జగన్ 'పిచ్చి వాగుడు'

      పదహారు నెలలు అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థితి బాగోలేదు. అందుకే మతి భ్రమించిన వాడిలా పిచ్చి వాగుడు వాగుతున్నాడు. సోనియాగాంధీ మోచేతి నీళ్లు తాగి రోజు ఆమె ఇటలీ నుండి వచ్చిన సంగతి తెలియదా ? అసలు వాళ్ల నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది సోనియాగాంధీ కాదా అని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హైదరాబాద్ సమైక్య శంఖారావం సభలో జగన్ ప్రసంగం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. జగన్ కు ఓట్లు సీట్లే ముఖ్యమని, తెలంగాణ వాళ్లు చీత్కరిస్తున్నా సిగ్గులేకుండా జగన్ కలిసి ఉందామని అంటున్నాడని పొన్నం విమర్శించారు. హైదరాబాద్ లో అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు హైదరాబాద్ లో మీటింగ్ లు పెట్టి జగన్ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాడని, జాతీయ గీతాన్ని అవమానించిన జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమిరెడ్డికి కిరణ్ షాక్

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. తెలంగాణ విభజన నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంతో సంబంధం లేకుండా చిత్తూరు జిల్లాకు తాగునీటి అవసరాల కొరకు ఏకంగా రూ.6 వేల కోట్లు కేటాయించుకున్నాడు. ఆర్థికశాఖ కూడా దీనికి ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుండి చిత్తూరు జిల్లాకు తాగునీటి తరలించే పథకం ఇది. ఇది పూర్తయితే వందలాది గ్రామాలతో పాటు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంలకు కూడా నీటి సమస్య ఉండదు.     అయితే కండలేరు జలాశయం నుండి కేటాయింపులు లేకున్నా ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు నీటిని తరలిస్తున్నారని, ఇక్కడ రైతులను ఎండబెట్టి ఎలా తరలిస్తారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని నిలదీస్తున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే అనుకోకుండా ఓ ప్రైవేటు కార్యక్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురయ్యారు. కనిపించిందే తడవు ముఖ్యమంత్రి సోమిరెడ్డితో చిత్తూరు జిల్లాకు నీరు తరలించొద్దని అంటున్నావు..అదే మాట మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో చెప్పించు..అప్పుడు ఆ పనులు నిలిపేస్తా అని చెప్పడంతో అవాక్కవడం సోమిరెడ్డి వంతయింది.

పులిని చూసి వాతలు పెట్టుకోనేల

  ఏపీ ఎన్జీవోల సభకు దీటుగా సమైఖ్య శంఖారావం సభను నిర్వహించి, సీమాంద్రాలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల కంటే సమైక్య రేసులో తామే ముందున్నామని చాటుకోవాలనే యావే తప్ప, సమైక్యాంధ్ర పట్ల ఏమాత్రం చిత్తశుద్దిలేని వైకాపా చాలా సాంప్రదాయబద్ధంగా ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని సభను ఆరంభించింది. అయితే మధ్యలో వందేమాతరం గీతం కూడా అందుకొంటామని, తెలుగుజాతిని విడగొడుతున్నవారిని బంగాళాఖాతంలోకి విసిరేస్తామని భీకర ప్రతిజ్ఞలు కూడా చేసారు.   ఇంతకీ మధ్యలో వందేమాతరం గీతం అందుకొంటామని హెచ్చరించవలసిన అవసరంమేమిటో వారికే తెలియాలి. బహుశః వందేమాతరం పాడటానికి తమకు అభ్యంతరం లేదని చెప్పి బీజేపీ వాళ్ళని మంచి ప్రయత్నం ఉందేమో మరి. ఎందుకంటే దేశంలో కొందరు నేతలు వందేమాతరం పాడేందుకు బాహాటంగానే నిరాకరిస్తున్నందున వారిపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది.   కానీ వైకాపా మహోదయులు వందేమాతరం గేయాన్నిసభలో ఆలపించకుండా దాని పరువు నిలిపారు. ఎందుకంటే సభ ముగింపులో వాళ్ళు జనగణమణ జాతీయ గీతాన్ని ఎంత కూనీ చేసారో చూస్తే ఎవరికయినా హృదయం కలుక్కుమానక మానదు. అసలు జాతీయ గీతాన్నిపాడకపోయినా ఎవరూ అడిగేవారు ఉండరు. కానీ, పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు ఏపీ ఎన్జీవోలు తమ ‘సేవ్ ఆంద్రప్రదేశ్’ సభని జనగణమణ జాతీయ గీతాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో ఆలపించి ముగించి అందరి మన్ననలు పొందడంతో, పోరాడితే పోయేదేముంది విభజన చిచ్చుతప్ప అని జనాలను ఊదరగొట్టినట్లుగానే పాడితే పోయేదేముంది పరువు తప్పఅని తప్పుల తడకలతో జనగణమణ జాతీయ గీతాన్నిపాడి ‘మమ’ అనిపించేసారు.   చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా అని పెద్దలు ఊరకనే అనలేదు. అది అక్షరాల వైకాపాకి వర్తిస్తుంది. జాతీయ గీతాన్నితప్పుగా, ఆశ్రద్దగా పాడినందుకు తెలంగాణా న్యాయవాదుల జేఏసీ పోలీసులకి పిర్యాదు చేసింది. అయితే కొమ్ములు తిరిగిన సీబీఐ వాళ్ళే జగన్ కాలిగోరు కూడా తాకలేకపోయింది పోలీసులు మాత్రం ఏమి చేయగలరు పాపం!

కృతజ్ఞతలు వాయిదా!

  సోనియాగాంధీ తెలంగాణా ప్రకటించడంతో ఆమెకు తామెంతో రుణపడిపోయామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అర్జెంటుగా ఆమెకి కృతజ్ఞతలు చెప్పేయడానికి తహతహలాడిపోతున్నారు. దీనికోసం ఆదివారం నాడు కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో కృతజ్ఞతల సభ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొని, అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేసి, స్తోత్రాలు చెల్లించి అధిష్ఠానం దృష్టిలో పడాలని అనుకున్నారు.   అయితే కృతజ్ఞతల సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటి నుంచి సొంత పార్టీ నుంచి మాత్రమే కాకుండా బయటి పార్టీల నుంచి కూడా విమర్శలు తలెత్తాయి. తెలంగాణ ఏర్పాటుతో అసలే కడుపు మండిపోతున్న సీమాంధ్ర ప్రజల ఆగ్రహాగ్నికి ఇలాంటి సభలు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది కాబట్టి ఈ సభను నిర్వహించకపోవడమే ఉత్తమమన్న అభిప్రాయం కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్యక్తం చేశారు.   అయినా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటైతే తెలంగాణ సీఎం అయిపోవాలని కలలు కంటున్న తెలంగాణ మంత్రులు సోనియమ్మకి కృతజ్ఞతలు చెప్పితీరుతాం అంటూ సభ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా ఈ సభ మీద నిప్పులు చెరిగింది. ఏం సాధించాలరని కృతజ్ఞతలు చెబుతారని నిలదీసింది. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ప్రకటించినా ముఖ్యమంత్రి స్థానంలో వున్న కిరణ్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రిని కట్టడి చేయడం చేతగాని మంత్రులు ఇలాంటి సభలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని టీఆర్‌ఎస్ విమర్శించింది. దాంతో నాలుక్కరుచుకున్న తెలంగాణ మంత్రులు కృతజ్ఞతల సభను వాయిదా వేసుకోవాలని అనుకున్నా ఏర్పాట్లన్నీ జరిగిపోవడంతో గత్యంతరం లేక ముందుకే వెళ్దామని అనుకున్నారు. కానీ లోలోపల అనవసరంగా సభ పెడుతున్నామేమోనని మథనపడుతూనే వున్నారు.   తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మథనను గుర్తించాడేమోగానీ, వరుణదేవుడు కరీంనగర్‌లో భారీ వర్షాలు కురిపించి అంబేద్కర్ స్టేడియంలో కాసిన్ని నీళ్ళ నిలిచేలా చేశాడు. దాంతో తె.కాం. నాయకుల బుర్రల్లో ఫ్లాష్ వెలిగింది. వెంటనే స్టేడియంలో నిలిచిన నీళ్ళ సాకుని చూపించి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతల సభని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సభ ఎప్పుడు జరిపేదీ తర్వాత తెలియజేస్తామని చెప్పారు.

నీతి నిజాయితీలకు కేరాఫ్ ఎడ్రస్

  తన వెనుక పది చార్జ్ షీట్స్ పోగేసుకొని, ప్రతీ చార్జ్ షీట్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దేశంలో తనంత నిజాయితీ పరుడు, తన పార్టీ అంత నీతిగల పార్టీ మరొకటి లేదనడం నిజంగా గొప్ప విషయమే. తను ఇప్పుడు దూషిస్తున్నఇతర పార్టీలలో నేతలు వైకాపాలోకి రాగానే ఒక్కసారిగా మంచి వారెలా అయిపోతారనే ధర్మ సందేహం ఉంది. ఉదాహరణకు దాడి వీర భద్రరావు, మైసూరా రెడ్డి వంటి వారు ఒకప్పుడు ఆయనని అయన పార్టీని దొంగల మూటా అని అభివర్ణించినవారే. మరి అటువంటి వారు మళ్ళీ అదే దొంగల ముటాలో చేరి ఇప్పుడు తమ పాత పార్టీలను దూషించడం చూస్తే ఎవరెటువంటి వారో అర్ధం అవుతూనే ఉంది. మరి అటువంటి వారిని పోగేసుకొని తమ పార్టీ అంత గొప్ప నీతి నిజాయితీ గల పార్టీ మరొకటి లేదని, మిగిలిన పార్టీలు నమ్మదగినవి కావని జగన్ కాండక్ట్ సర్టిఫికెట్స్ జారీ చేయడం విడ్డూరం. అలాగని రేపు అదే పార్టీల నుండి వచ్చేనేతలను జేర్చుకోకుండా ఉంటారా? అంటే అదీ తప్పదు.   నిన్న గాక మొన్న రాజకీయాలలోకి వచ్చిన ఆయన, తన బ్యాక్ గ్రౌండ్ సంగతి మరిచి ఎదుట పార్టీలను నేతలను నిందించడం విశేషం. ఇక సోనియాగాంధీ తన కొడుకుని ప్రధాని చేయాలనే తాపత్రయంతోనే రాష్ట్ర విభజన చేస్తోందని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి, మరి తను రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతోనే ఈ సమైక్యరాగం ఆలపిస్తున్నసంగతి మరిచిపోయినట్లున్నారు. సోనియాగాంధీ తన కొడుకుని ప్రధానిని చేయాలనుకొంటే, విజయమ్మ తన కొడుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయలనుకొంటున్న విషయం నిజం కాదా?   ఇక కాంగ్రెస్ అధిష్టానానికి వైకాపాకి మధ్య రహస్య అవగాహన ఉందన్న ఆరోపణలను ఎదుర్కోవడానికే సోనియాను విమర్శించారనుకొన్నా, రాష్ట్ర విభజనకి ముఖ్యకారకుడయిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రసక్తి ఎక్కడా తేకుండా జాగ్రత్తపడుతూ, చంద్రబాబుపైనే విమర్శలు ఎందుకు గుప్పిస్తున్నట్లు? అంటే కేసీఆర్ చేసిన ఉద్యమాల వలన గాక కేవలం చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లనే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన ఉద్దేశ్యమా? అలాగయితే వైకాపా ఇచ్చిన లేఖ సంగతేమిటి?   కేసీఆర్కి తెలంగాణా, జగన్కి ఆంధ్రా పంపకాలు అయినందున, సీమాంద్రాలో తనకి పోటీగా ఉన్న చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసారు తప్ప జగన్ ఎక్కడా తన ప్రసంగంలో కేసీఆర్ జోలికి పోలేదు. ఇదే కాంగ్రెస్-వైకాపా-తెరాసల మధ్య ఉన్నబంధం గురించి వివరిస్తోంది.మరి వెనక ఇంత కధ పెట్టుకొని నీతి నిజాయితీలకు తను, తన పార్టీయే కేరాఫ్ అడ్రెస్స్ అంటే ఎలా? 

ఆరు నెలలు గరిడి సాము నేర్చుకొని

  ఆరు నెలలు గరిడి సాము నేర్చుకొని మూల ముక్కుతున్న ముసలమ్మని ఒకే ఒక్క పెట్టుతో పడగొట్టేసాన్ననాడుట వెనకటికెవడో! అలాగే ఉంది వైకాపా నిర్వహించిన సమైక్యశంఖారావం సభ. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్వహించిన అంత భారీ సభలో ఇంతవరకు రోజూ చెపుతున్న విషయాలే తప్ప కొత్తగా చెప్పిన ముక్క ఒక్కటి లేదు. పైగా అందరూ చెప్పిందే చెప్పడం వలన కంఠ శోష, ఆయాసం తప్పపార్టీకి కానీ సమైక్య ఉద్యమానికి గానీ కొత్తగా ఒరిగిందేమీ లేదు.   అసలు అటువంటి సభ నిర్వహిస్తున్నపుడు దాని ద్వారా ఒక బలమయిన సందేశం, ఒక బలమయిన నిర్ణయం లేదా కనీసం పార్టీ శ్రేణులకు సరయిన దిశా నిర్దేశ్యం అయినా చేసి ఉంటే సభ ప్రయోజనం దక్కేది. కానీ సభలో ప్రసంగించిన వక్తలు ఒకరో ఇద్దరో తప్ప మిగిలినవారు ఏదో అందరూ, రోజూ జనాలందరూ మాట్లాడుకొనే ఆ నాలుగు ముక్కలే మళ్ళీ మళ్ళీ వల్లె వేస్తూ ఒక మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొన్నారు. ఇది సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న సభ అని చెప్పుకొంటూనే వక్తలు ‘జగన్మోహన్ రెడ్డి భావి ముఖ్యమంత్రి,’ ‘రాష్ట్రాన్ని కాపాడాలంటే జగనే ముఖ్యమంత్రి అవ్వాలి’ అంటూ అప్రస్తుత ప్రసంగం చేస్తూ సమైక్యంగా జగన్ భజనలో తరించిపోయారు.   ఇక జగన్ ప్రసంగం కూడా చాలా నాటకీయంగా, కృతకంగా సాగింది. ఏదయినా ఒక ముఖ్య విషయాన్ని చెప్పదలచుకొంటే దానిని జనాల మనసులకు హత్తుకొనేలా చెప్పదానికి కొంత నాటకీయత జోడించవచ్చు. గతంలో స్వర్గీయ యన్టీఆర్ కూడా చాలా నాటకీయంగా ప్రసంగించేవారు. కానీ బాషాపై ఆయనకున్న పట్టు, ఆయన మాటలలో విరుపులు అవీ చూసి జనాలు మంత్రం ముగ్దులయ్యేవారు. అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ తన ప్రసంగాలతో ప్రజలని ఏవిధంగా ఉర్రూతలూగిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.   జగన్ ఆ స్థాయిలో ప్రసంగించలేకపోవచ్చును. కానీ సభలో ఏవిధంగా ప్రసంగం సాగాలనే విషయమయినా జగన్ ఆయనను చూసి నేర్చుకొని ఉంటే సభలు రక్తి కట్టే అవకాశం ఉంటుంది.గానీ జగన్ అసలు విషయన్ని వదిలేసి ‘ప్రశ్నిస్తున్నాను’, ‘అడగదలుచుకొన్నాను’, ‘చ్చాలా’ బాధ కలుగుతోంది’ వంటివి ఆయన ప్రసంగంలో మరీ ఎక్కువయిపోవడంతో అవి అసలు విషయాన్నీ పూర్తిగా మింగేసాయి. ఆయన ప్రస్తావించిన నీటి సమస్యలు, విద్యాఉద్యోగ సమస్యల వంటి వాటిని ఆయన క్రుతకమయిన బాష, నాటకీయత మింగేసింది. దానికి పార్టీ పోగేసుకువచ్చిన జనాలు చప్పట్లు ఈలలు అని స్వంత డబ్బాకొట్టుకోవడం మరో ఎక్స్ ట్రా.   ఇక ఊళ్ళో ఉన్నఅక్కలు, చెల్లెళ్ళూ,అవ్వలు అంటూ సాగదీస్తూ చేంతాడంత తెలుగు చుట్టరికాల గురించి చెప్పి వారికి పేరుపేరునా దండాలు చెప్పుకొంటూ జనాల చేత చప్పట్లు కొట్టించుకొనే ఆనవాయితీ కూడా ఇక్కడ ఆయన తూచా తప్పకుండా చక్కగా పాటించారు. బలమయిన మీడియాను చేతిలో ఉంచుకొన్న ఆయన కనీసం వారి సలహాలు తీసుకొని ఉంటే ఆయన ప్రసంగం మరీ ఇంత పేలవంగా ఉండేది కాదని చెప్పవచ్చును.

‘యువరాజు’ అంటే ఒప్పుకోరట!

      కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, సోనియాగాంధీ తనయుడు రాహుల్‌గాంధీని ఇంతకాలం అందరూ ‘యువరాజు.. యువరాజు’ అని పిలిస్తే మురిసిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీని ‘యువరాజు’ అంటే ఒప్పుకోబోమని వార్నింగ్ ఇచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈమధ్య తాను మాట్లాడే ప్రతి సభలోనూ రాహుల్‌గాంధీని ‘యువరాజు’ అని సంబోధిస్తున్నారు. ఆయన అలా అంటూ వుండటం కాంగ్రెస్ పార్టీకి చిరాకు తెప్పించినట్టుంది. దాంతో రాహుల్‌గాంధీని దేశంలో జనం అంతా ఎలా పిలుస్తున్నారో నరేంద్రమోడీ కూడా అలాగే పిలవాలి. ‘యువరాజు’ అని అమర్యాదకరంగా పిలిస్తే సహించం అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. నరేంద్రమోడీ మరోసారి రాహుల్‌ని ‘యువరాజు’ అని పిలిస్తే మర్యాదగా వుండదని వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే మన తెలుగు సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’లో జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవడు పడితే వాడు బుడ్డోడు.. బుడ్డోడు అంటే గుడ్డలిప్పి కొడతా’ అని చెప్పడం గుర్తొస్తోంది కదూ!

అన్నీ అడగదల్చుకోవడమేనా?

      సమైక్య శంఖారావ సభలో జగన్ మాట్లాడిన తీరు భలే వెరైటీగా వుంది. ఈ సభలో జగన్ అనేక విషయాలు మాట్లాడాడు. మీటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి జగన్ ఒక్కోవిషయాన్ని ప్రస్తావిస్తూ, ‘‘అడగదల్చకున్నా’’ అనే మాటని కనీసం వందసార్లయినా అన్నాడు. సోనియా గాంధీని ‘‘అడగదల్చుకున్నా’’, చంద్రబాబుని ‘‘అడగదల్చుకున్నా’’, విభజనవాదులను ‘‘అడగదల్చుకున్నా’’, కేంద్ర ప్రభుత్వాన్ని ‘‘అడగదల్చుకున్నా’’ అని బోర్ కొట్టించాడు. ఇంతకీ జగన్ ప్రస్తావించిన పాయింట్లు అడిగదల్చుకున్నట్టా? అడిగినట్టా? టోటల్‌గా జగన్ పద్ధతి ‘అడగదల్చుకోవడమే’ తప్ప అడగటం కాదన్నమాట! ఏం జగన్ గారూ.. అన్నీ అడగదల్చుకోవడమేనా? అడగడం లేదా అని రేపు జనం అడిగితే జగన్ ఏం సమాధానం చెబుతాడో?!

శంఖారావంలోనూ విలీనం మాటే!

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోదామా అని తహతహ ఎక్కువైనట్టుంది. అందుకే అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీతో తమకున్న అనుబంధం గురించి, కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడం గురించి, కాంగ్రెస్ పార్టీలో కలసిపోవడం గురించి ప్రస్తావిస్తూ వుంటారు. మొన్నటి వరకూ జగన్‌తో చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన సబ్బం హరి ఆమధ్య జగన్‌కీ, కాంగ్రెస్‌ పార్టీకి వున్న అనుబంధం గురించి నోరుజారి చెప్పేశారు. అలా నోరు జారడం వల్ల ఆయన జగన్‌కి దూరమైపోయారు. మొన్నీమధ్యే వైకాపా నాయకుడు దాడి వీరభద్రరావు మాట్లాడుతూ, కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తామని చెప్పినా సోనియా గాంధీ వినకుండా జగన్‌ని జైల్లో పెట్టించిందని చెప్పి, ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు. ఆ తర్వాత మీడియా తన మాటలని వక్రీకరించిందని వివరణ ఇచ్చారు. తాజాగా వైకాపా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాటల్లో కాంగ్రెస్ పార్టీ మీద వైకాపా పార్టీకి వున్న అభిమానం నిందాస్తుతి రూపంలో బయటపడింది. సమైక్య శంఖారావ సభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, దిగ్విజయ్‌సింగ్ చెబుతున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వైఎస్సార్ ఎప్పుడూ కోరుకోలేదని, దీన్ని దిగ్విజయ్ నిరూపిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తామని సవాల్ విసిరారు. దిగ్విజయ్‌కి సవాల్ విసరదలచుకుంటే మరేదైనా సవాల్ విసరవచ్చు కదా.. కాంగ్రెస్‌లో వైకాపా విలీనం సవాలే ఎందుకు విసిరారన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. వైకాపా మనసులో వున్న ఉద్దేశాలే ఆ పార్టీ నాయకుల మాటల్లో బయట పడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

జగన్ పై జెసి సంచలనం

      కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిక్సింగ్ చేసుకున్నారు. దీనికి 144 కారణాలున్నాయి. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. జగన్ కు బెయిలు దక్కడమే ఇందుకు సాక్ష్యం. జగన్ కు బెయిలు రావడంలో ఎలాంటి తప్పు లేదని, అయితే ఆయనకు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడమే తప్పు అని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కేసు విచారణలో ఏం తేలిందని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రశ్నించారు.   కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అండదండల మూలంగానే హైదరాబాద్ లో జగన్ సభ విజయవంతం అవుతుందని, ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు ఆపి జగన్ సభ కొరకు 14 రైళ్లను మళ్లించారని జేసీ ఆరోపించారు. ఢిల్లీలో అధికారం కోసం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పార్టీని నాశనం చేసిందని, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయినట్లేనని ఆయన అన్నారు. విభజనకు వ్యతిరేకంగా ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు రాసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు ధైర్యాన్ని నిరూపించుకున్నారని జేసీ ప్రశంసించారు.

సోనియా ఆశీస్సులతోనే సభ?!

      సోనియాగాంధీ ఆశీస్సులతోనే జగన్ హైదరాబాద్‌లో సమైక్య శంఖారావ సభ నిర్వహించాడని అటు తెలుగుదేశం నాయకులతోపాటు ఇటు కాంగ్రెస్ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డి వేరువేరుగా విమర్శించారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకని అధికారం కోసం పాకులాడిన జగన్.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు వర్షాల ధాటికి జన, ప్రాణ, పంట, ఆస్తి నష్టంతో బాధపడుతుంటే జన సమీకరణలో మునిగాడని తెలుగుదేశం నాయకులు ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. సోనియా గాంధీ దర్శకత్వంలోనే జగన్ సభ జరుగుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కుమ్మక్కు కావడం వల్లే జగన్ సభ సజావుగా జరుగుతోందని ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. తెలుగుదేశం నాయకుల విమర్శలు ఇలా వుంటే, జగన్ సభని, కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకుడు జె.సి.దివాకరరెడ్డి కడిగిపారేశారు. కాంగ్రెస్ పార్టీ జగన్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని, అందుకే సీబీఐ జగన్‌కి క్లీన్‌చిట్ ఇచ్చిందని చెప్పారు.

వైకాపా రైల్ రోకో!

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించింది. పాపం వైకాపావాళ్ళు హైదరాబాద్‌లో సమైక్య శంఖారావ సభ చేసుకునే హడావిడిలో వుంటే రైల్ రోకో కార్యక్రమం ఎప్పుడు నిర్వహించారా అనే డౌటొస్తోంది కదూ? వైకాపా ప్రత్యక్షంగా కాదు.. పరోక్షంగా రైల్ రోకో కార్యక్రమం నిర్వహించింది. అదెలాగంటే, సమైక్య శంఖారావ సభలో పాల్గొనే కార్యకర్తల కోసం వైకాపా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 18 ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేసింది. ఈ పద్దెనిమిది రైళ్ళు హైదరాబాద్‌కి శనివారం ఉదయానికల్లా చేరాలి కదా. అందుకోసం రైల్వేశాఖ హైదరాబాద్ రూట్లో నడిచే మిగతా రైళ్ళకి రెడ్ సిగ్నల్ వేసి వైకాపా బుక్ చేసుకున్న స్పెషల్ రైళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. రైల్వేశాఖ ఔదార్యం పుణ్యమా అని వైకాపా రైళ్ళు అనుకున్న టైమ్‌కి హైదరాబాద్‌కి చేరుకున్నాయి. మిగతా రైళ్ళు మాత్రం లేటుమీద లేటైపోయ్యాయట.

ఆయన వెళ్ళింది అక్కడికేనా?

      రాష్ట్ర విభజన అంశం మీద ఢిల్లీకి వెళ్ళిన గవర్నర్ నరసింహన్ ప్రభుత్వంలో వున్న ముఖ్య నాయకులని, అధికారులని కలిశారు. రాష్ట్రానికి సబంధించిన పూర్తి సమాచారాన్ని అందించారు. అధికార ప్రముఖులతోపాటు దిగ్విజయ్‌సింగ్ లాంటి అనధికార ప్రముఖుడిని కూడా ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిసి తన స్నేహశీలతను చాటుకున్నారు. అయితే గవర్నర్ గారు యువరాజు రాహుల్ గాంధీని కూడా కలసి వచ్చారని తెలుస్తోంది. ఈ విషయం తాజాగా బయటకి పొక్కింది.   యువరాజుని కలసిన గవర్నర్ ఆయనకి రాష్ట్ర విభజన వల్ల జరిగే లాభ నష్టాలను కూలంకషంగా వివరించినట్టు తెలుస్తోంది. అయితే అధికార కార్యక్రమాలతో, అధికార గణం మధ్యలో వున్న గవర్నర్ రాహుల్ బాబుని ఎప్పుడు, ఎక్కడ కలిశారా అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి. అయితే, గురువారం రాత్రి పదకొండు గంటలు దాటాక గవర్నర్ తనతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా వెంట తీసుకు వెళ్ళకుండా ఒక్కరే కారులో బయటకి వెళ్ళారన్న వార్తలు వచ్చాయి.  ఆ వెళ్ళింది రాహుల్‌గాంధీ దగ్గరకే అయి వుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయినా గవర్నర్ గారు రాహుల్ గాంధీ గారిని కలవాలంటే అంత సీక్రెట్‌గా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ప్రొటోకాల్‌ని పక్కన పెట్టి దిగ్విజయ్‌సింగ్‌ని ఇంటికి వెళ్ళి మరీ కలిస్తే ఎవరైనా ఏమైనా అన్నారా?  ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా ఏలినవారు పట్టించుకున్నారా? ఈ తరహాలోనే రాహుల్ గాంధీని కూడా పబ్లిగ్గా కలిస్తే నష్టమేంటి?

వైకాపా అల్ప సంతోషం!

      గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే వున్నాయి. ఈ వర్షాలు సమైక్య శంఖారావం సభని నిర్వహించాలని అనుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో కూడా కురుస్తూనే వున్నాయి. సభ జరిగే సమయంలో ఓభారీ వర్షం తగులుకుంటే సభకు వచ్చినవాళ్ళంతా కకావికలైపోయి సభ అభాసు పాలయ్యే ప్రమాదం ఉందన్న శంకలు శంఖారావ సభ చుట్టూ అల్లుకున్నాయి. అయితే శనివారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది.     హైదరాబాద్‌లో చిరుజల్లులు తప్ప చెప్పుకోదగ్గ వర్షం కురవలేదు. సూర్యుడు బయటకి వచ్చి జనాన్ని పలకరించాడు కూడా! ప్రకృతిలో వచ్చిన ఈ మార్పు అదేదో తమ గొప్పతనంగా వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి. ఆ దేవుడు తమ పార్టీకి అనుకూలంగా ఉండటం వల్లే నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకుంటూ అల్ప సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు జగన్ సభకి తన మద్దతు తెలిపాడని అనుకుంటున్నారు.  భవిష్యత్తులో రాష్ట్రంలో తమ పార్టీ సాధించబోయే విజయాలకు ఇది ఒక సూచన అని పార్టీ నాయకులు కొత్త కొత్త అర్థాలు వెతుకుతున్నారు.

రాహుల్ అపరిపక్వ రాజకీయాలు

   - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     నేటి దేశ పార్లమెంటరీ వ్యవస్థలో శాసనవేదికలలో సభ్యులైన ప్రజాప్రతినిధుల రాజకీయ ప్రమాణాలు దిగజారిపోయాయి. ఈ పరిణామం పార్లమెంటరీ వ్యవస్థకే తీవ్రమైన అగ్నిపరీక్ష'' - గురుదాస్ గుప్తా (ప్రసిద్ధ పార్లమెంటేరియన్)   దేశ సంపదగా దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రకటించిన రేడియోతరంగాలపై గుత్తాధిపత్యం చెలాయించడానికి దేశ, విదేశీ టెలికాం సంస్థలు పోటాపోటీలు పడుతూ భారతదేశ ఆర్ధికవ్యవస్థకు నష్టదాయకంగా పరిణమించి, స్వలాభాపేక్షతో లక్షల కోట్ల రూపాయలను స్వాహా చేయడానికి సంబంధించిన భారీ కుంభకోణాన్ని "కాగ్''తో పాటు దేశం దృష్టికి తెచ్చినవాడు గురుదాస్ గుప్తా. ఇందులో ఇరుక్కున్న వాళ్ళు కేవలం బడాబడా కంపెనీలు మాత్రమేకాదు, ప్రధానమంత్రీ, ప్రధానమంత్రి కార్యాలయమూ, కేంద్రప్రభుత్వపు పెంపుడు కంపెనీగా బహిర్గతమైపోయిన అంబానీల "రిలయన్స్'' కూడా ఉన్నాయి; వీరికి తోడూ 2-జి స్కామ్ లో తీవ్ర అభియోగాలను ఎదుర్కొంటున్న మంత్రి చిదంబరం, మాజీమంత్రి రాజా (డి.ఎం.కె), ఒక సిబీఐ ఉన్నతాధికారి కూడా ఉన్నారు! అయితే ఈ కుంభకోణంలో అభియోగాల్ని విచారించే పేరిట నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా అభియోగాల్ని ధృవీకరించగా, అదీ చాలదన్నట్టు "మంత్రుల పరిశీలనా సంఘాన్ని (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినప్పుడు ఆ కమిటీ ముందుకు. అంతకుముందు పార్లమెంటరీ సంయుక్త సంఘం ముందుకువచ్చి ఈ కుంభకోణంలో అసలు దోషులెవరో తాను చేబుతాననీ, తనను పిలవాలనీ మాజీమంత్రి రాజా పదేపదే కోరారు. అయినా అతన్ని పిలవనేలేదు. అన్నీ "సర్దుకున్న తరువాత''నే ప్రధానమంత్రి కార్యాలయం గానీ, మన్మోహన్ సింగ్ గానీ అవసరమైతే "నేనూ సిబీఐ విచారణకు సిద్ధమే''నని 'దొంగలు పడిన ఆరునెలలకు' ఏవో మొత్తుకున్నట్టుగా ప్రకటనలు చేస్తూ వచ్చారు; చివరికి బొగ్గు కుంభకోణంలో వచ్చిన ఆరోపణల విషయంలో కూడా, రోజులకు రోజులు గడిచిపోయిన తరువాత, విదేశీ పర్యటనల తరువాత అంతా "సద్దుమణిగినట్టు'' కన్పించిన తరువాత విమాన ప్రయాణంలో మన్మోహన్ నేనూ విచారణకు సిద్ధమేనని ప్రకటించారు!   సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల ఫలితంగానే ప్రధానమంత్రి కార్యాలయానికీ "బొగ్గు'' తవ్వకాలలో ఉన్న కంపెనీల తాలూకూ కుంభకోణాలకూ ఉన్న సంబంధాన్ని సిబీఐ డైరెక్టర్ బయట పెట్టవలసి వచ్చింది. వీటన్నింటినీ గురుదాస్ గుప్తా బహిర్గతం చేశారు. అలాగే కాంగ్రెస్ - యు.పి.ఎ. ప్రభుత్వానికీ, "రిలయన్స్'' అంబానీలకూ కె.జి.గ్యాస్ తవ్వకాలు, "డి-6''బ్లాక్ లో ఉత్పత్తిని కృత్రిమంగా నియంత్రిస్తున్న [ఒప్పందాలకు విరుద్ధంగా] అంబానీల ఆగడాలకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని కూడా దేశప్రజల దృష్టికి తెచ్చినవాళ్ళు ప్రధానంగా ఇద్దరే ఇద్దరు - (1) ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి (2) గురుదాస్ గుప్తా!   ఈ పూర్వరంగంలో, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల్లో భాగంగా రేపటి ప్రధానమంత్రి పదవికోసం అర్రులుచాచి తన తల్లీ, కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా గాంధి అండతో, ఎదిగే క్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా కాంగ్రెస్ అధిష్ఠానం "ప్రమోట్'' చేసిన రాహుల్ గాంధీ ఇటీవల తన రాజకీయ అపరిపక్వతను చాటుకొంటున్నాడు! ప్రధానమంత్రి పదవికి 2014 ఎన్నికల అనంతరం రావాలని ఆశపడుతున్న తొందర్లో రాహుల్, ఇటీవల ఆగమేఘాల మీద దొడ్డితోవన కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్రతో వచ్చిన నేరచరితులైన పార్లమెంటు సభ్యులపై 'వేటు'ను తప్పించే ఆర్డినెన్సును బాహాటంగా "బుద్ధిలేని'' చర్యగా ఖండించాడు. అదీ ఎలా? అంతకుముందు సుప్రీంకోర్టు నేరచరితులైన లేజిస్లేటర్లు ప్రజాప్రనిధులుగా తగరనీ, వారంతా ఆరేళ్ళపాటు తిరిగి ఎన్నికలలో పాల్గొనరాదని చారిత్రాత్మకమైన తీర్పు చెప్పిన వెంటనే రాష్ట్రపతి లోపాయికారీగా క్యాబినెట్ చర్యతో విభేదిస్తూ నర్మగర్భంగా హెచ్చరించిన తరువాత ఆ విషయం తెలిసిన రాహుల్ గాంధీ 'మెరుపు'లా ఆ ఖ్యాతిని తాను కొట్టేసే దుడుకుతనంతో ఆర్డినెన్సు కాపీని ప్రదర్శనకోసం పత్రికలవారి ముందే చించేసి ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఘోరంగా అవమానపరిచాడు!   అది చాలాక మన్మోహన్ ఏమనుకుంటారోనని తల్లీ, కొడుకులిద్దరూ విదేశపర్యటనలో ఉన్న మన్మోహన్ ను "దువ్వుతూ'' పుండుమీద కారంచల్లినట్టుగా 'వేరే, ఉద్దేశంతో అన్నవి కావు, పట్టించుకోవద్ద'ని బుజ్జగించడానికి ప్రయత్నించారు. సరిగ్గా ఆ అవమానానికి నిరసనగా మన్మోహన్ ఆత్మగౌరవ పతాకం ఎగరవేసి, రాజీనామా చేయాల్సింది. ఎందుకంటే పదేళ్ళుగా కాంగ్రెస్ లో పనిచేస్తున్న రాహుల్ తాను 50వ 'వడి'లో ప్రవేశించి, రేపటి ప్రధానమంత్రి పదవిని ఆశిస్తు, తల్లి ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న సందర్భంలో - పిల్లవాడి స్థాయికి మించి ఎదగలేకపోయాడని చెప్పి తీరాలి. ప్రకటనల్లో హుందాతనంగాని, వైజ్ఞానిక దృక్పధంగాని లేని వ్యక్తిగా లోకానికి రాహుల్ కనపడుతున్నాడని గుర్తుంచుకోవాలి; ఆ ప్రకటన ద్వారా రాహుల్ కాంగ్రెస్ లో ఎవడికివాడే "సూపర్ మాన్''గా ఫోజులు పెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రకటనలిచ్చు కోవచ్చునన్నలైసెన్సు ప్రకటించినట్టయింది.   మాజీమంత్రి శశిథారూ వెంటనే అంతమాటా అన్నాడు కూడా: "రాహుల్ అలా ప్రకటించిన తరువాత మా సొంత అభిప్రాయాల్ని మేమూ ప్రకటించుకోవచ్చునన్న ధైర్యం మాకొచ్చింద''న్నాడు! బహుశా తమ కుటుంబాల అక్రమాస్తుల రక్షణ కోసమే, లేదా అవినీతి పాలవుతున్న, లేదా గురుదాస్ గుప్తా అన్నట్టు "లెజిస్లేటర్ల రాజకీయ ప్రమాణాలు దిగజారి పోతున్నందు''ననే "సమాచారహక్కు చట్టం'' పరిథిలోకి కాంగ్రెస్ లాంటి (మిత్రపక్షాలు సహా) అవినీతికర రాజకీయ పక్షాలు రాకుండా జాగ్రత్తపడడం కోసమే తన పార్టీ ప్రభుత్వం ఎలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందో రాహుల్ కు తెలియదా? కాగా, ఇప్పుడు తాజాగా రాహుల్, అనేక కుంభకోణాలతో, అవినీతి ఆరోపణలతో తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి 2014లో కూడా అధికారం కట్టపెట్టడానికి పన్నిన చిట్కా - కేవలం రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రయోజనాల రక్షణ కోసం భావోద్రేకాల్ని రెచ్చగొట్టబోవటం. "ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంచితే, భారతీయ జనతాపార్టీ (బిజెపి) మాత్రం ప్రజల్ని విడగొడుతున్నద''ని రాహుల్ ప్రచార ఆరోపణ! కాని 1947 నాటి రాజ్యాంగ నిర్ణయ సభా తీర్మాన స్ఫూర్తికే ఈ రెండుపక్షాలూ (కాంగ్రెస్, బిజెపి) వ్యతిరేకం. కులాతీతమైన లౌకిక వ్యవస్థకు (సెక్యులరిజం) దేశ రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలని, మతసంస్థలకు రాజకీయాలతో ప్రమేయం ఉండరాదని నాటి రాజ్యాంగ నిర్ణయసభ తీర్మానం! ఆ ప్రాతిపదికపైనే స్వతంత్ర భారతదేశంలో ఈ రెండుపార్టీలు ఎన్నికల సంఘం ముందు హామీపడ్డాయి. కాని ఆచరణలో దేశ మైనారిటీల మౌలిక ప్రయోజనాలను ఆచరణలో కాపాడకుండానే ఎన్నికలలో మాత్రం వారి వోట్ల ద్వారా లబ్ది పొందడం మాత్రమే ఈ రెండు పార్టీల లక్ష్యం! అందువల్ల ప్రజల్ని తమతమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం నిరంతరం చీల్చుతూ ఉండటం ఈ రెండింటి వకాలికమైన లక్షణం. "విభజన రాజకీయాలు'' రెండింటి ఉమ్మడి ప్రయోజనాలకు, ఉనికికి అవసరం! ఈ తప్పుడు "విభజన సూత్రం'' దేశ విభజనతో పాటే ప్రాణం పోసుకుంది. విభజించి పాలించమనే ఇండియాలో బ్రిటీష సామ్రాజ్య పాలనతోనే అమలులోకి రాగా, విభజన రాజకీయాలనుంచి తాము ఎన్నికల ప్రయోజనాల కోసం దూరం కాకుడన్నది కాంగ్రెస్, బిజేపీ మౌలికమైన విధాన, వ్యూహాలని మరచిపోరాదు!   ప్రస్తుతం రానున్న ఎన్నికలకు మధ్యంతరంగా ఎన్నికలకు సిద్ధమైన కొన్ని రాష్ట్రాలలో పర్యటిస్తున్న రాహుల్ చేస్తున్న ప్రసంగాలు పిల్ల తరహాగా ఉన్నాయి. కాంగ్రెస్ లోని మహామహా కొమ్ములు తిరిగి ఉన్న వివిధ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులలో నూటికి 90 మందికి పైగా నెహ్రూ - ఇందిర కుటుంబానికి తమ ఆత్మగౌరవాన్ని కూడా మరిచిపోయి సోనియా నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ కు ఆమె కుటుంబానికే విచక్షణా రహితంగా దాసోహమవడం వల్లనే మంచి యువతరం, యువరక్తం కాంగ్రెస్ వైపునకు మరలడంలేదు. మరలనందున నాయకత్వం చేస్తున్న పనేమిటి? సెంటిమెంట్ ను (మనోభావాల్ని) పోగొట్టుకోవటం; ఆ వరసలో రాహుల్ ఉచ్చరించిన సంప్రదాయమంత్రం - "నా నాయనమ్మను, నా తండ్రిని చంపేశారు. ఏదో ఒకరోజున నన్నూ చంపేస్తారు. అయినా నేను బాధపడ్డం లేదు, కంగారు పడ్డమూ లేదు అన్నాడు!''   కాని నాయనమ్మ హత్యగానీ నాన్న రాజీవ్'' హత్యకు గానీ దోహదపడిన పరిణామాలేవీ? ఏ పరిస్థితుల్లో ఆ ఘోరాలు జరిగాయి? చిరకాలంగా కాంగ్రెస్ కు సేవలందించిన బింద్రెన్ వాలా [శిక్కు]ను సాకింది కాంగ్రెస్ పెంచి పోషించింది కాంగ్రెస్. కాని పంజాబ్ ను కృత్రిమంగా విభజించిన తరువాత ఎదురైనా సమస్యల్లో ఒకటి బింద్రెన్ వాలా కాంగ్రెస్ కు దూరమయి పంజాబ్ శిక్కులకు ప్రత్యేక రాష్ట్రంగా 'ఖలిస్తాన్'ను ప్రకటించాలని ఉద్యమం ప్రారంభించాడు. అది హింసాత్మకంగా పరిణమించింది. పంజాబ్ విభజన ఎప్పుడైతే పంజాబ్ శాసనసభ ఆమోదం లేకుండా, శాసనసభను లెక్కజేయకుండా ఏకపక్షంగా రెండుగా పంజాబ్, హర్యానాలుగా చీల్చడానికి కాంగ్రెస్ ఎప్పుడు నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచీ పంజాబీల (శిక్కుల) ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అలాగే బిజెపి - ఎన్.డి.ఎ. ప్రభుత్వం హయాములో కూడా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లను కృత్రిమంగా విభజించి ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలను ఏర్పరిచారు! వాటిని దేశ, విదేశీ బడా గుత్తా పెట్టుబడిదారులకు దోపిడీ కేంద్రంగా బిజెపి, కాంగ్రెస్ లు మార్చాయి!   రాజస్థాన్ ఎన్నికల పర్యటనలో మాట్లాడుతూ రాహుల్ "ప్రజలు సమైక్యంగా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కాని బిజెపియే రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజల్ని విడగొడుతుంద''ని ఆరోపించారు. కాని అవే రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కూడా పనిచేస్తుందన్న వాస్తవాన్ని రాహుల్ మభ్యపెట్టాడు. దేశం ఐక్యంగా ఉండాలని ఒక వైపున కోరుకుంటున్న రాహుల్, విభజించి-పాలించే బ్రిటీష రాజనీతికి తలొగ్గిన కాంగ్రెస్ అదే స్వప్రయోజనాల కోసం, తాను సాధికారికంగానే భాషకు ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు వెన్నుదన్నుగా ఏర్పడిన తొలి కమీషన్ (ఫజల్ ఆలీ) సిఫారసులపైన ఏర్పడిన భాషా ప్రయుక్తంగా ఏర్పడిన తెలుగుజాతి తొలి రాష్ట్రమయిన "ఆంధ్రప్రదేశ్''ను నిట్టనిలువునా చీల్చడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు కంకణం కట్టుకున్నదో వివరించ గలగాలి!   ఇందిరాగాంధి పోలీసు - సైనిక సమూహాలతో "ఆపరేషన్ బ్లూస్టార్'' పేరిట దారుణమైన దాడులకు ఖలిస్తాన్ వాదుల మీద పాల్పడడం ద్వారా శిక్కులు అసహనంతో ఉగ్రవాదులుగా మారి ఎదురు మరొక దుస్సాహమైన దుర్మార్గానికి దిగింది. ఫలితంగా ఆమెను సొంత రక్షకులే హత్యగావించారు! దానికి ప్రతిగా ఢిల్లీలో ఇందిరాగాంధి హత్యతో ప్రత్యక్ష సంబంధం లేని 3000 మంది శిక్కులను హతమార్చడం జరిగింది. వేసిన విచారణ కమీషన్ లు కూడా ఈ ఘటనకు విస్తుపోయి, ఈ ప్రతీకార ఘటనలకు ఎవరు కారకులో, వారిని శిల్శించాలని పేర్లుసహా యిచ్చినా, శిక్కుల గాథ ముగియలేదు. ముగియలేదు కనుకనా, ఢిల్లీలో శిక్కులపై జరిగిన మారణకాండతో సోనియాకు గానీ, రాజీవ్ గాంధీకి గాని సంబంధం లేకపోయినా,ఇటీవల వైద్యచికిత్సల నిమిత్తం అమెరికా వెళ్ళిన తన తల్లి (సోనియా) అక్కడి ఖలిస్తాన్ శిక్కుసంస్థలు అమెరికా కోర్టుల ద్వారా ఆసుపత్రికి వెళ్ళి మరీ "సమాన్లు''జారీ చేయించాయి! అలాగే మాజీప్రధాని రాజీవ్ గాంధీపై జరిగిన దారుణ హత్యకూ, శ్రీలంకలో తమిళులపై శ్రీలంక ప్రభుత్వం అమలు జరుపుతున్న నిర్బంధకాండకు అండగా భారత సైన్యం వెన్నుదన్నుగా వెళ్ళి నిలబడడానికీ సంబంధం ఉందని, శ్రీలంకలో మన సైనికజోక్యం లేకపోతే రాజీవ్ మనకి దక్కేవాడనీ పలువురు వ్యాఖ్యాతలు ఆ రోజుల్లో పేర్కొనడమూ కొత్తగాదు.   అందువల్ల మనం స్వతంత్రమైన విధానాలకు లక్ష్యాలకూ దూరమవుతున్న కారణంగానే అమెరికా విసిరిన "సంస్కరణల''వలలోకి మనం చిక్కుబడి పోయిన కారణంగానే, ఇరుగుపోరుగుతో సంబంధాలు 65ఏళ్ళ తర్వాత కూడా కుడుతపడకుండా ఉన్నందున కూడా - దేశానికి చిక్కు సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికైనా గమనిస్తే మంచిది! అందువల్ల రాహుల్ అనవసర భయాలు తనలో పెట్టుకుని, సెంటిమెంట్ కోసం చౌకబారు ప్రకటనలు చేయకూడదు. హుందాతనం గల రాజకీయవేత్తగా ఆయన ఎదగాలని కోరుకుందాం! ఉన్మాదులకు తోడ్పడే "సెంటిమెంటల్ ఉప్పును'' అందించకూడదు! రాహుల్ చిరంజీవిగా ఉండాలన్న కోర్కె తప్ప మరొకటి దేశప్రజలకు ఉండదు గాక ఉండదు. నిజానికి గాంధీజీని చంపినవాడు నాధూరామ్ గాడ్సే అనే పరమ హిందూమతోన్మాది, నేటి బిజెపి పూర్వపు 'బ్రాండ్' అయిన ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తే అయినా, గాంధీజీ ఆదర్శాలను అనుక్షణమూ 'పాతరేస్తున్న'వారు మాత్రం అవినీతి గోదాలోకి పీకమొయ్యా దిగిపోయిన నేటి కాంగ్రెస్ నాయకులేనని రాహుల్ గుర్తించితే, దేశ సమస్యలకు పరిష్కారం చూడగల్గవచ్చునేమో!

మెగాస్టారుకి మెలుకువ వచ్చింది మళ్ళీ

తన మెగాస్టారు ఇమేజిని పణంగా పెట్టి మరీ, శుభమా అంటూ త్రీ..టూ..వన్..జీరో...అంటూ ప్రజారాజ్యం పార్టీని ‘జీరో’తో ఆరంభించినననాటి నుండి చిరంజీవి, హీరో నుండి పెద్ద జీరోగా మారిపోయారు. పట్టుమని ఏడాది కూడా పార్టీని నడుపలేని అయన మంత్రి పదవి కోసం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో జనాల దృష్టిలో ఆయన ‘జీరో టు పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో’ అన్నట్లుగా మారిపోయారు. ఆయన రాన్రాను చిన్న జీరో నుండి మరింత పెద్ద జీరోగా ఎదుగుతున్నారు తప్ప, రాజకీయాలలో ఉండి సాధించేమి లేదు. దేశముదుర్లతో నిండిన కాంగ్రెస్ పార్టీలో జేరడమే ఒకపెద్ద తప్పు గనుక ఆయన తన చుట్టూ ఓ గిరిగీసుకొని ఆ జీరోలో జీరోగా ఉండిపోక తప్పలేదు.   అయితే ప్రతీ మనిషి జీవితంలో ఉత్థానపతనాలు (రైజ్ అండ్ ఫాల్) ఉన్నట్లే ఆయనకీ ఉంటాయి గనుక, కొన్ని రోజులు సోనియమ్మకు అంతరంగికుడిగా మరి కొన్ని రోజులు కేంద్రమంత్రిగా ఒకవెలుగు వెలిగారు. కానీ రాష్ట్ర విభజన ప్రకటనతో అవన్నీకూడా మూన్నాళ్ళ ముచ్చట్లే అవుతాయని ఆయన కూడా  ఊహించలేకపోయారు. ఊహించి ఉంటే అసలు అమ్మ హస్తంలో పార్టీని పెట్టేవారు కారేమో.   తన పార్టీని, దానిని నమ్ముకొన్న వేలాది అభిమానులని, కార్యకర్తలని, చోటా మోటా నేతలని పణంగాబెట్టి సంపాదించుకొన్న కేంద్ర మంత్రి పదవి పోయింది. దానితోబాటే అధిష్టానంతో లింకులు తెగిపోయాయి. పైగా అధిష్టానం హ్యండిచ్చిన కారణంగా ఎన్నికలలో గెలుస్తామనే నమ్మకమూ లేదిప్పుడు.   ఇక సినీ పరిశ్రమలో ఆయన స్వయం కృషి గురించి అందరూ చెప్పుకొంటే, రాజకీయాలలో మాత్రం ఆయన   స్వయంకృతాపరాధం గురించే ఎక్కువ చెప్పుకోవలసి ఉంటుంది. రాష్ట్ర విభజనపై ఓసారి సమైక్యం వైపు, రాజీనామా చేయనని మొండికేసి సోనియమ్మా కొంగు చాటున దాక్కొని మరి కొన్ని రోజులు, మళ్ళీ నలుగురితో నారాయణ అనుకొంటూ రాజీనామా చేసి సమైక్యం వైపు కప్పగంతులు వేసి చివరికి సమైక్యజీరోగా మిగిలిపోయారు. ఇక ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి.   ఇక తనకి సమైక్య కిరణమే దారి చూపాలనే ఆలోచన వచ్చిందో ఏమో మళ్ళీ చాలా రోజుల తరువాత నిద్రలోంచి మేల్కొన్నట్లు మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖలతో తను కూడా ఏకీభవిస్తున్నానని ప్రకటించేశారు. అందువల్ల ఆయనకు కొత్తగా ఒరిగేదేమిటో ఆయనకే తెలియాలి.   ఆయన సినీ పరిశ్రమలో స్వయం కృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగి ఉండవచ్చు గాక, కానీ రాజకీయాలలో అదీ దేశ ముదుర్లతో నిండిన కాంగ్రెస్ పార్టీలో ఎంత స్వయం కృషి చేసేసినా, కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను ఒంటబట్టించుకోనంత కాలం ఏ ప్రయోజనమూ ఉండదు. ఆయన తనకు, తన మనస్తత్వానికి సరిపడని రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ మెగాస్టారుగా వస్తే జనాలు నెత్తినపెట్టుకొంటారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి ముందో చేతులు కట్టుకొని నిలబడటం కంటే, ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి తన తన మెగాస్టార్ హోదా నిలబెట్టుకొంటే గౌరవప్రదంగా ఉంటుంది కదా.  

విభజన రాజ్యాంగ విరుద్ధమే: చిరు

      చిరు మరోసారి ధైర్యం చేసి సీమాంధ్రులకు అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర విభజనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నానని, రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చివరి వరకు పోరాడతానని అన్నారు. తెలంగాణపై తీర్మానం, బిల్లు రెండూ అసెంబ్లీకి తప్పనిసరిగా పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తోందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలు, భయాలు, ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్రం ముందు వెళ్తూ ఉండడాన్ని సహించలేనని చెప్పారు. చిరంజీవి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ సగటు సీమాంధ్రుడికి ఆనందం కలిగించవచ్చేమోగానీ, చిరంజీవి ఏమిటీ.. ఇంత దూకుడుగా వ్యవహరించటమేమిటన్న సందేహం రాజకీయ పరిశీలకులను మాత్రం ఆలోచనలో పడేసింది.

శంఖారావ సభకో నమస్కారం!

      వైస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో ఈరోజు నిర్వహిస్తున్న సమైక్య శంఖారావ సభ, దాని నిర్వహణ వెనుక అసలు ఉద్దేశాల సంగతేమోగానీ, హైదరాబాద్‌లో జనం మాత్రం శంఖారావ సభకో నమస్కారం అంటున్నారు. అసలే వర్షాలతో జనం అల్లాడిపోతుంటే ఈ సమయంలో ఈ సభలేంటని అటు తెలంగాణ వారితోపాటు సీమాంధ్రులు కూడా విసుక్కుంటున్నారు.   సమైక్య శంఖారావం సభని జరగనివ్వమని తెలంగాణవాదులు గట్టి పట్టుదలతో వున్నారు. దీనికితోడు సభకి అడ్డుపడితే నరికేస్తాం, చంపేస్తాం అంటూ వైసీపీ కార్యకర్తలు స్టేట్‌మెంట్లు ఇవ్వడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. దాంతో పోలీసులు తమ డేగకళ్ళకు పనిపెట్టారు. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభ జరిగే ఎల్.బి.స్టేడియం చుట్టుపక్కల అయితే పరిస్థితి మరింత దారుణంగా వుంది. అటువైపు వెళ్ళిన వాహనాలు పోలీసు ఆంక్షల ఫలితంగా ఎటు తిరిగి ఎటువైపు వెళ్ళి ఎటువైపు తేలతాయో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులు వున్నాయి. మామూలు రోజుల్లోనే హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లు మామూలు విషయం. ఇక వర్షాలు పడే సమయంలో అయితే ఇకచెప్పనే అవసరం లేదు. అలాంటి పరిస్థతుల్లో ఇలాంటి ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ భారీ స్థాయిలో జామ్ అవుతోంది. పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడి పరిస్థితి కంటే దారుణంగా ఎల్.బి. స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయిన నగర జీవి పరిస్థితి వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వాదుల నిరసన ప్రదర్శనలుంటాయన్న అనుమానాలతో పోలీసులు అందరినీ అనుమానపు చూపులు చూస్తున్నారు. నగరంలో ప్రత్యేక చెకింగ్‌లు, నాకాబందీలు జరుగుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులకు కారణమైన వైసీపీ సమైక్య శంఖారావ సభ త్వరగా ముగిస్తే బావుండని నగరజీవి కోరుకుంటున్నాడు. సమైక్య శంఖారావ సభకో నమస్కారం పెడుతున్నాడు.

సిక్కుల ఉచకోతపై బాధలేదా?

      తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తనను కోపానికి గురిచేసిందన్న రాహుల్ వ్యాఖ్యలపై మోడీ తన ప్రసంగంలో పలు సందేహాలు లేవనెత్తారు. ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కుల వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేతలు వేలాది మంది సిక్కులను సజీవదహనం చేయడం... ఈ కేసుల్లో ఒక్కరికీ శిక్ష పడకపోవడం కోపం తెప్పించిందో లేదో చెప్పాలని ప్రశ్నించారు.   ‘ఇందిర హత్యపై కాంగ్రెస్ నేతలంతా ఆగ్రహానికి గురవడం నిజమేనా? ఆ కోపంలో నీ పార్టీ నేతలు వేలాది మంది సిక్కులను సజీవదహనం చేయడం, అయి నా ఒక్కరికీ శిక్ష పడకపోవడం నిజమేనా? నీ నానమ్మ మృతిపై నువ్వు ఆగ్రహానికి గురికావడాన్ని అర్థంచేసుకుంటా. కానీ వేలాదిమంది సిక్కుల మృతి పై నువ్వు బాధపడ్డావా? దీనిపై నీకు కోపం వచ్చిందా’ అని మోడీ ప్రశ్నించారు. తాను కూడా హత్యకు గురవ్వచ్చన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ కలకాలం చల్లగా ఉండేలా చూడమని బీజేపీ ప్రార్థిస్తుందని చెబుతూ.. ఉద్వేగభరితమైన అంశాలను ప్రస్తావించడం ద్వారా రాహుల్ ప్రజల ఉద్వేగాలను దోచుకునే యత్నం చేస్తున్నారన్నారు.