సి.ఎం. ఎక్కడా?

  ఉత్తరాఖండ్ లో తెలుగు యాత్రికుల అవస్థలు వర్ణనాతీతం. అలాగే మిగిలన రాష్ట్రాల వారి అవస్థలు చెప్పనలవి కాదు. కాని ఆయా రాష్ట్రాల వారిని వారి వారి ముఖ్యమంత్రులు దగ్గరుండి పర్యవేక్షించారు. కాని మన ముఖ్యమంత్రి గారు అటు మోడల్ స్కూల్స్ ఓపెనింగ్ లలోను,వైన్ షాపులను బార్లగా మార్చే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నారు. పర్యాటక మంత్రి చిరంజీవికి ఆపదవి ఎదుకున్నదో కూడా ఆయనకు తెలియనంతగా బాపట్ల బీచ్ లో,ఏరువాక ప్రారంభోత్సవంలో చాలా హడావిడిగా ఉన్నారు. పది రోజులుగా చార్ధామ్ వరదల్లో చిక్కుకున్న వారిని గురించి రాష్ట్ర ప్రరభుత్వం కార్యాచరణ ఏమిటి అని ఇప్పటివరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని నేత కిరణ్ కుమార్ రెడ్డి,ఆయన ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కేవలం తనకు నచ్చిన పధకాలను అమలు చేసుకోవడానికే ఉన్నట్లు ఉంది. మాటకు ముందు డిల్లి పయనమయ్యె ముఖ్యమంత్రి,పదిరోజులుగా వరదల్లో చిక్కుకున్న వారిని పరామర్శించ టానికి ప్రయత్నించలేదు. మరోపక్క నుండి తెలంగాణ మీద ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూప్రజలను అసహనానికి గురిచేస్తున్నారు. పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసైన వీరు నేర్చుకోరా?ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎలాంటి భావోద్వేగాలలో ఉన్నారో వారికి పట్టదా?ప్రజలు వీరి నుండి ఎలాంటి భరోసాను కోరుకుంటున్నారో వారికీ తెలియదా?   10 కోట్లమంది ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ముఖ్యమంత్రి నడుచుకునే తీరు ఇదేనా?రేపు ఎమొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారు. అంటే ఇప్పుడు ఎలా ప్రవర్తించినా రేపు వారి ప్రజాకర్షక పధకాలు వారికున్నాయి అనే వారి మొండి ధైర్యమా?కనీసం ఇప్పటి వరకు ఎంతమంది రాష్ట్రం నుండి యాత్రకు వెళ్ళారనే లెక్కలు కూడా ప్రభుత్వం దగ్గర లేవు. వీధికొకటిగా పుట్టుకొస్తున్న ట్రావెల్ ఏజెన్సీల మీద చేపట్టే చర్యలు గానీ,వారినుండి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు గానీ పర్యాటకశాఖ మంత్రి చెయ్యరు,రవాణా శాఖామంత్రి అసలేచేయ్యరు.

మోడికి శివసేన ఝలక్‌..

    కేదార్‌నాథ్‌ లో సంభవించిన విలయం దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు కారణమవుతున్నాయి.. ముఖ్యంగా ఈ విషయంలో బాధితుల రక్షించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు మరింతగా వివాదాస్పదం అవుతుంది.. తాజాగా గుజరాత్‌ సియం నరేంద్రమోడి తీరుపై శివసేన తీవ్రంగా స్పందించింది.   విలయం సంభవించిన వెంటనే స్పందించిన మోడి తన రాష్ట్ర ప్రజలను రక్షించుకోవటాన్ని అందరూ ప్రశంసించిన కేవలం తన రాష్ట్ర ప్రజలను మాత్రమే కాపాడుకోవడం వివాదాస్పద మవుతుంది.. వరదల్లో చిక్కుకున్న తన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి రెండు బోయింగ్‌ విమానాలతో పాటు, 30 బస్సులను ఏర్పాటు చేసి గంటల వ్యవదిలోన తన ప్రజలను కాపాడుకున్నాడు. కాని ఈ తీరే ఇప్పుడు వివాదాలకు కారణం అవుతుంది.   మోడిని దేశ నాయకుడిగా అందరూ భావిస్తున్న సమయంలో ఇలా కేవలం తన రాష్ట్ర ప్రజలను మాత్రమే కాపాడుకోవడాన్ని శివసేన తప్పుపట్టింది..ఈ విషయం మీదే మోడినీ తీవ్రస్థాయిలో విమర్శించింది.. పార్టీ అధికారికంగా ప్రచురించే పత్రిక సామ్నాలో మోడి తీరుపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించింది.   గతంలో మోడిని ఎన్నికల సారథిగా నియమించినప్పుడు పూర్తి స్ధాయిలో మద్దతు ప్రకటించిన శివసేన ఇప్పుడు మోడి తీరును తీవ్రంగా వ్యతిరేఖించింది

కెకె జన్మరహస్యం

  ఏది మాట్లాడినా అందులో కాస్త వెటకారం యాడ్‌ చేసి తనమార్క్‌ డైలాగ్‌తో సెన్సెషన్‌ క్రిమేట్‌ చేసే లీడర్‌ కె కేశవరావు.. ఇన్నాళ్లు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కెకె ఇటీవల పార్టీ మీద అలిగి గులాభి కండువ కప్పుకున్న ఈ నాయకుడు ఇప్పుడు తన మాటలను మరింత పదునెక్కించాడు.   ఇటీవలే తెలంగాణ రాష్ట్రసమితి సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన కెకె తాను తెలంగాణ వ్యక్తిని కాదంటూ వచ్చిన విమర్శలపై తీవ్రంగా స్పందించాడు.. తన మార్క్‌ వ్యంగ్యాస్తాలను సందించారు.   అవును నేను తెలంగాణ వ్యక్తిని కాదు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇంట్లో పుట్టాను నేను అంటూ చురకలంటిచారు..

సత్తిబాబుకు డియస్‌ ఎర్త్‌

  2014 ఎలక్షన్‌ల టార్గెట్‌గా అధిష్టానంలో రాష్ట్రకాంగ్రెస్‌లో భారీ మార్పులు చేయనుందన్న టాక్‌ వినిపిస్తుంది.. అయితే ఇందులో భాగంగా ముందు పిసిసి చీఫ్‌ బోత్సా సత్యనారాయణపై వేటు వేయడానికి రెడీ అవుతున్నారట కాంగ్రెస్‌ పెద్దలు.   ఇప్పటికే ఇందుకు సంబందించిన సంకేతాలు కూడా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు అందాయన్న టాక్‌ వినిపిస్తుంది.. ఈ ఎన్నికల్లో తెలంగాణా అంశమే ప్రదాన అంశం అవ్వనుంది కాబట్టి తెలంగాణ ప్రాంత వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారు.. అందుకు తగ్గట్టుగానే గత కొద్ది రోజులుగా మాజీ పిసిసి డియస్‌ ఢిల్లీలో మకాం వేసి అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.   అధిష్టానం కూడా తెలంగాణ ప్రాంతంలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని భర్తి చేయడానికి తెలంగాణ ప్రాంత వ్యక్తి ఉన్నత పదవులు కట్టాబెట్టాలని చూస్తుంది.   గత కొద్ది రోజులుగా సియం మార్పు పై కూడా ప్రచారం జరుగుతున్న , అధిష్టానం అందుకు సుముఖంగా లేదని వాదన వినిపిస్తుంది. ప్రస్థుతం పిసిసితో పాటు మంత్రి పదవిలో కొనసాగుతున్న బోత్సాపైనే వేటుపడే అవకాశం కనిపిస్తుంది.. దీనికి తోడు ఇటీవల పలు వివాదాస్పద వ్యాక్యలతో పార్టీని ఇబ్బందుల్లో పడేసిన బోత్సా పై వేటు వేయడమే సరైన నిర్ణయంగా భావిస్తుందట అధిష్టానం..

రాజమండ్రిలో గ్లామర్‌ వార్‌

  ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి సీటుకు, ఈ సారి ఎలక్షన్స్‌లో రసవత్తర పోరు జరగనుంది.. పోయిన సారి కూడా ఉండవల్లిపై కృష్ణంరాజు, మురళీమోహన్‌లు పోటి చేయగా అది ఉండవల్లికే ప్లస్‌ అయింది.. ఇద్దరు సినిమా స్టార్‌లు సినిమా ఓట్లను పంచుకోగా మిగతా ఓట్లతో ఉండవల్లి ఈజీగా గట్టెక్కారు.   అయితే ఈ సారి కూడా సీటుకు ఇలాంటి పోరే జరగనుంది.. ముఖ్యంగా తమపై ఆరోపణలు చేస్తున్న ఉండవల్లి సీటు కావడంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎలాగైన అక్కడ పాగా వేయాలని చూస్తుందట.. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ సారి ఉండవల్లికి బదులుగా ఈ స్థానంలో ఇటీవలే రాష్ట్రరాజకీయాల్లోకి ప్రవేశించిన జయప్రదని పోటికి నిలపాలని చూస్తుంది.   దీంతో జయప్రద గ్లామర్‌ను ఎదుర్కోటానికి వైసిపి నాయకులు ఈ స్థానం నుంచి ప్రముఖ హాస్యనటుడు ఆలీని రంగంలోకి దించాలని భావిస్తుంది.. స్థానికంగా మంచి పేరుతో పాటు ఇప్పటికే పలు సేవకార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆలీ బరిలో ఉంటే గెలుపు చాలా ఈజీ అవుతుందని ఆశిస్తుంది వైసిపి.   అయితే మరో వైపు తెలుగుదేశం తరుపున పార్టీ తరుపున మురళీమోహన్‌ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.. పోయిన సారి ఇద్దరు సినిమా స్టార్‌లు పోటిపడతంతో అది మరొకరికి ప్లస్‌ అయింది.. మరి ఈ సారి అందరూ సినిమా స్టార్‌లే తలపడితే ఎవరు గెలుస్తారో చూడాలి..

చర్చలు, దోశలు తరువాత ఇప్పుడు ప్యాకేజి కధ

  తెరాస మరియు టీ-కాంగ్రెస్ నేతల రియాక్షన్ తెలుసుకోవడాని కోసమన్నట్లు ‘తెలంగాణా ప్యాకేజి’ మ్యాటర్ ని కాంగ్రెస్ పార్టీ మీడియాకి లీకేజ్ చేయగానే, ఊహించినట్లే ఇక్కడ నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దానితో మళ్ళీ కొందరు కాంగ్రెస్ నేతలు ‘అవ్వన్నీ గాలి వార్త’లంటూ ఖండనలు పడేసారు. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఎక్కడ ఇచ్చేస్తుందో అని హడలి చచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ ప్యాకేజీ కబురు చెప్పగానే ‘అమ్మ కడుపు సల్ల గుండ!’ ‘నా ఉద్యమం సల్ల గుండ!’ అని వీపు రాసుకొని, ప్రకటన వెలువడగానే చేయవలసిన ముఖ్యమయిన పనులు అంటే ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తా రోకోలు, బందులు వంటి కార్యక్రమాలకి షెడ్యుల్ నిర్ణయించేందుకు కేసీఆర్ తన వాళ్ళతో ఓ మీటింగేసుకొన్నాడు. పనిలో పనిగా ‘కాంగ్రెస్ కి బొందపెట్టుడు, భూమిలోపాతిపెట్టుడు’ వంటి పిల్లి శాపాలకు, ప్రాస బాగా కుదిరిందని ‘ప్యాకేజ్ అంటే ప్యాక్ చేసుడే’ అనే పంచ్ డైలాగు కూడా కొత్తగా యాడ్ చేసుకొన్నారు.   అటు కాంగ్రెస్ ప్యాకేజి ప్రకటించగానే, ఇటు తను పార్టీ టికెట్స్ పంచడం మొదలుపెడితే మరికొన్ని కాంగ్రెస్ చేపలను ఈ సారి వలలో వేసేయోచ్చునని ఆయన ఆశ. తద్వారా హోం సిక్కుతో బెంగ పెట్టుకొన్న కేశవ్ రావు, వినోద్, మందా వారికి పార్టీలో కొంచెం కంపెనీ దొరికితే హోమ్లీగా ఉంటుందని కేసీఆర్ ఆలోచన.   అయితే, కాంగ్రెస్ పార్టీ ఆలోచన వేరేలా ఉంది. ప్రస్తుతం టీ-కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరిపోయినప్పటికీ, ఏదో ఒకరోజున కేసీఆర్ నోటికి బలయినప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికే తిరిగి వస్తారనే ధీమా ఉంది. లేకుంటే, ఎన్నికల వరకు ఈ ప్యాకేజి గేం షో ఇలాగే కంటిన్యూ చేసుకొంటూ పోయి, సరిగ్గా ఎన్నికల గంట కొట్టగానే, తెలంగాణా మీద ఏదో ఒక సానుకూల ప్రకటన చేసేసి ‘సహేంద్ర తక్షకాయిస్వాహా’ అన్నట్లుగా కేసీఆర్తో సహా మొత్తం అందరినీ కాంగ్రెస్ మహా సముద్రంలో కలిపేసుకొంటే బెటరేమోనని కాంగ్రెస్ దురాలోచన. ఏమయినప్పటికీ, ఎన్నికల గంట మ్రోగేవరకు ఈ డ్రామాలు అందరూ కంటిన్యూ చేసికోవడం మాత్రం ఖాయం.

కేధార్ నాథ్ స్టేట్ బ్యాంకులో రూ.4.25కోట్లు గంగ పాలు

  ఒకవైపు ఉత్తరాఖండ్ ను హటాత్తుగా ముంచెత్తిన వర్షాలతో వేలాది మంది మృత్యువుతో పోరాడుతుంటే, వారిని రక్షించేందుకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ, అనేక వేల మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్దులు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడపడితే అక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నశవాలను చూస్తే మనిషన్న వాడికి గుండె కరిగి కన్నీరవక మానదు. కానీ, మానవులలో దానవులు ఎప్పుడూ పొంచి ఉండనే ఉంటారు. చనిపోయిన వారి ఒంటి మీద ఉండే బంగారు, వెండి వస్తువులను ఒలుచుకొనే ప్రయత్నంలో కొందరు దుండగులు, కత్తులు గొడ్డళ్ళతో శరీర భాగాలను నరికి మరీ ఆభరణాలు వలుచుకు పోతునట్లు సమాచారం.   ఇక, కేదార్ నాథ్ మందిరానికి దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏకంగా రూ.5కోట్లు మాయమయ్యాయి. వరదలు రాక మునుపు ఉన్న డబ్బు, తగ్గిన తరువాత కనబడలేదు. కేదార్ నాథ్ మందిరం కమిటీ సభ్యుడు రాజ్ కుమార్ చెప్పిన దాని ప్రకారం, వరదలు ముంచుకు రాగానే, బ్యాంక్ సిబ్బందితో సహా అందరూ ప్రాణాలు రక్షించుకొనేందుకు పక్కనే ఉన్న గుడిలోకి పరుగులు తీసారు. అప్పటికి, బ్యాంక్ లో రూ.5కోట్ల నగదు ఉన్నట్లు ఖచ్చితమయిన లెక్కలున్నాయి. అయితే వరదల దాటికి బ్యాంకులోకి కూడా నీరు ప్రవేశించడంతో లోనున్నకంపూటర్లు, బల్లలు వంటి వాటితో సహా నగదు మొత్తం కొట్టుకుపోయింది.   అయితే ఆ సమీపంలో ఉన్న కొందరికి డబ్బు కట్టలు దొరికినట్లు ఆయన చెప్పారు. వరద ఉద్రుతి తగ్గిన తరువాత ఒక యువకుడు ఆర్మీ హెలికాఫ్టర్ లో ఎక్కబోతుండగా, అనుమానం వచ్చిన అధికారులు అతని బ్యాగులు తెరిచి చూస్తే అందులో రూ.83లక్షల నగదు దొరికింది. అయితే ఆ వ్యక్తి ఆ నగదు గురించి అడిగినప్పుడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతనిని అధికారులు పోలీసులకి అప్పగించారు. ఉత్తరాఖండ్ డీజీపీ సత్యవ్రత్ బన్సాల్, మీడియాతో మాట్లాడుతూ ఆ డబ్బు బ్యాంకు నుండి మాయమయినదేనని దృవీకరించారు.   బ్యాంకు అధికారులు మిగిలిన నోట్ల సంఖ్యలు కూడా మీడియాకు విడుదల చేసి, ఎవరికయినా ఆ డబ్బు దొరికినట్లయితే బ్యాంకుకు అందజేయాలని కోరారు. అయితే, మిగిలిన నాలుగు కోట్ల పాతిక లక్షలు గంగ పాలు అయిందో లేక ఎవరికయినా దక్కిందో తెలియదు కానీ, ఈ వార్త మాత్రం కేధార్ నాథ్ లో ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.   కేధార్ నాథ్ మందిరం రోజూవారి ఆదాయం రూ.1లక్ష రూపాయలను ఏరోజుకారోజు సాయంత్రం బ్యాంకులో జమా చేస్తుంటారు. బ్యాంకులో కేవలం రూ.2.5కోట్లు మాత్రమే నిలువ చేసే అవకాశం ఉండగా, ఆ రోజు మాత్రం మెయిన్ బ్రాంచీకి డబ్బు తరలించ లేకపోవడంతో బ్యాంకులో ఉన్న రూ.5కోట్లు నగదు గంగ పాలయింది. ఇప్పడు ఆ డబ్బులో కేవలం రూ. 83లక్షల మాత్రమె దొరికింది. మిగిలినది దొరుకుతుందనే నమ్మకం కూడా లేదు.

చిదంబరం, షిండేల పై 420 కేసు

      కేంద్ర మంత్రులు చిదంబరం, సుశీల్ కుమార్ షిండేల 420 కేసు నమోదైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పై కేంద్ర హోం మంత్రులుగా వున్న వారు ఇచ్చిన మాటను మార్చారని, హామీలను విస్మరించారని రంగారెడ్డి జిల్లా కోర్టులో తెలంగాణ వాదులు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో వారిపై 420 కేసు నమోదు చేశారు. 2009 డిసెంబర్ 9వ తారీఖు కేందమంత్రి చిదంబరం తెలంగాణపై చేసిన ప్రకటనను, అదే నెల 23న వెనక్కి తీసుకున్నారు. గత ఏడాది డిసెంబరు 28న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం చెబుతామని ప్రకటించారు. ఆ తర్వాత ఇంత వరకు తెలంగాణ మీద ఎటూ తేల్చలేదని తెలంగాణ వాదులు పిటీషన్ లో పేర్కొన్నారు.

పరమాత్ముడు తీర్చలేని బాధ

అందమైన హిమాలయాలు అందాలన్నీ చీరగా చుట్టుకుని కనువిందుగా మురిపించాయ్, రా రమ్మని ఆహ్వానించాయ్...   ఆ పరమాత్ముడు ముక్తినిస్తాడంటూ... నమ్మబలికాయ్ ఆశతో ఒడి చేరి ఆనందంలో మునిగి తేలుతున్నవారందరిని దయదాక్షిణ్యాలు లేకుండా ముంచేసాయ్... శవాలుగా మార్చేసాయ్ ఒకటా రెండా ఇన్ని వేల ప్రాణాలు పట్టుకుపోయి ఏ స్వామి గుమ్మానికి తోరణాలల్లుతున్నాయో... కళ్ళ ముందే అయినవారి ప్రాణాలు నీటిలో కలిసిపోతుంటే ఏమి చేయలేని వారిగుండె కోత.... ఒకరి కన్నకొడుకు, ఒకరి కన్నతల్లి, మరొకరి భార్య, ఇంకొకరి భర్త ఇలా బంధాలని, అనుబంధాలని తెంచుకుని నీటిలో కలిసి పోయాయ్... కన్నీరుని మిగిల్చిపోయాయ్... ఏ "నాథుడు" ఆ అవిసిన గుండెల భాదని తీర్చలేదు... తీర్చలేడు. ....రమ  

కమల రథసారధి దూకుడు

        ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక నరేంద్రమోడి స్పీడు పెంచారు.. ముందు తన ఎన్నిక కాస్త అసంతృప్తి చెలరేగిన బిజేపి పెద్దల సపోర్ట్‌తో పాటు తన రాజకీయ చతురతతో అన్ని అవాంతరాలను అధిగమించారు. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారం కోసం ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తన ప్రచార వ్యూహానికి తొలి వేదికగా ఎన్డీఏ అకాలీదళ్ అధికారంలో ఉన్న పంజాబ్‌ను ఎంచుకున్నారు.. పథాన్ కోట్ జిల్లాలోని మధోపూర్ బీజేపీ అధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో యూపీఏ సర్కార్ పై మోడీ నిప్పులు చెరిగారు. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడానికి ప్రతి అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటున్న మోడి ఉత్తరాఖండ్‌ వరదలను కూడా వదలలేదు.. ఈ సమయంలో దేశ ప్రజలంతా బాధితులకు అండగా నిలవాలని మోడీ పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ లో దేవాలయాల పునర్మిణానికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

జైల్లో పెట్టినా జగన్ మారలేదే!

  “పార్టీలో నీ అంతటి మొనగాడు మరోడు లేడు. నువ్వెంతంటే సోనియామ్మకి అంతే! ఆమె నీ మాట కాదనదని” అసమ్మతి నేతలందరూ కలిసి పార్టీలో కొత్తగా చేరిన చిన్నజీవిని ఎగదోస్తే వారి మాటలు నిజమేననుకొని, మెగాజీవి హడావుడిగా విమానం పుచ్చుకొని డిల్లీలో వాలిపోయి ‘కిరణ్ కుమార్ రెడ్డి ఈజే వెరీ బ్యాడ్ బాయ్’ అని సోనియమ్మకు క్లాసు పీకబోయాడు. అయితే, ఆమె వెంటనే ‘కిరణ్ ఈజే గుడ్ బాయ్’ అని ఆయన ఇదివరకు ఇచ్చిన సర్టిఫికేట్ ను సొరుగులోంచి తీసి చూపించి ‘మరి దీని సంగతేమిటి?’ అంటూ ఎదురు ప్రశ్నించడమే కాక, ‘ఏడాది తిరక్కుండానే అప్పుడే పార్టీ నీరు ఇంతగా వంట బట్టించుకోవడం ఆరోగ్యానికి హానికరం’ అని గట్టిగా హెచ్చరించడంతో, మళ్ళీ అదే విమానంలో హైదరాబాద్ వచ్చిపడ్డాక మళ్ళీ నిన్నటివరకు ఆయన పబ్లిక్కి దర్శనం ఈయలేదు.   అయితే రాజకీయ నాయకుడన్నాక ఇటువంటి తిట్లని, విమర్శలని ఖద్దరు చొక్కా క్రింద మడతేసి మరిచిపోవాలని గ్రహించిన కేంద్రమంత్రి గారు, మళ్ళీ మరో కొత్త ఖద్దరు చొక్కా ఒంటికి ఎక్కించుకొని, నిన్న గుంటూరులో ఏరువాక కార్యక్రమానికి వచ్చి తన ఉపన్యాసంతో జనాలని కుమ్మేశారు.   పనిలో పనిగా, ఎవరేమన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బోనులో ఉన్నపులిలా పడున్న జగన్ మోహన్ రెడ్డి మీద నాలుగు రాళ్ళు వేసి తన కసి తీర్చుకొన్నాడు. ‘జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినా కూడా అతని పద్దతుల్లో మార్పు కనిపించడం లేదని, అతనికి సత్ప్రవర్తన అబ్బట్లేదని’ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, ‘పులి ఎక్కడ ఉన్నా పులే!’ అని చెల్లెమ్మ షర్మిల చెవిన ఇల్లు కట్టుకొని పోరుతున్నపటికీ ఆయనకి ఎందుకు అర్ధం కావట్లేదో అని జనాలు ఆశ్చర్యపోయారు.   ఇక, ఒంటి చేత్తో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ, ఆ సంగతిని పార్టీలో తన రామచంద్రుడు తప్ప మరెవరూ ప్రస్తావించలేదు. ప్రస్తావించడం సంగతి దేవుడెరుగు, కనీసం గుర్తించను కూడా లేదు. దానితో మనసు నొచ్చుకొన్నమంత్రిగారు కృతజ్ఞతలేని ఈ కాంగ్రెస్ నేతలకి ఓ మంచి మాటనడానికి కూడా నాలిక రాదని ఆవేదన చెందారు. అటువంటి వారిని నమ్ముకోవడం కంటే, స్వయంగా ఆ పనేదో మనమే చాటింపు వేసుకొంటే తప్ప జనాలు కూడా బొత్తిగా పట్టించుకొనే పరిస్థితి లేదని భావించి, ఏరువాకలో కర్ణాటక ఎన్నికల గురించి మాట్లాడారు.   అయితే పంటలకి కర్ణాటక ఎన్నికలకీ ఎటువంటి లింకూ లేదని గ్రహించిన తరువాత, మొన్న డిల్లీ వెళ్లి ముఖ్యమంత్రిని తిట్టిన సంగతి కూడా మరిచిపోయి, ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల, వ్యవసాయానికి తగిన సాయం అందుతుందని, అప్పుడు వ్యవసాయం కూడా లాభసాటిగా మారుతుందని,ఆయన గ్యారంటీ ఇచ్చారు.   ఈ మాటలన్నీ ఎందుకు? అదేదో సినిమాలో మీరు పాటందుకోగానే టపటపా వానపడిపోయినట్లు, మళ్ళీ ఇప్పుడు కూడా ఏదయినా పాటందుకొని నాలుగు వానలు కురిపిస్తే మా తిప్పలేవో మేమే పడతాము కదా అని రైతులు గొణుకొన్నారు.అయితే, అదేమి పట్టించుకోని ఆ పెద్దాయన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తాను, కొంచెం శ్రమ పడవలసి ఉన్నపటికీ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించక తప్పదని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ హాట్రిక్ ఖాయం: చిరంజీవి

      2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హాట్రిక్ సాధించడం ఖాయమని చెబుతున్నారు కేంద్రమంత్రి చిరంజీవి. కాంగ్రెస్ సినియర్ నేతలే తమ పార్టీ గెలవడం కష్టమని చెబుతుంటే, చిరంజీవి మాత్రం పట్టనట్టుగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని అంటున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన మీడియా వర్గాల సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ పరువు నిలబడే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నాయి. మెగాస్టార్ మాత్రం 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తుందని చిరంజీవి అంటున్నారు. మరి చిరంజీవి ఏదో మాట వరసకు అన్నారో లేక నిజంగానే ఆయన  దీనిపై విశ్వాసంతో ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇప్పుడు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో చిరు విజయం పై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు తమ పార్టీ విజయానికి దోహదపడుతాయని ఆయన అన్నారు.

జలసర్పానికి 5000 మంది బలి

      చార్‌దామ్‌ యాత్రలో విషాదాల పరంపర కొనసాగుతూనే ఉంది.. వరద తగ్గిన చోట్ల శవాలు గుట్టలుగా తేలుతున్నాయి.. కేదారేశ్వరుడి ఆళయంతో సహా ఆ ప్రాంతం అంతా స్మశానంలా కనిపిస్తుంది.. ఎక్కడ చూసిన మానవ మృతదేహాలు శిథిలాలతో భయకర పరిస్థితులు కొనసాగుతున్నాయి.. వీటికి తోడు ఇంకా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది..   సహాయక చర్యల్లో సైన్యం ఎంతగా శ్రమిస్తున్నా.. ప్రభుత్వ వైఫల్యాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి.. ఇప్పటి వరకు మృతులు వందల్లోనే అంటూ అధికారులు ప్రకటిస్తూనా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఈ సంఖ్య ఐదు వేలకు పైనే అంటున్నారు..   ఇదిలా ఉంటే ఇంకా 12వేల మందిపైగా యాత్రికలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నారు.. వారిని రక్షించటానికి సైన్యం తీవ్రంగా శ్రమిస్తుంది.. కాని అక్కడికి చేరుకోవటానికి సరైనా రవాణ వ్యవస్థ లేకపోవటం, హెలికాప్టర్లో చేరడానికి వాతావరణం సహకరించకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో యాత్రికుల్లో చాలా మంది ఆఖలిదప్పులతో అలమటిస్తున్నారు..  

పవర్‌ కోసమే కెసిఆర్‌ పాట్లు

      ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది కెసీఆర్‌ పై విమర్శల వాడి కూడా భారీగా పెరుగుతుంది.. విపక్షాల నుంచే స్వపక్షం నుంచి కూడా కెసీఆర్‌ పై ఆరోపణలు వస్తున్నాయి.. జెఏసిని తన చెప్పు చేతల్లో పెట్టుకొని ఫామ్‌ హౌజ్‌ నుంచే ఉద్యమాన్ని నడుపుతున్న కెసిఆర్‌ మిగిలిన తెలంగాణ పక్షాలను కలుపుకుపోవడంతో విఫలమవుతుండటంతో ఈ విమర్శలు మరింత పదునెక్కుతున్నాయి..   తాజాగా మరో తెలంగాణ వాది ప్రజాగాయకుడు గద్దర్‌, కెసిఆర్‌పై తీవ్రవిమర్శలు చేశాడు. కేవలం అధికారం కోసమే కెసీఆర్‌ తెలంగాణ పోరాటం చేస్తున్నారని విమర్శించారు.. తెలంగాణ సాధన కోసం కృషి చేయాలని కాకుండా 100 అసెంబ్లీ స్థానాలు, 16 లోక్‌సభ స్థానాలు సాదించాలని కార్యకర్తలకు పిలుపునివ్వడమే దీనికి నిదర్శనం అన్నారు గద్దర్‌..   అంతేకాదు 100 స్థానాలకు పైగా సాదిస్తేనే తెలంగాణ సాధ్యమన్న మాటలతో తెలంగాణ శత్రువులు మరింత బలపడ్డారన్నారు..

వైసిపికి మరో ఎదురుదెబ్బ

      వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వాళ్ల నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి కి బెయిల్‌ రాక, ఎటూ పాలుపోని పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు ఈసీ నిర్ణయం మరో దెబ్బ పడింది.   రాజీనామ చేసి వైసిపి తరుపున గెలిచి జనాల్లో తమ పార్టీకున్న ఇమేజ్‌తో పాటు, అసెంబ్లీలో తమ బలం పెంచుకోవాలనుకున్న నాయకులకు నిరాశే మిగిలింది.. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేనందున ఇప్పట్లో ఇక ఉప ఎన్నికలు నిర్వహించేది లేదంటూ ప్రకటించారు ఈసి సంపత్‌..   గత  అసెంబ్లీ సమావేశాల్లో పెట్టిన అవిశ్వాస తీర్మాణానికి మద్దతుగా కాంగ్రెస్‌ నుంచి తొమ్మిది మంది, టిడిపి నుంచి ఆరుగురు ఎమ్మేల్యేలు పార్టీ విప్‌ను దిక్కరించి ఓటు వేశారు.. దీంతో ఆ పార్టీలు విప్‌ దిక్కరించిన సభ్యులపై వేటు వేయాలని కోరాగ ఇటీవలే వారిని అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు.. దీంతో కాలీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ సదరు సభ్యులు చాలా రోజులుగా కోరుతుండగా ఈసి నిర్ణయంతో వారంతా కంగుతిన్నారు..

తెలంగాణాపై రాజకీయ పార్టీల చదరంగం

  తెలంగాణా ప్రజల భావోద్వేగాలకు సంబందించిన సున్నితమయిన తెలంగాణా అంశం, తెరాసతో సహా అన్ని రాజకీయ పార్టీలకి ఇప్పుడు ఒక రాజకీయ లబ్ది చేకూర్చే ఒక ఆయుధంగా మారిపోయింది.   తెలంగాణా అంశాన్ని ఉపయోగించుకొని, రాబోయే ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుచుకొని తెరాస రాష్ట్రంలో, కేంద్రంలో చక్రం తిప్పాలని కలలు గంటుంటే, కాంగ్రెస్ పార్టీ ఒకసారి చర్చలు, మరొకసారి దోశలు, మరొకసారి ప్యాకేజీలు అంటూ కాలక్షేపం చేస్తూనే, ఎలాగయినా రాబోయే ఎన్నికలలో తెలంగాణాలో మళ్ళీ విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవాలని కోర్ కమిటీ వ్యూహాలు రచిస్తోంది.   ఇక్కడ తెలంగాణా ప్రాంతంలో కొంచెం హడావుడి మొదలవగానే, అక్కడ డిల్లీలో కోర్ కమిటీ సమావేశాలు మొదలయిపోతాయి. కానీ, వాటి వల్ల తెలంగాణాకి మాత్రం ఒరిగేదేమీ ఉండదు. తెలంగాణాకి ప్రత్యేక ప్యాకేజ్ అంటూ కాంగ్రెస్ అధిష్టానం మీడియాకి ఒక గాలి వార్త లీక్ చేసి తెలంగాణావాదుల రియాక్షన్ కోసం ఎదురు చూస్తుంటే, కొన్ని రోజులు రాజీనామా డ్రామాలు, మరి కొన్ని రోజులు పార్లమెంటు మెట్ల మీద ధర్నాలు చేసిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు, మళ్ళీ ఇప్పుడు 30వ తేదీన బహిరంగ సభ అంటూ హడావుడి చేస్తూ తమ ఉనికిని కాపాడు కొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు.   ఇక, తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చామని చెప్పుకొంటున్న తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు ఏనాడు కూడా ప్రత్యేక తెలంగాణా గురించి స్పష్టంగా మాట్లాడింది లేదు. అయినప్పటికీ, తాము కూడా ఈ ‘తెలంగాణా ఆటలో’ వెనుకబడి పోకూడదని ‘బయ్యారం మొదలుకొని చలో అసెంబ్లీ’ వరకు ఏ అవకాశాన్ని ఆ పార్టీ జారవిడుచుకోలేదు. అలాగని ప్రత్యేక తెలంగాణా కావాలని చంద్రబాబు ఏనాడు కోరలేదు కూడా.   ఇక, వైకాపా సంగతి సరే సరి! రాష్ట్రాన్ని ఏలేద్దామని రంగంలోకి దూకిన ఆ పార్టీ తెలంగాణా అంశంపై తమ అభిప్రాయం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అదేవిషయం గురించి తెలంగాణా ప్రజలు నిలదీస్తుంటే, ‘జగనన్న వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడు’ అంటూ అసందర్భ సమాధానాలతో తెలంగాణాలో పార్టీని నిలుపుకోవాలని తిప్పలు పడుతున్నారు.   ఇక, బీజేపీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు విస్పష్టంగా తన మద్దతు ప్రకటించడమే గాకుండా ఉద్యమాలు కూడా చేస్తోంది. అయితే ఆ పోరాటాల ద్వారా తెలంగాణా ప్రజల మనసు గెలుచుకొని, తెలంగాణా ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ ముఖ్యోదేశ్యం. అంటే, బీజేపీకి కూడా తెలంగాణా అంశం రాజకీయ లబ్ది చేకూర్చే అంశంగానే భావిస్తోందన్నమాట.   తెలంగాణా అంశం ఎంత సున్నితమయినదో, అంత బలమయినదని తెరాస కనిపెట్టినప్పటి నుండి, రాజకీయ పార్టీలకు అదొక రాజకీయ ఆయుధంగా మారిపోయింది. ఎవరికి అవసరమయినట్లు దానిని తమ అవసరాలకు అనుగుణంగా వాడుకొంటున్నారు తప్ప దానివల్ల ప్రజల మనోభాలు ఎంతగా గాయపడతాయో ఎవరికీ పట్టడంలేదు. సున్నితమయిన తెలంగాణా అంశం ఈవిధంగా రాజకీయ పార్టీలకు ఆట వస్తువుగా మారిపోవడానికి ప్రధాన కారణం, తెలంగాణా నేతలలో చిత్తశుద్ధి లేకపోవడమే. సంకల్ప బలం లేని నేతలు, అందుకు వేరెవరినో నిందిస్తూ తమకు అన్ని విధాల లబ్ది కుదిర్చేఈ రాజకీయ చదరంగం కొనసాగిస్తూనే ఉంటారు. వారిని సవరించి దారిన పెట్టుకోవలసిన బాధ్యత తెలంగాణా ప్రజలది, మేధావులదే.

కేసీఆర్ కుటుంబ౦ వల్లే ఆత్మహత్యలు

    కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ వాదాన్ని వాడుకోవడం వల్లే తెలంగాణవాదులు ఆత్మహత్యలు చేసుకున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. గతంలో తెలంగాణాపై అసెంబ్లీ తీర్మానం అవసంలేదని చెప్పి, ఇప్పుడు తెలంగాణ కోసం తీర్మానం చేయాలని టిఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతుందని అన్నారు. శాసనసభ లో తెలంగాణ తీర్మానం అంటూ టీఆర్‌ఎస్ ఆడుతున్న డ్రామాను రుజువు చేస్తానన్నారు. కేసీఆర్ పై తన అరోపణలు తప్పని రుజువు చేస్తే దేశం విడిచి వెళ్ళడానికి సిద్దమేనని ఆయన తెలిపారు. దమ్ముంటే తన సవాల్‌ను కేసీఆర్ కుటుంబ సభ్యులు స్వీకరించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సైంధవ పాత్ర టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు కుటుంబానిదేనని గోనె విమర్శించారు.

అలక పాన్పు దిగిన అద్వానీ

  నరేంద్ర మోడీకి పదోన్నతి కల్పించడంతో అలక పాన్పు ఎక్కిన పార్టీ సీనియర్ నేత అద్వానీ, పార్టీలో అందరు తన ముందు సాగిలపడిన తరువాత, బెట్టు చాలించి అలక పానుపు దిగారు. మొన్న ఆర్. యస్.యస్. అధ్యక్షుడు మోహన్ భగవత్ కూడా ఆయనకు వాస్తవ పరిస్థితులకనుగుణంగా నడుచుకోమని సున్నితంగా మందలించడంతో, అద్వానీ ఇంకా మళ్ళీ లైన్లో పడక తప్పలేదు.   అయితే, తన పెద్దరికం చాటుకొంటూ, మొన్న డిల్లీలో జరిగిన ఒక సభలోఆయన మాట్లాడుతూ, మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఇతర పార్టీలతో ఇప్పటి నుండే ఎన్నికల పొత్తులు కుదుర్చుకొని, ఎన్డీయే కూటమిని బలపరుచుకోవలసి ఉందని ఆయన సూచించారు. ఆ సూచన కొత్తగా పార్టీ ప్రచార కమిటీ పగ్గాలు చెప్పటిన నరేంద్రమోడీకి చేసిన సూచనని వేరే చెప్పనవసరం లేదు.   ఎన్డీయే కూటమి నుండి జనతాదళ్ (యు) తప్పుకోవడంతో, కూటమి జాతీయ స్థాయిలో బలహీనపడింది. అంతే కాకుండా నిన్నటి వరకు మిత్రుడిగా కలిసి పనిచేసిన నితీష్ కుమార్ ని, ఆయన జేడీ(యు)పార్టీని బీహార్ రాష్ట్రంలో ఎదుర్కోవలసి ఉంటుంది. నితీష్ కుమార్ గనుక వెళ్లి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే బీజేపీకి మరింత క్లిష్టపరిస్థితులు ఎదుర్కోక తప్పదు. గనుక, ఆ సమస్యలను పరిష్కరించుకోవలసిన బాధ్యత మోడీదేనని అద్వానీ చెప్పకనే చెప్పారు. తద్వారా మోడీకి కార్యాచరణ ప్రణాలికను కూడా ఆయనే సూచించి ఎలా నెగ్గుకు వస్తారో చూద్దామనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చును.