సుప్రీంను ఆశ్రయించిన సర్వీసు ప్రొవైడర్లు

 

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విజయవాడ కోర్టులో వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వాదనలో సర్వీసు ప్రొవైడర్లు పలు వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎలాంటి కాల్ డేటా ఇవ్వద్దని.. మెమో ఫైల్ చేసిందని, డేటా ఇస్తే ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించిందని చెప్పారు. అంతేకాక ఇదే విషయంపై ఎటూ తేల్చుకోలేని సర్వీసు ప్రొవైడర్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారం నిఘా సంస్థల దగ్గర ఉంటుంది కానీ సర్వీసు ప్రొవైడర్ల దగ్గర ఉండదని.. కాబట్టి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని వారికి లేఖ రాసింది. ఇదే విషయాన్ని సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు తెలిపారు. కానీ కోర్టు దానిని తీవ్రంగా ఖండించి.. పాలనా వ్యవహారాలు వేరు, కోర్టులు వేరని.. కాల్ డేటా ఇచ్చి తీరాల్సిందే అని తేల్చి చెప్పింది.

 

అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సర్వీసు ప్రొవైడర్లు విజయవాడ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. దీనిలో భాగంగానే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ నెల 24వ తేదీలోగా కాల్ డేటా ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించడంతో ఆ గడువు సమీపిస్తుంది కాబట్టి సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

Teluguone gnews banner