'రాయల తెలంగాణ' వెనుక కాంగ్రెస్ తంత్రం!

      ఆంద్రప్రదేశ్ కాంగ్రేస్ పార్టీకి అత్యంత కీలక రాష్ట్రం అనేది అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమంతో కెసిఆర్, ఇటు వైసీపీ ఆవిర్భావంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి క్లిష్టంగా మారింది. దీంతో తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి 'రాయల తెలంగాణ' ప్రతిపాదనను కాంగ్రెసు అధిష్టానం ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.   రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి, మరోమాటలో చెప్పాలంటే ఆయన బలాన్ని చీల్చడానికి రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించడంలో మజ్లీస్‌ ప్రయోజనాలు కూడా రాజకీయపరమైనవే. ఇటు కాంగ్రెసు ఆ ప్రతిపాదనను ముందుకు తేవడంలో, మజ్లీస్ దానికి పచ్చజెండా ఊపడంలో కూడా రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి తప్ప తెలుగు ప్రజల ప్రయోజనాలు అందులో ఇమిడి లేవనే విషయం తెలుస్తోంది. సీమాంధ్రలో రెడ్డి వర్గం బలహీనపడి సామాజిక సమీకరణలు మారిపోతాయని, ప్రధాన పోటీ కాపు, కమ్మ వర్గాల మధ్యే ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కొత్తగా ఏర్పడే సమీకరణల్లో చిరంజీవి, బొత్స సత్యనారాయణ మొదలైన నేతలు బలోపేతమవుతారని, వీరు ఇతర వర్గాలను సమీకరించడంలో విజయం సాధించగలరని కాంగ్రెస్ విశ్వసిస్తోంది.

తెలంగాణ కు పంచాయతీ బ్రేక్!

      గత కొన్ని రోజులుగా రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తెలంగాణ అంశం చివరి దశకు చేరుకుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అయితే తెలంగాణపై ప్రకటనకు స్థానిక సంస్థల ఎన్నికలు బ్రేక్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. పంచాయతీ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం కాగా, అది తెలంగాణపై నిర్ణయం వెలువడటానికి అవరోధంగా మారుతుందనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించకూడదు. అయితే తెలంగాణపై ప్రకటన చేసేది రాష్ట్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా కాదు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ ప్రకటన చేసే అవకాశముంది. అలాగే స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. కోడ్ నియమావళి కూడా ఈ సంఘమే పర్యవేక్షిస్తుంది. ఎక్కడో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటన చేస్తే... రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేయగలుగుతుంది? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా కాంగ్రెస్ పట్టించుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణపై చేయబోయే ప్రకటనకు పంచాయతీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందా లేదా అనే దానిపై పూర్తి స్పష్టత రావడం లేదు. జరిగేవి పంచాయతీ ఎన్నికలు కానుక కేంద్ర ప్రభుత్వం లేదా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించే నిర్ణయానికి కోడ్ వర్తించదని ఎన్నికల వ్యవహారాల్లో నిపుణుడు ఒకరు తెలిపారు. రాజకీయ పార్టీగా కాంగ్రెస్ తెలంగాణపై తమ వైఖరిని ప్రకటిస్తే అభ్యంతరం ఉండకపోవచ్చని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ పై నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

రాజకీయ పార్టీల పంచాయితీ హడావుడి

  చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా అదే పనిలో ఉన్నాయి. పార్టీలకతీతంగా గ్రామస్థాయిలో జరగనున్నపంచాయితీ ఎన్నికలను, అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం ప్రణాళికలు రచించడం మొదలుపెట్టాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన బంగారు తల్లిని నమ్ముకొని ఒంటరిగా ముందుకు దూసుకుపోతుంటే, తెరాస తెలంగాణావాదాన్ని, వైకాపా వైయస్సార్ సెంటిమెంటులని నమ్ముకొని బరిలోకి దిగుతున్నాయి.   ఇక, ఏ వాదము, సెంటిమెంటు లేని ప్రతిపక్ష పార్టీ తెదేపా మాత్రం తన క్యాడర్లని నమ్ముకొని ఈ ఎన్నికలలో విజయం సాదించాలని భావిస్తోంది. మిగిలిన రెండు పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్, తెదేపాలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి బలమయిన క్యాడర్లు ఉన్నందున, అవి ప్రజలలోకి తేలికగా చొచ్చుకొని వెళ్ళగలుగుతున్నాయి.   అయితే, కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తు పోకడలవల్ల, వివిధ ప్రాంతాలలో స్థానిక కాంగ్రెస్ నేతల అనుచరుల నుండి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. అయినప్పటికీ, తన స్వంత చరిష్మాతోనే పార్టీకి విజయం సాధించిపెట్టి, తన వ్యక్తిగత ఇమేజ్ ను మరింత పెంచుకోవాలని ఆలోచనతో కిరణ్ కుమార్, అందుకు తగినట్లుగానే ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు.   ఇక, తెదేపా కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం తన సర్వ శక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్దం అవుతోంది. అందుకోసం చంద్రబాబు త్వరలో హైదరాబాద్, వరంగల్, తిరుపతి, వైజాగ్ మరియు గుంటూరు జిల్లాలో పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణా తరగతులు నిర్వహించాలని అనుకొంటున్నారు. అదేవిధంగా, పార్టీలోని సీనియర్ నేతలను వారి వారి జిల్లాలలో పర్యటింపజేయడం ద్వారా పార్టీ శ్రేణులను ఉత్సాహపరచవచ్చని భావిస్తున్నారు. పంచాయితీ ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన తరువాత ఆయన తిరిగి తన బస్సు యాత్రని కూడా మొదలుపెట్టీ ఆలోచనలో ఉన్నారు. తద్వారా ఎన్నికల సమయం నాటికి వీలయినన్ని ఎక్కువ గ్రామాలు సందర్శించి, స్థానిక కార్యకర్తలను, ప్రజలను కూడా ప్రభావితం చేయవచ్చునని ఆయన అభిప్రాయం.   వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఇప్పటికే చాల ప్రాంతాలలో పార్టీ కార్యకర్తలు మరియు నేతలతో సమావేశాలులు నిర్వహిస్తున్నారు. కానీ, పార్టీ నుండి పెరిగిన వలసలు, అంతర్గత విబేధాలతో సతమతమవుతున్న ఆ పార్టీ తెలంగాణా ప్రాంతంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక తెరాస నేతలపై ఇటీవల వచ్చిన ఆరోపణలతో ఆ పార్టీ కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఎలాగయినా తెదేపాను గెలిపించుకోవాలని చంద్రబాబు ఆశిస్తున్నారు,

మోపిదేవికి మళ్ళీ అస్వస్థత

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వెన్నునొప్పితో బాధ పడుతుండడంతో జైలు అధికారులు చికిత్స కోసం నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్‌) ఆసుపత్రికి తరలించారు. మోపిదేవి వెన్నునొప్పితో పాటు అధిక రక్త పోటుతో బాధ పడుతున్నారు. మోపిదేవికి గత కొంతకాలంగా అస్వస్థతకు గురవుతూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో వైద్యులు చికిత్స చేశారు. చికిత్స అనంతరం ఆయనను జైలుకు తరలించారు.  

పీఎస్ఎల్‌వీ సి-22 ప్రయోగం సక్సెస్

      విపత్తులకు, విమానాలకు ఎంతో ఉపయోగపడే ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. దీనిని సోమవారం అర్ధరాత్రి ప్రయోగించారు. రాత్రి 11.41 నిమిషాలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది. ఇది తొలి భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహం. దీనిని రోదసీలోకి పంపించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన మన దేశం చేరింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో అంతరిక్ష పరిశోధకులు అవిశ్రాంతంగా పనిచేసి చోదక వ్యవస్థకు మార్గదర్శిగా ఉపయోగపడే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఈ తొలి ఉపగ్రహాన్ని (ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఏ) విజయవంతంగా ప్రయోగించారు. పిఎస్ఎల్వీ సి22 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని మోసుకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది. మిషన్ డైరెక్టర్ డాక్టర్ సురేష్‌తోపాటు ఈ ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందించారు. 44 మీటర్ల ఎత్తున్న ఈ ఉపగ్రహం పదేళ్లపాటు పని చేస్తుంది. ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ప్రయోగానికి అయిన ఖర్చు రూ.1,600 కోట్లు.

కిడ్నాప్ కి గురైన బాలుడు హర్షిత్ రెడ్డి హత్య

      ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లె శివారులో మూడేళ్ళ బాలుడు హర్షిత్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. డబ్బు కోసం దుండగులు నిన్న తెల్లవారుజామున హర్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. రూ.7లక్షలు ఇవ్వాలని లేకపోతె బాలుడ్ని చంపేస్తామని బెదిరించారు. అపహరించిన తరువాత బాలుడు ఏడుస్తుండడంతో గొంతు నులిమి హతమార్చి ఓబులక్కపల్లె గ్రామ శివారులో పాతిపెట్టారు. బాలుడి అపహరణ హత్య ఘటనలో ఇద్దరి నిందితులను పోలీసులు గుర్తించారు. వారిలో గుంటూరు జిల్లా దుర్గి వాసి శ్రీనివాసులు అదుపులోకి విచారిస్తున్నారు. మరో నిందుతుడు మహాబూబ్నగర్ జిల్లాకు చెందిన నాగారం పరారిలో ఉన్నాడు.

తెలంగాణా అంశంపై త్వరలో నిర్ణయం: దిగ్విజయ్

  రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ మరో పదిరోజులలో తెలంగాణా అంశంపై స్పష్టమయిన నిర్ణయం ప్రకటించబోతున్నట్లు ఖరారు చేసారు. అయితే, ఆయన చెప్పిన కొన్ని విషయాలు అటు తెలంగాణా నేతలకి, ఇటు ఆంధ్రా నేతలకీ కూడా మింగుడుపడటం లేదు.   ‘తెలంగాణాపై ఇదే ఆఖరి డెడ్ లైన్ గా భావించవచ్చా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకి అటువంటి దేమీ లేదని చెప్పారు. ఇప్పటికే అనేక డెడ్ లైన్లు గతంలో పెట్టడం జరిగిందని, అందువల్ల తానూ మళ్ళీ కొత్తగా మరొక డెడ్ లైన్ పెట్టదలచుకోలేదని అన్నారు. తెఅల్నగన సమస్యను రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్నీ పరిష్కరించవలసి ఉంటుందని, అందుకు శ్రీ కృష్ణా కమిటీ నివేదికతో సహా అన్ని నివేదికలను పరిగణనలోకి తీసుకొంటున్నామని చెప్పారు. అదే విధంగా తెలంగాణపై శాసన సభలో ఒక తీర్మానం ప్రవేశపెడతారని ఆయన చెప్పారు. కానీ కేంద్రం దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసారు.   దిగ్విజయ్ సింగ్ శ్రీ కృష్ణ కమిటీ ప్రస్తావన తేవడం, సీమాంధ్ర సభ్యులు అధిక సంఖ్యలో ఉన్న శాసన సభలో తీర్మానం పెడతామని చెప్పడం, యావత్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలని చెప్పడం వంటివి గమనిస్తే, అవి తెలంగాణా ఏర్పాటుకి వ్యతిరేఖంగా నిర్ణయం ఉండబోతోందని సంకేతాలు ఇస్తున్నాయి. కానీ, తెలంగాణ ఏర్పాటు అనంతరం తలెత్తే పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలన్న అంశంపైనే రోడ్డు మ్యాప్ గురించి అడుగుతున్నామని ఆయన చెప్పడం చూస్తే, తెలంగాణా ఇవ్వడం ఖాయమని అర్ధమవుతోంది. ఏమయినప్పటికీ, మరో పది రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఏదో ఒక నిర్ణయం ప్రకటించ బోతోందని మాత్రం స్పష్టం అయింది.

మళ్ళీ అధికారుల బదిలీ మేళా

    ప్రభుత్వ పాలన ప్రధానంగా ఐఏయస్, ఐపీయస్ మరియు ఇతర ప్రభుత్వాధికారుల ద్వారానే సాగుతున్నపటికీ, రాజకీయనాయకుల చేతిలో వారు ఆట బొమ్మలుగా మిగిలిపోతున్నారు. నేతల అవినీతి మేతకు, ఆగడాలకు అడ్డుపడితే ఇక ఆ అధికారికి శంకరగిరి మాన్యాలే గతి. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడమనేది వారి రికార్డులోనే ఉండదు. తరచూ బదిలీలతో వారి వ్యక్తిగత, కుటుంబ జీవితాలు దెబ్బతింటున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహయత వారిది. ప్రభుత్వం నిన్న హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున బదిలీలు చేసి, తన ప్రతాపం మరో మారు చాటుకోంది.   రంగారెడ్డి జిల్లాలో యదేచ్చగా సాగుతున్న భూ కబ్జాలను అడ్డుకొంటున్నందుకు కలెక్టర్ వాణీ ప్రసాద్, జాయింట్ కలక్టర్లు ఆర్.ముత్యాల రాజు, యం.జగన్నాధం వేరే చోటికి బదిలీ చేయబడ్డారు. అదే కారణాలతో హైదరాబాద్ కలెక్టర్ గా చేస్తున్న యస్ఏయం రజ్వీని కూడా విద్యుత్ పంపిణీ సంస్థకి యండీగా నియమిస్తూ బదిలీ చేయగా, ఆయన స్థానంలోకి ఏపీ మినరల్ డెవెలప్మెంట్ బోర్డులో చేస్తున్న యం.కే.మీనా వచ్చారు.   ఇక, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో చేస్తున్న పేరున్న పూనం మాలకొండయ్యకి గట్టిగా ఆరు నెలలు కూడా కాక మరో బదిలీ వేటు భరించక తప్పలేదు. ఐయేయస్ అధికారులలో ఆణిముత్యం వంటిదాని పేరున్నఆమె చేసిన పాపం అల్లా నియమ నిబందనలు ఖచ్చితంగా అమలుజేయడమే. నేతల ఆగ్రహానికి గురయిన ఆమెకు వేరొకచోటికి బదిలీ అయితే, ఆమె స్థానంలోకి కొత్తగా వైవీ.అనురాధ అనే కొత్త అధికారిణి వచ్చారు.   అధికారులు తమ సేవలకి ప్రతిఫలంగా ఈవిధమయిన బదిలీ వేటులు ఎదుర్కోవడం తప్పనిసరి అయిపోయింది. కానీ, తమ బంధువులు ఎవరో రాజకీయ పార్టీలు మారితే దానికి కూడా వీరినే శిక్షించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కార్మిక శాఖా కమీషనరు గా చేస్తున్న బీ. రామాంజనేయులుకి అప్రధాన్యమయిన ‘రెయిన్ షాడో ఏరియా డెవెలప్మెంట్’(అసలు ఇటువంటి శాఖా కూడా ఒకటుందని ఎంత మందికి తెలుసు?) బదిలీ చేయబడ్డారు. కారణం శాసన సభ్యుడయిన ఆయన అల్లుడు రాజేష్ అధికార కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవలే వైకాపాలోకి మారాడు! ఇప్పుడు ఆయన స్థానంలోకి డా.ఏ.అశోక్ అనే మరో అధికారి వచ్చారు.   ఖమ్మం జిల్లా కలెక్టర్ గా చేస్తున్న సిద్దార్థ్ జైన్ కూడా రాజకీయ నేతల ఆగ్రహానికి గురయి బదిలీకబడ్డవారే. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో వాణీ మోహన్ అనే మరో అధికారిణి స్థానంలోకి పంపబడ్డారు.   అధికారి పేరు  ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం   దాసరి శ్రీనివాసులు ముఖ్యకార్యదర్శి- గనుల శాఖా వ్యవసాయ మరియు సహకార సంస్థకు బీ.శ్రీధర్ నెల్లూరు కలక్టర్ రంగారెడ్డి కలెక్టర్ జీ. కిషన్ బీసీ సంక్షేమం వరంగల్ కలెక్టర్ సందీప్ కుమార్ సుల్తానియా రిజిస్ట్రార్ సహకార సంస్థలు   వీ.దుర్గాదాస్ ఏపీ ఆయిల్ ఫీల్డ్ వైస్ చైర్మన్ యండీ   ఆర్.ముత్యాల రాజు   జాయింట్ కలెక్టర్ తూ.గో.జిల్లా సి.హెచ్. ప్రభాకర్   జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి ఏ.మురళి   ఎడిషనల్ సిఈఓయస్.ఈ.ఆర్.పీ. యమ్వీ రెడ్డి   జాయింట్ కలెక్టర్ రంగా రెడ్డి కే.చంపాలాల్   జాయింట్ కలెక్టర్-2, రంగారెడ్డి టీ.ఆర్.కే రావ్   యండీ ఎపీయండీసీ                             బదిలీ అయిన ఐపీయస్ అధికారులు డా.యస్.ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్ జనరల్   ఆ.ప్ర.సంక్షేమ శాఖ రెసిడేన్షియల్ ఎడ్యుకేషన్ విభాగం   అతుల్ సింగ్ ఇన్స్పెక్టర్ జనరల్ డైరెక్టర్- స్టేట్ క్రిమేస్ రికార్డ్ బ్యూరో మహేష్ మురళీధర్ భగవత్   ఐజీ. సెక్యురిటీ కుమారి స్వాతి లక్రా   ఐజీ.ఎపీయస్పీ బెటాలియన్ కే.ఆర్.యం. కిషోర్ కుమార్   అదనపు డైరెక్టర్, ఏపీ పోలీస్ అకాడమీ హరీష్ కుమార్ గుప్త   ఐజీ. లా అండ్ ఆర్డర్ వీవీ శ్రీనివాస రావు   ఐజీ. సిఐడీ సోషల్ జస్టిస్

స్వార్ధ రాజకీయాలు ..సామర్ధ్యం లేని పాలకులు

....సాయి లక్ష్మీ మద్దాల       తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే నని,ఇది 56 సం॥ ల పోరాటమని ఏవేవో చాల వింత ప్రసంగాలు చేశారు మన టి కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సాధన సభ ద్వారా వారు, వారి అధిష్టానం ప్రజలకు ఏమి తెలియ జేయాలనుకున్నారో అది ప్రజలకు తెలియటమేమో కాని టి. ఆర్. ఎస్ నేతలకు బాగానే అర్ధమయింది. ఈరోజున అధిష్టానం తెలంగాణ అంశాన్ని ఒకకోలిక్కి తెస్తోంది దేనికోసం?తెలంగాణ ప్రజల మనోభావాలకు విలువనిచ్చా?లేక తన పొలిటికల్ మైలేజ్ కోసమా?కేవలం తన స్వార్ధ ప్రయోజనాలే అని తేట తెల్ల మైంది. అయితే ఇక్కడ సోనియా గాంధి ప్రజలకు ఏమని భరోసా ఇస్తుంది?కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యం లో రాష్ట్రం విడిపోయిన,కలిసున్నా ప్రజల సంక్షేమ అభివ్రిద్ది ఎలా సాధ్యం అనేది నేడు దేశ ప్రజలను వేధిస్తున్న సమస్య. ఎందుకంటే నేడు దేశాన్ని పాలిస్తున్నది రాజకీయ నాయకులు కాదు కేవలం అవినీతి మాత్రమే!విపరీతమైన కుంభ కోణాలలో,భయంకరమైన అవినీతిలో కూరుకొని పోయి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజులలో సమగ్రమైన పరిపాలనని ఎలా అందిస్తుంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని దేశ ప్రజలకు అపారమైన విశ్వాసం. కాని వారి పనికిమాలిన సంక్షేమ పధకాలొ లేక దిక్కుమాలిన కుల సమీకరణాలో వారిని గెలిపిస్తాయనేది వారి ప్రగాఢ నమ్మకం.   నేటి ఆధునిక నాగరిక సమాజానికి కావలసింది సమానత్వం మరియు అభివృద్ధి. కాని అలాంటి మెరుగైన పరిపాలనను అందించే సత్త ఈ పాలకులకు ఉందా?ఇది కేవలం తెలంగాణ సమస్య అని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ వారి రాజకీయ భవిష్యత్తును సరిచేసుకుంటున్నారు. మరి ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు ఉన్న నాయకులు రేపు ఇరు ప్రాంతాలకు సమన్యాయం ఎలా చేస్తారు. ఇక్కడ కేవలం తాగు నీరు మాత్రమే సమస్యా?మరి శాంతి భద్రతల పరంగా ఎలాంటి నివారణ చర్యలు చేపడతారు. మెరుగైన విద్య,నాణ్యమైన వైద్యం,అందరికి ఉద్యోగం అంటూ భారి డైలాగులే చెప్తున్నారు కాని ఈ సమస్యలన్నీ కలిసున్న కారణంగానే వచ్చినవా?అన్నిటికి మించి తెలంగాణ వస్తే కె. సి. ఆర్ పరిస్థితి మరో సిబుసోరెన్ లా అవుతుందని కూడా మరో వాదన ఉంది మరి ఈ నేపధ్యం లో ఆయన తన ఉనికిని కూల్పోవటానికి సిద్ధంగా ఉన్నాడా?  రాష్ట్రం ఉన్న విడిపోయిన ఇక్కడ ఇరు ప్రాంత ప్రజలకు కావలసింది అభివృద్ధి. కాని అది ఏ నాయకుల వల్ల కాదు అని ప్రజలకు అర్ధమై పోయింది. కాని నేడు ప్రజలు కోరుకుంటున్నది ఉన్న ఈ అభివృద్ధి అయిన కనుమరుగవకుండా ఉంటె చాలునని. రాజకీయనేతలందరూ వారి వారి వ్యాపారాలకు ఏది అనువుగా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. చివరకు నేటి పరిస్థితి ఎలా ఉందంటే రాయల తెలంగాణ అని రాయలసీమను రెండు ముక్కలు చేస్తున్నా చంద్రబాబు నాయిడు కూడా ఏమి మాట్లాడలేకున్నాడు. తెలంగాణ సాధన సభలో దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 44సం॥ లుగా సీమాంద్ర నేతలే ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరి దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు?60సం॥ ల కాలం లో ప్రజాస్వామ్యం ముసుగులో కుటుంబ పరిపాలనే భారత దేశ ప్రజలు చూస్తున్నారు. మరి తెలంగాణ కోసం ఇంత ధైర్యంగా సభ నిర్వహించామని చెప్పుకునే ఈ కాంగ్రెస్ నేతలు గాంధి కుటుంబ పాలనను వ్యతిరేకించ గలరా?కేవలం ప్రజల సంక్షేమం,దేశ అభివృద్ధిని మాత్రమే వీరుకనుక కాంక్షిస్తే,పి.వినరసింహారావు పరిపాలనకు,నేటి సోనియా గాంధీ ఆధ్వర్యంలోని మన్మోహన్ పరిపాలనకు గల వ్యత్యాసాన్ని,దేశ ఆర్ధిక ప్రగతిని విశ్లేషించ గలరా?ఏ మాత్రం పరిపాలన సామర్ధ్యం లేకుండా అమ్మ .... అమ్మ.... అంటూ సోనియా భజన చేసే వీళ్ళా రేపు రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రజలకు మేలుచేసేది!

కొత్త బాంబు పేల్చిన దిగ్విజయ్‌

      కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ఈ రోజు హైదరాబాద్ కి వచ్చిన ఆయన కాంగ్రెస్ నేతలను షాక్ కి గురి చేశారు. పది రోజుల్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరుగుతుందని, అప్పుడు తీసుకొనే నిర్ణయానికి పార్టీకి చెందిన అన్ని ప్రాంతాల నాయకులు కట్టుబడి ఉండాలని అన్నారు.   రాజకీయాల్లో వున్నవారందరూ వ్యాపారాలు చేయకూడదని, ఒకవేళ వ్యాపారాలు ఉంటే మానుకోవాలని అన్నారు. వైఎస్ నాకు సన్నిహితుడు. ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉండేవి. అయితే వైఎస్ కు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉందని చెప్పారు.   త్వరలో కోర్ కమిటీ ముందుకు సీఎం, బొత్స, ఆజాద్ తో కలిసి తాను హాజరు అవుతానని, సభ్యులకు తమ అభిప్రాయాలు వివరిస్తామని తెలిపారు. మొత్తంగా చూస్తే దిగ్విజయ్‌ చెప్పిన మాటల్లో ఒక్కదాంట్లోను విషయం లేదని ఇట్టే అర్థమయిపోతుంది.  

జగన్ పార్టీలో విబేధాలు, ఎన్నికలపై ప్రభావం!

      పంచాయితీ ఎన్నికల్లో సత్తాచాటలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కార్యకర్తల్లో ఉత్సాహన్ని నింపుతుంటే, ఇదే సమయంలో ఆయా జిల్లాలో అసంతృప్తుల బెడద ఎక్కువవుతుండడంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల,ఇంచార్జ్ ల నియామకం పార్టీలో సీనియర్ నేతలకు అసంతృప్తిని కలగిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జగన్ పార్టీలోని లుకలుకలు వరుసగా బయటపడుతున్నాయి.    తెలంగాణలో పార్టీ మరీ బలహీనంగా ఉండడంతో విజయమ్మ గత 25 నుండి తెలంగాణాలో పర్యటిస్తున్నారు. ఆమె తెలంగాణాలో పర్యటన చేస్తుండగానే ఆ పార్టీకి షాక్ తగిలింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోయం బాబురావు, బోడ జనార్ధన్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెసు పార్టీలో చేరారు. గుంటూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు అయిన మాకినేని పెదరత్తయ్య చేరిన కొన్నాళ్లకే పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత పార్టీకి దూరమై ఇప్పుడు కాంగ్రెసు పార్టీలే చేరేందుకు సిద్ధమయ్యారు.   ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత జలగం వెంకట్రావు కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతారని సమాచారం. ఖమ్మం లోకసభ టిక్కెట్ పైన జగన్ నుండి హామీ లేకపోవడం వల్లనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కీలక నేతలు రెండు రోజుల క్రితం తాము పార్టీ వీడుతామని చెప్పిన విషయం తెలిసిందే. ఇదే జిల్లాకు చెందిన రాష్ట్ర నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నేతలను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని అంటున్నారు.  జగన్ పార్టీలో చేరుతున్న నేతలకు అధిష్టానమే అంతా ఖర్చు భరిస్తుందన్న అభిప్రాయంతో పార్టీలో చేరుతున్న వారు ఉన్నారట. అయితే వాళ్ళకు అన్ని ఖర్చులు భరించడం వీలుకాదని పార్టీ చెప్పడంతో బయటకు వెళ్ళేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో నేతలు ఒకే సామాజిక వర్గం నుండి పార్టీలోకి వస్తున్నారట. ఇది కూడా ఇబ్బందిగా మారిందని అంటున్నారు.

తెలంగాణ సభకు పిలవలేదు,రాలేదు

      తెలంగాణ రాష్ట్ర సాధనకై నిజాం కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు నిర్వహించిన సభకు తనను ఆహ్వానించలేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. తనకు ఆహ్వానం రాకపోవడంతో సభకు హాజరుకాలేదని దానం నాగేందర్ తెలిపారు. ఈరోజు హైదరాబద్ కు వచ్చిన పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు ఆహ్వానం పలికేందుకు దానం నాగేందర్ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై అదిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న తమకు అభ్యతరంలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మూడో సారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. దిగ్విజయ్ సింగ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో దానం నాగేందర్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. దిగ్విజయ్ విమానాశ్రయం నుండి నేరుగా రాష్ట్ర కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ చేరుకున్నారు.

తెలంగాణను అడ్డుకోవడానికి కెవిపి ఇంట్లో భేటి

      ఆంద్రప్రదేశ్ కి దిగ్విజయ్ సింగ్ కి రావడంతో సమైక్యాంధ్ర వివాదం మళ్ళీ వేడెక్కింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మొగ్గు చూపుతోందన్న వార్తలు రావడంతో, తెలంగాణ ను ఇప్పుడు అడ్డుకోగలిగితే రాష్ట్రాన్ని విభజించడం ఇంకెవరి తరం కాదన్న దృఢమైన అభిప్రాయంతో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు భేటీ అయ్యారు.   ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి.. రాష్ట్ర విభజన సమర్ధనీయం కాదని వినతి పత్రం ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ వినతి పత్రం ఎలా ఉండాలన్న విషయమై వారు వివరంగా చర్చించుకున్నారు. జల వివాదాలు, ప్రాంతాల వారీగా అభివృద్ధి, నిధుల మంజూరు లాంటి అంశాలనూ వారు తమ నివేదికలో పొందుపరచారని సమాచారం.

దిగ్విజయ్ కు సమైక్య సెగ

        రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీగా నియమితులైన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ కి సమైక్యాంధ్ర సెగ తగిలింది. విశాఖలో జరిగిన క్షత్రియుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన దిగ్విజయ్ ని కేంద్రమంత్రి పురందేశ్వరి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, బాలరాజు, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి తదితరులు కలిశారు.   ఆంధ్రప్రదేశ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించవద్దు. కలిసి ఉంటేనే అభివృద్ది సాధ్యం అని మంత్రి సాకె శైలజానాథ్ నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ కు వినతిపత్రం అందజేశారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా కేవలం ఒత్తిడి తెచ్చేవాళ్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదని స్పష్టం చేశారు. అయితే ఏ విధమయిన సంకేతాలు ఉన్నా తాను చెబుతానని దిగ్విజయ్ తెలిపారు.

కాంగ్రెస్ టి.సభలో జానారెడ్డిపై చెప్పు

      రాష్ట్ర మంత్రి జానారెడ్డిపై తెలంగాణ వాది చెప్పు నిరసన తెలిపాడు. నిజాం కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ సాధన సభలో మంత్రి జానారెడ్డి ప్రసంగిస్తుండగా ‘తెలంగాణ ద్రోహి ఖబర్దార్’ అని నినాదం చేస్తూ తెలంగాణ యువకుడు మంత్రిపైకి చెప్పు విసిరాడు. ఈ లోపు అప్రమత్తమైన పోలీసులు యువకున్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.   ఆ తరువాత సభలో జానారెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ ప్రత్యేక జ్వాల ఇప్పటికీ ఆరలేదని, 1969 నుంచి రగులుతూనే ఉందని, ఆనాటి నుంచి ఉద్యమం రకరకాల రూపంలో వస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని, డిసెంబర్ 9న తెలంగాణ అవసరాన్ని సోనియా గుర్తించారు కనుకనే ప్రకటన చేశారని అన్నారు. 2001లోనే సీడబ్ల్యూసీలో తెలంగాణపై తీర్మానం చేశామని, తెలంగాణపై సంప్రదింపులు జరపాలని 2009 డిసెంబర్‌లో శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టింది, డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ ద్వారా తెలంగాణ ఏర్పడుతుందని ఈ సభతో తెలంగాణ ప్రజలకు నమ్మకం కుదిరిందని అభిప్రాయపడ్డారు.

డీయంకే తో దోస్తీ కత్తి మీద సామువంటిదే

  తమిళ తంబిలతో వ్యవహారం కత్తి మీద సాము వంటిదని, వారికి కోపమొచ్చినా సంతోషం కలిగినా పట్టలేమని కాంగ్రెస్ పార్టీ నిశ్చితాభిప్రాయం సరైనదేనని, డీయంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి చాలా సార్లు నిరూపించారు.   తనకు మద్దతు ఇస్తున్న పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ముద్దుల కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు అని కూడా చూడకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం కనిమోలిని 2జి స్కాం లో అరెస్ట్ చేయడమే కాక, పది నెలలు తీహార్ జైల్లో పెట్టి ఆమె చేత క్రోవ్వొత్తులు కూడా చేయించుకొన్నప్పుడు, ఆ కన్న తండ్రి హృదయం ఎంతగా రగిలిపోయుంటుందో కాంగ్రెస్ కి కూడా బాగా తెలుసు. అయితే రాష్ట్రంలో, పగబట్టిన పాములాంటి జయలలిత చేతిలో చిక్కి విలవిలలాడుతున్నందున, విధిలేని పరిస్థితుల్లో యుపీయేకు తన మద్దతు కొనసాగించవలసి వచ్చింది. తరువాత 2జీ స్పెషలిస్టులు కనిమోలి, రాజా ఇద్దరూ జైలు నుండి బెయిలుపై విడుదల కాగానే, శ్రీ లంక తమిళుల సమస్యను సాకుగా చూపించి, యుపీయేకు తన మద్దతు ఉపసంహరించి, మూడు చెరువుల నీళ్ళు తాగించాడా పెద్దాయన. అయితే, తండ్రిగా ఆయనపడిన ఆవేదనను అర్ధం చేసుకొన్న సోనియమ్మ మాత్రం డీయంకేతో దోస్తీ కొనసాగించాలని విశ్వప్రయత్నం చేసింది. అయితే ఆయన పేరుకి కరుణానిధి అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ పై ఇసుమంత కరుణ చూపలేదు.   అంత మాత్రాన్న కాంగ్రెస్ కూడా నిరాశాపడిపోలేదు. ఆయన మనసులో చోటు సంపాదించడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది. మొన్న జరిగిన రాజ్యసభ అభ్యర్ధుల ఎన్నికలలో కనిమోలికి ఐదు సీట్లు తక్కువబడటంతో, అదే అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆమెకు తన ఐదు ఓట్లు వేసి, ఆమెకు రాజ్యసభ సీటు మళ్ళీ దక్కేలా చేసింది. దానితో కటినాత్ముడనుకొన్న కరుణానిధి మనసు వెన్నపూసలా కరిగిపోయింది. అందుకు నిదర్శనంగా, ఆయన తన కుమార్తెను స్వయంగా డిల్లీ వెళ్లి సోనియమ్మకు కృతజ్ఞతలు చెప్పి, పనిలోపనిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి స్నేహగీతాలు పాడుకోవడానికి తమకు అభ్యంతరం లేదని సోనియమ్మ చెవిలో ఊది రమ్మని పంపారు. డిల్లీ వెళ్లి సోనియమ్మను కలిసి వచ్చిన కనిమోలి, తానూ కేవలం ‘థాంక్స్’ చెప్పడానికే ఇంత దూరం ఎగురుకొంటూ వచ్చానని మీడియాకు నమ్మబలుకుతున్నారు.   అయితే, కాంగ్రెస్ పార్టీ మొన్న బీహార్ లో నితీష్ కుమార్ కి కూడా ఇలాగే సహాయపడితే ఆయన జస్ట్ ఒక రెండు రూపాయలు పెట్టి ఒక ఫోన్ కాల్ చేసి థాంక్స్ చెప్పాడే తప్ప ఇలా ఇంత దూరం ఎగురుకు రాలేదు కదా? మరి కనిమోలి ఎందుకు అంత శ్రమపడింది? అంటూ మీడియావాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కారు

టి.కాంగ్రెస్ సభా వేదికపై 120 నేతలు

      ఆదివారం జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ సభలో వేదికపై రికార్డు స్థాయిలో నేతలు కూర్చోబోతున్నారు. తెలంగాణలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా అందరూ ఈ సభకు వస్తున్నారు. బహిరంగసభ వేదిక మీద కేవలం సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ ల ఫోటోలే ఉంచుతున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల నుండి ప్రజలు హాజరయ్యేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి తాను ఈ సభకు హాజరుకానని, తనకు ఆహ్వానం రాలేదని అన్నారు. సభా వేదిక మీద 120 మందికి పైగా నేతలు ఆసీనులయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి తమ సత్తా చాటాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు.

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ

      తెలంగాణాలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఉస్మానియా విద్యార్థి జేఏసీ ప్రకటించింది.సెప్టెంబర్ 17న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ జేఏసీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అదే వేదికపై పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఓయూ జేఏసీ నిర్ణయించింది. మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 10 గ్రామ పంచాయతీలకు ఓయూ జేఏసీ పోటీ చేయనుంది. ఈ పది స్థానాలకు ఓయూ జేఏసీ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున జేఏసీలు ఏర్పడ్డాయి. ఇక్కడ చురుకుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బాల్క సుమన్ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అయ్యారు. తాజాగా రాజారాం యాదవ్ టీడీపీలో  చేరి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మరో నేత పిడమర్తి రవి ఖమ్మం జిల్లా మధిర నుండి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.