డీఎస్ దారిలో పొన్నాల! కారెక్కుతారా!

 

ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆపార్టీని వీడి మరో పార్టీలోకి మారుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకపోవడంతో ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీని వదిలి వెళుతున్నారు. ఆఖరికి ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి.. ఎంతో రాజకీయానుభవం మూటగట్టుకున్న నేతలు కూడా పార్టీని వీడి వెళిపోతున్నారు. మొన్నీమధ్యనే డీఎస్ కూడా హస్తాన్నీ వీడి కారునెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా డీఎస్ దారిలో నడుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. పొన్నాల లక్ష్మయ్య కూడా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

 

ఒక్కటిగా ఉన్న రాష్ట్ర విడిపోవడానికి కారణమయిన కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఉనికి లేకపోవడంతో పార్టీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెలంగాణ పిసిసి బాధ్యతలను భుజానేసుకున్నారు పొన్నాల. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం పొన్నాలను పీసీసీ భాధ్యలనుండి తీసి ఆస్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి పొన్నాలకు పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఆహ్వానం అందడంలేదట. దీంతో పొన్నాల మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పొన్నాల తన సన్నిహితుల వద్ద కూడా వ్యక్తపరిచారంట. కాంగ్రెస్ పార్టీలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయని.. పిసిసి పదవి నుంచి తనను తొలగించడంతో పాటు పలు రకాలుగా తనను కాంగ్రెసు నాయకత్వం అవమానించిందని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి మారాలని యోచన చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీ నుండి రోజుకో నాయకుడు వేరే పార్టీలోకి వెళ్లడం జరుగుతోంది. ఇంకా ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంటుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

Teluguone gnews banner