కాళేశ్వరంపై దర్యాప్తు సీబీఐకి.. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్
posted on Sep 1, 2025 @ 10:14AM
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలపై రాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) ప్రకటించారు. కాళేశ్వరంపై రాష్టర ప్రభుత్వం నియమించిన కమిషన్ నివేదికపై అసెంబ్లీలో ఆదివారం (ఆగస్టు 31) సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం సీఎం రేవంత్ కాళేశ్వరం అక్రమాలు, అవినీతి, అవకతవకల కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో భారీ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) గుర్తించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దీనికి తోడు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వ తప్పిదాలను, అవకతవకలను ఎత్తిచూపాయన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సైతం తన నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ఏజెన్సీలను బాధ్యుల్ని చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని కమిషన్ స్పష్టం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికను జులై 31న ప్రభుత్వానికి సమర్పించగా, ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్ దానిని ఆమోదించింది.
ఇక ఆదివారం (ఆగస్టు 31) సభలో ఈ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత, అన్ని పార్టీల అభిప్రాయాలను స్వీకరించి, చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గమని ప్రభుత్వం భావించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్, ఎన్డీఎస్ఏ, ఇతర నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఆదివారం అర్ధరాత్రి వరకు సుమారు 9 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగింది. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తొలుత కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చడం నుంచి మేడిగడ్డ స్పీయర్స్ కుంగిపోయిన పరిణామాల వరకూ, జస్టిస్ ఘోష్ గారి నేతృత్వంలో విచారణ కమిషన్ నియామకం వరకు సమగ్రంగా సభకు తెలిపారు.