cell tower theft in bihar

వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్ ను ఎత్తుకెళ్లారు!

గ్రేట్ ట్రెయిన్ రాబరీ అని ఓ హాలీవుడ్ సినిమా ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచింది. ఆ సినిమాలో ట్రైన్ లో రవాణా అవుతున్న నిధిని దొంగ చాకచక్యంగా చోరీ చేసి అందరి దృష్టిలో హీరోగా నిలుస్తాడు. ఇదే కాదు.. రాబిన్ హుడ్ లా పెద్దలను దోచి పేదలకు పెంచే దొంగలను హీరోలుగా చిత్రిస్తూ పలు తెలుగు సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాలన్నిటినీ తలదన్నే లాంటి చోరీ ఒకటి జరిగింది. ఇక్కడ దొంగలు చోరీ చేసింది డబ్బునో, నగలనో కాదు.. ఏకంగా ఒక సెల్ టవర్ ను. అది కూడా ఏ అర్దరాత్రో అపరాత్రో కాదు. పట్ట పగలు. ఇటీవలి కాలంలో ఏటీఎంలను ఎత్తుకెళ్లిపోయిన దొంగల గురించి విన్నాం.. కానీ ఏకంగా సెల్ టవర్ ను ఎత్తుకుపోయిన దొంగలను మొదటి సారి చూస్తున్నాం. బీహార్ లో ఈ వింత దొంగతనం జరిగింది. సెల్ టవర్ ఎత్తుకు వెళ్లిన వారు ఏదో దొంగచాటుగా రాలేదు. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అధికారులమంటూ వచ్చి దర్జాగా పట్టపగలే ఎత్తుకెళ్లారు. చోరీ చేస్తున్నామన్న భయం కానీ, దొరికిపోతామేమోనన్న బెదురు కానీ వారిలో ఏ కొసానా కనిపించలేదు. టవర్ తీసేయడానికి కారణం తమ సెల్ ప్రొవైడర్ కంపెనీ నష్టాల ఊబిలో కూరుకుపోవడమేనని అడిగిన వారికి చెప్పారు. అందరూ చూస్తుండగానే భారీ టవర్ కు కిందకు పడుకోపెట్టి.. ఏ పార్టుకాపార్టు విడదీసి చక్కా పట్టుకుపోయారు. దీని విలువ పాతిక లక్షలకు పైనే ఉంటుందని చెబుతున్నారు. అంతా అయిన తరువాత కంపెనీవారికి సమాచారం అందడంతో వారు వచ్చి ఇది దొంగల పనేనని తేల్చారు. పట్నాలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ కు గత కొన్ని నెలలుగా కిరాయి కట్టడం లేదన్న విషయం తెలుసుకున్న ఓ దొంగల ముఠా దానికి చోరీ చేసేందకు పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. అందర్నీ నమ్మించి, అందరూ చూస్తుండగానే తమ పని చక్క పెట్టేసింది. 

man taken to custody for killing rat

ఇంట్లో ఎలుకల మందు పెడుతున్నారా?.. జగ్రత్త జైలు పాలౌతారు!

ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటే.. ఆ ఇల్లాలికి భయం చిరాకు వెంటాడుతుంటాయి. వాషింగ్ మిషన్ నుంచి అన్నిటినీ కొరికి పెట్టేసి పాడు చేయడమే కాకుండా.. అల్మార్లలో స్టోర్ చేసుకున్న పప్పులనూ వదలకుండా పాడు చేస్తుంటాయి. ఇక బట్టల సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. చింపి పోగులు చేస్తుంటాయి. పారాడే వయస్సున్న చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో అయితే ఎలుకలతో మరీ ఇబ్బంది. వీటన్నిటినీ అధిగమించడానికి ఇళ్లల్లో ఎలుకల బోన్లు పెడతాం. దానివల్లా లాభం లేదనుకుంటే ఎలుకల మందు పెట్టి ఎలుకలను చంపేస్తాం. అలా చంపేసినందుకు హత్య కేసు పెడతామంటూ పోలీసులు వస్తే... అదే కనుక జరిగితే దేశంలో జైళ్లలో కాకుండా బయట ఉండే వారి సంఖ్య చాలా తక్కువ అయిపోతుందనడంలో సందేహం లేదు. ఇంత ఉపోద్ఘాతమేమిటని అనుకుంటున్నారా.. ఎలుకను చంపాడని చెప్పి ఓ వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆశ్చర్యం వద్దు ఇది నిజమే.. ఉత్తర ప్రదేశ్ లో మనోజ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు చేసిన నేరం ఎలుకను హత్య చేయడమే. ఓ ఎలుక తోకకు రాయి కట్టి నీటిలో ముంచి చంపేశాడంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు మనోజ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఎలుక శవాన్ని పోస్టు మార్టం కోసం పంపారు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎలుకను హత్య చేసినందుకు మనోజ్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తారా, లేక ఉరి వేస్తారా అంటూ నెటిజనులు జోకులు పేలుస్తున్నారు.

tense in telangana ahead of bandi padayatra

బండి ఐదో విడత పాదయాత్ర అడుగు కదపనివ్వమంటున్న పోలీసులు.. నడిచి తీరుతాం అంటున్న బీజేపీ శ్రేణులు

తెలుగు రాష్ట్రాలలో పాదయాత్రలు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి. అమరావతి రైతుల పాదయాత్రలో సంభవించిన ఉద్రిక్త పరిణామాలు మరుపనకు రాకముందే.. తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్ర ఐదో విడత ప్రారంభానికి ముందే యుద్ధ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర సోమవారం(నవంబర్ 28)  నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లా భైంసా నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ఆదివారం (నవంబర్ 27) నుంచే పోలీసులు భైంసాను తమ అధీనంలోకి తీసుకున్నారు. యాత్రకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న బండి సంజయ కు తీరిగ్గాఅప్పుడు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. భైంసాలో నెలకొన ఉన్న సున్నిత పరిస్థితుల కారణంగా యాత్ర కొనసాగిస్తే.. ఉద్రిక్తతలు పెచ్చరిల్లి షర్ఫణలు జరిగే ప్రమాదం ఉందని చెబుతూ పోలీసులు యాత్రకు అనుమతి నిరాకరించారు.  శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వడం లేదని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రకటించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం యాత్ర కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర సాగుతున్నప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులు .. పాదయాత్ర అనుమతి రద్దు చేసి.. బండి సంజయ్ ను కరీంనగర్‌ తీసుకు వెళ్లి ఇంట్లో వదిలి పెట్టిన సంగతి విదితమే.  అప్పట్లో  హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని మరీ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐదో విడత పాదయాత్రకు  అదే సీన్ రిపీట్ అయ్యింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా బండి సంజయ్ పాదయాత్ర  చేయడం ఖాయమని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే భైంసాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే  కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భైంసా నుంచి బండి పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్కడి పరిస్థితులు ప్రత్యక్ష యుద్ధం జరుగుతోందా అన్నట్లుగా మారిపోయాయి.  ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. బండి భైంసాకు వెళుతుండగా మార్గ మధ్యంలో జగిత్యాల మండలం తాటిపల్లి వద్ద అడ్డుకుని యాత్రకు అనుమతి లేదని ముందకు వెళ్లేందుకు వీళ్లేదనీ స్పష్టం చేశారు. అయితే బండి పోలీసులను ఖాతరు చేయకుండా వారిని తప్పించుకుని ఓ కార్యకర్త వాహనంలో భైంసా వైపు దూసుకెళ్లారు. ఈ దశలో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడమే కాక తోపులాటల వరకూ వెళ్లింది. అయితే పోలీసులు బండిని వెంబడించి కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద నిలిపివేశారు. ఈ సందర్భంగా బండి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  రోడ్డుపైనే కార్యకర్తలతో కలిసి ధర్నాకు కూర్చున్నారు. దీంతో పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేసి జగిత్తాలకు తరలించారు.  బండి పాదయాత్రకు అనుమతి నిరాకరించడం, బండిని అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందంటూ విమర్శలు గుప్పించాయి. భైంసా, నిర్మల్, జగిత్యాలలో ఏ క్షణాన ఏం జరుగుతుదో అన్నంతగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వైపు బండి సంజయ్ ను పోలీసులు జగిత్యాలలో గృహ  నిర్బంధంలో ఉంచారు. మరో వైపు పాదయాత్రకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.  ఇప్పటి వరకూ రాష్ట్రంలో బండి సంజయ్ నాలుగు విడతల్లో 21 జిల్లాలలో 1178 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన సంగతి విదితమే.

Women raped and killed by lover

ఆత్యాచారానికి పాల్పడి.. ఆపై యాసిడ్ పోసి..ప్రేమించిన వాడే పొట్టన పెట్టుకున్నాడు..

చట్టాలెన్ని తెచ్చినా, కఠిన శిక్షల హెచ్చరికలు చేసినా మహిళలపై అత్యచారాలు, అఘాయిత్యాలు ఆగడం లేదు సరికదా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దగ్గరి వాళ్లు, అయిన వాళ్ల చేతుల్లోనే దారుణంగా హతమారిపోతున్నారు. తాజాగా ప్రేమించిన వాడే కాలయముడై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆపై ముఖంపై యాసిడ్ పోసి కిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నమ్మి వచ్చిన ప్రేయసిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి, ఆపై అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన జార్ఖండ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. 20 ఏళ్ల యువతి రాంచీలోని ఓ కాలేజీలో పీజీ చదువుతోంది. కొన్ని నెలలుగా ఆమె  దీప్ అనే యువకుడూ ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నవంబర్ 20 న ఆమె దీప్ తో కలిసి బయటికి వెళ్లింది. అప్పటి నుండి  ఆమె జాడ తెలియలేదు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండ్రోజుల తర్వాత..లోహర్ దగా గ్రామానికి సమీపంలో ఉన్న రాతి క్వారీల సమీపంలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ముఖం గుర్తుపట్టకుండా యాసిడ్ పోసి కాల్చేసి.. దారుణంగా హతమార్చాడని దర్యాప్తులో తేలింది. నిందితుడు దాప్ నారాయణ్ సింగ్ అలియాస్ చర్కు ని అరెస్ట్ చేశారు.  

India Pak dispute over Aaia cup and world cup tornys

ఆసియా కప్ కు మీరు రాకుంటే.. వన్డే వరల్డ్ కప్ కు మేం రాం

వచ్చే ఏడాది ఆసియాకప్ జరగనుంది. ఆ  టోర్నీకి పాకిస్థాన్ వేదిక కావడమే ఇప్పుడు ఇరు దేశాల మధ్యా వివాదానికి కారణమైంది.  ఇరు దేశాల మధ్యా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రెండు దేశాలూ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదన్న సంగతి విదితమే. ఐసీసీ టోర్నీలలో మాత్రమే అదీ తటస్థ వేదికలపై మాత్రమే రెండు దేశాల మధ్యా మ్యాచ్ ల జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ కు పాకిస్థాన్ వేదిక కావడంతో భారత్ అక్కడకు వెళ్లి ఆడుతుందా అన్న విషయంపై అనుమానాలు వ్యక్త మయ్యాయి. ఇప్పటికే బీసీసీఐ ఈ విషయమే దాదాపు స్పష్టత ఇచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ గడ్డపై భారత్ ఆడేది లేదని తేల్చేశారు. దీనిపైనే పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ రిటార్డ్ ఇచ్చారు. పాక్ లో టీమ్ ఇండియా ఆడక పోతే.. తామూ అదే బాట పడతామనీ,  2023లో భార‌త్ వేదిక‌గా జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌మ జ‌ట్టు ఆడ‌ద‌ని తెలిపాడు. గ‌త కొంత‌కాలంగా పాక్ జ‌ట్టు అత్యుత్త‌మంగా రాణిస్తోంద‌ని, ఏడాది కాలంలో టీమ్ఇండియాను రెండు సార్లు ఓడించామ‌ని ర‌మీజ్ రజా గుర్తు చేశారు. మా జ‌ట్టు ప‌టిష్టంగా మారింది అని చెప్ప‌డానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం ఏం ఉంటుంద‌ని అన్నాడు.  భార‌త్‌  ఇక్క‌డికి వ‌స్తే.. మేం ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌టానికి వెలుతాం. వాళ్లు రాక‌పోతే.. మేమూ వెళ్లం. మా జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌కుంటే ఆ టోర్నీని ఎవ‌రు చూస్తారని   ఓ వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌మీజ్ రాజా అన్నాడు. దీనిపై క్రికెట్ అభిమానులు మండిప‌డుతున్నారు. భార‌త్ గ‌నుక పాక్ కు వెళ్ల‌కుంటే ఆసియా క‌ప్ క్రేజ్ ప‌డిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. పాక్ ఒక‌వేళ ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌కుంటే ఆ దేశానికే న‌ష్టం అని చెబుతున్నారు. ఐసీసీ టోర్నీలో పాల్గొన‌డం ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని పాక్ కోల్పోవాల్సి వ‌స్తుంద‌న్నారు. ఇక ఇండియా కూడా ఏడాది కాలంలో రెండు సార్లు పాక్ ను ఓడించింద‌నే విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

rahul rides bike in joda yatra

డుక్కుడుక్కు డుక్కని బుల్లెట్ పై వచ్చిన రాహుల్!

మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఆయన ప్రసంగాలు, వేషధారణ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నయి. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. రాహుల్ గాంధీ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల కంటే సైద్ధాంతిక రాజకీయాలకు, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జోడో యాత్ర లక్ష్యం ఎన్నికల విజయం కాదని సమాజంలో ద్వేషభావాన్ని రూపుమాపిఐక్యతను సాధించడమేనని కాంగ్రెస్ మొదటి నుంచీ చెబుతూనే వస్తోంది. అందుకు తగ్గట్టుగానే రాహుల గాంధీ కూడా తన ప్రసంగాలాలో బీజీపీ, ఆర్ఎస్ఎస్’జాతీయ వాద హిందుత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ ల వల్ల దేశానికి వాటిల్లే ముప్పు గురించి హెచ్చరిస్తున్నారు.  హెచ్చరిస్తున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో సాగుతున్న యాత్రలో ప్రింయాంకాగాంధీ, రాబర్ట్ వాద్రా పాల్గొనడం కొత్త చర్చకు తావిచ్చింది. అదలా ఉంటే ఆదివారం రాహుల్ గాంధీ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ జన్మస్థలమైన డాక్టర్ అంబేడ్కర్ నగర్ లో రాహుల్ గాంధీ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. సాయంత్రానికి ఇండోర్ చేరుకున్న రాహుల్ అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇలా ఉండగా ఆదివారం నాటి యాత్రలో విశేషమేమిటంటే రాహుల్ గాంధీ కొద్ది దూరం బుల్లెట్ బైక్ నడిపారు. ఇది పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆయన వెంట కార్యకర్తలు పరుగులు తీశారు. కాంగ్రెస్ జిందాబాద్ నినాదాలతో అంబేడ్కర్ నగర్ మార్మోగింది. 

political distrubence on rahul appearence

రాహుల్ వేషం పై రాజకీయ రగడ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో జోరుగా సాగుతోంది. రెండు మూడు రోజుల్లో, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. సరే  రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లాట్, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న యువనేత సచిన్ పైలట్ వర్గాల మధ్య ‘ప్రత్యక్ష’ యుద్ధం జరుగతున్ననేపథ్యంలో రాహుల్ యాత్ర ఎలా ముందుకు సాగుతుంది, అనే విషయంలో వినిపిస్తున్న, ఉహాగానాలు,విశ్లేషణలను పక్కన పెడితే, ప్రస్తుతం మధ్య ప్రదేశ్, రాహుల్ యాత్ర చాలా చాలా  హుషారుగా సాగుతోంది. రాహుల్ యాత్రలో సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా, ఆమె భర్త భర్త రాబర్ట్  వాద్రా, కుమారుడు రేహాన్ వరసగా మూడు రోజులు పాల్గొనడంతో,రాహుల్ యాత్రకు కొత్తకళ వచ్చింది. ముఖ్యంగా ప్రియాంక వెంట, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రేహాన్ కూడా రావడంతో రాజకీయంగాను కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.  రాహుల్ గాంధీ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల కంటే సైద్ధాంతిక రాజకీయాలకు, సైద్ధాంతిక పోరాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జోడో యాత్ర లక్ష్యం కూడా ఎన్నికల విజయం కాదని, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ సహా ఇతర నాయకులు పలు సందర్భాలలో పేర్కొన్నారు. రాహుల గాంధీ కూడా తమ ప్రసంగాలాలో బీజీపీ, ఆర్ఎస్ఎస్ జాతీయ వాద హిందుత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ లను ప్రస్తావిస్తూ హెచ్చరిస్తున్నారు.  ఈనేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలో ఇంత వరకు గాంధీలు పోషించిన పాత్రను ఇకపై వాద్రాలు పోషిస్తారని, అందుకే ప్రియాంక కుటుంబ సమేతంగా యాత్రలో పాల్గొన్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. రాహుల్ గాంధీ యాత్ర తర్వాత కూడా, ఇదే ధోరణి అవలంబిస్తే ప్రియాంక, రాబర్ట్ వాద్రా పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకుంటారని అంటున్నారు. నిజానికి, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాలపై కొంత ఆసక్తి చూపారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, ప్రకటించిన విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.  అదలా ఉంటే, రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్‌  యాత్రలో వేష ధారణ మారిపోయింది. గతంలోనే,నేనూ హిందువునే అని ప్రకటించుకున్న రాహుల గాంధీ,. ఈసారి ఏకంగా పక్కాగా పండిత వేష కట్టారు. ఓంకారేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. నర్మదా నదీ తీరాన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో  రాహుల్ ఓంకార ముద్రలున్న శాలువా కప్పుకుని, రుద్రాక్ష మాలలు ధరించి, పెద్ద పెద్ద బొట్లతో అచ్చమైన పూజారికి రోల్ మోడల్ అన్నట్లు వేషం కట్టారు. పండితునిగా దర్శనమిచ్చారు. ఆ  ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. నిజానికి, రాహుల్ వేషం పై సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. మెచ్చుకున్న వాళ్ళు మెచ్చుకున్నారు. ట్రోల్ చేసిన వారు ట్రోల్ చేశారు. అదంతా ఒకెత్తు అయితే, రాహుల్ పోస్ట్ ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రీట్వీట్ చేస్తూ చేసిన వ్యాఖ్య  వివాదంగా  మారింది. అలాగే, అంతకు ముందు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ,రాహుల్ వేషధారణలో వచ్చిన మార్పును మెచ్చుకుంటూనే,  గడ్డం పెంచిన రాహుల్ గాంధీని చూడగానే సద్దామ్ హుస్సేన్‌ గుర్తుకు వస్తున్నారని  ట్రోల్ చేశారు. అది మరొక వివాదం అయింది . ఇప్పుడు కాంగ్రెస్, బీజేపే నాయకుల మధ్య రాహుల్ గాంధీ కొత్త వేషం పై హాట్ హాట్ గా  వివాదం నడుస్తోంది. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కేంద్ర మంత్రి హిందూ ఆచారాలను అవమానిస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. అలాగే, మరో కాంగ్రెస్ ప్రతినిధి లావణ్య బలాల్ రాహుల్ గాంధీపై మీకున్న విద్వేషం తారస్థాయికి చేరుకుంది   అని ఆమె స్మృతీ ఇరానీకి సుతిమెత్తగా చురకలు అంటించారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిమంత శర్మ రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు, హిమంత శర్మ సిగ్గు పడాలి. ఇప్పుడు ఆయన( హేమంత్ బిశ్వ శర్మ రాజకీయాల్లో ఇంత ఉన్నత స్థానంలో ఉన్నారంటే అదంతా రాహుల్ గాంధీ పుణ్యమేనని గుర్తుంచుకోవాలి అని ట్వీట్ చేశారు. ఇలా రాహుల్ గాంధీ సాగిస్తున్న బారత్ జోడో యాత్ర,ఓ వంక రాజకీయ వేడిని పుట్టిస్తోంది, మరో వంక సైద్ధాంతిక చర్చలకు ఆస్కారం కలిపిస్తోంది. అలాగే, కాంగ్రెస్ పార్టీలో రేపటి మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.

kcr national politics a break is it another u turn

జాతీయ దూకుడుకు బ్రేక్ కేసీఆర్ మరో యూ టర్న్?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాలలో దూకుడు పెంచే విషయంలో పునరాలోచనలో పడ్డారా? రాష్ట్ర, జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో తాజాగా ఆయన ఇంట గెలిచి రచ్చగెలవాలనే నిర్ణయానికి వచ్చారా? అంటే, రాజకీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో జరుగతున్న ముందస్తు ఎన్నికల సన్నాహాలు, ఇతర పరిణామాలను గమనిస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో మరోమారు యూ టర్న్ తీసుకున్నట్లే ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి పొలిటికల్  ఫోకస్ జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వైపుకు మరలినట్లే ఉందని పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మరో ఎనిమిది నెలలలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, ముందస్తు సంకేతాలు ఇవ్వడంతో ముందస్తు ఆలోచనకు మరింత బలం చేకూరిందని అంటున్నారు.ముందు రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించి ఆ తర్వాత జాతీయ రాజకీయలపై ఫోకస్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే అదే ఫైనల్ నిర్ణయం అనుకునే వీలులేదనీ కేసీఆర్ ను ఎరిగిన నేతలు అంటున్నారు. నిజానికి పార్టీ వర్గాల సమాచారం మేరకు  ముఖ్యమంత్రి ప్రస్తుతానికి రాష్ట్ర శాసన సభ ఎన్నికల పైనే దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా  ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమా వెళ్ళక పోవడమా అనే మీమాంసలో ముఖ్యమంత్రి ఉన్నారు, ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తేనే గానీ, జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే పరిస్థితి లేదని పార్టీ నాయకులు అంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం, దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలపై దృష్టిని కేంద్రేకరిస్తుందనే సమాచారంతో, ముఖ్యమంత్రి ఇటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, అటు జాతీయ రాజకీయ ప్రస్థానం గురించి విభిన్న కోణాల్లో ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  నిజానికి, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ, విజయదసమి (అక్టోబర్ 5) తెరాస విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేశారు. అయినా, ఆ తర్వాత పెద్దగా ముందడుగు పడలేదు.  ఆ వెంటనే, కేంద్ర ఎన్నికల సంఘానికి, పేరు మార్పుకోసం, తెరాస మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద కుమార్ నాయకత్వంలో తెరాస నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, నవంబర్  7న కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, పార్టీ పేరు మార్పుకు అవసరం అయిన మేరకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పేరున బహిరంగ పత్రికా ప్రకటన వెలువడింది. టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లుగా ఆ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ పార్టీ పేరు మార్చే విషయంలో ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, వాటిని 30 రోజుల లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపవచ్చని పేర్కొన్నారు.అంటే, డిసెంబర్ 7 తర్వాతగానీ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అవకాశమే కాదు అవసరం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేదు. పార్టీ పేరు మార్పు విషయంలో ఎన్నికల సంఘం ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఏదీ లేదు. సో ... డిసెంబర్ 7 తర్వాత గానీ, ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. అంతే కాదు, ముగ్గురు కమిషనర్లు హాజరైన పూర్తి స్థాయి సమావేశంలో మాత్రమే, పార్టీ పేరు మార్పు నిర్ణయం తీసువలసి ఉంటుందని అంటున్నారు. అయితే, ఇటీవల ఎన్నికల సంఘం మూడవ కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకం జరిగినా, ఆయన నియామక ప్రక్రియను సుప్రీం కోర్టు తపు పట్టిది. న్యాయవిచారణ జరుగుతోంది. సో .. ఇప్పట్లో తెరాస పేరు మార్పు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అంటున్నారు.  బీఆర్ఎస్ ముందడుగు పడక పోవడానికి అదొక సాంకేతిక కారణం అయినా ప్రధాన కారణం మాత్రం రాజకీయ మైనదే అంటున్నారు. దేశంలో, రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో జాతీయ రాజకీయాల్లో దూకుడు పెంచే విషయంలోముఖ్యమంత్రి పునరాలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అందుకే, డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలనే నిర్ణయం విషయంలోనూ వెనకడుగు వేశారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు,ఆతర్వాత జిల్లాలలో బహిరంగ సభలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా టీఆర్ఎస్/ బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధి బీజేపీనే అనే విషయంలో క్లారిటీ వచ్చిన నేపధ్యంలో కేంద్రం, బీజేపీ పై యుద్ధం కొనసాగుతుందని అంటున్నారు.

who is the new cs of ap new twist in last minute

కౌన్ బనేగా ఏపీ ‘సీఎస్’ ఆఖరిక్షణంలో కొత్త ట్విస్ట్

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్‌శర్మ పదవీ కాలం  నవంబర్ 30తో ముగుస్తుంది. ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో  డిసెంబరు 1వ తేదీ బాధ్యతలు చేపట్టే కొత్త సీఎస్ ఎవరు? అనే విషయంలో, ఇటు రాజకీయ వర్గాల్లో, అటు అధికార వర్గాల్లోనూ గత కొంత కాలంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి,  కొన్ని పేర్లు వినిపించినా ముందునుంచి సీనియర్ ఐఎఎస్ జవహర్‌రెడ్డి రేస్ లో ముందున్నారు. ఆయన నియామకం ఇంచుమించుగా ఖరారు అయిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే, ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని, అందరూ భావిస్తున్న సమయంలో,కొత్తగా మరో పేరు తెర మీదకు వచ్చింది.  అయితే ముందు నుంచి జవహర్ రెడ్డి వైపే మొగ్గుచూపిన ముఖ్యమంత్రి ఆఖరి క్షణంలో  పునరాలోచన చేయడం వెనక ఉన్న కారణం ఏమిటనే విషయంలో  భిన్న అభిప్రాయలు వ్యక్త మవుతున్నాయి. అయితే, ముఖ్యమంత్రి మనసు మార్చుకోవడం వెనక ఇంకా ఇతర కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ  ప్రధానంగా, జవహర్ ‘రెడ్డి’ పేరే కారణం అంటున్నారు. ప్రభుత్వంలో రెడ్డి వాసన తగ్గించేందుకు ముఖ్యమంత్రి సమీర్ ‘రెడ్డి’ నియామకం విషయంలో పునరాలోచన చేస్తున్నారని అంటున్నారు. పార్టీ పదవుల విషయంలోనూ ముఖ్యమంత్రి కొంత మేరకు రెడ్డి ట్యాగ్ ప్రాధాన్యత తగ్గించి, బీసీలకు పార్టీ పదవుల్లో కొంచెం ఎత్తు పీట వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.   అదలా ఉంటే, సీఎస్ రేసులో కొత్తగా కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణే పేరు వినిపిస్తోంది. 1988 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అరమణే  ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్రం రక్షణశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన్ను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. మరోవంక, గిరిధర్‌ అరమణే   శనివారం(నవంబర్26)  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో భేటీ అయ్యారు. కొత్త సీఎస్‌ నియామకంపై కసరత్తు జరుగుతున్న సమయంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.    ఆంధ్రప్రదేశ్ కేడర్‌ కు చెందిన ఐఎఎస్ అధికారుల సీనియార్టీ  జాబితాలో గిరిధర్‌ అరమణే రెండో స్థానంలో ఉన్నారు. గిరిధర్ అరమణే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడితే 2023 జూన్‌ 30 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయబోతున్నారు. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త సీఎస్ బాధ్యతలు చేపట్టాల్సిఉంటుంది. సో.. కొత్త సీఎస్‌ నియామకంపై నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.  నిజానికి, ముఖ్యమంత్రి ఫస్ట్ ఛాయస్ ‘రెడ్డి’ అందులో సందేహం లేదు. అందుకే, ముందు నుంచి, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రెటరీగా ఉన్న జవహర్‌రెడ్డి పేరు మాత్రమే ప్రముఖంగా వినిపించింది. అయితే  వచ్చేది ఎన్నికల సంవత్సరం  కాబట్టి ఆ దిశగానే నియామకం ఉంటుందని అంటున్నారు. అయితే అదే సమయంలో అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఖచ్చితంగా ‘కౌన్ బనేగా సీఎస్’ సస్పెన్స్ కొనసాగుతుందనీ అంటున్నారు. అయినా, మరి కొద్ది గంటల్లోనే అధికారిక ప్రకటన వెలువడనున్న నేపధ్యంలో తినబోతూ రుచులెందుకు అంటూ ఐఎఎస్ అధికారులు గుంభనంగా ఉంటున్నారు. కొస మెరుపుగా, రెడ్డి ఛాయస్ కు అడ్డు పడింది ఎవరు? అనే చర్చ కూడా అధికార, రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. ఇంతకాలం  ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పూర్తి స్వేఛ్చ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఆయనకు ముకుతాడు బిగించేందుకు, గిరిధర్‌ అరమణేను రాష్ట్రానికి పంపుతోందా  అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే  కేంద్రం కావాలనే గిరిధర్‌ అరమణే పేరును తెర మీదకు తెచ్చిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైనా, సీఎస్ ఎవరైనా, అన్ని విధాలా పట్టాలు తప్పిన ఏపీ సర్కార్ ను మళ్ళీ పట్టాల మీదకు తీసుకురావడం, అయ్యే పని కాదనే, ఐఎఎస్ లు అంటున్నారు. అవును ఐఎఎస్ లే కాదు, సామాన్య  ప్రజలు కూడా రాష్ట్రానికి మళ్ళీ  మంచి రోజులు రావాలంటే, మళ్ళీ చంద్రబాబు రావాలని అంటున్నారు.

snake bites on tounge result of superstition

మూఢ భక్తి పాడుగానూ.. పామును వెక్కిరిస్తే ఊరుకుంటుందా?

మూఢనమ్మకాలు ఒక్కోసారి ప్రాణం మీదకు తీసుకువస్తాయి. నిద్రలో పీడకలలు వస్తున్నాయని జ్యోతిష్యుడిని ఆశ్రయించిన ఓ వ్యక్తి ఆ జ్యోతిషుడు ఇచ్చిన సలహాను పాటించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అదృష్టం బాగుండి బతికి బయటపడడమైతే పడ్డాడు కానీ.. మూఢనమ్మకమే ప్రాణం మీదకు తెచ్చిందని తెలుసుకున్నాడో లేదో. కలలను కూడా శాస్త్రీయంగా విశ్లేషించి పీడకలల బారి నుంచి విముక్తి కలిగించేందుకు కౌన్సెలింగ్  ఇచ్చే కేంద్రాలున్నాయి. కానీ ఈ కాలంలో కూడా పీడకలలు చేటు చేస్తాయని నమ్మే వ్యక్తులు ఉన్నారనడానికి తమిళనాడుకు చెందిన రాజాయే నిదర్శనం.    గోపిచెట్టిపాళయంకు చెందిన రాజా ఒక రైతు  రాజాకు ఇటీవల తరచూ..  పాము కాటు కల వస్తుండటంతో భయపడి ఓ జ్యోతిష్యుడిని ఆశ్రయించాడు. అతడి సలహా మేరకు రాజా పాములపుట్ట ఉన్న ఓ అలయానికి వెళ్లి పుట్టకు పూజలు చేసి పాములా మూడు సార్లు నాలుక బయటకు చాపాడు. అంత వరకూ బానే ఉంది.. కానీ ఆ పుట్టలో ఉన్న పాము రాజా నాలుకపై కాటేసింది. వెంటనే ఆలయ పూజారి, రాజా కుటుంబ సభ్యులు పాము కాటువేసిన ప్రాంతంలో నాలుకను కోసివేసి.. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు.   ఆస్పత్రిలో వైద్యులు సగం తెగిపోయిన నాలుకకు చికిత్స చేసి.. పాము విషానికి విరుగుడు  ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు.  మూఢ నమ్మకాలు ఎంత ప్రమాదమో ఇప్పుడు రాజుకు తెలిసి వచ్చి ఉంటుంది.  

Morphing Heroins Photos siber criminal arrested

హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి..

హీరోయిన్లు, యాంకర్లను టార్గెట్ చేసుకుని వాళ్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కోనసీమ జిల్లాకు చెందిన పందిరి వెంటక వీర్రాజుగా గుర్తించారు. యాంకర్ అనసూయ ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి అసభ్య క్యాప్షన్స్ పెడుతూ వేధింపులకు గురి చేయడంతో పాటు, ఆమె వ్యక్తిగత జీవితంపైనా అభ్యంతరకర కామెంట్లు చేస్తుండటంతో కొద్ది కాలం కిందట అనసూయ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ లు మారుస్తుండటంతో పందిరి వెంకట వీర్రాజు అంత తేలికగా దొరకలేదు. కోనసీమలోని అతడి స్వగ్రామం ట్రేస్ చేసి దాదాపు వారం రోజుల పాటు నిఘా వేసి ఎట్టకేలకు అతడిని  అరెస్టు చేశారు. మార్ఫింగ్ ఫొటోలతో ఒక్క అనసూయనే కాకుండా అతడు కొందరు స్టార్ హీరోయిన్లు సహా మొత్తం 267 మంది హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ ట్విట్టర్ అక్కౌంట్ నుంచి అసభ్య వ్యాఖ్యలతో పోస్టు చేసినట్లు పోలీసులు కనుగోన్నారు. 

ambulance stopped because diezel empty patient died

డీజిల్ అయిపోయింది..అంబులెన్స్ ఆగిపోయింది.. రోగి ప్రాణం పోయింది!

ఆరోగ్య సేవల విషయంలో నిర్లక్ష్యం కారణంగా రోగి నిండు ప్రాణం బలైపోయిన సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించడానికి వచ్చిన అంబులెన్స్ లో మార్గ మధ్యంలో డీజిల్ అయిపోయి ఆగిపోయింది. దీంతో రోగి బంధువులు అంబులెన్సును దాదాపుకిలో మీటర్ దూరం తోసుకుని వెళ్లి డీజిల్ కొట్టించారు. అయినా ఆ అంబులెన్స్ కదల లేదు. దీంతో మరో అంబులెన్స్ కు ఫోన్ చేసి అది వచ్చి ఆసుపత్రికి తరలించేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. రోగి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. రాజస్థాన్ లోని దానాపూర్ గ్రామానికి చెందిన తేజియా పొలంలో పని చేస్తుండగా ఒక్కసారిగా అనారోగ్యంతో కుప్పకూలిపోయాడు. దీంతో  బంధువులు అంబులెన్సుకు కాల్ చేసి దానిలో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో డీజిల్ అయిపోయి అంబులెన్స్ ఆగిపోయింది. అక్కడికి  కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ అంబులెన్సును బంధువులు తోసుకుంటూ తీసుకెళ్లారు. అక్కడ డీజిల్ కొట్టించినా అంబులెన్స్ కదలలేదు. మొరాయించింది. దీంతో చేసేది లేక మరో అంబులెన్స్ ను పిలిపించుకుని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తేజను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తేజ బంధువులు అంబులెన్స్ ను తోసుకువెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులను ఆసుపత్రికి తీసుకువెళ్లే అంబులెన్స్ లో డీజల్ ఉందో లేదో చూసుకోనంత అధ్వానంగా వాటి సేవలు ఉన్నాయని నెటిజన్లు మండి పడుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సులే నాణ్యతా లోపాలతో, సేవా లోపాలతో రోగుల ప్రాణాలు తీస్తున్నాయని మండిపడుతున్నారు. అంబులెన్స్ మార్గమధ్యంలో మెరాయించకుండా ఉంటే రోగి బతికేవాడని అంటున్నారు.   

ganta to join ycp

ఫ్యాను’ నీడకు ‘గంటా’..!?

ఏ ఎండకు ఆ గొడుగు అన్న సామెతకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా సరైన ఉదాహరణ అని చెప్పవచ్చు. ఎన్నో పార్టీలు మారి, చివరికి తన నీడన చేరిన గంటా శ్రీనివాసరావును ఆదరించి, ఎంపీని చేసి, మంత్ర పదవులు ఇచ్చి గుర్తింపు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల విశ్వాసం, కృతజ్ఞత లేకుండా ఇప్పుడు పార్టీ మారుతున్నారంటూ వార్తలు రావడం గమనార్హం. అది కూడా తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువైన వైసీపీ పంచన చేరేందుకు గంటా రెడీ అవుతుండడం దారుణం అంటున్నారు.  గంటా శ్రీనివాసరావుకు రాజకీయ భిక్షపెట్టింది తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే. 1999లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయాల్లో ప్రవేశించి, తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి లోక్ సభా స్థానం నుంచి ఎన్నికయ్యారు గంటా. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో గంటాకు మంత్రి పదవి దక్కింది. ఇక 2014 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో చేరి భీమిలి నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన గంటాకు చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ, ప్రాథమిక, సెకండరీ, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు. అలా చంద్రబాబు దయతో రాజకీయంగా  పలుకుబడి సంపాదించుకున్న గంటా శ్రీనివాసరావు అడుగులు ఇప్పుడు వైసీపీ వైపు వేస్తున్నారనే వార్తలు రావడం సంచలనం అవుతోందంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఇటీవలే తన బంధువులు, సన్నిహితులతో చర్చించి, పార్టీ మారే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వైసీపీ పెద్దల నుంచి కూడా గంటాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.  డిసెంబర్ 1 గంటా బర్త్ డే. ఆ తర్వాత వైసీపీలో చేరాలని గంటా ముహూర్తం పెట్టుకున్నారనే లీకులు ఆయన సన్నిహితుల నుంచి వస్తుండడం గమనార్హం. డిసెంబర్ మూడో వారంలో విశాఖపట్నంలో జరిగే జగన్ సభ సందర్భంగా వైసీపీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. జగన్ రెండో కేబినెట్ లో మంత్రి పదవి కోల్పోయిన అవంతి శ్రీనివాసరావు వైసీపీలో గంటా చేరికను తీవ్రంగా వ్యతిరేకించడం వల్లనే గంటా చేరిక ఆలస్యమైందని కూడా అంటున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, విశాఖలో పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్న విజయసాయిరెడ్డి కూడా గంటా చేరికకు అడ్డంకులు పెట్టారంటారు. ఇప్పుడు వారిద్దరి మాటా పార్టీలో అంతగా చెల్లని పరిస్థితి రావడంతో  పాటు.. గంటాకు సన్నిహితుడైన పంచకర్ల రమేష్ బాబు తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడయ్యారు. దీంతో గంటా వైసీపీ చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారనే అంచనాలు వస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరుతున్నారంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. రాజకీయంగా కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న గంటీ జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్ చిరంజీవిని కలిశారు. అయినప్పటికీ జనసేనలో చేరకుండా ఇప్పుడు వైసీపీ వైపు ఎందుకు చూస్తున్నారనేది అంతు చిక్కడం లేదంటున్నారు. 

murder attemt on kotamreddy srinivasulureddy

తెలుగుదేశం నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై హత్యాయత్నం

ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. ఎవరికీ రక్షణ లేని వాతావరణం నెలకొని ఉంది. తెలుగుదేశం నాయకుడు, నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిపై శనివారం హత్యాయత్నం జరిగింది. నాగ వెంకట రాజశేఖరరెడ్డి అనే వ్యక్తి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని ఉద్దేశ పూర్వకంగా కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో కోటంరెడ్డికి గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారుతో ఢీకొట్టిన యువకుడు పరారయ్యాడు. ఈ దాడికి కారణం తెలియాల్సి ఉంది. ఆ యువకుడు నేరుగా కోటంరెడ్డి నివాసానికి వచ్చి వాగ్వాదానికి దిగాడనీ, తొలుత కోటంరెడ్డి కుమారుడితో గొడవపడ్డాడని చెబుతున్నారు. అనంతరం సర్ది చెప్పి ఆ యువకుడిని కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి పంపించేశాడని అంటున్నారు. వెళ్లినట్టే వెళ్లిన యువకుడు రివర్స్ లో కారులో వచ్చి కోటంరెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టి పరారయ్యడు.    ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటం రెడ్డిని తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటనకు గల కారణాలను ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మాజీ మంత్రి సోమినేని చంద్రమోహన్‌ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. కోటం రెడ్డికి తృటిలో ప్రాణాపాయం తప్పిందనీ ....కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇంటికి వచ్చి, వార్నింగ్ ఇచ్చిమరీ కారుతో ఢీ కొట్టడంపై అనుమానాలున్నాయనీ సోమిరెడ్డి అన్నారు. కాగా ఈ ఘటనలో కోటంరెడ్డి కాలు ఫ్రాక్చర్ అయిందనీ, దాడి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లాను వైసీపీ నేతలు డ్రగ్స్ అడ్డాగా మార్చేశారన్నారు.  రాజశేఖరరెడ్డి కారు వెనుక మరో కారు కూడా ఉందని చెబుతున్నారు. అది ఎవరిదనేది ట్రేస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇంటికి వచ్చి మరీ కారుతో ఢీ కొట్టిన రాజశేఖరరెడ్డి తీరు అనుమానాస్పదంగా ఉందని కోటంరెడ్డి కుటుంబీకులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్నాడనీ పేర్కొన్నారు.  

discussion on rise about early election in telangana

ముందస్తు ఎన్నికలకు అటూ ... ఇటూ

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నుంచి ఎన్నికల వరకు, ఎన్నికల రాజకీయమే నడుస్తున్నది. ఒకప్పుడు కొత్త ప్రభుత్వానికి కొంత హనీమూన్ పీరియడ్ అయినా ఉండేది కానీ, ఇప్పడు అది కూడా లేదు. డే వన్ నుంచే అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోతున్నాయి. మరో వంక రాజకీయాల్లో ఎత్తు పల్లాలు ఎదురైన ప్రతి సందర్భంలోనూ మీడియా మేథావులు రాజకీయ వేడి రగిల్చి ఎప్పటికప్పుడు ముందస్తు ఎన్నికలకు ముహూర్తాలు ఖరారు చేస్తున్నారు. అలాగే, ప్రతిరోజూ రెండు పూటలా పొద్దున సాయత్రం రాజకీయ మేథావుల భాజా భజంత్రీలతో ఎన్నికలు వచ్చేసినట్లే అనే భ్రమల్లోకి ప్రజలను తీసుకు పోతున్నారు. వినోదం పండిస్తున్నాయి.  అయితే ముందస్తు సందడికి, మీడియానే కారణమా అంటే కానే కాదు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ తమ తత్కాల అవసరాలకు అనుగుణంగా ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని సాధ్యమైనంత కాలం సజీవంగా ఉంచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, రాజకీయ విశ్లేషకులు, ‘యూ-ట్యూబ్’ మేథావులు కర్ర విరక్కుండా, పాము చావకుండా, ముందస్తు ఎన్నికలు వస్తే రానూ వచ్చును  రాక పొతే రాక పోనూ వచ్చును. వస్తే ఏమి జరుగుతుంది, రాక పొతే ఏమవుతుంది? అంటూ, ప్రశ్నలు సమాధాలు తామే వినిపిస్తుంటారు. ఇక సోషల్ మీడియా విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా వినిసొంపు విశ్లేషణలు వెల్లువెత్తుతుంటాయి. ఇప్పుడు తెలంగాణలో అదే కథ నడుస్తోంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు  ఒక సారి ముందస్తు ప్రశ్నే లేదంటారు, మరోమారు వెంటనే ఎన్నికలు జరుతామని కేంద్ర ప్రభుత్వం మాటిస్తే  ఇప్పుడే నిముషంలో అసెంబ్లీని రద్దుచేసి ముందస్తుకు ఎన్నికలకు పోయేందుకు మేము రెడీగా ఉన్నామని అంటారు. అలాగే  ప్రతిపక్ష పార్టీలు ముందస్తుకు   మేము రెడీ అంటాయి.  మళ్ళీ అదే నోటితో ముందస్తు అవసరం లేదంటాయి.   అదలా ఉంటే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలే అస్త్రాలుగా బీజేపీ, తెరాసల మధ్య రాజకీయ  యుద్ధం సాగుతున్న నేపధ్యంలో మరో మారు ముందస్తు  చర్చ జోరందుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు చేయడం, ఉద్యోగ నియామకాల ప్రకటలు, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఇలా ప్రతి మాట, ప్రతి ప్రకటన, సర్కార్ వారి ప్రతి అడుగు  ముందస్తు ఎన్నికల సంకేతమేననే ప్రచారం జరుగుతోంది.  ఇటీవల మునుగోడు ఉపఎన్నికల తర్వాత టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు,పార్టీ నాయకులు, నియోజకవర్గాల్లో ప్రజల మధ్యన ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయిస్తానంటూ చెప్పుకొచ్చారు. నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించనున్నట్లు ప్రకటించారు. దీంతో ముందస్తు ఊహాగానాలు మరింత  ఉపందుకున్నాయి.  అదలా ఉంటే, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ముందస్తుకు కొత్త డైమెన్షన్ ఇచ్చారు. ఇంకో ఏడెనిమిది నెలల్లో  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని అందరూ అనుకుంటున్నారని, కానీ తన దృష్టిలో రాష్ట్రంలో ఏడెనిమిది నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అంటే, అంటే 2023 డిసెంబర్ కు బదులుగా జూన్, జులై నెలల్లో ఎన్నికలు జరుగుతాయని సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఏడెనిమిది నెలల్లోనే ఎన్నికలు వస్తాయంటూ వినోద్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, బీఎస్పీ శ్రేణులకు కేవలం 180 రోజులు మాత్రమే సమయం ఉందని చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోవంక, బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ పార్టీ ముందస్తు ఎన్నికలు కోరుకోవడం లేదని, రాష్ట్రాంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని బీజేపీ కోరుకుంటోందని అన్నారు.  అయితే ఏది జరగాలన్నా ముందు ముఖ్యమంత్రి కేసేఆర్ నిర్ణయం తీసుకుని, అసెంబ్లీ రద్దు చేయాలి, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు అంటే, అప్పడు మళ్ళీ సీన్ మొత్తం మారిపోతుంది.  సో ... ఇప్పడు సాగుతున్న చర్చకు ఒక విధంగా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదని అంటున్నారు. అయితే, ఈ ఊహాగానాలకు   ఇప్పట్లో తెరపడే అవకాశం అయితే కనిపించడం లేదని అంటున్నారు.

వైసీపీపై రెచ్చిపోయిన పాల్ ..టచ్ చేస్తారా? దమ్ముందా?

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ జోకర్ గా కేఏ పాల్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మాటలు, చేష్టలకు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రీజ్ ఉంది. ప్రజాశాంతి పార్టీ అధినేతగా ఆయన ఎన్నికల బరిలో దిగుతారు. ప్రజాదరణ, ఎవరు ఓటేస్తారు? ఎన్ని ఓట్లు వస్తాయన్న అంచనాలతో సంబంధం లేకుండా కోటలు దాటేలా ప్రసంగాలు చేస్తూ తన విజయం ఖాయమని ప్రకటించేస్తారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికనే తీసుకుంటే.. ప్రజలలో కలిసి ఆయన చేసిన డ్యాన్సులు, పోలీంగ్ బూతుల వద్ద పెట్టిన పరుగులు విపరీతంగా వైరల్ అయ్యాయి. అటువంటి పాల్ తాజాగా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్, ఆయన కేబినెట్ లోని మంత్రులను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , మంత్రి  రోజా, మాజీ మంత్రి కొడాలి నానిపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను, శ్రేణులను విస్మయానికి గురి చేస్తున్నాయి. కేఏ పాల్ ఏంటీ.. ఇలా మాట్లాడడం ఏమిటని నివ్వెరపోతున్నాయి. అంతేకాదు.. కేఏ పాల్ వీడియో.. రిపీటెడ్ గా చూస్తుండటంతో ఆ వీడియోకు వ్యూస్ కూడా భారీగా పెరిగాయి.  అలాంటి వేళ.. ఫ్యాన్ పార్టీలో నోరున్న నేతలంతా  ప్రెస్ మీట్ పెట్టి.. కేఏ పాల్‌పై మాటల దాడికి దిగుతారా? అన్న చర్చ అయితే  వైసీపీ నేతల్లో మొదలైంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయనపై దోమ కాదు కదా ఈగ కూడా వాలనివ్వకుండా.. తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు ఎక్సెట్రా ఎక్సె ట్రా వంటి వారు చాలా జాగ్రత్తగా చూసుకున్నారని .. అలాంటి  వారంతా ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగి ప్రెస్‌మీట్ పెట్టి.. తమ మాటల తూటాలు పేలుస్తారా? లేక సైలెన్స్ మెయిన్టైన్ చేస్తారా? అని వైసీపీ శ్రేణులు ఆసక్తిగా, ఆతృతగా చూస్తున్నారు. కానీ మాజీలైన  ఆ మంత్రులందరూ పదవి కోల్పోయిన తరువాత  మీడియా ముఖం చాటేస్తున్న సంగతిని గుర్తు చేసుకుని నిరుత్సాహపడుతున్నారు.   ఇక  మంత్రి ఆర్కే రోజా, అంబటి రాంబాబు  వంటి వారే అయినా స్పందిస్తారా అని ఎదురు చూస్తున్నారు.  ఓ వేళ స్పందించినా..   రోజా మాత్రం తనదైన శైలిలో పంచ్ డైలాగులు గుప్పిస్తారని అంటున్నారు. అయితే తాజా వీడియోలో సీఎం జగన్‌పై కేఏ పాల్ మాట్లాడినట్లు.. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, లేదా జనసేనాని పవన్ కల్యాణ్   మాట్లాడి ఉంటే.. వీరంతా ఇప్పటికే  విమర్శలతో, పరుష పదజాలంతో రెచ్చిపోయేవారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. తాజా వీడియోలో.. కేఏ పాల్.. సీఎం జగన్, మంత్రి   రోజా, మాజీ మంత్రి కొడాలి నానిలపై చేసేన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు గత మూడున్నరేళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం చేయలేదని నెటిజన్లు భలే ఎంజాయ్ చేస్తున్నారు.  జగన్ పార్టీ లో నోరేసుకు పడిపోయే నేతలనే తలదన్నేలా  కేఏ పాల్ తాజా వీడియోలో చెలరేగిపోయారని నెటిజన్లు అంటున్నారు.  ఇప్పుడు   కేఏ పాల్‌కు ఎవరు..  ఏ స్థాయిలో  కౌంటర్ ఇస్తారో వేచి చూడాలని   కామెంట్లు  చేస్తున్నారు.   

తీవ్ర నేరాలకు పాల్పడిన మైనర్లను మేజర్లుగానే పరిగణించాలి.. కేంద్రం ప్రతిపాదన

అత్యాచారాలు, హత్యలు వంటి దారుణ నేరాలకు పాల్పడినప్పుడు నేరస్థులు మైనర్లయినా వారిని మేజర్లుగానే పరిగణనలోనికి తీసుకుని  కఠిన శిక్షలు విధించాల్సిందేనన్న ప్రతిపాదనలు పలు సందర్భాలలో పలువురు ప్రతిపాదనలు చేశారు. అలా చేసిన వారిలో  కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీచ . ఆమె కంటే ముందు ఇదే మంత్రిత్వ శాఖను నిర్వహించిన కృష్ణ తీరథ్ కూడా ఉన్నారు. అయితే బాలల హక్కుల ఉద్యమకారులు ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. దాంతో తీవ్ర నేరాల విషయంలో మైనర్లను మేజర్లుగా పరిగణించి చర్యలు తీసుకోవాలన్న వాదన మరుగున పడిపోయింది. అయితే తాజాగా మరో సారి   మేనకా గాంధీ ఇదే ప్రతిపాదనను మళ్లీ ముందుకు తీసుకు రావటంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రతిపాదనపై చర్చ మొదలైంది.   దారుణ లేదా క్రూరాతి క్రూర నేరాల విషయంలో న్యాయమూర్తులు పెద్దల విషయంలో వ్యవహరించినట్టే మైనర్ల విషయంలోనూ వ్యవహరించే విధంగా చట్టాలను సవరించాలని ఆమె అంటున్నారు. నిర్భయ కేసు విషయంలో పెద్దవారికి ఒక విధంగా, మైనర్ కు మరో విధంగా శిక్ష పడటం అనేది తీర్పునకు ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందని, ఆ తర్వాత మైనర్లు కూడా ఎక్కువగా అత్యాచారాలకు పాల్పడటం ఎక్కువైందని ఆమె చెబుతున్నారు. నిర్భయ కేసులో 18 ఏళ్లు పైబడిన వారికి మరణ శిక్ష విధించగా, వారితో కలిసి అదే  నేరానికి పాల్పడిన ఓ మైనర్ కు మూడేళ్లు మాత్రమే శిక్ష విధించి ఆ తర్వాత విడుదల చేసిన సంగతి విదితమే. అయితే, నిర్భయ తండ్రి  మాయ మాటలు చెప్పి నిర్భయను బస్సులోకి పిలిచింది, ఆమెను  చిత్రహింసలు పెట్టింది ఈ మైనరేనని చెప్పిన సంగతిని  మరిచిపోకూడదు.  ఆమె మరణానికి ప్రధాన కారకుడు అతనేనని కూడా నిర్భయ తండ్రి కేసు విచారణ సందర్భంగా చెప్పారు. అతను మైనర్ కనుక చట్ట ప్రకారం అతని నేరాన్ని రికార్డుల నుంచి పూర్తిగా తొలగించడం సరి కాదన్న అభిప్రాయం నిర్భయ కేసు సందర్భంగా సర్వత్రా వ్యక్తమైంది.  పలువురు న్యాయ నిపుణులు సైతం అప్పట్లో మైనర్ అన్న కారణంగా శిక్ష తగ్గించడాన్ని సమర్ధించలేదు.  కాగా ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లను కూడా మేజర్లుగా పరిగణించాలని పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరిన సంగతి విదితమే.  2015లో జువైనల్ జస్టిస్ యాక్ట్‌కు చేసిన చట్ట సవరణను పోలీసులు ఆ సందర్భంగా ఉదహరించారు. తీవ్ర నేరం చేసే మైనర్లను చట్ట ప్రకారం మేజర్‌గా పరిగణించవచ్చని  వారు అప్పట్లో పేర్కొన్నారు. ఇదలా ఉంటే ఉగ్రవాదులు సైతం చట్టంలోని మైనర్ అన్న లొసుగును ఉపయోగించుకుంటున్నారు. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తోయిబా సంస్థ ఈ అస్త్రాన్ని ఆధారం చేసుకుని మైనర్లకు ఉగ్రశిక్షణ ఇచ్చి సరిహద్దు దాటిస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయని మిలిటరీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి వారు  భద్రతా సిబ్బందికి పట్టుబడిన సందర్బంలో  మైనర్లు కనుక శిక్ష లేకుండా తప్పించుకునే అవకాశాలుంటాయని ఉగ్ర సంస్థలు ఈ దారిని ఎన్నుకున్నాయని అంటున్నారు. అందుకే మైనర్లు తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు వారిని మేజర్లుగానే పరిగణించి శిక్షలు విధించాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది.  అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలలో తీవ్ర నేరాలకు పాల్పడిన వారు మైనర్లైనా, మేజర్లైనా ఒకే విధమైన శిక్షలు విధిస్తున్నారు. అయితే ప్రపంచంలో ఎక్కువ దేశాలు మాత్రం మైనర్లకు చట్ట ప్రకారం వెసులుబాటు ఇస్తున్నారు. అయితే దేశంలో హింసాప్రవృత్తి పెచ్చుమీరుతున్న నేపథ్యంలో తీవ్ర నేరాలకు పాల్పడిన మైనర్ల విషయంలో ఉదారత కూడదన్న వాదనకు బలం పెరుగుతోంది. కేంద్రం కూడా తీవ్ర నేరాల విషయంలో మైనర్లను కూడా మేజర్లుగానే పరిగణించాలన్న యోచనలో ఉందని కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి.

మహిళల పట్ల రామ్ దేవ్ బాబా అనుచిత వ్యాఖ్యలు

పురుషాధిక్య సమాజంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా.. మహిళలపై అఘాయిత్యాల సంఖ్య ఇంతింతై అన్నట్లుగా పెరిగిపోతోంది. అన్నిటికంటే బాధాకరమైన విషయమేమిటంటే మహిళల పట్ల చులకన భావంతో వ్యాఖ్యలు చేసే వారిలో ప్రసిద్ధులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఏకంగా మంత్రులు కూడా ఉండటం. ఏపీలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. అలాగే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో బాగోతమూ తెలిసిందే. తమిళనాడు విద్యాశాఖ మంత్రి కూడా ఇటీవల ఒక సందర్భంగా తమ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై చులకన భావంతో వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు. అయితే కాషాయ బట్టలు వేసుకుని ఆధ్మాత్మిక బోధలు చేస్తూ, యోగాతో జీవన శైలిని మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఉద్బోధనలు చేసే యోగాగురు రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం చీదరించుకునేలా ఉంది.  ఇలా సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వారే మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రామ్ దేవ్ బాబా  పతంజలి యోగా పీఠ్ ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం థానేలోని హాయ్ల్యాండ్ ప్రాంతంలో యోగా సైన్స్ క్యాంపు మహిళల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ కార్యక్రమంలో మాట్లాడిన రామ్ దేవ్ బాబా మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళలు చీరలోనూ, సల్వార్ కమీజ్ సూట్లోనూ అందంగా ఉంటారు అని.. అక్కడితో ఊరుకోకుండా వారు దుస్తులు ధరించకున్నా అందంగానే ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే వంటి వారు కూడా ఉన్నారు.  రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన బాబా రామ్ దేవ్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అన్నివర్గాల నుంచీ వస్తోంది. ఆధ్యాత్మికత ముసుగులో వ్యాపార సామ్రాజ్యాన్నినిర్మించుకున్న బాబారామ్ దేవ్ కాషాయ వస్త్రధారణ మాటున తన పురుషాధిక్య వికృత స్వరూపాన్ని చూపారని విమర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో బాబారామ్ దేవ్ ను నెటిజనులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఉచ్ఛనీచాలు లేకుండా అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడిన రామ్ దేవ్ ను కఠినంగా శిక్షించాలని, ఆయన పతంజలి గ్రూప్ ఉత్పత్తులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎవరిని మార్చినా నో ఛేంజ్.. సెకండ్ ఛాన్స్ కు ..నో ఛాన్స్ ...

తత్త్వం బోధ పడింది. విషయం అర్థమైంది. సెకండ్ ఛాన్స్ కు నో ఛాన్స్ అనే నిజం కొంచం ఆలస్యంగానే అయినా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. నిజానికి, జగన్మోహన్ రెడ్డికి తత్త్వం బోధపడేందుకు కొంత సమయం పట్టింది కానీ  పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు  ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజాగ్రహం ఏ స్థాయిలో వుందో, ముందుగానే గ్రహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ‘మీటల’ మీద ఆశలు పెంచుకుని తమకు ఇక తిరుగులేదని ధీమా వ్యక్తం చేసినా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మాత్రం ఆయన లెక్కలు సీరియస్ గా తీసుకోలేదు. అందుకే, గడపగడపకు కదలండి అంటూ ముఖ్యమంత్రి పదేపదే ముళ్ళ కర్రతో పొడిచినా, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు అంతగా కదలలేదు. అందుకే చాలా వరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పదవిలో ఉన్నంత వరకు వుందాం,అందినంత వరకు వెనకేసుకుందాం ఆ తర్వాత రాజెవరో .. రెడ్డెవరో అనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే, గడప గడపకు వెళ్ళని వారికి మళ్ళీ టికెట్ ఉండదని ముఖ్యమంత్రి హెచ్చరించినా ఎమ్మెల్యేలు ఇచ్చినా పుచ్చుకునేది లేదులే అని మనసులోనే అనుకుంటున్నారో  ఏమో కానీ ఎవరిదారిన వారు దీపం ఉండగానే, ఇల్లు  చక్క పెట్టుకునే పనిలో పడిపోయారని, పార్టీ నాయకులు గుసగుసలు పోతున్నారు.   ఎప్పుడైతే, ఎమ్మెల్యేలలో ఈ విధమైన నిర్లిప్తత బయటకు పొక్కడం మొదలైందో, ఎప్పుడైతే గడప గడపలో  చిత్కారాలు,చేదు అనుభవాలు ఎదురయ్యాయో అప్పుడే జగన్ రెడ్డికి తత్త్వం బోధపడడం మొదలైంది. అదే సమయంలో,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  బృందంతో పాటుగా ఇతర సర్వే సంస్థలతో చేయించిన సర్వేలు నో సెకండ్ ఛాన్స్   అని స్పష్టం చేశాయి, ఇక అక్కడి నుంచి జగన్ రెడ్డిలో కలవరపాటు మొదలైందని, అందుకే ఆయన, నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారని అంటున్నారు.  అయితే, రోగం ఒకటైతే మందు మరొకటి ఇస్తే ప్రయోజనం ఉందని  అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు, ఎక్కడో పారేసుకుని ఇంకెక్కడో వెతుక్కున్నట్లు ఉందని అంటున్నారు. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇటీవల పార్టీలో మార్పులు, చేర్పులు చేపట్టారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా, ప్రాంతీయ సమన్వయ కర్తలను మార్చారు. అయితే ఈ మార్పులు, చేర్పుల తతంగాన్ని, సూక్ష్మంగా పరిశీలిస్తే, ఇవ్వన్నీ అలంకార ప్రాయమైన ( కాస్మెటిక్) మార్పులే తప్ప ప్రయోజనం చేకూర్చే మార్పులు కాదని పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి డామినేషన్ ఇమేజ్ ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా  చేసిన మార్పులు చేర్పులు, బూమరాంగ్ అయ్యే ప్రమాదముందని అంటున్నారు. బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన కొద్ది మంది నాయకులకు పదవులు ఇచ్చినా, పక్కలో బల్లెంలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని జోడించడంతో పెద్దగా ప్రయోజానం ఉండదని అంటున్నారు. పేరుకు ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించినా. పెత్తనం మాత్రం, రెడ్డి సామాజిక వర్గ చేతిలోనే ఉంటుందని, ఇది  అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకూ నాకించినట్టు ఉందని అంటున్నారు. ఉదాహరణకు, బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్ర బోసుకు కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల సమన్వయ కర్త బాధ్యతలు అప్పగించారు. అయితే, మిధున్ రెడ్డిని కూడా జత చేశారు. అలాగే, గుంటూరు, ఎన్టీఅర్ కృష్ణా జిల్లా బాధ్యతలను కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు అప్పగించారు, ఆయన నెత్తిన ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితునిగా పేరున్న ఆళ్ళ అయోధ్య రామి రెడ్డిని కూర్చో పెట్టారు. అంటే పార్టీలో చేసిన మార్పులు చేర్పులు మసిపూసి మారేడుకాయ చేసేందుకు చేసే ప్రయత్నమే తప్ప  మరొకటి కాదని అంటున్నారు.   నిజానికి వైసీపీలో మార వలసింది, మార్పు రావాల్సింది ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలోనే కానీ, మరెవరిలోనో కాదని పరిశీలకులు పేర్కొంటున్నారు. వైసీపీ పతనానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి అహంకార పూరిత ధోరణి, ఆనాలోచిత నిర్ణయాలు కారణం. అయితే, ఆయన  మాత్రం అందరిలో లోపాలు చూస్తున్నారే కానీ, అద్దంలో తనను తను మాత్రం చూసుకోవడం లేదు. అలాగే, సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి ఆశలు పెంచుకున్నా, వాస్తవంలో సంక్షేమ పధకాల ప్రయోజనాలు పొందుతున్న వారిలో ఒక విధమైన అసంతృప్తి ఉంటే, పథకాలు అందని వారిలో మరోరకం అసంతృప్తి ఉందని అంటున్నారు. అతేకాకుండా సంక్షేమ పథకాలు అందుతున్నది మూడింట ఒక వంతు మందికి మాత్రమే అని ఈ లెక్కన చూస్తే, ముఖ్యమంత్రి లెక్క తప్పిందని తేలుతోందని, గడపగడపలో నిరసనకు ఇదే కారణమని అంటున్నారు. అందుకే, ముఖ్యమంత్రి ఎన్ని మార్పులు చేర్పులు చేసినా, సెకండ్ ఛాన్స్’కు నో ఛాన్స్ .. చాన్సే లేదని అంటున్నారు.