తెలంగాణ పై వెనక్కి తగ్గేది లేదు: దిగ్విజయ్

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిపోయింది. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. సీడబ్లూసీ నిర్ణయం జరిగిపోయాక వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. దీనికి అందరూ ఒప్పుకోవాలి. ముందు ఒప్పుకొని ఇప్పుడు అడ్డం తిరిగితే ఒప్పుకునేది లేదు. మీకు ఏవయినా సమస్యలు ఉంటే ఆంటోని కమిటీకి చెప్పుకోండి. ఈ నెల 19, 20 తేదీలలో రాష్ట్రానికి వస్తుంది. పార్లమెంటు సమావేశాల కారణంగా ఇప్పటికిప్పుడు రావడం కుదరదు అని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ గురువారం రాత్రి మరోసారి వార్‌రూమ్‌లో సమావేశమైంది.   దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అంటోనితో పాటు దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, వీరప్పమొయిలీలు ఉన్నారు. సీమాంధ్రులు కోరుకునే డిమాండ్ల మీదనే కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. కేంద్ర మంత్రులు పళ్లం రాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు కమిటీకి తమ వాదనను వినిపించారు. రాయల తెలంగాణ ఇవ్వాలని కోట్ల కోరగా, సమైక్య రాష్ట్రాన్ని ఎక్కువ మంది ప్రజలు కోరుతున్నారని, రాష్ట్రానికి వచ్చి పరిస్థితి గమనించాలని పళ్లం రాజు విజ్ఞప్తి చేశారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని చిరంజీవి కోరారు.

సురాజ్యమవని .. స్వరాజ్యం

      .....సాయి లక్ష్మీ మద్దాల   నేడు భారతావని అంతటా 67వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. భారతదేశం సస్యశ్యామల దేశం. ఎన్నో సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశం. అభివ్రిద్ది విషయంలో మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నామనే చెప్పుకుంటున్నాం. 67 వసంతాలు గడిచినా భారత ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు అనేకం.  పేదరికం,నిరుద్యోగం,నిరక్షరాస్యత,పౌష్టికాహారలోపం,బాలకార్మికులు, లంచగొండితనం,నానాటికి పతనమవుతున్న దేశ ఆర్ధిక వ్యవస్థ.   ఇవే కాదు ఇంకా చాలా సమస్యలు నేడు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. సహజవనరులను దేశ సంక్షేమానికి వినియోగిచుకోవటం లో విఫలమైన,సహజ వనరుల కుంభ కోణాల్లో మాత్రం ఆరి తేరిపోయారు మన పాలకులు. గత 9ఏళ్ళుగా యు.పి.ఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మన దేశం చూడని కుంభకోణం లేదు. కాని ప్రజా సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేశారు. ప్రజలను  నానాటికి సోమరిపోతులను చేసే విధంగా ప్రజాకర్షక పధకాలు. దేశంలో ఎక్కడ చూసినా అదుపులో లేని శాంతి భద్రతలు. మెరుగైన విద్యను అందించలేని ప్రభుత్వ వైఫల్యం కారణంగా వీధికోకటిగా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు,ఫలితంగా అందరికి అందుబాటులో లేకుండా పోతున్న విద్య. ఎలాంటి వసతులు లేని,పరికరాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులు,దీనికారణంగా వెలుగు చూస్తున్న కార్పోరేట్ ఆసుపత్రులు ఫలితంగా సామాన్యుడికి అడుబాటు లో లేని వైద్యం. తాగటానికి గుక్కెడు నీళ్ళు కావాలంటే మైళ్ళ కొద్ది దూరం వెళ్ళాల్సిన పరిస్థితి.                గ్రామాల పరిస్థితి మరీ దుర్భరం. వ్యవసాయాన్ని ఆదుకొనేవాడు కనబడక రైతు దిగాలుపడిపోతు,ఆత్మహత్యలు చేస్కుంటున్న రైతన్నలు. మగ్గాలు కదలనంటున్న చేనేత రైతుల పరిస్థితి మరీ దారుణం. ఇవన్ని దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు. ఇంక నేతల విషయానికి వస్తే దేశ సమగ్రతను కాపాడాలన్న బలమైన తపన ఏ ఒక్క రాజకీయ నేతకు లేదు. కేవలం దేశం లో ని అంతర్గత సమస్యలెకాదు,దేశ సరిహద్దులో పొంచి ఉన్న సమస్యల నుండైన దేశాన్ని కాపాడే యోచనలో పాలకులు ఉన్నారా అంటే అది సందేహమే. ఒక పక్క నుంచి పాకిస్తాన్ మరోపక్క నుంచి చైనా ఎప్పుడు ఏదో ఒక సమస్యను దేశం మీదికి విసురుతూనే ఉన్నాయి. ఇది మన దేశాన్ని ఏలుతున్న నేతల వైఫల్య ఫలితం కాదా. దేశం పుట్టెడు సమస్యల్లో చిక్కుకొని ఉంది. కాని ఆ సమస్యలపై చర్చించే తీరిక మన నేతలకు లేదు. కనీసం చట్ట సభ్లలోనైన ప్రజా సమస్యలు చర్చకు వస్తాయా అంటే అక్కడ ఉండేది   యుద్ద వాతావరణమే.                ఇంక ప్రజల విషయానికి వస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 66 వసంతాలు పూర్తి అయినా,వారు బానిస మనస్తత్వాన్ని వదులుకుంటున్నట్లు లేరు. ఎందుకంటే నెహ్రు తర్వాత ఇందిరాగాంధీ,ఆ తరువాత రాజీవ్ గాంధి,తరువాత సోనియా గాంధి తరువాత రాహుల్ గాంధికి అధికారాన్ని కట్టపెట్టాలని ప్రయతిస్తున్నారే తప్ప,సమర్ధులైన నాయకులను ఎన్నుకోవటం లేదు. ఎంతో అనుభవం సమర్ధత కలిగిన ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కాలేక పోయారు. ఇది రాచరికానికి మరో రూపం అవుతుందే తప్ప ప్రజాస్వామ్యం కాజాలదు. ఎన్నాళ్ళి వారసత్వ రాజకీయాలు?ప్రజాస్వామ్యమంటే ప్రజలు వోట్లు వేసి నేతలను ఎన్నుకోవటం మాత్రమే కాదు చేయాల్సింది. వారసత్వ రాజకీయాలను తిప్పికొట్ట గలగాలి. అవినీతి పరులైన నేతలకు బుద్ధి చెప్పగలగాలి,సమర్ధులైన నాయకులను ఎన్నుకోవాలి. 

గద్దె బాబురావు ముందు చూపు

      విజయనగరం జిల్లాకు చెందిన చీపురుపల్లి శాసనసభ్యుడు గద్దె బాబురావు గతంలో తెదేపాలో ఉన్నప్పుడు పార్టీలో తనకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని, పార్టీకోసం పనిచేసేవారికి గుర్తింపు లేదని నిందిస్తూ తెదేపాను వీడి వైకాపాలో జేరారు. అయితే, ఆయన ఆపార్టీలో కూడా సరిగా ఇమడలేకపోవడంతో, మళ్ళీ అవే ఆరోపణలు చేస్తూ పార్టీని వీడేరు. ఒకనాడు ఏ పార్టీలో తనకు సరయిన గుర్తింపు గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసారో, మళ్ళీ అదే పార్టీని ఇప్పుడు తల్లి వంటి పార్టీ అనడం, తెదేపాను వీడినందుకు బాధపడుతున్నానని చెప్పడం చూస్తే ఆయన తెరిగి స్వంత గూటికి చేరుకొనేందుకు సిద్దపడుతున్నారని అర్ధం అవుతోంది. ఆయన వైకాపాలో జిల్లా సమన్వయ కర్తగా కీలక బాధ్యతలు చెప్పటినప్పటి నుండి పార్టీకి చెందిన స్థానిక నేతలతో విభేదాలు మొదలయ్యాయి. తత్ఫలితంగా ఇటీవల ఆ పార్టీ నేత షర్మిల విజయనగరం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ఆయన వ్యతిరేఖ వర్గంవారు, ఆమెకు పిర్యాదులు చేయడంతో ఆయనకు చేదు అనుభవం ఎదురయినట్లు సమాచారం. దానితో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలనే ఆలోచనతో, తన చీపురుపల్లి నియోజక వర్గం సీటును తెదేపా మరెవరికో కేటాయించక ముందే, తిరిగి స్వంత గూటికి చేరుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. కానీ, తెదేపా తిరిగి ఆయనకు స్వాగతం పలుకుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే ఆ పార్టీలో కూడా స్థానికంగా ఆయనకు వ్యతిరేఖించేవారు చాలామందే ఉన్నట్లు తెలుస్తోంది.

టీడీపీ నేత లాల్‌జాన్ భాషా కన్నుమూత

      టీడీపీ సీనియర్ నేత లాల్‌జాన్ భాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భాషా అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా నల్గొండ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.   1984లో గుంటూరు నుంచి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా టిడిపి తరఫున ఎన్నికయ్యారు. 1991లో ఆయన ఎన్‌జి రంగాను ఎన్నికల్లో ఓడించారు. ముంబైలోని ప్రఖ్యాతి గాంచిన మార్కంటైల్ బ్యాంక్ చైర్మన్‌గా ఆయన పనిచేస్తున్నారు. బాషా మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు నల్లగొండకు బయలుదేరారు. లాల్ జాన్ బాషా మృతి తనకు వ్యక్తిగతంగా తీరనిలోటు అని ఆయన అన్నారు. పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలను కోల్పోయిందని అన్నారు.

ఆలూ లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం

  ఆలూ లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్లు, ఇంకా రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలు కాకముందే తెలంగాణకు ప్రత్యేక పిసిసి వేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు రక్షణ శాఖ మంత్రి ఆంటోనిని కలిసి విన్నవించుకొన్నారు. తెలంగాణా కోసం ఎన్ని త్యాగాలకయినా సిద్దం అని ఉత్తర ప్రగల్భాలు పలికేవారందరూ ఇంకా తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందే పదవులకోసం పడుతున్న తాపత్రయం చూస్తుంటే, రేపు రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి పదవికోసం, ఇతర మంత్రి పదవులకోసం తమ సహచర నేతలతో వారు ఎటువంటి యుద్దాలు చేస్తారో చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనమయితే గనుక, ఈ పోటీ మరింత రసవత్తరంగా ఉంటుంది. అప్పుడు తెరాస వర్గం, కాంగ్రెస్ వర్గం అనే రెండు కొత్త వర్గాలు కాంగ్రెస్ పార్టీలో పుట్టుకొచ్చి, ఆదిపత్యం కోసం ఒకదానితో మరొకటి కత్తులు దూసుకొంటాయేమో? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పార్టీని విలీనం చేసుకొంటే అక్కడా ఆ పార్టీకి అదే పరిస్థితి ఏర్పడుతుందేమో? ఇంతకీ రాష్ట్ర విభజనతో తన ప్రత్యర్ధులను దెబ్బ తీసి తను లాభపడాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి, తెరాస, జగన్ పార్టీలే తిరిగి ఎసరుపెట్టినా ఆశ్చర్యం లేదు. అత్యాశకుపోతే, ఏపార్టీకయినా అదే పరిస్థితి తప్పదని చెప్పవచ్చును.

దేవినేని ఆమ‌ర‌ణ దీక్ష

  15రోజుల గ‌డుస్తున్న సమైక్యాంద్ర కోసం జ‌రుగుతున్న ఉద్యమాలు త‌గ్గక పోగా మ‌రింత తీవ్రమ‌వుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేత‌లు నిర‌హార దీక్షలు చేస్తుండగా ఇప్పుడు ఈ మ‌రో నాయ‌కుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించ‌డానికి రెడీ అవుతున్నారు. సమైక్యాంధ్రాకు మద్దతుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమమహేశ్వరరావు  ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడిన‌ రాష్ట్రం సమైక్యం కోసం స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆగస్టు 15న తాను ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విభ‌జ‌న విష‌యంలో అనుస‌రిస్తున్న వైఖ‌రితో పాటు రాష్ట్రాన్ని స‌మైక్యంగా ఉంచాల‌నే డిమాండ్ల‌తో ఆయ‌న నిర‌వ‌ధిక దీక్ష చేప‌డుతున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాల‌తో  సీమాంధ్రలో ఇప్పటికే 300 మందికి పైగా  ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆయ‌న‌ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంద్రల విష‌యంలో కాంగ్రెస్ నిర్లక్షంగా వ్యవ‌హ‌రిస్తుంద‌న్న ఆయ‌న సోనియా రాహుల్‌ని ప్రదానిని చేయ‌డానికే విభ‌జ‌న నిర్ణయం తీసుకుంద‌ని విమ‌ర్శించారు.

తిరుమ‌ల‌కు పెరుగుతున్న ర‌ద్ధీ

  స‌మైక్యాంద్ర ఉధ్యమం 24గంట‌ల పాటు సాక్షాత్తు తిర‌మ‌ల వెంక‌టేశ్వరున్నే అల్లాడించింది. సీమాంద్ర ఉద్యొగులు ఇచ్చిన సమ్మెపిలుపుతో తిరుమ‌ల తిరుప‌తిల‌లో జ‌న‌జీవ‌నం స్థంభించింది. క‌నీసం కొండ‌పైకి వెళ్లడానికి కూడా బ‌స్సులు లేక‌పోవ‌డంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నిన్న రాత్రి నుంచి ఉద్యోగులు స‌మ్మె నుంచి తిరుమ‌ల కొండ పైకి వెళ్లే బ‌స్సుల‌కుస‌డ‌లింపును ఇవ్వటంతో ఆధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. దీంతో తిరుమలలో బుధవారం రద్దీ క్రమేణా పెరుగుతోంది. అలిపిరి నుంచి కొండకు ఆర్టీసీ బస్సుల రాకపోకలు సాగుతుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తుల బారులు తీరారు. బుధ‌వారం కేవలం సొంత వాహనాలు, ట్యాక్సీలు, అద్దె జీపులు, ద్విచక్రవాహనాలు మాత్రమే ఠాట్ రోడ్‌లో తిరిగాయి. దీంతో రద్దీ అంతంతమాత్రంగా ఉంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు, అధికారులతో మంగళవారం రాత్రి టీటీడీ ఈవో, కలెక్టర్ తదితరులు జరిపిన చర్చలు ఫ‌లించాయి.య దీంతో నిన్న రాత్రి నుంచి 100 బ‌స్సులు కొండ పైకిన‌డుస్తున్నాయి. అయిన ప్రస్థుతం న‌డుస్తున్న బ‌స్సులు స‌ర్వీసులు స‌రిపోక భ‌క్తులు ఘ‌ర్షణ‌ల‌కు దిగుతున్నారు. ప్రభుత్వం, టిటిడిలు చొర‌వ తీసుకుని తిరుమ‌ల తిరుప‌తికి స‌మ్మె నుంచిపూర్తి స్థాయి మిన‌హాయింపు కోరాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు.

19 నుంచి విజ‌య‌మ్మ దీక్ష

  రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో వైసిపి మ‌రో అడుగు ముందుకు వేసింది. ఇన్నాళ్లు తాము విభ‌జ‌న వ్యతిరేకం కాదు అన్న ఆ పార్టీ నేత‌లు ఇప్పుడు స‌మైక్య రాష్ట్రం కోసం ప్రత్యక్ష యుద్దంలోకి దిగుతున్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రక‌ట‌న నేప‌ధ్యంలో ముందుగా రాజీనామాలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీమాంద్రల్లో హీరోలుగా మారారు. ఇదే ఊపులో ఇప్పుడు స‌మైక్యాంద్ర ఉద్యమ క్రెడిట్ అంత త‌మ ఖాతాలో వేసుకోవాల‌నుకుంటుంది ఆపార్టీ. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర‌వ‌ధిక దీక్షకు దిగ‌నున్నారు. ఈ నెల 19 నుంచి విజయవాడలో దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్రాన్ని విభ‌జించి ఇరు ప‌క్షాల‌కు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని స‌మైక్యంగా ఉంచాలని డిమాండ్‌తో ఆమె దీక్షకు దిగ‌నున్నారు. రాష్ట్రవిభ‌జ‌న విష‌యం కాంగ్రెస్ పార్టీ ఏక‌ప‌క్షంగా తీసుకుంద‌ని విమ‌ర్శిస్తూ వ‌స్తున్న వైసిపి ఇప్పుడు ప్రత్యక్షంగా నిర‌స‌న‌లు చేయ‌డానికి రెడీ అవుతుంది. రాజకీయ అబ్దికోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్ర విభజన తప్పనిసరైతే కేంద్రం ఓ తండ్రిలా వ్యవహరించి రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేయమని వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేస్తుంది.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు

      వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు పౌరసౌత్వ ధ్రువీకరణ పత్రం ఇచ్చినందున ఆయన ఎన్నిక చెల్లదని కోర్ట్ తీర్పునిచ్చింది. రమేష్ ఎన్నికపై ప్రత్యర్ధి ఆది శ్రీనివాస్ కోర్టుకు వెళ్లారు. దీనిపై కోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది. రమేష్ జర్మనీ పౌరసత్వం, భారత పౌరసత్వం కలిగి ఉన్నారని, జర్మనీ ప్రభుత్వం నుండి వేతనం అందుకుంటున్నాడని ఆది శ్రీనివాస్ ఆరోపిస్తూ కోర్టు కెక్కారు. ఆయన ఇక్కడ రాజకీయాలలోకి వచ్చి రెండువేల తొమ్మిదిలో టిడిపి తరపున గెలిచారు. ఆ తర్వాత ఆయన టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో గెలుపొందారు.

హైదరాబాద్ వాసులకు జానారెడ్డి హామీలు

  తెలంగాణా ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డిని, టీ-కాంగ్రెస్ నేతలు కానీ, తెరాస గానీ, ఉద్యమంలో ఉన్నవారు గానీ ఎవరూ ఎన్నడూ నమ్మలేదు. ఆయన తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారనే అపవాదు కారణంగానే ఎవరూ కూడా ఆయన మాటలను విశ్వసించలేకపోయారు. అటువంటి ఆయన ఇప్పుడు సీమాంధ్ర ప్రజలకు, ఉద్యోగులకు యావత్ టీ-మంత్రుల తరపున ఒక గొప్ప హామీ ఇచ్చారు.   ఎపి ఎన్జీఓలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారి భద్రతకు తానూ పూర్తి భరోసా ఇస్తున్నానని హామీ ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ నివసిస్తున్న ఆంద్ర, రాయలసీమ వాసులకు ప్రజలకు ఉండదలిచిన వారెవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని అందుకు తాను హామీ అని అన్నారు. అవసరమైతే వారి భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి అందుకు తగిన అన్ని చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.   ప్రస్తుతం హైదరాబాదులో పనిచేస్తున్నఆంధ్ర ఉద్యోగులు ఏవిధంగాను నష్టపోకుండా వారికి తగిన సదుపాయాలు, సర్వీస్ నిబంధనలను అమలుచేస్తామని జానారెడ్డి హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలు ప్రాంతాలుగా విడిపోయినా ఒకే కుటుంబంగా కలిసి ఉంటామని ఆయన చెప్పారు. ఎన్.జి.ఓలకు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నాకేంద్రం నియమించిన అంటోనీ కమిటీకి తెలియచేయాలని, వెంటనే వారు తమ సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.   ఇటువంటి హామీలు కాంగ్రెస్ నేతలే కాదు, తెరాస నేతలు సైతం ఇస్తున్నసంగతి ఆయనకీ తెలిసే ఉండాలి. కానీ, వారి మాటలకు చేతలకు చాలా తేడా కనబడుతున్న విషయం కూడా ఆయనకి తెలిసే ఉండాలి. ఒకవైపు ఆంధ్ర ప్రజలను ఎవరూ బయటకి పొమ్మనలేదని చెపుతూనే ‘కబడ్దార్ కొడకల్లారా!’ అంటూ అదే నోటితో ప్రజలను భయపెడుతున్నకొందరు అతివాద నేతల ఆలోచనలను జానారెడ్డి వంటి వారే కాదు సాక్షాత్ ప్రధాని హామీ ఇచ్చినా భద్రత ఉండదు.   అందువల్లే హైదరాబాద్ లో స్థిరపడిన ప్రజలు తీవ్ర అభద్రతా భావంతో బాధపడుతున్నారు. తెరాస నేతలు చేపట్టిన ఉద్యమంతో ప్రజల మధ్య అగాధం ఏర్పడింది. ఇప్పటికే, స్థానికంగా విద్యా ఉద్యోగ విషయాలలో తీవ్ర వివిక్షను ఎదుర్కొంటున్నఆంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులకు, జానారెడ్డి వంటి వారిచ్చే హామీలు ఎటువంటి న్యాయం, భద్రతను కల్పించలేవని ఖచ్చితంగా చెప్పవచ్చును. కేవలం చట్టపరమయిన రక్షణలు మాత్రమే వారి భయాలను కొంత మేరయిన తగ్గించగలవు. అయితే, ఇది తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాతనే సాధ్యం గనుక, అంతవరకు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని అక్కడి ప్రజల కోరుతున్నారు.   దీనికి సరయిన పరిష్కారం కనుగొనకుండా ముందుకు సాగినట్లయితే, హైదరాబాదులో తరచూ చెలరేగే మత ఘర్షణల వలెనే, ఆంధ్ర తెలంగాణా ప్రాంత ప్రజల మధ్య కూడా తరచూ ఘర్షణలు, ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉంటుంది.

తెలంగాణ బిల్లును ఓడిస్తాం: మంత్రి వట్టి

      పశ్చిమ గోదావరి జిల్లా గనపవరంలో మంత్రి వట్టి వసంత్ కుమార్ ని ఎపిఎన్జీవోలు అడ్డుకుని రాజినామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వసంతకుమార్ మాత్రం అందుకు అంగీకరించలేదు. రాజీనామా అనేది ఆఖరి అస్త్రమని.. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఓడించాక రాజీనామా చేస్తానన్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తే లాభముండదన్నారు. అందరు రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందని తెలిపారు. పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలని వట్టి కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే దృఢ నమ్మకం తమకుందన్నారు. రాజీనామాలు ఆఖరుగా ప్రయోగించాల్సిన అస్త్రమన్నారు.ఎన్.జి.ఓలు మాత్రం సమైక్యాంద్ర అంటూ, మంత్రులు,ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.

జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ హస్తం అందుకొంటాడా?

  అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్‌ను పొడిగించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ వచ్చే నెలాఖరులోగా తన దర్యాప్తు ముగించవలసి ఉంటుంది. అందువల్ల సీబీఐ కూడా తన దర్యాప్తును దాదాపు పూర్తిచేసి వచ్చే నెలాఖరులోగా జగన్ పై ఆఖరి చార్జ్ షీట్ కూడా వేసేందుకు సిద్దపడుతున్నట్లు సమాచారం. ఒకవేళ సీబీఐ గనుక తన తుది చార్జ్ షీట్ దాఖలు చేసినట్లయితే, జగన్ కేసుల్లో విచారణ ఆరంభమయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు అతను మళ్ళీ బెయిలు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇదివరకే అనుమతించింది గనుక, అప్పుడు జగన్ మరో మరు దరఖాస్తు చేసుకోవచ్చును. ఇప్పటికే ఎటువంటి విచారణ ఎదుర్కొనకుండా 14 నెలలు జైల్లో గడిపినందున ఆయనకి బెయిలు మంజూరు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.   ఒకవేళ ఆయన బెయిలుపై బయటకి రాగలిగితే, ఆయనపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తులు లేదా విలీనానికి ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అందుకు ఆయన అంగీకరించకపోతే ఆయనపైకి ఎన్ఫోర్స్ మెంట్ అధికారులను ఉసిగొల్పి తీహార్ జైలుకి తరలిస్తామని బెదిరించినా ఆశ్చర్యంలేదు. మరి ఆయన కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగి ఆ పార్టీతో స్నేహానికి సిద్దపడతాడో లేదో తేలిపోతే, దానిని బట్టి రాష్ట్ర రాజకీయాలలో కూడా కొత్త సమీకరణాలు, వ్యూహాలు కూడా ఏర్పడుతాయి. ఒకవేళ జగన్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినట్లయితే, వారిని డ్డీ కొనడం తేదేపాకు శక్తికి మించిన పనే అవుతుంది.   కానీ, ఇన్నాళ్ళుగా తనను జైలులో నిర్బందించినందుకు కాంగ్రెస్ పై కోపంతో రగిలిపోతున్న జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ బెదిరింపులకి భయపడకుండా కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనదలిస్తే, అది తేదేపాకు కొంత మేలు చేయవచ్చును. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకి పంపితే అది అతని పార్టీకి సానుభూతి ఓట్లను కురిపించే అవకాశం ఉంటుంది గనుక, కాంగ్రెస్ కూడా అందుకు దైర్యం చేయకపోవచ్చును. అందువల్ల కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదా విలీనం విషయంలో అతని అభిప్రాయం తెలుసుకొన్న తరువాతనే అతనిని విడుదల చేయడానికి మార్గం సుగమం చేయాలా వద్దానే సంగతి కాంగ్రెస్ తేల్చుకొనవచ్చును. దానిని బట్టే ప్రస్తుతం కొనసాగుతున్నసీబీఐ కేసులలో కూడా కామాలు, ప్రశ్నార్ధకాలు, ఫుల్ స్టాపులు వంటివి ఉండే అవకాశం ఉంటుంది.   ఒకవేళ, జగన్ జైలు నుండి విడుదల అయ్యి, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినట్లయితే, అది తేదేపాకు అగ్నిపరీక్షగా మారడం ఖాయం. బలమయిన ఈ ఇద్దరు ప్రత్యర్ధులు చేతులు కలిపినట్లయితే అది తేదేపాకు శక్తికి మించిన పరీక్షే అని చెప్పవచ్చును. ఒకవేళ అదే జరిగితే తెదేపాకు ఇటు సీమాంధ్ర రాష్ట్రంలో, అటు తెలంగాణా రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనడం శక్తికి మించిన పనే అవ్వవచ్చును. రాజకీయ అనుభవజ్ఞుడయిన చంద్రబాబు బహుశః ఇది గ్రహించబట్టే, కాంగ్రెస్ పార్టీ తన పార్టీని దెబ్బతీయడానికే రాష్ట్ర విభజనకు పూనుకోందని ఆరోపిస్తున్నట్లు అర్ధం అవుతోంది.   అయితే, అందుకు ఆయనే స్వయంగా సమ్మతిస్తూ లేఖ ఇచ్చారు గనుక అది స్వయంకృతాపరాధం అని చెప్పకతప్పదు. మరి ఆయన ఈ గడ్డు సమస్యను అధిగమించగలరో లేదో రానున్న ఎన్నికల కంటే ముందుగానే తెలిపోవచ్చును.

కూకట్ పల్లి నుంచి హీరో శ్రీ హరి పోటీ!

      ప్రముఖ సినీ నటుడు శ్రీహరి వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మొదట శ్రీ హరి జగన్ పార్టీలో చేరాలని అనుకున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేటు ఫిరాయించింది. తెలంగాణకు వ్యతిరేకంగా జగన్, విజయమ్మ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ ప్రజలకు పూర్తిగా దూరమయింది. దీంతో శ్రీహరి ఇక కాంగ్రెస్ లో చేరడమే మేలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చే సాధారణ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన పట్ల చిత్రసీమలో ఎవరూ వివక్ష చూపలేదని, అందరూ ఆదరించారని ఆయన అన్నారు.

ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ నేతలు: బైరెడ్డి

      రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డిరాజశేఖర్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఒక ముగిసిపోయిన అధ్యాయమని, ఇక అందులోఎవరూ ఏమిచేయగలిగేదేమి లేదని, ఆర్ధిక మంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటన గమనిస్తే అది స్పష్టంగా అర్ధం అవుతోందని, అయినప్పటికీ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ఇంకా ఏదో అవకాశం ఉందని, తామేదో చేయబోతున్నామని ప్రజలను మోసగించడం దారుణమని ఆయన అన్నారు.   కేంద్రం రాష్ట్ర విభజన చేసి, తెలంగాణా రాష్ట్రం ఏర్పరచబోతోందని కాంగ్రెస్ నేతలకు ఆరునెలలు ముందుగానే తెలిసి ఉన్నపటికీ, వారు తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఇంతకాలంగా ప్రజలను మభ్యపెడుతూ వచ్చి, ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలంటూ నాటాకాలు ఆడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.ఇందుకు వేరెవరినీ నిందించడం అనవసరమని, రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలే దీనికంతటికీ కారణమని ఆయన విమర్శించారు.   కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం కూడా జరిగిపోయిన తరువాత ఇప్పుడు సీమాంధ్ర మంత్రులు రాజీనామా డ్రామాలు ఆడుతుంటే, రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని వాదిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకెక్కడం కేవలం నాటకం మాత్రమేనని ఆయన విమర్శించారు. ఇక రాష్ట్ర విభజనపై ఎవరెన్ని వాగ్వాదాలు చేసుకొన్నపటికీ వాటివల్ల ఒరిగేదేమీ ఉండదని ఆయన స్పష్టం చేసారు.

16నుంచి తెలంగాణ‌లో శాంతి ర్యాలీలు

  తెలంగాణ ప్రక‌ట‌న త‌రువాత సీమాంద్రలో నిర‌స‌న జ్వాల‌లు చెల‌రేగ‌టంతో ఇప్పుడు తెలంగాణ నేత‌లు కూడా నిర్ణయం వెనక్కిపోకుండా ఉండేంద‌కు త‌గిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న సీమాంద్రుల స‌మ్మె రాజ్యంగా వ్యతిరేఖ‌మ‌న్నారు. తెలంగాణ ప్రక‌ట‌న‌పై కేంద్ర వెన‌క్కి త‌గ్గకుండా ఉండేదుకు పోరాట‌న్ని మ‌రోసారి ఉదృతం చేయాల‌ని భావిస్తున్నట్టుగా ఆయ‌న చెప్పారు. ఈ నెల 16 నుంచి తెలంగాణ ప్రాంతంలో వివిధ జేఎసి ఆధ్వర్యంలో శాంతిర్యాలీలు చేప‌ట్టనున్నట్టుగా చెప్పారు. అలాగే ఈ నెలాఖరులో రాజధాని హైదరాబాద్లో భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సీమాంద్ర ప్రాంతం అభివృద్ది చెంద‌క పోవ‌డానికి అక్కడి ప్రజాప్రతినిధులే కార‌ణం అన్నారు కోదండ‌రాం.ఈ రోజు స‌మైక్యాంద్ర కోరుతూ సీమాంద్ర మంత్రుల భార్యలు గ‌వ‌ర్నర్‌ను క‌ల‌సి విజ్ఞప్తి చేసిన నేప‌ధ్యంలో వారు త‌మ భ‌ర్తల‌నే సీమాంద్ర వెనుక‌బాటుత‌నం గురించి నిల‌దీయాల‌న్నారు కోదండ‌రాం.

రాజ్యసభలో చిదంబర రహస్యం

    .....సాయి లక్ష్మీ మద్దాల   ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తో కేంద్రం ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం రాజ్యసభలో తేల్చి చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తేదీని తాను ఖచ్చితంగా చెప్పలేనన్నారు. తెలంగాణా అంశాన్ని తొమ్మిదేళ్ళుగా నానబెట్టిన కాంగ్రెస్ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధికోసమే హడావిడిగా నిర్ణయం తీసుకుందన్న విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంలో 2009 లో తెలంగాణా పై ప్రకటనను ఉపసంహరించుకుంటూ ఆనాడు అన్ని పార్టీలు 'యు టర్న్'తీసుకున్నాయని చెప్పారు. మరి ఈనాడు మరల 'యూటర్న్'తీసుకోమని ఏ పార్టీ అయిన ఆయనకు హామీ యిచ్చిందా ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పవలసి ఉంది. ఎలాంటి కసరత్తు చేయకుండా తెలంగాణా పై ప్రకటన చేసారన్న విమర్శలకు సమాధానంగా శ్రీకృష్ణ కమిటీ వేసి చాలా కసరత్తు చేశామని చెప్పారు. కానీ శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ. దాని మీద కేంద్ర మంత్రి వర్గం లో కాని,పార్లమెంట్ లో కాని ఎటువంటి చర్చ జరగలేదు. వాస్తవానికి ఆ కమిటి చివరి అంశంగా తెలంగాణా గురించి ప్రస్తావిస్తూ అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వారి సమ్మతితో విభజన చేయాలని చెప్పింది. కానీ విభజన ప్రక్రియ ఆ ప్రకారంగా జరగలేదు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో మొదటగా చెప్పిన 5 అంశాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే విషయాన్ని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పవలసి ఉంది. ఎన్.డి.ఎ  ప్రభుత్వం గురించి  మాట్లాడుతూ ఆనాటి కేంద్ర హోం మంత్రిగా ఉన్న అద్వాని విభజన తనకు సమ్మతంగా లేదని చెప్పారని రాజ్యసభలో చిదంబరం అన్నారు. మరి నేడు బి.జె.పి సహకారంతో విభజన చెయ్యటానికి ఏ విధంగా ముందుకు వచ్చారో చిదంబరం చెప్పాలి. 2009 నాడు ప్రకటనను వెనకకు తీసుకున్నప్పటికీ నేడు మరల ప్రకటన చేయటానికి పరిస్థితులలో  మార్పు ఏమి వచ్చింది అనేది స్పష్టంగా చెప్పవలసి ఉంది. సి.డబ్ల్యు. సి  నిర్ణయం అంతిమ నిర్ణయం అని ప్రకటిస్తున్న కాంగ్రెస్ పెద్దలు 2001 లో సి.డబ్ల్యు.సి తీసుకున్న రెండవ ఎస్. ఆర్. సి నిర్ణయం ఏమైందో చెప్పాలి. రాష్ట్ర విభజన లాంటి అతి ముఖ్యమైన విషయాలు పార్లమెంట్ లో ప్రధాని ప్రకటించాలి. చిదంబరం ఎందుకు చేస్తున్నారు?అన్నిటికి మించి ఇప్పుడు కొత్తగా ఆంటోని కమిటీ అది కూడా పార్టీ కమిటీ వేశామని చెబుతున్నారు. ఏదైనా చెప్పుకునేది ఉంటె ఆ కమిటీతో చెప్పుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక పార్టీ కమిటీ ఎవరిని బుజ్జగించటానికి నేతలనా,ప్రజలనా?

తొలిరోజు స‌మ్మె స‌క్సెస్‌

  తెలంగాణ ప్రక‌ట‌ణ‌కు నిర‌స‌గా సీమాంద్ర ఉద్యోగ సంఘాలు త‌ల పెట్టిన స‌మ్మె తొలిరోజు విజ‌య‌వంతం అయింది.. ఈ మేర‌కు ఎపిఎన్జీవోస్ నేత అశోక్‌బాబు ఒక ప్రక‌ట‌న చేశారు. ఈ రోజు స‌చివాలంలో విలేకరుల‌తో మాట్లాడిన ఆయ‌న స‌మ్మెకు స‌హ‌క‌రించిన ఉద్యోగుల‌కు కృత‌జ్ఞత‌లు తెలిపారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడిన అశోక్ బాబు, సీమాంద్రలోని అన్ని జిల్లాల్లో స‌మ్మె విజ‌య‌వంతం అయిన‌ట్టు త‌మ‌కు స‌మాచారం అందింద‌న్నారు. స‌మ్మెలో పాల్గొనే వారు విద్వేషాలు రెచ్చగొట్టే నినాదాలు ప్రసంగాలు చేయ‌వ‌ద్దని కొరారు. రాష్ట్ర విభ‌జ‌న నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃస‌మీక్షించాల‌ని ఆయ‌న కోరారు. కొంత మంది నాయ‌కులు ఇక్కడ స‌మ్మె చేయ‌వ‌ద్దని త‌మ‌ని విజ‌య‌వాడ, తిరుప‌తి వెళ్లమ‌ని త‌మ‌ని బెదిరిస్తున్నార‌ని చెప్పారు. ఇప్పుడే ప‌రిస్థితి ఇలా ఉంటే రేపు రాష్ట్రం విడిపోయాక ఎలా ఉంటుంద‌ని ఆయ‌న ప్రశ్నించారు. రాష్ట్ర విభజన మీకు ఎంత అవసరమో, రాష్ట్రం కలిసి ఉండటం తమకు అంత అవసరం అన్నారు.

సీమాంద్రలో చ‌దువులు కూడా బంద్‌

  సీమాంద్ర జిల్లాల్లో రోజు రోజుకు ఉద్యమం ఉదృతం అవుతుంది. ఇప్పటికే చాలా శాఖ‌ల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు స‌మ్మెలో పాల్గోంటుండ‌గా ఇప్పుడు తాజాగా సీమాంద్రల్లోని 13 జిల్లాల‌కు సంభందించిన ఉపాధ్యాయులు స‌మ్మెకు సిద్దం అవుతున్నారు. చాలా మంది ప్రజా ప్రతినిధులు ఉద్యమంలో పాల్గొన‌క పోయినా ఉద్యోగులు, అన్ని వ‌ర్గాల ప్రజ‌లు స‌మైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు మిగిలిన ఉద్యోగ సంఘాల‌తో పాటు సమైక్యాంధ్ర కోసం  13 జిల్లాల ఉపాధ్యాయ సంఘాలు కూడా సమ్మె చేయడానికి  సిద్ధమవుతున్నాయి. ఆ ప్రాంత ఉపాధ్యాయ సంఘాల నేతలు రేపు  హైదరాబాద్లో సమావేశం కానున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఉపాద్యాయుల‌కు సీమాంద్ర స్థాయిలో జెఏసిలు లేక‌పోవ‌డంతో ఇప్పటి వ‌ర‌కు వారు నిర‌స‌న‌లకు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. 13 జిల్లాల ప్రతినిధులతో  బుధవారం హైదరాబాద్‌లో జరిగే కీలక  సమావేశంలో సీమాంధ్ర స్థాయి ఉపాధ్యాయ జేఏసీని ఏర్పాటు చేయాలని  నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి ఉపాధ్యాయులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

దిగ్విజ‌య్‌తో తెలంగాణ‌ ఎంపిల భేటి

  సీమాంద్రలో జ‌రుగుతున్న స‌మైక్య సెగ‌ల నేప‌ధ్యంలో తెలంగాణ ప్రాంత ఎంపిలు ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్ దిగ్విజ‌య్ సింగ్‌తో భేటి అయ్యారు. సీమాంద్రల్లో వ‌స్తున్న నిర‌స‌న‌ల‌తో నిర్ణయంలో మార్పు చేయ‌కూడ‌దని కొర‌డంతో పాటు, వీలైనంత త్వర‌గా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాల‌ని కోరారు. రాష్ట్ర విభ‌జ‌న ఆల‌స్యమ‌వుతున్న కొద్ది స‌మ‌స్యలు జ‌ఠిల‌మ‌వుతున్నాయ‌ని కాబ‌ట్టి వీలైనంత త్వర‌గా విభ‌జ‌న ప్రక్రియ పూర్తిచేయాల‌ని కోరిన‌ట్టుగా ఎంపి రాజ‌గోపాల్ రెడ్డి చెప్పారు. సీమాంద్ర ప్రజ‌ల‌కు తాము ర‌క్షణ క‌ల్పిస్తామ‌ని ఎంపి బ‌ల‌రాం నాయ‌క్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ త‌రువాత కూడా వారిని సోదురులుగానే చూస్తాం అని ఎంపిలు  చెప్పారు.