10th class student tejasri killed her mother

ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన టెన్త్ బాలిక

హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలసి టెన్త్ క్లాస్ చదువుతున్న భాలిక కన్నతల్లినే కడతేర్చింది.  తెలంగాణ ఉద్యమకారిణి , తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ మునిమనవరాలైన అంజలిని ఆమె 16ఏళ్ల కూతురు తేజశ్రీ దారుణంగా హతమార్చింది. టెన్త్ క్లాస్ చదువుతున్న తేజశ్రీ 19 ఏళ్ల శివ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఐదు రోజుల కిందట ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కాగా ఈ విషయంపై అంజలి పోలీసు స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల కిందట తేజశ్రీ తిరిగి ఇంటికి వచ్చింది. అలా వచ్చిన కుమార్తెను అంజలి మందలించింది. ఈ వయస్సులో ప్రేమ వ్యవహారాలు కరెక్ట్ కాదు, బుద్ధిగా చదువుకోమని హితవు చెప్పింది. అయితే తన ప్రేమ వ్యవహారానికి తల్లి అడ్డుగా ఉందని భావించిన తేజశ్రీ ప్రియుడు శివతో కలిసి తల్లిని హత్య చేయడానికి స్కెచ్ వేసింది. ఇందుకు శివ తమ్ముడు యశ్వంత్ కూడా తోడయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం (జూన్ 22) శివ, యశ్వంత్ లు తేజశ్రీ ఇంటికి వచ్చారు.  ఆ తరువాత ముగ్గురూ కలిసి అంజలిపై దాడి చేసి చున్నీతో గొంతు బిగించి తలపై రాడ్ తో కొట్టి హతమార్చారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  నిందితులు ముగ్గురూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. 

Jahnavi Dangeeti palakollu girl astronaut

పాలకొల్లు అమ్మాయి.. అంతరిక్షయానం

మన పాలకొల్లు అమ్మాయి ఏకంగా అంతరిక్షయానం చేయనుంది. ఇప్పటి వరకూ భారత్ లో పుట్టి ఇక్కడే నివసిస్తున్న మహిళ అంతరిక్షయానానికి ఎంపికైన చరిత్ర లేదు. అయితే అంతరిక్షయానానికి ఎంపికై మన  పాలకొల్లు అమ్మాయి జాహ్నవి చరిత్ర సృష్టించింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షల్లో  జాహ్నవి దంగేటి ఉత్తీర్ణురాలై ఈ స్పేస్ మిషన్ కి అర్హత సాధించింది. ఈ మేరకు జాహ్నవి కి  టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నుంచి వర్తమానం అందింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్  భారీ  అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్ లో  అంతరిక్ష ప్రయోగ ,వాణిజ్య ,పర్యాటక  కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ కేంద్రం నిర్మాణంలో మొదటిగా కొద్ది మంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులతో ప్రయోగాన్ని చేపట్టనున్నారు. 2029  మార్చి నెలలో నిర్వహించబోయే టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్   మొదటి అంతరిక్ష  ప్రారంభ  యాత్ర బృందంలో భారతదేశం నుంచి జాహ్నవి దంగేటి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ యాత్రలో భాగంగా జాహ్నవి ఐదు గంటలపాటు అంతరిక్షంలో గడపనుంది.        ఇప్పటికే మూడుసార్లు అంతరిక్ష యాత్రలు పూర్తిచేసిన అమెరికాకుచెందిన సీనియర్ వ్యోమగామి బిల్ మేక్ ఆర్థర్ నేతృత్వంలో టైటాన్స్ స్పేస్ మిషన్ తొలి అంతరిక్ష యానం చేయనుంది.ఇందుకు సంబందించిన వ్యోమగామి అభ్యర్థుల కు వచ్చేఏడాది అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల మూడేళ్లపాటు  శిక్షణ ఇస్తారు.  ఇంత వరకు భారత సంతతికి చెందిన అమెరికన్లు సునీతా విలియమ్స్ ,కల్పనా చావ్లా వ్యోమగాములుగా అంతరిక్షంలో అడుగిడారు. అయితే జాహ్నవి దంగేటి మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని  పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో   జన్మించింది. చిన్నతనంనుంచే చంద్రుడిపై అడుగుపెట్టాలని ధృఢనిశ్చయంతో ఆ దిశగా తన లక్ష్యాన్ని మలుచుకుంది.ఇంటర్మీడియట్ వరకు పాలకొల్లులోనే విద్యాభ్యాసం చేసిన జాహ్నవి ఇంజనీరింగ్ మాత్రం పంజాబ్ లో పూర్తిచేసింది. 2021  లో అమెరికా లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం కి భారతదేశం నుంచి ఎంపికై రికార్దు సృష్టించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాల్లో జరుగుతున్న వ్యోమగామి   శిబిరాల్లో శిక్షణ పొందుతూ వస్తోంది. పోలెండ్ లో అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించిన జాహ్నవిఐస్ లాండ్ దేశంలో జియో స్పేస్ సెంటర్లో  శిక్షణ తీసుకున్న మొదటి భారతీయురాలిగా నిలిచింది. ఇక్కడే 1965 , 1967  సంవత్సరాల్లో అమెరికా  అపోలో  ఆస్ట్రోనాట్ లు శిక్షణ పొందారు. చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బృందం కూడా జియో స్పేస్ సెంటర్  లోనే శిక్షణ పొందటం జాహ్నవికి మరింత స్ఫూర్తి కలిగించింది.

rare case filed in ps packet

పాలు విరిగిపోయాయంటూ పీఎస్ లో కేసు

కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. ఇప్పుడు కాదేదీ పోలీసు కంప్లైంట్ కు అనర్హం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. తాజాగా కుకట్ పల్లి పోలీసు స్టేషన్ లో అరుదైన కేసు నమోదైంది. అదేంటో తెలుసా.. కొన్న ప్యాకెట్ పాలు విరిగిపోయాయంటూ దుకాణదారుడిపై కేసు పెట్టాడో పెద్దమనిషి. పాపం పోలీసులు కూడా చేసేదేం లేక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..కుకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ సూపర్ మార్కెట్లో పాల ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చి కాచగానే పాలు విరిగిపోయాయి. దీంతో సదరు పాలను కొనుగోలు చేసిన వ్యక్తి రత్నదీప్ కు వెళ్లి సంగతి చెప్పాడు. దానికి దుకాణదారు దానిని మేమేం చేస్తాం అంటూ బదులిచ్చాడు. దీంతో ఆ కొనుగోలుదారుడు తిన్నగా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. దుకాణదారుపై ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   ఇటీవలి కాలంలో ప్యాకెట్ పాలు కాచగానే విరిగిపోతున్నాయనీ, వాసన వస్తున్నాయనీ పలువురు చెబుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కస్టమర్లు అంటున్నారు. లేకుంటే పాలు విరిగిపోయాయి, వాసన వస్తున్నాయంటే పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

case booked on kadapa mp avinash followers

కడప ఎంపీ అవినాష్ అనుచరులపై కేసు

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహిత అనుచరులపై కేసు నమోదైంది. మాజీ మంత్రి వైఎస్  వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ ను కారులో వెంబడించారన్న ఆరోపణలపై వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ లోకేష్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ లపై పులివెందుల పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ తనను కొందరు వ్యక్తులు కారులో వెంబడించారనీ, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందనీ పులివెందుల పోలీసు స్టేషన్ లో చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.   సునీల్ యాదవ్   ఫిర్యాదు మేరకు లోకేశ్ రెడ్డి, పవన్ కుమార్ లపై బీఎన్ఎస్  లోని 351, 126 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పులివెందుల పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న లోకేశ్ రెడ్డి, పవన్ కుమార్  పోలీసుల ఎదుట లొంగిపోతారని వైసీపీ స్థానిక నాయకులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

tirumala laddu tokens through kliyasko

తిరుమలలో ఇక అలా కూడా శ్రీవారి లడ్డూలు కొనొచ్చు

తిరుమలలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి కంపార్ట్ మెంట్లలో, క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. దర్శన అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేయడానికి కూడా మళ్లీ బోలెడంత సేపు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీనిని నివారించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. తిరుమల లడ్డూ కౌంటర్లలో రద్దీని, లడ్డూల కొనుగోలు కోసం భక్తులు అధిక  సమయాన్ని వెచ్చించే అవసరం లేకుండా చేయడం కోసం  కియోస్క్ల ద్వారా భక్తులు లడ్డూ టోకెన్లు తీసుకునే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అందుబాటులోకి తీసుకువచ్చింది.   భక్తుడు తన దర్శన టికెట్ నంబర్ ను కియోస్క్లో నమోదుచేసి తనకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని  యూపీఐ  ద్వారా నగదు చెల్లించి ఆ రసీదును లడ్డూ కౌంటర్లో ఇస్తే సరిపోతుంది. అక్కడ భక్తుడికి కావలసిన సంఖ్యలో లడ్డూలు అంద జేస్తారు. దీని వల్ల లడ్డూ టోకెన్ తీసుకోవడానికి క్యూలైన్ లో నిలబడే అవసరం లేకుండా సమయం ఆదా అవుతుంది.  

Amaravati

ఆగస్టు 15న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం : సీఎం చంద్రబాబు

  డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో సంవత్సర కాలంలోనే చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనే ధ్యేయంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.6 లక్షలుగా ఉందని, 2047 నాటికి దీనిని రూ.55 లక్షలకు పెంచడమే లక్ష్యమని నిర్దేశించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ పెరిగితే నిరంతరాయంగా రెవెన్యూ వృద్ధి చెందుతుందని, 2029 నాటికి తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ గణనీయంగా పెరగాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి, ఈ లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  పీ-4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్‌షిప్) కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. తెలివితేటలను ఆచరణలో పెట్టినప్పుడే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని స్పష్టం చేశారు.గత వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు. వారి అసమర్థ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతిన్నదని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర ప్రగతి ఆగిపోయిందని, ఈ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, వైసీపీ హయాంలో నిధులు పక్కదారి పట్టి దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు.  రాష్ట్రంలో కుటమి సర్కార్ అధికారంలోకి రాగానే  సంక్షేమానికి పెద్దపీట వేశమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి కీలక దస్త్రాలపై సంతకాలు చేశామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 213 అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని చెప్పారు. పంద్రాగస్ట్ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, అదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ‘తల్లికి వందనం’ పథకం హామీని నిలబెట్టుకున్నామని, అడ్మిషన్లు పూర్తయిన తర్వాత ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. రైతులకు 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందజేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Yogandhra

కోట్ల ఖర్చుతో యోగా..ఏపీకి మైలేజ్ వస్తుందా?

  నిజానికి చంద్ర‌బాబుది బాహుబ‌లి ఐడియా. ఆయ‌న రాయి రాయి కొట్టుకుంటూ పోరు. ఒక్క దెబ్బ‌తో కొడితే కొండ ఎలా పిండి అవుతుందో చేసి చూస్తారు. ఈ విష‌యంలో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన కృషి చాలానే ఉంది. మీరు కావాలంటే చూడండి ఆయ‌న సీఎం అయిన తొలి నాళ్ల‌లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని వెంట‌ప‌డి మ‌రీ  ఒకే ఒక్క ప్ర‌జంటేష‌న్ ఇచ్చి.. ఏకంగా ఆ కంపెనీ ఆఫీసు హైద‌రాబాద్ వ‌చ్చేలా చేశారు. త‌ర్వాతి కాలంలో హైద‌రాబాద్ కి ఎన్నో సాఫ్ట్ వేర్ కంపెనీలు రావ‌డం మాత్ర‌మే కాదు.. ఇక్క‌డే స‌త్యం వంటి అతి పెద్ద కంపెనీగా ఎదగ‌డం మ‌న‌కు తెలిసిందే. అయితే ఇదే స‌త్యం కంపెనీని వైయ‌స్ హ‌యాంలో చావు దెబ్బ తీసి  ఎద‌గ‌నీకుండా  చేశారు. అదే మీకు క‌ర్ణాట‌క‌లో బెంగ‌ళూరు బేస్ చేసుకుని.. ఏర్ప‌డ్డ ఇన్ఫోసిస్ ఇంకా ప‌దిలంగా  ఉంది. కార‌ణం అక్క‌డ ఇలాంటి దెబ్బ కొట్టుడు వ్య‌వ‌హారం లేక పోవ‌డమే. త‌ర్వాత హైద‌రాబాద్ బెంగ‌ళూరుతో స‌మానంగా సాఫ్ట్ వేర్ హ‌బ్ గా ఎదిగిన  విధం ప్ర‌పంచ‌మంతా చూసింది. ప్ర‌స్తుతానికి వ‌స్తే ఇదే ఏపీని మైక్రోసాఫ్ట్ ఫౌండేష‌న్ సాయంతో.. ఒక ఏఐ హబ్ గా త‌యారు చేసే విధంగా.. ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ్. దావోస్ కి వెళ్లి అక్క‌డేమీ సాధించలేక పోయార‌ని కామెంట్ చేశార‌ప్ప‌ట్లో ఇదే వైసీపీ నేత‌లు. త‌ర్వాత దాని రిజ‌ల్ట్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. కార‌ణం దావోస్ లో గేట్స్ ఫౌండేష‌న్ తో జ‌రిగిన  చ‌ర్చ‌ల‌కు సంబంధించిన అంశాలే నేడు ప్ర‌తిఫ‌లిస్తున్నాయి. ఇప్ప‌టికే ఏపీ  డ్రోన్ హ‌బ్ గా ఎదుగుతోంది. నెక్స్ట్ స్టెప్ ఏఐ హ‌బ్ గానూ ఎద‌గ‌డ‌మే టార్గెట్ గా  పెట్టుకుంది  కూట‌మి ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే వాట్స‌ప్ గ‌వ‌ర్నెన్స్ వ‌చ్చేసింది. ఇదొక ముంద‌డుగు. ఇక పోతే పీ- 4 ద్వారా జ‌రిగే విచిత్రాల‌ను వ‌చ్చే రోజుల్లో ఈ ప్ర‌పంచం చూడ‌బోతుంది. ఇదొక ఇంట‌ర్నేష‌న‌ల్ థియ‌రీ. కావాలంటే మీరు చూడండి సంప‌న్న దేశాలు, హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో ఈ విధానాలు ఫాలో అవుతుంటారు. మ‌నం బాగా అబ్జ‌ర్వ్ చేసిన‌ట్ట‌యితే ఈ విషయం  క్లియ‌ర్ క‌ట్ గా  తెలుస్తుంది. అక్క‌డ ఆహారం విచ్చ‌ల‌విడిగా ప‌డేస్తామంటే ఒప్పుకోరు. కార‌ణ‌మేంటో తెలుసా? అది ఎంద‌రో క‌ష్ట‌ప‌డి  త‌యారు చేసింది. కాబ‌ట్టి ఫుడ్ వేస్టే  చేయ‌డం అంటే పండించిన‌ వారిని అగౌర‌వ ప‌ర‌చ‌డ‌మే అవుతుంద‌ని వారిస్తారు. స‌రిగ్గా అలాగే ఒక వ్య‌క్తి ఎదుగుద‌ల‌లో తెలిసీ తెలీకుండా ఒక స‌మాజం స‌హాయ‌తా గుణం  దాగి ఉంటుంది. వారు అనుకున్న విధంగా ఎదిగాక‌.. ఆ స‌మాజానికి తిరిగి ఇవ్వ‌డం అన్న‌దొక‌ రూట్ మ్యాప్ ఏర్పాటు చేస్తే త‌ద్వారా వారు ఆ రూట్ ఫాలో అయ్యి.. ప‌ది మందికి సాయం చేస్తారు. వీరిలో కొంద‌రు ప్ర‌భుత్వ గుర్తింపు కోస‌మైనా, స‌మాజంలో గౌర‌వం కోస‌మైనా.. క‌ష్టంలో ఉన్న వారికి హెల్ చేయాల‌న్న భావ‌న‌కు వ‌స్తారు. దీన్నే బాబు ఇంప్రూవ్ చేశారు. ఆ దిశ‌గా వ‌చ్చే రోజుల్లో మ‌రింత ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్పుడు ప్ర‌జంట్ సిట్యువేష‌న్లోకి వ‌స్తాం. ఈ యోగాంధ్ర ఈవెంట్ ఎందుకు? ఎవ‌రి  కోసం చేశారు?  లాస్ట్ కి అక్క‌డేం జ‌రుగుతోంది? దాని  ద్వారా ల‌భించిందేంటి? జ‌నం త‌మ‌కిచ్చిన మేట్స్ లాక్కుని పీక్కుని వెళ్ల‌డం త‌ప్ప‌.. అన్న ద‌గ్గ‌ర ఈ ఫ్యాను బుర్ర‌లు ఆగిపోతున్నాయి.కానీ, బాబు బేసిక్ థియ‌రీ  అది కాదు. అస‌లాయ‌న విచ్చ‌ల విడి ఖ‌ర్చు ఎప్పుడూ పెట్ట‌రు. అదంతా కూడా ఒక‌ పెట్టుబ‌డే. ఇలా చేయ‌డం వ‌ల్ల త్రూ మోడీ ద్వారా అది నేష‌న‌ల్ న్యూస్ అవుతుంది. అంతే  కాకుండా ప్ర‌పంచం మొత్తం జూన్ 21ని ఇంట‌ర్నేష‌న‌ల్ గా యోగాడేగా ఫాలో అవుతుండ‌టం వ‌ల్ల‌.. అది ఇంట‌ర్నేష‌న‌ల్ న్యూస్ గానూ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంతో ప్ర‌పంచ మార్కెట్ని  ఏపీ నిర్వ‌హ‌ణా సామ‌ర్ధ్యంతో విశేషంగా ఆక‌ర్షించ‌వ‌చ్చు. మ‌న ఎగ్జిక్యూష‌న్ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఇక్క‌డ మ‌రో రెండు ముఖ్య మైన విష‌యాలు సైతం గుర్తించాలి. మొద‌ట మోడీ ఏపీకి ఎంతో చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖ ఉక్కుకు ప్యాకేజీనివ్వ‌డం, రైల్వే జోన్ కి గ్రీన్ సిగ్న‌ల్, ఇంకా పోల‌వ‌రం నిధులు ఇలా కేంద్రం నుంచి ఏపీకి పెద్ద ఎత్తున నిధులు వ‌స్తున్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలోనూ పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందుతున్నాయి. దీనంత‌టికీ కార‌ణం ప్ర‌ధాని మోడీ. ఆయ‌న మ‌న‌కంటూ ఇంత చేస్తుంటే.. ఆయ‌న‌కు ఇష్ట‌మైన‌వి చేయ‌డంలో త‌ప్పు ఏంట‌న్న‌ది ఒక వాద‌న‌.అయితే ఇందులో రెండో యాంగిల్ ఏంటంటే.. మీరు కావాలంటే చూడండి.. మొన్న యూఎస్ లో ట్రంప్ ఆర్డ‌ర్ ఒక‌టి తెచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం అక్క‌డ ఔష‌ధ ధ‌ర‌లు త‌గ్గించ‌డం. అయితే, ఇక్క‌డే రెండు భిన్న మైన వాద‌న‌లు వినిపించాయి. అదేంటంటే.. అత్య‌ధిక ధ‌ర‌లు ఔష‌ధాల‌కు వెచ్చిస్తే మంచి వైద్యం అందుతుంది. ఇది బేసిగ్గా అమెరిక‌న్లు న‌మ్మే థియ‌రీ. అయితే ఇక్క‌డ మ‌రో గొప్ప వాద‌న ఏంటంటే.. అస‌లు మందుల‌తో అవ‌స‌రం లేకుండా యోగా, వ్యాయామం త‌దిత‌రాలు ప్ర‌జ‌లు విరివిగా  అల‌వాటు చేసుకుంటే.. ఔషదాల‌ను వాడ‌కుండా చేయొచ్చ‌న్న‌ది ఒక ఆలోచ‌న  వెలుగు చూసింది. దీన్నిబ‌ట్టీ చూస్తే జ‌నారోగ్యం కాపాడ్డంలో భాగంగా ఇదొక బెస్ట్ మెథ‌డ్. ఇవేవీ  గుర్తించ‌కుండా రాజ‌కీయ ఆరోప‌ణ‌లు క‌రెక్టేనా? అన్న‌దొక ప్ర‌శ్న‌.  మొన్న దావోస్ వెళ్లిన‌పుడు మిస్ అయ్యింది ఈ ఎగ్జిబిట‌రీ థియ‌రీనే. హైద‌రాబాద్ బీభ‌త్స‌మైన స్టాల్ పెట్టి ఎగ్జిబిట్ చేసింది. మ‌న ద‌గ్గ‌ర అందుకు స్కోప్ లేకుండా పోయింది. ఇలాంటి స్కోప్ లేన‌పుడు క‌ల్పించాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌. దీంతో వ‌చ్చే యోగాడేని దృష్టిలో పెట్టుకుని గిన్నిస్ రికార్డ్ ప్రోగ్రాం ప్లాన్  చేద్దామ‌నుకున్నారు. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగానే చేశారు. మొత్తం మీద ప్రాగ్రామ్ ని భారీ ఎత్తున‌ స‌క్సెస్ చేశారు.ఈ డ‌బ్బు ఒక ప‌థ‌కానికి ఇవ్వొచ్చు. కాద‌న‌డం లేదు. అలాగ‌ని ఏ ప‌థ‌కాల‌కూ డ‌బ్బు ఆప‌డం లేదుగా.. మొన్నంటే మొన్న భారీ ఎత్తున అమ్మ‌కు వంద‌నం డ‌బ్బులు ప‌డి.. ఇంటిల్ల పాది ఎంత మంది పిల్ల‌లున్నారో..  వాళ్లంద‌రికీ డ‌బ్బులు ప‌డ్డ ప‌రిస్థితులున్నాయి. ఒకే ఇంట్లో ల‌క్షా యాభై ఆరు వేల రూపాయ‌ల మేర అమ్మ‌కు వంద‌నం డ‌బ్బులు ప‌డిన వార్త‌లు సైతం వెలుగు చూశాయి. ఇపుడీ యోగాంధ్ర వంటివి బ్రాండ్ ఏపీని మ‌రింత‌గా  ప్ర‌మోట్ చేస్తాయి.. త‌ద్వారా మ‌న ఉనికిని, నిర్వ‌హ‌ణా సామ‌ర్ధ్యాన్ని బాగా ఎలివేట్ చేస్తాయి. అదే వ‌చ్చే రోజుల్లో ప్రాజెక్టులు మ‌న వైపు వ‌చ్చేలా చేస్తాయి. ఇందులో దాగిన మార్కెట్ మంత్ర ఇదీ. ఈ విష‌యం తెలీక కొంద‌రు.. దీన్ని కూడా ఒక బ్యాడ్ ప్రాప‌గాండ‌గా మార్చ‌డం ఆంధ్రులు చేసుకున్న దుర‌దృష్టంగా భావిస్తున్నారు కొంద‌రు విశ్లేష‌కులు.

 MLA Prashanthi Reddy

సెల్ ఫోన్ తీసుకుందని పసిబిడ్డకు ఇంత శిక్షా!

    నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్ల దిబ్బలో ఫోన్ దొంగిలించిందనే ఆరోపణలతో బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. బాలిక పరిస్థితి చూసి చలించిపోయిన ఎమ్మెల్యే.. బాలిక బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులను వెంటనే ఆ చిన్నారిని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లి మెరుగైన వైద్యం ఇప్పించాలని ప్రశాంతి రెడ్డి స్థానిక నాయకులను ఆదేశించారు. ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక నాయకులు కమలాకర్ రెడ్డి వెంటనే ఆ చిన్నారిని  చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్ కి తరలించారు. ఈ అఘాయిత్యన్నికి పాల్పడిన పినతల్లి మాణిక్యం నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్ దొంగతనం చేశానని..గెంటితో ఒళ్లంతా కాల్చి కొట్టారు.చిన్నారి తల్లి వెంకట రమణమ్మ పాపని చిన్నప్పుడే సన్నారి మాణిక్యం దగ్గర వదిలేసి వేరే భర్తతో వెళ్లిపోయినట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారిస్తున్నరు.

Amaravati

పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం..వైసీపీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్

  తాను ఎప్పుడు రాష్ట్రం బాగు కోసమే ఆలోచిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలన చూశాక ఏపీకి అసలు వెలుగు వస్తుందా అని అనుకున్నా కూటమి సర్కార్ రాకుంటే ఆంధ్రప్రదేశ్ ఏమయ్యేదో అనిపించింది. కుదేలైన ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిన పెడుతున్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అండగా ఉన్నారు అని తెలిపారు. వైసీపీ నేతలకు పవన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. గొంతులు కోస్తామనే బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. అవన్నీ సినిమాల్లోనే బాగుంటాయని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదు.  మేం చట్టబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి పద్ధతిగా ఉంటున్నాం. ఎన్నో దెబ్బలు తిని, ఇక్కడి వరకు వచ్చాం. పిచ్చివేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం. ప్రజల్లో భయాందోళన కలిగించాలని చూస్తే సహించం’’ అని పవన్‌ హెచ్చరించారు. వైసీపీకి ప్రతిపక్షానికి కావాల్సిన సంఖ్య బలం కూడా లేదు.. కానీ ప్రతిపక్ష హోదా కావాలని గగ్గోలు పెడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఏకైక లక్ష్యంతో తామందరం కూటమిగా ఏర్పడి ముందుకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. తమ పోరాటాన్ని ప్రజలు గుర్తించి, ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆశీర్వదించారని తెలిపారు.ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించగలిగాం. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించింది. మేము గ్రామపంచాయతీలకు కేటాయించే నిధులను గణనీయంగా పెంచాం. పల్లెపండగ కార్యక్రమం ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధికి బాటలు వేశాం అని ఆయన వివరించారు.

Singaiah

సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణం : షర్మిల

  సింగయ్య మృతికి ముమ్మాటికి వైసీపీ అధినేత జగన్ నిర్లక్ష్యమే కారణమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మానవత్వమే లేదు.ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శ చేయలేదని షర్మిల ప్రశ్నించారు. క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణమని ఆమె పేర్కొన్నారు. మానవత్వం ఉంటే 5 కోట్లో, 10 కోట్లో పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలని తెలిపారు. 5 ఏళ్లు కుంభకర్ణ నిద్ర పోయి.. ఇప్పుడు ప్రజా సమస్యలు అంటూ బయలు దేరడం విడ్డూరంగా ఉందని షర్మిల విమర్మించారు.  వైయస్ జగన్మోహన్ రెడ్డివి బల ప్రదర్శన... జన సమీకరణ కార్యక్రమాలు తప్ప... ఏ ఒక్కటి ప్రజల కోసం ఉండబోవని వెల్లడించారు. జగన్ జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వకండని... జనాలను చంపకండి అంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి షర్మిల కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని కోరారు. ఇది ఇలా ఉండగా.. ఈ సంఘటనపై ఇవాళ వైయస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టారు. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి... వైసిపి పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగయ్య మృతికి కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణమని జగన్ ట్వీట్ చేశారు.కారులో ఉన్న అందరినీ విచారణకు పిలవాలని షర్మిల డిమాండ్ చేశారు.  

Amaravati

నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చింది : లోకేశ్

  గత పాలకులు విధ్వంసం సృష్టించారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేశ్ విమర్శించారు. ఏపీలో ఎన్డీయే కూటమి ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న సుపరిపాలన-తొలి అడుగు సదస్సులో లోకేశ్ మాట్లాడారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఎక్కువ మొత్తంలో పింఛను ఇస్తున్నామని. తల్లికి వందనం పేరుతో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. తొలి ఏడాదిలోనే డీఎస్సీ ద్వారా 16,300 పోస్టులు భర్తీ చేస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.పేదలకు చేయూత ఇచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని ఏ రాష్ట్రానికి వెళ్లినా పీ-4 విధానాన్ని ప్రశంసిస్తున్నారు. పొగాకు, మిర్చి, మామిడి, కోకో రైతులను ఆదుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయి. ఉత్తరాంధ్రకు టీసీఎస్‌, కాగ్రిజెంట్‌ సంస్థలను తీసుకొచ్చాం. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోంది. అభివృద్ధిలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు దూసుకుపోతోందని మంత్రి వెల్లడించారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోదు. ప్రశ్నిస్తే చాలు లాఠీ దెబ్బలు, అరెస్టులు వేధింపులు గురిచేసే వారని లోకేశ్ పేర్కొన్నారు. నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్రర్యం వచ్చిందని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Home Minister Anita

జగన్‌కు రాజకీయ లబ్థి తప్పా.. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు : హోం మంత్రి అనిత

  వైసీపీ అధినేత జగన్ పరామర్శ పేరుతో వెళ్లి రోడ్‌షోలు నిర్వహించారని హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతు వైసీపీ నేతలు దారుణంగా దిగజారిపోయారని  విమర్శించారు. ‘‘పొదిలిలో వేసీపీ నేతల అరాచకాలను అందరూ చూశారు. 10 అడుగుల రోడ్డులో ఎలా వెళ్లాలో నాయకులకు తెలియాదా? జగన్‌.. పరామర్శ పేరుతో వెళ్లి రోడ్‌షో నిర్వహించారు. జగన్‌కు రాజకీయ లబ్థి తప్పించి మనుషుల ప్రాణాలంటే లేక్క లేదా అని ప్రశ్నించారు.  ఇద్దరు వ్యక్తులు చనిపోయిన జగన్ తన పర్యాటన కొనసాగించారని  హోం మంత్రి మండిపడ్డారు. కారు కింద పార్టీ కార్యకర్త పడినా గుర్తించకపోవడం దారుణం. గాయపడిన వ్యక్తిని దయ, జాలి లేకుండా పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్తే ఆ వ్యక్తి బతికేవారేమో అని ఆమె తెలిపారు. ఏదో వాహనం ఢీ కొందన్న సమాచారం మేరకు పల్నాడు ఎస్పీ సతీష్ తొలుత అలా మాట్లాడారు. వీడియోలు చూశాక కేసు మార్చామని అదే ఎస్పీ చెప్పారు కదా. కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ‘గతంలో మేం ఆంక్షలు విధించామా?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.  మీరు చేసినవన్నీ మర్చిపోయి ఇప్పుడు మాట్లాడటం దారుణం. ఐదేళ్లపాటు ప్రతిపక్షనేతలను రోడ్డుమీదకు రానిచ్చారా అని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు

 Heavy rains

తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు

  తెలంగాణలో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆసిఫాబాద్,మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో కూడా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.  ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గత కొద్దిరోజుల నుంచి వాతావరణం చల్ల బడింది. కొంత సేపు ఎండలు పెట్టినా.. మిగితా సమయం మబ్బులు కమ్ముకుంటున్నాయి.  పశ్చిమ మధ్య బంగాళాఖాతం, సరిహద్దు వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పింది.  

by pools in four states

ఎవరి హవా వారిదే!

దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు సోమవారం (జూన్ 23) వెలువడ్డాయి. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తై ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలలో ఏ పార్టీకీ నిరాశ మిగల్లేదు. అలాగని రొమ్ము విరుచుని ఆనందంతో గంతులేయడానికీ అద్భుత ఫలితాలూ రాలేదు. ఎవరి హవా వారిదే అన్నట్లుగా ఫలితాలు ఉన్నాయి.  గుజరాత్‌లోని విసావదర్, కడి స్థానాలతో పాటు పంజాబ్‌లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబూరు నియోజకవర్గాలకు ఈ నెల  19న పోలింగ్ జరిగిన విషయం విదితమే. వెలువడిన ఫలితాలను బట్టి ఎవరి హవా వారిదే అన్నట్లుగా ఫలితాల సరళి ఉంది.   కేరళలోని నీలాంబూరు స్థానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్   అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ విజయం సాధించారు.  ఇక పంజాబ్ లోని లూధియానా వెస్ట్ నియోజకవర్గాన్ని ఆప్ కైవశం చేసుకుంది. ఇక పశ్చిమ బెంగాల్ లోని కాళీగంజ్ స్థానానికి జరిగిన బై పోల్ లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక పోతే గుజరాత్ లోని విసావదర్ స్థానంలో ఆప్ అభ్యర్థి విజయం సాధిస్తే. కాడి సీటును బీజేపీ దక్కించుకుంది. మొత్తం ఐదు అసెంబ్లీ నియోజ కవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా వాటిలో రెండింటిని ఆప్ దక్కించుకుంది. ఇక బీజేపీ, యూడీఎఫ్, టీఎంసీలు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. 

ఫోన్ పే రచ్చ.. ఉచ్చు బిగుస్తోంది.. అయితే అరెస్టు అంత వీజీ కాదు!

ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన  ఫోన్ అక్రమ ట్యాపింగ్‌ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు ఏ కంచికి చేరుతుందో..  ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఏమో కానీ.. ఇంతవరకు అందుతున్న సమాచారం ప్రకారం   ముందు ముందు పెద్ద తలకాయలకు చిక్కులు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా  ఈకేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, తనను నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే  పని చేశానని ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం గా మారింది.  ప్రభాకర రావు స్టేట్మెంట్ ఆధారంగా  ‘సిట్’ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్  ను రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వ్యూహాత్మకంగా.. ఎప్పటికప్పడు స్టాండ్’ మారుస్తూ వస్తున్న ప్రభాకర రావు..సిట్  విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సీన్ లోకి తీసుకొచ్చారని, మాజీ ఐపీస్ అధికారి, బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్  సహా పలువురు మాజీ అధికారులు, పరిపాలన అనుభవం ఉన్న రాజకీయ నాయకులు భావిస్తున్నారు. నిజానికి.. ఇంటెల్జెన్సీ మరీ ముఖ్యంగా పొలిటికల్ ఇంటెల్జెన్సీకి సంబందించిన వ్యవహారాల్లో డీజీపీ, హోం శాఖ కార్యదర్శి, చివరకు హోం మంత్రి ప్రమేయం కూడా ఉండదని.. ఎస్‌ఐబీ చీఫ్ నేరుగా శాంతి భద్రతల శాఖ మంత్రి, అంటే ముఖ్యమంత్రికి (హోం మంత్రి ఎవరైనా శాంతి భద్రతల విభాగం ముఖ్యమంత్రి వద్ద ఉంచుకోవడం అన్నది అనాదిగా అన్ని రాష్ట్రాల్లో  ఆచారంగా వస్తోంది. గత ప్రభుత్వ హయంలోనూ అదే ఆచారం కొనసాగింది. నాయని నరసింహ రెడ్డి, మహ్మూద్ అలీ ఎవరు హోం మంత్రిగా ఉన్నా, శాంతి భద్రలు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉన్నాయి.)  మాత్రమే రిపోర్ట్ చేస్తారని, ముఖ్యమంత్రి నుంచే, మౌఖిక, లిఖిత పూర్వక ఆదేశాలు స్వీకరిస్తారని  అంటున్నారు. సో.. ఇక్కడ ప్రభాకర రావు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సీన్ లోకి తీసుకు రావడం ఒక విధంగా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నంగానే చూడాలని మాజీ అధకారులు అంటున్నారు. అయితే.. మరోవంక ప్రభాకర రావు ఇచ్చినట్లు చెపుతున్న స్టేట్మెంట్ మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్  మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. అదలాఉంటే, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావునను ఇప్పటికే ఐదుసార్లు విచారించిన  సిట్  మరో సారి అంటే ఆరో సారి ఆదివాకం   (జూన్ 23)  విచారించింది. రెండు రోజుల క్రితం జరిగిన విచారణలో.. బంతిని మాజీ డీజీపీ కోర్టులోకి నెట్టిన ప్రభాకర రావు, ఈ సారి ఎలాంటి  ప్రకటన చేస్తారు.. ఇంకెవరిని సీన్ లోకి తెస్తారు  అన్న ఉత్కంఠ, ఆసక్తి వ్యక్తం అవుతున్నాయి. నిజానికి..  ప్రభాకర రావు విచారణకు పెద్దగా సహకరించడం లేదనీ..  ఎన్నిగంటలు కూర్చోపెట్టినా, ఒకటీ అరా ప్రశ్నలకు   అరకొర సమాధానాలు ఇవ్వడమే కానీ, సరైన సమాధానలు ఇవ్వడం లేదని  సిట్   వర్గాల సమాచారం. ముఖ్యంగా..  ఆగష్టు 5 వరకు ప్రభాకర రావును అరెస్ట్ చేయరాదని సుప్రీం కోర్టు ఆయనకు వెసులుబాటు కల్పించిన నేపధ్యంలో..  ఆయన విచారణకు సహకరించక పోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని సిట్ వర్గాలు అంటున్నాయి. అదలా ఉంటే..  గత అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఒకరి తో ఒకరు తలపడిన కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ దేవరాజ్ గౌడ్ సహా, మరి కొందరు కాంగ్రెస్ నాయకులకు  సిట్ వారం రోజుల్లోగా సిట్ కార్యాలయాని వచ్చి వాగ్మూలం ఇవాలని నోటీసులు ఇచ్చింది. అలాగే.. మరి కొంతమంది రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్ కూడా  సిట్  అధికారులు, రికార్డు చేయనున్నట్లు  తెలుస్తోంది. అదలా ఉంటే..  ఈ కేసు ఏనాటికైనా లాజికల్ కంక్లూజన్  కు చేరుతుందా ? పెద్ద తలల అరెస్ట్ వరకు వెళుతుందా అంటే..  అది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినంత ఈజీ అయితే కాదని అంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్

  తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాదిలో  ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం పూర్తయితే ఇంతవరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘన్ని  కోర్టు నిలదీసింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు మరో 60 రోజుల సమయం కావాలని ఎన్నికల సంఘం కోర్టును విజ్ఞప్తి చేసింది.  వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. కాగా 2024 ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. 

బండి వెర్సెస్ ఈటల.. ముదురుతున్న యుద్ధం!

భారతీయ జనతా పార్టీ  తెలంగాణ రాష్ట్ర శాఖలో సందడి మొదలైంది. కారణాలు ఏవైనా చాలా కాలంగా స్తబ్దుగా  ఉన్న కమలదళం నాయకుల్లో కదలిక వచ్చింది. అయితే..  కదలికతో పాటు  కయ్యాలకు తెర లేచింది. అఫ్కోర్స్.. పార్టీ స్తబ్దుగా ఉన్నా, మరోలా ఉన్నా.. బీజేపీలో అంతర్గత కుమ్ము లాటలు,నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు నిత్యకృత్యంగా సాగుతూనే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. అయితే..   తాజాగా పాత గొడవలు కొత్తగా తెర పైకి రావడంతో పార్టీ క్యాడర్  నారాజ్  అవుతున్నారు.  పార్టీ ముఖ్య నాయకులు, వ్యవహరిస్తున్న తీరు, మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు కీలక నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో  బహిరంగంగా పరస్పర విరుద్ద ప్రకటనలు చేయడం పార్టీ ఇమేజ్ ని దెబ్బ తీస్తోందని పార్టీ వర్గాల్లో అందోళన, పార్టీ క్యాడర్ లో ఆవేదన వ్యక్తమవుతున్నాయి. నిజానికి..  కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద మోదీ, సారధ్యంలోని  ఎన్డీఎ ప్రభుత్వం ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని  సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో మల్కా జ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ఆదివారం(జూన్ 22) వికసిత్‌ భారత్‌ సంకల్ప సభ జరుగతున్న సమయంలోనే.. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్  సభకు హాజరు కాకపోవడమే కాకుండా..  అదే సమయంలో  కరీంనగర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసీ మరీ,కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో.. గతంలో ఈటల చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తప్పు పట్టారు.అంతే కాదు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ స్టాండ్ ఎప్పుడూ ఒక్కటే అంటూ..  కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అయిందని గతంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన మాట, తీసుకున్న స్టాండ్ లో ఈ రోజుకూ ఇసుమంతైనా  మార్పు లేదని కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పారు. అంత వరకు అయితే కొంతవకు ఓకే.. బండి అక్కడితో ఆగలేదు బీజేపీలో ఉన్న ఎవరైనా  బీజేపీ స్టాండే తీసుకోవాలనీ..  వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదని పరోక్షంగా ఈటలకు చురకలు అంటించారు.   అంతే కాదు..  కాళేశ్వరం ప్రాజెక్టు సమబందించి అప్పటిరాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, మాజీ మంత్రి హోదాలో ఈటల ఒకటికి పదిసార్లు చెప్పడమే కాకుండా,కాళేశ్వరం ప్రాజెక్టుకు కాబినెట్ ఆమోదం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పు కుంటానని కాంగ్రెస్ నేతలకు సవాలు కూడా విసిరారు. అయితే, బండి సంజయ్ ఈటల సవాలును సింపుల్ గా తీసి పారేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈటల రాజేందర్ అభిప్రాయానికి పార్టీ స్టాండ్ పూర్తి భిన్నమని బండి పేర్కొన్నారు. కేసీఆర్ కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారంటే.. ఎవరూ నమ్మరన్నారు. అంటేఈటల చెప్పింది తప్పు, కాంగ్రెస్ చెప్పిందే సత్యం అని బండి, కాంగ్రెస్ పార్టీకి సర్టిఫికేట్ ఇచ్చారు.   విషయంలోకి వెళితే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ లో మూడు పిల్లర్లు కూలిన సంఘటన, ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలు, ఆర్థిక ఆకతవకలపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పీసీఘోష్ కమిషన్‌  ఏర్పాటు చేసిన విషయం  అందరికీ తెలిసిందే. ఈ కమిటీ ఎదుట ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీగా కాకుండా..  గతంలో  కేసీఆర్  మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి,  మాజీ మంత్రి హోదాలో ఇటీవల హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో , ఆర్థిక విషయాలకు సబంధం లేని  కాబినెట్ ఆమోదం వంటి కొన్ని సాంకేతిక అంశాలకు సంబంధించి  కేసీఆర్  ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు, ఈటల వ్యాఖ్యల, పూర్వాపరాలు, పర్యవసానాలపై, పార్టీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట, ఈటల మాజీ మంత్రిగా హాజరయ్యారే కానీ, బీజేపీ ఎంపీగా హాజరు కాలేదని స్పష్టం చేశారు. సరే.. అది ఎంత వరకు సమంజసం అనే విషయాన్నిపక్కనపెడితే.. అంతర్గతంగా చర్చించవలసిన  అంశాలను  బహిరంగా అది కూడా  బీజేపీ దేశ వ్యాప్తంగా, భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగా మోదీ ప్రభుత్వం విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ అభియాన్ లో  భాగంగా రాష్ట్రంలో వికసిత భారత్ సంకల్ప సభ నిర్వహిస్తున్న  సమయంలో.. పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగా వివాదాన్ని సృష్టించదాన్ని పార్టీ పెద్దలు తప్పుపడుతున్నారు. అలాగే..  ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య రాజుకున్న ఈ వివాదం ఎటు దారి తెస్తుంది, ఎందాకా పోతుంది అనేది  ఇప్పడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. అలాగే..  పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుంటేనే కానీ, బండి వర్సెస్ ఈటల మధ్య ముదురుతున్న యుద్ధం చల్లారదని అంటున్నారు.

పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

  వైసీపీ నేత మాజీ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 3.88 ఎకరాల భూమిని ఖాళీ చేయాలని మఠం ఈఓ ఉత్తర్వులివ్వగా పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై అభ్యంతరాలుంటే దేవదాయశాఖ ట్రిబ్యునల్‌కు వెళ్లాలని కోర్టు ఆదేశించింది. నేటి నుంచి రెండు వారాల పాటు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు జస్టిస్‌ కేవి విశ్వనాథన్‌, జస్టిస్‌ కోటీశ్వర్‌సింగ్‌ల ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ ముగించింది