పవన్ అభిమానులపై 'లాఠీచార్జ్'

      పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఆవిర్భావ సభకు పవర్ స్టార్ అభిమానులు భారీ సంఖ్యలో తరలీవచ్చారు. కేవలం నాలుగు వేల మందికే పాస్ లు జారీ చేయడంతో..మిగతా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా అభిమానులు, పోలీసులు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేశారు. తమ అభిమాన నటుడు నెలకొల్పనున్న రాజకీయపార్టీ ఆవిర్భావ సభను ప్రత్యక్షంగా చూద్దామని వచ్చిన కొంతమంది అభిమానులు పాస్ లు లేక బయటే నిరాశతో నిలిచిపోయారు.  పవన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బిగ్‌స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది పవన్ కొత్త పార్టీ ప్రకటనను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.

సెల్.. మోహన రంగా

      ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్లే. వెయ్యి రూపాయలు కూడా అక్కర్లేకుండానే ఫోన్లు వచ్చేస్తున్నాయి. సరిగ్గా ఈ అందుబాటునే నాయకులు ఉపయోగించుకుంటున్నారు. వాటిద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు, వాళ్ల సమస్యలు వినేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఈవిషయంలో కొంత ముందున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు,  యువజన సంఘాల ప్రతినిధులు, రైతులు, కవులు, కళాకారులు, రచయితలు, కుల సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజల సెల్‌ఫోన్ నంబర్లను సేకరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారు. వాళ్లు ఇప్పటికే వేలాది సెల్‌ఫోన్ నంబర్లను సేకరించారు. నెంబరుతో పాటు వారి పుట్టినరోజు తేదీలు, మరిన్ని వివరాలను నమోదు చేస్తున్నారు. సేకరించిన సెల్‌ఫోన్ నంబర్ల ద్వారా హరీష్‌రావు నేరుగా వారి పేరుతో పలకరించేలా ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో శుభాకాంక్షలు తెలియజేస్తారు. అభివృద్ధి పనులను ప్రచారం చేయడంతో పాటు సమస్యలను తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నంబరును త్వరలో ప్రకటించబోతున్నారు. ఏ ఊరికి ఎప్పుడు వస్తారో ప్రజలకు నేరుగా సమాచారం అందడానికి ఏర్పాట్లు చేశారు.  ఈ హైటెక్ ప్రచారం త్వరలోనే అందరూ అందిపుచ్చుకునే అవకాశం ఉంది.

ఆటోలకు పది కోట్ల బడ్జెట్!!

      ఎన్నికల కాలం కావడంతో ఆటోరిక్షాలకు భలే గిరాకీ మొదలైంది. పట్టణాలు, నగరాల్లో భారీ ఫ్లెక్సీలు పెట్టడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవు. ఎక్కడ ఏ పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినా సరే ఆయా మునిసిపాలిటీల సిబ్బంది తొలగించేస్తున్నారు. దాంతో నాయకులు సరికొత్త మార్గం కనిపెట్టారు. ఆటోలకు వెనుక భాగంలో మొత్తం తమ పోస్టర్లు, ఫ్లెక్సీలు అతికించి వాటిద్వారా ఎంతోకొంత ప్రచారం చేసుకుంటున్నారు.   ఇంతకుముందు కూడా వాణిజ్య ప్రకటనలకు ఆటోలను విరివిగా ఉపయోగిస్తున్నారు. వాటికి అలా ప్రకటనల బోర్డులు అతికించినందుకు ఆటోవాలాలకు నెలకు 100 రూపాయల నుంచి 300 వరకు ఇచ్చేవారు. అయితే, ఎన్నికల సీజన్ కావడం, ఒకేసారి అన్ని ఎన్నికలూ రావడంతో ఆటోవాలాలు కూడా రేటు పెంచేశారు. సగం వరకే అయితే 500, మొత్తం వెనకభాగం అంతా అయితే 1000 ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నాయకులు కూడా సరేనని అంతా ఇచ్చేస్తున్నారు. నగరాన్ని బట్టి కనీసం 10వేల వరకు ఆటోలుంటాయి. అంటే, అన్ని పార్టీలకు కలిపి కేవలం ఈ ఆటోల బడ్జెట్టే 5 నుంచి 10 కోట్ల వరకు అవుతుందన్న మాట!!

తెలంగాణాలో తెదేపా ప్రజాగర్జన రేపే

  చంద్రబాబు నాయుడు గతేడాది “వస్తున్నా మీ కోసం” పాదయాత్ర తరువాత, మళ్ళీ తెలంగాణాలో పర్యటించలేదు. తుఫాను బాధితులను పరామర్శించడానికి మధ్యలో ఒకసారి మాత్రమే వెళ్ళారు. రాష్ట్ర విభజన అంశంపై పార్టీ అనుసరించిన వైఖరి వల్ల తెలంగాణాలో పర్యటిస్తే రెండు చోట్లా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతోనే బహుశః ఆయన ఇంతవరకు పర్యటించలేదు. అయితే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణాలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి గనుక ఆయన తెలంగాణాలో పర్యటించనున్నారు.   తెలంగాణా రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తరువాత చంద్రబాబు తొలిసారిగా రేపు (శనివారం) ఖమ్మం జిల్లాలో తెదేపా నిర్వహించే ప్రజా గర్జన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. తెదేపా-తెలంగాణా నేతలు నామనాగేశ్వర రావు తదితరులు తెలంగాణాలో మొట్టమొదటిసారి జరుగబోతున్న ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గట్టిగా ప్రయత్నాలు, ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మోటార్ సైకిళ్ళపై ర్యాలీగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశః ఈ సభలో చంద్రబాబు తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలకమయిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా తెదేపా అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇదివరకే ప్రకటించిన ఆయన దానినే మరో మారు పునరుద్ఘాటించి, ఈ విషయంలో దాగుడు మూతలు ఆడుతున్నకాంగ్రెస్, తెరాసలను ఎండగట్టె ప్రయత్నం చేయవచ్చును. అదేవిధంగా హైదరాబాద్ ను ఏవిధంగా అభివృద్ధి చేసినదీ వివిఅరించి, తెదేపాకే తెలంగాణాను పునర్నిర్మించే సత్తా ఉందనే సందేశం ఈయవచ్చును. ఇక గతంలో పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్ళినవారు మరియు ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు ఈ సభలో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరే అవకాశం ఉంది. సభ ముగిసిన తరువాత, చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమవుతారు.  

పవన్ కి అలీ కూడా గుడ్ బై చెప్పెస్తాడా?

  పవర్ స్టార్ పొలిటికల్ పవర్ స్టార్ గా మారుతున్నారు. సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ సీన్ లోకి ఎంటరవుతున్నారు. అయితే పవన్ కు ఉన్న అతికొద్ది మంది స్నేహితులు ఆయన వెంట నడుస్తారా? సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పవన్ అంతరంగికుల్లో ఒకరైన మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పార్టీ వ్యూహకర్తల్లో ఒకరంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా నుంచి ఇటీవల విడుదలయిన ‘అత్తారింటికి దారేది’ వరకూఅతనితో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ అతనితో కలిసి పయనిస్తున్న నటుడు అలీ. ఈ విషయాన్ని అలీ, పవన్ లు వేర్వేరు సందర్భాల్లో సినిమా వేదికలపై చాలాసార్లు ప్రకటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పార్టీ ‘జనసేన’ విడుదలకు సిద్ధమైంది. ఇదే తరుణంలో అలీ టీడీపీలో చేరి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పవన్ పార్టీ పెడుతుండగా అలీ తెలుగుదేశం వైపు ఎందుకు చూస్తున్నారు? వీరిద్దరి స్నేహం ముగిసిందా? ఇద్దరి మధ్యా విభేదాలు పొడసూపాయా? లేక పవన్ అన్నయ్య చిరంజీవిని కాదని తన పంధాలో తను సాగాలనుకొన్నట్లే, ఆలీ కూడా తను అభిమానించే తెలుగుదేశంలో చేరబోతున్నారా? అనే విషయాలు వీరిద్దరిలో ఎవరో ఒకరు చెబితే గానీ క్లారిటీ రాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   అలీ ఎంద సీటు? సినిమాల్లో ఎంద చేట, కాట్రవల్లి ఊత పదాలతో అలరించిన ప్రముఖ హాస్య నటుడు అలీ రాజకీయాల్లోకి వస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన సొంతూరు రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెలువడినవి ఊహగానాలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం గుంటూరు అర్బన్ తూర్పు నియోజకవర్గం నుంచి అలీ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ముస్లిం మైనారిటీలు ఎక్కువమంది ఉండటం, ఇదే స్థానం నుంచి గతంలో బరిలో దిగిన దివంగత టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ భాషా సోదరుడు జియాఉద్దీన్ పోటీకి విముఖత చూపడంతో అలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని టీడీపీ నేతలు, అలీ గానీ ఖండించట్లేదు. అంటే అలీ తెదేపాలో చేరడం, గుంటూరు నుండి పోటీ చేయడం ఖాయమనుకోవచ్చేమో.

మాకు టిక్కెట్లొద్దు నాయనో..

      జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల బరిలో దిగడానికి ఆ పార్టీ సీనియర్ నేతలు నిరాకరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి ఇబ్బందులు కలిగిస్తోంది. యూపీఏ-2లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు సీనియర్లు ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి మనీశ్ తివారీ, ఆర్థిక మంత్రి చిదంబరం, సచిన్ పైలట్, జయంతి నటరాజన్ తదితర సీనియర్ నేతలు ఎన్నికల బరిలో దిగడానికి నిరాకరిస్తున్నారు. మరోవైపు.. సీనియర్ నేతలంతా ఎన్నికల బరిలోకి దిగాల్సిందేనని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో పార్టీని గెలుపు పట్టాలు ఎక్కించాల్సింది సీనియర్లేనని ఆయన చెబుతున్నారు.

కాంగ్రెస్ లోనే ఉంటానన్న బాడిగ

  రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించిన మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ మనసు మార్చుకున్నారు. మళ్లీ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఆయన బాటలోనే మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ నడిచారు. బాడిగ రామకృష్ణ మచిలీపట్నంలోని తన ఆఫీసులో కార్యకర్తలతో ఓ సమావేశం నిర్వహించారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాడిగను కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు. కాంగ్రెస్ నుంచి నాయకులు పోయారే తప్ప కార్యకర్తలు ఎక్కడికి వెళ్లలేదని, తామంతా బాడిగ కావాలనే కోరుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిసి తామంతా బాధపడినట్లు చెప్పారు. ఈసారి ఎన్నికల్లో బందరు నుంచి పోటీచేస్తే గెలిపిస్తామని అన్నారు. అయితే, పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేవనే అభిప్రాయాన్ని బాడిగ వ్యక్తం చేసినా వాళ్లు మాత్రం పట్టు వీడలేదు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండేదీ లేనిదీ చెప్పాలంన్నారు. మీరంతా కోరుతుంటే కాదనలేనని గడ్డుకాలంలో కాంగ్రెస్‌ను వీడడం తనకు ఇష్టం లేదని చెప్పిన బాడిగ చివరకు కాంగ్రెస్‌కు జై కొట్టారు. సమావేశానికి హాజరైన బూరగడ్డ వేదవ్యాస్ కాంగ్రెస్‌తోనే పయనమని ప్రకటించారు.

టీడీపీలోకి కొండా దంపతులు?

  వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు తిరుగులేని నేతలైన కొండా దంపతులు- మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ టీడీపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారు టీడీపీ తరఫున బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబుతో ఇందుకోసం కొద్ది రోజులుగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. కొండా దంపతులను టీడీపీలో చేర్చుకునే విషయంలో చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదు. అయితే ఈ విషయంపై జిల్లా నేతలతో బాబు కూడా చర్చించినట్టు సమాచారం. పరకాలతో పాటు మరో అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు టికెట్ల కోసం కొండా దంపతులు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. సోనియాకు సన్నిహితులైన ముఖ్య నేతల ద్వారా సిఫారసులు చేయించుకున్నా ఫలితం దక్కలేదు. దీనికి తోడు తమను వ్యతిరేఖించే పొన్నాల లక్ష్మయ్య తెలంగాణా పీసీసీ అధ్యక్షుడిగా రావడంతో వారి ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. తొలుత బీజేపీలో చేరాలని భావించినా, తర్వాత మనుసు మార్చుకొని టీడీపీవైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

గన్నవరంలో మళ్లీ టికెట్ ఫైటింగ్

  కృష్ణా జిల్లా గన్నవరం అంటే ప్రతిసారీ హాట్ సీటే. ఆ టికెట్ కోసం ఏ ఎన్నికల్లో చూసినా ఎంతోకొంత గొడవలు తప్పవు. ఇప్పుడు కూడా గన్నవరం అసెంబ్లీ టిక్కెట్ల పోరాటం టీడీపీలో కల్లోలాన్ని రేపుతోంది. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, వల్లభనేని వంశీమోహన్‌ పోరాటాన్ని ఉధృతం చేశారు. తమకే గన్నవరం సీటు కేటాయించాలని ఇద్దరు నాయకులూ పార్టీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుల ద్వారా వారు అసెంబ్లీ టిక్కెట్టు కోసం పోరాటం చేస్తున్నారు. గత మూడు మాసాలుగా వారిద్దరూ పార్టీ టిక్కెట్టు తనదంటే, తనదని ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని పంపించారని, ఈసారి గన్నవరం నుంచి అవకాశం ఇవ్వాలని తాను చంద్రబాబును అడిగినట్లు వంశీ అంటున్నారు. నియోజకవర్గంలో పని చేసుకోమని చెప్పారంటూ వంశీ పార్టీ శ్రేణులను కలుస్తున్నారు. అయితే, వంశీ చెప్పేదంతా అభూత కల్పనగా సిట్టింగ్ ఎమ్యెల్యే దాసరి వెంకట బాలవర్థనరావు కొట్టిపారేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరకీ టిక్కెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ నిజాయితీగల నాయకునిగా తనకు పార్టీలో ప్రజల్లో గుర్తింపు ఉందన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ తనకే గన్నవరం సీటు కేటాయిస్తారని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో పార్టీ టిక్కెట్టు ఎవరికి దక్కుతుందనే విషయం చర్చనీయాంశమైంది.

లోక్‌సభ బరిలో నగ్మా

  దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా గతంలో ఓ వెలుగు వెలిగిన నటి నగ్మాకు ఈ సారి కాంగ్రెస్ లోక్‌సభ టికెట్ దక్కింది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. లోక్‌సభ ఎన్నికలకు 71 మందితో కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో నగ్మాకు చోటు దక్కింది. ఇక్కడ దయానంద్ గుప్తాను మార్చి మరీ నగ్మాకు టికెట్ ఇచ్చారు. రెండో జాబితాలో మొత్తం 11 మంది మహిళలకు చోటు కల్పించారు. మాజీ క్రికెటర్, మొరాదాబాద్ ఎంపీ అజారుద్దీన్‌కు రెండో జాబితాలో టికెట్ దక్కలేదు. ఆ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకురాలు బేగం నూర్ బానోకు కాంగ్రెస్ కేటాయించింది. ‘ముడుపులకు ఉద్యోగం’ కుంభకోణంతో సంబంధముందని ఆరోపణలు వచ్చిన రైల్వేశాఖ మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్‌ కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన్ను తిరిగి చండీగఢ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దింపింది.

పవన్ పార్టీ కష్టమే..

  పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన’కు ఎన్నికల బరిలో చోటు లభించేలా లేదు. ఇప్పటికే షెడ్యూలు విడుదలవడం, ఎన్నికలకు తక్కువ వ్యవధి ఉండడం, పార్టీ కోసం దరఖాస్తు చేసుకుని రెండు రోజులే కావడం చూస్తుంటే తక్షణం పార్టీ ఏర్పాటు సాధ్యం కాదని తెలుస్తోంది. అయితే స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులపై పోటీచేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది. ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ దీనిపై స్పష్టత ఇచ్చారు. ‘‘జనసేన పేరుతో మార్చి 10న ఒక దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తులో పవన్‌కల్యాణ్‌ను అధ్యక్షుడిగా పేర్కొన్నారు. జనసేన పార్టీతో పోటీ చేస్తామని ఉంది. రెండు రోజులే అయింది ఆ లెటర్ వచ్చి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో అది కష్టం. నోటిఫై చేయాలి. పబ్లిక్ హియరింగ్ కావాలి. ఈ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఆరేడు నెలలు పడుతుంది. ఈ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. దానిలోపే రిజిస్ట్రేషన్ చేయడం అనేది కష్టం..’’ అని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటిస్తే.. వేరే పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చని, రిజిస్ట్రేషన్ లేకుండా అసలు ప్రకటించకూడదని, పబ్లిక్‌గా వాడుకోకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే పార్టీ జెండా, ఎజెండా లాంటివి ప్రకటించడానికి సాంకేతికంగా వీలు కాదన్న మాట. అది కాకుండా ఇంకేమైనా చెప్పుకొంటే చెప్పకోవచ్చు.

పవన్ కి అండగా మెగాభిమానులు

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టేందుకు సిద్దపడుతుండటంతో చిరంజీవి తన అభిమాన సంఘాల నేతలకు స్వయంగా ఫోన్లు చేసి తన సోదరుడి సభకు వెళ్ళవద్దని చెపుతున్నట్లు సమాచారం. అదే నిజమయితే, పదవుల కోసం ఇప్పటికే తన పరువు పోగొట్టుకొన్న ఆయన ప్రజల దృష్టిలో ముఖ్యంగా అభిమానుల దృష్టిలో మరింత చులకనవడం తధ్యం. చిరంజీవికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అభిమానులున్న సంగతి ఎవరూ కాదనలేరు. అయితే వారు ఆయన సినిమాల కారణంగానే అభిమానులయ్యారు తప్ప ఆయనలో వేరేదో గొప్ప గుణం చూసి మాత్రం కాదు. కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులలో చాలా మంది ఆయన సినిమాలను చూసి కాక ఆయనలో ఉన్న మానవతా దృక్పధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి అభిమానులయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ నటించిన అనేక సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ ఆయనపై వారి అభిమానం చెక్కు చెదరలేదు.   చిరంజీవి ప్రజారాజ్యం ప్రయోగం విఫలమయిన తరువాత మెగాభిమానులలో చాలా నిరుత్సాహం ఏర్పడింది. ఆ తరువాత వారి నమ్మకాన్ని, ఆశలను చివరికి వారి అభిమానాన్ని అన్నిటినీ వమ్ము చేస్తూ సాగుతున్న ఆయన ప్రస్తానం చూస్తున్న అభిమానులు, ఇప్పుడు సరిగ్గా అటువంటి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాజకీయాలలోకి ప్రవేశించాలనుకోవడంతో, ఆయన ఎక్కడ దెబ్బ తింటారో అనే భయంతోనే ఆయన రాజకీయ ప్రవేశాన్ని మనస్పూర్తిగా స్వాగతించలేకపొతున్నారు తప్ప, ఆయన రాజకీయాలలోకి రాకూడదని కాదు. అయితే, ఆయన ఆవేశంతో, అనాలోచితంగా వ్యవహరించకుండా సరయిన రాజకీయ విధానాలతో తనను తాను నిరూపించుకొన్నట్లయితే, ఆయనకు తన కుటుంబ సభ్యులు, సోదరులు అండగా నిలవనప్పటికీ, మెగాభిమానులందరూ ఆయనకు అండగా నిలవడం తధ్యం. పవన్ కళ్యాణ్ తన ముందున్నది పూల బాట కాదు, ముళ్ళ బాట అని నిత్యం గుర్తుంచుకొని పూర్తి అప్రమత్తతో, పూర్తి అవగాహనతో అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది. లేకుంటే ఇది కూడా మరొక ప్రజారాజ్యం, మరొక ఆమాద్మీ పార్టీలలాగ నవ్వుల పాలవుతుంది.

మెగా ఫ్యామిలీలో చీలిక

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కారణంగా, పవన్ కళ్యాణ్ కు ఇంటిపోరు తప్పడం లేదు. ఆయన సోదరుడు నాగబాబు మీడియాతో మాట్లాడుతూ, తమకు తమ అన్నయ్య చిరంజీవే దారి చూపాడని అందువల్ల ఆయన చూపిన బాటలోనే, ఆయననే అనుసరిస్తూ ముందుకు సాగుతానని చెప్పారు. తాను చిరంజీవికే మద్దతు పలుకుతానని విస్పష్టంగా చెప్పారు. ఇకపై మెగా ఫ్యామిలీలో మిగిలిన హీరోలు అల్లు అర్జున్, శిరీష్, వరుణ్ తేజ తదితరులు అందరూ కూడా వారి బాటేపట్టే అవకాశం ఉంది. గనుక పవన్ కళ్యాణ్ ఒంటరి అయిపోయినట్లే భావించవచ్చును. అదేవిధంగా మెగాభిమానులు కూడా ఎటువైపు మొగ్గాలనే సందిగ్ధంలో ఉన్నారు కనుక వారిలో కూడా చీలిక రావడం తధ్యం. రేపు పవన్ కళ్యాణ్ తన పార్టీ, తన ఆశయాలు, ఆంధ్ర, తెలంగాణా అంశాలు, సమైక్యవాదం, బలహీన వర్గాలు వగైరా అంశాల గురించి మాట్లాడిన తరువాత ప్రజలు, అభిమానులు, రాజకీయ పార్టీలు కూడా స్పందించడం మొదలుపెడతాయి. దానిని బట్టి పవన్ కళ్యాణ్ వెంట ఎంత మంది నడుస్తారో, ఎవరెవరు నడుస్తారో అనే అంశంపై మరింత స్పష్టత వస్తుంది.

కొడవళ్ళు మళ్ళీ కలిసాయి

  నిన్న మొన్నటి వరకూ కత్తులు, కొడవళ్ళూ దూసిన లెఫ్ట్ పార్టీలు రెండూ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు ఎత్తులతో ముందుకు వెళుతున్నాయి. సిద్ధాంత రాద్ధాంతాలను పక్కనబెట్టి కలిసి సాగాలని నిర్ణయించుకుంటున్నారు పాత మిత్రులు. ఆ నాటి ఆ స్నేహం ఆనంద గీతం అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. జగన్ పార్టీతో ఎన్నికల్లో వెళదామని ఆలోచించిన సీపీఎం, అవినీతి మకిలి తమకూ అంటుకుంటుందని భయపడి దూరం జరిగారు. సీపీఐ కూడా రాజకీయ సర్దుబాటు కోసం అటు ఇటు దిక్కులు చూసింది. ఎటు వైపు నుంచీ గ్రీన్ లైట్స్ కనిపించకపోవడంతో, దూరంగా కనబడుతున్న రెడ్ లైటు వైపే సాగాగా సాగాగా అక్కడ తన పాత మిత్రుడు సీపీయం కనబడింది. అప్పుడు రాఘవా, నారాయణ అనుకొంటూ ఒకరినొకరుకరుచుకుపోయారు.   ఒకరికొకరు లాల్ సలాములు చేసుకొన్నాక, మనతో ఎవరూ కలవనప్పుడు మనమే ఒకరితో మరొకరు కలిసి పోటీ చేసుకొందామని ఇద్దరూ డిసైడ్ అయిపోయారు. కలిసి కలదు సుఖమూ అనే ఆ పాత మధురాలను ఒకసారి కలిసి పాడుకొన్నారు మన కామ్రేడ్లు. ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. కారణం అవినీతి కాంగ్రెస్ తో కలిసి వెళ్ళలేరు. మతతత్వ బీజేపీతో దోస్తీ కుదరదు. బాబు కూడా బీజేపీ వైపే చూస్తుండటంతో ఆయన కూడా తమతో పొత్తుల ఊసే ఎత్తక పోయే..తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకే గెటవుట్ చెప్పేసిన తెరాస తమను ఎర్రెర కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతుందని ఆశపడటం అత్యాశే అవుతుంది. అందుకే ఆడుకున్నా, పాడుకున్నా తమ బాష అర్ధం చేసుకోగల కామ్రేడ్స్ తో ముందుకు సాగడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చేసారు.   సీపీఎం, సీపీఐలకు ఇరు ప్రాంతాల్లో కలిసి వచ్చే అంశాలున్నాయి. ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇచ్చిన సీపీఐకి తెలంగాణలో ప్లస్ అయితే, సమైక్యాంధ్రకు కట్టుబడ్డ సీపీఎంకు సీమాంధ్ర లో పరిస్థితులు అనుకూలిస్తాయని అంచనా వేస్తున్నారు కామ్రేడ్స్. అంటే ఈ సారి కామ్రేడ్స్ కూడా మరో కొత్త శక్తిగా బరిలోకి దిగుతున్నారన్నమాట.

అప్పుడే అసమ్మతి ‘గంట’ మ్రోగేసింది

  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరియు మరో నలుగురు కాంగ్రెస్ యం.యల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరి గట్టిగా 24గంటలు కూడా గడవక ముందే అప్పుడే గంటా బ్యాచ్ తెదేపాకి అసమ్మతి గంట కొట్టేసింది. వాళ్ళ రాకను మొదటి నుండి వ్యతిరేఖిస్తున్న సీనియర్ తెదేపా నేత అయ్యన్న పాత్రుడు నిన్న వారు పార్టీలో చేరిన తరువాత వారి పట్ల తన అయిష్టతను బహిరంగంగానే ప్రకటించేయడంతో గంటా బ్యాచ్ కంగు తింది.   చంద్రబాబు, గంటా బ్యాచ్ మరనేక మంది పార్టీ సీనియర్లు పాల్గొన్న సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, “ఈ కొత్తగా వస్తున్న వాళ్ళు పార్టీలో ఎంత కాలం ఉంటారో ఎప్పుడు వెళ్లిపోతారో ఎవరికీ తెలియదు. కానీ, మేము మా కార్యకరతలం మాత్రం చనిపోయేవరకు పార్టీనే అంటిపెట్టుకొని ఉంటాము,” అని గంటా బ్యాచికి అందరి సమక్షంలో చురుకలు వేసారు. ఆయన అలా అనడానికి బలమయిన కారణం ఉంది.   గత ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు తెదేపాకు హ్యాండిచ్చి ప్రజా రాజ్యం పార్టీలోకి దూకి, అక్కడి నుండి చిరంజీవితో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి దూకేసి మంత్రి అయిపోయారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు బయటకి దూకేసి పారిపోయిన గంటా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉండటం చూసి మళ్ళీ తెదేపాలోకి దూకేశారు. ఒకవేళ ఎన్నికల తరువాత అదృష్టం బాగుండి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే గంటా తెదేపాలోనే కొనసాగుతారనే నమ్మకం ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ 'జై చిరంజీవ!' అంటూ హనుమంతుడిలా చిరంజీవి చేయ్యందుకొని కాంగ్రెస్ లోకి దూకేయడం ఖాయం. అందుకే అయ్యన్న పాత్రుడు ఆ విధంగా అన్నారు.   ఆయనే కాదు స్వయంగా గంటా శ్రీనివాసరావే పార్టీలో చేరుతున్న సందర్భంగా ప్రసంగిస్తూ, “మా వంటి నేతలు తెదేపాలోకి వస్తుంటారు..వెళ్లిపోతుంటారు. కానీ పార్టీ కార్యకర్తలు మాత్రం పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఏమయినప్పటికీ తెదేపాలోకి రావడం స్వంత ఇంటికి చేరుకోన్నట్లే నాకు అనిపిస్తోంది,” అని అన్నారు.   మరి తనన్న మాటలనే అయ్యన్న నోట విన్నపుడు గంటా ఎందుకు అంత ఉలికి పడ్డారో తెలియదు కానీ తెదేపా నేతలతో ఏర్పాటు చేసిన తొలి సమావేశానికి తన బ్యాచ్ తో సహా డుమ్మా కొట్టేసి పార్టీలోకి వచ్చి 24గంటలు కూడా కాకముందే అసమ్మతి గంట కొట్టేసారు. అయ్యన్నపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తాజా సమాచారం.

పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ జనసేన పేరుపై వివాదం షురూ

  పోలిటిక్స్ లోకి ఎంటరవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పార్టీ పేరు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా జనసేన అంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఈ పేరుకు మించిన పేరే ఉండదంటూ రాంగోపాల్ వర్మ వంటివారు అప్పుడే ట్వీటేశారు. ఇంతలోనే జనసేన పార్టీ తమది అంటూ కొందరు మీడియా ముందుకు రావడం సంచలనం సృష్టించింది. రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్న తాము 6 నెలలు కష్టపడి జనసేన అని నామకరణం చేసుకున్నామని చెబుతున్నారు. వారం రోజుల క్రితం ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేశామని బాలరాజ్, అతని మిత్రులు చెబుతున్నారు. తమ పార్టీ పేరైన జనసేనపై ఎవరికి ఎటువంటి అభ్యంతారాలున్నా తెలియజేయాల్సిందిగా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చామని ఆధారాలు చూపిస్తున్నారు. మీడియాలో ప్రచారం నిజమై పవన్ పార్టీ కూడా జనసేనే అయితే దయ చేసి పేరు మార్చుకోవాలని అప్పీల్ చేశారు. పవన్ పార్టీ తరపున ఇంతవరకు ఏ ఒక్కరూ పార్టీ పేరు ప్రకటించలేదు. పవర్ స్టార్ పార్టీ పేరు కూడా జనసేన అయితే మరో కొత్త వివాదం మొదలైనట్లే.

అమెరికాలో మెరిసిన భారతీయ విద్యార్థులు

      అమెరికాలో ఇద్దరు భారతీయ అమెరికన్ విద్యార్థులు బుధవారం ప్రతిష్టాత్మక ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇంటెల్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ సైన్స్ అవార్డుల పోటీలో ఎనిమిది, పదో స్థానాలను కైవసం చేసుకున్న జార్జియాకు చెందిన ఆనంద్ శ్రీనివాసన్(17), మేరీల్యాండ్‌కు చెందిన శౌన్ దత్తా(18)లు ఈ ఘనత సాధించారు. అవార్డు కింద చెరో రూ. 12.23 లక్షల నగదును అందజేశారు. డీఎన్‌ఏలోని అతి సూక్ష్మ భాగాలను సైతం తెలుసుకునేందుకు ఉపయోగపడే ‘ఆర్‌ఎన్‌ఎన్‌స్కాన్’ అనే న్యూరల్ నెట్‌వర్క్ సంబంధిత కంప్యూటర్ మోడల్‌ను శ్రీనివాసన్ ఆవిష్కరించగా.. అణు పదార్థాల చర్యలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు దోహదపడే కంప్యూటర్ మోడల్స్‌ను, సూత్రాలను శౌన్ దత్తా అభివృద్ధిపర్చాడు.

పోటీ చేయడానికి ఎదురు డబ్బులు?

      అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆఖరుకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి వద్దకు నేరుగా నాయకులే వెళ్లి కాంగ్రెస్ తరఫున బీఫారం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నా వారి నుంచి స్పష్టమైన హామీ రావడం లేదు.   మాజీ మంత్రి రఘువీరారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రావడంతో పరువు నిలవాలంటే అన్ని చోట్లా అభ్యర్థులను రంగంలో దింపాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు రంగంలో ఉండాల్సిందేనంటూ తన అనుచరవర్గానికి రఘువీరా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గమైన మడకశిర మున్సిపాలిటీలో మాత్రమే అన్ని వార్డులకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. మిగిలిన 10 మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. మడకశిర మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారందరికీ తానే ఖర్చు భరిస్తానని రఘువీరారెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అనంతపురంలో ఇద్దరు ముగ్గురు మాత్రం ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని నేరుగా తమకు ఇస్తామంటేనే పోటీ చేస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది.

చంద్రబాబు సరి కొత్త ప్రయోగం

  ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని, వినియోగించుకోవడంలో ఎల్లపుడు ముందుండే చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలకు మరో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు నిన్న వైజాగ్ లో జరిగిన ప్రజాగర్జన సభలో ప్రకటించారు.   ఈసారి పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరిని అభ్యర్ధులుగా నిలబెట్టాలో తెలుపమని కోరుతూ పార్టీ ఎంచుకొన్నకొందరు అభ్యర్ధుల పేర్లను చంద్రబాబు గొంతుతో రికార్డు చేయబడిన వాయిస్ మెసేజ్ లు పార్టీ కార్యకర్తల, ప్రజల సెల్ ఫోన్లకు పంపబడతాయని, ఐ.వీ.ఆర్.యస్. ఆధారితంగా పనిచేసే ఆ మెసేజ్ లకు ప్రజలు, కార్యకర్తలు స్పందించి తమకు నచ్చిన అభ్యర్ధులను ఎంచుకోవచ్చని వారి అభిప్రాయాలకు అనుగుణంగా వారికి నచ్చిన వ్యక్తినే పార్టీ అభ్యర్ధిగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే నియోజక వర్గాల వారిగా అభ్యర్ధుల పేర్లతో కూడిన మెసేజ్ లు ప్రజలకు, కార్యకర్తలకు అందుతాయని, వాటికి స్పందించమని చంద్రబాబు కోరారు.   ఇదే ప్రయోగం ఆయన అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయక మునుపే చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. అందరి మన్ననలు పొందగాలిగేవారు. కానీ, దాదాపు సగం మందికి పార్టీ టికెట్స్ ఖరారు చేసిన తరువాత చేస్తున్న ఈ ప్రయోగం వలన ఆశించిన ఫలితం దక్కకపోవచ్చును. పైగా కొత్త సమస్యలను సృష్టించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు విజయవాడ నుండి కేశినేని నానికి ఏడాది క్రితమే ఆయన లోక్ సభ టికెట్ ఖరారు చేసారు. ఇప్పుడు ఆయనతో బాటు మరో ముగ్గురు అభ్యర్ధుల పేర్లను సూచిస్తూ మెసేజులు పంపినప్పుడు, ప్రజలు, కార్యకర్తలు ఆయనను కాక మరొకరి పేరును సూచిస్తే ఆయనను మార్చడం సాధ్యమా? అంటే కాదనే చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నుండి తెదేపాలోకి వచ్చి చేరుతున్న వారందరూ కూడా పార్టీ టికెట్స్ ఖరారు చేసుకొన్న తరువాతనే పార్టీలో చేరుతున్నారనేది బహిరంగ రహస్యం. కనుక అభ్యర్ధులకు పార్టీ టికెట్స్ ఖరారు చేసిన తరువాత ప్రజలను, కార్యకర్తలను అభిప్రాయం కోరడంలో ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలి.   అయితే, ఇప్పటికీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయని అనేక నియోజకవర్గాలలో ఈ ప్రయోగం చేయవచ్చును. కానీ, అది కూడా కొత్త సమస్యలకు దారి తీయవచ్చును. అయితే ప్రతీ కొత్త ప్రయోగానికి, ఆలోచనకీ మొదట్లో ఇటువంటి ఆటుపోటులు, విమర్శలు ఎదుర్కోక తప్పదు గనుక చంద్రబాబు ప్రయత్నించడంలో తప్పులేదు.