కడపలో అగ్రనేతల సందడి
posted on Sep 2, 2025 @ 9:40AM
ఉమ్మడి కడప జిల్లాలో సోమవారం (సెప్టెంబర్ 1 )రాజకీయ సందడి నెలకొంది. ఈ జిల్లాలో ఆ ఒక్కరోజే మూడు పార్టీల అధినేతలు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల సేవలో కార్యక్రమం కోసం విభజిత అన్నమయ్య జిల్లా రాయింపేటకు వచ్చారు. ఆయన అక్కడ పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు బంగారు కుటుంబాలు ,పి 4 కార్యక్రమాలు, ధోబిఘాట్ల సందర్శన వంటి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.
అనంతరం ప్రజా వేదిక లో మాట్లాడారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సోమవారం పులివెందుల చేరుకున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 2) ఉదయం ఇడుపులపాయ చేరుకొని అక్కడ తన తండ్రి వైఎస్ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ లో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి నివాళులర్పిస్తారు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, వైఎస్ తనయ వైఎస్ షర్మిల కూడా సోమవారం (సెప్టెబర్ 1) మధ్యాహ్నం ఇడుపులపాయకు చేరుకున్నారు. ఆమె కూడా తన తండ్రికి వైఎస్ ఘాట్ లో నివాళులర్పించ నున్నారు. ఒకే రోజు మూడు పార్టీలకు చెందిన ముగ్గురు అగ్రనేతలు జిల్లాలో పర్యటించడం అరుదైన సందర్భంగా చెప్పుకోవచ్చు.