యువగళం డే నంబర్ 2 ప్రారంభం

కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలో క్యాంప్ నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి   నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. ఈ రోజు ఆయన 9.7 కిలోమీటర్లు నడవనున్నారు.  బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటా మంతీలో పాల్గొంన్నారు.  కలమలదొడ్డిలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవుతారు. కలమలదొడ్డి నుంచి పాదయాత్ర కొనసాగించి శాంతిపురం క్యాంప్ కు చేరుకుంటారు. అక్కడ ప్రముఖలతో భేటీ అవుతారు. శనివారం ఆయన శాంతిపురంలో బసచేస్తారు.  ప్రముఖులతో సమావేశమవుతారు. కుప్పంలోని శాంతిపురంలో రాత్రి బస చేయనున్నారు. తొలి రోజులాగే రెండో రోజు కూడా లోకేష్ పాదయాత్రలో అడుగు కలిపేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులూ తరలి వచ్చారు. వారికి అభిమాదం చేస్తూ లోకేష్ ముందుకు కదిలారు.

ఎక్మోపై తారకరత్న.. కండీషన్ క్రిటికల్?

కుప్పంలో నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నకు వైద్యులు ప్రస్తుతం ఎక్మో అమర్చి  చికిత్స అందిస్తున్నారు.కుప్పంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.    లోకేష్ కు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న నిన్న సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను   వెంటనే తారకరత్నను ఆస్పత్రికి తరలించారు. అక్కడ గుండెపోటు అని వైద్యులు తేల్చారు. వెంటనే ఆయనను కుప్పం మెడికల్ కాలేజీకి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.   టీడీపీ నేత, హీరో బాలయ్య ఆస్పత్రికి చేరుకొని అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడి నుంచి  మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో తరలించారు.  నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలలో వైద్యులు క్రిటికల్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చారు. తారకరత్న రక్తనాళాళ్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు.  

కొందరు సీనీ నటులకు ఎమ్మెల్సీ తాయిలాలు.. జగన్ ఎత్తుగడ

జగ‌న్ కు ఈసారి సినిమా వాళ్ళ అవసరం తప్పేలా లేదు. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. సర్వేలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. వాస్తవమెంతో తెలియదు కానీ జగన్ స్వయంగా ఐ ప్యాక్ ద్వారా చేయించుకున్న సర్వేలో కూడా ఆయన క్యాబినెట్ లోని పాతిక మంది మంత్రులు వచ్చే ఎన్నికలలో ఓటమి చవిచూడనున్నారని తేలింది. మరో వైపు ఏపీలో తెలుగుదేశం, జనసేన పొత్త దాదాపు ఖరారైంది. బీజేపీ సంగతి ఇంకా ఎటూ తేలకపోయినా, తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ పార్టీకి పరాజయం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోకతప్పదని అంటున్నారు. గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రచారం చేశారు. మోహన్ బాబు, మంచు విష్ణు, కృష్ణుడు, భానుచందర్, అలి, పోసానికృష్ణమురళి, రాజశేఖర్, జీవిత, థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇలా జాబితా పెద్దదే ఉంది. అయితే ఈ సారి మాత్రం జగన్ కు అనుకూలంగా ప్రచారం చేయడానికి ఇప్పటి వరకూ అయితే అలీ, పోసాని వినా మరెవరూ కనిపించడం లేదు. మోహన్ బాబు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తనకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వస్తుందని ఆశించి భంగపడ్డారు. జగన్ అధికారం చేపట్టగానే ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వికి మాత్రమే పదవి ఇచ్చారు. అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఇక ఆ తరువాత మూడున్నరేళ్లకు అలీ, పోసానిలకు సలహాదారు పదవులు కట్టబెట్టారు. మిగిలిన వారి గురించి కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు.  దీంతో వారంతా పార్టీ కార్యక్రమాలకు ఒకింత దూరంగానే ఉంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్ గట్టెక్కేందుకు మరో సారి సినీ జీవులపైనే ఆధారపడనున్నారని పరిశీలకులు అంటున్నారు. అందు కోసమే.. వారికి ఏదో విధంగా ప్రయోజనం చేకూర్చేందుకు యోచిస్తున్నారని చెబుతున్నారు. వచ్చే మార్చిలో రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిని సీనీ జీవులతో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అది ఎంత వరకూ సాధ్యమౌతుందన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే పార్టీలో కూడా జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పలువురు ఆశావహులు ఎమ్మెల్సీ సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. చిలకలూరిపేట   మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తో పాటు పలువురికి జగన్ ఇప్పటికే హామీ  ఇచ్చారు.  ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో పవన్ ను విమర్శించే వారికి జగన్ పెద్దపీట వేయొచ్చు అనే మాట వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ఒకరిద్దరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశం ఉందని కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి.  వచ్చే ఎన్నికలలో పార్టీకి సినీ గ్లామర్ ను అద్దడానికి జగన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

జగన్ ఢిల్లీ పర్యటన.. అందుకోసమేనా?

ఏపీ సీఎం హఠాత్తుగా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. నిర్దుష్టంగా ఇందుకు కారణమేమిటన్నది తెలియరాలేదు. అయితే ఆయన హస్తిన పర్యటన కోసమే కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.    శుక్రవారం, శనివారం నాటి పర్యటనలను జగన్ రద్దు చేసుకుని హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఇంకా బయలుదేరలేదని చెబుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శ్రుక్రవారం (జనవరి 27)  ఉమ్మడి చిత్తూరు జిల్లా  పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడి వివాహానికి సీఎం జగన్ హాజరు కావాల్సి ఉంది.  అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు వైసీపీ నేత ఇంట్లో జరిగే వివాహ వేడుకకు సైతం సీఎం   హాజరవ్వాల్సి ఉంది. అలాగే శనివారం జగన్ విశాఖలో పర్యటించాల్సి ఉంది. విశాఖలో ఆయన చినముషిడివాడలోని శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాల్సి ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి లోక్ సభ సభ్యుల నివాసాల్లో జరిగే వివాహ వేడకలకు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ కార్యక్రమాలను ఇంత అర్థాంతరంగా రద్దు అయ్యాయి.  హస్తిన పర్యటన కోసమే ఈ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయని అంటున్నారు. కు ఎందుకు వెళ్తున్నారంటూ సదరు వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది.  అయితే సీఎం ఢిల్లీ పర్యటనపై సీఎంవో కార్యాలయం పెదవి విప్పడం లేదు. దీంతో జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన ఎందుకు అన్న విషయంపై పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.   కడప ఎంపీ ఆవినాశ్ రెడ్డి.. శనివారం (జనవరి 28)  సీబీఐ ఎదుట... విచారణకు హాజరుకావాల్సి ఉంది.  అలాగే జనవరి 31వ తేదీన రాజధాని కేసులపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో  జగన్.. తన ఢిల్లీ పర్యట ప్రాధాన్యత సంతరించుకుంది.   వివేకా హత్య కేసులో   అవినాశ్ రెడ్డికి ఇటీవల సీబీఐ నోటీసులు అందజేసింది. అయితే తాను.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వివిధ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని.. సీబీఐ అధికారులకు  అవినాశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే ఆయన అజ్ణాతంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న సమాచారంతో సీబీఐ అప్రమత్తమైంది. దీంతో అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసైనా విచారించాలని సీబీఐ నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.    ఇప్పటికే  వివేకానందరెడ్డి హత్య కేసులో పాత్రదారులు, సూత్రదారులు ఎవరనే అంశంపై సీబీఐకి ఓ క్లారిటీ వచ్చిందని.. ఈ నేపథ్యంలో వైయస్ ఫ్యామిలీలోని పలువురు కీలక వ్యక్తులను విచారించి.... అనంతరం సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందులతో జోరుగా సాగుతోంది.    ఇటీవల  అవినాశ్ రెడ్డి తండ్రి   భాసర్కరెడ్డి కోసం..  సీబీఐ ఆరా తీయడం కూడా అవినాశ్ రెడ్డి, భాస్కరరెడ్డిలను సీబీఐ అరెస్టు చేస్తుందన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ హడావుడిగా హస్తిన పర్యటన పెట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవంగా ఆయన శుక్రవారం (జనవరి 27)నే హస్తినకు బయలుదేరుతారని భావించారు. అయితే కారణాలేమిటైనా పర్యటనలు రద్దు చేసుకుని ఆయన తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఏ క్షణంలోనైనా హస్తిన నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందని ఆయన ఎదురు చూస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  

కివీస్ తో తొలి టి20.. టీమ్ ఇండియా పరాజయం

టీమ్ ఇండియా వరుస   విజయాలకు  బ్రేక్ పడింది. న్యూజిలాండ్ తో టి20 సిరీస్ లో భాగంగా రాంచీ వేదికగా శుక్రవారం (జనవరి 27) జరిగిన తొలి మ్యాచ్ లో భాతర్ పోరాడి ఓడింది.  న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా  టీ20 సిరీస్ ను మాత్రం ఓటమితో మొదలెట్టింది.  తొలి టీ20 మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50)   హాఫ్ సెంచరీ వృధా అయ్యింది. లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా  15 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం లక్ష్యఛేదనపై ప్రభావం చూపింది. గి ల్ 7, ఇషాన్ కిషన్ 4 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠి డకౌట్ అయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ 47(34 బంతుల్లో), కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులతో జట్టును గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారిద్దరూ వెంటవెంటనే ఔట్ కావడంతో ఇన్నింగ్స్ నడిపించే భారం వాషింగ్టన్ సుందర్ పై పడింది. అతడికి మరో ఎండ్ నుంచి సహకారం కరవైంది. దాంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్, శాంట్నర్, ఫెర్గుసన్ చెరో 2 వికెట్లు తీశారు. డఫీ, సోధీ తలో వికెట్ తీశారు.  అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు టీ20 ల సిరీస్ లో 1-0తో కివీస్ లీడ్ లో ఉంది.   ఇరుజట్ల మధ్య రెండో టి20 ఆదివారం (జనవరి 29) లక్నో వేదికగా జరుగుతుంది.

యువగళం డే నంబర్ 1.. ఆకట్టుకున్నారు.. అదరగొట్టేశారు!

తొలి అడుగు అదిరింది. ఆరంభం బ్రహ్మాండంగా ఉంది. కుప్పం నుంచి శుక్రవారం ఉదయం ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర అధికార పార్టీపై విమర్శలతో, ప్రజా సమస్యల పరిష్కారం హామీలతో సాగింది. అదే సమయంలో పరోక్షంగానైనా జనసేన, తెలుగుదేశం మధ్య పొత్తు ఉంటుందన్న సందేశాన్నీ ఇచ్చింది.  ఈ సందర్భంగా లోకేష్ వేసిన ప్రతి అడుగులోనూ ఆయనలో పరిణితి చెందిన నాయకుడు కనిపించాడు. రాజకీయ విమర్శలు చేస్తూనే వాటిని ప్రజా సమస్యలతో మేళవించారు. తన రాజకీయం ప్రజల కోసమేననీ, రాష్ట్రంలో దుష్టపాలన అంతం చేయడానికేననీ విస్పష్టంగా చాటారు.   తొలి రోజు పర్యటనలో ఆయన ప్రసంగం ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ, జగన్ సర్కార్ ను ఎండగడుతూ సాగింది. ఎక్కడా తడబాటు లేదు. తనపై, తెలుగుదేశంపై మంత్రులు గతంలో చేసిన విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. ముఖ్యమంత్రిని జాదూరెడ్డిగా అభివర్ణించారు. రాష్ట్రంలో జాదూ రెడ్డి పాలన అంతా జాదూయే అని చెప్పారు.  జగన్ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు.  మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పీకింది ఏమిటని ప్రశ్నించారు.  తెలుగుజాతి గర్వపడేలా దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. యావత్ ప్రపంచం అచ్చెరువొందేలా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. జాదూరెడ్డి వచ్చి  రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, అలాగే జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్లో జాబ్ లు ఉండవు అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.  ఇక మంత్రి రోజాకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. తనకు చీర, గాజులు పంపిస్తామని ఓ మహిళా మంత్రి అన్నారు.. పంపమనండి వాటిని మా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చి కాళ్లు మొక్కుతానని కౌంటర్ ఇచ్చారు. తాను తల్లి, చెల్లిని గెంటేసేవాడిని కాదన్నారు.   జే బ్రాండ్‌ మద్యంతో జాదూరెడ్డి మహిళల మంగళసూత్రాలు తెంపుతున్నాడంటూ విమర్శించారు.  రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉందన్నారు.  జే ట్యాక్స్‌ కట్టలేక పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు. వీధుల్లో డ్యాన్సులు వేస్తేనో.. క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావని ఎద్దేవా చేశారు.   ఎక్కడా తడబాటు లేకుండా జగన్ వైఫల్యాలనూ, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అన్న విషయాలను సూటిగా, స్పష్టంగా జన హృదయాలను హత్తుకునేలా చెప్పారు. తాను పాదయాత్ర పేరు ప్రకటించగానే వైసీపీ నేతల ఫ్యాంట్లు తడిసిపోయాయన్నారు. అందుకే జీవో నంబర్ 1 తెచ్చారని లోకేష్ అన్నారు. పాదయాత్ర అనుకోగానే తన సన్నిహితులు కొందరు వారించారనీ, సొంత బాబాయ్ ని చంపేసిన వ్యక్తి.. ఎంతకైనా తెగిస్తాడు వద్దని చెప్పారనీ లోకేష్ అన్నారు. అయితే  స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో చదివా. వరల్డ్‌ బ్యాంక్‌లో పనిచేశా. హెరిటేజ్‌ వంటి పెద్ద వ్యాపార సంస్థను నిర్వహించా. ప్రజల కంట కన్నీరు చూసి పాదయాత్ర చేస్తున్నానని వారిని సముదాయించానన్నారు, భయం అన్నది నా బయోడేటాలోనే లేదు అని లోకేష్ ఉద్ఘాటించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే యూత్‌ మేనిఫెస్టో తెస్తామన్నారు, ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుకను ఉచితంగా ఇస్తామన్నారు. ఇలా ఏం చేస్తామో చెప్పడమే కాకుండా.. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసినదేమిటో కూడా చెప్పారు.  పంచాయతీరాజ్‌ మంత్రిగా 25 వేల కిలోమీటర్ల   సిమెంట్‌ రోడ్లు వేయించా, పల్లెల్లో 25 లక్షల వీధి దీపాలు ఏర్పాటు చేయించా. 25 వేల కోట్లతో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఐటీ మంత్రిగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి రాష్ట్రంలో 80 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించానని లోకేష్ గుర్తు చేశారు. ఈ మూడున్నరేళ్లలో జగన్ సర్కార్ ప్రజల కోసం చేసిన ఒక్క మంచి పని ఉందా అని ప్రశ్నించారు. 

రాహుల్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరేనా?

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరి కొద్ది రోజులలో అంటే ఈ నెలాఖరుకు ముగియనుంది. కన్యాకుమారి టు కాశ్మీర్ ఆయన సాగించిన సుదీర్ఘ పాదయాత్ర ప్రజలలో ఆయన ఇమేజ్ పెరిగేందుకు దోహదపడింది. అందులో సందేహం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీలోనూ నూతనోత్సాహం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయినంత మాత్రాన ఈ పాదయాత్ర కాంగ్రెస్ ను వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అధికార పీఠంపై కూర్చోపెడుతుందా? అంటే మాత్రం కచ్చితంగా ఔను అనే సమాధానం రావడం లేదు. అందుకు కారణాలు అనేకం ఉన్నా.. ప్రధాన కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న నమ్మకం, విశ్వాసం ఆ పార్టీ సీనియర్ నేతలలో కనిపించకపోవడమే. అలాగే రాష్ట్రాలలో ఆ పార్టీ నాయకుల మధ్య విభేదాలు, వాటిని నియంత్రించే స్థితిలో పార్టీ అధిష్ఠానం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చ. పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చూపినంతగా గాంధీ కుటుంబానికి పార్టీలోని మిగిలిన నేతలు విధేయంగా లేరన్న సంగతి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ అధినాయకత్వం అంటే ఇప్పటికీ గాంధీ కుటుంబమే. పేరుకు మాత్రమే ఖర్గే అధ్యక్షుడు.. కానీ పార్టీ వ్యవహారాలన్నీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల కనుసన్నలలోనే సాగుతాయన్నది బహిరంగ రహస్యమే. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పునాదులు కదలడం 2014లో పరాజయంతోనే ప్రారంభమయ్యాయి. 2019 ఎన్నికల పరాజయం తో కాంగ్రెస్ సౌథం బీటలు వారడం ఆరంభమైంది. ఇప్పుడు కాంగ్రెస్ మరమ్మతులు చేపట్టింది. ఆ మరమ్మతులు పూర్తై పార్టీకి పూర్వవైభవం రావాలంటే ఇంకా చాలా చాలా సమయం పడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీకి దీటుగా నిలవగలుగుతుందా అంటే  అనుమానమే. అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల నాటి తో పోలిస్తే చాలా చాలా మెరుగుపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు ఆధారంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగిన మార్గాన్నీ, తీరునూ వారు ఉదహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉన్న యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలను రాహుల్ పాదయాత్ర పట్టించుకోలేదు. అలాగే పార్టీ అంతో ఇంతో బలంగా ఉన్న కేరళ, కర్నాటక, మధ్య ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ రోజులు, ఎక్కువ కిలోమీటర్లు సాగింది. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా.. ప్రజలలో గుర్తింపు సాధించడానికి కూడా ఈ యాత్ర దోహదపడింది. అలాగే ఈ యాత్రలో మోడీకి ప్రత్యామ్నాయం తానేనని చాటేందుకు రాహుల్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఫలించిందా లేదా అన్నది వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాతే తేలుతుంది. కానీ ఆ దిశగా రాహుల్ ప్రయత్నమైతే చేశారు. యాత్ర ప్రారంభం నాటికి రాహుల్ లో పరిణితి చెందిన నేతను ఎవరూ చూడలేదు.. కానీ యాత్ర సాగిన కొద్దీ ఆయనలో పరిపక్వతను పార్టీ శ్రేణులే కాదు, విపక్షాలు, ప్రజలూ కూడా గుర్తించాయి. అంగీకరించాయి. ఎక్కడా ఏ చిన్న అవాంతరం, అవాంఛనీయ సంఘటనా లేకుండా యాత్ర సాగడం నిజంగా రాహుల్ ఘనతే. యాత్ర సమయంలో పెరిగిన ఆయన గడ్డం.. అమృతసర్ లో కాషాయ వస్త్రధారణ.. ఆయనలో మోడీకి దీటుగా ఎదుగుతున్న నేతను ప్రజల కళ్లకు కట్టింది.   ఈ యాత్ర లక్ష్యం విషయంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏ కారణం చెప్పినా.. వాస్తవం మాత్రం పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చి.. మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడమే. అయితే అందుకు రాహుల్ గాంధీ యాత్ర చాలా వరకూ దోహదం చేసిందనడంలో సందేహం లేదు. ఇక మిగిలిన పని పార్టీ రాష్ట్రాల శాఖలపై ఆధారపడి ఉంది. రాష్ట్రాలలో కాంగ్రెస్ లో విభేదాలను పరిష్కరించుకుని ఏకతాటిపైకి వస్తేనే రాహుల్ పాదయాత్ర ఫలితాలు పార్టీకి దక్కుతాయి.   

వైసీపీకి మరో చాన్స్ లేదు..!

ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ భవిష్యత్ ఎలా ఉందో తెలియడానికి సర్వేలు ఎందుకు?  ఏపీలో అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.     సర్వేలతో పని లేకుండానే వైసీపీకి వచ్చే ఎన్నికలలో మరోమారు అధికారం దక్కడం అసాధ్యం అని ఎవరినడిగినా చెప్పేస్తున్నారు. జగన్ మూడున్నరేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదు. ఏ వర్గమూ ప్రభుత్వ పాలన బాగుందని చెప్పే పరిస్థితి లేదు. ప్రతిపక్షాలు, ప్రజలే కాదు.. స్వయంగా వైసీపీ వర్గాలు కూడా అంతర్గత సంభాషణల్లో ఈ విషయాన్నిఅంగీకరిస్తున్నారు. ఆఫ్ ది రికార్డుగా  వైసీపీ నేతలు తమ ప్రభుత్వం మరోసారి అనుమానమేనని చెబుతున్నారు.  స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోనే పార్టీకి ఎదురీత పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ వైసీసీ పట్ల వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని అంగీకరిస్తున్నారు. వై నాట్ 175 అంటూ జగన్ ప్రదర్శిస్తున్నది మేకపోతు గాంభీర్యమేనని అంటున్నారు. విశ్లేషకుల అభిప్రాయాలూ, సర్వేల ఫలితాలతో సంబంధం లేకుండానే వైసీపీ భవిష్యత్ ఏమిటన్నది సామాన్య జనానికి సైతం తేటతెల్లమైపోవడానికి.. ఆ పార్టీ నేతలు సొంత పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలూ, వ్యాఖ్యలే కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకులే.. సొంత పార్టీపైనా, ముఖ్యమంత్రిపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం వైపే తమ అడుగులని విస్పష్టంగా ప్రకటించేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిపై ఈ అవిధేయత రానున్న రోజులలో మరింత పెరుగుతుందని కూడా వారు చెబుతున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే. ఇటీవల ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా జగన్ ప్రభుత్వానికి రానున్నది గడ్డుకాలమేనని తేల్చింది. ఇక మంత్రుల విషయానికి వస్తే కేబినెట్ లో ఉన్న పాతిక మంత్రులలో ముగ్గురు నలుగురు మినహా మిగిలిన వారెవరూ విజయం సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు వారికి గడపగడపకు లో ఎదురైన పరాభవాన్ని, నిరసనల వెల్లువను తార్కాణంగా చూపుతున్నారు. అలాగే మాజీ మంత్రులకు కూడా వచ్చే ఏన్నికలలో విజయావకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు. మాజీలు అయిన తరువాత వారు పెద్దగా జనంలోకి రాకపోవడం, అంతకు ముందు మంత్రులుగా కూడా వారు జనంలో పెద్దగా తిరిగింది లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో వారి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెబుతున్నారు. ఇక ఇండియా టుడే సర్వే ప్రకారమే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో  13 పార్లమెంటు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులకు విజయం సాధించే అవకాశాలు ఇసుమంతైనా లేవని వెల్లడైంది. ట్రెండ్ ఇలాగే సాగితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.   

నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత

నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న ఆయన లోకేష్ పాదయాత్ర సందర్భంగా కుప్పంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజల కార్యక్రమంలోనూ, అనంతరం మసీదులో ప్రార్ధనలలోనూ తారకరత్న పాల్గొన్నారు. అనంతరం పాదయాత్రలో అడుగు కదిపారు. నడుస్తుండగానే ఒక్క సారిగా తారకరత్న కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి పీఈఎస్ హాస్పటల్ కు తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి తారకరత్న నాడి అందడం లేదనీ, శరీరం రంగు కూడా మారిందని వైద్యులు తెలపారు. దాదాపు 45 నిముషాల చికిత్స అనంతరం ఆయన పల్స్ నార్మల్ కు చేరుకుందని వివరించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తారకరత్నకు గుండె పోటు వచ్చిందని అంటున్నారు. హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు. చంద్రబాబు తారకరత్న ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను కోరారు. అవసరమైతే తారకరత్నను బెంగళూరు తరలించే అవకాశం ఉంది.  

బీఆర్ఎస్ గూటికి ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తన తనయుడు  శిశిర్‌ గమాంగ్‌  తో కలిసి శుక్రవారం (జనవరి 27) బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం ఆయన రెండు రోజుల కిందట బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి విదితమే.  బీఆర్‌ఎస్‌  అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో  గిరిధర్‌ గమాంగ్‌, శిశిర్ గమాంగ్ అలాగే   కోరాపుట్‌ మాజీ ఎంపీ జయరాం పాంగి కూడా బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు.  కాంగ్రెస్‌ను వీడి 2015లో బిజెపిలో చేరిన గిరిధర్ గమాంగ్ కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయిన సంగతి విదితమే. ప్రగతి భవన్ లో జరిగిన ఈ భేటీలో   గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు పాల్గొన్నారు. అప్పటి నుంచీ గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో సహా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జరుగోతోంది.   వీరిరువూ బీఆర్ఎస్ లో నేడు చేరనుండటంతో ఆ ప్రాచారం వాస్తవమేనని తేలింది. బీఆర్ఎస్ లో చేరేందుకు ఒడిశా నుంచి హైదరాబాద్ చేరుకున్న గిరిధర్ గమాండ్.. మరి కొద్ది సేపటిలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టమెంటరీ సమావేశం జరుగుతోందనీ, ఆ సమావేశం పూర్తి కాగానే కేసీఆర్ వీరిరువురికీ గులాబీ కండువా కప్పుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ కార్యకలాపాలను తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన  నేపథ్యంలో ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్  బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఇంతకీ ఈ గిరిధర్ గమాంగ ఎవరంటే..  1999లో అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన  ఒకే ఒక్క ఓటు వేసిన వ్యక్తి. 1999 ఏప్రిల్ 17 న అవిశ్వాస పరీక్షలో 13 నెలల నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్. ఈయన 9 సార్లు పార్లమెంటుకు ఎన్నియ్యారు. కాగా, గమాంగ్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే  వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్షలో చివరి నిమిషంలో పార్లమెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒ ఒక్క వోటు కారణంగానే  నాటి బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ  తరువాత కొద్ది రోజులకే ఆయన కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమయ్యారు. తన కుమారుడికి కాంగ్రెస్ తగు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోిస్తూ.. 2015లో బీజేపీ గూటికి చేరారు.

జనం మొగ్గు ఎటో తేలిపోయింది! .. చంద్రబాబు చుట్టూ ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రదక్షిణలు

జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుంది వంటి ప్రశ్నలకు సాధారణంగా ఎవరైనా సర్వేల మీద ఆధారపడతారు. అయితే జనం మూడ్ ఏమిటన్నది తెలుసుకోవడానికి వారికి సర్వేలు అక్కర్లేదు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయం వారు  అందరి కంటే ముందే పసిగట్టేయగలరు. వాళ్లే ఐఏఎస్ అధికారులు. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే.. బాబూస్.  అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పడానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల అధికారుల విధేయత స్థాయిని బట్టి ఇట్టే చెప్పేయ వచ్చు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల తీరు గమనిస్తే రాబోయే ప్రభుత్వం ఎవరిదన్నది ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు సాధ్యమైనంతగా ప్రభుత్వానికి దూరం జరుగుతున్నారు. ఇంత కాలం చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా ప్రభుత్వం ఇంత చెప్తే అంత చేసి విపక్షాన్ని చీకాకు పెట్టేందుకు మాత్రమే తమ అధికారాన్ని వాడిన అధికారులంతా.. ఇప్పుడు విపక్ష నేత కరుణాక్ష వీక్షణాల కోసం పడిగాపులు కాస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాలుగేళ్లుగా జగన్ కరుణాకటాక్షాల కోసం పరిధి దాటి మరీ పనులు చేసిన కొందరు అధికారులు ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తే చాలు.. గప్ చిప్ గా తెలంగాణ రాజధానికి చేరుకుంటున్నారు. రహస్యంగా ఆయనతో భేటీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో తాము వ్యవహరించిన తీరుకు క్షమాపణలకు కోరుకోవడమే కాదు.. అలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ ఇస్తున్నారు. జగన్ సర్కార్ ఒత్తిడితోనే తాము  తెలుగుదేవం పార్టీకి వ్యతిరేకంగా చేయాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు.   బరితెగించి మరీ ఇంత కాలం జగన్ కు భజన చేసిన అధికారులే ఇప్పడు బాబు ప్రాపకం కోసం కాళ్లా వేళ్లా పడుతున్నారు. ఈ తీరే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది.  చంద్ర‌బాబు రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు స‌క్సెస్ కావ‌డం, అదే సమయంలో సీఎం జగన్ సహా, వైసీపీ చేపట్టిన కార్యక్రమాలపై జనం విముఖత చూపుతుండటం.. జగన్ సభలకే జనం కరవౌవుతున్న పరిస్థితి, గడపగడపకు లో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజా నిరసన ఎదురు అవుతుండటంతో  అధికారులకు విషయం అర్ధమైపోయింది.   బాబు-ప‌వ‌న్ భేటీతో జగన్ కు మరో చాన్స్ అసాధ్యం అన్న స్పష్టత వచ్చేసింది. దీంతో వచ్చేది తెలుగుదేశం సర్కారేనని నిర్ధారించుకున్న అధికారులు ప్లేట్ ఫిరాయించేందుకు రెడీ అవుతున్నారు. నిబంధనల మేరకు నడుచుకున్న అధికారులు యథావిథిగా తమ ఉద్యోగ ధర్మం తాము నిర్వర్తిస్తుంటే.. పరిధి దాటి ఎక్స్ ట్రాలు చేసిన వారు మాత్రం ఇప్పడు గాబరా పడుతున్నారు. వచ్చే ప్రభుత్వం తమపై చర్యలు తీసుకోవడం ఖాయమని భయపడుతున్నారు. అందుకే ముందుగానే తమ ఎక్స్ ట్రాలకు కారణాలను చంద్రబాబుకు వివరణ ఇచ్చుకుని కొంచెం సేఫ్ అవుదామని తాపత్రేయ పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు హైద‌రాబాద్లో చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా కలిశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్ర‌భుత్వ  ఆదేశాల‌తో తాము అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డంలేద‌ని చంద్రబాబు ముందు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారని అంటున్నారు.   తెలుగుదేశం ప్ర‌భుత్వంలో తాము నిర్వర్తించిన విధులు, తమ ప్రతిభను  గుర్తు చేస్తూ  గత నాలుగేళ్లుగా తమ పనితీరు అధ్వానంగా ఉండటానికి కారణం జగన్ సర్కార్ అసమర్థతా, అనుచిత ఒత్తిడే కారణమని వివరణ ఇచ్చుకుంటున్నారు.   అలాగే తెలుగుదేశం పార్టీలోనే  కొనసాగుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొహం చాటేసిన సీనియర్ నేతలు కూడా ఇప్పుడు మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు అడుగులు కదుపుతున్నారు.   అవకాశం దొరికితే చంద్రబాబును కలిసి తాము ఇంత కాలం ఒకింత సైలెన్స్ మెయిన్ టైన్ చేయడానికి కారణాలను చెప్పుకుని మళ్లీ పార్టీలో పూర్వపు స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించేశారు. వీలైతే చంద్రబాబును, కుదరకపోతే లోకేష్ ను కలిసి  తాము ఇక‌పై యాక్టివ్ గా ఉంటామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు. ఇప్పడు నారా లోకేష్ పాదయాత్ర వారికి తమ పలుకుబడిని ప్రదర్వించేందుకు ఒక అవకాశంగా లభించిదని భావిస్తున్నారు. అలాగే వివిధ కారణాల వల్ల  పార్టీ మారిన వారు మళ్లీ తెలుగుదేశం గూటికి చేరేందుకు తమదైన శైలిలో, స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించేశారు.  

చిలుకా చిలుకా పలుకవా?

చిలుకా చిలుకా పలుకవా? అంటూ ఓ పాట ఉంది. బీహార్ పోలీసులు ఓ చిలుకను బంధించి  అదే పాట పాడుతున్నారు. ఆ చిలుక చేత మాట్లాడించి.. ఆ చిలుక పలుకుల ద్వారా మద్యం మాఫియా గుట్టు బయటపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఔను నిజమే లిక్కర్ మాఫియా కేసులో పోలీసులు ఓ రామచిలుకను అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ ఆ రామచిలుకను ఎందుకు అరెస్టు చేశారంటే అది నిందితుల పెంపుడు చిలుకట. ఆ చిలుకను విచారించి మద్యం మాఫియా కేసును ఛేదిస్తామంటున్నారు. బీహార్ లోని గురువా పోలీసులు ఈ వింత విచారణ చేస్తున్నారు. మద్యం దందాపై విషయంలో వారు ఓ ఇంటిపై దాడి చేశారు. అయితే పోలీసుల దాడి గురించి ముందే తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. దీంతో ఆ ఇంట్లో పోలీసులకు వారి పెంపుడు చిలుక మాత్రమే దొరికింది. దీంతో పోలీసులు దానిని అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ విశేషమేమిటంటే అది మాట్లాడుతుంది. పోలీసులు ఏ మడిగినా కటోరే.. కటోరే అంటూ బదులిస్తోంది. ఇంకా విచారిస్తే.. నిందితులకు సంబంధించి బోలెడు వివరాలు రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు రామచిలుకను బంధించి విచారణ పేరున సాగిస్తున్న ప్రహసనంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  గతంలో జానపద కథల్లో విన్నాం రాక్షసుడి ప్రాణం రామచిలుకలో ఉంది.. ఆ రామ చిలుక చెట్టు తొర్రలో ఉంది అని.. ఇప్పుడు మాత్రం నిందితుల గుట్టుముట్లన్నీ రామచిలుక నోట్లో ఉన్నాయి. ఆ రామచిలుక పోలీసు స్టేషన్ లో ఉంది అంటున్నారు. .

సర్కార్ వారి జీవోలకు అర్థాలే వేరులే!

అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య ఒక చక్కని సత్యాని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలన్నీ అమలవుతాయని ఎవరికైనా ఓ చెడ్డ,  దురాభిప్రాయం ఏదైనా ఉంటే, ఆ అభిప్రాయాన్ని వెంటనే తుడిచేసుకోండని నిండు సభలో గొంతెత్తి మరీ చెప్పారు. జీవోలన్నీ జీవోలు కాదు, అందులో కొన్ని ఉత్తుత్తి జీవోలుంటాయని రోశయ్య సర్కార్ వారి సీక్రెట్   ఓపెన్ చేశారు. నిజమే  సమయ సందర్భాలను బట్టీ రాజకీయ అవసరాలను బట్టీ, ప్రభుత్వం జీవోలు జారీచేయడం ఎప్పటినుంచో ఉన్నదే.. అయితే, అన్ని జీవోలను అలా తీసి పక్కన పెట్టే పరిస్థితి ఉండదు.  కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఉత్తుత్తి జీవోలే  కాదు, రాజ్యాంగ విరుద్ధమైన జీవోలు కూడా వచ్చి పోతున్నాయి. అవును  జగన్ రెడ్డి విచిత్ర సర్కార్ జారీ చేసే జీవోల్లో ఎన్ని పని చేస్తాయో.. ఎన్ని రాజ్యాంగ బద్దంగా ఉంటాయో.. చెప్పడం కష్టం. అనేక జీవోలను కోర్టు కొట్టి వేస్తే.. కొన్ని జీవోలను ప్రభుత్వం తనకు తానే రద్దు చేసుకుంటూ ఉంటుంది. మరోవంక మరికొన్ని జీవోలను పబ్లిక్ డొమైన్  లో లేకుండా  చీకటి కొట్లో దాచేస్తుంది.  తాజాగా జగన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు ఒకే రోజు కాలం చేశాయి..  అందులో ఒకటి ఫ్లెక్సీ బ్యాన్ విధిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు పక్కన పెట్టింది. అలాగే, రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఐదు శాతం పేదలకివ్వాలంటూ గతంలో ఇచ్చిన జీవోను ప్రభుత్వమే ఉపసంహరించుకుంది. అర్థాంతరంగా తనువు చాలించిన ఈ జంట జీవోలకు ఒక చిన్నపాటి చరిత్ర వుంది. ఎప్పుడో చాలా కాలం క్రితం  విశాఖ బీచ్‌లో ప్లాస్టిక్  వ్యర్ధాలను  ఏరివేసేందుకు ఓ స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఖ్యాతిధిగా పాల్గొన్నారు. మైక్  ముందు నిలబడి తమదైన స్టైల్లో గంభీర ఉపన్యాసం చేశారు.  అదే ఊపులో ( గిట్టని వాళ్ళు పూనకం అంటారు)  ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంటుంది. అధికారులు ముందు వెనక చూసుకోకుండా ఫ్లెక్సీలను నిషేధిస్తూ జీవోను తెచ్చారు. దీంతో ఫ్లెక్స్ ల మీద ఆధారపడి బతుకుతున్న వ్యాపారులు తమ బతుకు తెరువు మీద బండరాయి పడిందని  ఆందోళనకు గురయ్యారు. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అదే రోజు నుంచే  బ్యాన్ అమల్లోకి వస్తుందన్నారు కానీ ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరికి ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తుందన్నారు.  కానీ కొంత మంది కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆ జీవో చెల్లదని.. సింగిల్ యూజ్ ఫ్లెక్సీలు ఉంటే.. వాటిపైనే నిషేధం అమలవుతుందని స్పష్టం చేసింది. అసలు ఫ్లెక్సీలు ప్లాస్టిక్ కాదని.. సింగిల్ యూజ్ కానే కాదని వ్యాపారులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అయినా. జగన్ రెడ్డి ప్రభుత్వం (బహుశా సహజసిద్ద దురహకారంతో కావచ్చును) నథింగ్ డూయింగ్  ముఖ్యమంత్రి మాట తప్పరు మడమ తిప్పరు అని మొండి కేసింది. ఇక చేసేది  లేక వ్యాపారాలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు జీవో చెల్లదని తీర్పు ఇవ్వడంతో పాటుగా, సర్కార్ నెత్తిన నాలుగు అక్షింతలు కూడా వేసింది. అలాగే  ఏపీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే 5 శాతం జగనన్న కాలనీలకు చందా ఇచ్చుకోవాల‌ని గతంలో జీవో ఇచ్చారు. స్థలం రూపంలో అయినా లేదా డబ్బు రూపంలో నా అన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇష్టం అని జీవోలో పేర్కొన్నారు. అంటే ప్ర‌తి వెంచ‌ర్ లో 10 శాతం సామాజిక అవ‌స‌రాల కోసం కేటాయిస్తున్న దానికి అద‌నంగా మ‌రో 5 శాతం స్థ‌లం వ‌ద‌లాల్సి ఉంది. అయితే ఇది చట్ట విరద్ధమని.. చాలా మంది కోర్టు కెళ్లారు. చివరికి జగన్ రెడ్డి ప్రభుత్వం స్వహస్తాలతో సదరు జీవోను వెనక్కి తీసుకుంది. అఫ్కోర్స్ జీవో అమలు కాలేదు కానీ, కావాల్సిన వారికి కావలసిన మేళ్ళు జరిగాయని అంటారనుకోండి అది వేరే విషయం. ఉత్తుతి జీవోనే అయినా ఉత్తినే వెనక్కి తీసుకోలేదని చాలా మంది చేతులు తడిపిన తర్వాతనే జీవో వెనక్కి వెళ్లిందని అనేవాళ్ళు ఉన్నారు. అయినా డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని  వాళ్ళకు మాత్రం తెలియదా ఏంటి?   నిజానికి, ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలకు  అనుగుణంగా తెచ్చిన జీవోలేన్ని? అడ్డదారిన పట్టుకొచ్చిన జీవో లెన్ని? అందులో బతికిన వెన్ని? ఉన్నవెన్నిఅని లెక్కతీస్తే, పక్కాగా మాలిన జీవోలు ఓ పుంజీడు అయినా ఉంటాయో లేదో అనుమానమే అంటున్నారు అధికారులు. అందుకే జగన్ రెడ్డి ప్రభుత్వం జీవోలకు ముసుగులు వేస్తుంది. సీక్రెట్ గా ఉంచుతుందని అంటున్నారు. నిజానికి  అస్మదీయులకు మేళ్ళు చేసేందుకు సీక్రెట్ గా తెచ్చిన జీవోలను జగన్ రెడ్డి ప్రభుత్వం సీక్రెట్ గానే ఉంచుతోందని అంటున్నారు. అందులో కొన్ని జీవోలు వెలుగు చూస్తే, ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులు, చిన్నా పెద్ద కాంట్రాక్టులు ఇలా ఒకటని కాదు, సర్కార్ వారి అవినీతికి అద్దం పట్టే అనేక జ్వోలు వెలుగు చూస్తాయని అంటునారు. అయితే అది ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మాత్రం జరగదు గాక జరగదని అంటున్నారు .

ఇరకాటంలో ఈటల రేవంత్ మాటల మరమ్మేంటి?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో  బీజేపీలో చేరిన ఈటల నిరాశకు గురయ్యారని, ముఖ్యంగా బీజేపీలోనూ కోవర్టులున్నారనే విషయం అర్థమై ఆయన లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవలసినపరిస్థితి వచ్చిందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చల్లో ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి. నిజానికి  కేసీఆర్ కోవర్టులు అన్నిపార్టీలలో ఉన్నారు. అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ లో కొంచెం చాలా ఎక్కువగానే ఉన్నారు. ఆ విషయాన్నీ స్వయంగా రేవంత్ రెడ్డి లేదా అద్దంకి  దయాకర్ వంటి అయన అనుచరులు బహిరంగంగా, పేర్లతో సహా బయట పెడుతూనే ఉన్నారు. నిజానికి, కోవర్టుల చర్చతోనే కాంగ్రెస్ పార్టీలో రచ్చ మొదలైంది. సీనియర్  జూనియర్ వివాదం పురుడు పోసుకుంది. అధిష్టానం జోక్యం చేసుకున్నా చల్లారని స్థాయిలో కోవర్టు మంటలు గాంధీ భవన్ లో ఎగిసి పడుతున్నాయి. అయినా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చల్లో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.    ముఖ్యంగా బీజేపీలో నాయకులు, శ్రేణుల్లో అయితే ఈ చర్చ మరింత జోరుగా సాగుతోంది. నిజమే, రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా బీజేపీ చేరిన నాయకులకు, ముఖ్యంగా రాజకీయాల్లో అనేక ఎత్తుపల్లాలు చూసి వచ్చిన ఈటల రాజేందర్ వంటి సీనియర్  నాయకులకు ఆశించిన స్థానం, గౌరవం దక్కడం చాలా కష్టమే. సో.. ఈటల గానీ, రేవంత్ రెడ్డి ప్రస్తావించిన మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్ వెంకట స్వామి వంటి వారు బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్నమాట వాస్తవం కావచ్చును. కానీ  వారికి మరో ప్రత్యామ్నాయం కూడా లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది కానీఅదే రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో  బీఆర్ఎస్  ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటే అనే పర్సెప్షన్ ప్రజల్లో నాటుకు పోయింది. అందువలన కేసేఆర్ వ్యతిరేకులకు మరోమార్గం లేకుండా పోయిందని అంటున్నారు. మరో వంక బీజేపీ ముఖ్య నేతలు మాత్రం  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మరో కోణంలో చూస్తున్నారు. రేవంత్ రెడ్డి  మాట తీరు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ కు అద్దం పడుతోందని  అంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ గుర్తించడమే లేదని బీజేపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తన పరిస్థితి ఏమిటో తనకే తెలియని అగమ్యగోచర స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన ఈటల మాటలకు వక్రభాష్యం చెపుతున్నారని అంటున్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని మాత్రమే గుర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదని అంటున్నారు. అదలా ఉంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా అనేక విషయాలు ముచ్చటించిన రేవంత్ రెడీ, ఈటలతో పాటుగా, కేసీఆర్ ను  గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు.. ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరని, పేర్కొన్నారు.  బీజేపీ కేసీఆర్ ఒక్కటే అన్న విషయం ఈటల రాజేందర్ మాట్లల్లో స్పష్టమైంది కాబట్టి ప్రజలు దీనిపై ఆలోచించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  ఈటల రాజేందర్, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటివారు బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరు. కేవలం కేసీఆర్ ను మాత్రమే వ్యతిరేకిస్తారు. బీజేపీ ఐడీయాలజీతో ఆ ముగ్గురికి సంబంధం లేదు. బీజేపీలో కూడా కోవర్ట్ లు ఉన్నారని ఈటల అన్నారంటే ఏదో అసంతృప్తి ఉన్నట్లే కదా? ఈటల ముందుకు రాలేక  వెనక్కి పోలేని స్థితిలో ఉన్నారని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పరిస్థితి అంతకంటే గొప్పగా ఏమీ లేదనీ అందుకే సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న రేవంత్ రెడ్డి, బీజేపీలోని ఈటల, వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి సీనియర్ నాయకులకు ఒక నిగూఢ సందేశం ఇచ్చారని కొందరు అంటున్నారు. ఏమైనా, ఓ వంక ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య గణతంత్ర వివాదం పతాక స్థాయికి  చేరిన నేపధ్యంలో రేవంత్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగానే మరో చర్చకు ఆస్కారం కల్పించారని అంటున్నారు.

గణతంత్ర వేడుకలు వేదికగా గవర్నర్ వర్సెస్ సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ల మధ్య గత మూడేళ్ళుగా సాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. గణతంత్ర దినోత్సవం వేడుకల విషయంలో తలెత్తిన వివాదం కోర్టు తలుపులు తట్టింది. గణతంత్ర వేడుకలను కేంద్ర ప్రభుత్వం సూచించిన పద్దతిలో నిర్వహించాలని రాష్ట్ర  హై కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. పెరేడ్ గ్రౌండ్ లో ప్రజల సమక్షంలో ఘనంగా జరగవలసిన ఘణతంత్ర వేడుకలను రాజ్ భవన్  కే పరిమితం చేసింది. నిజానికి, జాతీయ రాజకీయాలపై కన్నేసిన కేసేఆర్  అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు, గవర్నర్ పై ఉన్న విభేదాల కారణంగా గణతంత్ర దినోత్సవానికి ప్రజలను దూరం చేశారు.  రాజకీయాలకు అతీతంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు, ముఖ్యమంత్రి కేసీఆర్  భారత రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని అవమానించిన తీరు పట్ల తీవ్ర అభ్యతరం తెలియచేస్తున్నారు. రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రి  దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.   మరోవంక  గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు . గవర్నర్ రాజ్యాంగ పదవిలో ఉంటూ ఓ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని మంత్రులు, అధికార బీఆర్ఎస్ ముఖ్య నేతలు భగ్గుమంటు న్నారు. ముఖ్యంగా, ఆమె చేసిన  ఫామ్ హౌస్  వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల్లో కాక రేపుతున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్  లో స్పందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కన్నా, దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని తెలిపారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతుందన్నారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజున  సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.  అలాగే  తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరోక్షంగా గవర్నర్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. గత ఎనిమిది సంవత్సరాల్లో రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు, వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని అయినా  కొందరికి తెలంగాణ రాష్ట్రంలో  జరుగుతున్న అభివృద్ధి, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కళ్లకు కనపడటం లేదని, వాళ్లందరూ కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు.  కాగా, గణతంత్ర వేడుకలపై ప్రభుత్వానికి నిబంధనలు తెలుసని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా మాట్లాడారన్నారు. గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాస్తామన్నారు. గవర్నర్ తమిళిసై విషయంలో రాష్ట్రపతి కల్పించుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  మరోవంక తెలంగాణ గవర్నర్ తమిళి సై మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య రిపబ్లిక్ డే వేడుకలు జరగకుండా చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చానన్నారు. ఖమ్మంలో  ఐదు లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని, ఆ సభకు లేని కరోనా నిబంధనలు గణతంత్ర వేడులకే గుర్తు వచ్చాయా? అని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి రాజ్‌భవనంపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడంలేదని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. దీంతో మరోమారు, గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం ఢిల్లీ కోర్టుకు చేరింది. బంతి ఇప్పడు కేంద్రం కోర్టులో వుంది. కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది? కోర్టు అంతిమ తీర్పు ఏమిస్తుంది? రాజ్యాంగానికి, త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని దృష్టిలో ఉంచుకుని, కొందరు సోషల్ మీడియాలో సూచిస్తున్న విధంగా  సుప్రీం కోర్టు  సుమోటోగా జోక్యం చేసుకుంటుందా? కేసేఅర్ ప్రభుత్వాన్ని వివరణ కోరుతుందా? రాజకీయంగా, ముఖ్యంగా జాతీయ రాజకీయ పరమపద సోపాన పటానికి నిచ్చెనలు వేస్తున్న బీఆర్ఎస్  అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్  రాజకీయ ప్రస్థానంపై  ఎలాంటి ప్రభావం చూపుతుంది.. చూడవలసి వుంది.

ఎంపీ అవినాశ్ అజ్ణాతంలోకి?!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. అజ్ణాతంలోకి పారిపోయేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఆ ప్లాన్ తోనే  ఆయన..  సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులకు  అయిదు రోజుల బిజీ షెడ్యూల్ ఉంది.. ఆ తర్వాత  హాజరవుతానంటూ ..  సమాచారం ఇచ్చారని అంటున్నారు?  అయితే  ఈ విషయాన్ని ముందుగానే  పసిగట్టిన సీబీఐ.. అప్రమత్తమై.. ఆగమేఘాల మీద కోర్టును ఆశ్రయించి.. వైఎస్ ఆవినాష్ రెడ్డి అరెస్ట్‌కు వారెంట్ తీసుకుని   అరెస్ట్ చేసి... హైదరాబాద్‌కు తీసుకు వచ్చి... విచారించేందుకు సీబీఐ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అంటున్నారు. ఈ విచారణలో భాగంగానే వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.   2019 మార్చిలో మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే   వివేకా గుండెపోటుతో మరణించారంటూ వైసీపీ  కీలక  నేత విజయసాయిరెడ్డి తొలుత మీడియా సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత వైయస్ వివేకానందరెడ్డిని గోడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపారంటూ  పోలీసులు కేసు నమోదు చేశారు.  వివేకా హత్య కేసులో.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో తన తండ్రి  వివేకా హత్య కేసులోని పాత్రదారులు, సూత్రధారులు ఎవరో తేల్చాలంటూ.. ఆయన కుమార్తె  సునీత.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించింది. ఆ క్రమంలో సీబీఐ విచారణలో వివేకా మాజీ కార్ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. వైఎస్ అవినాష్, ఆయన తండ్రి    భాస్కరరెడ్డితోపాటు పలువురు పేర్లను  వెల్లడించారు.  ఆ తర్వాత  వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై కేసులు పెట్టేందుకు పలువురు వ్యక్తులు రంగంలోకి దిగడం.. అలాగే  వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె  సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డిల ప్రమేయం ఉందంటూ పలువురు ఆరోపణలు గుప్పించడం.. వంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. అలాగే ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు సైతం  బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో సీబీఐ దర్యాప్తు  వేగం నెమ్మదించింది.   ఈ నేపథ్యంలో తన తండ్రి హత్య కేసు విచారణ.. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ..  సునీత.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  దీంతో ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి సుప్రీం కోర్టు బదిలీ చేసింది.   ఈ నేపథ్యంలో   వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ విషయాన్ని గమనించిన   అవినాశ్ .. విదేశాలకు చెక్కేసేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.  ఓ వేళ.. అతడిని అరెస్ట్ చేయకున్నా... అతడి పాస్‌పోర్ట్‌ను   సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసే అవకాశం ఉందని చర్చ సైతం కడప జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా అవినాష్ విజ్ణప్తి మేరకు సీబీఐ విచారణకు మరో తేదీని నిర్ణయించింది. ఈ నెల 28న అంటే  శనివారం విచారణకు రావాలంటూ రెండో సారి నోటీసులు జారీ చేసింది. సీబీఐ దూకుడు చూస్తుంటే అవినాష్ అరెస్టు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణ తప్పించుకునేందుకు ఆయన అజ్ణాతంలోకి వెళతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఆయన విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. ఏది ఏమైనా వివేకా హత్య కేసులో అవినాష్ చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుందని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ లో కొత్త కోణం ..గమనించారా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆ వ్యాఖ్య చేసిన సమయ, సందర్భాలు వేరు కావచ్చును. కానీ, ఎవరైనా వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని అయన చేసిన వ్యాఖ్యలు, ఇక దేహి అంటే కుదరదని ఎస్సీ, ఎస్టీ లకు చేసిన హిత బోధ, అదే విధంగా వ్యక్తి ఆరాధన గురిచి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయనలో ఎక్కడో అక్కడ రగులుతున్న రాజకీయ ఆకాంక్షలకు అద్దం పడుతున్నట్లు ఉన్నాయి.  నిజానికి, నిన్నమొన్న జరిగిన జనసేన తెలంగాణ కార్యకర్తలు, కార్య నిర్వాహకుల సభలోనే, పవన్ కళ్యాణ్  కొత్త ఆలోచనలకు ముసుగు తీశారు. పొత్తుల విషయంలో స్పష్టత ఇస్తూనే, రాజకీయ కొత్త కోణాన్ని అవిష్కరించారు. ఎక్కడా ఎక్కాలో  కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలనే నానుడి తిరగేసి, ఎక్కడ తగ్గాలోనే కాదు, ఎక్కడ ఎక్కాలో కూడా తెలియాలనే అర్థం వచ్చే విధంగా మాటల గారడీ చేశారు. పొత్తుల విషయంలో ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంత దూరం అనే సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా ఏపీలో బీజేపీ పొత్తు వుంది, ఉంటుంది అంటూనే, అవసరం అయితే కొత్త పొత్తులు ఉంటాయని అన్నారు.   ఇక ప్రస్తుతానికి వస్తే,   బుధవారం(జనవరి 25) మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో.. అంతే ప్రమాదకరమన్నారు. అలాగే, ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారని.. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని పేర్కొన్నారు.సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాదు.. సమగ్రంగా చూడాలని అన్నారు. జనాభాకు తగ్గట్టు బడ్జెట్‌లో కేటాయింపులు జరగాలని అభిప్రాయపడ్డారు. మన కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. నిధులు ఇవ్వాలని ఇంకా కోరాలా అని ప్రశ్నించారు. ఇకపై దేహి అంటే కుదరదని.. పోరాటాలు చేసి తీసుకోవాలన్నారు.  నిజమే పవన్ కళ్యాణ్ ఎస్సీ,ఎస్టీలను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అనుకోవచ్చును కానీ, అందులో రాజకీయ ధ్వనులున్నాయని, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు సంబంధించి పవన్ కళ్యాణ్, బయటి శత్రువుల కన్నా మనతోటి ఉండే శత్రువులనే ముందుగా కనిపెట్టాలని.. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు, నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండేవాడే నాయకుడు అంటూ అయన చేసిన ముక్తాయింపు, పవన్ కళ్యాణ్ లో కొత్త కోణాన్ని అవిష్కరించాయని అంటున్నారు.  కాగా.. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మరోమారు, వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్ట్టీలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో రూ. 20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా ఆచరణలో పెట్టాలి కదా అని నిలదీశారు. ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికి రాకుండా దారి మళ్లించి మోసం చేస్తారా అని పవన్‌ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవును, పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల్లో నిజం వుంది. అలాగే, ఆయన చేసిన వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ధ్వనించిన రాజకీయ వ్యాఖ్యానం... పవన్  కళ్యాణ్ లో మరో కోణాన్ని అవిష్కరించిందని, సినిమా భాషలో చెప్పాలంటే, మరో  నటుడిని రాజకీయ తెరకు పరిచయం చేసిందని అంటున్నారు.

లోకేష్ విజయోస్తు .. ధర్మ యుద్ధానికి శ్రీకారం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ‘యువగళం’ పేరిట చేపట్టే పాదయాత్ర  శుక్రవారం (జనవరి 27) కుప్పం నుంచి ప్రారంభమవుతోంది. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు, వందో ..రెండొందల కిలోమీటర్లో కాదు. ఏకంగా  4 వేల కిలోమీటర్లు,400 రోజులు..అంటే 15 నెలలకు పైగా సాగే సుదీర్ఘ పాద యాత్రకు, టీడీపీ యువనేత శ్రీకారం చుడుతున్నారు.  సరే, ఆయన ఇంత  కఠిన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అధికారం కోసమా? అంటే, కాదనలేము. కానీ, అది పాక్షిక సత్యం మాత్రమే. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు పట్టభిషిక్తుదయ్యాడు, కానీ, రావణ సంహారం జరిగింది మాత్రం రామచంద్రుని పట్టాభిషేకం కోసం కాదు, రాక్షస పాలన అంతమొందించేందుకే వానర సేన సాయంతో శ్రీరాముడు రావణ సంహారం కావించారు. ఇక ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు ప్రత్యేకించి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. రావణాసురుడు మాయలేడి వేషంలో సీతమ్మోరిని అపహరిస్తే, ఈనాటి  రావణుడు ‘ఒక్క ఛాన్స్’తో  ‘చీట్’చేసి  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. అందుకే రావణ పాలనని అంతమొందించేందుకే లోకేష్, ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారని అనుకోవచ్చు.  ఇక లోకేష్ పాదయాత్ర ఏ విధంగా జరుగుతుంది, ఆయన యాత్ర పొడుగునా ఎన్నెని అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుంది, అనేది ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకు జీవో నంబర్1 తెచ్చింది. పాదయాత్రకు అనుమతి నిరాకరించింది. అయినా, కోర్టు అనుమతితో లోకేష్ ముందడుగు వేస్తునారు. లోకేష్ పాదయాత్ర తొలి అడుగు పడక ముందే జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంతలా ఉలిక్కిపడుతోంది.. అవరోధాలు సృష్టిస్తోంది, అంటే ముందు ముందు..అడుగడుగునా ఇంకెన్ని అవరోధాలు సృష్టిస్త్గుందో వేరే చెప్ప నక్కరలేదు. అయినా... పులి కడుపున పుట్టిన పులి బిడ్డ లోకేష్ ..మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. అవును, లోకేష్’కు తన ముందుంది సీదాసాదా మార్గం కాదని తెలుసు.నిజానికి, ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు, గత  మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన చూసి,అనుభవిస్తున్న అందరికీ, లోకేష్ ముందున్నది, ‘కంటకాకీర్ణ’ మార్గమనే విషయం అర్థమవుతూనే వుంది.  అయినా, ఆనాడు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తాత నందమూరి తారక రామా రావు, తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తండ్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన చైతన్య యాత్రల స్పూర్తితో .. ‘యువగళం’ పాదయాత్రకు లోకేష్  శ్రీకారం చుడుతున్నారు. విజయ శంఖారావం పూరిస్తున్నారు. తెలుగు ప్రజల దీవెనలతో విజయుడై తిరిగొస్తారు.   లోకేష్ విజయయాత్ర పై ఎవరికీ ఎలాంటి అనుమనాలు లేవు. ధర్మో రక్షిత రక్షితః .. ధర్మకోసం చేసే ధర్మ పోరాటం ఆదిలో అవరోధాలు ఎదుర్కున్నా అంతిమ విజయం సాధించి తీరుతుంది.  అయినా, అడుగడునా కష్టాలు తప్పవని తెలిసీ కన్నకొడుకును యుద్ద భూమికి పంపడం ఏ తల్లికైనా ఎంత కష్టమో, ఏ తండ్రికైనా ఇంకెంత బాధాకరమో వేరే చెప్పనకరలేదు. అందునా పాదయాత్ర కష్ట సుఖాలు స్వయంగా అనుభవించిన చంద్రబాబు నాయుడికి, ఆయన కష్టాలు చూసి మానసిక వ్యధను అనుభవించిన లోకేష్  మాతృ మూర్తి భువనేశ్వరికి కన్న కొడుకును పాదయాత్రకు ఆశ్వీదరించి సాగనంపడం ఎంతగా బాధించి ఉంటుందో వేరే చెప్పనక్కర లేదు. అయినా, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆ దుఃఖాన్ని దిగమింగుకుని, లోకేష్ ను ఆశ్వీదరించి అక్షింతలు వేసి సాగనంపారు, చంద్రబాబు దంపతులు. అలాగే, లోకేష్ శ్రీమతి బ్రాహ్మణి, నిండా పట్టుమని పదేళ్ళు అయినా లేని కుమారుడు దేవాన్ష్‌ను, కుటుంబాన్ని వదిలి  400 రోజులు   దూరంగా ఉండడం ఎంత కష్టమో. బ్రాహ్మణి, దేవాన్ష్’ కు అంతకు మించిన బాధ.అయినా కుటుంబ సభ్యులు అందరూ ... లోకేష్ కు వీడ్కోలు పలికిన సందర్భంలో  హైదరాబాద్’లోని ఆయన ఇంటిలో ఉద్విగ్న.. ఉద్వేగభరిత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడి వాతావరణం ఒక విధంగా గుండె గొంతుకలోన కొట్లాడుతోంది .. గీతాన్ని గుర్తుకు తెచ్చింది.  తొలుత లోకేశ్‌ తమ ఇంట్లోని పూజ గదిలో తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామికి కుటుంబంతో కలిసి పూజ చేశారు. అనంతరం తల్లిదండ్రులు భువనేశ్వరి, చంద్రబాబుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. భువనేశ్వరి ఆయన్ను గట్టిగా హత్తుకున్నారు. అత్తామామల పాదాలకూ లోకేశ్‌ మొక్కారు. భార్య బ్రాహ్మణి హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. కారు బయల్దేరే ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టారు. లోకేశ్‌ తన కొడుకు దేవాన్ష్‌ను గాఢంగా హత్తుకుని ముద్దు పెట్టారు. నిజానికి, ఈ దృశ్యాలు అయిన వారినే కాదు అందరిని కదిల్చి వేశాయి. ఒకే రీతిన ఉద్వేగానికి గురిచేశాయి. తెలుగు దేశం కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. జేజేలు పలికారు. పేదలు దీవెనలు అందించారు ...  ధర్మ రక్షణ కోసం కష్టాలను లెక్క చేయకుండా కదిలిన ‘యువ గళానికి ... ప్రజా దీవేనలే శ్రీరామ రక్ష.. లోకేష్ విజయోస్తు ..అంటున్నారు.

కుంగిపోతున్న జోషిమఠ్.. ఛార్ ధాం యాత్ర అనుమానమే!

చార్ ధాం యాత్రపై నీలి నీడలు ముసురుకున్నాయి. జోషిమఠ్ కుంగిపోతుండటంతో ఈ యాత్ర సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే చార్ ధాం యాత్రకు వెళ్లాలంటే జోషిమఠ్ దాటుకునే వెళ్లాలి. కానీ ఇక్కడి రోడ్లు, భవనాలు, హోటళ్లు ఇసుమంతైనా సురక్షితం కాదని నిపుణులు అంటున్నారు. అయినా అవి సురక్షితమా కావా అన్న విషయాన్ని అధికారికంగా నిపుణుల కమిటీ తేల్చాల్సి ఉంది. జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ కు వెళ్లే రహదారికి చీలికలు వచ్చాయి. బద్రీనాథ్ నేషనల్ హైవే కుంచించుకు పోతోంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి.  ఆ కారణంగా రోడ్ల భద్రత కరవైంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమకుండ్ సాహెబ్, బద్రీనాథ్ ధాం, గోవింద్ ఘాట్, మనా పాస్ కు వెళ్లాలంటే జోషిమఠ్ గుండానే  వెళ్లాలి. ఏటా ఏప్రిల్ నుంచి మే మధ్యకాలంలో జరిగే చార్ ధాం యాత్ర కోసం పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఈ రహదారి వెంట ప్రయాణిస్తుండటంతో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జాం  అవుతుంది.   ఇంత ట్రాఫిక్ ను   జోషిమఠ్ రహదారులు ఇప్పుడు తట్టుకోగలవా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.   బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రోడ్ల పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ, నివేదిక సిద్ధం చేస్తున్నారు. హేలంగ్-మర్వారీ బైపాస్ ద్వారా చార్ ధాం యాత్రకు వెళ్లే ప్రత్యామ్నాయ అవకాశం ఉన్నా ఈ టన్నెల్  నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఈ ఏడాది చార్ ధాం యాత్ర కు అనుమతి అన్నది అనుమానమేనని అంటున్నారు.