పీకే.. బీహార్ లో కింగ్ మేకరేనా?
posted on Sep 16, 2025 @ 10:57AM
ఒకప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త అయి ఉండాలన్న అభిప్రాయం ఉండేది. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్నా.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు.
అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్ లో తిరుగుతున్నారునుకోండి అది వేరే సంగతి. అయితే ఆయన ఇప్పుడు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తన సొంత పార్టీ జనసురాజ్ కు తాను తన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల చివరిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పోరు హోరా హోరీ అన్న అంచనాలు ఉన్నాయి. ఎంత హోరాహోరీగా ఉన్నా ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కు ఎడ్జ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి.
ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఆర్డేజీ, ఎల్జీపీ, ఆప్ సహా వామపక్షాలు, బీజేపీ నేతృ త్వంలోని ఎన్డీయే కూటమి తలపడుతున్నాయి. కానీ ఎన్నికల వ్యూహకర్త, జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మాత్రం తాను ఎవరి పక్షమూ కాదని చెబుతున్నారు. తాను ప్రజాపక్షమనీ, ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగుతున్నాననీ చెబుతున్నారు. అదే ఇప్పుడు ఈ ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న మహాఘట్ బంధన్, ఎన్డీయే శిబిరాల్లో ఆందోళనకు కారణమౌతోంది.
పీకేకి, ఆయన పార్టీకి యువత, విద్యార్థులలో మంచి గుర్తింపు ఉంది. ఆయన ఒంటరిగా బరిలోకి దిగితే విజయం మాట ఎలా ఉన్నా.. మహాఘట్ బంధన్, ఎన్డీయేల ఓట్లను భారీగా చీల్చే అవకాశాలున్నాయని తాజాగా ఓ సర్వే పేర్కొంది. బీహార్ ఎన్నికలలో పీకే నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ తక్కువలో తక్కువ 8.3 శాతం ఓట్లు సాధిస్తుందన్నది ఆ సర్వే సారాంశం. అంటే బీహార్ లో అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా పీకే ప్రాధాన్యత, ప్రాముఖ్యత చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. సపోజ్ ఫర్ సపోజ్ బీహార్ ఎన్నికలలో ఏ పార్టీ అధికారానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోతే.. పీకే కింగ్ మేకర్ అవుతారన్న మాట. కొంచం ఇంచుమించుగా తాజా సర్వే ఆ విషయాన్నే చెప్పింది.
ఇక సర్వేను పక్కన పెట్టి బీహార్ ఎన్నికల విషయానికి వస్తే.. ఈ సారి ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత చాలా చాలా గట్టిగా పని చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కూడా ఆ ప్రజా వ్యతిరేకతపైనే గంపెడాశలు పెట్టుకుంది. అయితే పీకే ఒంటరి పోరు పేరుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశలు మెండుగా ఉన్నాయంటున్నారు. చూడాలి మరి పీకే ఒంటరి పోరు ఏ కూటమి కొంప ముంచుతుందో?