phone tapping

సుప్రీంను ఆశ్రయించిన సర్వీసు ప్రొవైడర్లు

  ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విజయవాడ కోర్టులో వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వాదనలో సర్వీసు ప్రొవైడర్లు పలు వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎలాంటి కాల్ డేటా ఇవ్వద్దని.. మెమో ఫైల్ చేసిందని, డేటా ఇస్తే ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించిందని చెప్పారు. అంతేకాక ఇదే విషయంపై ఎటూ తేల్చుకోలేని సర్వీసు ప్రొవైడర్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారం నిఘా సంస్థల దగ్గర ఉంటుంది కానీ సర్వీసు ప్రొవైడర్ల దగ్గర ఉండదని.. కాబట్టి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని వారికి లేఖ రాసింది. ఇదే విషయాన్ని సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు తెలిపారు. కానీ కోర్టు దానిని తీవ్రంగా ఖండించి.. పాలనా వ్యవహారాలు వేరు, కోర్టులు వేరని.. కాల్ డేటా ఇచ్చి తీరాల్సిందే అని తేల్చి చెప్పింది.   అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సర్వీసు ప్రొవైడర్లు విజయవాడ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. దీనిలో భాగంగానే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ నెల 24వ తేదీలోగా కాల్ డేటా ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించడంతో ఆ గడువు సమీపిస్తుంది కాబట్టి సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

bjp subramanian swamy

రాహుల్ గాంధీ డ్రగ్స్ తో పట్టుబడ్డాడు.. సుబ్రహ్మణ్య స్వామి

  లలిత్ మోదీ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. లలిత్ మోదీ విదేశీ వ్యవహారంతో సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకి సంబంధం ఉన్న నేపథ్యంలో ఇద్దరి పై చర్యలు తీసుకోవాలని వివాదం చేస్తుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ లలిత్ మోడీ వివాదంలో విమర్శలు చేస్తున్ననేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించి వారికి ఘాటుగా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీ మొదట తమ గురించి చూసుకోవాలని విమర్శించారు. అంతేకాక గతంలో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో డ్రగ్స్ తో ఉండగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) అధికారులు పట్టుకున్నారని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. అప్పుడు సోనియాగాంధీ అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయ్ ను వేడుకోవడంతో ఆయన కల్పించుకొని నాటి అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్‌కు స్వయంగా ఫోన్ చేసి రాహుల్ ను విడిపించారని షాకింగ్ ఆరోపణ చేశారు.   అందుకే కాంగ్రెస్ పార్టీ తమ పార్టీని, పార్టీలో ఉన్న నేతలని విమర్శించే ముందు తమ గురించి ఆలోచించుకోవాలని సూచించారు. అంతేకాక వసుంధరా రాజేకు ఎవరు మద్దతూ అవసరం లేదని.. ఆమె ధైర్యంగా ఈ వివాదం నుండి బయటపడగలదని అన్నారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా ఈ విషయంపై రచ్చ జరుగుతుంది.

talasani srinivas yadav

తలసాని తగ్గవయ్యా

  రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాపైనే చర్చలు జరుగుతున్నాయి. అసలు తలసాని రాజీనామా చేశాడా? చేయకుండా డ్రామా ఆడాడా? ఒకవేళ చేస్తే ఎందుకు ఆమోదించలేదు? అనే ప్రశ్నలు క్యూ కడుతున్నాయి. కానీ తాను మాత్రం 2014 డిసెంబర్ 16న ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజీనామా చేశానని.. రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకొని మరీ తిరుగుతున్నానని చెప్పుకొస్తున్నారు. అంటే తాను రాజీనామా చేసినా ఇప్పటి వరకు రాజీనామా ఎందుకు ఆమోదం పొందలేదు.. స్పీకర్ ఎందుకు తలసాని రాజీనామాను ఆమోదించలేదు.. అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో తప్పు స్పీకర్ దా! అలాంటి అనుమానాలే తలెత్తుతున్నాయి. కానీ ఒకసారి స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇస్తే స్పీకర్‌ దానిని తన జేబులో ఉంచుకోరు. వెంటనే సంబంధిత సెక్షన్‌కు పంపిస్తారు. కానీ అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి మాత్రం తమకు తలసాని రాజీనామా చేరలేదని ఈ నెల 8వ తేదీన కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డికి లికిత పూర్వకంగా తెలియజేసారు. అంటే తలసాని రాజీనామా లేఖ ఇవ్వకుండా ఇచ్చానని చెప్పినట్టు అర్ధమవుతోంది.   ఒకవైపు రాజీనామా చేశాడో లేదో తెలియని నేపథ్యంలో ఉంటే తలసాని మాటలు మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. ప్రతిపక్షనేతల మీద సవాళ్లమీద సవాళ్లు విసురుతున్నారు. రోజూ ఉదయం లేచిన దగ్గరనుండి తన పేరే జపం చేస్తున్నారని.. రోజూ నాకు పూజ చేయండంటూ విమర్శించారు. రాజకీయాలు పక్కన పెట్టి, నాలుగు రోజులు తనది కాదనుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని.. తన గురించి మాట్లాడితే అందరి చిట్టా విప్పుతానని.. తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని, ఎవరు వస్తారో రండని సవాళ్లు విసురుతూ ప్రగల్భాలు పలికారు. దీంతో రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్న తలసాని ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగ్గిస్తే మంచిదని.. దాని బదులు రాజీనామా ఆమోదించుకుని ఎన్ని ప్రగల్భాలు పలికినా బావుంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.     మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ రాజీనామా పై తెలంగాణ తెదేపా నేతలు నిన్ననే గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈరోజు తలసానిని తెలంగాణ మంత్రి వర్గం నుంచి తొలగించాలని కోరేందుకు టీడీపీ నేతలు ఈ స్పీకర్ నివాసానికి వెళ్లారు. కానీ వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్పీకర్ ఇంటి ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా టీడీపీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తలసాని రాజీనామా చేసి 6 నెలలు అవుతున్నా స్పీకర్ ఎందుకు ఆమోదం తెలపలేదని.. తలసాని తెలంగాణ ప్రభుత్వం కలిసి నాటకాలు ఆడుతున్నారని.. ఇక ఏ ఎన్నికల్లో తలసాని పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. ఒకవేల తలసాని రాజీనామా చేసి రాబోయే ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. మరి ఈ సవాళ్ల పర్వంలో ఎవరు నెగ్గుతారో చూడాలి.

ram gopal varma

పుష్కరాలపై మరోసారి వర్మ వివాదాస్పదవ్యాఖ్యలు

  ఎవరో ఒకరిని ఏదో ఒకటి అని.. విమర్శించనిదే మన విమర్శలవర్మ అదే రాంగోపాల్ వర్మకి నిద్ర పట్టదేమో. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విమర్శలు చేస్తూ నలుగురి నోళ్లలో నానితే కాని అయ్యగారికి బావుండదేమో. అందరూ అయిపోయారు ఇప్పుడు అయ్యగారికి పుష్కరాలు గుర్తొచ్చిన్నట్టున్నాయి. మొన్నీమధ్యనే గోదావరి మహా పుష్కరాలకు సంబంధించి జరిగిన తొక్కిసలాట గురించి దేవుడే భక్తులను కాపాడలేకపోయాడు.. పాపం చంద్రబాబు మాత్రం ఏం చేయగలడు అంటూ ట్వీట్స్ చేశారు. చనిపోయిన భక్తులు తక్కువ ప్రార్ధించారేమో అందుకే దేవుడు కాపాడలేదేమో అంటూ దేవుడిని సైతం తన విమర్శలకు బలి చేశాడు. ఇప్పుడు మళ్లీ పుష్కరాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.   "అభివృద్ధి చెందిన దేశాలన్నీతమ నదుల్నిశుభ్రంగా ఉంచుకొని మరింత అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మన దేశంలో మాత్రం పుష్కారాల పేరుతో నదుల్ని కలుషితం చేస్తున్నారు" అని వర్మ తన తాజాగా ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రజలు మండిపడుతున్నారు.  

ap high court

హైకోర్టు విభజన కుదరదు..

  రాష్ట్ర విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రా ప్రభుత్వానికి ఏదో విషయంపైన వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో అన్ని శాఖలలో దాదాపు విభజన జరిగిన కొన్ని అంశాలమీద ఇంకా ఇరు రాష్ట్రాలు గొడవ పడుతూనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా హైకోర్టు విభజన వివాదం. ఇటు తెలంగాణ రాష్ట్రానికి, అటు ఆంధ్రా రాష్టానికి ఉమ్మడిగా హైకోర్టు విభజనపై ఎప్పటినుంచో మల్లగుల్లాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టును విభజించి తీరాల్సిందే అని పట్టుబడుతుంది. దీనికి అప్పట్లో హైకోర్టు కూడా తెలంగాణ వాదులకు ఘాటుగానే సమాధానమిచ్చింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటయ్యేంత వరకు విభజించేది లేదని.. ఈ హైకోర్టు బాధ్యతను కేంద్రం పై పెడుతూ.. హైకోర్టు నిర్మాణానికి కావలసిన అనువైన స్థలాన్ని కేంద్రమే చూడాలని.. దానికి అయ్యే వ్యయాన్ని కూడా కేంద్రమే పెట్టుకోవాలని ఆదేశించింది.   అయితే ఇప్పుడు మళ్లీ ఈ విషయంపై ఉమ్మడి హైకోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్ర విభజన జరిగి సంవత్సరం గడిచినా న్యాయస్థాన విభజన ఇంకా జరగలేదని.. కింది స్థాయి న్యాయాధికారులను, కోర్టు సిబ్బందిని విభజించాలని కోరుతూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజించడం ఇప్పుడు కుదరదు చెప్పింది. ‘ఉమ్మడి హైకోర్టును విభజించడం కాదు... ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటు చేయాలి’ అని తేల్చిచెప్పింది. హైకోర్టు విభజన జరగకుండా కింది స్థాయి న్యాయాధికారులను విభజించడం సరికాదని.. ముందు చట్ట ప్రకారం హైకోర్టు విభజన జరగాలని.. ఆ తరువాత న్యాయాధికారులను విభజించడం జరుగుతుందని సూచించారు. ముఖ్యంగా ఏపీ హైకోర్టు నిర్మాణంపై కేంద్రం చొరవ తీసుకోవాలని.. గతంలో సూచించినట్టు ఏపీ హైకోర్టు భవన నిర్మాణానికి ఇంతవరకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎప్పుడు కేటాయించారో చెప్పాలని.. దీనికి సంబంధించి కౌంటర్ ను ఈ నెల 30లోగా దాఖలు చేయాలని ఆదేశించింది.

chandrababu naidu

అప్పుడు విమానాశ్రయం కూడా లేదు.. చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక అభివృద్ధి అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి అయిన ప్రారంభంలో హైదరాబాద్ కు కనీసం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదని.. తాను కొట్లాడి విమానాశ్రయాన్ని తీసుకొచ్చానని తెలిపారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, సమస్యలను సవాల్‌గా తీసుకొని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే పోర్టులు అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని.. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులను అభివృద్ధి చేస్తాం చెప్పారు. రాష్ట్రంలో 940 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఐదు క్లస్టర్లుగా అబివృద్ధి చేసి అన్ని రేవులను అనుసంధానం చేస్తామన్నారు. తూర్పు ఆసియా దేశాలకు ఏపి గేట్ వేగా తయారవుతుందన్నారు. కాగా ఏపీ రాజధాని గురించి మాట్లాడుతూ ఏపీలో వనరులకు కొదవు లేదని.. అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రోడ్లు నిర్మించాల్సి ఉందని చెప్పారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు చాలా మంది ఉన్నారని తెలిపారు.

talasani srinivas yadav

రోజూ నాకు పూజ చేయండి.. తలసాని

    *రాజీనామా చేశా *నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్ట *తలసాని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి   తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిగ్ గా నడుస్తుంది. ఒక పక్క తలసాని నేను రాజీనామా చేశానని చెప్పుతున్నారు. కానీ రాజీనామా లేఖ ఇంతవరకూ రాలేదని డిప్యూటీ సెక్రటరీ-పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ చెప్పారు. తలసాని రాజీనామా కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరెడ్డి సమాచార హక్కు చట్టం కింద అసెంబ్లీ సచివాలయానికి దరఖాస్తు చేయగా వాళ్లు రాజీనామా లేఖ రాలేదని చెప్పడంతో నిజం బయట పడింది. దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలందరూ తలసాని మీద గుర్రుమంటున్నారు. అటు తలసానితో పాటు కేసీఆర్ ను కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. తలసానితో పాటు కేసీఆర్ కు, గవర్నర్ కు కూడా సంబంధం ఉందని.. వీరు ముగ్గురు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆరోపించారు.   ఈ నేపథ్యంలో తన రాజీనామా పై వస్తున్న విమర్శలకు తలసాని స్పందిస్తూ ఘాటుగా స్పందించారు. 2014 డిసెంబర్ 16న తాను ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజీనామా చేశానని.. ఇప్పటికీ రాజీనామా లేఖను కూడా జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని అన్నారు. ప్రతిపక్షనేతలకు ఏం పనిలేదని.. పొద్దున లేచిన దగ్గరనుండి నా పేరుతో జపం చేస్తున్నారని.. అంతకంటే తన చుట్టూ తిరిగి పూజలు చేసుకోండని విమర్శించారు. రాబోయే ఉప ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఎవరు పోటీకి వస్తారో రండని సవాల్ విసిరారు. పదవులు తనకు కొత్తేమి కాదని.. రాజకీయాలు పక్కన పెట్టి, నాలుగు రోజులు తనది కాదనుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని హెచ్చరించారు. ‘‘అనవసరంగా నా జోలికొస్తే మీ బండారం బయటపెడతా, ఎవరినీ వదిలిపెట్ట’’ అని హెచ్చరించారు.   మరోవైపు తలసాని రాజీడ్రామా పై చర్చించేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మంత్రి తలసాని వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తలసాని టీడీపీ పార్టీనుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆతరువాత పార్టీ మారి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ లో మంత్రిగా కొనసాగుతున్నారని.. ఇది చట్ట విరుద్దమని తెలిపారు. తన పదవికి రాజీనామా చేశానని చెప్పి మోసం చేసిన తలసాని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరారు.

ponnala lakshmaiah

డీఎస్ దారిలో పొన్నాల! కారెక్కుతారా!

  ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆపార్టీని వీడి మరో పార్టీలోకి మారుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకపోవడంతో ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీని వదిలి వెళుతున్నారు. ఆఖరికి ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి.. ఎంతో రాజకీయానుభవం మూటగట్టుకున్న నేతలు కూడా పార్టీని వీడి వెళిపోతున్నారు. మొన్నీమధ్యనే డీఎస్ కూడా హస్తాన్నీ వీడి కారునెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా డీఎస్ దారిలో నడుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. పొన్నాల లక్ష్మయ్య కూడా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.   ఒక్కటిగా ఉన్న రాష్ట్ర విడిపోవడానికి కారణమయిన కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఉనికి లేకపోవడంతో పార్టీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెలంగాణ పిసిసి బాధ్యతలను భుజానేసుకున్నారు పొన్నాల. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం పొన్నాలను పీసీసీ భాధ్యలనుండి తీసి ఆస్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి పొన్నాలకు పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఆహ్వానం అందడంలేదట. దీంతో పొన్నాల మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పొన్నాల తన సన్నిహితుల వద్ద కూడా వ్యక్తపరిచారంట. కాంగ్రెస్ పార్టీలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయని.. పిసిసి పదవి నుంచి తనను తొలగించడంతో పాటు పలు రకాలుగా తనను కాంగ్రెసు నాయకత్వం అవమానించిందని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి మారాలని యోచన చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీ నుండి రోజుకో నాయకుడు వేరే పార్టీలోకి వెళ్లడం జరుగుతోంది. ఇంకా ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంటుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

parliament sessions

మొదటి రోజే రాజ్యసభలో రచ్చ

  అనుకున్నట్టుగానే పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ప్రారంభమయిన మొదటిరోజే పార్లమెంట్ లో ఆందోళనలు తలెత్తాయి. ముందునుండే విపక్షాలు వ్యతిరేక ధోరణితో ఉన్న కారణంగా పలు అంశాలపై వారు వివాదాలు లేవనెత్తారు. ముఖ్యంగా లలిత్ మోదీ వీసా వ్యవహారం. ఈ వ్యవహారం రాజ్యసభలో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ వీసా వ్యవహారంపై లలిత్ మోదీని ఎన్డీఏ ప్రభుత్వం వెనుకేసుకోస్తుందని.. లలిత్ మోదీ విదేశాలకు వెళ్లడానికి సుష్మా స్వరాజ్, వసుంధర రాజే సహకరించినా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. లలిత్ మోదీపై ఎఫ్ఐఆర్ దాఖలైందని.. రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారని.. అయినా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదో కారణాలు చెప్పాలని ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. మొత్తానికి ప్రారంభమయిన మొదటిరోజే ఇంత రచ్చ రచ్చగా ఉన్నాయంటే ఇంకా జరగబోయే రోజుల్లో ఎన్ని వివాదాలు తలెత్తుతాయో.

byreddy rajasekhar reddy

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు.. బైరెడ్డి

  ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అటు ఏపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కేంద్రమంత్రి సుజనా చౌదరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయని..60 శాతం చర్చలు పూర్తయ్యాయని.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడం ఖాయమని.. మరో నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా తథ్యమని జోస్యం చెప్పారు. అందరూ ఏపీకి ప్రత్యేక హోదా రావడానికి నానా తంటాలు పడుతుంటే ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు చేపట్టిన దీక్షకు బైరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోస్తా ఆంధ్రా.. రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందని.. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఏం అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాయలసీమ వర్సిటీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ.. యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా పై బైరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేతలందరూ మండిపడుతున్నారు.

pm Narendra Modi

వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి మాత్రం ఈ సమావేశాలు వాడివేడిగా సాగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు అనేక విషయాలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు సాగుతాయా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలు సజావుగా సాగనివ్వవని తెలుస్తోంది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మోడీ ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా వివిధ అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంటే కానీ సమావేశాలను సజావుగా సాగన్విబోమని నిన్ననే కాంగ్రెస్‌ నేతలు స్పష్టంచేశారు. ముఖ్యంగా లలిత్ గేట్ వివాదంలో సుష్మా స్వరాజ్, తప్పుడు డిగ్రీ వివరాలను ఈసీకి సమర్పించిన వివాదంలో స్మృతి ఇరానీల రాజీనామాలకు కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. వారు రాజీనామా చేస్తేకాని సమావేశాలు సజావుగా సాగుతాయని తేల్చి చెప్పారు.   మరోవైపు భూసేకరణ బిల్లు.. యూపీఏ పాలనలో ఉన్న భూసేకరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసిన నేపథ్యంలో ఆ బిల్లును ఆమోదింపచేయాలని చూస్తుంది. కానీ ఈ భూసేకరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పుడో తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ బిల్లుపై ర్యాలీ కూడా చేశారు. ఇదిలా ఉండగా నిన్న జరిగిన సమావేశంలో మోడీ మాత్రం మీరు ఔనన్నా.. కాదన్నా భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టితీరుతామని.. ఈ బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరముందని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు. దీనిని బట్టి ఈ వ్యవహారంపై కూడా పార్లమెంట్ సమావేశాల్లో పెద్ద రచ్చనే జరగబోయే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘అసలు యుద్ధాన్ని’ త్వరలో చూస్తారంటూ ప్రకటించారు. అంటే మోడీకి కూడా ముందే అర్ధమయివుంటుందని.. అందుకే అలా అని ఉంటారని భావిస్తున్నారు. మోడీ అన్నట్టుగానే ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎంత వాడివేడిగా జరగనున్నాయో చెప్పకనే చెప్పాయి.

revanth reddy

రేవంత్ ను ఆకర్ష్ ఆకర్షించలేకపోయింది

  *రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఆకర్ష్ *రేవంత్ రెడ్డి కోసం టీఆర్ఎస్ ముఖ్యనేత రంగలోకి *విచారణలో ఉన్నాను.. ఇప్పుడు చెప్పను   తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కుట్ర పన్ని ఓ పథకం ప్రకారం నోటుకు ఓటు కేసులో ఇరికించారని అందరికి తెలిసిన విషయమే. అయితే అసలు విషయం ఏంటంటే తెలంగాణ అధికార పార్టీ అన్ని పార్టీలకు చెందిన నాయకులను ఆకర్ష్ మంత్రం ద్వారా తమ పార్టీలోకి లాకున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై కూడా ఈ ఆకర్ష్ మంత్రాన్ని ఉపయోగించారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. అందరి మీద ఆకర్ష్ మంత్రాన్ని విసిరినట్టే రేవంత్ రెడ్డి పై కూడా ఈ మంత్రాన్ని విసిరారట.. ఆయా నేతల స్థాయిని బట్టి వారికి సరితూగే నేతలను టీఆర్ఎస్ రంగంలోకి దించుతుండగా.. రేవంత్ రెడ్డి కోసం మాత్రం ఆపార్టీకి చెందిన ఓ ముఖ్య నేత రంగంలోకి దిగారట. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పడం గమనార్హం.   తను ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఈ ఆసక్తికరమైన మాటలు చెప్పారు. అయితే ఆఫర్ చేశారని చెప్పనైతే చెప్పారు కానీ అసలు ఏం ఆఫర్ చేశారు. ఏం మాట్లాడారు.. అనే విషయాలు చెప్పలేదు. సాధారణంగా ఒక పార్టీ అధికారంలో ఉందంటే ఇలాంటి ఆఫర్లు చేయడం సహజం.. తాను విచారణలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పడం సరికాదని.. అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా చెపుతానని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.   మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ అనే మంత్రం ద్వారా పార్టీ నేతలనందరికి తమ వైపుకు తిప్పుకోవాలని చూసినట్టు తెలుస్తోంది. ఎంతకాదనుకున్నా రేవంత్ రెడ్డి మంచి వాక్చాతుర్యం ఉన్న నేత.. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రితో సహా అందరితో గట్టిగా మాట్లాడగల వక్త. అలాంటి రేవంత్ రెడ్డిని తమ పార్టీలోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీకి చాలా బలోపేతంగా ఉంటుందని.. అంతేకాక తెలంగాణ నుండి ప్రతిపక్ష నేతలలో గట్టిగా వాదించే సత్తా ఉన్న నాయకుడు కూడా రేవంత్ రెడ్డే.. కాబట్టి రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే ఎలాంటి సమస్యలు ఉండవని ఆలోచించారేమో అధికార పార్టీ నేతలు అందుకే రేవంత్ రెడ్డి పై వల విసిరారు. కానీ అంతా బాగానే ఉన్నా రేవంత్ రెడ్డిని సెలక్ట్ చేసుకోవడం టీఆర్ఎస్ చేసిన మొదటి తప్పు. ఎందుకంటే తెదేపా పార్టీలోని బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి.. తెదేపాకి.. పార్టీ అధ్యక్షుడికి నమ్మిన బంటు లాంటి వాడు రేవంత్ రెడ్డి . అలాంటి రేవంత్ రెడ్డిని తమ ఆకర్ష్ మంత్రం ద్వారా ఆకర్షించాలనుకోవడం తప్పు. వెరసి వాళ్లు చేసిన ఆఫర్లను రేవంత్ రెడ్డి తిరస్కరించారు. దీంతో టీఆర్ఎస్, వైకాపా పార్టీలు కుమ్మక్కయి.. రేవంత్ రెడ్డిపై కుట్ర పన్ని ఓటుకు నోటు కేసులో ఇరికించారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో హరీశ్ రావు, జగన్ కలిసి ఓ హోటల్ లో సమావేశమయ్యారన్న వార్తులు కూడా వచ్చాయి. మొత్తానికి డబ్బుకు లొంగలేని కారణంగా ఓ నాయకుడిపై కుట్రపన్ని ఇలా ఇరికించడం అన్యాయమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

3లక్షల ఇళ్లు.. 7లక్షల ఉద్యోగాలు.. చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌ ఏపీ సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళికను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతిని అందరూ గర్వపడేలా నిర్మిస్తామని.. 16 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీడ్‌ క్యాపిటల్‌ అభివృద్ధి చేస్తామని అన్నారు. 3లక్షల నివాస గృహాలకు అనుగుణంగా బృహత్‌ ప్రణాళిక ఉందని.. ఈ ప్రణాళికతో 7లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని వివరించారు. ఆకర్షణీయ, పర్యావరణ హిత, స్వయం సమృద్ధి నగరంగా అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా ఏపీ సీడ్ క్యాపిటల్ సంబంధించి శనివారం ఫోటోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఔనన్నా..కాదన్నా బిల్లు ప్రవేశపెడతాం.. మోడీ

  మంగళవారం నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ విపక్ష నేతలూ.. మీరు ఔనన్నా.. కాదన్నా భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టితీరుతామని.. యూపీఏ పాలనలో ఉన్న భూసేకరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు చేసిన నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరముందని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని.. సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు విపక్షాలపై కూడా ఉందన్నారు. మరోవైపు.. భూసేకరణ వంటి ముఖ్యమైన బిల్లులపై సర్కారు ముందడుగు వేస్తే దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని కాంగ్రెస్‌తో సహా ఇతర విపక్ష పార్టీలు గట్టిగా ఉన్నాయి. మొత్తానికి ఈ సారి పార్లమెంట్ సమావేశాలు వేడిగా జరుగుతున్నాయన్నది మాత్రం అర్ధమవుతోంది.

ఓటర్ కార్డుతో ఆధార్ లింక్.. లేకపోతే ఓటు లేదు

  సీఎం కేసీఆర్ బోగస్ ఓటర్ కార్డుల వ్యవహారంపై ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ నగరంలో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోందని.. నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ కార్డుకు.. ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తామని..ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోకుంటే ఓటు హక్కు ఉండదని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ లో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుకు ఈ ప్రక్రియను ముందు హైదరాబాద్ లో మొదలు పెడతామని.. తరువాత రాష్ట్రమంతటా అనుసంధానం చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన కంటే ముందే ఓటర్ల జాబితా సిద్ధం చేస్తామని చెప్పారు.

కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం

  సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి చేరే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరి శాసనసభకు పోటీ చేసి విజయశాంతి ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి విజయశాంతి రాజకీయాలకు కొంచెం దూరంగానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కారు ఎక్కే ప్రయత్నాలు చేస్తున్నట్టు.. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో విజయశాంతి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్న విజయశాంతి.. కేసీఆర్ తన పార్టీలోకి అంగీకరిస్తే వెంటనే పార్టీలోకి చేరడమే అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. గతంలో కేసీఆర్ మెదక్ పార్లమెంటు సీటు ఇచ్చి విజయశాంతిని ఎన్నికల్లో గెలిపించిన సంగతి తెలిసిందే.