బండి వెర్సెస్ ఈటల.. ముదురుతున్న యుద్ధం!
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో సందడి మొదలైంది. కారణాలు ఏవైనా చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న కమలదళం నాయకుల్లో కదలిక వచ్చింది. అయితే.. కదలికతో పాటు కయ్యాలకు తెర లేచింది. అఫ్కోర్స్.. పార్టీ స్తబ్దుగా ఉన్నా, మరోలా ఉన్నా.. బీజేపీలో అంతర్గత కుమ్ము లాటలు,నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు నిత్యకృత్యంగా సాగుతూనే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. అయితే.. తాజాగా పాత గొడవలు కొత్తగా తెర పైకి రావడంతో పార్టీ క్యాడర్ నారాజ్ అవుతున్నారు. పార్టీ ముఖ్య నాయకులు, వ్యవహరిస్తున్న తీరు, మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు కీలక నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బహిరంగంగా పరస్పర విరుద్ద ప్రకటనలు చేయడం పార్టీ ఇమేజ్ ని దెబ్బ తీస్తోందని పార్టీ వర్గాల్లో అందోళన, పార్టీ క్యాడర్ లో ఆవేదన వ్యక్తమవుతున్నాయి.
నిజానికి.. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద మోదీ, సారధ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వం ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో మల్కా జ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఆదివారం(జూన్ 22) వికసిత్ భారత్ సంకల్ప సభ జరుగతున్న సమయంలోనే.. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సభకు హాజరు కాకపోవడమే కాకుండా.. అదే సమయంలో కరీంనగర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసీ మరీ,కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో.. గతంలో ఈటల చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తప్పు పట్టారు.అంతే కాదు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ స్టాండ్ ఎప్పుడూ ఒక్కటే అంటూ.. కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అయిందని గతంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన మాట, తీసుకున్న స్టాండ్ లో ఈ రోజుకూ ఇసుమంతైనా మార్పు లేదని కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పారు. అంత వరకు అయితే కొంతవకు ఓకే.. బండి అక్కడితో ఆగలేదు బీజేపీలో ఉన్న ఎవరైనా బీజేపీ స్టాండే తీసుకోవాలనీ.. వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదని పరోక్షంగా ఈటలకు చురకలు అంటించారు.
అంతే కాదు.. కాళేశ్వరం ప్రాజెక్టు సమబందించి అప్పటిరాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, మాజీ మంత్రి హోదాలో ఈటల ఒకటికి పదిసార్లు చెప్పడమే కాకుండా,కాళేశ్వరం ప్రాజెక్టుకు కాబినెట్ ఆమోదం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పు కుంటానని కాంగ్రెస్ నేతలకు సవాలు కూడా విసిరారు. అయితే, బండి సంజయ్ ఈటల సవాలును సింపుల్ గా తీసి పారేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈటల రాజేందర్ అభిప్రాయానికి పార్టీ స్టాండ్ పూర్తి భిన్నమని బండి పేర్కొన్నారు. కేసీఆర్ కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారంటే.. ఎవరూ నమ్మరన్నారు. అంటేఈటల చెప్పింది తప్పు, కాంగ్రెస్ చెప్పిందే సత్యం అని బండి, కాంగ్రెస్ పార్టీకి సర్టిఫికేట్ ఇచ్చారు.
విషయంలోకి వెళితే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ లో మూడు పిల్లర్లు కూలిన సంఘటన, ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలు, ఆర్థిక ఆకతవకలపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పీసీఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కమిటీ ఎదుట ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీగా కాకుండా.. గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి, మాజీ మంత్రి హోదాలో ఇటీవల హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో , ఆర్థిక విషయాలకు సబంధం లేని కాబినెట్ ఆమోదం వంటి కొన్ని సాంకేతిక అంశాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు, ఈటల వ్యాఖ్యల, పూర్వాపరాలు, పర్యవసానాలపై, పార్టీలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట, ఈటల మాజీ మంత్రిగా హాజరయ్యారే కానీ, బీజేపీ ఎంపీగా హాజరు కాలేదని స్పష్టం చేశారు. సరే.. అది ఎంత వరకు సమంజసం అనే విషయాన్నిపక్కనపెడితే.. అంతర్గతంగా చర్చించవలసిన అంశాలను బహిరంగా అది కూడా బీజేపీ దేశ వ్యాప్తంగా, భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగా మోదీ ప్రభుత్వం విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ అభియాన్ లో భాగంగా రాష్ట్రంలో వికసిత భారత్ సంకల్ప సభ నిర్వహిస్తున్న సమయంలో.. పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగా వివాదాన్ని సృష్టించదాన్ని పార్టీ పెద్దలు తప్పుపడుతున్నారు. అలాగే.. ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య రాజుకున్న ఈ వివాదం ఎటు దారి తెస్తుంది, ఎందాకా పోతుంది అనేది ఇప్పడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. అలాగే.. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుంటేనే కానీ, బండి వర్సెస్ ఈటల మధ్య ముదురుతున్న యుద్ధం చల్లారదని అంటున్నారు.