ఎమ్మెల్యేగా ఓటమి దిశగా కేసీఆర్.. 40 ఏళ్ళ తర్వాత మొదటి షాక్!

కేసీఆర్ వరుసగా మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ ఎంతో నమ్మకంగా ఉంది. అయితే మూడోసారి సీఎం అవ్వడమేమో కానీ, పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్క చోట ఎమ్మెల్యేగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేశారు. దీంతో గజ్వేల్ లో ఓటమి భయంతోనే గులాబీ బాస్ కామారెడ్డి బరిలో నిలిచారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కామారెడ్డిలో కేసీఆర్ ఖంగుతినే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు మొదలయ్యాక ప్రస్తుత ట్రెండ్ ని గమనిస్తే నిజంగానే కామారెడ్డిలో కేసీఆర్ కి షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తోంది. కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి ఆధిక్యత ప్రదర్శించగా, ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలయ్యాక కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి లీడ్ లోకి వచ్చారు. ఇదే ట్రెండ్ కొనసాగితే కామారెడ్డిలో కేసీఆర్ కి ఓటమి తప్పదు. ఒకవేళ కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతే, 40 ఏళ్ళ తర్వాత ఇది ఆయనకు ఎమ్మెల్యేగా మొదటి ఓటమి అవుతుంది. మొదటిసారి 1983 లో సిద్ధిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బీఆర్ఎస్ అధినేత.. ఆ తర్వాత సాధారణ, ఉప ఎన్నికలు కలిపి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా ప్రతిసారి జయకేతనం ఎగురవేశారు. అలాంటి కేసీఆర్ 40 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేగా ఓటమిని చూడబోతున్నారు అనిపిస్తోంది.

ప్రజా తీర్పునకు కౌంట్ డౌన్ షురూ

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కౌంటింగ్ కౌన్ డౌన్ స్టార్ట్ అయింది. ఎన్నెన్నో ప్రశ్నలు.. ప్రతి ఒక్కరి మదిలో ఎంతో ఉత్కంఠ. అన్నిటికీ సమాధానం మరికొద్ది సేపట్లో. మరికొద్ది గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. క్రమక్రమంగా ఉత్కంఠకూ తెరపడనుంది. నెల రోజులుగా ఉత్కంఠ రేపిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా, విన్నా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ మొదలైంది.  ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపు.. ఆ తరువాత ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది. ఈసారి 80 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు కూడా ఇంటి నుంచి ఓటేసే అవకాశం కల్పించడంతో.. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించి ఐదంచెల భద్రత ఏర్పాట్లు చేసారు.. కిలోమీటరు దూరంలోనే ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాగా, భద్రాచలం , అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండడంతో వీటిలో ఏదో ఒక స్థానం ఫలితం తొలుత వెలువడవచ్చని అంచనా. చార్మినార్లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉన్నందున మిగిలిన రెండింటి కంటే దాని ఫలితమే మొదట తెలుస్తుందని భావిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం తేలే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలయ్యే సరికి ఎన్నికల ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉందని రాష్ట్ర ఈసీ కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు.  కౌంటింగ్‌కు సంబంధించి.. ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం యంత్రం పనిచేయకపోతే.. వీవీప్యాట్‌ డబ్బాలోని చీటీలను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని ఈవీఎంలన్నీ సవ్యంగా పనిచేస్తే.. మరో రకంగా వీవీప్యాట్‌ చీటీలను లెక్కిస్తారు. ఏవైనా ఐదు పోలింగ్‌ కేంద్రాల వీవీప్యాట్ల డబ్బాలను తీసుకుని, ఆయా కేంద్రాల్లో ఈవీఎంల ఫలితాన్ని సరిపోల్చుతారు. పోస్టల్ బ్యాలెట్స్ కోసం ప్రత్యేక టేబుల్స్ ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ 500ఓట్లకు ఒక టేబుల్ ఉంటుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ లో ఒక్కో టేబుల్ కు 6గురు అధికారులు ఉంటారు. ఒకరు మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు ఇద్దరితో మొత్తం ఒక్కో టేబుల్‌కు ఆరుగురు ఉంటారు. ప్రతీ ఈవీఎంను మూడు సార్లు లెక్కింపు ఉంటుంది కాబట్టి ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని సీఈఓ వికాస్ రాజ్ తెలియజేశారు. ఇక కౌంటింగ్ సమయాల్లో రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించినట్లు తెలిపింది. కాగా, తెలంగాణలో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారా లేక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా? క్లియర్ మెజార్టీ వస్తుందా? హంగ్ వస్తుందా? హంగ్ వస్తే, ఏ ప్రభుత్వం అధికారం చేపడుతుంది? ఇలా ఇవాళ్టి ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తి ఉంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. శనివారం హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచే అభ్యర్థులను చేజారనివ్వకుండా చూసే పనిలో ఉన్నారు. అటు రాహుల్ గాంధీ సైతం.. కౌంటింగ్ కేంద్రాల దగ్గరే అభ్యర్థులు ఉండాలని కండీషన్ పెట్టారు. ఫలితాలు కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంటే.. హైదరాబాద్ లోనే క్యాంప్ ఉంటుందనీ, అదే ఫలితాలు బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉంటే.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలిస్తారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్.. తమ పార్టీ అభ్యర్థులకు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల కాంగ్రెస్ లో ఆదివారం జరిగే క్యాంప్ పాలిటిక్స్ ఆసక్తి రేపనున్నాయి.

టాలీవుడ్ లో టెన్షన్.. కారణమేంటంటే?

ఐదేళ్లకోసారి ఎన్నికలు రావడం, ప్రభుత్వాలు మారడం, ఒక్కోసారి అధికారంలో ఉన్న పార్టీయే మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ టెన్షన్‌ అనేది ఉంటుంది. టాలీవుడ్‌ ప్రముఖుల్లో వివిధ పార్టీలకు చెందినవారు ఉంటారు. అయితే పార్టీలతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమకు చెందిన అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, దానికి అనుకూలంగా ప్రభుత్వం కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ వస్తోంది. అయితే ఒక్కో పార్టీ పాలసీ ఒక్కోలా ఉంటుంది. కొన్ని ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమ గురించిగానీ, అందులోని సమస్యల గురించిగానీ పెద్దగా పట్టించుకోని సందర్భాలు కూడా ఉన్నాయి. రెండు దఫాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్  మాత్రం సినీ పరిశ్రమ విషయంలో సానుకూలంగానే వ్యవహరించింది. ఈ విషయంలో టాలీవుడ్‌ ప్రముఖులు సంతోషంగానే ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా టాలీవుడ్‌లో కొంత టెన్షన్‌ వాతావరణం నెలకొందదని అంటున్నారు. ఇటీవలే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం (డిసెంబర్ 30) కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడతాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని కొందరంటుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ సారి ప్రభుత్వ మార్పు తథ్యమనీ మరి కొందరు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీఆర్ఎస్ పరాజయం పాలై, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే పేర్కొన్నాయి. దీంతో టాలీవుడ్ లో ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  ఎందుకంటే ఇప్పటివరకు కేసీఆర్‌ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ సానుకూలంగానే వ్యవహరించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారితే.. వచ్చే కొత్త సర్కార్   పరిశ్రమ విషయంలో ఎటువంటి వైఖరి అవలంబిస్తుంది అన్నదే ఆ టెన్షన్ కు కారణమంటున్నాయి.  వందల కోట్ల బడ్జెట్‌తో పెద్ద సినిమాలు చేసే నిర్మాతలకి ఎక్స్‌ట్రా షోలు, టికెట్‌ రేట్లను పెంచుకునే వెసులుబాటు కావాలి. ఇలాంటి వాటి వల్లే నిర్మాత పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటివరకు భారీ చిత్రాల నిర్మాతలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేదోడు వాదోడుగానే ఉంది.  ఇప్పుడు అధికారం మారి  కొత్త ప్రభుత్వం వస్తే టాలీవుడ్‌ పరిస్థితి ఏమిటన్నదే టాలీవుడ్ టెన్షన్ కు కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం కాంగ్రెస్‌  అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  అదే జరిగితే కాంగ్రెస్ సర్కార్ టాలీవుడ్‌కి  అనుకూలంగా ఉంటుందా, భారీ చిత్రాల నిర్మాతలకు కావాల్సిన అనుమతుల్ని ఇస్తుందా అన్న సందేహాలు సినీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.   

జగనాసుర పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కోసమే పొత్తు.. వ్యతిరేకించేవారంతా వైసీపీ కోవర్టులే!

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఎంత దృఢంగా ఉందో, ఎంత దృఢంగా ఉండబోతోందో జనసేనాని పవన్ కల్యాణ్ విస్పష్టంగా ఎలాంటి సందేహాలకూ తావులేని విధంగా చెప్పేశారు. ఈ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ పన్నుతున్న కుట్రలను సైతం కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జనసేనలో తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకించే వారంతా వైసీపీ కోవర్టులేనని తేల్చేశారు. అటువంటి వారంతా పార్టీ వీడి వెళ్లి వైసీపీలో చేరిపోవాలని నిర్మొహమాటంగా చెప్పేశారు. జనసేన తెలుగుదేశంతో పొత్తు నిర్ణయాన్ని ఆషామాషీగా తీసుకోలేదని, రాష్ట్ర భవిష్యత్, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే.. ఓ ప్రజాకంటకుడి పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడం కోసమే తెలుగుదేశంతో పొత్తు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  ఈ పొత్తు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాదనీ రాష్ట్ర ప్రగతి, పురోగతి, ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో కలిసి వేళ్లాలని నిర్ణయించాననీ చెప్పారు.  వాస్తవానికి జనసేనాని మొదటి నుంచీ కూడా  స్పష్టతతోనే ఉన్నారు. బీజేపీ కలిసి వస్తుందా రాదా అన్నది పట్టించుకోకుండా.. తాను మాత్రం తెలుగుదేశంతో కలిసే  ఎన్నికలకు వెడతానని  చెబుతూ వస్తున్నారు.  చెప్పినట్లుగానే ఆయన అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో పొత్తు ప్రకటన విషయంలో ఇంకెంత మాత్రం జాప్యం కూడదని నిర్ణయించుకున్న ఆయన రాజమహేంద్రవరంలో చంద్రబాబుతో ములాఖత్ నుంచి బయటకు వచ్చీ రాగానే సెంట్రల్ జైలు ముందే జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికలకు వెడుతుందని ప్రకటించారు.  ఆ తరువాత పరిణామాలు వేగంగా ముందుకు కదిలాయి.   తెలుగుదేశం, జనసేన పార్టీలు సమన్వయ కమిటీలను  ఏర్పాటు చేసుకొని, ఉమ్మడి కార్యాచరణను కూడా రూపొందించుకున్నాయి.  ఉమ్మడి ప్రణాళిక అమలు కూడా మొదలైంది. ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో కూడా వెలువరించాయి. ఇరు పార్టీల నేతలూ  కలిసికట్టుగా ప్రచారం కూడా మొదలు పెట్టారు.  ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించారు. క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల శ్రేణులూ ఉమ్మడిగానే ముందుకు కదులుతున్నాయి. అయితే, అక్కడక్కడా కొందరు జనసేన ద్వితీయ శ్రేణి నేతలు ఈ పొత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేన పార్టీ పెద్దలు ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని పలుమార్లు హెచ్చరించారు. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడిపోయారు. అయితే అలా వెళ్లిపోయిన వారంతా  వైసీపీ కోవర్టులుగానే జనసేనలో చేరారని.. కేవలం జనసేనపై బురద జల్లేందుకే వీరు పార్టీలో ఉంటూ వచ్చారని జనసేన వారిపై ఆరోపణలు చేసింది.  అయితే  ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు విషయంలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశంతో  పొత్తును జనసేనలో ఎవరు వ్యతిరేకించినా వారంతా వైసీపీ కోవర్టులేనని, అటువంటి వారిపై చర్యలు తప్పవనీ, పార్టీ నుంచి బహిష్కరించడానికి కూడా వెనుకాడననీ తేటతెల్లం చేశారు.   మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శుక్రవారం (డిసెంబర్ 1) నిర్వ‌హించిన పార్టీ ఉన్న‌త‌స్థాయి నాయ‌కుల స‌మావేశంలో ఏపీలో తెలుగుదేశం పార్టీతో, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని వైసీపీ నేతలు విమర్శించడంపై పవన్ స్పందించారు.  ఎలాంటి సిద్దాంతాలు లేని పార్టీ వైసీపీకి తనను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజలకు ఏది అవసరమో అది చేస్తానన్నారు. ప్రజల కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామన్నారు. తాను  ఏ పదవులు కోరుకోలేదని.. చేసే పని, పోరాటమే గుర్తింపు ఇస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక,  తెలుగుదేశంతో పొత్తుకు వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకుడు మాట్లాడినా..   కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది విస్పష్ట హెచ్చరిక చేశారు. పోత్తు నిర్ణయం నచ్చనివాళ్లు ఎవరైనా ఉంటే  ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు.  ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికలలో  జనసేన పోటీలో దిగింది. ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ..  జనసేనలో కొందరు  ఉద్దేశపూర్వకంగా ఏపీలో పొత్తుకు, పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో  పవన్ ఈసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.     నిజానికి వైసీపీ ఎప్పటి నుండో  తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తును దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. ముందుగా జనసేనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన  వైసీపీ నేతలు, ఆ తరువాత  ఎమోషనల్ గా పవన్ అభిమానులను రెచ్చగొట్టే  ప్రయత్నం చేశారు. కానీ, ఆ పప్పులు ఉండకలేదు. అలాగే  ఉద్దేశపూర్వకంగా కొందరు వైసీపీ నేతలను కోవర్టులుగా జనసేనలోకి పంపి పార్టీలో అయోమయం సృష్టంచేలా, పార్టీ విధానాలను వ్యతిరేకించే వ్యాఖ్యలు చేయించారు. అందులో భాగంగానే  తెలుగుదేశంతో కలిసే ఎన్నికలకు వెళతాం అన్న పవన్ ప్రకటన తరువాత  కొందరు జనసేనపై విమర్శలు చేసి పార్టీని వీడివెళ్లిపోయారు. మరికొందరిపై జనసేన చర్యలు కూడా తీసుకుంది. వాళ్లంతా వైసీపీ కోవర్టులేనని జనసేన అప్పట్లోనే స్పష్టం చేసింది. అలా పోగా మిగిలిన కొందరు ఇప్పటికీ  అడపాదడపా  పొత్తు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే     పవన్ పొత్తును వ్యతిరేకించే  వారంతా వైసీపీ కోవర్టులేననీ, అటువంటి వారిని ఉపేక్షించననీ తేల్చి చెప్పేశారు.  

రేవంత్ కోసం చంద్రబాబుకి అమిత్ షా ఫోన్?

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూకుడుతో భవిష్యత్ లో  తమకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని..  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ముందే ఊహించారా? ఆ క్రమంలో రేవంత్‌రెడ్డికి బీజేపీ కండువా కప్పే ప్రయత్నాలు జరిగాయా?  అందులో భాగంగా.. రేవంత్‌రెడ్డిని ఒప్పించాలంటూ  తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నాయుడుకు కేంద్ర మంత్రి అమిత్ షా పోన్ చేసి మరీ కోరారా?  అయితే చంద్రబాబు అందుకు నో చెప్పారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. అయితే ఇదంతా  గతంలో జరిగిందని అంటున్నారు.  ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ.. ఈ చర్చ తెలంగాణ సమాజంలో  విస్తృతంగా జరుగుతోంది.   2014లో ఓ వైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాదించగా.. ఆ తర్వాత బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత  సీఎం కేసీఆర్  ఆపరేషన్ ఆకర్ష్‌ అంటూ ఎర్రబెల్లి, తలసాని, కడియం వగైరా వగైరా  నేతలను కారెక్కించేశారు.  కానీ అతికొద్ది మంది మాత్రమే తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారని... వారిలో రేవంత్ రెడ్డి ఒకరు. అయితే ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా  చేశారు. కానీ ఇక్కడే కీలక పరిణామాలు తెరచాటుగా చోటు చేసుకొన్నాయనే ఓ చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది. అదేమంటే.. 2017, అక్టోబర్ 31న.. రేవంత్ రెడ్డి హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించిన రోజు... అయితే అంతకు కొద్దిరోజుల ముందు బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత, సీఎం కేసీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి.. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని... అదే జరిగితే..  భవిష్యత్ లో రేవంత్ వల్ల తమ పార్టీకే కాదు,  బీజేపీకి సైతం   ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయనీ చెప్పారనీ, దానిని నివారించేందుకు రేవంత్ ను బీజేపీలోకి తీసుకోవాలనీ కోరినట్లు చెబుతున్నారు. రేవంత్ బీజేపీలో చేరితే.. తెలంగాణలో కాంగ్రెస్  పుంజుకునే అవకాశాలు లేశమాత్రంగా కూడా ఉండవని చెప్పారని అంటున్నారు.  రేవంత్ రెడ్డి.. చంద్రబాబు మాట తప్ప.. మరోకరి మాట వినే రకం కాదంటూ అమిత్ షాకు కేసీఆర్ గట్టిగా చెప్పినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేసీఆర్ సూచన మేరకు అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసి రేవంత్ బీజేపీలో చేరేలా ఒప్పించాలని కోరారని, అయితే అందుకు చంద్రబాబు నిరాకరించారని చెబుతున్నారు.     అయితే అమిత్ షా అంత చొరవగా చంద్రబాబును  ఎన్డీయే బాగస్వామిగా ఉండటమేనని కూడా అంటున్నారు.  ఆ చొరవతోనే చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్ షా రేవంత్ ను బీజేపీలో చేరేలా ఒప్పించాల్సింగా కోరారు. అందుకు చంద్రబాబు రేవంత్ తమ పార్టీకి రాజీనామా చేశారనీ, ఆయనతో తాను ఎలా మాట్లాడి ఒప్పించగలననీ చెప్పినా, అమిత్ షా అందుకు అమిత్ షాకు టీడీపీ జాతీయ అధినేత బదులిస్తూ.. కొద్ది రోజుల క్రితమే ఆయన తమ పార్టీకి రాజీనామా చేశారని... అలాంటి వేళ రేవంత్ రెడ్డితో మాట్లాడి నేనెలా ఒప్పించగలనంటూ.. చెప్పినా అమిత్ షా మాత్రం రేవంత్ రెడ్డికి మీరంటే ఆరాధన, మీకు చెప్పే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అలాంటిది మీరు చెబితే తప్పకుండా వింటారంటూ ఒత్తిడి చేసినట్లు అప్పట్లో గట్టిగా వినిపించింది.  అంతే కాకుండా ప్రధాని మోదీ సైతం రేవంత్‌రెడ్డి బీజేపీ గూటికి రావాలని కోరుకుంటున్నారనీ, అందుకు మీరు సాయం చేస్తే ఆయన సంతోషిస్తారనీ కూడా అమిత్ బాబుపై ఒత్తిడి తెచ్చినట్లు చెబుతారు. అయితే చంద్రబాబు మాత్రం సున్నితంగానే అయినా చాలా స్పష్టంగా రేవంత్ మా పార్టీ వీడారు... అదీకాక రేవంత్ రెడ్డి రాజకీయ  భవిష్యత్ ఆయనే నిర్ణయించుకుంటారనీ తాను  ఒత్తిడి చేయలేనని చెప్పినట్లు అప్పట్లో చర్చ జరిగింది.   ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల మరో సారి సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి.   ఆదివారం (డిసెంబర్ 3) ఫలితాలు వెలువడనున్నాయి.  ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈ సారి కాంగ్రెస్ విజయం తథ్యమని చెబుతున్నాయి.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యం వల్లే  ఇది సాధ్యమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ తరుణంలో  దాదాపు ఆరేళ్ల కిందట గులాబీ బాస్ కేసీఆర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. రేవంత్ విషయంలో వేసిన ఆంచనాలు ఏ మాత్రం తూ చా తప్పకుండా జరిగుతున్నదనే విషయం సుస్పష్టమవుతోందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అదీకాక.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, అలాగే బీజేపీ ఎంపీ దర్మపూరి అర్వింద్‌లు వేర్వేరు సభల్లో తమ ప్రధాన ప్రత్యర్థి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రమే అని ప్రకటించడమే ఇందుకు నిదర్శమని పరిశీలకులు చెబుతున్నారు. ఇక కల్వకుంట్ల కవిత, దర్మపూరి అర్వింద్ ఇద్దరు నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయగా.. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారని... కానీ వీరిద్దరూ ఇప్పుడు ఒకే గూటి పక్షుల్లాగా ఒకే మాట పలుకుతుండడం కోసమెరుపు.

బీఆర్ఎస్ ఓటమిని హరీష్ రావు అంగీకరించేశారా?

తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్.. రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్   కాంగ్రెస్ పార్టీ  అధికారం చేపట్టడం ఖాయమని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాట్ పోల్స్ మాకే ముచ్చటగా మూడో సారి అధకారాన్ని కట్టబెడతాయని  ఘంటా పథంగా చెబుతున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే మీడియా ముందకు వచ్చిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పోలింగ్ ముగిసిన మరుసటి రోజు పార్టీ నేతలతో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్  హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న ధీమానే వ్యక్తం చేశారు.  కేసీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రమాణ స్వీకారం ఎక్కడో, సంతకం పెట్టాల్సిన తొలి ఫైల్ ఏదో కూడా చర్చించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. అంతే కాకుండా.. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసేశారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పార్టీ శ్రేణుల్లో ఆ ధీమా కనిపించడం లేదు. అటు వైపు కాంగ్రెస్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేయడమే కాకుండా, పార్టీ నుంచి గెలిచిన వారెవరినీ ప్రత్యర్థి పార్టీలు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఇవ్వకుండా కర్నాటక తరలించేందుకు ప్రణాళికలు కూడా రచిస్తోంది. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి, పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన తన్నీరు హరీష్ రావు పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నది. అయితే ఆ వీడియో ఎప్పటిది.. అన్న స్పష్టత అయితే లేదు.  ఆ వీడియోలో  హరీష్ రావు బీఆర్ఎస్ పరాజయం పాలైనా ప్రజలలోనే ఉంటాం, ప్రజల కోసమే పని చేస్తుందనీ చెప్పారు. అంతే కాకుండా ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. ఇదే ఆ వీడియో నిజమేనా, నిజమే అయితే  ఆయన ఎప్పుడు మాట్లాడారు? ఏ సందర్భంగా మాట్లాడారు అన్న అనుమానాలకు తావిస్తున్నది. ఎందుకంటే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొత్తం కేసీఆర్ తన భుజస్కంధాలపై వేసుకుని రోజుకు దాదాపు మూడు నాలుగు సభలలో ప్రసంగించారు. ఒక వేళ పార్టీ ఓటమికి బాధ్యత వహించాల్సి వస్తే పార్టీ అధినేతగా, ప్రచార సారథిగా కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేదా పార్టీ సమష్టి బాధ్యతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా హరీష్ రావు ఓటమి బాధ్యత పూర్తిగా తనదేనని చెప్పడం విస్తుగొలుపుతోంది. అన్నిటికీ మించి  ఈ వీడియోలో మెదక్ ఎంపీ, ప్రస్తుతం దుబ్బాక నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. మొత్తం మీద సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతన్న ఈ వీడియో వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఓటమిపై హరీష్ రావు వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. 

ఆశలన్నీ వాలంటీర్లపైనే.. మరి ఆ వ్యవస్థే రద్దయితే?

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వాలంటీర్ ఉద్యోగాలను   పారదర్శకత అనేదే  లేకుండా సొంత పార్టీ కార్యకర్తలతొ  నింపేశారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలే పలు సభల్లో ప్రజల సాక్షిగా చెప్పుకొచ్చారు. వాలంటీర్లలో 90 శాతం పైగా వైసీపీ వాళ్లే ఉన్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఓ సందర్భంలో  బాహాటంగానే చెప్పేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలను కొట్టి పారేయడానికి వీలులేని పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం తమ పార్టీ కరపత్రంలా వాడుకుంటుందన్నది అక్షర సత్యం. వీరంతా పార్టీ కార్యకర్తలే కాగా.. జగన్  చేత జగన్ కొరకు జగనే నియమించుకున్న వారే.  ప్రజలకు సంబంధించి సకల వివరాలు వీరి వద్ద ఉన్నాయి. వాటి ఆధారంగా వైసీపీ పార్టీకి మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ మధ్య కాలంలో తమకు అనుకూలంగా లేని ఓట్లను  రకరకాల కారణాలతో ఫామ్ 7 ద్వారా వలంటీర్ల ద్వారా   తొలగింపచేయడం  ద్వారా  వైసీపీ  ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.  కాగా, ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మాజీ క‌మిష‌న‌ర్ నిమ్మ‌గడ్డ ర‌మేష్‌బాబు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ప్ర‌భుత్వ జీతంతో పనిచేస్తూ.. ప్రభుత్వానికి చెందిన వారైన వాలంటీర్లు వైసీపీ పార్టీ  ప‌నులు చేస్తున్నార‌ని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఓట‌ర్ల జాబితా తయారీలో కూడా ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటున్నార‌ని, ఇది వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని ఆయ‌న సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు వ‌చ్చే నెల‌కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే అసలు వాలంటీర్ల వ్యవస్థ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పనుంది?  అసలు ఎన్నికల సమయానికి వాలంటీర్లు ఉంటారా?  కోర్టు ఆ వ్యవస్థను రద్దు చేస్తుందా? తాత్కాలికంగా వాలంటీర్లను ప్రభుత్వ వ్యవహారాల నుండి దూరం పెడుతుందా అనే చర్చ జరుగుతున్నది. అయితే  దాదాపుగా ఎన్నికల సమయానికి పూర్తిగా లేదా తాత్కాలికంగా వలంటర్ల వ్యవస్థ   సస్పెండ్ అయ్యే అవకాశాలే ఉన్నాయని న్యాయ‌నిపుణులుఅభిప్రాయపడుతున్నారు. అయితే, ఎన్నికల సమయానికి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసినా, లేదా తాత్కాలికంగా సస్పెండ్ చేసినా వైసీపీకి అది గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. ఎందుకంటే  వైసీపీ వాలంటీర్ల మీదనే  ఎన్నికల బరిలో నిలిచి గెలవడానికి పూర్తిగా ఆధారపడింది. నిత్యం ప్రజలతో సంబంధం ఉండే వాలంటీర్లు చెప్తే ప్రజలు వింటారని భావిస్తుంది. మాట వినని వారిని బెదిరించైనా అనుకూలంగా మార్చే సత్తా వాలంటీర్లకు ఉందని వైసీపీ నమ్ముతున్నది. ప్రభుత్వంపై అసంతృప్తితో ప్రస్తుతం వైసీపీ క్యాడర్ పార్టీ కార్యక్రమాలలో  ఏమంత ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ద్వితీయ శ్రేణి నేతలలో కూడా జోష్ కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా అట్టర్ ప్లాప్ అయిపోతున్నది. వైసీపీ నేతలు ప్రజల మధ్యకి వెళ్లినా కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. ప్రజలు మొహం చాటేస్తున్నారు. ఈ పరిస్థితులలో వాలంటీర్లే వైసీపీ నేతలకు ఫ్లెక్సీలు కట్టి స్వాగతం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. వాలంటీర్లు చేస్తున్నది కూడా అదే. అందుకే  ఎన్నికల సమయంలో  ఓటర్ మేనేజ్మెంట్ బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించాలని వైసీపీ డిసైడ్ అయిపోయింది. ఈ తరుణంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు సుప్రీం తీర్పుపై ఆధారపడి ఉంది. ఒక వేళ సుప్రీం వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తీర్పు వెలువరిస్తే.. వైసీపీ ఆశలన్నీ గంగలో కలవడం ఖాయం. అయితే జగన్ సర్కార్ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకు ఏవైనా న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలా అన్న విషయాన్ని పరిగణనలోనికి తీసుకునే  ప్రతి 50 ఇళ్లకు ఒక గృహసారథి చొప్పున నియమించుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వాలంటీర్ వద్ద ఉండే ప్రభుత్వ సమాచారాన్ని గృహసారథుల ద్వారా పార్టీ అవసరాల కోసం సేకరించి పెట్టుకుంటున్నదని చెబుతున్నారు. గృహసారథులకు ప్రజలతో నేరుగా సంబంధం లేదు. కానీ, ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థ రద్దయితే కొంతలో కొంత సారథులు ఉపయోగించుకోవచ్చన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. మరి ఈ సారథులు ఎంతవరకు వైసీపీకి ఉపయోగపడతారన్నది చూడాల్సి ఉంది. 

చంద్రబాబు గెలిచారు.. తెలుగుదేశంను గెలిపించారు

ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు.   రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ చంద్రబాబు దార్శినికతను ప్రశంసిస్తూనే ఉంటారు. రాజకీయంగా విభేదించేవారు కూడా ఆయన దూరదృష్టిని ప్రస్తుతిస్తూనే ఉంటారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజా సంక్షేమం, ప్రగతి జపం చేసే ఆయన సంకల్పానికి ఎవరైనా సరే అచ్చెరువొందక మానరు. అటువంటి చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తాను గెలవడమే కాకుండా తెలుగుదేశం పార్టీని సైతం గెలిపించేశారు. ఔను అసలు పోటీలో దిగకుండానే ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేశారు. తన అక్రమ అరెస్టు కారణంగా తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించడానికి అవకాశం లేని సంక్షోభ పరిస్థితులనే అందరికీ, అన్నిటికీ తానేననే పరిస్థితులను తీసుకువచ్చారు. ఔను ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అందరికీ చంద్రబాబే కావాలి.. గతంలో ఆయనతో పనిచేసిన వాళ్లకి, అసలు సంబంధమే లేని వాళ్లకి కూడా ఆయనే కావాలి. ఆయనను ప్రత్యర్థిగా భావించి దెబ్బకొట్టాలని చూసిన వారికీ ఆయనే దిక్కయ్యారు. బరిలో నిలిచి గెలవాలంటే ఆయన నామస్మరణ తప్ప మరో మార్గం లేదని అంతా భావించే పరిస్థితిని కల్పించారు.    వీరు వారు అని కాదు.. అన్ని పార్టీలకు చంద్రబాబే కావాలి. ఔను.. తెలంగాణ ఎన్నికలలో  కనిపించిన, కనిపిస్తున్న దృశ్యం  ఇదే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అన్ని పార్టీల నేతలు చంద్రబాబు జపం చేశారు.   చంద్రబాబు పేరు లేకుండా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసిన పార్టీ లేదు. నాయకుడు లేరు.  ఉమ్మడి రాష్ట్రంలో అయన చేసిన అభివృద్ధిని కీర్తించిన వాళ్ళు కొందరైతే.. ఆయన అక్రమ అరెస్టు ఖండించి  క్రెడిట్ కోసం ప్రయత్నించిన వారు మరికొందరు. ఏది తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ రాకీయాలలో చంద్రబాబు పేరు ప్రస్తావన రాని రోజు లేదు. నిజానికి ఇది దేశ రాజకీయాలలో సరికొత్త అధ్యాయం. ఎందుకంటే అవినీతి ఆరోపణలపై చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనే ఆయనను మా వాడంటే మా వాడని చెప్పుకున్నారు. ఇక ఆయన బెయిల్ పై బయటకి వచ్చిన తరువాత ఆయన పార్టీ తెలుగుదేశం  జెండా కోసం తెలంగాణ నేతలు తీవ్రంగా ప్రాకులాడారు.  తెలంగాణ ఎన్నికల ప్రచారంలో   ముఖ్యమైన మూడు పార్టీల అభ్యర్థులందరి మెడలో తెలుగుదేశం కండువాలు కనిపించాయి.   దాదాపుగా అన్ని పార్టీల నేతలు చంద్రబాబు నామస్మరణ చేశారు. తెలుగుదేశం మద్దతు దారులు, చంద్రబాబు అభిమానులు, ఆంధ్రా సెటిలర్ల   ఓట్ల కోసం   రాజకీయాలతో సంబధం లేకుండా అన్ని  పార్టీలూ, అందరు అభ్యర్థులూ ప్రాకులాడటం స్పష్టంగా కనిపించింది.  ఎవరికి వారు తెలుగుదేశం మద్దతు కోసం పసుపు కండువాలు మెడలో వేసుకున్నారు. తెలంగాణలో అతి పెద్ద పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు సైతం చంద్రబాబు నామస్మరణతోనే ప్రచారం సాగించారు. ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది.. గతంలో ఎన్నడూ జరగనిది. చంద్రబాబు తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసినన్ని రోజులూ  ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఆయన కనీసం పోటీలో కూడా లేకుండానే గెలిచేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు   పోటీలో నిలపకుండానే  తెలంగాణలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు.    ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. గత తొమ్మిదేళ్లలో తెలుగుదేశం ప్రస్థానాన్ని పరిశీలిస్తే  తెలంగాణలో ఆ పార్టీ పెద్దగా యాక్టివ్ గా లేదనే చెప్పాలి. అయినా తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా చంద్రబాబుకు తెలంగాణ వ్యాప్తంగా అసంఖ్యాక అభిమానులు ఉన్నారు. పార్టీకి బలమైన క్యాడర్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది.  గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే ఇప్పటికీ తెలంగాణలో చాలా ప్రాంతాలలో పార్టీల జయాపజయాలను  ప్రభావితం చేయగలిగిన సత్తా, బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రజలలో ఉన్న నమ్మకం, అభిమానమే ఇందుకు కారణం. తెలంగాణ  జనం గుండెల్లో చంద్రబాబు కొలువై ఉన్నారనీ, ప్రజలు ఆయనను ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారన్న విషయం ఆయన అక్రమ అరెస్టుతో బయటపడింది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలతో తేటతెల్లమైంది. ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా వెల్లువెత్తిన ఆందోళనపై తెలంగాణ  మంత్రి కేటీఆర్  అభ్యంతరం వ్యక్తం చేసినా, ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించకపోయినా.. బీఆర్ఎస్ నేతలూ, శ్రేణులూ మాత్రం బాబు జపం చేశారు. పరిస్థితిని గమనించిన కేటీఆర్ కూడా తన వ్యాఖ్యలకు నాలుక కరుచుకుని నష్టనివారణకు చేయగలిగినంతా చేశారు. దీనిని బట్టే  పోటీలో దిగకుండా చంద్రబాబు గెలిచేశారని, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో గెలిపించేశారనీ అర్ధం చేసుకోవచ్చు.  తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేయదన్న నిర్ణయంతో విబేధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేశారు. పరిశీలకులు పార్టీని పోటీలో నిలపకపోవడం పొరపాటు నిర్ణయం అంటూ విశ్లేషణలు చేశారు. అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారం ఆరంభమైన తరువాత చంద్రబాబు ఎంత ముందు చూపుతో ఆ నిర్ణయం తీసుకున్నారన్నది అందరికీ అవగతమైంది. మొత్తం తెలంగాణ అంతా చంద్రబాబు వెంటే ఉందనీ, ఇప్పుడు ఎన్నికలలో ఏ పార్టీ గెలిచిందన్నది ముఖ్యం కాదు. కానీ ఏ పార్టీ గెలిచినా అది తెలుగుదేశం చలవతోనే అని చెప్పుకోవలసిన పరిస్థితి తెలంగాణలో ఏర్నడింది.  అన్ని పార్టీలూ చంద్రబాబును తమవాడిగా చెప్పుకునేందుకు పోటీలు పడ్డాయి. గతంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వారు కూడా ఈ ఎన్నికలలో అయనను  కీర్తించడం విశేషం. దీంతో పోటీలో ఉండగా అందరినీ ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబు ఈ ఎన్నికలలో కనీసం పోటీలో లేకుండానే  ఘన విజయం సాధించేశారు.

ఎపిలో పొంచి ఉన్న ‘మియాచుంగ్’ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుంది.  ఆదివారం తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్య కారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాను తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పంట కోతలపై అవగాహన కల్పించాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించింది. తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా దంచికొడుతున్న వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై ప్రాంతాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అటు, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. రెండ్రోజుల్లో అది తుపానుగా మారొచ్చని అంచనా వేసింది. గత వారం రోజులుగా ఏజెన్సీలో చలి ప్రభావం పెరుగుతోంది. చింతపల్లిలో కనిష్ఠంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం వేళల్లో కాఫీ తోటలు, పంట పొలాలకు వెళ్లే కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వణుకుతూ ప్రయాణం  చేస్తున్నారు.అల్పపీడనం వల్ల ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది.  రేపటికి తీవ్రవాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉంది.  సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.  దీని ప్రభావంతో ఆదివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.

వాటర్ వార్ లో కొత్త ట్విస్ట్.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సరిగ్గా ఎన్నికల వేళ సాగర్ జలాల విడుదల విషయంలో ఏపీ సర్కార్ దుందుడుకుగా వ్యవహరించింది. సాగర్ డ్యాం నుంచి బలవంతంగా అనే కంటే దౌర్జన్యంగా నీటిని విడుదదల చేసింది. ఇంత కాలం ఊరుకుని ఇప్పుడు హడావుడిగా జగన్ సర్కార్ ఈ తీరులో దూకుడు ప్రదర్శించడం వెనుక  తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు రాజకీయ లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఉందన్న  విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.   ఎన్నికల వేళ సెంటిమెంట్ రగిలించేలా.. రెండు రాష్ట్రాల మధ్యా విభజన నాటి ఉద్రిక్తతలను రేకెత్తించి.. తెలంగాణలో తన మిత్రుడికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. సరే ఇప్పుడు ఆ వ్యూహం ఫలించిందా లేదా అన్న విషయాన్ని వదిలేస్తే.. ఏపీ పోలీసులు మాత్రం కచ్చితంగా చిక్కుల్లో పడ్డారు. ఏపీ పోలీసులు తమ భూభాగంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారంటూ, డ్యామ్‌పై కాపలాగా ఉన్న ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు  ఏపీ పోలీసులపై విజయపురి స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 447, 427 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో   ఏ1గా ఏపీ పోలీసులను చేర్చారు.  500 మంది సాయుధ బలగాలతో డ్యామ్ పైకి బలవంతంగా వచ్చారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. డ్యామ్ 13 గేట్లు ధ్వంసం చేశారని.. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి నీటిని విడుదల చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  

4న కేసీఆర్ కేబినెట్ భేటీ.. కొత్త ఆనవాయితీకి శ్రీకారమా?

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలలో రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం ఎవరిది అన్నది తేలుతుంది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనూహ్యంగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహుశా గతంలో ఏ ఆపద్ధర్మ ముఖ్యమంత్రీ ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండరు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లాడి అంటే డిసెంబర్ 4న కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ భేటీ  సోమవారం (డిసెంబర్ 4) మధ్యాహ్నం 2గంటలకు జరగనుంది.  ఈ మేరకు  సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. అసలు కేసీఆర్ ఫలితాల విడుదల తరువాత కేబినెట్ భేటీకి పిలుపునివ్వడాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు. ఇప్పడు తెలంగాణ రాజకీయాలలో ఈ కేబినెట్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. అసలా భేటీ ఉద్దేశమేమిటి, అజెండా ఏమిటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఇలా ఉండగా కేసీఆర్ పోలింగ్ పూర్తయిన తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు కానీ పార్టీ నేతల వద్ద మనం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అన్న ధీమా వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవద్దనీ, ఆగం ఆగం కావద్దనీ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పిన కేసీఆర్.. 3వ తేదీన సంబరాలకు సిద్ధం కావాలని కూడా వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం, సంతకం పెట్టే తొలి ఫైలు తదితర అంశాలపై కూడా కేసీఆర్ మాట్లాడారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ ను ఉటంకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఈ వ్యాఖ్యలలో విజయం పై విశ్వాసం కంటే.. అనుమానాలే ఎక్కువగా వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో  కాంగ్రెస్ లో విజయం జోష్ అప్పుడే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్ భేటీ  ఏర్పాటు సంచలనం సృష్టిస్తోంది. ఆనవాయితీకి భిన్నంగా ఫలితాలు వెలువడిన తెల్లారి కేసీఆర్ కేబినెట్ భేటీ ప్రకటన వెలువడటంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 

రాష్ట్రం పరువు గంగ పాలు.. ఏపీ క్యాపిటల్ బాండ్స్‌కు సీ గ్రేడ్!

జగన్ సర్కార్ పనిగట్టుకొని  రాష్ట్రం గంగలో కలిపేస్తున్నది. కే వలం రూ.14 కోట్లు వడ్డీ కట్టలేక మరో సారి ఏపీ ప్రతిష్టను బజారుకీడ్చింది. ఇప్పటికే రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల కుప్పలా మార్చేసిందని పలు నివేదికలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో హెచ్చరించింది. కానీ జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇప్పటికీ ప్రభుత్వం కొత్త అప్పుల కోసం వెంపర్లాడుతోంది. అప్పుల మీద అప్పులు.. అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్త అప్పులు చేసుకుంటూ, బాండ్ల నుండి ప్రభుత్వ ఆస్తుల వరకూ అన్నిటినీ తనఖా పెట్టేస్తోంది. చివరికి మద్యం మీద వచ్చే ఏళ్లల్లో రానున్న ఆదాయాన్ని చూపి కూడా అప్పులు తెచ్చింది. ఇప్పటికే ఒక రాష్ట్రం చేయాల్సిన అప్పుల పరిధికి మించి ఏపీ ప్రభుత్వం అప్పులు చేసేసింది. తెచ్చిన అప్పులను ఏదైనా అభివృద్ధి, ఉపాధి రంగంలో పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని గడిస్తున్నదా అంటూ అంటే అదీ కూడా లేదు. బటన్ నొక్కుడు ద్వారా పప్పు బెల్లాల మాదిరి పంచుకుంటూ వెల్లుతున్నది.   అప్పు చేసి తెచ్చిన నిధులను సక్రమంగా వినియోగించడం లేదు.  అసలు ప్రభుత్వమే అప్పుల మీద నడుస్తోంది.  ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అప్పుల విషయంలో రాష్ట్రం డేంజర్ లిస్టులోకి వెళ్ళింది. ఏపీకి కొత్తగా అప్పులు ఇస్తే రిస్క్ అంటూ ఫైనాన్స్ ఏజెన్సీలు రేటింగ్ లు ఇచ్చేశాయి. ఏపీ ప్రభుత్వం గతంలో జారీ చేసిన సీఆర్డీఏ బాండ్స్ రిస్క్ అంటూ క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. అంతేకాదు  రేటింగ్ నెగెటివ్ వాచ్ లిస్ట్ లో పెట్టింది.  ఇప్పుడు ఏపీ క్యాపిటల్ బాండ్స్‌కు స్టాక్ ఎక్సేంజ్‌ షాక్ ఇచ్చింది. ఏకంగా ఏపీ బాండ్లకు సీ గ్రేడ్ కేటాయించింది. ఈ మేరకు స్టాక్ ఎక్సేంజ్‌లకు రేటింగ్ సంస్థలు నోట్ పంపాయి. హై రిస్క్‌తో కూడిన బాండ్స్‌గా అక్యూట్ రేటింగ్ సంస్థ ఏపీ క్యాపిటల్ బాండ్లను పేర్కొంది. దీనికి కారణం ఏపీ ప్రభుత్వమేనని ఆ సంస్థ పేర్కొంది. ఈ బాండ్స్‌కు చెల్లించాల్సిన రూ.14 కోట్లు వడ్డీ కూడా నెల రోజులు ఆలస్యంగా చెల్లించారని రేటింగ్ సంస్థ వెల్లడించింది. గతంలో రాష్ట్రానికి సంబంధించి బీఎస్ఏ, డీఎస్ఆర్ఏ అకౌంట్స్‌లో ఉండాల్సిన రూ.525 కోట్ల  మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేకుండా వాడేసుకోవడంతో క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేయగా.. ఇప్పుడు రూ.14 కోట్లు వడ్డీ కూడా సమయానికి కట్టలేదని స్టాక్ ఎక్సేంజ్‌ సీ గ్రేడ్ కేటాయించింది. క్యాపిటల్ బాండ్స్‌కు సీ కేటగిరీ రేటింగ్ ఇవ్వడంతో బాండ్స్ కొనుగోలు చేసిన మదుపరులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. దీంతో ఏపీ పరువు మరోసారి బజారున పడింది. ఇది  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆర్ధిక పతనానికి పరాకాష్టగా చెప్పుకోవాల్సి ఉంటుంది.  గత ప్రభుత్వంలో చంద్రబాబు సీఆర్డీఏ బాండ్లు రూ.1300 కోట్లకి రిలీజ్ చేస్తే.. కేవలం గంటలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అవడం విశేషం. ఆ వెంటనే రూ.2000 కోట్లకి బాండ్స్ రిలీజ్  చేస్తే అవీ హాట్ కేకుల్లా సబ్‌స్క్రైబ్ అయిపోయాయి. చంద్రబాబు హయంలో బాండ్లు రిలీజ్ చేసే సమయానికి దేశవ్యాప్తంగా ఉన్న మునిసిపల్ కార్పొరేషన్స్ అన్నీ కలిపి రూ.1800 కోట్లకు బాండ్స్ జారీచేస్తే.. చంద్రబాబు సర్కార్ కేవలం గంటలో రూ.2000 కోట్లు బాండ్స్ జారీ చేసింది. అలాంటి పరిస్థితి నుంచి నేడు ఏపీ అంటే అప్పుల మయం, దివాళా తీసేసిన రాష్ట్రం అంటూ బోర్డు కట్టేసే పరిస్థితికి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కాదు అప్పులప్రదేశ్‌ అంటూ జాతీయ స్థాయిలో ముద్ర పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మితిమీరిన అప్పుల కారణంగా దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా, దివాళా తీసిన రాష్ట్రంగా రికార్డు  క్రియేట్ చేస్తున్నది.

మంత్రి కాకుండానే రేవంత్ ముఖ్యమంత్రి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఓటర్ల తీర్పు   ఈవీఎంలలో చేరి స్ట్రాంగ్ రూంలో భద్రంగా  ఉంది. దీంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మొదలైంది. మూడు ప్రధాన పార్టీలలో విజయం ఎవరిది? ప్రధాన ప్రతిపక్షం కాబోతున్నదెవరన్నచర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా కాంగ్రెైస్ దే అధికారం అని చెబుతున్నాయి.  దాదాపుగా పాతికకి పైగా ఎగ్జిట్ పోల్స్ లో రెండు మూడు మినహాయించి మిగిలిన అన్ని సర్వేలూ అధికారం ‘హస్త’గతం కావడం తథ్యమని పేర్కొంటున్నాయి.   పోలింగ్ తరువాత కాంగ్రెస్ నేతలలో జోష్ కనిపిస్తుంటే బీఆర్ఎస్ నేతలలో అది కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే అసలు మీడియా ముందుకే రాలేదు.  ఎన్నికల అనంతరం కేటీఆర్ మినహా బీఆర్ఎస్ ముఖ్య నేతలెవరూ మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. తప్పదన్నట్లు వచ్చిన కేటీఆర్ కూడా ఎగ్జిట్ పోల్స్ పై అసహనం వ్యక్తం చేశారు.  అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంయమనం పాటిస్తూ.. ఇకపై పరుష వ్యాఖ్యలకు దూరంగా హుందాతనంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ తీరును చూస్తుంటే కాంగ్రెస్  విజయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ కూడా అంగీకరించేసినట్లు కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కనుంది అనగానే తెలంగాణ రాష్ట్రానికి కాబోతున్న రెండవ సీఎం ఎవరన్నచర్చకు తెరలేచింది.  కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ  తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు.  సీఎం పేరు లేకుండానే ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమే  అయినా  తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా అన్నీ తానై చక్రం తిప్పిన రేవంత్ రెడ్డిపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.  అయితే కాంగ్రెస్ లో సీఎం రేసులో నలుగురు ఉన్నారని పరిశీలకులు భావిస్తున్నారు.  వారిలో ముందు పీఠిన ఉన్నది మాత్రం టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి మాత్రమే. పార్టీ హైకమాండ్ మొగ్గు కూడా ఆయనవైపే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలను రేవంత్ చేపట్టిన తరువాత కింది స్థాయి నుంచీ పార్టీలో జోష్ పెరిగింది. విజయంపై నమ్మకం కలిగిందని పార్టీలో ఆయనను వ్యతిరేకించే వారు కూడా అంగీకరించక తప్పని వాస్తవం.  ఎన్నికలకు ముందే రేవంత్ సీఎం అభ్యర్థిత్వం ఖరారైందనీన, అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించ లేదనీ పార్టీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.  అందుకే రేవంత్ కు ఎన్నికలలో అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మధు యష్కీ, షబ్బీర్ అలీ లాంటి  లీడర్లు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. భట్టి విక్రమార్క అయితే రాష్ట్రంలో సగభాగం పాదయాత్ర కూడా చేపట్టారు. ఎస్సీ నేత కావడం భట్టికి కలిసి వస్తుంది. అయితే, సామజిక సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం కోసం రేవంత్ రెడ్డి తన శక్తికి మించి పోరాడారు. స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీలో ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని దాదాపుగా ఒంటి చేత్తో నడిపించారు.  ప్రజల్లో బాగా పలచ  పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపి ఇప్పుడు ఓట్లుగా మార్చడంలో రేవంత్  అతడే ఒక సైన్యం అన్నట్లుగా  కనిపించారు. దీంతో  అధిష్ఠానం కూడా రేవంత్ ను కాకుండా మరొకరిని సీఎం పదవి కోసం పరిశీలించే అవకాశాలు ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.  నిజానికి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ కనీసం మంత్రి పదవి కూడా చేపట్టలేదు. గతంలో తెలుగు దేశం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేశారు. దీంతో ఇప్పటికే దీనిపై మీడియా నుండి రేవంత్ రెడ్డికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్నికలకు ముందే మీడియా ఇంటర్వ్యూలలో మంత్రిగా కూడా పరిపాలన అనుభవం లేని రేవంతును సీఎం చేసేందుకు మిగతా కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి రేవంత్ కూడా చాకచక్యంగానే సమాధానాలు చెప్పారు. ఇందిరాగాంధీ ఎలాంటి పరిపాలనా అనుభవం లేకుండానే దేశ ఆర్ధిక వ్యవస్థ స్థితి గతిని మార్చేసి, పాకిస్తాన్ ను ఓడించి, బంగ్లాదేశ్ విముక్తికి సహకరించి అద్భుతమైన పాలన అందించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారనీ, అలాగే  ఎలాంటి పాలనా అనుభవం లేని  సీఎంగా ఎన్టీఆర్ సుభిక్ష పాలన అందించారనీ,  ఇప్పటికీ వారి పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటున్నామని అటువంటప్పుడు తన సామర్ధ్యాన్ని ఎలా తక్కువ అంచనా వేస్తారని రేవంత్ సమాధానంతోనే ఎదురు ప్రశ్నలు సంధించారు. దీనిని బట్టి చూస్తే రేవంత్ మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి కావడం ఖాయమని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  

కాంగ్రెస్ వైపే తెలంగాణ మొగ్గు!

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి.  అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ప్రచార పర్వం ముగిసి ఓటింగ్ పూర్తై ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడిన తరువాత. కాంగ్రెస్ కు ఈ సారి జనం మొగ్గు చూపారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  దాదాపు అన్నివర్గాల ప్రజలూ ఈ సారి కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచినట్లుగా పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. అయితే ఎప్పుడూ ఓటింగ్ వైపు పెద్దగా దృష్టి సారించని హైదరాబాద్.. ఈ సారి కూడా  అలాగే వ్యవహరించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే గులాబీ పార్టీకి పరువు నిలిచే సంఖ్యలో స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం కూడా ఈ సారి గతానికి భిన్నంగా కాంగ్రెస్ కు ఓటెత్తిందని పరిశీలకులు చెబుతున్నారు.  కుటుంబపాలన, రెండుసార్లు అధికారంలో   ఉండటం వల్ల వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రుణమాఫీ.. ఇలా ఈ సారి కేసీఆర్ ప్రభుత్వం వద్దనుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అన్నిటికీ మించి  యువతలో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం కనిపించింది. కొలువుల పేరుతో మోసం చేశారన్న భావన వ్యక్తం అయ్యింది.   ఆరా-రేస్-సీపాక్-రాజనీతి స్ట్రాటజీస్-పొలిటికల్ లెబోరేటరీ-సీఎన్‌ఎన్‌న్యూస్ వంటి ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి.  ఇక ప్రివర్ మీడియా సోల్యూషన్స్, సునీల్‌వీర్, థర్డ్ విజన్ రీసెర్చి- పల్సు టుడే వంటి సంస్థల పోల్స్ ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపే ఉందని పేర్కొన్నాయి.   ఎన్డీటీవీ అయితే హంగ్ ప్రిడిక్ట్ చేసింది.  అయితే మొత్తంగా గురువారం (నవంబర్ 30) జరిగిన పోలింగ్ సరళిని, ఆ తరువాత ఆయా పార్టీల నేతల స్పందనను నిశితంగా గమనిస్తే.. కాంగ్రెస్ లో కనిపిస్తున్న ధీమా మరే  ఇతర పార్టీలోనూ కనిపించలేదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిలో కనిపించని ధీమా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలో ప్రస్ఫుటంగా కనిపించింది. అలాగే విశ్లేషకులు సైతం రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తొలి సారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయనే చెప్పారు. జనం కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక చాన్స్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, పరిశీలకుల విశ్లేషణలూ అన్నీ పక్కన పెడితే వాస్తవంగా రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏదన్నది డిసెంబర్ 3న తేలిపోతుంది. 

జగన్ సర్కారుకు హైకోర్టు మళ్లీ నోటీసులు!.. ఎందుకంటే?

న్యాస్థానాలు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా ఏపీ ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదు. సాక్షాత్తు సీఎంకు నోటీసులు ఇచ్చినా  ఖాతరు లేదు. ఉన్నతాధికారులను బోనులలో నిలబెట్టి చీవాట్లు పెట్టినా మమ్మల్ని కాదన్నట్లు దులిపేసుకుంటున్నారు. రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని ఎంత చెప్పినా.. మా రాజ్యాంగం వేరే ఉందనేలా ఉన్న జగన్ సర్కార్   తీరు మారడం లేదు.  ప్రజల సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు వద్దని ప్రభుత్వానికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పోనీ  జగన్ తొలి సారి సీఎం అయ్యారు.. ఆయనకు తెలియదేమో అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే  తనకు తిలియదు కనుకనే నెలకు కోట్లాది రూపాయల జీతాలిచ్చి  మరీ  పెద్ద సంఖ్యలో సలహాదారులను నియమించుకున్నారు.  మరి వారికి కూడా  ఈ ఇంగితం లేదా?  మమ్మల్ని ఎవరేం చేస్తార్లే అనుకున్నారేమో అడ్డగోలుగా ప్రభుత్వ అధికారులను పంపించి జగన్ మోహన్ రెడ్డికి ఓట్లేయాలని ప్రచారం సాగించారు. దీంతో మళ్ళీ న్యాయస్థానాలు కల్పించుకోవాల్సి వచ్చింది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు నుండి గ్రామ వాలంటీర్ వరకూ అన్ని శాఖల అధికారులను నోటీసులు ఇచ్చింది. వై ఏపీ నీడ్స్ జగన్ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) పేరుతో వైసీపీ ఓ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో నిర్వహిస్తున్నారు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 25   ప్రశ్నలతో కూడిన ఒక బుక్ లెట్ రూపొందించి.. జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు అమోఘం అని ప్రచారం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు పాలనపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. చివరికి వైసీపీ జెండాలు పంచి పెట్టి ప్రతి ఇంటి మీదా  వైసీపీ జెండా ఎగిరేలా బెదిరింపులకు దిగుతున్నారు.  వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పక్కా వైసీపీ పార్టీ కార్యకమం. ఇందులో ఎలాంటి అనుమానాలకూ తావేలేదు. అధికారం ఉంది కదా అని పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో నిర్వహిస్తున్నారు. ఆ అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారితో బలవంతంగా జగనే కావాలని చెప్పిస్తున్నారు. ఈ పథకం మొదలైనప్పటి నుండే విమర్శలొచ్చాయి. ఇక ఇప్పుడు కోర్టులు నోటీసులు ఇచ్చింది. రాజకీయపరమైన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్లు లాయర్లు ఉమేశ్‌ చంద్ర, నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వాములను చేయడం, ప్రజా ధనాన్ని వినియోగిస్తుండటం సహా తదితర అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు ఏపీ సీఎస్, పలువురు అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.   సీఎస్, ముఖ్య సలహాదారు సజ్జలతో పాటు పంచాయతీరాజ్‌, పురపాలక, గ్రామ-వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శులకు, వాలంటీర్లను కూడా ప్రతివాదులు చేసి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.   విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అనేందుకు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. కార్యక్రమానికి హాజరు కాలేదని గుత్తి మున్సిపాలిటీకి చెందిన ఉద్యోగికి మెమో జారీ చేసిన అంశాన్ని పిటిషనర్ లాయర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరో వైపు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. ఈ మేరకు విడుదల చేసిన జీవో నెంబర్ 7ను కూడా కోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సజ్జల ఆదేశాలిచ్చారని కోర్టుకు వివరించారు. ఒక వైపు దాదాపు రూ.20 కోట్ల రూపాయల ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం, వ్యతిరేకించిన ఉద్యోగులను బెదిరించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, కోర్టులు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా వినే తత్వం ఈ ప్రభుత్వానికి లేదు. ఒకవైపు కోర్టు ధిక్కరణ కేసులలో అధికారులు జైలు పాలవుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం అడ్డగోలు జీవోలతో ప్రభుత్వ అధికారుల బలి చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.

కర్నాటకకు కాంగ్రెస్ అభ్యర్థులు?

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. కాంగ్రెస్ లో కూడా అధికారం చే జిక్కించుకుంటామన్న ధీమా వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదనీ, 2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎగ్జిట్ పోల్స్ తాము అధికారానికి దూరం అవుతాయనే చెప్పాయనీ, కానీ తాము అధికారం చేజిక్కించుకున్నామనీ బీఆర్ఎస్ చెబుతోంది. ఈ సారీ అదే జరుగుతుందనీ, తాము వరుసగా మూడో సారి అధికారంలోకి వస్తామనీ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనీ ధీమాగా చెబుతోంది. అంతే కాదు ముచ్చటగా మూడో సారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే స్థలాన్ని కూడా ఇప్పటికే ఖరారు చేసేసింది. కొత్త సెక్రటేరియెట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారనీ, ఆయన తొలి సంతకం ఏ ఫైలు మీద చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారనీ బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ వాదనను కొట్టిపారేస్తోంది. ఏదో రకంగా అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ ప్రజా తీర్పును లెక్క చేయకుండా దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయనీ అనుమానిస్తోంది. ఈ సారి 70కు పైగా స్థానాలలో విజయం ఖాయమన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్.. తమ పార్టీ తరఫున గెలుస్తారన్న అభ్యర్థులందరినీ కర్నాటకకు తరలించే యోచన చేస్తున్నది. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  ఆధ్వర్యంలో ఈ మేరకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి అధిక స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే గెలిచిన వారిని ప్రలోభాలకు గురి చేసి తమ దరికి చేసుకోవడానికి బీఆర్ఎస్ ఇప్పటికే  ప్రయత్నాలు ప్రారంభించిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అందులో భాగంగానే హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనీ, కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు దూరంగా ఉంచేందుకు కర్నాటకకు తరలించే విధంగా వ్యూహరచన చేస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో పోలింగ్ పూర్తయిపోయినా రాజకీయ వేడి మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలలో బిజీగా ఉన్నాయి.