పావురాళ్ల గుట్ట ఘటనకు 16 ఏళ్లు..

వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. తాను 2004 ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావ‌డానికి పాద‌యాత్ర చేసే ముందు.. చాలా చాలా తీవ్రంగా బాధ ప‌డ్డారు. కార‌ణం చంద్రబాబు పాలన, విధానాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు  చూస్తుంటే అస‌లు మ‌నం సీఎం కావ‌డం క‌ల్ల అన్న‌ది అప్పటికి ఆయ‌న భావన, ఆవేద‌న‌. ఈ విష‌యం త‌న ఆత్మగా చెప్పుకునే కేవీపీ కి చెప్పుకుని బాధ ప‌డ్డారని  చెబుతుంది ఆయ‌న బ‌యోపిక్ గా వ‌చ్చిన యాత్ర‌. త‌ర్వాత ఆయ‌న మాస్ నాడి ప‌ట్టుకున్నారు. ఆ పాద‌యాత్రకు అప్పటి వ‌ర‌కూ వ్యతిరేకిస్తూ వ‌చ్చిన ప‌త్రిక‌లు కూడా బాగా హైలెట్ చేసి చూపించ‌డంతో.. ఆయ‌న అనూహ్యంగా 2004 ఎన్నిక‌ల‌ను గెలిచారు. అంత‌క‌న్నా ముందు చంద్రబాబు అలిపిరి బ్లాస్టింగ్ జ‌ర‌గ‌టం,  ఆ సానుభూతి ప‌వ‌నాలు, ఆపై తాను మోడ్రన్ అడ్మినిస్ట్రేట‌ర్ గా పేరు సాధించ‌డం వంటి అంశాలేవీ ప‌ని చేయ‌లేదు. వైయ‌స్ పాద‌యాత్ర ద్వారా మాస్ లోకి మ‌రీ ముఖ్యంగా రైతాంగంలోకి వెళ్లడంతో.. ఆయ‌న పంట, కాంగ్రెస్ పంట ఒకేసారి  పండాయి. అప్పటి వ‌ర‌కూ అంద‌ని ద్రాక్షగా ఉన్న అధికారం ఎట్టకేల‌కు వైయ‌స్ఆర్  ప‌ర‌మైంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయ‌స్ శ‌కం   ఒక‌టి మొద‌లైంది. ఎన్టీఆర్ అంటే, రెండు రూపాయ‌లకు కిలో బియ్యం, జ‌న‌తా వస్త్రాలు వంటి సంక్షేమ ప‌థ‌కాలు ఎలాగో, వైయ‌స్ అన‌గానే ట‌క్కున గుర్తుకొచ్చేవి ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్. ఇవి త‌ర్వాతి  కాలంలో ఒక ట్రెండ్ సెట్ట‌ర్ గా నిల‌వ‌డం, అటుంచితే కొన్ని విమ‌ర్శల‌ను సైతం మూట‌గ‌ట్టుకున్నాయి ఈ పథకాలు. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులు బాగు ప‌డ్డాయ‌న్న విమర్శలు రావ‌డం.. ఆపై ఫీజు రీఎంబ‌ర్స్ ద్వారా.. ప్రతి ఒక్కరూ ఇంజినీరింగ్ చేయ‌డం, దాని విలువ ప‌డిపోయి.. ఉద్యోగితా స్థాయి   దారుణంగా దెబ్బతిన‌డం ఒక ఎత్తు. ఈ విష‌యంపై కొంద‌రు సీనియ‌ర్ జ‌ర్నలిస్టులు ఆనాడే విమ‌ర్శలు గుప్పించిన ప‌రిస్థితి. ఈ సామాజిక క్షేమం మ‌ర‌చి కూడా వైయ‌స్ఆర్, ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ వ్యవ‌హ‌రిస్తారు కాబ‌ట్టే.. వారికి ఉండే మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్.. చంద్రబాబుకు ఉండేది కాదని చెబుతారు విశ్లేష‌కులు. బేసిగ్గా చంద్రబాబు థియ‌రీ వాట్ దే నీడ్. అదే వైయ‌స్ వాట్ దే వాంట్. దీంతో వైయ‌స్ మ‌హానేత అయ్యాడు. చంద్రబాబు చెడ్డ పేరు సాధించార‌ని చెబుతారు వీరంతా. ఇదిలా ఉంటే.. 2009లో రెండో సారి గెలిచాక వైయ‌స్ఆర్ ఇక తిరుగులేని నేత‌గా  ఎదుగుతార‌ని అనుకున్నారంతా. మ‌ధ్యప్రదేశ్ లో దిగ్విజ‌య్ సింగ్ త‌ర్వాత ఆ స్థాయిలో అధిష్టానం ముందు మంచి పేరు సాధించి.. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఎంపీల‌ను అందించి.. అటు యూపీఏ కూట‌మిని సైతం అధికారంలోకి వ‌చ్చేలా చేయ‌డంతో.. వైయ‌స్ కి సోనియా కోట‌రీ ద‌గ్గర మంచి ప‌లుకుబ‌డి ఉండేద‌ని అంటారు. బేసిగ్గా వైయ‌స్ఆర్.. గాంధీ కుటుంబ వ్యతిరేకి. ఆయ‌న తొలి  రోజుల్లో ఆనాడు దేశ వ్యాప్తంగా న‌డుస్తోన్న కుటుంబ  రాజ‌కీయాల‌ను, గాంధీలు కాని గాంధీల దాష్టీకాన్ని స‌హించ‌లేక పోయేవారని చెబుతుంది ఇటీవ‌ల వ‌చ్చిన మ‌య‌స‌భ అనే సీరీస్. మీరు కావాలంటే చూడొచ్చు. ఆయ‌నేం పెద్ద ఇందిరాగాంధీ విధేయుడు కారు. పైపెచ్చు ఎమ‌ర్జెన్సీ త‌ర్వాత‌.. కేవ‌లం ఒకే ఒక్కడుగా ఒరిజిన‌ల్ నేష‌న‌ల్ కాంగ్రెస్ నుంచి గెలిచి చ‌రిత్ర సృష్టించారు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ఆ త‌ర్వాత వైయ‌స్ గెలిచిన ఒరిజిన‌ల్ నేష‌న‌ల్ కాంగ్రెస్ ను, కాంగ్రెస్- ఐలో క‌లిపేయ‌డంతో.. విధిలేని ప‌రిస్థితుల్లో మాత్రమే వైయ‌స్ ఇందిర అధినాయ‌క‌త్వంలోని పార్టీలో టెక్నిక‌ల్ గా చేరారంతే!  ఆపై సోనియాగాంధీ సైతం వైయ‌స్ తో ఎంత ఇష్టం లేకున్నా  స‌రే.. ఆమె వైయ‌స్ ని కొన‌సాగించేవారంటే అందుకు కార‌ణం.. శ్యాంపిట్రోడా వంటి వారు చేసిన స‌ల‌హా సూచ‌న‌గా చెబుతారు కొంద‌రు సునిశిత రాజ‌కీయ విశ్లేష‌కులు. కాంగ్రెస్ అన‌గానే సీఎంల‌ను త‌ర‌చూ మార్చేస్తుంటార‌ని ఒక అప‌వాదు ఉండేది అప్పట్లో. ఇక‌పై ఏ రాష్ట్రంలో.. ఎవ‌రు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారో.. వారు ఎన్నిసార్లు పార్టీని అధికారంలోకి తెస్తే అన్ని సార్లు ముఖ్యమంత్రిని చేయాల‌న్న విధాన ప‌ర‌మైన నిర్ణయం కార‌ణంగా వైయ‌స్ఆర్ రెండో సారి కూడా సీఎం కాగ‌లిగార‌ని అంచ‌నా వేస్తారు. ఆపై వైయ‌స్ రెండోసారి అధికారంలోకి రావ‌డానికి ఇటు ప్రజారాజ్యం పార్టీ ప్రభావంతో పాటు.. అటు ఇక హైద‌రాబాద్ రావాలంటే పాస్ పోర్టు అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని  జ‌నాన్ని రెచ్చగొట్టడం కూడా.. ప‌ని చేసింది. దీంతో ఆయ‌న ద్వితీయ విఘ్నం లేకుండా అధికార పీఠం రెండో సారి కూడా ఎక్కగ‌లిగారని చెబుతారు.  అయితే 2009, సెప్టంబ‌ర్ 2న  పావురాల గుట్టలో ఆయ‌న ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవ‌డంతో.. ఆయ‌న శ‌కం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో  మొద‌లైన ఆరో ఏటే ముగిసిపోయింది. ఒక వేళ వైయ‌స్సే బ‌తికి ఉంటే.. తెలంగాణ వ‌చ్చి ఉండేది కాదేమో. ఈ మాట స్వయంగా కేసీఆరే అనేవారు.  అలా వైయ‌స్ తాను చ‌నిపోయే నాటికి సంక్షేమ ప‌థ‌కాల కార‌ణంగా జ‌నం గుండెల్లో గుర్తుండి పోవ‌డం.. ఆపై  కొంద‌రు ఆయ‌న మ‌ర‌ణ వార్త విని త‌ట్టుకోలేక చ‌నిపోయార‌న్న పేరు రావ‌డం. ఆపై వారిని ఓదార్చడానికంటూ జ‌గ‌న్ ఓదార్పు యాత్ర మొద‌లు పెట్టడంతో ఆయ‌న త‌ర్వాతి త‌రం విభ‌జిత ఆంధ్రప్రదేశ్ ను ప్రభావితం చేయ‌డం మొద‌లైంది. ఏది ఏమైనా వైయ‌స్ఆర్ ఆరోగ్య‌శ్రీ, ఫీజురీఎంబర్స్ మెంట్ వంటి వాటితో పాటు జ‌ల‌య‌జ్ఞం లాంటి ప‌థ‌కాల‌తో జ‌నానికైతే ఇంకా గుర్తే. ఆయ‌న మ‌ర‌ణించి నేటికి 16 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆయ‌న కొంద‌రి విష‌యంలో మ‌హానేత. ఈ విష‌యం మ‌న‌మెవ‌రం కొట్టిపారేయ‌లేం.

శతృవులు చెల్లెళ్లు, మరదళ్ల రూపంలో ఉంటారుగా కవితక్కా!

కేసీఆర్ కి ‘టి ’కలసి వచ్చినంతగా ‘బి’ కలసి రాలేదా? అంటే అవుననే చెప్పాలి. ఎప్పుడైతే ఆయనకెంతో అచ్చి వచ్చే టీని విడిచిపెట్టారో అప్పటి నుంచి కష్టాలు తరుముకొస్తున్నాయి. టీలోని తెలంగాణ అనే సెంటిమెంటు ఒక తల్లిలా కాపాడుతూ వచ్చింది. అదే..  బీ ఆయన్ను పూర్తిగా విడిచి పెట్టేసింది. ఏ ముహూర్తాన ఆయన టీ తో మొదలయ్యే టీఆర్ఎస్ అన్న పార్టీ పేరును బీతో ఆరంభమయ్యే భారత రాష్ట్ర సమితిగా మార్చారో.. అక్కడి నుంచి మొదలైంది కేసీఆర్ కు కష్టాల పరంపర. మొదట ఓటమి ఎదురైంది. ఆపై వరుస కేసులు. కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్. ఇక తాను అల్లుడు కలసి కాళేశ్వరం అవినీతి ఊబిలో పీకలోతు చిక్కుకుపోగా.. తన కొడుకు ఈ ఫార్ములా కేసులో.. బిడ్డ ఢిల్లీ స్థాయిలో లిక్కర్ స్కామ్. ప్రస్తుతం హరీష్‌, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్ కి మచ్చ అంటోన్న కవిత.. పార్టీకి మేలు చేస్తోందా కీడు చేస్తోందా? కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. అప్పటికీ హరీష్‌ అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేస్తూ అరివీర భయంకరుడిలా పోరాడి పేరు సాధిస్తున్నారు. ఆయనకు బూస్టింగ్ ఇవ్వాల్సిన కవిత.. అలాక్కూడా వదలడం లేదు. అనవసరమైన కామెంట్లు చేసి చెడ్డపేరు తెస్తున్నారు.  శతృవులు ఎక్కడో ఉండరు,, చెల్లెళ్ల రూపంలో, మరదళ్ల రూపంలో ఉంటారన్న మాటను నిజం చేస్తున్నారామె. ఒక సమయంలో కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుంటే కేటీఆర్ ఆమె చేసిందసలు తప్పే కాదు. ఇది రాజకీయ కక్ష సాధింపు. ఢిల్లీ ప్రభుత్వం పాలసీ మార్చితే అందులో తాను కూడా ఒక వ్యాపార భాగస్వామిగా ఇన్ వాల్వ్ అయ్యారని ఆమెపై పడ్డ మరకను తుడిచేసే యత్నం చేశారు. హరీష్‌ , సంతోష్ ఎలాంటి ప్రో కామెంట్ చేయకపోయినా.. నెగిటివ్ గా అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.   ఇప్పుడు కళేశ్వరం విషయంలో అలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన కవిత ఒకపక్క పార్టీపై  ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్ విమర్శలతో చెడుగుడు ఆడేస్తుంటే.. ఏం చేయాలో పాలు పోవడం లేదు కేసీఆర్ కి.  అంటే టైం బాగలేకుంటే కర్రే పామై కరుస్తుందన్నట్టు.. మన అదృష్టం తిరగబడితే బిడ్డే అడ్డం తిరిగి ఇదిగో ఇలాంటి చిక్కులు తెచ్చి పడేస్తున్నారు.  ఇప్పుడు కేసీఆర్ ని, హరీష్‌ని, సంతోష్ ని వేరు చేసి చూడాలని ఇక్కడ ఎవరికీ ఉండదు. తలసానిని ఆయన ఓఎస్డీ కలసి కాకుండా తలసానికి తెలీకుండా కేవలం ఆ ఓఎస్డీ గొర్రల స్కామ్ కి కారకుడని అంటే ఎలా ఉంటుందో.. ఇదీ అంతే. ఒక వేళ కవిత చెప్పినట్టు వీరు ఇరువురూ.. అంత అవినీతికి పాల్పడి ఉంటే.. మరి కేసీఆర్ వైఫల్యం కూడా ఇందులో ఉన్నట్టేగా?  రాష్ట్రంలోని ప్రత్యర్ధి పార్టీల వారు, ఆపై సినీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారి వారి రహస్యాలను కనుగొన్న కేసీఆర్.. తన సొంతింట్లోని వారు ఇంత భారీ ఎత్తున అవినీతికిపాల్పడుతుంటే మాత్రం ఎందుకు వదిలేశారు? ఇది మిలియన్ డాలర్ క్వశ్చిన్. ప్రస్తుతం కవిత పిచ్చి ప్రయత్నమేంటంటే.. కేసీఆర్ పులుగడిగిన ముత్యం.. ఆయన్ను కాపాడ్డానికి ఇటు కేటీఆర్, అటు హరీష్‌ తో పాటు సంతోష్ ని కూడా బలిపెడుతోంది కావచ్చని అంటున్నారు. అది కూడా తన తండ్రికి చేటు తెచ్చేదేనని ఆమె ఎందుకు తెలుసుకోలేక పోతున్నారో అర్ధం కావడం లేదంటారు పలువురు. ఇప్పుడు కాళేశ్వరం కేసు సీబీఐ వరకూ వెళ్లింది. దీంతో ఏ విధంగా ముందుకెళ్లాలో అని కేసీఆర్ ఓ పక్క తలపట్టుకుంటుంటే..  మధ్యలో కవిత తగుదునమ్మా అంటూ ఈ మేటర్ లో వేలు పెట్టి.. ఇటు సొంత కుటుంబాన్ని, అటు పార్టీని ఇరుకున పెట్టడంఎంత వరకూ సమంజసం అన్న మాట వినిపిస్తోంది.

ప‌వ‌న్ బ‌ల‌మేంటో తెలుసా!?

చాలా మంది ప‌వ‌న్ క‌ళ్యాణ్ బలం.. ఆయ‌న‌కున్న ప్ర‌జాద‌ర‌ణ‌గా భావిస్తారు. కానీ, అది కానే కాదు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రెంగ్త్ ఆయ‌న ఓపిక‌. దేనికైనా ఓపిక ప‌ట్ట‌డం ఆయ‌న నైజం. అందుకే ప‌వ‌న్ పాలిటిక్స్ లో అంత‌గా క్లిక్ అయ్యారు. అదే త‌న అన్న‌య్య చిరంజీవికి అలాంటి ఓపిక లేక పోవ‌డం వ‌ల్లే ఆయ‌న రాజ‌కీయాల్లో రాణించ‌లేక పోయారు. పార్టీ పెట్టిన‌ట్టే పెట్టి ఎత్తేశారు. ప‌వ‌న్ అలాక్కాదు. 2014లో ఆయ‌న నేరుగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేయ‌లేదు. నాటి టీడీపీ, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అంటే ఒక వ్య‌క్తి  నేలపై పడుకున్న వాడు పడుకున్నట్లే నిటారుగా నిలుచోలేడు.. ముందు నిదానంగా కూర్చుని  ఆపై ఎలా లేస్తాడో అలాంటి వ్య‌వ‌హారం అన్న‌మాట‌. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి.. తాను స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడి పోవ‌డం. ఆపై త‌న పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఒకే ఒక్క‌డు, రాజోలు ఎమ్మెల్యే రాపాక‌ వ‌ర‌ప్ర‌సాద్ వైసీపీలోకి వెళ్లినా.. త‌న కౌంట్ అసెంబ్లీలో జీరో అయినా  ఆ ఐదేళ్లు నిల‌బ‌డి, క‌ల‌బ‌డి ఆపై 2024లో తిరిగి పొత్తు క‌లుపుకుని   వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడం ఆయన ఘనత.   చాలా మంది అప్ప‌టి వ‌ర‌కూ అన్న మాట ఏంటంటే.. ప‌వ‌న్ కి అస‌లు రాజ‌కీయాలే తెలియ‌వ‌ని. కానీ ఆయ‌న త‌న పంథాలో తాను చేయాల్సిన రాజ‌కీయ ప్ర‌యోగాలన్నీ చేసేశారు. ఒక సారి మ‌ద్ద‌తిచ్చాం. మ‌రోమారు ఒంట‌రిగా పోటీ చేశాం. మ‌నం ఒంట‌రిగా పోటీ చేయ‌డంతో 2009నాటి రిజ‌ల్ట్స్ వ‌చ్చాయ్. అప్ప‌ట్లో త‌న అన్న‌య్య కార‌ణంగా తిరిగి  వైఎస్ రాజశేఖరరెడ్డి విజయానికి ఎలో దోహదపడ్డారో , 2019 ఎన్నిక‌ల్లో జగన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల వైసీపీ విజయానికి దోహదపడ్డారు.  దీంతో ఆయన మళ్లీ పొత్తులతో వెడితే..  2014 నాటి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చ‌ని  అంచ‌నా వేసి దాని ప్ర‌కార‌మే ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు ముందు పొత్తు ప్ర‌క‌ట‌న చేశారు. అప్ప‌టికీ ప‌వ‌న్ ని బీజేపీ మైండ్ వాష్ చేయ‌కుండా పోలేదు. కానీ అది క‌రెక్టు కాద‌ని తానే ఓన్ డెసిష‌న్ తీసుకుని  రాజ‌కీయ ప‌రిణితిని  ప్ర‌ద‌ర్శించారు జనసేనాని పవన్ కల్యాణ్. ప్ర‌భుత్వ‌ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చూశారు.  దీంతో కూట‌మి ఘ‌న‌ విజ‌యం సాధించింది. ఒక‌ప్పుడు రెండు చోట్ల పోటీ  చేసి ఓడిపోయిన ప‌వ‌న్.. త‌ర్వాత వంద‌కు వంద‌శాతం ఫ‌లితాల‌తో.. విజ‌య ఢంకా మోగించి.. ప్ర‌స్తుతం 21 ఎమ్మెల్యే 2 ఎంపీ, ఆపై మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌తో  తిరుగులేని విజయం సాధించారు.  ఇప్పుడు ప‌వ‌న్ టార్గెట్ జ‌న‌సేన జాతీయ పార్టీ కావాల‌ని భావించ‌డం. ఈ విష‌యంలోనూ కొంద‌రు గ‌ణాంకాలు వ‌ల్లె వేస్తున్నారు. మీకు ఆ మాత్రం ఓటు శాతం లేద‌ని అంటున్నారు. అది కూడా ఒక‌టిక‌న్నా ఎక్కువ రాష్ట్రాల నుంచి కావాల‌ని దెప్పి పొడుస్తున్నారు. కానీ ఆయ‌న తొలుత అంద‌రూ ఎగ‌తాళి చేశార‌ని ఎంత మాత్రం వెర‌వ‌రు. ఒక టార్గెట్ పెట్టుకుని ఆ దిశ‌గా వెళ్తూనే ఉంటారు. ఒక మినీ బీజేపీ స్థాయిలో ప్రో హిందూ స్టాండ్ తీసుకున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఏపీలో అత్య‌ధిక శాతం గ‌ల కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన  వారు. ఆపై త‌న భార్య క్రిష్టియ‌న్. ఇప్పుడు తాను చూస్తే స‌నాత‌న సార‌థిగా దూసుకెళ్తున్నారు. ఇక త‌న‌కు తాను ప్ర‌తి  ప్రాంతాన్ని ఓన్ చేసుకునేలా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. త‌ద్వారా ఆయా ప్రాంతాల స్థానిక‌త‌ను సొంతం చేసుకునేందుకు ప్ర‌యత్నిస్తూనే ఉంటారు. ఇదంతా కూడా రాజ‌కీయాల్లో ఒక భాగ‌మే. అందుకే ఆయ‌న్ను ఎగ‌తాళి చేసిన వారంతా  ప్ర‌స్తుతం అసెంబ్లీలో ప‌త్తా లేకుండా పోయారు. ద‌మ్ముంటే అసెంబ్లీ గేటు తాకి చూడు అన్నారు. ఆయ‌న ఎంట్రీ ఇచ్చాక అక్క‌డ అసెంబ్లీలో వారి ఊసే లేకుండా పోయింది. దీనంత‌టికీ కార‌ణం ఆయ‌న ద‌గ్గ‌ర ట‌న్నుల కొద్దీ ఉన్న ఓరిమి. భూదేవికి ఉన్నంత ఓపిక‌. ఇదే ప‌వ‌న్ ఆయుధంగా చెప్పాలంటారు ప‌లువురు పొలిట‌టిక‌ల్ ఎన‌లిస్టులు.

కడపలో అగ్రనేతల సందడి

ఉమ్మడి కడప జిల్లాలో సోమవారం (సెప్టెంబర్ 1 )రాజకీయ సందడి నెలకొంది. ఈ జిల్లాలో ఆ ఒక్కరోజే మూడు పార్టీల అధినేతలు పర్యటించారు.   ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల సేవలో కార్యక్రమం కోసం విభజిత అన్నమయ్య జిల్లా రాయింపేటకు వచ్చారు. ఆయన అక్కడ పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు బంగారు కుటుంబాలు ,పి 4 కార్యక్రమాలు, ధోబిఘాట్ల సందర్శన వంటి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ప్రజా వేదిక లో మాట్లాడారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత, పులివెందుల ఎమ్మెల్యే  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సోమవారం  పులివెందుల చేరుకున్నారు.  మంగళవారం (సెప్టెంబర్ 2) ఉదయం ఇడుపులపాయ చేరుకొని అక్కడ తన తండ్రి వైఎస్ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ లో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి నివాళులర్పిస్తారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, వైఎస్ తనయ  వైఎస్ షర్మిల కూడా సోమవారం (సెప్టెబర్ 1)  మధ్యాహ్నం ఇడుపులపాయకు  చేరుకున్నారు. ఆమె కూడా తన తండ్రికి  వైఎస్ ఘాట్ లో  నివాళులర్పించ నున్నారు.  ఒకే రోజు మూడు పార్టీలకు చెందిన ముగ్గురు అగ్రనేతలు జిల్లాలో పర్యటించడం అరుదైన సందర్భంగా చెప్పుకోవచ్చు.  

మంచి రోజులు వస్తాయి అధైర్య పడకండి : జగన్

  మంచి రోజులు వస్తాయని ఎవరు అధైర్య పడకుండా ఉండాలని,  ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ప్రజా దర్బార్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. పులివెందులలో మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా పులివెందుల చేరుకొని వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.  ఈ సందర్భంగా  వైసిపి పార్టీ నాయకులు,  కార్యకర్తలు , అభిమానులు , ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ నుంచి విజ్ఞప్తులను స్వీకరించి మీ సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని, ప్రభుత్వం వినకపోతే పోరాటాలు చేసే దానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరిని  ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేనున్నానని వారికి భరోసా ఇచ్చారు.  కూటమి నాయకులు దాడులకు ఎవరు భయపడకూడదని ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని వారికి సూచించారు. మంగళవారం ఉదయం తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి జగన్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. *ఘన స్వాగతం  పులివెందుల కు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భాకరాపురంలోని హెలిప్యాడ్ దగ్గర మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాషా , కడప ఎంపీ  వైయస్ అవినాష్ రెడ్డి , కడప నగర మేయర్ కే సురేష్ బాబు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైయస్ మనోహర్ రెడ్డి  అభిమానులు కార్యకర్తలు పుష్పగుచ్చం, శాలువాలు లతో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రతి ఒక్కరితో సెల్ఫీలు తీసుకోవడం జరిగింది.

వరద బాధిత మృతులకు రూ.5లక్షల పరిహారం : సీఎం రేవంత్

  వరద సహాయక చర్యలను అధికారులు పకడ్బందీగా అందించాలి  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో భారీ వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, కుంటల వివరాలు సేకరించాలని, వీటి మరమ్మత్తు , పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  వరదల వల్ల మరమ్మతులకు గురైన పంచాయతీ రోడ్లు, రోడ్లు భవనాల శాఖ రోడ్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల క్రింద పునరుద్ధరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు.  వరదలలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మరిన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. విపత్తుపై సమగ్ర నివేదికను తయారు చేసి కేంద్రానికి ఇవ్వాలని అధికారులను సీఎం సూచించారు.

సిద్దం సిద్దం అన్నారు... అసెంబ్లీకి వచ్చేందుకు సిద్దమా!

  సిద్ధం సిద్ధం అని నినాదాలు చేసిన వారికి ఓ సవాల్ విసురుతున్నాను. వైసీపీని సూటిగా అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చేందుకు వైసీపీ సిద్ధమా ?అసెంబ్లీకి రండి  ఎవరిది అభివృద్ధో.. సంక్షేమం ఎవరు అందించగలరో చర్చకు నేను సిద్ధం. వైసిపి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం. చర్చించడానికి వైసిపి సిద్ధమా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీపై ఫైర్ అవుతూ సవాలు విసిరారు . అంతేకాదు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికైపైనా చర్చకు సిద్ధం, బాబాయి హత్య పైనా చర్చకు సిద్ధం, దళిత డ్రైవర్ ను  డోర్ డెలివరీ చేసిన ఘటన  పైనా చర్చకు సిద్ధం ,కోడి కత్తి డ్రామా.. గులకరాయి డ్రామాల పైనా సిద్ధిమంటూ సవాల్ విసిరారు. ప్రజల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంపిణీ ,బంగారు కుటుంబాలు ,తదితర కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వచ్చారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టిన  అనంతరం ఆయన ప్రజా వేదికపై నుంచి మాట్లాడుతూ వైసిపి పలు అంశాలపై చర్చించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.ఇందుకోసం వైసీపి వారు అసెంబ్లీ కి వచ్చి చర్చించాలన్నారు. ఏనాడు విశ్రాంతి తీసుకోలేదు     రాజకీయ జీవితంలో నేను ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలనేదే నా ఆశయంమని, ఎవరైనా పింఛను తీసుకోకున్నా వచ్చే నెల అందిస్తున్నామని పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే మా లక్ష్యంమని అన్నారు .అభివృద్ధి జరగాలి.. ఆదాయం పెరగాలి - ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయిని పేర్కొన్నారు .రాయలసీమ ఇకనుంచి రాళ్ల సీమ కాదు, రతనాల సీమను చేస్తామన్నారు. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించామని,కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చిందన్నారు.మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంతో విజ్ఞత  చూపించాన్నారు. *గత పాలకు రక్తం పాలించారు. గత పాలకులు రాయలసీమలో రక్తం పారించారని,మేం వచ్చాక రాయలసీమలో సాగునీరు పారిస్తున్నామని అన్నారు.కష్టాల్లో ఉన్న మామిడి రైతులను మేం ఆదుకున్నామని మామిడికాయలు రోడ్డుపై పోసి వైసీపీ నేతలు డ్రామాలు ఆడారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేముందు పదిసార్లు ఆలోచించాలని,మహిళల ఆత్మగౌరవం దెబ్బతిస్తే కఠిన చర్యలు తప్పవని ఆడవాళ్ళు పై అఘాయిత్యాలకు పాల్పడితే అదే మీకు చివరి రోజని హెచ్చరించారు. *రాజంపేట మీదుగా కోడూరు కు నీళ్ళు కడప, రాజంపేట మీదుగా కోడూరుకు నీళ్లు తీసుకెళ్తామని, రాజంపేటలో వ్యవసాయం తగ్గి ఉద్యానపంటలు పెరిగాయని అన్నారు .రాజంపేటలో డెయిరీ, పశుసంపద బాగా పెరిగిందని అన్నారు. ఒంటిమిట్టను టిడిపి దత్తత తీసుకుందని, అనే కార్యక్రమాలు చేపడతామని, మా దృష్టిలో అభివృద్ధి వేరు రాజకీయాలు వేరని అన్నారు. *నదులు అను సంధానం  గంగానది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వంశధార నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేస్తామని తెలిపారు. మీరు ఆశీర్వదిస్తే చాలు కొండలనైనా పిండి చేస్తామని అన్నారు. *ప్రజల ఆరోగ్యం కోసం సంజీవిని సంజీవని పేరుతో ప్రాజెక్టు తెస్తున్నామని,ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టు తీసి కొలుస్తున్నారు. *అనర్హులకు పించన్లు సరైనదేనా! అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారికి కూడా గత ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇచ్చిందని,అలాంటి వారికి వారికి పెన్షన్లు ఇవ్వడం సరైందేనా...? ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు. అనర్హులకు పెన్షన్ తీసేయండని చెప్పే ధైర్యం ప్రజలకు రావాలని అన్నారు. వైసీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడతారు, పోలవరం, అమరావతిని ఆపేస్తున్నారు. రోడ్లకు గుంతలు పెట్టారని అన్నారు. వాళ్ల కారుతోనే సింగయ్యను తొక్కించి చంపేశారని,తిరిగి మనపైనే నెపాన్ని నెడుతున్నారని,మామిడి రైతుల విషయంలోనూ డ్రామాలు ఆడారని అన్నారు. *సీమకు నీళ్ళిచ్చే దారి చూపిన ఎన్టీ ఆర్  రాయలసీమకు నీళ్లిచ్చే దారి చూపిన నాయకుడు ఎన్టీఆర్ అని,రాయలసీమకు నీళ్లు తెస్తామని,నిన్ననే కుప్పానికి నీళ్లు తీసుకెళ్లానని  భవిష్యత్తులో రాజంపేట, కోడూరుకు నీళ్లు తెస్తామని,రాయలసీమకు కరవు లేకుండా చేస్తామని బరోసా ఇచ్చారు. కరవు జిల్లా అనంతపురానికి కియా తెచ్చాని,ఇవాళ ఆ జిల్లా రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్నారు. సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదని అన్నారు.నా బలం బలగం ప్రజలే అన్నారు. స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపుతాం లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామని అన్నారు. *ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నా ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు సమైఖ్య రాష్ట్రంలో నేనే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పారు. 30 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని,అయినా పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నాని,పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని అన్నారు. ఈ 30 ఏళ్ల కాలంలో సంపద సృష్టించి,సంక్షేమం చేయడమే నాకు తృప్తి కలిగిందన్నారు. అప్పులు చేసి బాగుపడ్డ వారు లేరని,అప్పు చేసి పప్పు కూడు తింటే... చిప్పే మిగులుతుందని అన్నారు.ఆదాయాన్ని పెంచిపేదలకు సంక్షేమం అందించాలి.. అదే నేను చేస్తున్నానన్నారు. ఐటీ, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారని,కానీ చాలా కుటుంబాలను ఆర్థికంగా ఎదిగేలా చేసింది ఐటీనే అని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు విస్తరించడానికి కారణం ఐటీనే కారణమన్నారు.హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని,బాగా అభివృద్ధి జరిగిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వాలు చేసినవి గుర్తు పెట్టుకోండి.. అభివృద్ధి వైంకుఠపాళి కాకూడదని అన్నారు.  2019-24లో ప్రభుత్వం మారిందిని, రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కలిసి పోటీ చేశామని అన్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నిలదీయగలుగుతున్నారని ఇదీ మేం ఇచ్చిన స్వేచ్ఛ అని అన్నారు . రాజంపేట చంద్రబాబు పర్యటనలో అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బిసి జనార్ధన్ ,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి  జగన్మోహన్ రాజులతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఇతర అధికారులు, అనధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

కవితపై చర్యలకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీ

  బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవితపై గులాబీ పార్టీ చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె పీఆర్వో నవీన్ కుమార్‌ను బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలిగించినట్లు సమాచారం. అటు బీఆర్‌ఎస్ ఫాలోవర్ల కవిత ట్వీట్టర్, ఇన్‌స్టా అకౌంట్లను అన్‌ఫాలో కొడుతున్నారు. మరోవైపు  కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన షాకింగ్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.  కవితకు కౌంటర్ ఇస్తూ.. బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హరీష్‌రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసింది. కవిత కామెంట్స్ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌‌కు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్‌తో‌ కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరరెడ్డి సమావేశమైనట్లు సమాచారం.    

కారుని ముంచుతున్న కాళేశ్వరం.. ఆంధ్రా రాగం అందుకున్న గులాబి దళం

లైఫ్ జాకెట్ గా పనికొస్తుందనేనా?  కాళేశ్వరం ప్రాజెక్టుపై పిసి ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీ  సుదీర్ఘంగా చర్చించి ఆ ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు, అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయం బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళనకు కారణమైంది.  దీనిని బీజేపీ అవకాశంగా తీసుకుని తమ పుట్టి ముంచుతుందన్న ఆందోళన బీఆర్ఎస్ లో కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాళేశ్వరంపై సీబీఐ విచారణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టా ల్సిందిగా పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా  ధర్నాలు, రాస్తారోకోలు,  ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు.  కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి నదీ జలాలను ఆంధ్రప్రదేశ్‌కు మళ్లించడానికి కాంగ్రెస్, బిజెపి కుట్రగా ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కార్ సీబీఐ విచారణ నిర్ణయాన్ని అభివర్ణించారు. ఈ  కుట్ర ను తీవ్రంగా ప్రతిఘటించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికీ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఏముంది?  కేటీఆర్ మాటలు, వ్యాఖ్యలు, ఆందోళనలకు పిలుపునివ్వడం ఇవన్నీ ఆయనలో, బీఆర్ఎస్ లో ఆందోళనకు, నిరాశకు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడిన ప్రతి సారీ ఆ పార్టీకి తెలంగాణ వాదం గుర్తుకువస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ పై విద్వేషం తన్నుకొస్తుంటుంది. మరీ ముఖ్యంగా గత ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత అయిన దానికీ కాని దానికీ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకత్వానికి ఒక అలవాటుగా మారిపోయింది. ఆంధ్ర సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువ కావచ్చునన్నది వారి యోచనగా కనిపిస్తోంది.  

ఇంతదాకా వచ్చాకా బీఆర్ఎస్ ఉంటే ఏంత? పోతే ఎంత

అవినీతి అనకొండలు హరీష్ రావు, సంతోష్ కుమార్ కాళేశ్వరం అవినీతిలో హరీష్ పాత్ర కవిత సంచలనం తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, అందులో మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర ఉందనీ కుంబడద్దలు కొట్టారు. వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు కనుకే రెండో టర్మ్ లో ఆయనను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని చెప్పిన కల్వకుంట్ల కవిత... హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ వల్లనే  కేసీఆర్ కు అవినీతి మరకలు అంటాయని చెప్పారు.  తనపై కుట్రలు చేసినా సహించానన్న ఆమె.. ఇప్పుడు తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.  అవినీతి అనకొండలైన హరీష్, సంతోష్ లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కవిత.. వారి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని ఆరోపించారు.  తాను ఎవరో ఆడిస్తే ఆడే బొమ్మను కాదన్న ఆమె.. సామాజిక మాధ్యమంలో తనపై హరీష్, సంతోష్ కు ఇష్టమొచ్చినట్లుగా రాతలు రాయిస్తున్నారని ఆరోపించిన ఆమె  కేసీఆర్ పైనే సీబీఐ కేసులుపెట్టే స్థాయికి వచ్చిన తరువాత ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ భావోద్వాగానికి లోనయ్యారు.  

ఆడుదాం ఆంధ్రా స్కాం.. మాజీ మంత్రి రోజా అరెస్టుకు ముహూర్తం ఖరారైందా?

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆధారాలు లేని ఆరోపణలతో, అనుచిత వ్యాఖ్యలతో  రెచ్చిపోయిన మాజీ మంత్రి రోజ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలకు, మరీ ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందంటూ విజిలెన్స్ దర్యాప్తు తేల్చడంతో ఇప్పుడు ఇహనో అరెస్టు అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారం అండతో మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రత్యర్థులపై  నిరాధార ఆరోపణలు చేసి నోరు పారేసుకున్న రోజాపై ఇప్పుడు ఆధారాలతో సహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆడుదాం ఆంధ్రా స్కాంపై దర్యాప్తు పూర్తయ్యింది. విజిలెన్స్ తన దర్యాప్తు నివేదికను డీజీపీకి అందజేయడం కూడా జరిగింది. దీనిపై సాప్ చైర్మన్ రవినాయుడు ఈ నెల 5వ తేదీ లోగా ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారందరిపై చర్య తీసుకుంటామని చెప్పారు.  ప్రభుత్వానికి ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించి విజిలెన్స్ నివేదిక అందింది ఈ స్కాంలో ప్రమేయం ఉన్న వారందరిపై లింగ వివక్షకు   తావులేకుండా చర్యలు తీసుకుంటామని, ఈ నెల 5 లోగా అరెస్టులు ఉంటాయనీ  సాప్ చైర్మన్  రవినాయుడు చేసిన వ్యాఖ్యలతో రోజా అరెస్టునకు రంగం సిద్ధమైందా అన్న చర్చ జోరందుకుంది.   జగన్ హయాంలో ప్రభుత్వం రూ. 119 కోట్ల బడ్జెట్‌తో అమలు చేసిన ఆడుదాం ఆంధ్ర  కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉణ్న సంగతి తెలిసిందే.   బహుమతి డబ్బు పంపిణీలో దుర్వినియోగం,  నాసిరకం  స్పోర్ట్స్ కిట్‌ల పంపిణీపై పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి.  జాతీయ కబడ్డీ మాజీ ప్లేయర్ ఆర్డీ ప్రసాద్  ఆడుదాం ఆంధ్ర అక్రమాలు, కుంభకోణంపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.   ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొత్తం అప్పటి మంత్రి రోజా, అప్పటి సాప్ చైర్మన్  పెత్తనం కిందే జరిగింది.   ఈ నేపథ్యంలోనేఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిని వారెంతటి వారైనా సెప్టెంబర్ 5 లోగా అరెస్టు చేస్తామంటూ శాప్ చైర్మన్ రవినాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా రోజా అరెస్టు తధ్యమన్న చర్చకూ తెరలేపాయి.  

రేవంత్ వ్యూహంతో మారిన జూబ్లీ సీన్!

సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో అనివార్యం అయిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక ముహూర్తం ఇంచుమించుగా ఖారారైంది. అందరూ అనుకుంటున్నట్లుగానే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, జూబ్లీ ఉప ఎన్నిక జరగ వచ్చని అన్నారు. అంటే అక్టోబర్ లేదా  నవంబర్ లో జూబ్లీ ఉపఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది.  ఉప ఎన్నిక ముహూర్తం విషయం పక్కన పెడితే..  జూబ్లీ ఉపఎన్నిక రోజు రోజుకు రంజుగా మారుతోంది. ఆసక్తిని పెంచుతోంది. కొత్త కోణాలు వచ్చి చేరుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ  జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ క్రికెటర్ ,మాజీ ఎంపీ అజారుద్దీన్  బరిలో దిగుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది.అంతే కాదు..  ఆయన రాష్ట్ర నాయకుల ప్రమేయం లేకుండా  నేరుగా ఢిల్లీ నుంచే  టికెట్’ కన్ఫర్మ్  చేసుకున్నారనే  ప్రచారం కూడా జరిగింది.  అయితే.. కాంగ్రెస్ పార్టీ హటాత్తుగా అజారుద్దిన్ ను గవర్నర్ కోటాలో పెద్దల సభ (శాసనమండలి) కి పంపాలని నిర్ణయించింది.  ప్రొఫెసర్ కోదండ రామ్ తో పాటుగా అజారుద్దీన్ ను శాసన మండలికి సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. నిజానికి.. మాగంటి మరణ వార్త చెవిన పడిన క్షణం నుంచే, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అజారుద్దీన్  జూబ్లీ టికెట్ తనదే అని ప్రచారం చేసుకున్నారు. అయితే.. ఇప్పడు అజారుద్దీన్  టికెట్ రేసు నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. అదలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పక్కా లెక్కలతోనే..  అజారుద్దీన్ ను రేసు నుంచి తప్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అజారుద్దీన్  అభ్యర్ధిత్వం పట్ల అంత సుముఖంగా లేరనీ,  అందుకే  అజారుద్దీన్  తనకు తానుగా  జూబ్లీ అభ్యర్ధిగా ప్రకటించుకున్న సమయంలో  పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్  గట్టి వార్నింగ్’ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తపరిచిన నేపధ్యంలోనే పీసీసీ చీఫ్ అజారుద్దీన్ ను గాంధీభవన్  కు  పిలిపించి మరీ క్లాసు తీసుకున్నారని అప్పట్లో పార్టీ వర్గాల్లో వినిపించింది.       అలాగే..  కాంగ్రెస్ పార్టీ అనధికార మిత్ర పక్షం ఎంఐఎం కూడా అజారుద్దీన్  అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. మరోవంక లక్షకు పైగా ముస్లిం ఓటర్లున్న జూబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలవాలంటే  ఎంఐఎం మద్దతు అనివార్యం.  అందులో అనుమానం లేదు. ఈ కారణంగానూ  అజరుద్దీన్  ను తప్పించి  గతంలో ఎంఐఎం టికెట్ పై పోటీ చేసిన బీసీ నాయకుడు నవీన్ యాదవ్  ను ముఖ్యమంత్రి రెంత్ రెడ్డి తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి..  మొదటి నుంచి కూడా నవీన్ పేరు వినిపిస్తూనే వుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా నవీన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరిగింది.  అలాగే  నవీన్ యాదవ్ ను బరిలో దించితే ఎంఐఎం మద్దతు పొందడమే కాకుండా, బీసీ ఛాంపియన్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మరో ప్లస్ పాయింట్ అవుతుందని, బీసీ నినాదానికి మరింత బలం చేకూరుతుందని  విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా.. బీజేపీ, హిందుత్వ రాజకీయాలను, హిందూ ఓటు బ్యాంక్  పోలరైజేషన్  ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్ట వచ్చని రేవంత్ రెడ్డి  భిన్న కోణాల్లో లెక్కలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు.  అయితే..  ఇప్పటికి కూడా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మేయర్ బి.రామ్మోహన్, మైనారిటీ వర్గం నుంచి ఫహీం ఖురేషి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు  తెలుస్తోంది. అయితే..  చివరకు ఏమి జరుగుతుంది? హస్తం టికెట్ ఎవరి చేతికి చిక్కుతుంది?  అన్నది స్టిల్ ఏ పజిల్ .. ఇప్పటికీ ఎటూ తేలని ప్రశ్నేై!

బీజేపీయే రైట్ అని తేలింది.. కేంద్ర మంత్రి బండి

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై తాము చేస్తున్న పోరాటం నేటికి ఫలించిందనీ, కాళేశ్వరంపై బీజేపీ వైఖరే సరైనదని రుజువైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సిందే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించడాన్ని స్వాగతించిన బండి సంజయ్.. సోమవారం మీడియాతో మాట్లాడారు.  కాళేశ్వరం అవినీతిపై బీజేపీ తొలి నుంచీ సీబీఐ విచారణ కోరుతున్న సంగతిని గుర్తు చేశారు.  ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీబీఐకి లేఖ పంపాలని ఆయన రేవంత్ ను కోరారు.  

కాళేశ్వరంపై రేవంత్ సేఫ్ గేమ్

  కాళేశ్వరంపై విచారణ సీబీఐకి అప్పగించిన రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడుతున్నారా అంటే… అవును అనే అంటున్నారు పరిశీలకులు…. ఎన్నికల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగానే అధికారంలోకి రాగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసి విచారణకు ఆదేశించారు.  కమిషన్ నివేదిక రాగానే ఆలస్యం చేయకుండా క్యాబినెట్ లో పెట్టి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆదివారం సెలవు దినం అయినా ఆఘమేఘాలపై అసెంబ్లీని సమావేశపరిచి కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదికపై చర్చకు ఉపక్రమించారు. చర్చలో మంత్రులంతా మూకుమ్మడిగా విడివిడిగా బీఆర్ఎస్ పై దాడిచేసి ఉక్కిరి బిక్కిరి చేశారు.  అర్ధరాత్రి వరకు చర్చను నడిపి చివర్లో సీబీఐ విచారణకు ఆదేశించారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఆయన బాస్ రాహుల్ గాంధీ లు సీబీఐ అనేది కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంటూ విమర్శలు చేశారు. అదే కీలుబొమ్మ అని విమర్శలు గుప్పించిన సంస్థకే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ బాధ్యత అప్పగించిన రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.   కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగిస్తే అంతుతేలుస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు.. బీజేపీ నేతల ప్రకటనలను అవకాశంగా తీసుకొని తను సేఫ్ గేమ్ ప్లాన్ అమల్లోకి తెచ్చారు. సీబీఐ విచారణలో అవకతవకలు గుర్తించి కేసీఆర్, హరీష్ లపై కేసులు నమోదు చేసి అరెస్టులకు దారితీస్తే తాను ఎవరినీ వేధించడం లేదని చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పవచ్చు… అదే సమయంలో తాను అనుకున్నది సాఫీగా తన చేతులకు మట్టి అంటకుండా జరిగిపోతుందని రేవంత్ భావిస్తున్నారు.  ఒకవేళ విచారణ సమయంలో జాప్యం జరిగినా తాను ఆశించినది  జరగకపోయినా బీజేపీ- టీఆర్ఎస్ లు ఒకటేననే ఆయుధాన్ని బయటకు తీసి రెండు పార్టీలను ఎండగట్టే అవకాశం తనకు ఎలాగూ ఉంటుంది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారు. రాష్ట్రంలో తనపైన కాంగ్రెస్ పార్టీపైన బీఆర్ఎస్- బీజేపీ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కూడా ఈ విచారణ అంశం పనకివచ్చే  అవకాశముంది. ఎటుచూసినా బీజేపీ- బీఆర్ఎస్ లను ఇరుకున పెట్టే దిశగా రేవంత్ పావులు కదిపారు..

సీబీఐ విచారణట.. వింటున్నారా రాహుల్?.. కేటీఆర్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ వేడిని రగిలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో అక్రమాలు, అవకతవకలు అవినీతి జరిగిందని తొలి నుంచీ ఆరోపిస్తున్న కాంగ్రెస్, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కాగా ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రాణాలను ఫణంగా పెట్టి 14 ఏళ్ల నిర్విరామ పోరాటంతో తెలంగాణను సాధించిన కేసీఆర్ ను శిక్షిస్తారా? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడుతుంటే... కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ రాహుల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గతంలో రాహుల్ గాంధీ సీబీఐపై చేసిన విమర్శలను గుర్తు చేస్తూ.. ఏపీలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు అంటోంది.. దీనిపై మీ స్పందనేంటి అంటూ ప్రశ్నించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదికగా..  మిస్టర్ రాహుల్ గాంధీ, తెలంగాణలో మీ  సీఎం కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు.  ఆ విషయం మీకు తెలుసా? అంటూ ప్రశ్నించారు.  తంలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందనీ,  అవి ప్రతిపక్షాలను నాశనం చేసే సెల్స్ గా మారిపోయాయని రాహుల్ విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఆప్పట్లో రాహుల్ ఈ మేరకు చేసిన ట్వీట్ ల స్క్రీన్ షాట్లను కూడా తన పోస్టుకు జోడించారు.  ఒకప్పుడు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని విమర్శించిన దర్యాప్తు సంస్థలకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణను ఎలా అప్పగిస్తుందని కేటీఆర్ నిలదీశారు. తమపై ఎన్ని కుట్రలు పన్నినా   తగ్గేదే లేదని పేర్కొన్నా ఆయన రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామన్నారు.   న్యాయవ్యవస్థపైనా, ప్రజలపైనా తమకు పూర్తి విశ్వాసముందన్న కేటీఆర్  స కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 

కేసీఆర్, హరీష్ కు హైకోర్టులో చుక్కెదురు

కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ నిలిపివే యాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణకు గానీ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కానీ హైకోర్టు నిరాకరించింది.  జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న వారి విజ్ణప్తిని కూడా తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను సాధారణ కేసుల మాదిరిగానే విచారిస్తామని స్పష్టం చేసిన హైకోర్టు... మంగళవారం ఉదయం ఈ పిటిషన్ విచారణ చేపడతామని పేర్కొంది. అయితే  అప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) ప్రకటించిన సంగతి తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై సుదీర్ఘ చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర రాష్ట్రాల ప్రమేయం ఉన్నందున, సీబీఐ విచారణే సరైనదని ప్రభుత్వం అభిప్రాయపడింది. అసెంబ్లీ తీర్మానం చేసిన మరుసటి రోజే  అంటే సోమవారం (సెప్టెంబర్ 1)  కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

హైటెక్ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకూ చంద్రబాబు అద్భుత ప్రయాణం.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సెప్టెంబర్ 1 ఒక ప్రత్యేక మైన రోజు. ఆయన ఒక్కరికే కాదు.. ఆయనను అభిమానించే కోట్లాది మందికి కూడా ఇది చిరస్మరణీయమైన రోజు. ఎందుకంటే ఇది 30 ఏళ్ల కిందట ఆయన తొలి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఔను 1995 సెప్టెంబర్ 1న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తొలి సారి ప్రమాణ స్వీకారం చేశారు.  ఆ తరువాత ఆయన మరో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆయన మొట్టమదటి సారి ముఖ్యమంత్రి అయిన రోజు మాత్రం ఎవరూ ఎప్పటికీ మరచిపోరు. ఇక ఆయన కుటుంబీకులకు అయితే ఈ రోజు మరింత ప్రత్యేకం. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబునాయుడికి ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎమోషన్ అయ్యారు.  తన తండ్రి తొలి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ.. తన మెంటార్, బాస్ అన్నీ నాన్నే అంటూ ఆయనకు విషెస్ తెలిపారు.  హైటెక్ నుంచి క్వాంటమ్ వాలీ వరకూ, బయోటెక్ ఆస్పిరేషన్ నుంచి డేటా ఆధారిత వ్యవస్థల వరకూ చంద్రబాబు అద్భుత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.  తనకు రాజకీయాలలో ఓనమాలు దిద్దించి, వేలుపట్టుకుని నడిపించిన తండ్రి సాధించిన ఈ ఘనత మైలు రాయికంటే గొప్పదని లోకేష్ పేర్కొన్నారు. ఇంట్లో నాన్నా అని పిలుచుకునే చంద్రబాబును పని ప్రదేశంలో బాస్ అని పిలిచే అద్భుత అవకాశం, అదృష్టం తన సొంతమని తండ్రికి విషెస్ చెబుతూ సామాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు.  

కాళేశ్వరంపై దర్యాప్తు సీబీఐకి.. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలపై  రాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) ప్రకటించారు. కాళేశ్వరంపై రాష్టర ప్రభుత్వం నియమించిన కమిషన్ నివేదికపై అసెంబ్లీలో ఆదివారం (ఆగస్టు 31) సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం సీఎం రేవంత్ కాళేశ్వరం అక్రమాలు, అవినీతి, అవకతవకల కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్టు  ప్రకటించారు.   కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో భారీ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) గుర్తించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దీనికి తోడు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వ తప్పిదాలను,  అవకతవకలను ఎత్తిచూపాయన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సైతం తన నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ఏజెన్సీలను బాధ్యుల్ని చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని కమిషన్ స్పష్టం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికను జులై 31న ప్రభుత్వానికి సమర్పించగా, ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్ దానిని ఆమోదించింది. ఇక ఆదివారం (ఆగస్టు 31) సభలో ఈ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత, అన్ని పార్టీల అభిప్రాయాలను స్వీకరించి, చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గమని ప్రభుత్వం భావించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్, ఎన్‌డీఎస్‌ఏ, ఇతర నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక‌పై ఆదివారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు సుమారు 9 గంట‌ల పాటు సుదీర్ఘంగా చ‌ర్చ సాగింది. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తొలుత కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను  నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.   అనంతరం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చడం నుంచి మేడిగడ్డ స్పీయర్స్ కుంగిపోయిన పరిణామాల వరకూ,  జస్టిస్ ఘోష్ గారి నేతృత్వంలో విచారణ కమిషన్ నియామకం వరకు సమగ్రంగా సభకు తెలిపారు.   

చంద్రబాబు అను నేను @30

ఏపీ అంటే బాబు- బాబు అంటే ఏపీ. అది ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అయినా న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అయినా ఆయ‌న ముద్ర చాలా చాలా స్ప‌ష్టంగా ఉంటుంది. రాజ‌కీయాలంటే జ‌న‌సామాన్యంలో.. ఒక ఆస‌క్తి క‌ల‌గ‌జేసింది కూడా చంద్ర‌బాబు అనే చెప్పాలి. అటు ప్ర‌ధానుల‌ను, రాష్ట్ర‌ప‌తుల‌ను కాదు.. ఒక‌రిద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను చేసిన ఘ‌న‌త కూడా చంద్ర‌బాబుదే.  ఇక చంద్ర‌బాబు ప్ర‌భావంతో ఎంత మంది యువ‌త ఐటీ నిపుణుల‌య్యారో చెప్ప‌లేం. త‌న సతీమణి భువ‌నేశ్వ‌రి  స‌హా ఎంద‌రు మ‌హిళా మ‌ణులు వ్యాపార‌వేత్త‌లుగా రాణించారో.. ఎంద‌రు ఆయ‌న స్ఫూర్తిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒక చంద్ర‌బాబంత‌! చంద్ర‌బాబు సీఎంగా తొలి సారి ప‌గ్గాలు చేప‌ట్టి 2025, సెప్టంబ‌ర్ 1నాటికి సరిగ్గా ముప్పై ఏళ్లు అవుతోంది. ఈ ముప్పై ఏళ్ల‌లో నాలుగు సార్లు సీఎం అయ్యారాయ‌న‌. అప్పుడ‌ప్పుడూ ఓట‌మి ద్వారా ఏర్ప‌డ్డ r ఉత్థాన పతనా ల‌ను ఎదుర్కుంటూనే తిరిగి కోలుకోవ‌డంలో ప‌డిలేచిన కెర‌టానికే పాఠాలు నేర్పించ‌గ‌ల స‌మ‌ర్ధుడు చంద్ర‌బాబు. బాబు అంటే మోడ్ర‌న్ అడ్మినిస్ట్రేష‌న్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ అని    బిల్ క్లింట‌న్, బిల్ గేట్స్ ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు.   వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ క‌థ‌నం చ‌దివినా తెలిసిపోతుంది. బాబు సామ‌ర్ధ్యానికి ప‌రీక్ష పెట్టిన ఎన్నిక‌లు 1999 నాటివి. అస‌లైన ఎన్టీఆర్ వార‌సులెవ‌రో ప్ర‌జ‌లు త‌మ ఓటుతో తెలియ చెప్పే ఎన్నిక‌లు కూడా అవే. ఆ ఎలెక్ష‌న్ల‌లో చంద్ర‌బాబు..   44.14 శాతం ఓట్లతో 181 సీట్లను కైవసం చేసుకుని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.  తర్వాత 2004, 2009ల్లో వరుస ఓటములు ఎదుర‌య్యాయి. అవి ఇటు పార్టీకి కానీ, అటు బాబుకు కానీ అత్యంత క‌ఠిన‌మైన రోజులు. మాములుగా అయితే ఇలాంటి క‌ష్ట‌కాలం త‌ట్టుకోలేక ఇత‌రులు పారిపోతారు. పార్టీ ప‌ట్టు జార‌విడుస్తారు. కానీ బాబులో ప‌ద‌వి, అధికారం ఉండ‌టం వ‌ల్ల మాత్ర‌మే రాణించ‌డం అనేది ఉండ‌దు గాక ఉండ‌దు.  బాబు- బ్ల‌డ్ పాలిటిక్స్, బాబు- ఫుడ్ పాలిటిక్స్, బాబు- బెడ్ పాలిటిక్స్.. అవి త‌ప్ప త‌న‌కేమీ తెలీదు. ఆ మాట‌కొస్తే రాజ‌కీయ‌మంటే అధికారంలో ఉండ‌టం మాత్ర‌మే కాదు.. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టంలోనే మ‌రింత ఎక్కువ రాజ‌నీతి ప్ర‌ద‌ర్శించే అవ‌కాశ‌ముంద‌ని దాన్ని కూడా విప‌రీతంగా ప్రేమించి అక్క‌డా త‌న‌దైన మార్క్ పాలిటిక్స్ తెలుగు జాతికి చ‌వి చూపిన  వన్ అండ్ ఓన్లీ లీడ‌ర్ చంద్ర‌బాబు. చంద్ర‌బాబును ప్ర‌త్యేకించి పొగ‌డ‌క్క‌ర్లేదు. ఆయ‌నేం చేశారో చెబితే చాలు.. అదే అతి పెద్ద ప్ర‌శంస‌గా మారుతుంది. 2014లో  న‌వ్యాంధ్రప్రదేశ్‌కు తొలి సీఎంగా..  మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు చంద్ర‌బాబు. ఆ తర్వాత 2019లో మ‌ళ్లీ  మ‌రో మారు ఓటమి ప‌ల‌క‌రించింది. అయినా స‌రే, అద‌ర‌క బెద‌ర‌క వెన్ను చూపించ‌క‌.. ముందుకెళ్లి పోరాడ్డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేశారు. ఒక ప‌క్క త‌న శ్రేణులు ఎన్నో ఎదురు దెబ్బ‌లు తింటున్నారు.. మ‌రో ప‌క్క ఇటు త‌న పార్టీ లీడ‌ర్లు అరెస్టులు, దాడులు వంటి ప్ర‌మాదాల‌ను ఎదుర్కుంటున్నా.. ముందుకెళ్ల‌డం త‌ప్ప వెన‌క్కు మళ్ల‌డం సాధ్యం కానిద‌ని బ‌లంగా న‌మ్మారు చంద్ర‌బాబు. ఆ మాట‌కొస్తే ఆ విధంగా ముందుకెళ్ల‌డ‌మే బాబు మార్క్ పాలిటిక్స్ గా ఈ తెలుగు రాష్ట్రాల‌కు చాటి చెప్పారాయ‌న‌. 2019-24 మ‌ధ్య ఆ ఐదేళ్ల జగన్ పాల‌న‌లో ఏపీ ఎన్నిర‌కాలుగా న‌ష్ట‌పోయిందో లెక్క క‌ట్ట‌డం చాలా చాలా క‌ష్టం. మ‌రీ ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతం అత్యంత దారుణంగా దెబ్బ తింది. ఏ దుష్ట‌క‌న్ను ప‌డింతో..తెలియ‌దు కానీ ఒక్క‌సారిగా జ‌నం విల‌విల‌లాడిపోయారు. ఇటు జ‌నం మాత్ర‌మే కాదు అటు బాబు సైతం వ్య‌క్తిగ‌తంగా ఎన్నో అవ‌మానాల‌ను చ‌వి చూశారు. చివ‌రికి ఆయ‌న స‌తీమ‌ణిని సైతం అవమానించడానికి వెనుకాడలేదు జ‌గ‌న్ దుర్మార్గ పాల‌న‌.  అల‌నాడు నిండు స‌భ‌లో ద్రౌప‌దికి జ‌రిగిన అవ‌మానంలాంటిది చేసి చూపింది జ‌గ‌న్ దుర్యోధన‌, దుశ్శాస‌న  పాల‌న‌. ఈ కురుస‌భ గౌర‌వ స‌భగా మారిన‌పుడు మాత్ర‌మే తాను తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడ‌తాన‌ని భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేసి బ‌య‌ట‌కెళ్లిపోయారు  చంద్ర‌బాబు. ఆ త‌ర్వాత 2023 సెప్టంబ‌ర్ 9న  బాబు జైలుకెళ్ల‌డం రాష్ట్ర చరిత్ర‌లోనే ఒక చీక‌టి అధ్యాయంగా న‌మోద‌య్యింది. అయినా స‌రే ఆ అష్ట‌క‌ష్టాల‌కు ఓర్చి... 2024లో కూట‌మి క‌ట్టి విజ‌య ఢంకా మోగించారు చంద్ర‌బాబు.  ఇది 1999 ఎన్నిక‌ల నాటిక‌న్నా అతి పెద్ద విజ‌యంగా న‌మోద‌య్యింది. కూట‌మితో ఎన్నిక‌ల‌కు వెళ్లినా.. కూట‌మి స‌పోర్టు లేకున్నా.. పెద్ద మొత్తంలో మెజార్టీ సాధించి బాబు త‌న‌దైన మ్యాజిక్  చేసి చూపించారు. నాలుగో సారి   ముఖ్య‌మంత్రి అయ్యి తిరిగి న‌వ్యాంధ్ర ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకునేలా చేశారు.  ఒక స‌మ‌యంలో నాకొక్క ఛాన్స్ అంటూ అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్ జ‌నం కూడా మాకొక్క ఛాన్స్ వ‌చ్చి బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాలంటే తిరిగి చంద్ర‌బాబు చేతికే పాల‌న అందించాల‌న్న కృత నిశ్చయానికి వచ్చారు. దీంతో ఆయ‌న మ‌రోమారు ముఖ్య‌మంత్రి పీఠ‌మెక్కి బాబు@4. 0 పాల‌న‌కు శ్రీకారం చుట్టారు. ఇది క్లుప్తంగా చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త చ‌రిత్రే అయినా.. ఇది  రెండు రాష్ట్రాల‌కు చెందిన సుమారు 10 కోట్ల మంది చ‌రిత్ర కూడా. ఉమ్మ‌డి, విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముప్పై ఏళ్ల నాటి రాజ‌కీయ r ఉత్థాన పతనాల చ‌రిత్ర కూడా.