కావూరి కొత్త పల్లవి

  తనకు కేంద్ర మంత్రి పదవి రాకపోతే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలు బెట్టి రాగానే ఈవిధంగా మాట మార్చడం గమనిస్తే ఆయనకు సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం ఒక రాజకీయ సోపానమే తప్ప దాని పట్ల ఎటువంటి నిబద్దత లేదని అర్ధం అవుతోంది. అయితే అంత మాత్రాన్నసమైక్యవాదిగా ఆయనకున్న ముద్ర చెరిగిపోదు గనుక కేంద్రం కూడా తెలంగాణావాదులను పక్కన బెట్టి సీమాంధ్ర నేతలకే ప్రాధాన్యత ఇస్తోందని అర్ధం అవుతోంది. ఇది పార్టీలో తెలంగాణా నేతలకు ఆగ్రహం తెప్పించవచ్చును. తెలంగాణా వాదన గట్టిగా వినిపించిన వారిని పార్టీలో పక్కన పెడతారనే అపవాదుని ఇప్పుడు కాంగ్రెస్ నిజం చేసి చూపినట్లయింది. దీనివల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేకపోయినప్పటికీ, ఇది క్రమంగా ఆ పార్టీని తెలంగాణాలో నిర్వీర్యం చేయడం ఖాయం. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవులాశిస్తున్న తెలంగాణా నేతలు ఇక ముందు తెలంగాణా అంశంపై మాట్లాడేందుకు వెనుకంజ వేయవచ్చును. దానిని అదునుగా తీసుకొని తెరాస తెలంగాణాలో పూర్తి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయవచ్చును. ఇక, కేంద్రం సమైక్యాంధ్ర నేతలకే ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణా నేతలని నిర్లక్ష్యం చేయడం గురించి కూడా బాగా ప్రచారం చేసుకొని ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందవచ్చును.

రాహుల్ కోసం మన్మోహన్ త్యాగానికి సిద్దం

  కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే సోనియా, రాహుల్ భజన తప్పనిసరి అని అందరికి తెలుసు. అయితే, సోనియా గాంధీ ఈ భజన కార్యక్రమానికి బాగా అలవాటుపడినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం దీనికి ఇంకా పూర్తిగా అలవాటుపడలేదు. అలాగని పార్టీలో వారి భజన కార్యక్రమం ఆగిపోలేదు. సాక్షాత్ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ కూడా ఈ భజన కార్యక్రమానికి మినహాయింపు కారని మరోమారు ఋజువు చేసుకొన్నారు.   నిన్న మంత్రివర్గ విస్తరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “రాహుల్ గాంధీ అన్ని విధాల సమర్దుడయిన యువనేత, జాతీయ నాయకుడు. ఆయన గనుక ప్రధాని పదవి చేప్పట్టదలిస్తే నేను ఆనందంగా తప్పుకొంటాను,”అని అన్నారు. ఆయన ఈవిధంగా మాట్లాడటం కొత్త కాకపోయినప్పటికీ, మళ్ళీ అకస్మాత్తుగా రాహుల్ ప్రధాని పదవి ప్రసక్తి తేవడం చూస్తే, ఆయన కూడా వచ్చే ఎన్నికల తరువాత మళ్ళీ మరోమారు ప్రధాని పదవిలో కొనసాగాలని కోరుకొంటున్నట్లు అర్ధం అవుతోంది. అందుకే ఆయన కూడా రాహుల్ భజన చేసి ఉండవచ్చును.   ఆయన సోనియా, రాహుల్ పట్ల తన విధేయతను మరో మారు బహిరంగంగా ప్రకటించుకోవడం ద్వారా తానూ ఆ పదవిలో వారి దయతోనే కొనసాగుతున్నట్లుగా చెప్పకనే చెప్పారు. వారు అనుమతిస్తే ప్రధాని పదవిలో కొనసాగుతానని లేకుంటే వైదొలగుతానని తెలియజేయడం ద్వారా ఒకవేళ రాహుల్ గాంధీ కనుక వచ్చే ఎన్నికల తరువాత ప్రధాని పదవి అధిష్టించేందుకు అయిష్టత చూపితే తనకు కాకుండా వేరెవరికీ ఆ పదవి కట్టబెట్టకుండా ఉండేందుకే ఆయన తన ఈ విధేయ ప్రకటన చేసారనుకోవచ్చును. లేకుంటే, ఆయన ఇటువంటి అసందర్భ ప్రకటన చేసేవారు కాదు. ఇక ముందు కూడా ఆయన ఇటువంటి ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. దేశంలో అత్యున్నత పదవిలో కొనసాగాలంటే ఆ మాత్రం శ్రమ తీసుకోక తప్పదు మరి.

అరుణాచలం దొంగల వేట

      సిబిఐ జేడీ గా బాధ్యతలు తీసుకున్న అరుణాచలం జగన్ కేసులో తన మార్కును చూపిస్తున్నాడు. జేడీ గా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే జగన్ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో జగన్, విజయ సాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్ లను ని౦దితులుగా నమోదు చేశారు. ఎకె దండమూడి, కన్నన్ తదితరులను మోసం చేశారని ఛార్జ్ షీట్ పేర్కొనడం విశేషం. పెండింగ్ లో వున్న కేసుల గురించి అధికారులు నుంచి జేడీ అరుణాచలం ఆరా తీశారు. ఈ కేసు ఎ స్థాయిలో వుందనే అన్ని విషయాలు తీసుకున్న తరువాత జగన్ కేసుకు సంబంధించి అనుబంధ ఛార్జ్ షీట్ వేయాలని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో జగన్ యాంటీ క్యాంపెనర్లు దొంగల వేట పార్ట్ 2 మొదలైందని సెటైర్లు వేస్తున్నారు.

తెలంగాణ లో విజయమ్మ పర్యటన

      రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలపరిచేందుకు వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు విజయమ్మ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె తెలంగాణలో పర్యటించనున్నారు. జూన్ 25 తేదీ నుంచి జులై 3వ తేదీ వరకు విజయమ్మ తెలంగాణలో పర్యటిస్తారు. ఈ నెల 25వ తేీదన మెదక్, 26న నల్లగొండ, 27న మహబూబ్‌నగర్, 28 ఖమ్మం, 29న రంగారెడ్డి, 30న కరీంనగర్ సందర్శిస్తారు. ఆ తర్వాత జులై 1వ తేదీన వరంగల్, 2న ఆదిలాబాద్, 3న నిజామాబాద్ పర్యటిస్తారు. ఐతే విజయమ్మకు ఈసారి తెలంగాణలో సరైన స్వాగతమే లభిస్తుందా? లేక తిరస్కారం ఎదురవుతుందా అన్నది చూడాలి.

'ఛలో అసెంబ్లీ' ఎందుకు విఫలమయింది?

- డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       "ఛలో అసెంబ్లీ'' నినాదంతో, తెలంగాణా పేరిట, 'ప్రత్యేక రాష్ట్రం' నినాదం చాటున ప్రాంతంలోని కొందరు రాజకీయ నిరుద్యోగులు రెండు మూడు పార్టీల పేరిట ఒకటి రెండు సంస్థల మాటున తలపెట్టిన [14-06-2013] ప్రదర్శనలు, ఆ మరునాడు "పోలీసుల జులుం''కు నిరసనగా "తెలంగాణా బంద్'' కోసం యిచ్చిన పిలుపూ పదవీవ్యామోహపరులయిన నాయకుల రాజకీయ 'వాపు' తప్ప మరేమీ కాదని మరోసారి రుజువయింది! ప్రజల కోరికలు వేరు, నాయకుల 'ఆబ' వేరనీ ఇంకోసారి వెల్లడయింది. ఇందుకు నిదర్శనం "బంద్'' [15-06-2013] అనంతరం వివిధ పత్రికలూ మోసుకొచ్చిన వార్తలే! ఉదాహరణకు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనూ, అటు తెలంగాణా జిల్లాలోనూ [గ్రామసీమలు సహా] 'బంద్'కు సరైన స్పందన కరువయిందని పత్రికలూ పేర్కొన్నాయి. కొన్ని పత్రికలూ, కాంగ్రెస్ అధిష్ఠానవర్గం రానున్న జనరల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్త్రంలోని మిగతా రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం మృగ్యమని భావించి, కనీసం తెలంగాణా లోనయినా "కాంగ్రెస్ ను బతికించుకునే లక్ష్యంతో'' తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించవచ్చనేమోనన్న అనుమానంతో కూడిన ఒక ఊహను ప్రచారంలో పెట్టగా, మరికొన్ని పత్రికలూ 'రాష్ట్ర విభజన జరగబోదనీ, మూడు ప్రాంతాలలోని వెనుకబడిన ప్రాంతాలకు సమానస్థాయిలో ప్రత్యేక అభివృద్ధి పథకాలతో ప్యాకేజీలను పకడ్బందీగా ప్రకటించి, అమలు జరిపే వ్యూహంతో అధిష్ఠానం ఉందనీ ప్రత్యేక వార్తలు [16-06-2013] ప్రకటించాయి! అంతేగాదు, "ఛలో అసెంబ్లీ'' కార్యక్రమంలోనే నేతలు మాత్రమే పాల్గొన్నారని సామాన్యప్రజలు స్పందించనే లేదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం  చేశారని ఒక పత్రిక రాసింది! ఒక ప్రసిద్ధ ఆంగ్లదినపత్రిక "హిందూ'' కూడా "మూడు ప్రాంతాలవారితో చర్చల ద్వారా ఒక అంగీకారానికి వచ్చిన తరువాతనే'' సమస్యకు పరిష్కారం సాధ్యమని యిప్పటికీ కేంద్రం భావిస్తోందని చెబుతూ, "బంద్'' పిలుపుకు మాత్రం ఇటు హైదరాబాద్ లోనూ, అటు తెలంగాణా జిల్లాలలోనూ ప్రజలనుంచి "స్పందన చాలా పేలవంగా'' ["poor response''] ఉందని రాసింది. రాజధాని హైదరాబాద్ లో దాదాపు విఫలమైనదనీ ["almost flopped"] వెల్లడించింది. బస్సులుహాయిగా తిరిగాయి. అక్కడక్కడా కొన్ని షాపులు మూయడం మినహా అంతటా షాపులూ, వాణిజ్య సంస్థలూ యథాతథంగానే పనిచేశాయి. ఆటోరిక్షాలూ, ఎంఎంటిఎస్ రైళ్ళూ అన్ని రూట్లలోనూ నడిచాయి. చివరికి రాజకీయ నిరుద్యోగుల బలవంతపు జోక్యాలవల్ల అల్లకల్లోలాలకు ఇటీవల కాలంలో కేంద్రంగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కూడా [అరెస్టయిన కొందరు విద్యార్థుల్ని విడుదల చేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు చేసిన ప్రదర్శన మినహాయిస్తే]  15వ తేదీన ప్రశాంతత నెలకొన్నదని అదే పత్రిక రాసింది! అయితే, గతంలో మాదిరే, 'బంద్' రోజున బండారు శ్రీనివాస్ అనే ఉస్మానియా ఇంజనీరింగ్ విద్యార్థి "తెల్లవారు జామున'' ఆత్మహత్య చేసుకున్నాడనీ, అయితే అతనే రాశాడని చెబుతున్న రెండు చీటీలు, ఒక మొబైలు ఫోను, 200 రూపాయలు అతని దుస్తుల్లో ఉన్నట్టు కనుగొన్నారు. ఉస్మానియా ప్రధానగ్రంథాలయం సమీపంలో ఒక చెట్టుకు వేలాడుతున్న అతని శరీరాన్ని చూసిన మార్నింగ్ వాకర్స్ పోలీసులకు చెప్పగా, గాంధీ ఆసుపత్రి శవాల గదికి తరలించారు. అయితే బంద్ పాక్షికంగానే విజయం పొంది, ఉస్మానియాలో ప్రశాంత పరిస్థితి నెలకొంటున్న సమయంలో శ్రీనివాస్ "ఆత్మహత్య''వార్త మళ్ళీ కొంత ఆందోళన కారణం కావటం, శ్రీనివాస్ ది "హత్యా, ఆత్మహత్యా'' అన్న అనుమానాలు విద్యార్థిల్లోనే వ్యాపించాయి. ఎందుకంటే, శ్రీనివాస్ తెల్లవారు జామున ఎవరూ చూడకుండా చెట్టుకు ఉరివేసుకుని చావవలసిన అవసరం - అందునా "చలో అసెంబ్లీ'' నిర్వహణ తర్వాత ఎందుకు వచ్చిందన్న ప్రశ్న విద్యార్థుల్లో బాగా నలుగుతోంది. ఎందుకంటే, నిరుద్యోగ రాజకీయ చేతబడులకు అలవాటు పడిన టి.ఆర్.ఎస్. నాయకులు పదవీకాంక్ష కొద్దీ చేస్తున్న పని - యువతలో మనోనిబ్బరాన్ని చెడగొట్టడం ద్వారా తాను నేరవేర్చలేని ఆశలను వారిలో రేకెత్తించి, అవి తాను నెరవేర్చలేక యువతను ఆత్మహత్యల వైపునకు నెట్టే దుర్మార్గపు 'చిట్కా'ను ఆశ్రయించటం! కాని తెలుగువారిని తెలుగువారి పైకే ఉసికొల్పడమైతే, ఉసికొల్పాడు. కాని ఆ క్రమంలో 'ఆత్మహత్య' అనే ఆదర్శాన్ని తానుగాని తన కుటుంబీకుల చేతగాని పాటించకుండా 'ఫామ్ హౌస్'లో (విలాసగృహం) కూర్చుని ఆత్మహత్యలకూ, బంద్ లకూ, ధర్నాలకూ అజ్ఞాత ఆదేశాలతో సరిపెట్టుకుంటున్నాడు! ఈ మొత్తం బాగోతం, తెలంగాణాలో తమ వర్గం కోల్పోయిన ఒకనాటి రాజకీయ ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని తిరిగి పొందటం కోసం కెసిఆర్ చేస్తున్న 'రాజకీయ' యాగం రాజేకీయ చేతబడులు తప్ప మరేమీ కాదని కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలిసిపోయింది. చివరికి "భస్మాసురహస్తం''లాగా ఈ ఆత్మహత్యల పర్వం సొంత స్థానిక పార్టీ టి.ఆర్.ఎస్.లోకే చొరబడిపోయి, నిన్నగాక మొన్ననే ఒక జిల్లానాయకుడిని బలిగొన్నది! అలాగే "ఛలో అసెంబ్లీ'' సందర్భంగా ఉన్న ఆ పార్టీ శాసనసభాపక్షం కార్యాలయం గోడలపైకి ఎక్కి సొంతపార్టీ శాసనసభ్యులు ఇద్దరు హుందాతనం కోల్పోయి నల్లజెండాలు చేతబూని, అక్కడనుంచి "దూకేస్తాం'' అంటూ పోలీసుల్ని, ఇతర శాసనసభ్యుల్ని బెదిరించి, తమ మానసిక దౌర్భాల్యాన్ని ప్రదర్శించారు. టి.ఆర్.ఎస్. సభ్యులే గతంలో కూడా గవర్నర్ పోడియం వద్దకు దూసుకువెళ్ళి ఆయన చేతిలోని పత్రాలను దౌర్జన్యంగా లాగేసి, చించేసి, బాజాలు మనుషుల్లా వ్యవహరించిన సంగతిని తెలంగాణా ప్రజలు యింకా మరువలేదు! నిజానికి నేడు వేర్పాటువాదం పేరిట మన తెలంగాణాలో జరుగుతున్న పని - 'దొరల'స్వామ్యానికీ, రెడ్ల స్వామ్యానికి మధ్య అధికారం కోసం సాగుతున్న పెనుగులాట పోరు తప్ప, తెలంగాణా బడుగు, బలహీనవర్గాల ప్రజాబాహుళ్యం వకాలిన సమస్యల (తిండి, బట్ట, వసతి, అక్షరాస్యత) పరిష్కారం కోసం జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటం కాదు. "వేర్పాటు వాదం'' చాటున ఈ సమస్యలను, సీమాంధ్రనుంచి తెలంగాణాకు వలసవచ్చి స్వార్థం కోసం కుంపటి పెట్టిన "బొబ్బిలిదొర'' ఎలా పక్కకు తప్పించి వేస్తూ వచ్చాడో ప్రజలు గుర్తించారు. అందుకే కాంగ్రెస్ గొడుగుకిందకు చేరడం ద్వారా తనను తాను కాపాడుకోడానికి కాంగ్రెస్ లో కూడా చీలికలు తెచ్చి, వివేక, కె.కె.లాంటి బలహీనుల్ని దగ్గరకు చేరదీసుకున్నాడు. ఈ తంతును తెలంగాణాలో అసంఖ్యాకులయిన ఎస్.సి., ఎస్.టి., బి.సి. వర్గాల ప్రజలు పసికట్టి, కె.సి.ఆర్. స్వార్థపూరిత ఉద్యమం నుంచి క్రమంగా దూరమవుతూ, పల్లెపల్లెకూ కె.సి.ఆర్.కు వ్యతిరేకంగా సందేశాన్ని అందజేస్తున్నారు. తెలంగాణాలో 'దొర'ళ, జాగిర్థార్ల దోపిడీ పెత్తనాల కింద నలిగిపోయిన దళిత, బహుజనులంతా ఏకంకావడానికికారణం అదే! అలాగే కె.సి.ఆర్. వొంటెత్తు పోకడకు నిరసనగానే బిజెపి, కమ్యూనిస్టుపార్టీలు "బంద్''ను బహిష్కరించడం జరిగింది. మొన్నటివరకూ కెసిఆర్ నెలకొల్పిన సంయుక్త కార్యాచరణ సంఘంతో యునైటెడ్ ఫ్రెంట్ రాష్ట్రశాఖ సహధ్యక్షురాలు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలయిన విమల ఒక ప్రకటన చేస్తూ కోదండరామ రెడ్డి నాయకత్వాన ఉన్న "సంయుక్త కార్యాచరణ సంఘం'' కెసిఆర్ పార్టీ అయిన "టి.ఆర్.ఎస్.కు తోకలా'' గా పనిచేస్తోందని విమర్శించాల్సి వచ్చింది! అందుకే తానిప్పుడు "పులిమీద కూర్చుని ప్రయాణిస్తున్నాన''ని కెసిఆర్ కు పూర్తిగా తెలుసు. కనుకనే "పులిమీద నుంచి కిందికి దిగామా'' తనకు ప్రాణం దక్కదని భావిస్తున్నాడు. భావించడమేమిటి? అలా అని అనేక సందర్భాల్లో ప్రకటనలూ చేశాడు! ఒకవేళ ఆపద్ధర్మంగా కాంగ్రెస్ ను కౌగిలించుకుని కూర్చున్నా కెసిఆర్ ను తాను ఎక్కి ప్రయాణిస్తున్న "పులి'' [తెలంగాణా] అయినా మింగేస్తుంది, లేదా కాంగ్రెస్ అధిష్ఠానమయినా మింగేస్తుంది. రేపు మనం వినబోయే వార్త అదే కావచ్చు!

మోపిదేవికి అనారోగ్యం

      మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న ఆయనను జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జైలు అధికారుల సమాచారం ప్రకారం ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి వచ్చింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మోపిదేవి కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతన్నారు. ప్రస్తుతం ఉస్మానియాలోని కార్డియాలజీ విభాగంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. అదేంటో జగన్ కేసులో ఉన్న వారు క్రమక్రమంగా వ్యాధుల పాలవుతున్నారు. సహజంగా బాధతో ఇలా అవుతున్నారా.. లేక ఇంకా ఏమైనా కారణాలు వెలుగు చూడాల్సి ఉందా?

రాజకీయాల్లోకి రాను: ఆలీ

      ప్రముఖ హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న డా. ఆలీ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈయన తన స్వస్థలం రాజమంత్రి నుండి పోటీకి తెలుగు దేశం పార్టీ నుండి బరిలోకి దిగుతున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ఇన్ని రోజుల నుండి ఈ వార్తల పై స్పందించని ఆలీ తాజాగా దీని పై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తున్న మాటల్లో నిజం లేదని, తనకు రాజకీయాలంటే పెద్దగా ఆశక్తి లేదని, అయినా నాలుగు పాత్రలు చేసుకునే నాకు రాజకీయాలు ఎందుకు ? ఒకవేళ రాజకీయాల్లోకి రావాలంటే తానే స్వయంగా ప్రకటిస్తానని, తన పై పుచ్చిన వార్తలు అన్నీ పుకార్లేనని, వాటిని ఎవరూ నమ్మవద్దని అన్నారు. ఇక ఈయనకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా పవన్, బ్రహ్మానందం సత్కరించారు. అంతే కాకుండా డాక్టరేట్ వచ్చిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆలీకి ప్రత్యేక సన్మానం కూడా జరిగింది. ఆలి ని పలువురు సత్కరించి, ఆయన స్వస్థలానికి చేస్తున్న సేవలను కొనియాడారు.

ఎన్డీయే కూటమితో జనత దళ్ (యు) తెగ తెంపులు

గత 17 ఏళ్లుగా ఎన్డీయే కూటమితో కలిసి సాగుతున్న జనత దళ్ (యు) బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తీసుకు వస్తుండటంతో కూటమి లోంచి బయటపడాలని నిశ్చయించుకొంది. అదీగాక, ఆ పార్టీకి చెందిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా, నిధులు కావాలంటూ చేసిన డిమాండ్ కు కాంగ్రెస్ సూచన ప్రాయంగా అంగీకరించడంతో నేడు కాకపోయినా రేపయినా కాంగ్రెస్ సారధ్యంలో నడుస్తున్న యుపీయే కూటమిలో చేరే అవకాశం ఉంది. ఇటువంటి నేపద్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వంలో కొనసాగుతున్న 11 మంది బీజేపీకి చెందిన మంత్రులు రెండు పార్టీల మధ్య ఏర్పడిన విబేధాల కారణంగా గత కొద్ది రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో నితీష్ కుమార్ వారిని తన క్యాబినెట్ లోంచి డిస్మిస్ చేశారు. దీనితో రెండు పార్టీలు  తెగతెంపులు చేసుకోవడం కూడా పూర్తయింది గనుక, జె.డీ.(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ తాము ఎన్డీయే కూటమి నుండి వైతోలగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అద్వానీ, వాజ్ పేయి వంటి గొప్ప నేతలను చూసి తాము ఎన్డీయే లోకి వచ్చామని, కానీ ఇప్పుడా పరిస్థితులు లేకపోవడంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో వైదొలగుతున్నామని ఆయన ప్రకటించారు.   ఒకేసారి 11మంది మంత్రులను తొలగించినందున నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ నెల 19న శాసనసభలో తన బల నిరూపణకు సిద్దం అవుతున్నారు.

పార్టీతో కత్తులు దూస్తున్న శంకర రావు

  గ్రీన్ ఫీల్డ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి మళ్ళీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ఆరోగ్యరీత్యా కొద్ది రోజులు మీడియాకు దూరమయ్యారు. ఆయన ఇప్పుడు కొంచెం తేరుకొన్నాక మళ్ళీ తన సహజ శైలిలో రాజకీయాలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు చిత్తూరు జిల్లా నుండి ఎర్రచందనం విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నాడని ఆయన సోనియా గాంధీకి ఒక లేఖ కూడా వ్రాసారు.   ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని ఇవాలని లేకపోతే స్పీకర్ పోడియం ముందు బైటాయిస్తామన్నారు. తనకు అవకాశం ఇస్తే ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్, గ్రీన్ ఫీల్డ్స్ తో సహా వివిధ అంశాలపై మాట్లాడాలను కొంటున్నట్లు తెలిపారు. తాను డీజీపీ దినేష్‌రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని కోరినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదో, సీబీఐ చేత ఎందుకు దర్యాప్తు జరిపించట్లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దినేష్ రెడ్డి అంశాన్ని అసెంబ్లీ లో చర్చించవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.   ఆయన మరో పదిహేను రోజుల్లో తెలంగాణాపై కేంద్రం నుంచి ఒక స్పష్టమయిన ప్రకటన వస్తుందని చెపుతూనే, పార్టీ అధిష్టానం ఇప్పటికైనా తెలంగాణాపై ఓ స్పష్టమయిన నిర్ణయానికి రావాలని చెప్పడం ఆయన తెలంగాణా అంశంపై ఎటువంటి సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని అర్ధం అవుతోంది. తెలంగాణాపై స్పష్టమయిన ప్రకటన చేయకపోతే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేసారు. అంతే కాకుండా తెలంగాణా ఇవ్వకపోతే కాంగ్రెస్ కి మనుగడ లేదని వ్యాఖ్యానించారు. లేకుంటే ఈ విషయం పై ప్రజలకు వివరణ ఇవ్వాల్సుంటుందని హెచ్చరించారు.   అటు పార్టీ అధిష్టానాన్ని, ఇటు ముఖ్యమంత్రిని వ్యతిరేఖిస్తు మాట్లాడుతున్న శంకర్ రావుని గమనిస్తే రానున్న ఎన్నికలలో తనకు పార్టీ టికెట్ రాదనే ఆందోళనలో ఉన్నట్లు అర్ధం అవుతోంది. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్దం అని సూచిస్తునట్లు ఉంది. అయితే, ఆయన పార్టీని వీడిపోవడం వలన పార్టీ కొచ్చేనష్టం ఏమిలేకపోగా ఆయనే రాజకీయంగా నష్టపోవడం ఖాయమని గ్రహించకపోవడం రాజకీయ అజ్ఞానమే.

బీజేపీ కి జేడీయూ రాంరాం

        జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముస్లిం ఓట్ల ముసలం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో కుదుపు తెచ్చింది. చాలా కాలం నుంచి బీజేపీతో కలిసి ఉన్న జేడీయూ బీజేపీ నుంచి చీలిపోయింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రచార సారథిగా నియమించడం జెడి(యు) కు నచ్చలేదు. ముస్లిం ఓట్లు ప్రభావిత స్థాయిలో ఉండే బీహారులో వారి ఓట్లు కాపాడుకునేందుకు జేడీయూ ఈరోజు సమావేశం నిర్వహించి బీజేపీ నుంచి బయటపడాలని నిర్ణయించింది. దీనికి విచిత్రంగా… తన కారణాలు తాను చూపకుండా అసలు కారణం దాచి బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకే నచ్చని నిర్ణయం మాకెలా నచ్చుతుందంటూ విరుచుకుపడింది. మొత్తానికి మోడీ కారణంగా జెడి(యు) బీజేపీతో పదిహేడేళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. శత్రువు వినాశనం ఆనందాన్ని ఇచ్చినట్లు ఎన్డీయేలో జేడీయూ విడిపోవడం కాంగ్రెస్ సంతోషిస్తోంది. అంతేకాదు జెడి(యు)ను తమ వైపుకు రప్పించుకునేందుకు కాంగ్రెసుతో పాటు థర్డ్ ఫ్రంటు నేతలు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు.

రాష్ట్ర కాంగ్రెస్ నావని దిగ్విజయంగా ఒడ్డుకి చేర్చగలడా?

  సాధారణ ఎన్నికలకి కేవలం పది నెలలే సమయం మిగిలి ఉండటంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవసరమయిన యంపీలను అందించే ఆంధ్ర రాష్ట్రంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఆ ప్రయత్నంలోనే భాగంగానే రాష్ట్ర వ్యహరాలపై పూర్తి అవగాహన ఉన్న దిగ్విజయ్ సింగ్ ను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా నియమించింది.   రాష్ట్ర కాంగ్రెస్ ని ప్రధానంగా మూడు సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. 1.తెలంగాణా అంశం, 2.రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి, 3. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఏవిధంగా వ్యవహరించాలి? ఈ మూడింటినీ పరిష్కరించనిదే రాష్ట్రంలో పార్టీ సజావుగా సాగే అవకాశం లేదు గనుక ఆయన మొట్ట మొదట వీటిపైనే దృష్టి సారించే అవకాశం ఉంది.   ఇంతవరకు రాష్ట్ర వ్యవహారాలు చూసిన గులాం నబీ ఆజాద్ క్లిష్టమయిన ఈ వ్యవహారాలను పరిష్కరించలేక వాటిపై నాన్పుడు ధోరణి అవలంభించడంతో సమస్య జటిలమయిపోయింది. అయితే, దిగ్విజయ్ సింగ్ పద్ధతి ఆయనకు పూర్తిగా విరుద్దం. ఆయన త్వరగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తారు. బహుశః ఈ కారణం చేతనే రాహుల్ గాంధీ ఏరికోరి ఆయనకు ఈ భాధ్యతలు అప్పగించి ఉండవచ్చును. రాహుల్ టీంలో ఒకరయిన దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర కాంగ్రెస్ సమస్యలను పరిష్కరించడంలో ఇంతవరకు సాగుతున్న పద్దతులకు స్వస్తి చెప్పి వీలయినంత త్వరగా తనదయిన శైలిలో పరిష్కరించవచ్చును.   తెలంగాణా సమస్యపై ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగినందున ఏవోకొన్నిపరిష్కారమార్గాలు సిద్ధమయ్యే ఉంటాయి గనుక వాటిలోంచి తగిన దానిని ఎంచుకొని ఆయన ముందుకు సాగవచ్చును. ఆయనకు రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ఉంది గనుక ఆయన ప్రతిపాదనలకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించవచ్చును. ఇక, ఆయనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అందరు నేతలతో చక్కటి సంబంధాలున్నాయి గనుక, బహుశః అందరితో సంప్రదింపులు జరిపి తెలంగాణా అంశంపై అందరికీ ఆమోద యోగ్యమయిన పరిష్కారం కనుగొనవచ్చును. అదేవిధంగా పార్టీలో అసమ్మతి నేతలను కూడా ఆయన గాడిన పెట్టవచ్చును.   ఇక తెలంగాణా అంశం తరువాతః అంత కీలకమయింది జగన్ అంశం. ఆయనను ఒప్పించి వైకాపాను కాంగ్రెస్ లో విలీనం లేదా ఎన్నికల పొత్తులు చేసుకోగలిగితేనే రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోగలదు. గనుక, ఆ పార్టీ నేతలతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని ఆ పార్టీని కాంగ్రెస్ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేయవచ్చును.   ఈ మూడు సమస్యలను కనుక ఆయన దిగ్విజయంగా పూర్తి చేయగలిగితే రాష్ట్రంలో, కేంద్రంలో ఆయన ప్రతిష్ట మరింత పెరగవచ్చును. అయితే డిసెంబరులో తన స్వంత రాష్ట్రమయిన మధ్యప్రదేశ్ లో శాసన సభకి ఎన్నికలు జరగనున్నందున మరి ఆయన మన రాష్ట్ర వ్యవహారాలను పరిష్కరించడానికి అంత చొరవ చూపగలరో లేదో అనుమానమే.

కేసీఆర్ పై మోత్కుపల్లి విసుర్లు

      కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోనియాతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుని బంద్‌కు పిలుపునిస్తే సక్సెస్ అవుతుందా అని ప్రశ్నించారు. డబ్బు కోసం కేసీఆర్ ఎంత మందిని బలితీసుకుంటారని మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే పార్లమెంటును ముట్టడించాలని మోత్కుపల్లి సవాల్ చేశారు. కేసీఆర్ దుర్మార్గపు వైఖరిని ఖడిస్తున్నామని, డబ్బున్న వారికే ఆయన టికెట్టు ఇస్తున్నారని విమర్శించారు. ఉద్యమం పేరుతో వేల కోట్లు సంపాదించిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తరమేస్తారని మోత్కుపల్లి అన్నారు.

జేఏసీ మహాధర్నా: కేటీఆర్ అరెస్ట్

        తెలంగాణ జేఏసీ తలపెట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. మహాధర్నాకు అనుమతి లేదని పోలీసులు ఉదయం నుంచే పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కాగా మధ్యాహ్నం విద్యుత్ సౌధ వద్ద ధర్నా చేసిన జేఏసీ నేతలు రఘు, దయాకర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విద్యుత్ సౌధ ముట్టడికి యత్నించిన టి.జేఏసీ చైర్మన్ కోదండరాం సహా, ఎమ్మెల్యేలు కేటీఆర్, నాగంను అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపటికి వదిలిపెట్టారు. పోలీసులు విడిచిపెట్టగానే నేతల మరలా విద్యుత్ సౌధ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. లోనికి అనుమతించాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ సౌధ ఉన్నతాధికారులతో మాట్లాడిన పోలీసులు ముగ్గురు నేతలను లోపలికి అనుమతినిచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ ట్రాన్స్‌కో సీఎండి, పోలీసులపై సభా హక్కుల ఉల్లంఘన కేసు పెడతామన్నారు. ఉద్యోగులతో పెట్టుకుంటే సీఎం కిరణ్‌కు హైదరాబాద్‌లో చోటు లేదని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై పోలీసుల దమకాండ తగదని కేటీఆర్ మండిపడ్డారు.

శాసనసభలో సీమంతం!

      బయట ఛలో అసేంబ్లీ జరుగుతోంది. శాసనసభ ఆవరణలోనే ఛలో అసేంబ్లీకి మద్దతు ఇవ్వలేదని, ప్రభుత్వం అరెస్టులు, లాఠీఛార్జ్ లతో దమనకాండకు పాల్పడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే శాసనసభ లోపల ఖమ్మం జిల్లా వైరా సీపీఐ శాసనసభ్యురాలు డాక్టర్ చంద్రావతికి మహిళా ఎమ్మెల్యేలు సీమంతం నిర్వహించారు. ప్రస్తుత అసేంబ్లీలో అందరికన్నా చిన్నది అయిన చంద్రావతికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. శాసనసభను టీఆర్ఎస్ అడ్డుకోవడంతో వాయిదాపడింది. దీంతో సెంట్రల్ హాల్ లో ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, ముత్యాల పాప, వంగా గీత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మేరీ లాజరస్ తదితరులు పూలు, పండ్లు, చీర, సారెలతో సీమంతం చేసి పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

అర్ధంతరంగా ముగిసిన మిస్త్రీగారి పర్యటన

  కర్ణాటక రాష్ట్ర పార్టీ వ్యవహారాల కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ రాష్ట్ర పర్యటన అర్థాంతరంగా ముగిసింది .ఈ వార్త రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఆయన రాష్ట్రంలో కీలకమయిన జిల్లాలలో సమీక్షలు చేయవలసి ఉంది.అంతే కాకుండా ముఖ్యమంత్రి, పి.సి.సి. కార్యదర్శిలతో భేటీ కావాల్సి ఉంది . కానీ ఆయన జిల్లా సమీక్షలతో పాటు ముఖ్యమంత్రి ,పి.సి.సి. కార్యదర్శిలతో భేటీ లను కూడా రద్దు చేసుకొని, అర్థాంతరంగా పర్యటన ముగించి ఢిల్లీ వె పలు అనుమానాలకు దారితీస్తోంది. రాష్ట్ర క్యాబినెట్ మరియు పార్టీలో ఉన్న అసమ్మతి నేతలు ఆయనతో భేటీ కాకూడదనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచన మేరకే ఆయన తన పర్యటన అర్ధంతరంగా ముగించుకొని వెళ్లిపోయినట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తద్వారా కిరణ్ కుమార్ రెడ్డి అసమ్మతి నేతలు తనకు వ్యతిరేఖంగా అధిష్టానానికి నివేదికలు ఈయకుండా జాగ్రత్తపడినట్లు అర్ధం అవుతోంది. మిస్త్రీ తన తదుపరి భేటీలను త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్నట్లు సమాచారం.

తెలగాణ బంద్: హరీష్ రావు అరెస్ట్

      ఛలో అసెంబ్లీ సంధర్బంగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నివారం తెలగాణ బంద్ జరుగుతోంది. బంద్ సంధర్బంగా సిద్ధిపేట ఆర్టీసి బస్సు డిపో ఎదుట ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ బంద్ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా శనివారం తెల్లవారు జామున ఏదుట్ల, రేమద్దెల గ్రామాల మధ్య రెండు ఆర్టీసి బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఓ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. గద్వాల, అచ్చంపేటల్లో మాత్రం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నల్లగొండ జిల్లాలో కూడా డిపోల వద్ద బైఠాయించిన తెరాస నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌కు సంఘీభావం తెలుపుతూ కరీంనగర్ జిల్లాలోని సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. హుజురాబాద్ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా తెరాస నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లాలో విద్యాసంస్థలు బంద్‌ను పాటిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిగి డివిజన్‌లో కొందరు వ్యక్తులు బస్సులను అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బస్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించి తెరాస శానససభ్యుడు జోగు రామన్నను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్‌లో ఆందోళనకారులు ఓ బస్సు అద్దాలను పగులగొట్టారు. ఇదే జిల్లాలోని పానగల్‌లో రెండు ఆర్టీసి బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారు.

పార్టీ ఉనికి కోసం తిప్పలు పడుతున్న వైకాపా

        మారో పది నెలలో ఎన్నికలు వస్తునప్పటికీ, ఇంతవరకు జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యే సూచనలు కనిపించకపోవడంతో ఆ పార్టీ నేతల్లో ముఖ్యంగా జగన్ కుటుంబ సభ్యులలో చాలా ఆందోళన నెలకొంది. అతను జైలు నుండి వ్యవహారాలు ఎంత చక్కబెడుతున్నపటికీ, ఎన్నికలలోగా ఆయన విడుదల కాకపోతే పార్టీ పరిస్థితి తలక్రిందులయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆ పార్టీలో చేరిన, చేరుతున్న నేతలు పార్టీ పరిస్థితిపై ఏమాత్రం అనుమానం కలిగినా నిస్సంకోచంగా వెంటనే వేరే పార్టీలోకి దూకేయడం ఖాయం. ఇక, ఎన్నికలు దగ్గర పడుతున్నపటికీ జగన్ జైలు లోపలే ఉండిపోవడం వలన ఆ పార్టీ నిర్మాణం కూడా ఇంతవరకు సరిగ్గా జరుగలేదు. ఇది కూడా ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.   ప్రస్తుతం షర్మిలా, విజయమ్మ ఇద్దరూ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నపటికీ, వారు కూడా సరయిన దిశా నిర్దేశం లేక తమకు తోచిన విధంగా పార్టీని ముందుకు తీసుకు వెళుతున్నారు. అయితే, వారిరువు నిర్మాణాత్మకమయిన దిశలో ముందుకు సాగకపోవడం వలన వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన గంగగా మారుతోంది. ప్రస్తుతం పార్టీ పరిస్థితి చూసినట్లయితే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతల సలహా సంప్రదింపులు, సేవలను ఆ పార్టీ ఏవిధంగా కూడా ఉపయోగించుకొంటున్నట్లు కనబడటం లేదు. అందువల్ల, విజయమ్మ ఇతర పార్టీల కార్యక్రమాలను, పద్దతులను అనుకరిస్తూ వైకాపాను నెట్టుకొస్తున్నారు.   ఇటువంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆ పార్టీ స్వయంకృతాపరాధం వలన కూడా కొత్త సమస్యలు సృష్టించుకొంటోంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో విజయమ్మ తమ రాజకీయ ప్రత్యర్ధులపై కేవలం మాటల యుద్ధమే కాకుండా అవసరమయితే భౌతిక దాడులు కూడా చేయమని ఆదేశించినట్లు ఆ పార్టీ నేత రాజేష్ కార్యకర్తలతో చెప్పడం రాజకీయ వర్గాలలో కలకలం సృష్టించాయి. ఇది పార్టీపట్ల ప్రజలలో వ్యతిరేఖతను ఏర్పరుస్తుంది తప్ప పార్టీకి ఏవిధంగాను ఉపయోగపడదని స్వయంగా ఆ పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు. జగన్ జైలు నుండి విడుదల కాని పక్షంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీని ఏవిధంగా సన్నధం చేసుకోవాలోనని ఆలోచించవలసిన తరుణంలో ఇటువంటి ఆలోచనలు చేయడం పార్టీకి ఏవిధంగా మేలు చేయకపోగా, పార్టీపై ప్రజలలో దురభిప్రాయం కల్గిస్తాయి. ఇప్పుడే ఆ పార్టీ నేతలు ఇటువంటి ఆలోచనలు చేస్తే రేపు అధికారంలోకి వస్తే ఏవిధంగా ప్రవరిస్తారనే సందేహం తప్పకుండా ప్రజలలో కలుగుతుంది.  పార్టీ ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయట పడటానికి ఇటువంటి ఆలోచనలు చేయడం వలన పార్టీకి మేలు జరుగక పోగా కీడు జరగవచ్చును. సారధి లేకుండా ఎన్నికల కురుక్షేత్రంలోకి కదులుతున్న వైకాపా రధంలో ఆ సమయానికి ఎందరు మిగులుతారో కాలమే చెపుతుంది.  

మహాకవి శ్రీ శ్రీ వర్థంతి

      రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజదర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టివీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అందుకే ఆయన పేరు తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. పేరు తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు. నేడు ఆ మహాకవి వర్థంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం..   ఆయనరచనల్లో 1950లోప్రచురించబడిన' మహాప్రస్థానం'అనే కవితా సంపుటి తెలుగుసాహితీ అభిమానులమనసుల్లోనే కాకుండా..సామాన్య ప్రజల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది.   ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్నిశాసించిన మహాకవి శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధకవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవరచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నతెలుగు సాహిత్యంలో కవితను ఇలానిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవిలేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది అన్న బూదరాజురాధాకృష్ణ గారి మాటలు శ్రీశ్రీ సాహితీ ప్రజ్ఞ్య కి నిదర్శనాలు. 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తత వెల్లటం వలన ఈయనఇంటిపేరు శ్రీరంగంగా మారింది.1935 లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణిపత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయనరాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్పకవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశను మార్చిన పుస్తకం అది.1947 లోమద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నో సినిమాలకు పాటలు,మాటలు రాసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది.ఆసందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది. శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు.తన 18 వ ఏట 1928 లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు.ఈ రచనను సాంప్రదాయ పధ్ధతి లోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సువంటి వాటిని పక్కన పెట్టి వాడుకభాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం మొదలు పెట్టారు.  1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నతస్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి ని చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టిఅనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియోనాటికలు రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకుతెలియదు. 1981 లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం కు ముందుమాటలో ఆయన ఈ విషయంస్వయంగా రాసాడు. తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయనరచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన తెలుగు వీరలేవరా.. అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజ తోకలిసి సినిమాలకు మాటలు రాసాడు. ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలోశ్రీశ్రీ మేటి. తెలుగు కవిత్వానికి దిశా నిర్దేశం చేసిన శ్రీ శ్రీ అమరుడు..  ఈ రోజు ఆ మహాకవి వర్థంతి సంధర్బంగా మరోసారి తెలుగు కవితా రథసారధికి అక్షర నివాళి అర్పింద్దాం..