కొరివితో తల గోక్కొంటున్న శంకరావు

  ఊరికే కూర్చొన్నోడు ఊసుపోక పేడ తీసి వాసన చూసినట్లు, మంత్రి పదవి ఊడగొట్టున్నశంకర్ రావు ఊసిపోక ముఖ్యమంత్రి మీద, డీజీపీ దినేష్ రెడ్డి మీద అధిష్టానానికి లేనిపోని చాడీలు వ్రాయడం మొదలుపెట్టారు. గ్రీన్ ఫీల్డ్స్ వ్యవహారంలో అరెస్టు తరువాత ఆయన తన పరిస్థితిని అర్ధం చేసుకొని తగ్గకపోగా, తన నోటికి మరింత పదును పెట్టారు. ఆయన దినేష్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడా బెట్టాడని ఆరోపణలు చేయడమే కాకుండా, దానిపై సీబీఐ విచారణ కూడా జరిపించాలని డిమాండ్ చేసారు.   ఆయన నోటి దురదే ఇప్పుడు ఆయన కొంప ముంచింది. ఒకవైపు గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారం భూతంలా వెంటాడుతుంటే దానిని నుండి బయటపడక ముందే, తన ఆరోపణలతో మరో కొత్త కేసులో ఇర్రుకొన్నారు. నిన్న సైఫాబాద్ పోలీసులు ఆయనని దాదాపు ఆరు గంటలు ప్రశ్నించారు. గత అనుభవం దృష్టిలో ఉంచుకొని, పోలీసులు వైద్యులను ఒక అంబులెన్స్ ను కూడా సిద్ధంగా పెట్టుకొని, ముందుగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతనే ప్రశ్నించడం మొదలుపెట్టారు. పోలీసులు తనని బాధిస్తున్నందుకు నిరసనగా శంకరావు మూతికి నల్లగుడ్డ కట్టుకొని విచారణకు హాజరయ్యారు. అయితే ఆ విచారణలో ఆయన దినేష్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఎటువంటి ఋజువులు చూపించలేకపోయారని ఇన్స్పెక్టర్ వీ.ఉమేందర్ స్పష్టం చేసారు. అందువల్ల పోలీసులు ఈ రోజు కూడా మళ్ళీ విచారణకు హాజరవవలసిందిగా ఆయనను ఆదేశించారు.   కానీ, శంకరరావు తనకలవాటయిన ఎత్తుగడ వేసారు. నిన్న సాయంత్రమే ఆయన కేర్ ఆసుపత్రిలో చేరిపోయి, ‘తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తానూ విచారణకు హాజరు కాలేనని, అవసరమయితే పోలీసులే వైద్యుల సమక్షంలో ఆసుపత్రిలో విచారణ చేసుకోవచ్చునని’ ఆయన తన కుమార్తె సుష్మిత చేత ఒక లేఖ వ్రాయించారు. ఇప్పుడు ఆయన పోలీసుల నుండి తప్పించుకోవాలంటే కేర్ ఆసుపత్రే శరణ్యం అవుతోంది. వృద్దాప్యం మీద పడిన తరువాతయినా నోటిని అదుపులో పెట్టుకొని ఉండి ఉంటే ఆయనకు ఇప్పుడు ఇన్ని కష్టాలు ఉండేవి కావు.

చెక్ బౌన్స్ కేసులో జీవిత రాజశేఖర్

      జీవిత, రాజశేఖర్ దంపతులు చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నారు. ఈ మేరకు సెప్టెంబరు 20వ తేదీని కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు వారిద్దరికి ఆదేశాలు జారీచేసింది. పరంధామ రెడ్డి అనే వ్యక్తి వద్ద సినీ నటి జీవిత రూ.34 లక్షలు అప్పుగా తీసుకుంది. ఈ మేరకు ప్రామిసరి నోటుతో పాటు రెండు చెక్కులు కూడా ఇచ్చింది. ఈ మొత్తం చెల్లించకపోవడంతో రెండు చెక్కులను పరంధామ రెడ్డి బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అందులో డబ్బులు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి. ఫిర్యాదును పరిశీలించిన 7వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్టేట్ చెల్లని చెక్కు కేసులో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని జీవితా రాజశేఖర్‌ను ఆదేశిస్తూ కోర్టు సమన్లు జారీ చేసింది.

దిగ్విజయ్ అలా ఎందుకన్నారు?

      ఒక వైపు రాయల తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వడం ఖాయం అని జోరుగా ప్రచారం జరుగుతోన్న నేపధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ మాత్రం తెలంగాణ పై నిర్ణయం ఎప్పుడు అనేది చెప్పలేనని అంటున్నారు. అయితే తెలంగాణ పై ఎప్పటికి నిర్ణయం తీసుకుంటామనేది చెప్పలేమని ఆయన అనడం ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణపై అనేక డెడ్‌లైన్లు పెట్టామని, తాను కూడా అలా డెడ్ లైన్ పెట్దదలచుకోలేదని ఆయన స్పష్టం చేయడం ఆసక్తికరంగా ఉంది. తెలంగాణపై తమకంతా తెలుసని, అయితే, నిర్ణయం ఎప్పుడొచ్చేదీ తాను చెప్పలేనన్నారు. ఎప్పుడు నిర్ణయం వస్తుందో చెప్పలేననడం ద్వారా దిగ్విజయ్ సింగ్ ఇప్పటికిప్పుడు తేలదని చెబుతున్నారా?

తెలంగాణ జేఏసి ప్రజాకోర్టు

      ప్రత్యేక తెలంగాణ అంశంపై ఢిల్లీలో కీలక చర్చలు జరుతున్నాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో తెలంగాణ జేఏసి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ 29న మాసబ్‌ట్యాంక్‌లో ప్రజా కోర్టును నిర్వహించనున్నామని కోదండరామ్‌ చెప్పారు. జూలై 4, 5 తేదిల్లో ఢిల్లీలో జాతీయ పార్టీలతో కలిసి తెలంగాణపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు కూడా ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని రకాలుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీల ఆశ చూపి తెలంగాణ రాష్ట్ర ఏర్పా టును పక్కకు పెట్టాలని చూస్తోందని, ఎటువంటి ప్యాకేజీలకు ఒప్పు కొనేది ప్రశ్నే లేదని, హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణకు మాత్రమే తాము అంగీకరిస్తామని, రాయల తెలంగాణకో, ప్రత్యేక ప్యాకేజీలకో ఒప్పుకునే సమస్యలేదని స్పష్టంచేశారు.

శాస్త్రం ఒప్పుకోదు మరి, అయినా తప్పలా ఆ జీవికి

  సాధారణంగా మన తెలుగువారు ఎవరయినా చనిపోయిన వారింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి నేరుగా మళ్ళీ తమ ఇంటికే వెళ్లి శుద్ధిస్నానం చేసిన తరువాత గానీ మరెవరి ఇళ్ళకు వెళ్లరు. అయితే, ఈ సాంప్రదాయం మరి అధికారిక కార్యక్రమాలకు కూడా వర్తిస్తుందో లేదో మన చట్టాలలో వ్రాయడం మరిచిపోయారు మన రాజ్యాంగనిర్మాతలు. ప్రత్యేక విమానం వేసుకొని, నేలమీద ఎక్కడా కాలుపెట్టకుండా ఆకాశంలో గిరగిరా తిరిగేస్తూ, దేశ సేవలో, ప్రజాసేవలో నిమగ్నమయిపోయిన మన కేంద్రమంత్రి గారు చిరంజీవిగారు, ఉత్తరాఖండ్ వరదలలో చిక్కుకొని చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఓదార్పు కార్యక్రమాన్ని తన డైరీలో చూసుకొన్న వెంటనే, ఒక ప్రత్యేక విమానం వేసుకొని హడావుడిగా గన్నవరం విమానశ్రయంలో వాలిపోయారు.   వారిని ఒదార్చేసిన తరువాత, వెంటనే గుంటూరు వెళ్లి అక్కడ వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఒక శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆయన అమృత హస్తలతోనే చేయవలసి ఉంది. అయితే, ఇక్కడే ఆయన ఓదార్పు యాత్రకి శాస్త్రం అడ్డుపడింది. అటువంటి కార్యక్రమాలకి హాజరయిన తరువాత, ఎంత పట్టుపంచె కట్టుకొని, ఉత్తరీయం కప్పుకొని వెళ్ళినా శుభమా అంటూ వెళ్లి కొబ్బరి కాయలు కొట్టవచ్చునా? అనే ధర్మసందేహం మంత్రి కన్నావారికి కలగడంతో, ఆయన అదే విషయాన్నిచిరు చెవిలో ఊదేసరికి, మరో ఆలోచన చేయకుండా అయితే ‘ప్రోగ్రాం క్యాన్సిల్!’ అనేసి మళ్ళీ ప్లేను ఎక్కేయబోయారు. కానీ, ఆయన ఓదార్పుకోసం అక్కడ బాధితులు అందరూ కడుపులోదుఃఖము ఉగ్గబట్టుకొని ఎదురు చూస్తున్నారని, ఆయన వెళ్ళకపోతే వారు ఇంకా చాలా దుఃఖపడిపోతారని విజయవాడ శాసన సభ్యుడు మల్లాది విష్ణు చెప్పడంతో, పెదమంత్రిగారి మనసు చెరువయిపోయింది.   అయితే శాస్త్రం ఒప్పుకోక పోవడంతో దానిలో ఏమయినా యమండ్మెంట్స్ ఉన్నాయోమో అని అందరూ కొంత సేపు తర్జనబర్జనలు పడ్డారు. అయితే, కలియుగంలో ఒకానొక పెదమంత్రిగారికి ఇటువంటి సమస్య తలెత్తుతుందని మన పెద్దలు ముందే ఊహించలేకపోవడంతో, పర్టిక్యులర్ గా అటువంటి క్లాజులు ఏమి వ్రాసిపెట్టలేదు.   శాస్త్రం లోతుపాతులు తెలియకపోయినా సంప్రదాయంలో ఉన్న వెసులు బాటు గుర్తుకు వచ్చిన చిన మంత్రిగారు, ఒక లాజిక్ చెప్పారు. “పోయినవారందరూ చనిపోయినవాళ్ళు కాదు. వారు కనబడకుండా పోయారంతే!” అధికారులు చెప్పిన ఆ పాయింటు వరకే మనం స్వీకరించినట్లయితే మనకిక ఏ శాస్త్రం అడ్డుతగలదని భేషయిన ఆలోచన చెప్పడంతో, పెదమంత్రిగారి కంట ఉత్తరాఖండ్ వరద నీటిలా కన్నీళ్లు పొంగుకొచ్చేసాయి. అంతే! ఒక ఉదుటన మూడు మెట్ల చొప్పున ప్లేను లోంచి దూకేసి మళ్ళీ ఓదార్పుయాత్రకి సిద్దమయిపోయారు.   మనవి: మంత్రిగారి ఈ ఓదార్పుయాత్రని, జగన్ మోహన్ రెడ్డి ఓదార్పుయాత్రతో ముడిపెట్టి, ‘జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి కుమ్మక్కు’ అని నీలపనిందలువేయవద్దని తెదేపా సభ్యులకు మనవి.

టిడిపి పై హనుమంతన్న దాదాగిరి

      ఉత్తరాఖండ్ వరదలలో తెలుగు ప్రాణులు చిక్కుకొని విలవిలలాడుతుంటే, నా బంగారు తల్లి, నా ఇందిరమ్మ కలలు, నా యస్సీ ఎస్టీ బిల్లు అంటూ రానున్న ఎన్నికలకి వోటు బ్యాంకుకి ఎరలు సిద్దం చేసుకొంటూ తాపీగా కూర్చొన్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అమెరికా నుండి వస్తూనే హుటాహుటిన డిల్లీలో నిలబడి సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టి, విమానంలో ప్రయాణికులను తరలించడం మొదలుపెట్టాక గానీ, ఆ పనులన్నీ ప్రభుత్వం చేయాలని గుర్తుకు రాలేదు ముఖ్యమంత్రిగారికి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి వరద బాధితులను స్వస్థలాలకు తరలించేందుకు టిడిపి తో పాటు కాంగ్రెస్ కూడా విమానాలను ఏర్పాటు చేసింది. అయితే టిడిపి ఏర్పాటు చేసిన విమనాలనే భాదితులు ఎక్కుతుండడంతో కాంగ్రెస్ నేతలు అడ్డుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో ఎక్కాలని బాధితులపై ఒత్తిడి తేవడంతో నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. చివరికి హనుమంతరావు, రమేష్ రాథోడ్ ల మధ్య తోపులాటకు దారి తీసింది. దీంతో సెక్యూరిటీ అడ్డుకొని నేతలను శాంతపరిచారు. సంఘటన స్థలాల నుంచి బాధితులను తాము తీసుకోనివస్తే...ఎయిర్ పోర్ట్ లో వారిని ప్రభుత్వ విమానాలు ఎక్కాలని చెప్పడం ఏంటని టిడిపి నేతలు ప్రశ్నించారు. ఇటు భాదితులు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

ఎట్టకేలకు మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం

  రోమ్ నగరం తగల బడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిని ఇక మనం రిఫరెన్స్ కోసం వాడుకోనవసరం లేదు. అతనికి ఏమాత్రం తీసిపోని కిరణ్ కుమార్ రెడ్డి మనకి ఉన్నారిప్పుడు. ఉత్తరాఖండ్ వరదలలో తెలుగు ప్రాణులు చిక్కుకొని విలవిలలాడుతుంటే, నా బంగారు తల్లి, నా ఇందిరమ్మ కలలు, నా యస్సీ ఎస్టీ బిల్లు అంటూ రానున్న ఎన్నికలకి వోటు బ్యాంకుకి ఎరలు సిద్దం చేసుకొంటూ తాపీగా కూర్చొన్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అమెరికా నుండి వస్తూనే హుటాహుటిన డిల్లీలో నిలబడి సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టి, విమానంలో ప్రయాణికులను తరలించడం మొదలుపెట్టాక గానీ, ఆ పనులన్నీ ప్రభుత్వం చేయాలని గుర్తుకు రాలేదు ముఖ్యమంత్రిగారికి. ఇక, విప్పత్తుల నిర్వహణ చూసుకొంటున్న మంత్రి రఘువీరా రెడ్డి గారికయితే, వరదలు వచ్చిన నాలుగయిదు రోజులవరకు ఆ విషయమే పట్టలేదు.   మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా మేల్కొని ఒక బృందం వైద్యులను డిల్లీకి, మరొక బృందాన్ని డెహరాడూన్ కి, మరొకటి హరిద్వార్ కి పంపించింది. కానీ, అప్పటికే సగం మంది బాధితులను తెదేపా వారి వారి నగరాలకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తరలించేయడంతో, వైద్య బృందాలు ఇంకా మిగిలిన తెలుగు వారికి, అక్కడికి చేరుతున్న ఇతర రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. ఇంత జరిగాక ఇంకా అపఖ్యాతి మూట కట్టుకోవడం ఎందుకనుకోన్నారో ఏమో, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విమానాన్ని, హరిద్వార్ నుండి ఒక ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేసింది.   విపత్తు సంభవించగానే స్పందించాల్సిన ప్రభుత్వం అప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని ఇప్పుడు వారం రోజుల తరువాత హెల్ప్ లైన్లు, వైద్య బృందాలు, ఆంధ్ర భవన్లో భోజన, వసతి సౌకర్యాలు, ప్రత్యేక రైళ్ళు, విమానాలు అంటూ హడావుడి మొదలుపెట్టింది. ఇదేపని మొదటి రోజునుండే మొదలుపెట్టి ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది. కానీ, నలుగురితో చెప్పించుకొన్నాక, ప్రతిపక్షాలు విమర్శలు చేసిన తరువాత గానీ రాష్ట్ర ప్రభుత్వానికి తన కర్తవ్యం ఏమిటో భోధపడలేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక ‘మేల్కొలుపు శాఖ’ను కూడా కొత్తగా ఏర్పాటు చేసుకొంటే మేలేమో. కానీ, దానిని మేల్కొల్పడానికి మరొకరు ఉండాలేమో!

సినీ పరిశ్రమకు ఆయువు పోసిన విజయవాడ

  నేడు వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన విజయవాడ ఒకానొకప్పుడు సినీ పరిశ్రమకి రాజధానిగా ఉండేది. సినీ నిర్మాణమంతా మద్రాసులో జరిగినప్పటికీ, వాటిని ప్రర్శించుకోవాలంటే నిర్మాతలు తప్పనిసరిగా విజయవాడలోని గాంధీ నగర్లో అడుగుపెట్టాల్సిందే.   ప్రసిద్ధిగాంచిన నవయుగ ఫిలిమ్స్, శ్రీ ఫిలిమ్స్ వంటి అనేక నిర్మాణ సంస్థల కార్యాలయాలన్నీ అక్కడే ఉండేవి. రాష్ట్రంలోని మొట్ట మొదటి సినిమా హాలు మారుతి టాకీస్ విజయవాడలో నిర్మించబడటం, ఆ తరువాత దుర్గాకళామండపం, లక్ష్మీ టాకీస్, సరస్వతి టాకీస్, రామా టాకీస్ వంటి డజనుకు పైగా సినిమా హాళ్ళు కూడా అక్కడే నిర్మించబడటం, పంపిణీ సంస్థలు, ఫైనాన్సర్లు కూడా అక్కడే ఉండటంతో, విజయవాడ నగరం సినీ రంగానికి రాజధానిగా దాదాపు మూడు నాలుగు దశాబ్దాలపాటు ఒక వెలుగు వెలిగింది.   ఆంద్రరత్న రోడ్డు, నాగేశ్వరావు పంతులుగారి వీధిలో దాదాపు డజనుపైగా సినిమా హాళ్ళు ఉండటంతో అక్కడికి ప్రేక్షకులతో బాటు సినిమా జనాలు కూడా తరచూ వస్తూనే ఉండేవారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆవీధిలో ఉండే దుర్గాకళామందిరానికి ఆనుకొని చిన్న లాడ్జీలో ఎప్పుడు బస చేస్తుండేవారు.ఇక సినీ నటుడు కృష్ణ, శోభన్ బాబు, సత్యనారాయణ, గుమ్మడి, రేలంగి వంటి ప్రసిద్ద నటులు కూడా తరచు గాంధీనగర్ లో కనబడుతూనే ఉండేవారు. శతాధిక చిత్ర నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన డా.రామా నాయుడు కూడా తన కుమారుడు సురేష్ బాబుని వెంటబెట్టుకొని తరచూ గాంధీనగర్ వస్తూనే ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం కూడా గాంధీనగరంలోనే నెలకొల్పబడటంతో నటులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్ కూడా అక్కడికి తరచూ వస్తూపోతూ ఉండేవారు.   అయితే ఇదంతా గత చరిత్రగా మిగిలిపోయింది. మారుతి, సరస్వతి, లక్ష్మి సినిమా హాళ్ళు కూల్చివేసి ఆ స్థానంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టబడటంతో, క్రమంగా ఆ ప్రాంతం వ్యాపార కార్యక్రమాలకు నెలవుగా మారిపోయింది. అయితే నేటికీ ఆంద్ర రత్న రోడ్డులో ఉన్న రామా టాకీస్, మరియు దుర్గ కళామందిర్ సినిమా హాళ్ళు ప్రేక్షకులను రంజింపజేస్తూనే ఉన్నాయి. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రమంతటా పంపిణీ దారుల కార్యాలయాలు, సినిమా హాళ్ళు ఏర్పడటంతో హైదరాబాద్ కేంద్రంగా సినీ పరిశ్రమ దశదిశలా విస్తరించింది.

తెలంగాణా కబుర్లు

  రాజకీయ వర్గాలలోను, మీడియాలోనూ తెలంగాణా అంశం ఇక క్లైమాక్స్ వచ్చేసినట్లు చాలా హడావుడి జరుగుతోంది. డిల్లీ నుండి రోజూ కొత్త కొత్త కాంబినేషన్లతో ప్యాకేజీలు వెలువడుతుంటే, దానిపై రాష్ట్రంలో మేధావులు బుర్రలు బ్రద్దలుకొట్టుకొని దానిలో పరమార్ధం కనిపెట్టేపనిలో పడ్డారు.   ఈ రోజు, తాజాగా విడుదలయిన ప్యాకేజీలో హైదరాబాదుతో కూడిన తెలంగాణా ఏర్పాటు చేసేసి, తెరాస నేతలు సలహా ఇచ్చినట్లు ఆ ప్యాకేజీ ఏదో సీమంద్రాకే ఇచ్చేస్తే ఎలా ఉంటుందని? అని ఒక సరికొత్త ఐడియా కాంగ్రెస్ పెద్దల బుర్రలో వెలిగినట్లు మీడియా కనిపెట్టేసింది.   ఇక, ఆవిధంగా చేసేసి, ఆడిన మాట తప్పని సత్య హరిశ్చంద్రుడి వంటి కేసిఆర్, తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తాడా లేదా అనే ధర్మ సందేహం కలగడంతో, ఇటువంటి బాక్ డోర్ సంప్రదింపులకు తెరాస ఇన్-చార్జ్ గా బాధ్యతలు చెప్పటిన కేశవ్ రావుని కాంగ్రెస్ పెద్దలు కాంటాక్ట్ చేసారుట! అదే బెటరని ఆయన కేసీఆర్ కి నచ్చజెప్పబోతే, ఎప్పుడో ఏడాది క్రిందట పండుగ సందర్భంగా ఇచ్చిన బంపర్ ఆఫర్ ను కాదన్న వాళ్ళు,మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు దగ్గిరపడిన తరువాత అడిగితే కుదరదని, కావాలనుకొంటే ఎన్నికల పొత్తులలకి తమని కాంటాక్ట్ చేసుకోమని కేసీఆరే స్వయంగా హాట్ లైన్లో సోనియమ్మకు తెగేసి చెప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి.   అయితే, కాంగ్రెస్ పెద్దలు కేసీఆర్ మాటలని నమ్మి అంత రిస్క్ తీసుకొనే సాహసం చేయలేకపోతున్నారుట. ఇచ్చేస్తే ఇక్కడ తెరాస, అక్కడ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి కాంగ్రెస్ కొంప కొల్లేరు చేసేస్తారని చిలకల సమాచారం. అందువల్ల తెలంగాణా కాంగ్రెస్ నేతలను నమ్ముకొని తెలంగాణా ఇచ్చేస్తే వారు గనుక కేసీఆర్ ధాటికి తట్టుకోలేక, సరిగ్గా ఎన్నికల సమయంలో హ్యాండ్స్-అప్ చేసేస్తే కాంగ్రెస్-పుట్టి మునిగిపోతుందని ఆందోళన చెందుతూ, ఏమి చేయాలో పాలుపోక, మళ్ళీ కోరు కమిటీ రూములోకి వెళ్లిపోయి తలుపులు వేసుకొని మరో కొత్త ఐడియా కోసం బుర్రలు బ్రద్దలు కొట్టుకొంటున్నారు...ట!

ఇప్పుడు ఆత్మీయయాత్ర ఎందుకో

  తెరాస బాకా పత్రిక ‘నమస్తే తెలంగాణా’ కి రాష్ట్ర విభజనని వ్యతిరేఖిస్తున్న అంధ్రాప్రాంత ప్రజలకి తెలంగాణా విభజన పట్ల కలిగే లాభాలను వివరించాలని అకస్మాత్తుగా బుద్ది పుట్టింది. అనుకొందే తడవుగా ‘ఆత్మీయయాత్ర’ అనే పేరు తగిలించుకొని అంధ్రాప్రాంతంలో పర్యటన మొదలుపెట్టేసింది కూడా. రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిసుందామని ప్రజలకి నచ్చజెప్పడం దాని మరో ఉద్దేశ్యం.   ఆంధ్ర ప్రాంత ప్రజలను నోటికి వచ్చినట్లు తిడుతూ, ఇంత కాలంగా అన్నదమ్ములవలె కలిసి న్నరెండు ప్రాంతాల ప్రజల మద్య పెట్టవలసిన చిచ్చుఅంతాపెట్టిన తరువాత,ఇప్పుడు ఆ పుండు మీద కారం చల్లడానికన్నట్లు, మొదలుపెట్టిన ఈ ‘ఆత్మీయయాత్ర’కి ఎటువంటి స్పందన వస్తుందో తెలియకనే ఈ యాత్ర మొదలుపెట్టలేదు.   మొన్న రఘునందన్ రావు హరీష్ రావుపై చేసిన వసూళ్ళ ఆరోపణలతో, నిన్నఆంధ్రజ్యోతి పత్రికలో కేటీఆర్ మీద సెటిల్మెంటు ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేసీఆర్ కుటుంబం మీద, ఇటీవల హైదరాబాదులోని ఒక సాధారణ ఆటో డ్రైవర్ లక్ష్మి నారాయణ అనే యువకుడు తెలంగాణా కోసం ఆత్మహత్య చేసుకొంటూ వ్రాసిన లేఖలో కేసీఆర్ , అతని కుటుంబ సభ్యులు ఉద్యమాలు పక్కన బెట్టి, ఎన్నికలు పేరుతో డబ్బు సంపాదన కోసం అర్రులు చాస్తునారంటూ చేసిన ఆరోపణలు, తన చావుకి కేసీఆరే కారణమని స్పష్టంగా వ్రాయడంతో ప్రజలకి సమాధానం చెప్పలేక కేసీఆర్, అతని కుటుంబ సభ్యులు నానాఅవస్థలు పడుతున్నారు. బహుశః వీటన్నిటి నుండి బయటపడేందుకే, కేసీఆర్ తన చేతిలో ఉన్న ‘నమస్తే పత్రిక’ని ఈ యాత్రకి పంపించి ఉండవచ్చును.   దాని పర్యవసానం ఎలాఉంటుందో తెలియని అజ్ఞాని కాదు అతను. ఊహించినట్లే, నమస్తే పత్రికపై కొందరు దాడి చేయడం వెన్వెంటనే తెలంగాణాలో నిరసనలు, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలూ, దిష్టిబొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలు అంతా ఖచ్చితంగా జరిగిపోయాయి. ఇప్పటికే, రెండు ప్రాంతాల మధ్య ప్రజల మద్య చిచ్చుపెట్టిన కేసీఆర్ కుటుంబం, తనను తాను రక్షించుకొనేందుకు, ఇప్పుడు మీడియాకు కూడా ఆజాడ్యం అట్టించాలని ప్రయత్నిస్తునట్లు కనబడుతోంది.   ఇక,ఒక సాదారణ ఆటో డ్రైవర్ కూడా కేసీఆర్ తెలంగాణా ఉద్యమాలలో నిబద్దత లేదని గుర్తించి ఎత్తిచూపినపుడు, అక్కడి ప్రజలకి ఈ విషయం తెలియదని, వారు గ్రహించలేరని కేసీఆర్ కి తెలియకపోదు. తన పదేళ్ళ తెలంగాణా అంశాన్ని ఎన్నికలు దగ్గిరపడుతున్న సమయంలో ఆఖరి నిమిషంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసి ఎత్తుకుపోవాలని చూస్తుండగా, మరో వైపు వసూళ్లు, సెటిల్మెంటులు, కిడ్నాపులు ఆరోపణలలో చిక్కుకోవడం, కేసీఆర్ కే కాదు ఆపరిస్థితుల్లో ఉన్న ఏ రాజకీయ నాయకుడయినా ఎలాగయినా బయటపడి, పరిస్థితులను మళ్ళీ తన అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా బహుశః అదే చేసాడని చెప్పవచ్చును.   కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తులను ఎదుర్కోవడానికి, పనిలోపనిగా తమమీద వస్తున్న ఆరోపణల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఈ ఆత్మీయయాత్ర మొదలుపెట్టించి ఉండవచ్చును. ఎన్నికల కోసం తెలంగాణా ఉద్యమాలను పక్కన పడేసిన తరువాత, చల్లబడిన తెలంగాణా సెంటిమెంటుని కూడా పనిలోపనిగా ఈ యాత్ర ద్వారా రెచ్చగొడితే, త్వరలో జరగనున్న పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలలో పార్టీకి లాభదాయకంగా ఉంటుందనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చును.   కేసీఆర్ కి లేదా నమస్తే తెలంగాణా పత్రికకి నిజంగా రెండు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యం సృష్టించి, అన్నదమ్ములుగా విడిపోయేలా చేయాలనే ఉద్దేశ్యమే ఉంటే, ఇటువంటి చవకబారు ఆలోచనలకు బదులు, ఇరుప్రాంతాల మేధావులను ఒక చోటకు చేర్చి అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారం కోసం ప్రయత్నించి ఉండేవారు.   రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిగి, పరిష్కరించబడవలసిన తెలంగాణా సమస్యను కేంద్రంపైకి నెట్టేసి చేతులు దులుపుకొని, ఉద్యమాలు చేసుకొంటూ రాష్ట్రాన్ని తిరోగమన పధంలోకి నడిపిస్తున్న కేసీఆర్, తన స్వలాభం కోసం ఇటువంటి నీచమయిన ఎత్తుగడలకి పాల్పడటం అందరూ ఖండించాల్సిందే.

తెలంగాణపై కాంగ్రెస్‌ కొత్త పల్లవి

      ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ విషయం పై కాంగ్రెస్‌ ఎటూ తేల్చుకోలేకపోతుంది.. అందుకే కాంగ్రెస్‌ నాయకులతో పాటు అధిష్టానం కూడా రోజుకో మాట చెపుతూ తెలంగాణ ప్రజల మనోభావలతో ఆడుకుంటుంది..   ఇన్నాళ్లు తెలంగాణ అంశాన్ని తేల్చాడానికే అధిష్టానం సంప్రదింపులు జరుపుతుందని చెప్పిన కాంగ్రెస్‌ ఇప్పుడు మరో సారి కొత్త పల్లవి అందుకుంది..గతంలో తెరమీదకు వచ్చిన రాయల్‌ తెలంగాణ అంశాన్ని మరోసారి పరిశీలిస్తున్నట్టుగా చెపుతుంది.. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ జిల్లాలతో పాటు రాయలసీమలో అనంతపూర్‌, కర్నూల్‌ జిల్లాలను కూడా కలిపి రాయల్‌ తెలంగాణగా ఏర్పాటు చేసే ఆలోచన కూడా పరిశీలిస్తున్నారట.. తెలంగాణాలోని 119 నియోజిక వర్గాలతో పాటు కర్నూలు 14, అనంత పూర్‌ 14 నియోజిక వర్గాలు కలిపి మొత్తం 147 స్థానాలు అవుతాయి అంటే సరిగ్గా ఆంద్రప్రదేశ్‌లోని సగం స్ధానాలు.. ఇలా సరిగ్గా రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించే ఆలొచనలో ఉందట అధిష్టానం.. ప్రస్థుతం స్థానిక సమరం ఉన్నందున అవి పూర్తవగానే వీలైనంత త్వరగా అసెంబ్లీలో ఈ తీర్మాణం పెట్టాలని భావిస్తుందట.. మరి మాట మీదైన కాంగ్రెస్‌ నిలబడుతుందో లేదో చూడాలి..  

కెసిఆర్‌ పై కూతురు ఫైర్‌

      తెలంగాణ ఉద్యమాన్ని తనే ముందుండి నడిపిస్తున్నట్టుగా చెప్పుకుంటున్న కెసిఆర్‌పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.. పార్టీ నుంచి రఘునందన్‌ లాంటి సీనియర్‌ సస్పెండ్‌ చేయడంతో ఆయన టిఆర్‌ఎస్‌ పార్టీలో జరిగిన దందాలను బయట పెట్టాడు..   దీంతో కెసిఆర్‌ పై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.. ప్రముఖ న్యాయవాధి బాలాజీ వడేరా కెసిఆర్‌ ఆస్తుల పై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. దీంతో పాటు కెసిఆర్‌ ఇంటి ముందు తలపెట్టిన చావుడప్పు లక్ష చెప్పుల నిరసన కార్యక్రమంలో స్వయానా కెసిఆర్‌ అన్నకూతురు రమ్య తానే స్వయంగా పాల్గొంటానని చెప్పారు.. అంతేకాదు ఉత్తారఖండ్‌ వరదల్లో మృతి చెందిన తెలంగాణా ప్రాంత ప్రజలకు కెసిఆర్‌ కనీసం సంతాపం కూడా తెలుపకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు..

కరుణని కరుణించిన కాంగ్రెస్‌

  గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న తమిళనాడు రాజ్యసభ ఎన్నికల సస్పెన్స్‌కు కాంగ్రెస్‌ తెరదించింది.. ఇన్నాళ్లు ఏ పార్టీకి సపోర్ట్‌ చేస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికలలో కరుణానిధి పార్టీ తరుపున నిలబడుతున్న కనిమొలిని బలపరచాలని నిర్ణయించింది.   గత కొద్ది రోజులుగా తన గారాలపట్టి కనిమొళిని గెలిపించుకోవటం కోసం కరుణానిధి అన్ని పార్టీలతో తీవ్రంగా చర్చలు జరిపారు. చివరకు ఆ చర్చలు ఫలించి కాంగ్రెస్‌ పార్టీ కరుణను కరుణించింది.. రాజ్యసభ ఎన్నికల్లో డియంకె పార్టీ తరుపున నిలబడుతున్న కనిమొళికి తన మద్దతు తెలపనుంది.   కానీ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించిన తరువాత కూడా కనిమొళికి పూర్తి మెజారిటీ మాత్రం రాలేదు.. ఇప్పటికే డియంకె పార్టీకి 23 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్‌ నుంచి ఐదుగురు, పిటి నుంచి ఇద్దరు, ఎం ఎం టి నుంచి ఇద్దరు ఆ పార్టీకి సపోర్ట్‌ చేస్తున్నారు.. అయితే అందరూ కలిసి కూడా 32 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది.. రాజ్యసభకు ఎన్నిక అవ్వాలంటే 34 మంది సభ్యుల మద్దతు అవసరం.   ఇప్పటికే కాంగ్రెస్‌ అనుకోని విధంగా డియంకెకి మద్దతు ఇవ్వటంతో రేపు జరగనున్న ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారో అన్నది ఆసక్తిగా మారింది.. మరి కాంగ్రెస్‌ కరుణించినా కరుణ కల నెరవేరుతుందా, కనిమొళి గట్టుక్కుతుందా చూడాలి..

టీ-కాంగ్రెస్ నేతల సభ ఏమి సాధిస్తుంది

  కాంగ్రెస్ అధిష్టానంతో తెలంగాణా అంశంపై రెండు రోజులు తీవ్ర మంతనాలు జరిపి నగరానికి తిరిగి వచ్చిన మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్, పార్టీ అధిష్టానం తెలంగాణా ఇస్తుందో లేదో, అసలు తెలంగాణపై పార్టీ ఆలోచనలు ఏమిటో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని చెపుతూనే, మరో వైపు తమ పార్టీ తెలంగాణా ఇస్తుందని ఆశిస్తున్నట్లు కూడా చెప్పడం విశేషం. పైగా, ఆయన రేపు 30వ తేదీన జరిగే టీ-కాంగ్రెస్ నేతల సభ విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నట్లు చెపుతూ, తానూ కూడా ఆ సభలో పాల్గొంటానని చెప్పారు.   డీ.యస్. మాటలను బట్టి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ తెలంగాణా అంశంపై నాన్పుడు ధోరణి అవలంభించేందుకే మొగ్గు చూపుతున్నట్లు అర్ధం అవుతోంది. అదే జరిగితే, తాము రాజకీయాలలో కొనసాగడం కష్టమని సున్నితంగా ఆయన తన మనసులో మాటను తెలియజేసారు.   రేపు 30వ తేదీన జరిగే టీ-కాంగ్రెస్ నేతల సభ వల్ల అసలు ఏమయినా ప్రయోజనం ఉంటుందా అంటే అనుమానమే. ఎందుకంటే, పార్టీ యంపీలు పార్లమెంటు మెట్ల మీద రెండు రోజులు పడిగాపులు కాసినప్పటికీ, ముగ్గురు నేతలు పార్టీ వీడి తెరాసలో చేరినప్పటికీ పట్టించుకోని అధిష్టానం ఇప్పుడు ఈ తాటాకు చప్పుళ్ళకి బెదరదని ఖచ్చితంగా చెప్పవచ్చును.   టీ-కాంగ్రెస్ నేతలకు పదవీ లాలస, టికెట్స్ యావ ఉన్నంత కాలం వారు తన పెరట్లో కుందేళ్ళ వంటి వారని కాంగ్రెస్ అధిష్టానం నిశ్చితాభిప్రాయం. అదే మాటను తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల, టీ-కాంగ్రెస్ నేతలు తమ ఈ బలహీనతలను పక్కన బెట్టి తెలంగాణా కోరినప్పుడే కాంగ్రెస్ అధిష్టానం కూడా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ, పార్టీ గనుక తెలంగాణా ప్రకటన చేయకపోతే, టీ-కాంగ్రెస్ నేతలందరూ కూడా రానున్న ఎన్నికలలో పోటీ చేయకుండా ఎన్నికలను బహిష్కరిస్తే బాగుంటుందని చేసిన ప్రతిపాదనకు, అది ఆచరణలో అమలు చేయడం అసాధ్యమని, అందువల్ల ఈవిషయంలో ఎవరికీ వారు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవలసిందేనంటూ మంత్రి జానారెడ్డి వెంటనే టకీమని జవాబు చెప్పడం గమనిస్తే, వారి బలహీనతలు అర్ధం అవుతుంది.   ఇటువంటి పరిస్థితిలో వారు పెట్టుకొనే సభలు సమావేశాలు, ప్రజలను మభ్య పెడుతూ ఎన్నికలదాకా కాలక్షేపం చేయడానికి, తెరాస దాడుల నుండి తమను తాము కాపాడుకోవడానికే తప్ప వేరే ఏ ప్రయోజనం కొరకు కాదని చెప్పవచ్చును. ఇక, కాంగ్రెస్ అధిష్టానం కూడా వారి నుండి సరిగ్గా ఇటువంటి టైం పాస్ ఆలోచనలనే కోరుకొంటోందని చెప్పవచ్చును.

తూర్పున ఉదయించేది రవే

  విజయవాడ సాక్షిగా మరోసారి కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు రాజకీయాలు తెరమీదకు వచ్చాయి.. ఎప్పుడు వర్గ పోరుతో సతమతమవుతున్న పార్టీని రాజశేఖర్‌రెడ్డి కాస్త కట్టిడి చేసిన ఆయన మరణం తరువాత పరిణామాలు మళ్లీ పరిస్థితిని మొదటికి తీసుకువచ్చాయి.. ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తరువాత ఈ గొడవలు మరింత ఎక్కువయ్యాయి.   తాజాగా విజయవాడ తూర్పు అసెంబ్లీ సీటు విషయంలో కాంగ్రెస్‌ నేత నెహ్రూ, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రవి బహిరంగ విమర్షలు చేసుకుంటున్నారు. ఈ విషయంలో రవి నెహ్రూపై ఆయనకు మద్దతు నిస్తున్న లగడపాటి రాజగోపాల్‌ పై విమర్షలు గుప్పించాడు.. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయినప్పుడు తనకు విజయవాడ తూర్పు సీటుకు అధిష్టానం హామి ఇచ్చిందని.. ఇప్పుడు నెహ్యూ ఎన్ని రాజకీయాలు చేసి వేస్ట్‌ అంటూ కార్యకర్తల సమావేశంలో ప్రకటించాడు. అయితే ఇప్పటికే ఆ సీటు మీద ఆశతో అక్కడ తన ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న నెహ్రూ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడో.. మరి ఈ గొడవను సద్దుమనిగించడానికి కాంగ్రెస్‌ పెద్దలు ఎలాంటి రాయభారాలు నడిపిస్తారో చూడాలి..

ఈ సారి హాలీం గుభాలింపులూ అందవు

  రంజాన్‌ మాసం దగ్గర పడుతుండటంతో అప్పుడే ఆ సందడి మొదలైంది.. రంజాన్‌ మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది హాలీం.. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ ఎంజాయ్‌ చేసే ఈ హాలీం టేస్ట్‌ ఈ సారి మరింత కాస్ట్లీ కానుంది. పెరిగిన ధరలు పండగ సందడి మీద కూడా భారీ ప్రభావం చూపనున్నాయి.. నిత్యావసారలతో పాటు పెరిగిన ఆయిల్‌, చికెన్‌, మటన్‌ రేట్లు ఈసారి హాలీంను సామాన్యుడికి దూరం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్లేట్‌ 70కి పైగా పలుకుతుండగా ఈ సారి ఆ రేట్‌ 100 రూపాయలు దాటుతుందంటున్నారు.. డైరెక్ట్‌గానే కాదు ఇండైరెక్ట్‌గా కూడా హాలీం భారం కానుంది.. పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలతో ట్రాన్స్‌పోర్టేషన్‌ కూడా భారంగా మారనుంది. పెరిగిన విధ్యుత్‌ చార్జీల భారం కూడా హాలీం కనిపించనుంది.. హాలీం సెంటర్లను విధ్యుత్‌ దీపాలతో అందంగా ముస్తాబు చేసే హాటల్‌ వారు ఆ ఖర్చును కూడా వినియోగదారుడినుంచే వసూలు చేయాలని భావిస్తున్నారు. ఇలా ఒకటి దానితో ఒకటి కలిసి హాలీం రేటు ప్లేటు 100 రూపాయలను దాటిస్తున్నాయి.. మరి ఇంత రేటుతో ఈ సారి అమ్మకాలు ఎలా ఉండనున్నాయో చూడాలి..  

నితిష్‌ గుప్పిట్లో బిజెపి గుట్టు

  నరేంద్రమోడికి సారధ్యం అప్పగించిన తరువాత అలిగి ఎన్‌డిఎకు దూరమైన నితీష్‌ ఇంకా బిజెపి పై కత్తులు దూస్తూనే ఉన్నారు.. నితీష్ పార్టీని వీడిన దగ్గర నుంచి బిజెపి నాయకులు నితీష్‌ లక్ష్యంగా తీవ్ర విమర్శలను గుప్పించారు.. అయితే ఇన్నాళ్లు పూర్తి స్థాయిలో ప్రతి విమర్శలకు దిగని నితీష్ ఇప్పుడు తన మాటల వాడి చూపిస్తున్నారు.   తాను నోరు తెరిస్తే ఎంతో మంది  బిజెపి నేతల గుట్టు బయటపడుతుందన్నారు.. ఆదివారం జరిగిన ర్యాలీలో నితీష్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేసిన రాజ్‌నాధ్‌కు తన మాటలతో కౌంటర్‌ ఇచ్చారు నితీష్.   అయితే ఇన్నాళ్లు నితీష్‌ దూరమవ్వటంతో రాజకీయంగా మాత్రమే నష్టం అనుకున్న  బిజెపికీ ఇప్పుడు తాజా పరిణామాలతో నితీష్‌ మూలంగా కొంత మంది నాయకులు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడాల్సివస్తుందేమో అని భయపడుతున్నారు..

రాం చరణ్ వి అన్నీఅబద్దాలేనట

  మొన్నామధ్య మన మగధీరుడు-రాం చరణ్ తేజ్ తన కారుకి అడ్డొచ్చిన పాపానికి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకి తన మెగాతండ్రిగారి సెక్యురిటీ సిబ్బందితో నడిరోడ్డు మీద ఉతికేయించిన తరువాత, పాపం! వారి ఉద్యోగాలు పోతాయని జాలిపడి వారి మీద పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండా వదిలేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, అతని దయార్ద హృదయం అర్ధం చేసుకోలేని మీడియా మాత్రం, సెక్యురిటీ గార్డులు, ఆ ఇద్దరు పిలకాయలను నడిరోడ్డు మీదే చితకకొట్టిన్నట్లుగాను, ఆ కొట్టుడు కార్యక్రమాన్ని మన మగధీరుడు పక్కన నిలబడి చూసి ఆనందిస్తునట్లుగాను, జరగనిది జరిగినట్లుగా వార్తలు గీకిపడేసి, లేనిదీ ఉన్నట్లుగా ఫోటోలను మార్ప్ఫింగ్ చేసి, ఆయనను అప్రదిష్ట పాలుచేసే ప్రయత్నం చేసాయి. అయినప్పటికీ, చరణ్ బాబు మళ్ళీ రచ్చచేయకుండా కేవలం చిన్న ఖండనతో సరిపెట్టేసి, వారిని కూడా వదిలిపెట్టేసి మరో మారు తన విశాల హృదయాన్ని ఈ కుత్సిత ప్రపంచానికి చాటి చెప్పాడు.   అయితే, కాకుల వంటి లోకులు నోళ్ళు మూయించడం చాలా కష్టమని ఆయనకి అర్ధమవడంతో, ఇక పీడకల వంటి స్ట్రీట్ ఫైట్ ని ఫ్లాష్ బ్యాక్ లోపడేసి నన్నెదిరించే మొనగాడు ఎవడు అంటూ బిజీ అయిపోయాడు. అయితే లోకంలో అందరూ ఆయనంత ఉదార హృదయులు, మంచి వారే కాకుండా ‘సలీం’ వంటి దుర్మార్గ న్యాయవాదులు కూడా ఉంటారు. కందకు లేని దురద కత్తి పీట కెందుకన్నట్లు, రాం చరణ్ జాలితో వదిలేసిన కేసుని, రాం చరణ్ పక్కా నిర్దోషి అని పక్కా జడ్జిమెంట్ ఇచ్చేసిన పోలీసులని కాదని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమవల్ల కాదని ముగించిన అధ్యాయాన్ని, పుచ్చుకొని మానవహక్కుల సంఘం(మా.హ.సం.)లో కేసువేశారు.   ఆ ఇద్దరు సాఫ్ట్ వేర్ పిలకాయలను అటు రాం చరణ్ వాయించి వదిలిపెడితే, కనీసం అతని మీద కేసయినా నమోదు చేయలేదు, పిలకాయలని ఆసుపత్రికి తీసుకుపోయి వైద్య పరీక్షలయినా చేయించలేదు, అసలు ఎవరు దోషో ఎవరు నిర్దోషో జడ్జిమెంటు ఇవ్వడానికి పోలీసులెవరు? అంటూ తన బుర్రకి తోచిన తిక్కతిక్క ప్రశ్నలు అన్నీ వేయడంతో, పాపం! మా.హ.సం.వారు కూడా “నిజమే! ఇదీ పాయింటే స్మీ! అని ఆయన మాటలు పట్టుకొని ఆ వ్యవహారం మీద దర్యాప్తు జరిపి నివేదిక ఇమ్మని నగర పోలీసు కమీషనరుకి హుకుం జారీ చేసారు.   ఒక పక్క రోజూ సరికొత్త హాట్ టాపిక్స్ కుప్పలు కుప్పలుగా వచ్చిపడిపోతుంటే, ఈ పాత శోదంతా అందరూ మరిచిపోయినా, మన దేశంలో చట్టం తన పని తానూ చేసుకుపోయే రూలోకటి ఉంది గనుక, మా.హ.సం. నుండి తాఖీదులు అందుకొన్న నగర పోలీసు కమీషనరు దర్యాప్తు పూర్తి చేసి నివేదిక మా.హ.సం. చేతిలో నిన్ననే పెట్టారు.   అయితే, లోకంలో చెడ్డవారు అన్ని చోట్లా ఉంటారన్నట్లు ఆయన కూడా మన చరణ్ బాబుదే తప్పన్ని, ఆయన అన్నీ అబద్దాలే చెప్పాడని, మీడియాలో ప్రచురించిన ఫోటోలు అన్నీ నిజమయినవేనని, సెక్యురిటీ వాళ్ళు పిలకాయాలని రోడ్డు మీద పీకడం నిజమేనని, పోలీసులు కేసు నమోదు చేయలేదని, జరిగినది జరిగినట్లుగా అంతా పూస గుచ్చినట్లు వివరించి చెప్పేసాడా పెద్దాయన. అయితే, ఎందుకయినా మంచిదని ఆ సాఫ్ట్ వేర్ పిలకాయలు, చరణ్ బాబు ముగ్గురూ కూడా తెలుగులో, ఇంగ్లీషులో బూతులు తిట్టుకొన్నాకనే ఈ సీన్లనీ జరిగాయంటూ చిన్న కవరింగ్ ఇచ్చాడు.   ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదని అంటారు గానీ ఇలా పోలీసుల నోటిలో కూడా నానదని వినడం ఇదే మొదటిసారి. చట్టం తన పని తానూ మరీ ఇంత నిక్కచ్చిగా చేసుకుపోగలదని మనమేమైనా కలగన్నామా? అయితే ఈ కధ ఇంతటితో ముగిసిపోయిందో లేదో మ.హ.సంఘం వారే చెప్పాలి.