చర్చలు, దోశలు తరువాత ఇప్పుడు ప్యాకేజి కధ

  తెరాస మరియు టీ-కాంగ్రెస్ నేతల రియాక్షన్ తెలుసుకోవడాని కోసమన్నట్లు ‘తెలంగాణా ప్యాకేజి’ మ్యాటర్ ని కాంగ్రెస్ పార్టీ మీడియాకి లీకేజ్ చేయగానే, ఊహించినట్లే ఇక్కడ నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దానితో మళ్ళీ కొందరు కాంగ్రెస్ నేతలు ‘అవ్వన్నీ గాలి వార్త’లంటూ ఖండనలు పడేసారు. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఎక్కడ ఇచ్చేస్తుందో అని హడలి చచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ ప్యాకేజీ కబురు చెప్పగానే ‘అమ్మ కడుపు సల్ల గుండ!’ ‘నా ఉద్యమం సల్ల గుండ!’ అని వీపు రాసుకొని, ప్రకటన వెలువడగానే చేయవలసిన ముఖ్యమయిన పనులు అంటే ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తా రోకోలు, బందులు వంటి కార్యక్రమాలకి షెడ్యుల్ నిర్ణయించేందుకు కేసీఆర్ తన వాళ్ళతో ఓ మీటింగేసుకొన్నాడు. పనిలో పనిగా ‘కాంగ్రెస్ కి బొందపెట్టుడు, భూమిలోపాతిపెట్టుడు’ వంటి పిల్లి శాపాలకు, ప్రాస బాగా కుదిరిందని ‘ప్యాకేజ్ అంటే ప్యాక్ చేసుడే’ అనే పంచ్ డైలాగు కూడా కొత్తగా యాడ్ చేసుకొన్నారు.   అటు కాంగ్రెస్ ప్యాకేజి ప్రకటించగానే, ఇటు తను పార్టీ టికెట్స్ పంచడం మొదలుపెడితే మరికొన్ని కాంగ్రెస్ చేపలను ఈ సారి వలలో వేసేయోచ్చునని ఆయన ఆశ. తద్వారా హోం సిక్కుతో బెంగ పెట్టుకొన్న కేశవ్ రావు, వినోద్, మందా వారికి పార్టీలో కొంచెం కంపెనీ దొరికితే హోమ్లీగా ఉంటుందని కేసీఆర్ ఆలోచన.   అయితే, కాంగ్రెస్ పార్టీ ఆలోచన వేరేలా ఉంది. ప్రస్తుతం టీ-కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరిపోయినప్పటికీ, ఏదో ఒకరోజున కేసీఆర్ నోటికి బలయినప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికే తిరిగి వస్తారనే ధీమా ఉంది. లేకుంటే, ఎన్నికల వరకు ఈ ప్యాకేజి గేం షో ఇలాగే కంటిన్యూ చేసుకొంటూ పోయి, సరిగ్గా ఎన్నికల గంట కొట్టగానే, తెలంగాణా మీద ఏదో ఒక సానుకూల ప్రకటన చేసేసి ‘సహేంద్ర తక్షకాయిస్వాహా’ అన్నట్లుగా కేసీఆర్తో సహా మొత్తం అందరినీ కాంగ్రెస్ మహా సముద్రంలో కలిపేసుకొంటే బెటరేమోనని కాంగ్రెస్ దురాలోచన. ఏమయినప్పటికీ, ఎన్నికల గంట మ్రోగేవరకు ఈ డ్రామాలు అందరూ కంటిన్యూ చేసికోవడం మాత్రం ఖాయం.

కేధార్ నాథ్ స్టేట్ బ్యాంకులో రూ.4.25కోట్లు గంగ పాలు

  ఒకవైపు ఉత్తరాఖండ్ ను హటాత్తుగా ముంచెత్తిన వర్షాలతో వేలాది మంది మృత్యువుతో పోరాడుతుంటే, వారిని రక్షించేందుకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ, అనేక వేల మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్దులు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడపడితే అక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నశవాలను చూస్తే మనిషన్న వాడికి గుండె కరిగి కన్నీరవక మానదు. కానీ, మానవులలో దానవులు ఎప్పుడూ పొంచి ఉండనే ఉంటారు. చనిపోయిన వారి ఒంటి మీద ఉండే బంగారు, వెండి వస్తువులను ఒలుచుకొనే ప్రయత్నంలో కొందరు దుండగులు, కత్తులు గొడ్డళ్ళతో శరీర భాగాలను నరికి మరీ ఆభరణాలు వలుచుకు పోతునట్లు సమాచారం.   ఇక, కేదార్ నాథ్ మందిరానికి దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏకంగా రూ.5కోట్లు మాయమయ్యాయి. వరదలు రాక మునుపు ఉన్న డబ్బు, తగ్గిన తరువాత కనబడలేదు. కేదార్ నాథ్ మందిరం కమిటీ సభ్యుడు రాజ్ కుమార్ చెప్పిన దాని ప్రకారం, వరదలు ముంచుకు రాగానే, బ్యాంక్ సిబ్బందితో సహా అందరూ ప్రాణాలు రక్షించుకొనేందుకు పక్కనే ఉన్న గుడిలోకి పరుగులు తీసారు. అప్పటికి, బ్యాంక్ లో రూ.5కోట్ల నగదు ఉన్నట్లు ఖచ్చితమయిన లెక్కలున్నాయి. అయితే వరదల దాటికి బ్యాంకులోకి కూడా నీరు ప్రవేశించడంతో లోనున్నకంపూటర్లు, బల్లలు వంటి వాటితో సహా నగదు మొత్తం కొట్టుకుపోయింది.   అయితే ఆ సమీపంలో ఉన్న కొందరికి డబ్బు కట్టలు దొరికినట్లు ఆయన చెప్పారు. వరద ఉద్రుతి తగ్గిన తరువాత ఒక యువకుడు ఆర్మీ హెలికాఫ్టర్ లో ఎక్కబోతుండగా, అనుమానం వచ్చిన అధికారులు అతని బ్యాగులు తెరిచి చూస్తే అందులో రూ.83లక్షల నగదు దొరికింది. అయితే ఆ వ్యక్తి ఆ నగదు గురించి అడిగినప్పుడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతనిని అధికారులు పోలీసులకి అప్పగించారు. ఉత్తరాఖండ్ డీజీపీ సత్యవ్రత్ బన్సాల్, మీడియాతో మాట్లాడుతూ ఆ డబ్బు బ్యాంకు నుండి మాయమయినదేనని దృవీకరించారు.   బ్యాంకు అధికారులు మిగిలిన నోట్ల సంఖ్యలు కూడా మీడియాకు విడుదల చేసి, ఎవరికయినా ఆ డబ్బు దొరికినట్లయితే బ్యాంకుకు అందజేయాలని కోరారు. అయితే, మిగిలిన నాలుగు కోట్ల పాతిక లక్షలు గంగ పాలు అయిందో లేక ఎవరికయినా దక్కిందో తెలియదు కానీ, ఈ వార్త మాత్రం కేధార్ నాథ్ లో ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.   కేధార్ నాథ్ మందిరం రోజూవారి ఆదాయం రూ.1లక్ష రూపాయలను ఏరోజుకారోజు సాయంత్రం బ్యాంకులో జమా చేస్తుంటారు. బ్యాంకులో కేవలం రూ.2.5కోట్లు మాత్రమే నిలువ చేసే అవకాశం ఉండగా, ఆ రోజు మాత్రం మెయిన్ బ్రాంచీకి డబ్బు తరలించ లేకపోవడంతో బ్యాంకులో ఉన్న రూ.5కోట్లు నగదు గంగ పాలయింది. ఇప్పడు ఆ డబ్బులో కేవలం రూ. 83లక్షల మాత్రమె దొరికింది. మిగిలినది దొరుకుతుందనే నమ్మకం కూడా లేదు.

చిదంబరం, షిండేల పై 420 కేసు

      కేంద్ర మంత్రులు చిదంబరం, సుశీల్ కుమార్ షిండేల 420 కేసు నమోదైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పై కేంద్ర హోం మంత్రులుగా వున్న వారు ఇచ్చిన మాటను మార్చారని, హామీలను విస్మరించారని రంగారెడ్డి జిల్లా కోర్టులో తెలంగాణ వాదులు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో వారిపై 420 కేసు నమోదు చేశారు. 2009 డిసెంబర్ 9వ తారీఖు కేందమంత్రి చిదంబరం తెలంగాణపై చేసిన ప్రకటనను, అదే నెల 23న వెనక్కి తీసుకున్నారు. గత ఏడాది డిసెంబరు 28న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం చెబుతామని ప్రకటించారు. ఆ తర్వాత ఇంత వరకు తెలంగాణ మీద ఎటూ తేల్చలేదని తెలంగాణ వాదులు పిటీషన్ లో పేర్కొన్నారు.

పరమాత్ముడు తీర్చలేని బాధ

అందమైన హిమాలయాలు అందాలన్నీ చీరగా చుట్టుకుని కనువిందుగా మురిపించాయ్, రా రమ్మని ఆహ్వానించాయ్...   ఆ పరమాత్ముడు ముక్తినిస్తాడంటూ... నమ్మబలికాయ్ ఆశతో ఒడి చేరి ఆనందంలో మునిగి తేలుతున్నవారందరిని దయదాక్షిణ్యాలు లేకుండా ముంచేసాయ్... శవాలుగా మార్చేసాయ్ ఒకటా రెండా ఇన్ని వేల ప్రాణాలు పట్టుకుపోయి ఏ స్వామి గుమ్మానికి తోరణాలల్లుతున్నాయో... కళ్ళ ముందే అయినవారి ప్రాణాలు నీటిలో కలిసిపోతుంటే ఏమి చేయలేని వారిగుండె కోత.... ఒకరి కన్నకొడుకు, ఒకరి కన్నతల్లి, మరొకరి భార్య, ఇంకొకరి భర్త ఇలా బంధాలని, అనుబంధాలని తెంచుకుని నీటిలో కలిసి పోయాయ్... కన్నీరుని మిగిల్చిపోయాయ్... ఏ "నాథుడు" ఆ అవిసిన గుండెల భాదని తీర్చలేదు... తీర్చలేడు. ....రమ  

కమల రథసారధి దూకుడు

        ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక నరేంద్రమోడి స్పీడు పెంచారు.. ముందు తన ఎన్నిక కాస్త అసంతృప్తి చెలరేగిన బిజేపి పెద్దల సపోర్ట్‌తో పాటు తన రాజకీయ చతురతతో అన్ని అవాంతరాలను అధిగమించారు. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారం కోసం ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తన ప్రచార వ్యూహానికి తొలి వేదికగా ఎన్డీఏ అకాలీదళ్ అధికారంలో ఉన్న పంజాబ్‌ను ఎంచుకున్నారు.. పథాన్ కోట్ జిల్లాలోని మధోపూర్ బీజేపీ అధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో యూపీఏ సర్కార్ పై మోడీ నిప్పులు చెరిగారు. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడానికి ప్రతి అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటున్న మోడి ఉత్తరాఖండ్‌ వరదలను కూడా వదలలేదు.. ఈ సమయంలో దేశ ప్రజలంతా బాధితులకు అండగా నిలవాలని మోడీ పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ లో దేవాలయాల పునర్మిణానికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

జైల్లో పెట్టినా జగన్ మారలేదే!

  “పార్టీలో నీ అంతటి మొనగాడు మరోడు లేడు. నువ్వెంతంటే సోనియామ్మకి అంతే! ఆమె నీ మాట కాదనదని” అసమ్మతి నేతలందరూ కలిసి పార్టీలో కొత్తగా చేరిన చిన్నజీవిని ఎగదోస్తే వారి మాటలు నిజమేననుకొని, మెగాజీవి హడావుడిగా విమానం పుచ్చుకొని డిల్లీలో వాలిపోయి ‘కిరణ్ కుమార్ రెడ్డి ఈజే వెరీ బ్యాడ్ బాయ్’ అని సోనియమ్మకు క్లాసు పీకబోయాడు. అయితే, ఆమె వెంటనే ‘కిరణ్ ఈజే గుడ్ బాయ్’ అని ఆయన ఇదివరకు ఇచ్చిన సర్టిఫికేట్ ను సొరుగులోంచి తీసి చూపించి ‘మరి దీని సంగతేమిటి?’ అంటూ ఎదురు ప్రశ్నించడమే కాక, ‘ఏడాది తిరక్కుండానే అప్పుడే పార్టీ నీరు ఇంతగా వంట బట్టించుకోవడం ఆరోగ్యానికి హానికరం’ అని గట్టిగా హెచ్చరించడంతో, మళ్ళీ అదే విమానంలో హైదరాబాద్ వచ్చిపడ్డాక మళ్ళీ నిన్నటివరకు ఆయన పబ్లిక్కి దర్శనం ఈయలేదు.   అయితే రాజకీయ నాయకుడన్నాక ఇటువంటి తిట్లని, విమర్శలని ఖద్దరు చొక్కా క్రింద మడతేసి మరిచిపోవాలని గ్రహించిన కేంద్రమంత్రి గారు, మళ్ళీ మరో కొత్త ఖద్దరు చొక్కా ఒంటికి ఎక్కించుకొని, నిన్న గుంటూరులో ఏరువాక కార్యక్రమానికి వచ్చి తన ఉపన్యాసంతో జనాలని కుమ్మేశారు.   పనిలో పనిగా, ఎవరేమన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బోనులో ఉన్నపులిలా పడున్న జగన్ మోహన్ రెడ్డి మీద నాలుగు రాళ్ళు వేసి తన కసి తీర్చుకొన్నాడు. ‘జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినా కూడా అతని పద్దతుల్లో మార్పు కనిపించడం లేదని, అతనికి సత్ప్రవర్తన అబ్బట్లేదని’ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, ‘పులి ఎక్కడ ఉన్నా పులే!’ అని చెల్లెమ్మ షర్మిల చెవిన ఇల్లు కట్టుకొని పోరుతున్నపటికీ ఆయనకి ఎందుకు అర్ధం కావట్లేదో అని జనాలు ఆశ్చర్యపోయారు.   ఇక, ఒంటి చేత్తో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ, ఆ సంగతిని పార్టీలో తన రామచంద్రుడు తప్ప మరెవరూ ప్రస్తావించలేదు. ప్రస్తావించడం సంగతి దేవుడెరుగు, కనీసం గుర్తించను కూడా లేదు. దానితో మనసు నొచ్చుకొన్నమంత్రిగారు కృతజ్ఞతలేని ఈ కాంగ్రెస్ నేతలకి ఓ మంచి మాటనడానికి కూడా నాలిక రాదని ఆవేదన చెందారు. అటువంటి వారిని నమ్ముకోవడం కంటే, స్వయంగా ఆ పనేదో మనమే చాటింపు వేసుకొంటే తప్ప జనాలు కూడా బొత్తిగా పట్టించుకొనే పరిస్థితి లేదని భావించి, ఏరువాకలో కర్ణాటక ఎన్నికల గురించి మాట్లాడారు.   అయితే పంటలకి కర్ణాటక ఎన్నికలకీ ఎటువంటి లింకూ లేదని గ్రహించిన తరువాత, మొన్న డిల్లీ వెళ్లి ముఖ్యమంత్రిని తిట్టిన సంగతి కూడా మరిచిపోయి, ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల, వ్యవసాయానికి తగిన సాయం అందుతుందని, అప్పుడు వ్యవసాయం కూడా లాభసాటిగా మారుతుందని,ఆయన గ్యారంటీ ఇచ్చారు.   ఈ మాటలన్నీ ఎందుకు? అదేదో సినిమాలో మీరు పాటందుకోగానే టపటపా వానపడిపోయినట్లు, మళ్ళీ ఇప్పుడు కూడా ఏదయినా పాటందుకొని నాలుగు వానలు కురిపిస్తే మా తిప్పలేవో మేమే పడతాము కదా అని రైతులు గొణుకొన్నారు.అయితే, అదేమి పట్టించుకోని ఆ పెద్దాయన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తాను, కొంచెం శ్రమ పడవలసి ఉన్నపటికీ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించక తప్పదని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ హాట్రిక్ ఖాయం: చిరంజీవి

      2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హాట్రిక్ సాధించడం ఖాయమని చెబుతున్నారు కేంద్రమంత్రి చిరంజీవి. కాంగ్రెస్ సినియర్ నేతలే తమ పార్టీ గెలవడం కష్టమని చెబుతుంటే, చిరంజీవి మాత్రం పట్టనట్టుగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని అంటున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన మీడియా వర్గాల సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ పరువు నిలబడే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నాయి. మెగాస్టార్ మాత్రం 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తుందని చిరంజీవి అంటున్నారు. మరి చిరంజీవి ఏదో మాట వరసకు అన్నారో లేక నిజంగానే ఆయన  దీనిపై విశ్వాసంతో ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇప్పుడు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో చిరు విజయం పై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు తమ పార్టీ విజయానికి దోహదపడుతాయని ఆయన అన్నారు.

జలసర్పానికి 5000 మంది బలి

      చార్‌దామ్‌ యాత్రలో విషాదాల పరంపర కొనసాగుతూనే ఉంది.. వరద తగ్గిన చోట్ల శవాలు గుట్టలుగా తేలుతున్నాయి.. కేదారేశ్వరుడి ఆళయంతో సహా ఆ ప్రాంతం అంతా స్మశానంలా కనిపిస్తుంది.. ఎక్కడ చూసిన మానవ మృతదేహాలు శిథిలాలతో భయకర పరిస్థితులు కొనసాగుతున్నాయి.. వీటికి తోడు ఇంకా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది..   సహాయక చర్యల్లో సైన్యం ఎంతగా శ్రమిస్తున్నా.. ప్రభుత్వ వైఫల్యాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి.. ఇప్పటి వరకు మృతులు వందల్లోనే అంటూ అధికారులు ప్రకటిస్తూనా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఈ సంఖ్య ఐదు వేలకు పైనే అంటున్నారు..   ఇదిలా ఉంటే ఇంకా 12వేల మందిపైగా యాత్రికలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నారు.. వారిని రక్షించటానికి సైన్యం తీవ్రంగా శ్రమిస్తుంది.. కాని అక్కడికి చేరుకోవటానికి సరైనా రవాణ వ్యవస్థ లేకపోవటం, హెలికాప్టర్లో చేరడానికి వాతావరణం సహకరించకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో యాత్రికుల్లో చాలా మంది ఆఖలిదప్పులతో అలమటిస్తున్నారు..  

పవర్‌ కోసమే కెసిఆర్‌ పాట్లు

      ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది కెసీఆర్‌ పై విమర్శల వాడి కూడా భారీగా పెరుగుతుంది.. విపక్షాల నుంచే స్వపక్షం నుంచి కూడా కెసీఆర్‌ పై ఆరోపణలు వస్తున్నాయి.. జెఏసిని తన చెప్పు చేతల్లో పెట్టుకొని ఫామ్‌ హౌజ్‌ నుంచే ఉద్యమాన్ని నడుపుతున్న కెసిఆర్‌ మిగిలిన తెలంగాణ పక్షాలను కలుపుకుపోవడంతో విఫలమవుతుండటంతో ఈ విమర్శలు మరింత పదునెక్కుతున్నాయి..   తాజాగా మరో తెలంగాణ వాది ప్రజాగాయకుడు గద్దర్‌, కెసిఆర్‌పై తీవ్రవిమర్శలు చేశాడు. కేవలం అధికారం కోసమే కెసీఆర్‌ తెలంగాణ పోరాటం చేస్తున్నారని విమర్శించారు.. తెలంగాణ సాధన కోసం కృషి చేయాలని కాకుండా 100 అసెంబ్లీ స్థానాలు, 16 లోక్‌సభ స్థానాలు సాదించాలని కార్యకర్తలకు పిలుపునివ్వడమే దీనికి నిదర్శనం అన్నారు గద్దర్‌..   అంతేకాదు 100 స్థానాలకు పైగా సాదిస్తేనే తెలంగాణ సాధ్యమన్న మాటలతో తెలంగాణ శత్రువులు మరింత బలపడ్డారన్నారు..

వైసిపికి మరో ఎదురుదెబ్బ

      వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వాళ్ల నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి కి బెయిల్‌ రాక, ఎటూ పాలుపోని పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు ఈసీ నిర్ణయం మరో దెబ్బ పడింది.   రాజీనామ చేసి వైసిపి తరుపున గెలిచి జనాల్లో తమ పార్టీకున్న ఇమేజ్‌తో పాటు, అసెంబ్లీలో తమ బలం పెంచుకోవాలనుకున్న నాయకులకు నిరాశే మిగిలింది.. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేనందున ఇప్పట్లో ఇక ఉప ఎన్నికలు నిర్వహించేది లేదంటూ ప్రకటించారు ఈసి సంపత్‌..   గత  అసెంబ్లీ సమావేశాల్లో పెట్టిన అవిశ్వాస తీర్మాణానికి మద్దతుగా కాంగ్రెస్‌ నుంచి తొమ్మిది మంది, టిడిపి నుంచి ఆరుగురు ఎమ్మేల్యేలు పార్టీ విప్‌ను దిక్కరించి ఓటు వేశారు.. దీంతో ఆ పార్టీలు విప్‌ దిక్కరించిన సభ్యులపై వేటు వేయాలని కోరాగ ఇటీవలే వారిని అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు.. దీంతో కాలీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ సదరు సభ్యులు చాలా రోజులుగా కోరుతుండగా ఈసి నిర్ణయంతో వారంతా కంగుతిన్నారు..

తెలంగాణాపై రాజకీయ పార్టీల చదరంగం

  తెలంగాణా ప్రజల భావోద్వేగాలకు సంబందించిన సున్నితమయిన తెలంగాణా అంశం, తెరాసతో సహా అన్ని రాజకీయ పార్టీలకి ఇప్పుడు ఒక రాజకీయ లబ్ది చేకూర్చే ఒక ఆయుధంగా మారిపోయింది.   తెలంగాణా అంశాన్ని ఉపయోగించుకొని, రాబోయే ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుచుకొని తెరాస రాష్ట్రంలో, కేంద్రంలో చక్రం తిప్పాలని కలలు గంటుంటే, కాంగ్రెస్ పార్టీ ఒకసారి చర్చలు, మరొకసారి దోశలు, మరొకసారి ప్యాకేజీలు అంటూ కాలక్షేపం చేస్తూనే, ఎలాగయినా రాబోయే ఎన్నికలలో తెలంగాణాలో మళ్ళీ విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవాలని కోర్ కమిటీ వ్యూహాలు రచిస్తోంది.   ఇక్కడ తెలంగాణా ప్రాంతంలో కొంచెం హడావుడి మొదలవగానే, అక్కడ డిల్లీలో కోర్ కమిటీ సమావేశాలు మొదలయిపోతాయి. కానీ, వాటి వల్ల తెలంగాణాకి మాత్రం ఒరిగేదేమీ ఉండదు. తెలంగాణాకి ప్రత్యేక ప్యాకేజ్ అంటూ కాంగ్రెస్ అధిష్టానం మీడియాకి ఒక గాలి వార్త లీక్ చేసి తెలంగాణావాదుల రియాక్షన్ కోసం ఎదురు చూస్తుంటే, కొన్ని రోజులు రాజీనామా డ్రామాలు, మరి కొన్ని రోజులు పార్లమెంటు మెట్ల మీద ధర్నాలు చేసిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు, మళ్ళీ ఇప్పుడు 30వ తేదీన బహిరంగ సభ అంటూ హడావుడి చేస్తూ తమ ఉనికిని కాపాడు కొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు.   ఇక, తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చామని చెప్పుకొంటున్న తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు ఏనాడు కూడా ప్రత్యేక తెలంగాణా గురించి స్పష్టంగా మాట్లాడింది లేదు. అయినప్పటికీ, తాము కూడా ఈ ‘తెలంగాణా ఆటలో’ వెనుకబడి పోకూడదని ‘బయ్యారం మొదలుకొని చలో అసెంబ్లీ’ వరకు ఏ అవకాశాన్ని ఆ పార్టీ జారవిడుచుకోలేదు. అలాగని ప్రత్యేక తెలంగాణా కావాలని చంద్రబాబు ఏనాడు కోరలేదు కూడా.   ఇక, వైకాపా సంగతి సరే సరి! రాష్ట్రాన్ని ఏలేద్దామని రంగంలోకి దూకిన ఆ పార్టీ తెలంగాణా అంశంపై తమ అభిప్రాయం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అదేవిషయం గురించి తెలంగాణా ప్రజలు నిలదీస్తుంటే, ‘జగనన్న వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడు’ అంటూ అసందర్భ సమాధానాలతో తెలంగాణాలో పార్టీని నిలుపుకోవాలని తిప్పలు పడుతున్నారు.   ఇక, బీజేపీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు విస్పష్టంగా తన మద్దతు ప్రకటించడమే గాకుండా ఉద్యమాలు కూడా చేస్తోంది. అయితే ఆ పోరాటాల ద్వారా తెలంగాణా ప్రజల మనసు గెలుచుకొని, తెలంగాణా ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ ముఖ్యోదేశ్యం. అంటే, బీజేపీకి కూడా తెలంగాణా అంశం రాజకీయ లబ్ది చేకూర్చే అంశంగానే భావిస్తోందన్నమాట.   తెలంగాణా అంశం ఎంత సున్నితమయినదో, అంత బలమయినదని తెరాస కనిపెట్టినప్పటి నుండి, రాజకీయ పార్టీలకు అదొక రాజకీయ ఆయుధంగా మారిపోయింది. ఎవరికి అవసరమయినట్లు దానిని తమ అవసరాలకు అనుగుణంగా వాడుకొంటున్నారు తప్ప దానివల్ల ప్రజల మనోభాలు ఎంతగా గాయపడతాయో ఎవరికీ పట్టడంలేదు. సున్నితమయిన తెలంగాణా అంశం ఈవిధంగా రాజకీయ పార్టీలకు ఆట వస్తువుగా మారిపోవడానికి ప్రధాన కారణం, తెలంగాణా నేతలలో చిత్తశుద్ధి లేకపోవడమే. సంకల్ప బలం లేని నేతలు, అందుకు వేరెవరినో నిందిస్తూ తమకు అన్ని విధాల లబ్ది కుదిర్చేఈ రాజకీయ చదరంగం కొనసాగిస్తూనే ఉంటారు. వారిని సవరించి దారిన పెట్టుకోవలసిన బాధ్యత తెలంగాణా ప్రజలది, మేధావులదే.

కేసీఆర్ కుటుంబ౦ వల్లే ఆత్మహత్యలు

    కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ వాదాన్ని వాడుకోవడం వల్లే తెలంగాణవాదులు ఆత్మహత్యలు చేసుకున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. గతంలో తెలంగాణాపై అసెంబ్లీ తీర్మానం అవసంలేదని చెప్పి, ఇప్పుడు తెలంగాణ కోసం తీర్మానం చేయాలని టిఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతుందని అన్నారు. శాసనసభ లో తెలంగాణ తీర్మానం అంటూ టీఆర్‌ఎస్ ఆడుతున్న డ్రామాను రుజువు చేస్తానన్నారు. కేసీఆర్ పై తన అరోపణలు తప్పని రుజువు చేస్తే దేశం విడిచి వెళ్ళడానికి సిద్దమేనని ఆయన తెలిపారు. దమ్ముంటే తన సవాల్‌ను కేసీఆర్ కుటుంబ సభ్యులు స్వీకరించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సైంధవ పాత్ర టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు కుటుంబానిదేనని గోనె విమర్శించారు.

అలక పాన్పు దిగిన అద్వానీ

  నరేంద్ర మోడీకి పదోన్నతి కల్పించడంతో అలక పాన్పు ఎక్కిన పార్టీ సీనియర్ నేత అద్వానీ, పార్టీలో అందరు తన ముందు సాగిలపడిన తరువాత, బెట్టు చాలించి అలక పానుపు దిగారు. మొన్న ఆర్. యస్.యస్. అధ్యక్షుడు మోహన్ భగవత్ కూడా ఆయనకు వాస్తవ పరిస్థితులకనుగుణంగా నడుచుకోమని సున్నితంగా మందలించడంతో, అద్వానీ ఇంకా మళ్ళీ లైన్లో పడక తప్పలేదు.   అయితే, తన పెద్దరికం చాటుకొంటూ, మొన్న డిల్లీలో జరిగిన ఒక సభలోఆయన మాట్లాడుతూ, మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఇతర పార్టీలతో ఇప్పటి నుండే ఎన్నికల పొత్తులు కుదుర్చుకొని, ఎన్డీయే కూటమిని బలపరుచుకోవలసి ఉందని ఆయన సూచించారు. ఆ సూచన కొత్తగా పార్టీ ప్రచార కమిటీ పగ్గాలు చెప్పటిన నరేంద్రమోడీకి చేసిన సూచనని వేరే చెప్పనవసరం లేదు.   ఎన్డీయే కూటమి నుండి జనతాదళ్ (యు) తప్పుకోవడంతో, కూటమి జాతీయ స్థాయిలో బలహీనపడింది. అంతే కాకుండా నిన్నటి వరకు మిత్రుడిగా కలిసి పనిచేసిన నితీష్ కుమార్ ని, ఆయన జేడీ(యు)పార్టీని బీహార్ రాష్ట్రంలో ఎదుర్కోవలసి ఉంటుంది. నితీష్ కుమార్ గనుక వెళ్లి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే బీజేపీకి మరింత క్లిష్టపరిస్థితులు ఎదుర్కోక తప్పదు. గనుక, ఆ సమస్యలను పరిష్కరించుకోవలసిన బాధ్యత మోడీదేనని అద్వానీ చెప్పకనే చెప్పారు. తద్వారా మోడీకి కార్యాచరణ ప్రణాలికను కూడా ఆయనే సూచించి ఎలా నెగ్గుకు వస్తారో చూద్దామనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చును.

కోర్టు తీర్పుతో కంగు తిన్నరఘువీరా రెడ్డి

  పదవుల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడటం కాంగ్రెస్ కు కొత్తేమి కాదు. కొద్ది నెలల క్రితం జరిగిన సహకార ఎన్నికలలో విజయ బావుటా ఎగుర వేశామని టముకు వేసుకొన్న కాంగ్రెస్ పార్టీ, అందుకు ఎన్ని అడ్డుదారులు త్రొక్కిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా వైకాపా అధిపత్యం కనబరిచిన కడప జిల్లాలో, తెదేపా ఆధిఖ్యత గల గుంటూరు జిల్లాలోను కాంగ్రెస్ ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావు.   అనంతపురం జిల్లాలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ఎన్నికలలో మెజారిటీ పదవులను ఖాతాలో వేసుకొందామని అత్యాశకి పోయిన ఆ జిల్లా మంత్రి రఘువీరా రెడ్డి, బకాయిలు పడ్డ (డిఫాల్ట్) సంఘాలకు కూడా ఓటు హక్కు కల్పిస్తూ ప్రభుత్వం చేత ఒక జీ.ఓ. (నెం:839) జారీ చేయించుకొన్నారు. అనంతపురం జిల్లా కరువు వాత పడటం చేత కొన్ని సంఘాలు బకాయిలు చెల్లించలేకపోయాయని, అందువల్ల వాటికి ఓటు హక్కు కల్పిస్తూ జీఓ జారీ చేయించుకొన్నారు.   అయితే ఆ జీఓ కేవలం తన ఒక్క జిల్లాకి మాత్రమే వర్తించేలా జారీ చేయించుకొన్నారు. జిల్లాలో మొత్తం 54 డిఫాల్ట్ సంఘాలకు ఈ జీవో ద్వారా ఓటు హక్కు కల్పించి, తద్వారా అత్యధిక పదవులు కైవసం చేసుకోవాలని రఘువీరా ఆలోచన.   అయితే, మహబూబ్‌నగర్‌, కర్నూల్‌, కడప, చిత్తూరు జిల్లాల్లో కూడా ఈసారి కరువు భారిన పడ్డాయి. అందువల్ల ఆయా జిల్లాలో కూడా అనేక సంఘాలు బాకీలు తిరిగి చెల్లించలేక డిఫాల్ట్ సంఘాలుగా మిగిలిపోయాయి. అయితే, ప్రభుత్వం విడుదల చేసిన జీఓ వాటన్నిటికీ వర్తింపజేయకుండా కేవలం తన ఒక్క జిల్లాకే వర్తింపజేసుకోవడంతో, మిగిలిన జిల్లాలో డిఫాల్ట్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. కానీ, రఘువీరా వారి అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో, వైకాపాకి చెందిన సొసైటీ అధ్యక్షులు ఎల్‌.శివశంకర్‌రెడ్డి హైకోర్టులో ప్రభుత్వ జీవోకి వ్యతిరేఖంగా ఒక ఫిటిషన్‌ వేసారు. దానిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, డిఫాల్ట్‌ సంఘాలకు ఓటు హక్కు కల్పించకూడదని ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో రఘువీరారెడ్డి చేసిన దురాలోచన బెడిసి కొట్టింది.   డిఫాల్ట్‌ సంఘాలకు ఓటు హక్కు లేకపోవడంతో, అనంతపురం జిల్లాలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఎన్నికలలో పరిస్థితులు వైకాపాకి అనుకూలంగా మారిపోయాయి. రఘువీరా తలచిందొకటి కానీ జరిగింది మరొకటి. పదవిలో ఉండే కొందరు వ్యక్తులు తాము సమాజానికి, వ్యవస్థకి అతీతులమనే ధోరణి కనబరుస్తుంటారు. అటువంటి వారికి ఇటువంటి గుణపాటాలు తప్పనిసరి.

మతతత్వ ముద్రనే ఇష్టపడుతున్న బీజేపీ

  బీజెపీని ఎవరయినా మతతత్వ పార్టీగా అభివర్ణిస్తే ఆ పార్టీ నేతలు విరుచుకొని పడతారు. తాము తప్ప మిగిలిన పార్టీలన్నీ కుహనా సెక్యులర్ ముసుగులు ధరించి తిరుగుతున్నాయని వారు ఎద్దేవా చేస్తారు. అయితే, వారు హిందూమతానికి ప్రాతినిద్యం వహిస్తున్నసంగతిని ఎన్నడూ దాచిపెట్టుకొనే ప్రయత్నం చేయలేదు. దానిని అలుసుగా తీసుకొని కాంగ్రెస్, ఆ పార్టీపై మతతత్వ ముద్ర వేసి పబ్బం గడుపుకోవడం కూడా అందరికీ తెలిసిందే.   తన మతతత్వ ధోరణివల్ల బాబ్రీ మశీదు విద్వంసం జరిగినపుడు, దానికి ప్రధాన కారకుడయిన అద్వానీ ఏనాడు అందుకు పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. కానీ, అదే ధోరణి వల్ల గుజరాత్ రాష్ట్రంలో మారణ కాండ జరిగినందుకు కారకుడయిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పార్టీ అధికారం కట్టబెట్టాలని చూసినప్పుడు మాత్రం ఆయన తీవ్రంగా వ్యతిరేఖిస్తూ తన పదవులకి రాజీనామా చేసారు. అంటే ఒక మతతత్వ వాదిని మరొక మతతత్వవాది అసహ్యించుకొంటున్నాడన్న మాట. మరటువంటప్పుడు, ఇతర పార్టీలు వారు అసహ్యిన్చుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?   తను చేసిన తప్పులనే మోడీ చేస్తే సహించలేని అద్వానీ, ఇప్పుడు అంతకంటే ఘనుడయిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎన్డీయే కన్వీనర్‌గా ఉండాలని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆహ్వానించినపుడు ఏవిధంగా స్పందిస్తారు? బీజేపీ కంటే నాలుగాకులు ఎక్కువే చదివిన శివసేన కేవలం మత తత్వమే కాకుండా ప్రాంతీయవాదం కూడా నరనరాన్న జీర్ణించుకొని ఉంది. పొట్ట చేత పట్టుకొని వచ్చిన బీహారీలు, గుజరాతీలు, దక్షిణాది వారిని ముంబై నుండి తరిమేయాలని ఆ పార్టీ గతంలో చాలా సార్లు విఫలయత్నాలు చేసింది.   బాల్ టాక్రే వారసుడిగా శివసేన పగ్గాలు చేతబట్టిన ఆయనకూడా తండ్రి అడుగు జాదలలోనే నడుస్తూ, ముంబైయేతరులను బయటకి పంపాలని గట్టిగా వాదిస్తున్నారు. అటువంటి భావాలున్న ఉద్ధవ్ ఠాక్రేను ఎన్డీయే కన్వీనర్‌గా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కోరడం ద్వారా బీజేపీ తన మతతత్వ ముద్రను మరో మారు దృవీకరించుకొంటోందని చెప్పవచ్చును. తద్వారా తన కెదురయిన అవకాశాలను తానే జారవిడుచుకొంటోంది   బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మోడీ గురించి మాట్లాడుతూ “దేశాన్ని కలిపే నాయకుడే మనకి కావాలి తప్ప, విడదీసేవాడు అవసరం లేదని” అన్నారు. మరిప్పుడు బీజేపీ అధ్యక్షుడు స్వయంగా ఉద్ధవ్ ఠాక్రేకు హారతి పట్టిన సంగతి తెలిస్తే మరి ఆయన ఏమంటాడో?

దాసరి కి సీపీఐ నారాయణ సపోర్ట్

      బొగ్గు కుంభకోణంలో అసలు ముద్దాయి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. కానీ ఆయనను వదిలి మాజీ మంత్రి దాసరి నారాయణరావు మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని నారాయణ ప్రశ్నించారు. కేజీ బేసిన్ లో రిలయన్స్ గ్యాస్ దోపిడీ చేస్తుందని, భారత ప్రభుత్వాలు రిలయన్స్ కు దాసోహం అవుతున్నాయని ఆరోపిస్తూ సీపీఐ రిలయన్స్ ముందు ఆందోళన చేసింది. ఆ సంధర్భంగా ఆయన దాసరికి మద్దతుగా మాట్లాడారు. బొగ్గు కుంభకోణం కేసులో ఇటీవల దాసరి నారాయణరావును విచారించిన సీబీఐ ఇటీవల ఆయనకు చెందిన సంస్థల మీద, జిందాల్ కార్యాలయాల మీద సోదాలు జరిపి కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో దాసరికి మద్దతుగా ఎవరూ నిలవలేదు. అయితే ప్రత్యక్ష్యంగా ఇప్పుడు సీపీఐకి చెందిన రాష్ట్ర కార్యదర్శి నారాయణ పరోక్షంగా అండనివ్వడం విశేషం.

రత్తయ్యతో రాయపాటికి కన్నా చెక్ పెడతారా

  గ్రూపు రాజకీయాలకి, కుమ్ములాటలకి పెట్టింది పేరయిన కాంగ్రెస్ పార్టీలో ఏ పరిణామం జరిగినా దాని వెనుక ఏదో ఒక పెద్ద కధే ఉంటుంది. గుంటూరు జిల్లా వైకాపాకు చెందిన ప్రముఖ నేత రత్తయ్యని, అదే జిల్లాకు చెందిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి రప్పించగలుగారు. నిన్నఆయనను స్వయంగా వెంటబెట్టుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల సమక్షంలో పార్టీ తీర్ధం ఇప్పించి కాంగ్రెస్ కండువా కప్పించారు.   ఆయన రాకతో కాంగ్రెస్ పార్టీ బలపడటం సంగతి ఎలావున్నపటికీ, గుంటూరు జిల్లాలో రాయపాటి సాంభశివరావుతో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వైరం ఉన్న కన్నా లక్ష్మినారాయణ, ఆయన ధాటికి తాళలేకపోవడంతో తన వర్గం మరింత బలపడితే తప్ప ఆయనను ఎదుర్కోవడం కష్టమని భావించిన కన్నా లక్ష్మినారాయణ, వైకాపాలో ఇమడలేక ఇబ్బందిపడుతున్నరత్తయ్యని మెల్లగా పార్టీలోకి రాప్పించగలిగారు. ఇంతవరకు రాయపాటిదే పైచేయిగా సాగుతున్న గుంటూరు రాజకీయాలలో రత్తయ్యతో కలిసి కనా చక్రం తిప్పాలని భావిస్తున్నారు. అంతే గాక, వచ్చే ఎన్నికలలో రత్తయ్యకి గుంటూరు యంపీ టికెట్ ఇప్పించి రాయపాటి ప్రాభవానికి గండి కొట్టాలనే దూరాలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి దీనికి రాయపాటి ఏవిధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి. వీటినే కాంగ్రెస్-మార్క్ రాజకీయలంటారు.

అమ్మో .. 'రూపాయ్'

.....సాయి లక్ష్మీ మద్దాల       నేడు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థను వణికిస్తున్న ఒకే ఒక అంశం పెరిగిన డాలర్ రేటు. భారతదేశంతో పాటు మిగిలిన చాలా దేశాల కరెన్సీ విలువ పడిపోయింది. దీనికి కారణం ఏమిటి?ప్రపంచం మొత్తం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నా కూడా ఏమాత్రం చెక్కు చెదరని పటిష్టమైన ఆర్ధికవ్యవస్థ మన భారతదేశానిది అని ఢంకా బజాయించే మన నేతలంత నేటి ఈ పరిస్థితికి ఏమని సమాధానం చెప్తారు?అసలు ఈపరిస్థితికి కారణం ఏమిటి?రూపాయి విలువ పడిపోయిన వైనం ఒక్కరాత్రిలో జరిగినది కాదు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో దాదాపు 30%ఆర్ధిక వ్యవస్థ అమెరికా భాగస్వామ్యంలో ఉంది. ప్రపంచీకరణ నేపధ్యంలో విదేశీ వస్తువుల మీద మోజు పెరగటం,తద్వారా వాటి దిగుమతులు పెరగటం పరిపాటి అయిపోయింది. ఇది కుడా నేటి ఈ పతనానికి ఒక కారణం.     అమెరికా ఫెడరల్ బ్యాంకు ఉద్దీపన ప్యాకేజి పేరుతో ప్రతినెల ముద్రిస్తున్న 85 బిలియన్ డాలర్ల అధిక కరెన్సీని తగ్గిస్తాయన్న సంకేతాలు వెలువడి నప్పటి నుండి అంటే ఏప్రిల్ చివరి నుంచి రూపాయి పతనం వేగవంతమ్ అయింది. ఎక్కువగా విదేశీదిగుమతులపై ఆధారపడటం,కరెంట్ అకౌంట్ లోటు అధికంగా ఉండటం మూలాన భారతీయ కరెన్సీ ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటోంది. గడచిన 5సం "ల కాలంలో రూపాయి విలువ 50%నికి పైగా పడిపోయింది.2008లో    రూ॥ 39/- వద్ద ఉన్న డాలరు విలువ నేడు రూ60/-ల సమీపానికి చేరింది. దీనివలన దిగుమతులు మరింత భారమయ్యె  పరిస్థితి కనిపిస్తుంది. దీని వలన దేశ సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదముంది. అయితే ఆర్ధిక మంత్రి  ఇతర కొంతమంది ఆర్ధిక నిపుణులు దిగుమతులను కట్టడి చేయాలని చుబుతున్నారు. ఏ దిగుమతులను కట్టడి చేయాలి?ఎరువులా?క్రూడ్ ఆయిలా ?వ్యవసాయాధారితమైన భారతదేశానికి ఎరువుల అవసరం ఎంత ఉందొ అందరికి తెలిసినదే,క్రుడాయిల్ అవసరం మనదేశానికే కాదు అన్ని దేశాలకు ఉంది. తదనుగుణంగానే ఈరెండింటి దిగుమతి తప్పనిసరి. ఇక్కడ కట్టడి చేయగలిగిన దిగుమతి కేవలం ఒక్క బంగారం మాత్రమే. కరెంట్అకౌంట్ లోటును పుడ్చాలంటే తక్షణ చర్యలేవి?ప్రభుత్వం పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయలేదు. ఉన్న పెట్టుబడులన్నీ అవినీతి లోకి మళ్ళి పోయాయి. వ్యవసాయాధారిత దేశంలో నేటికి ఎరువులను దిగుమతి చేసుకున్తున్నామే గాని ఎరువులను ఉత్పత్తి చేయలేక పోతున్నాము. రూపాయి పతనం కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థలో ద్రవ్యం లభ్యత కఠినం అవుతుంది. భారత స్టాక్ మార్కెట్ కు బయటి నుండి నిధులు రావటం తగ్గిపోతుంది. రూపాయి విలువ నానాటికి క్షీణిస్తున్న దశలో ఇంధన సబ్సిడితో పాటు,ఎరువుల సబ్సిడీ కూడా అమాంతం పెరిగే ప్రమాదముంది. డాలర్ విలువ ఒక్క రూపాయి పెరిగితే ఇంధన ఖర్చు రూపంలో సంత్సరానికి 9000కోట్ల రూపాయల అదనపు భారం భారత ప్రజానీకం మీద పడుతుంది. ముఖ్యంగా రూపాయి పతనం కారణంగా పేద,మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారు. వంటనూనెల నుండి నిత్యావసర వస్తువులు,పెట్రోలియం ఉత్పత్తుల ధరలతో ప్రజానీకం విలవిల లాడే పరిస్థితి. దీనితో మధ్యతరగతి ప్రజల నెలవారీ ఇంటి బడ్జెట్ 15%నుండి 20%నికి పెరిగిపోతుంది.   నేడు భారతీయ ఆర్ధిక రంగం విలవిల లాడుతోంది. దీనికి కారణం,మన నేతలు ఎన్నో సంత్సరాలుగా చేస్తున్న తప్పుల ఫలిత మిది. ఓట్ బాంక్ రాజకీయాల కోసం ఎటువంటి పథకాలనైన అమలుపరిచే రాజకీయ యంత్రాంగం చేతకాని తనం,నిర్ణయ రాహిత్యం కారణంగా ఏర్పడిన సంక్షోభం ఇది. అర్ధం పర్ధం లేని పధకాల అమలు కారణంగానే ఆర్ధిక రంగం గాడి తప్పింది. దీనిని గాడిలో పెట్టాలంటే,ప్రభుత్వం చాలా విషయాల మీద దృష్టి సారించాలి. అందులో ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని అభివ్రిద్ది చేసి,తద్వారా ఉపాధిని కల్పించాలి. ఈకొద్ది మంది పెట్టుబడిదారుల ఆధిపత్యం కాకుండా పారిశ్రామిక వికేంద్రీకరణ చేపట్టాలి. ఇది కొంచెం దీర్ఘకాలిక ప్రణాళిక. ఇప్పటికిప్పుడు సత్వర నివారణ చర్యలు అంటే మన దేశం చేస్తున్న ఎగుమతులైన బాసుమతి బియ్యం ,వజ్రాలు,జౌళి ఉత్పత్తులు,రసాయనాలు,ఔషధాలు,ఇంజనీరింగ్ విడిభాగాలఉత్పత్తి,తదితర ఎగుమతుల పరిమాణం పెరగాలి. దానికి తగిన తోడ్పాటు,ప్రోత్సాహకం ప్రభుత్వం అందించాలి. ప్రభుత్వనిధులు పనికిమాలిన పధకాల కోసం కాక సక్రమమైన వాణిజ్య ఉత్పత్తుల కోసం ఖర్చు చేయ గలగాలి. ముఖ్యంగా ఓట్ బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి దేశ సంక్షేమానికి పెద్దపీట వేయగలిగితే,భవిష్యత్తులో మరోసారి ఇలాంటి విపత్తు బారిన పడకుండా దేశాన్ని కాపాడిన వారవుతారు. దేశ ప్రజలు కూడా రానున్న భవిష్యత్త్ ప్రయోజనాల రీత్యా పొదుపుకు పెద్ద పీట వేయాలి.

శంకరన్న పై మరో కేసు

      కాంగ్రెస్‌ మాజీ మంత్రి శంకర్రావుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.. హైకమాండ్‌ అండదండలతో జగన్‌ను జైలు పాలు చేసిన శంకర్రావు ఆ తరువాత పార్టీ నాయకులను కూడా పట్టించుకోకుండా అందరి మీద ఆరోపణలు మొదలుపెట్టాడు..   దీంతో పార్టీ పెద్దలు కూడా శంకర్రాపును పక్కన పెట్టారు.. అయితే తనకు సరైన విలువ దక్కటం లేదన్న శంకర్రావు ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డినే టార్గెట్‌ చేసి అనేక ఆరోపణలు చేశాడు.. దీంతో పార్టీకి దూరమయిన శంకర్రావు కేసులకు మాత్రం చాలా దగ్గరయ్యాడు. ఇప్పటికే భూకబ్జా కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్న శంకర్రావును.. కొడలు రూపంలో మరో కేసు వెంటాడింది.. తనను హెరాస్‌ చేస్తున్నారంటూ కొడలు వేసు వేసిన కేసు శంకరన్నతో పాటు ఆయన కుంటుంబానికి కూడా చుట్టుకుంది.. ఇదే వరుసలో ఆయన మెడకు ఇప్పుడు తాజాగా మరో కేసు చుట్టుకుంది.. గతంలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరి సియం, డిజిపిలపై అక్రమంగా సంపాదిస్తున్నారంటూ ఆరోపణలు చేసిన శంకర్‌రావుపై డిజిపీ కార్యాలయంలోని అసిస్టెంట్‌ ఐజీ ఆఫ్‌ పోలీస్‌ ఎం సుబ్బారావు కేసు ఫైల్‌ చేశారు..