tdp hopes on nizamabad

నిజాబాబాద్ సభపై తెలుగుదేశం భారీ హోప్స్!

పూర్వ వైభవాన్ని పునర్‌ ప్రతి ష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పక్కా రాజకీయ ప్రణాళికలతో అడుగులు వేస్తున్నది. అభివృద్ధి, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో పాగా  వేసేం దుకు రాజకీయ వ్యూహ రచన చేసింది. ఖమ్మం బహిరంగ సభతో దక్షిణ తెలంగాణలో తెలుగుదేశం సత్తా చాటినట్లే నిజామాబాద్‌ సభతో ఉత్తర తెలంగాణ లో టిడిపి స్థానాన్ని పదిల పర్చుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నది. వచ్చే నెల 12, లేదా 13న నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. గతంలో ఉత్తర తెలంగాణలో ఉన్న టిడిపి కమిటీలు, నాయ కుల జాబీతాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరి శీలించి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కు సూచనలు చేశారు. ఈ సూచనల మేరకు గతంలో టిడిపి కి కంచుకోటగా ఉన్న ప్రాంతాలు, నాయకులు, త్యాగాలకు సిద్ధంగా ఉన్న శ్రేణుల జాబీతాలను పరిశీలించారు. ఉత్తర తెలంగాణ లో పార్టీలు మారిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. అసలు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గట్టి పట్టు ఉంది. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా అనివార్యంగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైనట్లుగా కనిపించినా.. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణ సెంటిమెంటుకు చెల్లు చీటీ పాడేయడంతో.. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవాన్ని సముపార్జించుకునే అవకాశాలు మెరుగయ్యాయి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో నిజమైన అభివృద్ధి జరిగింది తెలుగుదేశం హయాంలోనే. ఈ  నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారించారు. ఖమ్మంలో గత నెల 21న నిర్వహించిన తెలుగుదేశం బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది.   చంద్ర‌బాబు భారీ కాన్వాయ్ తో హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి రోడ్డు మార్గం ద్వారా ఖ‌మ్మం వెళ్లారు. దారి పొడవునా జనం బ్రహ్మరథం పలికారు. తెలంగాణలో తెలుగుదేశంకు ఉన్న క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఖమ్మం సభ సక్సెస్ తో జోరుమీద ఉన్న తెలుగుదేశం వెంటనే మరో బహిరంగ సభకు ప్రణాళిక రచించింది. నిజామాబాద్ లో ఉంటే ఉత్తరతలెంగాణలో సత్తా చాటేందుకు సిద్ధం అయ్యింది. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షడు కాసాని జ్ణానేందర్ అందుకు సన్నాహాలు షరూ చేశారు. ఖమ్మం సభతో తెలంగాణలో తెలుగుదేశంపై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే భారాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన జాతీయ పార్టీ తొలి బహిరంగ సభకు ఖమ్మంనే వేదిక చేసుకున్నారు.   ఖమ్మంలో శంఖరావం పేరిట తెలుగుదేశం నిర్వహించిన భారీ భారీ బహిరంగ సూపర్ సక్సెస్‌తో.. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీలో  నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిస్తోంది. అంతే కాదు తెలుగుదేశం పార్టీ ఆంధ్రలోనే బతికి ఉంది.. తెలంగాణలో మాత్రం కనుమరుగైపోయిందంటూ వస్తున్న విమర్శలకు ఈ సభ సక్సెస్‌  ఫుల్‌స్టాప్ పెట్టింది. దీంతో కొత్త ఊపు ఉత్సాహంతో తెలంగాణలో తెలుగుదేశం అడుగుల వేగం పెంచింది. అయితే బారాస అధినేత   కేసీఆర్.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తోందంటూ ప్రకటించారు. అలాంటి వేళ.. ఆయన దేశంలో ఎక్కడైనా ఈ సభను నిర్వహించవచ్చు. కానీ అలా కాకుండా.. తెలంగాణలోని అదీ.. ఖమ్మం వేదికగా ఈ సభను ఏర్పాటు చేయడంతో ఖమ్మం తెలుగుదేశం సభ భారాసాలోనూ ప్రకంపనలు సృష్టించిందని అవగతమౌతోంది. అసలే ఖమ్మంలో భారాసాకు ఉన్న పట్టు అంతంత మాత్రమే. అందులోనూ ఇప్పుడు ఆ జిల్లా భారాసాలో అసంతృప్తి జ్వాలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. పొంగులేటి, తుమ్మలలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అక్కడే తమ జాతీయ పార్టీ తొలి బహిరంగ సభ ఏర్పాటు చేయడం.. ఇందుకు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలను ఆహ్వానించడంతో.. ఒక వేళ ఆ సభకు అనుకున్నంతగా జనం రాకపోతే.. తెలుగుదేశం పార్టీకి భారాసా సభే రెడ్ కార్పెట్ వెల్ కమ్ పలికినట్లౌతుందని పరిశీలకులు అంటున్నారు. 

jagan to attend nia court

ఎన్ఐఏ కోర్టుకు జగన్?.. ఎందుకంటే

జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టుకు జగన్ హాజరు కావాల్సిందే. అయితే ఆయన ఇంత వరకూ కోర్టు మెట్లు నిందితుడిగా ఎక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్ఐఏ కోర్టుకు ఆయన బాధితుడిగా హాజరు అవ్వాల్సి వస్తోంది. ఔను బాధితుడిగానే. టెక్నికల్ ఈ బాధితుడిగా హాజరు కావాల్సి వచ్చినా వాస్తవానికి ఈ కేసు కారణంగా ఆయన గత ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఔను కోడి కత్తి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ టేకప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ కేసులో బాధితుడి స్టేట్ మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని ప్రశ్నించింది. బాధితుడిని విచారించకుండా, స్టేట్ మెంట్ రికార్డు చేయకుండా సాక్షులను మాత్రం విచారించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. ఈ కేసులో జగన్  స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లుగా ఎన్ఐఏ తరఫున్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే చార్జిషీట్ లో  ఆ స్టేట్ మెంట్ ఏదని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో 56 మందిని విచారిస్తే.. మొదటి 12 మంది స్టేట్ మెంట్లూ చార్జిషీట్ లో లేకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు బెయిలు నిరాకరించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 31 నుంచి కేసు విచారణ చేపడతామని పేర్కొంది. ఈ కేసు విచారణకు బాధితుడితో సహా అందరూ హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో కోడి కత్తి కేసులో బాధితుడిగా ఉన్న జగన్ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. గత ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జగన్ పై కోడి కత్తితో దాడి జరిగిన సంగతి విదితమే. ఆ దాడి కారణంగా అప్పటి ఎన్నికలలో జగన్ పార్టీకి సానుభూతి లభించి లబ్ధి చేకూరిన సంగతి విదితమే.  నిందితుడిగా సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం జగన్ త్వరలో బాధితుడిగా ఎన్ఐఏ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగన్‌పై విశాఖలో జరిగిన కోడికత్తి దాడి ఘటనలో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణలో బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. నెలాఖరు నుంచి ఈ కేసులో విచారణ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జిషీటును పరిశీలించారు. ఈ కేసులో ఇంత వరకూ బాధితుడైన జగన్మోహన్ రెడ్డి దగ్గర స్టేట్ మెంట్ తీసుకోలేదని ఎన్ఐఏపై .. శ్రీనివాస్ తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. అయితే తాము జగన్ స్టేట్ మెంట్ నమోదు చేశామని ఎన్ఐఏ లాయర్ కోర్టుకు తెలిపారు.. అయితే ఆ స్టేట్ మెంట్.. చార్జిషీటులో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడి స్టేట్ మెంట్ నమోదు చేయకుండా ఇతర సాక్షులను విచారిస్తే ఏం ప్రయోజనమని న్యాయమూర్తి ప్రశ్నించారు. నెలాఖరు నుంచి రెగ్యులర్ విచారణను ప్రారంభిస్తున్నందున బాధితుడు కూడా కోర్టుకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. దీంతో బాధితుడైన సీఎం జగన్ కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.

funds flow to varanasi

వారణాసికి నిధుల వరద!

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది పాత సామెత ... మోడీ తలచుకుంటే డబ్బులకు కొదవా అన్నది నేటి సామెత. అవును, ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే ఎవరైనా ఇదే అంటారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో ముఖ్యంగా వారణాసిలో ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మోడీ శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారో లెక్క లేదు... అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కు ఇరుగు పొరుగు రాష్రాలు ఈర్ష్య పడేలా నిధుల వరద పారింది. దీనిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పలు సందర్భాలలో విమర్శలు చేశారు.  అదలా ఉంటే   ఇప్పడు, ఈ రోజు  ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతి పొడవైన నదీ విహార యాత్ర రివర్ క్రూయిజ్ఎంవీ గంగా విలాస్ ను వారణాసి లోని టెంట్ సిటీలో  ప్రారంభించారు. అంతే కాదు పనిలో పనిగా వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఇతర అంతర జల మార్గాల ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జల మార్గాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల రవాణ, వాణిజ్య, పర్యాటకం పెరుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తూర్పు ప్రాంతం దేశానికి వృద్ధి చోధకంగా దోహదపడుతుందని అన్నారు. దీనిని దేశంలో మౌలిక సదుపాయాల పరివర్తన దశాబ్దంగా పేర్కొన్నారు.  గంగా విలాస్ యాత్ర తేలికైన యాత్ర కాదని మన దేశంలో అంతర జల మార్గాల అభివృద్ధికి ఒక ఉదాహారణ అని చెప్పారు. గతంలో అంతర్ జల మార్గాల రంగంలో అసాధారణ  అభివృద్ధి గురించి నరేంద్రమోదీ మాట్లాడుతూ... 2014 లో దేశంలో కేవలం 5 అంతర్ జల మార్గాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 111 కు పెరిగిందరీ, జల మార్గాల రవాణా మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గంగా విలాస్ లో విహార యాత్ర చేస్తున్న స్విట్జర్లాండ్ పర్యాటకులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  ఎంవీ గంగా విలాస్ – ఈరోజు వారణాసి నుంచి బయలుదేరి 51 రోజుల్లో సుమారు 3 వేల 2 వందల కిలో మీటర్లు ప్రయాణించి, బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ కు చేరుకుంటుంది. ఈ పడవలో విలాసవంతమైన 18 గదులున్నాయి. 36 మంది పర్యాటకులు విహారం చేయవచ్చు. నేషనల్ పార్కులు, నదీ ఘాట్లు, పాట్నా నగరం, జార్ఖండ్ లోని షాహిబ్ గంజ్, పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, బంగ్లాదేశ్ లోని ఢాకా, అస్సాంలోని గౌహతిలను ఈ పర్యాటకులు సందర్శించవచ్చు. గంగా నది ఒడ్డున టెంట్ సిటికి కూడా ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేశారు.  ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. కాగా, ఇంతవరకు దేశంలో ఇలాంటి ప్రయోగం జరగ లేదు, ఇదే తొలి ప్రయత్నం. కాగా, భారతదేశ మొట్ట మొదటి నదీ పర్యాటక నౌక,  గంగా, బ్రహ్మపుత్ర  నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌకకు మరో ప్రత్యేకత కూడా వుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌకగా కూడా ‘ఎంవీ గంగా విలాస్‌’ చరిత్ర సృష్టించింది. ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పాటు సూట్‌ గదులు, స్పా, జిమ్‌ సెంటర్లు, ఫ్రెంచ్ బాల్కనీలు, ఎల్ఈడీ టీవీలు, సేఫ్‌లు, స్మోక్ డిటెక్టర్లు, కన్వర్టిబుల్ బెడ్లు వంటివి కూడా ఉన్నాయి. ఈ రోజే (జనవరి 13) 51 రోజుల తోలి పర్యటనను వారణాసి నుంచి ప్రారంభించనున్న ఎంవీ గంగా విలాస్ .. భారత్‌లోని ఐదు రాష్ట్రాలను, బంగ్లాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం 3,200 కి.మీ దూరం ప్రయాణించి దిబ్రూఘర్ చేరుకుంటుంది. అంతేకాక 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ నౌక ప్రయాణించనుంది. ఇక ఈ నౌక తన మొదటి పర్యటనలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గువాహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంది. ఎంవీ గంగా విలాస్ తన తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులను తీసుకెళ్లనుంది. అయితే,  ఈ నౌక అందరికీ అందుబాటులో ఉండదు ..ఎందుకంటే ..ఒక్కో ప్రయాణికుడికి రోజుకు దాదాపు రూ.25వేలు  చార్జి అవుతుంది. అంటే ఈ యాత్ర మొత్తానికి ఒక్కొక్కరికీ రూ.12.75లక్షల ఖర్చవుతుంది.  అదలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ రివర్ క్రూయిజ్ ఏమ్వీ  గంగా విలాస్, వల్ల సామాన్య ప్రజలకు మేలు జరగదని విమర్శించారు.నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏకైక ఉద్దేశ్యం మతపరమైన ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలుగా మార్చడం ద్వారా డబ్బు సంపాదించడం మాత్రమే అని యాదవ్ అన్నారు. ప్రజలు తమ జీవితపు చివరి దశలో లేదా ఆధ్యాత్మికత కోసం వారణాసిని సందర్శిస్తారు మరియు జ్ఞానాన్ని పొందుతారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా డబ్బు సంపాదించడం కోసం బిజెపి ఈ ఏర్పాటు (అక్కడ) చేస్తోంది" అని యాదవ్ చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.

indians migrating

వలసల భారతం!

ఏటా లక్షలాది మంది భారతీయులు  విదేశాలకు వలస వెళ్లిపోతుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం.  స్వదేశంలో కన్నా విదేశాల్లో స్థిరపడడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరిగిపోతుండటానికి కారణమేమిటన్న దానిపై ఇటీవల ఇండోర్ లో జరిగిన భారతీయ ప్రవాసీ దివస్ లో చర్చ జరిగింది.  తాజా గణాంక వివరాల ప్రకారం, ప్రస్తుతం కోటీ 80 లక్షల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యోలో విదేశాలకు వెళ్లిన జనాభా ఉన్న దేశం ప్రపంచంలో భారత్ మాత్రమే. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వలసలు పోతున్నారన్న దానిపైనే   భారతీయ ప్రవాసీ దివస్‌లో  ఆందోళన వ్యక్తమైంది. భారతీయుల్లో అత్యధిక సంఖ్యా కులు విదేశాల్లో తమ భవితవ్యాన్ని, తమ అదృష్టాన్ని వెతుక్కోవడానికి దారి తీస్తున్న కారణాలపై కూడా చర్చ జరిగింది.  భారత్‌ తర్వాత అంత పెద్ద సంఖ్యలో వలసలు పోతున్న జనాభా కలిగిన దేశం మెక్సికో మాత్రమే. అయితే అక్కడి వారు ఎక్కువగా వలస వేళ్లేది అమెరికాకు మాత్రమే. అదే ఇండియన్స్ విషయానికి వస్తే.. వీరు దేశం విడిచి వెళ్లడానికి డెస్టినేషన్ ఒక్క అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఏ దేశానికైనా సరే వెళ్లడానికి ఇసుమంతైనా సందేహించకుండా వెళ్లిపోతున్నారు.  ఒక్క గల్ఫ్ దేశాలలోనే దాదాపు 80 లక్సల మంది భారతీయులు ఉద్యోగమో, వృత్తో, వ్యాపారమో చేసుకుంటగూ జీవనం గడుపుతున్నారు.  అలాగూ అమెరికా, ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్యా లక్షల్లోనే ఉంటుంది. వీరంతా స్వదేశీ పాస్ పోర్టు స్థానంలో వీరు నివసిస్తున్న దేశం పాస్ పోర్టు కోసం ప్రయత్నాలు చేసి సాధిస్తున్నారు.  తూర్పు ఆఫ్రికా, కరిబ్బియన్‌, మలేషియా, ఫిజి దేశాల్లో కూడా భారతీయులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.  వీరంతా వలస పాలకుల కాలంలోనే భారతదేశం వదిలి ఇక్కడకు కార్మికులుగా చేరుకుని స్థిరపడ్డారు. విదేశాలకు వలస వెళ్లి స్థిరపడిన భారతీయుల్లో కార్మికులూ ఉన్నారు. అధికారులు ఉన్నారు. యజమానులు ఉన్నారు. సంపన్నులూ, పేదవారూ కూడా ఉన్నారు.  అయితే, వీళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయా దేశాలలో  సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అక్కడి వారి దృష్టి పడేది ప్రధానంగా ప్రవాసులపైనే.   విశేషమేమిటంటే, చాలా దేశాల్లో భారతీయులు ఘన విజయాలు సాధిస్తున్నారు. ఇక అమెరికాలో అయితే, ఇతర దేశాల సంతతికి చెందినవారిలో భారతీయులే సంపన్న వర్గంగా రికార్డులకెక్కింది. ఇంగ్లండ్‌ పోర్చుగల్‌, ఐర్లాండ మారిషస్‌ ప్రధాన మంత్రులు, గుయానా, సూరినామ్‌, ఇండొనీషియా అ ధ్యక్షులు భారతీయ సంతతికి చెందినవారే. మొత్తం మీద నాలుగు ఖండాల్లోని దేశాలలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తే.  అనేక దేశాల్లో అత్యంత పట్టు, పలుకుబడి కలిగిన వర్గంగా రూపాంతరం చెందిన భారతీయులు భారత్‌కు, ఇతర దేశాలకు మధ్య భౌగోళికంగానే కాక, రాజ కీయంగా, ఆర్థికంగా కూడా ఓ బలమైన వారధిగా పనిచేయడం కద్దు.  ఇలా ఎన్నిసానుకూలతలు ఉన్నా అందే ఆందోళన కర విషయాలు కూడా ఉన్నాయి.  ప్రతి ఏటా కనీసం లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2022లో మొదటి పది నెలల కాలంలోనే ఈ సంఖ్య లక్షా 83 వేలు దాటింది. హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ అనే ప్రసిద్ధ కన్సల్టెన్సీ సంస్థ అందజేసిన వివరాల ప్రకారం, గత ఏడాది సుమారు 8,000 మంది భారతీయ కుబేరులు భారతదేశ పౌరస త్వానికి స్వస్తి పలికారు. అంతేకాదు, సంపన్న భారతీయుల్లో ఎక్కువ మంది విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మీద విశ్వాసం సడలిపోవడమే ఇందుకు ముఖ్యంకారణంగా చెబుతున్నారు.  దేశంలో రాజకీయ పరిస్థితులు, ఆర్ధిక విధానాలు కారణంగానే తాము దేశం విడిచి వెళ్లడానికి కారణమని కూడా అత్యధికులు చెబుతున్నారు. 

alliance pakka

రణస్థలి నినాదం.. ఆఇద్దరి పొత్తు పక్కా !

ఆదర్శాలు ఎన్నున్నా చివరకు రాజకీయాలలో అందరి గమ్యం ఒక్కటే. అందుకు పవన్ కళ్యాణ్ మినహాయింపు కాదు. అవును పవన్ కళ్యాణ్  రాజకీయ అరంగేట్రం చేసి పది సంవత్సరాలు దాటిపోయింది. అయితే  ఈ పదేళ్ళలో ఆయన రాజకీయ ప్రస్థానం ఎంతవరకు వచ్చిందంటే సమాధానం చెప్పడం కష్టమే .. అయ్యవారు ఏమి చేస్తున్నారు అంటే, చేసిన తప్పులు  దిద్దుకుంటున్నారు అన్నట్లుగా ఇంతకాలం ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. అయితే, రణస్థలం యువశక్తి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన వివరణలు, సంధించిన అస్త్రాలు,వదిలిన పంచులు,పవన్ కళ్యాణ్ కు  రాజకీయ తత్త్వం బోధపపడిందనేలా ఉందని  రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా చూస్తే రాజకీయ పరిపక్వత స్పష్టంగా గోచరించిందని ఏపీ పొలిటికల్ రోడ్ మ్యాప్ ను క్లియర్ చేసిందని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీతో పొత్తు  విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీ ఇచ్చారని  అంటున్నారు.  పొత్తుల విషయంలో ఇంతవరకు కొంత మేర అటూ ఇటూ కాకుండా ఉన్న పవన్ కళ్యాణ్, రణస్థలంలో కుండ బద్దలు కొట్టేశారు. ఒంటరిగా పోటీచేసి వీర మరణం పొందవలసిన అవసరం లేదని. అక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా గెలుస్తామంటే, పొత్తులు లేకుండానే పోదాం కానీ అది నేల విడిచి సాము చేయడమే అవుతుందని చెప్పకనే చెప్పారు.  మీరు అండగా వుంటానని గ్యారెంటీ ఇస్తారా అని పవన్  జన సైనికులను ప్రశ్నించారు. ఇప్పుడు ఓకే అని చెప్పి ఎన్నికలు అనగానే మా వాడు, మా కులం అని అంటే కుదరదని ఆయన తేల్చిచెప్పారు. తాను జైనసైనికులను కుటుంబం అనుకున్నానని..  తన ఫ్యామిలీయే వదిలేస్తే తాను ఏం చేయాలని ప్రశ్నించారు. కొన్నిసార్లు ప్రత్యర్ధులని కూడా కలుపుకుని పోవాలని ఆయన వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలు ఆయనలోని పరిపక్వతకు అద్దం పడుతున్నాయని రాజకీయ పండితులు, అంటున్నారు.  నిజానికి రాజకీయాలలో ఆశయాలు, ఆదర్శాలు ఎంత అవసరమో, అవి నెరవేరే మార్గాలను ఎంచుకోవడం కూడా అంతే  అవసరమని అంటున్నారు.  ఈ నేపధ్యంలో  అందరినీ హింసించే ఒక్కడిని ఎదుర్కోవాలంటే అందరూ కలవాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఎంతో అలోచించి చేసిన వ్యాఖ్యగా పరిశీలకులు పేర్కొంటున్నారు.  గతంలోను అనేక  సందర్భాలలో దుష్ట సంహారం కోసం రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్క పెట్టి రాజకీయ పార్టీలు ఏకం అయిన సందర్భాలున్నాయని పరిశీలకులుఅంటున్నారు. ఇందిరా గాంధీ  అధికార దాహంలో ‘హిట్లరమ్మ’ (నియంత)లా మారి దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఉత్తర దక్షిణ దృవాల వంటి పార్టీలు ఏకమై ఇందిరను ఓడించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చి వేసినప్పుడు,ఎన్టీఆర్ కు బీజేపీ, వామపక్షాలు కుడి ఎడమన నిలిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించారని గుర్తు చేస్తున్నారు. అలాగే ఇప్పడు ఏపీలో సాగుతున్న జగన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించేందుకు తెలుగు దేశం పార్టీతో కలిసి పనిచేయాలని జనసేన నిర్ణయం తీసుకుంటే అది తప్పు కాదని, ఒక విధంగా అది ఒక చారిత్రక అవసరమని రాజకీయ పండితులు అంటున్నారు.  అలాగే  ఇటీవల తాను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసిన సంధర్బంలో వైసీపీ నాయకులు వ్యక్త పరిచిన ఉలికి పాటును ప్రస్తావిస్తూ బేరాలు కుదిరిపోయాయని వైసీపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పోలీసులు తనను వేధిస్తే.. చంద్రబాబు తన కోసం వచ్చి నిలబడ్డారని పవన్ తెలిపారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్లి సంఘీభావం ప్రకటించానని ఆయన చెప్పారు. అలాగే, ఆ రెండున్నర గంటల్లో  ఏఏ అంశాలు చర్చించింది, వ్యగ్యం జోడించి వివరించిన పవన్ కళ్యాణ్ సీట్ల గురించి ప్రస్తావించ లేదని చెప్పారు. అదే సమయంలో వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయక తప్పదని  స్పష్టం చేశారు, ఈ సందర్భంగా గత ఎన్నికల్లో జన సేనకు 6.9 శాతం ఓట్లు పోలయినా, ఒక్క సీటూ రాలేదని, మరో వంక టీడీపీ, జనసేన మధ్య ఓట్ల చీలిక వలన 53 నియోజక వర్గాల్లో వైసీపీ, ‘సాంకేతిక’ విజయం సాధించిందని వివరించారు. ఈసారి  ఆ తప్పు జరగని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని మరో మారు .. స్పష్టం చేశారు. దీంతో టీడీపీ, జనసేన పొత్తును పవన్ కళ్యాన్ పక్కా చేశారని పరిశీలకులు పేర్కొంటున్నారు.

why kcr giving importence to ap

తెలంగాణ సీఎంకు ఏపీ పై ఎందుకంత ప్రేమ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనగానే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన అలుపెరగని పోరాటం గుర్తుకొస్తుంది. ఆయన లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు, అసలు తెలంగాణ లేదు. తెలంగాణ అస్తిత్వ వాదాన్ని ఆయుధంగా చేసుకుని, చావు నోట్లో తల పెట్టి, పోరాడి తెలంగాణ సాధించారు కేసీఆర్. పుష్కర కాలంపైగా సాగిన తెలంగాణ మలిదశ ఆందోళనకు కర్త, కర్మ, క్రియా అన్నీ ఆయనే.(అవును ఆయనే లేకుంటే 1200 మంది యువకుల బలిదానాలు ఉండేవి కాదు, ఆ 1200 బలిదానాలు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ రాకుంటే లిక్కర్ స్కాములు, వందల వేల కోట్లకు పడగలెత్తిన కుటుంబాలు ఉండేవి కాదని, కొందరు చేస్తున్న వాదనలో నిజం ఉంటే ఉండొచ్చు కానీ అది వేరే విషయం)  అయితే ఇప్పుడు అదే కేసేఆర్, తెలంగాణ పేరు చెప్పుకుని  జాతీయ స్థాయిలో రాజకీయం చేసేందుకు  బాటలు వేసుకుంటున్నారు. ఆ క్రమంలో అప్పట్లో ఆంధ్ర ప్రాంత ప్రజలను ఆంధ్ర ప్రాంత పాలకులను అనేక విధాల దూషించిన ఆయన ఈరోజు తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలోనూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ కుల సమీకరణలు పనిచేశాయని అంటున్నారు. నిజానికి, మూడు రోజుల క్రితం  శాంతికుమారిని  సీఎస్‌గా నియమించిన వెంటనే ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు ప్రగతిభవన్ కు వెళ్లి అభినందించారు.  కేసీఆర్‌తో పాటు కొత్త సీఎస్‌, ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్న ఫొటోలను సీఎంవోనే రిలీజ్‌ చేసింది. అప్పటి వరకు తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త సీఎస్‌ను కలువనే లేదు. కానీ ఏపీ నేతలు మాత్రం ఫోటోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అంతే కాదు  ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకే  డైరెక్ట్ ఎంట్రీ లేని ప్రగతి భవన్ లోకి బీఆర్ఎస్ ఆంధ్రా నేతలకు మాత్రం ఎప్పుడంటే అప్పడు వచ్చి పోయే విధంగా బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు. ఆంధ్రా నాయకులకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందని అంటున్నారు. నిజానికి  ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేందుకు, ‘ఏపీ బీఆర్ఎస్’ పాస్ వర్డ్ గా  మారిందని అంటున్నారు.   నిజానికి  జాతీయ ఆలోచనలు మొగ్గతొడిగిన నాటి నుంచి కేసీఆర్  కు ప్రాధాన్యతలు మారి పోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన ఎనిమిదేళ్ళలో  ఇంచుమించుగా మూడు వేలకు మందికి పైగా తెలంగాణ రైతులు  అందులో అధిక శాతం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయినా అందులో సగం కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం  ఉదారంగా కాదు చట్టపరంగా ఇవ్వవలసిన నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  అయినా, ముఖ్యమంత్రి కేసేఅర్ పంజాబ్, బీహార్, జార్ఖండ్  రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఉదారంగా ఆర్థిక సహాయం అందించి వచ్చారు.  అంత కంటే మరింత ఉదారంగా భాషా భేదం,  ప్రాంతీయ భేదం లేకుండా దేశంలోని జాతీయ, ప్రాంతీయ పత్రికలు అన్నింటిలో  పెద్ద ఎత్తున ప్రకటనలు (అడ్వర్ టైజ్ మెంట్లు) ఇచ్చి ప్రచారం చేసుకున్నారు.  అలాగే  దేశంలో రైతు నాయకులుగా చలామణి అవుతున్న కొందరు రైతు నాయకులను చర్చల పేరిట హైదరాబాద్ కు పిలిచి సన్మానాలు చేసి పంపించారు. కానీ, ఆ చర్చలలో రాష్ట్రానికి చెందిన రైతు నాయకులకు మాత్రం స్థానం కల్పించలేదు. అందుకే ముఖ్యమంత్రి కొత్త అడుగుల విషయంలో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ విషయంలో ముఖ్యమంత్రి చూపుతున్న ప్రత్యేక ప్రేమ విషయంలో రకరకాల అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అలాగే, ముఖ్యమంత్రి అడుగుల వెనక దీర్ఘకాలిక వ్యూహం  ఉందని  అంటున్నారు.

pawan clarity on alliance

పొత్తుపై పవన్ క్లారిటీ.. ఇక వైసీపీకి దబిడి దిబిడే!

ఏపీలో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు విషయంలో ఇంతవరకూ ఉన్న ద్వైదీ భావానికి పవన్ కల్యాణ్ తెర దించేశారు. శ్రీకాకుళం జిల్లా రణ స్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో  పవన్ కల్యాణ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలి అన్న విషయంలో జనసేన శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. ఇంత వరకూ ఇటువంటి స్పష్టత జనసేనాని ఇవ్వక పోవడంతో పార్టీలోని కిందిస్థాయి క్యాడర్ లో ఒకింత అయోమయం ఉండేది. తమ పార్టీ ఒంటరిగా ముందుకుసాగుతుందా? లేక పొత్తులు ఉంటాయా అన్నఅనుమానాలు ఉండేవి. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పాల్గొనాలా, ఒంటరిగానే ముందుకు వెళ్లాలా అన్న సందిగ్ధత ఉండేది.  అయితే రణస్థలం వేదికగా పవన్ కల్యాన్ అన్ని అనుమానాలకూ తెరదించేశారు. ఇష్టం ఉన్నా లేకున్నాసర్దుకు పోయి ముందుకు సాగాల్సిందేనని దిశా నిర్ధేశం చేశారు. దీంతో క్షేత్ర స్థాయిలో జన సైనికులు తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుని ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే యువశక్తి సభ వేదికగా పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం మోగించేశారు. అధికార వైసీపీ లక్ష్యంగా విమర్శల తూటాలు సంధించారు. ఒంటరి పోరుతో విరమరణం చెందాల్సిన అవసరం లేదనీ, ఉమ్మడిగా తలబడి విజయాన్ని అందుకోవడమే లక్ష్యమని కుండబద్దలు కొట్టేశారు. ప్యాకేజీ స్టార్ అంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు కూడా తనదైన  శైలిలో ఘాటు సమాధానం ఇచ్చారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే చెప్పులతో బడితె పూజ   ఖాయమని హెచ్చరించారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శించిన ఏ ఒక్కరినీ వదల కుండా అందరికీ ఘాటుగా బదులిచ్చారు.  ఇక పొత్తు నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పేశారు. తన సభలకు ఇసుక వేస్తే రాలనంత మంది జనం వస్తారు కానీ ఆ స్థాయిలో ఓట్లు మాత్రం రావడం లేదని పేర్కొన్నారు. తనకు అధికారం మీద కాదు జనం మీదే మమకారం అని చెప్పిన ఆయన ప్రజలకు మేలు చేయాలన్నదే తన లక్ష్యమనీ, అందుకే రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు.   రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడానికి కుట్రలు చేస్తున్నారని దీన్ని ప్రతి జనసైనికుడు ఎదిరించాలని పిలుపునిచ్చారు. జగన్ ను మూడు ముక్కల ముఖ్యమంత్రిగా అభివర్ణించారు.  తాను పొత్తుకు సుముఖంగా ఉండటానికి కారణం కూడా ఆయన ఈ సభలో విస్పష్టంగా చెప్పారు.  పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. అందరూ తన సభలకు వస్తారు జేజేలు కొడతారు తప్ప ఎన్నికలకు వచ్చి ఓట్లు వేయరని అలాంటప్పుడు తనని గెలిపిస్తానని గ్యారెంటీ ఇస్తే మరెవరితోనూ పొత్తు పెట్టుకొను అని ఆయన అన్నారు.  ఆ పరిస్థితి లేదు కనుకనే మన గౌరవానికి భంగం కలగకుండా ఉంటే ఇతర పార్టీలతో కలిసి నడుద్దామని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో రాష్టంలో రాజకీయ వేడి పుంజుకోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. విశాఖలో పవన్ కల్యాణ్ కు జగన్ సర్కార్ అవరోధాలు కల్పించిన సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనానినిక సంఘీ భావం తెలిపిన సందర్భంలోనూ, కుప్పం పర్యటనలో చంద్రబాబుకు జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన సందర్బంగా పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సంఘీభావం తెలపడం తో ఇరు పార్టీల మధ్య  పొత్తు ఉంటుందన్న అంచానాలైతే వచ్చేశాయి. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా ఒక కొలిక్కి వచ్చేశాయన్న ప్రచారమూ జరిగింది. అయితే ఇప్పటి వరకూ ఆ ప్రచారాన్ని ఇరు పార్టీలూ ధృవీకరించకలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేయడంతో క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలూ సమన్వయంతో పని చేసే అవకాశాలు ఏర్పడ్డాయి.  అదే సమయంలో కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలన్న వైసీపీ వ్యూహాలకూ పవన్ తన విస్పష్ట ప్రకటనతో చెక్ పెట్టినట్లే అయ్యింది. దీంతో  జగన్  పాలనను జన క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా ఇంత కాలం తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ఇక  ఉమ్మడి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు కదులుతాయి.  ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయింది.  

will rahul contest from medak

రాహుల్ పోటీ మెదక్ నుంచేనా ?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,2024 లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? గత (2019) ఎన్నికల్లో ఓడిపోయిన అమేథి (యుపీ)  నుంచి మళ్ళీ బరిలో దిగుతారా?  అదే ఎన్నికల్లో ఆయన్ని గెలిపించి లోక్ సభకు పంపిన వయనాడ్ ( కేరళ) నుంచి పోటీ చేస్తారా? ఈ రెండు కాకుండా మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అంటే, అది ఇప్పుడే చెప్పే విషయం కాదు. అలాగే, కాంగ్రెస్ పార్టీ లేదా పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేనో మరొకరో నిర్ణయించే విషయం కూడా కాదు. రాహుల్ గాంధీ ఎక్కడినుంచి పోటీచేయాలో ఆయనే స్వయంగా నిర్ణయించుకుంటారని పార్టీ నాయకులు అంటున్నారు.  అయితే, 2024 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. ముందుగా గత 2019 ఎన్నికల్లో పార్టీ ముఖ్య నేతలు ఓడి పోయిన నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టిని కేద్రేకరించింది. వీఐపీ నియోజక వర్గాల్లో తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సహజంగానే  గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ ప్రముఖుల్లో రాహుల్ గాంధీ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటారు. కాబట్టి, ముందుగా అమేథీలో సర్వే నిర్వహించారు. నిజానికి 2019 ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ అ నియోజక వర్గం వైపు పెద్దగా కన్నెత్తి చూడలేదు. ఒకటి రెండు సందర్భాలలో ఎదో చుట్టపు చూపుగా వెళ్ళారే తప్పించి, సొంత ఇయోజక వర్గం అనే ప్రతేకతను చూపలేదు మరో వంక రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కేంద్ర మంత్రి హోదాలో తరచూ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు.   గత సంవత్సరం (2022) లో జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, అమేథీ అసెంబ్లీ సహా అమేథీ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఎక్కడా కాంగ్రెస్ ఒక్క  సీటు అయినా గెలవలేదు.  (అసలు రాష్ట్రం మొత్తం మీద హస్తం పార్టీ గెలిచింది రెండే  రెండు  సీట్లు ) ఐదులో మూడు సీట్లు బీజేపీ, రెండు సీట్లు ఎస్పీ గెలుచుకున్నాయి.  కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ నియోజక వర్గంలో మాత్రమే సెకండ్ ప్లేస్  లో నిలిచింది. మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో థర్డ్ ప్లేస్ కే పరిమితం అయింది.  అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో మాత్రం 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ కంటే అమేథీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు. 2019లో అమేథీ నుంచి ఓటమిని చవి చూసిన రాహుల్ గాంధీ ఈసారి అమేథీలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం అమేథీలోనే కాదు, మొత్తం యుపీలోనే కాంగ్రెస్ పార్టీ ఖాయంగా గెలిచే లోక్ సభ సీటు ఒక్కటీ లేదని అంటున్నారు. చివరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలోను  ఈ సారి కాంగ్రెస్  గెలుపు కష్టమే అంటున్నారు. అదీగాక, ఈ సారి సోనియా గాంధీ పోటీ చేయక పోవచ్చని, అలాగే రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి పోటీచేయరని అంటున్నారు. అయితే అమేథీ నుంచి పోటీ చేయాలా వద్దా అనేది రాహుల్ గాంధీ నిర్ణయించుకోవాలని పార్టీ సీనియర్ నాయకుడు తారిఖ్ అన్వర్ అభిప్రాయపడ్డారు. అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయకపోతే ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని , అలాగే రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేయకపోతే నెహ్రూ కుటుంబ బంధువు షీలా కౌల్‌ అక్కడి నుంచి పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇదంతా గాంధీ కుటుంబం తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మరో వంక భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ ని బాగా పెంచిందని, ఈ నేపద్యంలో  ఆయన ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. రాహుల్ పోటీ చేసేందుకు పరిశీలనలో ఉన్న నియోజక వరగాల్లో మెదక్ నియోజక వర్గం కూడా ఉంది అంటున్నారు. 1980 లోక్ సభ ఎన్నికల్లో ఇదిరా గాంధీ ఇదే నియోజక్ వర్గం నుంచి పోటీచేసి రెండు లక్షల మెజార్టీతో గెలుపొందారు. అందుకే రాహుల్ గాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేసే ఆలోచనలో అన్నట్లు తెలుస్తోంది .

will revaanth go ahead with paqdayatra

రేవంత్ పాదయాత్ర.. ఉంటుందా? ఉండదా?

తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు అడుగడుగునా అవాంతరాలు ఎదురౌతున్నాయా? ఆయన ముందుగా ప్రకటించినట్లు ఈ నెల చివరి నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నారు. ఎన్నికల ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పాదయాత్రతో ముందుకు సాగాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఆయన ఉన్నా.. హై కమాండ్ నుంచి అనుమతి, రాష్ట్రంలో ఆయన వ్యతిరేకుల అడ్డంకులతో యాత్ర తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నారు.   పాదయాత్రతో ప్రజల్లోకి వెళితే.. కాంగ్రెస్ పార్టీ కేడర్ , ద్వితీయ శ్రేణి నాయకులు, వరుస ఓటములతో డీలా పడిన క్యాడర్ లో నూతనోత్సాహం నింపాలన్నది రేవంత్ లక్ష్యంగా చెబుతున్నారు. అలాగే మరోవైపు రాజకీయంగా దూకుడు మీద ఉన్న బీజేపీకి కూడా తన పాదయాత్రతో చెక్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లడంతో... కాంగ్రెస్ హైకమాండ్ తన పాదయాత్రకు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చని.. అనుమతి కూడా లభిస్తుందని రేవంత్ విశ్వాసంతో ఉన్నారు.   తన పాదయాత్ర ద్వారా  కాంగ్రెస్  ప్రచారం కూడా జరుగుతుందని, ప్రజల్లోకి కాంగ్రెస్ చేసిన పనులు, చేపట్టిన పథకాలు మరోసారి తీసుకెళ్ళొచ్చని రేవంత్ చెబుతున్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులను గమనిస్తే ఆయన పాదయాత్ర మొదలు పెట్టడం, కొనసాగించడం అంత తేలిక కాదన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేకవర్గం రేవంత్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మాణిక్ ఠాక్రే బాధ్యతలు చేపట్టిన తరువాత సంక్షోభ నివారణ యత్నాలు మళ్లీ మొదటి నుంచీ ప్రారంభమయ్యాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి నేతలను బుజ్జగించడమే లక్ష్యంగా ఠాక్రే వ్యవహరిస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను జిల్లా కమిటీలనూ, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఇసుమంతైనా ఖాతరు చేయబోనని ఠాక్రేతో సమావేశం తరువాత ప్రకటించడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చర్జ్  ఠాక్రే వస్తూనే  రాష్ట్ర పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు.     కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి పాదయాత్ర అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జ్ ముందు ఇప్పటికే ప్రస్తావించి ఆయన  ఒక్కరే పాదయాత్ర చేస్తే ఎలా.. ఆయనకు అనుమతి ఇవ్వడం ద్వారా కొత్త పంచాయతీ సృష్టించవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో తెలంగాణలోని పలువురు సీనియర్లు, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న నేతలంతా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించారని అంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇస్తే.. తాము కూడా పాదయాత్ర చేస్తామని.. తమకు కూడా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తామొంటూ   సీనియర్ నేతలు ఇప్పటికే తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి అనుమతి ఇచ్చి.. ఇతర నేతలకు ఇవ్వకపోతే కొత్త సమస్య వస్తుందని   సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావ్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. అయితే తాను అనుకున్న విధంగానే పాదయాత్రతో ముందుకు సాగాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని.. ఈ విషయంలో హైకమాండ్‌ను ఏదో రకంగా ఒప్పించాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. ఒక వేళ హై కమాండ్ అనుమతి లభించకుంటే.. అధిష్ఠానాన్ని ధిక్కరించైనా సరే పాదయాత్రతో ముందుకు సాగాలని రేవంత్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.  మొత్తానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీకి కారణమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ap high court suspends go one

జీవో 1 ను సస్పెండ్ చేసిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాష్ట్రంలో సభలూ,  సమావేశాలపై నిషేధం విధిస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో1 ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవో నంబర్‌-1ను సవాల్ చేస్తూ  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.   జీవో నంబర్ 1 ప్రకారం సభలు, రోడ్‌షోలు, అనుమతి లేకుండా.. రాజకీయ పార్టీలు సభలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సీపీఐ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను హై కోర్టు  గురువారం (జనవరి 12)న విచారించింది. జీవో నంబర్ 1ను ఈ నెల 23 వరకూ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఈ జీవో చెల్లదని మొదటి నుంచీ తెలుగుదేశం సహా అన్ని  విపక్షాలు చెబుతూ వస్తున్నసంగతి విదితమే. 

ycp will gain if tdp janasena bjp are in alliance

కమలంతో కలిస్తే సీన్ సితారే.. అత్మసాక్షి ఫస్ట్ రిపోర్ట్

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిదాయకంగా మారుతున్నాయి. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ  ముందస్తు ఎన్నికలకు వెళ్లి ముందుగా ఇంటికి వెళ్ళడం కంటే, అందాక ఆగి అయిన కాడికి నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం ఉత్తమమనే అభిప్రాయం అధికార పార్టీ ఎమ్మెల్యేలలో వ్యక్తమౌతోంది.   అదలా ఉంటే  రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై ‘ఆత్మ సాక్షి’ పొత్తుల ప్రాతిపదికన నిర్వహించిన ప్రాథమిక సర్వే ప్రకారం  టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే  ఆ కూటమి తిరుగులేని మెజారిటీతో సింహాసనం ఎక్కేస్తుంది. అదే  టీడీపీ, జనసేన కూటమితో మూడో పార్టీ బీజేపీ జట్టు కడితే  మూడు పార్టీల కూటమి మళ్ళీ మరో ఐదేళ్ళు విపక్షంలో నిరీక్షించక తప్పదు. నిజమే ఇది కొంచెం తప్పుడు లెక్కలా ఉన్నా ఆత్మ సాక్ష సర్వే ప్రకారం టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే  రెండు పార్టీల కూటమికి 105 నుంచి 112  వరకు అసెంబ్లీ సీట్లు ఖాయంగా వస్తాయి. అయితే  ఆ లెక్క నిజం కావాలంటే, టీడీపీ 36 నియోజక వర్గాలో ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ లని , అంటే అభ్యర్ధులను తీసీసి కొత్త వారికి టికెట్ ఇవ్వాలని ఆత్మ సాక్షి సర్వే చెబుతోంది. అదలా ఉంటే టీడీపీ, జనసేన కూటమిలోకి కమలం వచ్చి చేరితే, మూడు పార్టీల కూటమి 75 నుంచి 78 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది.  వైసీపీకి 90 నుంచి 95 సీట్లు వస్తాయి. వైసీపీ సునాయాసంగా రెండవ సారి అధికారంలోకి వస్తుంది. ఇదేమిటి ఒకటి ప్లస్ ఒకటి రెండు, రెండు ప్లస్ ఒకటి మూడు కావాలి కానీ, రెండు కంటే తక్కువ ఎలా అవుతుంది, అంటే, అదంతే అంటోంది అత్మసాక్షి సర్వే.   ఇక మూడో సినేరియోలో .. బీజేపీ, జనసేన ఒక జట్టుగా, వైసీపీ, టీడీపీ విడివిడిగా పోటీ చేసినా ముక్కోణపు పోటీలో కూడా వైసీపీనే మళ్ళీ విజయం సాధిస్తుంది.  వైసీపీకి 90 నుంచి 95, టీడీపీకి 68 నుంచి 70 సీట్లు, జనసేనకు 5 సీట్లు వస్తాయి. మరో 8 నుంచి పది సీట్లలో కీన్ కాంటెస్ట్ ఉంటుంది.  అయితే, ఆత్మ సాక్షి లెక్క ప్రకారం ప్రతి పక్షాల ముందన్న మంచి ఆప్షన్ మరొకటి వుంది. ... టీడీపీ,జనసేన,సిపిఐ, సిపిఎం పార్టీలు జట్టు కడితే, వైసీపీ కేవలం 60 నుంచి 65 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అవుతుంది. టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల కూటమి భారీ మెజారిటీ సాధిస్తుంది.  ఆత్మ సాక్షి టీడీపీకి ఓ చిన్న సూచన కూడా చేసింది. మొత్తం 175 నియోజక వర్గాలకు గాను, 42 అసెంబ్లీ స్థానల్లో మాత్రమే టీడీపీ కాసింత బలహీనంగా వుంది. ఈ 42 నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్ధులను ఇంచార్జ్ లుగా నియమించడమో లేదంటే ఉన్న వారికి బూస్ట్ ఇచ్చి,  ఉత్సాహన్ని నింపి గట్టిగా పనిచేసేలా చేయడమో చేయాలని ఆత్మ సాక్షి సూచించింది. చివరగా,ఆ 42 మంది బలహీన ఇంచార్జ్ ను మార్చలేక పోతే టీడీపీ బలం 59, 65 మధ్యలోనే ఉంటుందని ఆత్మసాక్షి.. సర్వే సూచిస్తోంది. అయితే ఇది సర్వే ప్రైమరీ రిపోర్ట్ మాత్రమే .. పూర్తి స్థాయి  సర్వే నివేదికతో కానీ,  అసలు నిజాలు బయటకు రావు.

whaat indicates this change

ఈ మార్పు .. దేనికి సంకేతం ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్  శాంతి కుమారి ఎంపిక అనూహ్యమే, అసలు రేసులోనే  లేని ఆమెను ముఖ్యమంత్రి ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి, ఆమెకు కూడా ఇది సర్ప్రైజ్  కావచ్చును. కానీ ముఖ్యమంత్రి కేసేఆర్ తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయన తప్ప మరొకరు అలోచించనైనా ఆలోచించ లేరు. అవి ఆయనకు తప్ప ఇంకెవరికీ అర్థం కావు. గతంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌ స్థానానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె వాణి దేవిని  ఆఖరి క్షణంలో తెరాస అభ్యర్థిగా ఖరారు చేశారు. అప్పుడు ఇలాగే అందరూ అవాక్కయ్యారు. అలాగే ఇప్పడు సీఎస్ గా  శాంతి కుమారి ఎంపిక కూడా చాలా మందిని చాలా రకాలుగా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అంతకంటే విచిత్ర్రం మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నిష్క్రమణ. నిజానికి, సోమేశ్ కుమార్ కోర్టు ఆదేశాలను ఇలా హుందాగా స్వీకరిస్తారని కానీ..  మౌనంగా ఉంటారని కానీ..  కోర్టు పొమ్మనగానే, జేబులో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లి పోతారని కానీ ఎవరూ ఉహించలేదు. హై డ్రామా జరుగుతుందనే అందరూ ఉహించారు. మీడియా  అదే ఆశించింది. అయితే  సోమేశ్ కుమార్  అందరినీ  డిసప్పాయింట్  చేస్తూ ఎలాంటి చడీ చప్పుడు లేకుండా కోర్టు గీసిన గీత దాటకుండా నడుచుకుంటూ వెళ్లి పోయారు.  అయితే ఇప్పడు అదే ఆయన అలా జేబులో చేతులు పెట్టుకుని మౌనగా ఏపీకి వెళ్లి పోవడమే, అందరినీ అంతు చిక్కని ప్రశ్నగా వెంటాడుతోంది. అవును.. ఆయన ఎందుకు అలా వెళ్ళిపోయారు ? ముఖ్యమంత్రి కేసేఆర్  తమకు అన్ని విధాల అనుకకూలమైన ఆయన్ని ఎందుకు అలా.. వెళ్ళనిచ్చారు. ఎందుకు ఒంటరిగా వదిలేశారు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడు తున్నాయి.  హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక్క క్షణం వృధా చేయకుండా అత్యంత వేగంగా పావులు కదిపింది. తెలంగాణ ప్రభుత్వ విధుల నుంచి సోమేశ్‌ కుమార్‌కు వెంటనే రిలీవ్‌ కావాలని ఆదేశిస్తూ  ఉత్తర్వులు జరీ చేసింది. కోర్టు తీర్పు వచ్చిన రోజునే  మంగళవారం (జనవరి 10) ఈమేరకు  కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(డీఓపీటీ) ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 12 లోపు అంటే గురువారం లోగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్‌ను ఆదేశించింది. ఒక విధంగా ఇది ఊహించిందే  ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్‌ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సోమేశ్‌ కుమార్‌ 2014లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌ 2016లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ(డీవోపీటీ) 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పుడు ఆ పిటిషన్‌ పైనే కోర్టు తీర్పు నిచ్చింది.  మరోవంక రాజకీయ కోణంలో చూసినా సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు, ఇష్టుడు కావడం వలన ఆయన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద పరుగులు తీయడాన్ని  అర్థం చేసుకోవచ్చును.కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే వేగంగా చక చకా నిర్ణయాలు తీసుకున్నారు.  సోమేశ్ కుమార్ అటో ఇటో ఎటో తేల్చుకోక ముందే కొత్త సీఎస్ బాధ్యతలు స్వీకరించారు. ఇది  చాలా మందిని చాలా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంచు మించుగా మూడున్నరేళ్ళుగా ముఖ్యమంత్రి నోట్లో నాలుకలా అన్ని కార్యాలు చక్కపెట్టిన సోమేశ్ కుమార్ కు కనీసం ఒక సాంప్రదాయ వీడ్కోలు అయినా లేకుండానే ఎందుకు అలా వదిలేశారు అనేది పొలిటికల్ ఆఫీషియల్ సర్కిల్స్ లో మిలియన్ డాలర్ల ‘చర్చ;’ గా మారింది.     నిజానికి కోర్టు తీర్పును ముందుగానే ఊహించిన సోమేశ్ కుమార్ కు, అదే జరిగితే ఏమి చేయాలనే విషయంలో ఒక స్పష్టత ఉందనే ప్రచారం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును హైకోర్టు రద్దు చేయడంతో ఆయన తన పోస్టుకు రాజీనామా చేస్తారనే ప్రచారం మరింత జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ఉద్దేశం, ఆసక్తి ఆయనకు ఏమాత్రం లేవని వార్తలొచ్చాయి. అంతే కాకుండా ఆయన సర్వీస్ ఇంకా నిండా సంవత్సరం కుడా లేదు. ఈ ఏడాది అంటే 2023 డిసెంబరు 30తో ఆయన సర్వీసు కాలం ముగుస్తుంది. కనుక  ఇంత తక్కువకాలం కోసం ఏపీకి వెళ్లి  చిన్న పోస్టులో కొనసాగడం అవసరమా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకే తన ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేస్తారని చర్చ కూడా జరిగింది. అనంతరం తెలంగాణ సర్కారు ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. నిజానికి సోమేశ్‌కుమార్‌ కు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మొదటి నుంచీ  సత్సంభాదాలే ఉన్నాయి కనుక ఆయన ఐఏఎస్ గా రాజీనామా చేసినా,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ ఆయన  సేవలను సలహాదారు గానో, మరో విధంగానో ఎక్కడో అక్కడ తప్పకుండా  ఉపయోగించు కుంటారనే ప్రచారం జరిగింది.  కానీ  అవేవీ లేకుండా సోమేష్ కుమార్ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీన్ మారిపోయింది. కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల లోగానే,  కొత్త సీఎస్ నియామకం జరిగిపోయింది. కొత్త సీఎస్‌గా శాంతికుమారి పేరు మీడియాకు తెలియడం, ఆమె కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవడం, ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. అయితే ఎందుకిలా జరిగింది? మాజీ సీస్ ఇంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నారు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అంతలా  ఉదాసీనంగా ఉన్నారు ...? కేంద్రంతో మరో వివాదం కొని తెచ్చుకోవడం ఇష్టం లేక కేసీఆర్ మౌనంగా ఉండిపోయారా... ఈ గుణాత్మక మార్పుకు సిబిఐ , ఈడీ కేసులు, విచారణలకు ఏమైనా సంబంధం వుందా? ఇవ్వన్నీ ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నలు

new cs appointment kcr move aiming ap

తెలంగాణ కొత్త సీఎస్.. ఏపీ కోసం కేసీఆర్ ఎత్తుగడేనా?

తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతి కుమారి నియామకం వెనుక కేసీఆర్ పెద్ద వ్యూహమే ఉంది.  అయితే ఆ వ్యూహం తెలంగాణ లక్ష్యంగా కాదు.. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతం లక్ష్యంగా రచించారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతం కోసం ఇప్పటికే ఒక సామాజిక వర్గం లక్ష్యంగా చేరికలను ఆహ్వానించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతికుమారిని నియమించడం ద్వారా ఏపీలో ‘ఒక’ సామాజిక వర్గం మొత్తంగా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యేలా వ్యూహం పన్నారని అంటున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ మూలాలుఉన్న శాంతి కుమారిని సీఎస్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కేసీఆర్ ఏపీలో ఏ సామాజికవర్గాన్నైతే లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారో.. ఏ సామిజక వర్గం బీఆర్ఎస్ కు చేరువ అవుతో ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని భావిస్తున్నారో.. ఆ సామాజిక వర్గానికే చెందిన శాంతి కుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించారు. ఆయన వ్యూహం లక్ష్యం సవ్యదిశగానే సాగుతోందనడానికి ఆమె నియామకం జరిగి.. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏపీ కాపు ప్రముఖులు కొత్త సీఎస్ తో కలిసి సీఎం కేసీఆర్ ను కలవడమే  నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు.   శాంతి కుమారి వాస్తవానికి తెలంగాణలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి అయినా, ఇంత కాలం ఆమె అంతగా ప్రాధాన్యత లేని అటవీ శాఖకు పరిమితం చేశారు. ఆమె గతంలో  సీఎంవోగా పని చేసినా ఆమెకు అక్కడ కూడా దక్కాల్సిన ప్రాముఖ్యత దక్కినట్లు కనిపించదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలంగాణ సీఎస్ రేసులో సీఎంకు సన్నిహితులైన అధికారులు నలుగురైదుగురు ఉన్నా కూడా ఆ రేసులో కనీసం పేరు కూడా వినిపించని శాంతి కుమారిని కేసీఆర్ అనూహ్యంగా సీఎస్ గా నియమించడం వెనుక ఏపీ లక్ష్యంగా ఉన్న వ్యూహమే కారణమని చెబుతున్నారు.  ఇటీవలే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించిన కేసీఆర్.. రోజుల వ్యవధిలోనే అదే సామాజిక వర్గానికి చెందిన శాంతి కుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించి.. ఆ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఎనలేని ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇస్తోందన్న సంకేతాలు ఇచ్చారు.  అదే సమయంలో తెలంగాణలో తెలుగు అధికారులకు కీలక పదవులు ఇవ్వడం లేదంటూ తనపై తెలంగాణలో వెల్లువెత్తుతున్న విమర్శలకు కూడా ఆయన శాంతికుమారిని సీఎస్ గా నియమించడం ద్వారా చెక్ పెట్టి ఒకే సారి రెండు ప్రయోజనాలు సిద్ధించేలా పావులు కదిపారు. ఏపీ లక్ష్యంగా కేసీఆర్ వేసిన ఈ ఎత్తుగడ ఏ మేరకు బీఆర్ఎస్ ఆ రాష్ట్రంలో బలపడేందుకు తోడ్పడుతుందో తెలియదు కానీ, ఆమెతో కలిసి  ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి కృతజ్ణతలు చెప్పడంతోనే ఆయన ఏ ఉద్దేశంతో శాంతి కుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించారన్నది స్పష్టమౌతోంది.  

will thakre bring unity in congress

ఠాక్రే... తేల్చేస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం పరిష్కారానికి పార్టీ అధిష్టానం కొంచెం ఆలస్యంగానే అయినా నడుం బిగించింది. నిజానికి రేవంత్ రెడ్డిని  పీసీసీ అధ్యక్షునిగా నియమించిన క్షణానే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి బీజం పడింది. రేవంత్ నియామకం అయిన వెంటనే, కోమటి రెడ్డి వెంకటరెడ్డి నిరసన గీతానికి సిగ్నేచర్ ట్యూన్ సెట్ చేశారు.  .రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నంత కాలం గాంధీ భవన్ గడప తొక్కనని తొలి నిరసన గళం వినిపించారు. ప్రతిజ్ఞ చేశారు. కోమటి రెడ్డి వెనక జగ్గా రెడ్డి ఆయన వెంట వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి మరి కొందరు ఇలా ఒకరి వెంట ఒకరుగా పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారు.  మరో వంక మాజీ పీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి. శ్రీధర్ బాబు వంటి మరికొందరు సీనియర్లు, తటస్థంగా ఉన్నట్లు ఉంటూనే., రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక విధమైన మౌన పోరాటం చేశారు. చాపకింద నీరులా రేవంత్ రెడ్డి కుర్చికి ఎసరు తెచ్చే ప్రయత్నాలు సాగించారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక ముందు నుంచి సీనియర్ నేతలు రూట్ మార్చి రేవంత్ రెడ్డికి ‘బయటి’ వ్యక్తి  అనే ముద్ర వేశారు. అదే సమయంలో  రేవంత్ రెడ్డి ఆయన ముఖ్య అనుచరులు, కాంగ్రెస్ కల్చర్ తెలిసీ, తెలియక  చేసిన వ్యాఖ్యలు సీనియర్లకు అస్త్రాలయ్యాయి.  ఆ అస్త్రాలను ఉపయోగించుకునే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధికి డిపాజిట్ అయినా దక్కకుండా చేయడంలో సీనియర్లు కృతకృత్యులయ్యారు. అలాగే మునుగోడు ఓటమిని పూర్తిగా రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఖాతాలో వేసి, ఆయన పోటుగాడు కాదు,  పనికిరానోడే అని అధిష్టానానికి పెద్దక్షరాల్లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అందరూ చేతులు కలిపారు. ఒకే స్వరంతో  ‘కోరస్’గా నిరసన గీతాన్ని ఢిల్లీకి వినిపించారు. ఢిల్లీ కదిలింది.     అయితే, అధిష్టానం సమస్యను గుర్తించడంలో జరిగిన జాప్యం వల్లనైతేనేమీ, సమస్య పరిష్కారానికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడం వల్లనైతేనేమీ, అధిష్టానం నడుం బిగించే సమయానికే, సమస్య జటిలమై కూర్చుంది. రాష్ట్ర వ్యవహరాల బాధ్యుడు మాణిక్యం ఠాగూర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో జట్టు కట్టి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని సీనియర్ నాయకులు తీవ్ర స్వరంతో ఆరోపించిన తర్వాత కానీ కాంగ్రెస్ అధిష్టానంలో కదలిక రాలేదు. అంతే కాదు దిగ్విజయ్ దౌత్యం కూడా విఫలమైన తర్వాత కానీ, మాణిక్యం ఠాగూర్ ను తొలిగించ లేదు. అందుకే కావచ్చును,చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున చందాన ఠాగూర్ ను సాగనంపినా పెద్దగా ఫలితం లేక పోయింది. సీనియర్లు శాంతించడం లేదు. మరోవంక రేవంత్ రెడ్డి కూడా కాడి  వదిలేసే ఆలోచకు వచ్చినట్లు తెలుస్తోంది.   ఈ నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే రంగంలోకి దిగారు. రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్ వచ్చారు. మహారాష్ట్రకు చెందిన ఠాక్రే సీనియర్ నాయకుడు.  సందేహం లేదు. నాలుగైదు మార్లు ఎమ్మెల్యేగా, ఒకటి రెండు మార్లు మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటుగా పార్టీలోనూ పీసీసీ సహా కీలక పదవులు నిర్వహించిన అనుభవం వుంది. అయితే. మాణిక్యం ఠాగూర్ తో కానీ పని మాణిక్‌రావు ఠాక్రేతో అవుతుందా? దిగ్విజయ్ అంతటివాడితో కానీ పని ఠాక్రేతో అవుతుందా? అనే అనుమానాలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి.  మరోవంక  ఠాక్రే రాకతో గాంధీ భవన్‌లో కొత్త జోష్‌ కనిపించింది. చాలాకాలం నుంచి దూరం దూరంగా ఉంటున్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా గాంధీ భవన్‌లో దర్శనమిచ్చారు. కానీ  రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నంత వరకు  తాను గాంధీభవన్‌ గడప తొక్కనని ప్రతిజ్ఞ చేసి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత అసమ్మతికి తొలి బీజం నాటిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాత్రం ఆ మాట మీదనే నిలబడ్డారు. ఆహ్వానం పంపినా ఆయన రాలేదు. అఫ్కోర్స్ మధ్యలో ఆయన ఒకటి రెండు సందర్భాలో గాంధీభవన్  కు వచ్చారు అనుకోండి అది వేరే విషయం. అలాగే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తిరుమల వెళ్లడంతో.. ముఖాముఖి సమావేశాల్లో పాల్గొనలేకపోయారు. అదలా ఉంటే రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క పోదెం వీరయ్య తదితర నేతలూ ‘వ్యక్తిగత’  కారణాలతో సమావేశాలకు రాలేదు. అలాగే  ఠాక్రేతో ఎవరికి వారుగా సమావేశమైన నాయకులు  దిగ్విజయ్ సింగ్ ముందు వినిపించిన విధంగా ఎవరి వాదన వారు వినిపించినట్లు తెలుస్తోంది  రాష్ట్రంలో కాంగ్రెస్ కు సానుకూల పరిస్థితే ఉందని, రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించకుండా అందర్నీ కలుపుకొపోతేనే సానుకూల ఫలితం వస్తుందన్న అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేస్తే  సానుకూలతను ఓట్ల రూపంలో మార్చుకునే ప్రక్రియలో రేవంత్‌కు సీనియర్ నాయకుల సహకారం అందడం లేదని రేవంత్ రెడ్డి  అనుకూల వర్గం నేతలు తమ వాదన వినిపించినట్లు తెలిసింది.  పీఏసీ సభ్యులందరికీ సమయం ఇచ్చి అభిప్రాయాలు విన్న ఠాక్రే.. పార్టీలో ఎవరి గౌరవం వారికి దక్కేలా తాను చూస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే .. ఇరు వర్గాలు ఎవరికి వారు, ‘తగ్గేదే లే’ అంటున్న నేపధ్యంలో  అది అయ్యే పనేనా ? కాదంటే, పరిస్థితి ఏంటి ? ఇవే ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్, అభిమానుల ముందున్న ప్రశ్నలు.

tamilnadu governer wantedly  provocating

తమిళనాడు గవర్నర్ కావాలనే రెచ్చగొడుతున్నారా?

రాష్ట్రప్రభుత్వాలూ, గవర్నర్ ల మధ్య వివాదం తలెత్తడమన్నది కొత్త విషయమేమీ కాదు.  కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికీ మధ్య సత్సంబంధాలు  లేని ప్రతి సందర్భంలోనూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు గవర్నర్లతో పేచీ తలెత్తడం సాధారణమే. ఈ పరిస్థితి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఉన్నదే.  కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న కాలంలోనూ ఇలా గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ ను పదవీ చ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన సందర్భంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్ లాల్ వ్యవహరించిన తీరు, పోషించిన పాత్ర తెలిసిందే.   సరే ఇప్పుడు బీజేపీ హయాంలోనూ అటువంటి పరిస్థితే కొనసాగుతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళ సైల మధ్య విభేదాలు తెలియనివి కావు.  అలాగే తాజాగా  తమిళనాడులో నూ ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే తమిళ నాడులో జరిగింది మాత్రం మామూలు వివాదం కాదు. ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన. ప్రజాస్వామ్యంలో మాయని మచ్చగా మిగిలిపోయే వివాదం. తమిళనాడు శాసనసభ కొత్త సంవత్సరంలో మొదటిసారిగా సమావేశమైనప్పుడు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు గవర్నర్‌, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదాలను మరింత రాజేశాయి. శాసనసభను ఉద్దేశించి గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి తాను చేయాల్సిన ప్రసంగంలో చివరి నిమిషంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం, దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి   తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దీని మీద గవర్నర్‌ సభ నుంచి వాకౌట్‌ చేయడం వంటి ఘటనలు స్వతంత్ర భారత దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదు. శాసనసభ ఆమోదించిన సుమారు పన్నెండు బిల్లుల మీద సంతకం చేయకుండా గవర్నర్‌ తొక్కి పెట్టి ఉంచడం గతంలో పలు సందర్భాలలో పలు రాష్ట్రాలలో జరిగింది. అయితే తమిళనాడు గవర్నర్ మాత్రం ఇది చాలదన్నట్టు ఒక అడుగు ముందుకు వేసి  శాసనసభలో చేసిన వ్యాఖ్యలు గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగాధాన్ని మరో ఎత్తుకు తీసుకు వెళ్లింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ తరచూ సన్నాయి నొక్కులు నొక్కే తమిళనాడు గవర్నర్‌   శాసనసభలో తాను ప్రసంగించడానికి ప్రభుత్వం తయారు చేసి ఇచ్చిన ప్రసంగంలో కొన్ని వాక్యాలను చదవ లేదు.   తన ‘విచక్షణాధికారం’ నెపంతో వదిలేశారు.  ఈ వ్యవహారమంతా చినికి చినికి గాలివానగా మారి, గవర్నర్ల పాత్రపై వాడి వేడి చర్చకు తెరలేపింది.  రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ప్రసంగంలో మార్పులు, చేర్పులు చేయడానికి, తనకు తోచిన విధంగా కొన్ని భాగాలను తొలగించడానికి గవర్నర్‌కు హక్కుందా అన్నది పక్కన పెడితే..  నా ప్రభుత్వం అంటూ గవర్నర్ ఆరంభించే ప్రసంగంలో అలా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించడం లేదా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. గతంలో అంటే 2018లో కేరళలో కూడా ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్‌ పి. సదాశి వం తన బడ్జెట్‌ ప్రసంగంలో కొన్ని భాగాలను తొలగించి చదివారు. కేంద్ర ప్రభుత్వాన్ని, పాలక పక్షాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆ భాగాలను   గవర్నర్‌ చదవకుండా దాటేసినా వాటిని కూడా చదివినట్టుగానే పరిగణిస్తామని అప్పట్లో కేరళ  స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చారు. గవర్నర్‌ తీరుపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. చివరికి దానంతటదే చల్లారింది.  ఇక 2020లో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ కూడా ఇదే విధంగా వ్యవహరించారు. సదాశివం, ఆరిఫ్‌ మొహ మ్మద్‌ ఖాన్లు గవర్నర్లుగా ఉన్నంత వరకూ రాష్ట్ర ప్రభుత్వంతో విభేదిస్తూనే వచ్చారు. ఆ కొందరు సంప్రదాయాలను, పద్ధతులను పాటించడానికి ఇష్టపడడం లేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం  ఒక కేసులో   గవర్నర్ల రాజ్యాంగపరమైన అధికారాలను వివరించింది. తాము గవర్నర్లుగా ఉన్న రాష్ట్రానికి తాము కార్య నిర్వాహక అధిపతులే కానీ, వాస్తవంలో మంత్రివర్గమే రాష్ట్రానికి కార్య నిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తుంది. ఇంత స్పష్టంగా సుప్రీం తీర్పు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో గవర్నర్లు పరిధి మీరడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడమేననే చెప్పాలి. ఇక తమిళనాడు గవర్నర్ విషయానికి వస్తే ఆయన కావాలనే తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో విపక్ష ఏఐడీఎంకే కూడా తన నిరసనను వ్యక్తం చేసిందంటే గవర్నర్ రవి ప్రసంగం ఎవరికీ నచ్చని విధంగానే ఉందన్నది తేటతెల్లమౌతోంది. 

చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ.. మోహన్ బాబు కోసమేనా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబునివాసానికి వెళ్లిన రజనీకాంత్ ఆయనతో దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేశారు. మిత్రుడు రజనీకాంత్ ను కలవడం సంతోషంగా ఉందంటూ వారిరువురూ కలిసిన ఫోటును కూడా ఆ ట్వీట్ కు జత చేశారు. సరే ఇంతకీ ఇరువురి మధ్యా ఏం చర్చ జరిగిందన్న విషయంపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ జరిగిన అనంతరం రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందన్న ఊహాగానాలూ వ్యక్తమౌతున్నాయి. మర్యాదపూర్వకంగానే చంద్రబాబుతో భేటీ అయినట్లు రజనీకాంత్ చెబుతున్నా.. అదొక్కటే కాదు ఇంకేదో కారణం ఉండి ఉంటుందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్ హయాం నుంచీ సినీ ప్రముఖులు సన్నిహితంగానే ఉంటూ వచ్చారు. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే మాజీ ఎంపీ, ప్రస్తతుం వైసీపీలో ఉన్న మోహన్ బాబు సన్నిహిత మిత్రుడు. ఇటీవలి కాలంలో మోహన్ బాబు వైసీపీలో ఉక్కపోతకు గురౌతున్నారు. ఆ పార్టీలో ఎటువంటి గుర్తింపూ లేక, కనీసం పట్టించుకునే వారు కూడా కరవై ఇబ్బందులు పడుతున్నారు. తన స్థాయికీ, స్టేచర్ కు తగిన పదవి ఇస్తారని భావించినా జగన్ అసలు మోహన్ బాబును ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలాగే గతంలో ఒక సారి తిరుపతిలోని తన విద్యా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాయిబాబా విగ్రహావిష్కరణకు ఆహ్వానించేందుకు మోహన్ బాబు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. అప్పుడే మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం జరిగింది. కారణాలేమైనా అప్పట్లో అది జరగలేదు. ఆ ప్రచారమూ సద్దుమణిగింది. తాజాగా ఇప్పుడు రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ కావడంతో ఆ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక పోతే మోహన్ బాబు, పవన్ కల్యాణ్  మధ్య అంతగా సయోధ్య లేదని చిత్ర పరిశ్రమలో ఒక టాక్ ఉంది. పలు సందర్భాలలో ఆ విషయం నిజమేననిపించే సంఘటనలూ జరిగాయి. అయితే రజనీకాంత్ కు పవన్ కల్యాణ్ తోనూ, చంద్రబాబుతోనూ కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అలాగే మోహన్ బాబు ఆయనా కూడా మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో రజనీకాంత్ మోహన్ బాబు తెలుగుదేశం ప్రవేశం గురించి చర్చించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు, రజనీకాంత్ ల భేటీ  రాజకీయ చర్చకు తావిచ్చిందనడంలో సందేహం లేదు.  

శబరిమల ఆవరణ పంపిణీ నిలిపివేత!

ఆలయాలలో ప్రసాదాల తయారీ, పంపిణీ, నాణ్యత, పవిత్రత విషయంలో ఇటీవలి కాలంలో వివాదాలు పెచ్చరిల్లుతున్నాయి.  రెండు నెలల కిందట విజయవాడ దుర్గగుడిలో శానిటేషన్ శాఖలో పని చేసే ఉద్యోగి.. ప్రసాదం లడ్డూలపై కూర్చుని ఫోన్ మాట్లాడుతూ.. ఇదేమని ప్రశ్నించిన భక్తులపై ఎదురు దాడికి దిగాడు. వాళ్లెంత అభ్యంతర పెట్టినా నా ఇష్టం నాదే అన్నట్లు వ్యవహరించాడు. దీంతో కొందరు భక్తులు ఆ ఉద్యోగి లడ్డూల పై కూర్చుని ఫోన్ మాట్లాడుతుండగా ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అలాగే.. ఇటీవల భద్రచాలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో భక్తులకు బూజు పట్టిన లడ్డూలు విక్రయించిన సంఘటన మరువక ముందే.. శబరిమలలో ప్రసాదాల పంపిణీని నిలిపివేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఆవరణగా పిలిచే ఈ ప్రసాదం తయారీలో యాలకులు ఉపయోగిస్తారు. అయితే ఈ యాలకులను అధిక మొత్తంలో రసాయినాలు వాడి పండిస్తున్నట్లు తేలింది. దీంతో ఈ ప్రసాదం తినే వారికి హానికరమని భావించిన కేరళ హైకోర్టు ఆవరణ పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు యాలకులు వాడకుండా ప్రసాదం తయారు చేయాలని నిర్ణయించింది.  మొత్తం మీద వరుస సంఘటనలు చూస్తుంటే.. భక్తులు అత్యంత భక్తితో వచ్చే దేవాలయాల పవిత్రత, పరిశుభ్రత, ప్రసాద నాణ్యత వంటి విషయాలలో సంబంధిత అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్రం, రాష్ట్రాల మధ్య నిథుల ‘పంచాయతీ’

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ నిధుల విషయంలో పరస్పరం ఎంత దుమ్మెత్తి పోసుకున్నా, ఎన్ని విమర్శలు చేసుకున్నా.. వాస్తవమేమిటంటే.. గ్రామ పంచాయతీలకు నిధులు అందడం లేదన్నది మాత్రమే. గ్రామాల అభివృద్ధికి కానీ, గ్రామాలలో సంక్షేమ పథకాలకు కానీ పైసా  నిధులు కూడా లేవు. అమలు జరిగిన, జరుగుతున్న కార్యక్రమాలకు నిధులు అందక సర్పంచ్ లు అడకత్తెరలో పోక చెక్క మాదిరి నలిగిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గ్రామాల అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శమని సొంత భుజాలు చరుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగని విధంగా తెలంగాణలో గ్రామాభ్యుదయం వికసించిందని చెప్పుకుంటున్నారు.  అయితే గ్రామ పంచాయతీలకు నిధుల మంజూరు విషయంలో మాత్రం కేంద్రంపై నెపం తోసేసి చేతలు దులిపేసుకుంటోది. అదే సమయంలో  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తోంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నిందారోపణలో పబ్బం గడిపేసుకుంటూ.. గ్రామాలకు నిధుల మంజూరు విషయాన్ని విస్మరిస్తున్నాయి.  రాష్ట్రంలో గ్రామాలు దేశంలో మరెక్కడా లేనివిధంగా అభివృద్ధి చెందు తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గొప్పగా చెప్పుకుంటున్నా వాస్తవంలో మాత్రం నిధుల కొరతతో గ్రామ పంచాయతీలు నానా అవస్థలూ పడుతున్నాయి.   నిధుల కొరత కారణంగా తాము నానా అవస్థలూ పడుతున్నామంటూ గత కొన్ని నెలలుగా  సర్పంచులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాము కూడా చివరికి వ్యవసాయ కార్మికులుగా, కాపలా దార్లుగా పని చేయాల్సి వస్తోందని, ప్రాణాలు తీసుకోవడం కూడా జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను కాంట్రాక్టర్లకు చెల్లించడానికి రుణాలు తీసుకోవాల్సి వస్తోందని  చెబుతున్నారు. తమ దగ్గర నిధులు లేకపోయినా, అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో తమపై విపరీతంగా ఒత్తిడి పెరుగుతోందని  వారు వాపోతున్నారు. చాలా నెలలుగా తమకు నిధులు విడుదల కావడం లేదంటూ   గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేదు. ఏ సర్పంచ్ ఏ పార్టీకి చెందినవారైనా నిధుల కొరత మాత్రం అందరికీ సమానంగానే ఉంటోంది. అత్యధిక శాతం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు బాకీ పడిందని వారు చెబుతున్నారు.  గ్రామ పంచాయతీలు నిధులు కేటాయించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై  విమర్శలు, అలాగే కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆరోపణలు, నిరసనలతో బీజేపీ హోరెత్తిస్తుంటే.. కాంగ్రెస్ కూడా పంచాయతీలకు నిధుల విషయంలో కేసీఆర్ సర్కార్ నే నిందిస్తోంది.  అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు సరిగా నిధులు రావడం లేదని, కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, నిధుల్లో కోత విధించడం, నిధుల మంజూరులో ఆలస్యం చేయడం, విధులు ఆపేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పరస్పరారోపణల మధ్య అసలు వాస్తవం మరుగున పడిపోతోంది.  వాస్తవం ఏమిటంటే కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయడం రాష్ట్రాల హక్కులను హరించడమేనని కేసీఆర్ అంటున్నారు. నిజమే.. కానీ కేంద్రం విడుదల చేశాం కానీ, రాష్టం దారి మళ్లించిందంటోది.  రాష్టరమేమో కేంద్రం నుంచి నిధులే రాలేదంటోంది. ఇప్పటికైనా పరస్పర నిందారోపణలను పక్కన పెట్టి వాస్తవమేమిటన్నది వెల్లడించి పంచాయతీలకు నిధుల కొరత పరిష్కరించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. 

తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారి

తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె   2025 వరకు ప  కొనసాగనున్నారు. శాంతికుమారి ప్రస్తుతం  అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తున్నారు.  గ‌తంలో వైద్యారోగ్య శాఖ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. సీఎంవోలో స్పెష‌ల్ ఛేజింగ్ సెల్ బాధ్య‌త‌ల‌ను కూడా నిర్వ‌హించారు.   మెద‌క్ క‌లెక్ట‌ర్‌గా కూడా శాంతి కుమారి సేవ‌లందించారు. హైకోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ తెలంగాణ సీఎస్ గా రిలీవ్ అయిన క్షణం నుంచీ రాష్ట్రంలో కొత్త సీఎస్ ఎవరన్న ఉత్కంఠ నెలకొంది.  ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఎస్ఎస్ అధికారులు రామకృష్ణ, అరవింద్ కుమార్ లలో ఎవరు తెలంగాణ కాబోయే సీఎస్ అన్న చర్చ అధికార వర్గాలలో జోరుగా సాగింది.  మునిసిపల్ శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్, ప్రణాళికా శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న రామకృష్ణలు రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. వీరిరువురిలో కూడా బీహార్ కు చెందిన అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలున్నట్లుగా అధికార వర్గాలు సైతం భావించాయి. మునిసిపల్ శాఖ స్పెషల్ సీఎస్ గా అరవింద్ కుమార్ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉన్నారన్న ప్రచారంతో తెలంగాణ స్పెషల్ సీఎస్ గా ఆయనకే ఎక్కువ అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే కేసీఆర్ కూడా బీహార్ క్యాడర్ కు చెందిన అరవింద్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొగ్గు మాత్రం అరవింద్ కుమార్ వైపే ఉందని భావించారు. అయితే అనూహ్యంగా  అటవీశాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న శాంతి కుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారు. ఆమెను కొత్త సీఎస్ గా నియమించారు. శాంతికుమారి  1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శాంతి కుమారి.. గ‌తంలో ఆమె సీఎం కార్యాల‌యంలో ప‌ని చేశారు. శాంతి కుమారి తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా రికార్డు సృష్టించారు.  తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా నియమితురాలైన శాంతి కుమారి ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. మెరైన్ బయోలజీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న శాంతి కుమారి అమెరికాలో ఎంబీఏ చేశారు. ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ తరువాత తెలంగాణలోనూ వివిధ హోదాలలో పని చేసిన శాంతి కుమారి  తెలంగాణ సీఎస్ గా నియమితురాలయ్యే వరకూ తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.