టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు..

ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీలోకి ప్రతిపక్ష పార్టీ అయినా వైసీపీ నేతలు వరుసగా వలసలు సాగిస్తున్నారు. ఇంకా కొంత మంది నేతలు టీడీపీలోకి రావడానికి యోచిస్తున్నారు అని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుంటూరు జిల్లా మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. కన్నెగంటి హనుమంతు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడిపికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని.. కొద్ది నెలల్లోనే తన ఆధ్వర్యంలో వారు వైసీపీలో చేరుతారని సంచలనమైన వ్యాఖ్య చేశారు. తెలంగాణలో టీడీపీ ఇప్పటికే ఖాళీ అయిపోయిందని.. అందుకే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని భయపడి మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆర్కే చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రిజర్వేషన్ల గొడవ... ఇప్పుడు రాజస్తాన్‌లో

  గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, హర్యానా.... తమ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాలంటూ సాగుతున్న ఉద్యమాలు ఇప్పడు రాజస్తాన్‌ను చేరుకున్నాయి. రాజస్తాన్‌ అనగానే రాజపుత్‌లు గుర్తుకువస్తారు. వారు సుదీర్ఘకాలంగా తమలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆదాయం ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ ప్రశాతంగా సాగుతున్న వారి ఉద్యమం, తమ పక్కనే ఉన్న హర్యానా ప్రజలను చూడగానే ఊపందుకుంది.   ‘హర్యానాలోని జాట్‌లు పోరాడినట్లు హింసాత్మకంగా పోరాడితే రిజర్వేషన్లు దక్కుతాయంటే మేం అలాంటి ఆందోళనలకు వెనుదీయం’ అంటున్నారు రాజ్‌పుత్‌లు. రాజ్‌పుత్‌లకు సంబంధించి కర్ని అనే ఒక సంఘం ఈ విషయం మీద తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తమకు రిజర్వేషన్లను కల్పించే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఈ నెలాఖరు దాకా వీరు వేచి చూస్తారట. ఆ తరువాత నుంచీ దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో జాట్ తరహా ఉద్యమాన్ని ఆరంభిస్తారట!

కన్హయ్యను చంపేస్తా.. పెట్రోల్ బాంబులు విసురుతా..

  జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య ప్రస్తుతం దేశ ద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇప్పటికే ఈకేసులో నిందితులుగా ఉన్న మిగిలిన ఐదుగురు విద్యార్ధులు కూడా అజ్ఞాతం వీడి బయటకు రావడంతో ఏ క్షణంలోనైనా వారిని అరెస్ట్ చేసేఅవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కన్హయ్యను కోర్టులో హాజరుపరిచేప్పుడు అతనిపై దాడి చేసిన లాయర్లను పోలీసులు కస్టడీకితీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా వారు ఎవిధంగా దాడి చేశారో చెబుతుంటే ఆశ్చర్యపోవాల్సిందే. దీనికిసంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. కస్టడీలో ఉన్న ముగ్గురు లాయర్లు విక్రమ్ సింగ్, యశ్ పాల్, ఓం శర్మలుకన్హయ్యను భారత్ మాతాకీ జై అనేదాకా కొట్టామని.. కన్హయ్య ప్యాంట్ తడుపుకునేదాకా కొట్టామని.. కన్హయ్యనే కాదు కోర్టు బయట విలేకరులు,జేఎన్‌యూ ప్రొఫెసర్లను కూడా కొట్టామని అన్నారు.   ఇక లాయర్ యశ్‌పాల్ అయితే తీహార్ జైలులోకి వెళ్లి మరీ కన్హయ్యను చంపేస్తానని.. ఈసారి కోర్టు వస్తే కన్హయ్యపై  పెట్రోల్ బాంబులు విసురుతానని హెచ్చరించారు.

దమ్ముంటే ముంబై రండి.. వర్మ వార్నింగ్..

రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పదమైన కామెంట్లు చేశాడు. రాంగోపాల్ వర్మ వంగవీటి సినిమా తీస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే వర్మకి వార్నింగ్ లు కూడా వచ్చాయి. వర్మతో పాటు వంగవీటి సినిమా కోసం కమ్మ, కాపు...' పాట రాసిన సిరాశ్రీకి బెదిరింపులు వచ్చాయి. అయితే ఇప్పుడు వాటిపై స్పందించిన రాంగోపాల్ వర్మ కొన్ని సంచలనమైన ట్వీట్లు చేశారు. ''నాకు వార్నింగ్ ఇస్తున్న రౌడీలనుకునే ఆకురౌడీలు బావిలో కప్పలని" అన్నారు. అంతేకాదు నేను ముంబైలో ఉంటా దమ్ముంటే ముంబైలో అడుగుపెట్టండి.. లేకపోతే నేను ఈ నెల 26వ తేదీన 11.25కు విజయవాడ వస్తానని టైంతో సహా చెప్తూ.. ఎవరికి భయపడే ప్రసక్తే లేదని అన్నాడు.

ప్రేమ విఫలం కావడంతో బూతుపాట రాశా- శింబు

  తమిళహీరో శింబుకి సినిమా కష్టాలు ఇంకా తీరలేదు. గత ఏడాది బీప్‌ సాంగ్ పేరుతో ఒక బూతుపాటను రాసిన శింబూ, ఆ పాటకి సంగీతాన్ని అందించిన అనిరుధ్‌ల మీద మహిళా సంఘాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే! మహిళలను కించపరిచేలా ప్రవర్తించారంటూ వీరి మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయం చిలికిచిలికి గాలివానగా మారడంతో శింబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కానీ రేపు ఎట్టిపరిస్థితుల్లోనూ కోర్టు ఎదుట కనిపించాలని న్యాయస్థానం ఆదేశాలను ఇవ్వడంతో, శింబు ఇవాళ కోయంబత్తూరు పోలీసుల ముందు లొంగిపోక తప్పలేదు. ఈ సందర్భంగా శింబుని విచారించేందుకు 35 ప్రశ్నలతో ఒక చిట్టాని పోలీసులు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.   శింబు వీటన్నింటికీ ఓపికగా జవాబులు ఇచ్చాడట. శింబు చెప్పినదాని ప్రకారం తాను కొన్నేళ్ల కిందట ఓ ప్రేమ వ్యవహారంలో విఫలం అయిన సందర్భంలో ఈ పాటను రాశాడట. దానికి తనే స్వయంగా సంగీతాన్ని కూడా సమకూర్చుకున్నాడట (ఇందులో అనిరుధ్‌ పాత్ర ఏమీ లేదని చెప్పడం శింబు ఉద్దేశ్యం కాబోలు). తను ఏదో తనకోసం పాటని రాసుకున్నాడే కానీ సినిమాల కోసం కాదని స్పష్టం చేశాడట శింబు. తను వ్యక్తిగతంగా దాచుకున్న ఈ పాట ఇంటర్నెట్లోకి ఎలా ప్రత్యక్షమైందో తెలియదంటూ తెగ ఆశ్చర్యపడిపోయాడట. శింబు మాటలు విన్నవారు కూడా అందులో నిజం ఎంత ఉందా అని ఆశ్చర్యపడక తప్పలేదు.

గేట్లు తెరవండి.. జగన్ కు గుణపాఠం చెప్పండి..

వైకాపా పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు వైకాపాకు చెందిన పలువురు నేతలను టీడీపీలోకి చేర్చుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన టీడీపీ పార్టీ నేతలతో ముచ్చటించారట. వైకాపా పార్టీలోకి చేరాలనుకుంటున్న8 మంది ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి చేర్చుకోవాలని.. పార్టీలోకి వస్తామన్న వారికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా  వారికి గేట్లు తెరవాలని సూచించారట. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతలు మాతో టచ్ లో ఉన్నారు అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం నేర్పుదామని అన్నారంట

బాలివుడ్‌ నటిని అనుమతించని పాకిస్తాన్‌

  అలనాటి మేటి సితార షర్మలా టాగూర్ పాకిస్తాన్‌ అధికారుల చేతిలో కాస్త ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. గతవారం లాహోర్‌లో జరుగుతున్న ఓ సాహిత్యం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన షర్మిల వద్ద తగినన్ని పత్రాలు లేకపోవడంతో తిరిగి ఇండియా వెళ్లేందుకు అక్కడి అధికారులు అనుమతించలేదు. టాగూర్ తాను పాకిస్తాన్‌లో ఉన్నన్ని రోజులకి సంబంధించి ఒక ‘పోలీసు రిపోర్టు’ని కూడా జతచేయవలసి ఉందట. ఆ రిపోర్టు లేకపోవడంతో షర్మిలను వాఘా బోర్డరు వద్దే నిలిపివేశారు. రిపోర్టు వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా దాటిపోవడంతో షర్మిల తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మొత్తానికి షర్మిల పాకిస్తాన్‌లోని శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదన్న రిపోర్టుని చూపించాల్సి వచ్చిందన్నమాట. శాంతిభద్రతలంటే పాకిస్తాన్‌కు ఎంత ఆసక్తో!

ధావన్, హర్భజన్ మధ్య రెజ్లింగ్

  ఆసియా కప్ లో రేపు ఇండియా బంగ్లాదేశ్ తో ఆడుతుంది. ఈరోజు జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో, ఇద్దరు టీం ఇండియా ప్లేయర్లు నువ్వా నేనా అనుకున్నారు. మాటా మాటా పెరిగింది. వెంటనే హ్యాండ్ రెజ్లింగ్ కు దిగారు. పచ్చిక మీదే హోరా హోరీగా తలపడ్డారు. అంతా సరదాకే లెండి. ధావన్, హర్భజన్ ఇద్దరూ కూడా హాస్యప్రియులే. డ్రస్సింగ్ రూం లో సహచరులను ఆటపట్టించడం ఇద్దరికీ చాలా సరదా. లెఫ్ట్ హ్యాండర్ అయిన ధావన్, రైండ్ హ్యాండ్ తో ట్రై చేసి చివరికి ఓడిపోయాడు. ప్రాక్టీస్ సెషన్లో ఇలా సరదాగా హ్యాండ్ రెజ్లింగ్ చేస్తూ కెమేరాకు చిక్కారు. కాగా రేపు బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్ ను టీం ఇండియా తేలిగ్గా తీసుకోవట్లేదు. నెట్స్ లో బౌలర్లు అశ్విన్, హార్థిక్ పాండ్యాలు కూడా భారీ భారీ షాట్స్ ప్రాక్టీస్ చేశారు. బంగ్లాదేశ్ లోని మీర్ పూర్ స్టేడియంలో రేపు రాత్రి 7 గంటలకు మొదటి టి 20 మొదలవనుంది.

మూత్రం పోసినందుకు లక్ష జరిమానా..

మద్యం మత్తులో విమానంలో మూత్ర విసర్జన చేసి లక్ష రూపాయల ఫైన్ కట్టాడు ఓ ప్రయాణికుడు. జిను అబ్రహం అనే వ్యక్తి ఇండియా నుంచి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కాడు. అయితే ప్రయాణంలో ఆయన మద్యం సేవించి బాగా ఊగిపోయాడు. అంతేకాదు తాగేసి సీట్లో నుండి లేచి గలాటా చేస్తుండగా సీట్లోకి వెళ్లి కూర్చోమని సిబ్బంది ఎంత కోరినా పట్టించుకోలేదు. అక్కడితో ఆగకుండా.. విమానం మరో అరగంటలో ల్యాండ్ అవుతుందనగా ప్యాంటు తీసేసి.. విమానం ఫ్లోర్ మీద, సీటు మీద మూత్రం పోసేశాడు. దీంతో అతనిపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనికి సంకెళ్లు వేసి.. సీట్ బెల్టులతో కుర్చీకి కట్టేశారు. తరువాత విమానం ల్యాండ్ అయిన తరువాత అతనిని కోర్టులో హాజరు పరచగా  అతడికి 300 పౌండ్ల జరిమానా విధించింది. దాంతోపాటు పరిహారం కింద మరో 500 పౌండ్లు, ఖర్చుల కింద 185 పౌండ్లు, బాధితుల సర్‌చార్జిగా 30 పౌండ్లు.. అంటే దాదాపు లక్ష రూపాయలు చెల్లించాలని తీర్పు చెప్పారు.   అయితే ఆ ప్రయాణికుడు మాత్రం తాను యాంటీ డిప్రసెంట్ మందులు వాడుతున్నానని, రెండు పెగ్గుల విస్కీ తీసుకున్నానని, ఏం చేశానో తనకు గుర్తులేదని అబ్రహం కోర్టులో చెప్పాడు.

సంజయ్ దత్ కోసం అభిమాని ఫ్రీ ఆఫర్..

  తమ అభిమాన హీరోపై ఉన్న అభిమానాన్ని ఫ్యాన్స్ ఒక్కోరకంగా చూపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అభిమాని కూడా తన అభిమానాన్ని చాటుకోవాలనుకున్నాడు. సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన గడువు ముగియడంతో గురువారం ఉదయం ఎరవాడ జైలు నుంచి విడుదల కానున్నాడు. ఈ సందర్బంగా నూర్ మహ్మదీ హోటల్ యజమాని ఖలీద్ హకీమ్ ఫ్రీ ఓ ఆఫర్ ప్రకటించాడు. సంజయ్ దత్ విడుదలయ్యే రోజు  తమ హోటల్ కు వచ్చే వారికి ప్రత్యేక వంటకం 'చికెన్ సంజూ బాబా' ఉచితంగా వడ్డించనున్నామని.. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకే ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించాడు.   ఖలీద్ హకీమ్ మాట్లాడుతూ తన హోటల్ ను  1986లో ప్రారంభించానని.. దీనికి సంజయ్ దత్ ను ఆహ్వానించానని.. అప్పటినుంచి  తరచుగా తన హోటల్ కు సంజయ్ వస్తుండేవారని వెల్లడించారు.

మరో ఎమ్మెల్యే జగన్ కు షాక్ ఇవ్వనున్నాడా..!

  ఇప్పటికే వైసీపీ అధినేతకు దిమ్మతిరిగిపోయే షాకిస్తూ ఆ పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇంకా ఆ దెబ్బ నుండి కోలుకోకముందే మరో ఎమ్మెల్యే కూడా టీడీపీలోకి మారే యోచనలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. భూమా ఫ్యామిలీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.. ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కూడా టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు టీడీపీ మరో ఎమ్మెల్యేపై దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతే కాదు ఆ ఎమ్మెల్యే కూడా టీడీపీలోకి వెళ్లే అవకాశాలు వున్నట్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇది నిజమా.. లేక రాజకీయ నాటకాలా.. ఇంతకీ టీడీపీలోకి వెళ్లాలనుకునే ఆ ఎమ్మెల్యే ఎవరో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

కేంద్రం నుండి పిలుపు.. ఢిల్లీ బయల్దేరిన సీఎం..

తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ.. జాట్లు చేపట్టిన ఆందోళనలు పదిరోజులకు చేరింది. మరోవైపు జాట్ల ఆందోళనల వలన ప్రభుత్వానికి 34 వేల కోట్లు నష్టంగా చెబుతున్నారు అధికారులు. ఇదిలా ఉండగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో జాట్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించటంపై కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలసిందే. దీనిపై చర్చించేందుకు గాను కేంద్ర కబురు పెట్టడంతో.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, ఇంకా ఇద్దరు మంత్రులతో కలిసి ఢిల్లీ బయల్దేరారు. దీనిలో భాగంగా కమిటీ... ముందుగా హరియాణా ప్రభుత్వ అభిప్రాయాలను సేకరించనున్నట్టు తెలుస్తోంది.

సల్మాన్ ను చంపితే 4 మిలియన్ల డాలర్లు..

  బ్రిటన్ రచయిత సల్మాన్ రష్దీపై ఇరాన్ తన వ్యతిరేకతను చాటుకుంటూనే ఉంది. దీనిలో భాగంగా ఇరాన్ మీడియా గ్రూపు అతనిపై ఓ ఆస్తికర ఆఫర్ ను ప్రకటించింది. దీంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. భారత సంతతికి చెందిన సల్మాన్ రష్దీను చంపితే 4 మిలియన్ల డాలర్లు నజరానా ఇస్తామంటూ ప్రకటించింది. దీనంతటికి కారణం రష్దీ రాసిన ద శటానిక్ వర్సెస్ అనే పుస్తకం కారణం. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని ఇరాన్ సుప్రీం నేత అయాతొల్లా రుహోల్లా ఖొమేని ఫత్వా జారీ చేశారు. దీనిలో భాగంగానే ఆయనను చంపిన వాళ్లకు నజరానా ప్రకటించారు.   కాగా గతంలో ఈయనను చంపినందుకు 2.7 మిలియన్ డాలర్లు నజరానా ప్రకటించిన ఇరాన్.. ఆతరువాత అది 3.3 మిలియన్ డాలర్లకి పెరిగింది. మళ్లీ ఇప్పుడు 4 మిలియన్ల డాలర్లకు పెంచారు.

ఇంకొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటా.. చిరంజీవి

సినీనటుడు, రాజ్యసభసభ్యుడు కె చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన తన ఎంపీ నిధులు రూ.30 లక్షలతో నిర్మించిన మూడు సామాజిక భవనాలను ప్రారంభించారు. అనంతరం.. పేరుపాలెం సౌత్‌లో రూ.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు చిరంజీవి భూమిపూజ చేశారు. అంతేకాదు ‘ప్రధానమంత్రి సాంసద్‌ ఆదర్శ గ్రామ యోజన' పథకం క్రింద మొగల్తూరు మండలం తీరప్రాంత గ్రామమైన పేరుపాలెం సౌత్‌ను చిరంజీవి దత్తత తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటానని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానని  చెప్పారు.

భూమా నాగిరెడ్డి టీడీపీ చేరిక.. చక్రం తిప్పిన బాలకృష్ణ..!

  ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియలు నిన్న టీడీపీలోకి జంప్ అయ్యారు. వీరిద్దరి పార్టీ మార్పుపై పలు అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఆఖరికి టీడీపీలో చేరిపోయారు. అయితే వీరిద్దరూ టీడీపీలోకి అసలు కారణం.. తెరవెనుక ఉన్నది మాత్రం హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొంత కాలంగా భూమా వైసీపీ పార్టీ పైన అధినేత జగన్ పైన చాలా అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కర్నూల్ జిల్లాలో జరిగిన కో ఆపరేటివ్ ఎన్నికల్లో వైసిపికి చుక్కెదురవ్వడంతో భూమాను జగన్ తప్పుపట్టారు. దీంతో భూమా పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కర్నూలులో చాలా కాలం నుండి  భూమా పార్టీ మార్పుపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కీలక పాత్ర పోషించి భూమాను టిడిపిలోకి లాగేందుకు మంతనాలు జరిపారట. బాలకృష్ణతోపాటు లోకశ్ కూడా భూమాతో మంతనాలు జరిపి ఆయన టిడిపి తీర్థం తీసుకునేలా చేశారని రాజకీయ పెద్దలు అనుకుంటున్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

  నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సెంట్రల్ హాలులో ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా కీలక జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పార్టీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఈ బిల్లుతో పాటు రియల్ ఎస్టేట్ బిల్లు, ప్రైవేటు కంపెనీల దివాళా బిల్లు, యాంటీ హైజాకింగ్ బిల్లు, ఎయిర్ క్యారేజీ బిల్లు, ఇన్‌లాండ్ వాటర్‌వేస్ బిల్లు తదితరాలన్నింటిపై చర్చలు జరిపి ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదిలా ఉండగా సమావేశాలు సజావుగా సాగే అవకాశం కనిపించడంలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీలోకి ఆదినారాయణ.. కంటతడి పెట్టిన లక్ష్మీదేవమ్మ..

ఎన్నో హై డ్రామాల మధ్య వైసీపీ నేతలు టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే అందరి సంగతేమో కానీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాత్రం ఎప్పటినుండో టీడీపీ లోకి చేరాలని చూస్తున్నారు. కానీ ఆయన ఎంట్రీకి రామసుబ్బా రెడ్డి నుండి ఆభ్యంతరాలు రావడంతో చంద్రబాబు కూడా లైట్ తీసుకున్నారు. అయితే ఎట్టకేలకు ఇన్ని రోజులకు ఆదినారాయణరెడ్డికి టీడీపీ నుండి గ్రీన్ సిగ్నల్ రావడం.. పార్టీ మారడం జరిగిపోయాయి. అయితే ఆదినారాయణను టీడీపీలోకి చేర్చుకోవడంపై రామసుబ్బా రెడ్డి పెద్దమ్మ లక్ష్మీదేవమ్మ కంటతడి పెట్టారట. తెలుగుదేశం పార్టీ కోసం తమ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, రాజకీయ పోరాటంలో తన భర్తను కోల్పోయానని, మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు చేసిన వారిని ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించడం ఎంతవరకు న్యాయమని చంద్రబాబును నిలదీశారు. దీంతో చంద్రబాబు ఆమెను ఓదారుస్తూ.. ఆదినారాయణ రెడ్డి చేరికను అర్థం చేసుకోవాలని, పార్టీ అభివృద్ధి దృష్ట్యా ఈ చేరిక అవసరమని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయితే ఆఖరికి వారు ఆదినారాయణ రెడ్డి రావడానికి ఒప్పుకున్న ఒకింత అయిష్టంగానే ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి చూద్దాం.. ఎంత వరకూ పార్టీలో మనగలరో..