శ్రీకాకుళం ప్రజాగర్జనలో చంద్రబాబు ప్రసంగం

  ఈరోజు శ్రీకాకుళంలో తెదేపా నిర్వహించిన ప్రజాగర్జన సభకు ఊహించిన దానికంటే ఎక్కువగా జనం పోటెత్తారు. వారిని చూసి చంద్రబాబు కూడా చాలా ఉత్సహంగా ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఎండగట్టారు. గత పదేళ్ళ యూపీఏ పాలనలో దేశంలో అవినీతి, కుంభకోణాలు, అధిక ధరలు, బీదరికం తప్ప మరేమీ పెరగలేదని ఎద్దేవా చేసారు. ఈ పదేళ్ళ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టిందని, అందువల్ల ఇకపై ఇటలీ దొరసాని సోనియమ్మను, ఆమె నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా బయటకు సాగానంపవలసిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.   తాను తెలంగాణా ఏర్పాటుకి అంగీకరిస్తూ లేఖ ఇవ్వడం నిజమే గానీ, ఇంత అన్యాయంగా విడదీయమని ఎన్నడూ సూచించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసం తెలుగు ప్రజలనే కాక స్వంత పార్టీ నేతలకి కూడా తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నపుడు ఏవిధంగా ఎన్డీయే ప్రభుత్వంతో సత్సంభందాలు నెరుపుతూ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చింది వివరించి, ఇప్పుడు కూడా తెదేపాకే అధికారం ఇస్తే అత్యంత దైన్యస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టి ప్రగతి పధాన్న పయనింపజేస్తానని హామీ ఇచ్చారు.   శ్రీకాకుళానికి చెందిన తెదేపా నేత స్వర్గీయ ఎర్రం నాయుడు సేవలను ప్రజలకు గుర్తు చేసి, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏవిధంగా జిల్లాను, గిరిజనులు నివసించే కన్నెధార కొండను కూడా దోచుకోన్నాడో సవివరంగా తెలియజేస్తూ, సరయిన నాయకుడికి, పార్టీకి ఓటేయడం ఎంత అవసరమో చంద్రబాబు వివరించారు.   ఇక ఈసారి తన ప్రసంగంలో చంద్రబాబు ఒక ఆసక్తికరమయిన కొత్త పధకం ప్రకటించారు. తమిళనాడులో జయలలిత ప్రభుత్వానికి ఎంతో పేరు తెస్తున్న ‘అమ్మ క్యాంటీన్’ లాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రమంతటా యన్టీఆర్ క్యాంటీన్లు ప్రారంబించి అందులో పేదలకు కేవలం రూ.5కే భోజనం పెడతామని ప్రకటించారు.

కల్వకుంట్ల వారు మరీ ఇంత మాటకారులా..అబ్బో..

  పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ప్రకటించినపుడు కేసీఆర్ పై, కేసీఆర్ కుమార్తె కవితపై తీవ్ర విమర్శలు చేసారు. కవిత అధ్యక్షతన నడుస్తున్న తెలంగాణా జాగృతి సంస్థకు విదేశాల నుండి వచ్చిన భారీ విరాళాలకు లెక్క చెప్పగలరా? అని పవన్ ప్రశ్నించారు. సాధారణంగా ఇటువంటి విమర్శలకు కొంచెం సమయం తీసుకొని జవాబుచేప్పే అలవాటున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈసారి కూడా అదే విధంగా కొంచెం సమయం తీసుకొని ఈరోజు తాపీగా జవాబు చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం చాలా మాటకారులేనని మరో మారు ఋజువు చేస్తూ పవన్ కళ్యాణ్ అడిగిన నిధుల గురించి తప్ప మిగిలిన అన్ని విషయాల గురించి కవిత చాలా చక్కగా, నేర్పుగా వేరే విషయాలను ప్రస్తావిస్తూ అసలు సంగతి దాటవేశారు. ఆయన ప్రశ్నకు జవాబు చెప్పడానికి వారం రోజుల సమయం ఎందుకు తీసుకోన్నారంటే, ఈవారం రోజుల్లో పవన్ కళ్యాణ్ తప్పతడులు వేస్తే వాటిని ఉపయోగించుకొని దీటుగా జవాబీయవచ్చునని ఆగేరేమో! అందుకే ఆమె తన విమర్శలలో పవన్ మోడీకి మద్దతు తెలపడం గురించి కూడా ప్రస్తావించారు.   పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు తాను జవాబీయనవసరం లేదని చెపుతూనే ఆయనొక రాజకీయ కమెడియన్ అని, సినిమాలలో ఆయన పంచే వినోదం చూడాలంటే జేబులకు చిల్లు పడుతుందని, కానీ ఈసారి ఆయనే ప్రజలకు ఉచితంగా వినోదింపజేసేందుకు వచ్చారని ఆమె ఎద్దేవా చేసారు. నిరుడు ఎన్నికలలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఆయన సోదరుడు పవన్ స్థాపించిన జనసేన పార్టీ కూడా దానిలాగే మేకప్ & ప్యాకప్ పార్టీ అని విమర్శించారు. పవన్ తనకు గద్దర్ ఇష్టమని చెపుతూ అందుకు పూర్తి విరుద్దంగా మోడీ, చంద్రబాబులకు మద్దతు ఇస్తానని చెప్పడం చూస్తే ఆయనకు సరయిన రాజకీయ అవగాహన లేదని అర్ధమవుతోందని అన్నారు.   దాదాపు అర్ధ గంటసేపు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన ఆమె, ఆయన అడిగిన ఒకే ఒక ప్రశ్న- విదేశాల నుండి అందుకొన్న నిధులకి లెక్కల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించకుండా తన ప్రసంగం ముగించగలగడం కల్వకుంట్ల వారి అనన్యసామాన్యమయిన వాగ్ధాటికి చిన్న మచ్చు తునక మాత్రమే.

మేకప్, ఫ్యాకప్..పవన్ పై కవిత సెటైర్

      జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు మేకప్... ఆ తర్వాత ఫ్యాకప్ చేసే వారి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. రెండువేల తొమ్మిది ఎన్నికల ముందు హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు రంగంలోకి వచ్చారని..ఎన్నికల ముందు మేకప్ ..ఎన్నికల తరువాత ఫ్యాకప్ వాళ్లకు కామన్ అని ఎద్దేవా చేశారు. గద్దర్ అంటే అభిమానం అని చెబుతూనే నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. మరి రేపు విశాఖ సభలో పవన్ కవితకు ఏ సమాధానం ఇస్తారో ? వేచిచూడాలి.

చంద్రబాబు బ్రహ్మాస్త్రం తెరాసకి తగిలినట్లేనా?

  తెదేపా నేతలను తెరాసలోకి వలసలు వచ్చేలా ప్రోత్సహిస్తూ ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేసామని భావిస్తున్న తెరాసకు నిన్న మెహబూబ్ నగర్లో తెలుగుదేశం నిర్వహించిన ప్రజాగర్జన విజయవంతం అవడంతో కంగారు మొదలయింది. అది తెరాస నేత హరీష్ రావు మాటలలో స్పష్టంగా వ్యక్తమయింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ “చంద్రబాబు బీసీలకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇస్తున్నారు. ఆయన ఆ పదవేదో ఆంధ్రాలోనే ఇచ్చుకొని, దైర్యం ఉంటే తెలంగాణాలో పోటీచేసి గెలవగాలరా అని ప్రశ్నిస్తున్నాము. మేము దళిత ముఖ్యమంత్రి హామీపై వెనక్కు తగ్గామని తెదేపా ఒట్టొట్టి ప్రచారం చేస్తోంది. కానీ మేము నేటికీ మా హామీపై వెనక్కు తగ్గలేదు. మాకు ఇక ఆంధ్రా పార్టీల పెత్తనం అవసరం లేదు. ఈ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించి మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తధ్యం,” అని అన్నారు.   చంద్రబాబు చెపుతునట్లు బీసీ ముఖ్యమంత్రి ఐడియా తెరాసపై బ్రహామాస్త్రంలా పనిచేసిందని హరీష్ రావు మాటలే స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఆయన తాము దళిత ముఖ్యమంత్రి హామీపై వెనక్కు పోలేదని చెపుతున్నారు. కానీ మూడు రోజుల క్రితమే తెరాస అధ్యక్షుడు కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిపై తాను హామీ ఇచ్చిన పరిస్థితులు లేవని, తానే ఆ పదవి చెప్పట్టవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. మరి ఇప్పుడు హరీష్ రావు దళిత ముఖ్యమంత్రి హామీపై వెనక్కు తగ్గలేదని చెప్పడానికి అర్ధం తెరాస ఆలోచనలో మళ్ళీ మార్పు వచ్చిందనా లేక తనను పక్కన బెట్టి కొడుకు కేటీర్ ని ముందుకు తీసుకువెళుతున్న కేసీఆర్ ని ఇరుకున పెట్టె ప్రయత్నంలో అన్నమాటనుకోవాలా?   చంద్రబాబుని తెలంగాణాలో పోటీ చేయమనడం, ఆయన ముఖ్యమంత్రి అవుదామనుకొంటున్న ఆంధ్రాలో బీసీని ముఖ్యమంత్రిగా చేయమని హరీష్ రావు డిమాండ్ చేయడం దేనికంటే, బీసీ ముఖ్యమంత్రి అంశంతో తమకు అగ్నిపరీక్ష పెడుతున్న చంద్రబాబుని కూడా అదే విధంగా ఇరుకున పెడదామనే ఆలోచనేతోనే. హరీష్ రావు ఇప్పుడు తెరాసలో ఉన్నారు గనుక ఆ పార్టీని వెనకేసుకు రాక తప్పదు. కానీ రేపు కేసీఆర్ ఆయనను పక్కనబెట్టి తన కొడుకుకి ముఖ్యమంత్రిని చేయబోతున్నట్లు గ్రహిస్తే అప్పుడు ఆయన కూడా తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పై విమర్శలు చేస్తూ, తనకు ఆ పదవి ఆఫర్ చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీలోనో చేరకుండా ఉంటారా?

హరీష్ మీద కాంగ్రెస్ కన్ను!

      కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పోయిన చోటే వెతుక్కునే సిద్ధాంతాన్ని మరచిపోయింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నట్టుంది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఆరిపోయింది. దాంతో ఆ పార్టీలో వున్న వారు తెలుగుదేశం పార్టీలోకి పారిపోతున్నారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన వారితో రోజుకో లిస్టు న్యూస్ పేపర్లలో కనిపిస్తోంది. సీమాంధ్రలో ఎలాగూ ఆరిపోతానని డిసైడైపోయిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో వ్రతం చెడ్డా తెలంగాణలో ఫలం దక్కాలని భావిస్తోంది.   అందుకే తెలంగాణలో ఇతర పార్టీల నుంచి నాయకులను తనలోకి లాక్కునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా తనకు టెంకెజెల్ల కొట్టిన టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ఇప్పటికే తమ పార్టీ అకౌంట్లో వుంది. దీనికి తోడు కొంతమంది కీలక టీఆర్ఎస్ నాయకులను తమ పార్టీలోకి లాక్కుంటే రాజకీయంగా తనకు మరింత ప్లస్ అయ్యే అవకాశం వుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్‌లో అత్యంత కీలకంగా వుండే నాయకుడిని కాంగ్రెస్‌లోకి తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో చాలామంది టీ కాంగ్రెస్ నాయకులు తెరాసలో కీలకంగా వున్న హరీష్ రావు వైపు ఆశగా చూస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హరీష్ రావు తలకిందులుగా తపస్సు చేసినా టీఆర్ఎస్‌లో ఆయన మూడో స్థానంలోనో, నాలుగో స్థానంలో నిలుస్తారు. మొదటి రెండు స్థానాలూ కేసీఆర్, కేటీఆర్ ఆక్రమించేశారు. హరీష్ మొదటి స్థానంలోకి రావడం అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. రాష్ట్ర స్థాయిలో ప్రతి రాజకీయ నాయకుడూ కోరుకునే ముఖ్యమంత్రి పదవి కేసీఆర్‌కే ప్రస్తుతం ఆమడ దూరంలో వుంది. ఆ పదవి హరీష్ రావుకి చేరువ కావడం కలలోమాటగానే వుంది. అయితే తెలంగాణ స్టేట్‌కి ముఖ్యమంత్రి అయ్యే ఆఫర్ ఇచ్చి హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందన్న అభిప్రాయం అనేకమంది టీ కాంగ్రెస్ నేతల్లో వున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ బతికి వుండగా అప్పట్లో హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాలు చేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావులో ‘ముఖ్యమంత్రి’ ఆశలు రేపడం ద్వారా కాంగ్రెస్‌లోకి తేవాలన్న ఆలోచనలు, సమాలోచనలు జరుగుతున్నట్టు సమాచారం.

పవన్ సమావేశానికి మళ్ళీ చిరు అడ్డంకులు

  కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటుంటే, అది గిట్టని ఆయన సోదరుడు చిరంజీవి ముందుగా తన కొడుకు రాం చరణ్ తేజ్ చేత తాను తన తండ్రి పక్షమే వహిస్తున్నాని చెప్పించి అభిమానులను తనవైపు త్రిప్పుకొనే ప్రయత్నం చేసారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ సమావేశం జరిగే ముందురోజున తన సోదరుడు నాగబాబుతో “తాను కూడా అన్నయ్య చిరంజీవి వెంటే నడుస్తున్నాని, అభిమానులు కూడా తమవెంటే వస్తారని ఆశిస్తున్నామంటూ” ఒక మీడియా ప్రకటన కూడా చేయించారు. అంతటితో ఆగకుండా చిరంజీవి స్వయంగా తన అభిమాన సంఘాల నేతలకు పోన్లు చేసి “తమ్ముడు పవన్ సమావేశానికి వెళ్ళవద్దని” కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి ఎంత ప్రయాసపడినప్పటికీ, పవన్ కళ్యాణ్ సమావేశానికి వేలాదిమంది అభిమానులు తరలి వచ్చారు. ఒక్క సీమాంద్రానుండే కాక తెలంగాణా నుండి కూడా చాలా మంది అభిమానులు పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు ప్రకటించారు. కారణం వారు అతని మాటలలో నిజాయితీ ఉందని నమ్మడమే. ఇంత జరిగినా చిరంజీవి మాత్రం తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చేయడం మానుకోలేకపోతున్నారు.   పవన్ వంటి యువకులు రాజకీయాలలోకి వచ్చి పార్టీలు పెట్టడం తాను కూడా స్వాగతిస్తానని తన బస్సు యాత్రలో చెపుతూనే, మళ్ళీ అందరూ కేవలం కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని కోరడం విడ్డూరం. రేపు పవన్ కళ్యాణ్ వైజాగులో తన జనసేన పార్టీ మొట్టమొదటి సమావేశం నిర్వహించబోతుండటంతో చిరంజీవి మళ్ళీ తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ప్రదర్శిస్తూ తన కుమారుడు రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని అతనిచేత హైదరాబాదు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో మెగాభిమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేయిస్తున్నారు.   మొన్న రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ తనకు సరయిన రాజకీయ అవగాహన లేదని అన్నారు. కానీ రేపు సాయంత్రం అభిమానులతో జరుపబోయే సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తారని వార్తలు రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. రేపు సాయంత్రమే బాబాయ్ పవన్ కళ్యాణ్ తన మొదటి రాజకీయ సభను నిర్వహిస్తున్నారని తెలిసి కూడా రామ్ చరణ్ కూడా సరిగ్గా అదే సమయంలో సమాంతరంగా హైదరాబాదులో మరో సమావేశం నిర్వహించడంతో అభిమానులు బాబాయ్-అబ్బాయ్ లలో ఎవరినో ఒకరిని ఎంచుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు.   ఇటువంటి ప్రయత్నాల వలన పవన్ కళ్యాణ్ కి వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, చిరంజీవి ప్రతిష్ట మాత్రం మరింత మసక బారడం ఖాయం.

బీజేపీలోకి సత్తిబాబు అండ్ కో?

      పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై రోజుకో రూమర్ వస్తోంది. ఈసారి పోటీ ఎక్కడోనని రకరకాల ప్రచారం జరగ్గా నేడు ఆయన ఏకంగా పార్టీయే మారిపోతున్నారన్న ప్రచారం చోటు చేసుకుంది. బీజేపీలో చేరుతారని, కుటుంబ ప్యాకేజీలో సీట్ల కోసం బేరసారాలు సాగిస్తున్నారని విజయనగరం జిల్లాలో ఒకటే చర్చ. ఇవన్నీ వదంతులేనని కొంతమంది తేలికగా తీసుకోగా, లోపాయికారీగా ఏదో జరుగుతోందని మరికొంతమంది చెబుతున్నారు. ప్రజాదరణ, అనుచరగణాన్ని కోల్పోయిన బొత్స సత్యనారాయణ పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉంది.   తనతో పాటు పదిహేనేళ్లుగా నడిచిన నాయకులు, కార్యకర్తలు కనీసం పట్టించుకోవడం లేదు. రోజుకొకరు జారిపోతున్నారు. చెప్పాలంటే కాంగ్రెస్ రాజకీయాల్లో ఒంటరైపోతున్నారు. తన కుటుంబానికి చెందిన ప్రజాప్రతినిధులు, మరో ఐదేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి తప్ప మరెవరూ ఆయనతో  ఉన్నట్టు కనిపించడం లేదు.  దీంతో  ఆయన దయనీయ పరిస్థితి  ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్‌పై రకరకాల ఊహాగానాలొస్తున్నాయి. శృంగవరపుకోటలో పోటీ చేస్తారని ఒకసారి, చీపురుపల్లిలో అని మరోసారి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి  అని ఇంకోసారి ప్రచారం జరిగింది. విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారని మరో వాదన వినిపించింది. కానీ ఆయన నోరు విప్పిన పాపన పోలేదు. తన రాజకీయ భవిష్యత్‌పై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో  బీజేపీలో చేరుతున్నారని బొత్సపై కొత్త ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిచ్చాయి. బొత్స సత్యనారాయణ తమ పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్న మాట ఆయన తెలిపారు. కొన్నికారణాల వల్ల సినీ నటుడు మోహన్‌బాబు పార్టీలోకి రాకుండా ఆగిపోయారని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

గుజరాత్‌ అల్లర్లపై మోడీ స్పందన

      గోద్రా అల్లర్లపై గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ స్పందించారు. గుజరాత్‌లో 2002లో జరిగిన మత ఘర్షణలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. బ్రిటన్ కు చెందిన టీవి నిర్మాత, రచయిత ఆండీ మారినో రాసిన 'మోడీ రాజకీయ జీవిత చరిత్ర' పుస్తకంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. గోద్రా అల్లర్లలో తన ప్రమేయం లేకపోయినా..తన ప్రమేయం వున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగిందని మోదీ వాపోయారు. అల్లర్లు జరిగినప్పటి నుండి పన్నెండేళ్ల పాటు తాను అన్ని వైపుల నుండి విమర్శలను ఎదుర్కొన్నానని, అయితే మీడియా తన పని తాను చేసుకోనివ్వాలని, ఎలాంటి ఘర్షణ పెట్టుకోకూడదని తాను ముందే నిర్ణయించుకున్నానని చెప్పారు. అల్లర్ల తర్వాత మోడీ ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవాలని అనుకున్నారని, అయితే పార్టీ, గుజరాత్ ప్రజలు ఒత్తిడి చేయడంతో పదవిలో కొనసాగినట్టు పుస్తకం వెల్లడించింది.

పశ్చిమ టీడీపీలో.. చేరికలతో తంటా

      పశ్చిమగోదావరి జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీలోకి భారీస్థాయిలో వలసలైతే వస్తున్నారు గానీ, నాయకుల చేరికతో పార్టీ బలపడాల్సింది పోయి లేనిపోని కొత్త తలనొప్పులు వస్తున్నాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ముందు వరుసలో నిలబడి టీడీపీ తీర్థం పుచ్చుకోగా, భీమవ రం ఎమ్మెల్యే అంజిబాబు సోమవారం టీడీపీలో చేరారు. నేడో రేపో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి పితాని సత్యనారాయణ కూడా చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.   అయితే, వీరందరినీ సహృదయంతో ఆదరించే స్థానిక నేతలు కరువయ్యారు. పదేళ్లుగా అధికారానికి దూరమైనా పార్టీ జెండాలను మోస్తూ, పార్టీ తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతం చేస్తు న్న తమకు కాకుండా ఇప్పటికిప్పుడు పార్టీలో చేరుతున్న నాయకులకు పెద్దపీట వేస్తూ టికెట్లు కేటాయిస్తే ఊరుకోమని పాత నాయకులు తెగేసి చెబుతున్నారు. కొట్టు సత్యనారాయణ, ఈలి నాని రాకవల్ల ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు వర్గానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పటికీ, జెడ్పీ చైర్మన్ పదవిని ఆశచూపి ఆయనను తాత్కాలికంగా బుజ్జగించారు. భీమవరం సీటును అంజిబాబుకు కేటాయిస్తే గాదిరాజు బాబు, మెంటే పార్థసారథి వర్గాలను బుజ్జగించాల్సి ఉంది. కారుమూరి, పితాని సత్యనారాయణ పార్టీలోకొచ్చి ఆచంట టికెట్ కోరితే ఇప్పటికే అక్కడ పార్టీ కన్వీనర్‌గా కొనసాగుతున్న పెనుగొండ కాలేజి వ్యవస్థాపకుడు గుబ్బల తమ్మయ్య పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. పార్టీ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. వలస నేతలకు వీరతాడు వేయడం మంచి పద్ధతి కాదని, దీనివల్ల పార్టీలో నిస్వార్థంగా పనిచేసే కేడర్ దూరమయ్యే ప్రమాదముందని సీనియర్ కార్యకర్తలు చెబుతున్నారు.

పొన్నాల కుర్చీ క్రింద మంటలు

  తంతే బూర్లె గంపలో పడినట్లు ఎవరూ ఊహించని విధంగా తెలంగాణా పీసీసీ అధ్యక్ష కుర్చీలో పడిన పొన్నాల లక్ష్మయ్యకు అప్పుడే అసమ్మతి మొదలయింది. ఆ కుర్చీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకొన్న జానారెడ్డి, దామోదర, డీ.శ్రీనివాస్, షబ్బీర్ ఆలీ తదితరులు, ఆయన పార్టీని సరిగ్గా ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారని అధిష్టానానికి పిర్యాదులు చేయడంతో, పొన్నాలను వెంటనే డిల్లీ వచ్చి తనను కలవమంటూ దిగ్విజయ్ సింగ్ నుండి సమన్లు జారీ అయిపోయాయి.   ఆయన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టి పదిరోజులయినా ఇంతవరకు టీ-కాంగ్రెస్ నేతలతో సమావేశం ఏర్పాటు చేయలేదని, పార్టీ నేతలను కలుపుకు పోయేందుకు అసలు శ్రద్ధ చూపడం లేదని, తెరాసను డ్డీకొనడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఆయనపై డిల్లీకి పిర్యాదులు వెలువెత్తాయి. పైగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం చేస్తూ పార్టీని బలపరుస్తుంటే, పొన్నాల పార్టీని బలోపేతం చేసేందుకు ఏమాత్రం కృషి చేయకుండా తనకి, తన అనుచరులకు పార్టీ టికెట్స్ దక్కించుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నారని పార్టీలో ఆయన ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తున్నారు.   కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినపటికీ దానిని గట్టిగా ప్రచారం చేసుకోవడంలో విఫలమయిన టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస ఆ క్రెడిట్ ని స్వంతం చేసుకొంటూ గట్టిగా ప్రచారం చేసుకొంటుంటే, తెరాసను గట్టిగా ఎదురించకపోగా, పొన్నాలపై యుద్ధం ప్రకటించడం విశేషం. ఊహించని విధంగా పీసీసీ అధ్యక్ష కుర్చీ దక్కిందని సంతోషిస్తున్న పొన్నాలకు ఊహించని విధంగానే తన కుర్చీ క్రింద పొగలు, మంటలు రావడంతో ఉక్కిరిబిక్కిరవుతూ కాపాడమని డిల్లీకి పరిగెత్తారు.

దుర్గాబాయిని ఓడించిన రాజమండ్రి !

      1952లో జరిగిన తొలి ఎన్నికల్లో రాజమండ్రి ద్విసభ్య సాధారణ లోక్‌సభ స్థానం నుంచి విలక్షణ తీర్పు నమోదైంది. ఈ స్థానం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్ధి ఎన్.రెడ్డి నాయుడు కాంగ్రెస్ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఆయన చేతిలో ఓటమి పాలైనది మరెవరో కాదు... ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశముఖ్ ! అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన కళా వెంకటరావు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన అమలాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘోరపరాజయం పాలయ్యారు. పోలైన ఓట్లలో ఆయనకు 12.5 శాతం మాత్రమే వచ్చాయి.   రాజమండ్రి నుంచి పోటీచేసిన సోషలిస్టు నేత, స్వాతంత్య్ర సమరయోధులు మద్దూరి అన్నపూర్ణయ్య కూడా కమ్యూనిస్టు అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అంతేకాక మూడోస్థానంలో నిలిచారు. అలాగే రామచంద్రపురం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మల్లిపూడి పళ్లంరాజు ( కేంద్రమంత్రి పళ్లంరాజు తాత) ప్రజాపార్టీ అభ్యర్థి చేతిలో ఓడారు. ఆశ్చర్యం ఏమిటంటే స్వాతంత్య్రం తెచ్చానని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల్లో మూడు లోక్‌సభ స్థానాల్లోనూ ఓటమి పాలైంది.

దటీజ్ వెంకయ్య

  రాష్ట్రంలో సొంతంగా బలపడటంపై బీజేపీ వ్యూహం రచిస్తోంది. పలువురు ప్రముఖులు, నాయకులను కమలం దిశగా నడిపించడంలో పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నరు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ అంటూ.. ఆయనతో పలువురికి భేటీలు ఏర్పాటుచేయిస్తూ ఆకర్షిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు, తెలుగుదేశం పక్షాన ఉన్న ప్రముఖులను, తటస్థులనూ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది. 2012 డిసెంబర్‌లో తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ హీరో బాలకృష్ణకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అందుకు బాలయ్య కూడా సరే అన్నారు. కానీ వెళ్లొద్దని చంద్రబాబు చెప్పడంతో బాలయ్య వెనక్కి తగ్గారని అప్పట్లో వార్తలు వచ్చాయి. గత ఏడాది ఆగస్టులో మోడీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయనను కలిసిన కొద్దిమంది సినీ ప్రముఖుల్లో బాలకృష్ణ కూడా ఒకరు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని తమ పార్టీలో చేర్చుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. తాజాగా హరికృష్ణపైనా 'కమలం' కన్ను పడినట్లు తెలుస్తోంది.   "విభజనను వ్యతిరేకించడంలో హరికృష్ణ నిజాయితీగా వ్యవహరించారు. ఆయన ఒక్కరే రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నారు'' అంటూ వెంకయ్యనాయుడు తరచూ ప్రశంసలు కురిపిస్తుండటం గమనార్హం. ఇక... మోడీని పవన్ కల్యాణ్, నాగార్జున కలవడం (కలిసేలా చేయడం) వెనుక కూడా సీమాంధ్రలో సొంతంగా బలపడాలనే ఎజెండా ఉన్నట్లు తెలుస్తోంది. వెంకయ్య నాయుడి ఆహ్వానం మేరకే మోడీని కలిసినట్లు నాగార్జున స్వయంగా అంగీకరించారు. బుధవారం నాడు మోహన్ బాబు కూడా మోడీని కలుస్తున్నారు. ఆయనను కూడా వెంకయ్యే తెరమీదకు తీసుకొస్తున్నట్లు సమాచారం.

కూకట్ పల్లి బరిలో సూరీడు?

  తెల్ల జుట్టు.. నల్లటి మీసాలతో వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎప్పుడూ వెనకే ఉంటూ పాదయాత్ర సమయంలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన వ్యక్తి సూరీడు. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా ఓ పదవి సృష్టించి మరీ సూరీడిని అందులో కూర్చోబెట్టారు. వైఎస్ ఉన్నన్నాళ్లూ సూరీడికి రాజభోగాలే. అలాంటిది, హెలికాప్టర్ ప్రమాదం తర్వాత అసలు సూరీడు ఏమైపోయారో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. అలాంటిది ఆ పేరు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వస్తోంది. సూరీడుకు అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించేందుకు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చక్రం తిప్పుతున్నారు. కూకట్పల్లి కాంగ్రెస్ టిక్కెట్ సూరీడుకు ఇప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ను సూరీడు కలిసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, తెలంగాణా పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడం వెనుక కూడా కేవీపీ హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ-పీసీసీ అధ్యక్ష పదవికి ముందుగా జానారెడ్డి పేరు బలంగా వినిపించింది. అయితే ఆఖరి నిమిషంలో ఆయనకు మొండిచేయి చూపారు. ఊహించని విధంగా పొన్నాల తెరపైకి వచ్చారు. ఈ తతంగం వెనకాల కూడా కేవీపీ మంత్రాంగం ఉందని అంటున్నారు.

తన్నుకున్న కొత్త.. పాత తమ్ముళ్లు

  నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో పాతకాపులు, వలస నేతల మధ్య ఏకంగా దాడులే జరుగుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. నువ్వెంతంటే.. నువ్వెంతంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నాయి. వలస నేతల రాకను ఆహ్వానిస్తున్నట్లు నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని గాంభీర్యాన్ని ప్రదర్శించినా కార్యకర్తలు దీనిని జీర్ణించుకోలేకున్నారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గీయుడు కైలాసం ఆదిశేషారెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి సతీమణి కైలాసం సుప్రియ కొత్తూరు-2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానానికి సోమిరెడ్డి వర్గీయుడైన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మునగాల రంగారావు భార్య మునగాల సుజాత కూడా నామినేషన్ వేశారు. వీరిలో బీ ఫారం ఎవరికి ఇవ్వాలన్న విషయమై రెండు వర్గాల మధ్య గొడవ కాస్త ఎక్కువగానే జరిగింది. ఎన్నికల అధికారి వద్ద ఒకరికొకరు ఎదురు పడిన ఇరువర్గాలు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో రెచ్చిపోయారు. దూషణల పర్వానికి దిగారు. మీరెంత అంటే మీరెంత అంటూ దుర్భాషలాడుకున్నారు. మరింత రెచ్చిపోయిన ఇరువర్గాల వారు తోపులాటకు దిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. సై అంటే సై అంటూ సవాల్ విసురుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్సై నాగేశ్వరరావు పోలీసు బలగాలతో అక్కడి చేరుకున్నారు. సోమిరెడ్డి, ఆదాల వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితి అదుపులోకి వచ్చింది. చివరకు పాతకాపైన సోమిరెడ్డి వర్గీయుడు రంగారావును కాదని కాదని ఆదాల వర్గీయుడైన ఆదిశేషారెడ్డి వర్గానికే టీడీపీ బీఫాం ఇచ్చారు.

ఏపీపీఎస్సీ సభ్యుడా.. జగన్ పార్టీ కార్యకర్తా?

  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కొందరు ఉద్యోగాలు అమ్ముకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పుడే దాని పరువు గంగలో కలిసిపోయింది. అదొక రాజకీయ పునరావాస శిబిరంగా మారిపోయింది. ఇప్పుడు అదే విషయం మరోసారి రుజువైంది. కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక ఎన్నికల సమరంలో ఏపీపీఎస్సీ సభ్యుడు డాక్టర్ ఎస్ఎండీ నౌమాన్ వైసీపీ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతుగా నౌమాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనను ఏపీపీఎస్‌సీ సభ్యుడిగా నియమించారు. కాంగ్రెస్‌లో ఉన్న శిల్పామోహన్‌రెడ్డి టీడీపీ గూటికి చేరారు. శిల్పాతో విభేదాల కారణంగా నౌమాన్ రెండు వారాల క్రితం హైదరాబాద్‌లో జగన్‌తో కలిశారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు అత్యధికంగా ఉన్న పాతబస్తీలో ప్రచారానికి వైసీపీ నాయకులు నౌమాన్‌ను రంగంలోకి దించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన సాగుతున్నా ఏపీపీఎస్‌సీ పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీ తరపున ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది.

రాహులయ్యా.. జరా భద్రమయ్యా!

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవరకూ కూడా ఆగేట్టులేడు. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా ప్రధాని పీఠం ఎక్కి కూర్చోవాలని ఆరాటపడిపోతున్నాడు. అందుకు అర్జెంటుగా ప్రజలకు చేరువయిపోవడం ఒక్కటే మార్గమని భావించి బారికేడ్లు దూకేసి మరీ జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. జనాలకి చేరువ కావడం అంటే ఫిజికల్‌గా వాళ్ళ దగ్గరకి వెళ్ళడం అని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడేమో. అందుకే జనం మధ్యలోకి దూరిపోతున్నాడు. జనానికి దగ్గర కావడం అంటే వాళ్ళ మనసులకు నచ్చడం అనే విషయాన్ని రాహుల్ గాంధీ ఎప్పటికి అర్థం చేసుకుంటాడో ఏంటో.   మొన్నీమధ్య ఓ ఎన్నికల మీటింగ్‌కి వెళ్ళిన రాహుల్ బారికేడ్లు దూకేసి అడ్డదారిలో ప్రజల దగ్గరకి వెళ్ళాడు. రాహుల్ గాంధీ ఇలా చెప్పాపెట్టకుండా చేస్తున్న సాహసాలకు సెక్యూరిటీ సిబ్బంది బిత్తరపోయి హడావిడి పడిపోతున్నారు. అసలే రాహుల్ గాంధీ “నాకు ప్రాణభయం వుంది దేవుడో.. మా నాయనమ్మ, మా నాన్నలాగా నా ప్రాణాలకు గ్యారంటీ లేదని” చెబుతూ వుంటాడు. మరోపక్క ఇలాంటి సాహసాలు కూడా చేస్తూ వుంటాడు. ఇది సెక్యూరిటీ సిబ్బందికి లేనిపోని తలనొప్పులను తెచ్చిపెడుతోంది. 1991లో రాజీవ్ గాంధీ కూడా ఇలాగే అతి చొరవ చూపించి జనాల్లో కలిసిపోవడం వల్ల ఎంత అనర్థం జరిగిందో తెలిసిందే.   అందువల్ల రాహుల్ గాంధీ కాస్త జాగ్రత్తగా వుంటే బెటర్. ఈసారి ఎన్నికలలో కాకపోతే వయసు వుంది కాబట్టి ఆపైసారో మరోసారో ఎన్నికలలో పోటీ చేసి గెలవగలిగితే ప్రధానమంత్రి అయినా అవ్వొచ్చును. ఈసారికి మాత్రం నరేంద్రమోడీ పుణ్యమా అని తనకు ప్రధాని కుర్చీలో కూర్చొనే భాగ్యం దక్కదని గ్రహించినా రాహుల్ గాంధీకి ఆ తహతహ మాత్రం తగ్గట్లేదు పాపం. అందుకే రిస్క్ తీసుకొని బారికేడ్లు దూకేస్తున్నారుట. కానీ రాహుల్ గాంధీ లేనిపోని సాహసాలు చేయకుండా, కొంచెం జాగ్రత్తగా మసులుకొంటే మంచిదని ఆయన్ని అభిమానించేవారు, అభిమానించని వారు కూడా అనుకుంటున్నారుట! అంటే బ్రతికుంటే బలిసాకు తినయినా బ్రతకొచ్చని వారి అభిప్రాయమో..ఏమో...

కేసిఆర్ కు మోత్కుపల్లి సవాల్

      తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు సవాల్ విసిరారు. కేసిఆర్ మల్కాజ్ గిరి లోక్ సభకు పోటీ చేస్తే ఆయనపై పోటీ చేయడానికి సిద్దంగా వున్నానని తెలిపారు. మల్కాజిగిరి నుండి కెసిఆర్ బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయని.. అది నిజమా లేక లీకులా అన్నారు. ఆయన పోటీ చేసేది నిజమైతే.. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వం దక్కలేదని అసంతృప్తిగా ఉన్న మోత్కుపల్లి తాజాగా మళ్లీ లైన్ లోకి వచ్చాడని చెప్పాలి. అయితే ఈ స్థానం నుండి టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

చిరంజీవి అండ్ ట్రూప్ వారి ఉత్తర కుమార ప్రగల్భాలు

  చిరంజీవి వెండి తెర మీద ఆడిపాడితే అదొక రకమయిన వినోదం. అదే కాంగ్రెస్ కండువా కప్పుకొని బస్సుయాత్ర చేస్తూ ప్రజల ముందు పంచ్ లేని డైలాగ్స్ కొడితే అది మరొక రకమయిన కామెడీ. రెండూ వినోదం పంచేవే. మొదటి దానికి ప్రజలు డబ్బు చెల్లిస్తే, రెండో దానికి కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తోంది! చిరంజీవి అండ్ కో ట్రూప్ నెల్లూరు చేరుకొంది. యధాప్రకారం స్టేజి మీద ఉన్నంత మంది క్రిందన లేకపోయినా నిరుత్సాహపడకుండా ఇది రోడ్ షో కాదు, కార్యకర్తల సమావేశమని అందరికీ సర్దిచెప్పుకొని తన ప్రోగ్రాం షురూ చేసేసారు మెగా జీవిగారు.   ముందుగా సీమాంద్రాను సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబును ఎంచుకొని, మరి తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నపుడు ఎందుకు చేయలేదని ‘లా పాయింటు’ లేవనెత్తారు. కానీ తన పక్కనున్న ‘రఘువీరుడు’ అంతక్రితం జరిగిన సమావేశంలోనే “గత అరవై ఏళ్లుగా తమ కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని వచ్చే పదేళ్ళలో చేసేస్తామని” చెప్పిన సంగతి మరిచిపోయారు. అటువంటప్పుడు కేవలం తొమ్మిదేళ్ళే పాలించిన చంద్రబాబు ఏదో ప్రజలను వినోదింపజేయడానికి సింగపూరు పిక్చరు వేసి చూపిస్తే తప్పేమిటి? అని గుప్పెడు ప్రేక్షకుల ప్రశ్న.   అసెంబ్లీలో నోరే విప్పని చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధి అంటారేమిటి? అని మరో ధర్మ సందేహం వ్యక్తం చేసాడు ఆ మెగాజీవి. నిజమే! చంద్రబాబు నోరు మెదపలేదు. సరే! కానీ రాష్ట్ర విభజనకు వ్యతిరేఖిస్తూ రాజీనామా కూడా చేసిన ఈ మెగాజీవి హైదరాబాదుని యూటీ ఎందుకు చేయమన్నట్లు? విభజన బిల్లుకి మద్దతు ఎందుకు ఇచ్చినట్లు? మరక మంచిదే అని ఏదో బట్టలసబ్బుల ప్రకటనలాగ విభజన మంచిదేనని ఇప్పుడు ఎందుకు వితండ వాదం చేస్తున్నట్లు? నేటికీ కేంద్రమంత్రి పదవిలో ఎందుకు కంటిన్యూ అయిపోతున్నట్లు? అని ప్రజలకు కూడా అనేక ధర్మసందేహాలు కలుగుతున్నాయి.   ఇక మెగాజీవి గారు జగన్ జైల్లో ఉన్నపుడే వైకాపా పరిస్థితి బాగా ఉందని వెటకారం చేసారు. కానీ తను బయట ఉండి కూడా ప్రజారాజ్యం పార్టీని  గట్టిగా రెండేళ్ళు నడపలేక చేతులెత్తేసి, కాంగ్రెస్ హస్తంలో పార్టీని పెట్టేసి కేంద్రమంత్రి పదవితో పునీతులయిన సంగతి మరిచిపోయి, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి కూడా పార్టీని బాగా నడపగలిగారని అంగీకరించడం చాలా గొప్ప విషయమే.   ఇక చంద్రబాబు రండి బాబు రండి అని పిలుస్తుంటే... జగన్ బాబు నిధులు తెండి బాబు తెండి అని అంటున్నారని ఎద్దేవా చేశారు. నిజమే..ఎవరి బాధలు వారివి. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేవారు లేకనే కదా.. ఇప్పుడు ఈ కాంగ్రెస్ జీవులన్నీ ఏసీ బస్సేసుకొని రోడ్డున పడవలసి వచ్చింది. జనాల మాట దేవుడెరుగు కనీసం తమ గోడు వినేందుకు పదిమంది కార్యకర్తలు వచ్చినా చాలని వారు ఆరాటపడటం లేదా? కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు చుట్టూ జనాలు తిరిగే పరిస్థితి నుండి జనాల చుట్టూ కాంగ్రెస్ నేతలు తిరిగే దుస్థితికి అద్దం పడుతూ సాగుతున్న ఈ బస్సుయాత్రలో కూడా మరి ఈ ఉత్తరకుమార ప్రగల్భాలు ఎందుకు?   విజయనగరంలో ఆయనతో బస్సెక్కిన బొత్స వారు అక్కడే దిగిపోవడమే కాకుండా త్వరలోనే వేరే బస్సేక్కేందుకు బ్యాగులు సర్దుకొంటున్నట్లు తాజా వార్త. అదే నిజమయితే ఆయన పేరును కూడా కాంగ్రెస్ ద్రోహుల జాబితాలో చేర్చి వారందరి గోత్రానామాలతో పాటు బొత్స పేరును కూడా తరువాత స్టేజి నుండి స్మరించు కొంటారేమో.. అందువల్ల కనీసం బస్సులో ఉన్నవారయినా యాత్ర పూర్తయ్యేలోగా మధ్యలో ఎక్కడా దిగిపోకుండా కాపాడుకోగలిగితే అదే పదివేలు. అలాకాదని బ్లడ్డ్ బ్యాంకులున్నాయి కదా అని పదే పదే కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తానని అంటే జనాలు నవ్విపోతారు చిరంజీవి గారు.