కేంద్రం, రాష్ట్రాల మధ్య నిథుల ‘పంచాయతీ’

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ నిధుల విషయంలో పరస్పరం ఎంత దుమ్మెత్తి పోసుకున్నా, ఎన్ని విమర్శలు చేసుకున్నా.. వాస్తవమేమిటంటే.. గ్రామ పంచాయతీలకు నిధులు అందడం లేదన్నది మాత్రమే. గ్రామాల అభివృద్ధికి కానీ, గ్రామాలలో సంక్షేమ పథకాలకు కానీ పైసా  నిధులు కూడా లేవు.

అమలు జరిగిన, జరుగుతున్న కార్యక్రమాలకు నిధులు అందక సర్పంచ్ లు అడకత్తెరలో పోక చెక్క మాదిరి నలిగిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గ్రామాల అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శమని సొంత భుజాలు చరుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగని విధంగా తెలంగాణలో గ్రామాభ్యుదయం వికసించిందని చెప్పుకుంటున్నారు.  అయితే గ్రామ పంచాయతీలకు నిధుల మంజూరు విషయంలో మాత్రం కేంద్రంపై నెపం తోసేసి చేతలు దులిపేసుకుంటోది. అదే సమయంలో  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తోంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నిందారోపణలో పబ్బం గడిపేసుకుంటూ.. గ్రామాలకు నిధుల మంజూరు విషయాన్ని విస్మరిస్తున్నాయి.  రాష్ట్రంలో గ్రామాలు దేశంలో మరెక్కడా లేనివిధంగా అభివృద్ధి చెందు తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గొప్పగా చెప్పుకుంటున్నా వాస్తవంలో మాత్రం నిధుల కొరతతో గ్రామ పంచాయతీలు నానా అవస్థలూ పడుతున్నాయి.  

నిధుల కొరత కారణంగా తాము నానా అవస్థలూ పడుతున్నామంటూ గత కొన్ని నెలలుగా  సర్పంచులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాము కూడా చివరికి వ్యవసాయ కార్మికులుగా, కాపలా దార్లుగా పని చేయాల్సి వస్తోందని, ప్రాణాలు తీసుకోవడం కూడా జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను కాంట్రాక్టర్లకు చెల్లించడానికి రుణాలు తీసుకోవాల్సి వస్తోందని  చెబుతున్నారు. తమ దగ్గర నిధులు లేకపోయినా, అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో తమపై విపరీతంగా ఒత్తిడి పెరుగుతోందని  వారు వాపోతున్నారు. చాలా నెలలుగా తమకు నిధులు విడుదల కావడం లేదంటూ   గగ్గోలు పెడుతున్నారు.

ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేదు. ఏ సర్పంచ్ ఏ పార్టీకి చెందినవారైనా నిధుల కొరత మాత్రం అందరికీ సమానంగానే ఉంటోంది. అత్యధిక శాతం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు బాకీ పడిందని వారు చెబుతున్నారు.  గ్రామ పంచాయతీలు నిధులు కేటాయించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై  విమర్శలు, అలాగే కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆరోపణలు, నిరసనలతో బీజేపీ హోరెత్తిస్తుంటే.. కాంగ్రెస్ కూడా పంచాయతీలకు నిధుల విషయంలో కేసీఆర్ సర్కార్ నే నిందిస్తోంది.  అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు సరిగా నిధులు రావడం లేదని, కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, నిధుల్లో కోత విధించడం, నిధుల మంజూరులో ఆలస్యం చేయడం, విధులు ఆపేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పరస్పరారోపణల మధ్య అసలు వాస్తవం మరుగున పడిపోతోంది.  వాస్తవం ఏమిటంటే కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయడం రాష్ట్రాల హక్కులను హరించడమేనని కేసీఆర్ అంటున్నారు.

నిజమే.. కానీ కేంద్రం విడుదల చేశాం కానీ, రాష్టం దారి మళ్లించిందంటోది.  రాష్టరమేమో కేంద్రం నుంచి నిధులే రాలేదంటోంది. ఇప్పటికైనా పరస్పర నిందారోపణలను పక్కన పెట్టి వాస్తవమేమిటన్నది వెల్లడించి పంచాయతీలకు నిధుల కొరత పరిష్కరించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. 

Teluguone gnews banner