earth quake in russia

రష్యా దీపుల్లో తీవ్ర భూకంపం.. ఫసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం (జులై 30)  8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం  సంభవించింది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో  సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పలు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి 126 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే  తెలిపింది.  ప్రారంభంలో 8.7 తీవ్రతగా  ఈ భూకంపం సంభవించినట్లు ప్రకటించినా తర్వాత 8.8గా సవరించారు. ఈ తీవ్రత కారణంగా కమ్చట్కా ద్వీపకల్పంలో 3 నుంచి 4 మీటర్ల ఎత్తైన సునామీ అలలు రికార్డ య్యాయి. రష్యా అధికారుల ప్రకారం, ఈ భూకంపం గత కొన్ని దశాబ్దాలలో అత్యంత శక్తివంతమైనదిగా నమోదైంది. ఈ భూకంపం తర్వాత, జపాన్‌లోని హొక్కైడో ఉత్తర తీరంలో సునామీ అలలు మొదట 30 సెంటీమీటర్ల ఎత్తులో వచ్చినట్లు జపాన్ మీడియా తెలిపింది. జపాన్ ప్రభుత్వం పసిఫిక్ తీరంలోని ప్రజలకు వెంటనే ఖాళీ ఆదేశాలు జారీ చేసింది. సునామీ అలల వల్ల నష్టం సంభవించే అవకాశం ఉంది. తీర ప్రాంతాలు, నదీ తీరాల నుంచి ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు లేదా సురక్షిత భవనాలకు వెళ్లాలని తెలిపింది. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు సురక్షిత ప్రదేశాన్ని వదిలి వెళ్లవద్దని జపాన్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని హవాయి, అలాస్కా రాష్ట్రాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలో 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. హవాయి రాజధాని హోనోలులు సహా ఓహు దీవిలోని పలు ప్రాంతాలను  తక్షణ ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్వామ్ దీవిలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో సునామీ అలలు 3 నుంచి 4 మీటర్ల ఎత్తుతో తాకాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎవరికి గాయాలు లేనప్పటికీ, ఒక కిండర్‌గార్టెన్ భవనం దెబ్బతిన్నట్లు కమ్చట్కా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ మంత్రి సెర్గీ లెబెడెవ్ తెలిపారు.

ap liquor scam another arrest

ఏపీ లిక్కర్ స్కాంలో వరుణ్ అరెస్ట్.. రూ.11 కోట్లు, లిక్కర్ డంప్ స్వాధీనం

ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో  కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి  కలెక్షన్ గ్యాంగ్‌లో వరుణ్ కీలక వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్‌ను కొందరు కీలక వ్యక్తులు దేశం దాటించారు. ఇప్పటికే వరుణ్‌పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించి వరుణ్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఇవాళ, రేపు మరికొన్ని ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో సహా మరో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో A 40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు  బుధవారం (జులై 30) తెల్లవారుజామున హైదరాబాద్‌‌లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో A1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, A12 చాణక్య రూ. 11 కోట్లని 12 అట్టపెట్టల్లో దాచినట్లు అంగీకరించారు. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ హౌస్‌లో సిట్ అధికారులు తనిఖీలు చేసి భారీగా అక్రమ మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు.

ed steps up investigation into sheep scam

గొర్రెల స్కాం దర్యాప్తులో దూకుడు పెంచిన ఈడీ.. తలసాని పాత్రపై దర్యాప్తు

గొర్రెల స్కాం కేసు దర్యాప్తులో  ఈడీ దూకుడు పెంచింది.  హైదరాబాద్‌లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలపై గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం ఈడీ రంగంలోకి దిగి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారడంతో పాటు, ఇతర రాష్ట్రాలకూ లింకులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అందుకే మనీ లాండరింగ్‌ కేసుగా ఈడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే ఈడీ అధికారులు గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్ట్ చేశారు. గొర్రెల పంపిణీ విధివిధానాలు, ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు. 2015లో అప్పటి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి సుమారు రూ.4,000 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే..  ఈ పథకాన్ని అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ తన దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన తొలినాళ్ల నుంచే కొంతమంది అధికారులు, మధ్యవర్తులు కలిసి ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు సమాచారం. అసలు లబ్ధిదారులకు నిధులు అందకుండా బినామీ ఖాతాల్లోకి చేరినట్టు ఆధారాలు లభించాయి. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి ఆ మొత్తాన్ని అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహరంలో అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హస్తమూ ఉందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

jagan delhi tour against madyam scam arrests

మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు నిరసనగా జగన్ ఢిల్లీ ధర్నా?.. సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనా?

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో కీలక వ్యక్తులు వరుసగా అరెస్టౌతున్నారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ పునాదుల వరకూ వెడుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత జగన్ కు అరెస్టు భయం పెచ్చరిల్లిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసులో తనకు కూడా అరెస్టు తప్పదన్న భయంతో ఆయన హస్తినలో అండ కోసం పాకులాడుతున్నారు. అందుకే ఢిల్లీ యాత్రకు యోచిస్తున్నారు. జగన్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు వ్యతిరేకంగా ఢిల్లీలో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సీఎంతా జగన్ ఉన్న సమయంలో ఆయనకు కార్యదర్శిగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సలహాదారు వాసుదేవరెడ్డి, ఈ కుంభకోణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి, ఇక జగన్ కుటుంబానికి సన్నిహితుడు, భారతీ సిమ్మెంట్స్ ఆడిటర్ గోవిందప్ప సహా పలువురు అరెస్టు కావడంతో.. దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ కు రావడానికి ఇంకెంతో కాలం పట్టదన్న భయంతో జగన్ హస్తినలో హడావుడి చేసి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. మద్యం కుంభకోణం పేరుతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందంటూ జగన్ హస్తినకు వెళ్ల ధర్నా చేసే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా హస్తినలో వివిధ జాతీయ పార్టీల మద్దతు కూడగట్టి ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయించే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు.  వాస్తవానికి ఆయన గత సోమవారమే హస్తిన పర్యటనకు బయలుదేరాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల వచ్చే నెలలో అంటే ఆగస్టులో హస్తినకేగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   అయితే మద్యం కుంభకోణం అరెస్టులకు నిరసనగా హస్తినలో ధర్నా చేస్తే జాతీయ స్థాయిలో జగన్ పరువు, వైసీపీ పరువు మసకబారుతుందని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టైన సంగతిని జగన్ గుర్తుంచుకోవాలని పరిశీలకులు విశ్లేషిస్లున్నారు.  అన్నిటికీ మింది జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయించినా.. డిజిటల్ పేమెంట్స్ కు ఎందుకు నో చెప్పిందన్న ప్రశ్న జాతీయ మీడియా నుంచి వస్తే జగన్ సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఎదుర్కొనడం ఖాయమంటున్నారు. ఏది ఏమైనా మద్యం కుంభకోణం అరెస్టులకు వ్యతిరేకంగా జగన్ హస్తిన వెళ్లి యాగీ చేస్తే మాత్రం ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  

sit seize liquor scam cash

మద్యం కుంభకోణం కేసు.. రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెరిగింది. ఈ కుంభకోణంలో దోచుకున్న కోట్ల రూపాయల సొమ్మును దాచిన ప్రదేశాన్ని గుర్తించిన సిట్.. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేసిన సిట్.. ఇప్పుడు ఈ కుంభకోణంలో దోచుకున్న సొమ్మునూ వెలికి తీస్తూ దూకుడుగా దర్యాప్తును సాగిస్తోంది.   అందులో భాగంగా  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ‌లం సులోచ‌నా ఫార్మ్‌గెస్టు హౌస్‌లో మ‌ద్యం సొమ్ము దాచిన డంప్ ను గుర్తించిన సిట్.. ఆ సొమ్ము స్వాధీనం చేసుకుంది.  లిక్క‌ర్‌స్కామ్‌లో ఏ 40 అయిన  వ‌రుణ్‌ పురుషోత్తం ఇచ్చిన స‌మాచారం మేరకు  సిట్  అధికారులు  సులోచ‌నా ఫార్మ్‌గెస్టు హౌస్‌లో  త‌నిఖీలు నిర్వ‌హించ‌గా సొమ్ము బయటపడింది. 11 అట్టపెట్టెలలో దాచిన 11 కోట్ల రూపాయలను సిట్ స్వాధీనం చేసుకుంది.  రాజ్‌క‌సిరెడ్డి, చాణ‌క్య‌ల ఆదేశాల మేర‌కు ఈ కంపెనీలో 12 అట్ట‌పెట్టెల్లో రూ.11కోట్ల సొమ్ముల‌ను దాచిపెట్టిన‌ట్లు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించి సొత్తును స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు.   వైసీపీ  హ‌యాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో  రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డితో పాటు, అప్ప‌టి సిఎం కార్య‌ద‌ర్శి ధ‌నుంజ‌య‌రెడ్డి, ఓఎస్టీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, కీలక నిందితుడు రాజ్  కేసిరెడ్డి, భారతీ సిమెంట్స్ ఆడిటర్ గోవిందప్ప సహా పలువురిని సిట్ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  అక్ర‌మ‌ద్యం ద్వారా    3వేల కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగినట్లు  సిట్   మొత్తం మీద ఇప్పుడు పెద్ద మొత్తంలో న‌గ‌దు ల‌భ్యం కావ‌డం ఈ కేసులో కీల‌క‌ప‌రిణామ‌మ‌ని పరిశీలకులు అంటున్నారు.  

earth quake in russia

రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

రష్యాలో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. 2011 టోకియో భూకంపం తరువాత ఇదే అతి పెద్ద భూకంపంగా అధికారులు చెబుతున్నారు. రష్యాలోని తూర్పు ప్రాంతమైన కమ్చట్కా ద్వీపం సమీపంలో  ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపం కారణంగా రష్యా, జపాన్ తీరప్రాంతాలతో పాటు పసిఫిక్ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న అనేక దీవులకు సునామీ ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  భూకంపం ప్రభావంతో సముద్రంలో పెద్ద అలలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అమెరికా హవాయి, అలస్కా, గువామ్ దీవులకూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.  సైపాన్, రోటా, టినియన్ వంటి సమీప దీవులకు కూడా ముందస్తు అప్రమత్తం జారీ చేశారు. ఇలా  ఉండగా   జపాన్ ఉత్తర ప్రాంతానికి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగా జపాన్ పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ ముప్పు అధికంగా ఉంటుందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది.  

devotees rush in tirumala

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. పవిత్రమైన శ్రావణమాసం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. బుధవారం (జులై 30) ఉదయం శ్రీవారి  దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్ లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్న ప్రసాదం, పాలు, జల ప్రసాదం అందజేస్తున్నది. ఇక మంగళవారం (జులై 29) శ్రీవారిని మొత్తం 75 వేల 183 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 906 మంది తలనీలలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 89 లక్షల రూపాయలు వచ్చింది. 

youth fell from train while taking selfie

సెల్పీ తీసుకుంటూ రైలు నుంచి జారిపడిన యువకుడు

  యువతీ, యువకులు సెల్ఫీ మోజులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, నదులు, కొండలు వంటి ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు కదులుతున్న రైలులో తలుపు వద్ద నుంచుని సెల్పీ తీసుకునే ప్రయత్నంలో రైలు నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి వద్ద చోటు చేసుకుంది. మదనపల్లె కురబల కోట రైల్వే స్టేషన్ వద్ద సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో రైల్లోంచి జారిపడిన  తీవ్రంగా గాయపడి మహ్మద్ నస్రీన్ అనే 18 ఏళ్ల యువకుడు ప్రస్తుతం మదనపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

Tirumala

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

  గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు. గరుడ వాహనసేవలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.  

Operation Sindoor

యుద్ధాన్ని ఆపాలని ఏ దేశాధినేత చెప్ప లేదు : ప్రధాని

  ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్ సభలో విపక్షత నేత రాహుల్‌ గాంధీ కామెంట్స్‌పై ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్‌ను  కాంగ్రెస్ పాకిస్థాన్‌ను వెనుకేసురావటం దౌర్భగ్యమని ప్రధాని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడారు. పైలట్ అభినందన్‌ పాక్‌కు చిక్కుకున్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడారని, కానీ ఆయన సురక్షితంగా భారత్ తెచ్చామని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజాపక్షమేనని, ప్రజల మనోభావాలు, వారు తనపై ఉంచిన నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని భారత రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారు. ‘పహల్గాం ఉగ్రవాదులు పాక్‌కు చెందినవారు అనడానికి ఫ్రూప్ ఏంటని అడిగారు. పాక్‌కు కాంగ్రెస్ క్లిన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. అని మోదీ అన్నారు.   ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో జరుగుతున్న చర్చపై మోదీ మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు భారత్‌ విజయోత్సవానికి నిదర్శనం. ఆపరేషన్‌ సిందూర్‌ విజయానికి ప్రతీకగా విజయ్‌ ఉత్సవ్‌. మన సైనికులు ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ను దేశం మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోంది. ఉగ్రస్థావరాలను మనసైన్యం నేలమట్టం చేసింది.140కోట్ల మంది భారతీయులు నాపై నమ్మకం ఉంచారు. సైన్యం వెనుక దేశ ఉంది. మతం కోణంలో పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శత్రువుకు ఊహకు అందని విధంగా శిక్ష విధించాం.  సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. మన సాయుధ బలగాలు కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ కీలకమైన దాడులు పూర్తి చేశాయని, 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని ప్రధాని తెలిపారు. పహల్గాం దాడి తర్వాత భారత్ గట్టిగా స్పందిస్తుందని పాక్ ఆలోచన చేసిందని, ఆ పని తాము చేసి చూపించామని ప్రధాని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మాస్టర్ మైండ్స్‌కు నిద్ర దూరమైందని చెప్పారు.ఆపరేషన్‌ సిందూర్‌ ఆపాలని ప్రపంచంలో ఏ నేత కూడా మాకు చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నాతో ఫోన్‌లో మాట్లాడారు. పాక్‌ భారీగా దాడి చేయబోతోందని ఆయన హెచ్చరించారు.  పాక్‌ భారీ మూల్యం చెల్లించుకుంటుందని జేడీ వాన్స్‌కు చెప్పా.  పాక్‌కు ఎవరు సాయం చేసినా.. చూస్తూ ఊరుకొనేది లేదని చెప్పాం. పాక్‌ ఎలాంటి దాడి చేసినా మేం చూసుకుంటామని వాన్స్‌కు చెప్పాం. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్తామని జేడీ వాన్స్‌కు చెప్పాం. పాక్‌కు ఎవరు సహాయం చేసినా.. చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశాం. పాక్‌కు చిరకాలం గుర్తుండిపోయే సమాధానం ఇచ్చాం. పాక్‌ డీజీఎం అర్ధరాత్రి ఫోన్‌ చేసి దాడులు ఆపాలని బతిమాలితేనే ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేశామని ప్రధాని తెలిపారు 193 ప్రపంచ దేశాల్లో కేవలం మూడు దేశాలే పాకిస్థాన్‌కు అండగా నిలిచాయి’’ అన్నారు.  

Kadapa Central Jail

కడప సెంట్రల్ జైలు అవినీతి అక్రమాలపై డీజీ ఆరా

  కడప కేంద్ర కారాగారంలో ఇటీవల  సెల్ఫోన్లు పట్టుటబడిన వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది.కొద్ది రోజుల క్రితమే కొందరులపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైల్లో జరుగుతున్న అక్రమాల తంతుపై జైల శాఖ డిజి టల్ మరోసారిఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) అంజనీ కుమార్  కడప సెంట్రల్ జైలు ను మంగళవారం తనిఖీ చేశారు. సెంట్రల్ జైల్లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సెంట్రల్ జైలులోకి మొబైల్స్ ఏవిధంగా వస్తున్నాయి.  అనే దానిపై మరోసారి ఆరాతీశారు.  అనంతరం సెంట్రల్ జైలు అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులను తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. సెంట్రల్ జైలు లో  ఖైదీ వద్ద సెల్ఫోన్లు లభించడంతో విధుల్లో నిర్లక్షం వహించారని అధికారులు ఏడుగురు జైలు సిబ్బంది పై చర్యలు తీసుకున్నారు.  ఇప్పటికే ఇలా  చర్యలు తీసుకున్నప్పటికీ మరోసారి జైలు శాఖ డైరెక్టర్ జనరల్ కేంద్రకారాగారాన్ని సందర్శించి పరిశీలించారు.       ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడుతూ విజిట్ లో భాగంగా విజయవాడ నుంచి కడప సెంట్రల్ జైలుకు రావడం జరిగిందని తెలిపారు, కడప సెంట్రల్ లోపల లోపల అందరూ సీనియర్ ఆఫీసర్స్ జైలు వార్డన్స్  తో మీటింగు నిర్వహించి  పలు భద్రత అంశాలు పై చర్చించడం జరిగిందన్నారు. కడప సెంట్రల్ జైల్లో కొన్ని సమస్యలు రెండు మూడు నెలలుగా ఉండడం ముఖ్యంగా ఒకే ఖైదీ వద్దనుంచి సెల్ ఫోన్స్ రికవరీ సంబంధించి డిఐజి రవి కిరణ్ గత వారంలో విజిట్ చేసి ఎంక్వైరీ రిపోర్టు ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ రిపోర్టు ప్రకారం కొన్ని లోపాలు గుర్తించడం జరిగిందన్నారు.  ఎంక్వయిరీ రిపోర్టు ప్రకార కొంతమంది పైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని, మరికొందరి ని సస్పెండ్ కూడా చేశామని తెలిపారు. ఇక్కడ ఉన్న అధికారులపై నాకు నమ్మకం ఉంది భవిష్యత్తులో లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని అన్నారు, అదేవిధంగా ఉమెన్ జై ల్ సూపర్డెంట్ కొన్ని కొత్త ప్రపోజల్ తెలిపారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్ బిజినెస్ గురించి తెలిపారన్నారు. కడప సెంట్రల్ జైల్లో కొంతమంది వార్డెర్స్ అండ్ హెడ్ స్పోర్ట్ యాక్టివిటీ ప్రమోషన్స్ కోసం ఒక కొత్త ప్రపోజల్ కింద వర్క్ స్టార్ట్ అయిందని తెలిపారు. జైల్లో యోగా   మదనపల్లి సత్సంగ్ ఫౌండేషన్ కింద మదనపల్లిలో ఒక సక్సెస్ ఫౌండేషన్ ఉన్నదని దీని ద్వారా కడప, నెల్లూరు, రాజమండ్రి, వైజాగ్ ,గుంటూరు జిల్లాలలో ఇలా  ప్రతి సెంట్రల్ జైల్లో అదేవిధంగా ప్రతి డిస్టిక్ జైల్లో యోగా సర్టిఫికేషన్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది  అని తెలిపారు.  రానున్న ఆరు నెలల్లో ప్రతి జైలు నుంచి 15 నుంచి 20 మంది ఖైదీలను యోగా శిక్షకులుగా తయారు చేస్తామన్నారు.  ఖైదీల్లో పరివర్తన తీసుకు రావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.  జైలు శిక్ష తర్వాత  సొసైటీలో ప్రతి వ్యక్తికి ఒక రెస్పెక్టివిటీ జీవించే హక్కు కలిగి ఉండాలి అన్నారు, ఈ సర్టిఫికెట్ కు ఆల్ ఇండియా వాలిడిటీ ఉన్నది అన్నారు. ఆరు నెలల్లో సెంట్రల్ ,జిల్లాలో కనీసం మినిమం 10 నుండి 15  యోగ సెంటర్స్ ను తయారు  చేస్తామన్నారు.

Reserve Bank of India

బ్యాంకు ఖాతాదారులు క్లెయిమ్ చేసుకోని సొమ్ము రూ.67 వేల కోట్లు

  కష్టపడి సంపాదించిన డబ్బులను బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లలో దాచుకుంటారు. అవసరమైనప్పుడు వాటిని తీసుకుంటారు. వాటికి బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. అయితే, డిపాజిట్ చేసి ఎవరూ క్లెయిమ్ చేసుకోని డబ్బు పెరిగిపోతోంది. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలోని బ్యాంకుల్లో జూన్ 30, 2025 నాటికి ఎవరూ తీసుకోని డబ్బులు (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు) ఏకంగా రూ. 67003 కోట్లు ఉన్నాయి. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటుగా ప్రైవేట్ బ్యాంకుల్లోనూ అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరిగినట్లు తెలిపింది.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జూన్ 30, 2025 నాటికి అన్‌ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ. 58,330.26 కోట్లు ఉన్నాయి. ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో రూ. 8,673.72 కోట్లుగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ బ్యాంకుల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 19,329.92 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 6,910.67 కోట్లు డిపాజిట్ చేసి ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు.  కెనరా బ్యాంకులో రూ. 6,278.14 కోట్లు ఎవరూ తీసుకోని డిపాజిట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2063.45 కోట్లతో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ. 1609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ. 1360.16 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

Operation Sindoor

భారత సైనికుల చేతులను ప్రధాని కట్టేశారు : రాహుల్‌ గాంధీ

    ఆపరేషన్ సిందూర్ విషయంలో ఎన్డీయే సర్కార్ 30 నిమిషాల్లోనే పాకిస్థాన్‌కు లొంగిపోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణ పాటిద్దామని పాక్‌ను అడిగింది. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని రాజ్‌నాథ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్నికి పాక్‌తో పోరాడే ఆలోచన లేదని తెలిపారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాల వల్లే మన ఎయిర్ కాప్టర్లు కూలిపోయాయి. ఐఏఏప్ లాంటి తప్పు చేయలేదని రాహుల్‌ తెలిపారు.  ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో ప్రభుత్వ పెద్దలు మన సైనికుల చేతులు కట్టేశారని  విమర్శించారు. మరోవైపు భారత్‌-పాక్‌ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పుకొంటున్నారు’’అని అన్నారు.  ఓ వైపు సీజ్ ఫైర్ కు తానే కారణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 29 సార్లు చెప్పారని కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఖండించలేదన్నారు. ఇందిరాగాంధీలో ఉన్న సగం ధైర్యం ప్రధానికి లేదన్నారు. ఉంటే సీజ్ ఫైర్ లో ట్రంప్ ప్రమేయం లేదని, ప్రధానికి ధైర్యం ఉంటే  ట్రంప్ అబద్ధాల కోరు అని సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. పహెల్గామ్ సూత్రధారి మునీర్ ట్రంప్ తో కలిసి భోజనం చేశారని రాహుల్ విమర్శించారు. కశ్మీర్ పహెల్గాం ఉగ్రదాడిలో అమాయలు బలయ్యారని పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని అందరూ ముక్తకంఠంతో ఖండిచారని రాహుల్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో మన సైనికులు గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఈ పరేషన్ విషయంలో కేంద్రానికి ప్రతిపక్షాలు అన్ని సహకరించాయన్నారు. అంటే.. పాకిస్థాన్ తో పోరాడే ఆలోచన లేదని రాజ్ నాథ్ చెప్పారు. అసలు పాకిస్థాన్ తో యుద్ధం చేసే ఆలోచననే రాజ్ నాథ్ చెప్పకనే చెప్పారన్నారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ ను ఖండించలేదని కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే ఖండించాయన్నారు.  1971 యుద్దంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయత్మకంగా వ్యవహరించిందని రాహుల్ తెలిపారు. అప్పటి జనరల్ మణిక్ షాకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పూర్తి సేఛ్చ ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. యుద్దం చేసే సంకల్పం ప్రభుత్వానికి లేదు. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ చెప్పిన విషయాలు తేటతెల్లం చేస్తున్నాయిని పేర్కొన్నారు. మీరు దాడులు చేయకండని పాక్ చెప్పడం దేనికి సంకేతం అని రాహుల్ ప్రశ్నించారు. పాక్ దుశ్చర్యను సభలోని ప్రతి ఒక్కరూ ఖండించారు అని రాహుల్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి అండగా ఉంటమని పార్టీలన్నీ చెప్పాయి. దేశంలో ప్రతి పక్షంగా ఐక్యంగా  ఉన్నందుకు గర్వపడుతున్నామని రాహుల్ గాంధీ తెలిపారు.  

New Ration Cards

కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

  ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆగష్టు 25 నుంచి అర్హులు అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఆగష్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ పంపీణీ కొనసాగుతుందని వెల్లడించారు. QR కోడ్‌లతో డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. నూతన రేషన్ కార్డులపై రాజకీయ నేతల ఫొటోలు ఉండబోవు అని స్పష్టం చేశారు. డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని అన్నారు.  ఐదేళ్లలోపు, 80 ఏళ్లు దాటిన వారికి ఈకేవైసీ అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, రేషన్ డీలర్ల దగ్గర ఈ-పోస్ యంత్రాల సహాయంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేస్తారు. అప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు, రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం చూడొచ్చు. అటు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రోజూ ఉదయం. 8 గంటల నుండి 12 వరకు సాయంత్రం 4 గంటల నుండి 8 వరకు రేషన్ షాపుల్లో  సరకులు సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.  

Nagarjunasagar Project

నాగార్జునసాగర్ అన్ని గేట్లు ఎత్తివేత..18 ఏళ్ల తర్వాత

  ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తుంది. దీంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో : 2,55,811 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 2,47,213 క్యూసెక్కులుగా ఉంది.  ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 590.00 అడుగులకుగాను ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో.. దిగువ భాగంలోని నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా దాదాపు 18 ఏళ్ల తర్వాత.. నెల ముందుగానే నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాగార్జునసాగర్ మనకు ఆధునిక దేవాలయమని అభివర్ణించారు. సాగర్‌కు మాజీ ప్రధాని నెహ్రూ పునాది వేస్తే.. ఇందిరాగాంధీ ప్రారంభించారని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ద్వారా 26 లక్షల ఎకరాల ఆయుకట్టుకు నీరు అందుతుందని మంత్రి తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి 7 గేట్లు 10 అడుగులు మేర నీటీని అధికారులు విడుదల చేశారు. జూరాల జలాశయం నుండి 1,48,619 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలో చేరింది. దీంతో సుంకేసుల మ్యారేజ్ నుండి 1,10,497  క్యూసెక్కుల నీరు వచ్చింది. ఇన్ ఫ్లో 2,59,116 క్యూసెక్కులు..ఔట్ ఫ్లో  2,55,811 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుతం నీటిమట్టం 883.00  అడుగులు చేరింది.  

రేవంత్‌రెడ్డికి భారీ ఉరట... పిటిషన్‌దారుపై సుప్రీం మండిపాటు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. భూవివాదం కేసులో ఎన్ పెద్దిరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ  తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసిన విషయం తెలిసిందే.  అయితే హైకోర్టు ఆదేశాలను సమాల్ చేస్తూ   పెద్దిరాజు సుప్రీంకోర్టులో సవాలు వేశారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ పిటి షన్ దాఖలు చేశారు.  ఆ పిటిషన్‌లో హైకోర్టు తీర్పునకు సంబంధింన అంశాలతో పాటూ తీర్పు వెలువరించిన న్యాయమూర్తిపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఎన్  పెద్దిరాజు   పిటిషన్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం డిస్మిస్ చేసింది.  అలాగే ఎన్ పెద్దిరాజుతో పాటు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ బీఆర్ గవాయి  తదుపరి విచారణకు పిటిషనర్  పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే ఈ అంశంపై పిటిషనర్ తరపు న్యాయవాది రితీష్ పాటిల్.. కోర్టు సాక్షిగా క్షమాపణ కోరారు. కేసు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు.  కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ సీజేఐ ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణ నోటీస్‌కు లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే.. కోర్టు పరిగణలోకి తీసుకుం టుందని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చేనెల  11 కు వాయిదా వేశారు. 

గోషామహల్‌కు ఉప ఎన్నిక రాదంటున్న రాజాసింగ్

గోషామహల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికపై స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థి కోరితే తాను ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుందంటూ కొంత మంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ లేని పోని గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.  ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ పెద్దలు తనను పిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన బాధలు వారికి చెప్పిన తర్వాత తాను బీజేపీలో తిరిగి చేరే అంశంపై క్లారిటీ ఇస్తానన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ అభ్యర్థి వ్యక్తిగతంగా పిలిస్తే.. వెళ్లి ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.  బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనను గుర్తించకపోయినా.. తనను గుర్తించే వాళ్లు చాలా మంది ఉన్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. వారంతా బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడుతున్నారన్నారు. తాను వెళ్లి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే అక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ చాలా బాగా పెరిగిందని వివరించారు. తనపై ఎవరు ఎన్ని కుట్రలు చేసారో అన్ని తనకు తెలుసునని చెప్పారు. కేంద్ర మంత్రులు తనతో టచ్‌లోనే ఉన్నారన్న రాజాసింగ్.. తాను శివసేన, టీడీపీ, జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నిర్ద్వంద్వంగా ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఇవన్నీ బీజేపీ మిత్రపక్ష పార్టీలేనని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షడు రామచందర్ రావు బాగానే పని చేస్తున్నారంటూ   ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నేతృత్వంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఇటీవల ఎన్నిక జరిగింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ఢిల్లీలోని పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులున్నాయి. అయితే అదే సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు అనుచరగణంతో కలిసి పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు. అయితే ఆయన్ని పార్టీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై  అక్కడికక్కడే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి, నాయకులకు ఒక దణ్ణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు.  రాజీనామా లేఖను పార్టీ అగ్రనాయకులకు పంపారు. వారు వెంటనే దానిని ఆమోదించారు. దీంతో గోషామహల్ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది. అది సోషల్ మీడియాలో  ఓ రేంజ్ లో వైరల్ అయింది.  మరోవైపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జూబ్లీహిల్స్‌తోపాటు గోషా మహల్ అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఉప ఎన్నిక వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరో వైపు బీజేపీని విడిచి పెట్టవద్దంటూ ఢిల్లీలోని కొంత మంది ఆ పార్టీ నేతలు.. రాజాసింగ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వారు పార్టీ అగ్రనాయకత్వంతో మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ఢిల్లీలోని బీజేపీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని.. వారితో భేటీ తర్వాత మళ్లీ బీజేపీలో చేరే అంశంపై క్లారిటీ ఇస్తారనే ఓ చర్చ అయితే గోషామహల్‌లో సాగుతోంది. అదీకాక.. గత కొంత కాలంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి, ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఒక ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. 

స్టేజీపై డాన్స్ అదరగొట్టిన రామ్మోహన్ నాయుడు

  కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బంధువుల పెళ్లిలో తన డ్యాన్స్‌తో  అదరగొట్టారు. శ్రీకాకుళంలో జరిగిన తన బంధువుల వివాహంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి ఆయన గ్యాంగ్ లీడర్ పాటకు  స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతలో మంత్రి చలాకితనానికి మంచి స్పందన లభిస్తోంది. బంధుమిత్రులతో కలిసి వేదిక ఎక్కిన ఆయన... ఉత్సాహంగా కాలు కదిపారు. మాంచి హుషారైన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఎప్పుడు బిజీగా ఉంటే కేంద్ర మంత్రి ఒకేసారిగా డ్యాన్స్  చేయటంతో టీడీపీ పార్టీ శ్రేణులు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు