సిరిసిల్లలో కేటీఆర్ ఎదురీత?

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ కు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో  ఎదురుగాలి వీస్తోందా? ప్రజావ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇందుకు తార్కానంగా ఆయన మంగళవారం నియోజకవర్గ పార్టీ క్యాడర్ తో మాట్లాడిన వీడియోకాల్ ను ఉదహరిస్తున్నారు. ఆ వీడియోలో కేటీఆర్ ప్రజా వ్యతిరేకత ఉందని అంగీకరించడం,  ప్రజలకు ఎన్ని పనులు చేసినా, ఎంత మంచి చేసినా ఎక్కడో కొంత అసంతృప్తి ఉంటుందని, ప్రజలకు తనకు మధ్య డైరెక్టన్ కనెక్షన్ తెగిపోయిందనే అభిప్రాయాలు కూడా జనం నుంచి నియోజకవర్గంలో వినిపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ కేడర్‌లోనే చాలా మందికి తనతో యాక్సెస్ లేదనే అసంతృప్తి ఉన్నదని, ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవాలని కోరుకుంటున్నారని, కానీ ఇంతకాలం ఎమ్మెల్యేగా క్యాడర్ కు దగ్గర కాలేదనీ, కానీ మరో సారి అవకాశం ఇస్తే  తప్పకుండా నెలలో రెండు రోజుల పాటు సిరిసిల్లలోనే ఉంటానని,   నేరుగా అందుబాటులో ఉంటానని శ్రేణులకు హామీ ఇచ్చారు. ఇంత చేశాం, అంత చేశాం, హైదరాబాద్ కు ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడి దారులు వలస వచ్చేలా చేశాం. తెలంగాణ అభివృద్ధికి బాటలు వేశాం. దేశానికి రాష్గ్రాన్ని ధాన్యాగారంగా మార్చేశాం అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఎన్నికల ముందు కేడర్ తో ఇలా బేలగా మాట్లాడమే ఆయన సిరిసిల్లలో ఎదురీదుతున్నారనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక్కడ నుంచి  ప్రచారం చాలా కీలకమని, ప్రతి ఇంటినీ టచ్ చేసి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి వారికి భరోసా కల్పించాలని కేడర్ కు పిలుపునిచ్చారు.  కొత్త రేషను కార్డులు, పింఛన్లు.. వంటి సమస్యల పరిష్కారంపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలనీ కేడర్ కు కేటీఆర్ సూచించారు. సరిగ్గా ఎన్నికల వేళ  ప్రజల నమ్మకాన్ని కోల్పోయామన్న అనుమానం రావడమే ఓటమి భయాన్ని సూచిస్తున్నదని అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో అధికార పార్టీలో ఈ సారి విజయంపై పూర్తి స్థాయి విశ్వాసం కనబడటం లేదని ఆ పార్టీ ప్రచార సరళే తేటతెల్లం చేస్తోందని అంటున్నారు. 

అమెరికాను హడలెత్తిస్తున్న లిస్టీరియా.. పండ్ల ద్వారా వ్యాప్తి!

కరోనాఈ పేరు వింటే చాలు ఇప్పటికీ ప్రపంచ దేశాల ప్రజలు వణికిపోతున్నారు. దీనిలోనే ఎన్నో వేరియంట్లు కూడా పుట్టుకొచ్చి ప్రపంచాన్ని హడలెత్తించిన సంగతి తెలిసిందే. మొత్తంగా కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను హరించింది. ముఖ్యంగా చైనా, యూఎస్, అమెరికా లాంటి   దేశాలలో ఈ ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. కరోనా మహమ్మరి బారి నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కానీ, అంతలోనే రకరకాల వైరస్ లు, బ్యాక్టీరియాలు   పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్య నిపుణులు కొత్త వైరస్ లు, బ్యాక్టీరియాలపై  హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.  ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికాను ఇప్పుడు ఓ కొత్త వైరస్   హడలెత్తిస్తోంది. ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్లలో జీవించే ఈ వైరస్ పండ్ల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.  సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఒక ఘోరమైన లిస్టిరియా అమెరికా దేశంలో వ్యాప్తి చెందుతున్నట్లు హెచ్చరించారు. ఈ లిస్టిరియా అమెరికాలోని పలు ప్రాంతాలలో గల పంట పొలాలలో ఉత్పత్తై.. అక్కడ నుండి పండ్ల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా పీచెస్, ప్లమ్స్ వంటి పండ్ల రకాలతో ఈ లిస్టిరియా వ్యాప్తి చెందుతుందట. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దుకాణాలలో కొన్ని కంపెనీ పండ్లను తిన్న తర్వాత ఒకరు మరణించగా మరో 10 మందిఅస్పత్రి పాలయ్యారు. 10 మందిలో ఒక  గర్భిణీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 2022లో మే 1 నుండి నవంబర్ 15 వరకు, ఆ తర్వాత ఈ ఏడాది కూడా ఎవరైతే ఆ కంపెనీ పండ్లను కొనుగోలు చేశారో వారు వెంటనే వాటిని విసిరివేసిన, నిల్వ చేసిన  ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ సహా ఆప్రాంతాలన్నిటినీ  శుభ్రం చేయాలని సూచించినట్లు సీడీసీ తెలిపింది.  ఎల్లో పీచ్ 4044, 4038, వైట్ పీచ్ 4401, ఎల్లో నెక్టరైన్ 4036, 4378, తెలుపు నెక్టరైన్ 3035, రెడ్ ప్లమ్ 4042, బ్లాక్ ప్లమ్ 4040 పండ్ల ద్వారా లిస్టిరియా వ్యాప్తి చెందినట్లు గుర్థించారు లిస్టిరియా బాధితులు ఇప్పటి వరకు కాలిఫోర్నియా, కొలరాడో, కాన్సాస్, ఇల్లినాయిస్, మిచిగాన్, ఒహియో, ఫ్లోరిడా   రాష్ట్రాల్లో ఉన్నట్లు సీడీసీ తెలిపింది. కాగా ఈ బ్యాక్టీరియా అతి తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉండగా..  వ్యాధి సోకిన వారు పూర్తిగా కోలుకునేందుకు  నాలుగు వారాల సమయం పడుతుందని తెలిపారు. కాబట్టి ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడీసీ తాజాగా పేర్కొంది.  ఈ లిస్టిరియా పండ్లతో కలిసి రిఫ్రిజిరేటర్‌లో జీవించడంతో పాటు ఇతర ఆహార పదార్ధాలు, వాటి ఉపరితలాలకు సులభంగా వ్యాపిస్తుందని సీడీసీ పేర్కొంది. కాగా, లిస్టిరియా అనేది అరుదైన బ్యాక్టీరియా కాగా ఇది ఆహార పదార్ధాల ద్వారా గర్భిణీలు, నవజాత శిశువులతో పాటు రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు సోకితే ప్రమాదమని సీడీసీ తెలిపింది. ఇది సోకితే లిస్టెరియోసిస్‌కు కారణమవుతుందని.. ఇది జ్వరం, కండరాల నొప్పులు, అలసటతో పాటు కొన్ని తీవ్రమైన సందర్భాల్లో సెప్సిస్ లేదా మెనింజైటిస్‌కు కారణమవుతుందని తెలిపారు. దీంతో దాదాపు 20-30% మరణాల రేటుతో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు కారణమవుతుందని తెలిపారు. సీడీసీ నివేదిక ప్రకారం, జూన్ 30, 2022న ఫ్లోరిడాలో మొదట లిస్టెరియాను గుర్తించారు.  

ఛత్తీస్ ఘడ్ భారీ నక్సల్స్ దాడి కేసు.. ఎన్ఐఏని తోసిపుచ్చిన సుప్రీం!

ఛత్తీస్ ఘడ్ లోని ఝీరమ్ లోయలో 29 మంది మృ తికి కారణమైన నక్సల్స్ దాడి ఘటనలో విస్తృత కుట్ర కోణంపై దర్యాప్తును తమకు అప్పగించేలా రాష్ట్ర పోలీసులను ఆదేశించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో మూడేళ్లుగా ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు చేసేందుకు చేసిన న్యాయ పోరాటం ఫలించలేదు.  తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమన్న సంగతి తెలిసిందే.  2009 నుండి ఛత్తీస్ ఘడ్ లో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికి డజనుకు పైగా భారీ దాడులు చేసి వందల మందికి నక్సలైట్లు కారణమయ్యారు. నక్సల్స్ దాడులలో మరణించిన వారిలో  రాజకీయ నేతలతో పాటు ఆర్మీ జవాన్లు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బంది, భద్రతా సిబ్బంది, పోలీసు అధికారులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. నక్సల్స్ దాడులలో అన్నిటి కంటే దారుణమైనది 010లో దంతేవాడ  మెరుపుదాడిలో 75 మంది జవాన్లు మరణించిన ఘటన ఒకటైతే, ఆ తరువాత 2013లో ఝీరమ్ లోయలో మావోయిస్టుల దాడిలో 29 మంది చనిపోయిన  ఎవరూ మరచిపోలేవి. 2013 నాటి దాడిలో రాష్ట్ర మాజీ మంత్రి మహేంద్ర కర్మ, అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు,   సహా 29 మంది మరణించారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల కోసం  ప్రచారం జరుగుతున్నప్పుడు బస్తర్ జిల్లాలో పరివర్తన్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ నాయకులు తిరిగి వస్తుండగా నక్సల్స్ ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడి కేసు విచారణ అంశంపై చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థల మధ్య పోరాటం జరుగుతుంది.  ఈ కేసును ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు జరపగా.. తాజాగా రాష్ట్ర పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. నక్సల్స్ దాడి వెనక విస్తృత కుట్ర కోణం ఉందంటూ ఓ వ్యక్తి 2020లో ఫిర్యాదు చేయగా రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. దీనిపై ఎన్ఐఏ స్థానిక కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా అనుకూల తీర్పు దక్కలేదు. ఈ కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయకుండా తమకి అప్పగించాలని కోర్టులను కోరినా తోసిపుచ్చారు. ఝీరమ్ లోయలో 29 మంది మృతికి కారణమైన నక్సల్స్ దాడి ఘటనలో విస్తృత కుట్ర కోణంపై దర్యాప్తును తమకు అప్పగించేలా రాష్ట్ర పోలీసులను ఆదేశించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తొలుత ట్రయిల్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ చుక్కెదురు కావడంతో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా వ్యతిరేక తీర్పు రావడంతో సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది.  ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా ఎన్ఐఏ అభ్యర్ధనను తోసిపుచ్చింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు పోలీస్ విచారణకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు.xవేదికగా  స్పందించిన భూపేష్.. సుప్రీం తీర్పు ఛత్తీస్‌గఢ్‌కు న్యాయం తలుపు తెరిచినట్లే అన్నారు. ప్రపంచ ప్రజాస్వామ్యంలో జీరామ్ ఘటనను అతిపెద్ద రాజకీయ మారణకాండగా అభివర్ణించిన ఆయన ఈ దాడిలో   సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు సహా 32 మందిని కోల్పోయామని  పేర్కొన్నారు. ఈ కేసును ఎన్‌ఐఏతో పాటు మరో కమిషన్ కూడా దర్యాప్తు చేసినా.. ఈ ఘటన వెనుక ఉన్న విస్తృత రాజకీయ కుట్రను ఎవరూ విచారించలేదని సీఎం అన్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఎన్‌ఐఎ దానిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని.. ఈ రోజు అది భగ్నమవడంతో ఇక పోలీస్ దర్యాప్తునకు మార్గం సుగమమైనట్లే అన్నారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తారు. ఎవరు ఎవరితో ఏమి కుట్ర పన్నారో అంతా తేలిపోతుందని పేర్కొన్నారు.

ఆయారాం గయారాంలతో పార్టీలకే కాదు.. ప్రజలకూ కన్ఫ్యూజనే!

ఐదు రాష్ట్రాల ఎన్నికల సంరంభం ఆరంభమైపోయింది. ఛత్తీస్ గఢ్, మిజోరం, రాజస్థాన్న, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలన్నీ తమతమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార యుద్ధం మొదలెట్టేశాయి. అయితే అన్ని పార్టీలనూ ఫిరాయింపుల బెడద వెన్నాడుతూనే ఉంది. నిన్నటి వరకూ ఈ పార్టీలో  ఉన్న వ్యక్తి ఇప్పుడు మరో పార్టీ అభ్యర్థిగా దర్శనమిస్తున్న వైచిత్రి దాదాపు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలోనూ నెలకొని ఉంది. పార్టీ టికెట్ రాలేదనో, కోరిన స్థానం దక్కలేదనో.. కారణం ఏదైతేనేం.. పార్టీలలో కప్పదాట్లు తారస్థాయిలో జరుగుతున్నాయి. సరే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, నోటిఫికేషన్ విడుదల, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలు ఇవి ఎటూ తప్పవు. దీంతో అసమ్మతులను బుజ్జగించే పనికి చుక్క పెట్టి పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. కానీ తాము ఏ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నామో, ఆ వ్యక్తే నిన్న మొన్నటి వరకూ ప్రత్యర్థి పార్టీలో కీలకనేతగా ఉండి తనను విమర్శించిన సంగతిని విస్మరించలేక పలు పార్టీల నేతలు ప్రచారంలో తడబడుతున్నారు.  మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఈ పరిస్థితి చాలా చాలా అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా జంపింగుల బెడదతో అధికార బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలకు ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంది.  అవును అన్ని పార్టీలలోనూ ఇదే పరిస్థితి. ఇలా అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యిందో లేదో అలా పార్టీలలో ఫిరాయింపుల పర్వానికి తెరలేచింది.  పార్టీ సిద్ధాంతాలకు నిబద్ధులుగా ఉండే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసే సంప్రదాయానికి పార్టీలు ఎప్పుడో తిలోదకాలిచ్చేశాయి.  కేవలం పార్టీ అగ్రనాయకత్వం ఇష్టాయిష్టాల మీద, వారి ప్రాపకం మీదా, అలాగే ఖర్చుచేయగలిగే  స్తోమత మీదా ఆధారపడి పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.  అందుకే ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ ఇచ్చే పార్టీలోకి జంప్ చేయడానికి అన్ని పార్టీల నేతలూ రెడీగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.   ఈ కారణంగానే తెలంగాణ లో ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చిన తరువాత కూడా ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. పోటీకి అవకాశం లేకపోయినా.. ఎన్నికల తరువాత ఏదో విధంగా లబ్ధి చేకూర్చేలా ఒప్పందాలు కుదుర్చుకుని మరీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది.   ఇటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మేలు కాదు. ప్రజలే రాజకీయ కప్పదాట్లను అడ్డుకోవాలి. ఫిరాయింపు దారులను ఎన్నికలలో తిరస్కరించడం ద్వారానే నిబద్ధత ఉన్న రాజకీయ వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.  జనం ఫిరాయింపుదారుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. 

అక్బరుద్దీన్ ఓవైసీపై  కేసు నమోదు 

మరో ఎనిమిది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనూహ్యంగా బిఆర్ఎస్ మిత్ర పార్టీ అయిన మజ్లిస్ కు చుక్కెదురైంది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై బుధవారం పోలీస్ కేసు నమోదయింది. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని దూషించినందుకు గాను సంతోష్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 353 (విధులను అడ్డుకోవ‌డం)తో పాటు పలు సెక్ష‌న్ల కింద కేసును న‌మోదు చేసిన‌ట్లు డీసీపీ రోహిత్ రాజు తెలిపారు. అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం  చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని లలితాబాగ్‌లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... సమయం అయిపోయిందని, ప్రచారం ముగించాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి వారించారు. తన వద్ద కూడా వాచీ ఉందని, ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని, తనను ఆపే వ్యక్తి ఈ భూమ్మీద  పుట్టలేదని పోలీసు అధికారినతో పరుషంగా మాట్లాడారు. అవసరమైతే తాను ఇంకా మాట్లాడతానని, ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేశారు. తాను కనుసైగ చేస్తే పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అయినంత మాత్రాన తన పని అయిపోలేదన్నారు. తనలో అదే దమ్ము ఉందన్నారు. పోలీసులను బెదిరించిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదయింది. ప్రస్తుతం ఆపద్దర్మ ప్రభుత్వం కొనసాగుతుంది.  ఎన్నికల కమిషన్ నేతృత్వంలో పోలీసులు పని చేస్తున్నారు.   

వందల కోట్లతో పార్టీ ప్రచారం.. సొమ్ము మాత్రం ప్రజలదే.. జగన్మాయ కొత్త పుంతలు!

ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ పుణ్యమో లేక గత ఎన్నికలలో గట్టెక్కించిన  గోబెల్స్ ప్రచారమే మళ్లీ  గట్టెక్కిస్తుందన్న ఆశో తెలియదు కానీ  ఏపీలో వైసీపీ ఇప్పుడు కూడా పూర్తిగా సోషల్ మీడియా ప్రచారాన్నే నమ్ముకుంది. సీఎంగా జగన్ ప్రజల మధ్యకు రావడం ఎప్పుడో మానేశారు. కనీసం పార్టీ అధ్యక్షుడి హోదాలో కూడా జనం మధ్యకు వచ్చే పరిస్థితే లేదు. ఇక అధినేతే అలా జనాలకు మొహం చాటుస్తుంటే నాయకులు మాత్రం జనాలను ఎలా ఫేస్ చేయగలరు? సో ఏపీలో అధికార పార్టీకి ప్రజలతో కనెక్షన్ కట్ అయిపోయి చాలా కాలమైంది. అధవా ఏదో కార్యక్రమం పేరు చెప్పుకుని నేతలు జనంలోకి వచ్చినా వారికి నిరసనలు, ప్రతిఘటనలే ఎదురౌతున్నాయి. దీంతో వైసీపీ ఇప్పుడు ఇక పార్టీ ప్రచారానికి పూర్తిగా సోషల్ మీడియాపైనే ఆధారపడింది. దానినే నమ్ముకుంది.  వాస్తవాల సంగతి పక్కన పెట్టేసి.. తనకు కావాల్సినట్లుగా ప్రజలను నమ్మించడమే వైసీపీ  సోషల్ మీడియా విభాగం పని.  గత ఎన్నికలకు ముందు ఏపీలో పీకే ఐ ప్యాక్ టీం భారీ ఎత్తున వైసీపీ కోసం సోషల్ మీడియా క్యాంపైన్ చేసింది. జరగబోయే ఎన్నికలకు కూడా ఐ ప్యాక్ టీం జగన్ మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నది. అయితే, ఈ సారి గత ఎన్నికలకు చేసినంత చేస్తే సరిపోదనీ, అంతకు మించి చేయాలని జగన్ ఆయన నమ్ముకున్న ఐప్యాక్ భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  ఆ మధ్య జనసేన తెలుగుదేశం పొత్తుకు సిద్దమవుతుందన్న ఊహాగానాల సమయం నుండే వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది. ముందుగా పొత్తును దెబ్బతీసేందుకు రకరకాల ఎత్తులు వేసిన వైసీపీ.. తన సోషల్ మీడియాలో  శృతి మించి అబద్ధాల ప్రచారానికీ, అనుచిత వ్యాఖ్యల ద్వారా ప్రత్యర్థులను ట్రోల్ చేయడానికీ, ఇంకా చెప్పాలంటే ఆ పొత్తు పొసగకుండా ఇరు పార్టీల మధ్యా గ్యాప్ పెంచడానికీ శతథా కృషి చేసింది. అయినా ఫలితం ఇల్లే అవ్వడంతో ఇప్పుడు ఇంకాస్త డోస్ పెంచాలని నిర్ణయించింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే  వందల కోట్లు ఖర్చు పెట్టైనా సరే.. టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టి పొత్తు ఫలితం లేకుండా చేయాలని భావిస్తున్నది. పరిశీలకులు వైసీపీ సామాజిక మాధ్యమం ద్వారా సాగిస్తున్న ప్రచారం సరళిని ఇలాగే విశ్లేషిస్తున్నారు.  ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉంది. కానీ  వైసీపీ ఇప్పటికే సామాజిక మాధ్యమం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ఓ రేంజ్ లో మొదలు పెట్టేసింది.  గతంలో జనసేన-టీడీపీ పొత్తును దెబ్బతీసేందుకు మొదలు పెట్టిన పెయిడ్ క్యాంపైన్ ను ఇప్పుడు ఎన్నికల ప్రచారంగా మార్చేసిందని పరీశీలకులు అంటున్నారు. ఇప్పటికే వందల కొద్దీ యూట్యూబ్ చానెళ్లు, వేలసంఖ్యలో సోషల్ మీడియా ఖాతాలు కొనుగోలు చేసిన వైసీపీ డిజిటల్ విభాగం..  ఇప్పుడు ఆయా చానెళ్లు, ఖాతాలలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసినట్లు పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు..  ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల యాడ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ లలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి.  యూట్యూబ్ లో మనం ఎలాంటి కంటెంట్ చూసినా వీడియోపై యాడ్స్ రావడం చాలా కామన్ .  వీటిలో కొన్నిటిని కనీసం 5 సెక‌న్లు ఇష్టమున్నా లేకున్నా చూడాల్సి ఉంటుంది. తర్వాత కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. మరి కొన్ని యాడ్స్ అయితే పూర్తి అయ్యేవ‌ర‌కు చచ్చినట్లు వేచి ఉండాల్సిందే.   యూట్యూబ్ వీడియోపై ఇలాంటి యాడ్స్ ఇవ్వాలంటే డైరెక్ట్ గా యూట్యూబ్ తోనే ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే ఎలాంటి వీడియోలపై యాడ్స్ రావాలి.. ఏ లొకేషన్ లో ఉన్న యూజర్స్ యాడ్స్ చూడాలి..  ఏ సమయంలో ఈ యాడ్స్ రావాలి వంటివి యూట్యూబ్ మానిటర్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఏపీలో ప్రజల ఫోన్లలో యూట్యూబ్ లో వీడియో కంటెంట్ చూసే క్రమంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై ప్రకటనలు ఇస్తున్నారు. ముఖ్యం నవరత్నాలలోని పథకాలపై ప్రకటనలు వస్తున్నాయి. పథకాలపై ప్రజలు గొప్పగా చెప్పినట్లుగా   ప్రకటనలు ఉంటున్నాయి. ఇక మ‌రికొన్ని అడ్వర్టైజ్ మెంట్లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విమర్శలతో నిండి ఉంటున్నాయి.  సాధారణంగా యూట్యూబ్ ఏదైనా ప్రోడక్ట్, కంపెనీ గురించి ప్రకటనలకు ఒక స్థాయి ఛార్జి చేస్తే.. రాజకీయ ప్రకటనల కోసం మరో స్థాయిలో వసూళ్లు చేస్తుంది.  ఈ స్థాయిలో యూట్యూబ్ యాడ్స్ ఇవ్వాలంటే కనీసంలో కనీసం వందల కోట్లలో ఖర్చు ఉంటుంది. అలా వందల కోట్లు వ్యయం చేసి మరీ ప్రకటనలు గుప్పిస్తున్న వైసీపీ ఇందు కోసం పార్టీ సొమ్మును కూకుండా ప్రజల సొమ్మును అంటే ప్రభుత్వ సొమ్మును వ్యయం చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేసే లెక్కలో ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రకటనలు ఇస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఈ ప్రకటనలలో కొన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలతో నిండి ఉంటున్నాయి. దీంతో సామాజిక మాధ్యమంలో ప్రకటనల కోసం ప్రభుత్వం ఇష్టారీతిగా, అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేస్తోందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.   వైసీపీ  వర్గాల   సమాచారం మేరకు ఇప్పటి నుండి మరో నాలుగు నెలల పాటు ప్రకటనలు ఇచ్చేలా యూట్యూబ్ తో  వైసీపీ ఒప్పందం చేసుకుంది.  దీనిని బట్టి చూస్తే ఈ నాలుగు నెలలకు ప్రకటనల ఖర్చు అంటే పార్టీ ప్రచార వ్యయం వందల కోట్లలోనే ఉంటుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.  వైసీపీ పార్టీ నుండి ఈ నిధులు ఖర్చు చేసి ఉంటే దానిపై ఎన్నికల కమిషన్ నిఘా పెట్టి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అలా కాకుండా  ప్రభుత్వ నిధులు కేటాయిస్తే అది ముమ్మాటికీ  అధికార దుర్వినియోగమే అవుతుంది. అంటే ఎలా చూసిన సామాజిక మాధ్యమం ద్వారా వైసీపీ ప్రకటనల రూపేణా చేస్తున్న వ్యయం ఎలా చూసినా నిబంధనలకు తిలోదకాలు వదిలేసి చేస్తున్నదేనన్ని పరిశీలకులు  నిశ్చితాభిప్రాయం. 

సక్సెస్‌కి బ్రాండ్ అంబాసిడర్ మల్లన్న!

మంత్రి చామకూర మల్లారెడ్డి.. ఈ పేరు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మల్లన్న సభలు, సమావేశాలు, ప్రసంగాలకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది.   ఔను.. పూలమ్మినా.. పాలమ్మినా అంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన ఒక్క ప్రసంగం.. సోషల్ మీడియాలో దుమారమే రేపింది. పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడిన.. సక్సెస్ అయినా అంటూ తన జీవితంలోని సక్సెస్ మంత్రను ఓ సభలో  మల్లారెడ్డి వివరించిన తీరు  ఆయనకి ఎక్కడలేని ఫేమ్ ను తీసుకొచ్చింది.   డిగ్రీ చదువుని మధ్యలోనే ఆపేసినట్లు చెప్పుకొనే మల్లారెడ్డి.. హైదరాబాద్ వేదికగా పలు విద్యాసంస్థలను స్థాపించి బడా బిజినెస్‌మ్యాన్‌గా   మంచి పేరు తెచ్చుకున్నారు. నిజానికి 2014 ముందు మల్లారెడ్డి రాజకీయాలలో ఎవరికీ తెలియదు. 2014లో టీడీపీ తరపున మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.  ఆ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికైన ఏకైక వ్యక్తి మల్లారెడ్డే.  ఆ తర్వాత 2016లో మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)లో చేరారు. 2018 ఎన్నికల్లో  ఆ పార్టీ అభ్యర్థిగా  మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచి.. కేసీఆర్ కేబినెట్ లో స్త్రీ, శిశు సంక్షేమ, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మళ్లీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి  బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, ర్యాలీలు, మీడియా డిబేట్లతో ఆయన బిజీగా ఉన్నారు.   పూలమ్మినా, పాలమ్మినా మల్లారెడ్డి అలా కష్ట పడే విజయానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగారు.  తెలుగు రాష్ట్రాలకు ఎందరో యువ ఇంజనీర్లను, వైద్యులను అందిస్తున్నారు. ఆయన స్థాపించిన  కాలేజీలలో చదివిన ఎందరో విద్యార్థులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నేటికీ ఆయన కాలేజీలంటే ఒక బ్రాండ్.. ఆయన కాలేజీలలో సీటు పొందడం విద్యార్థులకు ఒక క్రేజ్. ఐటీ ఇండస్ట్రీ నుండి కార్పొరేట్ హాస్పటిల్స్ వరకూ..  ప్రపంచ పారిశ్రామిక రంగం నుండి.. అంతర్జాతీయ విమానయానం వరకూ.. ఆయన కాలేజీ విద్యార్థులంటే పిలిచి కొలువులు ఇవ్వాల్సిందే. ఇదీ విద్యారంగంలో ఆయన సెట్ చేసిన ట్రెండ్.  ఆయన విద్యాసంస్థలలో విద్యార్థులే కాదు.. పనిచేసే ఉద్యోగులకు ఒక క్రేజ్ ఉంటుంది. ఆయన కాలేజీ సిబ్బందిగా ఉద్యోగం సంపాదిస్తే లైఫ్ సెటిల్ అయినట్లే అనే టాక్ ఉంటుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా మల్లారెడ్డి కాలేజీలలో ఉద్యోగాలకు పోటీ ఉంటుంది. ఇక రాజకీయాలలో కూడా అంతే. ఆయన మాట తీరు ఫన్నీగా ఉండొచ్చు కానీ ఆయన పనితీరులో వంకలు పెట్టాల్సిన పనిలేదంటారు రాజకీయ విశ్లేషకులు. ఆయన ఏ పార్టీలో ఉన్నా మనసు పెట్టి పనిచేస్తారు. ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పని చేస్తారు. అందుకే మల్లారెడ్డి అంటే అన్ని పార్టీల నేతలకు దగ్గరి మనిషి అనే భావన ఉంటుంది. కష్టాన్ని నమ్ముకోని ఎదిగిన మనిషి కదా దాని విలువ తెలుసు కనుకనే తన కష్టాన్ని పదిమందికి చెప్పుకుంటారు.  ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ మాత్రం ఆయనను విజనరీ ఉన్న వ్యక్తిగా గుర్తించింది. ఈ ఏడాది ఆగస్టులోనే మల్లారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్ అవార్డ్ దక్కింది.  సైకిల్ మీద పాలమ్మిన వ్యక్తి నేడు ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్ లో విజనరీ మ్యాన్ గా చోటు దక్కించుకున్నారంటే సక్సెస్ కి అసలు సిసలైన నిదర్శనం ఇదే అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరమేముంటుంది?!

జీ.వినోద్ సహా మాజీ క్రికెటర్ల నివాసాలలో ఈడీ సోదాలు..

మాజీ క్రికెటర్ల నివాసాలలో  బుధవారం (నవంబర్ 22) ఈడీ సోదాలు నిర్వహించింది. మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్ నివాసాలతో పాటు హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు జి. వినోద్ నివాసాలలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది.  హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలపై వీరిపై ఏసీబీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుల ఆధారంగానే ఇప్పడు ఈడీ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. కాగా ఈ సోదాలలూ అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్, జి.వినోద్ ల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకున్న ఈడీ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.   కాగా మంగళవారం కూడా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ నివాసాలలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది. అయితే బుధవారం (నవంబర్ 22) వినోద్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. అయితే వినోద్ హెచ్ సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కావడం, గతంలో అంటే ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ ఈడీ సోదాలు జరిగాయని అంటున్నారు. వినోద్ నివాసంపైనే కాకుండా హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్, అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ నివాసాలపై కూడా ఈడీ దాడులు నిర్వహించింది. ఈముగ్గురిపైనా కూడా ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో జరిగిన అవినీతిపై తెలంగాణ ఏసీబీ చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ చార్జిషీట్ లలో ప్రస్తావించిన అంశాలపైనే ఇప్పుడీ దాడులు జరిగినట్లు చెబుతున్నారు. అలాగే చార్జిషీట్ లో అంశాలపై ఈడీ ఈ ముగ్గురినీ ప్రశ్నించి వివరాలను సేకరించినట్లు తెలియవచ్చింది.   

విశాఖపట్నంలో స్కూల్ ఆటోను ఢీ కొట్టిన లారీ...ఏడుగురు చిన్నారులకు గాయాలు 

విశాఖపట్నంలో  బుధవారం ఉదయం ఆటో లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఇందులో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.   పిల్లలను స్కూలుకు తీసుకెళుతున్న ఆటోను ఓ ట్రక్కు వేగంగా ఢీ కొట్టింది.  ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్, క్లీనర్ పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు ఆటో డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయాలపాలైన చిన్నారులు బేతని స్కూలు విద్యార్థులని పోలీసులు తెలిపారు.విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు,  స్కూలు పిల్లల ఆటోను  బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో రెండు పల్టీలు కొట్టింది. దీంతో  స్కూలు పిల్లలు ఎగిరి బయటపడ్డారు. వెంటనే చిన్నారులను స్థానికులు హుటాహుటిన స్థానికంగా ఉన్న సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కు డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయపడ్డ విద్యార్థులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మిగతా పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. 

కాంగ్రెస్ గూటికి నటి దివ్యవాణి

ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా పార్టీలలో చేరికల జోష్ తగ్గలేదు. వరుస చేరికలతో కాంగ్రెస్ కళకళలాడుతోంది. తాజాగా నటి దివ్యవాణి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో సినీ కళ కూడా కాంగ్రెస్ కు తోడైందని అంటున్నారు. నటి దివ్యవాణి రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీతో ఆరంభమైంది.  ఆమె 2019లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితు ఆ తరువాత ఆమె పార్టీకి రాజీనామా చేశారు. 2022లో పార్టీకి రాజీనామా చేసిన దివ్యవాణి అప్పటి నుంచీ ఏ పార్టీలోనూ చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమె కాంగ్రెస్ గూటికి చేరారు.  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో దివ్యవాణి పార్టీ కండువా కప్పుకున్నారు. వరుస చేరికలతో ఇప్పటికే మాంచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్   ఇప్పుడు నటి దివ్యవాణి చేరికతో సీనీ గ్లామర్ కూడా సంతరించుకున్నట్లైంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలో అసంతృప్తి, అసమ్మతి నేతలు కాంగ్రెస్ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ లో లేడీ అమితాబ్ గా తిరుగులేని గుర్తింపు ఉన్న నటి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆమె వాగ్ధాటితో  బీజేపీ, బీఆర్ఎస్ లపై చేస్తున్న విమర్శలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ రాజకీయాలలో చురుకుగా ఉన్న విజయశాంతి చేరిక  ఎన్నికల వేళ కాంగ్రెస్ కు అదనపు బలంగా మారిందనడంలో సందేహం లేదు. అదే విధంగా నటి దివ్యవాణి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం పార్టీలో సినీగ్లామర్ అదనపు ఆకర్షణగా మారిందని పరిశీలకులు అంటున్నారు.  

బర్రెలక్కసభపై దాడి

తెలంగాణ రాజకీయాలలో నవ సంచలనం బర్రెలక్కపై దాడి జరిగింది. ఎంత చదువుకున్నా, ఏళ్ల తరబడి కోచింగ్ లు తీసుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వచ్చే దారే కనిపించడం లేదని ఆరోపిస్తూ, ప్రభుత్వోద్యోగం కోసం కోచింగ్ లు తీసుకుంటూ డబ్బులు, సమయం వృధా చేసుకోవడం కంటే బర్రెలు కాసుకోవడం బెటర్ అంటూ శిరీష అనే నిరుద్యోగ యువతి బర్రెలక్కడా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది.   తాను నిరుద్యోగుల గొంతుకనవుతానంటూ బర్రెలక్క ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. మహబూబ్ నగర్‌లోని కొల్లాపూర్ నియోజకవర్గం నుండి బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచింది.  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో శిరీష నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నది. ఆమె ప్రచారానికి జనం బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆమెకు సంఘీభావం తెలుపుతున్నారు. పలువురు ప్రచారానికి ఆర్థికంగా సహకారం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీల గుండెల్లో దడ మొదలైంది. కేసీఆర్ ప్రచారంలో కూడా బర్రెలక్క ఎన్నికల చిహ్నం విజిల్ సందడి చేయడంతో ఆయన ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇలా జోరుగా సాగుతున్న బర్రలక్క ప్రచారం ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారిందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.   ఈ నేపథ్యంలో  బర్రెలక్క మంగళవారం కొల్లాపూర్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో గుర్తుతెలియని వ్యక్తులు   దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు చీల్చుతాననే భయంతోనే తనపై దాడి చేశారని అన్నారు. తనపై దాడి చేసింది ఏ పార్టీ వారో తెలిదయన్నారు. రాజకీయాలు అంటేనే రౌడీయిజం అనేవారు.. కానీ తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానన్నారు. నిరుద్యోగుల కోసం పోరాడాటానికి వస్తే.. తనపై ఇలా దాడులు చేస్తున్నారని ఆమె భోరున విలపించారు. ఇప్పటి వరకు తనకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినా తాను  ఎవరి పేరూ బయటపెట్టలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. పోలీసులకు తమకు రక్షణ కల్పించాలని కోరారు.

ఎవరీ బర్రెలక్క..ఏమా కథ!

బర్రెలక్క... బర్రెలక్క.. బర్రెలక్క.. తెలంగాణ ఎన్నికల వేళ.. ఈ పదమే అందరి నోట్లో తెగ నానుతోంది. అంతేకాదు.. ఈ బర్రెలక్క వీడియోలు.. ఆమెపై పలు కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో   రచ్చ రంబోలా చేసి పారేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అక్కడక్కడ వినిపించిన ఆమె పేరు ప్రస్తుతం   సునామీలాగా జనంలో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అలాంటి వేళ.. అసలు ఇంతకీ ఎవరీ బర్రెలక్క? అని ప్రపంచంలోని తెలుగు వారంతా ఆసక్తిగా ఆమె గురించి ఆరా తీస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం బర్రెలక్క స్వస్థలం. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బీకాం డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతోంది. ఆ క్రమంలో టీపీఎస్‌సీ పరీక్షల్లో పేపరు లీకులు, కోర్టు కేసులు, పరీక్షలు వాయిదాలు మీద వాయిదాలు పడడంతో తీవ్ర నిరాశ చెందింది. ఆ క్రమంలో ఎన్ని డిగ్రీలు చదివినా.. ఉద్యోగాలు రావడం లేదని.. అందుకే బర్రెలు కాస్తున్నానంటూ.. నిరుద్యోగి శిరీష తీసిన వీడియో... సోషల్ మీడియాను షేక్ చేసింది... చేస్తోంది. అలా శిరీష.. బర్రెలక్కగా మారి.. కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగింది. ఆమెకు కేంద్ర ఎన్నికల సంఘం విజిల్  గుర్తు కేటాయించింది.  రాజకీయమన్నా.. ఎన్నికలన్నా.. కోట్లాది రూపాయిల ఖర్చుతో కూడుకొన్న పని.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. పార్టీకి ఫండ్ ఇవ్వడమే కాదు.. ఓటర్లను నోట్లతో కొనుగోలు చేసే కేపాసిటీ ఉన్న కోటీశ్వరులే ఎన్నికల బరిలో నిలవాలనే ఓ సంప్రదాయానికి రాజకీయ పార్టీలు ఎప్పుడో తెర తీశాయి. అలాంటి వేళ.. కేవలం బర్రెలు కాసుకొనే ఓ యువతి.. అదీ కూడా చాలా చిన్న వయస్సులోనే  ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయం తీసుకోవడం,  ఆ వెంటనే ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా.. నడిచి వెళ్లి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసింది బర్రెలక్క. ఆ క్రమంలో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలంటూ పలువురు వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చినా అదరక బెదరక.. మొక్కవొని ధైర్యంతో నిలబడింది. ఇక ఎన్నికల ప్రచారంలో  సైతం తన దైన శైలిలో ఈల వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇక ఆమె చేసే ఈ ఈల శబ్దానికి దశాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థల గుండెల్లో గోల మొదలైంది. అలాగే నిరుద్యోగుల ప్రతినిధిగా శిరీష.. తన ప్రచారంలో భాగంగా యూట్యూబ్‌లో ఓ పాటను సైతం విడుదల చేసింది. కదిలే ఓ అడుగు .. యవతకు నువ్వు వెలుగు... కదిలింది మన బర్రెలక్క అదిగో లేవర యువత అంటూ సాగుతున్న పాట.. సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరోవైపు మన కోసం ధైర్యంగా బరిలో నిలిచిన బర్రెలక్కకు మనం మద్దతుగా నిలుద్దామంటూ తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులు సైతం ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గంలో ప్రతీ మండలంలో ప్రజలు స్వచ్చందంగా ముందుకు .. ఆమెకు   మద్దతు తెలుపుతుండడం గమనార్హం.   మరోవైపు.. ఇదే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అధికార బీఆర్ఎస్ అభ్యర్థిగా బీరం హర్షవర్థన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ అభ్యర్థిగా సుధాకర్ బరిలో దిగారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్    అభ్యర్థుల మధ్యే ఉంటుందని తొలుత అంతా భావించారు. కానీ బర్రెలక్క సెడన్ ఎంట్రీతో.. నియోజకవర్గంలో పోలిటికల్ సీనేరియా ఒక్కసారిగా తారుమారు అయింది.  అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పార్టీ అధినేతలు, అగ్రనేతలు, కీలక నేతలు ఎన్నికల ప్రచారాలు,  ర్యాలీలు నిర్వహించినా.. బర్రెలక్కకు వస్తున్న ప్రజాదరణ ముందు వారి ప్రచారం దిగదుడుపేనని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.  ఇంకోవైపు బర్రెలక్క గురించి కేంద్రపాలిత ప్రాంతం యానం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. ఆ క్రమంలో ప్రచారం కోసం లక్ష రూపాయిల విరాళాన్ని ఆమెకు ఆయన అందజేశారు. అంతేకాకుండా.. ఈ నెల 27వ తేదీన ఆమెను కలుస్తున్నట్లు ఆయన ప్రకటించడమే కాకుండా.. ఆమె ప్రచారం కోసం మరింత విరాళం ఇవ్వనున్నట్లుతెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చిన నిరుత్సాహపడవద్దని.. బర్రెలక్కకు ఆయన సూచించారు.   ఇక తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకొంది. అలాంటి వేళ.. దశాబ్దాల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీల నుంచి కాకులు తీరిన యోధులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో అభ్యర్థుల మధ్య ఎన్నికల ప్రచారం హోరా హోరీగా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు అన్ని సాధనాలను ఉపయోగించుకొంటూ ముందుకు వెళ్తున్నాయి. అలాంటి వేళ.. డబ్బు, బ్యాక్ గ్రౌండ్, హంగు ఆర్బాటం లేకుండా ఎంట్రీ ఇచ్చిన ఈ బర్రెలక్క.. ఈ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం.. ప్రపంచం ఆమెను పరిచయం చేసుకొంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

కలకలం రేపిన ఉత్తమ్ పొలిటికల్ కన్సల్టెంట్ కిడ్నాప్!

తెలంగాణలో ఎన్నికల వేడి పీక్స్ కు చేరింది. విమర్శలు, ప్రతివిమర్శల స్థాయి దాటి కిడ్నాప్ లు, దాడుల వరకూ చేరింది. ఇప్పటికే ఎన్నిల ప్రచారంలో ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థిపై హత్యాయత్నం చేసిన సంగతి విదితమే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్య‌ర్థి కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై యత్నాయత్నం సంచలనం సృష్టించిన సంగతి విదితమే.   ఆ తరువాత కూడా ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చే సరికి ఆ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.  ఇక తాజాగా మంగళవారం అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొలిటికల్ కన్సల్టెంట్ కిడ్నాప్ యత్నం ఉదంతం సంచలనం సృష్టించింది. పైగా ఈ కిడ్నాప్ కు ప్రయత్నించింది అధికార పార్టీ ఎమ్మెల్యే సైది రెడ్డి కావడం గమనార్హం.  యం.పి ఉత్తమ్ కోసం పనిచేస్తున్న  పొలిటికల్ కన్సల్టెంట్ బండి రామ స్వామిని కిడ్నాప్ చేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యూ సైది రెడ్డి ప్ర యత్నించారని  బాధితుడు రామస్వామి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వెళ్లి రామస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రచారం ముగించుకుని వెళుతునన తనను బీఆర్ఎస్ అభ్యర్థి   సైది రెడ్డి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారనీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం పని చేయవద్దని బెదరించారనీ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.   ఎమ్మెల్యే సైది రెడ్డి తన కారు  బలవంతంగా ఎక్కించుకొని  తన సెల్ ఫోన్ గుంజికొని కోదాడ రోడ్ లో గల తన విల్లా  కు తీసుకొని పోయి మీ టీమ్ సభ్యులు ఉత్తమ్ కు పని చేయడానికి వీలు లేదని హెచ్చరించారని బండి రామస్వామి పేర్కొన్నారు.  అనంతరం  మేము లక్షల కోట్లు పెట్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం  మా జీవితాలతో ఆడుకుంటావా అని స్థానిక సి. ఐ  రామ లింగారెడ్డి కి ఫోన్ చేసి వీరి పై దొంగలు గా కేసు పెట్టాలని, వీరి ఐ.డి కార్డులు తీసుకోవాలని సైది రెడ్డి చెప్పారని బాధితుడు తెలిపారు..అంతే కాకుండా  తాను  ఫ్యాక్షనిస్టుననీ,  మాట వినకపోతే నిన్నూ నీ కుటుంబాన్ని చంపుతా అని సైదిరెడ్డి తనను  బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. ఆ తరువాత తనను వదిలేసి ఉత్తమ్ కు పని చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మరో మారు హెచ్చరించినట్లు తెలిపాడు.  ఎమ్మెల్యే  సైది రెడ్డి తో తనకు ప్రాణ హాని ఉందనీ, తనకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని బండి రామస్వామి ఫిర్యాదులో కోరారు.  

ఏపీలో దొంగ ఓట్లపై సీఈసీకి తెలుగుదేశం ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లపై తెలుగుదేశం నాయకులు సీఈసీకి ఫిర్యాదు చేశారు.  రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం అనుకూలుర ఓట్లు తొలగిస్తున్నారనీ, అదే సమయంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారనీ తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రతినిథి బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అలాగు దేశంలో అన్ని రాష్ట్రాలలోనూ ఎన్నికల విధులకు టీచర్లను వినియోగిస్తున్నారనీ, ఒక్క ఏపీలో మాత్రం ఎన్నికల కోసం ప్రత్యేకంగా   టీచర్లను వినియోగిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో మాత్రం ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పించారనీ ఈ బృందం సీఈసీకి ఫిర్యాదు చేసింది.   గ్రామ సచివాలయ వ్యవస్థ కనుసన్నల్లోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతోంని ఆరోపించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఈసీకి వివరించినట్లు తెలుగుదేశం నాయకులు తెలిపారు. అక్టోబర్ 27 వరకు దేశవ్యాప్తంగా ఓటర్ల పరిశీలన కార్యక్రమం జరిగిందనీ, అయితే ఏపీలో మాత్రం ఈ కార్యక్రమం జరగలేదని వారు పేర్కొన్నారు.   రాష్ట్రంలో ఫారం 6, 7 , 8 దరఖాస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఒక కుటుంబంలోని వ్యక్తుల ఓట్లను వేర్వేరు బూత్‌లకు కేటాయించిన విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే  చనిపోయిన వ్యక్తుల వివరాలు ఆధారాలతో ఇచ్చినా ఓటర్ల జాబితా నుంచి వారి ఓట్లను తొలగించలేదని ఫిర్యాదు చేశారు.   ఒక వ్యక్తికి రెండు ఓట్లన్న జాబితానుఆధారాలతో సహా ఇచ్చినా చర్యలు తీసుకోలేదనీ,  వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెలుగుదేశం  సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారనీ తెలుగుదేశం ప్రతినిథి బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. సుమారు 160 పోలింగ్ కేంద్రాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయనీ ఆధారాలతో సహా సీఈసీకి తెలిపింది.  నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని,  గ్రామ సచివాల సిబ్బంది ప్రభుత్వ ప్రచారంలో పాల్గొంటున్నారనీ తెలియజేసింది.  గ్రామ సచివాలయ సిబ్బందిని బీఎల్‌వోలుగా నియమిస్తున్నారనీ, వారు ఇంటింటికీ  వైసీపీ జెండాలు పట్టుకుని  వెళ్లి ప్రచారం చేస్తున్నారనీ ఆరోపించింది. ఏపీలో సొంత వ్యవస్థ ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నారి పేర్కొంది. గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల ప్రక్రియలో వాడవద్దని చెప్పినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. అధికార యంత్రాంగమంతా జగన్ కనుసన్నల్లో పనిచేస్తోందని తెలుగుదేశం నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. 

ప్రజాక్షేత్రంలోకి బాబు లోకేష్.. ఇక జగన్ కు చుక్కలే!

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. నాలుగున్నరేళ్ల పాలన కాలంలో కక్షసాధింపుకు ప్రాధాన్యమిచ్చిన సీఎం జగన్.. చివరి ఆరు నెలలలో దాన్ని  తారస్థాయికి తీసుకెళ్లే పనిలో పడ్డారు.   దీంతో అసలే అసంతృప్తితో ఉన్న ప్రజలలో ఇప్పుడు ఆ అసంతృప్తి స్థాయి కూడా తీవమైంది. ఇక్కడా అక్కడా అని లేకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో, అన్ని వర్గాలలో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. దీంతో ప్రతిపక్షాలను అణచివేయాలనో.. లేక అసలు అడ్డు లేకుండా చేయాలనో  కానీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించారు. అర్ధరాత్రి వేళ ఆయన బస చేసిన చోట నుండే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేశారు. అది కూడా కనీసం చార్జ్ షీటులో పేరు కూడా లేకుండా అరెస్టుకు తెగబడ్డారు. ఆ తర్వాత ఆయన  జైలు నుండి బయటకి రాకుండా ఉంచేందుకు కూడా తీవ్రంగా శ్రమించారు. కానీ ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. అది బేషరతుగా. స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ సీఐడీ చూపించలేదని కోర్టు విస్పష్టంగా తేల్చేసింది. దీంతో వైసీపీకి మళ్ళీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.  చంద్రబాబు అరెస్టుకు ముందు అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఉండేది. ఒకవైపు టీడీపీ అధికార ప్రతినిధి నారా లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన, బస్సు యాత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్   వారాహీ యాత్ర  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాయి. ప్రతిపక్షాలు సంధించే ఒక్కో ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేక వైసీపీ నేతలు తెల్ల మొహాలు వేసేవారు. అయితే, చంద్రబాబుఅరెస్టు  తరువాత   వైసీపీకి కొద్దిగా ఊపిరి పీల్చుకుని ఉక్కిరిబిక్కిరి పరిస్థితి నుంచి బయటపడే అవకాశం వచ్చింది.తెలుగుదేశం నిరసనలు, ధర్నాలు హోరెత్తినా.. తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ, విదేశాలలో కూడా చంద్రబాబుకు సంఘీభావంగా జనం బయటకు వచ్చి ఆందోళనలు చేసినా.. ప్రభుత్వ అక్రమాలు, అరాచక పాలన వంటి అంశాల నుంచి ప్రజలను ఏమార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకి వచ్చారో మళ్ళీ టీడీపీ, జనసేనలు కలిసికట్టుగా ప్రభుత్వంపై దాడి మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు కావడంతో ప్రతిపక్ష నేతలు అప్పుడు ఎక్కడ ప్రజా సమస్యలపై పోరాటం ఆపారో.. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుండే మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మునుపటి కంటే జోష్ తో తెలుగుదేశం, జనసేన కలిసి ఇప్పుడు ఈ పోరాటం మొదలు పెట్టనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేకిచ్చిన సంగతి తెలిసిందే.   హైకోర్టులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దక్కింది.. సుప్రీంలో క్వాష్ పిటిషన్ కూడా ఈ నెలాఖరుకి తేలిపోయే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే నిలిచిపోయిన లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగించేందుకు నిర్ణయించారు.    రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర ఎక్కడ అయితే తాత్కాలికంగా నిలిచిందో అక్కడ నుంచే కొనసాగించనున్నారు. ముందుగా అనుకున్నట్లు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగింపు సభ పెట్టాలా.. లేక వైజాగ్ నగరంలోనే భారీ సభతో ముగించాలా అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. యువగళం ముగింపు సందర్భంగా సభ నిర్వహించే విషయమై ఇప్పటికే ఉత్తరాంధ్ర నేతలతో లోకేష్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  కాగా, ఇక ఈ నెలాఖరు నుండి చంద్రబాబు కూడా ప్రజల మధ్యకి వెళ్లనున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మళ్లీ తిరిగి ప్రారంభించనున్నారు.  తర్వాత, సాధ్యమైనంత త్వరలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో పాటు చంద్రబాబు కోసం మరో కొత్త కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, దాదాపు మూడు నెలల తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకి రానున్న చంద్రబాబు ఏం మాట్లాడతారు? ప్రజలకు ఏం చెప్పనున్నారన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. తనపై అక్రమ కేసులు పెట్టి ఎలా వేధిస్తున్నారన్నది చంద్రబాబు ప్రజలకి వివరిస్తే వైసీపీకి మరింత నష్టం తప్పదనే భావన ఉంది. చంద్రబాబు అక్రమ అరెస్గు తరువాత ఆబాలగోపాలానికి బాబు వ్యక్తిత్వ ఔన్నత్యం తెలిసింది. చంద్రబాబు విజన్, చంద్రబాబు గొప్పతనం గురించి ఊరూరా చర్చ జరిగింది. రాజకీయాలతో సంబంధం లేని వారు కూడా బయటకు వచ్చి బాబు రాష్ట్రానికి, దేశానికి చేసిన మేలు గురించి వివరించారు. దీంతో ఇప్పుడు జనం చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది.  అందుకే చంద్రబాబు పర్యటనలకు జనం పోటెత్తడం ఖాయమన్న అంచనాలున్నాయి. అలాగే ప్రజా సమస్యలపై తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణ మొదలైంది. మొత్తంగా చూస్తే చంద్రబాబుకు పూర్తి స్థాయి బెయిల్ దక్కడంతో ఇక వైసీపీకి డౌన్ ఫాల్ ప్రారంభమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇదేమిటి రామచంద్ర ప్రభు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి నేటి వరకు లక్ష అరవై వేల కోట్ల రూపాయిల అవినీతి చేశారని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పులివెందుల ఎస్సైని ఆయన కోరారు. అనంతరం పులివెందుల పోలీస్ స్టేషన్ బయట ముఖ్యమంత్రి   జగన్‌పై రామచంద్రయాదవ్ పలు ఆరోపణలు సంధించారు. అయితే సీఎం జగన్‌ అవినీతిపై రామచంద్రయాదవ్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  సీఎం వైయస్ జగన్‌ అవినీతిపై రామచంద్రయాదవ్ ఫిర్యాదు చేయడంపై నెటిజన్లు ఫక్కున నవ్వుతున్నారు. ఇప్పటికే  జగన్‌పై అక్రమ ఆస్తుల కేసులు చాలానే ఉన్నాయని..  అందులోభాగంగానే ఆయన 16 నెలల పాటు చంచల్ గూడ జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చి.. ముఖ్యమంత్రి అయ్యారని వారు గుర్తు చేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్, జే బ్రాండ్ మద్యం విక్రయాలు, డ్రగ్స్ దందా, గంజాయి అక్రమ రవాణా వగైరా వగైరా ఆరోపణలు   జగన్ ప్రభుత్వంపై ఉన్నాయని.. మరి ఇన్నాళ్లూ ఊరుకొని.. జస్ట్ ఎన్నికలకు ముందు ఇలా సీఎంగారి అవినీతి బాగోతంపై.. అదీ కూడా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అయిన పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో వివరించాలని రామచంద్రయాదవ్‌ను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.   ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంచాయతీ నిధుల దారి మళ్లింపు, లెక్కకు మించి చేస్తున్న అప్పులపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి స్వయంగా ఫిర్యాదు చేశారని..  అలాగే హద్దు అనేదే లేకుండా జగన్ ప్రభుత్వం అప్పుల చేస్తుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆమె స్వయంగా లేఖ సైతం రాశారని.. అదే విధంగా జే బ్రాండ్ మద్యం తాగి ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు రాష్ట్రంలో అధికమవుతోందని.. ఇక మద్యం తాగి మరణిస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే ఉంటుందని.. ఆమె ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. ఢిల్లీ వెళ్లి సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి.. జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో చోటు చేసుకొన్ని ప్రతి అంశాన్ని   ప్రస్తావిస్తూ.. ఓ లేఖను కూడా అందజేశారని.. కానీ ఆ రోజు నుంచి.. ఈ రోజుకు జగన్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకున్న దాఖలాలు  లేవని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.  అలాంటి వేళ... రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేస్తే.. అదీకూడా సీఎం  జగన్ సొంత ఇలాకా పులివెందులకు వెళ్లి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడమేమిటని నెటిజన్లు  సందేహం  వ్యక్తం చేస్తున్నారు. అయినా.. ఈ రామచంద్రయాదవ్.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరుకు చెందిన వారని.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. సీఎం జగన్ రైట్ హ్యాండ్ వైసీపీ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా వాసి అని వారు వివరిస్తున్నారు. అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఈ రామచంద్ర యాదవ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని వారు అంటున్నారు. అవి కూడా ఎంతగా అంటే.. అపాయింట్‌మెంట్ లేకుండా.. అమిత్ షాను నేరుగా కలిసేటంత  అంటున్నారు.  అలాంటిది జగన్ అవినీతిపై రామచంద్రరావు ఏపీ పోలీసులకు అందునా పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటని అంటున్నారు. అంత కంటే రామచంద్రయాదవ్ నేరుగా   అమిత్ షాకు ఫిర్యాదు చేస్తే ఫలితముండేదేమోనని నెటిజన్లు సూచిస్తున్నారు. అదీకాక జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై ఓ వైపు అక్రమ కేసుల నమోదు,  మరోవైపు ఆయా పార్టీ శ్రేణులపై వరుస దాడులు జరుగుతున్నాయని.. అందుకు అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు ఏ జిల్లా.. ఏ ప్రాంతం మినహాయింపు కాదని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాంటిది.. సీఎం  జగన్ అవినీతిపై ఫిర్యాదు చేయడం చూస్తుంటే... ఇది పక్కా ఎన్నికల స్టంట్ అని వారు అభిప్రాయపడుతున్నారు.  అయినా.. వైయస్ జగన్ 16 నెలలు శ్రీకృష్ణుడి జన్మస్థానంలో ఉండి..  ఏడు ఊచలు పదే పదే లెక్కించాడని తెలిసి కూడా ఆయన వద్ద ఉన్న లక్ష కోట్ల రూపాయిల్లో ఎంతో కొంత తమకు ఇచ్చేస్తాడనుకొని.. ఆయన పార్టీకి 151 ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలను ఇచ్చి బంపర్ మెజార్టీతో గెలిపించిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ వాసులదని.. అలాంటి  జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్రంలోని పెద్దలకే ఫిర్యాదు చేసినా లేఖల ద్వారా వివరించానా.. వారి నుంచి కనీస స్పందన కూడా లేదని.. అలాంటిది మీరు పులివెందుల వెళ్లి.. జగన్ అవినీతిపై ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కేసు నమోదు చేస్తారా? ఓ వేళ వారు కేసు నమోదు చేసినా? జగన్ బాబు అవినీతిపై పోలీసులు దర్యాప్తు చేస్తారా? అంటే.. ఈ విషయం అంత నమశక్యంగా లేదని.. ఎందుకంటే.. ఇది ప్రజాస్వామ్య దేశమని..  అదీకూడా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని.. అలాంటి దేశంలో చోరులు, బడా చోరులు, దొరలు, స్కామ్‌ల్లో నిండా మునిగి తేలుతున్న వారు, బాబాలు, స్వామిజీలు, సన్యాసులు వగైరా వగైరా ఎవరైనా అవినీతి చేయవచ్చు, అలాగే అందలం ఎక్కవచ్చని.. కానీ వారు తప్పు చేశారు... అవినీతి చేశారని ఫిర్యాదు చేస్తే మాత్రం.. మన దేశంలోని దాదాపుగా అన్ని వ్యవస్థలకు ఆటోమెటిక్‌గా పక్షవాతం వచ్చేస్తుందని,  అదే పేదలు, నిరుపేదలు, మద్య తరగతి జీవులు .. రూపాయో, పది రూపాయిలో దొంగతనం చేస్తే మాత్రం .. వారిని శిక్షించేందుకు దాదాపుగా అన్ని వ్యవస్థలు పానకం తాగి పూనకం వచ్చినట్లుగా.. ఇంకా చెప్పాలంటే.. ఆయా వ్యవస్థలకు ప్రతినిధులుగా, జవాబుదారీతనానికి అసలు సిసలు నిర్వచనంలాగా నిండు చలాకీతనంతో వ్యవహరిస్తారని నెటిజన్లు తమదైన శైలిలో వివరిస్తున్నారు.

ఆ మూడు రోజులూ మద్యం బంద్.. ఎన్నికల వేళ పార్టీలకు షాక్

ఎన్నికల ప్రచారంలో మందు, డబ్బు ప్రాధాన్యత ఏమిటన్నది అందరికీ తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఎన్నికల సంఘం షాకింగ్ డెసిషెన్ తీసుకుంది. ఈ నెల 30న  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో చివరి రెండు మూడు రోజులు ఎంత కీలకమైనవో అందరికీ తెలసిందే. ఏప్రిల్ 28 సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడుతుంది. ఇక అక్కడ నుంచీ ప్రచారం అంతా మద్యం, డబ్బులతో జరుగుతుందన్నది తెలిసిందే. ఈ దశలో నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకూ రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. తెలంగాణలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు లైసెన్స్ దారులకు ఉత్తర్వులు జారీ  అయ్యాయి. ఈ ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  అధికారులు హెచ్చరించారు. గత ఎన్నికలు, ఉపఎన్నికల్లో మద్యం ఏరులైన పారిన సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం.. ఈసారి అలా జరగకూడదని ముందుగానే కఠిన నిర్ణయాలు తీసుకుందని అంటున్నారు. 

రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు కానీ.. సొంతానికి ప్యాలెస్ నిర్మాణమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. జగన్ అధికారం చేపట్టేనాటికి అమరావతి రాష్ట్ర రాజధానిగా అన్ని హంగులూ సంతరించుకుని.. ప్రపంచమేటి నగరంగా రూపుదాల్చడం ఖాయమన్న ఆశలను రాష్ట్రప్రజలలో రేకెత్తించింది. అయితే జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ.. అమరావతి నీరుగారడం ప్రారంభమైంది. విధ్వంసం వినా, నిర్మాణం తెలియని జగన్ సర్కార్ అమరావతి విధ్వంసంతోనే పాలన ఆరంభించింది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన ఆ విధ్వంస పాలన అమరావతిని శ్మసానంతో పోల్చడం, నిర్వీర్యం చేయడం, మూడు రాజధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకుని రాష్టాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చడం వరకూ సాగింది. నాలుగున్నరేళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని ఏదన్నది జగన్ సర్కార్ తేల్చలేకపోయింది. మూడు రాజధానులు అంటూ మొదలు పెట్టి చివరకు విశాఖ వద్దకు వచ్చి ఆగింది. న్యాయరాజధాని కర్నూలు అసలు మా యోచనలోనే లేదని కోర్టులకు చెప్పేసింది. శాసన రాజధాని అని చెప్పిన అమరావతిని నిర్వీర్యం చేసేసింది. విశాఖ నుంచైనా పాలన సాగిస్తారో లేదో తేలలేదు కానీ.. ప్రజలు అధికారం ఇచ్చింది తాను ప్యాలస్ లను నిర్మించుకోవడానికే అన్నట్లుగా జగన్ ప్రజా ధనంతో రుషికొండకు బోడి గుండు కొట్టేసి మరీ ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఆ భవన నిర్మాణం విషయంలో ఆది నుంచీ కోర్టులకు, ప్రజలకు అన్నీ అబద్ధాలే చెబుతూ వచ్చారు.  పర్యాటక భవనాలే అంటూ కోర్టులకు సైతం అసత్యాలు చెప్పారు. ఆ నిర్మాణాలకు అయిన వ్యయం ఎంతన్నది బయటకు తెలీయకుండా రహస్యంగా ఉంచారు. జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. కానీ  హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ గత్యంతరం లేని పరిస్థితుల్లో  రుషికొండ ప్యాలెస్ నిర్మాణ వ్యయం వెలుగులోనికి  వచ్చింది. రుషికొండపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ఇంత కాలం రహస్యంగా ఉంచిన పది జీవోలనూ కోర్టు ఆదేశాల కారణంగా బయట పెట్టక తప్పని పరిస్థితి జగన్ సర్కార్ కు ఏర్పడింది. దీంతో రుషికొండపై ప్యాలెస్ నిర్మాణానికి 433 కోట్ల రూపాయలు వ్యయం అయ్యిందన్న విషయం తేటతెల్లమైంది. అంచనా వ్యయానికి మించి ఖర్చు చేసినట్లు తేటతెల్లమైంది. పర్యాటక అభివృద్ధి అంటూ మొదలు పెట్టి పర్యావరణ విధ్వంసానికి సైతం వెరవకుండా పచ్చటి రుషికొండకు గుండు కొట్టి మరీ నిర్మించిన భవనానికి ప్రజాధనం ఎంత వ్యయం అయ్యిందన్నది తెలిపే పది జీవోలు ఇప్పుడు ప్రభుత్వ వెబ్ సైట్ లో దర్శనమిస్తున్నాయి. పర్యాటక అభివృద్ధికి అంటూ ఆరంభించిన నిర్మాణాలకు కొండ చుట్టూ నో ఎంట్రీ బోర్డులు ఎందుకు?.. అంటూ ఇంత కాలం ప్రజలు, విపక్షాలు నిలదీస్తున్నా లెక్క చేయకుండా రుషి కొండ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా అనధికారికంగా ప్రకటించేసి ఒక రహస్యోద్యమంలా పని కానిచ్చేసిన జగన్ రెడ్డి రుషికొండ ప్యాలెస్ నిర్మాణం బండారం ఇప్పుడు బయటపడిపోయింది.   విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అద్దె భవనంలో నివాసం ఉండి ఏపీ ప్రజలకు రాజధాని నిర్మించాలని ఆరాటపడితే..  తరువాత సీఎం అయిన జగన్ నిర్మాణంలో ఉన్న రాజధానిని నిర్వీర్యం చేసేసి..   రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసి సొంత ప్యాలస్ ల నిర్మాణాలపై దృష్టి పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలనెలా ప్రభుత్వోద్యోగులకు సమయానికి జీతాలివ్వలేని ఆర్థిక దుస్థితిలో రాష్ట్రాన్ని ముంచేసిన జనగ్ రెడ్డి.. ప్రజాధనంతో  సొంతానికి రుషికొండ ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడం,  ఆ ప్యాలస్ లో  ఫర్నిచర్ కే 14 కోట్లు ఖర్చు చేయడం బయటపడిన జీవోల ద్వారా వెలుగులోకి వచ్చింది.  గడిచిన నాలుగున్నరేళ్లలో  అమరావతిలో కనీసం ఒక్క ఇటుక కూడా వేయని జగన్   కోట్ల ప్రజా ధనాన్ని ఇలా ప్యాలెస్ నిర్మించుకోవడానికి వెచ్చించడం ఏమిటని జనం నిలదీస్తున్నారు.