old dispute continue in new year

కొత్త సంవత్సరంలోకి పాత పంచాయతీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన సంవత్సరాలు ఒకెత్తు అయితే  2022 సంవత్సరం ఒక్కటీ ఒకెత్తు అన్నట్లుగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  కేంద్ర రాష్ర్త ప్రభుత్వాల మధ్య దూరం పెరిగింది. సంవత్సరం ఆరంభంలో కేంద్రం పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన యుద్ధం, చినికి చినికి గాలి వానగా మారింది. మరో వంక, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత సంవత్సరం చివర్లో ( నవంబర్ 2021) జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఉత్సాహంతో  రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించింది. జులైలో బీజేపీ జాతీయ కార్యవర్గ  సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించి... రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాసకు సవాల్ విసిరింది. మరో వంక జాతీయ స్థాయిలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు తెరాస అధినేత , ముఖ్యమంత్రి కేసిఆర్ బీజేపీ యేతర, కాంగ్రెస్సే తర పార్టీలను ఏకం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగించారు.. అయితే, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక పోవడం వల్లనో ఏమో .. కూటమి ప్రయత్నాలు పక్కన పెట్టి, తెరాస పేరును భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్) గా మార్చి జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం  చేశారు.  అయితే ఆ ప్రయత్నాల సంగతి ఎలా ఉన్నా..  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన దూరం రాజకీయంగా  బీజేపీ, బీఆర్ఎస్  మధ్య పెరిగిన వైరం  సంవత్సరం చివరకు వచ్చే సరికి మూడు వివాదాలు .. ఆరు కొట్లాటలు చందంగా మారింది. స్కాములు, సిబిఐ విచారణలు, ఈడీ దాడులు, కోర్టు విచారణలు, అరెస్టులుగా కథ నడుస్తోంది.  ముఖ్యంగా ఢిల్లీ రాష్ట్రంలో  చోటుచేసుకున్న మద్యం స్కామ్ తెలంగాణను కుదిపేసింది. మద్యం స్కాంలో భాగంగా తెలంగాణ వైపు దర్యాప్తు సంస్థలు తిరిగి చూశాయి.  హైదరాబాదులో ముడుపులు పట్టుకున్నాయి. ముడుపులు, పర్మిట్ల బాగోతంలో ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోయినపల్లి అభిషేక్ రావు తదితరుల పేర్లు ఛార్జీషీటులోకి ఎక్కాయి.   నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ తరపున కొందరు ప్రయత్నించడం ఈ ఏడాది తెలంగాణ రాజకీయాల్లో మరో హైలైట్ గా నిలిచింది. గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి బీజేపీలో చేరితే వందల కోట్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి రక్షణ ఉంటుందని నిందితులు చెప్పిన ఆడియోలు, వీడియోలు వెలుగు చూశాయి. బీజేపీ ప్రతిష్ట మసకబారింది, అయితే .. సంవత్సరం చివర్లో అటు లిక్కర్ కేసు, ఇటు ఎమ్మెల్యేల బేరసారాల కేసు మలుపులు తిరుగుతోంది ..  కొత్త సంవత్సరంలో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో .. ఎక్కడికి చేరుతుందో .. 

round up 2022 bjp bags gujarat anain

రౌండప్ 2022..గుజరాత్ లో మళ్లీ బీజేపీ ప్రభంజనం

డిసెంబర్  కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. డిసెంబర్ 1..  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 189 స్థానాలకు గానూ 89 నియోజక వర్గాల్లో జరిగిన మొదటి విడత పోలింగ్లో 56.8 శాతం పోలింగ్ జరిగింది . రెండవ తుది విడత పోలింగ్ డిసెంబర్ 5 న జరుగుతుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు.  భారత దేశం జీ 20 అధ్యక్ష పదవిని స్వీకరించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 32 వేర్వేరు రంగాలలో 300 సమావేశాలు నిర్వహించారు. కాగా, విదేశాంగ సఖ మంత్రి జైశంకర్ జీ 20 అధ్యక్ష పీఠం నుంచి  భారత దేశం, ప్రపంచానికి తన గళాన్ని వినిపిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్త పరిచారు. డిసెంబర్ 3.. ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. భారత టేబుల్ టెన్నిస్ వెటరన్ ఆటగాడు శరత్ కమల్ కు అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో అతను 3 బంగారు పతకాలు, ఒక రజతం సాధించాడు. డిసెంబర్ 4.. నేడు భారత నౌక దినోత్సవం .. నేవీ డే ..ఈ సందర్భంగా...దేశమంతా నేవీ సేవల్ని స్మరించుకుంటోంది. 1971లో భారత్, పాకిస్థాన్‌ యుద్ధ సమయంలో "ఆపరేషన్ ట్రిడెంట్" తో  విజయం సాధించింది నావికా దళం. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4వ తేదీన భారత నౌకా దళ దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రముఖులంతా నేవీ సేవలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.  డిసెంబర్ 5.. గుజరాత్ రెండవ దశ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 93 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. రెండవ దశలో మొత్తం 2.54 కోట్ల ఓటర్లు (59శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.  డిసెంబర్ 8.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 182 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీ 156 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 17, ఆమాద్మీ 5 సీట్లలో విజయం సాధించింది. ఇతరులకు 4 స్థానాలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌ లో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ.. ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని..అక్కడి ప్రజలు ఈసారి కూడా కొనసాగించారు. బీజేపీని ఓడించి.. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు.  డిసెంబర్ 10.. ప్రపంచ  మానవ హక్కుల దినోత్సవం. 1948లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన రోజు, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన వెలువడిన రోజు. ఈ సంవత్సరం దరికీ సమాన గౌరవం, స్వేచ్ఛ సమ న్యాయం’ అనే థీమ్’ ప్రధాన అంశంగా జరుపుకుంటున్నారు.   డిసెంబర్ 15.. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం రాజ్యాంగ పద్ధతుల ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని, రహదారిపై కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ఇరు రాష్ట్రాలను కోరారు.కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలతో సమావేశం అనంతరం షా మాట్లాడుతూ, సమస్యను పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల మంత్రులతో ఆరుగురు సభ్యుల ప్యానెల్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. డిసెంబర్ 22.. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కొవిడ్ కేసుల పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఈ మేరకు అయన లోక్ సభలో ఒక ప్రకటన్ చేశారు  ముఖ్యంగా రాబోయే పండుగలు,నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. డిసెంబర్ 26... ప్రజల్లో న్యూనతాభావాన్ని కలిగించడానికి చరిత్ర పేరుతో కల్పిత కథనాలు బోధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వీటిని అధిగమించి ముందుకు సాగాలంటే తొలుత సంకుచిత భావజాలం నుంచి విముక్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలంలో కోల్పోయిన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు గతంలో చోటుచేసుకున్న తప్పిదాలను నవీన భారత్‌ సరిదిద్దుతోందని అన్నారు. గురు గోవింద్‌ సింగ్‌ వారసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. తొలిసారి నిర్వహించిన ‘వీర్‌ బాల్‌ దివస్‌’ కార్యక్రమంలో ప్రధాని మోడీ  పాల్గొని ప్రసంగించారు. డిసెంబర్ 26..భారత్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపిన చైనా, పాకిస్థాన్‌లు మన దేశంపై ఎప్పుడైనా దాడి చేయొచ్చని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యపై స్పందించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాహుల్‌ గాంధీ ఇంకా 1962ల్లోనే జీవిస్తున్నారని విమర్శించారు. డిసెంబర్27.. దేశంలో కోవిడ్ ఎమర్జెన్సీ సన్నద్ధతను అంచనా వేసేందుకు దేశంలోని  అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. జమ్మూ మరియు కాశ్మీర్ నుండి అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీర్ల మొదటి బ్యాచ్ భారత సైన్యంలో చేరింది.భోపాల్‌లో జరిగిన మహిళల బాక్సింగ్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో లోవ్లినా బోర్గోహైన్ మరియు నిఖత్ జరీన్ స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. డిసెంబర్ 29.. బ్రెజిల్‌ దిగ్గజం, ఫుట్‌బాల్‌ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీలే(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పీలే సావోపాలోలోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 29.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేవలం పార్టీని నడుపుతారని, గాంధీ కుటుంబం చేతిలోనే నాయకత్వం ఉంటుందని ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన మాటలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు బీజేపీకి అస్త్రంగా మారాయి. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు లేఖ పై  సీఆర్ పీఎఫ్ స్పందించింది. సెక్యూరిటీ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంలేదని, రాహుల్ గాంధీ భద్రతా మార్గదర్శకాలను తరచూ ఉల్లంఘించారని పేర్కొంది. 2020 నుంచి ఇప్పటి వరకు 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను రాహుల్ అతిక్రమించారని, ఈ విషయాన్ని ఆయనకు కూడా తెలియజేసినట్లు వివరించింది. తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి తెరలేచింది. మొత్తం 783 ఉద్యోగాలకు టీఎస్ పీఎస్ సీ నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా 165 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) ఉద్యోగ ఖాళీలు ఉండగా, 126 మండల్ పంచాయత్ ఆఫీసర్ పోస్టులు, 98 తహసీల్దార్ పోస్టులు ఉన్నాయి. మధ్యాహ్నం 12:27 గంటలకు గౌహతికి ఈశాన్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం యొక్క లోతు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. డిసెంబర్ 30.. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

rishab panth injured

రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలు

శుక్రవారం ఉదయం  జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళుతుండగా రూర్ఖీ వద్ద రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొంది. దీంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. తొలుత పంత్కు రూర్కీ సివిల్ హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంత్ కు వీపు, నుదురు మీద, కాలికి గాయాలయ్యాయి . కారులో మంటలు చెలరేగుతున్న సమయంలో కారు విండో పగలగొట్టుకుని రిషభ్ పంత్ బయటకు దూకేశాడు. కారు పూర్తిగా దగ్ధమైంది.  రిషబ్ పంత్ ఒక్కడే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు.  మంగ్లౌర్ పీఎస్ పరిధిలోని నేషనల్ హైవే-58లో జరిగిన ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని   పంత్‌ను రూర్కీలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం రిషభ్ పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. పంత్ కు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. టీమ్ ఇండియా వికెట్ కీపర్ గా ఇప్పుడిప్పుడే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న పంత్ డ్యాషింగ్ బ్యాట్స్ మన్ గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకూ టీమ్ ఇండియా జట్టుకు 33 టెస్టులు, 30 వన్డేలు, 66 టి20లకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 56 ఇన్నింగ్స్ లో రెండు 2271 పరుగులు చేశాడు. అత్యదిక స్కోరు 159 నాటౌట్. వన్డేల్లో 30 మ్యాచ్ లు ఆడి  865 పరుగులు చేశాడు. ఇక టి20లలో అయితే 66 మ్యాచ్ లు ఆడి 987 పరుగులు చేశాడు.  

Soccer legend pele no more

ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

ఫుట్ బాల్ లెజండ్ పీలే కన్నుమూశారు. 82 ఏళ్ల పీలే క్యాన్సర్ తో పోరాడుతూ గురువారం(డిసెంబర్ 29) అర్ధరాత్రి  సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.  సాకర్ చరిత్రలోనే అత్యుత్తమ క్రీడాకారుడిగా పీలే గుర్తింపు పొంందారు.  అలాగే మూడు ప్రపంచ కప్ విజయాలలో భాగస్వామిగా ఉన్న ఏకైక సాకర్ క్రీడాకారుడు పీలేయే.   1958, 1962, 1970లలో ప్రపంచ సాకర్ విజేత బ్రెజిల్ జట్టులో పీలో సభ్యుడు .  నాలుగు ప్రపంచకప్‌లలో బ్రెజిల్ కు ప్రాతినిధ్యం వహించిన పీలే ప్రత్యర్థి జట్ల డిఫెన్స్ ను ఛేదించి  మెరుపు వేగంతో బంతిని గోల్‌ పోస్టులోకి పంపేసి క్రీడాభిమానులు, ప్రేక్షకులనే కాకుండా ప్రత్యర్థి క్రీడాకారులను సైతం సంభ్రమాశ్చర్యాలలో ముంచేసే వాడు. 1966లో నే సాకర్ కు గుడ్ బై చెప్పాలని భావించినా, ఆ నిర్ణయాన్ని మార్చుకుని  మళ్లీ జట్టులోకి వచ్చాడు. 1970 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా బంగారు బంతి అందుకున్నాడు.   ప్రపంచకప్‌లలో 14 మ్యాచుల్లో 12 గోల్స్ సాధించాడు. పీలే మృతి పట్ల  సాకర్ ప్రపంచం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.  

new troubles in congress

కాంగ్రెస్ పార్టీలో కొత్త చిక్కులు

కాంగ్రెస్ పార్టీలో కొత్త చిక్కు మొదలైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో హస్తం పార్టీకి ఇంటా బయట చిక్కులు ఎదురవుతున్నాయా అంటే, అవునన్న సమాధానమే వస్తోంది. ఓ వంక  గాంధీ కుటుంబ విధేయుడు,  కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు  పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీని మానవాతీతుడిగా అభివర్ణించిన సల్మాన్ ఖుర్షీద్  తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  పేరుకే అధ్యక్షుడు, పవర్స్ మాత్రం గాంధీల చేతుల్లోనే ఉన్నాయి. ఉంటాయి ..  అంటూ పార్టీ అధ్యక్షుడు, గాంధీల రిమోట్  కంట్రోల్ తో పనిచేస్తారని బీజీపే చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చారు. నిజానికి  ఖుర్షిద్ చెప్పింది కొత్త విషయం కాదు. ఒకప్పుడు చిదంబరం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీ రోజు వారీ కార్యకలాపాలు ఖర్గే చూస్తారు. విధాన పరమైన నిర్ణయాలు, ఇతరత్రా ముఖ్య నిర్ణయాలు గాంధీలను సంప్రదించే తీసుకుంటారని అన్నారు. ఇప్పడు అదే విషయాన్ని ఖుర్షిద్,  ఖుల్లం ఖుల్లాగాబయట పెట్టారు.    కాంగ్రెస్ పార్టీ సారథి గాంధీ కుటుంబమే  అందులో సందేహం లేదు. కేవలం పార్టీ కార్యకలాపాలపైన దృష్టి సారించేందుకే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారని తెలిపారు. అయితే అది నిజమే అయినా ఇప్పడు ఖుర్షిద్ యాదృచ్చికంగా, ఈ వ్యాఖ్యలు చేశారా, లేక ఇంకేదైనా రీజన్ ఉందా అనే చర్చ జరుగుతోంది.  నిజానికి  బీజేపీ ఎప్పటి నుంచో ఇదే ఆరోపణ చేస్తోంది. ఇపుడు సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్య  ను ఆసరా చేసుకుని ఖర్గే కాంగ్రెస్ పార్టీకి రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడా? రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడా? అని ప్రశ్నించింది. ఖుర్షిద్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అసలు నిజం బయటపడిందన్నారు. భజనపరత్వం, వంశపారంపర్య రాజకీయాలనే కాంగ్రెస్ నమ్ముకుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఎవరు ఉన్నారనేదానితో సంబంధం లేదని పగ్గాలు మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీల చేతుల్లోనే ఉంటాయన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంట్ అని పిలవాలా? రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ అని పిలవాలా? అని నిలదీశారు. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఎటువంటి అధికారం ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేదన్నారు. గాంధీలు ఏం చెబితే దానినే ఖర్గే చేస్తారన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత ఎన్నికలు ఓ బూటకమని విమర్శించారు. మరో వంక మనీలాండరింగ్ కేసులో తనపై దర్యాప్తును రద్దు చేయాలని రాబర్ట్ వాద్రా చేసిన దరఖాస్తును రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో బీజేపీ మరో మారు గాంధీ కుటుంబాని టార్గెట్ చేసింది. భారత రాజకీయాల్లో గాంధీ కుటుంబం అత్యంత అవినీతిపరుల కుటుంబమని దుయ్య బట్టింది. రాబర్ట్ వాద్రాపై వచ్చిన అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మౌనం వీడాలని బీజేపీ డిమాండ్ చేసింది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఈ అవినీతి జరిగిందన్నారు. భారత దేశంలో అత్యంత అవినీతిపరుల కుటుంబం ఇది. అవినీతికి పాల్పడటం, భూములను కబ్జా చేసి రాబర్ట్ వాద్రాకు అప్పగించడం మాత్రమే దాని పని. కుటుంబంలో ముగ్గురు సభ్యులు అవినీతి కేసుల్లో బెయిలుపై బయట ఉన్నారని ఎద్దేవా చేశారు.  అదలా ఉంటే రాహుల గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని, రాహుల్ గాంధీ, విపక్షాల ముఖ్యనేతగా  ఆమోదం పొందుతున్నారని, కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్న వేళ, ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భారత్ జోడో యాత్రకు తమ పార్టీ మద్దతు ఇవ్వదని తెగేసి చెప్పారు. అంతే కాదు, తమ పార్టీ సిద్ధాంతం, భావజాలం ప్రత్యేకమైనవన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని వ్యాఖ్యానించారు.   మరో ఐదారు రోజుల్లో జనవరి 3 న యాత్ర ఉత్తర ప్రదేశ్ లో ప్రవేశిస్తున్నవేళ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ యాత్రలో పాల్గొనాలని బీజేపీ యేతర పార్టీల నేతలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ నేతలు ఇటీవల చెప్పారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్‌డీ నేత జయంత్ చౌదరిలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలోనే  అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. జోడో యాత్రలో పాల్గొనాలని తమకు ఆహ్వానమే అందలేదన్నారు.  నిజానికి, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యం ఎన్నికల ప్రయోజనాలు కాకపోయినా, యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీలో కొత్త రక్తం వచ్చి చేరుతుందని, తద్వారా కాంగ్రస్ పార్టీ బలపడడంతో పాటుగా, రాహుల్  గాంధీ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందని, ఆశించారు. అయితే, భారత్ జోడో యాత్ర ఈ లక్ష్యాన్ని  చేరుకుందా ? అంటే, కొంత వరకు మాత్రమే అనే సమాధానం వస్తోంది.

modi tweet about her mothers death

దేవుని పాదాల చెంతకు చేరిన వందేళ్ల అద్భుత కాలం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి, 100ఏళ్ల హీరాబెన్ మోదీ.. గుజరాత్ అహ్మదాబాద్ లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "ఒక అద్భుతమైన 100ఏళ్ల కాలం.. దేవుడి పాదాల వద్దకు చేరింది. అమ్మలో నిస్వార్థ కర్మయోగి, జీవితానికి కావాల్సిన విలువలను చూశాను. 100వ జన్మదినం నాడు నేను అమ్మని చూసినప్పుడు నాకు ఒక విషయం చెప్పింది. అది నేను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాను. ఇంటెలిజెన్స్ తో పని చేయ్యి, స్వచ్ఛతగా జీవించు అని చెప్పింది," అని మోదీ అన్నారు. 100ఏళ్ల హీరాబెన్ మోదీ.. అనారోగ్య సమస్యల కారణంగా బుధవారం అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త తెలుసుకున్న ప్రధాని.. ఢిల్లీ నుంచి వెంటనే అహ్మదాబాద్కు వెళ్లి ఆమెను పరామర్శించారు. వైద్యులతో ఆమె ఆరోగ్యం గురించి చర్చించారు. హీరాబెన్ మోదీ కోలుకుంటున్నారని, ఒకటి- రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్ఛ్ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె మరణవార్తను శుక్రవారం ఉదయం వెల్లడించారు మోదీ. యూఎన్ మెహ్తా హార్ట్ హాస్పిటల్ వర్గాల ప్రకారం.. హీరాబెన్ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3:39 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రధాని మోదీ సోదరుడు పంకజ్ మోదీతో కలిసి గాంధీనగర్లని రాయ్సన్ అనే గ్రామంలో నివాసముండేవారు హీరాబెన్ మోదీ. హీరాబెన్ మోదీతో నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పుడు గుజరాత్ వెళ్లినా.. తల్లితో గడుపుతారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ఎన్నికల సమయంలో.. కచ్చితంగా ఆమె ఆశీర్వాదాలు తీసుకుని వెళతారు. పుట్టిన రోజు సందర్భంగానూ.. తల్లి వద్దకు వెళ్లి మిఠాయిలు తినిపించే వారు మోదీ.ఇక తల్లి మరణవార్త తెలుసుకున్న మోదీ.. గుజరాత్  బయలుదేరారు.ప్రధాని మోదీ తల్లి మరణం పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

telangana dgp anjani kumar

తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంజనీ కుమార్‌ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత డీజీపీ మహేందర్‌ రెడ్డి పదవీ కాలం శనివారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి అంజనీకుమార్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అంజనీకుమార్‌ బదిలీతో ఖాళీ అయిన స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను నియమిస్తూ, ఆయనకు విజిలెన్స్‌ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శాంతిభద్రతల అదనపు డీజీ డాక్టర్‌ జితేందర్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగానూ, రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ను సీఐడీ డీజీగా బదిలీ చేశారు. హైదరాబాద్‌ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌ దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను రాచకొండ కమిషనర్‌గా.. ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ అదనపు డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌ను శాంతిభద్రతల అదనపు డీజీగా నియమించారు.  డీజీపీ మహేందర్‌రెడ్డి  అనారోగ్యంతో  కొంతకాలం సెలవులో ఉన్న సమయంలోనూ అంజనీకుమార్‌ ఇన్‌చార్జి డీజీపీగా ఉన్నారు.  

modi mother no more

ప్రధాని మోడీకి మాతృ వియోగం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ శుక్రవారం(డిసెంబర్ 30) ఉదయం కన్నుమూశారు.   అహ్మదాబాద్ నగరంలోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో హీరాబెన్ మోదీ అనారోగ్యంతో  చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 100 సంవత్సరాలు. హీరాబెన్ ఆరోగ్యంక్షీణించడంతో ఆమెను బుధవారం(డిసెంబర్ 28)అహ్మాదాబాద్ లోని   యుఎన్ మెహతా ఆసుపత్రిలో అడ్మిట్ చేసన సంగతి విదితమే.   ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబసభ్యులు మైసూరు వద్ద మంగళవారం (డిసెంబర్ 27) జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ వార్త విని తీవ్ర ఆందోళనకు గురైన హీరాబెన్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. జూన్ 18వ తేదీన ఆమె 100వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి విదితమే. 

corona spread again boster dose shortage

మళ్లీ మహమ్మారి విజృంభణ.. బూస్టర్ డోసు కొరతతో జనం ఆందోళన

కోవిడ్ మహమ్మారి మరో సారి భారత్ పైనా పంజా విసిరేందుకు సిద్ధమౌతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ భారత్ లో వచ్చే 40 రోజులూ అత్యంత కీలకమనీ, జనవరిలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందనీ హెచ్చరించింది. ఈ హెచ్చరికే ఇప్పుడు భారత్ లో బూ స్టర్ డోస్ వేసుకోని వారిలో ఆందోళన నింపుతోంది. బూస్టర్ వ్యాక్సిన్ తప్పని సరిగా వేయించుకోవాలని  కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు చెవినిల్లు కట్టుకుని పోరినా అత్యధికులు నిర్లక్ష్యం చేశారు. దీంతో దేశం మొత్తంలో బూస్టర్ డోస్ వేసుకున్న వారి సంఖ్య కనీసం ఒక శాతం మించలేదు. దీంతో భారత్వ్యాక్సినేషన్ విషయంలో ఇతర దేశాల కంటే వెనుకబడి ఉంది. గత జూలైలోని కేంద్రం 75 రోజుల పాటు బూస్టర్ డోస్ వేయించుకునే వారికి ఉచితంగా వ్యాక్సినేషన్  ప్రకటించింది. అయినా పాతిక శాతం మంది కూడా వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ముందుకు రాలేదు.  కరోనా మమమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశంలో మొదటి రెండు డోసుల వ్యాక్సినేషన్ విషయంలో దేశంలో ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు కదిలారు. తొలి రెండు డోసులూ వేసుకున్నవారి శాతం 95 శాతం మించింది.  12 ఏళ్ల లోపు పిల్లల్లో కూడా 95 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అయితే మూడో డోసు విషయానికి వచ్చే సరికి మాత్రం జనం మాత్రం వెనుకంజ వేశారు. 60 ఏళ్లు పైబడిన వారు బూస్టర్ డోసు వేయించుకున్నారు కానీ, అంతకంటే తక్కువ వయసు వారు మాత్రం బూస్టర్ డోసు పట్ల ఏమాత్రం ఆసక్తి చేపలేదు.   ఇప్పుడు మరోసారి మహమ్మారి వ్యాప్తి వార్తల నేపథ్యంలో  జ.నం బూస్టర్ డోస్ కోసం ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. కానీ వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది.  

ycp Corpse politics on kandukuru mihap

రాజకీయ లబ్ధి కోసం వైసీపీ శవరాజకీయం!

అధికార వైసీపీలో హుందాతనం కనుమరుగైంది. విపక్ష సభలకు జనం పోటెత్తడం ఆ పార్టీకి కంటగింపుగా మారింది. జనం విపక్ష నేతకు బ్రహ్మరథం పడుతుంటే.. జీర్ణించుకోలేక కారాలూ, మిరియాలూ నూరుతోంది. జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉన్న చంద్రబాబునాయుడి పర్యటనల్లో కనీస పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయకుండా.. ఆయన ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టడానికి వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే కందుకూరు ఘటన విషయంలో భద్రతా ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నా ఎదురు విమర్శలతో రాజకీయ పబ్బం గడిపేసుకోవాలని ప్రయత్నిస్తున్నది.   కుందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇది వాస్తవం. ఎనిమిది నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇదీ వాస్తవమే. మాటల కందని మహా విషాదమిది.  ఈ ఘటనపై అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా స్పందించారు. చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తెలుగుదేశం మృతుల  కుటుంబాల బాధ్యత తీసుకుంటామని ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి తొలుత . పది లక్షల సాయం ప్రకటించింది. ఆ తరువాత దానిని పదిహేను లక్షలకు పెంచింది. అలాగే మరో ఎనిమిది లక్షల రూపాయలు తమ వంతుగా ఆందజేస్తామని నాయకులు ప్రకటించారు. మొత్తం తెలుగుదేశం పార్టీ మృతుల కుటుంబాలకు 24లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఏపీ సర్కార్ కూడా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అయితే ప్రకటించింది.. కానీ జరిగిన సంఘటన నుంచి రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాటను కూడా మొదలెట్టేసింది.  తొలుత సమాజిక మాధ్యమంతో మొదలెట్టి.. అధికార వైసీపీ మంత్రులు, నాయకులు దుర్ఘటన నుంచి రాజకీయ లబ్ధి కోసం శవరాజకీయాలకు తెరలేపారు. కందుకూరులో తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యుడు అంటూ.. అధికార పార్టీ ప్రచారం ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినప్పుడు తొక్కిసలాట వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిది. పెద్ద సభ లేదా రోడ్ షో జరుగుతున్నప్పుడు పోలీసులు బందోబస్తు విధుల్లో కనిపించాలి. చిన్న చిన్న కార్యక్రమాలలోనే పోలీసుల పెద్ద సంఖ్యలో మోహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేత, అందునా జడ్ ప్లస్ కేటగరి భద్రత ఉన్న చంద్రబాబునాయుడు పాల్గొంటున్న సభ కు మరింత జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే కందుకూరులో అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. పోలీసుల సంఖ్య అతి స్వల్పంగా ఉంది. తొక్కిస లాట సమయంలో పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. తొక్కిసలాటకు ముందు చంద్రబాబు తన ప్రసంగంలో పదే పదే ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. తోసుకోవద్దు, వాహనాలు ఎక్కిన వారంతా కిందకు దిగాలి అని విజ్ణప్తి చేశారు. అయితే ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన ప్రభుత్వం మాత్రం ఘోరంగా విఫలమైంది. పైపెచ్చు రాజకీయ నేతల సభలో దుర్ఘటన జరగడం ఇదే మొదటి సారి అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తోంది. అయితే  ఇటీవల విజయవాడలో వైసీపీ నిర్వహించిన జయహో బీసీ సభలో భోజనల దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుని ఒకరు చనిపోయారు. కనీసం ఆ కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించలేదు  అస్వస్థతతో చనిపోయాడని ప్రచారం చేసి చేతులు దులిపేసుకుంది.  అలాగే గోదావరి జిల్లాలో జరగిన సభలో ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె కుటుంబానికి కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇక జగన్ పాదయాత్రలో తొక్కిసలాటల గురించి చెప్పనే అక్కర్లేదు. జగన్ పాదయాత్ర తొలి రోజే తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. అయితే ఆ ఏ సందర్భంలోనూ అటువంటి విషాద సంఘటనలపై తెలుగుదేశం కానీ, మరే ఇతర పార్టీలు కానీ రాజకీయ విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ కందుకూరు దుర్ఘటనలో తప్పు ప్రభుత్వం వైపు ఉన్నా.. తెలుగుదేశం తప్పిదమని చెప్పడానికి బురద రాజకీయం ప్రారంభించేసింది.   మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే దుర్ఘటన జరగడానికి చంద్రబాబే బాధ్యుడన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ దుర్ఘటన సాకుగా చూపి భవిష్యత్ లో చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వవద్దంటూ పోలీసులకు సూచనలు చేశారు. ఈ సంఘటనకు లింకు పెట్టేసి లోకేష్ పాదయాత్రను కూడా అడ్డుకోవాలన్న కుట్రలకు తెరలేపారు. అయితే వాస్తవంగా కందుకూరు దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యమని పరిశీలకులు చెబుతున్నారు. కనీస బందోబస్తు కూడా లేకపోవడం, ఉన్న కొద్ది మంది పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం వల్లే తొక్కిసలాటలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారంటున్నారు.  విపక్ష నేత సభ జరిగే ప్రదేశంలో బారికేడ్లు పెట్టి తొక్కిసలాటలు వంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన పోలీసులు.. రోడ్డుకు ఆనుకునే ఎలాంటి రక్షణ గోడ లేకుండా ఉన్న కాలువ వద్ద కనీసం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడ మేమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రచారయావ వల్లే ఇరుకు రోడ్లలో సభలు నిర్వహిస్తూ జనం అశేషంగా వచ్చారని చెప్పుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్న మాటలు అసంబద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రచార యావ అంటే రైతులకు ఇచ్చే భూమి పట్టాలపై   ఫొటో ముద్రించుకోవడాన్ని మించి ప్రచార యావ ఎక్కడైనా ఉంటుందా అని సామాన్యలే ప్రశ్నిస్తున్నారు. ఇక కందుకూరు సభకు వచ్చిన జనం కనిపిస్తూనే ఉన్నారు. వారిని తరలించడానికి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు. స్కూలు బస్సులను బలవంతంగా తీసుకోలేదు. వచ్చిన వారంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే. విపక్ష నేత ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు ప్రజల ముందుకు రావడాన్ని ఎవరూ ప్రశ్నించజాలరు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లేకుంటే ఆ సభలకు జనం రారు. విశాఖ సహా పలు చోట్ల బలవంతంగా సమీకరించినా జగన్ సభ నుంచి జనం వెళ్లిపోతున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల ద్వారా అందరూ చూశారు. సభ నుంచి వెళ్లిపోయే వారిని ఆపడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలూ కనిపించాయి. కందుకూరు సభకు వచ్చిన వారు అలా తరలించిన వారు కాదు. ఎక్కడైనా సభలూ సమావేశాలూ జరిగితే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదీ..ఇక్కడే ప్రభుత్వం, పోలీసులూ విఫలమైంది. కందుకూరు దుర్ఘటన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. జగన్ పర్యటనలకు పరదాలు కప్పేసే పోలీసులు.. జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు సభకు కనీసం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. రక్షణ గోడ లేని కాలువ వద్ద కనీసం పోలీసులనైనా పెట్ట లేదు. ఆ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులే చెబుతున్నారు. అయినా ఒక విషాదం జరిగినప్పుడు రాజకీయ విమర్శలను పక్కన పెట్టి సహాయ కార్యక్రమాలకు చేయి అందించడం కనీస ధర్మం. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ విషాద ఘటనపై  దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతుంటే అధికార వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడుతూ.. ప్రభుత్వ తప్పిదాన్ని విపక్షంపై రుద్దడానికి ప్రయత్నిస్తోంది.

cbi nazar on kcr in farm house case

ఫామ్ హౌస్ కేసులో సీఎం కేసీఆర్ పై సీబీఐ నజర్?

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చిక్కుల్లో పడ్డారా అంటే ఔననక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫామ్ హౌస్ లో  ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కేసీఆర్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ వ్యవహారం ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగు చూసిన తరువాత ముఖ్యమంత్రి  కేసీఆర్ మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను వెల్లడించడాన్ని ప్రస్తావించిన హైకోర్టు.. సీఎం కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని పేర్కొంది. కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను బహిరంగ పరచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే  సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వీడియోలు విడుదల చేయడం కూడా సరికాదని స్పష్టం చేసింది. హైకోర్టు లేవనెత్తిన అంశాలు సీబీఐ చేతికి ఆయుధాలుగా మారినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.  మీడియా సమావేశంలో కేసీఆర్ వెల్లడించిన  సాక్ష్యాలు ఎక్కడి నుంచి, ఎవరి నుంచి వచ్చాయన్న విషయంపై సీబీఐ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నాతిని సేయబోతే కోతి అయ్యిందన్న తీరుగా.. బీజేపీని ఇరుకున పెట్టడానికి ఫామ్ హౌస్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసి అత్యుత్సాహం ప్రదర్శించడమే ఇప్పుడు కేసీఆర్ తలకు చుట్టుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. సీబీఐ కేసీఆర్ ను విచారించడానికి నిర్ణయించుకుంటే మాత్రం అది మరింత సంచలనం అవుతుందనడంలో సందేహం లేదు.  సిట్ దర్యాప్తును రద్దు చేసి కేసును సీబీఐకి ఇవ్వడానికి  పలు కారణాలను చూపిన హైకోర్టు  తన తీర్పులో కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా ఆ కారణాలలో ఒకటిగా పేర్కొంది.  సిట్ దర్యాప్తు పూర్తిగా రద్దు చేసినందున సీబీఐ ఈ కేసును మొదటి నుంచీ దర్యాప్తు చేయనుంది, ఫిర్యాదుదారుడైన పైలట్ రోహిత్ రెడ్డి , మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలను విచారించడంతో పాటు ఈ కేసుకు సంబంధించి   కేసీఆర్ నూ సీబీఐ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. దీంతో  ఫామ్ హౌస్ కేసు సీబీఐ అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును తెలంగాణ సర్కార్ సుప్రీంలో సవాల్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. నువ్వు తమలపాకుతో ఒకటంటే.. నేను తలుపు చెక్కతో రెండంటా అన్న చందంగా కేసీఆర్ తన కుమార్తె కవితపై  లిక్కర్ స్కాం లో కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తునకు ప్రతిగా.. బీజేపీపై ఫామ్ హౌస్ కేసులో సిట్ ను ఏర్పాటు చేశారు. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుకు కళ్లెం వేయాలని భావించారు. అయితే ఈ వ్యూహం బెడిసి కొట్టి ఫామ్ హౌస్ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ చేతికి వెళ్లడంతో ముందరి కాళ్లకు బంధం పడినట్లైంది. కేసీఆర్ స్వయంగా సీబీఐ విచారణకు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. 

intresting dacts about future pm would be wife

ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్.. కాబోయే శ్రీమతి ఎవరో?

తెలుగు సినిమా హీరోలలో ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే, ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు ... బాహుబలి ప్రభాస్.. అలాగే, రాజకీయాల్లో  ‘దమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్   అనగానే గుర్తు కొచ్చేది  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.  నిజమే, ప్రధాని మోడీ (పెళ్ళైన బ్రహ్మచారి), యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇలా రాజకీయ ప్రముఖులలో పెళ్లి కాని ప్రసాదులు  ఇంకా కొందరున్నారు. అయినా కూడా  ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’ఎవరంటే మాత్రం రాహుల్ గాంధీ పేరే ముందుగా వినిపిస్తుంది.   మిగిలిన వారందరికీ పెళ్లీడు దాటిపోయిందని కావచ్చును సోషల్ మీడియాలో రాహుల్ పెళ్లి వార్తలు వైరల్ అయినంతగా ఇతర పెళ్ళి కాని రాజకీయ ప్రముఖుల పెళ్లి వార్తలు వైరల్ అయినా దాఖలాలు లేవు. అలాగని రాహుల్ గాంధీ బాలా కుమారుడా అంటే కాదు. ఆయన ఈ మధ్యనే హాఫ్ సెంచరీ మార్క్ క్రాస్ చేశారు. ఫిఫ్టీ ప్లస్ క్లబ్ లో చేరిపోయారు.  అంతేకాదు, భారత్ జోడో యాత్రలో మేకప్ లేకపోవడం వల్లనో ఏమో, నెరిసిన గడ్డం, ముడతలు పడిన ముఖంతో రాహుల్ గాంధిలో వార్ధక్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సోషల్ మీడియాలో ఆయన కొత్త రూపం  గురించిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయన అభిమానులు పెరిగిన గడ్డంతో రాహుల్ గాంధీ రావీద్రనాథ్ టాగోర్ లా ఉన్నారని మెచ్చుకుంటే, గిట్ట్టని వాళ్ళు  సద్దాం హుస్సేన్ లా ఉన్నారని కడుపు మంట తీర్చుకున్నారు.  సరే అదెలా ఉన్నా, ఎవరు ఏమన్నా, రాహుల్ గాంధీ అంటే అమ్మాయిల్లో ఇంకా  క్రేజుంది, రాహుల్ పేరుతో వైబ్రేషన్స్ ఫీలయ్యే అమ్మాయిలున్నారు. భారత్ జోడో యాత్రలో ఆయనతో కలిసి నడిచేందుకు, ఆయనతో సేల్ఫీలు దిగేందుకు  అమ్మాయిలు, సెలబ్రిటీలు కూడా పోటీ పడ్డారు. అందుకే ఆయన ఇంకా, ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అలాగే, రాహుల్ గాంధీ కూడా మన ప్రభాస్ లానే పెళ్లి చేసుకోను .. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి పోతాను, అని ఆఫీషియల్ ప్రకటన ఏదీ చేయలేదు. సోలో లైఫే సో.. బెటరు  అని పాడ లేదు. అందుకే, రాహుల్ పెళ్లి  గురించి అప్పుడప్పుడు... హాట్ హాట్ వదంతులు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే, ఇంతవరకు రాహుల్ గాంధీ ఎప్పడూ పెళ్లి  వదంతుల మీద స్పందించలేదు. అలాగే విదేశాల్లో పబ్బుల్లో, క్లబ్బుల్లో అమ్మాయిలతో ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయినా ఆయన అంతగా పట్టించుకోలేదు. ప్రత్యర్ధి పార్టీలు శీల పరీక్ష పెట్టినా, ఆయన్ని డిఫెండ్ చేసే బాధ్యత కాంగ్రెస్ వాచాస్పతులు ( అధికార ప్రతినిధులు) ఇతర నాయకులు తీసుకున్నారే కానీ, రాహుల్ జీ ఎప్పడు కూడా తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ తాజాగా, సరదాగానే అయినా, మీడియా అడిగిన పెళ్లి ప్రశ్నకు రాహుల్ సరదాగా సమాధానమిచ్చారు.  తనకు  కాబోయే భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే భార్యకు తన  నానమ్మ ఇందిరమ్మకున్న లక్షణాలు, తల్లి సోనియా గాంధీలోని  సుగుణాలు... ఉండాలని మనసులోని మాటను బయట పెట్టారు. అలాగే, తనకు కాబోయే భార్య ఆ ఇద్దరిలోని మంచి లక్షణాలను కలబోసిన బొమ్మలా ఉంటే మరీ మంచిదని అన్నారు. ఇదంతా సరదగా సాగిన సంభాషనే  అయినా, రాహుల్ గాంధీని ఇష్టపడే అమ్మాయిల్లో ఆ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే ...అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చునేమో ... ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కాబోయే శ్రీమతి  .. ఎవరో  ఆ అదృష్టవతురాలు..  ( ఇది కేవలం సరదా కోసం మాత్రమే ..ఎవరూ సీరియస్’ గా తీసుకోవద్దని మనవి)

womens t20 world up from febraury 10

మహిళల టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్

మహిళల టి20 వరల్డ్ కప్ 2023కు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు స్కిప్పర్ గా హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ గా స్మృతి మందానలను ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహిళల టి20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి విదితమే.  ఈ టోర్నీ కోసం   వుమెన్స్ సెలెక్షన్ కమిటీ 15 మంది  ప్లేయర్స్ తో టీం ఎంపిక చేసింది. ఈ జట్టులో శిఖా పాండేకు చోటు లభించింది.  దక్షిణాఫ్రికా వేదికగా    ఫిబ్రవరి 10వ తేదీ నుంచి టోర్నీ ప్రారంభం అవుతుంది.   గ్రూప్ 2లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్, ఐర్లండ్, భారత్ ఉన్నాయి. భారత్ తొలి మ్యాచ్ దాయాది   పాకిస్థాన్ జట్టుతో కేప్ టౌన్ లో వల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ జరగనుంది.  ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 

roundup 2022 air pollution in delhi

రౌండప్ 2022 ఢిల్లీలో వాయు కాలుష్యం

నవంబర్  కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. నవంబర్ 2...  దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) కల్కాజీ ప్రాంతంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజల కోసం నిర్మించిన 3,024 ఫ్లాట్స్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.   నవంబర్ 3.. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్’ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీడియా  మీడియాకు వివరించారు. ప్రధానమంత్రి నరెంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్’లో రెండు విడతలలో డిసెంబర్ 1, 5 వ తేదీలలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఓటల్ లెక్కింపు చేపడతారు.  నవంబర్ 4.. ఢిల్లీ కాలుష్య స్థాయి పెరుగుతున్న నేపధ్యంలో.,, వాహానాల నియంత్రణకు సరి .. బేసి విధానాన్ని మరో మారు అమలు  చేయాలని భావిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. అలాగే, ఢిల్లీ ప్రభుత్వం 50 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం’ సిఫార్స్ చేసింది .   నవంబర్ 8...  గుజరాత్ శాసన సభకు వరసగా11 మార్లు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,గిరిజన ఎమ్మెల్యే  మొహన్’సిన్హ బీజేపీలో చేరారు.  నవంబర్ 9... గుజరాత్ మాజే ముఖ్యమంత్రి విజయ్ రుపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్’ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్యదం లేదని ప్రకటించారు. విజయ్ రూపనీ 2016 ఆగష్టు 7 నుంచి 2021 సెప్టెంబర్ 13 వరకు గుజరాత్ ముఖ్యంత్రిగా ఉన్నారు .. నవంబర్ 12..  హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. నవంబర్ 19...  అరుణాచల్ ప్రదేశ్’లో ప్రప్రధమ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశానికీ స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి 2014 వరకు ఈశాన్య భారతంలో కేవలం 9 విమానాశ్రయాల నిర్మాణం జరిగితే, తమ ప్రభుత్వం ఏడేళ్ళలో ఏడు విమానాశ్రయాలను నిర్మించింది ప్రధాని పేర్కొన్నారు. నవంబర్ 21...  యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది కాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రివ్యూ పిటీషన్ దాఖలు  చేసిందని, ప్రభుత్వం తెలిపింది.

fight in flight between three youth

విమానంలో ముష్టిఘాతాలు, పిడిగుద్దులతో రణం.. కారణమేమిటంటే?

చదవేస్తే ఉన్న మతి పోయిందంటారు. చదువు వల్ల సంస్కారం పెరిగితేనే ఆ చదువుకు సార్థకత. ఊర్లలో బస్సులో సీట్ల కోసం పామరులు కోట్లాటలకు దిగడం సహజం. అలాగే  రైళ్లలో అన్ రిజర్వుడు కంపార్ట్ మెంట్లలో చోటు కోసం చొక్కాలు పట్టుకుని కొట్టుకునే వారినీ చూశాం. కానీ విద్యావంతులైన యువకులు విమానంలో సీటు కోట్లాటకు దిగి కొట్టుకున్న సంఘటన  మాత్రం ఎవరూ చూసి ఉండరు.  అయినా విమనాంలో సీటు కోసం కొట్టుకోవడమేమిటి చోద్యం కాకపోతే అనుకుంటాం.  కానీ అలాంటి చోద్యం జరిగింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబై నుంచి థాయ్ ల్యాండ్ వెళ్లేందుకు విమానం రన్ వేపై సిద్ధంగా ఉంది. ఇహనో ఇప్పుడో టేకాఫ్ తీసుకుంటుంది. సరిగ్గా ఆ సమయంలో విమానంలో గొడవ జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారింది. ఇంతకీ ఆ గొడవ సీటు విషయంలో జరిగింది. ఔను నిజమే సీటు కోసం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ముగ్గురు యువకులు గొడవ పడ్డారు. జుట్టూ జుట్టూ పట్టుకు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు విసురుకున్నారు. విమాన సిబ్బంది సర్ది చెప్పడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించ లేదు. గొడవ అంతకంతకూ తీవ్రమౌతుంటే సిబ్బంది కూడా చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగ ప్రవేశం చేసిన తరువాత గొడవ సద్దుమణిగింది. వీరి గొడవ కారణంగా దాదాపు గంటన్నర ఆలస్యంగా విమానం టేకాఫ్ అయ్యింది. 

చిన్నారుల పాలిట విషం.. ఇండియన్ మేడ్ కాఫ్ సిరప్!

భారత్ లో తయారైన సిరప్ తాగి ఉజ్బెజిస్థాన్ లో 18 మంది చిన్నారులు మరణించారు.  ఇండియాలో తయారైన డాక్ 1 మ్యాక్స్ సిరప్ ను ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్లే చిన్నారుల మరణాలు సంభవించాయి. కాగా సిరప్‌లో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్‌ ఉన్నట్టు లేబరేటరీ పరీక్షల్లో వెల్లడైంది.   తమ దేశంలో  18 మంది చిన్నారుల ఉసురు తీసిన పాపం  ఇండియాదే అంటూ భారత్ పై మండిపడింది. ఈ మేరకు ఓ ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.   దగ్గు మందులో ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్టు ల్యాబ్ టెస్టుల్లో తేలింది. దీంతో డాక్ 1 మ్యాక్స్  ట్యాబ్లెట్లు, సిరప్ ను  అన్ని మందుల షాపుల నుంచి విత్ డ్రా చేశారు. 2022లో ఇలా భారత్ లో తయారైన దగ్గు మందు సేవించి చిన్నారులు మరణించటం ఇదే మొదటి సారి కాదు. రెండోసారి. ఇంతకు ముందు గాంబియాలో 70 మంది చిన్నారులు మేడ్ ఇన్ ఇండియా కాఫ్ సిరప్ కారణంగా మరణించారు. దీనికి కారణమైన హర్యానా లోని మైడెన్ ఫార్మాను కేంద్రం సీజ్ చేసింది కూడా.  ఇలా ఉండగా   ఉజ్బెకిస్థాన్‌లో దగ్గు మందు తాగి  చిన్నారులు మృతి చెందడంపై తదుపరి పరిశోధనలకు సహకరించేందుకు డబ్ల్యుహెచ్ ఓ చర్యలకు ఉపక్రమించింది. ఉజ్బెకిస్థాన్‌లోని ఆరోగ్య అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. దర్యాప్తునకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అంతకుముందు, అక్టోబర్‌లో భారత్‌లో తయారు చేసిన దగ్గు మందు తాగి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 60 మందికి పైగా పిల్లలు మరణించారు. దీని తరువాత, ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది, అయితే ఇప్పటి వరకు భారతీయ కంపెనీ యొక్క దగ్గు మందు నుండి పిల్లలు మరణించినట్లు అధికారిక ధృవీకరణ లేదని తెలిపింది. ఈ ఆరోపణలు అనవసరంగా భారత ఔషధ కంపెనీల ప్రతిష్టను దిగజార్చుతున్నాయని కేంద్రం చెబుతోంది.  అలాగే.. భారతీయ నిర్మిత దగ్గు మందు తాగి చిన్నారులు మృతి చెందడంపై, మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్‌ల నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించినట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. కేంద్ర డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో), రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌తో కలిసి సోనెపట్‌లోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌పై సంయుక్త విచారణ జరిపిందని రసాయనాలు,  ఎరువుల సహాయ మంత్రి భగవంత్ ఖుబా డిసెంబర్ 13న రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అక్టోబర్ ప్రారంభంలో దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. దగ్గు మందు లో డైథలిన్ గ్లైకాల్ , ఇథిలిన్ గ్లైకాల్ మానవులకు విషం లాంటిదని అందులో పేర్కొంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక  తర్వాత మైడెన్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను గాంబియా నిషేధించింది. అంతే కాకుండా  మందులను మార్కెట్ నుండి తొలగించాలని  ప్రపంచ ఆరోగ్య సంస్థ  అన్ని దేశాలను హెచ్చరించింది.   

రాహుల్’ సారధ్యంలో జాతీయ కూటమి ?

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై ఆ పార్టీ నేతలలో విశ్వాసం సన్నగిల్లితే సన్నగిల్లిందేమో, కానీ,  తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే అదినేత ఎంకే స్టాలిన్ లో మాత్రం, హస్తం పార్టీ పై విశ్వాసం రోజురోజుకు పెరిపోతోంది. రాహుల్ గాంధీ నాయకత్వంపై స్టాలిన్ విశ్వాసం భారత్ జోడో యాత్ర కంటే వేగంగా పరుగులు తీస్తోంది. ద్విగుణీకృతం అవుతోంది. 2024 ఎన్నికల్లో బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కునే సత్తా, సామర్ధ్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని స్టాలిన్ కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ సారథ్యంలో కలిసి  పోరాడదాం...రండని.. విపక్ష పార్టీలకు పిలుపు నిచ్చారు.  నిజానికి  తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు. డిఎంకే అండలేకుండా కాంగ్రెస్ పార్టీ అడుగు తీసి అడుగు వేయలేదు. నిజానికి 1969లో తమిళనాడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. మద్రాస్ రాష్ట్రం చిట్ట చివరి ముఖ్యమంత్రి భక్తవత్సలం (1962- 1967) .. కాంగ్రెస్ పార్టీ చిట్టచివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే.. 1969లో మద్రాస్ రాష్ట్రం, తమిళనాడుగా అవతరించిన తర్వాత, తమిళనాడులో వంతుల వారీగా ద్రవిడ పార్టీల (డిఎంకే, అన్నా డిఎంకే) పాలనే సాగుతోంది. నిజానికి, బీజేపీ  కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం ఇవ్వడానికి దశాబ్దాల ముందే, తమిళనాడులో హిందీ వ్యతిరేక ద్రవిడ వాదం జోరులో  కాంగ్రెస్ చప్పబడి పోయింది. నిజానికి కాంగ్రెస్ మాత్రమే కాదు, గడచిన ఆరుపదుల పైబడిన కాలంలో బీజేపీ, వామపక్షాలు సహా జాతీయ పార్టీలు ఏవీ, తమిళనాడులో నిలబడలేక పోయాయి. ద్రవిడ పార్టీలు అందించిన అక్సిజిన్ తో ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో నిజానికి డిఎంకే అవసరం కాంగ్రెస్  పార్టీకి ఉన్నంతగా, కాంగ్రెస్ పార్టీ అవసరం డిఎంకేకు లేదు. అయినా  స్టాలిన్  కాంగ్రెస్ వెంట పడుతున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను మెచ్చుకోవడమే కాదు, రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.  కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాలిన్ మాట్లాడుతూ  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని కోల్పోయిందనడాన్ని తాను నమ్మబోనని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు కాంగ్రెస్ పార్టీతో కూడిన జాతీయ కూటమి అవసరమని చెప్పారు. కాంగ్రెస్ తిరిగి గాడిలో పడుతోందని, భారత దేశానికి ఇప్పుడు అదే అవసరమని చెప్పారు. ఆ పార్టీ పునరుజ్జీవం బాటలో ఉందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సోదరునిగా అభివర్ణిస్తూ, బీజేపీ అనుసరించే సంకుచిత రాజకీయాలకు మేలైన విరుగుడు మందు వంటివారు సోదరుడు రాహుల్ గాంధీ అని స్టాలిన్ అన్నారు.  దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సురక్షితంగా, స్వతంత్రంగా పని చేసే విధంగా చూడటం కోసం జాతీయ కూటమి ఏర్పాటవడం చాలా ముఖ్యమని చెప్పారు .రాహుల్ గాంధీ బీజేపీతో కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాకుండా సైద్ధాంతిక ప్రాతిపదికపై కూడా పోరాడుతున్నారన్నారు.  భారత్ జోడో యాత్ర భారీ సంచలనం సృష్టించిందన్నారు. అయితే స్టాలిన్ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇంతలా మేచ్చుకోవడానికి కారణం ఏమిటి? నిజానికి రాహుల్ గాంధీ పొలిటికల్ ట్రాక్ రికార్డు చూస్తే, ఆయన సాధించిన గొప్ప విజయాలు మచ్చుకైనా కనిపించవు.  రాహుల్ గాంధీ 2004లో తొలిసారి అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో రెండు మార్లు (2009, 2014)  అదే నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. కానీ, 2019 ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయారు.ఆ ఎన్నికల్లో అమేథీతో పాటుగా కేరళలోని  వాయనాడ్  నియోజక వర్గం నుంచి కూడా పోటీచేశారు. సొంత నియోజక వర్గంలో ఒడి పోయినా, వాయనాడ్  ఓటర్లు ఆయన్ని అక్కున చేర్చుకుని పార్లమెంట్  కు పంపించారు. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా పార్టీని గెలిపించలేక, ఓటమికి నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు..ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చరిత్ర.  అయితే స్టాలిన్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించడానికి ఆ చరిత్ర కాదు కారణం.. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా   అన్నా డిఎంకేలోని అంతర్గత కలహాలను అడ్డుపెట్టుకుని బీజేపీ తమిళనాడులో పాగావేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత  బీజేపీ కొంత వేగంగా అడుగులు వేస్తోంది.ముఖ్యంగా బీజేపీ ప్రవచించే హిందూ జాతీయ వాదానికి ఆదరణ పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తి కొంత వేగంగా జరుగుతోంది .. అందుకే  రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు, స్టాలిన్ కు కాంగ్రెస్ అవసరం ఏర్పడింది.  ముఖ్యంగా రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర లో బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ జాతీయ వాద భావజాలానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎత్తిన జెండా, అజెండా స్టాలిన్ కు రాజకీయ అవసరంగా మారాయి. అందుకే స్టాలిన్ కాంగ్రెస్ కు జై కొట్టారు.  కాంగ్రెస్ /రాహుల్ సారథ్యంలో జాతీయ కూటమి ఏర్పాటుకు విపక్ష పార్టీలు ఒకటవ్వాలని పిలుపిచ్చారు.

రాహుల్ యాత్రలో కొత్త రాగాలు

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిస్తున్న భారత్ జోడో యాత్ర ఇంచుమించుగా ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 24న ఢిల్లీ చేరిన యాత్ర.. 9 రోజుల క్రిస్మస్, న్యూ ఇయర్ బ్రేక్  తర్వాత జనవరి 3న మళ్ళీ మొదలవుతుంది. కొత్త సంవత్సరంలో ఢిల్లీ, పంజాబ్ ల గుండా కశ్మీర్ లో ప్రవేశిస్తుంది. సెప్టెంబర్ 7 తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర 2023 జనవరి 20న శ్రీనగర్‌లో ముగుస్తుంది. ఇప్పటి వరకు 3 వేల కిలోమీటర్లు నడిచిన రాహుల్ మరో 548 కిలోమీటర్లు యాత్ర కొనసాగించనున్నారు. చివరకు కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగుస్తుంది. ప్రారంభం నుంచి ఇంతవరకు రాహుల్ జోడో యాత్ర, పదికి పైగా రాష్ట్రాల గుండా సాగింది. అయితే, ఇతవరకు యాత్రకు ఎక్కడా ఎలాంటి అంతరాయం కలగలేదు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. శాంతి భద్రతల సమస్య తలెత్తలేదు. అలాగే, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప యాత్ర ఎక్కడా పెద్దగా వివాదస్పదం కాలేదు. ఉద్రిక్తతలు  చోటు చేసుకోలేదు. శాంతి భద్రతల సమస్య తలెత్త లేదు.   కానీ, ఢిల్లీలో ఎంటర్ అయిన తర్వాత, యాత్రలో వేడి పెరుగుతోంది. భారత్ జోడో యాత్ర ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో జనాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా వైఫల్యం పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాసింది. రాహుల్ గాంధీకి, భారత్ యాత్రలో పాల్గొంటున్న వారికి, నేతలకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీ పోలీసులు నేరుగా హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారు, అందుకే కాంగ్రెస్ పార్టీ నేరుగా కేంద్ర హోం మంత్రికి లేఖ రాసింది.  బదర్‌పూర్ సరిహద్దు నుంచి డిసెంబర్ 24న రాహుల్ గాంధీ వెంట వేలాది మంది మద్దతుదారులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎర్రకోట వైపు పాదయాత్ర సాగుతుండగా పలువురు రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడం, ఆయనకు అతి దగ్గరగా రావడంతో కలకలం రేగింది. తొక్కిసలాట తరహా పరిస్థితి తలెత్తింది. దీనిపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో తీవ్రమైన భద్రతా లోపాలు తలెత్తిన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 24వ తేదీన పాదయాత్ర ఢిల్లీలోకి అడుగుపెట్టిన సమయంలో అనేక సందర్భాల్లో భద్రతా లోపాలు చోటుచేసుకున్నాయి. జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న రాహుల్‌కు అతి దగ్గరగా జనం గుమిగూడుతున్నప్పుడు వారిని అదుపు చేయడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం మౌన ప్రేక్షకులుగా చూస్తుండిపోయారు. యాత్రలో పాల్గొనకుండా పలువురు ప్రముఖులను వేధించారు. యాత్రలో పాల్గొన్న అనేక మందిని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటరాగేట్ చేసింది. హర్యానా స్టేట్ ఇంటెలిజెన్స్‌కు చెందిన గుర్తుతెలియని దుండగులు భారత్ జోడీ యాత్రలో అక్రమంగా ప్రవేశించారని డిసెంబర్ 23న సోహ్నా సిటీ పోలీస్ స్టేషన్‌లో మేము ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు  అని ఆ లేఖలో అమిత్‌షాకు వేణుగోపాల్ తెలియజేశారు.  కాంగ్రెస్ నేతల త్యాగాలను సైతం వేణుగోపాల్ ఆ లేఖలో గుర్తు చేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను అర్పించారని, 2013 మే 25న జీరమ్ ఘాటిలో నక్సల్స్ దాడిలో ఛత్తీస్‌గఢ్ నాయకత్వం మొత్తం అశువులు బాసిందని అన్నారు.  జనవరి 3 నుంచి అత్యంత సున్నితమైన పంజాబ్ , జమ్మూకశ్మీర్‌లో జోడో యాత్ర సాగాల్సి ఉంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతలో ఉన్న రాహుల్, భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కార్తకర్తలు, ప్రజలు, నేతలకు తగిన భద్రత కల్పించాలి  అని అమిత్‌షాను ఆ లేఖలో వేణుగోపాల్ కోరారు. అలాగే, యాత్ర ఢిల్లీలో ప్రవేశించిన సమయంలోనే చైనా తదితర దేశాల్లో కరోనా ప్రకంపనలు ఉదృతమయ్యాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, రాహుల గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర, తాత్కాలికంగా యాత్రకు బ్రేక్ ఇవ్వాలని లేదంటే కొవిడ్ ప్రోటోకాల్ (మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు) పాటించాలని కోరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ కొంత రాజకీయ దుమారం రేపింది. రాహుల్ భారత్ జోడో యాత్ర బీజేపీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోందని, మల్లికార్జున ఖర్గే మొదలు దిగ్విజయ్ సింగ్ వరకు కాంగ్రెస్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు, కవ్వింపు ప్రకటనలు చేశారు. అందుకు ప్రతిగా కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, స్మృతీ ఇరానీ తమదైన స్టైల్లో సమాధానమిచ్చారు. అదొకటి అలా ఉంటే, ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాల‌యంలో జరిగిన కాంగ్రెస్‌ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాహుల్ గాంధీ, మీడియా మధ్య, ‘చాయ్ పె చర్చ’   స్టైల్లో ‘టీ’ ..షర్టు పే’ ఆసక్తికర చర్చ జరిగింది. నిజానికి, యాత్రలో  రాహుల్  విడవకుండా వేసుకుంటున్న టీ’ షర్టు పై  హాట్ అండ్ కూల్ చర్చ జరిగింది. కాగా  బుధవారం(డిసెంబర్ 28)  పార్టీ ఆవిర్భావ దినోత్సవనికీ రాహుల్ గాంధీ అదే వైట్ టీ ష‌ర్ట్ లో హాజరయ్యారు. దీంతో కొందరు విలేకరులు అదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు. దీనిపై స్పందించిన రాహుల్... ప్రస్తుతం టీ షర్టు  హ‌వా న‌డుస్తోంది.. ఎప్పటి వ‌ర‌కు ఆ హ‌వా ఉంటుందో, అప్పటి వ‌ర‌కు కొన‌సాగిస్తానని అన్నారు.  టీష‌ర్ట్ హీ చ‌ల్ ర‌హి హై ఔర్ జ‌బ్ త‌క్ చ‌ల్ ర‌హి హై చ‌లాయింగే" అని నవ్వుతూ రాహుల్ హిందీలో సమాధానం ఇచ్చారు. అయితే, ఇంతవరకు సాగిన యాత్ర ఒకెత్తు అయితే,  పంజాబ్, కశ్మీర్’లలో సాగే యాత్ర ఒకెత్తు అన్నారు.

కందుకూరులో మాటలకందని విషాదం

కందుకూరులో  తెలుగుదేశం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం అధినేత హాజరైన ఈ కార్యక్రమానికి జనం అనూహ్యంగా పోటెత్తారు. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం ఇంత వరకూ కేవలం రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. కందుకూరులో చంద్రబాబు రోడ్ షో ప్రపంగం ప్రారంభించారు. ఆ ప్రాంత మంతా జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో మార్మోగింది. చంద్రబాబు ఉద్వేగపూరితంగా ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగం మధ్యలో ఆయన అక్కడ కాల్వ ఉంది జాగ్రత్త అని హచ్చరించారు కూడా.. అంతలోనే అనూహ్య దుర్ఘటన జరిగింది. బైకులపై కూర్చుని చంద్రబాబు ప్రసంగం వింటున్న వారు వాహనాలతో సహా కాలువలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో పది మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి వారందరినీ పరామర్శించారు.   నేనున్నా భయపడవద్దని ధైర్యం చెప్పారు. మీ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం మృతుల కుటుంబాలకు, ఒక్కొక్కరికి పదిలక్షల నష్టపరిహారం ప్రకటించారు.మృతుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. వారిని దగ్గరుండి చూసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇంటూరి రాజేష్, ఇంటూరి రాజేష్ బాధితులకు దగ్గరుండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. కాగా తర్వాత జరగాల్సిన కావలి సభను రద్దు చేసుకున్నారు.   కందుకూరు దుర్ఘటనలో మరణించిన కార్యకర్తల అంత్యక్రియలకు పార్టీ ఇన్‍చార్జ్ లు, ఎమ్మెల్యేలు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఒక్కో ఇన్‍చార్జ్ ఒక్కొక్క కార్యకర్త మృతదేహం వెంట వెళ్లి.. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు కుటుంబసభ్యులతో ఉండాలని ఆదేశించారు మరణించిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని చంద్రబాబు చెప్పారు. కందుకూరులో జరిగిన విషాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బీద రవిచంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్‌బాబు తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అలాగే తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కందుకూరు దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   ఈ దుర్ఘటనలో మృతి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు ఆయన సంతాపం ప్రకటించారు. మృతుల ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.