జగన్ మిథున్ రెడ్డిని ఎప్పుడు పరామర్శిస్తారంటే..?

మద్యం స్కాం నిందితులను పరామర్శించే విషయంలో జగన్ ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం నిందితులను మినహాయిస్తే.. జగన్  ఇతర కేసుల్లో అరెస్టైన తమ పార్టీ నేతలు, కార్యకర్తలను జైలుకెళ్లి పరామర్శించారు. ఆ పరామర్శ యాత్ర సందర్భంగా తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పించి మరీ వచ్చారు. జగన్ జైలుకెళ్లి పరామర్శించిన వారిలో రౌడీ షీటర్లు ఉన్నారు. గంజాయిబ్యాచ్ వాళ్లూ ఉన్నారు. కానీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వారిలో తనకు అత్యంత సన్నిహితులు, పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వారూ ఉన్నా ఎందుకో మరి వారిని పరామర్శించే విషయంలో మాత్రం ఆయన ఇసుమంతైనా ఆసక్తి చూపడంలేదు. ఈ కేసులో అరెస్టైన వారిలో జగన్ మాజీ పీఏ, మాజీ ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్, అలాగే ఈ కుంభకోణంలో కీలక పాత్ర ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వంటి వారు ఉన్నారు. వీరంతా జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారే. అయినా సరే ఇప్పటి వరకూ వారిని జగన్ పరామర్శించలేదు.  కానీ ఎట్టకేలకు ఇక తప్పదన్నట్లుగా ఈ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి పరామర్శకు మాత్రం రెడీ అయినట్లు ప్రకటించారు. ఈ నెల 25న రాజమహేంద్రవరం వచ్చి, జైలుకు వెళ్లి మిథున్ రెడ్డిని జగన్ పరామర్శిస్తారని పార్టీ కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన కూడా పరామర్శ తేదీకి పది రోజుల ముందే వెలువడింది. ఇక పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా జగన్ మిథున్ రెడ్డిని ఈ నెల 25న పరామర్శించనున్నారని మూడు నాలుగు రోజుల ముందు ధృవీకరించారు.  అంతలో ఏమైందో ఏమో కానీ ఆ పరామర్శయాత్రను జగన్ వాయిదా వేసుకున్నారు. ఆగస్టు 25న కాదు మరో తేదీన వస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. జగన్ పరామర్శ వినాయకచవిత తరువాత ఎప్పుడో ఉంటుందని అదే బొత్స ప్రకటించారు.  జగన్ రాజమండ్రి జైలు యాత్ర మళ్లీ వాయిదాపడిందన్న వార్తలపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు.   ఇదే మద్యం కుంభకోణం కేసులో నేడు కాకపోతే రేపు.. రేపు కాకపోతే మరో రోజు ఇదే రాజమహేంద్రవరం జైలుకు తాను కూడా రావాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇంతోటి దానికి పరామర్శ యాత్ర ఎందుకు? అనే జగన్ మిథున్ రెడ్డి పరామర్శను వాయిదా వేసుకున్నట్లుందంటూ కామెంట్లు పెడుతున్నారు. తన హయాంలో తెలుగుదేశం అధినేత, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అక్రమంగా నిర్బంధించిన జైలుకు ఇప్పుడు తన సన్నిహితుడు, తన వల్లే జైలు పాలైన మిథున్ రెడ్డిని పరామర్శించాల్సిన పరిస్థితి రావడం జగన్ కు మింగుడుపడటం లేదనీ, అందుకే తన పర్యటన వాయిదే వేసుకున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఫాల్కన్ స్కామ్.. తవ్వే కొద్ది పగులుతున్న అక్రమాల పుట్ట!

ఫాల్కన్ స్కామ్ లో తవ్వినకొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి  వస్తున్నాయి. క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పేరిట కంపెనీ పెట్టి ఇన్‌వాయస్ డిస్కౌంటింగ్‌ ద్వారా భారీ లాభాలు వస్తాయని చిన్న, మధ్య తరగతి మదుపరులను నమ్మించి రూ.792 కోట్ల మోసానికి పాల్పడిన ఫాల్కన్ స్కామ్ కేసులోలో    చార్టర్డ్ అక్కౌంటెంట్   శరత్ చంద్ర టోస్ని వాలి కీలక పాత్ర పోషించినట్లు వెలుగులోకి వచ్చింది. శరత్ చంద్రను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.  లేని డబ్బుల్ని అకౌంట్లో ఉన్నట్లుగా చూపి తప్పుడు లెక్కలతో  చార్టెడ్ అక్కౌంటెంట్ శరత్ చంద్ర బురిడీ కొట్టించారని నిర్ధారించుకున్న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అయితే ఈ ఫాల్కన్ కంపెనీ చైర్మన్ అమర్ధీప్ మాత్రం దుబాయ్ కు పరారయ్యాడు. అయితే అమర్ దీప్ కు సహకారం, సహాయం అందించిన శరత్ చంద్ర ఈ స్కామ్ లో కేంద్ర బిందువు అని ఈడీ తేల్చి అరెస్టు చేసింది. హవాలా రూపంలో స్కాం సొమ్ములను విదేశాలకు తరలించడంలో శరత్ చంద్రదేకీకల పాత్ర ధాని అని ఈడీ దర్యాప్తులో తేలింది. పూర్తిస్థాయిలో సహాయం చేసిన చార్టెడ్ అకౌంటెంట్ శరత్చంద్ర ఈ స్కామ్ కు కేంద్ర బిందువుగా ఉన్నారని ఈడీ తేల్చింది.. హవాల రూపంలో డబ్బులు మొత్తాన్ని విదేశాలకు తరలించడంలో శరత్ చంద్ర కీలక సూత్రధారిగా ఉన్నారని ఈడి దర్యాప్తులో తేలింది. దీంతో  చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర టోష్నీవాల్‌ను అరెస్ట్ చేసి. ప్రవెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.  క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో పెట్టుబడి దారులను  .ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, మోసం చేసి ఏకంగా 792 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది.  ఈ స్కామ్‌కి ప్రధాన సూత్రధారి అయిన కంపెనీ యజమాని అమర్‌దీప్ కుమార్ కోసం శరత్ చంద్ర టోష్నీవాల్ పలు నకిలీ లావాదేవీలను నిర్వహించడంతో పాటు.. మనీలాండరింగ్‌లో కీలక పాత్ర పోషించినట్టు ఈడీ విచారణలో తేలింది. శరత్ చంద్ర తన బంధువుల పేర్లపై కంపెనీల్లో వాటాలు కూడా కొనుగోలు చేసినట్టు  చెబుతున్నారు.  ఈ కేసులో రూ. 18.14 కోట్ల ఆస్తులను ఈడి అటాచ్ చేసింది.. ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్‌ను కూడా ఈడీ అరెస్టు చేసింది.  చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్ కి పారిపోయిన అమర్దీప్ ను స్వదేశానికి రప్పించడం కోసం ఈడీ ప్రయత్నాలు ప్రారంభించింది. 

80 ఏళ్ల వృద్ధుడికి హనీ ట్రాప్.. 8 లక్షలు హాంఫట్

ఆయన వయస్సు ఎనిమిది పదులు. అలాంటి వృద్ధుడిని మాయమాటలు, శృంగార చేష్టలతో ట్రాప్ చేసి దారుణంగా మోసం చేశారు. 80 ఏళ్ల వృద్ధుడితో మహిళ గొంతుతో మాట్లాడి మరీ  హనీట్రాప్ లో చిక్కుకునేలా చేశారు. ఎనిమిది లక్షలు కొట్టేశారు. తరువాత తాను హనీట్రాప్ కు గురయ్యానని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను మోసం చేసిన ముఠాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. అమీర్ పేటకు చెందిన వృద్ధుడికి మాయా రాజ్పుత్ అనే మహిళ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆ వాట్సాప్ వీడియో కాల్ ,మెసేజ్ లకు స్పందించిన వృద్ధుడు ఆమెతో తో మాట్లాడడం మొదలుపెట్టాడు.   అలా ఓ నాలుగు రోజుల పాటు వృద్ధుడితో మాట్లాడుతూ. పరిచయం పెంచు కున్నారు. వృద్ధుడు పూర్తిగా హనీ ట్రాప్ మాయాజాలంలో చిక్కుకునేట్లు చేశారు.అనంతరం వృద్ధుడు తమ మాయలో పడ్డాడని నిర్ధారించుకున్న  స్కామర్స్ ఏవేవో కారణాలు చెప్పి డబ్బులు గుంజడం మొదలుపెట్టారు. తమ వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని ఖర్చుల కోసం డబ్బులు కావాలని, అలాగే వైద్య ఖర్చుల కోసం తాకట్టుపెట్టిన బంగారాన్ని విడిపించుకుంటామనీ, ఇలా రకరకాల కారణాలతో ఆ వృద్ధుడి నుంచి దఫదఫాలుగా ఎనిమిది లక్షలు నొక్కేశారు.   అయితే వృద్ధుడు ఖాతా నుంచి డబ్బులు మాయం అవుతుండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వృద్ధుడిని నిలదీసి అడగడంతో అసలు విషయం వెలుగు లోకి వచ్చింది.  సైబర్ మోసగాళ్లు వలలో పడ్డాడని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

లొంగిపోయిన మావోయిస్టు కాకరాల సునీత ఎవరో తెలుసా?

కాకరాల సత్యనారాయణ.. ఈ పేరు ఎక్కడో బాగా విన్నట్లే అనిపిస్తుంది కదా! ఈయన  ఓ మంచి రచయిత. అంతే కాదు 300 పైగా సినిమాల్లో  నటించారు. విప్లవ రచయితగా పేరుగాంచిన కాకరాల సత్యనారాయణ కుమార్తె ఒక పెద్ద మావోయిస్టు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య సునీత.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి వైఎస్ ప్రభుత్వం మావోయిస్టులతో   జరిపిన శాంతి చర్చల్లో సుధాకర్ కీలకపాత్ర పోషించారు. సుధాకర్ ను సునీత ప్రేమించి పెళ్లి చేసుకుంది.  కాకరాల సునీత భర్త సుధాకర్ ఇటీవలే పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు. ఇక కాకరాల సునీత అయితే నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే మమేకమై ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆమె పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలోనే సునీత రాచకొండ పోలీసులను బంధువుల ద్వారా కాంటాక్ట్ చేశారు. ఇప్పటివరకూ ఐదు భారీ ఎన్కౌంటర్లో పాలుపంచుకున్న సునీత పైన 20 లక్షల పైన రివార్డు ఉంది.  40 సంవత్సరాల్లో సునీత అంచలంచ లుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ వరకు వెళ్లారు. అంతే కాదు మావోయిస్టు సిద్ధాంతాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో సునీత కీలకపాత్ర పోషించారు. మరోవైపు మావోయిస్టుల పత్రిక జంగ్, క్రాంతి లకు ఎడిటర్ గా పని చేశారు.. మావోయిస్టు భావజాలాన్ని యువతలోకి జోపించే ప్రయత్నం చేశారు. మావోయిస్టు భావజాలానికి  యువత యువత ఆకర్షితులయ్యేలా సునీత కీలక పాత్ర పోషించారు. నల్లమల ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఛత్తీస్ గఢ్, తెలంగాణలలో సునీత పనిచేశారు.. ఇటీవల జరిగిన నేషనల్ పార్క్ ఎన్కౌంటర్ లో కూడా ఆమె పాల్గొన్నారు. మావోయిస్టుల ఎరివేతలో భాగంగా ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అడవిలో అన్నలు ఉండే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సునీత జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయిం చుకుని, గురువారం (ఆగస్టు 21)  రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.   శుక్రవారం (ఆగస్టు 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక గురువారం (ఆగస్టు 21) శ్రీవారిని మొత్తం 65 వేల 112 మంది దర్శించుకున్నారు. వారిలో  27 వేల 321 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల49 లక్షల రూపాయలు వచ్చింది. 

టీడీపీ ఎమ్మెల్యేల అతి.. బాబు ఆగ్రహం!

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతుంటారు. అధినేత చంద్రబాబు కనుసైగలతో పార్టీ నడుస్తుంటుంది. అందరిదీ ఒకే లైన్. కానీ ఇప్పుడు మాత్రం ఎవరి లైన్ వారిదే అన్నట్లుగా కొందరు తెలుగదేశం మ్మెల్యేలు వ్యవహరిస్తుండడం టీడీపీ హైకమాండ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నా సమస్యలు వస్తాయనడానికి ఇదే ఎగ్జాంపుల్ కావొచ్చు. గత ఎన్నికల్లో తెలుగుదేశం 144 సీట్లలో పోటీ చేస్తే 135 స్థానాలలో గెలిచింది. అంత పెద్ద స్ట్రైక్ రేట్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది.  అయితే ఇంతమందిని మెయింటేన్ చేయడం వీలు కావట్లేదా? లేదంటే భారీ మెజార్టీ ఉందన్న ధీమా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోందా? ఓవైపు కూటమి ఇమేజ్ ను పెంచడం కోసం  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పని చేస్తున్నారు. ఇంకోవైపు డ్యామేజ్ చేయడంలో టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకువెళ్తున్నారన్న చర్చ జరుగుతోంది. దారి తప్పుతున్న వారందరికీ సెట్ రైట్ చేసే ప్రోగ్రామింగ్ ను సీఎం చంద్రబాబు రెడీ చేయాల్సిన టైం వచ్చేసిందా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది.   శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి. పార్టీలో ఈయన సీనియర్ లీడర్. మొన్నటిదాకా పెద్దగా వివాదాల జోలికి వెళ్లని బుడ్డా లేటెస్ట్ గా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న తన అనుమతి లేకుండా తన సెగ్మెంట్ లో కార్యక్రమాలు నిర్వహించారంటూ పార్టీ ఎంపీ శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి విషయంలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొందరు అనుచరులు ఏరాసు ఇంటిపై దాడి కూడా చేశారు. ఆ పంచాయితీ చంద్రబాబు దగ్గరకు చేరింది. అది చల్లారక ముందే లేటెస్ట్ గా శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ లో అటవీ శాఖ సిబ్బందిపై బుడ్డా చేయి చేసుకోవడం పెను వివాదంగా మారింది.  ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమే అని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నట్లుగానే కేసు ఫైల్ అయింది.  ఇక అనంతపురం అర్బన్   ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. గొడవేంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడారన్నది అభియోగం. 3 నిమిషాల 8 సెకన్లు ఉన్న ఆడియో రికార్డింగ్ చుట్టూ ఏపీలో పెను దుమారమే చెలరేగింది. వార్ 2 సినిమా బెనిఫిట్‌ షోలకు అనంతపురంలో పర్మిషన్లు లేవని, ఆపించేస్తున్ననట్లు ఎమ్మెల్యే చెప్పడం, పర్మిషన్లు ఉన్నాయని ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడు అంటున్నట్టు, ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యంతరకర కామెంట్స్ చేసినట్లు ఆ ఆడియోలో వినిపించింది. అంతే ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టి, ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించేశారు. ఇది అనంతపురానికే పరిమితం కాలేదు. విజయవాడ, తిరుపతి, నెల్లూరుకూ పాకింది.  దీనిపై రియాక్ట్ అయిన దగ్గుపాటి, ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని, ఏఐ అని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఫేక్ ఆడియో సృష్టించారని వాదించారు. తాను నందమూరి, నారా కుటుంబాల అభిమానినని, ఎన్టీఆర్ అభిమానుల భావోద్వేగాలను గాయపరిచినట్లయితే క్షమాపణలు చెబుతున్నానని వీడియో రిలీజ్ చేశారు. అయినా సరే అభిమానుల ఆగ్రహం తగ్గలేదు. నిజానికి అనంతపురం అర్బన్ లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో దగ్గుపాటి ప్రసాద్ కు చాలా కాలంగా అంతర్గత విబేధాలు ఉన్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, సవాళ్లు విసురుకోవడం గతంలోనూ జరిగాయి. దమ్ముంటే రాజీనామా చేసి రా... ఎవరు గెలుస్తారో చూద్దాం అని ప్రభాకర్ చౌదరి ఇప్పటికే సవాల్ చేశారు. ఇన్ని గొడవల మధ్యలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై ఆడియో ఇష్యూ ప్రసాద్ మెడకు చుట్టుకుంది. ఈ మ్యాటర్ అటు పార్టీ పరంగా, సామాజికపరంగా సున్నితమైంది కావడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు కూడా. లేనిపోని వివాదాలు ఎందుకు క్రియేట్‌ చేసుకుంటున్నారని చివాట్లు పెట్టారంట. ఇక ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపల్‌ కు అర్ధరాత్రి వీడియో కాల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో కాల్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. అయితే కూన రవికుమార్ ఈ ఆరోపణలను ఖండించారు. తాను అర్ధరాత్రి కాల్ చేయలేదని, ఆ కాల్‌లో ప్రిన్సిపాల్‌తో పాటు మరికొందరు ఉన్నారని, తనపై అసత్య ప్రచారం జరుగుతోందని వాదించారు. పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈ ఎపిసోడ్ కూడా రకరకాల మలుపులు తిరుగుతోంది.  గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడిన సీన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి మార్ఫింగ్ వీడియోలు అని క్లారిటీ ఇచ్చుకున్నా.. ఈ ఘటనపై విమర్శలు రావడంతో టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.  అటు నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో కీ రోల్ పోషించారన్న మ్యాటర్ లో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నేత, మరో ఎమ్మెల్యే ఇరుక్కున్నారు. తన తప్పేమీ లేదని ఒకరు వివరణ ఇచ్చుకుంటే మరో ఎమ్మెల్యే చుట్టూ హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఒక్కరూ మాట్లాడడం లేదు. సో ఈ ఘటనలు ఏపీలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యేల వ్యక్తిగత వివాదాలు కాస్తా పార్టీకి మైనస్ గా మారే పరిస్థితులు తీసుకొచ్చాయి. ఈ విషయంపై పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ అయ్యింది. గురువారం (ఆగస్టు 21) కేబినెట్ భేటీకి కొద్ది ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించి మరీ వారి పట్ల ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాగే హోంమంత్రి అనితను పెరోల్ ఆర్డర్లపై సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని కూడా సున్నితంగా  మందలించారు. మరో వైపు పార్టీ ఇన్ చార్జ్ ల తీరు కూడా కొండకచో వివాదంగా మారుతోంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు అతి చేస్తున్నారన్న విషయంలో పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. తీరు  మార్చుకోకుంటే చర్యలు తప్పవన్న హెచ్చరికలూ చేసింది. 

తెలుగు రాష్ట్రాలు.. ఒక ఉపరాష్ట్రపతి ఎన్నిక కథ

నిజానికి వెంకయ్య తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి మరో ఉపరాష్ట్రపతి పదవికి ఛాన్సున్నది బి. సుదర్శన్ రెడ్డి విషయంలోనే. అయితే ఇండియా కూటమి అభ్యర్ధి అయిన సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశమెంత? అన్నది అటుంచితే.. ఎన్డీఏ అభ్యర్ధి రాధాకృష్ణన్ తమిళ వ్యక్తి కాగా.. త్వరలో తమిళనాడు ఎన్నిక జరుగుతుండటంతో.. కాంగ్రెస్ సైతం ఒక తమిళ వ్యక్తినే ఎంపిక చేయాలనుకుంది. తిరుచ్చి శివ అనే డీఎంకే నేత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. సరిగ్గా అదే సమయంలో ఒక ఇస్రో సైంటిస్టు పేరు కూడా ప్రముఖంగానే వినిపించింది. కానీ చివరి నిమిషంలో రాజకీయాలకు సంబంధం లేని బి. సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి చంద్రబాబుకు పరిచయముంది. అందుకే జస్టిస్  తాను రాజకీయ పార్టీలకు కొత్తగానీ, రాజకీయాలకు కాదన్నారు. అలాంటి పరిచయం ప్రస్తుతం ఉన్న ఒకానొక సిట్యువేషన్ లో సుదర్శనరెడ్డికి ఉపయోగ పడుతుందా? అని చూస్తే అదేమంత తేలిగ్గా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన రాధాకృష్ణన్ కు తమ బేషరతు మద్దతు ప్రకటించేశాయి. ఇక సాటి రెడ్డి కులస్తుడైన సుదర్శన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఎలాంటి అభిమానముందో తెలీదు.  ఒక వేళ అభిమానమున్నా జగన్ మరో ఆలోచన లేకుండా బీజేపీ ప్రతిపాదించిన రాధాకృష్ణన్ కే మద్దతు పలుకుతారన్న విశ్లేషకుల అభిప్రాయాలను అనుగుణంగానే వైసీపీ సభ్యులు ఎన్డీయే అభ్యర్థికే మద్దతు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించేసింది.  ఎందుకంటే.. ఇప్పటికే జగన్ పీకలోతు కేసుల గొడవల్లో ఉన్నారు. అందుకే తనకున్న లోక్ సభ, రాజ్య సభ సభ్యులు 11 మంది కాగా.. ఈ మొత్తం అటు వైపునకు మళ్లించేశారు. అలా మళ్లించకుంటే జైలుకు వెళ్లక తప్పదన్న భయం ఆయనది.  దీంతో ఎంత రెడ్డాభిమానం ఉన్నా గానీ జగన్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి  మద్దతుగా నిలవడం లేదు సరికదా..   వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు.. కట్ చేస్తే బీఆర్ఎస్ సీనేంటో చూస్తే.. బీజేపీ|బీఆర్ఎస్ రెండూ ఒకటే అన్న మాటకు ఆస్కారమిచ్చేలా కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. అదేంటో చూస్తే ఎవరైతే 2 లక్షల టన్నుల ఎరువులను తెలంగాణకు ఇస్తారో వారికే తమ మద్ధతు అన్నారు. నిజానికి ఎరువులను ఇచ్చే అధికారం ఉన్నది కేంద్రంలోని బీజేపీకి. దీన్నిబట్టీ చూస్తే వారి మద్ధతు బీజేపీకే అని చెప్పాల్సి ఉంటుంది.  మొన్నటికి మొన్న సీఎం రమేష్ మాటలను అనుసరించి చెబితే ఇప్పటికే తమపై కేసుల్లేకుండా చేయడంలో భాగంగా.. బీజేపీలో కలిసి పోవడానికైనా సిద్ధమైన బీఆర్ఎస్ ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత వాసి అయిన సుదర్శన్ రెడ్డికి ఓటు వేసే అవకాశమెంతో ఈ ఎరువుల మెలికను బట్టిఇట్టే తెలిసిపోతోంది.  కాబట్టి.. తెలుగు సెంటిమెంటు కన్నా.. ఇక్కడ ఎవరి అవసరాలు, వారి వారి కేసుల వ్యవహారాలపైనే ఎక్కువగా ఈ ఎన్నిక ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఇదండీ మన తెలుగు వారి ఉప రాష్ట్రపతి ఎన్నిక కథ, కమామిషు!

జగన్, కేటీఆర్ కటీఫేనా?

తెలుగుదేశం పార్టీపై గుడ్డి వ్యతిరేకత, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఉన్న అక్కసు  బిఆర్ఎస్, వైసీపీ లను దగ్గర చేసాయి, జగన్, కేసీఆర్ లను ఒకే తాటి మీదకు తెచ్చాయి. బాబు కి రిటర్న్ గిఫ్ట్ అంటూ మొదలైన జగన్ కేసీఆర్  రాజకీయ బంధం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం, 2024 ఎన్నికలలో వైసీపీ పతనంతో బట్టబయలైంది ఆ ఓటముల తరువాత వైసీపీ అధినేత ప్యాలెస్ రాజకీయాలకు, బీఆర్ఎస్  ఫామ్ హౌస్ రాజకీయాలకు పరిమితం అయ్యారు. అక్కడ నుంచీ ఇరుపార్టీల బంధం తెగిపోకుండా కొనసాగించే బాద్యతను బీఆర్ఎస్ అధినేత కుమారుడు, ఆయన రాజకీయవారసుడు, అలాగే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు భుజాన వేసుకున్నారు. సొంత చెల్లెలితో విభేదాల విషయంలోనూ జగన్, కేటీఆర్ మధ్య సారూప్యాలు ఉన్నాయి.  ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను షర్మిల, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ను కల్వకుంట్ల కవిత తీవ్రంగా విభేదిస్తున్నారు.  ఏ రకంగా చూసినా జగన్, కేటీఆర్   బాట ఒకటే అన్నట్లుగా ఇంత కాలం సాగింది.  ఇక ఇప్పుడు ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై ఆరంభించిన రాజకీయ యుద్ధం అనుంగు మిత్రులు జగన్, కేటీఆర్ దారులు వేరు చేసింది. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటే చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మద్దతు ప్రకటించారు. రాహుల్ చేస్తున్న విమర్శలను సమర్ధిస్తూ.. తాను మరికొన్ని విమర్శలకు ఎన్నికల సంఘంపై సంధించారు. పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా కూడా విమర్శలు గుప్పించారు.  ప్రజాస్వామ్యంలో ఈసీ కీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి భారత ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయాల్సిన తరుణం ఆసన్నమైందంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.  భారత ఎన్నికల సంఘం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో ఘోర వైఫల్యం చెందిందని దుయ్యపెట్టారు. రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణలను మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించిన ఈసీ అధికారుల మాటలు విన్న తరవాత సందేహాలు మరింతగా ఎక్కువయ్యాయనీ కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం నిప్పులు కక్కే కేటీఆర్ ఒక్క సారిగా రాహుల్ గాంధీకి వంత పాడుతూ.. బీజేపీ కి వ్యతిరేకంగా గళం విప్పారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మాత్రం రాహుల్ ఓటు చోరీ ఆరోపణలను సమర్ధించలేదు, సరి కదా తమ పార్టీకి పులివెందులలో జరిగిన అన్యాయంపై రాహుల్ పన్నెత్తు మాట మాట్లాడకపోవడాన్ని తప్పుపట్టారు. అంతే కాకుండా   టీడీపీ, బీజేపీ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో జగన్, కేటీర్ మధ్య ఇంత కాలం ఉన్న స్నేహబంధం తెగిపోయిందా? ఇరువురూ కటీఫ్ చెప్పేసుకున్నట్లేనా అంటూ పోలిటికల్ సర్కిల్స్ లో ఓ చర్చ ఆరంభమైంది.  

ఢిల్లీ సీఎంకు జడ్ కేటగరి భద్రత

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం (ఆగస్టు 20) జరిగిన దాడిని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఖండించాయి. నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ సీఎంపై ఆమె  అధికారిక నివాసంలోనే జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించింది. రేఖాగుప్తాకు జడ్ కేటగరి భద్రత లక్పించాలని నిర్ణయించింది. ఇలా నిర్ణయించడమే తరువాయి, అలా ఉత్తర్వులు జారీ చేసింది.   దీంతో గురువారం ఉదయానికే  సీఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. ఢిల్లీ  పోలీసుల నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి భద్రత బాధ్యతలను స్వీకరించాయి.  సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 24 గంటలూ భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. జెడ్ కేటగిరీ భద్రతలో 20 మందికి పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమకూర్చారు.  

ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. ఇంతకీ ఆ నిందితుడు ఎవరంటే?

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దేశ రాజధాని సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో జన్ సున్‌వాయ్ నిర్వహిస్తున్న సమయంలో  ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చేందుకు వచ్చిన ఓ వ్యక్తి  కొన్ని పేపర్లను ఆమెకు అందించారు. అంతలోనే  గట్టిగా అరుస్తూ సీఎంపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఊహించని పరిణామంతో.. సీఎం రేఖా గుప్తా షాక్‌కి గురయ్యారు.  ముఖ్యమంత్రిపై దాడి చేసిన నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్‌ భాయ్‌ ఖిమ్జీ భాయ్‌ సకారియాగా గుర్తించారు. గుజరాత్‌లోనూ అతడిపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు, దాడికి గల కారణాలు తెలుసుకొనే పనిలో ఉన్నారు. అయితే,  సీఎంపై రాజేశ్ ఎందుకు దాడి చేశాడనే విషయంపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. నిందితుడి బంధువు జైల్లో ఉన్నాడని, అతనిడి రిలీజ్ చేసేందుకు.. సీఎంకు విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రి అధికార నివాసానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం,  ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. మరోవైపు గుజరాత్‌లో నిందితుడి తల్లిని ప్రశ్నించిన అధికారులు ఆమె నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. తన కుమారుడు, ఢిల్లీ సీఎంని కలిసేందుకు వెళ్లిన విషయం తనకు తెలియదని ఆమె చెప్పినట్లు సమాచారం. అతడు  జంతు ప్రేమికుడని, ఇటీవల వీధి శునకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే,  అతడి మానసిక పరిస్థితి బాగా లేదనీ, గతంలోనూ ఓ సారి ఢిల్లీకి వెళ్లి వచ్చాడని పోలీసులకు వివరించినట్లు సమాచారం. నిందితుడు రాజేశ్‌పై.. గుజరాత్‌లో తొమ్మిది కేసులున్నట్లు తెలుస్తోంది. బెదిరింపులు, స్థానికులపై దాడి, మద్యం మత్తులో దుష్ప్రవర్తనకు సంబంధించి.. ఈ కేసులు నమోదైనట్లు తెలిసింది. జైల్లో ఉన్న బంధువు విడుదల కోసమే.. సీఎంని కలిసేందుకు వెళ్లాడనే వార్తలు వచ్చినప్పటికీ.. అలాంటిదేమీ లేదని గుజరాత్ పోలీసులు గుర్తించినట్లు తేలింది. సీఎం రేఖా గుప్తాకు కొన్ని పేపర్లు అందించిన తర్వాత.. గట్టిగా అరుస్తూ దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనని.. బీజేపీ సహా విపక్ష పార్టీలు ఖండించాయి. దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతను దేనికోసం సీఎంపై దాడికి పాల్పడ్డాడు అనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.

అమెరికా సిటిజన్‌కి పుతిన్ రేర్ గిఫ్ట్

అలాస్కా సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ అమెరికా సిటిజన్ కు  ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. రష్యాలో తయారైన బైక్‌ను బహుమతిగా ఇవ్వడంతో సదరు అమెరికా సిటిజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల పుతిన్, ట్రంప్ అలాస్కాలో సమావేశమైన సందర్భంగా ఈ ఘటన జరిగింది. పుతిన్ కంటే ముందు ఓ రష్యా బృందం అలాస్కాకు వచ్చింది. ఆ బృందంలో ఓ టీవీ ఛానల్ వారు కూడా ఉన్నారు. ఆ సమయంలో మార్క్ వారెన్ అనే వ్యక్తి అరల్ గేర్ అప్ అనే రష్యన్ మోటర్ సైకిల్‌పై దూసుకుపోతూ కనిపించారు. తన రోజువారీ పనులపై ఆయన బైక్ ‌నడుపుతూ వెళుతుండగా వారి కంటపడ్డారు. రష్యా బైక్ అమెరికాలో కనిపించడంతో ఆశ్చర్యపోయిన టీవీ బృందం సభ్యులు మార్క్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అతడు తన బైక్ గురించి   చెప్పుకొచ్చారు. అది తనకు చాలా చాలా ఇష్టమైన బైక్ అన్నాడు. అయితే ఇప్పుడు పాతబడిపోయిందని తెలిపాడు. దాని విడి భాగాలు   అమెరికాలో దొరకట్లేదని అన్నాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ తరువాత కొన్ని రోజులకు మార్క్‌కు రష్యా దౌత్య బృందం నుంచి కబురు అందింది. మరో కొత్త బైక్ బహుమతిగా ఇవ్వనున్నట్టు వారు చెప్పారు. కానీ మార్క్ మాత్రం నమ్మలేదు. ఇదేదో ప్రాంక్ కాల్ అయి ఉంటుందని అనుకున్నాడు. కానీ పుతిన్, ట్రంప్ మీటింగ్ ముగియానే రష్యన్ బృందం మరోసారి మార్క్‌ను సంప్రదించింది. తాము ఉంటున్న హోటల్ వద్ద అతడికి బైక్‌ను బహూకరించింది. ఇది పుతిన్ వ్యక్తిగత బహుమతి అని చెప్పి మరీ బైక్ తాళాలు ఇచ్చింది. దీంతో మార్క్ ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. ఇది నజమేనా? నమ్మలేకపోతున్నా అని ఆ రోజున జరిగిన విషయాన్ని మార్క్ గుర్తు చేసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందే బైక్‌ను తయారు చేసి  అమెరికాకు పంపించినట్టు తనకు రిజిస్ట్రేషన్‌ పేపర్లు చూడగానే అర్థమైందని అన్నాడు. అది తన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన బైక్ అంటూ మురిసిపోయాడు. రష్యా బృందానికి ధన్యవాదాలు కూడా తెలిపారు. మార్క్ గతంలో అగ్నిమాపక దళంలో  పని చేసి రిటైర్ అయ్యారు. మరి ఈ బైక్ ఖరీదు ఎంతటి అంటారా?  మన కరెన్సీలో అక్షరాలా  19 లక్షల రూపాయలు. 

దేశ రక్షణ శక్తిని బలపర్చేలా ఎయిర్‌ఫోర్స్ వ్యూహాలు.. అమ్ములపొదిలోకి లైట్ కాంబాట్ ఫైటర్ జెట్స్‌

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే వీలైనన్ని లైట్ కాంబాట్ ఫైటర్ జెట్స్‌ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి చేర్చేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుపుతోంది. ఆ దిశగా దేశ రక్షణ శక్తిని మరింత బలపరిచేలా.. 62 వేల కోట్లతో.. 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ అడ్వాన్స్‌డ్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేయనుంది. తేజస్ మార్క్-1ఏ స్వదేశీ యుద్ధ విమానాలకు దక్కిన రెండో ఆర్డర్ ఇది.  2021లో  48 వేల కోట్లతో 83 యుద్ధ విమానాల సమీకరణకు పచ్చజెండా ఊపింది.   కొత్తగా 97 జెట్‌లతో కలిపి వీటి సంఖ్య 180కి చేరనుంది.  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చాలా కాలంగా సేవలందిస్తున్న.. పాత మిగ్-21 యుద్ధ విమానాల స్థానాన్ని తేజస్ మార్క్ 1ఏ భర్తీ చేయనుంది. మిగ్-21 విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతుండటంతో, వాటి స్థానంలో.. అడ్వాన్స్‌డ్ తేజస్ యుద్ధ విమానాలు రావడం వల్ల.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరింత శక్తిమంతంగా, సురక్షితంగా మారుతుంది. తేజస్ ఫైటర్ జెట్స్‌ వల్ల ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం మరింత పెరగనుంది. రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడంలోనూ కీలకంగా మారనుంది. తేజస్ మార్క్ 1ఎ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన 4.5 జనరేషన్ యుద్ధ విమానం. ఈ ఫైటర్ జెట్స్ భారత వైమానిక దళంలోకి చేరడం ద్వారా స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో ఇండియా అభివృద్ధి సాధించిందనే మెసేజ్ ప్రపంచ దేశాలకు వెళ్తుంది. అంతేకాదు.. విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడటం తగ్గుతుంది.  తేజస్ మార్క్ 1ఎ  విమానాల్లో అత్యంత అధునాతన టెక్నాలజీని వాడారు. ఇందులో ఉన్న యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే.. రాడార్ శత్రువుల కదలికల్ని కచ్చితంగా గుర్తించగలదు. ఇందులోని ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్ శత్రు రాడార్లను జామ్ చేసేందుకు, ఆయుధాలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఎయిర్ టు ఎయిర్ రీఫిల్లింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 9 రకాల రాకెట్లు, మిసైళ్లు, బాంబులను ఫైర్ చేయగలదు. ఇజ్రాయెల్ డెర్బీ మిసైళ్లతో పాటు స్వదేశీ అస్త్ర క్షిపణిని కూడా చాలా ఈజీగా ప్రయోగించగలదు. ప్రస్తుతం, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ఫైటర్ జెట్స్ స్క్వాడ్రన్ల కొరత ఎదుర్కొంటోంది. ఈ తేజస్ విమానాల చేరికతో ఐఏఎఫ్ ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్యతో పాటు పోరాట సామర్థ్యం కూడా పెరగనుంది. తేజస్ యుద్ధ విమానాల తయారీతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రొడక్షన్ ప్లాంట్‌కు రాబోయే కొన్నేళ్ల పాటు చేతి నిండా పని దొరుకుతుంది. ఇక,  దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ సంస్థలకు, ఎమ్ఎస్ఎమ్ఈలు, స్టార్ట ప్స్‌కు కూడా పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది. ఈ డీల్‌తో  భవిష్యత్తులో తేజస్ మార్క్-2 లాంటి అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లని తయారుచేసే ప్రాజెక్టులకు రూట్ క్లియర్ చేస్తుంది.

రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో పిటిషన్!?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కేసులో కీలక నిందితుడు, ప్రస్తుతం అరెస్టై విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. అక్రమ మద్యం వ్యాపారంతో భారీగా కూడబెట్టిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలిన నేపథ్యంలో ఆయన ఆస్తులను సీజ్ చేయాలని ఏపీ సర్కార్ అదేశించింది. దీంతో సిట్ బెజవాడ ఏసీబీ కోర్టులో ఆస్తుల జప్తునకు పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అవుతోంది.  దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు అలాగే, 3 కోట్ల రూపాయల బ్యాంక్ ఖాతాను జప్తు చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నది.   

అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

హైదరాబాద్ లో ఘోర విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కర్నాటక గుల్బర్గా జిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి వలస వచ్చి మియాపూర్ మక్క మహబూబ్ పేటలో నివాసం ఉంటున్న కుటుంబం గురువారం (ఆగస్టు 21) అనుమానాస్పద స్థితిలో తమ నివాసంలోనే మరణించారు. మృతులను లక్ష్మయ్య, వెంకటమ్మ, అనిల్, కవిత, అప్పు గా గుర్తించారు. వీరిలో అప్పు రెండేళ్ల చిన్నారి కావడం మహా విషాదం. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల చిన్నారిని హత్య చేసి అనంతరం మిగిలిన నలుగురూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఘటనా స్థలంలో ఎటువంటి లేఖా లభించలేదని తెలిపారు.  

ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి బెదరింపు లేఖ

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డికి బెదిరింపు లేఖ క‌ల‌క‌లం సృష్టించింది. ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి ఈ నెల 17న  నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి నివాసానికి వచ్చి అక్క‌డ ఉన్న భ‌ద్ర‌తా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ లేఖలో  రెండు కోట్ల రూపాయలు ఇవ్వకుంటే ప్రశాంతి రెడ్డిని చంపేస్తామంటూ బెదరింపు ఉంది. దీంతో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బదరింపు లేఖ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టారు.  ఈ బెదరింపు లేఖకు సంబంధించి అల్లూరు మండలం ఇస్క‌పాళెంకు చెందిన ఒక వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఎంపీ నివాసంవద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. అతడి వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు ఉండటం, అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలిస్తుండటంతో అతడిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఇలా ఉండగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బెదరింపు లేఖ రావడం వాస్తవమేనని నెల్లూరు జిల్లా ఎస్పీ తెలిపారు. 

పులివెందులలో మరో ఎలక్షన్ వార్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గడ్డపై  ఆయనకు, ఆయన పార్టీ వైసీపీకి ఘోర పరాభవాన్ని మిగిల్చిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక తరువాత అదే పులివెందులలో మరో ఎన్నికల యుద్ధానికి తెర లేచింది.  పులివెందుల జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నిక గ్రామీణ ప్రాంతానికి సంబంధించినది కాగా.. ఇప్పుడు జరగబోతున్నది పులివెందుల పట్టణంలోని మునిసిపల్ కౌన్సిల్ స్థానానికి. నిజానికి ఒక కౌన్సిలర్ ను ఎన్నుకోవడానికి జరిగే ఎన్నికకు పెద్దగా ప్రాథాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ అది పులివెందుల.. జగన్ కోట అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. అటువంటి పులివెందుల మునిసి పాలిటీలో వార్డు కౌన్సిలర్ స్థానానికి ఎన్నిక జరగనుంది. మరి పులివెందుల జడ్పీటీసీ స్థానినికి జరిగిన ఉప ఎన్నికలో విజయకేతనం ఎగురవేసి మంచి జోరుమీద ఉన్న తెలుగుదేశం.. పులివెందుల పట్నంలో కూడా వైసీపీకి ఓటమి చూపి సత్తా చాటాలని సహజంగానే భావిస్తుంది. అలాగే జడ్పీటీసీ ఎన్నికలో ఓటమిని పరాభవాన్ని.. పులివెందుల మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్ స్థానానికి జరగనున్న ఎన్నికలో విజయం సాధించి సమాధానం చెప్పాలన్న పట్టుదలతో వైసీపీలో కనిపిస్తోంది.  దీంతో పులివెందుల మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్ స్థానానికి జరగబోయే ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉండటం సహజమే. ఒక్క పులివెందులలోనే కాదు.. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఆరు మునిసిపాలిటీలో, కార్పొరేషన్ లలో ఎన్నికలు జరిగే  అవకాశం ఉంది.  ఇవీ ఉప ఎన్నికలే. జిల్లాలో   కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మరణించి ఖాళీ అయిన స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.  దీంతో సంప్రదాయాన్ని అనసరించి ఈయా స్థానాలలో పోటీకి అభ్యర్థులను నిలపకుండా తెలుగుదేశం దూరంగా ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని పరిశీలకులు అంటున్నారు.  ఉమ్మడి కడప జిల్లాలో ఖాళీగా ఉన్న కార్పొరేటర్ , కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయ్యింది.  ఎన్నికలు జరుగనున్న స్థానాలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది.  కడప, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం, రాయచోటి లో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. కడప నగరంలోని 22 ,48 డివిజన్ ల్లో, మైదుకూరులో  5 వ వార్డు, జమ్మల మడుగు లో 4 వ వార్డు, పులివెందుల లో 23 వ వార్డు, బద్వేలులో 11,30 వార్డుల్లో, కమలాపురం లో 8,20 వార్డుల్లో, రాయచోటిలో 19,30 వార్డుల్లో   ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో మరోసారి కడప జిల్లా, మరీ ముఖ్యంగా పులివెందుల ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

చంద్రబాబుతో పని చేయడం అంత వీజీ కాదు.. ఈ మాటన్నదెవరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత గురించి, ప్రగతి కాముకత గురించి ఇప్పుడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైబరాబాద్ సిటీ, అమరావతి నిర్మాణాలే అందుకు ప్రత్యక్ష తార్కానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన  దార్మనికత, కృషి, శ్రమ, పట్టుదల కారణంగానే హైదరాబాద్ బెంగళూరు, చెన్నైలను అధిగమించి మరీ ఐటీ హబ్ గా రూపుదిద్దుకుంది. ఐఎస్ బీహెచ్ వంటి సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయి. బిల్ క్లింటన్ ముందే ఐటీ ప్రోగ్రస్, అభివృద్ధి ఎలా సాధించాలి అన్న విషయాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగల సత్తా, ధైర్యం చంద్రబాబు సొంతం. ఇది ఎవరూ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నాలుగు దశాబ్దాలలో పదే పదే రుజువైన వాస్తవం.  అయితే తన తండ్రితో కలిసి పని చేయడం చాలా చాలా కష్టం అంటున్నారు నారా లోకేష్. తండ్రి స్థాయిని చేరుకునే సత్తా ఉన్న నాయకుడిగా నారా లోకేష్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కొండొకచో తండ్రిని మించిన తనయుడని కూడా పార్టీ శ్రేణులూ, నాయకులు, పరిశీలకులూ కూడా సోదాహరణంగా వివరిస్తున్నారు. అటువంటి లోకేష్ ఇటీవల ఒక సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుతో పని చేయడం చాలా కష్టం అని కుండబద్దలు కొట్టేశారు. అయితే ఆయన వద్ద పని చేయడం, ఆయన నుంచి నేర్చుకోవడం మాత్రం గొప్ప అదృష్టమన్నారు. ఇక చంద్రబాబుతో కలిసి పని చేయడం ఎందుకు కష్టమో కూడా లోకేష్ వివరించారు. ఆయనలా పంక్చువల్ గా (సమయపాలన) ఉండటం ఎవరికైనా సరే కష్ట సాధ్యమేనన్నారు.  ఇక ఆయన ఉదయం పది గంటలకు ఒక పని అప్ప చెబుతారనీ, పావుగంటలోనే వచ్చి ఆ పని ఎంతవరకూ వచ్చిందంటూ పీకలమీద కుర్చుంటారని లోకేష్ చమత్కరించారు.  ఆయనతో కలిసి పని చేయాలంటే ఆయన వేగం అందుకోవాల్సిందేనన్నారు.   చంద్రబాబు రెండు ఐకానిక్ నగరాలను అభివృద్ధి చేసే గొప్ప అవకాశం పొందిన నాయకుడన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ కూడా ఇటువంటి అవకాశం లభించిందని తాను అనుకోవడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి దక్కేలా సైబరాబాద్ నగరాన్ని నిర్మించి చూపారనీ, సైబరాబాద్ తో తెలంగాణ ముఖచిత్రమే మారిపోయిందని లోకేష్ అన్నారు. ఇక ఇప్పుడు ప్రపంచస్థాయి రాజధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తున్నారని పేర్కొన్నారు.  చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోనే అమరావతికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు తరలి వస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు.