ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు.. బైరెడ్డి
posted on Jul 21, 2015 @ 2:53PM
ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అటు ఏపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కేంద్రమంత్రి సుజనా చౌదరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయని..60 శాతం చర్చలు పూర్తయ్యాయని.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడం ఖాయమని.. మరో నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా తథ్యమని జోస్యం చెప్పారు. అందరూ ఏపీకి ప్రత్యేక హోదా రావడానికి నానా తంటాలు పడుతుంటే ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు చేపట్టిన దీక్షకు బైరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోస్తా ఆంధ్రా.. రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందని.. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఏం అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాయలసీమ వర్సిటీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ.. యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా పై బైరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేతలందరూ మండిపడుతున్నారు.