వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు

 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి మాత్రం ఈ సమావేశాలు వాడివేడిగా సాగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు అనేక విషయాలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు సాగుతాయా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలు సజావుగా సాగనివ్వవని తెలుస్తోంది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మోడీ ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా వివిధ అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంటే కానీ సమావేశాలను సజావుగా సాగన్విబోమని నిన్ననే కాంగ్రెస్‌ నేతలు స్పష్టంచేశారు. ముఖ్యంగా లలిత్ గేట్ వివాదంలో సుష్మా స్వరాజ్, తప్పుడు డిగ్రీ వివరాలను ఈసీకి సమర్పించిన వివాదంలో స్మృతి ఇరానీల రాజీనామాలకు కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. వారు రాజీనామా చేస్తేకాని సమావేశాలు సజావుగా సాగుతాయని తేల్చి చెప్పారు.

 

మరోవైపు భూసేకరణ బిల్లు.. యూపీఏ పాలనలో ఉన్న భూసేకరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసిన నేపథ్యంలో ఆ బిల్లును ఆమోదింపచేయాలని చూస్తుంది. కానీ ఈ భూసేకరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పుడో తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ బిల్లుపై ర్యాలీ కూడా చేశారు. ఇదిలా ఉండగా నిన్న జరిగిన సమావేశంలో మోడీ మాత్రం మీరు ఔనన్నా.. కాదన్నా భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టితీరుతామని.. ఈ బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరముందని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు. దీనిని బట్టి ఈ వ్యవహారంపై కూడా పార్లమెంట్ సమావేశాల్లో పెద్ద రచ్చనే జరగబోయే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘అసలు యుద్ధాన్ని’ త్వరలో చూస్తారంటూ ప్రకటించారు. అంటే మోడీకి కూడా ముందే అర్ధమయివుంటుందని.. అందుకే అలా అని ఉంటారని భావిస్తున్నారు. మోడీ అన్నట్టుగానే ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎంత వాడివేడిగా జరగనున్నాయో చెప్పకనే చెప్పాయి.

Teluguone gnews banner