రేవంత్ ను ఆకర్ష్ ఆకర్షించలేకపోయింది
posted on Jul 21, 2015 @ 11:10AM
*రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఆకర్ష్
*రేవంత్ రెడ్డి కోసం టీఆర్ఎస్ ముఖ్యనేత రంగలోకి
*విచారణలో ఉన్నాను.. ఇప్పుడు చెప్పను
తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కుట్ర పన్ని ఓ పథకం ప్రకారం నోటుకు ఓటు కేసులో ఇరికించారని అందరికి తెలిసిన విషయమే. అయితే అసలు విషయం ఏంటంటే తెలంగాణ అధికార పార్టీ అన్ని పార్టీలకు చెందిన నాయకులను ఆకర్ష్ మంత్రం ద్వారా తమ పార్టీలోకి లాకున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై కూడా ఈ ఆకర్ష్ మంత్రాన్ని ఉపయోగించారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. అందరి మీద ఆకర్ష్ మంత్రాన్ని విసిరినట్టే రేవంత్ రెడ్డి పై కూడా ఈ మంత్రాన్ని విసిరారట.. ఆయా నేతల స్థాయిని బట్టి వారికి సరితూగే నేతలను టీఆర్ఎస్ రంగంలోకి దించుతుండగా.. రేవంత్ రెడ్డి కోసం మాత్రం ఆపార్టీకి చెందిన ఓ ముఖ్య నేత రంగంలోకి దిగారట. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పడం గమనార్హం.
తను ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఈ ఆసక్తికరమైన మాటలు చెప్పారు. అయితే ఆఫర్ చేశారని చెప్పనైతే చెప్పారు కానీ అసలు ఏం ఆఫర్ చేశారు. ఏం మాట్లాడారు.. అనే విషయాలు చెప్పలేదు. సాధారణంగా ఒక పార్టీ అధికారంలో ఉందంటే ఇలాంటి ఆఫర్లు చేయడం సహజం.. తాను విచారణలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పడం సరికాదని.. అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా చెపుతానని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ అనే మంత్రం ద్వారా పార్టీ నేతలనందరికి తమ వైపుకు తిప్పుకోవాలని చూసినట్టు తెలుస్తోంది. ఎంతకాదనుకున్నా రేవంత్ రెడ్డి మంచి వాక్చాతుర్యం ఉన్న నేత.. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రితో సహా అందరితో గట్టిగా మాట్లాడగల వక్త. అలాంటి రేవంత్ రెడ్డిని తమ పార్టీలోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీకి చాలా బలోపేతంగా ఉంటుందని.. అంతేకాక తెలంగాణ నుండి ప్రతిపక్ష నేతలలో గట్టిగా వాదించే సత్తా ఉన్న నాయకుడు కూడా రేవంత్ రెడ్డే.. కాబట్టి రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే ఎలాంటి సమస్యలు ఉండవని ఆలోచించారేమో అధికార పార్టీ నేతలు అందుకే రేవంత్ రెడ్డి పై వల విసిరారు. కానీ అంతా బాగానే ఉన్నా రేవంత్ రెడ్డిని సెలక్ట్ చేసుకోవడం టీఆర్ఎస్ చేసిన మొదటి తప్పు. ఎందుకంటే తెదేపా పార్టీలోని బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి.. తెదేపాకి.. పార్టీ అధ్యక్షుడికి నమ్మిన బంటు లాంటి వాడు రేవంత్ రెడ్డి . అలాంటి రేవంత్ రెడ్డిని తమ ఆకర్ష్ మంత్రం ద్వారా ఆకర్షించాలనుకోవడం తప్పు. వెరసి వాళ్లు చేసిన ఆఫర్లను రేవంత్ రెడ్డి తిరస్కరించారు. దీంతో టీఆర్ఎస్, వైకాపా పార్టీలు కుమ్మక్కయి.. రేవంత్ రెడ్డిపై కుట్ర పన్ని ఓటుకు నోటు కేసులో ఇరికించారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో హరీశ్ రావు, జగన్ కలిసి ఓ హోటల్ లో సమావేశమయ్యారన్న వార్తులు కూడా వచ్చాయి. మొత్తానికి డబ్బుకు లొంగలేని కారణంగా ఓ నాయకుడిపై కుట్రపన్ని ఇలా ఇరికించడం అన్యాయమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.