మతతత్వ ముద్రనే ఇష్టపడుతున్న బీజేపీ

  బీజెపీని ఎవరయినా మతతత్వ పార్టీగా అభివర్ణిస్తే ఆ పార్టీ నేతలు విరుచుకొని పడతారు. తాము తప్ప మిగిలిన పార్టీలన్నీ కుహనా సెక్యులర్ ముసుగులు ధరించి తిరుగుతున్నాయని వారు ఎద్దేవా చేస్తారు. అయితే, వారు హిందూమతానికి ప్రాతినిద్యం వహిస్తున్నసంగతిని ఎన్నడూ దాచిపెట్టుకొనే ప్రయత్నం చేయలేదు. దానిని అలుసుగా తీసుకొని కాంగ్రెస్, ఆ పార్టీపై మతతత్వ ముద్ర వేసి పబ్బం గడుపుకోవడం కూడా అందరికీ తెలిసిందే.   తన మతతత్వ ధోరణివల్ల బాబ్రీ మశీదు విద్వంసం జరిగినపుడు, దానికి ప్రధాన కారకుడయిన అద్వానీ ఏనాడు అందుకు పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. కానీ, అదే ధోరణి వల్ల గుజరాత్ రాష్ట్రంలో మారణ కాండ జరిగినందుకు కారకుడయిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పార్టీ అధికారం కట్టబెట్టాలని చూసినప్పుడు మాత్రం ఆయన తీవ్రంగా వ్యతిరేఖిస్తూ తన పదవులకి రాజీనామా చేసారు. అంటే ఒక మతతత్వ వాదిని మరొక మతతత్వవాది అసహ్యించుకొంటున్నాడన్న మాట. మరటువంటప్పుడు, ఇతర పార్టీలు వారు అసహ్యిన్చుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?   తను చేసిన తప్పులనే మోడీ చేస్తే సహించలేని అద్వానీ, ఇప్పుడు అంతకంటే ఘనుడయిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎన్డీయే కన్వీనర్‌గా ఉండాలని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆహ్వానించినపుడు ఏవిధంగా స్పందిస్తారు? బీజేపీ కంటే నాలుగాకులు ఎక్కువే చదివిన శివసేన కేవలం మత తత్వమే కాకుండా ప్రాంతీయవాదం కూడా నరనరాన్న జీర్ణించుకొని ఉంది. పొట్ట చేత పట్టుకొని వచ్చిన బీహారీలు, గుజరాతీలు, దక్షిణాది వారిని ముంబై నుండి తరిమేయాలని ఆ పార్టీ గతంలో చాలా సార్లు విఫలయత్నాలు చేసింది.   బాల్ టాక్రే వారసుడిగా శివసేన పగ్గాలు చేతబట్టిన ఆయనకూడా తండ్రి అడుగు జాదలలోనే నడుస్తూ, ముంబైయేతరులను బయటకి పంపాలని గట్టిగా వాదిస్తున్నారు. అటువంటి భావాలున్న ఉద్ధవ్ ఠాక్రేను ఎన్డీయే కన్వీనర్‌గా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కోరడం ద్వారా బీజేపీ తన మతతత్వ ముద్రను మరో మారు దృవీకరించుకొంటోందని చెప్పవచ్చును. తద్వారా తన కెదురయిన అవకాశాలను తానే జారవిడుచుకొంటోంది   బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మోడీ గురించి మాట్లాడుతూ “దేశాన్ని కలిపే నాయకుడే మనకి కావాలి తప్ప, విడదీసేవాడు అవసరం లేదని” అన్నారు. మరిప్పుడు బీజేపీ అధ్యక్షుడు స్వయంగా ఉద్ధవ్ ఠాక్రేకు హారతి పట్టిన సంగతి తెలిస్తే మరి ఆయన ఏమంటాడో?

దాసరి కి సీపీఐ నారాయణ సపోర్ట్

      బొగ్గు కుంభకోణంలో అసలు ముద్దాయి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. కానీ ఆయనను వదిలి మాజీ మంత్రి దాసరి నారాయణరావు మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని నారాయణ ప్రశ్నించారు. కేజీ బేసిన్ లో రిలయన్స్ గ్యాస్ దోపిడీ చేస్తుందని, భారత ప్రభుత్వాలు రిలయన్స్ కు దాసోహం అవుతున్నాయని ఆరోపిస్తూ సీపీఐ రిలయన్స్ ముందు ఆందోళన చేసింది. ఆ సంధర్భంగా ఆయన దాసరికి మద్దతుగా మాట్లాడారు. బొగ్గు కుంభకోణం కేసులో ఇటీవల దాసరి నారాయణరావును విచారించిన సీబీఐ ఇటీవల ఆయనకు చెందిన సంస్థల మీద, జిందాల్ కార్యాలయాల మీద సోదాలు జరిపి కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో దాసరికి మద్దతుగా ఎవరూ నిలవలేదు. అయితే ప్రత్యక్ష్యంగా ఇప్పుడు సీపీఐకి చెందిన రాష్ట్ర కార్యదర్శి నారాయణ పరోక్షంగా అండనివ్వడం విశేషం.

రత్తయ్యతో రాయపాటికి కన్నా చెక్ పెడతారా

  గ్రూపు రాజకీయాలకి, కుమ్ములాటలకి పెట్టింది పేరయిన కాంగ్రెస్ పార్టీలో ఏ పరిణామం జరిగినా దాని వెనుక ఏదో ఒక పెద్ద కధే ఉంటుంది. గుంటూరు జిల్లా వైకాపాకు చెందిన ప్రముఖ నేత రత్తయ్యని, అదే జిల్లాకు చెందిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి రప్పించగలుగారు. నిన్నఆయనను స్వయంగా వెంటబెట్టుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల సమక్షంలో పార్టీ తీర్ధం ఇప్పించి కాంగ్రెస్ కండువా కప్పించారు.   ఆయన రాకతో కాంగ్రెస్ పార్టీ బలపడటం సంగతి ఎలావున్నపటికీ, గుంటూరు జిల్లాలో రాయపాటి సాంభశివరావుతో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వైరం ఉన్న కన్నా లక్ష్మినారాయణ, ఆయన ధాటికి తాళలేకపోవడంతో తన వర్గం మరింత బలపడితే తప్ప ఆయనను ఎదుర్కోవడం కష్టమని భావించిన కన్నా లక్ష్మినారాయణ, వైకాపాలో ఇమడలేక ఇబ్బందిపడుతున్నరత్తయ్యని మెల్లగా పార్టీలోకి రాప్పించగలిగారు. ఇంతవరకు రాయపాటిదే పైచేయిగా సాగుతున్న గుంటూరు రాజకీయాలలో రత్తయ్యతో కలిసి కనా చక్రం తిప్పాలని భావిస్తున్నారు. అంతే గాక, వచ్చే ఎన్నికలలో రత్తయ్యకి గుంటూరు యంపీ టికెట్ ఇప్పించి రాయపాటి ప్రాభవానికి గండి కొట్టాలనే దూరాలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి దీనికి రాయపాటి ఏవిధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి. వీటినే కాంగ్రెస్-మార్క్ రాజకీయలంటారు.

అమ్మో .. 'రూపాయ్'

.....సాయి లక్ష్మీ మద్దాల       నేడు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థను వణికిస్తున్న ఒకే ఒక అంశం పెరిగిన డాలర్ రేటు. భారతదేశంతో పాటు మిగిలిన చాలా దేశాల కరెన్సీ విలువ పడిపోయింది. దీనికి కారణం ఏమిటి?ప్రపంచం మొత్తం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నా కూడా ఏమాత్రం చెక్కు చెదరని పటిష్టమైన ఆర్ధికవ్యవస్థ మన భారతదేశానిది అని ఢంకా బజాయించే మన నేతలంత నేటి ఈ పరిస్థితికి ఏమని సమాధానం చెప్తారు?అసలు ఈపరిస్థితికి కారణం ఏమిటి?రూపాయి విలువ పడిపోయిన వైనం ఒక్కరాత్రిలో జరిగినది కాదు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో దాదాపు 30%ఆర్ధిక వ్యవస్థ అమెరికా భాగస్వామ్యంలో ఉంది. ప్రపంచీకరణ నేపధ్యంలో విదేశీ వస్తువుల మీద మోజు పెరగటం,తద్వారా వాటి దిగుమతులు పెరగటం పరిపాటి అయిపోయింది. ఇది కుడా నేటి ఈ పతనానికి ఒక కారణం.     అమెరికా ఫెడరల్ బ్యాంకు ఉద్దీపన ప్యాకేజి పేరుతో ప్రతినెల ముద్రిస్తున్న 85 బిలియన్ డాలర్ల అధిక కరెన్సీని తగ్గిస్తాయన్న సంకేతాలు వెలువడి నప్పటి నుండి అంటే ఏప్రిల్ చివరి నుంచి రూపాయి పతనం వేగవంతమ్ అయింది. ఎక్కువగా విదేశీదిగుమతులపై ఆధారపడటం,కరెంట్ అకౌంట్ లోటు అధికంగా ఉండటం మూలాన భారతీయ కరెన్సీ ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటోంది. గడచిన 5సం "ల కాలంలో రూపాయి విలువ 50%నికి పైగా పడిపోయింది.2008లో    రూ॥ 39/- వద్ద ఉన్న డాలరు విలువ నేడు రూ60/-ల సమీపానికి చేరింది. దీనివలన దిగుమతులు మరింత భారమయ్యె  పరిస్థితి కనిపిస్తుంది. దీని వలన దేశ సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదముంది. అయితే ఆర్ధిక మంత్రి  ఇతర కొంతమంది ఆర్ధిక నిపుణులు దిగుమతులను కట్టడి చేయాలని చుబుతున్నారు. ఏ దిగుమతులను కట్టడి చేయాలి?ఎరువులా?క్రూడ్ ఆయిలా ?వ్యవసాయాధారితమైన భారతదేశానికి ఎరువుల అవసరం ఎంత ఉందొ అందరికి తెలిసినదే,క్రుడాయిల్ అవసరం మనదేశానికే కాదు అన్ని దేశాలకు ఉంది. తదనుగుణంగానే ఈరెండింటి దిగుమతి తప్పనిసరి. ఇక్కడ కట్టడి చేయగలిగిన దిగుమతి కేవలం ఒక్క బంగారం మాత్రమే. కరెంట్అకౌంట్ లోటును పుడ్చాలంటే తక్షణ చర్యలేవి?ప్రభుత్వం పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయలేదు. ఉన్న పెట్టుబడులన్నీ అవినీతి లోకి మళ్ళి పోయాయి. వ్యవసాయాధారిత దేశంలో నేటికి ఎరువులను దిగుమతి చేసుకున్తున్నామే గాని ఎరువులను ఉత్పత్తి చేయలేక పోతున్నాము. రూపాయి పతనం కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థలో ద్రవ్యం లభ్యత కఠినం అవుతుంది. భారత స్టాక్ మార్కెట్ కు బయటి నుండి నిధులు రావటం తగ్గిపోతుంది. రూపాయి విలువ నానాటికి క్షీణిస్తున్న దశలో ఇంధన సబ్సిడితో పాటు,ఎరువుల సబ్సిడీ కూడా అమాంతం పెరిగే ప్రమాదముంది. డాలర్ విలువ ఒక్క రూపాయి పెరిగితే ఇంధన ఖర్చు రూపంలో సంత్సరానికి 9000కోట్ల రూపాయల అదనపు భారం భారత ప్రజానీకం మీద పడుతుంది. ముఖ్యంగా రూపాయి పతనం కారణంగా పేద,మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారు. వంటనూనెల నుండి నిత్యావసర వస్తువులు,పెట్రోలియం ఉత్పత్తుల ధరలతో ప్రజానీకం విలవిల లాడే పరిస్థితి. దీనితో మధ్యతరగతి ప్రజల నెలవారీ ఇంటి బడ్జెట్ 15%నుండి 20%నికి పెరిగిపోతుంది.   నేడు భారతీయ ఆర్ధిక రంగం విలవిల లాడుతోంది. దీనికి కారణం,మన నేతలు ఎన్నో సంత్సరాలుగా చేస్తున్న తప్పుల ఫలిత మిది. ఓట్ బాంక్ రాజకీయాల కోసం ఎటువంటి పథకాలనైన అమలుపరిచే రాజకీయ యంత్రాంగం చేతకాని తనం,నిర్ణయ రాహిత్యం కారణంగా ఏర్పడిన సంక్షోభం ఇది. అర్ధం పర్ధం లేని పధకాల అమలు కారణంగానే ఆర్ధిక రంగం గాడి తప్పింది. దీనిని గాడిలో పెట్టాలంటే,ప్రభుత్వం చాలా విషయాల మీద దృష్టి సారించాలి. అందులో ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని అభివ్రిద్ది చేసి,తద్వారా ఉపాధిని కల్పించాలి. ఈకొద్ది మంది పెట్టుబడిదారుల ఆధిపత్యం కాకుండా పారిశ్రామిక వికేంద్రీకరణ చేపట్టాలి. ఇది కొంచెం దీర్ఘకాలిక ప్రణాళిక. ఇప్పటికిప్పుడు సత్వర నివారణ చర్యలు అంటే మన దేశం చేస్తున్న ఎగుమతులైన బాసుమతి బియ్యం ,వజ్రాలు,జౌళి ఉత్పత్తులు,రసాయనాలు,ఔషధాలు,ఇంజనీరింగ్ విడిభాగాలఉత్పత్తి,తదితర ఎగుమతుల పరిమాణం పెరగాలి. దానికి తగిన తోడ్పాటు,ప్రోత్సాహకం ప్రభుత్వం అందించాలి. ప్రభుత్వనిధులు పనికిమాలిన పధకాల కోసం కాక సక్రమమైన వాణిజ్య ఉత్పత్తుల కోసం ఖర్చు చేయ గలగాలి. ముఖ్యంగా ఓట్ బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి దేశ సంక్షేమానికి పెద్దపీట వేయగలిగితే,భవిష్యత్తులో మరోసారి ఇలాంటి విపత్తు బారిన పడకుండా దేశాన్ని కాపాడిన వారవుతారు. దేశ ప్రజలు కూడా రానున్న భవిష్యత్త్ ప్రయోజనాల రీత్యా పొదుపుకు పెద్ద పీట వేయాలి.

శంకరన్న పై మరో కేసు

      కాంగ్రెస్‌ మాజీ మంత్రి శంకర్రావుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.. హైకమాండ్‌ అండదండలతో జగన్‌ను జైలు పాలు చేసిన శంకర్రావు ఆ తరువాత పార్టీ నాయకులను కూడా పట్టించుకోకుండా అందరి మీద ఆరోపణలు మొదలుపెట్టాడు..   దీంతో పార్టీ పెద్దలు కూడా శంకర్రాపును పక్కన పెట్టారు.. అయితే తనకు సరైన విలువ దక్కటం లేదన్న శంకర్రావు ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డినే టార్గెట్‌ చేసి అనేక ఆరోపణలు చేశాడు.. దీంతో పార్టీకి దూరమయిన శంకర్రావు కేసులకు మాత్రం చాలా దగ్గరయ్యాడు. ఇప్పటికే భూకబ్జా కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్న శంకర్రావును.. కొడలు రూపంలో మరో కేసు వెంటాడింది.. తనను హెరాస్‌ చేస్తున్నారంటూ కొడలు వేసు వేసిన కేసు శంకరన్నతో పాటు ఆయన కుంటుంబానికి కూడా చుట్టుకుంది.. ఇదే వరుసలో ఆయన మెడకు ఇప్పుడు తాజాగా మరో కేసు చుట్టుకుంది.. గతంలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరి సియం, డిజిపిలపై అక్రమంగా సంపాదిస్తున్నారంటూ ఆరోపణలు చేసిన శంకర్‌రావుపై డిజిపీ కార్యాలయంలోని అసిస్టెంట్‌ ఐజీ ఆఫ్‌ పోలీస్‌ ఎం సుబ్బారావు కేసు ఫైల్‌ చేశారు..  

కొనసాగుతున్న జలవిలయం

      కేదారేశ్వరుడి సాక్షిగా గంగ సృష్టించిన విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది.. సునామిలా విరుచుకుపడిన మందాకినీ నది అలలు వందాల ప్రాణాలు తీయటంతో పాటు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేయగా. ఇప్పుడు మిగిలిన ఆ ఆనవాలు కూడా మృత్యు ఘంటికలను మోగిస్తున్నాయి..   ఇప్పటికే సైన్యం ప్రాణాలకు తెగించి వేల ప్రాణాలను కాపాడినా.. ఇంకా దాదాపు 50 వేలకు పైగా ప్రజలు అక్కడే చిక్కుకొని ఉన్నారు.. అయితే ఇంత వరకు రవాణా మార్గాలు సరిచేయలేకపోవడం.. వాతవరణ పరిస్థితులు కూడా సహకరించకపోవటంతో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది..   ఇప్పటి వరకు మరణించిన వారిలో సంగ మంది అలల తాకిడికి మరణించగా అంతే మంది ఆకలి దప్పులతో మరణించారు.. అయితే  ఇప్పటికీ చాలా మంది మార్గమధ్యంలోనే ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.. ముఖ్యంగా యాత్రకు వెళ్లిన వారిలో వృద్దులు మహిళలే ఎక్కవుగా ఉండటంతో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది.. ప్రభుత్వంతో పాటు పలు స్వఛ్చంద సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నా అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా అవి బాధితులకు అందటం చాలా కష్టమవుతుంది..

తమిళ పురచ్చితలవై జయమ్మ కరుణ

.....గోపి చిల్లకూరు.డల్లాస్ టెక్సాస్       భారత్ లో మీరు  ఏ పట్టణం లో సెటిల్ అవ్వాలను  కొంటున్నారో ఇంకా నిర్ణయం తిసుకొలేదా ! ఎందుకు ఆలస్యం తమిళనాడు మద్రాసు నగరంలోకి మకాం మార్చేయండి. ఆదాయంతో పనిలేకుండా బహు భేషుగ్గా బతికేయచ్చు, శెభాష్ జయలలితమ్మ, నమస్కారం, వణక్కం అంటూ !  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారు వరుసగా ప్రకటిస్తున్న అమ్మటిఫిన్, అమ్మలంచ్, అమ్మమినరల్ వాటర్, అమ్మ వెజిటబుల్ అవుట్ లెట్స్  పథకాలు చూస్తుంటే !  1) బ్రేక్ ఫాస్ట్  1-3 రూపాయల లోపు(ఇడ్లి, దోస, పొంగలు, పూరి ..etc )నచ్చిన టిఫిన్స్      లంచ్       5-8 రూపాయలలోపు     డిన్నర్    5 -8రూపాయలలోపు     మినరల్ వాటర్ సగం ధరకే !     రోజుకు 12 రూపాయలతో ఒక మనిషి బ్రతికేయచ్చు !   మీకు పై అమ్మ హోటల్ లో రోజూ తినలేకపోతే వారానికి ఒకసారి అమ్మ Vegetables outlet   స్టోర్స్ లో సగం ధరకే కూరగాయలు.    1)  బియ్యం ఎలాగు కేజీ 2 రూపాయలు మంచిగా బిరియాని వండుకొని పండుగ చేసుకోవచ్చు !  2) ప్రతి ఫామిలీకి ఇచ్చే ఉచిత టీవితో జయటీవీ  సీరియళ్ళు అన్ని ఫ్రీగా చుసేయవచ్చు 3) మీ పిల్లలకిచ్చే ఉచిత laptopతో చాటింగ్ లేదా సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ లు  చేసేయవచ్చు ! 4) ఓటు మాత్రం జయలలిత అమ్మకే వేసేయండి ! ఈసారి మనకు వంటకు గ్యాస్ కూడా ఫ్రీగా వస్తుంది.   అమ్మ ఇంకొంచెం కరుణ చూపిస్తే   ప్రతి రోజూ వండిన వెజిటేరియన్  భోజనం మూడు పూటల మన  ఇంటికి వస్తుంది.   అమ్మ దయతలిస్తే  ఆదివారం  చికెన్ లేదా  మటన్  భోజనం కూడా  వస్తుంది. పేద ప్రజలకు భోజనం సరసమైన ధరలకు అందిచడం మంచిదే కాని వారిని ఎన్నికల దృష్టితో  మరీ  సోమరిపోతులను చేయడం తగదు అన్నది రచయత భావన. అదే విధముగా ఈ పథ కాల  ద్వార రాష్ట్ర ఖజానాకు నష్టం రాకుండా చేస్తే అత్యంత ఉపయోగమైన పథకములు అవుతాయీ !.  ప్రతి చోట అమ్మ హోటల్స్ పెట్టి  ఇడ్లిబండిలు , చిన్న హోటల్స్, చిరు అంగడిలు నడిపే వారు అందరు నష్టపోయే అవకాశం వుంది.  ఇప్పటికే తమిళనాడు గత సంవత్సరం లోటుబడ్జెట్  దాదాపు 23వేల  కోట్లు. ఈ సంవత్సరం ఇప్పటికే  భోజన పథకం ఖర్చు 5000 కోట్లు.   లోక్ సభ ఎన్నికలు త్వరలో  వస్తున్నాయని ఇన్ని పథకాలు ఇలాగే పెడితే రాష్ట్రం దివాలా తీయడం ఖాయం.  చైనాలో ఒక  పాత  సామెత "ఒక మనిషికి చేపలు వండి ఒక పూట భోజనం  పెట్టడం కంటే అదే మనిషికి చేపలు పట్టడం నేర్పితే  ఆ వృత్తి  అతనికి  జీవితాంతం తిండి పెడుతుంది" అన్న సామెత ప్రభుత్వాది నేతలు గుర్తు పెట్టుకొంటే మంచిది.   (“Give a man a fish and you feed him for a day. Teach a man to fish and you feed him for a lifetime.)

నవ్విపోదురుగాక మాకేల సిగ్గు

  గట్టిగా నెల రోజులు కూడా శాసనసభను నడపలేని ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రూ.ఒకటిన్నర కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి, ఒక్కోటి రూ 47, ౦౦౦ ఖరీదు చేసే టాబ్లెట్ పీసీలను, గిఫ్ట్ వోచార్లను, ఇతర కానుకలను బహుమతిగా అందిస్తే, సభను ఒక్కరోజు కూడా సవ్యంగా జరగనీయకుండా అడ్డుపడిన మన శాసన సభ్యులు, నవ్వితే నవ్విపోదురుగాక మాకేల సిగ్గు అనుకొంటూ ప్రభుత్వం అందించిన ఆ బహుమతులను ఆనందంగా స్వీకరించారు. అందుకు ప్రభుత్వంపై తమకున్నవ్యతిరేఖత కానీ, పార్టీ సిద్దాంతాలు గానీ, తెలంగాణావాదం గానీ ఏవీ అడ్డు రాలేదు. బహుమతులు అందుకోవడం తమ జన్మ హక్కు అన్నట్లు చిద్విలాసంగా నవ్వులు చిందిస్తూ నిన్నటి వరకు ఎవరిని సభలో తిట్టిపోసారో వారి నుండే అందుకొని ఎంచక్కా ఇళ్ళకు వెళ్ళిపోయారు.   ఇక, గిరిజన సంక్షేమ శాఖ గిరిజనుల కోసం ఏమి చేస్తోందో చెప్పలేకపోయినా, ఒక్కో శాసన సభ్యుడికి రూ.7,500 విలువయిన గిఫ్ట్ వోచర్లు పంచిపెట్టింది. అదేవిధంగా పరిశ్రమల శాఖ రాష్ట్రoలో కరెంటు కోతలతో అల్లాడిపోయిన పరిశ్రమలకు చేసిన మేలేమి లేకపోయినా, శాసన సభ్యులకు ఎంతో ఉదారంగా విలువయిన బహుమానాలు పంచిపెట్టింది.   అయితే, క్రిందటిసారి బడ్జెట్ సమావేశాల అనంతరం ఇచ్చిన లాప్ టాపులు, ప్రింటర్లు, స్కానర్లు, సెల్ ఫోనులు, ఐ పాడ్ వగైరా కానుకలతో పోలిస్తే ఈ సారి ప్రభుత్వం మొక్కుబడి బహుమతులతో సరిపెట్టేసిందని కొందరు సభ్యులు సణిగినప్పటికీ, ప్రజలమీద మరింత భారం మోపడం సబబు కాదనుకొంది ప్రభుత్వం.   సాధారణంగా కార్యాలయాలలో, కర్మాగారాలలో ఎవరయినా సరిగ్గా పనిచేయకాపోతే అటువంటివారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ అసెంబ్లీని సజావుగా సాగనీయకుండా అడ్డుపడినందుకు శాసనసభ్యులకు ప్రభుత్వం బహుమానాలు పంచిపెట్టడం మాత్రం నిజంగా విడ్డూరమే. అందుకు ప్రజాధనం ఖర్చు చేయడం జవాబు దారితనం లేకపోవడమే కారణం.

కాపలా కుక్కల్లా కాదు..గుంట నక్కల్లా

      టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలనే దోచుకుంటున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ పట్ల గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, వాళ్ళ శవాల మీద పునాదులు నిర్మించుకున్నారని ఆరోపించారు. భూవివాదంలో కేటీఆర్ కు భాగస్వామ్యం లేకపోతే, అసెంబ్లీలో నిన్న టీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ తమ అసలు రంగు ఎక్కడ బయటపడుతుందోనని టీడీపీపై ఎదురుదాడికి దిగిందని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఉంది కాబట్టే ప్రజలు మిమ్మల్ని భరిస్తున్నారని, లేకపోతే తరిమికొట్టేవారన్నారు. భూవివాద వ్యవహరంలో భువనేశ్వర్ జైల్లో సతీష్‌రెడ్డి ఉన్నమాట నిజం కాదా, కిడ్నాప్‌పై శ్రీనివాస్‌రావు కుమార్తెల ఆరోపణలు నిజం కాదా?, సతీష్‌రెడ్డిని పట్టించుకోవడం లేదని అతని సోదరులు చెప్పిన మాట నిజం కాదా అని రేవంత్ ప్రశ్నించారు.

దగ్గుబాటి క్షమాపణ చెప్పాలి

      కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేకపోతె రూ.5 కోట్ల క్రిమినల్ దావా వేస్తానని రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి హెచ్చరించారు. దగ్గుబాటికి తాను ఇప్పటికే లీగల్ నోటీసులను పంపించానని, ఇప్పటికైనా ఆయన క్షమాపణలు చెప్పాలని టీఎస్సార్ సూచించారు. పురందేశ్వరి పై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ప్రభుత్వ పతకాలను విశాఖ ప్రజలను పూర్తి స్థాయిలో అందించడమే నా దేయమని అన్నారు. విశాఖ లోకసభ సీటుపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు, టి.సుబ్బిరామి రెడ్డిల మధ్య వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దగ్గుబాటి టిఎస్సార్ పైన తీవ్ర విమర్శలు చేశారు.

టిడిపి ఎమ్మెల్యేలు హరీష్ తో టచ్ లో ఉన్నారా?

      టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు టిడిపిని ఇబ్బంది పెడుతున్నాయి. టిడిపి, టీఆర్ఎస్ ల మద్య మాటల యుద్ధం నడుస్తుండడంతో, తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు టిడిపి ని టెన్షన్ పెడుతున్నాయి. టిడిపి కి చెందిన ఎమ్మెల్యే లు ఎనిమిది మంది తనకు టచ్ లో ఉన్నారని చెప్పారు. టిడిపి పార్టీ ఖాళీ అవుతుందనే భయంతో ఆపార్టీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. టిడిపి నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, తమపై అసత్య ప్రచారం చేస్తూ తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే నిజంగానే టిడిపి ఎమ్మెల్యే లు హరీష్ తో టచ్ లో వున్నారా? కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా!

'నేనింతే' అన్న మహీధర్ రెడ్డి

      కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది తనకు వ్యతిరేఖంగా సంతకాలు సేకరణ చేపట్టిన అంశంపై ఆ పార్టీ మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్ రెడ్డి స్పందించారు. కొందరు ఎమ్మెల్యేలకు సొంత పనులు చేయలేదనె తనను తొలగించాలని కోరుతున్నారని మహీధర్ రెడ్డి విమర్శించారు. అయిన తాను తన పద్దతి మార్చుకోనని, తాను ఇలాగె ఉంటానని అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని సంతకాలు పెట్టుకున్న అభ్యంతరం లేదని చెప్పారు. మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్ రెడ్డికి అండగా మంత్రి దానం నాగేందర్ నిలబడ్డారు. మహీధర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.

బాబు..మగాడివైతే నువ్వు రా

      టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కు, ఆంధ్రజ్యోతి పత్రికకు తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. తనపై కుట్రతోనే ఆంధ్రజ్యోతి పత్రిక భూదందా వార్తలను ప్రచురించిందని, ఆ పత్రిక పై సోమవారం పరువు నష్టం పిటిషన్ వేస్తానని అన్నారు. తాను ఎలాంటి విచారణకైన సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. చంద్రబాబు, కెసిఆర్ ఆస్తులపై విచారణకు సిద్దంగా ఉన్నామని 'దమ్ముంటే, మగాడివైతే నువ్వు రా.. చంద్రబాబు, కెసిఆర్ పుట్టినప్పటి నుంచి విచారణ జరిపిద్దామా? ఇద్దరి ఆస్తులపై విచారణకు సిద్దమని తమ పార్టీ నేతలు ఎప్పుడో చెప్పారని కెటిఆర్ అన్నారు. లాగు తడుపుకుంటూ పారిపోయే వ్యక్తి చంద్రబాబు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాను తప్పు చేసినట్లు తేలితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ చెప్పారు.

జగన్ కోసం 'క్యాంపు ఆఫీస్ దందా'

      వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడు వైఎస్ జగన్ ని కోట్లకు అధిపతిని చేయడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. సెక్రెటేరియట్ లెవల్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు..తన పర్సనల్ క్యాంపు ఆఫీస్ అడ్డాగా చేసేసుకొని ముఖ్యమంత్రి వైఎస్, ఆయన సన్నిహిత మిత్రుడు కేవీపీ రాంచంద్రరావు, ఏపీఐఐసీ చైర్మన్ బీపీ ఆచార్య, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ లు ఓ పెద్ద వ్యవహారం చక్కబెట్టేశారు. కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ సంస్థకు అప్పనంగా ఎలాంటి ఒప్పందపత్రం లేకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4700 ఎకరాలు నెల్లూరు జిల్లాలో కట్టబెట్టేశారు. వైఎస్ కు సన్నిహితంగా ఉండే కృష్ణపట్నం పోర్టు గ్రూపు అధినేత విశ్వేశ్వరరావు కుమారులు శ్రీధర్, శశిధర్ లు కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ కు డైరెక్టర్లు. ఆ తరువాత వైఎస్ హయాంలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఆగస్టులో పదవీ విరమణ పొంది 2009 అక్టోబర్ 14న అంటే పదవీ విరమణ చేసిన రెండు నెలలకే అందులో ఎండీగా చేరిపోయారు.2005లో ఈ సంస్థ నమోదుకాగా 2008 మేలో డైరెక్టర్లు శ్రీధర్, శశిధర్ లు తప్పుకున్నారు. వారి స్థానంలో జగన్ సన్నిహితులు సజ్జల దివాకర్ రెడ్డి, నర్రెడ్డి గంగిరెడ్డిలు వచ్చారు. ఆ తరువాత జులై 25న హరీష్ సి కామర్తి, జెజె రెడ్డి అనే మరో ఇద్దరు జగన్ సన్నిహితులు చేరారు. ఇక 2009 సెప్టెంబర్ 2న వైఎస్ అనుకోని ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ అభిమానులు ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. ఇది ఒకవైపు జరుగుతున్న సంఘటన అయితే వైఎస్ చనిపోయిన నెల 17 రోజులకు అంటే అక్టోబరు 19న వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మెజారిటీ షేర్లు కొనుగోలు చేసి ఈ సంస్థకు యజమాని అయిపోయారు. మరి ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ వ్యవహారం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

త్వరలో మరో ‘టీ’ పార్టీ

  తెరాస మరియు దాని అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులపై తరచూ ఎన్ని ఆరోపణలు వస్తున్నపటికీ, తెలంగాణా పోరాటానికి వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా చలామణి అవుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.   ఇటీవల అటువంటి ఆరోపణలతోనే ఆ పార్టీ నుండి బహిష్కరింపబడిన రఘునందన్ రావు, తిరిగి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేయడం, ఆ తరువాత వారిరువురూ సవాళ్లు ప్రతిసవాళ్ళు చేసుకోవడం, రఘునందనుడు నేరుగా సీబీఐకి వెళ్లి ఏవో కాగితాలు సమర్పించడం, పరువు నష్టం దావాలంటూ హరీష్ రావు రంకెలేయడం వగైరా ఎపిసోడ్స్ అన్నీ చకచకా జరిగిపోయిన తరువాత, అమాయక ప్రజలకి ఈ సీరియల్లో అసలు హీరో ఎవరో, విలన్ ఎవరో తెలుసుకోక ముందే సీరియల్ ఏవో చెప్పలేని అనివార్య కారణాల వల్ల అర్ధంతరంగా ముగిసిపోయింది. కనీసం తరువాత ఎపిసోడ్ లోనయినా ఆ సస్పెన్స్ వీడుతుందో లేదో అని సీరియల్ జీవితానికి అలవాటుపడిన జనాలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.   అయితే, మీడియా ముందు గుక్క తిప్పుకోకుండా మాట్లాడే రఘునందనుడు, ఏ కోర్టు గడప దగ్గరో లేక ఏ మీడియా గుమ్మంలోనో ఎదురయి మిగిలిన సీరియల్ కంప్లీట్ చేస్తాడని ఆశిస్తున్న ప్రజలు ఆశలు అడియాసలు చేస్తూ, ఆయన అనుచరులు అకస్మాత్తుగా డిల్లీలో ఎలెక్షన్ కమీషన్ ముందు ప్రత్యక్షమయినట్లు సమాచారం. త్వరలో ఆయన కూడా ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టుకొని, కేసీఆర్ లాగే ఉద్యమాలు చేసుకొందామని డిసైడ్ అయినట్లు సమాచారం.   కానీ, కేసీఆర్ పద్దతి కంటే ‘గుర్ఖాల్యాండ్’ తరహాలో ఉద్యమాలు చేసుకోవడం మంచిదని ఆయన డిసైడ్ అయినట్లు, అందువల్ల తన కొత్త పార్టీకి అదే స్టయిల్లో ‘తెలంగాణా ముక్తి మోర్చా’ అని పేరు ఖాయం చేసుకొనట్లు సమాచారం.కానయితే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ డిల్లీలో మళ్ళీ పెద్దల మేళా పెట్టుకొని ఇక నేదో రేపో తెలంగాణా ప్యాకేజి ఇచ్చేస్తోందని అందరూ చెప్పుకొంటున్న ఈ తరుణంలో ఆయన పార్టీ లాంచింగ్ వల్ల ఏమయినా లాభం ఉంటుందా లేదా అనేది ఆయన ఆలోచించుకోవాలి.

గవర్నర్ పై మండిపడ్డ కేకే

    తెలంగాణ ప్యాకేజీలకు సంబంధించి గవర్నర్ నరసింహన్ కేంద్రంలో మాట్లాడారన్న ప్రచారం నేపధ్యంలో మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ నేత కే కేశవరావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులే కీలకమని, గవర్నర్‌ కేవలం రాష్ట్రపతి ఏజెంట్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయాలను అణగతొక్కాలను కోవడం రాజ్యాంగానికి విరుద్ధమని గవర్నర్ పై కేకే విమర్శలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప..ప్యాకేజీలకు అంగీకరించేది లేదు అని కేకే స్పష్టం చేశారు. అధిష్టానం ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకోకుంటే… తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెంటనే బయటకు రావాలి అని కేకే పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో పదవి విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు అని కేకే ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

టీఆర్ఎస్ తేలుకుట్టిన దొంగలా ఎందుకుంది!

      టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశాంతంగా కూర్చోవడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణపై తీర్మానం అంటూ నిన్నటి వరకు రాద్దాంతం చేసి.. ఇప్పుడు ఎందుకు మౌనంగా కూర్చున్నారని మోత్కుపల్లి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే. తారక రామారావు సెటిల్‌మెంట్ దందాపై కథనం రావడంతో టీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. కెటిఆర్ కోసం తెలంగాణవాదాన్ని పక్కన పెట్టారన్నారు.కెసిఆర్ కుటుంబం మరో నిజాంను తలపిస్తోందన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు మరోసారి బయటపడిందన్నారు.చరిత్రలో ఏ ఉద్యమకారుడు అయినా ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్నారని, కెసిఆర్ మాత్రం ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు.

సోనియా తలుచుకుంటే తెలంగాణ: జానా రెడ్డి

      కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తలుచుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికయినా ఇవ్వకతప్పదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతల సంతకాలు తీసుకున్నమని.. సంతకాలు పెట్టని వారి పేర్లు ఈ నెల 30న జరిగే నిజాం కళాశాల బహిరంగసభలో వెల్లడిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మూడున్నర కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే మూడున్నర కోట్ల జనం ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెంచాలని అధిష్టానాన్ని కోరామని అని తెలిపారు.