అప్పుడు విమానాశ్రయం కూడా లేదు.. చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక అభివృద్ధి అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి అయిన ప్రారంభంలో హైదరాబాద్ కు కనీసం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదని.. తాను కొట్లాడి విమానాశ్రయాన్ని తీసుకొచ్చానని తెలిపారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, సమస్యలను సవాల్గా తీసుకొని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే పోర్టులు అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని.. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులను అభివృద్ధి చేస్తాం చెప్పారు. రాష్ట్రంలో 940 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఐదు క్లస్టర్లుగా అబివృద్ధి చేసి అన్ని రేవులను అనుసంధానం చేస్తామన్నారు. తూర్పు ఆసియా దేశాలకు ఏపి గేట్ వేగా తయారవుతుందన్నారు. కాగా ఏపీ రాజధాని గురించి మాట్లాడుతూ ఏపీలో వనరులకు కొదవు లేదని.. అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రోడ్లు నిర్మించాల్సి ఉందని చెప్పారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు చాలా మంది ఉన్నారని తెలిపారు.