మిథున్ రెడ్డి కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు దూకుడుగా సాగుతోంది. ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురికి బెయిలు వచ్చినా.. కీలకమైన వారు ఇప్పటికీ బెయిలు లభించక రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారిలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులు అయిన రాజ్ కేశిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిథున్ రెడ్డిలు కూడా ఉన్నారు.  తనకు సన్నిహితులైనప్పటికీ జగన్ ఇప్పటి వరకూ వీరిని జైలుకు వెళ్లి పరామర్శించలేదు. అది పక్కన పెడితే.. ఈ కేసులో ఏ4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు బెయిలుపై వెళ్లి తిరిగి వచ్చి రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయారు. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ తరుణంలో సిట్ మిథున్ రెడ్డిని ఐదు రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.   సిట్ పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. 

అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు?.. జగన్ రెడ్డి మాట మార్చి మడమ తిప్పేశారా?

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గురువారం (సెప్టెంబర్ 18) నుంచి  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదని ఇప్పటికే పలు మార్లు వైసీపీ అధినత జగన్ చెప్పారు. అయితే మాట అదే అయినా, ఇప్పుడు చేత మారుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  ఇటీవల కూడా జగన్ స్వయంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోవడం లేదని స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీకి హాజరు కాకపోవడమే ఖరారైతే.. ఆయన హడావుడిగా తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కావలసిన అవసరం లేదు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల రోజునే అంటే గురువారం (సెప్టెంబర్ 18)న తన తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు.  దీనిపై జగన్ సొంత మీడియా కూడా క్లారిటీ ఇచ్చింది. జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారని పేర్కొంది.   దీనిని బట్టి ప్రతిపక్ష హోదా  విషయాన్ని వదిలేసి జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి హాజరౌతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఒక వేళ జగన్ తాను డుమ్మా కొట్టి, తన పార్టీకి చెందిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలనూ సభకు పంపుతారా? అన్న అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒక వేళ జగన్ అసెంబ్లీ బహిష్కరణకే కట్టుబడి ఉంటే.. ఆయన ఆదేశాలను ధిక్కరించి అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో జగన్ వ్రతం చెడ్డా ఫలమైనా దక్కితే చాలన్నట్లుగా అసెంబ్లీ హాజరుకు, ప్రతిపక్ష హోదాకూ ముడిపెట్టవద్దన్న నిర్ణయానికి వచ్చి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ విషయంలో ఆయన పొరుగు రాష్ట్రం   తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, తన స్నేహితుడు అయిన కేసీఆర్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తాను అసెంబ్లీకి హాజరు కాకపోయినప్పటికీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరౌతున్నారు. జగన్ కూడా అదే విధంగా తాను అసెంబ్లీకి గైర్హాజరైనా పార్టీ ఎమ్మెల్యేలను సభకు పంపాలని నిర్ణయించుకున్నారంటున్నారు. అందుకే ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారనీ, ఆ భేటీలో ఆయన ఎమ్మెల్యేలకు సభలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేస్తారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీని వల్ల జగన్ కు అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని కూడా అంటున్నారు. జగన్ హాజరు కాకుండా ఎమ్మెల్యేలను సభకు పంపినా జగన్ పారిపోయారన్న విమర్శలు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.  

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటన

    తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హొటల్లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, బీసీల వాటా అనే నినాదాలు పార్టీ జెండాలో కనిపించాయి.తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక దినమైన సెప్టెంబర్ 17న పార్టీని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, "తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు.  బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోంది" అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏ పార్టీ బీసీలను ఎలా వంచించిందో లెక్కలతో వివరిస్తానని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీని ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన వివరించారు. కొందరు ఈ రోజును విమోచన దినమని, మరికొందరు విద్రోహ దినమని అంటున్నారని, కానీ వాస్తవానికి ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైన రోజని ఆయన గుర్తుచేశారు. అందుకే ఈ చారిత్రక రోజున తమ పార్టీని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు.   

తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యతా దినోత్సవం

తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని బీఆర్ఎస్ ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరారామావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టిన సెప్టెంబర్ 17ను కొందరు విమోచనమని, మరి కొందరు విలీనం అని అంటున్నారని, అయితే ఎవరెలా అన్నా వేలాది మంది రాజరిక వ్యవస్థపై పోరాడి ప్రాణాలర్పించారన్నది వాస్తవమన్నారు.  నాటి పోరాట యోధులందరికీ బీఆర్ఎస్ తరఫున శిరసు వంచి నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. పోరుగడ్డ తెలంగాణ.. నాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి,  1969 తెలంగాణ ఉద్యమం,ఆ తర్వాత జరిగిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమాలను చూసిందన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. గ్రూప్-1 విద్యార్థులు తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆకాంక్షలు వ్యక్తపరచుకోవడానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంతో దాడి చేసిందన్నారు. రైతన్నలు యూరియా కోసం రోడ్లపైకి వస్తుంటే వారి సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టడం మానేసి ఈ ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి పోరాడుతూనే ఉంటుందన్నారు.  ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. 

మోడీత్వ @ 75

సీఎం అయ్యే వ‌ర‌కూ అసెంబ్లీలో, పీఎం అయ్యే వ‌ర‌కూ పార్ల‌మెంటులో అడుగు పెట్ట‌లేదు. ఆపై రామాల‌య నిర్మాణం అయ్యే వ‌ర‌కూ అయోధ్యలోనూ అడుగు పెట్ట‌లేదు. అంతే కాదు ఇటు పాక్ గుండెలో వణుకు, అటు చైనాకు బెరుకు పుట్టించ‌గ‌ల ఒన్ అండ్ ఓన్లీ  నేమ్. ప్రెజంట్ యూఎస్ సిట్యువేష‌న్ కూడా సేమ్ టు సేమ్ సీన్. ద‌టీజ్ న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ.   మోడీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా  ప్ర‌త్యేక క‌థ‌నం.   మోడీ..  1950 సెప్టంబ‌ర్ 17న గుజ‌రాత్ లోని వాద్ న‌గ‌ర్ లో జ‌న్మించారు. త‌న ఎనిమిద‌వ ఏట‌నే ఆర్ఎస్ఎస్ లో చేరి అక్క‌డ 15 ఏళ్ల‌పాటు అంచ‌లంచెలుగా ఎదిగారు. ఆపై 1987లో గుజ‌రాత్ బీజేపీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా.. క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 2001లో శంక‌ర్ సింగ్ వాగేలా, కేశూభాయ్ ప‌టేల్ వంటి వారి మ‌ధ్య వివాదాలు చెల‌రేగ‌డంతో అనూహ్యంగా గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించారు. ఆ త‌ర్వాత మూడు ప‌ర్యాయాల ముఖ్య‌మంత్రిగా ప‌ని చేయ‌డం మాత్ర‌మే కాకుండా.. 2014, 2019, 2024 ఎన్నిక‌ల్లో మూడు మార్లు ప్ర‌ధానిగానూ ఎన్నిక‌య్యారు. ఇవీ క్లుప్తంగా మోడీకి సంబంధించిన గ‌ణాంకాలు. ఇక మోడీ ప్ర‌భావం, ఆయ‌న ప‌నిత‌నం, ఆయ‌న ఘ‌న‌త.. వంటి అంశాల విష‌యానికి వ‌స్తే ఏదైతే ఆర్ఎస్ఎస్ ద్వారా ఎదిగారో అదే ఆర్ఎస్ఎస్ ని ఈనాడు శాసించే వ‌ర‌కూ వ‌చ్చేశారు. గ‌తంలో బీజేపీ గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి నాగ్ పూర్ కేంద్రంగా ఉండేది. అదే నేడు.. గుజ‌రాత్ కేంద్రంగా మారిపోయింది. అంత‌గా మోడీ త‌న ప్ర‌భావాన్ని చూపించ‌డం మొద‌లు పెట్టారు. కావాలంటే చూడండి.. ఇటీవ‌ల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ 75 ఏళ్ల రిటైర్మెంట్ కి స‌బంధించి ఇలా కామెంట్ చేశారో లేదో.. ఆ వెంట‌నే ఆయ‌న‌.. అలాంటి నియ‌మం సంఘ్ లో లేనే లేదు. నేను కూడా 80 ఏళ్ల వ‌య‌సులో.. సంఘ్ ఏ ప‌ని చెప్పినా చేస్తాన‌నే వ‌ర‌కూ వ‌చ్చారు. ద‌టీజ్ ది ప‌వ‌రాఫ్ మోడీ. అంటే ఒక‌ప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పిన‌ట్ట‌ల్లా వినే క‌మ‌ల‌నాథుల నుంచి ఒక క‌మ‌ల‌నాథుడు చెప్పిన‌ట్ట‌ల్లా వినే ఆర్ఎస్ఎస్ వ‌ర‌కూ వ‌చ్చేసింది వ్య‌వ‌హారం. అంటే, క‌మ‌లం పువ్వుకు కాడ ఆధార‌మా.. కాడ‌కు క‌మ‌లం పువ్వు ఆధార‌మా.. అంటే ప్ర‌స్తుతానికైతే పువ్వే కాడ‌కు ఆధారం అన్న‌ట్టుగా మారిపోయింది సీన్. ఇక మోడీ పాల‌న‌ ద్వారా దేశ వ్యాప్తంగా వ‌చ్చిన మార్పు చేర్పులేంట‌ని చూస్తే..  అవి నోట్ల ర‌ద్దు నుంచి మొద‌లు పెట్టాల్సి వ‌స్తుంది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, ట్రిపుల్ త‌లాక్, జీఎస్టీ వంటివి కీల‌కం. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం జ‌రిగింది కూడా మోడీ హ‌యాంలోనే. ఈ విష‌యంలో మోడీకి బీజేపీ దాసోహం అంటుందంటే సందేహించాల్సిన అవసరం లేదు. కార‌ణం.. అస‌లు బీజేపీ ఇంత‌గా విశ్వ వ్యాప్తం అయ్యిందే రాముడి వ‌ల్ల‌. ఆనాడు అద్వానీ అయోధ్య ర‌థ‌యాత్ర‌లో ఒక సహాయ‌కుడిగా ఉన్న మోడీ.. ఇప్పుడు తన నేతృత్వంలో అయోధ్య రామ‌మందిరం సాకారం చేయడం అన్నది ఒక చరిత్ర  ఇక పాల‌నాప‌ర‌మైన అంశాల్లోకి వ‌స్తే..  జీఎస్టీ ద్వారా పెద్ద మొత్తంలో  ధ‌నం ఖ‌జానాకు చేరుతూ వ‌చ్చింది. అయితే మోడీ పాల‌న‌లో రోడ్ల విస్త‌ర‌ణ‌, న‌దుల అనుసంధానం, సైనిక శ‌క్తి ప‌టిష్ట‌త‌ వంటి ఎన్నో అంశాలు భార‌త్ కి క‌లిసి  వ‌స్తున్నాయ్. ప్ర‌స్తుతం కూడా మోడీ మిజోరాం, సిక్కిం వంటి ట్రైన్ ట్రాక్ లేని రాష్ట్రాల‌కు ఆ రైల్వే నెట్ వ‌ర్క్ అనుసంధానం చేస్తూ ఘ‌న‌త సాధిస్తున్నారు. ఇక మోడీ అంటే 2001 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అప్ర‌తిహ‌తంగా 24 ఏళ్ల పాటు సాగిన ఒకానొక అధికార‌పు జైత్ర యాత్ర. ఇప్ప‌టి వ‌ర‌కూ నెహ్రూ, ఇందిర వ‌యా పీవీ, వాజ్ పేయి వంటి వారెవ‌రికీ సాధ్యం కాని మూడు మార్లు ముఖ్య‌మంత్రి- మూడు మార్లు వ‌రుస ప్ర‌ధాన మంత్రిత్వం అనే ట్రాక్ రికార్డు బ‌హుశా మోడీకి త‌ప్ప మ‌రే నాయ‌కుడి  పేరిట లేద‌ని ఘంటా ప‌థంగా చెప్పొచ్చు. అంత‌టి ప‌వ‌ర్ ఫుల్ ర్యాలీ మోడీ ట్రాక్ రికార్డుల‌కు మాత్ర‌మే సొంతం. అలాగ‌ని మోడీ కేవ‌లం పాజిటివ్ వైబ్స్ తోనే న‌డుస్తున్నార‌న‌డానికి వీల్లేదు. ఆయ‌న పాల‌నా కాలంలో ఇంటింటికీ ఉద్యోగం, ప్ర‌తి ఒక్క‌రి  ఖాతాలో 15 ల‌క్ష‌ల బ్లాక్ ని వైట్ గా మార్చిన మ‌నీ.. ఇలాంటి  నెర‌వేర‌ని హామీలు చాలానే ఉన్నాయి.. అయితే మోడీ పాల‌నా కాలంలో అంత‌ర్జాతీయ విష‌యాలు ఎలాంటివ‌ని చూస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న యోగాను ప‌రిచ‌యం చేసిన పేరు సాధించారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో పాక్ పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక స‌ర్జిక‌ల్ స్ట్రైక్, మ‌రో ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా ఆధిప‌త్యం చెలాయించారు. ఇవాళ పాక్, యూఎస్ ద్వారా థ‌ర్డ్ పార్టీ మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి అంగ‌లార్చుతుంటే.. మోడీ స‌సేమిరా అంటున్నారు. ఇక యూఎస్ తో సంబంధాల విష‌యానికి వ‌స్తే ఒక‌ప్పుడు త‌న ఫ్రెండ్ ట్రంప్ గెల‌వాల‌ని ప్ర‌చారం చేసిన మోడీ.. ఇవాళ అదే ట్రంప్ ఆగ‌ర్భ శ‌తృవా అన్న‌ట్టుగా మారిన ప‌రిస్థితి. ఇప్ప‌టికే ట్రంప్ భార‌త్ పై 50 శాతం సుంకాలు విధించ‌గా.. నాటో దేశాల‌కు 100 శాతం సుంకాలు భార‌త్ పై విధించ‌మ‌ని సూచిస్తున్నారు. దీంతో మోడీ  కూడా యూఎస్ కి చెక్ పెట్టే దిశ‌గా.. చైనా, ర‌ష్యా తో చెలిమి  చేస్తూ.. ట్రంప్ గుండెల్లో మంట‌లు రేపుతున్నారు. అంత‌గా అంత‌ర్జాతీయ సంబంధాల్లో కొత్త ఒర‌వ‌డి సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ్లోబ‌ల్ సౌత్ కి  నాయ‌క‌త్వం వ‌హించేందుకు య‌త్నిస్తున్నారు మోడీ.మోడీ విద్యార్హత వంటి అంశాలు వివాదాస్పదంగా ఉంటే..  గుజ‌రాత్ అల్ల‌ర్ల కేసు ఆయన పొలిటికల్ కెరీల్ లో  మాయ‌ని మ‌చ్చ‌ అని చెప్పవచ్చు.   అదలా ఉంటే.. ఒక టైంలో త‌న అభిమానుల చేత నోస్ట‌ర్ డామ‌స్ చెప్పిన‌ భార‌త్ నుంచి వ‌చ్చే ప్ర‌పంచ ధృవ‌తార మోడీ అన్న పేరు సాధించిన మోడీ.. ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.  ఇప్ప‌డు ఆయనకు 75 ఏళ్లు. పార్టీ ప‌రంగా అయితే.. ఈ నియ‌మానుసారం ప‌ద‌వి దిగిపోవాల్సి ఉంది. అయితే నియ‌మాల‌న్న‌వి మ‌న‌కు కాదు ఇత‌రుల‌ను నియంత్రించ‌డానిక‌ని ఇంకా ఆయ‌న త‌న రాజ‌కీయ ప్ర‌స్తానం కొన‌సాగిస్తారా? లేదా అన్నిది చూడాలి.  హ్యాపీ బ‌ర్త్ డే మోడీ.

భూమనపై కేసు

అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న ఆరోపణలపై వైసీపీ సీనియర్  నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై మంగళవారం (సెప్టెంబర్ 16) కేసు నమోదైంది.  తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యేటీ ఈవో గోవిందరాజులు ఫిర్యాదుపై  అలిపిరి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.  అలిపిరి సమీపంలో ఉన్న   శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని అలక్ష్యం చేస్తున్నారంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే కూడా అయిన  భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలు విమర్శలు చేశారు.   టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భూమన ఆరోపించారు.  వాస్తవానికి తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరికి సమీపంలోని  పాత చెక్ పోస్టు వద్ద శిల్పాలు చెక్కేవారు.  23 సంవత్సరాల కిందట సీఎం నారా చంద్రబాబుపై బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ఇక్కడి శిల్పాలు చెక్కే వారిని ఖాళీ చేయించారు.  ఆ సందర్భంగా అప్పట్లో స్థపతులు శనేశ్వరుడి తొమ్మిది అడుగుల విగ్రహం అక్కడే వదిలేశారు. దీంతో అప్పటి నుంచీ ఆ విగ్రహం అక్కడే ఉందని టీటీడీ వివరించింది. అయినా.. భూమన తన ఆరోపణలను కొనసాగించడంతో.. టీటీడీ డిప్యూటీ ఈవో గోవిందరాజులు భూమనపై అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.  

ఒకే సందర్భం.. పలు పేర్లు.. ఇంతకీ సెప్టెంబర్ 17న ఏంజరిగింది?

భార‌త్ లో ఒక స్వాతంత్ర దినం, మ‌రో రిప‌బ్లిక్ దినోత్స‌వం.. ఇలాంటి జాతీయ‌ పండ‌గ‌ల‌ను భారత జాతి మొత్తం ఒకే దృక్ప‌థంలో, ఒకే కోణంలో జ‌రుపుకుంటూ రావ‌డం ఆన‌వాయితీ. అయితే..  తెలంగాణ‌లో మాత్రం ఒక దినోత్సవాన్ని  మూడు పార్టీలు మూడు ర‌కాలుగా జ‌రుపుకుంటారు. అదే తెలంగాణ విమోచ‌న దినం. దీనిని బీజేపీ హైద‌రాబాద్ విమోచ‌న దినోత్స‌వంగా, కాంగ్రెస్ తెలంగాణ ప్ర‌జా పాల‌నా దినోత్స‌వంగా, బీఆర్ఎస్ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వంగా పిలుస్తూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాయి. చ‌రిత్ర‌లో ఒక ముఖ్య ఘట్టం జ‌రిగిన రోజుకు.. భిన్న పార్శ్వాలు క‌లిగి ఉండే సందర్భం  బ‌హుశా ఇదేనేమో.  అంత‌గా ఈ దినోత్స‌వం ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. ఇంత‌కీ    సెప్టెంబర్ 17కి ఉన్న చారిత్ర‌క దినం ప్రాముఖ్య‌త ఏంటంటే.. 1948 సెప్టెంబర్ 17న  నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో విలీనమైంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏడా సెప్టెంబర్ 17ను  ప్రతి పార్టీ తమ సొంత దృక్పథంతో  ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాయి.   తెలంగాణ అంటేనే ఉద్య‌మాల ఖిల్లా. భార‌త్ మొత్తం స్వాతంత్ర పోరాటం చేస్తే ఇక్క‌డ మాత్రం నిజాం పాల‌కుల‌తో స‌మాంత‌రంగా సాయుధ పోరాటం చేయాల్సి వ‌చ్చింది. అందుకే భార‌త్ మొత్తం 1947 ఆగ‌స్ట్ 15న స్వాతంత్రం పొందినా.. హైద‌రాబాద్ సంస్థానం మాత్రం నిజామ్ ఉస్మాన్ అలీ ఖాన్ పాల‌న‌లో మ‌రో 13 నెల‌ల పాటు బానిస‌త్వంలో మ‌గ్గింది.  దీనంత‌టికీ కార‌ణం ర‌జాకార్లు.. అంటే మిల‌ట‌రీ వింగ్ ఆఫ్ మ‌జ్లిస్- ఏ- ఇత్తిహాద్ అనే పేరిట వీరు ఆనాడు హైద‌రాబాద్ రాష్ట్ర ప్ర‌జ‌లపై అనేక అత్యాచారాలు, హింస వంటి దారుణ‌మైన ప‌ద్ధ‌తుల్లో పాలిస్తూ.. స్వ‌తంత్ర రాజ్యం కోసం పోరాడారు. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ నాయ‌క‌త్వంలోని భార‌త ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ పోలో పేరిట పోలీస్ యాక్ష‌న్ ప్ర‌క‌టించింది.  1948 సెప్టెంబర్ 13న, భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించిన నాలుగు రోజుల్లోనే నిజాం లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న, అధికారికంగా లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో హైదరాబాద్ భారత్‌లో విలీనమైంది. ఈ పోరాటంలో వేల మంది తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగం చేశారు. రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, చండ్రరాజేశ్వరరావు, షోయాబుల్లా ఖాన్ వంటి నాయకులు ఈ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి ఈ చారిత్ర‌క రోజును ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తుల్లో ర‌క‌రకాలుగా జ‌రుపుకోవ‌డం మొద‌లైంది. అయితే జనానికి మాత్రం ఇది రెండో స్వాతంత్ర పోరాట విజ‌యం. ర‌జాకార్ల పై సాధించిన ఘ‌న విజ‌యం. బ్రిటిష‌ర్లతో ఎలాంటి పోరాటం చేశారో తెలీదు కానీ.. ఆనాటి ర‌జాకార్ల దాష్టీకాల‌కు హింసాకాండ‌కు బ‌లైన అమ‌రుల‌ను త‌లుచుకుంటూ నివాళి అర్పించే సంద‌ర్భం.

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ వేడి... పార్టీల ఫోకస్

  రాష్ట్రంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వేడి మొదలైంది. జూబ్లీ బైపోల్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బరిలో దిగనున్నారు. బీసీ నినాదానంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పేరును పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.   నియోజకవర్గంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పోస్టర్లు వెలిశాయి. ‘కావాలి అంజన్న.. రావాలి అంజన్న.. ఇది నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష’ అంటూ జూబ్లీహిల్స్‌లో అంజన్‌కుమార్ బ్యానర్లు అంచించారు. మరోవైపు.. తాను టికెట్ ఆశిస్తున్నట్టు ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. అలాగే మినిస్టర్ పదవి కూడా కావాలని బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌  మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉపఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపినాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె కుటుంబంతో సహా ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు.   జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కమలం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ.. ఈ సీటునూ సొంతం చేసుకుని బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నా.. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో  అధిష్ఠానం నిమగ్నమైనట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోనే ఈ స్థానం ఉంది. దీంతో తమకే గెలిచే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది

ఏపీ మండలి చైర్మన్ న్యాయవాదికి హైకోర్టు అక్షింతలు!?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం విషయంలో పదే పదే వాయిదాలు కోరుతున్న మండలి చైర్మన్ న్యాయవాదికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ విచారణకు మరింత సమయం కావాలంటే ఖర్చుల కింద పదివేల రూపాయలు చెల్లించాలని స్పష్టం చేసింది.  ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ పిటిషన్ విచారణ చేపట్టిన జస్టిస్ రామకృష్ణ  మండలి చైర్మన్ మెషేన్ రాజు న్యాయవాది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విషయమేంటంటే.. జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఆ పార్టీలో చేరారు. అనంతరం వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అయితే, పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదనే కారణంతో 2024 నవంబర్‌లో ఆయన తన ఎమ్మెల్సీ పదవితో పాటు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ కె. మోషేన్ రాజుకు స్వయంగా అందజేశారు. నెలలు గడుస్తున్నా, తన రాజీనామాను చైర్మన్ ఆమోదించకపోవడంతో  జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. తన రాజీనామా ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణను ఇప్పటికే చైర్మన్ న్యాయవాది కోరిక మేరకు పలుమార్లు వాయిదా వేసినా  కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం చేయడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  బుధవారం సాయంత్రం 5 గంటలలోపు లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.10 వేలు చెల్లించాలని ఛైర్మన్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. 

ప్రభుత్వ శాఖల సేవలకు రేటింగ్స్.. ఏపీ సీఎం నారా చంద్రబాబు

ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు ఇకపై రేటింగ్స్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు మంగళవారం (సెప్టెంబర్ 16) క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 తదితర అంశాలపై సమీక్షించిన చంద్రబాబు.. పాలనలో టెక్నాలజీ వినియోగంపై   దిశానిర్దేశం చేశారు.  కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరు మరింతగా మెరుగు పడాల్సి అవసరం ఉందని చెప్పిన చంద్రబాబు గతంతో పోల్చుకుంటే కొన్ని శాఖల పనితీరు మెరుగు పడినప్పటికీ,  రెవెన్యూ లాంటి శాఖల పనితీరు మరింత మెరుగుపడాలన్నారు.   రెవెన్యూ శాఖ   సంతృప్తికర స్థాయిలో  సేవలు అందించడం లేదని చంద్రబాబు అన్నారు. అందుకే ప్రభుత్వ సేవలకూ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.  సీనియర్ అధికారులు కూడా తమ పని విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై తమ తమ శాఖలకు సంబంధించిన క్షేత్ర స్థాయి సమాచారం కోసం పదే పదే కలెక్టర్లను నివేదికలు అడిగే పరిస్థితి రాకూదని అన్నారు. ఆర్టీజీఎస్ నుంచి అవసరమైన మేరకు నివేదికలు తీసుకుని అందుకు అనుగుణంగా  పని చేయించాలన్నారు.  అన్ని ఫైళ్లూ వంద శాతం ఆన్ లైన్ లో ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం రెండు నెలలు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా అవేర్ వ్యవస్థను ఏర్పాటు చేశామనీ,  దీని ద్వారా 42 రకాల సమాచారం కలెక్టర్లకు అందుతోంది.  వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి ఏయే జిల్లాలు ఎక్కడెక్కడ తమ పనితీరు మెరుగుపరుచుకోవాలో కూడా రియల్ టైమ్ లో చెప్పేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.  కలెక్టర్ల కాన్ఫరెన్సులో క్వాంటం వ్యాలీ భవనాల డిజైన్లను ప్రదర్శించారు. ఆ భవనాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సీఎం కోరారు. భవిష్యత్తులో 3 వేల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం అందుబాటులోకి రానున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. 80 వేలమంది పని చేసేలా క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

పేర్నినానిపై మరో కేసు?.. ముందస్తు బెయిలొచ్చే వరకూ అజ్ణాతమేనా బాసూ!

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తాజాగా మరో భూ కబ్జా ఆరోపణ బలంగా వినిపిస్తోంది. బందరులోని రంగనాయకులు ఆలయ భూమికి సంబంధించి పేర్ని నానిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  బైపాస్ రోడ్డు సమీపంలోని దేవుని చెరువు వద్ద భూమికి ఎండోమెంట్ అధికారులు గతంలో నిర్వహించిన వేలం ద్వారా చాలా చాలా తక్కువ ధరకు భూములు అమ్ముడుపోయాయి. ఇందుకు పేర్ని నాని చేసిన ప్రచారమే కారణమని అంటున్నారు. అప్పట్లో అంటే వేలం సమయంలో పేర్ని నాని ఆ భూములు తిరిగి విక్రయించడానికి పనికిరావని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ భూముల గుండా హైనెన్షన్ వైరు వెడుతుండటమే ఇందుకు కారణమని నాని అప్పట్లో చేసిన ప్రచారం కారణంగా ఎవరూ కొనుగోలుకు ముందుకు రాలేదు. ఈ భూమిని పేర్ని నాని అప్పట్లో గజం 12వందల నుంచి 13 వందల రూపాయలకు అతి చౌకగా సొంతం చేసుకున్నారు.  ఈ రకంగా పేర్నినాని, అతడి అనుచరులు దాదాపు 5.33 ఎకరాల భూమిని వేలం ద్వారా కారు చౌకగా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అదే భూమిని చదరపు గజం 40 నుంచి 50 వేల రూపాయల వరకూ విక్రయించాలని చూస్తున్నారు.   అతి చౌకగా అనుచరుల పేరు మీద కొనుగోలు చేసిన భూమి చాలా భాగాన్ని పేర్ని నాని వైసీపీ అధికారంలో ఉండగానే అంటే.. 2022 మరియు 2023 మధ్య తన, తన కుటుంబ సభ్యుల పేర్ల మీద బదలాయించేకుకున్నారు. మిగిలిన భూమిని కూడా తన కుటుంబ సభ్యుల పేర బదలాయించు కోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆ భూముల గుండా వెడుతున్న హైటెన్షన్ వైర్ ను కూడా తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూముల వ్యవహారంలో పేర్ని నానిపై కేసు నమోదయ్యేందుకు రంగం సిద్ధమైందని చెబుతున్నారు. కేసు నమోదైతే.. ఈ కేసులో కూడా ముందస్తు బెయిలు వచ్చే వరకూ పేర్ని నాని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతారా? చూడాల్సి ఉందంటున్నారు పరిశీలకులు. గతంలో తనపై కేసు నమోదైన ప్రతి సారీ పేర్ని నాని కోర్టు బెయిలు మంజూరు చేసే వరకూ అజ్ణాతంలో గడిపిన సంగతిని ఈ సందంర్భంగా గుర్తు చేస్తున్నారు.  

అప్పుడు చెప్పాం.. ఇప్పుడు చేసి చూపించాం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. విభజిత ఆంధ్రప్రదేశ్ కు రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 15 నెలలు అయ్యింది. గతంలో మూడు సార్లు సీఎంగా ఉన్న సమ యంలో ఎన్నడూ ఎదుర్కోని క్లిష్టపరిస్థితులు ఈ సారి ఆయనకు స్వాగతం పలికాయి. జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం, విధ్వంస పాలన కారణంగా గత ఏడాది చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటమే కాకుండా పది లక్షల కోట్ల రూపాయల అప్పు నెత్తిన పడింది.   ఇదే విషయాన్ని చంద్రబాబు సోమవారం (సెప్టెంబర్ 15) కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ చెప్పారు.  అటువంటి పరిస్థితుల నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచీ రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చి అభివృద్ధి దిశగా నడిపించేందుకు తాను చేపట్టిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలను ఆయన ఈ సదస్సులో వివరించారు. అదే సమయంలో నగదు బదలీ పథకాలు అంటే సంక్షేమ పథకాలకు ఎక్కడా ఎలాంటి లోటూ రాకుండా ముందుకు సాగుతున్నానని చెప్పారు.   దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నాన్నా. అదే పెన్షన్ల పథకం అని చెప్పిన ఆయన ఈ పథకం ద్వారా 64 లక్షల మందికి ప్రతి నెలా మొదటి తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్నట్లు వివరించారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికీ ఆర్థిక సహాయం అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు.  మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, దీపం 2 పథకాల గురించి వివరించారు. అన్నదాతా సుఖీభవ, ఆటో డ్రైవర్లకు రూ.15వేలు పథకాల గురించి కూడా చెప్పారు. గత ఏడాది ఎన్నికలకు ముందు చెప్పాము.. ఇప్పుడు చేసి చూపిస్తున్నాము అన్న చంద్రబాబు.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగాలని, అందులో కలెక్టర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు.  

పీకే.. బీహార్ లో కింగ్ మేకరేనా?

ఒకప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త అయి ఉండాలన్న అభిప్రాయం ఉండేది. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్నా.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్ లో తిరుగుతున్నారునుకోండి అది వేరే సంగతి.  అయితే ఆయన ఇప్పుడు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తన సొంత పార్టీ జనసురాజ్ కు తాను తన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల చివరిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.  అక్కడ పోరు హోరా హోరీ అన్న అంచనాలు ఉన్నాయి. ఎంత హోరాహోరీగా ఉన్నా ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కు ఎడ్జ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి.  ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఆర్డేజీ, ఎల్జీపీ, ఆప్ స‌హా వామ‌ప‌క్షాలు, బీజేపీ నేతృ త్వంలోని ఎన్డీయే కూటమి   తలపడుతున్నాయి. కానీ ఎన్నికల వ్యూహకర్త, జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మాత్రం తాను ఎవరి పక్షమూ కాదని చెబుతున్నారు. తాను ప్రజాపక్షమనీ, ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగుతున్నాననీ చెబుతున్నారు.  అదే ఇప్పుడు ఈ ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న మహాఘట్ బంధన్, ఎన్డీయే శిబిరాల్లో ఆందోళనకు కారణమౌతోంది. పీకేకి, ఆయన పార్టీకి యువత, విద్యార్థులలో మంచి గుర్తింపు ఉంది. ఆయన ఒంటరిగా బరిలోకి దిగితే విజయం మాట ఎలా ఉన్నా.. మహాఘట్ బంధన్, ఎన్డీయేల ఓట్లను భారీగా చీల్చే అవకాశాలున్నాయని తాజాగా ఓ సర్వే పేర్కొంది. బీహార్ ఎన్నికలలో పీకే నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ తక్కువలో తక్కువ 8.3 శాతం ఓట్లు సాధిస్తుందన్నది ఆ సర్వే సారాంశం. అంటే బీహార్ లో అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా పీకే ప్రాధాన్యత, ప్రాముఖ్యత చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. సపోజ్ ఫర్ సపోజ్ బీహార్ ఎన్నికలలో ఏ పార్టీ అధికారానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోతే.. పీకే  కింగ్ మేకర్ అవుతారన్న మాట. కొంచం ఇంచుమించుగా తాజా సర్వే ఆ విషయాన్నే చెప్పింది.  ఇక సర్వేను పక్కన పెట్టి బీహార్ ఎన్నికల విషయానికి వస్తే.. ఈ సారి ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత చాలా చాలా గట్టిగా పని చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కూడా ఆ ప్రజా వ్యతిరేకతపైనే గంపెడాశలు పెట్టుకుంది. అయితే పీకే ఒంటరి పోరు పేరుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశలు మెండుగా ఉన్నాయంటున్నారు.  చూడాలి మరి పీకే ఒంటరి పోరు ఏ కూటమి కొంప ముంచుతుందో? 

బండి సంజయ్‌పై కేటీఆర్‌ రూ.10 కోట్ల పరువు నష్టం కేసు

  కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బండి సంజయ్ ఎటువంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేశారని, దీనివల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.  తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ కేటీఆర్ తరఫు న్యాయవాదులు ఆగస్టు 11న బండి సంజయ్‌కు లీగల్ నోటీసు పంపారు. అయితే, ఆ నోటీసులకు బండి సంజయ్ స్పందించకపోవడంతో పాటు, క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో కేటీఆర్ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే ఆయన సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ దావాలో కేటీఆర్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలకు గాను బేషరతుగా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తన పరువుకు నష్టం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు, ప్రసంగాలు, ప్రచురణలు చేయకుండా బండి సంజయ్‌ను నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అలాగే, ఇప్పటికే ఆన్‌లైన్ వేదికలు, సామాజిక మాధ్యమాలు, ఇతర వార్తా మాధ్యమాలలో ఉన్న పరువు నష్టపరిచే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు  

వక్ఫ్ పై సుప్రీం తీర్పు హర్షణీయం : సీపీఐ నారాయణ

  వక్ఫ్​ సవరణచట్టంలోని అనేక కీలక నిబంధనలను నిలిపివేస్తూ  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ స్వాగతించారు. న్యూఢిల్లీలోని ఎ. పి భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంఖ్య బలంతో చేసిన చట్టంపై సుప్రీం కోర్టు స్పందనపై హర్షం వ్యక్తం చేశారు. సిపిఐ ముందు నుంచి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరినీ ఖండిస్తూనే ఉందని గుర్తు చేశారు. బిల్లు చట్ట రూపం పొందక మునుపే జాయిన్ట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కోరినట్టు గుర్తు చేశారు.అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రకారం ఒక శాతం ఉన్న ప్రజలకు కూడా మతపరమైన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కేంద్రం ప్రభుత్వ ఏక పక్ష వైఖరికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ఇక మోదీ చేపట్టిన అస్సాం, మణిపూర్ పర్యటనలో నిజాయతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ మూడేళ్లుగా మండుతున్నా పట్టించుకోని ప్రధాని అటువైపు చూడలేదని పేర్కొన్నారు. అక్కడి సమాజం రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రమైన ఘర్షనలు జరిగినా పట్టించుకొని మోదీ ఇప్పుడు అక్కడకి వెళ్లి ఏమి సాధించలేదని పేర్కొన్నారు. అయన పర్యటన పుంగనూరు జవాను పోయాడు వచ్చాడు అనే సామెత తరహాలో ఉందని ఎద్దేవా చేసారు. అప్పటికే నిర్మాణమై, ఉపయోగంలో ఉన్న పాత భవనాలను మళ్ళీ ప్రారంభించిన రావడం పై మండిపడ్డారు. మొత్తం మోదీ మణిపూర్ పర్యటన మోస పూర్తితంగా ఉందని ఆరొపించారు. తెలంగాణ సాయుద పోరాటం వారోత్సవాల నేపథ్యంలో  తెలంగాణ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ను విముక్తి చేసిన ఉద్యమంపై గవర్నర్ అలా మాట్లాడడం ఆర్ ఎస్ ఎస్ అజండాను మోయడమే అవుతుందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ను నిషేధించిన  పటేల్ పేరుతో రాజకీయం చేయడం సిగ్గు చేటని పేర్కొన్నారు. నిజాంకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. 4 వేల మంది కమ్యూనిస్టుల త్యాగాలు, పది లక్షల ఎకరాల భూమి పంపకం తెలంగాణ సాయుధ పోరాటం ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇవన్నీ మరచి గవర్నర్ ఆర్ఎస్ఎస్ సంస్థకు చెప్రాశిలాగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ కేరళ, తమిళనాడు సహా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల గవర్నర్ లందరూ ఆర్ఎస్ఎస్ మూలాలకు చెందిన వారిని పేర్కొన్నారు. వారంతా కేంద్రానికి తోత్తులుగా మారి రాష్ట్రాల్లో సమాంతర పాలన చేస్తూన్నారని పేర్కొన్నారు. బీజేపీ ఆర్ ఎస్ ఎస్ నేతలకు తెలంగాణ సాయుధ పోరాటం పై మాట్లాడే అర్హత లేదని వ్యాఖనించారు. ఇటు స్వాతంత్ర పోరాటంలోనూ వారికి ఇసుమంత పాత్ర లేదని గుర్తు చేశారు. బిజెపిల నుండి ఒక్కరైనా జైలుకు వెళ్లారా ఒక లాటి దెబ్బ తిన్నారా ఒక తూటాని ఎదుర్కొన్నారు అంటూ ఘాటుగా ప్రశ్నించారు.దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో తమవారు లేకపోవడం తో తమకు సంబంధం లేని వారి త్యాగాలను వాడుకుంటున్నరని, శవాలను కూడా అద్దెకు తీసుకుని తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని నారాయణ  చురకలు అంటించారు.

రాజకీయాల్లో మహిళలకు ఎన్టీఆర్ ప్రోత్సాహం : అయ్యన్న పాత్రుడు

  మహిళలు లేకుండా వికసిత్‌ భారత్‌ సాధించలేమని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. చాల చోట్ల మహిళలు స్కూళ్లకు దూరంగా ఉండటం వల్ల కొందరు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారత సదస్సులో రెండో రోజు ఆయన మాట్లాడారు. ప్రతి స్త్రీకి భద్రత, ఆత్మ నిర్భరత అందించాలి. పంచాయతీ స్థాయిలో కంప్యూటర్ సెంటర్ ఉండేలా చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఎకనామిక్‌ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు.  మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధిస్తే.. భారత్ ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. గ్రామంలోని ప్రతి మహిళకు పని కల్పించి, ఆర్థికంగా స్వతంత్రులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కమిటీలు ప్రణాళికలు రూపొందించాలి. దేశంలోని ఆఖరి మహిళకు కూడా ఫలితాలు అందేలా ప్రణాళికలు ఉండాలి. పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి లోక్ సభ వరకు ప్రతి ఒక్కరూ మహిళల వృద్ధి కోసం కృషి చేయాలని సభాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగిన మహిళా సాధికారతపై పార్లమెంటరీ మరియు శాసన కమిటీల మొదటి జాతీయ సదస్సు విజయవంతంగా పూర్తవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు  రావాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్యా రంగంలోను, సమాజ సేవలోను భాగస్వామ్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి విచ్చేసిన  పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, కమిటీల సభ్యులకు నమస్కారాలు తెలిపారు. రెండు రోజులపాటు విన్న ప్రసంగాలు, జరిగిన చర్చలు, పంచుకున్న అనుభవాలు మనకు కొత్త దిశ, కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని, ఈ మంచి చర్చలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని  అయ్యన్న పాత్రుడు  పేర్కొన్నారు. నందమూరి తారకరామారావు  అప్పట్లోనే మహిళలకు పెద్దపీట వేశారని, పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు కల్పించారని  స్పీకర్  గుర్తుచేశారు.  రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 1983లో తాను తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు లేరని, మహిళా పంచాయతీ అధ్యక్షులు లేరని అయ్యన్న పాత్రుడు  పేర్కొన్నారు. కానీ నందమూరి తారకరామారావు  స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని, అదే విధంగా అన్ని రాష్ట్రాల్లోను జరగాలని అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న తీర్మానాన్ని ఆమోదించి అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 22 మంది మహిళా శాసనసభ్యులు ఉన్నారని, శాసన మండలిలో కూడా మహిళా సభ్యులు ఉన్నారని  అయ్యన్న  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, లోక్‌సభ స్పీకర్  ఓం బిర్లా  రాజ్యసభ ఉప సభాపతి  హరివంశ్, ఏపీ ఉప సభాపతి  రఘురామ కృష్ణమరాజు పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి దేశంలోని అన్ని రాష్ట్రాల కమిటీల అధ్యక్షులు, సభ్యులు,పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : జగదీశ్ రెడ్డి

  బీఆర్‌ఎస్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి  విజ్ఞప్తి చేసినట్లు సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి  జగదీశ్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి పలు ఆధారాలు సమర్పించారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో జగదీష్‌రెడ్డి, వివేక్‌ గౌడ్‌, చింతా ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి  అసెంబ్లీ మీడియా  పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు.  బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ నాయకులతో ప్రచారాల్లో ఎందుకు తిరుగుతున్నారు, వాళ్లతో దిగిన ఫోటోలను పోస్టర్లుగా ఎందుకు వేసుకుంటున్నారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హస్తం పార్టీ కండువా కప్పుకుని తిరుగుతూ జాతీయ జెండా అని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌లో ఉంటే కేసీఆర్‌తో ఉండాలి కదా?’ అని ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తుండగా, ఆ  ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారలేదని అంంటున్నారు.  తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రను కలిశామని వారు అందుకున్న నోటీసులకు సమాధానంగా పేర్కొన్నారు.   

జూబ్లీ హిల్స్ బరిలో తెలంగాణ జాగృతి అభ్యర్థి?

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనడానికి రెడీ అయిపోరాయా? ఇప్పటి వరకూ విమర్శలు, ఆరోపణలకే పరిమితమైన కల్వకుంట్ల కవిత.. ఇక నేరుగా కదన రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. త్వరలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థిని రంగంలోని దించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆమె ఈ విషయంలో ఒక కార్యాచరణ ప్రణాళిక రచించినట్లు చెబుతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ విషయంలో ఆమె కీలక నేతలతో చర్చించారని అంటున్నారు.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో సోమవారం (సెప్టెంబర్ 15) భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్యా దాదాపు అరగంట పాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ జాగృతి తరఫున కల్వకుంట్ల కవిత విష్ణువర్ధన్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా రంగంలోకి దింపనున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి.  కవితతో భేటీ తరువాత విష్ణువర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తెలంగాణ జాగృతి అధినేత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు చెప్పారు. ఈ భేటీలో తాను కవితను పెద్దమ్మ గుడిలో దసరా ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించినట్లుచెప్పారు. తమ మధ్య రాజకీయ చర్చలేవీ జరగ లేదని పేర్కొన్నారు.  ఇలా ఉండగా త్వరలో జరగనున్న బతుకమ్మ పండుగ సందర్భంగా కవిత కొత్త పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కవిత బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తరువాత తెలంగాణ జాగృతిలో అంతర్గత విభేదాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జాగృతి తరఫున అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీఆర్ఎస్ కు గట్టి ఝలక్ ఇవ్వాలన్నపట్టుదలతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు.  

వైసీపీలో సజ్జల సినిమా అయిపోయినట్లేనా?

సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాయిస్ సజ్జల రామకృష్షారెడ్డే. వైసీపీ అధికారంలో ఉండగా సజ్జల డిఫాక్టో సీఎంగా వ్యవహరించారు. సకల శాఖల మంత్రిగా పేరు గడించారు. ఏ శాఖకు సంబంధించైనా సరే ఆ శాఖ మంత్రికి సంబంధం లేకుండా, కనీస సమాచారం కూడా లేకుండా సజ్జల నిర్ణయాలు తీసుకునే వారు. మీడియా సమావేశాలు నిర్వహించే వారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొంత కాలం సజ్జల మౌనం వహించినా.. ఆ తరువాత షరా మామూలే. జగన్ కుడి భుజంగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. పార్టీలో జగన్ తరువాత స్థానం సజ్జలదే అని పార్టీ శ్రేణులు కూడా చెబుతాయి. అయితే తాజాగా జగన్ దగ్గర సజ్జల సీన్ అయిపోయిందని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. ఇంత హఠాత్తుగా సజ్జలకు అంతటి మర్యాద? ఎందుకయ్యా అంటే.. పార్టీ వర్గాలు చెబుతున్నదానిని పట్టి.. ఇటీవల అమరావతి రాజధాని విషయంలో వైఎస్ జమన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అంటున్నారు పరిశీలకులు, ఐను ఇటీవల జస్జల చేసిన ప్రకటన,వ్యాఖ్యలు వైసీపీకి తీరని డ్యామేజీ చేశాయని అంటున్నారు.  ఇంతకీ ఆయన ఏమన్నారంటే..మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా  ఇక మూడు రాజధానుల మాటే ఎత్తదు? అమరావతే రాజధాని, విశాఖ కానే కాదు. జగన్ తాడేపల్లిలోనే ఉంటారు. గుంటూరు, విజయవాడల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధానికి అభివృద్ధి చేస్తారు. అని ఆయన మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టేశారు.  జగన్ అమరావతి రాజధానిక సానుకూలంగా ఉన్నారనీ, విశాఖ ఊసే ఎత్తరు అని చెప్పడం ద్వారా జగన్ హయాంలో మూడు రాజధానుల విధానం తప్పు అని ఒప్పుకోవడమే కాకుండా.. ఎలాంటి ప్రణాళికా, వ్యూహం లేకుండా కేవలం చంద్రబాబుపై కక్షతోనే ఇప్పుడు జగన్ అమరావతికి జై కొడుతున్నారన్న ప్రచారం ప్రజలలో బలంగా వెళ్లిపోయింది. అంతే కాకుండా అధికారంలో ఉన్నంత కాలం మూడు రాజధానులంటూ జగన్ కాలక్షేపం చేయడం కక్ష సాధింపుతోనే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోపం కాదని సజ్జల తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేసినట్లైంది. దీంతో జగన్ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది.  ఈ కారణంగానే జగన్ సజ్జలను పూర్తిగా పక్కన పెట్టేశారని అంటున్నారు. అంతే కాదు సొంత మీడియాలో కానీ, పార్టీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా సజ్జల పేరు, ఫొటో కనిపించడానికి వీల్లేదన్న ఆదేశాలు కూడా జారీ చేసినట్ల చెబుతున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా జగన సొంత మీడియాతో పాటు సామాజిక మాధ్యమంలో కూడా సజ్జల నిపించడం లేదు. వినిపించడం లేదు.