వైసీపీలో మరో ఆర్ఆర్ఆర్ బాలినేని!?

ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలో మరో రెబల్ నేత తయారయ్యారు.  ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రెబల్ గా మారి సీఎం జగన్ మోహన్ రెడ్డికి కంట్లో కనుసులా మారి ప్రభుత్వ వైఖరిని, తప్పిదాలను ఎండగడుతున్న సంగతి తెలిసిందే.  సొంత పార్టీయే అయినా రెబల్ గా మారిన రఘురామపై ఏపీ పోలీసులు పలు కేసులు పెట్టి అరెస్టులు చేసి వేధించారు. లాకప్ లో మ్యాన్ హ్యాండిల్ చేశారు. అయినా సరే తగ్గేదేలే అన్నట్లుగా రఘురామకృష్ణం రాజు జగన్ సర్కార్ పై తన అటాక్ ను మాత్రం ఆపలేదు. ఇంతలా ఆర్ఆర్ఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా.. ఆయన ఇప్పటికీ  వైసీపీలోనే ఉన్నారు. రాజీనామా చేయలేదు. అలాగే  వైసీపీ కూడా ఆయనను బహిష్కరించలేదు.  ఇప్పుడు అధికార పార్టీకి పార్టీలోనే మరో రఘురామకృష్ణం రాజు బయలుదేరారు. ఆయన ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అన్నిటికీ మించి సీఎం జగన్ బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని కూడా ఛాన్స్ దొరికితే చాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వైసీపీ పెద్దలు ఈయన్ని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగించినా, మందలించినా ఆయన కూడా వెనక్కు తగ్గేదేలే అంటూ   ప్రభుత్వం బండారాన్ని బయటపెట్టేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేసిన  బాలినేని తాజాగా ఏపీ అంతటా భూకబ్జాలు జరిగాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒంగోలు కేంద్రంగా జరిగిన భూకబ్జాలపై చాలా కాలంగా ఫైట్ చేస్తున్న బాలినేని తాజాగా ఇదే విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లోనూ భూవివాదాలు.. భూకబ్జాలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ అంతటా భూకబ్జాలు, ఆక్రమణలు జరిగినా ఎక్కడా విచారణ జరగలేదని.. ఏ జిల్లాలో కూడా ప్రజాప్రతినిధులు విచారణ కోరిన దాఖలాలు లేవని, కానీ రాష్ట్రంలో తాను ఒక్కడినే ఈ విషయంపై విచారణ కోరి పోరాటం చేస్తున్నానని అన్నారు. భూ ఆక్రమణలు తన వరకు వచ్చిన వెంటనే స్పందించి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి సిట్ వేయించానని.. నిందితులు ఎవరైనా సరే వదలొద్దని సిట్ అధికారులకు ఫుల్ పవర్ ఇచ్చానని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరాననీ చెప్పారు. తాను సిట్ వేయించిన తర్వాత ప్రజల్లో ధైర్యం వచ్చి ఫిర్యాదులు చేయటం మొదలు పెట్టినట్లుగా  కూడా చెప్పారు. తన చొరవతో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో భూస్కాంలో ప్రమేయం ఉన్న వారిలో దాదాపు 200 మంది ఊరొదిలి పారిపోయారని, ఇదే తరహాలో భవిష్యత్ లో భూకబ్జాలు, అక్రమణలంటే భయపడేలా చేస్తానని ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో భూ ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై చాలా కాలంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆక్రమణల వ్యవహారంలో సీఎం జగన్ బాబాయి,  టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉన్నట్లు ఫిర్యాదులు అం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  బాలినేని తిరుగుబాటుతో పోలీసులు పది మందిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అయితే, అసలు నిందితులు వేరే ఉన్నారన్నది బాలినేని వాదన. చాలా కాలంగా ఇదే విషయంపై అధిష్టానం బాలినేనిని బుజ్జగించినా ఆయన మాత్రం మీడియా ముందుకు రావడం, బహిరంగంగానే తమ ప్రభుత్వంలో తమ పార్టీ నేతలే భూకబ్జాలు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని మాట్లాడుతుండడం వైసీపీకి, మరీ ముఖ్యంగా జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారూ, ఆరోపణలు చేస్తున్న వారూ కూడా ఆయనకు బంధువులే.  నిన్న మొన్నటి వరకూ ప్రకాశం జిల్లాకి పరిమితమైన బాలినేని, ఇప్పుడు జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు జరుగుతున్నాయనీ, తనలాగే ప్రజా ప్రతినిథులందరూ ఫిర్యాదులు చేసి కబ్జాలను అడ్డుకోవాలన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.   ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా భూకబ్జాలు, ఆక్రమణలు ఉన్నాయని చేసిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా జగన్ ను, ఆయన సర్కార్ ను ఇబ్బందులలోకి నెట్టేశాయి.   వైసీపీలో బాలినేని వైరాగ్యం ఈనాటిది కాదు. రెండేళ్ల కిందట తనకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికినప్పటి నుంచే ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే, అప్పుడు జిల్లా మీద పెత్తనం అన్న హామీతో సర్దుకున్నారు. అయితే ఎప్పుడైతే జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి హవా మొదలైందో అప్పటి నుంచే  బాలినేని  రెబల్ గా మారిపోయారు. బాలినేని ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా వైసీపీ  బుజ్జగించడం తప్ప ఏమీ చేయలేకపోతోంది. ఈ సారి బాలినేనికి సీటు ఇవ్వరని, సుబ్బారెడ్డి పోటీకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది.   సుబ్బారెడ్డి కూడా ఇప్పటికే తాను ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.  అలాగే బాలినేని  వైసీపీని వీడి సైకిల్ ఎక్కే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే అది ఇప్పటికీ ప్రచారంగానే మిగిలిపోయింది. ఇటు బాలినేని పార్టీని వీడడం లేదు.. అటు పార్టీ కూడా ఆయనను పంపించేయడం లేదు.  అయితే బాలినేని  వ్యాఖ్యలు మాత్రం వైసీపీకి తీరని డ్యామేజీ తెచ్చిపెడుతున్నాయనడంలో సందేహం లేదు. పరిశీలకులు కూడా బాలినేని వైసీపీలో పూర్తి స్థాయి రెబల్ గా మారిపోయినట్లుగానే కనిపిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. 

బీఆర్ఎస్ కు ప్రచారాస్త్రాలు కరవు.. కర్నాటక కాంగ్రెస్ ఆదరవు

తెలంగాణ ఎన్నికల ముంగిట అధికార బీఆర్ఎస్ కు కర్నాటక కష్టాలు ఎదురౌతున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్ విజయం తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ జోరుకు బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. అంతే కాదు.. కర్నాటకలో కాంగ్రెస్ విజయం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా పెద్ద థ్రెట్ గా మారిపోయింది. కర్నాటకలో కాంగ్రెస్ విజయాన్ని ఏదో గాలివాటం గెలుపుగా కొట్టి పారేయాలని ప్రయత్నించిన తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వరుస ఝలక్ లు తగులుతూ వస్తున్నాయి. కర్నాట ఎన్నికల తరువాత దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం రెండీ అయ్యింది. షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ వచ్చింది. విడతల వారీగా పోలింగ్ కూడా మొదలైపోయింది. అయినా కూడా తెలంగాణలో బీఆర్ఎస్, మిగిలిన ఐదు రాష్ట్రాలలో బీజేపీ కర్నాటక షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేదనే అనిపిస్తున్నది. అదే సమయంలో కర్నాటక ఫలితాల జోష్ తో  ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ జోష్ మామూలుగా లేదు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్, మిగిలిన నాలుగు రాష్ట్రాలలో బీజేపీలో నిర్లిప్తత, నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.  ప్రధానంగా తెలంగాణ విషయానికి వస్తే.. తెలంగాణలో బీజేపీ వెనుకబాటు తొలి నుంచీ బీఆర్ఎస్, బీజేపీల రహస్య బంధంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలూ వాస్తవమేనని జనం కూడా నమ్మే పరిస్థితి ఏర్పడింది.  బీఆర్ఎస్ తో విభేదించి కేసీఆర్ సర్కార్ ను దీటుగా ఎదుర్కోగలిగే పార్టీగా బీజేపీని నమ్మి వచ్చి చేరిన సీనియర్లంతా ఉక్కపోతకు గురయ్యారు. బీఆర్ఎస్ ను బీజేపీ గట్టిగా వ్యతిరేకించడం లేదన్న అసంతృప్తితో ఒక్కరొక్కరుగా పార్టీ నుంచి బయటకు వచ్చారు. అలా రాలేని వారు ఈ సారి ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపారు.  ఇక అధికార బీఆర్ఎస్ విషయానికి వస్తే.. రాష్ట్రంలో  తనకు ప్రత్యర్థి బీజేపీ మాత్రమే అన్నట్లుగా ఆ పార్టీపై విమర్శలు గుప్పించి, సవాళ్లు విసిరి కమలం పార్టీ గ్రాఫ్ ను పెంచేసిన బీఆర్ఎస్.. తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచీ ప్లేట్ ఫిరాయించేసింది. ఆ పార్టీ విమర్శలన్నీ కాంగ్రెస్ వైపే మళ్లాయి. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే.. కాంగ్రెస్ ను లక్ష్యం చేసుకునే ఎక్కవగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ పరిస్థితే బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య మైత్రిపై అనుమానాలను పెంచేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా.. తమకు మరో సారి అధికారంలోకి వస్తే ఏం చేస్తాం... అధికారంలో ఉన్న కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాల గురించి ప్రచారం చేసుకుంటుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ ఐదేళ్లలో  తాను చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమాన్ని చెప్పుకోవడంలో ఎందుకో తడబడుతోంది. డబుల్ బెడ్ రూం వంటి వాగ్దానాలను మరో సారి విజయం కోసం తెరమీదకు తెస్తున్నది. ఏవైతే తన ఫ్లాగ్ షిప్ ఘనతలుగా కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ చెప్పుకుంటున్న వాటినే టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతోంది.  అదే సమయంలో బీఆర్ఎస్ తమ ఘనతలను చాటుకోవడం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటకలో వైఫల్యం చెందిందని చెప్పడానికే ఎక్కువగా తాపత్రేయ పడుతోంది. పరాయి రాష్ట్రం ఊసు మనకెందుకు, పరాయి రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టయితే ఇక్కడ ఆందోళనలు ఏమిటి? అంటూ రుసరుసలాడిన కేసీఆర్, కేటీఆర్ లు ఇప్పడు ఆ విషయాన్ని మరచిపోయి లేదా ఉద్దేశ పూర్వకంగా విస్మరించి కర్నాటకలో కాంగ్రెస్ వైఫల్యాలను తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ఇది సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల సమయంలో చేసే పని కాదు.  అధికారంలో ఉన్న పార్టీ  తమ హయాంలో జరిగిన అభివృద్ధి-సంక్షేమ పథకాలు ప్రచారం చేసుకుంటుంది. మరో సారి అవకాశం ఇస్తే ఇంకెంత చేస్తామన్నది చెప్పుకుంటుంది. అయితే తెలంగాణలో అధికారంలో ఉన్నబీఆర్ఎస్ మాత్రం కర్నాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పి ఈ రాష్ట్రంలో తమకు ఓటు వేయాలని ప్రచారం చేసుకుంటున్నది.   ఎన్నికల ప్రచార సభల్లోనే కాదు.. పార్టీ పరంగా పత్రికలకు ఇచ్చే ప్రకటనలో కూడా కర్నాటకలో కాంగ్రెస్ పాలన గురించే  పేర్కొటుండంపై రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. కర్నాటకలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. వాటిని అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేస్తున్నది.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రచారాన్ని గమనిస్తే.. రాష్ట్రంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి తాము ఏం చేశామో చెప్పుకునే అవకాశాలేమీ లేకపోవడంతో.. పక్క రాష్ట్రంలో ఇక్కడ తమ ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి.. రాష్ట్రంలో మాకు ఓటేయండి అని అడుగుతోందని అవగతమౌతుంది.    అయితే కర్నాటక బూచిని చూపి తెలంగాణలో లబ్ధి పొందాలన్న బీఆర్ఎస్ వ్యూహం ఫలించే అవకాశాలు లేవనీ, ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నది తెలంగాణ అసెంబ్లీకనీ ప్రజలకు స్పష్టంగా తెలుసునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తెలంగాణలో ముఖాముఖీ పోరే? బీజేపీ కాడె వదిలేసినట్లేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి సరిగ్గా తొమ్మది రోజుల వ్యవధి ఉంది. ఈ నెల 30న పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 3న ఫలితాలు వెలువడుతాయి. అంటే మరో పన్నెండు రోజులలో రాష్ట్రంలో కొలువుదీరనున్న తదుపరి సర్కార్ ఎవరిదన్నది తేలిపోతుంది.  రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎంత మంది అభ్యర్దులు రంగంలో ఉన్నారు. వారిలో రెబల్స్ ఎందరు? ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఏయే పార్టీల మధ్య జరుగుతోంది అన్నవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మాత్రం తెలంగాణలో జరుగుతన్నది, జరగనున్నది ముఖాముఖీ పోరేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల సమరంలో బీఎస్పీ మినహా  మిగిలిన చిన్నా చితకా పార్టీలన్నీ పోటీ నుంచి తప్పుకోవడమో, ప్రధాన పార్టీలకు అనుకూలంగా మారిపోవడమో జరిగిపోయింది.  ఇక రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నంతగా బిల్డప్ ఇచ్చిన బీజేపీ ఇంకా ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కాని పరిస్థితే రాష్ట్రంలో కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి మహామహా సీనియర్లుగా చెప్పుకునే వారే వెనుకంజ వేశారు. కిషన్ రెడ్డి పోటీకి దూరంగా ఉండటమే ఇందుకు ఉదాహరణగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు, ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులలో కనిపిస్తున్న నిరాశక్తత గమనిస్తే.. తెలంగాణలో ప్రధాన పోటీ అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్యేననీ, ఒక రకంగా ఈ రెండు పార్టీల మధ్యా ముఖాముఖి పోరుగా ఈ ఎన్నికలు మారిపోయాయని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రెండు పార్టీలూ చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలు.. పరిధి మీరినట్లుగా కనిపిస్తున్న విమర్శల బాణాలు ఆ సంగతినే తేటతెల్లం చేస్తున్నాయి. కొద్ది సేపు వాటిని పక్కన పెడితే ఈ సారి ఎన్నికలలో సెంటిమెంట్ కు స్థానం లేకుండా పోయింది. అభివృద్ధి, సంక్షేమం ప్రధాన అజెండాగా మారిపోయాయి. రాష్ట్ర ఆవిర్భావం తువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా అభివృద్ధి, సంక్షేమం పెద్దగా ప్రాధాన్యత లేని అంశాలుగానే ఉండిపోయాయి. తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే ఆ రెండు ఎన్నికల ప్రాచరంలోనూ కీలక భూమిక పోషించింది. ఆ రెండు ఎన్నికలలోనూ తెలంగాణ సెంటిమెంట్ ను పండించడంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించింది. సెంటిమెంట్ అంతటి ప్రధాన పాత్ర పోషించినా కూడా ఆ రెండు ఎన్నికలలోనూ బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అత్తెసరు మార్కులతోనే గట్టెక్కి అధికార అందలాన్ని అందుకుంది. ఆ తరువాత ఆపరేషన్ ఆకర్ష్ అంటూ వలసలను, జంప్ జిలానీలను ప్రోత్సహించడం ద్వారా తిరుగులేని బలాన్ని సంపాదించుకుంది అది వేరే సంగతి.  అయితే ఈ సారి ఎన్నికలలో తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇక ఎంత మాత్రం విజయాన్ని అందించే అస్త్రం కాదు. ఆ పరిస్థితిని టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం ద్వారా4 స్వయంగా కేసీఆర్ తీసుకువచ్చారు. అయితే ఆయన జాతీయ రాజకీయ ప్రవేశానికి దారులన్నీ మూసుకుపోయిన పరిస్థితుల్లో గత్యంతరం లేక   తెలంగాణ సెంటిమెంట్‌ ను మళ్లీ తెర మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు. కానీ అది పెద్దగా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆయన పరాయి పాలన, పరాయి రాష్ట్రం అంటూ సభల్లో చెబుతుంటే.. పార్టీ శ్రేణులే మరి బీఆర్ఎస్ గా పార్టీని మార్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు పరాయి రాష్ట్రం మాట గుర్తు రాలేదా అని చర్చించుకుంటున్నాయంటే.. ప్రస్తుత ఎన్నికలలో తెలంగాణ వాదం ఎంత అప్రధానంగా మారిపోయిందో అవగతమౌతోంది.    ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రచారంలో ఒక అడుగు ముందుందని చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒకసారి అధికారం ఇచ్చి చూడండంటూ ప్రజలను కోరుతోంది. అంతర్గత కుమ్ములాటలను అధిగమించి ప్రజారంలో దూసుకువెడుతోంది.  రాష్ట్ర ప్రభుత్వ అవినీతి బాగోతా లను జనాలకు వివరిస్తూ,  ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే ప్రయత్నం  చేస్తోంది. మహిళలకు ప్రతి నెలా నగదు బదిలీ, విద్యార్థులకు నగదు ఆసరా, రైతులకు ఆర్థిక సహాయం వంటి ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఏ విధంగా చూసినా చేసింది చెప్పుకోవడంలో అధికార బీఆర్ఎస్ తడబడుతుంటే.. విపక్ష కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతోంది.  అన్నిటికీ మించి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ స్పందన ఆ పార్టీకి ఒక విధంగా తీరని నష్టం చేసిందనే చెప్పాలి. ఆ తరువాత నాలిక కరుచుకుని నష్టనివారణ చర్యలు చేపట్టినా అప్పటికే ఆలస్యమైపోయింది. కేసీఆర్ ఎన్టీఆర్ భజన చేస్తున్నా.. కేటీఆర్ చంద్రబాబు అరెస్టు దారుణమంటూ చెబుతున్నా జనం నమ్మడం లేదు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టును వెంటనే ఖండించడం ద్వారా కాంగ్రెస్ తెలుగుదేశం శ్రేణులనే కాకుండా, సెటిలర్లను కూడా ఆకట్టుకుంది.  ఈ నేపథ్యంలో  తెలంగాణ ఎన్నికలలో ముఖాముఖి పోరు హోరాహోరీగా ఆసక్తికరంగా మారాయని పరిశీలకులు అంటున్నారు. 

బీజేపీలో కేసీఆర్ నాటిన ఆ కలుపు మొక్క ఎవరు?

బీజేపీకి రాంరాం చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వెంటనే లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్  రాములమ్మ.. పెద్ద ట్విస్టే  ఇచ్చారు.  ఆమె బీజేపీని వీడితే వీడారు కానీ, అలా వీడిన వెంటనే కారు, కమలం పార్టీలు దొందూదొందేనని బాంబు పేల్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి,  బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీలో  ఓ కలుపుమొక్కను నాటారంటూ ఓ బాంబు పేల్చారు. ఆ కలుపు మొక్కే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ప్రస్తుత దుస్థితికి కారణమని కుండబద్దలు కొట్టారు. అయితే విజయశాంతి చెబుతున్న ఆ కలుపు మొక్క ఎవరన్న దానిపై ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   విజయశాంతి మాటల సారాంశం ఏమిటంటే.. బీఆర్ఎస్ అధినేత   సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా, పకడ్బందీ ప్రణాణికతో బీజేపీలోకి ఒక కోవర్ట్ ను పంపారని. అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బీజేపీలోకి పంపిన ఆ కోవర్ట్ ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది.  విజయశాంతి బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత తొలి సారిగా గాంధీ భవన్ కు మీడియాతో మాట్లాడారు. ఆ మీడియా సమావేశంలోనే  విజయశాంతి కేసీఆర్.. బీజేపీలో తన కోవర్ట్ ను కలుపుమొక్కలా ప్రవేశపెట్టారని ఆ   మనిషి.. ఎక్కడ ఏం గందరగోళాలు సృష్టించాడో ఏమో కానీ.. పార్టీలో గొడవలు సృష్టించి.. అధ్యక్షులను దింపాలి దింపాలంటూ.. హైకమాండ్‌కు పదే పదే చెప్పడం.. అందుకోసం పలుమార్లు   ఢిల్లీకి వెళ్లడంతో.. ఆయన మాటలకు కట్టుబడి బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం జరిగిందంటూ ఆమె వివరించారు. అంతే కాకుండా..  ఆ మనిషి ఆసైన్డ్ భూములు ఏమైనాయి.. ఆ మనిషి మీద ఉన్న కేసులు ఏమైనాయి.. అన్నది అంతా  ఆలోచించాలంటూ ఈ సందర్బంగా రాములమ్మ పేర్కొన్నారు.   అదీకాక.. తెలంగాణలో జరిగిన వరుస ఉప ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలుపొందితే.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపొందారు. ఇక నాగార్జున సాగర్, మునుగోడులలో.. కారు పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయం విదితమే.  అలాంటి వేళ అంటే కేసీఆర్ నాటిన మొక్క.. ఈటల రాజేందరా? లేకుంటే రఘునందన్ రావా? అనే సందేహం సైతం పోలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆ ఇద్దరూ  టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. బీజేపీలో చేరిన వారే.  ఆ క్రమంలో తొలుత రఘునంధన్ బయటకు వచ్చాడు .. ఆ తర్వాత ఈటల వచ్చారు. కానీ రాములమ్మ చెప్పినట్లు అసైన్డ్ భూముల వ్యవహారం. కేసులు అంటే.. వెంటనే ఈటల రాజేందర్ గుర్తుకు వస్తారు. దీంతో రాములమ్మ చెప్పిన, చెబుతున్న కలుపు మొక్క  ఈటలేనా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తమౌతున్నాయి.  అందుకే.. గతంలో ఉప్పు నిప్పులా ఉన్న గులాబీ, కమలం పార్టీలు.. ప్రస్తుత ఎన్నికల వేళ... భాయి.. భాయి అన్న చందంగా వ్యవహరిస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కోవడం.. ఆ తర్వాత చోటు చేసుకొన్న వరుస పరిణామాల నేపథ్యంలో అటు గులాబీ పార్టీకి.. ఇటు కమలం  పార్టీకి మధ్య అనుసంధాన కర్తగా ఈటల వ్యవహరించారా? అందుకే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో హేమా హేమీలు అరెస్ట్ అయి.. తీహార్ జైలుకు వెళ్లి.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. కవితకు మాత్రం అరెస్టు మినహాయింపు లభించిందా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో  జోరుగా నడుస్తోంది.  అలాగే బీజేపీ తెలంగాణ  అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చ వద్దంటూ.. తాను పదే పదే కమలం పార్టీ అధిష్టానానికి చెప్పినా.. కేసీఆర్ నాటిన మొక్క చెప్పడం వల్లే ఆ పార్టీ అధ్యక్షుడిగా కొత్త వారు నియమితులరంటూ రాములమ్మ చెప్పడాన్ని బట్టి చూస్తే.. కేసీఆర్ బీజేపీలో ప్రవేశపెట్టిన కోవర్ట్.. ఈటలే అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోందని పరిశీలకులు సైతం అంటున్నారు. అదీకాక గత   రెండేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు బయట కుస్తీ లోన దోస్తీ అన్న చందంగా వ్యవహరిసున్నాయనే ఓ చర్చ సైతం నడుస్తోంది. అంటే కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య రాజకీయ వైరం లేదా? కే వలం వీళ్లు ఆడుతోన్న  ఓ డ్రామానేనా అనే ఓ సందేహం సైతం తెలంగాణ సమాజంలో వ్యక్తమౌతోంది.

శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం(నవంబర్ 20) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 26 నుంచి మొదలౌతాయి.  సికింద్రాబాద్-కొల్లం ప్రత్యేక రైలు ఈ నెల  26న, అలాగే డిసెంబరు 3వ తేదీనా నడపనుంది. ఇక కొల్లం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 28, డిసెంబరు 5న నడుస్తుంది. అలాగే నర్సాపూర్-కొట్టాయం ఈ నెల 26, డిసెంబరు 3తేదీలలోనూ, తిరుగు ప్రయాణం కోసం కొట్టాయం-నర్సాపూర్  ప్రత్యేక రైలు ఈ నెల 27, డిసెంబరు 4 తేదీలలోనూ ఉంటుంది. ఇక కాచిగూడ నుంచి కొల్లం వెళ్లే స్పెషల్ ట్రైన్  డిసెంబర్ 9, 22, 29  తేదీలలో ఉంటుంది. అలాగే కొల్లం నుంచి కాచిగూడకు వచ్చే ప్రత్యేక రైలు  24, డిసెంబరు 1, 8; కాకినాడ-కొట్టాయం ఈ నెల 23, 30, కొట్టాయం-కాకినాడ ఈ నెల 25, డిసెంబరు 2; సికింద్రాబాద్-కొల్లం ఈ నెల 24, డిసెంబరు 1; కొల్లం-సికింద్రాబాద్ ఈ నెల 25, డిసెంబరు 2 తేదీల్లో  ఉంటాయి. వీటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్ లు ఉంటాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 49 కేంద్రాలు ఖరారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారయ్యాయి. 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.  దీంతో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు  అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ కేంద్రాలు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపడతారు. మిగిలిన 13 నియోజకవర్గాలకూ వేరువేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాలలో జిల్లాకు ఒకటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

బాబుకి బెయిలు.. జగన్‌కి జైలు!

స్కిల్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి. మల్లిఖార్జునరావు తీర్పు వెలువరించారు. ఈ నెల 28వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు వెళ్లవలసిన అవసరం లేదని ఆ తీర్పులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. అలాగే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సమయంలో విధించిన షరతులు ఈ నెల 28వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆ తరువాత 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొన వచ్చని తెలిపారు. అదే విధంగా ఈ నెల 30వ తేదీన ఏసీబీ కోర్టుకు చంద్రబాబు హాజరుకావాలని.... ఆయన చికిత్సకు సంబంధించిన నివేదికను ఆ కోర్టుకు సమర్పించాలని జస్టిస్ టి. మల్లిఖార్జునరావు తన తీర్పులో వివరించారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం నంద్యాలలో అరెస్ట్ చేసింది. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. మరోవైపు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన ఆయన తనయుడు నారా లోకేశ్.. తన తండ్రి అరెస్ట్‌తో తన పాదయాత్రను అర్థాంతరంగా నిలిపివేశారు. ఆ క్రమంలో తన తండ్రికి బెయిల్ కోసం.. నారా లోకేశ్ ఢిల్లీ వేదికగా న్యాయవాదులతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు.  మరోవైపు జైల్లో ఉన్న చంద్రబాబు పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి సమయంలో ఆయనకు ప్రభుత్వ వైద్యులు  పలు పరీక్షలు నిర్వహించారు. ఆ క్రమంలో ఆయన కంటికి శస్త్ర చికిత్స చేయవలసి ఉందంటూ వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులే కాదు.. సైకిల్ పార్టీ శ్రేణులు సైతం చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందాయి. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో 105 మంది ప్రాణాలు విడిచారు. మృతుల కుటుంబాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి   పరామర్శించారు.  ఇందు కోసం ఆమె చేపట్టిన నిజం గెలవాలి యాత్రకు అపూర్వ జనస్పందన వచ్చింది. మరో వైపు హైకోర్టు .. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అనారోగ్యం కారణంగా.. పలు వైద్య పరీక్షలు చేయించుకొన్నారు. ఆ క్రమంలో కంటి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. మరోవైపు తన తండ్రి చంద్రబాబు అరెస్ట్‌తో ఆపేసిన యువగళం పాదయాత్రను నారా లోకేశ్.. నవంబర్ 24వ తేదీ అంటే.. శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారని సమాచారం. అలాగే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు సైతం.. మరికొద్ది రోజుల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే.. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో నవంబర్ 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొన వచ్చని స్ఫష్టం చేసింది. దీంతో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఆయన మళ్లీ తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాబు ఆరోగ్యం కుదురుకున్న తర్వాత.. సాధ్యమైనంత త్వరలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని సమాచారం.  అలాగే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకు వర్తిస్తాయని హైకోర్టు  న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేయడంతో.. నవంబర్ 29వ తేదీ నుంచి చంద్రబాబు యధావిధిగా తన కార్యచరణను ప్రకటించే చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రచారం నవంబర్ 28వ తేదీ సాయంత్రంతో ముగియనుంది.  అదీకాక.. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. దీంతో చంద్రబాబు తన ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీదే పెట్టనున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అలాంటి వేశ.. జగన్ పార్టీ ఓటమి దాదాపుగా ఖరారు అవుతుందనే ఓ ప్రచారం సైతం జన బాహుళ్యంలో దూసుకుపోతుంది. అదే జరిగితే..  ఆ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు మళ్లీ శ్రీకృష్ణ జన్మస్థానం  తథ్యమనే ఓ ప్రచారం సైతం ప్రజల్లో వైరల్ అవుతోంది.

కేసీఆర్ ఎన్టీఆర్ నామస్మరణ.. కాంగ్రెస్‌ను దెబ్బతీసే వ్యూహం!

మాటల మరాఠీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒక్కసారి ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఎదుటి వాళ్ళని అవలీలగా తన మాట వినేలా చేసుకోగల నేర్పరి అని పేరుంది.  తనదైన శైలిలో ప్రసంగాలతో ఆకట్టుకోగల నైపుణ్యం ఆయన సొంతం. తెలంగాణ రాజకీయాలను అవపోసన పట్టిన కేసీఆర్, తెలంగాణ పల్లె సంస్కృతిని, తెలంగాణ ప్రజల మనసు లోతులను కొలిచి.. అందులో రాజకీయ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. తొమ్మిదేళ్ల ఆయన పాలన ఎలా ఉన్నా మాటలతోనే ప్రజలను బోల్తా కొట్టించి కారు ఎక్కించుకొని అసెంబ్లీకి వెళ్లారు. ముఖ్యంగా సెంటిమెంట్ రగిలించి ఓట్లుగా మలచుకోవడంలో కేసీఆర్ ది అందె వేసిన చేయి. గత రెండు ఎన్నికలలో తెలంగాణ స్వాభిమానం పేరిట కేసీఆర్ ఎన్నికల రాజకీయం నడిచింది. ఈసారి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రసంగాలలో కాస్త పస తగ్గిందన్న భావన వ్యక్తమవుతున్న మాట నిజమే. అయితే ఆయన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.   తెలంగాణ కోసమే పుట్టిన టీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల పేరిట బీఆర్ఎస్ గా మార్చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి పరాయి పాలకులు, ఢిల్లీ గులాములు వంటి విమర్శలు చేయడానికి కేసీఆర్ కు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ సెంటిమెంట్ రగిలించడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ఆకాంక్ష కోసం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇక పరాయి పాలకులు, ఢిల్లీ గులాములు అంటూ కేసీఆర్ గత ఎన్నికలలో కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీలని టార్గెట్ చేసి తెలంగాణ ప్రజలలో సెంటిమెంట్ రగిలించగా.. ఇప్పుడు ప్రచారంలో ఆ విమర్శలకు కేసీఆర్ వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈసారి తెలుగుదేశం  పోటీకి దూరంగా ఉంది.. కేసీఆర్ ఆ మధ్య వివిధ రాష్ట్రాల పర్యటనలు చేసి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే  ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ ఆయన బీఆర్ఎస్ కూడా పరాయి పార్టీనే అవుతుంది. దీంతో ఈసారి ఆ విమర్శ పెద్దగా ప్రజలకు ఎక్కదు. అందుకే కేసీఆర్ ఈసారి స్టైల్ మార్చారు.  ఈ ఎన్నికలకు తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండడంతో ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తెలంగాణ ఎన్నికలలో కీలకంగా మారాయి. దీంతో అన్ని పార్టీలు తెలుగుదేశం ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. కారణాలు ఏమైనా వారంతా ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లుగా  కనిపిస్తున్నది. సరిగ్గా ఇప్పుడు ఇదే అంశాన్ని కేసీఆర్ ఓ అస్త్రం మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం సమయంలో  కాంగ్రెస్ హయాంలో ఆనాటి పరిస్థితులను, ఎన్టీఆర్ పార్టీ స్థాపన కారణాలను వివరిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకుని వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులు మళ్ళీ తీసుకొస్తారా అని ఎద్దేవా చేస్తున్నారు. ఇందిరాగాంధీ హయాంలో పేదలు ఆకలితో అల్లాల్లాడుతూంటేనే కదా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి అధికారంలోకి వచ్చి కిలో రెండు రూపాయల బియ్యం లాంటి పథకాలను తెచ్చి వారి ఆకలి తీర్చిందని ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ హయాంలో అంత అద్భుతమైన పాలన చేసి ఉంటే అసలు తెలుగుదేశం ఎందుకు ఆవిర్భవించేదని కేసీఆర్ ప్రశ్నించారు.  కేసీఆర్ ఈ మాటల వెనక చాలా అర్ధం ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకునే స్థాయికి దూసుకొచ్చింది. అందుకు  తెలుగుదేశం క్యాడర్ కూడా సహకరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కేసీఆర్ ఒకే విమర్శతో అటు కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ.. తెలుగుదేశం ఆవిర్భావానికి కాంగ్రెస్ దుష్టపాలనే కారణమని చెబుతూ తెలుగుదేశం క్యాడర్ ను కాంగ్రెస్ కు దూరం చేయాలని చూస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఆనాటి పరిస్థితులే వస్తాయని చెప్తూనే, ఆనాటి పరిస్థితులు తెచ్చిన కాంగ్రెస్ కు ఇప్పుడు తెలుగుదేశం ఎలా మద్దతు ఇస్తుందన్న చర్చ జరిగేలా చేయడమే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. అందులో భాగంగానే ఎన్టీఆర్ ను కీర్తిస్తూ తెలుగుదేశం క్యాడర్ ను కాంగ్రెస్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కేసీఆర్ ప్రసంగాలలో ఈ వ్యూహం బయట పెడుతుండగా.. మిగిలిన ఈ వారం ప్రసంగాలలో కేసీఆర్ ఇదే అంశంపై మరింత లోతుగా మాట్లాడే అవకాశం కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. ఈ వ్యూహానికి కాంగ్రెస్ కౌంటర్ ఎలా ఉండబోతున్నదన్నది ఆసక్తిగా మారింది.  

బిజెపికే  మందకృష్ణ జై 

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికింది. తెలంగాణలో బీజేపీవిజయం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ... మాదిగ సామాజిక వర్గానికి, ఎస్సీలలోని ఇతర వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మాదిగ సంస్థలకు మంద కృష్ణ లేఖలు రాశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మనల్ని మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు  కానీ... ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ పదేళ్లు కానీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపలేదని మండిపడ్డారు. మనకు అనుకూలంగా వచ్చిన పలు నివేదికలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించలేదని మంద కృష్ణ ఆరోపించారు. గత దశాబ్ద కాలంగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్  కేంద్రానికి ఎటువంటి లేఖ రాయలేదని, పార్లమెంటులో వర్గీకరణ మీద మాట్లాడలేదని  ఆయన విమర్శించారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు వెన్నుపోటు పొడిచారన్నారు. కనీసం ఆయన మంత్రివర్గంలో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణలో ఎస్సీలు ఎక్కువ అని, అందులోనూ మాదిగలు ఎక్కువ అని, కానీ తమకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. అందుకే నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన మద్దతు బీజేపీకేనని మంద కృష్ణ మాదిగ రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ఎస్సీలు 17 శాతం ఉంటారు. అందులో 60 శాతం మాదిగలు ఉంటారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ప్రధాని మోదీ నిజాంకాలేజ్ గ్రౌండ్ లో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఎమోషనల్ అయ్యారు. మోదీని పట్టుకుని  ఏడ్చేశారు. 

స్పీకర్ తమ్మినేనికి బలవంతపు రిటైర్మెంట్ ?

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఓటమి ఖరారైందని రాజకీయ పరిశీలకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనపై ప్రజల అసంతృప్తి,  జగన్ సర్కార్ కక్ష పాధింపు పాలనపై పెల్లుబుకుతున్న ఆగ్రహానికి తోడు  తెలుగుదేశం, జనసేన కలిసి కదులుతుండటంతో వైసీపీకి ఇప్పుడు ఓటమి తప్ప మరో అప్షన్ లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీకి ఘోర పరాజయం తప్పదంటున్నారు. ఇప్పటికే పలు సర్వేలు వైసీపీకి  ఘోర పరాజయం తప్పద పేర్కొన్నాయి.  మాకు తిరుగే లేదని.. మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని మరోసారి అందలం ఎక్కిస్తాయని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం తెగ మధనపడిపోతున్నారనీ, ఆందోళన చెందుతున్నారనీ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఈ  నేపథ్యంలో  వైసీపీ రకరకాల ఎత్తులు వేసి పరువు నిలుపుకోవాలని చూస్తుంది.  అందులో భాగంగానే భారీ స్థాయిలో సిట్టింగులను మార్చేయాలని భావిస్తోంది. అది కూడా ఉత్తరాంధ్రలో ఈ అభ్యర్థుల మార్పుపై విషయంలో భారీ కసరత్తే జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   కోస్తాంధ్రలో పప్పులు ఉండకవన్న భావనకు వచ్చేసిన వైసీపీ.. ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టింది.  అందుకే ఎలాగోలా ఎన్నికల సమయానికి విశాఖ నుండి సీఎం పరిపాలన ప్రారంభించేయాలని నానా హడావుడీడ పడింది. అయితే అది ఆచరణ  సాధ్యం అవుతుందా అంటే పరిశీలకుల నుంచే కాకుండా, న్యాయనిపుణుల నుంచి కూడా అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది. విశాఖ పరిపాలనా  రాజధాని  అన్న హామీతో ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ, మరీ ముఖ్యంగా జగన్ భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే సిట్టింగులపై వ్యక్తమౌతున్న తీవ్ర ప్రజా వ్యతిరేకత ప్రభావం తగ్గించుకునేందుకు  కొత్త అభ్యర్థులను బరిలో ఉంచాలని యోచిస్తున్నదని అంటున్నారు. ఇందులో భాగంగా పలువురు ఎంపీలను అసెంబ్లీ బరిలో దించడం, పలువురు ఎమ్మెల్యేలకు  స్టీట్ల మార్పు వంటి చర్యలపై జగన్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇక కొంతమంది సిట్టింగులకు రిక్తహస్తం చూపే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు.   ఈ క్రమంలోనే ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఈసారి టికెట్ కేటాయించేందుకు వైసీపీ పెద్దలు సుముఖంగా లేరని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. తమ్మినేని సిట్టింగ్ స్థానం ఆముదాల వలసలో ప్రస్తుతం వైసీపీ మరో కొత్త మొహం కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలలో తమ్మినేని కూడా ఒకరన్న నిశ్చితాభిప్రాయానికి జగన్ వచ్చేశారని అంటున్నారు. అందుకే వైసీపీ ముందుగా ఆయనను ఈసారి పార్లమెంటుకు పోటీ చేయించాలని భావించింది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని భావించినా, ప్రజాభిప్రాయం ఆయనకు వ్యతిరేకంగా ఉందనీ, ఆయన గెలిచే అవకాశాలు మృగ్యమనీ అంతర్గత సర్వేలో తేలడంతో ఇక తమ్మినేనిని పూర్తిగా పక్కన పెట్టేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేసినట్లు చెబుతున్నారు.  తమ్మినేనికి రాజ్యాంగ బద్దమైన పదవి దక్కినా ఆయన ఆ పదవికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించారన్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే.  వేదికలపైనే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం, ప్రతిపక్షాలపై ఆయన ప్రవర్తించిన తీరు, అసెంబ్లీ సాక్షిగా వైసీపీ సభ్యుల దౌర్జన్యాలను ప్రోత్సహించడం వంటి సంఘటనలు ఆయన ప్రతిష్టను పూర్తిగా మసకబార్చేశాయి.  అలాగే ఎమ్మెల్యేగా కూడా ఆయన ప్రజల నుంచి వ్యతిరేకతనే ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలవడం అసాధ్యంగా మారిపోయిందని వైసీపీ అగ్రనాయకత్వానికి తేటతెల్లమైపోయిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అంతే కాకుండా దీనికి తోడు ఒకసారి స్పీకర్ గా పనిచేసిన నేతలు మళ్ళీ రాజకీయాల్లో రాణించలేరన్న సెంటిమెంట్  పరంగా చూసినా కూడా ఇక తమ్మినేనికి వైసీపీ బలవంతపు రిటైర్మెంట్ ఇచ్చేయాలనే నిర్ణయానికి వచ్చేసినట్లేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావలి ప్రతిభా భారతి స్పీకర్ గా పనిచేసిన అనంతరం అనేక ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత స్పీకర్ గా పనిచేసిన యనమల రామక్రిష్ణుడు మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. అయితే చంద్రబాబు ఆయన సేవలు నచ్చి ఎమ్మెల్సీగా చేసి కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంతే. స్పీకర్ నుండి సీఎం అయితే కాగలిగారు కానీ మళ్ళీ గెలవలేకపోయారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తర్వాత పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తమ్మినేని సీతారాం పరిస్థితి కూడా అదేనని అంటున్నారు. ఓడిపోతారని తెలిసీ టికెట్ ఇవ్వడం కంటే టికెట్ నిరాకరించి బలవంతపు రిటైర్మెంట్ ఇవ్వడమే మేలని వైసీపీ తమ్మినేని సీతారాంను పూర్తిగా పక్కన పెట్టేసిందని చెబుతున్నారు. 

స్కిల్ కేసులో బాబుకు బెయిలు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ  ఊరట దక్కింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది.  స్కిల్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు  బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు  ఈ నెల 17న తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వ్ చేసిన తీర్పును సోమవాంర (నవంబర్ 20)న వెలువరించింది. ఈ బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. రాజకీయం చంద్రబాబును వేధించడమే లక్ష్యంగా ఆయనపై ఈ కేసు బనాయించారని, ప్రభుత్వం చెప్పినట్లుగా  ఏపీ సీఐడీ వ్యవహరిస్తోందని చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదించారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని కోర్టులో వాదనలు వినపించారు.   మరో వైపు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ నిబంధనల్ని ఉల్లంఘించారని సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.  ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించి బెయిలు మంజూరు చేసింది. 

నవంబర్ 24 నుంచి లోకేష్ పాదయాత్ర.. జగన్ సర్కార్ పై దండయాత్ర!

స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు తో తాల్కాలికంగా నిలిచిపోయిన లోకేష్ పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. అశేష్ జనాదరణతో అప్రతిహాతంగా సాగుతున్న సమయంలో చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసింది. ఆ సమయంలో  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలులో జరుగుతున్న యువగళం పాదయాత్రను నారా లోకేశ్ తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.     చంద్రబాబుకు బెయిల్ కోసం, క్వాష్ కోసం ఆయన  ఢిల్లీ వేదికగా న్యాయపోరాటంలో నిమగ్నమయ్యారు. అందుకోసం  న్యాయవాదులతో  వరుస భేటీలు, అలాగే జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడం, జాతీయ మీడియా వేదికగా ఏపీలో జగన్ సర్కార్ అకృత్యాలు, అక్రమాలను ఎండగట్టడం వంటి కార్యక్రమాలలో ఆయన క్షణం తీరిక లేకుండా గడిపారు.  చంద్రబాబు నాయుడు 52 రోజుల తర్వాత మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తరువాత కూడా చంద్రబాబు ఆరోగ్యం,  వైద్య పరీక్షలు, కంటికి శస్త్రచికిత్స వంటి విషయాలలో లోకేష్ తండ్రికి చేదోడువాదోడుగా, అండగా ఉన్నారు. ఇక ఇప్పుడు  వచ్చే శుక్రవారం(నవంబర్ 24) నుంచి యువగళం పాదయాత్రను పున: ప్రారంభించాలని నిర్ణయించారు. చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన  సెప్టెంబర్ 9న ఎక్కడైతే తాను తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించేందుకు లోకేష్ నిర్ణయంచుకున్నారు. అందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.  మరోవైపు నారా లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ.. యువగళం పాదయాత్రను నిలిపివేశారని.. అలాగే తెలంగాణలో ఎన్నికలో పోటీ నుంచి తెలుగుదేశం వైదొలిగిందనీ వైసీపీ కీలక నేతలు విమర్శలతో నోటికి పని చెప్పారు. అదీకాక ఓ వైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. ఇంకో వైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సైతం మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వేళ... అసెంబ్లీ ఎన్నికలకు అట్టే సమయం లేదని.. దాంతో మళ్లీ పాదయాత్రకు శ్రీకారం చుట్టి.. ప్రజల్లోకి వెళ్లాలని నారా లోకేశ్  నిర్ణయం తీసుకున్నట్లు పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.    2023, జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి నారా లోకేశ్  యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ   ఆయన పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు, బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి తనదైన శైలిలో వివరిస్తున్నారు.   బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ  కార్యక్రమంలో భాగంగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును  జగన్ ప్రభుత్వం అరెస్ట్ అక్రమంగా అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పుడు ఎక్కడైతే తన పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారో.. అక్కడ నుంచే లోకేష్ మళ్లీ యువగళం పాదయాత్రను కొనసాగించనున్నారు.  ఇప్పుడు లోకేష్ కూడా యువగళం పేరిట దండయాత్ర మొదలు పెడితే వైసీపీకి ఫైనల్ డేంజర్ బెల్ మోగినట్లేనని రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. ఇప్పుడు లోకేష్ యువగళం పాదయాత్ర జగన్ సర్కార్ పాలిట దండయాత్రగా మారడం తథ్యమని తెలుగుదేశం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  

హద్దుల్లేని అహంకారానికి నిలువెత్తు నిదర్శనం!

ఒక జట్టుగా ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేనిది అయి ఉండొచ్చు. జట్టులో ఆటగాళ్లంతా  సమష్టిగా విజయం కోసం సర్వశక్తులూ ధారపోసి ఉండోచ్చు. నైపుణ్యం కలిగిన జట్టుగా ఆసీస్ జట్టను అంతా గౌరవిస్తారు. అయితే ఆటగాళ్ల అహంభావాన్ని, అహంకారాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపుతూనే ఉంటారు. క్రీడా స్ఫూర్తి అన్న పదానికి ఆసీస్ జట్టు మినహాయింపు అనే అంతా అంటారు. ఆసీస్ తో  ఆడిప ప్రతి జట్టూ ఈ విషయాన్ని ఎలాంటి దాపరికాలూ, బేషజాలూ, మోహమాటాలూ లేకుండా అంగీకరించేస్తుంది.  విజయం దూరమౌతోందంటే.. ఆ జట్టులో ఏ మాత్రం క్రీడా స్ఫూర్తి కనిపించదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా బలమైన జట్టుతో తలపడుతున్నామని భావిస్తే చాలు ముందు ప్రత్యర్థి జట్టును సైకిలాజికల్ గా దెబ్బతీసే వ్యూహంతో నోటికి పని చెబుతారు. జట్టు మానసిక స్థైరం దెబ్బతీయడమే లక్ష్యంగా మీడియా సమావేశాలలో మాట్లాడతారు. స్లెడ్జింగ్ కు పాల్పడతారు. మ్యాచ్ కు ముందు హీట్ పెంచేసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేస్తారు. మైదానం బయట ఆసీస్ జట్టు సభ్యులు చేసే ఇవేవీ ఆటలో భాగం కాదు. కానీ ప్రత్యర్థుల ఏకాగ్రతను దెబ్బ తీసే విధానాలు అనడంలో సందేహం లేదు. ఇక మైదానంలో కూడా ఆసీస్ ఆటగాళ్ల నిబద్ధత, నిజాయితీ ఎప్పుడూ ప్రశ్నార్ధకంగానే ఉంటుంది.  స్కిప్పర్ గా బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినందుకు స్టీవెన్ స్మిత్, అతడికి సహకరించినందుకు డేవిడ్ వార్నర్ లపై వేటుపడిన సంగతి తెలిసిందే. అలాగే  రివ్యూ  కోరుకోవడమనేది పూర్తిగా మైదానంలో ఉన్న జట్టుకు సంబంధించిన విషయం. అందులో మైదానం బయట ఉండే హెల్ప్ స్టాఫ్ కు ఏ పాత్రా ఉండదు. కానీ స్మిత్ ఆ రివ్యూ తీసుకోవాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడం కోసం కోసం పదే పదే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటం, అక్కడ నుంచి సైగల ద్వారా సంకేతాలు అందడం తెలిసిందే. అప్పట్లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఆ రెండు సందర్భాలూ కూడా ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పటివే. ఆటలో నైపుణ్యం విషయంలో ఆసీస్  క్రీడాకారులను ఎవరూ వంక పెట్టరు కానీ, క్రీడాస్ఫూర్తి, వ్యవహారశైలి విషయంలో ఆ ఆటగాళ్లకు ఎవరూ కనీసం పాస్ మార్కులు కూడా వేయరు.   ఇక ఒక టోర్నమెంట్ కానీ, మ్యాచ్ కానీ గెలిచిన తరువాత ఆ జట్టు ఎంత అహంభావంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో ఒకటి చెప్పుకోవాలంటే.. 2006లో ఆస్ట్రేలియా జట్టు చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అప్పట్లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్ జట్టు సారథికి ట్రోఫీ అందించారు. శరద్ పవార్ బీసీసీఐ అధ్యక్షుడే కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, కేంద్ర మంత్రిగా కూడా కీలక బాధ్యతలు వహించారు. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు కూడా. అటువంటి సీనియర్ పొలిటీషిన్ ను కప్పు అందుకోగానే వేదిక మీదనే పక్కకు నెట్టేసి ఆసీస్ జట్టు సంబరాలు చేసుకున్న తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ విమర్శలను పట్టించుకోవడం కానీ, పొరపాటు జరిగిందని క్షమాపణలు చెప్పడం కానీ ఆసీస్  ప్లేయర్లకు అలవాటే లేదు.  తాజాగా 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ప్రైజ్ డిస్ట్రీబ్యూషన్ అయిపోయిన తరువాత డ్రెస్సింగ్ రూంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్ అంతకు ముందే గెలుచుకున్న వరల్డ్ కప్ పై దర్జాగా  కాళ్లు పెట్టి కూర్చుని బీరు తాగుతున్న ఫొటో వివాదాస్పదంగా మారింది. సామాజిక మాధ్యమంలో అందుకు సంబంధించి ఫొటో వైరల్ అయ్యింది. నెటిజన్లు మార్ష్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు, లెజెండ్ లు కూడా మిచెల్ మార్ష్ తీరును తప్పుపడుతున్నారు. మార్ష్  తీరు క్రికెట్ కే అవమానమని అంటున్నారు. ఎవరేమనుకుంటే మాకేం అన్నట్లుగా ఆసీస్ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి క్రికెట్ ఆస్ట్రేలియా ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాంగ్రెస్ టార్గెట్ @90!

తెలంగాణలో కాంగ్రెస్ జోష్ మామూలుగా లేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమైన ఆ పార్టీ ఈ సారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. కర్నాటకలో విజయం తరువాత.. తెలంగాణలో వైనాట్ పవర్ అన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పార్టీ పగ్గాలు అందుకున్న నాటి నుంచీ కూడా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులలో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ వచ్చింది. అయితే సీనియర్లు తొలుత రేవంత్ నాయకత్వం పట్ల విముఖతతో అసమ్మతి రాగం ఆలపించినా.. ఆ తరువాత అధిష్ఠానం జోక్యంతో అంతా సర్దుకున్నట్లు కనిపిస్తున్నది. అక్కడక్కడా అసమ్మతి గళం గొణుగుడు వినిపించినా.. క్యాడర్ దానిని పట్టించుకోకుండా ఉత్సాహంగా ప్రచారంలో ముందుకు దూకుతున్నారు. ఇక పోలింగ్ తేదీ రోజుల వ్యవధిలోకి వచ్చేయడంతో మరింత పకడ్బందీగా, ప్రణాళికా బద్ధంగా ప్రచార వ్యూహాన్ని రచించుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో కనీసం 90 స్థానాలలో విజయం సాధించడమే టార్గెట్ గా పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు అవకాశాలు ఉన్నట్లు గుర్తించిన 90 నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ 90 నియోజకవర్గాలలోనూ విస్తృత ప్రచారానికి కార్యాచరణ రూపొందించింది.  ప్రచారం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనాయకులంతా రంగంలోకి దిగే విధంగా ప్లాన్ చేసింది.  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, భూపేష్ పటేల్, చిదంబరంతో పాటు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.  ఇక ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్, మాజీ ఎంపీ విజయశాంతి కూడా కాంగ్రెస్ తరఫున ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రులు, మాజీ సీఎంలు కూడా తెలంగాణలో ప్రచార పర్వంలో పాల్గొనేందుకు రానున్నారు. ఈ నెల 22 నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ ప్రచారంలో పాల్గొనేందుకు సుడిగాలి పర్యటనలకు షెడ్యూల్ ఖరారైంది.   కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలంపూర్, నల్లగొండలో ఈ నెల 22న ప్రచారం చేయనున్నారు. అలాగే  విజయశాంతి ఖమ్మం, మహబూబ్ నగర్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్  నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ లో జోష్ నింపనున్నారు. అదే విధంగా ఇతర అగ్రనేతల పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది.  రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టోలోని కీలకాంశాలనూ చేరవేయడమే లక్ష్యంగా పార్టీ ప్రచార కార్యక్రమం రూపొందించినట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. ప్రస్తుత టెంపో ఏ మాత్రం సడలకుండా కొనసాగేలా ప్రచారపర్వాన్ని కొనసాగించేలా కాంగ్రెస్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది.  పార్టీ హామీలనే కాకుండా.. గత తొమ్మదేళ్ల కేసీఆర్ పాలనా వైఫల్యాలను కూడా ప్రజలలో ఎండగట్టే విధంగా కాంగ్రెస్ ప్రచారం ఉండాలన్న నిశ్చయంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణ ఇచ్చిన అమ్మగా సోనియా గాంధీని కూడా రాష్ట్రంలో ప్రచారానికి తీసుకురావాలని యోచిస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదనకు సోనియా కూడా సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.   ఒక వేళ ఏ కారణం చేతనైనా సోనియా రాష్ట్ర పర్యటనకు రాలేని పరిస్థితి ఏర్పడితే..  ఆమె ఒక ప్రత్యేక వీడియో ద్వారా  తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ సోనియాగాంధీ చేత రాష్ట్ర ప్రజలకు ఓ పిలుపు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది.  

వైజాగ్  ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం... 50 బోట్లు దహనం

వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో  అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు.  చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లు సుమారు 50 బోట్లు వరకు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం అందుతోంది. అగ్ని మాపక సిబ్బంది అతి కష్టంతో 10 బోట్లు వరకు కాపాడగలిగారు.ఒక బోటు ఖరీదు అంచనాగా 30 నుండి 40 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.  ఈ విధంగా సుమారు 40 కోట్లు వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇంతటి ఘోర విషాదం ఎలా జరిగింది అన్న విషయం పై దర్యాప్తు చేయవలసి ఉంది,  వేటకు వెళ్ళాల్సిన దినసరి కూలీలు, వీటిపై బ్రతికే వారందరి పరిస్థితి అరణ్య రోదనగా  మారింది. బోట్ల యజమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎవరిని కదిలించినా హృదయ విదారకంగానే ఉంది. ఈ బోట్లలో భారీగా చమురు, పెట్రోలు, ఇతరత్రా మండే స్వభావం ఉన్న వాటిని ఉంచడంతో.. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఐతే.. బోట్లలో ఎవరైనా ఉన్నారా, వారికి గాయాలేమైనా అయ్యాయా అన్నది తెలియాల్సి ఉంది.ఒక్కో బోటులో సుమారు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం వెనక ఓ యూట్యూబర్ ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి వెళ్లాలని మంత్రి సీదిరి అప్పల రాజుకు సూచించారు. 

ఏపీలో కులగణన.. అనుమానాలెన్నో.. తీర్చే దిక్కెవరు?

ఏపీ సర్కార్ తీసుకున్న కులగణన నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా కుల గణనపై విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ముందే ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతుండడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఏ కులంలో ఎంత మంది ఉన్నారు? అందులో మగవారు ఎంతమంది.. ఆడవారు ఎంతమంది?, మళ్ళీ అందులో పిల్లలు ఎంతమంది? వారి వయస్సు, వారి ఆర్ధిక పరిస్థితి, ఇళ్ల నెంబర్లు, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధీ, సెల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు ఇలా సమస్త సమాచారం సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు తప్పనిసరిగా ప్రస్తుత చిరునామా పొందుపరచడంతో పాటు..  అది సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా, అది కాకుండా నివాస స్థలం ఉందా, ఇంట్లో మరుగుదొడ్డి సౌకర్యం ఉందా?  తాగునీటి సదుపాయం ఉందా? వీధి కుళాయి, బోర్ వెల్, పబ్లిక్ బోర్వెల్, సొంత కుళాయి ఉందా?  గ్యాస్ పొయ్యి ఉందా? లేకుంటే కట్టెల పొయ్యితోనే వండుతున్నారా? పశు సంపద కలిగి ఉన్నారా? ఉంటే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఎన్ని ఉన్నాయి? ఇలా కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలతో పాటు వ్యవసాయ భూమి వివరాలను నమోదు చేయనున్నారట. ఈనెల 27 నుంచి ఈ కుల గణన ప్రారంభం కానుండగా.. 2024 ఎన్నిక సమయానికి ఇది పూర్తి చేయాలని  జగన్  సర్కార్ భావిస్తుంది. అంటే ఎన్నికల సమయానికి ప్రతి ఒక్కరి సమస్త సమాచారం ప్రభుత్వం చేతిలో ఉండేలా ఈ కులగణన చేపట్టేందుకు కసరత్తులు చేస్తున్నది. ముందుగా ఈ కులగణనను పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా చేపట్టడానికి ఏపీ సర్కార్ నిర్ణయించింది. కానీ, ఆ తర్వాత  ఏమనుకుందో, రాజకీయ విబేధాలు వస్తాయని భావించిందో ఏమో వలంటీర్లను పక్కనపెట్టి రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, ప్లానింగ్, సంక్షేమ శాఖ నుంచి ఎంపిక చేసిన సూపర్వైజర్ల పర్యవేక్షణలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఈ సర్వేను చేపట్టాలని సిద్దపడింది. మండల స్థాయిలో తహసీల్దారులు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, మండల ప్రత్యేక అధికారుల సైతం ఈ గణనను పర్యవేక్షించనున్నారు.  ఈ కులగణన కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ ను కూడా తీసుకురానున్న ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ఈ యాప్ లో ప్రజల వివరాలతో కుల గణన చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు. సర్వే సమయంలో ప్రతి వ్యక్తి వివరాలను నమోదు చేయడంతో పాటు కేవైసీని కూడా తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో అసలు ఈ కులగణన జరిగే పనేనా? ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం రాష్ట్ర ప్రజల సమాచారం మొత్తం తీసుకోవాలంటే అసలు సమయం సరిపోతుందా? సచివాలయ ఉద్యోగులు వెళ్లి ఇలా సమస్త సమాచారం అడిగితే ప్రజలు చెప్తారా? అసలే ప్రభుత్వం మీద ఆక్రోశంతో ఉన్న జనం ఈ సర్వేకి సహకరిస్తారా?  అసలు ఇంత ప్రయాసలకోర్చి ఇప్పటికిప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టాల్సిన అవసరం ఏంటి ? ఇంత సమాచారం ప్రభుత్వం దేని కోసం సేకరిస్తున్నది? ఇలా సేకరించిన సమాచారం ఎక్కడ భద్రపరచనుంది? ప్రజల నుండి ఇలా సేకరించిన సమస్త సమాచారం భద్రంగానే ఉంటుందా? భద్రంగా ఉంటుందని ప్రభుత్వం  హామీ ఇస్తుందా? ఇలా ఎన్నో అనుమానాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చెప్తున్న ప్రకారం ఈ సర్వే పూర్తి చేయాలంటే కనీసం ఒకటి రెండేళ్లు సమయం కావాలి. కానీ, ఈ ప్రభుత్వం వద్ద   నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. పైగా ఎన్నికల ముంగిట ఇలాంటి సర్వేకి ప్రజలు  ఎంతవరకు సహరిస్తారన్నది అనుమానమే. అసలు ఎందుకు ఈ సర్వే చేస్తున్నారో చెప్పకుండా వివరాలు చెప్పమంటే ప్రజలు చెబుతారా?  క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగుల పనితీరు సరిగా లేని చోట ఈ సర్వే కష్టమే అవుతుంది. పైగా ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న వారు, ప్రభుత్వంపై అనుమానాలు ఉన్న వారు కేవైసీ చేయడం, ఓటీపీలు చెప్పేందుకు ససేమీరా అనడం గ్యారంటీ. విద్యార్థులు, ఉద్యోగులు ఇంత సమాచారం ఎందుకని ప్రశ్నించడం గ్యారంటీ. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రజల డేటాను సేకరించి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ సంస్థ ఆఫీసులో స్టోర్ చేస్తున్నదన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. ఇప్పుడు ఈ స్థాయిలో ప్రజల నుంచి వారి వివరాలను సేకరించడం, , నాలుగు నెలల్లో  కులగణనను పూర్తి చేయడం అసాధ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆస్పత్రిలో నటుడు విజయకాంత్.. ఆరోగ్యం విషమం!

నారాయణన్‌ విజయ్‌రాజ్‌ అళగర్‌స్వామి... ఈ పేరు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ, విజయ్‌కాంత్‌ అంటే ఠక్కున అందరికీ గుర్తొస్తుంది. యాక్షన్‌ హీరోగా తమిళ్‌, తెలుగు భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న విజయ్‌కాంత్‌ హీరోగానే కాదు, రాజకీయ నాయకుడిగా కూడా తనదైన  ముద్రను వేశారు. ఒకప్పుడు కోలీవుడ్‌లో  హీరో విజయ్‌ కాంత్‌  ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలకు ప్రాణం పోశారు. లక్షల మంది అభిమానులను సంపాదించాడు. ఆ తరువాత సినిమాలు వదిలి.. ప్రజా జీవితంలోకి వచ్చి  డీఎండీకేను స్థాపించారు. విజయ్‌కాంత్‌ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం విజయ్‌కాంత్‌ ఆరోగ్య పరిస్థితి విషమించి  హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది.  తీవ్రమైన జ్వరం,  జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో విజయ్‌ కాంత్‌ హాస్పిటల్‌లో చేరినట్టు సమాచారం. సాధారణ వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను ఒక రోజు అబ్జర్వేషన్‌లో  ఉంచాలని వైద్యులు చెప్పినట్లు సమాచారం.  దీర్ఘ కాలంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న విజయ్ కాంత్ కు గతంలో  మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా విజయ్‌కాంత్‌ వీల్‌ చైర్‌లోనే వెళ్తుంటారు. ఆయన వయస్సు 70 ఏళ్లు. విజయకాంత్‌ తమిళ సినీ పరిశ్రమపై  తనదైన ముద్ర వేసిన ఆయన  రాజకీయాల్లో అడుగుపెట్టి దేశీయ ముర్పోక్కు ద్రావిడ కలగం (డీఎండీకే) స్థాపించారు.  రాజకీయ నాయకుడిగానూ తమిళనాట తనదైన ముద్ర వేశారు. తమిళ నటుడు, నటీనటుల సంఘానికి  అధ్యక్షుడుగా కూడా  విజయకాంత్‌  పనిచేశారు.  

తెలుగుదేశం,జనసేన ఉమ్మడి సమరం.. ఇక వైసీపీ హ్యాండ్సప్పే!

ఏపీలో ఎన్నికల వేడి ఇప్పుడేమిటి? చాలా కాలం కిందటే మొదలైంది. వాస్తవానికి ఈ నెల 30న  పోలింగ్ జరగనున్న తెలంగాణలో కంటే మరో ఐదు నెలల తరువాత ఎన్నికలకు వెళ్లే ఏపీలోనే ఎలక్షన్ హీట్ పీక్స్ లో ఉందని చెప్పాలి.  ఏపీలోఅధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఎవరికి వారు నిర్దిష్ట ప్రణాళికలతో గెలుపు వేట ఆరంభించేశాయి. అయితే, ఇప్పటికే ప్రజా నాడి, ముందస్తు సర్వేల ఫలితాలతో  విపక్షాలు గెలుపు ధీమాతో ప్రజల మధ్యకు వెళ్తుంటే..  అధికార పార్టీ మాత్రం   ప్రజలలో  తమ సర్కార్ పట్ల నెలకొన్న తీవ్ర అసంతృప్తిని ఎలా  ఎదుర్కోవాలో అర్ధం కాక జనం ముందుకు వెళ్లడానికి జంకుతోంది.   తెలుగుదేశంతో జనసేన జతకట్టడం, ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలను కూడా నియమించుకొని సమష్టిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల కింద‌ట ఉమ్మ‌డి మేనిఫెస్టోల‌పై స‌మావేశాలు నిర్వ‌హించారు. రాష్ట్ర వ్యాప్తంగా స‌మ‌న్వ‌య స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన  ఉమ్మడి కార్యాచరణ పేరిట సమన్వయంతో ప్రణాళికా బద్ధంగా ఉమ్మడిగా ఎన్నికల సమరానికి సిద్ధపడటంతో  వైసీపీకి దిక్కుతోచడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలుగుదేశం, జనసేన కూటమి ఇప్పటికే 100 రోజుల ప్రణాళిక, ఓటరు జాబితా అవకతవకలతో పాటు ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాయి.  ఇరు పార్టీలు క్షేత్ర‌స్థాయిలో వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కార్య‌క్ర‌మాలు రెడీ చేసుకున్నాయి. ఇందులో ర‌హ‌దారుల నిర్మాణం, రోడ్ల‌పై గుంతలు, వాటి ద్వారా ఏర్ప‌డిన ప్ర‌మాదాలు, పోయిన ప్రాణాలు వంటి కీలక అంశాల‌పై ఉమ్మ‌డి నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌కు పిలుపునిచ్చాయి. ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌లో ఇది తొలి ఘ‌ట్ట‌మేనని చెబుతున్నాయి.   రోడ్ల నిర్మాణం, రోడ్ల‌పై గోతులు, ఏర్ప‌డిన ప్ర‌మాదాలు, పోయిన ప్రాణాలతో మొదలయ్యే తెలుగుదేశం, జనసేనల  ఉమ్మడి సమరం.. మరో రెండు నెలల పాటు పూర్తిగా ప్రజా సమస్యలపైనే కొనసాగనుంది. రాష్ట్రంలో ఇసుక కష్టాలు, పెరిగిన విద్యుత్ చార్జీలు, నిత్యావసర ధరలు, పన్నుల బాదుడు, రైతుల కష్టాలు, ఏ రంగానికి లేని ప్రోత్సాహకాలు, భారీగా పెరిగిన నిరుద్యోగం, వలసలు, మద్యం బాదుడు, ఊరు పేరు లేని నాసిరకం మద్యం, నాసిరకం మద్యం తాగి పోయిన ప్రాణాలు, రోగమొచ్చినా ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఆసుపత్రులలో అందని వైద్య పరీక్షలు, అందుబాటులో లేని మందులు, విద్యార్థులకు అందని ఫీజు రీఎంబర్స్ మెంట్, పెరిగిన అప్పులు ఇలా క్షేత్ర స్థాయిలో నాలుగున్నరేళ్లగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడమే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణ. దీంతో ఇది వైసీపీ ప్రభుత్వంపై మరింతగా ప్రజావ్యతిరేకతను పెంచుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఒక్కసారి తెలుగుదేవం,జనసేన పార్టీలు ఉమ్మడిగా ఇరు పార్టీల జెండాలతో ప్రజల మధ్యకి వెళ్తే  ఇక అధికారపక్షానికి చుక్కలు కనిపించడం ఖాయమని అంటున్నారు.  ప్రజలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నదనడంలో సందేహం లేదు.  అందుకే ఎక్కడిక్కడ వైసీపీ నేతలకు నిరసన సెగలు తగులుతున్నాయి.     వివిధ కార్యక్రమాల పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజల మధ్యకి పంపినా ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించామని ప్రభుత్వ పెద్దలు ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  దానికి తోడు చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారం కూడా జగన్ కు వ్యతిరేకంగా మారింది. చంద్రబాబుపై వరస కేసులు బనాయించి ఆయనని బయటకి రాకుండా చేయాలని చూసిన తీరు.. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకేనని ప్రజలు నిర్ధారించుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వ వేధింపులు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి.   ఈ తరుణంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటం మొదలు పెడితే వైసీపీ ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కాక రేపుతున్న ఖమ్మం.. తెలుగు తమ్ముళ్ల స్పెషల్ ఫోకస్!

తెలంగాణ ఎన్నికలు ఇక రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారంలో మునిగిపోయాయి. అభ్యర్థుల మధ్య, పార్టీల మధ్యా  మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికలను చావో రేవో అన్నట్లుగా మారిపోయాయి.  దీంతో మూడు పార్టీలూ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.   తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలలో నెలకొన్న అసంతృప్తి ని కాంగ్రెస్ పార్టీ ఓట్లుగా మలచుకోవడంతో ఎంతమేర సఫలీకృతం అవుతుందన్నది ఈ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయనుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా కాంగ్రెస్ జోరుమీద ఉందని అంటున్నారు. అధికారం దక్కించుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే గెలుపు  ధీమా మాత్రం కాంగ్రెస్ లో  ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అయితే ప్రజా నాడి కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతోందని సర్వేలు చెబుతున్నాయి.   గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలతో పాటు తెలుగుదేశం బలంగా ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగు తమ్ముళ్ల మద్దతుతో ఇప్పుడు కాంగ్రెస్ బలంగా మారింది. అలాంటి ప్రాంతాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకటి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రా ప్రాంతానికి అనుకోని ఉండడంతో పాటు తొలి నుండి ఇక్కడ బీఆర్ఎస్  సొంతంగా నిలదొక్కుకోలేకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఇక్కడ కమ్మ, రెడ్డి సామజిక వర్గాలు బలంగా ఉండడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడ ఆయా సామాజికవర్గాలకు చెందిన ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకున్నారు. అయితే బీఆర్ఎస్ లో వాళ్లకి తగిన గౌరవం దక్కలేదన్న అసంతృప్తితో  వాళ్లలో పలువురు ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ కు దూరమయ్యారు.   ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో కాకలు తీరిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ ఇందుకు ఉదాహరణ. తెలుగుదేశంలో ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో కీలకమైన శాఖలు నిర్వహించిన తుమ్మల 2014 వరకూ టీడీపీలోనే ఉన్నారు.  రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్ గూటికి చేరిన తుమ్మల  మంత్రి కూడా అయ్యారు. కానీ 2018లో ఓటమి తర్వాత కేసీఆర్ అండ్ కో ఆయన్ను పట్టించుకోవడం మానేసింది. దీంతో ఈ ఎన్నికల సమయానికి తుమ్మలను కాంగ్రెస్ పార్టీ దరి చేర్చుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల  తెలుగుదేశం మాజీ నేత కావడం, ఇప్పటికీ  తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో అనుబంధం ఉండడంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు తుమ్మలకు అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ ఇస్తున్నారు. అసలే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో  తెలుగుదేశం క్యాడర్  బీఆర్ఎస్ మీద గుర్రుగా ఉండగా.. తమ్ముల  తెలుగుదేశంతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ  ప్రచారంలో  మైలేజీ పొందుతున్నారు. నాడు తెలుగుదేశంలో  కేసీఆర్ కు మంత్రి పదవిని ఇప్పించింది తానేనని, అంతెందుకు 2014 తర్వాత తన వల్లనే టీఆర్ఎస్ కు ఖమ్మంలో కళాకాంతులు దక్కాయని చెబుతున్నారు.   మరోవైపు ఇదే జిల్లాలో బీఆర్ఎస్ మాజీ నేత‌, ప్ర‌స్తుత  కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ కూడా రెడ్డి సామాజికవర్గంతో పాటు పాత కాంగ్రెస్ క్యాడర్ ను ఆకర్షిస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆర్ధికంగా బలమున్న నేత కావడంతో పొంగులేటి బీఆర్ఎస్ నుండి బయటకి వచ్చిన నాటి నుండే క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తున్న పొంగులేటి పాత కాంగ్రెస్, బీఆర్ఎస్ లో తన అనుచర గణాన్ని, తెలుగుదేశం సానుభూతిపరులను కూడా కలుపుకొనిపోతూ బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసురుతున్నారు. సీఎం కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్‌ను రెడీ చేశామ‌ని డైరెక్ట్ గా హెచ్చరిస్తున్న పొంగులేటి.. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని కాస్కోండి అంటూ చాలెంజ్ విసురుతున్నారు. కమ్మ సామజిక వర్గం నుండి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నా.. ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా.. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అంశంతో తమ్ముళ్లు అందరూ ఇప్పుడు అజయ్ పై పోటీ చేసిన తుమ్మల వైపు మళ్లారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే   తెలుగుదేశం మాజీ నేతలు, తెలుగు తమ్ముళ్లే రాజకీయాన్ని మలుపు తిప్పుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనికి పాత కాంగ్రెస్ నేతలు తోడై ఖమ్మం జిల్లాలో కాక రేపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లలో టీడీపీ జెండాలు రెపరెపలాడడంతో ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు సినిమా క్లైమాక్స్ ఏమిటన్నది క్లియర్ కట్ గా  అర్ధమై ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.