రంగలోకి దిగనున్న బీజేపీ అధ్యక్షుడు..

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ చేసింది ఏం లేదు. దీంతో బీజేపీ పై రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుండి విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో ఆందోళనలు..దీక్షలు చేపట్టడం కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు తమ పార్టీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. దీనిలో భాగంగానే ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై బీజేపీ సంకల్పం’ పేరుతో ఒక భారీ ప్రచార ప్రణాళికను ఆయన రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్టు సమాచారం.. అయితే ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతి పైసా, ప్రతి అనుమతీ ప్రజల ముందు పెట్టడమేనట. అంతేకాదు మార్చి ఆరో తేదీన రాజమండ్రి లో జరిగే పార్టీ బహిరంగ సభ నుంచే అమిత్‌షా ఈ ప్రణాళికను అమలులో పెట్టబోతున్నారట. చూద్దాం.. ఈ ప్రణాళిక ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..

చెన్నై ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య.. కారణం అదేనా..?

చెన్నై లో యువ ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. తమిళనాడు రాజధాని చెన్నై శివారు ప్రాంతం ఎగ్మోర్‌లో ఎన్‌ హరీశ్ ఐపీఎస్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన  చెన్నైలోని ఎగ్మోర్‌ ప్రాంతంలో ఐపీఎస్‌ అధికారుల క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. అయితే ఈరోజు ఈయన కోసం కార్యలయ సిబ్బంది రాగా ఆయన మాత్రం ఎంతసేపటికీ తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చి వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే హరీశ్‌ చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అయితే అధికారుల సమాచారం ప్రకారం కాస్త కొద్ది రోజుల నుండి హరీశ్‌ ప్రమోషన్ పై విచారణ జరుగుతోందని.. అతని బ్యాచ్ వాళ్లకి రెండేళ్ల కిందటే ప్రమోషన్స్‌ వచ్చాయి దీంతో హరీశ్ మనస్తాపం చెందినట్టు తెలిపారు. అయితే ఇప్పుడు హరీశ్‌ ఆత్మహత్యకు పదోన్నతి అంశమే కారణమా? లేక వేరే ఏదైనా ఉందా? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

దిల్లీ ప్రొఫెసరు గిలానీ- తీహార్‌ జైలుకి!

దిల్లీ విశ్వవిద్యాలయపు మాజీ ప్రొఫెసరు గిలానీకి న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్‌ కస్టడీని విధించింది. ఈ మేరకు ఆయనను కొద్దిసేపటి క్రితమే తీహార్‌ జైలుకి తరలించారు. ఆది నుంచీ వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వస్తున్న గిలానీ ఈ నెల 10వ తేదీన అఫ్జల్‌గురుకి అనుకూలంగా ప్రెస్‌క్లబ్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో అఫ్జల్‌గురుకి అనుకూలంగా, ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. గిలానీ మొదటి నుంచీ కూడా కశ్మీర్ వేర్పాటవాదులకు మద్దతుగా వ్యవహరించేవారు. 2001లో పార్లెమంటు మీద జరిగిన దాడిలో కూడా గిలానీ ముఖ్య పాత్రను పోషించారని ఆరోపణలు వచ్చాయి. అయితే సరైన సాక్ష్యధారాలు లేకపోవడంతో ఆయనను విడుదల చేయక తప్పలేదు. మరోసారి దేశద్రోహం కేసు కింద అరెస్టైన గిలానీ విషయంలో న్యాయస్థానం ఏ తీర్పుని వినిపించబోతోందో చూడాలి.

పాముల పెట్టెలో తల పెట్టిన క్రికెటర్.. కాటేసింది..

పాము పుట్టలో చేయి పెడితే కాటు వేయకుండా ఉంటుందా.. వేసే తీరుతుంది. అలాంటిది కావాలని పెడితే ఇంక ఊరుకుంటుందా.. ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. ఇంతకీ పాము పుట్టలో చేయి ఎవరు పెట్టారబ్బా అనుకుంటున్నారా.. పెట్టింది చేయి కాదు.. తల అది కూడా క్రికెటర్ షేన్‌వార్న్. ఆస్ట్రేలియాలో నెట్ వర్క్ టెన్ నిర్వహించిన ఓ రియాల్టీ షోకు వార్న్ హాజరయ్యాడు.  ఈ రియాల్టీ షోలో ఓ చిన్న సైజు అనకొండలతో ఓ టాస్క్  చేయాల్సి ఉంది. దీనిలో భాగంగానే అతను తన తలను అనకొండలు ఉన్న బాక్స్ లో దూర్చాడు. అంతే అందులో ఉన్న ఒక అనకొండ వార్న్ తలపై కాటేసింది. అయితే అదృష్టం ఏంటంటే.. అది విషపూరితం కాకపోవడం, మరీ పెద్దగా కాటేయకపోవడం. అదే గట్టిగా కాటేస్తే.. సుదీర్ఘ కాలం పాటు చికిత్స చేయించుకోవాల్సి వచ్చేదట. మరి ఇలాంటి రిస్కీ రియాల్టీ షోలు ఎంతవరకూ అవసరమో..?

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం..

చిత్తూరు జిల్లాలో ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది. కన్న తండ్రే కూతురిపై అత్యాచారం చేసి సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఓ వ్యవసాయ కూలీ పన్నెండేళ్ల తన కూతురిపై ఇప్పటికీ మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తరచూ పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. అయితే ఒకరోజు తన తండ్రి అత్యాచారానికి ప్రయత్నించగా బాలికి తప్పించుకొని ఇంటికి వెళ్లి తన తల్లికి చెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైం తల్లి బాలికను తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా బాలిక తండ్రి పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు

ఆదాయపు పన్ను ఉచ్చులో కపిల్‌దేవ్‌!

  ఆదాయపు పన్ను ఉచ్చులో కపిల్‌దేవ్‌!భారతదేశానికి తొలి ప్రపంచకప్‌ను అందించిన నాయకుడు కపిల్‌దేవ్‌. తరచూ సాటి క్రికెటర్ల మీద వివాదాస్ప వ్యాఖ్యలు చేసే కపిల్ ఈసారి తానే ఒక వివాదంలో ఇరుక్కున్నాడు. నోయిడాకు చెందిన ఓ కంపెనీ షేర్లని కపిల్‌ చాలా తక్కువ ధరకే పొందాడన్నది ఈ ఆరోపణ. సదరు కంపెనీ గతంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న ఓ ఇంజనీరుది కావడంతో ఇదేమంత త్వరగా తేలే విషయంలా కనిపించడం లేదు. ఏదో సహాయం చేయడం వల్లే కపిల్‌ వాస్తవ ధరకంటే తక్కువకే షేర్లను పొందారన్నది అధికారుల అనుమానం. కానీ కపిల్‌ వాదన మాత్రం వేరే విధంగా ఉంది. ‘నేనొక సాధారణ క్రికెటర్‌ను మాత్రమే. నేను వ్యాపారవేత్తలకు ఎలా సాయపడగలను?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజమే మ్యాచ్‌ ఫిక్సింగ్‌లాంటి తీవ్రమైన ఆరోపణలను సైతం సునాయాసంగా ఎదుర్కొన్న కపిల్‌కు ఈ ఆరోపణలను ఎదుర్కోవడం ఏమంత కష్టం కాకపోవచ్చు.

రాహుల్ గాంధీ కాదు.. రాహుల్ మెమెన్..!

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శల బాణాలు సంధించారు. జేఎన్‌యు వ్యవహారంలో రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి విద్యార్థి సంఘాలకు మద్దతు తెలపడంపై కిషన్ రెడ్డి ఆయనపై మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ దృష్టిలో దేశ వ్యతిరేక నినాదాలు చేసినవారు దేశభక్తులా? అఫ్జల్‌గురు, యాకూబ్‌ మెమెనల నుంచి ఆయన స్ఫూర్తి పొందారా? తీవ్రవాదులు, ఉగ్రవాదులపై మీ విధానం మారిందా? అని ప్రశ్నించారు. అంతేకాదు ఈసందర్భంగా ఆయన 'రాహుల్‌ మెమెన్‌ లేదా రాహుల్‌ అఫ్జల్' అనో పేరు మార్చుకోండి అంటూ సలహా ఇచ్చారు. ఈ మధ్య కాలంలో యూనివర్శిటీల్లో కావాలనే కుట్రలు జరుపుతున్నారని ఆరోపించారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఉగ్రవాదానికే బలయ్యారనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు.

రైతు ఆత్మహత్యలపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ఫ్యాషనైపోయింది..

రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎక్కువైంది. తాజాగా భారతీయ జనతా పార్టీ ఎంపీ గోపాల్‌ శెట్టి రైతు ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మహారాష్ట్రలో 124మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదిక వచ్చింది. అయితే దీనిమీద స్పందించిన ఎంపీ గోపాల్‌ శెట్టి ఈ ఆత్మహత్యలన్నీ నిరుద్యోగం, పేదరికం కారణంగానే జరగడం లేదని.. రైతులకు ఆత్మహత్యలు చేసుకోవడం ఫ్యాషన్‌ అయిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అంతే దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఇదే అవకాశంగా ఎంపీ గారిపై మండిపడుతుంది. రైతులు పంటలు విఫలమై, అప్పులతో ఆత్మహత్య చేసుకుంటోంటే వారి గురించి ఇంత దారుణంగా మాట్లాడటం అన్యాయమని అన్నారు. ఇక చేసేది లేక తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, తనను క్షమించాలని కోరారు.

భర్త అంత్యక్రియల కోసం... కొడుకులను తాకట్టుపెట్టిన సావిత్రి

  పేదరికం ఎంతటి సవాళ్లును ముందుంచుతుందో చెప్పే కథ ఇది. జనవరి 26న దేశమంతా ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటుంటే... ఓ స్త్రీ మాత్రం తన భర్తకి అంత్యక్రియలు నిర్వహించేందుకు కన్నకొడుకులునే 5,000కి తాకట్టు పెట్టింది. ఒడిషాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనలో రైబా అనే పేదవాడు గత నెల 26వ తేదీన చనిపోయాడు. రైబా దీర్ఘకాలిక రోగంతో బాధపడుతుండటంతో, అప్పటికే అతని చికిత్స కోసం ఇల్లు గుల్లైపోయింది. రైబా చనిపోయేనాటికి ఇంట్లో చిల్లిగవవ్వ కూడా మిగల్లేదు. అతని అంత్యక్రియల కోసమని రైబా భార్య సావిత్రి, ఆర్థికసాయం చేయమంటూ తమ ఊరిలోని ప్రతి గడపనీ తట్టింది. కానీ ఉపయోగం లేకపోవడంతో చివరికి తన ఐదుగురు పిల్లల్లో పెద్దవారైన ఇద్దరిని (ముఖేష్‌- 13, సుఖేష్‌- 11) పొరుగింటాయనకి తాకట్టు పెట్టింది. ఈ సంఘటనను స్థానిక అధికారులు కొట్టిపడవేస్తున్నప్పటికీ, తాకట్టు జరిగిన మాట నిజమేనని గ్రామస్తులు చెబుతున్నారు. పురాణాలలో సతీసావిత్ర భర్త ప్రాణాలను దక్కించుకునేందుకు అష్టకష్టాలూ పడితే, ఒడిషాలో నేటి సావిత్రి అతనికి శవసంస్కారం జరిపించేందుకు కూడా ఎంతో త్యాగాన్ని చేయాల్సి వచ్చింది. ఎంతైనా కలియుగం కదా!

బాలయ్య టాటూ నా మజాకా..

నాని తాజాగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమా ఈనెల 12 రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఎలా హిట్టయిందో.. ఈ సినిమాలో నాని వేసుకున్న టాటూ కూడా అంత హిట్టయింది. ఇంతకీ ఆ టాటూ ఏంటనుకుంటున్నారా.. జైబాలయ్య అనే టాటూ. ఈ సినిమాలో నాని బాలయ్య ఫ్యాన్. దీంతో చేతిపై జై బాలయ్య టాటూతో కనిపిస్తాడు. అయితే సినిమాలో నాని వేయించుకున్న టాటూ అటు బాలయ్య అభిమానులను కూడా బాగా ఆకట్టుకుంది. ఒక్క అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ఈ టాటూ నచ్చడంతో తమ చేతుల మీద వేయించుకొని సరదా తీర్చుకుంటున్నారు. మొత్తానికి బాలయ్య టాటూ బానే వర్కవుట్ అయినట్టు కనిపిస్తుంది.

తమిళనాట బస్సు ప్రయాణం ఫ్రీ.... వృద్ధులకు మాత్రమే!

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్కడి పెద్దవారికి ఓ తీపికబురు అందించారు. ఫిబ్రవరి 24 నుంచి ఆ రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వృద్ధులకు బస్సు ప్రయాణం ఉచితం కాబోతోంది. ఈ పథకాన్ని తొలుత చెన్నైలో అమలుచేసి, ఫలితాలు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు దాటిన వారు చెన్నై నగరంలోని ఏ సిటీబస్సులోనైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం వారు రవాణా సంస్థ నుంచి టోకెన్లను పొందవలసి ఉంటుంది. అయితే నెలకి పది టోకెన్లను మాత్రమే గరిష్టంగా వినియోగించుకోగలరు. ఈ పథకాన్ని అమలుచేయడం ద్వారా తాము ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చామని జయలలిత గర్వంగా ప్రకటించారు. ఈ ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటంతో, ఈ పథకం మంచి ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఈ పథకాన్ని ఫిబ్రవరి 24నే ఎందుకు అమలు చేస్తున్నారయ్యా అంటే... ఆ రోజు జయలలితగారి పుట్టినరోజు అన్న సమాధానం వినిపిస్తోంది!

అది నా రక్తంలోనే ఉంది.. రాష్ట్రపతిని కలిసిన రాహుల్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన జేఎన్‌యూలో విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ అరెస్ట్ వ్యవహారం గురించి కేంద్రంపై వ్యవహరిస్తున్న తీరు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. కన్నయ్య కుమార్‌ అరెస్టు వ్యవహారంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు అసంబద్ధంగా ఉందని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. కాగా రాహుల్ గాంధీతో పాటు 17 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై విమర్శలు చేస్తున్న వారికి ఘాటుగానే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ దేశ ద్రోహి అంటూ అతనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిపై స్పందించి.. దేశ భక్తి తన రక్తంలోనే ఉందని అన్నారు. మా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల గొంతు నొక్కాలని చూడడం సరికాదని అన్నారు.

నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తాం.. జర్నలిస్ట్ కు హెచ్చరిక

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న ఆడవాళ్లపై అరాచకాలు ఆగవు. ఇప్పటికే రోజుకో ఘటన చూస్తూనే ఉన్నాం.. రోజుకో వార్త వింటూనే ఉన్నాం. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం వింటే మాత్రం కాస్త ఆశ్చర్యపోవాల్సిందే. అదేంటంటే.. ఒకటి రెండు రోజుల్లో నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తామంటూ ఓ మహిళా జర్నలిస్టును ఓ వ్యక్తి ట్విట్టర్‌లో హెచ్చరించడం. వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంటూ.. అందరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే జెఎన్‌యూ వివాదం గురించి. దీనిలో భాగంగానే న్యాయవాదులు జర్నలిస్ట్ లపై దాడి చేసినందుకు గాను ముంబైలో విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ మహిళా జర్నలిస్టు తన సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసింది. అయితే అమరేందర్ సింగ్ అనే వ్యక్తి ఆమెను బదిరిస్తూ ఒకటిరెండు రోజుల్లో నీపై తీవ్రమైన గ్యాంగ్ రేప్ జరుగుతుంది, స్పృహలోకి రండి, భారతమాతతో చెలగాటమాడకండి అంటూ అతను ట్వీట్ చేశాడు. దీంతో ఆమె  భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై ఐపిసి సెక్షన్లు 354 (ఎ)1 (అమర్యాదకరంగా వ్యవహరించడం), 509 (మహిళలను అవమానించే చర్యలకు పాల్పడడం), 506 (నేరపూరిత ఉద్దేశం) కింద ఆజాద్ మైదాన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేయలేదు.

ఉపరాష్ట్రపతి పదవిపై వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 30వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తరువాత వెంకయ్యకు ఏ పదవి దక్కుతుందో అన్న దానిపై పలు చర్చలు జరుగుతున్న సంగతి కూడా విదితమే. వెంకయ్య పదవి ముగిసిన తరువాత ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని యోచిస్తున్నారు. అయితే ప్రధాని మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో వెంకయ్యను వదులుకునేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది.  దీనిలో భాగంగానే బీజేపీ నుంచే నాలుగోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. సాధారణంగా బీజేపీ నియమ నిబంధనల ప్రకారం ఒక సభ్యుడికి మూడు సార్లు మాత్రమే రాజ్యసభకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వెంకయ్యకు మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి పదవి గురించి వస్తున్న వార్తలపై వెంకయ్య మాట్లాడుతూ రాజ్యాంగ పదవి కంటే.. పార్టీ పదవే తనకు ముద్దు అని తేల్చి చెప్పారు. తాను ఉషాపతినేనని ఉపరాష్ట్రపతి కాబోనని ఆయన అన్నారు. మరి ఏ జరుగుతుందో చూడాలి.

రాహుల్ ను ఉరితీయండి..

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ జెఎన్‌యూ వివాదంపై స్పందించి అక్కడి విద్యార్దులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై రాజస్థాన్‌లోని బర్మర్‌ జిల్లా బైటూ నియోజకవర్గం.. బిజెపి ఎమ్మెల్యే కైలాష్‌ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అఫ్జల్‌ గురు అమర వీరుడని కీర్తించే వారికి మద్దతు పలకడం దారుణమని.. రాహుల్ గాంధీ దేశ ద్రోహి అని.. ఆ 'రాజకుమారుడి'ని ఉరి తీయడమో కాల్చి చంపడమో చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'రాజకుమారుడి'గా కాంగ్రెస్‌ నేతలు పేర్కొనే రాహుల్‌గాంధీకి దేశంలో నివసించే హక్కు లేదని కైలాష్‌ అన్నారు. మరి కైలాష్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.

బాంబు పేలి 28 మంది మృతి.. 61 మందికి గాయాలు..

టర్కీలో వరుస బాంబు పేలుళ్లు సంభంవిస్తున్న నేపథ్యంలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. టర్కీలో రాజధాని అంకారాలో కారు బాంబు పేలుడు సంభవించింది. వివరాల ప్రకారం.. అంకారాలో టర్కీ మిలటరీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 28 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో 61 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై టర్కీ ఉప ప్రధాని స్పందిస్తూ.. ఈ దాడికి కారణం ఎవరు అనేది ఇంకా తెలియలేదని.. వాహనాల్లో బాంబులు నింపి ఉండటం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఇది తీవ్రవాదుల చర్య అని పార్లమెంట్ అధికార ప్రతినిధి అన్నారు.

ఆంజనేయస్వామి పై కేసు.. కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు..

అదేదో సినిమాలో తనకు జరిగిన నష్టానికి దేవుడే కారణమంటూ ఒక వ్యక్తి దేవుడిపై కోర్టులో కేసు వేస్తాడు. తాజా సంఘటన చూస్తుంటే కూడా ఆ సినిమాలో మాదిరిగానే అనిపిస్తుంది. హిందూ దేవుడు ఆంజనేయస్వామిని కోర్టుకు హాజరుకావాలంటూ బిహార్‌లోని ఓ దిగువ న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం.. బిహార్‌లో రోహ్తస్‌ జిల్లాలోని డెహ్రీ ఆన్‌ సోన్‌లో రోడ్డుపక్కన పంచముఖి' హనుమాన్ ఆలయం ఉంది. అయితే ఇది  రోడ్డును ఆక్రమించుకొని ఉన్నందువల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. దీంతో ప్రజాపనుల విభాగం అధికారులు దీనిపై కోర్టులో కేసు దాఖలు చేసి హనుమాన్ ఆలయం తొలగించడంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో ఆంజనేయస్వామి కోర్టకు హాజరుకావాలంటూ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన నోటీసులను ఆలయానికి అంటించారు. మరి ఆంజనేయస్వామి కోర్టుకు వస్తారా..?