ఏంటేంటీ వైఎస్ఆర్సీపీ... కాంగ్రెస్‌కి వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీనా!?

  వైసీపీ కాంగ్రెస్‌కి వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీ కాబ‌ట్టి.. మేం ఆ పార్టీకి అనుకూలంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌లేం అంటారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స‌. ఇక్క‌డ విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే మా పార్టీ అంటూ పులిహోర క‌లుపుతున్న బొత్స  ఆ టైంలో ఉన్న పార్టీ కాంగ్రెస్.  ఇదిలా ఉంచితే, వైసీపీ ఓటు బ్యాంకు మొత్తం ఏపీలోని కాంగ్రెస్ ది. ఇప్ప‌టికి వైసీపీ కి ఉన్న 39. 5 ఓటు శాతం మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిష్టియ‌న్ మైనార్టీ. వీళ్లంతా.. దాదాపు కాంగ్రెస్ సాలిడ్ ఓటు బ్యాంకే. ఏపీలో కాంగ్రెస్ రాష్ట్ర విభ‌జ‌నాంత‌రం త‌గిన ఆద‌ర‌ణ లేక పోవ‌డంతో ఆ మొత్తం ఓట్ షేర్ మొత్తం వైసీపీకి వెళ్లిపోయింది. లిట్ట‌ర‌ల్ గా మాట్లాడితే ఏపీలోని వైయ‌స్ఆర్సీపీ ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ దే. ఇందులో నో డౌట్.  ఇంకో ముచ్చ‌ట ఏంటంటే ఎన్డీయే కూట‌మికి ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన స‌ర‌కు స‌రంజామా మొత్తం రెడీగా ఉంది. 788 మంది ఎల‌క్టోర‌ల్ ఎంపీలుంటే, వారిలో 392 మంది స‌పోర్టు ఉంటే స‌రిపోతుంది. ఇప్ప‌టికి 422 మంది మ‌ద్ధ‌తు ఎన్డీఏ అభ్య‌ర్ధి సీపీ రాధాకృష్ణ‌న్ కి ఉంది. అంత ఉండి కూడా తిరిగి కేంద్ర బీజేపీ అధిష్టానం  కేంద్ర మ‌త్రి రాజ్ నాథ్ సింగ్ ద్వారా జ‌గ‌న్ కి ఫోన్ చేయించింది. ఇదెక్క‌డి మ‌త‌ల‌బో అర్ధం కావ‌డం లేదెవ‌రికి. ఏంటీ దోబూచులాట‌? ఇప్ప‌టికే జ‌గ‌న్ బెయిల్ మీద ఉండ‌టానికి ప్ర‌ధాన కార‌ణం బీజేపీతో ఆయ‌న‌ కి ఉన్న చీక‌టి ఒప్పందాల‌ని అంటారు. మొన్న అమిత్ షా వ‌చ్చిన‌పుడు కూడా బాబు, ప‌వ‌న్ ముందు జ‌గ‌న్ బాగోగులు వాక‌బు చేశారు. మోడీ కూడా జ‌గ‌న్ గ‌ట్స్ గురించి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తార‌న్న టాకుంది. ఇదంతా చూస్తుంటే, జ‌గ‌న్- బీజేపీ అవినాభావ సంబంధం ఏంటో ఇట్టే తెలిసి పోవ‌డం లేదా? అంటారు కొంద‌రు. ఆ మాట‌కొస్తే వ‌చ్చే కొత్త  ప‌ద‌వీచ్యుతి బిల్లు- జ‌గ‌న్ని క‌ట్ట‌డి చేయ‌డం క‌న్నా బాబు, నితీష్ కోస‌మే ఇదంతా అంటూ ఏకంగా పార్ల‌మెంటులోనే మార్మోగిన వైనం.  వీన్నిటిని బ‌ట్టీ చూస్తే.. ఎవ‌రు ఏంటో ఇట్టే తెలిసి పోవ‌డం లేదా? కాంగ్రెస్ ఓటు బ్యాంకు త‌న ఓటు బ్యాంకుగా మ‌లుచుకుని.. కాంగ్రెస్ బ్ల‌డ్ న‌ర‌న‌రాన జీర్నించుకుని.. కాంగ్రెస్ కి వ్య‌తిరేకంగా తామీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేస్తామంటే దీని భావ‌మేమి బొత్సేశా! అంటున్నారు ఒక్కొక్క‌రూ. కార‌ణం జ‌గ‌న్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం యాంటీ బీజేపీ. కానీ ఇక్క‌డ జ‌గ‌న‌న్న చూస్తే త‌న స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీతో అంట‌కాగ‌డాన్ని ఏమ‌ని అర్ధం చేసుకోవాలి వైసీపీ ఓట‌ర్లూ! అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది.

ముగిసిన నారాయణ స్వామి సిట్ విచారణ

  ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సుదీర్ఘంగా సిట్ విచారించింది. దాదాపు 6 గంటల పాటు నారాయణస్వామిని ప్రశ్నిలించినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, ఇతర అంశాలు, లిక్కర్ స్కాంకు సంబంధించి పలు అంశాలపై విచారణ సాగినట్లు తెలుస్తోంది. కీలక ఆధారాలు, నారాయణ స్వామి స్టేట్మెంట్ సిట్ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.  ఆరోగ్య కారణాల రిత్యా విచారణకు హాజరు కాలేనని సిట్ కు గతంలో నారాయణస్వామి  తెలిపారు. ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా ఆయన నివాసంలోనే సిట్ విచారణ చేపట్టింది. గతంలోనే ఆయన తనకు ఎలాంటి సమాచారం లేదని .. కేవలం మంత్రిగా తాను అవసరమైతే సంతకాలు మాత్రమే చేసేవాడినని నారాయణ స్వామి వీడియో కాల్ ద్వారా విచారణ చేసినప్పుడు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. మరోవైపు లిక్కర్ స్కాం కేసులో తనపై వస్తున్న వదంతులను ఎవరు నమ్మొద్దని నారాయణ స్వామి తెలిపారు. నాపై అనేక అభూతకల్పనలు కొన్ని ఛానెళ్లు చేస్తున్నాయిని పేర్కొన్నారు. సిట్ విచారణకు పూర్తిగా సహకారించాని తెలిపారు. సిట్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని ఆయన పేర్కొన్నారు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన సీఎం చంద్రబాబు

  ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి మద్దతు తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ఆయనకు మా మద్దతు ఉంటుందని చెబుతూ అభినందనలు తెలిపాను. దేశానికి, ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్‌ గౌరవం తీసుకొస్తారని సీఎం పేర్కొన్నారు.  ఎన్నికల ముందు నుంచి ఎన్డీయేలో తెలుగు దేశం పార్టీ ఉంది. ఆ అభ్యర్థికే మా మద్దతు ఉంటుందన్నారు. తెలుగువాడు అన్నప్పుడు గెలిచే అవకాశం ఉంటేనే అభ్యర్థిని పెట్టాలి. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది. ఎన్డీయేలో ఉన్నప్పుడు ప్రతిపక్ష అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ : మంత్రి లోకేశ్

  ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతు గత 14 నెలల్లో అమలు చేసిన సంస్కరణలు ఫలితాల దిశగా నడిపి బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదని అన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాల్లో మౌళిక సదుపాయలు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అమరావతిలో ఏడాదిలోగా లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని లోకేశ్ తెలిపారు.  రాష్ట్రచరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేశాం, చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ.325కోట్లు విడుదల చేశాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-2025 ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి, ఉత్తమమైన ప్రీస్కూల్ పాలసీని సిద్ధంచేయండి. నిర్ణీత క్యాలండర్ ప్రకారం మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సైన్స్ & స్పోర్ట్స్ ఫేర్ లు నిర్వహించాలని మంత్రి తెలిపారు.  రాజమండ్రి గ్రంథాలయానికి రూ.87లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ఏడాది ప్రభుత్వ లైబ్రరీల్లోని పుస్తకాలతో ప్రిపేరైన 350మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు లభించాయి. లైబ్రరీల వల్ల కలిగే ప్రయోజనాలపై పెద్దఎత్తున క్యాంపెయిన్ నిర్వహించాలి. పోటీ పరీక్షలకు అవసరమైన అన్నిరకాల పుస్తకాలు లైబ్రరీల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయ రామరాజు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కృతికా శుక్లా, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండి సిఎన్ దీవెన్ రెడ్డి, పబ్లిక్ లైబ్రరీస్ డైరక్టర్ కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. 

శ్రీశైల క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

  నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన  శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజు ఐదవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో 650 మంది చెంచు గిరిజన ముత్తైదువులు, అలానే 1000 మంది సాధారణ మహిళ ముత్తయిదువులు పాల్గొన్నారు. వరలక్ష్మీ వ్రతం లో పాల్గొన్న మహిళలకు దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రతపూజా సామగ్రిని అలానే చీర,రవిక వస్త్రం కూడ అందజేసి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పాన్ని పఠించి నిర్వీఘ్నంగా జరిపించారు.  అనంతరం వ్రతంలో పాల్గొన్న చెంచు గిరిజన మహిళలకు, సాధారణ మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా చీర,రవిక పూలు, గాజులు, ప్రసాదం అందజేసి శ్రీ స్వామి,అమ్మవార్ల దర్శనం కల్పించారు. వ్రతంలో పాల్గొన్న మహిళలందరికి దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.  మన వైదిక సాంప్రదాయంలో శ్రావణ మాస వరలక్ష్మి  వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా వస్తుందనీ ఈవో తెలిపారు. ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించినట్లు తెలిపారు.  ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో  గిరిజన చెంచు సోదరిమనులకు అవకాశం కల్పించామన్నారు. చెంచు ముత్తైదులను ఎంపిక చేయడంలో ఐటీడీఏ అధికారుల సహకారం అందించారని తెలిపారు, ఐటీడీఏ పీవో శివప్రసాద్ మాట్లాడుతూ దేవస్థానం గిరిజన చెంచు భక్తులను వరలక్ష్మి వ్రతాలకు ప్రత్యేకంగా ఆహ్వానించడం పట్ల దేవస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. మూడు జిల్లాల నుండి పలు గూడెములలోని గిరిజన చెంచు భక్తులను ఈ వరలక్ష్మి వ్రతానికి తీసుకొని రావడం జరిగిందన్నారు  వరలక్ష్మి వ్రతంలో శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు, ఐటీడీఏ పీవో శివప్రసాద్  దంపతులు, పెద్ద ఎత్తున మహిళలు  పాల్గొన్నారు.  

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్?

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయా?  అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు  కార్పోరేట్ హాస్పిటల్స్‌లో ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ సేవల పరిధిని ఐదు లక్షల నుంచి పదిలక్షల రూపాయలకు పెంచింది.  అయితే ఆరోగ్యశ్రీ బకాయలు పేరుకుపోవడంతో ఈ పథకం కింద సేవలను ఈనెల 31 నుంచి బంద్ చేయాలని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు నిర్ణయించాయి. ఈ మేరకు ఆరోగ్య శ్రీ సీఈవోకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్ హెచ్ ఏ) లేఖ రాసింది.  ఆ లేఖలో ఆరోగ్య శ్రీ సేవలతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సేవలను కూడా నిలిపివేయనున్నట్లు పేర్కొంది. ఏడాది కాలంగా ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, ఆయా సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బకాయిలను చెల్లించకుండా పెండింగ్ లో ఉంచిందనీ, దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు టీఏఎన్ హెచ్ ఏ ఆ లేఖలో పేర్కొంది.  

కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ

  సినిమాల్లో హీరో విలన్లను రక్తం వచ్చేలా కొట్టడం లేదా చంపడం... పబ్జి వంటి గేమ్ షోలో గన్  పట్టుకుని ఎదురు వచ్చిన శత్రువులను తుపాకిలతో కాల్చి చంపడం...ఇటువంటి రక్తపాతం లాంటి సీన్లు చూసి పిల్లలు మైండ్ సెట్ మారు తుందనడానికి కూకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు ఓ మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు... తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో ఒక బాలుడే నిందితుడని తెలి యగానే పోలీసులు, స్థానికులు ఒక్క సారిగా అవ్వక్క య్యారు. గత ఐదు రోజులుగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేయడంతో పాటు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. చివరకు బాలిక హత్య కేసులో పక్కింటి పిల్లోడే  నిందితుడి గా బయటపడింది. పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు దొంగతనం ఎలా చేయాలో వచ్చి రాని ఇంగ్లీషు లో ఒక లెటర్ రాసుకున్నాడు. హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ ఇంగ్లీషులో ఓ లెటర్ రాసుకున్నాడు.  బాలిక సహస్ర ఇంట్లో తల్లిదండ్రులు బయటికి వెళ్లిన అనంతరం పక్కింట్లో ఉన్న బాలుడు దొంగతనం చేయడానికి సహస్ర ఇంట్లోకి ప్రవేశిం చాడు. మెల్లిగా దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సహస్ర అక్కడికి వచ్చింది. దొంగ తనం విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్తానని సహస్ర బెదిరించింది.  దీంతో భయపడిపోయిన బాలుడు వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా సహస్ర గొంతులో పొడిచాడు. అనంతరం కింద పడిపోయిన సహస్ర పై దాడి చేసి 18 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత బాలుడు సహస్ర ఇంట్లో నుండి పక్క బిల్డింగ్ లోకి వెళ్లి 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో బాలుడులో తెలియని భయం మొదలైంది.  అది  గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంటనే ఎస్ఓటి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్ ఓ టి పోలీసులు బాలుడు చదువు తున్న స్కూల్ కి వెళ్లి విచారణ చేశారు. కానీ బాలుడు నోరు విప్పి ఏమి చెప్పలేదు. దీంతో ఎస్ఓటి పోలీసులు బాలుడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా ఇంగ్లీషులో రాసుకున్న ఒక లెటర్, ఒక కత్తి, రక్తంతో కూడిన దుస్తులు బయటపడ్డాయి. దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు..  

కాళేశ్వరం రిపోర్టుపై స్టేకు హైకోర్టు నో .. కేసీఆర్, హరీష్ రావులకు చుక్కెదురు!

కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.   ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా.. ముందే చర్యలు తీసుకుంటారా అన్నదానిపై క్లారిటీ కావాలని హైకోర్టు గురువారం (ఆగస్టు 21) విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని అడిగింది. దీనిపై శుక్రవారం (ఆగస్టు 22) న అడ్డకేట్ జనరల్ ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన అనంతరమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫుర కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన తదుపరి చర్యల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.  ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కాపీలు ఇస్తామని.. సమగ్రంగా చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  జస్టిస్ ఘోష్ కమిషన్‌కు చట్టబద్ధత లేదనుకుంటే కేసీఆర్, హరీష్ రావు తమకు నోటీసులు జారీ చేసినప్పుడే హైకోర్టుకు వెళ్లి ఉండాల్సిందని న్యాయ నిపుణులు అంటున్నారు.  కమిషన్ ముందుకు హాజరై తమ వాదనలు వినిపించిన తర్వాత, ఇప్పుడు ఆ నివేదిక తమకు వ్యతిరేకంగా వచ్చిందని దానికి చట్టబద్ధత లేదని విమర్శించడం సరికాదని అంటున్నారు.  

జీహెచ్ఎంసీలో లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి : హైకోర్టు

  హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్ టెల్ వేసిన పిటిషన్‌పై  విచారణ సందర్బంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచొద్దని స్పష్టం చేసింది. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయటం ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటంపై న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామంతాపూర్‌ ఘటనను ఆయన ప్రస్తావించారు.  పుట్టిన రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఘటనపై ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేక్‌ కట్‌ చేయాల్సిన 9 ఏళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసిందని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక అన్నారు. విద్యుత్‌ ప్రమాదంపై ఎవరికి వారే చేతులు దులిపేసుకుంటే ఎలా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామంతాపూర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో హైదరాబాద్‌లో ఉపయోగం లేని కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.   

వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి బెయిల్

  వైఎస్ వివేక హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదించినా ఫలితం లేకపోయింది. ఈ కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయింది. దీంతోనూ గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.  ఈ కోర్టు కూడా గంగిరెడ్డి బెయిల్ రద్దూ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గంగిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో పలుమార్లు విచారణ జరిగింది. అయితే ఆయా సమయాల్లో విచారణను ధర్మాసనం వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా జరిగిన విచారణలో ఇరువర్గాల వాదన విన్న కోర్టు.. గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో సుప్రీంకోర్టులో ఆయనకి ఊరట లభించింది.  కాగా 2019 ఎన్నికలకు ముందు వివేకానందారెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో గంగిరెడ్డిని ఏ1 నిందితుడిగా పోలీసులు గుర్తించారు. గంగిరెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే పులివెందుల కోర్టు ఇచ్చిన తీర్పుతో గంగిరెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు. సీబీఐ అధికారులు కడపతో పాటు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టులు ఆయనకి బెయిల్ రద్దు చేశాయి.   

మోడీ దత్తపుత్రుడు జగన్.. వైసీపీ బీజేపీ బీటీమ్!

ఉపరాష్ట్రపతి ఎన్నిక  అనివార్యమైంది. ఎన్డీయే కూటమి అభ్యర్థిని ప్రకటించిన తరువాత సుదీర్ఘ చర్చల అనంతరం ఎన్డీయే కూటమి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. దీంతో ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోటీ అనివార్యమైంది.  ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉప రాష్ట్రపతి ఎన్నిక రాజకీయాన్ని రసకందాయంలో పడేలా చేసింది. ఇండియా కూటమి అభ్యర్థి తెలుగువారవ్వడం, ఇంత వరకూ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి కావడంతో.. పోవడంతో  ఏ కూటమిలోనూ లేకపోయినా జగన్ నాయకత్వంలోని వైసీపీ ఆయనకు కాకుండా, ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. మిగిలిన వారందని విమర్శలూ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల విమర్శలు మాత్రం జగన్ నోట మాట రానీయకుండా చేస్తున్నాయి. తన సోదరుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ ప్రధాని మోడీకి దత్తపుత్రుడంటూ ఆమె మరో సారి జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయ పరిస్థితులు, పరిణామాలతో సంబంధం లేకుండా జగన్ ఎన్డీయే అభ్యర్థికి బేషరతు మద్దతు ఇవ్వడాన్ని సూటిగా ప్రశ్నించిన షర్మిల.. తెలుగుదేశం, జనసేన, జగన్ ఒకే తానులోని ముక్కలని విమర్శించారు. అయితే తెలుగుదేశం, జనసేనలు బీజేపీతో తమ బంధాన్ని బహిరంగంగా చెబుతుంటే.. జగన్ మాత్రం రహస్యంగా బీజేపీ పంచన చేరి ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటున్నారని విమర్శించారు. ఇంత కంటే దారుణం మరోటి ఉండదన్నారు. ఇండియా కూటమి తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిల బెట్టినా, జగన్ నిస్సిగ్గుగా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని బట్టే వైసీపీ బీజేపీ బీటీం అని అర్ధ మౌతోందని షర్మిల అన్నారు. వైసీపీ రాష్ట్రప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.  చూడాలి షర్మిల విమర్శలకు జగన్ ఏ రకంగా స్పందిస్తారో?

శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్

  శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేను  ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై  క్రిమినల్ ఇన్వెస్టిషన్ డిపార్ట్‌మెంట్ అరెస్ట్ చేశారు. 2023లో ఆయన విదేశీ పర్యాటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. మొత్తం 10 మంది ప్రమేయం ఉందని సీఐడీ పేర్కొంది. ఆయన వ్యక్తిగత లండన్ పర్యటనకు రూ. కోటీ 70 లక్షల ప్రభుత్వ నిధులు వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.  2023లో ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఆ అంశానికి సంబంధించిన కేసులో విక్ర‌మ‌సింఘేను అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. బ్రిటీష్ యూనివ‌ర్సిటీలో విక్ర‌మ‌సింఘే భార్య‌ను స‌త్క‌రించే కార్య‌క్ర‌మం కోసం ఆయ‌న వెళ్లారు. విక్ర‌మ‌సింఘేను కొలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రుస్తున్న‌ట్లు అధికారి తెలిపారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల కోసం ప్ర‌భుత్వ నిధుల‌ను వాడుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని ఆ అధికారి చెప్పారు. 2022లో గోటబయ రాజపక్స రాజీనామా చేసిన తర్వాత విక్రమసింఘే అధ్యక్ష పదవిని చేపట్టారు. 2024లో ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.  

కేసుల భయంతో వణికిపోతూ చేసే రాజకీయం ఇలాగే ఉంటుంది మరి!

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఒక వేళ మద్దతు ప్రకటించకపోయి ఉంటే అందరూ ఆశ్చర్యపోయి ఉండే వారు. అయితే ఎవరినీ ఆశ్చర్యపరచడం ఇష్టం ఉండని జగన్ తమ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ద్వారా ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కే వైసీపీ మద్దతు అని ఒక ప్రకటన చేయించారు. అక్కడితో ఆగకుండా బీజేపీ అగ్రనేతలు స్వయంగా కోరడం వల్లనే పార్టీలో చర్చించి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పుకుంటున్నారు. ఔను కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ స్వయంగా జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారని ప్రచారం చేసుకుంటున్నది వైసీపీ. సరే ఇవన్నీ పక్కన పెట్టి సపోజ్.. ఫర్ సపోజ్ రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి ఉండకపోతే ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండియా కూటమికి వైసీపీ మద్దతు పలికి ఉండేదా?  అంటే అబ్బే అటువంటి పరిస్థితి లేదన్న సమాధానమే ఆ పార్టీ నాయకత్వం నుంచి వ స్తుం ది.  ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి తరఫున సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఆయన తెలుగువారు కూడా.  అయినా కూడా వైసీపీ ఎన్డీయే కూటమి అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. ఎన్డీయే కూటమిలో వైసీపీకి ప్రత్యర్థి అయిన తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. అయినా సరే వైసీపీ హడావుడిగా నిర్ణయం తీసేసుకుని ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించేసింది. తద్వా రా జగన్ తాను అప్పుడూ, ఇప్పడూ, ఎప్పుడూ మోడీ, షా కు విధేయుడేనని చెప్పకనే చెప్పేసింది.  అలా చెప్పకుంటే.. అలా విధేయత ప్రకటించకుండా ఉంటే కేసులతో ఇబ్బంది తప్పదన్న సంగతి జగన్ కు బాగా తెలుసు. ఎప్పుడైనా మాట మాత్రంగానైనా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ విధానాలపై విమర్శల చురకలేసినా, లేశ మాత్రంగానైనా వ్యతిరేకత ప్రకటించినా.. గత పదేళ్లకు పైగా హాయిగా బెయిలుపై తిరుగుతున్న తనకు జైలే గతి అవుతుందన్న భయం జగన్ కు నిలువెల్లా ఉందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తన హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో జగన్ ఇప్పటికే పీకలోతు ఇరుక్కున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్.. పకడ్బందీగా అడుగులు ముందుకు వేస్తున్నది. సిట్ వేస్తున్న ప్రతి అడుగూ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగన్ అని తేల్చే దిశగానే సాగుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో జగన్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టుడు ఆర్ నాట్ టు డు అన్న సందేహానికి వీసమెత్తైనా అవకాశం ఇవ్వకుండా  ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ప్రకటించేసి.. అరెస్టుల నుంచి కాపాడాల్సిందంటూ మోడీ, జగన్ లకు శరణుచొచ్చానన్న సంకేతం ఇచ్చేలా  జగన్ డ్రెస్, ఫేస్ కూడా మార్చేశారంటున్నారు. బీజేపీ పెద్దలకు విధేయంగా ఉండటం కంటే ఉన్నానన్న సంగతిని కమలనాథులకు కనిపించేలా చేయడం తక్షణ కర్తవ్యంగా భావించిన జగన్  అందుకు తగ్గట్టుగానే అందరి కంటే ముందే ఎన్డీయే అభ్య ర్థి రాథాకృష్ణన్ కు మద్దతు ప్రకటించేశారంటున్నారు.  కేసులు, అరెస్టులు, బెయిలు రద్దుల భయంతో జగన్ చేసే రాజకీయం ఇలా కాక మరెలా ఉంటుందంటున్నారు పరిశీలకులు. జగన్ ఈ తరహా రాజకీయమే వైసీపీకి శాపంగా, మరణశాసనంగా మారిందని అంటున్నారు. 

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ కానుక

  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకగా చీర, పసుపు కుంకుమ పంపించారు. శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన ఆధ్వర్యంలోవరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. తొలి  పూజల్లో ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ పాల్గొని వ్రతమాచరించారు.  ఈ సందర్భంగా పాదగయ పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మంది మహిళలకు కానుకగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పంపించిన చీరలు, పసుపు, కుంకుమ కిట్లను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే  పంతం నానాజీ , పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త  మరెడ్డి శ్రీనివాస్ , జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

బీజేపీ అధ్యక్షుడు అరెస్ట్

  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్  చేశారు. సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మొయినాబాద్ వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు హైదరాబాద్ నగర పరిధిలో బీజేపీ నాయకులను కార్పొరేటర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.దీంతో నాయకులు, కార్పొరేటర్లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.  తుర్కయాంజల్‌లోనూ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అబ్దుల్లాపూర్‌ మెట్‌ పీఎస్‌కు తరలించారు. మరోవైపు సరూర్‌నగర్‌ కార్పొరేటర్‌ శ్రీవాణి సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆమెతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా బీజేపీ నేతలు ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్న మునిసిపల్ శాఖ నగర ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలం చెందుతుందని అన్నారు.  హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా హై టెన్షన్ వైర్లు జనవాసాల మీద ఉండడం మూలంగా ఇటీవల రామంతపూర్ లాంటి ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పగా చెప్పుకుంటున్న జిహెచ్ఎంసి, హైడ్రా, ఆయా విభాగాల మధ్య సమన్వయం లేదని దీంతో హైదరాబాదులో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు.  వెంటనే దీనిపై ముఖ్యమంత్రి స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

ఆసియా కప్ లో టీమ్ ఇండియా x పాకిస్థాన్

ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్  దాయాది దేశాల క్రికెట్ జట్ల మధ్య మరో పోరుకు వేదిక కానుంది. త్వరలో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల తలపడను న్నాయి. ఇరు దేశాల మధ్యా సత్సంబంధాలు లేని కారణంగా ఇంత కాలం అంతర్జాతీయ టోర్నీలలో అంటే ఐసీసీ ఈవెంట్లలో తప్ప ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక మ్యాచ్ లు జరగడం లేదు. ఆయితే అసలు ఇక అంతర్జాతీయ టోర్నీలలో కూడా ఇరు దేశాల జట్లూ తలపడే అవకాశం ఉండదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఔను.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్యా యుద్ధం తప్పదా అన్న పరిస్థాతి ఏర్పడింది. దాడులు, ప్రతి దాడులూ కూడా జరిగాయి. ఆపరేషన్ సిందూర్ తో భారత్.. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది. ఆ తరువాత పాకిస్థాన్ కాళ్లా వేళ్లా పడటంతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ తో అన్ని రకాల సంబంధాలనూ తెంచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడాల్సిన పోటీని భారత్ బహిష్కరిస్తుందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. రాజకీయపార్టీలు, సామాన్య ప్రజలే కా దు.. క్రికెట్ అభిమానులు సైతం పాకిస్థాన్ తో మ్యాచ్ వద్దంటే వద్దని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడాల్సిన మ్యాచ్ ను టీమ్ ఇండియా బహిష్కరించడానికే ఎక్కువ అవకాశాలున్నాయన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో భారత క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా చేసిన ప్రకటన భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. పాకిస్థాన్ తో ఎటువంటి క్రీడా సంబంధాలకూ తావులేదని స్పష్టం చేసిన మంత్రిత్వ శాఖ అయితే అంతర్జాతీయ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మల్టీ నేషనల్ ఈవెంట్ల విషయంలో ఈ నేషేధం ఉండదన్న క్లారిటీ ఇచ్చింది. అంటే ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడేందుకు ఎటువంటి ఆటకం లేదని స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 14న ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఈ మ్యాచ్ పట్ల ఇరు దేశాలలోనే కాకుండా.. క్రికెట్ ఆడే దేశాలన్నిటిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. టోర్నీ ఏదైనా, వేదిక ఏదైనా భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే అదో హైటెక్ మ్యాచే. యుద్ధం జరుగుతోందా అన్నంత ఉత్కంఠ నెలకొంటుంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ పట్ల ఆసక్తి వ్యక్తమౌతుంది. అసలు ఇరు జట్ల మధ్యా మ్యాచ్ ఉందంటేనే అది టోర్నీకే ఒక అదనపు ఆకర్షణగా మారుతుంది. 

దార్శనికుడు పాలకుడైతే..

ఓ సైబరాబాద్.. ఓ కియా ఫ్యాక్టరీ ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ తల్లి పడే ప్రసవవేదన ఏమిటో మన అందరికీ తెలిసిందే… అలాగే ఒక పరిశ్రమ … ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు కోల్పోయే రైతులు పడే ఆవేదన అంతకు ఏ మాత్రం తక్కువ కాదు.   తాను జన్మనిచ్చిన బిడ్డ  బుడిబుడి నడకలు వేస్తూ… బోసినవ్వుల మాటలు చెబుతూ ఉంటే ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు… అలాగే పరిశ్రమలు , ప్రాజెక్టులు పూర్తయి ఫలాలు అందరికీ అందినప్పుడూ ప్రజల ఆనందం, వారి అనుభూతి   మాటల్లో చెప్పలేనిదనడంలో సందేహం లేదు.  దీనికి ఉదాహరణే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలు….. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో గిట్టని వాళ్ళు చేసిన విమర్శలు… హేళనలు  అన్నీ ఇన్నీ కావు.. కానీ నేడు అదే హైటెక్ సిటీ ఒక కొత్త నగరాన్నే నిర్మించింది.. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచింది… రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి గా చంద్రబాబు దూరదృష్టి తో ఆవిష్కరించినదే కియా కార్ల తయారీ పరిశ్రమ… కరవు కాటకాలకు నెలవైన అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో కార్ల తయారీ కర్మాగారాన్ని 536 ఎకరాలను కేటాయించారు..  కొండలు .. గుట్టలతో ఉన్న ఆ ప్రాంతాన్ని చదును చేసి  కియా కార్ల కంపెనీకి అప్పగించారు.  కర్మాగారానికి అవసరమైన నీటిని కూడా కేటాయిస్తూ జీవోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో హైటెక్ నిర్మాణం చేపట్టినప్పుడు ఎదురైన విమర్శలే ఇక్కడా వినిపించాయి.. అయినా చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ముందడుగు వేశారు.  కరువు సీమలో నీటిని సాగుభూములకు ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారని విపక్షాలు విమర్శలు చేశాయి. కానీ కర్మాగారం వస్తే ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందో రైతులకు వివరించి మరీ ఒప్పించారు చంద్రబాబు.  2017లో కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.  2019 నాటికి ఉత్పత్తి ప్రారంభించగానే..   మొదటి ఏడాదిలోనే 50 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేసిన కియా కంపెనీ,  2025 నాటికి 15 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది…ఏటా 3 లక్షల కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలన్న లక్ష్యంగా మూడో షిఫ్ట్ జోడించారు. చంద్రబాబు హయాంలో కర్మాగారం పనులు సాఫీగా సాగాయి.  ప్రభుత్వం మారాక కొన్ని బాలరిష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అప్పటి అధికార పార్టీ నాయకుల దందాల రానఫంగా.  కియా అనుబంధ పరిశ్రమను తమిళనాడుకు తరలించే ప్రయత్నాలూ జరిగాయి.   కియా పరిశ్రమ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు కృషి ప్రస్తుతం ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది.  గతంలో భూములు అమ్ముకుందామంటే కొనే దిక్కులేదు.  కాని నేడు పరిస్థితి అందు కు పూర్తి భిన్నంగా ఉయారైంది.  అందుకే దార్శనికుడు పాలకుడితే రాష్ట్ర పురోగతి ఎలా ఉంటుందో కి యా పరిశ్రమ ను చూస్తేనే తెలుస్తుంది.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి నదికి వరద కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 14 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదవరి వరద ఉధృతి కారణంగా రాజమహేం ద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద మెట్లు పూర్తిగా నీటమునిగాయి. ఇక్కడ నీటి మట్టం 55 అడుగులుగా ఉంది. కాగా వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజి 175 గేట్లూ ఎత్తివేసి 13 లక్షల 5 వేల 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ముంపు ముప్పు ఏర్పడింది. అధికారులు లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేశారు.  లంకగ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.  సాయంత్రానికి వరద ఉధృతి ఒకింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

చర్చలు ఫలించాయి.. సినీ కార్మికుల సమ్మె ముగిసింది

గత 18 రోజులుగా చేస్తున్న సమ్మెను సినీ కార్మికులు విరమించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో నిర్మాతలు, కార్మికులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కుదరడంతో  నిర్మాతలు , ఫెడరేషన్ నాయకుల తో కార్మికశాఖ అదనపు కమిషనర్ జరిపిన చర్చలు చర్చలు ఫలించాయి.  దీంతో ఇంత కాలంగా నిలిచిపోయిన షూటింగ్ ను శుక్రవారం (ఆగస్టు 22) నుంచి ప్రారంభమయ్యాయి. సమ్మె ముగిసి షూటింగ్ లు ఆరంభం కావడంతో  కృష్ణానగర్ లో సందడి కనిపించింది.   జూనియర్ అరిటిస్టులు ఇతర విభాగాలకు చెందిన టెక్నీషియన్స్ చేతినిండా పని దొరకుతుందన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 18రోజులుగా షూటింగ్ లు నిలిచిపోవడంతో.. ఇక ఎక్కడా బ్రేక్ లేకుండా షూటింగ్ ను సాగించేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.