ఎవరిని మార్చినా నో ఛేంజ్.. సెకండ్ ఛాన్స్ కు ..నో ఛాన్స్ ...
తత్త్వం బోధ పడింది. విషయం అర్థమైంది. సెకండ్ ఛాన్స్ కు నో ఛాన్స్ అనే నిజం కొంచం ఆలస్యంగానే అయినా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. నిజానికి, జగన్మోహన్ రెడ్డికి తత్త్వం బోధపడేందుకు కొంత సమయం పట్టింది కానీ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజాగ్రహం ఏ స్థాయిలో వుందో, ముందుగానే గ్రహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ‘మీటల’ మీద ఆశలు పెంచుకుని తమకు ఇక తిరుగులేదని ధీమా వ్యక్తం చేసినా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మాత్రం ఆయన లెక్కలు సీరియస్ గా తీసుకోలేదు. అందుకే, గడపగడపకు కదలండి అంటూ ముఖ్యమంత్రి పదేపదే ముళ్ళ కర్రతో పొడిచినా, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు అంతగా కదలలేదు. అందుకే చాలా వరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పదవిలో ఉన్నంత వరకు వుందాం,అందినంత వరకు వెనకేసుకుందాం ఆ తర్వాత రాజెవరో .. రెడ్డెవరో అనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే, గడప గడపకు వెళ్ళని వారికి మళ్ళీ టికెట్ ఉండదని ముఖ్యమంత్రి హెచ్చరించినా ఎమ్మెల్యేలు ఇచ్చినా పుచ్చుకునేది లేదులే అని మనసులోనే అనుకుంటున్నారో ఏమో కానీ ఎవరిదారిన వారు దీపం ఉండగానే, ఇల్లు చక్క పెట్టుకునే పనిలో పడిపోయారని, పార్టీ నాయకులు గుసగుసలు పోతున్నారు.
ఎప్పుడైతే, ఎమ్మెల్యేలలో ఈ విధమైన నిర్లిప్తత బయటకు పొక్కడం మొదలైందో, ఎప్పుడైతే గడప గడపలో చిత్కారాలు,చేదు అనుభవాలు ఎదురయ్యాయో అప్పుడే జగన్ రెడ్డికి తత్త్వం బోధపడడం మొదలైంది. అదే సమయంలో,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంతో పాటుగా ఇతర సర్వే సంస్థలతో చేయించిన సర్వేలు నో సెకండ్ ఛాన్స్ అని స్పష్టం చేశాయి, ఇక అక్కడి నుంచి జగన్ రెడ్డిలో కలవరపాటు మొదలైందని, అందుకే ఆయన, నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారని అంటున్నారు.
అయితే, రోగం ఒకటైతే మందు మరొకటి ఇస్తే ప్రయోజనం ఉందని అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు, ఎక్కడో పారేసుకుని ఇంకెక్కడో వెతుక్కున్నట్లు ఉందని అంటున్నారు. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇటీవల పార్టీలో మార్పులు, చేర్పులు చేపట్టారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా, ప్రాంతీయ సమన్వయ కర్తలను మార్చారు. అయితే ఈ మార్పులు, చేర్పుల తతంగాన్ని, సూక్ష్మంగా పరిశీలిస్తే, ఇవ్వన్నీ అలంకార ప్రాయమైన ( కాస్మెటిక్) మార్పులే తప్ప ప్రయోజనం చేకూర్చే మార్పులు కాదని పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి డామినేషన్ ఇమేజ్ ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా చేసిన మార్పులు చేర్పులు, బూమరాంగ్ అయ్యే ప్రమాదముందని అంటున్నారు. బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన కొద్ది మంది నాయకులకు పదవులు ఇచ్చినా, పక్కలో బల్లెంలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని జోడించడంతో పెద్దగా ప్రయోజానం ఉండదని అంటున్నారు.
పేరుకు ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించినా. పెత్తనం మాత్రం, రెడ్డి సామాజిక వర్గ చేతిలోనే ఉంటుందని, ఇది అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకూ నాకించినట్టు ఉందని అంటున్నారు. ఉదాహరణకు, బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్ర బోసుకు కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల సమన్వయ కర్త బాధ్యతలు అప్పగించారు. అయితే, మిధున్ రెడ్డిని కూడా జత చేశారు. అలాగే, గుంటూరు, ఎన్టీఅర్ కృష్ణా జిల్లా బాధ్యతలను కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు అప్పగించారు, ఆయన నెత్తిన ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితునిగా పేరున్న ఆళ్ళ అయోధ్య రామి రెడ్డిని కూర్చో పెట్టారు. అంటే పార్టీలో చేసిన మార్పులు చేర్పులు మసిపూసి మారేడుకాయ చేసేందుకు చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని అంటున్నారు.
నిజానికి వైసీపీలో మార వలసింది, మార్పు రావాల్సింది ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలోనే కానీ, మరెవరిలోనో కాదని పరిశీలకులు పేర్కొంటున్నారు. వైసీపీ పతనానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి అహంకార పూరిత ధోరణి, ఆనాలోచిత నిర్ణయాలు కారణం. అయితే, ఆయన మాత్రం అందరిలో లోపాలు చూస్తున్నారే కానీ, అద్దంలో తనను తను మాత్రం చూసుకోవడం లేదు.
అలాగే, సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి ఆశలు పెంచుకున్నా, వాస్తవంలో సంక్షేమ పధకాల ప్రయోజనాలు పొందుతున్న వారిలో ఒక విధమైన అసంతృప్తి ఉంటే, పథకాలు అందని వారిలో మరోరకం అసంతృప్తి ఉందని అంటున్నారు. అతేకాకుండా సంక్షేమ పథకాలు అందుతున్నది మూడింట ఒక వంతు మందికి మాత్రమే అని ఈ లెక్కన చూస్తే, ముఖ్యమంత్రి లెక్క తప్పిందని తేలుతోందని, గడపగడపలో నిరసనకు ఇదే కారణమని అంటున్నారు. అందుకే, ముఖ్యమంత్రి ఎన్ని మార్పులు చేర్పులు చేసినా, సెకండ్ ఛాన్స్’కు నో ఛాన్స్ .. చాన్సే లేదని అంటున్నారు.