ధర్మానకేమో బెయిల్, మోపిదేవికి జైలా?

జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తమ నాయకుడి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అనుచరులు గుర్రుగా ఉన్నారు. మోపిదేవిని జైలుకి పంపిన ప్రభుత్వం ధర్మానకి ముందస్తు బెయిల్ ఎందుకిప్పించిందో చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇద్దరు వ్యక్తులకు వేరు వేరు న్యాయాన్ని అమలుచేసి చోద్యం చూస్తున్నారంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ కేసులో మోపిదేవి వెంకటరమణతో ఎందుకు బలవంతంగా రాజీనామా చేయించారో, ఎందుకు ఇప్పటివరకూ ధర్మాన రాజీనామాని ముఖ్యమంత్రి ఆమోదించకుండా ఉన్నారో జనం చూస్తూనే ఉన్నారంటూ మోపిదేవి అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవిని అరెస్టు చేసిన సీబీఐ ధర్మాన విషయంలో ఆచితూచి అడుగులేస్తోందని ఆరోపించారు. ధర్మానకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారికి ఎవరికీ మందస్తు బెయిల్ మంజూరు చేయకుండా ధర్మానకు మాత్రం ముందస్తు బెయిల్ ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం.. కేవలం మోపిదేవి వెంకటరమణ బలహీన వర్గాలకు చెందిన నేత కావడమేనంటూ అభిమానులు మండిపడుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.