సీమాంధ్ర ఎంపీల డ్రామా..కాంగ్రెస్ కుట్ర!

  ఈరోజు లోక్ సభ సాక్షిగా రాష్ట్ర కాంగ్రెస్ యంపీలు తెలుగు ప్రజల పరువు పూర్తిగా తీశారు. విభజన బిల్లు ప్రవేశపెట్టకుండా హోంమంత్రి షిండేని అడ్డుకోవాలని సీమాంధ్ర యంపీలు, వారిని నిలువరించాలని తెలంగాణా యంపీలు వారి అధిష్టాన దేవత సోనియాగాంధీ కళ్ళ ముందే ఒకరినొకరు కొట్టుకొన్నంత పని చేసారు. ఆతరువాత అందరూ మీడియా ముందుకు వచ్చి ఒకరినొకరు నిందించుకొంటూ తెలుగు జాతి పరువుని పూర్తిగా గంగలో కలిపేసారు.   బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ మీడియాతో మాట్లాడుతూ, "ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టవద్దని మేము ప్రధానమంత్రికి ముందే సూచించాము. కానీ, కాంగ్రెస్ పార్టీ మా సూచనను పట్టించుకోకుండా సభలో బిల్లు ప్రవేశపెట్టి, తన సభ్యులే ఒకరితో మరొకరు కలహించుకొంటుంటే సోనియాగాంధీ నిర్లిప్తంగా చూస్తూ కూర్చోన్నారు. స్వంత పార్టీ సభ్యులనే అదుపు చేయలేనివారు దేశాన్ని ఏవిధంగా పాలిస్తున్నారో వారికే తెలియాలి?" అని ఆమె ఎద్దేవా చేసారు.   ఏమయినప్పటికీ, ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు వ్యవహరించిన తీరు వలన బిల్లుకు వ్యతిరేఖంగా ఓటు వేద్దామనుకొన్నవారు సైతం అనుకూలంగా వేసేందుకు సిద్దపడినట్లయితే, ఆవిధంగా వారిచేత ఓటు వేయించేందుకే కాంగ్రెస్ అధిష్టానం తన యంపీల చేత ఈ నాటకం ఆడించిందని భావించవలసి ఉంటుంది. బిల్లుని ఆమోదించడానికి సభలో సాధారణ మెజారిటీ సరిపోతుందని న్యాయశాఖ స్పష్టం చేసింది గనుక, సభలో తన సభ్యులచేతనే ఈవిధంగా రాద్ధాంతం చేయించి, వారిని సభ నుండి సస్పెండ్ చేసి, సభలో మిగిలినవారి సహకారంతో మూజువాణి ఓటు ద్వారా బిల్లుని ఆమోదింపజేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్లు ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. "కాంగ్రెస్ యంపీలందరూ ఒకరితో ఒకరు కుమ్ములాడుకోవడం కాంగ్రెస్ కుట్రగానే మేము భావిస్తున్నామని" సుష్మా స్వరాజ్ చెప్పడం చూస్తే ఈ అనుమానం నిజమేననిపిస్తుంది. విభజన బిల్లుని తమ వోటు ద్వారా కాక మంద బలంతో అడ్డుకొందామని వారు భావించడం వలన బిల్లుకి అనుకూలంగా పరిస్థితులు మారవచ్చుననే గ్రహింపు వారికి లేదని భావించలేము. కనుక సుష్మా స్వరాజ్ చెపుతున్నట్లు, వారు బిల్లుని అడ్డుకోవడానికి కాక దానిపై ఎటువంటి చర్చ జరగకుండా అడ్డుకొని ఆమోదింపజేసేందుకే సభలోఈ విధంగా గొడవ చేస్తూన్నారని అనుమానించక తప్పదు.  

సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్

      లోకసభలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. రెండు గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఆమె వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం సభను మూడుగంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలోను ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన పరిణామాలపై స్పీకర్ మీరాకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తాను చాలా బాధపడుతున్నా....విచారిస్తున్నాని స్పీకర్ అన్నారు. ఇప్పుడు మాట్లడలేని పరిస్థితిలో ఉన్నానని తెలిపారు. సభలో ఈరోజు జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని స్పీకర్ మీరాకుమార్ అన్నారు.

కాంగ్రెస్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా

      కాంగ్రెస్ పార్టీకి మరో ముగ్గురు సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి, బండారు సత్యానందరావు ఉన్నారు. వీరు తమ రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఇక ఇప్పటికే రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించినందుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ తన పదవికి రాజీనామా చేశారు. గురువారం ఉదయం తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు లేఖను అందించారు. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఆత్మహత్యకు యత్నించిన టిడిపి మోదుగుల

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టగానే తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. టి.బిల్లును షిండే సభలో ప్రవేశపెడుతున్న సమయంలో పేపర్లు లాక్కునేందుకు ఎంపీ సబ్బంహరి యత్నించగా, టీ.ఎంపీలు షిండేకు రక్షణగా నిలిచారు. మరోవైపు టి.బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎంపీ మోదుగుల సభలో హల్‌చల్ చేశారు. మైకులను పగుల గొట్టారు, లోక్ సభ సెక్రటరీ జనరల్ వద్ద టేబుల్ అద్దాలు పగులగొట్టి పొడుచుకునేందుకు యత్నించిన మోదుగులను తెలంగాణ ఎంపీలు అడ్డుకున్నారు. అటు లగడపాటిపై ఎంపీలు గుత్తా, మందా జగన్నాథం చేయిచేసుకున్నారు. లగడపాటిని ఎంపీ మందా కిందేసి తొక్కేందుకు యత్నించగా కేంద్ర మంత్రి పళ్లంరాజు అడ్డుకున్నారు.

లోక్‌సభలో పెప్పర్ స్ప్రే...లగడపాటికి అస్వస్థత

    లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లును షిండే ప్రవేశపెట్టిన వెంటనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీమాంధ్ర ఎంపీల వైఖరితో లోక్‌సభ మరోసారి రణరంగంగా మారింది. లోక్‌సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఎంపీ లగడపాటి సభలో పెప్పర్ స్ప్రే చల్లడంతో పలువురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గు, కళ్ల మంటలతో అస్వస్థతకు గురైన ముగ్గురు ఎంపీలను అధికారులు ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ సభ్యులు లగడపాటిని పక్కకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన మిరియాల పొడిని తన పైనే ప్రయోగించుకున్నారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

లోక్ సభలో తెలంగాణ బిల్లు పెట్టిన కాంగ్రెస్

      తెలంగాణ బిల్లుపై దేశ రాజధానిలో నెలకొన్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టాన౦ తెరదించింది. లోక్ సభలో గంధరగోళ పరిస్థితుల మధ్య నాటకీయంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును 12గంటలకు సుశీల్ కుమార్ షిండే సభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్త వాతావారణం నెలకొంది. సీమాంధ్ర ఎంపీలు సమైక్యనినాదాలు చేస్తూ బల్లలపైకి ఎక్కి మైకులు విరకొట్టి, దస్త్రాలు పడేశారు. లోకసభ లో సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడంతో దాని ఘాటుకి దగ్గు, కళ్ళ నుంచి నీళ్ళు రావడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో ఎంపీలు బయటకు పరుగులు తీశారు. లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు.   Watch This Video A musical tribute to Mahatma Gandhi on his death anniversary

టి బిల్లుపై కమల్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

      లోకసభలో రాష్ట్ర విభజన బిల్లుని ఈరోజే ప్రవేశపెట్టనున్నారని సర్వత్రా వార్తలు వస్తున్న సమయంలో పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కమల్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లును ఈరోజు ప్రవేశపెట్టడమా....లేక సోమవారం ప్రవేశపెట్టడమా అన్న దానిపై చర్చిస్తున్నామని తెలిపారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైల్వే బడ్జెట్, ఓటాన్ అకౌంట్‌పైనా దృష్టి పెట్టాల్సి ఉందని కమల్‌నాథ్ పేర్కొన్నారు.   మరోవైపు రాష్ట్ర విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి సవరణలు, మార్పులు చేయనవసరం లేదని, బిల్లుని యధాతధంగా లోక్ సభలో ప్రవేశపెట్టవచ్చని, బిల్లుని ఆమోదించడానికి సాధారణ మెజార్టీ సరిపోతుందని న్యాయశాఖ చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏనుగంత బలం చేకూరినట్లయింది. అందుకే ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి రాజీనామా వార్తలను అధిష్టానం పట్టించుకోలేదేమిటి?

  ఈ రోజు రాష్ట్ర శాసనసభ చిట్ట చివరి సమావేశాలు ముగియగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయచ్చని వార్తలు వెలువడుతున్న సమయంలో, రాష్ట్ర విభజన బిల్లు వ్యవహారంతో తలమునకలయి ఉన్న కారణంగానో, లేక ఆయన రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన విదించాలని భావిస్తుందో తెలియదు కానీ కాంగ్రెస్ అధిష్టానం మొత్తం మీద ఆ సంగతి అసలు తెలియనట్లు, అసలు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఆయన రాజీనామా ఆమోదం పొందినట్లయితే, దానితోబాటు ఆయన మంత్రివర్గం కూడా పూర్తిగా రద్దయిపోతుంది. ఒకవేళ ఆయన శాసనసభ రద్దుకు కూడా సిఫారసు చేసినట్లయితే, దానిని గవర్నర్ ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన అనివార్యమవుతుంది. కానీ, ఆయన ముఖ్యమంత్రి రాజినామాను ఆమోదించకుండా పెండింగులో పెట్టిన్నట్లయితే, ఈ సమస్యకు వేరే పరిష్కారాలు ఆలోచించే వెసులుబాటు కేంద్రానికి దొరుకుతుంది. పైగా ఆవిధంగా చేసినట్లయితే ఆయనను కొత్తపార్టీ పెట్టకుండా మరికొంత కాలం నిలువరించవచ్చును. ఈలోగా మరికొందరు శాసనసభ్యులు, మంత్రులు వేరే పార్టీలలోకి మారిపోతే, ఇక ఆయన కొత్త పార్టీ ఆలోచన అటకెక్కక తప్పదు. పైగా అయన రాజకీయ భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారుతుంది.   కానీ, ఆవిధంగా జరగడం వలన కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు. సీమాంధ్రలో తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకొంటూనే, కాంగ్రెస్ వ్యతిరేఖతను ఓట్లుగా మలుచుకోవడానికే కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యూహం అమలుచేస్తోంది గనుక ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించి, రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలోగా ఆయన ప్రజలలోకి వెళ్లి మరికొంత మైలేజీ పొందేలా చేయవచ్చును.

టుడేస్ స్పెషల్స్

  ఈరోజు రాష్ట్రంలో, డిల్లీలో అనేక ఆసక్తికర సంఘటనలు జరుగబోతున్నాయి. 1.లోక్ సభలో రాష్ట్ర విభజన ప్రవేశపెట్టడం.   2. సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు మళ్ళీ తమ స్వంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం.   3.రాష్ట్ర శాసనసభ చిట్ట చివరి సమావేశాలు ముగింపు.   4. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా.   5. డిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వం జనలోక్ పాల్ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టడం. ఆమోదం పొందకపోతే డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా.   ఈరోజు మధ్యాహ్నం ప్రశ్నోత్తరాల సమయం తరువాత రాష్ట్ర విభజన బిల్లుని కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టబోతోంది. అయితే అంతకంటే ముందుగానే దానిని అడ్డుకొనే ప్రయత్నంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరింపబడ్డ సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, తమ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా మరో మారు అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. అయితే దానిని సభలో చర్చకు ప్రవేశపెట్టాలంటే కనీసం 50మంది యంపీల మద్దతు అవసరం కాగా, ఇంతవరకు కేవలం 37 మంది యంపీలు మాత్రమే సంతకాలు చేసారు. కనుక మిగిలిన 13మంది మద్దతు కూడగట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.   ఇక రాష్ట్ర శాసనసభచిట్టచివరి సమావేశాలు ఈరోజుతోనే ముగుస్తాయి. ఈరోజే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేయవచ్చని తెలుస్తోంది.   బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న జనలోక్ పాల్ బిల్లుని ఇక ఈరోజే డిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమాద్మీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ బిల్లు ఆమోదం కోసం అవసరమయితే తను రాజీనామాకు కూడా సిద్దమేనని డిల్లీ ముఖ్యమంత్రి పదే పదే చెపుతున్నారు గనుక బహుశః ఆయన కూడా ఈరోజే తన పదవి నుండి తప్పుకొంటారేమో! అదే జరిగితే ఆమాద్మీ రెండు నెలల ముచ్చటగా మిగిలిపోతుంది.

నేడు లోక్ సభకి తెలంగాణ బిల్లు

  రాష్ట్ర విభజన బిల్లుని మొదట రాజ్యసభలో ప్రవేశపెడదామని ప్రయత్నించి భంగపడిన కాంగ్రెస్ అధిష్టానం, అధికార ప్రతిపక్ష పార్టీ నేతలనేకమంది రాష్ట్ర విభజన బిల్లు లోపభూయిష్టంగా, రాజ్యాంగ విరుద్దంగా ఉందని గట్టిగా వాదిస్తుండటంతో, మరోమారు అటువంటి చేదు అనుభవం ఎదుర్కోకూడదనే ఆలోచనతో బిల్లుపై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ సలహా కోరింది. రాష్ట్ర విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి సవరణలు, మార్పులు చేయనవసరం లేదని, బిల్లుని యధాతధంగా లోక్ సభలో ప్రవేశపెట్టవచ్చని, బిల్లుని ఆమోదించడానికి సాధారణ మెజార్టీ సరిపోతుందని న్యాయశాఖ చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏనుగంత బలం చేకూరినట్లయింది. అందుకే ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే సిద్దమవుతున్నారు.   అదేవిధంగా సీమాంధ్ర యంపీలు, మంత్రులు ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్లుని సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు. అందువలన ఈరోజు పార్లమెంటు రణరంగంగా మారే అవకాశముంది గనుక, కాంగ్రెస్ అధిష్టానం వారందరినీ సభ నుండి సస్పెండ్ చేయమని స్పీకర్ మీరాకుమార్ కి ముందే సూచించి ఉండవచ్చును. ఇంతవరకు జరిగిన వ్యవహారమంతా కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా ఏకపక్షంగానే సాగుతోంది గనుక, ఈరోజు స్పీకర్ కూడా అధిష్టానం మాట మన్నించి వారిని సభ నుండి సస్పెండ్ చేసి బిల్లుని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయవచ్చును.

పురందేశ్వరి కాంగ్రెస్ కి గుడ్ బై?

  ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తమ పార్టీ తరపున పోటీ చేసిన ముగ్గురు అభ్యర్ధులను ఓటేయకుండా తిరస్కరించారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేఖంగా తమ అధిష్టానం రాష్ట్ర విభజన చేస్తునందుకు నిరసనగా వారికి ఓటేయకుండా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కానీ, వైజాగ్ యంపీ మరియు కేంద్రమంత్రి అయిన ఆయన భార్య పురందేశ్వరి రాష్ట్ర విభజన అనివార్యమని, అందువలన సీమాంధ్ర ప్రాంతానికి న్యాయంగా రావలసిన ప్యాకేజీ కోసం పోరాడుతానని చెప్పడమే కాక, జీ.ఓ.యం.కు లేఖలు కూడా వ్రాసారు. కానీ, అదే సమయంలో తాను రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తున్నందున పార్లమెంటులో టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేస్తానని కూడా విస్పష్టంగా ప్రకటించారు. ఆమె ఈరోజు మిగిలిన సీమాంధ్ర కేంద్రమంత్రులు, యంపీలతో కలిసి లోక్ సభ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఆందోళన చేయడంతో సోనియాగాంధీ కూడా కంగు తిన్నారు. రేపు తమ పార్టీ లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టినట్లయితే, తన మంత్రి పదవికి, పార్టీకి కూడా రాజినామా చేసేందుకు ఆమె సిద్దమవుతున్నట్లు సమాచారం.  ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీ వీడదలిస్తే, ఆమెను చేర్చుకోనేందుకు బీజేపీ, వైకాపాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ రెండు పార్టీలలో చేరేందుకు ఆసక్తి లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి లేదా మరొకరు స్థాపించబోయే కొత్త పార్టీలో చేరినాచేరవచ్చును. ఆమె తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుంటుందని నందమూరి అభిమానులు కోరుకొంటున్నారు. కానీ ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, చంద్రబాబుకి మధ్య గతంలో కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి గనుక ఆమె తెదేపాలో చేరడం అనుమానమే. ఆమె పార్టీ వీడుతారా లేదా? వీడితే ఏ పార్టీలో చేరుతారు? అనే విషయాలు త్వరలోనే తేలిపోతాయి.

తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు..!

      తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపిందని కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ చెప్పారు. ప్రధాని బుధవారం మధ్యాహ్నం బీజేపీ నేతలతో తన నివాసంలో భేటీ ఏర్పాటు చేసారు. విందు సమావేశం ముగిసిన అనంతరం కమల్‌నాథ్‌ మీడియతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే తేదీపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీ నేతలు తెలంగాణకు తమ పార్టీ అనుకూలమంటూనే.. సీమాంధ్ర సమస్యలు పరిష్కరించిన తర్వాతే బిల్లుకు మద్దతిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నాయకులు రోజుకో మాట చెబుతున్న నేపధ్యంలో.. ఏ విషయాన్ని పూర్తిగా నమ్మలేని పరిస్థితి. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ లు నోరువిప్పితేనే తెలంగాణ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

యుపీఏ విందు రాజకీయం

      తెలంగాణా బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యుపీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో విందు రాజకీయానికి తెరతీసింది. లోక్ సభలో తెలంగాణ బిల్లు పాస్ కావాలంటే బీజేపీ మద్దతు తప్పనిసరి కావడంతో.. ఆ పార్టీ నాయకులను బుజ్జగించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన విందుకు యుపీఏ తరఫున చిదంబరం, షిండే, కమల్ నాథ్ లు హాజరవనున్నారు. బీజేపీ అగ్రనాయకులందరినీ ఆహ్వానించిన విందు ప్రధాన ఎజెండా.. అడ్డంకులు లేకుండా, వీలైనంత ప్రశాంత వాతావరణం లో తెలంగాణా బిల్లును గట్టెక్కించడమే. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికే సొంత పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులపై కాంగ్రెస్ వేటు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.   తెలంగాణ బిల్లు లోపాల పుట్టలా ఉందని సీమాంధ్రతో పాటు తెలంగాణా ప్రాంతానికి చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తుండడంతో.. మద్దతుపై బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనితోపాటు బిల్లుకు బీజేపీ మద్దతు అనుమానమే అన్న సంకేతాలు వెలువడ్డాయి. సీమాంధ్రకు అన్యాయం చేసే బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వబోమని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. మీ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు కుడా మద్దతివ్వని బిల్లుకు తామెలా మద్దతిస్తామని ఆయన బాహాటంగానే ప్రకటించారు. దీంతో మేలుకున్న కాంగ్రెస్ నాయకులు..నస్టనివారణ చర్యలు చేపట్టారు. అవిశ్వాస నోటీసు ఇచ్చిన తమ ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. ముఖ్యమంత్రి పై కూడా చర్యలు తీసుకుంటామంటూ లీకులు ఇచ్చారు.   మొత్తంగా ఈ పరిణామం యుపీయేకు లాభం చేకూర్చేలా ఉంది. బిల్లులు బీజీపీ మద్దతిస్తే.. తెలంగాణా ఇచ్చిన క్రెడిట్ దక్కుతుంది. ఒక వేళ బీజేపీ మద్దతు ఇవ్వకపోతే.. బిల్లు వీగిపోతుంది. మేము చేయాల్సింది అంతా చేసాం... బీజేపీ వల్లే బిల్లు వీగిపోయింది అని చెబితే తెలంగాణలో సానుభూతి దక్కుతుంది. ఈ విషమ పరిస్థితిని భారతీయ జనత పార్టీ ఎలా ఎదుర్కుతుందో వేచి చూడాల్సిందే......  

లోక్ సభ రేపటికి వాయిదా..

      సీమంధ్ర నాయకుల నినాదాలతో లోక్ సభ బుధవారం దద్దరిల్లింది. వాయిదా తర్వాత ప్రారంభమైన సభ సీమాంధ్ర ఎంపీల అరుపులతో మార్మోగింది. రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రికి మల్లికార్జున ఖర్గేకు వీరు అడుగడుగునా అడ్డుతగిలారు. మంత్రులు కావూరి, పళ్లంరాజు, చిరంజీవి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి లు వెల్ లోకి వచ్చి నిరసన తెలిపారు. కిశోర్ చంద్రదేవ్,కృపారాణి తమ స్థానాల్లో నిల్చుని నిరసన తెలిపారు. వీరికి ప్రతిగా తెలంగాణా ఎంపీలు కుడా నినాదాలు చేసారు. ఖర్గే ప్రసంగిస్తున్న సమయం లో సీమాంధ్ర ఎంపీలు విభజన బిల్లు ప్రతుల్ని చింపి విసిరేశారు. దీంతో ఆయన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించారు. గందరగోళం మధ్య స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

జగన్ కు డిగ్గీరాజా దీవెన....

      దిగ్విజయ్ సింగ్ కనిపిస్తే చెంప పగలగొట్టండి అని ఓ బహిరంగసభలో కార్యకర్త లకు పిలుపు నిచ్చిన జగన్ కు... సాక్షాత్తూ ఆ డిగ్గీ రాజా ఎదురొస్తే ఎంచేశారు.? చెంప పగలగొట్టలేదు సరికదా కోపంగా కూడా చూడలేదు. కనీసం మాట్లాడకుండానైనా వెళ్ళలేదు. పార్లమెంట్ హాల్ లో ఎదురు పడిన దిగ్విజయ్ సింగ్తో యువనేత తనదైన శైలిలో నవ్వుతూ..చాలా ప్రేమగా మాట్లాడారు... ఆయన్ను చూడగానే అమాంతం వినయంతో వంగిపోయారు. రెండు మాటలు మాట్లాడాక "గాడ్ బ్లెస్ యు జగన్" అంటూ అని ఆయన వెళ్ళిపోయారు. మాట తప్పను, మడమ తిప్పను అంటూ తరచూ యువనేత చేసే జపాన్ని.. ఇక్కడ చేసిన పనిని చూసి అక్కడే ఉన్న జర్నలిస్టులు విస్తుపోయారు.

సోనియాగాంధీ కి సీమాంధ్ర మంత్రుల షాక్

  ఇంతకాలం కాంగ్రెస్ అధిష్టానం గీసిన గీత దాటకుండా మసులుకొన్న సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఈరోజు లోక్ సభలో తమ అధినేత్రి సోనియాగాంధీ వారిస్తున్నా వినకుండా స్పీకర్ పోడియం చుట్టుముట్టి సభను సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించి అధిష్టానానికి పెద్ద షాక్ ఇచ్చారు. కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి, పల్లం రాజు, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తమ సహచర సీమాంధ్ర యంపీలతో కలిసి స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ సభను స్థంభింపజేశారు. మరో ఇద్దరు మంత్రులు కిల్లి క్రుపారాణీ, కిషోర్ చంద్ర దేవ్ తమ తమ స్థానాల వద్దనే నిలబడి నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. రైల్వేమంత్రి మల్లిఖార్జున్ ఖార్గే మధ్యంతర రైల్వే బడ్జెట్ సభలో ప్రవేశపెడుతుంటే, రైల్వేసహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, స్పీకర్ పోడియం వద్ద మిగిలిన మంత్రులు, యంపీలతో కలిసి ఆందోళన చేయడం విశేషం.   సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు మంత్రులు నినాదాలు చేస్తుంటే, వారికి పోటీగా తెలంగాణా కాంగ్రెస్ యంపీలు కూడా జైతెలంగాణా నినాదాలు చేయడంతో సభ స్తంభించిపోయింది. తెదేపా యంపీ శివ ప్రసాద్ మరియు తెరాస యంపీ మందా జగన్నాధం మధ్య తోపులాట జరగడంతో సభలో యుద్దవాతావరణం ఏర్పడింది.   రేపు లోక్ సభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది గనుక, బహుశః సీమాంధ్ర యంపీ, కేంద్ర మంత్రులందరినీ సభ నుండి సస్పెండ్ చేయమని స్పీకర్ ను కోరవచ్చును. కానీ, బీజేపీతో సహా విపక్షాలన్నీ కూడా సభ నుండి సభ్యులను సస్పెండ్ చేయడానికి ముందే అభ్యంతరం వ్యక్తం చేసాయి గనుక ఈ ఆందోళన రేపు మరింత తీవ్రంగా కొనసాగవచ్చును. ఈరోజు ప్రధాని డా. మన్మోహన్ సింగ్ తెలంగాణా బిల్లుకి బీజేపీ మద్దతు కోరేందుకు బీజేపీ అగ్రనేతలను మధ్యాహ్నం విందు భోజనానికి ఆహ్వానించారు. కానీ, స్వంత పార్టీ సభ్యులే ఇంతగా అభ్యంతరం చేపుతున్నపుడు ఇక బీజేపీ మద్దతుని కోరడం కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. బహుశః బీజేపీ నేతలు అదే మాట ఆయనకి చెప్పవచ్చును.

గంధరగోళ పరిస్థితుల మధ్యే రైల్వే బడ్జెట్

      లోక్ సభలో గంధరగోళ పరిస్థితుల మధ్యే రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే మధ్యంతర రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సీమాంధ్ర ఎంపీల నిరసనల మధ్య తొలిసారిగా ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మల్లికార్జున ఖర్గే బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా... కేంద్ర మంత్రులు కావూరి, పురంధేశ్వరి, పల్లంరాజు, చిరంజీవి వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలుపగా, కిల్లీకృపారాణి, కిషోర్‌చంద్రదేవ్ తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలియజేశారు.   మధ్యంతర రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు: #. ఖద్రా-వైష్ణోదేవి మధ్య ప్రారంభానికి సిద్ధమైన రైలు మార్గం #. తూర్పు - పశ్చిమ రైల్వేలో రెండు ప్రత్యేక సరుకు రవాణా మార్గాలు #. 2702 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు #. మరో 4 వేల 500 కిలోమీటర్ల రైల్వే లైను విద్యుతీకరణ #. కాజీపేట, విజయవాడ మీదుగా సికింద్రాబాద్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ #. కాచీగూడ - తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ #. గుంటూరు - కాచీగూడ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ #. హైదరాబాద్- గుల్బర్గాల మధ్య ఇంటర్ సింటి ఎక్స్‌ప్రెస్ #. మరో 4 వేల 500 కిలోమీటర్ల రైల్వే లైను విద్యుతీకరణ

సీమాంధ్ర నేతలు టెర్రరిస్టులు....

      సీమాంధ్ర నాయకులపై తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీమాంధ్ర నాయకులు పార్లమెంటును తగలబెడతమని టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుక్షణం అడ్డుపడాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆటంకాలు సృష్టించాలని చూస్తున్న సీమాంధ్ర నాయకులపై దేశద్రోహుల కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిజిపి.ప్రసాదరావు సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నాయకులపై కేసులు నమోదు చేసిన ప్రసాదరావు...సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యే లింగారెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు సుమోటో కేసు పెట్టడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతి తెలంగాణ ప్రజలు పక్షాన నిలిచారని అన్నారు. తెలంగాణకు అడ్డుపడితే తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో ఊహించుకోవాలని అన్నారు.