ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంకు మంత్రి లోకేష్ కు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్  మంత్రి నారా లోకేశ్ కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి మంత్రిలోకేష్ కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలంటై ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆస్ట్రేలియా హైకమిషనర్ ఆహ్వానాన్ని పంపారు.   ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్ కు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే  మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో లోకేష్ చేస్తున్న కృషిని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రశంసిస్తూ.. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేశ్ ను కోరింది. ఈ ప్రతిష్ఠాత్మక స్పెషల్ విజిట్స్ లో   ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2001లో  పాల్గొన్నారు. లోకేష్ కు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామి కావడం ద్వారా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమై ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలైనా, విద్యా, స్కిల్ డెవలప్ మెంట్, ఇన్వెస్ట్ మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై  చర్చించేందుకు దోహదపడుతుంది.  

పులివెందులపై జగన్ పట్టు సడలిందా?

నాలుగున్నర దశాబ్దాలకు పైబడి వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు పరస్థితి మారుతోందా? జగన్ ఆధిపత్యానికి గండి పడుతోందా? పులివెందుల నాయకులు, స్థానిక ప్రజలకు ఆయన దూరం అవుతున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  జగన్ సీఎంగా ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఈ దూరం ప్రారంభమైందంటున్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలా జగన్ పులివెందుల నియోజకవర్గ వాసులతో మమేకమైన పరిస్థితి లేకపోవడం, అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారం కోల్పోయి కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కక, కేవలం నియోజకవర్గ ఎమ్మెల్య స్థాయికే పరిమితమైన సమయంలో కూడా ఆయన నియోజకవర్గ ప్రజలకు దగ్గరకావడానికి ఇసుమంతైనా ప్రయత్నించకపోవడంతో జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.  ఆ అసంతృప్తే ఇటీవల పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రతిఫలించిందన్న చర్చ జోరుగా సాగుతోంది.    వాస్తవానికి పులివెందుల ప్రజలతో వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న కలివిడి తనమే ఆయన, ఆయన కుటుంబం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలలో రాణించే అవకాశానికి కారణమైంది.  వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే ఆయన అధికారంలో ఉన్నా, లేకున్నా ఎల్లవేళలా పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండేవారు. పులివెందుల నుంచి ఎవరు వచ్చినా  ఆప్యాయంగా పలకరించడమే కాకుండా, వారు ఏ పనిమీద వచ్చారో కనుక్కుని ఆ పని చేసి పంపించేవారు.  ఆయన పలకరింపు, ఆయన సహాయం చేసే విధానం పులివెందుల వాసులు ఆయననూ, ఆయన కుటుంబాన్నీ గుండెల్లో పెట్టుకునేలా చేసింది. పులివెందుల ప్రజలకు ఆయన పట్ల ప్రజలలో ఉన్న అభిమానమే.. ఆయన తదననంతరం జగన్ ను కూడా అక్కున  చేర్చుకునేలా చేసింది. అయితే జగన్ ఆ ఆదరణను నిలుపుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్  నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా జనాలకు కూడా దురమయ్యారని స్థానికులే చెబుతున్నారు.  ఆ కారణంగానే జగన్ కు పులివెందులలో మునుపటి స్థాయి ఆదరణ, పట్టు కొరవడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైయస్ ఎంపీగా ఉన్నా, ముఖ్యమంత్రిగా  బిజీగా ఉన్నా ఆయన అందుబాటులో లేని లోటు కనిపించకుండా  సోదరుడు దివంగత వైయస్ వివేకానంద రెడ్డి పులివెందుల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాలలో పాలుపంచుకునే వారు. అటువంటి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్ పక్కన పెట్టుకోవడం కూడా పులివెందుల ప్రజలు జగన్ కు దూరం కావడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారిందంటున్నారు.  అలాగే వైఎస్ కుటుంబ విభేదాల కారణంగా కూడా పులివెందుల జనంలో జగన్ పట్ల విముఖతకు కారణంగా చెబుతున్నారు. పులివెందులలో ఇప్పటివరకు జరిగిన జడ్పిటిసి ఎన్నికల విషయానికి వస్తే 1994, 2001, 2007, 2013, 2021  ఎన్నికల్లో గెలిచినా, ఏకగ్రీవం అయినా వై ఎస్ కుటుంబ మద్దతుతో పోటీ చేసిన వారే . అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే 1978 నుంచి 2024 మధ్యకాలంలో జరిగిన 14 ఎన్నికల్లో వై ఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు.  చివరగా 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గత ఎన్నికల మెజారిటీ తగ్గినా మరో సారి జగన్ మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలవడానికి కారణమయ్యాయి. అయితే  2019 ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన పరిణామాలు  పులివెందులలో జగన్ పట్టు జారిపోవడానికి కారణం అని చెప్పాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల సమయంలో జగన్ కు వైఎస్ కుటుంబం మొత్తం అండగా నిలిచింది. తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల, బాబాయ్ వివేకానందరెడ్డి.. ఇలా అందరూ అన్ని విధాలుగా ఆయనకు అండగా నిలబడ్డారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కూడా జగన్ కు ప్రజా సానుభూతి వెల్లువెత్తి వైసీపీ ఘన విజయానికి దోహదం చేసింది. అయితే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత ముందు సోదరి, ఆ తరువాత తల్లి ఆయనకు దూరం కావడం, అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయం దర్యాప్తులో ఎస్టాబ్లిష్ కావడం, వివేకా కుమార్తె న్యాయపోరాటం ఇవన్నీ జగన్ కు పులివెందులలో బలం తగ్గడానికి కారణాలయ్యాయి. అలాగే జగన్  హయాంలో నియోజకవర్గంలో కాంట్రాక్టర్లుగా మారి పలు అభివృద్ధి పనులు చేసిన పార్టీ శ్రేణులకు చెందిన కోట్లాది రూపాయల బిల్లులు చెల్లింపునకు నోచుకోకపోవడం వంటి అంశాలు కూడా నియోజకకర్గంలో జగన్ కు ఆదరణ తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇవన్నీ కలిసి పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఆయన పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాకుండా ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని చవిచూసేలా చేశాయి.  ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని నియోజకవర్గ ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుంటే.. ఉన్న కొద్దిపాటి పట్టూ జారిపోయే ప్రమాదం ఉందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాదా?

తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు ఆ పార్టీ పరిస్థితిని రాష్ట్రంలో నానాటికీ దిగజారేలా చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి ఈ అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. అధిష్టానం జోక్యం కూడా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని మెరుగుపరచచడంలో విఫలమైంది. ఇప్పటికీ రాష్ట్రపార్టీలో ముఠాల కుమ్ములాటలు, గ్రూపు తగాదాలూ అలాగే ఉన్నాయి. నాయకుల మధ్య విభేదాలు క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు బహిరంగంగా ఆ పార్టీ ఎంపీ నుంచే ఘోర పరాభవం, అవమానం ఎదురైంది.  విషయమేంటంటే.. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక, ఎన్నికల వ్యూహరచన తదితర అంశాలపై చర్చించేందుకు శనివారం  పార్టీ సీనియర్లు, కీలక నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అవమానం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ మెదక్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు పదే పదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పేర్కొన్నారు.   ఒక సారి అయితే పొరపాటు అనుకోవచ్చు. కానీ రఘునందనరావు తన ప్రసంగంలో కనీసం అరడజను సార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని పేర్కొన్నారు. పరిశీలకులు, పార్టీ వర్గాలూ కూడా రఘునందనరావు ఉద్దేశపూర్వకంగా, రామచంద్రరావును అవమానించే  లక్ష్యంతోనే అలా మాట్లాడారని అంటున్నారు. రఘునందనరావు, రామచంద్రరావు మధ్య విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామచంద్ర రావును అవమానించడం, చిన్నబుచ్చడమే లక్ష్యంగా రఘునందనరావు అలా వ్యవహరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మోడీ నోట తెలంగాణ విమోచన దినం మాట!

ప్రధాని నరేంద్రమోడీ నోట తెలంగాణ విమోచన దినోత్సవం మాట వచ్చింది. తెలంగాణ హైదరాబాద్ నియంతృత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి చెందిన సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న రోజు అన్న సంగతి తెలిసిందే. అలాంటి తెలంగాణకు అత్యంత ప్రాముఖ్యత ఉన్న రోజు గురించి ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. మోడీ మన్ కీ బాత్ 125వ ఎపిసోడ్ లో ఆదివారం (ఆగస్టు 31)న తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ  నిజాం నియంతృత్వ కబంధ హస్తాల నుంచీ,  రజాకార్ల దురాగతాల నుంచి విముక్తి చెంది నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందిన రోజు సెప్టెంబర్ 17 అన్నారు.  నిజాం పాలనలో  త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినా, వందేమాతరం అని నినదించినా చంపేసేవారని పేర్కొన్న మోడీ..  సర్దార్ పటేల్   ఆపరేషన్ పోలోతో తెలంగాణను నిజాం కబంధ హస్తాలనుంచి విముక్తి చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ రేడియోలో చేసిన ప్రసంగాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో వినిపించారు.   

బీసీ రిజర్వేషన్ బిల్లుకు వంద శాతం మద్దతు కానీ.. అసెంబ్లీలో కేటీఆర్

పంచాయతీ రాజ్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించేందుకు రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ  ఆమోదం తెలిపింది.   పంచాయతీ రాజ్ లో 42 శాతం రిజర్వేషన్లకు వీలు కల్పంచే బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బిల్లుకు ఆమోదం తెలుపుతూనే కీలక వ్యాఖ్యలు చేశారు.   బీసీల రిజర్వేషన్ బిల్లును అమలు చేయడం తమకు ఇష్టం లేదని సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన  బీసీలకు బీఆర్ఎస్ పార్టీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ పదవులను ఇచ్చిందని గుర్తు చేశారు. బీసీని మొదటి అడ్వొకేట్ జనరల్ గా చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనన్న కేటీఆర్ తమ బీఆర్ఎస్ పార్టీలో  మూడు  ప్రొటోకాల్ పదవులను బీసీలకే ఇచ్చామని గుర్తు చేశారు  బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని, 50 శాతం సీలింగ్ తీసేలా రాజ్యాంగ సవ రణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు బిఆర్ఎస్ మద్దతు వంద శాతం ఉంటుందని కేటీఆర్ సభా ముఖంగా ప్రకటించారు. ఇప్పటివరకూ సీఎం రేవంత్ రెడ్డి 52 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకోసం అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు. ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ కలిసి చర్చిస్తే అరగంటలో బీసీ రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేటీఆర్ అన్నారు. 

ట్రంప్ ఇండియా టూర్ రద్దు.. మోడీ చైనా పర్యటన ఎఫెక్టేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది డిసెంబర్ లో భారత్ లో జరపాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది చివరిలో ఇండియాలో జగరనున్న క్వాడ్ సదస్సులో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆయన దానిని రద్దు చేసుకున్నారు. భారత్ పై ట్రంప్ టారిఫ్ వార్.. ప్రతిగా ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటన నేపథ్యంలో ట్రంప్ టూర్ రద్దు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   అసలు ఆపరేషన్ సిందూర్ తరువాత నుంచి భారత్ - అమెరికాల మధ్య సంబంధాలు ఒకింత చెడ్డాయనే చెప్పాల్సి ఉంది. భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని పదే పదే చెప్పుకుంటూ తనకు తానే శెహభాష్ అంటూ భుజ కీర్తులు తగిలించేసుకుంటున్న ట్రంప్ కు పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశం ప్రమేయం ఇసుమంతైనా లేదనీ, పాక్ బతిమలాడుకుని కాళ్ల బేరానికి రావడం వల్లనే సీజ్ ఫైర్ కు అంగీకరించామనీ భారత్ కుండబద్దలు కొట్టడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మింగుడు పడలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో కూడా ట్రంప్ అభ్యంతరాలను ఇండియా ఇసుమంతైనా ఖాతరు చేయకపోవడంతో కంగుతిన్న అమెరికా అధ్యక్షుడు భారత్ పై అదనపు సుంకాలు విధించారు. దీనిని కూడా లేక్క చేయని ఇండియా రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో తగ్గేదే లే అని చేతల ద్వారా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మోడీతో చర్చించేందకు ట్రంప్ పలు మార్లు ఫోన్ చేశారనీ, అయితే ఆ ఫోన్ కాల్స్ కు మోడీ స్పందించలేదనీ వార్తలు వినవచ్చాయి.  ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడంతో ట్రంప్ తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

బీసీలకు రిజర్వేషన్లు.. బీఆర్ఎస్సే అడ్డం.. అసెంబ్లీలో రేవంత్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా తెలంగాణ పురపాలక చట్టం-2019కు సవరణలు చేస్తూ రూపొం దించిన బిల్లును ప్రభుత్వం ఆదివారం  (ఆగస్టు 31) అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న రేవంత్ రెడ్డి  స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ   బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, గవర్నర్ తీరు కారణంగానే జాప్యం జరుగుతోందన్నారు. గతంలో తమ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపిందని రేవంత్ గుర్తుచేశారు. అయితే.. గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపారనీ.. గత ఐదు  నెలలుగా ఆ బిల్లులు అక్కడే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం 2018, 2019లో తెచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు రిజర్వేషన్లకు గుదిబండగా మారాయనీ,  వాటిని సవరించేందుకు ఆర్డినెన్స్ తీసుకొస్తే..  దానిని కూడా గవర్నర్ రాష్ట్రపతికి పంపారనీ రేవంత్ వివరించారు. ఈ విషయంపై ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే, బీఆర్ఎస్ ఎంపీలు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. బీఆర్ఎస్ కు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదనీ, అందుకే ఇప్పుడు కూడా సభలో గందరగోళం సృష్టిస్తూ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.  బీసీలకు రిజర్వేషన్ల కల్పించేందుకు తీసుకువచ్చిన ఈ చట్ట సవరణ బిల్లుకు బీఆర్ఎస్ సహకరించకుంటే భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మొదట బీసీల వివరాలు సేకరించే బాధ్యతను రాష్ట్ర బీసీ కమిషన్ కు అప్పగించామన్న ఆయన..  రాజ్యసభ సభ్యుడు ఆర్. క్రిష్ణయ్య పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా  బీసీల వివరాలు సేకరించే బాధ్యతను డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సర్వే నిర్వహించినట్లు వివరించారు.  

చిన్నబాబు నాడు చెప్పారు.. నేడు జరిగింది!

మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. పని మొదలు పెడితే పూర్తి చేయాలి. ఈ విషయంలో రెండో ఆలోచనకే తావుండకూడదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పే విశ్వసనీయత అంటే అదీ. కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్నడూ జనం విశ్వాసం పొందేలా చెప్పింది చేసి చూపించిన పాపాన పోలేదు. నవరత్నాలంటూ ఆర్భాటంగా ప్రకటించిన పథకాల అమలు కూడా అరకొరగానే సాగింది. బటన్ నొక్కి సంక్షేమ సొమ్ము లబ్ధిదారులకు పందేరం చేశామంటూ ఘనంగా చాటుకున్నారే తప్ప.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. ఫలితమే గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీకి చరిత్రలో మిగిలిపోయేటంతటి ఘోర పరాజయం ఎదురైంది.  అయితే మాట ఇస్తే నిలబెట్టుకుంటాం. అంటూ తన యువగళం పాదయాత్ర సందర్భంగా ఉద్ఘాటించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. అదే చేస్తున్నారు. పాదయాత్ర సందర్బంగా రాయలసీమ జిల్లాలకు హంద్రీ నీవాతో నీళ్ళు అందిస్తామని నారా లోకేష్‌ చెప్పారు. చెప్పడమే కాదు..  శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గుట్టూరు గ్రామంలో ఈ హామీని ఓ శిలాఫలకంపై చెక్కి మరీ ఆవిష్కరించారు.   గోరంట్ల, మడకశిర పరిధిలోని గ్రామాలకు తాగఃగునీరు, సాగునీరు అందించి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా ఆ శిలాఫలకంపై చెక్కించారు. ఇప్పుడు అది సాకారమైంది. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు శనివారం (ఆగస్టు 30)  కుప్పంలో కృష్ణమ్మకి గంగపూజ చేశారు. ఈ సందర్భంగా జనం నాడు లోకేష్ ఆవిష్కరించిన శిలా ఫలకం చూపి మరీ ఆయన తన మాట నిలబెట్టుకున్నారనీ, సాగు, తాగు నీరందించారని ఘనంగా చెప్పుకుంటున్నారు. పండుగ చేసుకుం టున్నారు.   ఒక పక్క వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపణలూ, విమర్శలూ గుప్పిస్తుంటే.. మరో పక్క నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతోంది.  ఇప్పుడు కృష్ణా జలాలను సీమకు అందించి కుప్పంలో గంగపూజ చేసి విశ్వసనీయత అంటే ఏమిటో చంద్రబాబు, లోకేష్ ను చాటారు. దీంతో వైసీపీ గళం మూతపడింది. కుప్పంకు కృష్ణాజలాలకు సంబంధించి వైసీపీ ఒక్కటంటే ఒక్క ముక్క మాట్లాడటం లేదు.   మంచిని చూడటానికి వారి నేత్రాలు, పొగడడానికి వారి నోళ్లు సహకరిస్తున్నట్లు లేదంటూ  వైసీపీ నేతలను నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. 

హరీష్ రావుది దింపుడు కళ్లెం ఆశేనా?!

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకల వ్యవహారంలో బీఆర్ఎస్ గాభరా పడుతోంది. భయపడుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు కంగారు పడుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ ను మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులను బెంబేలెత్తిస్తోంది. దీంతో కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశించాలని కోరుతూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఒక వేళ ప్రవేశపెట్టినా.. ఎలాంటి చర్యా తీసుకోవద్దనైనా ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.  సరే కోర్టు నిర్ణయం ఏమిటన్నది పక్కన పెడితే.. అసలు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేపెట్టి చర్చిస్తామన్న రేవంత్ సర్కార్ నిర్ణయంపై హరీష్ రావు, కేసీఆర్, బీఆర్ఎస్ లు ఎందుకు అంత గాభరాపడిపోతున్నారు?  హరీష్ రావు శనివారం (ఆగస్టు 30) హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఆదివారం (ఆగస్టు 31) కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. శనివారం సాయంత్రం వరకూ హరీష్ రావు పిటిషన్ కోర్టులో విచారణకు రాలేదు. అదలా ఉంచితే.. కళేశ్వరం కమిషన్ నివేదికను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ గతంలోనే హరీష్ రావు, కేసీఆర్ లు పిటిషన్లు వేశారు. కానీ కోర్టు వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సమగ్రంగా చర్చించిన తదుపరి మాత్రమే చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో నివేదికపై స్టే ఇవ్వడానికి అప్పట్లో కోర్టు నిరాకరించింది.  అయినా  హరీష్ రావు కాళేశ్వరం రిపోర్టునున అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలంటూ మరో సారి కోర్టును ఆశ్రయించారు. .  ఆయన గాభరా ఏమిటంటే.. ఒక సారి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడితే.. ఆ తరువాత ఆ నివేదిక చట్టబద్ధతపై కోర్టులు నిర్ణయం తీసుకోజాలవు.  అంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు... ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలంటే మాత్రం చట్టబద్ధంగానే తీసుకోవాలి. అంటే చర్యల అంశం కోర్టు పరిధిలోకి వస్తుంది.   అయినా కూడా అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెడతారంటేనే హరీష్ కంగారు పడుతున్నారు. అంటే కాళేశ్వరంలో అవకతవకలు, అక్రమాలు, అవినీతి జరిగిందని పరోక్షంగా అంగీకరించేస్తున్నారా అన్నచర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. అందుకే కాళేశ్వరం కమిషన్ నివదిక అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవాలంటూ పదే పదే కోర్టును ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆక్టోబర్ లేదా నవంబర్‌లో జూబ్లీ‌ ఉప ఎన్నిక : కిషన్‌రెడ్డి

  దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అకాల మరణంతో ఏర్పడిన జూబ్లీ‌హిల్స్ అసెంబ్లీ స్ధానానికి ఆక్టోబర్ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతోంది. బీసీల ఓట్లు అడిగి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేశానే జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నికకు వెళ్లాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని కేంద్ర మంత్రి తెలిపారు. ఎన్నికల షెడ్యూలు విడుదలతో సంబంధం లేకుండా, అభ్యర్థి ఎంపిక అంశానికి పెద్దగా ప్రాధాన్యమివ్వకుండా కేవలం పార్టీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌లు జూబ్లీహిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఏకంగా ముగ్గురు రాష్ట్ర మంత్రులను రంగంలోకి దింపి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బీజేపీ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, పాయల్ శంకర్‌తో పాటు గౌతమ్ రావు, గరికపాటి మోహన్ రావు, చింతల రామచంద్రారెడ్డిలకు అవకాశం కల్పించారు.

అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ వద్దు..హైకోర్టులో హరీష్‌రావు పిటిషన్

  పీసీ ఘోష్ క‌మిష‌న్ కమీషన్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికను శాసన సభలో  ప్రవేశ పెట్టొద్దని కోరుతూ తెలంగాణ హైకోర్టులో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్‌రావు హౌస్ మోషన్‌ పిటిషన్ వేశారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు తాము కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వారు అనుమతినివ్వడం లేదని హరీష్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని హరీష్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించి, తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని హరీష్‌రావు హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్ణయాలు తీసుకున్న తీరు.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై 16 నెలలపాటు విచారణ జరిపిన పీసీఘోష్ కమిషన్.. జూలై 31న ప్రభుత్వానికి నివేదికను అందించింది.  ఈ నివేదికపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చ జరిగింది. అధికారులతో పాటు బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు బాధ్యులని తేలడంతో.. అసెంబ్లీలో చర్చించి.. అందరి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్తామని ఇది వరకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ ఇప్పటికే హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హాజరవుతారని లేదని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

సెప్టెంబరు 18 నుంచి శాసన సభ సమావేశాలు : స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

  తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా శాసన సభ్యులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోక్‌సభ స్పీకర్‌ ఓమ్ బిర్లా హాజరవుతారని, ముగింపు రోజున గవర్నర్‌ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారని  స్పీకర్‌  తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబరు 18 నుంచి శాసనసభ సమావేశాలు జరగుతాయని, ఈమేరకు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించినట్టు తెలిపారు.  

స్థానిక సంస్థలకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

  స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.  ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసింది.తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో  భేటీ అయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు చేసింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్‌కు క్యాబినెట్ సిఫార్సు చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంతోపాటు, ఇటీవలి వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైనా చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థికశాఖ సాయం కోరుతూ తీర్మానం చేశారు. మరోవైపు సెప్టెంబర్‌ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా క్యేబినెట్ నిర్ణయం తీసుకుంది.  

మోడీ చైనా టూర్ మేట‌రేంటి?

  ఆగ‌స్ట్ 29 నుంచి సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కూ మోడీ జ‌పాన్, చైనా ప‌ర్య‌టిస్తున్నారు. జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఆర్ధికాంశాలు ప్ర‌ధాన  పాత్ర పోషిస్తున్న‌ట్టు చెబుతున్నారు విదేశాంగ శాఖ అధికారులు. ప‌ది ట్రిలియ‌న్ జపాన్ ఎన్లు వ‌చ్చే ప‌దేళ్ల‌లో భార‌త్ లో పెట్టుబడుల వ‌ర్షం కురిసేలా తెలుస్తోంది. అస‌లీ యాత్ర మొత్తంలో చైనా షాంఘై కోప‌రేటివ్ స‌మ్మిట్ లోనే అస‌లు మేట‌ర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. పుతిన్ తో స‌హా మొత్తం ఇర‌వై మందికి పైగా ప్ర‌పంచ నాయ‌కులు ఈ వేదిక మీద ఎక్కి ఒకేసారి క‌నిపించ‌నున్నారు. గ‌తంలో ర‌ష్యాలో జ‌రిగిన బ్రిక్స్ స‌మావేశాల త‌ర్వాత మోడీ.. పుతిన్, జిన్ పింగ్ ని క‌ల‌వ‌డం ఇదే. ఇప్ప‌టికే మోడీ చైనా ప‌ర్య‌టించి ఏడేళ్లు పూర్తి కావ‌స్తోంది. ఇప్ప‌టికే ట్రంప్ మోడీ స‌ర్కార్ పై గ‌రం గ‌రంగా ఉండ‌టం తెలిసిందే. అమెరికా అప్పీళ్ల కోర్టు.. ఇలాంటి సుంకాల విధింపు అక్ర‌మం అని కోర్టు తీర్పునిచ్చినా ఆయ‌న సుప్రీం కెళ్లి త‌ద్వారా.. తాను అనుకున్న‌ది సాధించాల‌నుకుంటున్నారు. దీంతో మోడీ స‌ర్కార్ కూడా రూట్ మార్చింది. మ‌న వ‌స్త్ర ఉత్ప‌త్తులు దిగుమ‌తి పొందే 40 దేశాల్లో మేళాలు పెట్టి మార్కెటింగ్ పెంచి.. అమెరికా  నుంచి ఎదురు  కానున్న‌.. నష్టాన్ని పూడ్చే య‌త్నం చేస్తోంది. ఇదంతా ఇలా ఉంటే మోడీ ప్ర‌స్తుతం ఇటు పుతిన్ తో పాటు అటు జిన్ పింగ్ ని సైతం క‌ల‌సి కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకునేలా తెలుస్తోంది. 2001లో ఆరు యురేషియా దేశాలతో మొద‌లైన ఎస్. సీ. ఓ.. ప్ర‌స్తుతం ఇర‌వైకి పైగా దేశాలతో పెద్ద కూట‌మిగా అవ‌త‌రించింది. ఇదిలా ఉంటే ఈ స‌మ్మిట్ ద్వారా గ్లోబ‌ల్ సౌత్ అనే కాన్సెప్ట్ ని కూడా తెర‌పైకి తెచ్చేలా తెలుస్తోంది. వీరంతా క‌ల‌సి వ‌చ్చే రోజుల్లో అమెరికా వ్య‌తిరేకంగా తీర్మానాలు తీస్కుంటే అదో గేమ్ ఛేంజ‌ర్ కానుంది. ఇప్ప‌టికే యూరోలా బ్రిక్స్ దేశాలు సైతం ఒక క‌రెన్సీని ఎంపిక చేసుకుని త‌ద్వారా.. చెల్లింపులు మొద‌లు పెడితే డాల‌ర్ ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా స‌గం ప‌డిపోతుంది. ఆపై ఈ బ్లాక్ మెయిల్ డ్రామాలకు ఇక కాలం చెల్లిపోతుంది. ఇలాంటి కీల‌క‌మైన నిర్ణ‌యంగానీ ఈ స‌మ్మిట్ ద్వారా ఒక్క‌టి బ‌య‌ట‌కొచ్చినా చాలు ట్రంప్ ఖేల్ ఖ‌తం దుక‌ణం బందేనంటున్నారు. ఇవే కాకుండా ఆర్ధిక- ర‌క్ష‌ణ- సైనిక ప‌ర‌మైన వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కూడా ఈ దేశాలుగానీ చేసుకోవ‌డం మొద‌లైతే అమెరికా, దాని వెన‌కున్న యురోపియ‌న్ దేశాలు దాదాపు ఒంట‌రిగా మిగిలిపోతాయి. వీట‌న్నిటిలోకీ యూఎస్ పెద్ద‌న్న పాత్ర దారుణంగా  ప‌డిపోయి బ‌ల‌హీన  ప‌డుతుంది. ఇలాంటిదేదో ప్లాన్ చేయ‌డానికే భార‌త్, 2020 నాటి స‌రిహ‌ద్దు గొడ‌వ‌ల‌ను మ‌ర‌చిపోయి చైనాతో చెలిమి చేయ‌డాన‌కి ముందుకొస్తోంది. దానికి తోడు ఇటు పాకిస్తాన్,  అమెరికా పంచ‌న చేర‌డంతో చైనా కూడా భార‌త్ వైపే మొగ్గు చూపించేందుకు ముందుకొస్తోంది. అందుకే ఆగ‌స్ట్ లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భార‌త్ ప‌ర్య‌టించి.. చైనా రావ‌ల్సిందిగా మోదీకి జింగ్ పింగ్ పంపిన ఆహ్వాన ప‌త్రం అందించారు. అందులో భాగంగా మోడీ ఇటు జ‌పాన్ తో ఆర్ధిక అటు చైనాతో దౌత్య ప‌ర‌మైన స‌ర్దుబాట్ల కోసం ఈ గ్రాండ్ టూర్ వేశార‌ని అంచ‌నా వేస్తున్నారు దౌత్య వ్య‌వ‌హారాల నిపుణులు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వామపక్షాలు కలిసి రావాలి : సీఎం రేవంత్‌ రెడ్డి

  ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వామపక్షాలు కలిసి రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీలో ఏర్పాటు చేసిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో  ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం మా పాలమూరు బిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి కడదాకా పోరాటం చేశారని కొనియాడారు. విద్యార్థి ఉద్యమాల నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎదిగారని అన్నారు. దాదాపు 65 సంవత్సరాలు ఎర్రజెండా నీడనే ఉన్నారని చెప్పారు. సామాజిక చైతన్యం ఉన్న నాయకుడు అని అన్నారు.  పేదల జీవితాల్లో మార్పు రావాలని నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోయేలా తాము కూడా ప్రయత్నం చేస్తామని.. త్వరలోనే క్యాబినేట్‌లో చర్చించి  ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం అని చెప్పుకొచ్చారు. వారి కంటే గొప్పగా ఆ పాత్రను ఇంకెవరూ పోషించలేరని అన్నారు. కొందరు రాజ్యాంగాన్ని, ఎన్నికల సంఘాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారు. బిహార్‌లో ఐదు లక్షల ఓట్లు మాయమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో విపక్షాలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది అని కోరారు.  

అపర భగీరథుడు చంద్రబాబు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దార్శనికుడు!

గంగానదిని భూమికి తీసుకువచ్చిన పౌరాణిక రాజు భగీరథుడైతే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంకు ఆధునిక భగీరథుడిగా మారారు. రాయలసీమలోని   తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గతంలో కృష్ణాజలాలు అన్నది ఎన్నటికీ నెరవేరని కలలా అనిపించినది.. ఇప్పడు వాస్తవంగా మారింది. ఇది చంద్రబాబు దార్శనికతకు, ఆయన పట్టుదలకు, అనుకున్నది సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా  ముందుకు సాగే తీరుకు కుప్పం చేరుకున్న కృష్ణాజలాలే ప్రత్యక్ష, సజీవ నిదర్శనంగా చెప్పవచ్చు.  ఈ సందర్భంగా చంద్రబాబు కృష్ణా జలాల్లో పడవ ప్రయాణం చేస్తున్న దృశ్యాలు తెగ వైరల్ అయ్యాయి. కృష్ణా జలాలు కుప్పం చేరుకున్న క్షణాలు స్థానికులను ఉద్విగ్నతకు గురి చేశాయి.    శ్రీశైలం నుండి హంద్రీ-నీవా  కాలువ ద్వారా కుప్పంకు చేరుకున్నాయి.  కేప్పం చేరుకున్న కృష్ణా జలాలను పూజలు చేసి, జలహారతి ఇచ్చిన అనంతరం సీఎం మాట్లాడుతూ..  రాయలసీమకు నీటిని తరలించడం అన్నది తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు లక్ష్యం, కల అని చెప్పారు.    శ్రీకృష్ణదేవరాయలు ఏలిన రాయలసీమ ఒకప్పుడు  రత్నాల సీమ.. అయితే ఇప్పుడది రాళ్ల సీమగా, కరవు సీమగా మారిపోయింది. ఈ పరిస్థితి మార్చాలన్న చంద్రబాబు కృతనిశ్చయమే ఇప్పుడు ఈ జలసిరి. 1999లో  చంద్రబాబు హంద్రీనీవాకు పునాది వేశారు.  2025 నాటికి  కృష్ణ జలాలను  తీసుకురావగలిగారు.  భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ, ఈ విజయాన్ని, ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కృష్ణా జలాలలో పడవ ప్రయాణం చేశారు.   

కేటీఆర్, హరీష్ అరెస్ట్

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు  శనివారం  ప్రారంభమైన సంగతి  తెలిసిందే. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు సంతాపతీర్మానాలకే పరిమితమయ్యాయి. సంతాప తీర్మానాలను ఆమోదించిన తరువాత సభ వాయిదా పడింది.  అసెంబ్లీ నుంచి నేరుగా  సెక్ర‌టేరియ‌ట్‌కు చేరుకున్నకేటీఆర్, హరీష్ రావులు  రైతుల స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌కు దిగారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి సెక్రటేరియెట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోలీసు వాహనం లోంచే మీడియాతో మాట్లాడారు. యూరియా దొరకక రైతులు ఆత్మహత్యలే గతి అనుకునే పరిస్థితికి వచ్చారనన్నారు. యూరియా కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన కేటీఆర్, హరీష్ రావులను ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ ను తరలించారు.  

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే : మంత్రి కోమటిరెడ్డి

  మాజీ సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలిని మంత్రి తెలిపారు. కాళేశ్వరం కేసిఆర్ హయాంలోనే రికార్డు స్థాయిలో కట్టారు..ఆయన హయంలోనే కూలిందన్నారు. కాళేశ్వరంపై వేసిన కమిషన్ జడ్జి..సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేశారు..మంచి పేరున్న న్యాయ మూర్తి ఆయన అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.  కమిషన్ కమిటీ సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని దానికి భయపడే కేసీఆర్, హరీష్ రావు కోర్టుకు పోయారని మంత్రి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే.. కేసీఆర్ అసెంబ్లీ వచ్చి చెప్పాలి. ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు తీసుకుంటున్నాడు..బాధ్యత ఆయనపై ఉంటదని  వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం పై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ వాకౌంట్ చేయకుండా.. మా మీద పూలు చల్లుతారా.? తప్పించుకుని పారిపోతారు. కాళేశ్వరం పూర్తి నివేదిక, కంప్లీట్ గా చర్చ ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుతున్న..కేసీఆర్ శాసన సభకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అని ఆయన తెలిపారు. కాళేశ్వరం పై లక్ష కోట్లు తిన్న వాళ్లను వదిలేస్తామా.?ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు...వాళ్లను ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు  

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్

  గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరాం, అజారుద్దీన్ పేర్లను క్యాబినెట్ ఖరారు చేసింది. ఇవాళ జరిగిన మంత్రి వర్గ సమావేశంలో వీరిద్దరి పేర్లను  ఆమోదించి గవర్నర్‌కి  సిఫార్సు చేస్తూ కేబినెట్ తీర్మానం తీసుకుంది. గతంలో కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించగా ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.  అమీర్‌ అలీఖాన్‌ స్థానంలో అజారుద్దీన్‌కు అవకాశం కల్పించారు.ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ నియామకాలను బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీం.. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది.  మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు అని సర్వోన్న న్యాయస్ధానం అభిప్రాయపడింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణ తేదీగా సెప్టెంబర్ 17ను నిర్ణయించింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో తానేకే  కాంగ్రెస్ టిక్కెట్ ఖాయమని భావించాడు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని కట్టబెట్టాలనే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్‌ హస్తం పార్టీ అభ్యర్థి ఎవరై అనేది సస్పెన్స్‌ గా మారింది