సిట్, ఈడీల సమన్వయం.. ఏపీ లిక్కర్ స్కాం నిందితుల్లో భయం భయం!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌ లో సిట్, ఈడీలు ఏకకాలంలో దూకుడు పెంచడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఖంగారు పెరిగిపోతున్నది. ఒక వైపు సిట్ ఈ కేసు దర్యాప్తులో మద్యం కుంభకోణం సొమ్ము అంతిమ లబ్ధిదారు ఎవరన్నది తేల్చే దిశగా దర్యాప్తు చేస్తుంటే.. ఈడీ   ఈ మద్యం స్కాంకు సబంధించిన మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగిందో తేల్చే పనిలో పడింది. అందులో భాగంగానే ఈడీ గురువారం (సెప్టెంబర్ 18) ఏకకాలంలో పలు రాష్ట్రాలలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో  వైసీపీ పెద్దల్లో ఒక్కసారిగా కంగారు మొదలైంది.   ఇంత కాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని భావించిన ఈ కేసులో నిందితులు.. ఈడీ ఎంట్రీతో స్కాం చెయిన్ గుట్టు మొత్తం రట్టౌంతుందన్న ఆందోళనలో పడ్డారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఇంకా సమన్లు అందుకోని వారూ, సిట్ రాడార్ లోకి రాలేదని సంబరపడుతున్నవారు ఉలిక్కి పడుతున్నారు. దర్యాప్తు తమ దాకా రావడానికి ఇంకెంతో కాలం పట్టదన్న ఆందోళనలో పడ్డారు.  అన్నిటికంటే ముఖ్యంగా ఈడీ పక్కా సమాచారంతో, అంతకు మించి పక్కా ప్రణాళికతో సోదాలు నిర్వహిస్తున్నట్లు గురువారం (సెప్టెబర్ 18) సోదాలను గమనిస్తే అర్ధమౌతోంది.  లిక్కర్ స్కాము సొమ్ములు ఎవరెవరికి చేరాయి. బ్లాక్ ను వైట్ ఎలా చేశారు. అందుకోసం ఎవరెవరు ఎన్నెన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టారు. వంటి మొత్తం సమాచారం దగ్గరుంచుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.  ఈ తరహాలో ముందుకు వెడుతున్న ఈడీ మద్యం స్కాం సూత్రధారి ఎవరు అన్నది గుర్తించడానికి ఎంతో కాలం పట్టదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  సిట్, ఈడీలు పూర్తి సమన్వయంతో  దర్యాప్తు చేస్తున్నాయని అవగతమౌతోందని అంటున్నారు.  మనీలాం డరింగ్ ద్వారా విదేశాలకు నగదు ఎలా వెళ్లింది అన్న విషయంపై దర్యాప్తు చేసిన ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పుడు అలా విదేశాలకు వెళ్లిన సొమ్ము వైట్ గా మారి ఎక్కడికి ఎలా చేరిందన్న విషయంపై దృష్టిసారిస్తుందని అంటున్నారు.  

మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు.. మాజీ ఆర్డీవో మురళి అరెస్టు

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ మురళిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.    తిరుపతిలోని ఆయన నివాసంలో మురళిని పోలీసులు అరెస్టు చేశారు. ఫైళ్ల దగ్ధం కేసులో ఆయనకు గతంలో ఇచ్చిన   బెయిలును సుప్రీం కోర్టు రద్దు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.  గత ఏడాది జులై 21న మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులో మురళి నిందితుడు.  మురళీ 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లెలో ఆర్డీవోగా పనిచేశారు. అయితే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో  అగ్నిప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్ధం కావడం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ అక్రమాల ఆధారాలను చెరిపివేయాలన్న కుట్ర ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న కేసు కూడా నమోదైంది. దీంతో ఈ కార్యాలయంలో అంతకు ముందు పని చేసిన ఆర్డీవో మురళి సహా ఇతర అధికారులను అప్పట్లో పోలీసులు విచారించారు. ఆ విచారణలో ప్రాథమిక ఆధారాల లభ్యం కావడంతో ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది.   సీఐడీ దర్యాప్తులో ఫైళ్ల దగ్ధం కేసులో పలువురు వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అప్పట్లో పలువురిపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు అయ్యాయి.   వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మునిసిపల్ వైస్‌ ఛైర్మన్‌ జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డిలపై అప్పట్లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.  అప్పట్లో నిందితుల నివాసాలలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భూములకు సంబధించిన ఫైళ్లు లభ్యమయ్యాయి.  దాదాపు కోటి రూపాయల పైబడి భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేశారు. అప్పటి మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకటాచలపతి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పది ఫైళ్లలో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్‌ కు సంబంధించిన ఫైళ్ల జిరాక్స్‌ లు లభ్యమయ్యాయి. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులైన   మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం లో  124 ఫైళ్లు  లభ్యమయ్యాయి. సరే ఇప్పుడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఈ కేసులో నిందితుడైన మాజీ ఆర్డీవో మురళిని పోలీసులు అరెస్టు చేశారు.  సుప్రీం కోర్టు ఆయనకు గతంలో మంజూరు చేసిన బెయిలు రద్దు చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు.  దీంతో ఇప్పుడీ కేసులో ఫైళ్ల దగ్ధం కుట్ర వెనుక ఉన్న పెద్దతలకాయలు బయటపడే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. 

ప్రతిపక్ష హోదాపై జగన్ వెనక్కు.. కానీ..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై మంకుపట్టు వీడారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం (సెప్టెంబర్ 18) ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సమావేశాల్లో తాను సభకు రావడానికి సిద్ధమేనని ప్రకటించారు. హోదా కోసం ఇంత కాలం మంకుపట్టు పట్టి, కోర్టును కూడా ఆశ్రయించిన జగన్.. ఇప్పుడు బేషరతుగా  అసెంబ్లీకి హాజరు కావడానికి రెడీ అని ప్రకటించడం విస్మ యం గొలుపుతోంది. కాగా జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో జరిపిన భేటీలో అసెంబ్లీ, మండలిలో  పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అదే విధంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా తాను సభకు వస్తాననీ, అయితే సభలో తనకు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలని అన్నారు. అయితే స్పీకర్ మాత్రం సభలో ఒక ఎమ్మెల్యేకు మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో అంతే సమయం ఇస్తానని అంటున్నారనీ, అలా అయితే..  అలా అయితే ప్రజా సమస్యలను వివరంగా చెప్పడం ఎలా సాధ్యమౌతుందని అన్నారు. దీంతో అసలు జగన్ ఏం చెప్పారు? ఆయన అసెంబ్లీకి వస్తారా? రారా? కనీసం ఆయన పార్టీ ఎమ్మెల్యేలనైనా సభకు పంపుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ప్రతిపక్ష హోదా విషయంలో వెనకడుగు వేసిన జగన్.. సభలో మాట్లాడే సమయం విషయంలో మాత్రం పట్టుబడుతున్నారు. సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అయిన జగన్ సభలో మాట్లాడే సమయం విషయంలో పట్టుబట్టడాన్ని చూస్తుంటే.. ఆయన సభకు హాజరయ్యే అవకాశాలు లేవనే అంటున్నారు. 

జూబ్లీ ఉప ఎన్నిక చుట్టూ పరిభ్రమిస్తున్న తెలంగాణ రాజకీయం!

జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థాన‌మేంటో తేలిపోనున్నదా?  మంత్రి పొంగులేటి కామెంట్ల‌  అర్ధ‌మేంటి?  వ‌చ్చే మూడున్న‌రేళ్ల‌లో అస‌లు పార్టీయే ఉండ‌ద‌నీ.. బీజేపీలో క‌లిపేసి.. విదేశాల‌కు వెళ్లినా వెళ్తార‌నీ కామెంట్ చేశారు మినిస్ట‌ర్ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి.  ఈ స‌రికే కేటీఆర్ పెట్టేబేడా స‌ర్దుకుని పేక‌ప్ చెప్ప‌ డానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్య చేశారు. పొంగులేటి మాట‌ల‌ను అటుంచితే.. అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక మాత్రం మ‌హా రంజుగా సాగేలా క‌నిపిస్తోందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఉన్న ర‌స‌వ‌త్త‌ర పోరుకు తోడు ఇటు క‌విత జాగృతి తరఫున అభ్య‌ర్ధి బ‌రిలోకి దిగేలా తెలుస్తోంది.  అలాగే ఎన్డీయే కూట‌మి అభ్యర్థి కూడా పోరులో ఉండటం తథ్యం.  అంటే ఎటు నుంచి ఎటు చూసినా గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై  అన్ని పార్టీలూ దృష్టి పెట్టారన్నది స్పష్టమౌతోంది.   అన్నిటికీ మించి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సినీ ప్రముఖులు, సినీమా పరిశ్రమకు చెందిన వారు అధికంగా ఉండే ప్రాంతం. ఒక  స‌మ‌యంలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మాత  దిల్ రాజు రంగంలోకి దిగుతారని కూడా వినిపించింది.  స‌రిగ్గా అదే స‌మ‌యంలో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ స‌తీమ‌ణి  శైలిమ‌ను బ‌రిలోకి దింపినా దింపుతారనే మాట కూడా గట్టిగా వినిపించింది.  శైలిమ‌గానీ బరిలోకి దిగితే.. జాగృతి అధ్యక్షురాలు క‌విత త‌న వ‌దిన‌పై పోటీ చేస్తార‌న్న టాకూ వచ్చింది.  అదలా ఉంటే ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాకు ఆమోదం లభించలేదు.  ఒక వేళ ఆమె రాజీనామాను  మండలి చైర్మన్ఆమోదిస్తే.. అప్పుడు కవిత అనివార్యంగా  ఏదో ఒక ప‌ద‌వి కోసం పోటీ ప‌డాల్సి ఉంది. ఇటు సోద‌రితో పాటు అటు సోద‌రుడికి కూడా ఈ సీటు సో- సో- సో ఇంపార్టెంట్.  ఎందుకంటే అధికార ప‌క్షం, పొంగులేటి వంటి వారి రూపంలో ఎప్పుడూ ఏదో ఒ ప‌రీక్ష ఎదుర‌వుతూనే ఉంది. ఈ అవ‌మానాల‌న్నిటి నుంచి బ‌య‌ట ప‌డాలంటే కేటీర్ సైతం ఇక్క‌డ త‌న స‌త్తా చాటాల్సి ఉంటుంది. బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, పార్టీకి భవిష్యత్ అధినేతగా  కేటీఆర్ కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక పరీక్ష అనే చెప్పాలి. ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటితేనే.. ఆయన నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో విశ్వాసం ఇనుమడిస్తుంది. త‌న స‌త్తా చాటాల్సి ఉంటుంది.   వీట‌న్నిటితో పాటు.. కాంగ్రెస్ కి కూడా జూబ్లీ ఉప పోరు అత్యంత ప్రతిష్ఠాత్మకం అనడంలో సందేహం లేదు.   అధికారంలో ఉన్న  పార్టీ ఉప ఎన్నిక‌లో గెల‌వ‌కుంటే అది ప్రభుత్వ ప్రతిష్ట దిగజారడానికి దోహదపడుతుంది. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ కవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కుదింపు

  ఏపీ అసెంబ్లీ వర్షాకాల పనిదినాలు 8 రోజులకు ప్రభుత్వం కుదించారు. దీంతో ఈనెల 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. శాసన సభ  వర్షాకాల సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని సభాపతి అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో తొలుత నిర్ణయించారు. కానీ, ఆ తర్వాత 8 రోజులకు కుదించారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరగనుంది.  సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ, 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ మంత్రులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు రేపు మధ్యాహ్నం రూ. 1.30 గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.  

అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు : జగన్

  అమరావతి తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ నిర్వహణ తీరు, మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. జగన్ ఈ సందర్భంగా అసెంబ్లీ, మండలి వ్యవహారాలపై విస్తృతంగా వ్యాఖ్యానించారు.“అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకోవాలన్న తపన కనిపించడం లేదు,” అని ఆయన విమర్శించారు.  కొంతమంది తనకు సలహాలు ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేల్ని లాగేసి ప్రతిపక్షం బలహీనపరచాలని సూచించారని చెప్పారు.“కానీ మేము అలా చేయలేదు. వారి అభిప్రాయాలూ గౌరవించాం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది ఎవరూ గొంతు విప్పకూడదనేది అధికార పక్షం అభిప్రాయంగా కనిపిస్తోంది అని జగన్ తెలిపారు. అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉన్నప్పటికీ, మూడు పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షానికే అనుకూలంగా ఉన్నాయని, నిజమైన ప్రతిపక్షం వైయస్సార్‌సీపీ మాత్రమేనని జగన్ స్పష్టం చేశారు.  మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో తగిన సమయం దొరుకుతుంది. ప్రజల తరఫున గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ గుర్తింపు ఇవ్వడంలేదు,” అని అన్నారు.అందుకే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామని తెలిపారు. అయితే మండలిలో వైయస్సార్ కాంగ్రెస్‌కు మంచి బలం ఉందని, ఆ వేదికలో ప్రజల తరఫున గొంతు విప్పాలని ఎమ్మెల్సీలకు సూచించారు. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం. ప్రజల తరఫున ధైర్యంగా, ఆధారాలతో మాట్లాడాలి. అక్కడ మన వాయిస్ బలంగా వినిపించాలి,” అని జగన్ పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ, మండలిలో తీసుకోవాల్సిన వ్యూహాలపై చర్చించి, తమ సూచనలు కూడా ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమయం ఇవ్వకపోవడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు నిరాకరణపై వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై మండలిని ప్రధాన వేదికగా ఉపయోగించాలని ఎమ్మెల్సీలను ఆదేశించారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ సంస్కరణలు దిక్సూచి : సీఎం చంద్రబాబు

  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, ఈ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. సంస్కరణలు అంటే నేనప్పుడు ముందుంటాను. అభివృద్ధికి కృషి చేస్తేనే సంపద పెరుగుతుంది. సంపద సృష్టించకుండా సంక్షేమం ఇవ్వడం సరికాదు. అప్పులు చేసి సంక్షేమం పంచడం సమంజసం కాదు, అని సీఎం అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగాయని గుర్తుచేశారు. వన్ నేషన్ – వన్ విజన్ అడుగులు వేస్తున్నామని, దేశం–రాష్ట్రం ప్రాధాన్యమని తెలిపారు. గతంలో 4 టైర్ల పన్ను వ్యవస్థ (5%, 12%, 18%, 28%) ఉండేదని, ఇప్పుడు 5% మరియు 18% శ్లాబులతో సరళతరం చేశారని వివరించారు. పండుగల వేళ వినియోగం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ సంస్కరణల ఫలితంగా పరోక్ష పన్ను చెల్లింపుదారులు 2017లో 65 లక్షల నుంచి ప్రస్తుతం 1.51 కోట్లకు పెరిగారని, జీఎస్టీ రిసిప్టులు 2018లో రూ.7.19 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు రూ.22.08 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు పేదల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయని, వన్ నేషన్ – వన్ విజన్ నినాదంతో భారత్ డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధించే దేశంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

కేటీఆర్ నువ్వో బచ్చా...నీ తండ్రి వల్లే కాలేదు : మంత్రి పొంగులేటి

  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో తాను గెలవకుండా చూస్తానంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పొంగులేటి బదులిచ్చారు. పాలేరులో నా గెలుపును ఆపడానికి నీ తండ్రి వల్లే కాలేదు. నా గెలుపును ఆపడానికి మీ నాయన మూడు సార్లు ముక్కు నేలకు రాసిన..ఆయన వల్లే కాలేదని  పొంగులేటి అన్నారు.  నీ వల్ల అవుద్దా..బచ్చాగాడివి ఘాటు  వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా..సంచి సర్దుకుని అమెరికాకు చెక్కుతవా..అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించడానికి సిద్దంగా ఉన్నారు.. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండని మంత్రి పొంగులేటి తెలిపారు. గురువారం వరంగల్ క్రాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 కుటుంబాలకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి  ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. "ప్రతి సంవత్సరం లక్ష ఇళ్లు కట్టినా, పదేళ్లలో పది లక్షల పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరేది. కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కమీషన్లపైనే దృష్టి పెట్టింది తప్ప పేదల గృహ నిర్మాణాన్ని పట్టించుకోలేదు" అని ఆయన ఆరోపించారు.

కొడుకు రిసెప్షన్ రద్దు.. ఆ సొమ్ముతో ఆ ఎమ్మెల్యే ఏం చేశారంటే?

ఆ ఎమ్మెల్యే రైతులను యూరియా కష్టాల నుంచి బయటపడేయాలని తపన పడ్డారు. తపనపడి ఊరుకోలేదు..లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికీ ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయడానికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ సొమ్ముల కోసం ఆయన ఏకంగా తన కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేశారు. ఆ రిసెప్షన్ కోసం వ్యయం చేద్దామని కేటాయించిన రెండు కోట్ల రూపాయలను రైతుల కోసం ఇచ్చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. తన కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేసుకుని మరీ రెండు కోట్ల రూపాయలను రైతులకు ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆయన ఆ మేరకు గురువారం (సెప్టెంబర్ 18) తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రెండుకోట్ల రూపాయల చెక్కు అందించారు. ఆ రెండు కోట్లనూ తన నియోజకవర్గంలోని రైతులకు ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున యూరియా అందజేయాలని ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి సీఎంను కోరారు.   ఇటీవలే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. ఆ వివాహ రిసెప్షన్ ను మిర్యాల గూడలో భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు బత్తుల లక్ష్మారెడ్డిని కదిలించాయి. అంతే కుటుంబ సభ్యులతో చర్చించి కుమారుడి వివాహ రిసెప్షన్ ను  రద్దు చేసి.. ఆ సొమ్ముతో రైతులకు యూరియా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.  

జూబ్లీ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్!?

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అమీర్ అలీఖాన్ తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. గచ్చిబౌలిలోని ఒక నాయకుడి నివాసంలో గురువారం (సెప్టెంబర్ 18) ఈ భేటీ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ఏడాది జనవరిలో సీనియర్ నేత అమీర్ అలీఖాన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది.  అయితే గవర్నర్ కోటాలో వీరికి ఎమ్మెల్సీ పదవులను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అప్పట్లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  దీనిపై కొద్ది నెలల కిందట సుప్రీం తీర్పు వెలువరించింది. అమీర్ అలీఖాన్, ఆయనతో పాటుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన ప్రొఫెసర్ కోదండరామ్ ల నియామకాలపై స్టే విధించింది. సుప్రీం కోర్టు స్టే పై కాంగ్రెస్ పెద్దగా స్పందించలేదు. కోదండరామ్ ను మళ్లీ ఎమ్మెల్సీని చేసి తీరుతామని చెప్పిన రేవంత్ అమీర్ అలీఖాన్ విషయంలో మాత్రం ఏమీ మాట్లాడలేదు.  సరే గత నెలలో   కోదండరాంతో పాటు  మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు కేటాయించిన కాంగ్రెస్ అమీర్ అలీఖాన్ ను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే తీవ్ర అసంతృప్తితో ఉన్న అమీర్  అలీఖాన్ సమయం చూసి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారని ఆయన కవితతో భేటీ ద్వారా తెలుస్తోంది.  

10 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    ఏపీ అసెంబ్లీ పది రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆరు ఆర్డినెన్సుల స్థానంలో కొత్త బిల్లులు తీసురావాలని భావిస్తున్నారు. దీంతో సెప్టెంబర్ 30 తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 20, 21, 28 తేదీల్లో శాసన సభకి  సెలవులు ఉండనున్నాయి. సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.  జీఎస్టీ సంస్కరణలపై నేడు శాసనసభలో చర్చ జరుగుతుంది. 19న జలవనరుల అంశం, 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్‌-6, 26న క్వాంటం వ్యాలీ, 27న లాజిస్టిక్స్‌, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ-కోస్తా-ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశంపై చర్చ జరగనుంది.  నేటి నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ, మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చించాలని వైసీపీ సభ్యులు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా ఛైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. 

బూరుగు రమేష్, విక్రాంత్ నివాసాల్లో ముగిసిన ఈడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం నుంచీ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహి స్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై చోట్ల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో 3,500 కోట్ల సొమ్మును దారిమళ్లించారన్న ఆరోపణలపై ఈడీ నిర్వహిస్తున్న ఈ సోదాలలో భాగంగా మారేడుపల్లిలోని వెల్డింగ్టన్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాలలో దాదాపు ఏడుగంటల పాటు నిర్వహించిన సోదాలు ముగిశాయి. ఈ సోదాలలో ఈడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.  కాస్పో లీగల్ సర్వీసెస్, మహదేవ జ్యువెల్లరీస్ తో పాటు రాజశ్రీ ఫుడ్స్ లో బూరుగు విక్రాంత్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈ కంపెనీలలోకి ఏపీ మద్యం కుంభకోణం కేసు నగదు మళ్లించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో భాగంగా బూరుగు రమేష్ నివాసంలో నగదు, షెల్ కంపెనీల పత్రాలు సీజ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. స్వాధీనం చేసుకున్న పత్రాలు నగదును హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో  ముగ్గురికి బెయిల్ లభించింది. కాగా నకిలీ ఇన్వాయిస్, పెంచిన మద్యం ధరలతో అక్రమంగా సొమ్ములు వివిధ ప్రాంతాలకు చేరవేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఈడీలు  సోదాలు జరుగుతున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి ఐదు రాష్ట్రాల్లో లింకులున్నాయని గుర్తించిన ఈడీ ఇప్పుడు ఈ సోదాలు నిర్వహిస్తోంది.  

కవిత రాజీనామాపై మండలి చైర్మన్ ఏమన్నారో తెలుసా?

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా పై త్వరలో నిర్ణయం తీసుకుంటానని  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆమె రాజీనామాను ఇప్పటి వరకూ ఆమోదించకపోవడానికి కారణం కూడా చెప్పారు. కల్వకుంట్ల కవిత తన రాజీనామా ఆమోదించాల్సిందిగా  కోరుతూ కవిత తనకు ఫోన్ చేసిందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఆమె రాజీనామాపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం గురించి వివరించారు. పార్టీ నుంచి సస్పెండైన తరువాత కవిత భావోద్వేగంతో రాజీనామా చేసి ఉంటారని భావించాననీ, అందుకే రాజీనామా నిర్ణయంపై పునరాలోచించుకోవాలని ఆమెకు సూచించానీ గుత్తా చెప్పారు.  కవిత రాజీనామాపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు.

వైసీపీ బెంగళూరు భజన.. కారణమేంటంటే?

అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయడం అన్నది తెలుగుదేశం తీరు అయితే.. వైసీపీ విధానం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. విద్వేష, విధ్వంస, కక్ష పూరిత విధానాలే తమ బలమని వైసీపీ గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.  అందుకు ఇటీవలి కాలంలో వైసీపీయులు చేస్తున్న బెంగళూరు భజనను ఉదాహరణగా చూపుతున్నారు పరిశీలకులు. ఇంతకీ వైసీపీ బెంగళూరు భజన ఎందుకు, ఎలా మొదలైందంటే..  బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సీఈవో కర్నాటక రాజధాని నగరంలో  మౌలిక సదుపాయాలు అత్యంత దారుణమని విమర్శిస్తూ.. ఇలాంటి నగరంలో తమ సంస్థను కొనసాగించడం ఇష్టం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ విమర్శ చేశారు.   బెంగళూరులో రవాణా కష్టాలు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు..  రహదా రుల అధ్వాన పరిస్థితిపై ఆ పోస్టుతో జాతీయ స్థాయిలో చర్చకు తెరలేచింది.   బెళ్లందూరు ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్టు బెంగళూరులో రహదారుల అధ్వాన స్థితికి అద్దం పట్టింది.   తమ కంపెనీ సిబ్బంది కార్యాలయానికి వచ్చి వెళ్లడానికి పట్టే కనీస ప్రయాణ సమయం గంటన్నరకు మించి ఉంటోందనీ, దీనికి తోడు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానమనీ ఆయనా పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదనీ, ఈ పరిస్థితి సమీప భవిష్యత్ లో మెరుగుపడుతుందన్న ఆశ లేదనీ ఆ పోస్టులో పేర్కొన్న సీఈవో ఈ పరిస్థితుల్లో తమ సంస్థను బెంగళూరులో కొనసాగించడం తనకు ఇసుమంతైనా ఇష్టం లేదని పేర్కొన్నారు.  సరిగ్గా ఇక్కడే నారా లోకేష్ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ విషయంలో తనకున్న శ్రద్ధను, చిత్త శుద్ధినీ చాటుకున్నారు.  బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి  బెంగళూరులో రవాణా కష్టాలు ప్రస్తావిస్తూ.. కంపెనీని అక్కడ నుంచి తరలించాలని భావిస్తున్నట్లు పోస్టు పెట్టిన గంటల వ్యవధిలో లండన్ పర్యటనలో ఉన్న లోకేష్ స్పందించారు. విశాఖపట్నంను హైలైట్ చేస్తూ.. బెంగళూరు నుంచి మీ సంస్థను తరలించాలని భావిస్తే.. విశాఖకు రావాలని కోరుతూ ఆయనను కోరారు.  విశాఖ లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అద్దాల్లాంటి రహదారులు ఉన్నాయనీ, శాంతి భద్రతల విషయంలో విశాఖ నంబర్ వన్ అని పేర్కొన్నారు.  దీంతో వైసీపీయులు ఒక్కసారిగా బెంగళూరు భజన ప్రారంభించేశారు. బెంగళూరు నుంచి పరిశ్రమను తరలించాలని లోకేష్ కోరడం ఇరు  రాష్ట్రాల మధ్యా సత్సంబంధాలను దెబ్బతీయడమేనంటూ విమర్శలు గుప్పించడం ఆరంభించారు. అయినా ఒక రాష్ట్రంలోని కంపెనీని ఏపీకి తరలించాలంటూ ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడుతున్నారు. లోకేష్ చర్యలు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే చర్యగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అయితే పరిశీలకులు మాత్రం మంత్రి నారాలోకేష్ స్పందన రాష్ట్ర ప్రయోజనాలు, ప్రగతి పట్ల ఉన్న చిత్తశుద్ధికి, శ్రద్ధకు తార్కానంగా విశ్లేషిస్తున్నారు. బెంగళూరు నుంచి తమ కంపెనీని తరలించాలని భావిస్తున్నట్లు సదరు కంపెనీ సీఈవో  పేర్కొన్న తరువాతే లోకేష్.. ఏపీ బెస్ట్ చాయిస్ అంటూ ఆహ్వానించారనీ, అందులో తప్పేమిటనీ అంటున్నారు. అయితే ఏపీ అభివృద్ధి పట్ల ఇసుమంతైనా అక్కర లేని వైసీపీ మాత్రం బెంగళూరు నుంచి పరిశ్రమను లోకేష్ ఏపీకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ గుండెలు బాదేసుకోవడం వెనుక తెలుగుదేశం ప్రభుత్వ ప్రతిష్ట,  లోకేష్ ప్రతిష్ఠ పెరుగుతాయన్న దుగ్ధ తప్ప మరో కారణం లేదంటున్నారు 

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు.. దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు విచారణలో ఈడీ దూకుడు పెంచింది. మద్యం కుంభకోణం సొమ్మును మనీ లాండరింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలలో గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం సోదాలు ప్రారంభించింది. ఈ సోదాలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ పై ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కుంభకోణంతో  సంబంధం ఉన్న డిస్టిలరీల నుండి ఈడీ వాంగ్మూలాలు తీసుకుంది. అంతే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని కూడా ఇప్పటికే ఈడీ విచారించింది. ఇప్పుడు ఆ వాంగ్మూలాలు, విచారణలో తేలిన అంశాల ఆధారంగా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆఫీసులు, నివాసాలలో సోదాలు ప్రారంభించింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడు సహా పలు ప్రాంతాలలో ఈ సోదాలు జ రుగుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో బినామీ సంస్థలు, సూట్ కేసు కంపెనీలు, హవాలా ద్వారా దాదాపు 3500 కోట్లు మనీలాండరింగ్ జరిగిందని సిట్ దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై ఈడీ నజర్ పెట్టింది.  

అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం (సెప్టెంబర్ 18) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరౌతారా? లేదా? అని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వారి హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే  ఆ ఉత్కంఠకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో తెరపడింది. ప్రజా సమస్యలు జగన్ కు ఆయన పార్టీ సభ్యులకు పట్టవని మరో సారి రుజువైపోయింది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ సహా వైసీపీ సభ్ములెవరూ హాజరు కాలేదు. వారు ఎక్కడా కనిపించలేదు.  అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజులు అసెంబ్లీకి హాజరై ప్రజాసమస్యలపై మాట్లాడానికి వైసీపీ సభ్యులను ఆహ్వానించారు. గైర్హాజర్ కొనసాగితే అనర్హత వేటుపై హెచ్చరించారు. అంతెందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సభకు వచ్చి సమస్యలపై, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మాట్లాడేందుకు సిద్ధమా అని సవాల్ కూడా విసిరారు. అయినా జగన్ స్పందించలేదు. ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు ఆయన సహా, ఆయన పార్టీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే.. వాటిని పట్టించుకోని జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలతో గురువారం (సెప్టెంబర్ 18) మధ్యాహ్నం తరువాత సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం ఏర్పాటు చేయడంతో అక్కడ ఆయన ఏం మాట్లాడనున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా అధికారంలో లేని పార్టీ ఎమ్మెల్యేలతో సదరు పార్టీ అధినేత అసెంబ్లీ సమావేశాల సమయంలో సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. కానీ జగన్ మాత్రం అసెంబ్లీని బాయ్ కాట్  చేసి ఏమ్మెల్యేలకు ఏం దిశా నిర్దేశం చేస్తారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   

కోమటిరెడ్డిపై కాంగ్రెస్ మెతక వైఖరి.. మతలబేంటి?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ రెబల్ మాత్రమే కాదు అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేరుగా సొంత పార్టీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఆయన దాటని హద్దు లేదు. తొలుత తనకు మంత్రి పదవి హామీ ఇచ్చి మాట తప్పారంటూ తన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసుకున్నా.. ఇటీవలి కాలంలో ఏకంగా పార్టీనే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.   మంత్రిపదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.. తొలుత సీఎం రేవంత్ పై, ఇప్పుడు మొత్తంగా కాంగ్రెస్ పై తిరుగుబావుటా ఎగురవేశారు.  తాజాగా తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 17) ఆయన అమరవీరుల స్ఫూపం వద్ద నివాళి అర్పించారు. ఆ సందర్భంగా ఆయన తెలంగాణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  తెలంగాణలో పరిస్థితిని నేపాల్ లో పరిస్థితితో పోల్చి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ పై ప్రజలు తిరుగుబాటు చేసి తరిమికొట్టే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.  అయినా కాంగ్రెస్ నుంచి చిన్నపాటి స్పందన కూడా లేదు. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్టానుసారంగా పార్టీ పరువు మంటగలిసేలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నా.. కాంగ్రెస్ చర్య తీసుకునే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందన్నది అంతుపట్టడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఏకంగా కాంగ్రెస్ సర్కార్ పై ప్రజా తిరుగుబాటు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై తనకు ఎటువంటి ఫిర్యాదూ రాలేదని టీపీసీసీ చీఫ్ అనడం పలు సందేహాలకు తావిస్తున్నది. అసలు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న కాంగ్రెస్ వర్గాల నుంచే వినవస్తున్నది.  

కాంగ్రెస్ ఉద్యోగాల వాగ్దానం నిలబెట్టుకోలేకపోయింది : ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి

  సొంత పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌న్‌పార్కు వ‌ద్ద నిరుద్యోగ అభ్య‌ర్థుల‌తో క‌లిసి అమ‌ర‌వీరుల స్థూపానికి  రాజ‌గోపాల్ రెడ్డి నివాళుల‌ర్పించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు. ప్రభుత్వానికి, నిరుద్యోగులకు మధ్య వారధిగా తాను పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు ఆందోళనలు మానుకోండి మీ సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీకి, దిల్‌సుఖ్‌నగర్‌కి నేనే వస్తానని రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు.  నిరుద్యోగులను గాలికి వదిలేయొద్దు.. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు  పాత్ర వెలకట్టలేనిదన్నారు.  పదేళ్లలో నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక గ్రూప్ వన్ కూడా వేయలేకపోయారు. కేసీఆర్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని అప్పుల పాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి  న్యాయం జరగలేదని ఎమ్మెల్యే తెలిపారు.    

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 గంటలకు అసెంబ్లీ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. శాసన సభ సమావేశాల నిర్వహణపై సభాపతి అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమవుతుంది.ఈ సమావేశంలో వర్షాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ నిర్ణయం తీసుకోనున్నారు.