అవనిగడ్డ ప్రజలకు అండగా ఉంటా: కంఠమనేని రవిశంకర్

      అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీలు, కులమతాలకతీతంగా పలు సేవాకార్యక్రమాలు, వైద్య సేవలు అందిస్తున్నారు తెలుగుదేశం నాయకులు, తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠమనేని రవిశంకర్. ప్రజలకు మరింత చేరువకావాలనే సంకల్పంతో గ్రామీణ ప్రాంత ప్రజలను పరిచయం చేసుకుంటూ, ఇంటింటికీ వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు మోపిదేవి, చల్లపల్లి, కోడూరు, ఘంటాశాల, నాగాయలంక మ౦డలాలలో ఆయన పర్యటించి ఆ గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఓటు హక్కు చాలా అమూల్యమైనదని, రానున్న ఎన్నికలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడినే ఎన్నుకోవాలని సూచించారు. మీడియాతో మాట్లాడుతూ.. అవనిగడ్డ నియోజకవర్గంలో వలసవాదులకు చోటు లేదని, ప్రజలకు కావాల్సింది వారి సమస్యలను తీర్చి, కష్టాల్లో అండగా నిలిచే నాయకుడని.. ఆ నాయకుడు తానే అవుతాననే ధీమాను కంఠమనేని రవిశంకర్ వ్యక్తం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు అవనిగడ్డ సీటును తనకు ఇస్తారనే నమ్మకం వుందని అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన పరిచయ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.      

కాంగ్రెస్ ‘సర్వే’నాశనం

  అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్వనాశనం అయిపోయిందన్న విషయం స్పష్టంగా తెలిసిపోతూనే వుంది. పార్లమెంట్ విషయంలో ఎవర్ని కదిలించినా ‘మోడీ’ అంటున్నారు. సీమాంధ్రలో ఎవర్ని అడిగినా ‘చంద్రబాబు’ అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం నిశ్శబ్ద విప్లవం సృష్టించబోతోందన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయ్యే అవకాశాలున్నాయని జాతీయ స్థాయిలో పలు ఛానెళ్ళు సర్వే సంస్థలతో కలసి నిర్వహించిన సర్వేల్లో తెలిసిపోతోంది. రెండు మూడు మీడియా సంస్థలు బయటకి వెల్లడించిన సర్వే ఫలితాలను గమనిస్తే కాంగ్రెస్ నాయకులు ఎన్నికల తర్వాత నెత్తిన తెల్లగుడ్డలు వేసుకోవడం ఖాయమని అర్థమవుతోంది.   మరికొన్ని మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ఫలితాలు త్వరలో బయటకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ సర్వేలన్నీ కూడా దేశంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ మటాషైపోవడం ఖాయమని చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం వాస్తవాలను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అన్ని సర్వేలూ తమకి వ్యతిరేకంగా వస్తున్నప్పటికి వాళ్ళకి జ్ఞానోదయం కలగటం లేదు. ఇవన్నీ డబ్బులిచ్చి చేయిస్తున్న సర్వేలంటూ గత ఎన్నికల సమయంలో తాము చేయించిన ‘పెయిడ్ సర్వే’లను గుర్తు చేసుకుంటూ చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గతి పట్టబోతోందో తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా సర్వేలు చేయాల్సిన అవసరం లేదని, మారుమూల పల్లెటూళ్ళో వున్న సామాన్య ఓటర్ని అడిగినా చెబుతాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కేసీఆర్ మీడియా లీకులతో ప్రత్యర్ధులు తికమక

  తెరాస అభ్యర్ధుల మొదటి జాబితా ఇంకా విడుదల కానేలేదు. కానీ, కేసీఆర్ మల్కాజ్ గిరీ నుండి, కేటీఆర్ సిరిసిల్లా నుండి, కవిత నిజామాబాద్ నుండి మరొకరు మరొక చోటు నుండి పోటీ చేస్తారంటూ తెరాస మీడియాకి లీకులు ఇస్తూ తమ ప్రత్యర్దులను తికమక పరిచే ప్రయత్నం చేస్తోంది. ఊహించినట్లే కేసీఆర్ విసిరినా గేలానికి కొన్ని చేపలు చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. వాటిలో మొదటి చేప తెదేపా తెలంగాణా ఎన్నికల కమిటీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు. ప్రస్తుతం తెదేపాలో మల్కాజ్ గిరీ నుండి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో మోత్కుపల్లి కూడా ఒకరు.   ఇప్పుడు కేసీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తారని మీడియా గుప్పుమనడంతో, ఇదే అదునుగా “పార్టీ అదేశిస్తే తాను కేసీఆర్ పై పోటీ చేసి ఓడిస్తానని” ప్రకటించేసారు. అయితే కేసీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తారనే నమ్మకం ఏమీ లేకపోయినా, ఈ సాకుతో మోత్కుపల్లి కూడా మల్కాజ్ గిరీపై కన్నేయడాన్ని అక్కడి నుండి పోటీ చేయాలను కొంటున్న రేవంత్ రెడ్డి వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న మీడియా లీకుతో తెలుగు తమ్ముళ్ళ మధ్య చిచ్చుపెట్టగలిగిన కేసీఆర్ ని, నిజంగానే మోత్కుపల్లి డ్డీకొని ఓడించగలరా? అంటే అనుమానమే. కానీ, ఈ సాకుతో తాను కూడా మల్కాజ్ గిరీ నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మోత్కుపల్లి విస్పష్టంగా ప్రకటించగలిగారు.

పాపం కావూరి!

  కేంద్రమంత్రి కావూరి దిమాగ్ రాజకీయంగా ఖరాబైనట్టు కనిపిస్తోంది. నాలుగు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఓటమే ఎరుగని వ్యక్తిగా ఒక వెలుగు వెలిగిన కావూరి రాజకీయ జీవితం ప్రస్తుతం అత్యంత కనాకష్టంగా తయారైంది. కావూరి పోటీ చేస్తే చాలు గెలవటం ఖాయం అనే స్థితి నుంచి తాను పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమన్న మానసిక స్థితికి కావూరి చేరుకున్నారంటే పాపం…ఆయన పరిస్థితిని చూసి ఎవరికైనా జాలి కలుగుతుంది. అయితే కావూరి ఎంతమాత్రం జాలిపడటానికి అర్హుడు కాదన్నది సీమాంధ్రుల ఏకాభిప్రాయం. కేంద్రమంత్రి పదవి వచ్చేంత వరకూ సమైక్యవాదిగా కనిపించిన కావూరి కేంద్రమంత్రి అవగానే సమైక్యవాదాన్ని అటకెక్కించేసి పక్కా కాంగ్రెస్ విధేయుడు అయిపోయారు. రాష్ట్ర విభజన పాపాన్ని ఒక్క పిడికెడు కాకుండా నాలుగైదు పిడికిళ్ళు తన అకౌంట్‌లో వేసుకున్నారు. రాష్ట్ర విభజనకు ఏ దశలోనూ వ్యతిరేకత తెలుపకుండా మంత్రి పదవే పరమావధిగా భావించిన కావూరి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయాక తీరిగ్గా విచారిస్తున్నారు.   ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి తనకు గెలిచే సీన్ లేదని అర్థమైపోయిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ జిలానీ అయిపోయే ప్రయత్నాలు మొదలెట్టారు. ఆరిపోయే దీపంలా వున్న మంత్రి పదవిని వదులుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. పదవి లేకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా గొంతులోంచి దిగని కావూరి సార్ మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆహ్వానం వస్తుందేమోనని ఎదురుచూశారు. సీమాంధ్రలో తెలుగుదేశానికి వున్న అభిమాన్ని అడ్డు పెట్టుకుని మరోసారి పార్లమెంట్‌కి వెళ్ళాలని భావించారు. అయితే అటు నుంచి పట్టించుకునేవాళ్ళు లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే అయ్యగారికి అంత ధైర్యం లేక ఇప్పడు బీజేపీతో రాయబారాలు నడుపుతున్నారు. కానీ అటు నుంచి కూడా కావూరికి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కావూరి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమన్నది తేలిపోయింది. అలాంటి కుంటి గుర్రాన్ని రేసులో నిలపడానికి ఏ పార్టీ ఇష్టపడటం లేదు. రాజకీయంగా తనకు వచ్చిన దురవస్థని చూసుకుని కావూరి మనశ్శాంతి లేకుండా వున్నారు. రాజకీయంగా దిమాగ్ ఖరాబ్ చేసుకుంటున్నారు.

మదనపల్లెలో బీజేపీ పోటీ?

      చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలి? టీడీపీనా.. లేక బీజేపీనా? ఈ విషయమై గందరగోళం నెలకొంటోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానాన్ని కమలానికి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలియడంతో టీడీపీ వర్గాలు కాస్త డీలా పడ్డాయి. బీజేపీ తరఫున భారతీయ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి చల్లపల్లె నరసింహా రెడ్డికి మదనపల్లె టికెట్టు ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో దీనిని అంగీకరిస్తున్నారు. ఆ పార్టీ జాతీయ స్థాయి అగ్రనేతల్లో ఒకరైన ఎల్‌కే అద్వానీతో చల్లపల్లెకు మంచి అనుబంధం ఉంది.   దీంతో సీట్ల సర్దుబాటు అంటూ జరిగితే చల్లపల్లెకు మదనపల్లె కేటాయించడం ఖాయమని అంటున్నారు. దీనికి తోడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మదనపల్లె విషయంపై మౌనంగా ఉన్నారు. బీజేపీకి కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నందునే మదనపల్లె ప్రస్తావన తేవడం లేదనే అనుమానాలు దేశం నేతల్లో ఉన్నాయి.

సీపీఐ - టీ కాంగ్రెస్ పొత్తు ఓకే?

  భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు దాదాపు ఖరారైంది. స్థానాల కేటాయింపుపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. వురోవైపు టీఆర్‌ఎస్‌తో సీపీఐ పొత్తుకు దాదాపుగా మార్గాలు మూసుకుపోయాయి. పొత్తు విషయంలో టీఆర్‌ఎస్ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు కూడా. సోమవారం సీపీఐ నేతలు ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్ నేతలతో పొత్తులపై చర్చలు జరిపారు. అయితే టీఆర్ఎస్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన నారాయణ.. తెలంగాణా పీసీసీ చీఫ్ పొన్నాలతో ఓ హోటల్లో రహస్యంగా భేటీ అయ్యారు. తమకు రెండు ఎంపీ, 17 అసెంబ్లీ స్థానాలివ్వాలని కోరారు. ఒక ఎంపీ, 12 అసెంబ్లీ సీట్లను కేటాయించేందుకు పొన్నాల అంగీకారం తెలిపారు. అయితే, ఎంపీ సీట్ల వ్యవహారాన్ని అధిష్టానం చూస్తోందని, సీపీఐ కోరుతున్న అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు ఉండటంతో మరోసారి చర్చించుకుందామని సూచించారు.   రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ తమకు అనుకూలంగా ఉన్న ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయని, రెండు సీట్లు ఎక్కువ ఇచ్చేందుకు వెనుకాడొద్దని నారాయణ ఆయనతో చెప్పినట్లు సమాచారం. ఒకటి రెండు అటూ ఇటూగా మొత్తమ్మీద హస్తంలో కంకి కొడవలి ఇమిడిపోయినట్లే భావించవచ్చును.

తెలంగాణా బరిలో రాహుల్?

    కాంగ్రెస్ యువరాజు రాహుల్‌ గాంధీ తెలంగాణాలో పోటీ చేయబోతున్నారు. ఇందుకోసం తెలంగాణాలో టీఆర్‌ఎస్ బలహీనంగా, కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలేమున్నాయి, రాహుల్ పోటీ చేస్తే తెలంగాణా అంతటా దాని ప్రభావం పడే అవకాశముందా అనే ప్రశ్నలకు ఏఐసీసీ వేగులు సమాధానాలు వెదుకుతున్నారు. కచ్చితంగా గెలిచే అవకాశమున్న పార్లమెంట్ స్థానం ఏదనే దానిపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. తెలంగాణా బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు ప్రజాదరణ పెరిగిందని పలు సర్వేలు వెల్లడించడంతో రాహుల్‌ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కాంగ్రెస్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. తాను పోటీ చేయడం ద్వారా తెలంగాణాలోని అన్ని సీట్లపైనా దాని ప్రభావం ఉంటుందని, తద్వారా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ అంశంపై యువరాజు కూడా దృష్టి సారించినట్టు తెలిసింది. అందుకే తన వేగులను పంపి తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి, కచ్చితంగా గెలిచే అవకాశాలున్న సీట్లు, టీఆర్‌ఎస్ బలంపై ఆరా తీయిస్తున్నారు. దక్షిణ తెలంగాణాలో టీఆర్‌ఎస్ బలం తక్కువగా ఉన్నందున, పోటీకి ఈ ప్రాంతమే మేలనే భావనకు వచ్చిన వేగులు, చేవెళ్ల, భువనగిరి, నల్లగొండ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో వారు ఫోన్లో మాట్లాడి, అగ్రనేతలకు ఆయా సీట్లు ఎంతవరకు సురక్షితం అనే అంశాన్ని విశ్లేషించినట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కూడా రాహుల్ దూతలు మంతనాలు జరిపినట్టు సమాచారం.

ఒంగోలు గడ్డపై చిరంజీవి ఫ్లాప్ షో

  ‘కాశీకి వెళ్లానని..కాషాయం’ అంటూ ఇంద్ర సినిమా డైలాగుతో ప్రారంభమైన ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల బుర్రను వేడెక్కించింది.నూనూగు మీసాల వయసులో ఒంగోలులో తాను తిరిగిన జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని చెప్పిన ఆయన గుర్తులు వేదికపైనున్న కాంగ్రెస్ పెద్దలనే అయోమయానికి గురిచేశాయి. ‘కాంగ్రెస్ పార్టీ అనేది ప్రకృతి గద్ద.. రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగిరిన పక్షిలా.. నేడు యువకులు రూపాంతరం చెందాలి.. కార్యోన్ముఖులు కావాలి..’ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి పొంతన లేకుండా చేసిన వ్యాఖ్యలివి.   ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇతర కాంగ్రెస్ పెద్దలతో కలిసి తాను చేపట్టిన కాస్తా అట్టర్ ఫ్లాప్ కావడంతో చిరంజీవికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడినట్లుంది అంటూ కొంతమంది కార్యకర్తలు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పట్టింది. గుంటూరు జిల్లా నుంచి ఒంగోలులోకి ప్రవేశించిన కాంగ్రెస్ బస్సు యాత్ర ఆద్యంతం పెద్ద జోకులాగే సాగింది.   ఇక సభలో కేంద్రమంత్రి పనబాక మాట్లాడుతూ చిరంజీవిని సూపర్‌స్టార్ అని సంబోధించినప్పుడు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. పవర్‌స్టార్, జై జనసేన అంటూ పవన్‌ అభిమానులు పెద్దగా నినాదాలివ్వడంతో వేదికపై నేతలు డైలామాలో పడ్డారు. ఇక చిరంజీవి కూడా గతంలో తాను పీఆర్పీ అధినేతగా సమైక్యాంధ్ర కోసం పోరాడానంటూనే.. అప్పట్లో తనను ఎవరూ మెచ్చుకోనందున.. కాంగ్రెస్‌లో కలిశానని.. ఇప్పుడు తన హక్కులు, అధికారాలు పరిమితమయ్యాయని చెప్పుకోవడంపై అభిమానులు పెదవి విరిచారు.

ఆదాల వర్సెస్ ఆనం.. ఈసారి పార్లమెంటు బరిలో?

  ఒకే పార్టీలో ఉన్నా కూడా వైరి వర్గాలుగా ఎప్పటికప్పుడు తమ ఆధిపత్యాన్ని చూపించుకోడానికి ప్రయత్నించిన చరిత్ర ఆనం, ఆదాల వర్గాలకు ఉంది. నెల్లూరు జిల్లాలో ఆనం చెంచుసుబ్బారెడ్డి వారసులుగా ఈ తరంలో రాజకీయాలు నడిపిస్తున్న ఆనం సోదరుల్లో పెద్దవాడు, నిన్న మొన్నటి వరకు సమైక్య రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి లోక్ సభ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయానికి కారణం ఆయన చిరకాల ప్రత్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డేనని తెలుస్తోంది.   ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, తెలుగుదేశం పార్టీలో చేరిన ఆదాల.. నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన ఆనం.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఆదాలను ఢీకొట్టాలని భావిస్తున్నారట. అయితే, అంతకుముందు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీలో కొనసాగుతున్న మేకపాటి రాజమోహనరెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ. ఆయన ఈసారి కూడా అదే పార్టీ తరఫున బరిలోకి దిగడం ఖాయం.   ఈ నేపథ్యంలో.. ఒకే పార్టీ నుంచి వచ్చిన ముగ్గురు నాయకులు మూడు వేర్వేరు పార్టీల నుంచి నెల్లూరు లోక్ సభ స్థానాన్ని చేజిక్కించుకోడానికి పందెం కోళ్లలా పోరాడబోతున్నారన్న మాట.

బీజేపీకి జస్వంత్ సింగ్ షాక్ ట్రీట్మెంట్

  రాజకీయ పార్టీలకి టికెట్స్ కేటాయింపు సమయంలో అసమ్మతి బెడద సర్వసాధారణమే అయినప్పటికీ, పార్టీలో అగ్రనేతలే తిరుగుబాటు చేస్తే, ఆ బాధ వర్ణనాతీతం. పార్టీలో చెలరేగిన అసమ్మతి కంటే తమ రాజకీయ ప్రత్యర్ధులకు, మీడియాకు జవాబు చెప్పుకోలేక అత్త కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాన్నట్లు ఉంటుంది పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. పార్టీలో అత్యంత సీనియర్ నేత అయిన జశ్వంత్ సింగ్ కోరిన విధంగా రాజస్థాన్‌లోని బార్మర్ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీపై ఆగ్రహించిన ఆయన ఈరోజు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ కంగు తింది. ఇదే అదునుగా కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్ వంటి వారు బీజేపీపై దాడి చేస్తుంటే, కాంగ్రెస్ అనుకూల మీడియా జస్వంత్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం మొదలు పెట్టేసింది. కానీ, జస్వంత్ సింగ్ తాను స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషాన్ వేసినప్పటికీ, పార్టీని వీడబోనని ప్రకటించారు.   జస్వంత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీని బయట నుండి వచ్చిన వారు పూర్తిగా ఆక్రమించేసారని, దానితో పార్టీలో సీనియర్స్ కి కూడా విలువ, గౌరవం లేకుండా పోయిందని, అందుకు తానే ఒక ఉదాహరణ అని మీడియా ముందు వాపోయారు. పార్టీకి భీష్మ పితామహుడు వంటి లాల్ కృష్ణ అద్వానీ భోపాల్ నుండి పోటీ చేయాలని భావిస్తే ఆయనకు అక్కడ టికెట్ నిరాకరించి అహ్మదాబాద్ నుండి టికెట్ కేటాయించారు. అదేవిధంగా పార్టీలో మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ వారణాసి నుండి పోటీ చేద్దామనుకొంటే, నరేంద్ర మోడీ అక్కడ నుండి పోటీ చేయాలని భావించడంతో జోషీని అక్కడి నుండి తప్పించారు. జరుగుతున్న పరిణామాలకి పార్టీలో సీనియర్లు అద్వానీ, సుష్మస్వరాజ్, శత్రుఘన్ సిన్హా వంటి వారు కూడా చాలా బాధపడ్డారు. కానీ, మోడీ అనుకూల వర్గానికి చెందిన అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు పార్టీ శ్రేయస్సు కోసం కొందరు కొన్ని సార్లు త్యాగాలు చేయవలసి ఉంటుందని తమ సీనియర్లకు హితవు పలకడం గమనిస్తే, జస్వంత్ సింగ్ ఆరోపణలు నిజమేనని నమ్మక తప్పదు. జస్వంత్ సింగ్ పార్టీ ప్రతిష్టకి భంగం కలిగిస్తూ నామినేషన్స్ వేసారు గనుక బహుశః నేడో రేపో ఆయనపై పార్టీ బహిష్కరణ వేటు వేసినా వేయవచ్చును.

మోడీకి నాగ్ మద్దతు..అమలకు వద్దు

      ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున నరేంద్రమోదీతో అహ్మదాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆయనతో 40 నిముషాలపాటు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన అన్నారు. తన భార్య అమల ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నానని వస్తున్న వార్తలను నాగార్జున ఖండించారు. తమ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.   అభివృద్ధిలో గుజరాత్ దూసుకు వెళ్తుందని, పలు అభివృద్ధి ప్రాజెక్టులు స్వయంగా చూశానని నాగార్జున పేర్కొన్నారు. గుజరాత్‌లో 24 గంటలూ విద్యుత్ ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ఎన్నో గ్రామాలకు ఇంటర్నెట్, వైపై అనుసంధానం ఉందని, మోదీ పాలన చాలా బాగుందని ఆయన కొనియాడారు. మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్లు నాగార్జున పేర్కొన్నారు.

సినీ నటులకు రాజాకీయాలేలననగా...

  సినీ నటులు రాజకీయాలలోకి ప్రవేశించడం కొత్తేమీ కాకపోయినా ఈసారి ఎన్నికలలో చాలా మంది నటులు ఏదో ఒక రాజకీయ పార్టీ పంచన చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఏదో ఒక రాజకీయ పార్టీతో అంట కాగుతుంటే మిగిలిన వారు కూడా హడావుడిగా ఏదో ఒక పార్టీ జెండా దొరకబుచ్చుకొనేందుకు పరుగులు తీస్తున్నారు. బాబు మోహన్ తెదేపాకు గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోగా, మరో హాస్యనటుడు ఆలీ త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరి, రాజమండ్రీ నుండి పోటీ చేస్తానంటున్నారు. ఇక, పవన్ కళ్యాణ్ అయితే స్వయంగా ఓ రాజకీయ పార్టీ పెట్టుకొని నరేంద్రమోడీని కలిసి ఆయనకి తన మద్దతు తెలిపివచ్చారు. ఆ వెంటనే నాగార్జున, బ్రహ్మానందం కూడా నమో నమో అంటూ బీజేపీ చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టేసారు. మోహన్ బాబు కూడా బీజేపీలో చేరవచ్చని తాజా సమాచారం. బహుశః త్వరలోనే మిగిలిన వారు కూడా ఏదో ఒక జెండా పట్టుకొని ప్రజల ముందుకు వస్తారేమో. గతంలో రాజకీయ పార్టీలు నటీ నటుల చుట్టూ తిరుగుతూ తమ పార్టీలో చేరమని లేదా కనీసం పార్టీకి ప్రచారం చేయమని కోరుతుండేవి. కానీ, అప్పుడు ఎవరూ అంత ఆసక్తి చూపేవారు కాదు. కానీ, ఇప్పుడు నటీనటులే స్వయంగా పార్టీలలో చేరుతాము, ప్రచారం చేస్తామంటూ రాజకీయనాయకుల, పార్టీల చుట్టూ తిరగడం గమనిస్తే దానివెనుక చాలా బలమయిన కారణం ఉందని అర్ధమవుతుంది.   సినీ నటులు రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నారంటే అందుకు చాలా కారణాలు ఉండవచ్చును. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే రాష్ట్ర విభజనతో ఎదురయ్యే సమస్యల నుండి తమను తమ ఆస్తులను కాపాడుకోవడానికే సినీ నటులు రాజకీయ పార్టీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని భావించవచ్చును. సినీ పరిశ్రమలో దాదాపు 75 శాతం ఆంధ్రావారి చేతిలోనే ఉంది. ఇప్పుడు విభజన తరువాత తెలుగు సినీ పరిశ్రమ అంతా తెలంగాణలోకి వెళ్లిపోయింది. తెలంగాణాలో కేసీఆర్ తమ కుటుంబమే రాజ్యం ఏలుతుందని స్వయంగా చెపుతున్నారు. గత పదేళ్ళ కాలంలో సినీ పరిశ్రమతో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏవిధంగా ఆడుకోన్నారో అందరికీ తెలుసు. అటువంటిది ఇప్పుడు శాశ్వితంగా ఆయన కనుసన్నలలోనే సినీ పరిశ్రమ నడుచుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే వారు ఆందోళన చెందడం సహజమే.   సినీ పరిశ్రమ అంటేనే అంతా కోట్లతో వ్యవహారం. చాలా మంది నటీనటులు కోట్లలో ఆదాయం సంపాదిస్తూ, హైదరాబాదులో స్థలాలు, స్టూడియోలు, హోటల్స్ ఇతరత్రా వ్యాపారాలు, లావాదేవీలు కలిగి ఉన్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణాలో తెరాస ప్రభుత్వం ఏర్పడి, దానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా, అయన కుటుంబ సభ్యులందరూ మంత్రులుగా బాధ్యతలు చేపడితే వారి దృష్టి మొట్టమొదటగా తమ మీదనే పడుతుందని సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఆందోళన చెందడం సహజమే. ఈ సమస్య నుండి బయటపడాలంటే వారి ముందు రెండే రెండు మార్గాలున్నాయి. 1. హైదరాబాదులో ఉన్న తమ ఆస్తులన్నిటినీ అమ్ముకొని మళ్ళీ ఏ వైజాగ్ కో తరలిపోవడం. 2. రాజకీయ పార్టీల రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవడం. ఇందులో మొదటిది దాదాపు అసాధ్యం కనుక బహుశః అందరూ రెండో ఆప్షన్ ఎంచుకొంటున్నారని భావించవచ్చును. లేకుంటే వారికి ఆ తరువాత కేసీఆర్ మరే ఆప్షన్స్ ఇవ్వకపోవచ్చును.

ఆయనకి ఎన్నికల కమిషన్ షాక్

      “ఇంకా ఎన్ని రోజులురా మీ ఆగడాలు…ఈ అరాచకాలు…ఆయనొస్తున్నాడు…” అంటే... ఎవరాయన? రాజకీయ నాయకుడు ప్రశ్నిస్తే ఆయన ఎవరో కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి పుత్రరత్నం జగన్ అనే విషయం రివీల్ అవుతుంది. వెంటనే ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది. ఆ తర్వాత ఓ బొంగురు గొంతు ‘ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి.. దుమ్ము దులిపేయండి’ అని సందేశం ఇస్తూ గత కొన్ని రోజులుగా టీవీలో ప్రకటనలు హడావిడి సృష్టించాయి. అయితే సడన్ గా ఛానెళ్ళలోంచి ఈ ప్రకటన మాయమై౦ది. అయితే ఈ ప్రకటనపై ఎన్నికల కమిషన్ అభ్యంతర౦ పెట్టింది. తమ అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయకూడదని స్పష్టం చేసిందట. దాంతో వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్‌కి ఈ ప్రకటనల ప్రసారం చేయడానికి అనుమతి కోరుతూ లేఖ రాసింది. అయితే ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనల ప్రసారానికి అంగీకరింబోనని తెలిపిందట.

దళిత ముఖ్యమంత్రికి పరిస్థితులు సూట్ అవ్వవట

  ఇప్పుడప్పుడే తెలంగాణా రాదనే భావనతోనే తెదేపా, వైకాపాలు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు ఇచ్చాయి. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా అదేవిధంగా భావించి, తెలంగాణా ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని, తెలంగాణా రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇస్తూ వచ్చారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా తెలంగాణా ఏర్పడిపోయింది. ఈ వ్యవహారంలో తెదేపా, వైకాపాలు ఎలాగో చావు తప్పి కన్ను లొట్టపోయి బయటపడ్డా, కేసీఆర్ మాత్రం ఇంకా బయటపడలేక పోతున్నారు. అప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీతో ఏవో గిల్లి కజ్జాలు పెట్టుకొని, కుంటి సాకులు చెప్పి ఎలాగో కాంగ్రెస్ పార్టీతో విలీనం, పొత్తుల మాటను గట్టున పెట్టేయగలిగారు. కానీ, కనబడని ఆ దళిత ముఖ్యమంత్రి మాత్రం ఆయనను నీడలా వెన్నాడుతూ వేధించుకుతింటూనే ఉన్నాడు. అందుకే అతనిని కూడా వదిలించుకోవడానికి మాటల మాంత్రికుడు కేసీఆర్ సరి కొత్త మంత్రాలు పటించడం మొదలుపెట్టారిప్పుడు.   ఆనాడు దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదన చేసినప్పటి పరిస్థితులు ఇప్పుడు ఎంతమాత్రం లేవని, అవకాశం దొరికితే తెలంగాణాను నమిలి మింగేద్దామని ‘ఆంధ్రా బూచాళ్ళు’ కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఇంకా చాలా మంది పొంచి ఉన్నారని, అందువలన తెలంగాణాను సాధించిన తనకే వారందరి నుండి దానిని కాపాడుకొనే భాద్యత కూడా దఖలు చేసుకోవలసి వస్తోందని తెలిపారు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదనను కూడా పక్కన పెట్టక తప్పడం లేదని అన్నారు. అంతే గాక రాగల రెండుమూడేళ్ళు కూడా తెలంగాణకు చాలా క్లిష్టమయినవని అందువలన తన కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధ్యతలు తీసుకొని తెలంగాణాను కాపాడుకొంటారని కేసీఆర్ తన మనసులో మాటని కక్కేశారు. ఎన్నికలకు వెళ్ళే లోపుగానే తెరాస తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరు కూడా ప్రకటిస్తానని ఆయన మరో కొత్త హామీ ఇచ్చారు.   ఇప్పటికే తెరాస కార్యకర్తలు, నేతలందరూ కూడా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. వారు మరింత గట్టిగా అడిగినట్లయితే వారి మాటను కాదనలేని సహృదయుడు కేసీఆర్. ఆ విధిలేని పరిస్థితిలో మళ్ళీ ‘ఆ బక్కోడే’ ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా స్వీకరించేందుకు అంగీకరించ్చన్న మాట!   అందువల్ల చంద్రబాబు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినా, బీజేపీ దళితుడిని చేస్తానన్నా, జగన్మోహన్ రెడ్డి మైనార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినా ఇక కేసీఆర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఈసారి కొంచెం జాగ్రత్త పడుతూ తన కుటుంబ సభ్యులందరూ కూడా ‘బంగారి తెలంగాణా’ పునర్నిర్మాణంలో బాధ్యతలు (?) స్వీకరిస్తారని ముందే ప్రకటించేశారు. గనుక వారందరికీ కూడా లైన్ క్లియర్ అయిపోయినట్లే! రేపు వారందరూ తలో మంత్రి పదవీ పుచ్చుకొంటున్నపుడు వారెవరికీ ఎటువంటి సంజాయిషీలు ఇవ్వనవసరం లేదు కూడా. ఎందుకంటే వారందరూ పదవులు, అధికారంపై ఆరాటంతో కాక కేవలం ‘బంగారి తెలంగాణా’ను నిర్మించుకొనేందుకు మాత్రమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. కల్వకుంట్ల వారు ఎంత త్యాగాశీలులో...

నారాయణ అతితెలివి

      సీపీఐ నాయకుడు నారాయణ తనకు సంబంధం లేని పనులని భుజాన వేసుకుని లాభం పొందే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ పనేంటయ్యా అంటే, ప్రస్తుతం రాష్ట్రంలో తిట్టిన తిట్టు తిట్టుకోకుండా తెగ తిట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నానని నారాయణ ప్రకటించాడు. వాళ్ళకి లేని బాధ నీకెందుకయ్యా, మధ్యలో నిన్ను రాయబారి చేయమని ఎవరైనా అడిగారా అనే ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెబుతున్నాడు.   ప్రజల సంక్షేమాన్ని కోరుకునే తాను కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీని కలిపే ప్రయత్నం చేస్తున్నానని అంటున్నాడు. ఈ రెండు పార్టీలు కలవటం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరిగే అవకాశం వుందని అంటున్నాడు. నారాయణ గారి బుర్రలో వున్నది తెలంగాణ ప్రజల మేలు కాదని, ఈ రెండు పార్టీలకు సయోధ్య కుదిర్చి రాజకీయంగా లాభం పొందే ఆలోచనలో ఆయన ఉన్నారన్నది ఎంత అమాయకులకైనా అర్థమైపోయే విషయం. అంచేత నారాయణ ఇలాంటి సూపర్ తెలివితేటల ప్రదర్శన మానుకుని నిజంగా జనానికి ఉపయోగపడే విషయాల గురించి ఆలోచిస్తే మంచిదని విమర్శకులు సలహా ఇస్తున్నారు.

పాపం చిరంజీవి

      ప్రస్తుతం సీమాంధ్రలో ఈ బస్సు యాత్ర చేస్తూ ప్రెస్ మీట్స్ లో చిరంజీవి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ఆయనకు వున్న రాజకీయ అపరిపక్వత స్పష్టంగా కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ చిరంజీవి మాట్లాడుతున్న మాటలు చిరంజీవి మీద చిరాకు పెంచి, కిరణ్ కుమార్ మీద అభిమానం పెంచేలా వుంటున్నాయి. రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనం కూడా వుంటుందా అన్నట్టుగా చిరంజీవి ప్రసంగం సాగుతోందని విమర్శకులు అంటున్నారు. కాంగ్రెస్ గర్భంలో కలిసిపోయిన పిఆర్పీ పార్టీకి చెందిన ఓ కార్యకర్త అందరిముందు చిరంజీవిని ఛీకొడుతూ ‘పార్టీని అమ్ముకోవడానికి సిగ్గులేదా?’ అని అడిగేయడం, పిఆర్పీ ఐడెంటిటీ కార్డ్ ని ముక్కలు చేసేయడం బాబోయ్ దారుణం. ఇంత జరిగినా చిరంజీవి తుడిచేసుకుని బస్సు యాత్రలో పాల్గొనడం ఇంకా దారుణమని అంటున్నారు.

తివారీ.. ఓ మంచి డాడీ!

      రాజ్‌భవన్‌లో రాసలీలలు నడిపిన వృద్ధ జంబూకం ఎన్.డి.తివారీ గుర్తున్నాడుగా! మొన్నటి వరకూ పితృత్వం కేసులో ఇరుక్కుని కోర్టు చుట్టూ తిరిగిన తివారీ, రోహిత్ శేఖర్ అనే కుర్రోడు తన కొడుకే కాదని బల్లగుద్ది మరీ వాదించాడు. డి.ఎన్.ఎ. రిపోర్టులో సదరు పిలగాడు నీ కొడుకేనని తేలిందయ్యాబాబూ అని చెప్పినా తివారీ ఎంతమాత్రం పట్టించుకోకుండా తనకి, రోహిత్ శేఖర్‌కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశాడు.   రోహిత్ శేఖర్ మాత్రం తక్కువవాడా.. ఎంతైనా తివారీ రక్తం పంచుకుని పుట్టినోడు కదా.. తాను కూడా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేశాడు. చివరికి ఈమధ్యే తివారీ కడుపులో వున్న తండ్రి పేగు కదిలింది. రోహిత్ శేఖర్ తన కొడుకేనని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఇంతకాలం కోర్టులో తాను చేసిన వాదనంతా తూచ్ అని మర్చిపోండని చెప్పేశాడు. ఇదంతా ఇలా వుంటే, ఇప్పుడు రోహిత్ శేఖర్‌ని రాజకీయంగా ఎదిగేలా చేయడానికి తివారీ తహతహలాడిపోతున్నాడు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ పార్లమెంట్ స్థానం నుంచి తానుగానీ, తన కొడుకు గానీ పోటీచేసే అవకాశం వుందని చెబుతున్నాడు. త్వరలో నైనిటాల్‌లో పర్యటించి అక్కడి నుంచి తాను పోటీచేయాలా? తన కొడుకు పోటీ చేయాలా? అని అక్కడి ఓటర్లనే అడిగి తెలుసుకుంటానని, ఓటర్లు చెప్పిన ప్రకారం నడుచుకుంటానని సెలవిస్తున్నాడు. అడుగు తీసి అడుగు వేయడానికి అరగంట టైమ్ తీసుకునే తివారి నైనిటాల్‌లో పర్యటించడం, ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం ఇవన్నీ పులిహోర కబుర్లేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన కొడుకుని రాజకీయంగా ప్రమోట్ చేయడానికే తివారీ ఫిక్సయ్యాడని చెబుతున్నారు. అయినా రేపోమాపో అన్నట్టున్న తివారీ పోటీ చేస్తే ఓట్లేయడానికి నైనిటాల్ ఓటర్లు అంత అమాయకులు కాదని అంటున్నారు. లేటుగా ఒప్పుకున్నా తివారీ ఒక మంచి డాడీ అని మెచ్చుకుంటున్నారు. కొడుకుమీద ఇంత ప్రేమ కారిపోతున్నవాడు ఏళ్ళకేళ్ళు వాడు నా కొడుకే కాదంటూ కోర్టు చుట్టూ ఎందుకు తిరిగాడోనని అనుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ కి మజ్లిస్ వార్నింగ్

  మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ చాలా కాలం తరువాత వార్తలలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ మతతత్వ బీజేపీకి, నరేంద్ర మోడీకి మద్దతు తెలపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. నరేంద్ర మోడీ, బీజేపీల గురించి తెలిసి ఉన్నపటికీ పవన్ కళ్యాణ్ పనిగట్టుకొని గుజరాత్ వెళ్లి మోడీని కలవడం, బీజేపీకి మద్దతు తెలపడాన్ని అసదుద్దీన్ ఖండించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మోడీకి, బీజేపీకే మద్దతు ఇచ్చేందుకు సిద్దపడినట్లయితే, హైదరాబాదులో అతని సినిమాలను ఆడనీయమని హెచ్చరించారు. అదేవిధంగా మీడియా కూడా నరేంద్ర మోడీ జపం చేయడాన్ని ఆయన నిరసించారు. అటువంటి మతతత్వవాదికి మీడియా కూడా మద్దతు ఈయడం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.   అసదుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లీస్ పార్టీ కూడా పూర్తిగా మత ప్రాతిపాదికనే, ముస్లిం ఓటు బ్యాంకుని లక్ష్యంగా చేసుకొని ఏర్పడినదే. అటువంటప్పుడు ఆయన బీజేపీని మతతత్వ పార్టీ అని ఎద్దేవా చేయడం హాస్యాస్పదం. అదేవిధంగా కేవలం హైదరాబాద్ కే పరిమితమయి కనీసం ఉప ప్రాంతీయ పార్టీ అని కూడా చెప్పుకోలేని మజ్లిస్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న అసదుద్దీన్ జాతీయ పార్టీ అయిన బీజేపీని, ప్రాంతీయ పార్టీ అయిన జనసేనను విమర్శించడం దేనికంటే కేవలం తాను మాత్రమే బీజేపీని దానిని సమర్ధించే పార్టీలను దైర్యంగా డ్డీ కొట్టి, ముస్లిముల తరపున పోరాడగలనని చెప్పుకొని ముస్లిం ప్రజల ఓట్లు పొందడానికే. మతతత్వ బీజేపీని, దాని ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని బూచిగా ఎత్తిచూపుతూ ముస్లిం ప్రజలలో అభద్రతా భావం కలిగించడం ద్వారా వారి ఓట్లు రాల్చుకోవాలని అసదుద్దీన్ ఆలోచన. కానీ, రాజకీయంగా మంచి చైతన్యవంతులయిన ముస్లిం ప్రజలను ఇటువంటి మాటలతో బయపెట్టి ఓట్లు రాబట్టుకోవాలని అసదుద్దీన్ ప్రయత్నించడం చాలా హాస్యాస్పదం.   ప్రజల నుండి ఓట్లు రాబట్టుకొనేందుకు కేసీఆర్ తెలంగాణా సెంటిమెంట్, కిరణ్ సమైక్య సెంటిమెంటు, జగన్ తండ్రి సెంటిమెంటు వాడుకొంటునట్లే అసదుద్దీన్ ముస్లిం సెంటిమెంట్ వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రయాపడుతున్నారు.

కమలనాథుల గుండెల్లో బాంబు పేల్చిన పవన్

  నిన్న కాక మొన్న వచ్చిన పవన్ కల్యాణ్.. కాకలు తీరిన రాజకీయ నాయకులకు దిమ్మతిరిగేలా చేస్తున్నాడు. ఇంకేముంది, జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి పొత్తు పెట్టుకుంటాయని, దాంతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని నాయకులు ఊహల పల్లకిలో తేలిపోయారు. వాళ్ల ఆశలను ఆదిలోనే పవన్ తుస్సుమనిపించాడు. తన మద్దతు జాతీయ పార్టీకేనని, ఇంకా గట్టిగా మాట్లాడితే కేవలం మోడికి మాత్రమే పరిమితమని బాంబు పేల్చాడు. తనను దగ్గరుండి, చెయ్యి పట్టుకుని మరీ మోడీ దగ్గరకు తీసుకెళ్లిన బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజుకు ఈ మేరకు ఓ లేఖాస్త్రం సంధించారు.   ‘‘టీడీపీతో సహా ఏ ప్రాంతీయ పార్టీకీ మద్దతు ఇవ్వాలని నేను ఈరోజు వరకు నిర్ణయించుకోలేదు. లేనిపోని పుకార్లు వస్తున్న నేపథ్యంలో నేనీ విషయాన్ని స్పష్టం చేస్తున్నా. జనసేన, మోడీ మధ్య సత్సంబంధాలు పెంపొందాలని, అవి మరింత పటిష్టం కావాలని మాత్రమే ఆకాంక్షిస్తున్నా’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.   హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న వీర్రాజుకు ఈ లేఖ అందిన వెంటనే ఆయన పవన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదని తెలిసింది. ఈ లేఖ ఉద్దేశమేమిటో తెలుసుకునేందుకు ఆయన పవన్ సహచరులతో మాట్లాడారు. అయితే, ఇటువంటి వ్యవహారాల్లో తమ ప్రమేయం ఉండదని, నేరుగా పవన్‌నే సంప్రదించి విషయం తెలుసుకోవాలని సూచించారు. దీంతో ఆయన ఈ లేఖను ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేసి, పొత్తు వ్యవహారాలను చూస్తున్న అరుణ్ జైట్లీకి అందజేయాలని కోరినట్టు తెలిసింది.