కన్హయ్య బెయిల్.. ఇదొక సాంప్రదాయంగా మారుతుంది.. సుప్రీం

జెఎన్‌యు విద్యార్ది సంఘ నేత కన్హయ్య బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో హైకోర్టును సంప్రదించాలని సూచించింది. దేశ ద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య తరుపున  సత్వ రమే అనే న్యాయవాది పిటిషన్ ను దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో సత్వ రమే పిటిషన్‌ను పరిష్కరించాల్సిందిగా హైకోర్టును కోరింది. ఇప్పుడీ పిటిషన్‌ను గనుక ఈ కోర్టు విచారణకు స్వీకరిస్తే దేశంలోని నిందితులందరికీ ఇదొక సాంప్రదాయంగా మారుతుందని.. కాబట్టి ప్రతీ కేసుకు కూడా సుప్రీంకోర్టే కోర్టు అనుకుంటే అదొక ప్రమాదకరమైన సాంప్రదాయం అవుతుందని జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ సప్రేలతో కూడిన బెంచ్‌ పేర్కొంది

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి..

జార్ఖండ్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్‌లో నవాధియా అడవి సరిహద్దు గ్రామం గార్గబేఢ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అడవిలో నక్సల్స్‌ సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం వచ్చిన వెంటనే భద్రతా దళాలతో అక్కడి చేరుకున్నామని.. భద్రతా దళాలు.. మావోయిస్ట్ ల మధ్య కాల్పులు జరిగాయని.. ఈకాల్పుల్లో నలుగురు మావోయిస్ట్ లు మృతి చెందగా..  ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని.. ఎస్పీ రాజ్‌ కుమార్‌ లఖ్రా తెలిపారు. గాయాలైన పోలీసులను ఆస్పత్రికి తరలించాం.. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పారు. కాగా మృతి చెందిన నలుగురిలో ఒక మహిళ ఉందని.. వారి మృతదేహాలతో పాటు  రెండు ఎస్‌ఎల్‌ఆర్లు, రెండు 303 తుఫాకులను స్వాధీనపరచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

లులియాకి హిందీ ట్యూషన్‌ పెట్టించిన సల్మాన్ ఖాన్.. ఎందుకో..?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి ప్రేమాయణాలకు కొదువే లేదు. గతంలో చాలా మంది హీరోయిన్స్ తో రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రొమేనియన్‌ మోడల్‌, టీవీ స్టార్‌ లులియా వంటూర్‌ని ప్రేమిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న వీరిద్దరి వ్యవహారం మరోసారి వార్తల్కోకి ఎక్కింది. అందేంటంటే అసలేమాత్రం హిందీ రాని లులియాకి చక్కటి హిందీ నేర్పడానికి సల్మాన్‌ ట్యూషన్‌ పెట్టించాడట. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. లులియా ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలోనే హిందీ రాక ఇబ్బంది పడుతున్నందుకు ట్యూషన్ పెట్టించాడని అంటున్నారు. అయితే హిందీ సినిమాల్లో నటించేందుకా, లేక సల్మాన్‌ కుటుంబీకులతో కలిసిపోవడానికా అన్నది  బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మరి ఎందుకో సల్మాన్ కి, లులియాకే తెలియాలి.

జగన పంచ్ కు రివర్స్ పంచ్.. టీడీపీలోకి భూమా..?

రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. ఏ పార్టీ నుండి ఎప్పుడు ఏనేత.. ఏ పార్టీలోకి జంప్ అవుతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న పార్టీల్లో సగానికి పైగా నేతలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి చేరడానికే సముఖత చూపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న టీడీపీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో తెలంగాణలో టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే ఏపీలోకి వచ్చేసరికి కాస్త పరిస్థితి బానే ఉంది. ఇక్కడ అధికార పార్టీ టీడీపీ కావడంతో కొంతమంది నేతలు టీడీపీ లోకి వలస వస్తున్నారు. ఇక ఈనేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత జగన్ కు పెద్ద షాకే ఎదురైంది. రెండు రోజుల క్రితమే మా పార్టీలో ఎవరూ టీడీపీలోకి వెళ్లడం లేదు.. ఇది టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్.. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలే మాతో టచ్ లో ఉన్నారు అని అన్నారు. దీంతో అందరూ చంద్రబాబుకి జగన్ ఝలక్ ఇచ్చారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే జగన్ కే దిమ్మతిరిగే షాక్ ఎదురైందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు భూమా అఖిల ప్రియ త్వరలో టిడిపిలో చేరుతారని కర్నూలు జిల్లాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. భూమా నాగిరెడ్డి ప్రస్తుతం పిఎసి చైర్మన్‌గా ఉండగా.. ఆయన కూతురు భూమా అఖిల ప్రియ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే. అయితే వీరిద్దరికి టీడీపీ నుండి మంచి ఆఫరే వచ్చినట్టు చెబుతున్నారు. వీరిద్దరు టీడీపీలోకి చేరితే ఓ మంత్రి పదవిని చంద్రబాబు ఇస్తారని చెప్పినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన  చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. ఇదిలా ఉండగా భూమాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ రోజు కార్యకర్తలతో భేటీ అనంతరం అసలు విషయాలు తెలుస్తాయి అని అంటున్నారు రాజకీయ పెద్దలు. మొత్తానికి చంద్రబాబుకి షాకిచ్చానని సంతోషపడే లోపులోనే జగన్ కు రివర్స్ షాక్ ఎదురైనట్టుంది.

15 ఏళ్లు పైబడిన బస్సులను నడపొద్దు..

గోవా రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..ఇకనుండి 15 ఏళ్లు పైబడిన బస్సులను నడపకూడదని. వివరాల ప్రకారం.. కదంబ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(కేటీసీఎల్‌)లో 15 ఏళ్లు పైబడిన బస్సులను ఇక నడిపించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. 15 ఏళ్ల పాటు ఉపయోగించిన బస్సులను తొలగించాలని.. వాటి స్థానంలో కొత్త బస్సులను చేర్చాలని ఆదేశించింది. బస్సులను దశలవారీగా తొలగించి..   2021 నాటికి ఈ ప్రక్రియను  పూర్తి చేయాలని సూచించింది. అంతేకాదు 20 ఏళ్లకు పైగా నడుస్తున్న బస్సులను వచ్చే ఏడాది మార్చి 31 లోపల తొలగించాలని.. 17, 18ఏళ్లు పైబడిన బస్సులను 2018 మార్చి నాటికి మార్చేయాలని ప్రభుత్వం రవాణా సంస్థకు సూచించింది.

68 రూపాయలకే ఐ-ఫోన్‌

ఈ ప్రకటన ఆన్‌లైన్లో కనిపిస్తే ఎగబడంది ఎవరు. కానీ 30,000 విలువ చేసే  iPhone 5S ని ఎవరన్నా 68 రూపాయలకి అమ్ముతారా? అంటే అదే జరిగింది మరి! స్నాప్‌డీల్‌ సంస్థ చేసిన ఈ పొరపాటు ఓ వినియోగదారుడికి కలిసి వచ్చింది. ఈ నెల 12వ తేదీన స్నాప్‌డీల్‌ వెబ్‌సైట్లో కొత్త ఐఫోన్‌ విలువని పొరపాటుగా 68 రూపాయలు అంటూ పేర్కొంది. ఇలాంటి ఆఫర్లు ఎప్పుడు కనిపిస్తాయా అని కాచుకుని కూర్చున్న నిఖిల్‌ బన్సల్‌ అనే విద్యార్థి మరుక్షణంలోనే దానిని ఆర్డరు చేసేసుకున్నాడు. స్నాప్‌డీల్ తన పొరపాటుకి చింతించి వెంటనే ఆ ధరని మార్చేసింది. కానీ అప్పటికే ఫోన్ కొనేసిన నిఖిల్‌ ఊరుకుంటాడా! స్నాప్‌డీల్ తనని మోసం చేసిందంటూ పంజాబులోని ఓ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశాడు. కోర్టు నిఖిల్‌కి అనుకూలంగా తీర్పుని ఇవ్వడమే కాకుండా నష్టపరిహారంగా ఓ రెండు వేలు చెల్లించమని చెప్పింది. అయినా స్నాప్‌డీల్‌కి మనసు ఒప్పలేదు. ఇదంతా ఓ సాంకేతిక పొరపాటు అంటూ ఓ వినియోగదారుల పోరంలో కేసుని దాఖలు చేసింది. అక్కడా స్నాప్‌డీల్‌కి చుక్క ఎదురైంది. ఈసారి నష్టపరిహారం 10,000కి పెరిగింది. అదీ సంగతి! ఇటూ ఐ-ఫోనూ చవకగా దొరికింది. అటు నష్టపరిహారమూ దక్కింది.

అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్ కు కోర్టు సమన్లు..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యుడు జగన్మోహన్‌రెడ్డికి ఆక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిలో భాగంగా కోర్టు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఫార్మ కంపెనీలైన అరబిందో, హెటిరో వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలు చేసిన ఫిర్యాదును గురువారం ఈడీ ప్రత్యేక కోర్టు, మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈకేసులో నిందితుడైన జగన్ కు కి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి టి రజని సమన్లు జారీ చేశారు. మార్చి 28న  వ్యక్తిగతంగా హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ తో పాటు మరో 19 మందికి సమన్లు జారీ చేశారు.

అండర్‌వరల్డ్‌ డాన్‌ కుమార పిళ్లై అరెస్ట్..

అండర్‌వరల్డ్‌ డాన్‌ కుమార పిళ్లైను పోలీసులు పట్టుకున్నారు. ముంబైలోని పలు నేరాలలో నిందితుడిగా ఉన్న కుమార పిళ్లై కోసం పోలీసులు గత కొంత కాలంగా పరారీలో ఉన్నారు. ఈయన కోసం పోలీసులు చాలా కాలం నుండి గాలిస్తున్నారు. దీనిలో భాగంగానే కుమార పిళ్లైని సింగపూర్‌లో అరెస్టు చేసినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. గతంలో ఇతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు కూడా జారీ అయింది. అయితే ఇప్పుడు సింగపూర్ లో అరెస్ట్ చేసిన వ్యక్తి కూమార్ పిళ్లె అవునా ..కాదా? అని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. దీనిపై  ముంబయి పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడు కుమార పిళ్లై అని నిర్ధరణ అయిన తర్వాత సింగపూర్‌ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.

మోడీ, షరీఫ్ మరోసారి..

పఠాన్ కోట్ ఉగ్రవాదుల దాడి వలన జనవరిలో జరగాల్సిన భారత్ ప్రధాని నరేంద్ర మోడీ.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల భేటీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు జరగాల్సిన భేటీ ఆగిపోవడంతో వీరిద్దరూ మరోసారి కలవనున్నట్టు తెలుస్తోంది. మార్చి నెలలో ప్రారంభమయ్యే.. ప్రపంచ అణుసదస్సులో ఇరుదేశాల ప్రధానులు ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వం వహిస్తారు. కాగా ప్రపంచ దేశాల అణుకార్యక్రమాలు, పర్యవసానాలు, అణుశక్తి వినియోగం తదితర అంశాలపై ఈ సదస్సులో పలు తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మోదీ పర్యటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ పాక్ అధికారులు మాత్రం ఇద్దరి భేటీ ఖాయమంటున్నారు. మరి అది ఎంత వరకూ నిజమే చూడాలి.

రైలు ఢీకొని నలుగురు మృతి..

ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు గ్యాంగ్ మెన్ లపైకి సబర్బన్ రైలు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. వివరాల ప్రకారం.. సబర్బన్‌ కుర్లా- విద్యావిహార్‌ స్టేషన్ల మధ్య గ్యాంగ్‌మెన్లు పట్టాలపై మరమ్మతులు చేస్తుండగా... ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు(సీఎస్‌టీ) వెళ్తున్న లోకల్‌ రైలు వీరిపై నుంచి దూసుకెళ్లినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. అయితే వారిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా అప్పటికే మృతి చెందినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణంపై విచారిస్తున్నామని, ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.