పెద్దారెడ్డికి హై కోర్టు షాక్.. తాడిపత్రిలోకి నో ఎంట్రీ

మాజీ ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన తాడిపత్రి ఎంట్రీకి అనుమతి ఇస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్డు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది.  హైకోర్టు అనుమతి ఉన్నా తనను తాడిపత్రిలోకి పోలీసులు అనుమతించలేదంటూ ఆరోపణలు గుప్పిస్తున్న పెద్దారెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు పెద్ద షాక్ అనే చెప్పాలి. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించి ఆయనకు భద్రత కల్పించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు అనంతపురం జిల్లా ఎస్పీ. జిల్లా ఎస్పీ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే ఇస్తూ బుధవారం (ఆగస్టు 20) ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 

బాబు ద బిజినెస్ మెన్

  రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రతన్ టాటా చనిపోవచ్చేమోగానీ ఆయన ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోవడం తనకు ఇష్టం లేదన్నారాయన. అందుకే ఈ హబ్ స్థాపించినట్టు చెప్పారు. మన కంటి ముందు హైదరాబాద్‌లో ఐటీ ర్యాలీ తీసింది మనం చూసే ఉంటాం. తాను ఈ విషయం అప్పుడే పసిగట్టి.. ఐటీ ని ఎంకరేజ్ చేశాననీ తర్వాత ఇప్పుడు ఐటీలో మన వాళ్లు మేటిగా ఉన్నట్టు చెప్పారాయన.  ఇప్పుడు అమరావతి అనే రాజధాని నిర్మాణం చేసే అదృష్టం నాకొచ్చింది. దీంతో ఈ ప్రాంతాన్ని క్వాంటం వ్యాలీగా మార్చడమే తన ధ్యేయమన్నారు చంద్రబాబు. అదేమంత పెద్ద కష్టం కాదని.. తానందించిన ప్రేరణతో ఇప్పుడు ఎటు చూసినా తెలుగువారే కనిపిస్తున్నారని.. యూఎస్‌లో పెద్ద స్థాయిలో భారతీయులు రాణిస్తుంటే వారిలో 33 శాతం తెలుగు వారే ఉన్నారని అన్నారాయన. ఇదే స్ఫూర్తితో తాను అమరావతిని సైతం తీర్చిదిద్దాలని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇంటికో ఐటీ ఎంప్లాయి ఉండాలని భావించిన తాను- ప్రస్తుతం ఇంటికో ఎంటర్ ప్రెన్యూర్ ఉండేలా భావిస్తున్నానని.. అందుకే ఈ రతన్ టాటా హబ్ తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చారాయన.  అంతే కాదు తన స్వీయ అనుభవాలను కూడా ఈ సందర్భంగా రంగరించారు చంద్రబాబు. 1992లో తాను హెరిటేజ్ ఐడియా తీసుకొచ్చానని.. కారణం మనం ఎప్పుడైతే రాజకీయాల్లాంటి ఐడియల్ ప్లేసెస్ లో ఉన్నామో.. మన కుటుంబానికంటూ ఒక ఆర్ధిక ఆధారం ఉండాలని తాను మొదట భావించినట్టు చెప్పుకొచ్చారాయన. దీంతో తానీ వ్యాపారం ప్రారంభించామని.. తర్వాత కాలంలో.. దాన్ని నడిపే బాధ్యతను తన సతీమణి భువనేశ్వరికి ఇచ్చాననీ.. తొలుత ఆమె పెద్ద గొప్పగా ముందుకు రాకున్నా.. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో వండర్స్ క్రియేట్ చేసినట్టు చెప్పారు. ఇప్పుడు తాము తమ కుటుంబం హ్యాపీగా ఉన్నామని. ఈ ప్రేరణతో తాను ఇంటింటికీ ఒక ఎంటర్ ప్రెన్యూర్ ప్రొగ్రాం తీసుకొస్తున్నట్టు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు.

ఓల్డ్ సీటిని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందే : సీఎం రేవంత్

  ప్రపంచ స్థాయి నగరంలో ప్రభుత్వ ఆఫీసులు సరిగ్గా లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యాలయంలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. గచ్చిబౌలిలో 8 నెలల్లో అంతర్జాతీయ స్ధాయి నూతన భవన సముదాయాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మూసీ ప్రక్షాళనను కొందరు వ్యతిరేకించిన ఓల్డ్ సీటిని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని తెలిపారు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణమని సీఎం అన్నారు. చంద్రబాబు, వైఎస్ఆర్‌‌లు కూడా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఇక దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి వెనుకు స్వర్గీయ రాజీవ్ గాంధీ పాత్ర కూడా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైటెక్స్ సిటీకి పునాది రాయి పడిందని, ఆ తరువాత దాని నిర్మాణాన్ని చంద్రబాబు కొనసాగించారని రేవంత్ గుర్తు చేశారు. అమెరికాలో కూడా సిలికాన్ వ్యాలీని తెలుగు వాళ్లు శాసిస్తున్నారని తెలిపారు. తెలుగు వాళ్లు లేకపోతే అమెరికా ఐటీ కంపెనీలు నడిచే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో హైదరాబాద్‌కు పోటీగా నిలబెట్టాలని తెలిపారు.  కానీ, మూసీ ప్రక్షాళన.. ఫ్యూచర్ సిటీ కొందరికి నచ్చడం లేదని కామెంట్ చేశారు. ఆనాడు కూడా హైటెక్స్ సిటీని కొందరు అవహేళన చేశారని.. ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు, ఊరు చివర ఎయిర్‌పోర్టా అంటూ కామెంట్లు చేశారని గుర్తు చేశారు.తెలంగాణ రైజింగ్ నినాదంతో హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు పాల్గోన్నారు.

13 గంటలు.. ఎనిమిది భేటీలు.. హస్తినలో లోకేష్ స్పీడ్ మామూలుగా లేదుగా?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటన దేశవ్యాప్తంగా  అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజకీయాలతో  సంబంధ్ లేకుండా లోకేష్ హస్తిన పర్యటనను అన్ని పార్టీల నేతలూ ఆసక్తిగా గమనించాయి. నిజానికి  లోకేష్ తాజా హస్తిన పర్యటన పూర్తిగా ఫలవంతమైంది. లోకేష్ కోరడం ఆలస్యం కేంద్ర మంత్రులంతా ఆయనకు పోటీలు పడి మరీ అప్పాయింట్ మెంట్లు ఇచ్చారు. కేవలం 13 గంటల వ్యవధిలో ఆయన ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అలాగే ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాథాకృష్ణన్ ను కలిసి అభినందించారు. అంతే కాదు ఈ సారి పర్యటనలో ఆయన హస్తినలో టీడీఎల్పీ కార్యాలయాన్ని సందర్శించారు. టీడీఎల్పీ కార్యాలయానికి లోకేష్ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా లోకేష్ కు తెలుగుదేశం, జనసేన ఎంపీలు ఘన స్వాగతం పలికారు.  సాధారణంగా ఈ స్థాయిలో మంత్రులతో భేటీలు జరపడం, రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం నిర్విరామంగా కృషి చేయడంలో ఇంత వరకూ చంద్రబాబుకు ఎవరూ సాటిరారన్న పేరు ఉంది. అయితే లోకేష్ తాజా హస్తిన పర్యటన ఆయన చంద్రబాబును బీట్ చేసేశారా అనిపించేలా ఉందని ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులే కాదు.. పలు జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా అంటున్నారు. ఆయన స్పీడ్ ఓ రేంజ్ లో ఉందని ప్రశంసిస్తున్నారు.   ఈ భేటీలలో నారా లోకేష్  రోడ్లు, డేటా సిటీ, పోర్టు అభివృద్ధి గ్రాంట్లు సహా అనేక కీలక అంశాలపై సంబంధిత మంత్రులతో చర్చించారు. దాదాపుగా.. దాదాపుగా ఏమిటి.. ఆయన కలిసిన కేంద్ర మంత్రులంతా లోకేష్ వినతులకు సానుకూలంగా స్పందించారు. ఏపీ అభివృద్ధి విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తామంటూ ముందుకు వచ్చారు.  ఆంధ్రప్రదేశ్ సమగ్ర సంతులిత అభివృద్ధికి కేంద్రం సహకారం సాధించడమే ధ్యేయంగా సాగిన లోకేష్ హస్తిన యానం పూర్తిగా ఫలవంతమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

శ్రీశైలం వద్ద కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతున్నది. దీంతో  ప్రాజెక్టు శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతుంది. దీంతో  ప్రాజెక్టు  గేట్లును ఎత్తివేసి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3లక్సల 45 వేల 730 క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ కు ఉరకలెత్తుతోంది.  అధికారులు. శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3లక్సల 45 వేల 730 క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ కు ఉరకలెత్తుతోంది. అయితే ఎగువన జూరాల నుంచి 2 లక్షల 65 వేల 957 క్యూసెక్కుల వరదనీరు, సుంకేసుల నుంచి 1 లక్ష 42 వేల 294 క్యూసెక్కుల  వరదనీరు  శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నది.  దీంతో  శ్రీశైలం జలాశయానికి మొత్తంగా   4 లక్షల 09 వేల 376 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 4 లక్షల 11 వేల 237 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.7354 టీఎంసీలుగా నమోదైంది.  శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ మొసలి కన్నీరు!

కొన్ని నాటకాలు రక్తి కడతాయి. కొన్ని నాటకాలు వాస్తవాన్ని బయటపెడతాయి.  ఇప్పుడు వైసీపీ పరిస్థితి విశాఖలో అదే రకంగా ఉంది.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేవలం కార్మికులే కాదు,  ఉత్తరాంధ్ర ప్రజలు సైతం ఆవేదనతో ఉన్నారు.  ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన ఈ స్టిల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నది ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్. డిమాండ్ కూడా.  అయితే ఆ సెంటిమెంటును రాజకీయంగా వాడుకోవడానికి వైసిపి తొలి దశ నుంచి ప్రయత్నిస్తోందని తాజా పరిణామాలను బట్టి స్టీల్ కార్మికులు ఆరోపిస్తున్నారు.  ఆంధ్రుల హక్కు నినాదంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పుట్టింది.  ప్రపంచంలోనే నాణ్యమైన స్టీల్ గా విశిష్టత గాంచింది.  కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల బారిన పడింది.  ప్రధానిగా వాజ్ పేయి ఉన్న సమయంలో ప్లాంటును ప్రైవేటీకరించాలన్నఅధికారుల ప్రతిపాదనను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు.  కేంద్రాన్ని ఒప్పించి బిఎఫ్ఆర్ నుంచి కాపాడారు.  ఆ తర్వాత మళ్లీ దశాబ్ద కాలం తర్వాత ప్లాంట్ సంక్షోభంలో పడింది.  ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దీన్ని ప్రైవేటీకరించాలని ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీ   దీన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించలేదు. ఒక దశలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాంట్ లో మిగులు భూమిని విక్రయించి నష్టాల నుంచి బయటపడాలని సూచించారు అయితే కార్మిక నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ కోసం రైతులు ఇచ్చిన భూములను విక్రయించడానికి అంగీకరిం చలేదు.  అయితే స్టీల్ కార్మికులు ఉత్పత్తి ఆగకుండా ఉద్యమాలు కొనసాగించడానికి సహకరిస్తామని ఫ్యాన్ పార్టీ నాయకులు ప్రకటించారు.  అది నిజమేనని భావించి కార్మికులు వైసిపి వెంట నడిచారు.  అయితే ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఫ్యాన్ పార్టీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదు.  దీంతో ప్లాంట్ మరింత నష్టాల్లోకి కష్టాల్లోకి వెళ్ళింది.  కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తేవడంతో 1140 కోట్ల రూపాయల  ఆర్థిక సహాయం అందించింది.  అయితే ప్లాంట్ ను విక్రయించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించారు.   అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క పైసా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆర్థిక సహాయం తీసుకురాకపోగా,  కాకపోగా ఆ సమయంలో ఆ పార్టీ పరోక్షంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాలేదు. దీంతో దాదాపు నాలుగేళ్లగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తర్జనభర్జనులు కొనసాగుతూ ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాని ఈ ఫ్యాన్ పార్టీ ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని స్టీల్ కార్మికులు ఆరోపిస్తున్నారు.

నల్లజర్లలో రేవ్ పార్టీ!

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రేవ్ పార్టీ కలకలం రేపింది. పుట్టిన రోజు పార్టీ అంటూ నల్లజర్ల మండలం ఘంటవారి గూడెంలో రేవ్ పార్టీ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేసి ముగ్గురు యువతులు, పాతిక మంది పురుషులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, ఏడు కార్లు, ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పాశ్చాత్య మోజులో పడి ఇటువంటి అసాంఘిక, అనైతిక కార్యక్రమాలకు తెగబడితే ఉపేక్షించేది లేదని పోలీసు అధికారలు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా ఇంత వరకూ హైదరాబాద్ వంటి మెట్రోపాలిటిన్ నగరాలకే పరిమితం అనుకున్నరేవ్ పార్టీ కల్చర్ పచ్చదనంతో కళకళలాడే తూర్పుగోదావరి జిల్లాకూ పాకడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. నల్లజర్ల సంఘటన విషయానికి వస్తే బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

హిమాచల్ లో రెండు సార్లు కంపించిన భూమి

హిమాచల్ ప్రదేశ్ పై ప్రకృతి పగబట్టినట్టుగా ఉంది. ఆ రాష్ట్రంలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ పెద్ద సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. భారీ వర్షాలు, వరదలూ, క్లౌడ్ బరస్ట్ లతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైపోతోంది. ఇటీవలి కాలంలో భారీ వర్షాలు, వరదలు, క్లౌడ్ బరస్ట్ ఘటనల కారణంగా దాదాపు 300 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. ఇప్పుడు తాజాగా హిమాచల్ ప్రదేశ్ ను భూకంపం కుదిపేసింది. బుధవారం (ఆగస్టు 20) ఉదయం హిమాచల్ ప్రదేశ్ లో గంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. మొదటి సారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదు కాగా, రెండోసారి సంభవించిన భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. ఈ వరుస భూకంపాలతో జనం భయాందోళనలకు గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఈ భూకంపాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.  

భద్రాచలం వద్ద వరద గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వానలతో గోదవరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద  గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతోభద్రాచలం వద్ద గోదావరి రౌద్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీరు కలిసి గోదవరిలో ప్రవాహ ఉధృతి భారీగా పెరిగింది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద స్నానఘట్టాలు నీట మునిగాయి.  పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం నీట మునిగాయి. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు   26 గేట్లు ఎత్తి  నీటిని దిగువకువిడుదల చేస్తున్నారు. 

సీఎం అయినా, పీఎం అయినా ఒకటే.. జైలు కెడితే పదవి ఊస్ట్.. లోక్ సభలో బిల్లు

తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు ఎవరైనా సరే  తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే..  వారు ఆటోమేటిగ్గా పదవి కోల్పోతారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును తీసుకువస్తోంది. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా  లోక్‌సభలో బుధవారం (ఆగస్టు 20) ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం చట్టాల మేరకు ప్రజా ప్రతినిథి ఎవరైనా కోర్టులో దోషిగా నిరూపితమైతేనే పదవి కోల్పోతారు. అయితే ఇప్పడు కేంద్ర తీసుకువస్తున్న బిల్లు చట్ట రూపం దాల్చితే..  కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో అరెస్ట్ అయి, వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే.. 31వ రోజున ఆ ప్రజాప్రతినిథి పదవి ఆటోమేటిగ్గా రద్దౌతుంది.   హత్య, భారీ అవినీతి వంటి   నేరాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239ఏఏ లకు సవరణలు చేయనున్నారు. గత ఏడాది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి   అరవింద్ కేజ్రీవాల్, దాదాపు ఆరు నెలల పాటు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం చెబుతోంది.  ఈ బిల్లుతో పాటు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు, జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ  బిల్లును కూడా అమిత్ షా బుధవారం (ఆగస్టు 20) లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై గురువారం (ఆగస్టు 20) ఉదయం దాడి జరిగింది. ఒక ఫిర్యాదుదారుడిగా జన్ సున్వాయ్ కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి ఏకంగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని అహ్మద్ పాషాగా గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపైనే ఓ వ్యక్తి దాడికి  పాల్పడటం సంచలనం  సృష్టించింది. అయితే దాడికి కారణం, నిందితుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  కాగా తనపై జరిగిన దాడి యత్నాన్ని సీఎం రేఖా గుప్తా పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇటువంటి దాడులకు తాను బెదిరేది లేదని స్పష్టం చేశారు. 

నెల్లూరు లేడీ డాన్ అరుణ అరెస్టు

 నెల్లూరు లేడీ లేడి డాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయించడంలో చక్రం తిప్పిన అరుణ హైదరాబాద్ వెళ్తుండగా మేదరమెట్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్టు చేస్తారన్న భయంతో లేడీడాన్ అరుణ నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్ కు పరారీ కావడానికి ప్రయత్నించారు. అయితే ఆమె కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ప్రకాశం జిల్లా మేదరమెట్ట వద్ద కోవూరు పోలీసులు ఆమెను అదుపులోనికి తీసున్నారు.  ఈ సందర్భంగా అరుణ తన కారులో గంజాయి పెట్టి  తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉందంంటూ కారులో పడుకుని సెల్ఫీలు తీసుకుని మీడియా, సోషల్ మీడియాకు విడుదల చేశారు. మీడియాయే తనను కాపాడాలంటూ వేడుకుంటే ఆమె ఆ వీడియోలు విడుదల చేశారు.  ఇలా ఉండగా  కోవూరులో ఆమెపై ఇప్పటికే ఓ కేసు నమోదై ఉంది. కోవూరులో ఓ ఇల్లు ధ్వంసం కేసులో ఆమె నిందితురాలు. అయితే ఇప్పుడు ఆమెను ఏ కేసులో అరెస్టు చేశారన్నది తెలియాల్సి ఉంది.  

22న తెలంగాణ బంద్.. ఎందుకంటే?

తెలంగాణలో మరో వివాదం రాజుకుంది. మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మార్వాడీల దాష్టీకాలు, దౌర్జన్యాలకు నిరసనగా అంటూ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్యకార్యచరణ సమితి (జేఏసీ) ఈ నెల 22న అంటే శుక్రవారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియాతో మాట్లాడిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన మార్వాడీలు తెలంగాణ కులవృత్తులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రజలను  దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మార్వాడీ గోబ్యాక్ అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు. ఇలా ఉండగా మార్వాడీలకు వ్యతిరేకంగా రాజుకుంటున్న ఆగ్రహం, ఆందోళనపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వినా మరెవరూ, ఏ పార్టీ ఇంత వరకూ స్పందించలేదు. బండి సంజయ్ మార్వాడీలకు మద్దతుగా నిలిచారు. అలాగే ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  కూడా మార్వాడీలపై ఆరోపణలను ఖండించారు. మార్వాడీ గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్రగా ఆయన అభివర్ణించారు. గుజరాతీ, మార్వాడీ, రాజస్థానీ లు వందల ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారన్న రాజాసింగ్.. మార్వాడీ వ్యతిరేక ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.30 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. బుధవారం (ఆగస్టు 20) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 30 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలాగే ఎస్ఎస్ డి టోకెన్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక మంగళవారం స్వామి వారిని మొత్తం 76 వేల 33 మంది దర్శించుకున్నారు. వారిలో  26,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదా యం 5 కోట్ల 30 లక్షల రూపాయలు వచ్చింది.   

తండ్రికి తగ్గ తనయుడు నుంచి తండ్రి స్థాయిని అందుకున్న నాయకుడు.. లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి  నారా లోకేష్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజకీయంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తుంటే.. జనసామాన్యం ఆనందాశ్చర్యలకు గురౌతున్నారు.  పార్టీ సీనియర్ నాయకులు,  మంత్రులు,  ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులూ లోకేష్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే లోకేష్ మాట తీరు, ప్రజలలో మమేకమౌతున్న విధానంతో ప్రజానేతగా దాదాపు అందరూ అంగీక రిస్తున్నారు. ఇటు పార్టీలో, ప్రజలలో అభిమానం పెంచుకోవడమే కాదు, అటు హస్తినలో కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న పర్యటనలతో జాతీయ స్థాయిలో లోకేష్ గుర్తింపు పొందుతున్నారు. సమర్థ నాయకుడిగా అందరి ఆమెదం, అంగీకారం పొందారు.   అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు?  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా,  నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడు పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదు ను పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికే ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై  ఎటాక్ ప్రారంభించాయి. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీ యాలకు దూరం చేయాలని ప్రయత్నించాయి.  ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించాయి.   అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎదిగారు. ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తితో  ముందుకు సాగారు. పట్టుదలతో  తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజా నేతగా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడే కాదు.. తండ్రిని మించిన తనయుడు అన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పార్టీనేతలు, శ్రేణులలోనే కాదు జనంలో కలిగించారు.   తాజాగా లోకేష్ తన హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో, ఎన్డీయే మిత్రపక్షాల నేతలతో వరుస భేటీలూ, రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం వారితో చర్చించిన తీరు తరువాత భవిష్యత్ లో ఎన్డీయేలో నారా లోకేష్ మరింత కీలకంగా మారుతారనడంలో సందేహం లేదన్న భావన సర్వత్రా కలుగుతోంది. విశ్లేషకులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తరహాలో ఆయన అభివృద్ధి, సంక్షేమం, సాంకేతికత అందిపుచ్చుకోవడంలో జాతీయ స్థాయిలోనే ముందు వరుసలో నిలుస్తున్నారు.   మిత్రపక్షాల నాయకులను సమన్వయం చేయడంతో పాటు టిడిపి ప్రాధాన్యాలను మరింత పెంచే దిశగా లోకేష్ ముందుకు సాగుతున్నారు.  ఇక ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు, జనసేన ఎంపీలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. అంతే కాదు జాతీయ స్థాయిలో  ఎన్డీఏ మిత్రపక్షాల కీలక నేతలతో భేటీలలో రాష్ట్రం గొంతు బలంగా వినిపించారు.   గతంలో తనపై విమర్శలు చేసి ఎగతాళి చేసిన వారే శభాష్ లోకేష్ అనిపించుకునేలా ఎదిగారు. లోకేష్ తాజా హస్తిన పర్యటన ఆయన పరిణితికి, సమర్థతకు, రాష్ట్రప్రయోజనాల పట్ల ఆయనకు ఉన్నశ్రద్ధకు అద్ధం పట్టింది. 

సింగరేణికి బంగారు గనుల అన్వేషణ లైసెన్స్

  సింగరేణి సంస్థకి బంగారు అవకాశం లభించిందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ దక్కినట్లు సీఎండీ తెలిపారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించిందని బలరామ్ వెల్లడించారు.ఆన్‌లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్-1 బిడ్డర్‌గా నిలిచిందని పేర్కొన్నారు.  సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గనుల్లో అన్వేషణ పూర్తి చేస్తామని తెలిపారు. దేవదుర్గ్‌లోని బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధన చేయనుంది. వివిధ రకాల అన్వేషణల అనంతరం తుది ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించవలసి ఉంటుంది.  ఆ గనులను సింగరేణి లేదా ఇతర సంస్థలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది.ఈ గనులను మైనింగ్ కోసం దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75 శాతాన్ని ఆ గని జీవితకాలం పాటు సింగరేణికి చెల్లించవలసి ఉంటుంది. బంగారం, రాగి గనుల అన్వేషణ కోసం రూ. 90 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు ఉండగా, రూ. 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది.  

ముంబైలో భారీ వర్ష బీభత్సం..నిలిచిపోయిన మోనో రైలు

  ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలివేటెడ్ ట్రాక్‌పై నడిచే మోనో రైలు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా మైసూర్ కాలనీ భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ట్రైన్ దాదాపు గంటకుపైగా ఆగిపోయింది. ఆ సమయంలో 100 మంది ప్రయాణికులు అందులోోో చిక్కున్నట్లు సమాచారం. ఈఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమైన సహాయక చర్యలు చేపట్టారు. వరుసగా నాలుగో రోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నగరంలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అనేక ప్రదేశాలలో రైల్వే ట్రాక్‌లు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు విమాన ప్రయాణాలపైనా తీవ్ర ప్రభావం పడింది. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరే 304 విమానాలు ఆలస్యంగా నడిచాయి. పది విమానాలు రద్దు కాగా, 198 విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంబై, థానే, రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.