భర్త అంత్యక్రియల కోసం... కొడుకులను తాకట్టుపెట్టిన సావిత్రి
పేదరికం ఎంతటి సవాళ్లును ముందుంచుతుందో చెప్పే కథ ఇది. జనవరి 26న దేశమంతా ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటుంటే... ఓ స్త్రీ మాత్రం తన భర్తకి అంత్యక్రియలు నిర్వహించేందుకు కన్నకొడుకులునే 5,000కి తాకట్టు పెట్టింది. ఒడిషాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనలో రైబా అనే పేదవాడు గత నెల 26వ తేదీన చనిపోయాడు. రైబా దీర్ఘకాలిక రోగంతో బాధపడుతుండటంతో, అప్పటికే అతని చికిత్స కోసం ఇల్లు గుల్లైపోయింది. రైబా చనిపోయేనాటికి ఇంట్లో చిల్లిగవవ్వ కూడా మిగల్లేదు. అతని అంత్యక్రియల కోసమని రైబా భార్య సావిత్రి, ఆర్థికసాయం చేయమంటూ తమ ఊరిలోని ప్రతి గడపనీ తట్టింది. కానీ ఉపయోగం లేకపోవడంతో చివరికి తన ఐదుగురు పిల్లల్లో పెద్దవారైన ఇద్దరిని (ముఖేష్- 13, సుఖేష్- 11) పొరుగింటాయనకి తాకట్టు పెట్టింది. ఈ సంఘటనను స్థానిక అధికారులు కొట్టిపడవేస్తున్నప్పటికీ, తాకట్టు జరిగిన మాట నిజమేనని గ్రామస్తులు చెబుతున్నారు. పురాణాలలో సతీసావిత్ర భర్త ప్రాణాలను దక్కించుకునేందుకు అష్టకష్టాలూ పడితే, ఒడిషాలో నేటి సావిత్రి అతనికి శవసంస్కారం జరిపించేందుకు కూడా ఎంతో త్యాగాన్ని చేయాల్సి వచ్చింది. ఎంతైనా కలియుగం కదా!