అంకెల్లో తెలంగాణ పోలింగ్

      ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణలోని మొదటి విడత పోలింగ్ జరగబోతోంది. పది జిల్లాలోని 17 పార్లమెంటు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు 4 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 162 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. రాష్ట్రానికి చెందిన 1,40,000 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు.   మొత్తం 30,518 పోలింగ్ స్టేషన్లకు గాను 12 వేల పోలింగ్ స్టేషన్లలను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. ఈ ఎన్నికలలో 2 కోట్ల 81 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరిలో 1 కోటి 37 లక్షల మంది మహిళా ఓటర్లు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు 265 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. 119 అసెంబ్లీ స్థానాలకు 1669 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కొన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.  ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 126 కోట్ల రూపాయలు, 74 కిలోల బంగారి, 708 కిలోల వెండి, 4,50,000 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల భద్రతకి సంబంధించి ఫిర్యాదు చేయదలచుకుంటే 1950 టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.  

సీమాంధ్రులలో హైదరాబాద్ యు.టి. ఆశలు

      రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రులను దారుణంగా మోసం చేసింది. తరతరాలు కోలుకోలేని విధంగా అన్యాయం చేసింది. కనీసం హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించకుండా హైదరాబాద్ మొత్తం మీద తెలంగాణకే అన్ని హక్కులూ ధారాదత్తం చేస్తూ సీమాంధ్రులను హైదరాబాద్‌లో అనాథలుగా చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు విభజనకు ప్రతీకారం తీర్చుకోవడానికి, తెలుగుదేశం, బీజేపీ కూటమికి పట్టం కట్టడానికి అక్కడి ప్రజలు సిద్ధంగా వున్నారు.   రేపటితో తెలంగాణలో ఎన్నికలు ముగుస్తున్నాయి. ఎన్నికల కోసమే ఇప్పటి వరకూ కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ అనే అంశాలన్ని ఇప్పటి వరకూ బయటకి చెప్పని బీజేపీ నాయకత్వం తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే ఈ అంశాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది. మే 1న సీమాంధ్రలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొనే సభలో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అనే అంశాన్ని మోడీ ప్రకటించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ అనుమానాన్నే టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌కీ వచ్చింది. తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే హైదరాబాద్ యూటీ చేస్తామనే ప్రకటన బీజేపీ నుంచి వస్తుందని ఆయన ఓ బహిరంగ సభలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో దారుణంగా గాయపడిన సీమాంధ్రకు ఆ గాయాలు తగ్గాలంటే హైదరాబాద్ యుటి ప్రకటన చేయాల్సిన బాధ్యత బీజేపీ మీద వుంది.  

మోడీ దయ్యం లాంటోడు: మమతా బెనర్జీ మండిపాటు

      బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దయ్యం లాంటోడని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిణి మమతా బెనర్జీ మండిపడ్డారు. గుజరాత్ అల్లర్ల సూత్రధారి నరేంద్రమోడీ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశానికి చీకటి రోజులు ప్రారంభమవుతాయని ఆమె ఆగ్రహంగా చెప్పారు. ‘‘గుజరాత్‌లో అల్లర్లకు కారణమైన మోడీ ఇప్పుడు తన దృష్టిని పశ్చిమ బెంగాల్ మీద కేంద్రీకరించాడు. ఇక్కడ కూడా గుజరాత్ తరహా అల్లర్లు జరగాలని మోడీ పథక రచన చేస్తున్నాడు’’ అని మమత మోడీ మీద విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి గురించి మోడీ ప్రస్తావించడాన్ని మమత ఖండిస్తూ, గుజరాత్ అల్లర్ల కారకుడి నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం బెంగాలీ ప్రజలకు లేదని ఆమె అన్నారు.

అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేయాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీంతో కొత్తగా మరోమారు రాష్ట్రపతి పాలన విధించడంతో పార్లమెంటు ఆమోదానికి మరో రెండు నెలలు అవకాశం లభించినట్లయింది. అయితే ఇది ఇప్పటికే అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనకు కొనసాగింపు మాత్రమే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం... ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోపు పార్లమెంటు ఆమోదం పొందాలి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగుస్తోంది. కానీ, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటును సమావేశ పరిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలోనూ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. దీంతో అసలు శాసనసభను రద్దు చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని కేంద్రం నిర్ణయించుకుంది.

నేటి నుండి పవన్ ఆంధ్రాలో ప్రచారం

  తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఇప్పుడు సీమాంధ్ర దారి పట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గుంటూరులో నరసరావుపేట, చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇంతవరకు కేసీఆర్ పై తన బాణాలు ఎక్కుపెట్టిన పవన్, ఇకపై జగన్మోహన్ రెడ్డిపై బాణాలు సందించడం ఖాయం. అదేవిధంగా ఇంతవరకు ఆయనపై కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎదురు దాడి చేయగా ఇకపై జగన్, విజయమ్మ, షర్మిలా ఎదురుదాడి చేయవచ్చును. నరేంద్ర మోడీ ఇంకా ప్రచారానికి రాక మునుపే జగన్మోహన్ రెడ్డిపై కటిన చర్యలు తప్పవని హెచ్చరించినందున, ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నపవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగానే విమర్శలు చేయవచ్చును. పవన్ కళ్యాణ్ ప్రచారంతో తెలంగాణాలో తెదేపా-బీజేపీ అభ్యర్ధులు బలం పుంజుకొన్నట్లుగానే, సీమంద్రాలో కూడా వారి అభ్యర్ధులు బలం పుంజుకోవచ్చును. ఇక ఇంతవరకు ఆంధ్రాలో చిరంజీవి ఒక్కరే ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రవేశిస్తుండటంతో ప్రచారపర్వం ఆసక్తికరంగా మారనుంది.

బీజేపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డిపై చర్యలు: మోడీ

  బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ నిన్న ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొట్ట మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, ఆ చర్యలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డితో కూడా కటినంగానే వ్యవహరిస్తామని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతేగాక తమ ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయిన సీట్లను తప్పక సాధిస్తుందని, అందువల్ల వైకాపా మద్దతు తీసుకోబోమని, ఆపార్టీని దూరంగా ఉంచుతామని అన్నారు. ఇంతకు ముందు మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నడూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఆయన వైకాపా మద్దతు తమకు అవసరం లేదని ప్రకటించడం చూస్తే, బహుశః ఆయన చెపుతున్నట్లు తమ పార్టీ గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నారని అర్ధమవుతోంది. ఇటీవల వెలువడిన తాజా సర్వే నివేదికలు కూడా ఎన్డీయే కూటమికి స్పష్టమయిన ఆధిక్యత రావచ్చని సూచిస్తున్నాయి. బహుశః అందుకే మోడీ తమకు వైకాపా మద్దతు అవసరం లేదని అనగలిగారు. అందువలన జగన్మోహన్ రెడ్డి కూడా ఇకపై కాంగ్రెస్ లేదా అది మద్దతు ఇచ్చే థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇచ్చి కేంద్రంలో మోడీ అధికారంలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చును. ఇక త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి రానున్న నరేంద్ర మోడీ, తన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డిపై మరింత ఘాటుగా విమర్శలు, హెచ్చరికలు చేయవచ్చునని ఆయన మాటలు సూచిస్తున్నాయి. ఇది బీజేపీతో పొత్తులు పెట్టుకొన్న తెదేపాకు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి మరింత ఉత్సాహం కలిగించవచ్చును. మోడీ తన ఎన్నికల ప్రచారం వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పోటీ చేస్తున్న వైజాగ్ నుండే మొదలుపెట్టే అవకాశం ఉంది గనుక, అది ఆమె విజయావకాశాలపై ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.

చంద్రబాబు వ్యూహాలతో విజయానికి ఆమడ దూరంలో కాంగ్రెస్, తెరాసలు

  తెలంగాణా ఉద్యమాలు, రాష్ట్ర విభజన వ్యవహారంతో తెలంగాణాలో తెలుగుదేశం దుఖాణం దాదాపు బంద్ అయిపోయినట్లేనని అందరూ భావించారు. రాష్ట్ర విభజన తరువాత ఇక తెలంగాణాలో తెదేపా ఉనికి ఉండబోదని బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనేకమార్లు అన్నారు. కానీ ఇప్పుడు అదే తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు అదే తెదేపా కాంగ్రెస్, తెరాసలకు దీటుగా గట్టి పోటీ ఇచ్చింది. అందుకు కారణం చంద్రబాబు అనుసరించిన వ్యూహాలు, ఎత్తులు, కృషేనని చెప్పక తప్పదు.   ఎన్నికల ప్రకటన వెలువడగానే, ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు బీసీ మంత్రం జపించి ప్రత్యర్ధులకు పరీక్ష పెట్టారు. ఆ వెనువెంటనే బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదన చేసి, కాంగ్రెస్, తెరాసలు సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి కల్పించారు. ఆ తరువాత, మంచి ప్రజాధారణ గల పవన్ కళ్యాన్ని ముందుకు తీసుకువచ్చి ఎన్నికల ప్రచారంలో వేడి పుట్టించారు. తెలంగాణా వ్యాప్తంగా తన పార్టీ నేతలను, వారి అనుచరులకు మద్దతుగా వరుసపెట్టి ప్రజాగర్జన సభలు నిర్వహిస్తూ, కాంగ్రెస్, తెరాసలపై, ముఖ్యంగా తెలంగాణాలో తనకి ఎదురేలేదనుకొంటున్న కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీ శ్రేణులలో సమరోత్సాహం కలిగించి కేసీఆర్ సైతం నివ్వెరపోయేలా చేయగలిగారు.   అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన హైదరాబాదు నగరాన్నిచూపుతూ అది తన కృషి, సమర్ధత, దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనమని చెప్పుకొని, తమ పార్టీ మాత్రమే తెలంగాణా అభివృద్ధికి కృషి చేసిందని, చేయగలదని గట్టిగా నొక్కి చెపుతూ ప్రజలను ఆకట్టుకొన్నారు. ఇక ప్రచారం కీలక దశకు చేరుకోగానే బీసీ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిష్ణయ్యే మా పార్టీ తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధి అని చంద్రబాబు స్వయంగా విస్పష్టంగా ప్రకటించడంతో, కాంగ్రెస్, తెరాసలు అంతే దీటుగా ఆయనకు సవాలు విసరలేకపోయాయి. కారణాలు అందరికీ తెలిసినవే!   నిన్నటితో తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఇప్పుడు పార్టీల బలాబలాలు ఒకసారి చూసుకొంటే, తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ కానీ, తెచ్చిన తెరాస గానీ గుండెల మీద చెయ్యేసుకొని మాకే పూర్తి మెజార్టీ వస్తుందని చెప్పలేని పరిస్థితి. కారణం తెదేపా-బీజేపీ కూటమి అనూహ్యంగా పుంజుకొని ఆ రెండు పార్టీలకు గట్టి పోటీనీయడమే. కేసీఆర్ దురాశకు పోకుండా ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే బహుశః ఇటువంటి దుస్థితి వచ్చేదే కాదేమో. అప్పుడు ఎన్నికలు కాంగ్రెస్-తెరాసలకు పూర్తి అనుకూలంగా ఏకపక్షంగా జరిగి ఉండేవేమో!   కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకొన్నట్లు, ఇంతకాలం సోనియా గాంధీని బలిదేవత అని తిట్టిన నోటితోనే కేసీఆర్ ఇప్పుడు ఆమె వలననే తెలంగాణా ఏర్పడిందని, థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామన్న నోటితోనే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు యూపీఏ కూటమికి మద్దతు ఇస్తామని ఒక టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లేనని అర్ధమవుతోంది. మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరడానికి సిద్దం అవుతున్నారని అర్ధమవుతోంది. ఇదే విషయాన్నీ జైపాల్ రెడ్డి కూడా దృవీకరించారు.   ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, ఇంతకాలం తమదే విజయమని చాలా ధీమా ప్రదర్శించిన కాంగ్రెస్, తెరాసలు మాత్రం విజయం సాధించే అవకాశం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును. తమకే ఏక పక్షంగా ఓట్లు పడిపోతాయని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్, కాంగ్రెస్ నేతలు, తెదేపా ఇచ్చిన గట్టి పోటీ వలన విజయానికి ఆమడ దూరంలో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. తెదేపా-బీజేపీలది అనైతిక బందమని ఇంతకాలంగా విమర్శిస్తున్న కాంగ్రెస్, తెరాసలు ఎన్నికల తరువాత అధికారం కైవసం చేసుకొనేందుకు మళ్ళీ నిసిగ్గుగా చేతులు కలిపేందుకు సిద్దపడుతున్నారు.

కాంగ్రెస్ ఎత్తుకి బీజేపీ చిత్తు కాబోతోందా?

  కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కోక మునుపే, అవసరమయితే థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామని ఆ పార్టీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృద్వీరాజ్ చవాన్ ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని అంగీకరిస్తున్నట్లేనని బీజేపీ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రకటన వెనుక బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే దురాలోచన కూడా ఉందని, అందుకే ఆ పార్టీతో రహస్య ఒప్పందం ఉన్న తెరాస వంటి పార్టీలు ఎన్నికల తరువాత థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామని కొత్త పాట అందుకొన్నాయని, అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల తరువాత ఏ కూటమికి మద్దతు ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. కొన్ని రోజుల క్రితం వరకు థర్డ్ ఫ్రంట్ ని చాలా తేలికగా తీసుకొన్న బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ వేస్తున్న కొత్త ఎత్తుతో చాలా కంగారు పడుతోందని వెంకయ్య మాటలు స్పష్టం చేస్తున్నాయి.

సినిమాల కంటే దేశసేవే ముఖ్యం: పవన్ కళ్యాణ్

      తనకు ఇప్పుడు సినిమాల కంటే దేశసేవే ముఖ్యమని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తాను సినిమాలకు పూర్తిగా దూరమవ్వాలని లేదని, అయితే సినిమాల కంటే తనకు దేశసేవే ముఖ్యమని ఆయన చెప్పారు. తెలంగాణలోని కామారెడ్డిలో ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా పవన్ కళ్యాణ్ తన మనసులో అనుకుంటున్న మాటని బయటపెట్టారు. పవన్ దేశసేవే ముఖ్యమని అన్నప్పుడు సభలో వున్నవారు ‘‘సినిమాలు’’ అని అరిచారు. దానికి పవన్ స్పందిస్తూ, సినిమాలలో నటిస్తూనే వుంటానని చెప్పారు. ఇంతకీ పవన్ దేశసేవ ఏ రూపంలో చేయబోతున్నారనేది మాత్రం చెప్పలేదు.

ఆత్మహత్యలకు టీఆర్ఎస్సే కారణం: జైరాం రమేష్

      టీఆర్ఎస్ మీద కొంతకాలంగా విరుచుకుపడుతున్న జైరాం రమేష్ సంచలన ప్రకటన చేశారు. టీఆర్ఎస్‌ని నమ్ముకుని దగ్గరుండి తెలంగాణ క్రతువు జరిపించిన జైరాం రమేష్ కేసీఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా ప్లేటు ఫిరాయించడంతో బాగా హర్టయ్యాడు. తెలంగాణలో టీఆర్ఎస్‌కి ఎంత ఎక్కువ డ్యామేజ్ చేయగలిగితే అంత మంచిదన్న అభిప్రాయంలో ఆయన వున్నట్టున్నారు. అందుకే టీఆర్ఎస్ మీద సోమవారం భారీ కామెంట్ చేశారు. తెలంగాణలో యువకుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్సే కారణమని జైరాం రమేష్ ఆరోపించారు. యువకులు ఆత్మహత్యలు చేసుకునేలా టీఆర్ఎస్ నాయకులు ప్రేరేపించారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణల మీద స్పందించడానికి టీఆర్ఎస్‌కి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారం చేయడానికి, ఎదుటి పార్టీలని తిట్టడానికి టీఆర్ఎస్‌కి టైమైపోయింది.

వైఎస్ జగన్ ఐదు సంతకాల గుట్టు ఇదే

      వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాను సీమాంధ్రకి ముఖ్యమంత్రి అయిపోతానని, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు సంతకాలు చేస్తానని చెబుతూ వస్తున్నారు. ఆ ఐదు సంతకాలు గుట్టును తెలుగుదేశం నాయకులు యనమల రామకృష్ణుడు బయటపెట్టారు. ఒకవేళ జగన్ పొరపాటుగా సీఎం అయితే ఆయన సంతకాలు చేయాలనుకుంటున్న ఫైళ్ళేమిటో యనమల చెప్పారు.   సంతకం నంబర్ 1 :  తనకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి  థాంక్స్ చెప్పడంలో భాగంగా కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యే ఒప్పందం మీద. సంతకం నంబర్ 2: సీబీఐ దాఖలు చేసిన కేసులు, చార్జిషీట్లు తదితరాలను టాంపరింగ్ చేసే ఆదేశాల మీద. సంతకం నంబర్ 3: తాను స్థాపించిన బినామీ కంపెనీలు, సాక్షి మీడియాకు అదనపు రాయితీలు ఇచ్చే ఫైలు మీద. సంతకం నంబర్ 4:  తన తండ్రి లాక్కున్న 89 వేల ఎకరాల దళిత భూములతోపాటు, ఇంకా లక్షా 50 వేల ఎకరాల అసైన్డ్ భూమిని తన బినామీలకు కట్టబట్టే ఫైల్. సంతకం నంబర్ 5: తండ్రిని అడ్డు పెట్టుకుని సంపాదించిన లక్షల కోట్లు, భవంతులను క్రమబద్ధీకరించే ఆదేశాల మీద.  

స్వర్గీయ శోభా నాగిరెడ్డికి ఓట్లు వేస్తే చెల్లుతాయిట

  వైకాపా సీనియర్ నేత శోభా నాగిరెడ్డి కొద్ది రోజుల క్రితం కారు ప్రమాదంలో మరణించడంతో, ఆమె పోటీ చేస్తున్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా పాడుతాయని అందరూ భావించారు. కానీ వైకాపా ఎన్నికల సంఘం వద్ద తన పేరు రిజిస్టర్ చేయించుకొన్న ప్పటికీ దానికి ఇంకా గుర్తింపు ఇవ్వనందున, షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, ఈవీయంలలో ఆమె పేరు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ తొలగొంచలేని పక్షంలో ఆమెకు వేసే ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ బన్వర్ లాల్ ప్రకటించారు. నిజానికి ఎక్కడయినా ఇదే పద్ధతి అనుసరిస్తారు. కానీ మళ్ళీ ఆయన తాజాగా మరో విచిత్రమయిన ప్రకటన చేసారు. శోభ నాగిరెడ్డి చనిపోయినప్పటికీ, ఈవీయంలలో ఆమె పేరు తొలగించడం వీలుపడలేదు కనుక, ఒకవేళ ఆమె పోటీ చేస్తున్న వైకాపాకు కేటాయించిన ఫ్యాన్ గుర్తుకే అత్యధికంగా ఓట్లు వచ్చినట్లయితే, ఆళ్లగడ్డలో మళ్ళీ ఉపఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.   శోభా నాగిరెడ్డి హటాన్మరణంతో ఏమిచేయాలో పాలుపోనే స్థితిలో ఉన్న వైకాపా, తమకు అనుకూలంగా ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు ఇద్దామని ఆలోచించింది. కానీ ఇప్పుడు ఎన్నికల కమీషన్ స్వయంగా ఉపేన్నికలకి మార్గం సుగమం చేసింది గనుక, ఆమె మరణంతో ప్రజల ఏర్పడిన సానుభూతిని తమ పార్టీకే అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నంలో ఆమెకే ఓటువేసేలా ప్రజలను ప్రోత్సహించవచ్చును. ఒకవేళ ఈ ఎన్నికలలో వైకాపాయే విజయం సాధించి అధికారంలోకి వచ్చినట్లయితే, అప్పుడు ఉపఎన్నికలలో నెగ్గడం పెద్ద సమస్య కాబోదు.

తెలంగాణలో ష్ గప్ చుప్

    ఈనెల 30వ తేదీన ఎన్నికలు జరుగనున్న తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సోమవారం సాయత్రానికి ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీ కూడా ఎన్నికలకు సంబంధించిన మేటర్స్ మాట్లాడకూడదు. ఇతర పార్టీల మీద విమర్శలు చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎన్నికల కమిషన్ నిషేధించింది. టీవీ ఛానళ్ళలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకటనలు కూడా ఇక ప్రదర్శించరాదు. సీమాంధ్రకు సంబంధించిన ప్రకటనలు కూడా తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకూ టీవీ ఛానళ్ళలో ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రదర్శించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలదే పైచేయి

      ఎప్పటి లాగానే ఈసారి కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థులలో 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీళ్ళలో బాలుర శాతం 51.37. బాలికల ఉత్తీర్ణత శాతం 60.52. బాలుర కంటే బాలికలే దాదాపు తొమ్మది శాతం అదనంగా ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 8.68 లక్షల మంది. వీరిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 4.55 లక్షలు. మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థులలో 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్స్ లో 42.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం 1.24 శాతం పెరిగింది.

రాహుల్ కోరితే యుపిఏకి మద్దతిస్తా: కేసీఆర్

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాలుక మళ్ళీ మరో మలుపు తిరిగింది. నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీని, పొన్నాల లక్ష్మయ్యని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పేరు పేరునా తిట్టిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయం ముగిసిపోయి, పోలింగ్ మాత్రమే బ్యాలన్స్ వున్న సమయంలో ట్విస్ట్ ఇచ్చాడు. ఒక జాతీయ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశాడు. ఈ ఎన్నికల తర్వాత మోడీ నాయకత్వంలోని ఎన్డీయేకి తాను మద్దతు ఇవ్వనని చెప్పాడు. ఇది సంచలన ప్రకటన కాదు.. మోడీ ప్రస్తావన అయిపోయిన తర్వాత అసలు సంచలన ప్రకటన కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. రాహుల్ గాంధీ తనని కోరిన పక్షంలో యు.పి.ఎ.కి తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. దీంతోపాటు తెలంగాణ రావడానికి సోనియాగాంధీనే కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చేరువ కావడానికి కేసీఆర్ ఈ మాటలు మాట్లాడి వుండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈసారి కేసీఆర్ మాటలు నమ్మడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని అంటున్నారు.

టీఆర్ఎస్‌కి వీఆర్ఎస్సే: గజ్వేల్‌లో చంద్రబాబు గర్జన

      టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో ఇంతకాలం సంయమనం పాటించిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎన్నికల ప్రచార వేళ ముగుస్తున్న సమయంలో కేసీఆర్‌కి వ్యతిరేకంగా గర్జించారు. ఆ గర్జన కూడా అక్కడో ఎక్కడో కాకుండా, కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే గర్జించారు. ఆ గర్జనలివిగో... తెలంగాణలో దొరలరాజ్యం పోవాలి. కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పిచ్చాస్పత్రికి పంపిస్తా. గజ్వేల్ నీ జాగీర్ అనుకుంటున్నావా కేసీఆర్? గజ్వేల్ టీడీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి ఊదితే గోదావరిలో పడతావ్. కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో అవినీతి పంట పండిస్తున్నాడు. తెలంగాణకి ద్రోహం చేస్తున్న ప్రధాన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ అంతు చూస్తా. మోడీనీ, నన్ను తిడతావా.. ఖబడ్డార్.