టీడీపీతో కటీఫ్.. టీఆర్ఎస్ తో బీజేపీ..!

  రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అస్సలు చెప్పలేం. నిన్న మొన్నటి వరకూ పిచ్చ తిట్లు తిట్టుకున్నోళ్లు కూడా సడెన్ గా ఈరోజు ఒక్కటైపోతుంటారు. రాజకీయమంటే అదేనేమో అనిపిస్తుంటుంది. ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది.   టీడీపీ, బీజేపీ పార్టీలు మిత్రపక్షమని అందరికీ తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కలుపున్న ఈరెండు పార్టీలు.. అటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ.. ఇటు కేంద్ర ప్రభుత్వంలోనూ గెలుపొంది అధికారం చేపట్టాయి. అయితే ఈరెండు పార్టీలు మిత్రపక్షాలు అయినప్పటికీ నాయకుల మధ్య మాత్రం ఎప్పుడూ బేధాభిప్రాయాలు ఉంటూనే ఉండేవి. ఇక రాష్ట్ర విభజన తరువాత పరిస్థితి చెప్పనవసరం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల దుమ్ము దులిపేస్తుంది. ఇప్పటికే దాదాపు టీడీపీ ఖాళీ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే బీజేపీ టీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు రెడీ అవుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.   దీనిలో భాగంగానే ఎప్పుడూ కేసీఆర్ అపాయింట్ మెంట్ కు దూరంగా ఉండే మోడీ.. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం..  ప్ర‌ధాని మోదీతో ఏకాంతంగా సమావేశం అవ్వ‌డం.. అడిగిన వ‌న్నీ వ‌రుస‌పెట్టి ఇచ్చేయ‌డం.. ఇవ‌న్నీ చూస్తుంటే నిజ‌మే అనిపించ‌క‌మాన‌దు!. అంతేకాదు తాజాగా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ లో కూడా తెలంగాణకు బాగానే న్యాయం జరిగినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎంపీ కవిత కూడా కవిత సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఇప్పుడు క‌మ‌లం కారెక్క‌బోతోంది అనే అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. కేంద్ర మంత్రివర్గంలోకి టీఆర్ఎస్ చేరిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. మరి ఎంతవరకూ నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. 

స్మృతీ తల నరికి ఇవ్వు.. మాయావతి

రోహిత్ ఆత్మహత్యపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, యూపీ మాజీ సీఎం, బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మధ్య ఇంకా రగడ జరుగుతూనే ఉంది. ఈనేపథ్యంలో మాయావతి స్మృతీ ఇరానీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ అంశంపై స్మృతీ చెప్పిన సమాధానాలు తనకు సంతృప్తి చెందలేదని.. రోహిత్‌ అంశంపై తన సమాధానంతో నేను సంతృప్తి చెందకుంటే తన తల నరికి సమర్పిస్తానని స్మృతి ఇరానీ చెప్పారని.. కనుక ఆమె చెప్పినట్టు తలనరుక్కొని తన ముందు పెట్టాలని మాయవతి అన్నారు. రోహిత్‌ ఆత్మహత్యపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్‌లో దళిత సభ్యుడిని నియమిస్తారా లేదా అన్న తన ప్రశ్నకు ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదని మాయావతి అన్నారు. దీనికి స్మృతీ స్పందిస్తూ..  కేంద్రీయ వర్సిటీలోని ప్రాక్టోరియల్‌ బోర్డులో ఎస్సీ సభ్యుడు లేరన్న ఆరోపణలను నిరాధారమన్నారు.. ఇంకా నా తలను తీసుకురమ్మని మీ కార్యకర్తలను పురమాయించండని పేర్కొన్నారు. మరి ఈ గొడవ ఇంకెంత దూరం వెళుతుందో..

ముషారఫ్‌కు మరణశిక్ష

  పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ మరణశిక్షను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఆ దేశ ఉన్నత న్యాయస్థానం నిన్న 2007లో ముషారఫ్ చర్యల గురించి విచారణ చేపట్టవలసిందిగా ఆదేశించింది. 2007లో ముషారఫ్‌ దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జన్సీని విధించారు. అందుకు వ్యతిరేకించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇఫ్తకర్‌ మహమ్మద్‌ను నిర్దాక్షిణ్యంగా ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన చర్యతో ఆనాటి న్యాయవ్యవస్థ మొత్తం ముషారఫ్ మీద మండిపడింది. న్యాయవాదులంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఆనాటి నుంచి ముషారఫ్‌కూ న్యాయవ్యవస్థకూ మధ్య సంబంధం ఉప్పునిప్పులాగా సాగుతోంది. అప్పట్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ముషారఫ్‌ తీసుకున్న ఈ చర్యలన్నీ దేశద్రోహం కిందకి వస్తాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడుతోంది. అందుకుగాను ఆయన మీద విచరణ జరిపించి తనకు తుది నివేదికను అందచేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసులో కనుక ముషారఫ్‌ దోషిగా తేలితే ఆయనకు మరణశిక్షను విధించే అవకాశం కూడా ఉంది. దీంతో నిదానంగా దేశం నుంచి జారుకోవాలని ప్రయత్నిస్తున్న ముషారఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ముషారఫ్‌ ఇప్పటికే మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టోకి సంబంధించిన హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.

విరాట్‌ కోహ్లీ అభిమానికి బెయిల్‌

  భారతదేశ జెండాను తన ఇంటి మీద ఎగరువేసిన కేసులో ఉమర్‌ దరాజ్‌ అనే పాకిస్తాన్‌ పౌరునికి ఎట్టకేళకు బెయిల్ లభించింది. దీంతో దాదాపు నెలరోజులుగా జైళ్లో మగ్గుతున్న ఉమర్‌కు కాస్త ఉపశమనం లభించినట్లైంది. విరాట్‌ కోహ్లీకి వీరాభిమాని అయిన ఉమర్‌, గత నెల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఆడిన తీరుకి మురిసిపోయాడు. వెంటనే తన ఇంటి మీద భారతదేశ జెండాను ఎగురవేశాడు. దాంతో స్థానిక పోలీసు అధికారులు ఉమర్‌ను నిర్బంధించడమే కాకుండా, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తున్నాడంటూ తీవ్రమైన కేసులను మోపారు. ఈ కేసులో ఉమర్‌కు కనీసం పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. తనను విరాట్‌ అభిమానిగా మాత్రమే చూడమనీ, ఎవరో గూఢచారిలా భావించవద్దనీ ఉమర్‌ కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. ఉమర్‌ నిజంగానే అమాయకుడని అతని గతానికి సంబంధించిన పోలీసు రికార్డులు కూడా పేర్కొంటున్నాయి. ‘ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ జరిగేటప్పుడు చాలామంది బ్రెజిల్, అర్జెంటినీల జెండాలను ఎగురేస్తారు... అంతమాత్రాన వారు దేశద్రోహులు అయిపోతారా’ అంటూ ఉమర్‌ న్యాయవాదులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇంతకీ ఉమర్‌ భవిత ఎలా ఉంటుందో చూడాలి మరి!

మోదీ కూడా మన్మోహన్‌లా అయిపోతున్నారు- తృణమూల్

  తన వాక్పటిమకు పేరొందిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్షాల నుంచి ఓ చిత్రమైన విమర్శను ఎదుర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుల్తాన్‌ అహ్మద్ అనే ఎంపీ నిన్న పార్లమెంటులో మాట్లాడుతూ, హర్యానా గురించి మోదీ నిశ్శబ్దంలో ఉండటంలో ఆంతర్యం ఏమిటంటూ ప్రశ్నించారు. మోదీ కూడా నిదానంగా పూర్వ ప్రధాని మన్మోహన్‌లాగా ‘సైలెన్స్ సిండ్రోమ్‌’ అనే లక్షణానికి లోనవుతున్నారనీ, అధికారం వేరెవరో చెలాయిస్తున్నారనీ విమర్శించారు. దిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న హర్యానాలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరుగుతున్నా మోదీ కిమ్మనకుండా ఉన్నారన్నది సుల్తాన్‌ అహ్మద్‌ మాట. నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల యువత అసహనానికి లోనవుతున్నారనీ, అందుకే ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయనీ అన్నారు సదరు సభ్యుడు. మోదీ ఈ విమర్శకు జవాబిస్తారో, పోతేపోనీ అని ఊరుకుంటారో చూడాలి మరి!

బాలకృష్ణకు వ్యతిరేకం కాదు.. కానీ చిరంజీవిని అనే హక్కు లేదు..

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిరంజీవిపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై చిరంజీవి అభిమానులు ఇప్పటికే గుర్రు మీద ఉన్నారు. ఇక తమ్ముడు పవర్ స్టార్ కూడా బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న్టట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. ఆయన ఉత్సవాలు ఎవరి ఖర్చుతో చేసుకన్నా పర్వలేదు.. చిరంజీవి గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదన్నారు. బాలకృష్ణకు తాము వ్యతిరేకం కాదని, అయితే చిరంజీవిని విమర్శించే హక్కు ఆయనకు లేదని చెప్పారు.

దేవినేని నెహ్రూతో వర్మ.. వర్మకు హెచ్చరిక..

  దర్శకుడు రాంగోపాల్ వర్మ వంగవీటి సినిమా కోసం విజయవాడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన దేవినేని నెహ్రూతో సమావేశమయ్యారు. దీంతో బెజవాడ మొత్తం వంగవీటి హడావుడితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు ఈసినిమాకి రావాల్సిన విమర్శలు వస్తూనే ఉన్నాయి. సీపీఐ నగర కార్యదర్శి శంకర్ వంగవీటి రాంగోపాల్ వర్మను హెచ్చరించారు. కమ్యూనిస్టు నేత తలసాని వెంకటరత్నంను రౌడీగా చిత్రీకరించాలని చూస్తే తాము సహించమని అన్నారు. అసలు రాంగోపాల్ వర్మకు ఏం తెలుసు.. పేదల కోసం తలసాని వెంకటరత్నం అనేక పోరాటాలు చేశారు..  బెజవాడలో కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్ర రామ్గోపాల్ వర్మకు ఏం తెలీదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్‌ స్టేషన్లో సీమంతం

  పోలీస్‌ స్టేషన్లో పెళ్లిళ్లను జరిపించే వార్తలు మనకి కొత్తేమీ కాదు. కానీ గుంటూరులో ఏకంగా ఒక మహిళా కాన్‌స్టేబుల్‌కి, స్టేషన్లో సీమంతం జరిపించిన విషయం ఇప్పుడు వార్తలలో నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే. ప్రమీల అనే మహిళా కాన్‌స్టేబుల్ ఎనిమిది నెలల గర్భవతి. అయితే తరచూ డ్యూటీలోనే ఉండటం వల్ల ఆమెకు స్టేషన్లోనే సీమంతం జరిపించేస్తే బాగుంటుందన్న ఆలోచన డీఎస్‌పీ సరితకు వచ్చింది. అంతే! నిన్న స్టేషన్‌నే ఫంక్షన్‌హాలుగా మార్చేశారు. బ్యానర్లూ, కుర్చీలూ తెప్పించారు. పళ్లు, గాజులు, కొత్తచీరలు అన్నింటినీ ప్రమీలకు బహుకరించి ఆమెకు ఘనంగా సీమంతాన్ని జరిపించారు. తరచూ డ్యూటలో ఉండే పోలీసులకి సంప్రదాయాలను పాటించే అవకాశం చిక్కదనీ, అందుకే తాను ఈ వేడకుని నిర్వహించానని పేర్కొన్నారు సరిత!

కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుండే..

కృష్ణా పుష్కరాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యలయం నుండి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు జరగనున్నట్లు ఏపీ దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. అంతేకాదు కృష్ణా పుష్కరాల కోసం నూతనంగా 280 ఘాట్లు నిర్మించనున్నట్లు.. ఈ పుష్కరాల నిమిత్తం..  అమరావతిలో ఘాట్ల నిర్మాణంతో పాటు కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అంతేకాదు గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల్లో జరిగిన ప్రమాదం.. ఇప్పుడు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇక సీఎం కూడా కృష్ణా పుష్కరాలను కూడా నదుల అనుసంధానికి సంకల్పంగా స్వీకరించాలన్నారు.

మెగా పవర్ స్టార్స్ ఫేక్ స్టార్స్ .. వర్మ సంచలన ట్వీట్

  ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెర లేపనిదే రాంగోపాల్ వర్మకి అస్సలు నిద్రపట్టదు. ట్విట్టర్ అనే ఆయుధం ద్వారా తను ఏది అనుకుంటే అది చెప్పేస్తుంటాడు ఈ వివాదాల వర్మ.. అయితే ఈసారి ట్వీట్స్ లో పొలిటికల్ టచ్ ఇచ్చాడు. కాపుల కోసం కాపు ఐక్య గర్జన ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభంపై ప్రశంసలు కురిపించారు. ముద్రగడ రియల్ మెగా పవర్ స్టార్ అని.. స్క్రీన్ మెగా పవర్ స్టార్స్ ఫేక్ స్టార్స్ మాత్రమే అని కామెంట్ చేశాడు. ముద్రగడ కనుక పార్టీ పెడితే తాను ఆ పార్టీలో చేరతానని.. తాను కాపు వర్గానికి చెందిన వాడిని కాదని... తన మిత్రులు ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని చెప్పుకొచ్చాడు. మరోవైపు వంగవీటి సినిమా కోసం రాంగోపాల్ వర్మ విజయవాడుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మరిన్ని రహస్యాలు తెలుకోవడానికి విజయవాడ వచ్చానని ఆయన చెప్పారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్‌ సహా పలువురిని కలుస్తానని.. జూన్ మొదటి వారంలో సినిమా విడుదల చేస్తామంటున్నాడు.  

మహిళా కానిస్టేబుల్ పై రాజకీయ నాయకుడి రౌడీయిజం.. ఎక్కడ..?

ఈమధ్య కాలంలో రాజకీయ నాయకులు అధికారం ఉంది కదా అని తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఏం చేసిన ఎవరు అడగరూ అన్న ధీమాతో విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే జరిగింది ముంబైలో. ముంబైలో ఓ మహిళా కానిస్టేబుల్ పై శివసేన నేత శశికాంత్ రౌడీయిజం చూపించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న అతనిని మహిళా కానిస్టేబుల్ ఆపింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఆయన కిందకి దిగి మహిళా అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా అయితే దాడికి పాల్పడ్డ వ్యక్తికి శివసేనకు ఎలాంటి సంబంధం లేదని ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాజకీయ నాయకులను చంపేయాలి.. మాజీ న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

జేఎన్యూ వివాదంపై ఇప్పటికే దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజ్యసభలో కూడా రచ్చ రచ్చ జరుగుతోంది. ఇప్పుడు వీటికి ఆజ్యం పోస్తున్నట్టు ఉన్నాయి ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌ఎస్‌ దింగ్రా చేస్తున్న వ్యాఖ్యలు. జేఎన్యూ విద్యార్ధులు అఫ్జల్ గురుకు ఉరిశిక్ష  విధించడాన్ని ఖండిస్తూ చేసిన నిరసనలను ఆయన తప్పు బట్టారు.  పార్లమెంటుపై దాడి సందర్భంగా 40,50 మంది ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటని  వారిని వెనకేసుకొస్తున్న పార్లమెంటు సభ్యులనుద్దేశించి ప్రశ్నించారు. అఫ్జల్‌ గురును వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను చంపేయాలంటూ వివాదానికి తెర లేపారు. అఫ్జల్ గురు లాంటివారు సమాజానికి చెడు చేసేవారు.. అలాంటి వారికి శిక్ష విధించే హక్కు న్యాయస్థానాకి ఉంటుంది అని ఆయన అన్నారు.

అన్నను అన్నందుకు.. బాలయ్యకు పవన్ కౌంటర్..!

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెల 27, 28 తేదీల్లో హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్సవాల నేపథ్యంలో బాలకృష్ణ చిరంజీవిపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. లేపాక్షి ఉత్సవాల నిర్వహణ తన కష్టార్జితమని, ఎవరినీ పిలువాలో.. పిలువకూడదో తనకు తెలుసునని.. చిరంజీవిని ఉత్సవాలకు పిలువలేదు. నేను ఎవరినీ నెత్తిన ఎక్కించుకోను. నా నెత్తిమీద ఎక్కేవారిని పిలవాల్సిన అవసరం నాకు లేదు.. అంటూ పెద్ద లెక్చరే ఇచ్చారు. అయితే ఇప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై చిరంజీవితో పాటు ఇంకో వ్యక్తి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్వతహాగా అన్నా దమ్ముల మధ్య ఎలాంటి విబేధాలు ఉన్నా.. అతని అన్న జోలికి వస్తే మాత్రం తను అంత తేలికగా వదిలిపెట్టడు. గతంలో తన అన్నపై సెటైర్లు వేసిన మొహన్ బాబుకి కూడా ఇలానే చురకలు అంటించాడు.   అయితే ఇప్పుడు బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకుగాను పవన్ కళ్యాణ్.. బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగూ తన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి తన అన్నను పిలవాలని పవన్ అనుకుంటున్న నేపథ్యంలో అక్కడే బాలకృష్ణకు గట్టిగా సమాధానం ఇస్తారని అనుకుంటున్నారు. మరి పవన్ ఎప్పుడు కౌంటర్ ఇస్తారో చూడాలి.

పీఎస్ లో హీరోయిన్ స్వాతిరెడ్డి.. ఆమె తల్లి కొట్లాట..

ప్రముఖ వర్దమాన నటి స్వాతిరెడ్డి ప్రేమ గోల పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. తన కుమార్తె అదృశ్యమైందంటూ ఆమె తల్లి నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లాకి చెందిన శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తిపై అనుమానాలున్నాయంటూ.. అతనే తన కూతురికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడంటూ బంజారా హిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వార్తలకు స్పందించిన స్వాతిరెడ్డి పోలీస్ స్టేషన్ కు వచ్చి తాను ఎక్కడికీ వెళ్లలేదని.. మాఅమ్మకు నాకు ఆర్ధికా లావాదేవీల్లో గొడవలున్నాయి అంటూ తెలిపింది. అసలు తనకు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని.. డబ్బు కోసం తల్లి.. తనను చాలాసార్లు వేధించినట్లు స్వాతిరెడ్డి  చెప్పింది. ఈ నేపథ్యంలో స్వాతిరెడ్డి, నాగేంద్రమ్మ... పోలీసుల ఎదుటే కొట్లాటకు దిగారు. దీంతో పోలీసులు వారిని వారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్వాతిరెడ్డి లవ్ అనే సినిమాలో నటించింది.

రైల్వే బడ్జెట్ లో కేంద్రం ఏపీకి టోపి...

కేంద్రమంత్రి సురేశ్ ప్రభు నిన్న రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈయన ప్రవేశ పెట్టిన రైల్వె బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగింది ఏం లేదని తెలుస్తోంది. ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజల ఆశలపై నీరు జల్లినట్టే అయింది. రైల్వే బడ్జెట్ లో కేంద్రం ఏపీకి టోపి వేసిందని.. విశాఖకు రైల్వే జోన్ ఇస్తానని చెప్పి ఆఖరికి చెవిలో పూలు పెట్టినంత పని చేసింది. దీంతో ఏపీలో అప్పుడే ఆందోళనలు కూడా మొదలయ్యాయి. కేంద్రాన్ని ఒప్పించే సత్తా మన దగ్గర లేదా..?అమరావతి రాయలసీమ కనెక్ట్ విటీ ఇంకెప్పుడూ..? విశాఖపట్నంకు రాని రైల్వే జోన్ తెస్తామన్న సుజనా ఎక్కడ విఫలమయ్యారుఅంటూ పలు ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే యూనివర్శిటీని అమరావతికి కేటాయించమని ఎన్నోసార్లు.. మంత్రిగారిని..మోడీ గారిని కోరినా ఆఖరికి అది కూడా దక్కలేదు. మరి ఈ వ్యవహారంపై ఇంకేన్ని వివాదాలు తలెత్తుతాయో చూడాలి.

సంజయ్‌దత్‌ గొడవలో పడి బడ్జట్‌ను పట్టించుకోలేదు!

  ఈసారి రైల్వే బడ్జట్‌ జనానికి కాస్త నిరాశ కలిగించిన మాట వాస్తవమే. మామూలుగా అయితే మీడియా ఈ విషయాన్ని ఏకిపారేసేది. కానీ నిన్న మన రైల్వే మంత్రిగారికి లాభించిన విషయం ఒకటి జరిగింది. రైల్వే బడ్జట్‌ను ప్రవేశపెట్టినరోజునే సంజయ్‌దత్‌ ఎరవాడ జైలు నుంచి విడుదల కావడంతో వార్తాఛానళ్లన్నీ ఆయనకే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చాయి. సంజయ్‌దత్‌ విడుదల అయిన వెంటనే ఏ గుడి వెళ్లాడు? ఆయన విడుదల అయ్యాక ఎన్ని సినిమాల్లో నటించబోతున్నాడు? అసలు సంజయ్‌దత్‌ ఏ కేసులో జైలుకి వెళ్లాడు? తదితర విషయాలన్నింటి మీదా వార్తలను ప్రసారం చేయడంలో మునిగిపోయాయి. దాంతో రైల్వే బడ్జట్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. నిన్న సోషల్‌ మీడియాలో కూడా అంతా సంజయ్‌ హవానే నడిచింది. దాంతో సురేష్‌ ప్రభు రైలుకంటే సంజయ్‌బాబు రైలే వేగంగా దూసుకుపోయిందంటూ జనం నవ్వుకున్నారు.