చేటు చేసే మందా? మంచి చేసే చేదు మందా?

  నోట్ల రద్దు నిర్ణయం జిరిగి అటు ఇటుగా నెల కావస్తోంది. మరి ఈ మూడు, నాలుగు వారాల్లో జరిగిందేమిటి? నల్లదనం వెలికి వస్తుందని, దొంగ నోట్లు చెత్త కుండీల్లో, నదుల్లో, చెరువుల్లో కట్టలుకట్టలుగా కనిపిస్తాయని జరిగిన ప్రచారం అంతా ఒట్టిదేనా? డీమానిటైజేషన్ లోని మంచి సంగతి దేవుడెరుగు, చెడు మాత్రం కామన్ పీపుల్ని కాటేసిందా? కాళ్లు అరిగేలా క్యూలలో నిలబడ్డ వాళ్లకు నష్టం తప్ప దేశానికి ఒరిగిందేమీ లేదా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు బోలెడు వస్తున్నాయి. పనిలో పనిగా బంగారం విషయంలో మీడియా చేస్తున్న హడావిడి మరింత నిరాశ కలిగిస్తోంది. ఇళ్లలో, ఒంటి మీదా, బ్యాంక్ లాకర్లలో వున్న బంగారం కూడా మోదీ వచ్చి ఎత్తుకుపోతాడు అన్నట్టు వుంది వ్యవహారం. లేడీస్ ముందు మైక్ లు పెట్టి వీలైనంత తిట్టిపోయిస్తున్నారు! కాని, నోట్ల రద్దు నిజంగానే ఒక తుగ్లక్ చర్యా? మోదీ అన్ పాప్యులర్ అవ్వటం దీనితోనే ప్రారంభమైందా?  పెద్ద నోట్ల రద్దు చిన్న విషయం కాదు. అందుకే, చాలా పెద్ద వ్యవహారమైన పెద్ద నోట్ల రద్దు అందరికీ పెద్ద అయోమయంగా మారిపోయింది. ఒక్కోసారి మోదీ ప్రభుత్వానికి కూడా ఏం జరుగుతుందో అర్థం కావటం లేదేమో అనిపిస్తుంది. అలా వుంది కన్ ఫ్యూజన్! కాని, డీమానిటైజేషన్ ప్రచారం జరుగుతోన్నంత బ్యాడ్ ఐడియా కాదు. చాలా మంచి కోణం అందులో దాగి వుంది. కాని, పాలు తోడేసిన వెంటనే పెరుగైపోదన్నట్టు... కాస్త టైం పట్టే అవకాశం వుంది. అంత వరకూ మాత్రం బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్యుల క్యూ లైన్లే కనిపిస్తాయి. ప్రతిపక్షాల అరుపులు, కేకలే వినిపిస్తాయి. కాని, స్లోగా నోట్ల రద్దు గుడ్ ఎఫెక్ట్ అనుభవంలోకి వస్తూనే వుంది. దాన్ని గుర్తించగలిగితే భయం, అయోమయం తగ్గే అవకాశం వుంది. తాజా మార్కెట్ ట్రెండ్ ని చూస్తే బంగారం ధర తగ్గుతోంది. ఇంకా తగ్గే ఛాన్స్ కూడా వుందంటున్నారు మార్కెట్ ఎక్స్ పర్ట్స్. దీనికి కారణం బంగారు నిల్వలు, ఎగుమతులపై అమెరికా, చైనా తీసుకునే నిర్ణయాలే. అయితే, మన దేశంలో జరుగుతోన్న నోట్ల రద్దు తదనంతర పరిణామాలు కూడా గోల్డ్ పై ఎఫెక్ట్ చూపుతున్నాయి. గవర్నమెంట్ బ్లాక్ మనీతో కొనే బ్లాక్ గోల్డ్ ను ఓ కంట గమనిస్తోందని తెలియగానే కొనుగోళ్లు తగ్గాయి. నిజానికి పెద్ద నోట్లు రద్దు కాగానే చాలా మంది బంగారు బిస్కెట్లే బెటర్ అనుకున్నారు. కాని, ఇప్పుడు వాటికి కూడా లెక్కలు చెప్పాలనటంతో గోల్డ్ సేల్స్ తగ్గిపోయాయి. ఫలితంగా ధర కూడా తగ్గుతూ వస్తోంది. ముందు ముందు ఇంకా తగ్గితే కామన్ పీపుల్ కొనుక్కునే నగలు మరింత చౌకగా మారతాయి.  బంగారం బాటలోనే పయనిస్తోంది రియల్ ఎస్టేట్. నోట్లు రద్దు కాక ముందు విపరీతంగా ధర పలికిన భూముల ఇప్పుడు మధ్య తరగతి వారికి అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే, బ్యాంక్ లోన్లు తక్కువ వడ్డీకి లభిస్తే రియల్ లాభాలు బోలెడు వుంటాయి. భారీగా డిపాజిట్లు జరగటం వల్ల ముందు ముందు తక్కువ వడ్డీకి హోమ్ లోన్స్ ఇస్తారని ఆల్రెడీ నిపుణులు చెబుతున్నారు. అంటే, మిడిల్ క్లాస్ స్వంత ఇంటి కల ఇక ముందు మరింత తేలిగ్గా సాకారం కానుందన్నమాట! బంగారం, ఇల్లే కాదు... నోట్ల రద్దు సత్ ఫలితాలు ఇంకా అనేక రంగాలపై పడుతున్నాయి. ఉదాహరణకి, భీమా రంగమే తీసుకోండి... నోట్లు రద్దయ్యాక చాలా మంది పాలసీలు చేయించటం మొదలెట్టారు. ఇంత కాలం ట్యాక్స్ లు కట్టకుండా మూలుగుతున్న ధనం రకరకాలుగా బయటకు వస్తోంది. ముంబైలోని ఒక వ్యాపారి అయితే ఏకంగా 50కోట్ల ప్రీమియం కట్టాడట ఎల్ఐసీకి! దేశంలో అతి పెద్ద ప్రీమియం అమౌంట్ ఇప్పటి వరకూ ఇదేనట! ఓ బాలీవుడ్ హీరో కూడా 2కోట్ల ప్రీమియంతో పాలసీ తీసుకున్నాడట. ఇక పోయిన నెల చివరి రోజున ఒకే రోజు జీవన్ అక్షయ్ అనే పాలసీ కోసం ఎల్ఐసీకి 2300కోట్లు వసూలయ్యాయట! ఇంత భారీగా కలుగుల్లో దాక్కున్న సొమ్ము బయటకి రావటం... కనీస ఆర్దిక శాస్త్రం తెలిసిన ఎవరికైనా లాభదాయకంగానే కనిపిస్తుంది! అనూహ్యంగా నోట్లు రద్దు చేసిన తరువాత ఇబ్బందులు వున్న మాట ఎంత వాస్తవమో , ముందు ముందు రాబోయే లాభాలు కూడా అంతే నిజం. కేవలం నల్లధనం పైనే చర్చ చేస్తూ ఇతర లాభాలు, వివిధ రంగాలపై కలిగే లాభసాటి ప్రభావాలు చర్చించకపోవటం పెద్ద తప్పే అవుతుంది! ఈ సత్యం ముఖ్యంగా గ్రహించాల్సింది మెయిన్ స్ట్రీమ్ మీడియా...        

ఆమెకి... పాత నోట్లపై ఎందుకంత 'మమత'? 

మోదీ నోట్ల రద్దు నిర్ణయం పెద్ద దుమారం రేపింది దేశంలో! పార్లమెంట్లో కూడా నోట్ల రద్దు నానా హంగామాకి దారి తీస్తోంది! అయితే, నోట్ల రద్దు మిగతా అన్ని పార్టీలు, అందరు ముఖ్యమంత్రుల కన్నా మమత, కేజ్రీవాల్ ను మాత్రం తీవ్రంగానే ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది! ఎందుకోగాని... ఈ ఇద్దరూ పాత నోట్లను అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. ఆఖరుకు, కేరళ, త్రిపురలోని కమ్యూనిస్టు ముఖ్యమంత్రులు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కేసీఆర్, నవీన్ పట్నాయక్ లాంటి ఇతర ముఖ్యమంత్రులు ... ఎవ్వరూ చేయనంత ఉద్యమం మమత, కేజ్రీవాల్ ఇద్దరే చేస్తున్నారు. మోదీపై దుమ్మెత్తి పోస్తున్నారు! సాధారణంగా మన దేశంలో చాలా మంది పొలిటీషన్స్ బ్లాక్ మనీతో డీల్ చేస్తుంటారు. వాళ్లకు పెద్ద నోట్ల రద్దు ఒకింత జీర్ణం కాని విషయమే. అయినా కూడా దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాస్తవ స్థితిని గ్రహించి గంభీరంగా పరిస్థితి చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. మోదీకి వ్యతిరేకంగా అనవసరంగా విమర్శలు చేయటం లేదు. ఒకటి అరా స్టేట్మెంట్ ఇచ్చి తమ పనిలో తాము పడిపోతున్నారు. కాని, ఎప్పటిలాగే మోదీని టార్గెట్ చేసిన కేజ్రీవాల్, కొత్తగా ప్రధాని బద్ధ శత్రువుగా మారిన మమత ఎంత మాత్రం నిశ్శబ్ధంగా వుండలేకపోతున్నారు. కేజ్రీవాల్ అయితే తన ఎన్నికల ప్రచారంలో ఎవరికైనా ఓటు వేయండి కాని బీజేపికి మాత్రం వద్దని చెప్పేదాకా వెళ్లిపోయాడు! అంటే... తన ఆప్ గెలవకపోయినా సరే కాని నరేంద్ర మోదీ బీజేపి మాత్రం గెలవటానికి వీల్లేదని ఆయన అభిప్రాయం! మమత బెనర్జీ గతంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్రంపై విరుచుకుపడుతోంది. మరీ ముఖ్యంగా, మోదీ అంటే చాలు ఇల్లు పీకి పందిరేస్తోంది. ఏది జరిగినా జనం ముందు మోదీయే కారణమని నిరూపించే పనిలో పడిపోయింది. అందుకు చక్కటి ఉదాహరణ ఆమె ఫ్లైట్ ల్యాండింగ్ లో జరిగిన జాప్యం తాలూకూ రభసే! ఒక ప్రైవేట్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణించిన ఆమె అందులో ఇంధనం తక్కువగా వుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పార్టీ ఎంపీలైతే పార్లమెంట్ స్థంభింపజేశారు. ఇది కేంద్రం కుట్ర అనేశారు. వాళ్ల ఆందోళన తప్పు పట్టాల్సింది కాకపోయినా... తరువాత సదరు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కంపెనీ ఇచ్చిన వివరణ వ్యవహారం మొత్తం నవ్వుల పాలయ్యేలా చేసింది! ఇంధనం తక్కువ వుండటం నిజం కాదని... కమ్యూనికేషన్ లో వచ్చిన గ్యాప్ వల్ల కాస్త హడావిడి జరిగిందని తెలిపింది! విమానం గొడవ సద్దుమణగక ముందే బెంగాల్ లో ఆర్మీ ఎందుకు కాలు పెట్టిందని సీరియస్ అయిపోయింది దీదీ. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా సైన్యం టోల్ గేట్ల వద్దకు రావడం అస్సలు అంగీకార యోగ్యం కాదంటూ మమత సచివాలయంలో బైటాయించింది. ఆర్మీ వెనకకు వెళితే తప్ప బయటకి రానంటూ మొండికేసింది. ఆమె అభ్యంతరం తప్పు కాకపోయినా సచివాలయంలో కూర్చుని బయటకి రాకుండా సీన్ క్రియేట్ చేయటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వంత భారతీయ సైన్యాన్ని చూసి మమత ఎందుకు అంత బెంబేలెత్తిపోతోంది? నిజానికి ఆర్మీ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అలాంటి డ్రిల్ అప్పుడప్పుడూ చేస్తూనే వుంటుందని ఇండియన్ ఆర్మీ క్లారిటీ ఇస్తూనే వుంది కూడా! అయినా కూడా మమత ఎందుకు రచ్చ చేస్తోంది?  కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన ప్రకారం శారదా స్కాం మమత బెనర్జీ  ఫ్రస్ట్రేషన్ కి కారణమని  తెలుస్తోంది. అందులో ఆమె అవినీతికి పాల్పడ్డారని, అదే ఇప్పుడు టెన్షన్ కి మూలమని చెబుతున్నారు. మోదీ ఒకవేళ సీబీఐని రంగంలోకి దింపితే మమత చుట్టూ అనేక కోణాల్లో ఉచ్చు బిగుసుకోవచ్చంటున్నారు. అది ఆమె రాజకీయ భవిష్యత్ కే దెబ్బ. అంతే కాదు, ఇప్పటికే మమత కమ్యూనిస్టుల్ని మట్టి కరిపించింది కాబట్టి తరువాత బలంగా ఎదుగుతోంది బీజేపి. అందుకే, మమత కమలాన్ని పెరికేసే పనిలో వుందంటున్నారు! మమత బెనర్జీ మీద ఇప్పటి వరకూ అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు. కాబట్టి ఆమె శారదా స్కాం లాంటి వాటి వల్ల భయపడుతున్నారని మనం నమ్మలేం. కాని, నోట్ల రద్దు వెనక్కి తీసుకోలేని నిర్ణయం , పైగా దేశ సంక్షేమానికి దీర్ఘ కాలంలో మంచి చేస్తుందని తెలిసి కూడా ఎందుకు వ్యతిరేకిస్తోంది? మోదీని రాజకీయాల్లోనే లేకుండా చేస్తానని శపథాలు ఎందుకు చేస్తోంది? ఇది ఆమెకే తెలియాలి. కాకపోతే, ఖచ్చితంగా తెలివైన రాజకీయం మాత్రం కాదు. ఆవేశంగానో, అసహనంతోనో ఆమె వేస్తోన్న తప్పటడుగు. మమత కాస్త ప్రశాంతంగా తన వ్యూహాల్ని పునరాలోచించుకోవాల్సిన సమయం ఇది...  

నమో సక్సెస్ అవుతున్నాడా? లేక అపోజిషన్ ఫెయిలవుతోందా? 

  పదేళ్లు మన్మోహన్ సింగ్ లాంటి మౌన ప్రధానితో అలవాటు పడ్డ భారతీయులకి మోదీ మార్క్ పరిపాలన జీర్ణం కావటం లేదు. ఆయన చేసే పనులు మంచివా, చెడ్డవా అనే వాదనలు తరువాత... అసలు ఆయన ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాక కన్ ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది! సొషల్ మీడియాలో మోదీ భక్తులుగా పిలవబడే హార్డ్ కోర్ ఫ్యాన్స్ నమోని ఎలాగూ సమర్థిస్తారు. వాళ్లని పక్కన పెట్టేస్తే మధ్యస్థంగా వుండేవాళ్లు, మోదీ వ్యతిరేకులు ప్రధాని చర్యలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సతమతం అవుతున్నారు. మరీ ముఖ్యంగా, విపక్ష నేతలు అందరికందరూ డైలామాలో పడిపోతున్నారు. దీనికి కారణం, మోదీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ ఢిల్లీలో కొనసాగుతూ వచ్చిన గేమ్ రూల్స్ అన్నీ మార్చేయటమే! ఆయన ఆట తనకి నచ్చినట్టు ఆడేస్తున్నాడు... మోదీ ప్రధాని అయ్యాక ఆయన దేశ దేశాలు తిరగటం మొదలు స్వచ్ఛ్ భారత్ కు పిలుపునివ్వటం, జన్ ధన్ ఖాతాలు ... ఇలా చాలా అంశాలు విమర్శల్లోకి వచ్చాయి. ప్రతీ సారి ఆయనంటే పడని వారు విరుచుకుపడటం, సమర్థించే వారు చెలరేగిపోయి మద్దతివ్వటం జరుగుతూనే వుంది. ప్లానింగ్ కమీషన్ ని నీతీ ఆయోగ్ గా మార్చటం లాంటి కీలక నిర్ణయాలకి, జీఎస్టీ లాంటి బిల్లులకి ఆయన మీద ఆరోపణలు చేస్తే అంతా బాగానే వుండేది. కాని, మీడియా, ప్రతిపక్షాలు, ఒక వర్గం మేధావులు ప్రతీ చిన్న అంశం రచ్చ చేయటం మొదలు పెట్టారు. ఆఖరుకి ఆయన వేసుకున్న కోటు కూడా పెద్ద కొట్టాటకు దారి తీసింది. మోదీ ఆ వివాదాస్పద కోటునే వేలం వేసి అందరి నోళ్లకు తాళం వేశాడు. ఇలా ప్రతీ సారి మోదీపై కోపంతో ఆయన ప్రత్యర్థులు సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారు. అందుకు, చక్కటి ఉదాహరణలు పదే పదే వస్తోన్న ఎన్నికల ఫలితాలు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్సే అంతిమ లిట్మస్ పరీక్ష కదా...  బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఓడిన మోదీ అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే స్థానిక, ఉప ఎన్నిక, సాధారణ ఎన్నికల్లో గెలుస్తూ, బీజేపిని గెలిపిస్తూ వస్తున్నాడు. ఇది ఆయన పట్ల జనంలో చెక్కుచెదరకుండా వుంటోన్న నమ్మకానికి నిదర్శనం. అదే ఇప్పుడు డీమానిటైజేషన్ తరువాత కూడా జరుగుతోంది. ఒకవైపు మమత బెనర్జీ తాను మోదీని రాజకీయాల్లోనే లేకుండా చేస్తానని కంకణం కట్టుకుంటే మరో వైపు అరవింద్ కేజ్రీవాల్ క్యూలైన్లలో వందల మంది చనిపోయారని వాపోతున్నాడు. రాహుల్ అయితే ఏటీఎంల వద్దకొచ్చి నానా హంగామా చేస్తున్నాడు. మన సీపీఐ నారాయణ లాంటి లోకల్ నాయకులైతే మోదీని ఉరి తీయాలి లాంటి బాంబులు పేలుస్తున్నారు. మీడియా ఛానల్స్ కూడా అలుపెరగక జనం బ్యాంకుల ముందు పడుతున్న కష్టాల్ని లైవ్ లో చూపిస్తున్నాయి. ఇంత జరిగినా మహారాష్ట్ర, గుజరాత్ ఎన్నికల్లో భారీ విజయాలు వరించాయి మోదీ సేనని! ఇది దేనికి సంకేతం?  చిన్నా చితక ఎన్నికల్లో గెలిచిస్తే 2019 సాధారణ ఎన్నికల్లో కూడా మోదీ గెలుస్తాడని అర్థం కాదు. రెండో సారి ప్రధాని అవుతాడని భరోసా లేదు. కాని, ఆయన్ని వ్యతిరేకించే వారు ఫెయిల్ అవుతున్నది ఆయన వల్ల జనానికి కలిగిన నష్టం అర్థమయ్యేలా చెప్పటంలో! ప్రతిపక్ష నేతలు, మీడియా అంతా జనం ఇబ్బందుల గురించే మాట్లాడుతున్నారు. కాని, పరిష్కారాలు వారి వద్ద కూడా లేవు! ఇక మమత బెనర్జీ, కేజ్రీవాల్ చెప్పినట్టు ఇప్పుడు పాత 500, 1000 నోట్లు తిరిగి వాడుకలోకి తేవటం అసాధ్యం. అలా జరగాలని మామూలు జనం కూడా కోరుకోవటం లేదు! మరి ఇలాంటి పరిస్థితుల్లో ఊరికే మోదీని తిట్టిపోసే నేతల వల్ల జనానికి ఏం లాభం? అందుకే వారు నరేంద్ర మోదీని మరింత నమ్ముతున్నారు. మంచికో, చెడుకో ఆయన సాహసం చేసి నోట్లు రద్దు చేశాడు. తరువాత జరగాల్సిన ఏర్పాట్లు సరిగ్గా జరగలేదు. జనం తీవ్ర ఇబ్బందులే పడ్డారు. పడుతున్నారు. అయినా కూడా మోదీ నల్లధనం పై తాను చేస్తోన్న పోరులో రోజుకో కొత్త నిర్ణయంతో దూసుకుపోతున్నాడు. ఎక్కడికక్కడ బ్లాక్ మనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని సామాన్యులకి నమ్మకం కలిగిస్తున్నాడు. ఇదే ఆయన సక్సెస్ కి సీక్రెట్ అనుకోవాలి...  అమాంతం 86శాతం కరెన్సీ మార్కెట్లోంచి మాయమైపోతే కష్టం ఖచ్చితంగా వుంటుంది. కాని, ఆ కష్టం తాత్కాలికమని జనం భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే తెలంగాణలోని సిద్దిపేట రైతు బజార్లో ప్రభుత్వం స్వైప్ మిషన్ ఏర్పాటు చేసింది. లావాదేవీలు నోట్లు అక్కర్లేకుండా జరుగుతున్నాయి. అటు గుజరాత్ లోని పెద్ద పెద్ద గుళ్లలో హుండీల్లో వేసే సొమ్ము ఇప్పుడు స్వైప్ మిషన్ల ద్వారా దేవుడికి చెల్లిస్తున్నారు! తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎన్డీఏలో లేని ముఖ్యమంత్రి, గుజరాత్ లాంటి రాష్ట్రంలో బీజేపి ముఖ్యమంత్రి అంతా ప్రజల కోసం చేయగలిగింది చేస్తున్నారు. ఆల్రెడీ ఇండియా డిజిటల్ ఇండియాగా మారే క్రమం మొదలైపోయింది. కొన్ని రోజుల కిందటి కంటే ఇప్పుడు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయాయి! ఒక భారీ మార్పు కోసం దేశమంతా అయిష్టంగానైనా ముందుకు సాగుతోంది. ఈ అనివార్యతే మోదీ వ్యతిరేకుల కంటే మోదీని రేసులో వుంచుతోంది...    

మీరు ఐటీనా... ఐతే ఈ గుడ్ న్యూస్ మీకే!

తెలుగు రాష్ట్రాలు... మరీ ముఖ్యంగా, హైద్రాబాద్ అంటే ఎవరికైనా వెంటనే ఏం గుర్తుకు వస్తుంది? ఐటీనే కదా! అసలు ఐటీ రంగం హైద్రాబాద్ లో పురి విప్పిన తరువాత మన నగరం రూపే మారిపోయింది. అంతలా ఐటీ హైద్రాబాద్ ని ఛేంజ్ చేసింది. ఇన్ ఫ్యాక్ట్, కేవలం భాగ్యనగరాన్నే కాదు మొత్తం దేశాన్ని ఐటీ రంగం ఇప్పుడు శాసిస్తోంది. ఇంకా ఎన్ని రంగాలు వున్నా ఐటీ, దాంట్లో లభించే జాబ్స్ అంటే జనానికి భలే క్రేజ్. అయితే, 2017 ఫస్ట్ హాఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ కి పండగేనంటున్నారు ఎక్స్ పర్ట్స్....  ఐటీ రంగం అమాంతం అభివృద్ధి అయింది మన దేశంలో. అందులోకి తొలి నాళ్లలో ప్రవేశించిన వారు ఇప్పుడు సాలిడ్ గా సెటిలైపోయారు. తరువాత కూడా లక్షలాది మంది కంప్యూటర్ల ముందు కూర్చుని వేలాది రూపాయల జీతాలు సంపాదించారు. కాని, గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్దిక సంక్షోభం పుణ్యామాని ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ పెద్దగా ఇరగదీయటం లేదు. ముఖ్యంగా ఇండియాలో ఐటీ స్లో అవ్వడం చాలా ప్రభావమే చూపింది. కొంత వరకూ కంప్యూటర్ కలల్ని తగ్గించేసింది కూడా. సీఏలు, డాక్టర్లు అవ్వాలని, సివిల్స్ లో ర్యాంకులు కొట్టాలని ప్రయత్నించే వాళ్లు ఎక్కువైపోయారు! కాని, ఐటీనే నమ్ముకుని మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న వారికి గుడ్ టైమ్స్ ఆర్ బ్యాక్.... 2016 డిసెంబర్ నుంచి 2017 మార్చ్ మధ్య దేశంలోని వందలాది ఐటీ కంపెనీలు ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నాయట. అయితే, ఇలా కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగాలు భర్తీ చేయటం కొత్తేం కాదు. కాని, ఈసారి ఏకంగా 76శాతం కంపెనీలు కొత్త వార్ని తమ క్యాంపస్ లలోకి ఆహ్వానించనున్నాయట! ఈ విషయం  ఎక్స్‌పెరిస్‌ ఐటీ మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా సర్వే వెల్లడించింది. దాని ప్రకారం దేశంలోనే అత్యధికంగా 34శాతం ఐటీ ఉద్యోగాలు దక్షిణాదిలో భర్తీ కానున్నాయట! మిగిలిన 66శాతం దేశంలోని ఇతర ప్రాంతాల్లో పూరిస్తారట. అంటే, హైద్రాబాద్, బెంగుళూరు లాంటి ఐటీ హబ్స్ లో భారీ ఎత్తున ఉద్యోగాలు చేతికందే అవకాశం వుందన్నమాట...  కొత్తగా లభించే ఉద్యోగాల్లో కొంత ఎక్స్ పీరియన్స్ వున్న వారికి పెద్ద పీట వేసే అవకాశం కూడా వుందట. 3 నుంచి 8 ఏళ్ల అనుభవం వున్న వారికి మరింత మంచి ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు. మరో వైపు, ఐటీ రంగంలో చాలా మందికి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతోంటే సగం కంపెనీలకు అవసరమైన నిపుణులే దొరకటం లేదట! అంటే, సర్టిఫికెట్లు కాకుండా టాలెంట్ కూడా వున్న వారు తక్కువగా వుంటున్నారన్నమాట! సో... మీరు ఐటీ రంగంలోని వారు, కాస్త అనుభవం వున్న వారు, అంతకు మించి టాలెంట్ కూడా వున్న వారైతే... 2017 మార్చ్ లోపు చక్కటి ఆఫర్ ఖచ్చితంగా ఆశించవచ్చన్నమాట!  

ధర్మ యుద్ధంలో మాదిగల్ని... వెంకయ్య గెలిపిస్తారా? 

భారతదేశంలో కులం అత్యంత శక్తివంతమైంది. నిజానికి అందరూ మతం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు కాని... కులం దాని కంటే రెట్టింపు ప్రభావం చూపుతుంది సమాజం పైన! ఎన్నికలొస్తేనైతే కులం చెలరేగిపోతుంది. మంచితనం, అర్హత లాంటివేవీ కులం ఇప్పించినంతగా బీపారాలు ఇప్పించలేవు. పదవులు తెచ్చిపెట్టవు. అందుకే, మన నేతలు కులాన్ని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు...  భారతదేశంలో కులం అంతకంతకూ బలపడటానికి అనేక కారణాల్లో ఒకటి రిజర్వేషన్! అసలు రిజర్వేషన్లు పెట్టింది సదుద్దేశంతోనే అయినా రాను రాను అవ్వి ఎన్నికల ఎజెండాలో భాగమైపోయాయి. ఇంతవరకూ రిజర్వేషన్స్ పొంది లాభపడ్డ వారు గణనీయంగానే వున్నా ఇంకా పేదరికంలో మగ్గుతోన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బోలెడు మంది వున్నారు. ఇక ఓసీల్లోని పేదల సంగతైతే మాట్లాడేదే లేదు! వాళ్లను మరింత దయనీయ స్థితి....  రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటే అందరూ ఖచ్చితంగా ప్రస్తావించేది మాదిగల పోరాటం. మంద కృష్ణ మాదిగ ఎప్పట్నుంచో ఎస్పీ వర్గీకరణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయనతో మాదిగలు వుంటే మాలలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తక్కువ కులాల వారికి రిజర్వేషన్లను అగ్ర కులాల వారు వ్యతిరేకించటం లాంటిదే ఈ అభ్యంతరం కూడా. మాలలు మాదిగల కన్నా సామాజికంగా, ఆర్దికంగా, విద్యాపరంగా ముందు వున్నారు కాబట్టి వారికి తక్కువ రిజర్వేషన్స్ , మాదిగలకు ఎక్కువ రిజర్వేషన్స్ రావటం ... ఎలా చూసినా సబబే! కాని, ఇప్పుడున్న రిజర్వేషన్ పద్ధతి యధాతథాంగా కొనసాగించాలని ఎస్సీల్లోని కొన్ని కులాలు కోరుకుంటున్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని పార్టీలు వీలైనప్పుడల్లా వాడుకున్నాయి. కాని, అధికారంలోకి వచ్చాక అందుకు తగిన ప్రయత్నం మాత్రం చేసినట్టు కనిపించదు. అయితే, తాజాగా జరిగిన ఎమ్మార్పీఎస్ ధర్మయుద్ధం సభ సాక్షిగా ఒక్కటి మాత్రం క్లియర్. కాంగ్రెస్, బీజేపి, సీపీఐ... ఇలా అన్ని పార్టీలు వర్గీకరణకు అనుకూలమే. అయినా పార్లమెంట్లో మాత్రం రాజ్యాంగ సవరణ జరగటం లేదు. ఎందుకు? రెండు దశాబ్దాలుగా మాదిగలు పోరాటం చేస్తున్నా ఎందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదు? కారణం ఓట్లు! వర్గీకరణ చేస్తే ఎస్సీల్లోని చాలా కులాల ఓట్లు కోల్పోవలసి వస్తుంది. అందుకు ఏ అధికార పార్టీ ఎప్పుడూ సిద్ధంగా వుండదు... వెంకయ్య నాయుడే మాదిగల రిజర్వేషన్ డిమాండ్ సాకారమయ్యేలా చూడాలని మంద కృష్ణ తాజాగా అన్నారు. ఆ మధ్య ఆయన ఢిల్లీలో వెంకయ్యకి పాదాభివందనం కూడా చేశారు. దాని గురించి కృష్ణ వివరణ ఇస్తూ మాదిగల సంక్షేమం కోసం కాళ్లు మొక్కడం తప్పేం కాదని చెప్పారు. ఆ సంగతి ఎలా వున్నా ఇప్పుడు అధికారంలో వున్న బీజేపి కూడా ఎస్సీ వర్గకరణ అంశాన్ని తనదైన స్టైల్లో వాడుకుంటోందని సుస్పష్టం. ఆ ఉద్దేశమే లేకపోతే మాదిగల సభకి వెంకయ్య నాయుడు హాజరయ్యేవారే కాదు. ఇప్పుడు ఎలాగూ హాజరై తమ మద్దతు ప్రకటించారు కాబట్టి జనం కోరుకుంటున్నట్టు త్వరగా వర్గీకర్ణణ బిల్లు పార్లమెంట్లోకి తెస్తే ... అదన్నా ఒక చారిత్రక నిర్ణయం అవుతుంది. అలా కాకుండా మంద కృష్ణతో సహా లక్షలాది మంది మాదిగలు పెట్టుకున్న నమ్మకాన్ని వెంకయ్య, బీజేపి కూడా వమ్ము చేస్తే ... అది రాజకీయ కుల క్రీడ మాత్రమే అవుతుంది...  

ఆయన అమెరికాని... 638సార్లు ఓడించాడు! 

  ఫిడెల్ క్యాస్ట్రో .... క్యూబా అనే ఒక చిన్న దేశానికి యాభై ఏళ్ల పైచిలుకు సారధ్యం వహించిన ఒక 90ఏళ్ల వృద్ధుడు! ఆయన సహజ కారణాలతో చనిపోతే ప్రపంచం అంతా చర్చించుకోవాల్సిన అవసరం ఏం వుంది? మామూలుగా అయితే ఏం లేదు! కాని, క్యాస్ట్రో ఎదురించింది అమెరికాని! అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని! అదీ 638సార్లు సీఐఏ చేసిన హత్యా ప్రయత్నాల్ని తట్టుకుని, తిప్పికొట్టి ప్రాణాలతో నిలబడగలిగాడు! తన దేశాన్ని అమెరికన్ క్యాపిటలిస్టు మర్రి చెట్టు నీడలో కూడా సజీవంగా నిలపగలిగాడు.... అందు కోసం పిడెల్ గురించి మాట్లాడుకుంటోంది ప్రంపంచం! రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు అమెరికా తలుచుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం రాజేయగలదు! దేశాలకు దేశాల్నే కుప్పగూల్చేయగలదు. సిరియా, లిబియా... ఇలా బోలెడు ఉదాహరణలు! కాని, అమెరికన్ మైటీ పవర్ ని తట్టుకుని నిలిచిన దేశాలు కూడా వున్నాయి. తమ అంతర్గత వ్యవహారాల్లో అగ్రరాజ్యాన్ని కనీసం చిటికెన వేలు కూడా పెట్టనీయని అలాంటి అతి కొద్దీ దేశాలే వియత్నాం, క్యూబా లాంటివి! అమెరికా దేశపు నీడలోనే కరేబియన్ దీవుల్లో ఒకటిగా వుంది క్యూబా. దానికి అమెరికన్ పీడ నుంచి విముక్తి కలిగించిన వాడు ఫిడెల్ క్యాస్ట్రో. కమ్యూనిజం, సోషలిజం నమ్ముకున్న ఆయన టీనేజ్ లోనే గన్ను పట్టుకుని విప్లవంలోకి దూకాడు. అమెరికా తొత్తుగా దేశాన్ని పాలిస్తోన్న మిలటరీ నియంత నుంచి స్వేచ్ఛ సాధించాడు. తరువాత 33ఏళ్ల వయస్సులోనే క్యూబా దేశ పగ్గాలు చేపట్టాడు. అమెరికా ఎన్ని కుట్రలు చేసినా సామ్యవాద పంథాలో దేశాన్ని ముందుకు నడిపాడు! ఈ సమయంలోనే ఆయన అర శతాబ్దాపు పాలనలో సీఐఏ క్యాస్ట్రోను వేసేయటానికి ప్రయత్నించని రోజు లేదు! అలా 638సార్లు విఫలయత్నాలు చేసిందట... బహుశా అమెరికాకు ఇంతకంటే దారుణమైన పరాభవం మరొకటి చరిత్రలో ఏదీ లేదనుకుంటా! విషపూరితమైన మాత్రలు ఇవ్వడం, ఆయన కాల్చే చుట్టలో బాంబు అమర్చడం , స్కూబా డైవింగ్ సూట్‌లో డేంజరస్ ఫంగస్‌ను ఉంచడం, విషం నింపిన సిగరెట్లు వంటి ప్రయోగాలతో అంతమొందించేందుకు ప్రయత్నించినా కాస్ట్రో ఖతమ్ కాలేదట! మాఫియా స్టైల్లో కాల్చి చంపేందుకు కూడా సీఐఏ ప్రయత్నం చేసింది కానీ అది వర్కవుట్ కాలేదు! చివరికి క్యాస్ట్రో మాజీ భార్య మారిటా లోరెంజ్ ద్వారా సైతం ఆయన్ను హత్య చేయించేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ నిత్యం అలెర్ట్ గా  ఉండే ఫిడెల్ కాస్ట్రో... అమెరికా కుట్రలన్నీ ధిక్కరించి నిర్భయంగా తిరిగాడు. దేశ బాధ్యతలు తమ్ముడికి అప్పజెప్పే వరకూ క్యూబాను అమెరికాకు పక్కలో బల్లెంలా పదునుగా ముందుకు నడిపాడు....         

తోక వంకర పాక్.... సరి'హద్దు' మీరుతూనే వుంది!

  ఒకవైపు దేశం మొత్తం పాత నోట్లు, కొత్త నోట్లు అంటూ అల్లాడిపోతోంది. మోదీని సమర్థించే వారు నల్లధనం బటయకొస్తుంది అంటూ వాదన వినిపిస్తుంటే వ్యతిరేకించే వారు సామాన్యుల బాధలు ఏకరూవు పెడుతున్నారు. కాని, ఈ గందరగోళం మధ్యలోనే పాకిస్తాన్ తన పాప కార్యాలు చేసుకుంటూ పోతోంది. డీమానిటైజేషన్ కారణంగా మీడియాతో సహా ఎవరూ సరిహద్దు వద్ద హద్దులు మీరుతున్న శత్రుదేశాన్ని పట్టించుకోవటం లేదు...  పదే పదే కాల్పుల విరమణకు తెగబడే పాకిస్తాన్ మొన్నటికి మొన్న దారుణానికి దిగింది. తమ ఆర్మీ బాస్ మారటంతో ఉన్మాదం పెరిగిపోయి మన జవాన్లు ముగ్గుర్ని బలి తీసుకుంది. అందులో ఒకరి తలను కిరాతకంగా నరికారు పాక్ సైనికులు. ఒక దేశ అధికారిక సైన్యానికి చెందిన వారై వుండి ఇలాంటి అమానుష చర్యలు చేయటం కేవలం పాకీలకు మాత్రమే చెల్లుతుంది. యూపీఏ ప్రభుత్వ కాలం నుంచీ మన సైనికుల తలలు నరకటం పాశవిక ఆనందంగా మారిపోయింది పాకిస్తాన్ ఆర్మీకి. అయితే, మోదీ పాలన వచ్చిన తరువాత ప్రతీకార దాడులు కూడా అదే రేంజ్లో జరుగుతున్నాయి. ఆ మధ్య జరిగిన ఉరీ ఉగ్ర దాడికి ప్రతీకారంగానే మన వాళ్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసి రక్తానికి రక్తంతో జవాబిచ్చారు. అయినా పాక్ తోక వంకరగానే వుంటోంది. అందుకే, తాజాగా మరోసారి ముగ్గురు ఇండియన్ సోల్జర్స్ పై గన్నులు ఎక్కి పెట్టింది. అందుకు ప్రతి ఫలం కూడా అనుభవించింది. ఇండియన్ ఆర్మీ జరిపిన వివిధ భీకర దాడుల్లో చాలా ఆర్మీ పోస్టులు బూడిదయ్యాయి. అంతే కాదు, మన వారి లెక్కల ప్రకారం 8మంది పాక్ సైనికులు మరణించారు. మరి కొంత మంది సామాన్య పాక్ పౌరులతో కలిపి మొత్తం 14మంది హతమయ్యారు. ఈ దాడుల్ని పాక్ కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చేసింది...  వారంలో మూడు సార్లు మన డిప్యూటీ హై కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది పాక్ ప్రభుత్వం. ఏ కారణం లేకుండా భారత్ తమ పై కాల్పులు జరుపుతోందని దొంగ ఏడుపులు ఏడుస్తోంది ఆ దేశం. అంతే కాదు, మన వారు చెప్పినట్టు 8 మంది సైనికులు అని ఒప్పుకోకున్నా ముగ్గురు హతమయ్యారని గుండెలు బాదుకోక తప్పలేదు నవాజ్ షరీఫ్ కి! అయితే, ఇంతగా నష్టం జరుగుతున్నా, తమ సైనికులు అకారణంగా ప్రాణాలు విడుస్తున్నా బుద్ది మాత్రం మార్చుకోలేదు పక్క దేశం పాలకులు. కాశ్మీర్ స్వాతంత్ర్య ఉద్యమానికి తమ మద్దతు కొనసాగుతుందని పాత పైత్యం మరో సారి ప్రదర్శించాడు నవాజ్ షరీఫ్!   మన సైనికులు మరణించాక ప్రతీకార దాడులు చేయటం కన్నా అసలు మన వైపు నుంచి ప్రాణ నష్టం సాధ్యమైనంత తక్కువగా వుండేలా చూస్తే బాగుంటుందంటున్నారు సామాన్య జనం. ఇందుకోసం మన ఆర్మీ మరింత అలెర్ట్ గా వుండటం అవసరం. కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా అంతే అవసరం.    

ఓట్ల కోసం... నల్ల నోట్ల జాతర!  

నోట్లు రద్దై దేశమంతా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్లలోకి వచ్చింది. కాని, అసలు నల్లదనం జాతర అయిదేళ్లకోసారి జరుగుతుంది మన దేశంలో! అదేంటో మీకు తెలుసా? ఎన్నికలు!  అవును... ఎలక్షన్స్ వస్తే భారతదేశంలో కరెన్సీ వరద పారుతుంది. మందు సీసాల లోంచి ఘాటైన వాసనగా బయటకొస్తుంది! బిర్యానీ పొట్లాల లోంచి ఘుమఘుమలాడుతూ ఊరిస్తుంది! అసలింతకీ మన ప్రిపేయిడ్ ఎన్నికల నల్ల సత్యాలేంటో మీకు తెలుసా? ఇవి చూడండి ... మీకే కళ్లు బైర్లు కమ్ముతాయి. గ్యారెంటీ...  ఇండియన్ ఎలక్షన్స్ లో అత్యంత ఖరీదైన ఎన్నికలు ఎంపీ సీట్లకు జరిగే పార్లమెంట్ వే! మొత్తం 543 ఎంపీ సీట్లుంటే ఒక్కో సీటుకి సగటున ఎంత ఖర్చు చేస్తారో తెలుసా? దాదాపు 45కోట్లు! ఇలా ఒక్కో నియోజక వర్గం నుంచీ 45కోట్లు గుమ్మరిస్తే మొత్తం దేశంలో ఒక సాధారణ ఎన్నికలు పూర్తయ్యేలోగా అయ్యే ఖర్చు... ఇంచుమించూ 25 వేల కోట్లు!  ఎంపీల తరువాత ఆ స్థాయిలో చక్రం తిప్పేది ఎమ్మేల్యేలు. వీళ్ల గాలంతా రాష్ట్రాల లోపలే వీచినా... వీళ్లు కూడా ఒక్కో నియోజకవర్గానికి 25కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట! అంటే దేశంలోని మొత్తం 4,120అసెంబ్లీ స్థానాలకి లక్ష కోట్ల వరకూ ఖర్చవుతోంది. రాష్ట్రాన్ని బట్టీ, పోటీని బట్టీ, అభ్యర్థుల్ని బట్టీ అసెంబ్లీ స్థానాల ఖరీదు మారిపోతూ వుంటుంది. ఒక్కో చోట పది కోట్ల లోపలే వ్వవహారం పూర్తి అవ్వొచ్చు.... ఎమ్మేల్యేలు, ఎంపీలే కాదు... ఎమ్మెల్సీలు, పంచాయతీలు, స్థానిక సంస్థల్లోని ప్రతినిదులు కూడా భారీగానే ఓట్లు ఖరీదు చేస్తున్నారు. అందరూ డబ్బుల వరద పారిస్తారనే చెప్పకపోయినా అలా చేయకపోతే గెలిచే సీన్ లేదని మాత్రం చెప్పొచ్చు. అందుకే, మనకు ఏవో చిన్న చిన్న ఎన్నికలుగా కనిపించే వాటికి కూడా లక్ష కోట్లు ఎగిరిపోతున్నాయి!  ఇలా ఒక్కో రకం ఎన్నికలకి ఒక్కో రేంజులో కాసుల కాల్వలు తవ్వి మన నేతలు నల్ల సేద్యం చేస్తున్నారు. ఒక్కసారి అధికారపు పంట ఈ ప్రీపెయిడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల చేతికి వచ్చిందా.... అయిదేళ్ల పాటూ కోతలే కోతలు! పెట్టిన డబ్బులకి కనీసం డబుల్ దండుకునే దాకా దున్నటం ఆపటం లేదు! అయిదేళ్లలో అన్ని ఎన్నికలకు కలిపి దేశంలో 2,25,000కోట్లు చేతులు మారుతున్నాయట! ఇదంతా ఎవ్వరూ ఎవ్వరికీ రసీదులు రాసి ఇవ్వని బ్లాక్ మనీనే! ట్యాక్స్ తో సంబంధం లేని సీక్సెట్ హనీనే! మరి ఇదంతా కేవలం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల పాపమే అనుకుంటున్నారా? అదేం కాదు! అన్ని పార్టీలకూ వందల కోట్ల విరాళాలు వచ్చి చేరుతున్నాయి. వాటికి లెక్కా పత్రం అంటూ వుండదు. 20వేల కన్నా తక్కువ చందాలకు పార్టీలు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాతల పేర్లు, కంపెనీల వివరాలు చెప్పాల్సిన పనిలేదు. అందుకే, బీజేపీ, కాంగ్రెస్ లతో సహా మన పార్టీలు అన్నీ 20వేల కంటే తక్కువ వసూళ్లే చేసినట్టు రికార్డ్ లు చూపుతాయి! నిజంగా మాత్రం వీటి వద్ద మూలుగుతున్న వందల కోట్లకు ఎలాంటి అధికారిక లెక్కలు లేవు! నల్లధనం పై యుద్ధం ప్రకటించిన మోదీ పార్టీ అయిన బీజేపి వద్దే మార్కెట్లోని 44శాతం బ్లాక్ మనీ ఫండ్ గా వుందంటారు. అలాగే, కాంగ్రెస్ ఆ తరువాతి స్థానంలో 39.4శాతం ఫండ్ కలిగి వుందట! సీపీఎం వద్ద 8శాతం, బీఎస్పీ వద్ద 4.4శాతం, ఎన్సీపీ వద్ద 3.7శాతం, సీపీఐ వద్ద 0.2 శాతం పార్టీ ఫండ్స్ వున్నాయట! ఇక డబ్బులుగా మాట్లాడుకుంటే మన పెద్ద పెద్ద పార్టీల వద్ద వున్న విరాళాల మొత్తం ... 813.6కోట్లు. అందులో 565.8కోట్లు అజ్ఞాత దాతలు ఇచ్చారంటూ అన్ని పార్టీలు కూడబలుక్కుని వివరాలు దాచేస్తున్నాయి. అంటే... ఇదంతా కూడా ఒక విధమైన బ్లాక్ మనీనే! జాతీయ పార్టీలు, ఉత్తరాది పార్టీలే కాదు... మన తెలుగు రాష్ట్రాల పార్టీలు కూడా తక్కువేం తినలేదు. ఎన్నికలు వస్తే దశల వారీగా, దళాల వారీగా తిన్నోడికి తిన్నంత తినిపిస్తున్నాయి! మన దగ్గర అసెంబ్లీ స్థానం గెలవాలంటే గరిష్టంగా 26కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట రాజకీయ నేతలు. ప్రతీ చోటా అంత చమురు వదలకున్నా... కనీసం 14కోట్లు సమర్పించుకోకుండా ఎమ్మేల్యే అయ్యే ఛాన్స్ లేదట!  తెలుగు ఎంపీలు... గెలిచిన వారు, ఓడిన వారు అంతా కలిసి మనకున్న 42పార్లమెంట్ సీట్లకుగానూ... ఒక్కో నియోజక వర్గానికి 67కోట్ల దాకా ఫ్లష్ చేశారట! అంటే 3వేల కోట్లు లెక్క జమా లేకుండా చేతులు మారాయన్నమాట! తెలుగు స్టేట్స్ లో పార్టీలు ఇచ్చే ఎమ్మేల్సీ బీపామ్ కూడా ఖరీదైందే! ఒక్కో అభ్యర్థి 9కోట్లు వెదజల్లుతున్నాడంటున్నారు! ఓట్లు పడే సమయంలో నోట్ల ప్రవాహం ఆపకుండా .... మామూలు కాలంలో నోట్లు రద్దు చేస్తే లాభం అంతంతమాత్రమే! మోదీ ఇప్పుడు చేసిన నోట్స్ బ్యాన్ రాబోయే ఎన్నికల్లో ఎంత మేర బ్లాక్ మనీని కంట్రోల్ చేస్తుందో వేచి చూడాలి! కాని, పూర్తిగా మందు, బిర్యానీలు లేని ఎలక్షన్స్ ఆమాంతం వచ్చేస్తాయని ఆశించటం మాత్రం అతే అవుతుంది. ఎందుకంటే, సాధారణ జనం పెద్ద ఎత్తున పాల్గొనే జనరల్ ఎలక్షన్స్ కాదు మన దేశంలో టీచర్లు, పట్టభద్రులు పాల్గొనే ఎమ్మేల్సీ ఎన్నికలు కూడా డబ్బులిస్తేనే ఓట్లు వేసే దయనీయమైన స్థితిలో వున్నాయి! చదువు లేని వారికంటే చదువుకున్న వాళ్లలోనే అవినీతి, అలక్ష్యం ఎక్కువగా వున్నాయి. అందుకే, మనం మారాలి. అప్పుడే బ్లాక్ మనీ నుంచి వైట్ మనీ దిశగా దేశం అడుగులు వేస్తుంది!     

అభాగ్యుల దేశంలో... ఆర్భాటపు పెళ్లిల్లు!

  పెళ్లి... ఈ రెండక్షరాల పదం మనిషి జీవితంలో చాలా ముఖ్యమైంది. ఇప్పుడైతే కష్టమైంది కూడా! ఎందుకంటే, పెళ్లిళ్లు అవ్వటం గగనమైపోతోంది సిటీలోని మిడిల్ క్లాస్ జనాలకి. ఇక ఒకవేళ అయినా కూడా పెటాకులవుతోన్న పెళ్లిల్లు కూడా ఎక్కువే వుంటున్నాయి ఈ మధ్య కాలంలో! మొత్తం మీద మ్యారేజ్ అనేది కొందరికి క్రేజ్ గా, కొందరికి డ్యామేజ్ గా, మరి కొందరికి బాండేజ్ గా తోస్తోంది! కాని, మామూలు జనం పెళ్లిని ఒకలా చూస్తోంటే... డబ్బున్న వాళ్లు వెడ్డింగ్ పేరు చెప్పి కోట్లకు కోట్లు గాల్లో ఎగరేస్తున్నారు. గాలి అనగానే మనం ఎవరింటి పెళ్లి హడావిడి గురించి మాట్లాడుకోబోతున్నామో అర్థమైందిగా? గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లి... ఇది నిన్నటి దాకా పెద్ద టాపిక్. కాని, ఇప్పుడు ఆయన మీద జరుగుతోన్న ఐటీ దాడులు హాట్ టాపిక్. కాకపోతే, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారాల పట్టి పెళ్లి అప్పుడే పాతబడిపోయింది! ఎందుకంటే, అంతకంటే గ్రాండ్ గా తన కొడుకు పెళ్లి చేయటానికి మరో బెంగుళూరు కోటిశ్వరుడు రంగంలోకి దిగాడు! గాలి జనార్దన్ రెడ్డి బీజేపి నేత అయితే ఈయనగారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి. స్వయంగా సర్కార్ లో భాగమై వుండి రమేష్ అనే సదరు కాంగ్రెస్ నాయకుడు జనానికి దిమ్మ తిరిగిపోయేలా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడు! ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్లో చిన్న తరహా పరిశ్రమల మంత్రి అయిన రమేష్ పెళ్లి మంటపాన్నే రెండు ఎకరాల్లో ఏర్పాటు చేయిస్తున్నాడట. అంతే కాదు, తన కొడుకు పెళ్లికి దాదాపు లక్ష మందిని వరకూ ఆహ్వానిస్తున్నాడట. ఇక ఎకరాల కొద్దీ స్థలంలో నిర్మించిన పెళ్లి మంటపం మొత్తం ఎయిర్ కండీషన్డ్ కూడా చేయబడుతుందట. అంతే కాదు, ఆదివారం జరగనున్న ఈ గ్రాండ్ మ్యారేజ్ కోసం వీవీఐపీలు హెలికాప్టర్లలో రానున్నారట! వాళ్ల కోసం హెలిపాడ్లు కూడా సిద్ధం అవుతున్నాయి. పెళ్లి మంటపం కొల్హాపుర్ మహాలక్ష్మీ ఆలయం నమూనాలో వుంటుందట! నిన్న గాలి జనార్డన్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి రమేష్... కర్ణాటకలో వరుసగా ఘనమైన వివాహాలు ఆర్భాటంగా జరుగుతున్నాయి. అంతే కాదు, సామాన్యులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద చుక్కలు చూస్తున్నా వీరి పెళ్లిళ్ల హడావిడి ఎంత మాత్రం తగ్గటం లేదు. పైగా అధికార, ప్రతిపక్షాల్లోని కీలక నేతలే ఇలాంటి హంగామాకు తెర తీస్తున్నారు. ఇలాంటి కోట్ల రూపాయల పెళ్లిల్లు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం కాదు. దేశంలోని చాలా చోట్ల వెడ్డింగ్ పేరు కోట్లు వెదజల్లటం మామూలైపోయింది. వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు, క్రీడాకారులు... ఇలా ఎవరికి వారు పెళ్లి అనగానే తలంబ్రాల కన్నా ఎక్కువగా డబ్బులు పైకెత్తి పోస్తున్నారు! బాగా డబ్బున్న వాళ్లు గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోవటం తప్పు కాదు. పైగా దాని వల్ల వాళ్ల వద్ద ఊరికే మూలుగుతున్న ధనమంతా బయటకొచ్చి పెళ్లి జరగటానికి కారణమైన సామాన్యులకి చేరుతుంది! అవసరం అనుకుంటే ఐటీ శాఖ ఈ భారీ పెళ్లిళ్ల కోటీశ్వరుల్ని వివరణ కూడా కోరవచ్చు. కాని, సమస్యల్లా... అసలు ఒకే భారతదేశంలో ఇంత గ్రాండ్ మ్యారేజెస్ జరుగుతోంటే... మరో పక్క శవాలు వాహనంలో తీసుకెళ్లటానికి, తమ వార్ని దహనం చేయటానికి డబ్బులు లేని కఠిక దరిద్రులు కూడా కోట్లలో ఎలా వుంటున్నారు? గాలి జనార్దన్ రెడ్డి జరిపించిన లాంటి ఆర్భాటపు పెళ్లిల్లు ఒక్కటే ఋజువు చేస్తాయి... మన దేశంలో ధనికుడు మరింత ధనికుడు, పేదవాడు మరింత పేదవాడూ అవుతున్నాడు. ఈ వ్వత్యాసం సాధ్యమైనంత తగ్గనంత వరకూ... అభివృద్ధి కేవలం ప్రచారంలో వుండే ఫ్యాషనబుల్ పదం మాత్రమే!     

జన్‌ధన్‌ ఖాతాలకు అందుకేనా డబ్బులు

మోదీగారు పెద్దనోట్ల రద్దు గురించి ప్రకటన చేసి పది రోజులు దాటిపోయింది. రోజులు గడిచేకొద్దీ సర్దుకుంటుంది అనుకున్న సమస్య కాస్తా మరింత తీవ్రతరం దాల్చడం చూసి పాలకులకే అంతుచిక్కడం లేదు. బడాబాబుల సంగతేమో కానీ సామాన్యజనంలో మాత్రం ఈ పరిస్థితి ఆగ్రహాన్నే మిగులుస్తోంది. ప్రభుత్వం ఉద్దేశం మంచిదే అయినా అందుకు తగినంత సన్నద్ధత లేకుండా వ్యవహరించిందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నరు ఉర్జిత్‌ పటేలుగారు ప్రధానిని తప్పుదోవ పట్టించడం వల్లే ఇలా సీన్‌ రివర్స్ అయ్యిందన్న వార్తలు వెలువడ్డాయి.   రఘురామ్‌ రాజన్‌ వంటి సమర్థుడి స్థానంలో ఏరికోరి తెచ్చుకున్న ఉర్జిత్‌బాబు, ప్రధానికి తగిన దిశానిర్దేశం చేయలేకపోయారట. ఈ నేపథ్యంలో నోట్ల రద్దుతో ఏర్పడుతున్న చేదువార్తలతో పత్రికలన్నీ నిండిపోతున్నాయి. వైద్యం అందక ఫలానా ప్రాణం ఆగిపోయిందనీ, పొలం అమ్ముడుపోక ఫలానా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందనీ తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఇక ఎంతకీ జరగని క్యూలు, ఎంతకీ తరగని పోలీసుల కాఠిన్యం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.   బాహుబలి టికెట్ల కోసం కొట్టుకుచావలేదా? దేశం కోసం ఈమాత్రం త్యాగం చేయలేరా?... లాంటి ప్రశ్నలు వినిపిస్తున్నప్పటికీ ఈ కష్టం అకారణం అన్న విమర్శలు కూడా అదే స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఇప్పటిదాకా భాజపాకు అనుకూలంగా ఉన్న పేదవారు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారంటూ నిఘావర్గాలు సైతం ఒప్పుకోక తప్పడం లేదు. గోరుచుట్టు మీద రోకటి పోటులా ఇదే సమయంలో మాల్యా రుణాన్ని మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రజలను మరింత రెచ్చగొట్టేలా ఉంది.   ఇలాంటి నేపథ్యంలో జీరోబ్యాలెన్స్‌ ఉన్న జన్‌ధన్‌ ఖాతాలలలో పదివేల రూపాయలు జమచేయనున్నారన్న వార్త ఒకటి చక్కెర్లు కొడుతోంది. దాదాపు ఆరుకోట్ల వరకూ ఉన్న ఇలాంటి ఖాతాలలో పదేసివేలు జమచేయాలంటే ప్రభుత్వం అరవైవేల కోట్ల వరకూ వెచ్చించాల్సి ఉంటుంది. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ముందు ఇదేమంత ఖర్చు కాదంటున్నారు నిపుణులు. ఇలాంటి తాయిలం వల్ల పేదలు తిరిగి తమ వైపు మొగ్గుచూపుతారన్నది ప్రభుత్వ ఆలోచన కావచ్చు. మరోపక్క ఇది బ్యాంకింగ్‌ వ్యవస్థను కూడా బలపరిచే సూచనలు ఉన్నాయి. ప్రజలకు ఖాతాలను నిర్వహించుకునే అలవాటు చేయడం వల్ల వారిని బ్యాంకుల వైపు తిప్పుకోవచ్చు.   జన్‌ధన్‌ ఖాతాలో వేలరూపాయల జమచేయడంతో పేదల ఆగ్రహం కొంతవరకు ఉపశమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చర్యతో, తమ మేలు కోసమే ప్రభుత్వం నల్లనోట్లని రద్దు చేసిందన్న నమ్మకం వారిలో కలగకతప్పదు. ఇక మధ్యతరగతివారి కోసం మోదీగారు ఎలాంటి తాయిలాలను ప్రకటిస్తారో చూడాలి. వారిని కూడా మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తారా లేకపోతే వారి కోపం తాటాకుమంటలా తాత్కాలికం అని పట్టించుకోకుండా వదిలేస్తారో అన్నది త్వరలోనే తేలిపోనుంది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం... భారత వీర నారీ దివస్!

  నవంబర్ 19... ఈ రోజుకి వున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇవాళ్ల అంతర్జాతీయ పురుషుల దినోత్సవం! కాని, భారతదేశానికి సంబంధించినంత వరకూ అసలు సిసలు భారతీయ నారీ దివస్! ఎందుకలా అంటారా? ఇవాళ్ల జన్మించిన ఇద్దరూ వీర నారీమణుల్ని ఒక్కసారి తలుచుకుంటూ సరిగ్గా అర్థం అవుతుంది! నవంబర్ 19న ఎవరు పుట్టారో తెలుసా? ఇందిరా గాంధీ! అవును, ఇప్పటి వరకూ మన దేశాన్ని పరిపాలించిన అందరు ప్రధానుల్లో ఎంత వివాదాస్పదురాలో అంత ధృఢ సంకల్పం కూడా గల ధీర వనిత! ఆమె గురించి రాజకీయంగా వినిపించే విమర్శలు పక్కన పెడితే ఆమె తన పదవి కాలంలో చేసిన గొప్ప పనులు చాలా వున్నాయి. ముఖ్యంగా, బ్యాంకుల్ని రాత్రికి రాత్రి జాతీయం చేసిన ఆమె తెగువ ఇప్పటి మన ఆర్దిక రంగ పటిష్ఠతకి నేరుగా కారణం. బ్యాంకుల్ని ఇందిర జాతీయం చేయకపోయి వుంటే ఇవాళ్ల మన ఆర్దిక పరిస్థితి మరోలా వుండేది. అలాగే, ఆమె అత్యంత సాహసంతో బంగ్లాదేశ్ ను విడదీసి పాక్ ను రెండు ముక్కలు చేసి వుండకపోతే మనం ఈ రోజు మరింత ఉక్కిరిబిక్కిరి అయ్యేవాళ్లం. కేవలం పశ్చిమాన మిగిలి వున్న పాకిస్తానే మనకు ఎన్నో సమస్యలు సృస్టిస్తోంది. అదే పాక్ బంగ్లాదేశ్ ప్రాంతాన్ని కూడా కలుపుకుని తూర్పున వుండి వుంటే మనం ఇరువైపులా సతమతం అయ్యేవాళ్లం. ఇక ఇందిరా గాంధీ చేసిన మరో గొప్ప పని ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పారేయటం. అందుకు ఆమె ప్రాణాల్నే బలిచ్చుకోవాల్సి వచ్చింది. అయినా కూడా ఆమె త్యాగం వల్లే ఇవాళ్ల పంజాబ్ ఖలిస్తాన్ కాకుండా భారత్ లో అంతర్భాగంగా మిగిలి వుంది! తన నిర్ణయాలతో ఆధునిక భారతదేశాన్ని ఎన్నో విధాల ప్రభావితం చేసిన ఇందిర ఎమర్జెన్సీ ద్వారా శాశ్వత అపకీర్తి కూడా మూటగట్టుకుంది. ఇక ఇదే రోజు జన్మించిన ... జాతిని ప్రభావితం చేసిన మరో మహిళా మణిపూస ఝాన్సీ లక్ష్మీ భాయి. ఈమెవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని, దురదృష్టవశాత్తూ మన పాఠ్యపుస్తకాలు లక్ష్మీభాయి గురించి చెప్పాల్సినంతగా చెప్పవు. ఆమె బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక రాణి అంటూ అందరికీ తెలుసు. కాని, అంతకంటే ఇంకా ఎక్కువగా ఎవ్వరికీ ఏమీ తెలియదు. అదే విషాదం. భారతదేశంలో ఒకప్పుడు సతీ లాంటి అమానుష ఆచారాలు అమలులో వుండేవి. స్త్రీల మీద దారుణమైన అణిచివేత వుండేది. కాని, అదే సమయంలో భారతీయ సమాజం ఝాన్సీ లక్ష్మీ భాయి లాంటి పోరాట యోధురాల్ని ప్రపంచానికి అందించింది. ఆమె యుద్ధ రంగంలో దిగి సివంగిలా వేటాడింది. ఇది మన దేశానికి వున్న మరో కోణం. అంతా అనుకున్నట్టు ఇక్కడ స్త్రీ ఎప్పుడూ అణిచివేతకు, దోపిడీకీ మాత్రమే గురికాలేదు. ఎన్నో రంగాల్లో ఎంతో సాధించింది. ఝాన్సీ లక్ష్మీ భాయి అందుకు గొప్ప ఉదాహరణ...  ఇందిరా గాంధీ, ఝాన్సీ లక్ష్మీ భాయి ... ఒకే తేదీ నాడు జన్మించిన ఈ ఇద్దరూ దేశానికి గర్వకారణం. అంతకంటే ముఖ్యంగా, భారతీయ సమాజంలో స్త్రీకిచ్చిన స్వేచ్ఛా, సమానత్వం, ప్రాముఖ్యత... వీటన్నటికీ గొప్ప ఉదాహరణలు!

పిక్చర్ అభీ బాకీ హై... డిసెంబర్ 30 తరువాతే అసలు సినిమా!

  ఇప్పుడు ఎవరి నోట్లో విన్నా నోట్ల గోలే! అప్పుడే అటుఇటుగా పది రోజులు కావొచ్చేస్తోంది. 500, 1000 నోట్లు రద్దైపోయాయి. కొత్త నోట్లు రాలేదు. కాని, సామాన్య జనానికి మాత్రం సరికొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. బ్యాంకులు, ఏటీఎంల ముందు లైన్లు కూడా మరీ అంతగా తగ్గినట్టు కనిపించటం లేదు. అడుక్కునే వాడి దగ్గర నుంచీ అంబానీ దాకా అందరూ న్యూస్ లో మాత్రం నిలుస్తున్నారు. చాలా మంది వందలు దొరక్క వేల కష్టాలు పడుతుంటే అంబానీలు, గాలి జనార్దన్ లు మాత్రం హ్యాపీగా గడిపేస్తున్నారని వాదనలు గుప్పుమంటున్నాయి. అసలీ ఆర్దిక అల్లకల్లోలానికి మొత్తానికీ ఎవరు కారణం? మోదీ! మరి మోదీ చేసింది ఆమోదించదగిందేనా?  ప్రపంచపు అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్ గేట్స్ మోదీ నోట్ల రద్దు నిర్ణయం సూపర్ అన్నాడు. ఆయనే కాదు ఇంకా చాలా మంది భేష్ అంటున్నారు. అంతకంటే ఎక్కువ మంది పెద్ద నోట్ల రద్దు పెద్ద పొరపాటు అంటున్నారు. సామాన్యులు కష్టాలు పడుతుంటే నల్లధనం వున్న అసలైన నల్ల మారాజులు సేఫ్ గా వున్నారని కడుపు చించుకుంటున్నారు. నిజంగా ఇప్పుడు మూమూలు జనం పడుతున్న ఇబ్బందులేంటి? ఓ సారి చూద్దామా...  మన దేశంలో మరీ పేద వార్నీ తీసుకుంటే వాళ్లూ ఎప్పుడూ బ్యాంకులు, ఏటీఎంల జోలికి వెళ్లింది లేదు. వాళ్ల రోజు వారీ ఖర్చు ఒక వందని మించటం కూడా గగనమే. అందువల్ల ఈ కఠిక దారిద్ర్యంలో వున్న వారికి మోదీ నిర్ణయం ఎఫెక్ట్ విపరీతంగా వుండదనే చెప్పాలి. వున్నా వాళ్లొచ్చి బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో అయితే నిలబడరు. నిలబడే ఛాన్స్ లేదు. వాళ్ల ఇబ్బంది తగ్గుముఖం పట్టాలంటే ఆ పేదలు ఆధారపడే మధ్య తరగతి వారు టెన్షన్ ఫ్రీ అవ్వాలి. సమస్యంతా వీరికే వచ్చింది. 500, 1000 నోట్లు నెలలో పదే పదే ఉపయోగించేది, ఇప్పుడు ఉపయోగించలేకపోతున్నదీ మిడిల్ క్లాసే. నిత్యావసరాలు కొనుక్కోవటానికి వెళ్లటం మొదలు పెళ్లో, పేరంటమో ఏది అయినా నోట్లు చకచకా బయటకు తీస్తారు మధ్య తరగతి జనం. అందుకోసం ఏటీఎంల వద్ద ప్రత్యక్షమైపోతారు. కాని, ఇప్పుడు మోదీ నిర్ణయం వల్ల ఏటీఎంలు, బ్యాంక్ ల వద్ద క్యూ లైన్లలో గంటల కొద్దీ సమయం నిలబడ్డా రెండు వేలు, నాలుగు వేలకు మించి రావటం లేదు. అందుకే, ఢిల్లీలో కేజ్రీవాల్, మమత బెనర్జీ మొదలు లివింగ్ రూంలో న్యూస్ ఛానల్స్ లోని రిపోర్టర్స్ వరకూ అందరూ హడావిడి చేసేస్తున్నారు. మోదీ తుగ్లక్ అనేదాకా వెళ్లిపోయారు! మోదీ నిజంగా తుగ్లక్ లాగానే ప్రవర్తిస్తున్నాడా? బహుశా కాదనుకుంటా! ఎందుకంటే, మోదీని విమర్శిస్తున్న వాళ్లు చాలా వరకూ ఆయనకు ఎప్పుడూ బద్ధ శత్రువులుగా వుండేవారే. 2002 గోద్రా అల్లర్ల నుంచి మొదలు నమో పై ఈ వర్గానికి కావాల్సినంత కసి. వారు ఆయన తప్పు చేసినప్పుడు తిడతారు. ఒప్పు చేస్తే మరింత దారుణంగా దాడి చేస్తారు. అది వారి బిజినెస్. ఇక మోదీ వ్యతిరేక బ్యాచ్ తో ఈ నోట్ల రద్దు సమయంలో మరి కొంత మంది కూడా కలిశారు. వాళ్లు భారీగా పెద్ద నోట్లు పోగేసుకున్న మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ లేదంటే రిచ్ క్లాస్ జనాలు. వీళ్ల దగ్గర వున్నది బ్లాక్ మనీ కావొచ్చు, కాకపోవచ్చు. కాని, తమ వద్ద వున్న డబ్బులు వాడలేకపోతున్నాం, క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది, రోజు కేవలం 2వేలు, 4వేలు మాత్రమే చేతికొస్తున్నాయి లాంటి ఫ్రస్ట్రేషన్స్ వీళ్ల చేత మోదీని తిట్టిస్తున్నాయి. నిజంగా సామాన్య జనం డబ్బుకి కటకటలాడుతున్నారా అంటే కాదనే చెప్పాలి. ఇంతకు ముందులా ఇప్పుడు డబ్బులు గలగలలాడటం లేదంటే. ఫలితంగా రోడ్డు పై పానీ పూరీ అమ్మే వాడు మొదలు బంగారం షో రూముల్లో వజ్రాల అమ్మకునే వాడిదాకా అందరూ డల్ అయిపోయారు. కాని, మోదీని అభిమానించే ఆయన భక్తులు మొదలు కొంత మంది పెద్ద పెద్ద ఆర్దిక వేత్తల దాకా అందరూ చెబుతోన్నది ఒక్కటే. ఈ ఒత్తిడి ఎల్లకాలం వుండేది కాదు. మెల్లమెల్లగా సడలిపోతుంది. క్రమంగా తగ్గుతూ వచ్చి డిసెంబర్ 30తో అంతం అవుతుంది. అమ్మో అన్ని రోజులా అనిపించవచ్చు కాని కేంద్రం తీసుకుంటోన్న చర్యలతో భారీగా ఖర్చు చేయని మధ్యతరగతి మరో పది రోజుల్లో గాడిలో పడిపోతారు. పెళ్లిల్లు , ఫంక్షన్స్ పెట్టుకున్న వారు ప్రెషర్ భరించాల్సి వచ్చినా అదీ 2016తోనే పూర్తైపోతుంది. కొత్త సంవత్సరం సరికొత్తగా వస్తుంది. నల్లధనం భారీ ఎత్తున మాయమైపోయి నిజమైన ఆర్దిక స్వచ్ఛ్ భారత్ ఆవిష్కరణ జరుగుతుంది. అదెలా తెలియాలంటే ఈ అంకెలు అర్థం చేసుకోవాల్సిందే...    మోదీ ఎందుకని 500, 1000 నోట్లని మాత్రమే రద్దు చేశాడు? అదీ అమాంతంగా? కారణం ఇదే... మన దేశంలో మొత్తం చెలామణిలో వున్న సొమ్ము 17.17లక్షల కోట్లు! అందులో పెద్ద నో్ట్ల వాటా 14.61లక్షల కోట్లు! ఇందులో నవంబర్ 8న రాత్రి 8.30కి మోదీ రద్దు ప్రకటన చేసేప్పటికి బ్యాంకుల వద్ద వున్నది 9.5లక్షల కోట్లు. అంటే ఈ తొమ్మిదిన్నర లక్షల కోట్లు అధికారికం అన్నమాట. మిగిలిన 5.11లక్షల కోట్లు రకరకాలుగా బ్లాక్ డాగ్స్ బ్లాక్ చేసేసినవి! వీటి వల్లే మార్కెట్లో ప్రతీ రేటు పెరిగిపోతూ వస్తోంది. ఇన్ ప్లేషన్ అన్నా, ద్రవ్యోల్బణం అన్నా ఇదే. ధరల పెరుగుదల. కొందరి దగ్గర ఇబ్బడి ముబ్బడిగా దొంగ డబ్బు వుండటంతో వాళ్లు ఇష్టానుసారం కొనుగోళ్లు చేస్తారు. వాళ్ల కోసం సినిమా టికెట్ల రేట్లు మొదలు భూముల రేట్ల దాకా అన్నీ పెరిగిపోతాయి. మరి కేవలం తెల్ల సొమ్ము మాత్రమే వున్న సామాన్యుడి పరిస్థితి ఏంటి? పెరిగిపోతోన్న ధరల్ని వింటూ ఏమీ కొనలేక తెల్ల ముఖం వేయటమే. కాని, ఇప్పుడు మోదీ ఆర్దిక సర్జికల్ స్ట్రైక్స్ లో 5.11లక్షల పరుపుల కింద నుంచి , కప్ బోర్ట్ ల నుంచీ, ఫామ్ హౌజ్ ల నుంచీ, ఆఖరుకు కార్ డిక్కీల నుంచీ బయటకు వస్తాయి! రావాలి! డిసెంబర్ 30 దాని కోసమే ఇచ్చిన గడువు! రాకపోతే నల్ల నక్కల దగ్గర వున్న పాత నోట్లు మూతులు తుడుచుకోటానికి కూడా పనికి రావు. మరి అలా డిసెంబర్ 30నాటికి కూడా అలా బయటకి రాని నల్లధనం సంగతేంటి? ఇటు జనానికి, అటు గవర్నమెంట్ కి కాకుండా పోతుందా? కానే కాదు... మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అసలు లాభం 2017 జనవరి ఒకటి నుంచీ మొదలవుతుంది. బ్లాక్ మనీగా వున్న 5.11లక్షల కోట్లలో మహా అయితే 1 లేదా 1.5లక్షల కోట్లు మాత్రమే ఇప్పుడు వైట్ అయ్యే ఛాన్స్ వుంది. మిగతాదంతా దొరల్లా తిరుగుతున్న నల్లధనం దొంగలు తిట్టుకుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ పారేయాల్సిందే. లేదంటే పాతరేయాల్సిందే. అలా మార్కెట్ నుంచి మాయం అయిన దాదాపు 4లక్షల కోట్లు వృథా మాత్రం కావు. నేరుగా గవర్నెమంట్ ఖాతాలో కొత్త నోట్ల రూపంలో చేరిపోతాయి. ఇదీ అసలు లాభం! ఇంత భారీగా సొమ్ము ప్రభుత్వ ఖాజానాకి చేరాలంటే 5వందలు, వెయ్యి నోట్ల రద్దు తప్ప మరే మార్గం లేదు. అందుకే, మోదీ సాహసం చేసి నల్ల త్రాచుల తలపై కొట్టి వాట్ని పుట్టల్లోంచి బయటకు లాగాడు. ఇప్పుడు ఆ నల్లత్రాచులే ఢిల్లీ నుంచీ గల్లీ దాకా విషం చిమ్ముతున్నాయి. డిసెంబర్ 30వరకూ చిమ్ముతూనే వుంటాయి కూడా! బ్లాక్ మనీగాళ్లతో పాటూ... మోదీ పాకిస్తాన్ కు, ఎన్జీవోలకు కూడా మైండ్ బ్లాంక్ చేశాడు. అదెలా అంటే ఈ రద్దు నిర్ణయంతో దేశంలోని పాకిస్తానీ ఏజెంట్ల వద్ద మూలుగుతున్న వందల కోట్లు టిష్యు పేపర్స్ అయిపోయాయి. ఆల్రెడీ కాశ్మీర్ లో రాళ్లు రువ్వే ఉద్యమకారులు లేక కర్ఫ్యూ పోయి సాధారణ పరిస్థితులు నెలకొనటం మనం గమనించాలి. ఎలా పాకిస్తానీ పెద్ద నోట్లు మన దేశంలో పెద్ద సమస్యగా మారాయో చాలా మందికి తెలియదు. అసలు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కన్నా దొంగ నోట్లతో ఎక్కువ భీభత్సం సృష్టిస్తోంది గత కొన్నేళ్లుగా. ఇప్పుడు దానికి నరేంద్రుడు చెక్ పెట్టినట్టే! అంతే కాదు, ఫారిన్ ఫండ్స్ తో నడుస్తూ ఎన్జీవోలుగా చెప్పుకుంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వేలాది సంస్థలకు కూడా నోట్ల రద్దు నోట్లో మాట లేకుండా చేసేసింది. చీటికీ మాటికీ ప్రభుత్వంపై కోర్టకు వెళ్లే స్చచ్ఛంద సంస్థలు మొదలు మత మార్పిళ్లు, జేఎన్ యూలో ర్యాలీలకు కారణం అయ్యి...  ఎన్నో కుట్రలు చేస్తోన్న దుకాణాలన్నీ ఇప్పుడు బంద్ అవుతాయి. కనీసం తగ్గు ముఖం పట్టనన్నా పడతాయి! అంతే కాదు, ఎక్కడో అడవుల్లో వేల కోట్లు దాచేసిన అన్నలు కూడా ఇప్పుడు అయోమయంగా దిక్కులు చూస్తున్నారు. వారి వద్ద వున్న 7వేల కోట్లు విప్లవానికి ఎందుకు పనికి రానీ పేపర్ ముక్కలు అయిపోయాయట! ఇక పైన వారి గన్నులు పేలటం ముందంతా తేలిక కాకపోవచ్చు! ఇలా నల్లధనం మొదలు నల్ల చీకటి ప్రపంచం అరాచకుల వరకూ అందరికీ నానా విధాలుగా చెక్ పెట్టే మోదీ బ్రహ్మాస్త్రామే నోట్ల రద్దు! కాని, ఇందులో జరిగిన కొన్ని లోటుపాట్లే ఇప్పుడే అవకాశవాద రాజకీయ పార్టీలకు అస్త్రాలుగా మారుతున్నాయి....  మోదీ ఆర్దిక సర్జికల్ స్ట్రైక్స్ లో మొదటి తప్పిదం... పెద్ద నోట్లు రద్దు చేయదలుచుకున్నప్పుడు వంద నోట్లు తగినంతగా ఎందుకు అందుబాటులో వుంచుకోలేదు? అలా చేస్తే నల్ల జనాలకు మ్యాటర్ లీకైపోతుంది అనిపిస్తే... కనీసం కొత్త 500, 1000నోట్లు భారీగా ఎందుకు ముద్రించి పెట్టుకోలేదు? ముద్రణకు, తరలింపుకు ఎందుకు తగిన ఏర్పాట్లు చేసుకోలేదు? ఇవన్నిటికంటే అయోమయం కలిగించే విషయం... నల్లధనం పెద్ద నోట్ల వల్ల విజృంభిస్తుందని తెలిసినప్పుడు ఏకంగా 2వేల రూపాయల నోటు ఎందుకు తీసుకొచ్చినట్టు? దాని వల్ల ముందు ముందు నల్లధనం పోగేయటం మరింత ఈజీ అవుతుంది కదా? ఇక టెక్నికల్ గా కొత్త నోట్లు ఏటీఎంల లోంచి రాకపోవటం మరింత ఇబ్బంది పెడుతోంది సామాన్యుడ్ని. కనీసం ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ముందుగా ఊహించలేకపోయారు అంటే... ఈ రద్దు వ్యవహారం రహస్యంగా , ఆదరాబాదరాగా చేశారనిపిస్తోంది. అందుకే, ఉద్దేశ్యం మంచిదైనా అమలు అల్లకల్లోలం అయింది! ఇప్పటికైనా మోదీ కామన్ మ్యాన్ కష్టాలు సాధ్యమైనంత త్వరగా తీర్చేస్తే... అప్పుడు దొరలతో, దొంగలతో, దొరల్లా చెలామణి అయ్యే దొంగలతో ఆయన హ్యాపీగా గేమ్ అడుకోవచ్చు. అందుకోసం... ఆల్ ది బెస్ట్ మోదీ జీ! 

మోదీతో మ్యాచ్ లో గోల్స్ చేస్తున్నాడా? సెల్ఫ్ గోల్సా?

  కొన్ని సార్లు  ప్రత్యర్థి మరీ బలవంతుడు, తెలివైన వాడూ అయితే పెద్ద పెద్ద యోధులు కూడా షాక్ కొట్టినట్టు అనూహ్యంగా తప్పులో కాలేసేస్తుంటారు. మోదీ విషయంలో కేజ్రీవాల్ ప్రవర్తన అలాగే వుంది. దేశ రాజధానిలో కమలాన్ని వికసించనీయకుండా రాత్రికి రాత్రి హీరో అయ్యాడు అరవింద్. కాని, పోను పోను అదే రీతిలో డౌన్ కూడా అయిపోతున్నాడు. మోదీపై పోరు విషయంలో ఒక దాని తరువాత ఒకటి తప్పు చేస్తూ పోతున్నాడు.  మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ భారీ విజయాలు సాధించిన వారే. అయితే, కేజ్రీవాల్ కన్నా మోదీ అనుభవం, నేపథ్యం చాలా పెద్దది. ఆయన ఆరెస్సెస్ లాంటి సముద్రంలో ఈదాడు, బీజేపిలో అంచెలంచెలుగా ఎదిగాడు, గుజరాత్ ను తిరుగు లేకుండా పాలించాడు. ఫైనల్ గా ఎందరు తల కిందులు తపస్సు  చేసిన దేశ ప్రధాని అయ్యాడు. కాని, అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే ప్రభంజనంలో తెలివిగా లాభపడ్డాడు. మొత్తం దేశాన్ని ఏలేద్దామని తొందరపడ్డాడు. ఢిల్లీని కాదని వారణాసిలో భంగపడ్డాడు. మళ్లీ తిరిగొచ్చి జనం ముందు అద్భుతంగా పాసయ్యాడు. కాని, ఇప్పుడూ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. మోదీ మీద కాన్సన్ ట్రేషన్ తో అసలుకే మోసం తెచ్చుకుంటున్నాడు. అందుకు నోట్ల రద్దు వ్యవహారమే తాజా ఉదాహరణ...  అరవింద్ కేజ్రీవాల్ కి , ఆయన్ని అభిమానించే వారికి నచ్చకపోయినా మోదీ ప్రై మినిస్టర్ అన్నది నిజం. కేజ్రీవాల్ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కూడా లేని ఢిల్లీకి సీఎం. ఇది కూడా సత్యమే! కాని, ఏకే ఆ తేడాని మరిచిపోయి తహతహలాడుతుంటాడు. దేశంలో కేసీఆర్, చంద్రబాబు లాంటి ముప్పై మంది సీఎంలు వున్నారు. వాళ్లెవరూ తమ అసెంబ్లీలలో 500, 1000 నోట్ల రద్దుపై తీర్మానం చేయలేదు. ఎందుకని? ఈ ప్రశ్న వేసుకోకపోవటమే కేజ్రీవాల్ ఆవేశానికి కారణం! డిల్లీలో కేజ్రీ ఓ తీర్మానం చేసేశాడు. నోట్ల రద్దుపై రాష్ట్రపతికి కంప్లైంట్ కూడా చేశాడు. దీని ద్వారా ఆయన అత్యధిక జనానికి ఇవ్వదలుచుకున్న సంకేతం ఏంటి? నల్లధనం, అవినీతి అంటూ అధికారంలోకి వచ్చిన ఆయన ఇవాళ్ల మోదీ బ్లాక్ మనీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తప్పుబడుతున్నాడు. అంతకంటే దారుణం... దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు! ఇప్పుడు ఏటీఎంలు, బ్యాంక్ ల ముందు బిజీగా వున్న జనం ఇదంతా పట్టించుకోకపోవచ్చు కాని... కొంత చిల్లర చేతుల్లో పడ్డాక అరవింద్ చేసిన పనుల గురించి ఆలోచిస్తారు. ఊరికే నోట్ల రద్దుని కుంభకోణం అనటం, పాత నోట్లే మళ్లీ కావాలని అనటం... ఇవన్నీ ఢిల్లీ సీఎం తనని తాను నల్ల ధనం పోగేసిన వారి తరుఫున నిలబెట్టుకోవటమే అవుతుంది. అంతే తప్ప ఆమ్ ఆద్మీకి ఇలాంటి మోదీ వ్యతిరేక పోరాటం వల్ల లాభం వుండదు! అరవింద్ కేజ్రీవాల్ మోదీని వ్యతిరేకించ కూడదా? నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోవాలా? అస్సలు కాదు. కేజ్రీవాల్ అయినా, రాహుల్ గాందీ అయినా, మమత, ఏచూరీ ఎవరైనా ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కాని, అది చేసే క్రమంలో సోషల్ మీడియా వచ్చేసి బాగా తెలివి మీరిపోయిన జనంలో తప్పుడు సంకేతాలు పంపకూడదు. కొత్త నోట్లు లేక జనం ఇబ్బంది పడుతున్నారన్నదే ముఖ్యం తప్ప పాత నోట్లు మళ్లీ కావాలని అనటం హాస్యప్పదం. అసలు పాత 500, 1000 నోట్లు తిరిగి చెలామణి కావాలని మామూలు జనం ఎవ్వరూ కోరటం లేదు. ఏటీఎంలు, బ్యాంక్ ల వద్ద క్యూ లైన్ల బాధ తప్పితే చాలనుకుంటున్నారు. అంతే కాదు, ఇలా ఇంకో రెండ్రోజులు ఇబ్బంది పడ్డా నల్లధనం పీడ విరగడ కావాలని, మోదీ అందు కోసం ప్రయత్నిస్తున్నారని అనుకుంటున్నారు. ఒకవేళ మోదీ ఉద్దేశ్యం అది కాక బడా కార్పోరేట్లకు లబ్ధి చేయటం అయితే దాన్ని సమర్థంగా నిరూపించాలి. కాని, అరవింద్ కేజ్రీవాల్ రోజుకో ఘాటు వ్యాఖ్యతో మోదీపై కసి తీర్చుకుంటున్నాడు తప్ప సామాన్య జనానికి పెద్దగా దగ్గరవటం లేదు. వాళ్లు క్యూ లైన్లలో బాధపడుతుంటే ఈయన మోదీ ఎప్పుడో గుజరాత్ సీఎంగా 25కోట్లు లంచం తీసుకున్నాడని అర్తం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు! మోదీపై అవినీతి ఆరోపణలు, ఆయన భార్య గురించి కామెంట్స్, తల్లి గురించి వెటకారాలు, 2002 అల్లర్ల విషయంలో సుప్రీమ్  తీర్పునే తప్పుబట్టడం, ఆయన వేసుకున్న కోటు ఖరీదు, ఇక మొన్నటికి మొన్న జరిగిన సర్జికల్ స్రైక్స్ కి సాక్ష్యాలు అడగటం... ఇవన్నీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాయని ఆల్రెడీ చాలా సార్లు ప్రూవ్ అయింది. కాని, ఆమ్ ఆద్మీ వారికి అర్థమైనట్లు లేదు... పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలే జ్ఞానోదయం చేయాలి...   

రాహుల్‌గాంధి వెనకబడుతున్నారా!

  పెద్దనోట్ల రద్దు. ఈ నిర్ణయంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నల్లధనాన్ని తుడిచిపెట్టేందుకు ఇది ఒక అద్భుతమైన చర్య అంటూనే, ప్రభుత్వం మరికాస్త సన్నద్ధంగా ఉండి ఉంటే సామాన్యులకి నోటు కష్టాలు వచ్చేవి కావన్న విమర్శలు వినిపించాయి. తాత్కాలికంగా తిట్టుకున్నా, నోటు కష్టాలు తీరేకొద్దీ ప్రజలు మళ్లీ మోదీ నిర్ణయం వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయంతో దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ప్రధానిగా ఆయన పేరు చిరకాలం నిలిచిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. కానీ నోట్ల రద్దు సందర్భంగా ఏర్పడిన అసౌకర్యాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకోవడంలో రాహుల్‌ గాంధి విఫలం అయ్యారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.   నోట్ల రద్దు విషయంలో రాహుల్‌ ప్రతిస్పందనలన్నీ తూతూమంత్రంగానే సాగాయి. పాత నోట్లని మార్పిడి చేసుకునేందుకు సామాన్యులతో పాటు క్యూలో నిల్చొన్నా, ఆ చర్య ఆశించినంత ప్రచారాన్ని అందించలేదు. పైగా ‘స్కాముల్లో కోట్లు దోచుకున్నవారు ఇప్పుడు బ్యాంక్‌ లైన్లో నిలబడాల్సి వస్తోందంటూ,’ మోదీ చురకలు అంటించారు. నోట్ల రద్దు విషయంలో కేజ్రీవాల్‌, మమతాబెనర్జీ, సీతారాం ఏచూరి వంటి రాజకీయ నేతలు ప్రదర్శించిన దూకుడు సైతం రాహుల్‌ చూపలేకపోయారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో తొందరపడి మోదీని ‘రక్తవ్యాపారి’ అంటూ విమర్శించిన రాహుల్‌, నోట్ల రద్దు విషయంలో ఏం మాట్లాడాలో తెలియక నాలుగైదు ట్విట్టర్‌ పోస్టులు పెట్టి సరిపెట్టుకున్నారు.   పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే ఏమంత కష్టం కాదు. ముందే కొందరికి ఉప్పందిందన్న ఆరోపణలు, 2000 నోటు వృధా అనే విశ్లేషణలతో నోట్ల రద్దు గురించి నిలదీయవచ్చు. కానీ అదేమీ జరగలేదు. దీంతో సామాన్యుడిలో ఎగసిన అసంతృప్తిని తనకు అనుకూంగా మార్చుకునే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు అయ్యింది. మరో ఏడాది వరకూ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించకూడదంటూ రాహుల్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పటికే విమర్శల పాలవుతోంది. వచ్చే ఏడాదిలో కీలకమైన ఎన్నికలు ఉండటంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు జంకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక నోట్ల రద్దు విషయంలో రాహుల్‌ మెతకదనం చూసి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులే చొరవ తీసుకుని ఉద్యమాలు చేపట్టవలసి వస్తోంది.   పరిణతి చెందిన నాయకుడు తన పార్టీకి భరోసాగా నిలవాలి. అవసరం అయినప్పుడు ప్రభుత్వం మీద విరుచుకుపడాలి. దేశం అంతా ఒక్కతాటి మీద ఉన్నప్పుడు తాను కూడా పాలకపక్షానికి అండగా నిలబడాలి. మరి రాహుల్‌గాంధి వీటిని ఎంతవరకు అనుసరిస్తున్నారో ఆయనకే తెలియాలి.

ఇదో 'భక్తుడి' లేఖ...

ప్రియమైన ప్రధాని మోదీగారికి!     నమోన్నమః .... సార్ నేనెవరో తెలుసా? మీకు తెలిసే అవకాశం లేదు. కాని, నా చుట్టుపక్కల వున్నోళ్లు, అలాగే ఫేస్బుక్, ట్విట్టర్లలో మేమంటే పడనోళ్లు... మోదీ భక్త్ అంటుంటారు! అంటే మిమ్మల్ని గుడ్డిగా సమర్థించే ఒకానొక తెగ అన్నమాట! పాపం మా ప్రత్యర్థులు మమ్మల్ని వెక్కిరించాలని భక్తులు అన్నారుగాని అది చివరికి గొప్ప బిరుదులా తయారైంది. ఇప్పుడు మేం ప్రౌడ్ టు బి మోదీ భక్త్ అని ప్రకటించుకుంటుంటాం! ఇక ఈ విషయం నుంచి అసలు విషయానికి వద్దాం...  మీరు చేసిన పనేమైనా బాగుందా మోదీగారూ? ఎందుకు ఎలాంటి క్లూ ఇవ్వకుండా 500, 1000 నోట్లు రద్దు చేశారు? కనీసం ఓ వారం రోజులు ముందు ప్రకటించాల్సింది! అప్పుడైతే నల్ల దొంగలు తమ డబ్బుల కట్టలకి సున్నం దట్టించి తెల్లగా మార్చుకునేవారు. ఇప్పుడు చూడండి... దిక్కుతోచక నదుల్లో పారేస్తున్నారు. కాల్చేస్తున్నారు. చెత్త కుప్పల్లో విసిరేస్తున్నారు. పాపం ఎంత కష్టపడి నొక్కేసినో దొంగ సొమ్మో మీకేమైనా తెలుసా అసలు? అయినా దొంగ సొమ్ము విలువ తెలియాలంటే మీ లాంటి నిజాయితీపరులకేం తెలుస్తుంది లెండి! మీకేమైనా ఇల్లా, పిల్లల్లా? సంసారుల బాధలు మీకెలా తెలుస్తాయి? కొందరు నల్ల సొమ్ము దాచిన కక్కుర్తిగాళ్ల లేఖితనం మీకెలా తెలుస్తుంది? అబ్బే! మీకు తెలియవు. మన దేశ ప్రధానుల్లో ఇంతగా డబ్బు కక్కుర్తి లేని అమాయక ప్రధానిని మిమ్మల్నే చూస్తున్నాం! ఇదంతా ఒక మోదీ భక్తుడిగా నా బాధనకుంటున్నారా? కానే కాదు... మోదీ అంటే గిట్టని బ్యాచ్ ఒకటి వుంది కదా... వాళ్ల విలాపం! అయినా మోదీగారూ! అసలు మీరు బ్లాక్ మనీ ఎందుకు అరికట్టాలనుకున్నారు? దొంగ నోట్లు ఎందుకు నిర్మూలించాలనుకున్నారు? ఇదే ఇప్పుడు చాలా మంది సో కాల్డ్ లిబరల్ థింకింగ్ వున్న వాళ్ల కష్టం. నష్టం. దుఃఖం. ఇంతకు ముందు ప్రధానుల్లా మౌనంగా వుండి వుంటే ఎంతో బావుండేది. పాకిస్తాన్ నుంచి దొంగ నోట్లు వచ్చేవి. కాశ్మీర్లో రాళ్లు రువ్వే వాళ్ల చేతుల్లో పడేవి. మన సైనికులు, పోలీసుల తలలు రక్తంతో తడిసేవి. అంతేనా? పాకిస్తాన్ అచ్చేసిన దొంగ నోట్లు పట్టుకుని దేశంలో అచ్చోసిన అంబోతుల్లా ఆర్దిక ఉగ్రవాదులు తిరిగేవారు. ఇప్పుడు వారి కదలికలకి చాలా కష్టంగా వుంది. అంతే కాదు, దొంగ నోట్లు కాకుండా దొర నోట్లతోనే లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్జీవోలు, ఇంకా ఇతర సంస్థలు, ఆఖరుకు చిన్నా చితక రాజకీయ పార్టీలు... వీటన్నటికి ఇప్పుడు ఎంతగా ఒళ్లు మండిపోతోందో తెలుసా? మీరు చేసిన నిషేదం వల్ల మత మార్పిళ్లు మొదలు నక్సలైట్ల విప్లవాల వరకూ, ఎన్నికల్లో సారా ప్యాకెట్ల వరకూ ఏదీ కుదరటం లేదు! అంతా మీరే చేశారు... అంతా మీరే చేశారు! పీఎంగారూ! మీ పేరు చెబితేనే అవార్డులు తీసుకుని రోడ్ల మీదకొచ్చే అసహనవాదులు ఇంకా బోలెడు కంప్లైంట్స్ తో వున్నారు ...  మీరు చేసిన నోట్ల రద్దుతో ఇంత కాలం పైసా పైసా కూడబెట్టుకుని కాపాడుకున్న నల్లధనం అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోతోంది. రియల్ ఎస్టేల్ దందాలు మొదలు రియల్ క్రైమ్స్ వరకూ ఎన్నో చేసి నానా గడ్డి తిని చీకట్లో పెట్టిన 500, 1000 ఇప్పుడు వెలుతురు చూసే ఛాన్సే లేకుండా పోయింది! నదుల్లోనో, కాల్వల్లోనో లేదా దేవాలయాల హుండీల్లోనో వేసేయాలి! ఇలాంటి పరిస్థితి తీసుకురావటం మీకు న్యాయమా? మీ దగ్గరే ఓ పాతిక కోట్లు నల్లధనం వుంటే ఇలా చేస్తారా? అందుకే, వచ్చే ఎన్నికల్లో నల్లదనం విలువ తెలిసిన వాడ్ని, స్వయంగా ఒక లక్ష కోట్లన్నా నల్లధనం వున్నవాడ్ని ప్రధానిగా ఎంచుకుంటాం! అప్పుడే దేశంలో ఎక్కడెక్కడో వున్న బ్లాక్ మనీకంతా రక్షణ వుంటుంది!  ఇలా ప్రతిజ్ఞలు చేస్తున్న గొప్ప ప్రజాస్వామిక వాదులు మిమ్మల్ని తుగ్లక్ తో పోల్చుటం మొదలు ఫ్రస్ట్రేషన్ లో బూతులు తిట్టడం వరకూ అన్నీ చేసేస్తున్నారు. ఏమన్నా అంటే... అసలు విషయాలైన దొంగ నోట్లు, నల్లధనం లాంటి మాటలు మాట్లాడకుండా పేదల్ని అడ్డుపెట్టుకుంటున్నారు! ఏటీఎంల దగ్గర , బ్యాంకుల దగ్గర క్యూ లైన్లలో వున్న వారి మీద ఎగబడి ఎగబడి సింపతీ చూపిస్తున్నారు! అసలు మన దేశంలోని మీడియాలో, మేధావుల్లో, పార్టీల్లో, కొందరు సామాన్య జనంలో, సోషల్ నెటిజన్స్ లో ఇంత సింపతీ వుందని మాకెప్పుడూ తెలియదు! బాహుబలి కోసం లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తిన్న జనం ఇప్పుడు వంద నోట్ల కోసం లైన్ లో వుండలేక స్పృహ తప్పిపోతున్నారట! అంతేనా, వెయ్యి రూపాయల పెన్సన్ ఇచ్చే ఆఫీస్ మొదలు వెయ్యి పెట్టి సినిమా చూసే మల్టీప్లెక్స్ దాకా అంతటా మొన్నటి దాకా అందరూ క్యూలు కట్టే వారు. ఇప్పుడు మాత్రం దేశ సంక్షేమం కోసం నోట్లు రద్దు చేస్తే కొత్తవి తీసుకోలేకపోతున్నారు. నరకం చూసేస్తున్నారు. అయినా దేవుడి కోసం పుష్కరాల్లో తొక్కిసలాటలో ఛస్తారు కాని... దేశం కోసం క్యూలు కడతారా? అబ్బే! అలాంటివి అస్సలు చేయరు! మోదీ జీ! నిజంగా ఊళ్లలోని నిరు పేదలు, సిటీల్లోని పూట గడవని వాళ్లు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. వాళ్లను మీరు ఎంత త్వరగా సమస్యల నుంచి బయటపడేస్తే అంత సంతోషం. కాని, సందట్లో సడేమియాల్లా ఈ ఇబ్బందికర సమయంలోనే కొందరు మీ మీదా, మీ భక్తులమైన మా మీద కసి తీర్చుకుంటున్నారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ మొదలు ఈ గల్లీ గల్లీల్లోని కేడీల వరకూ వీళ్లందరిదీ ఒకే వాదన. సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారని. అందుకే, వెంటనే పాత నోట్లపై నిషేధం ఎత్తి వేయాలని! కొత్తవి తొందరగా అందుబాటులోకి తెమ్మనటం కాకుండా పాతవి అడుగుతున్నారంటేనే వీళ్ల దురుద్దేశం తెలుస్తోంది కదా? అసలు ఇబ్బంది బ్లాంక్ అయిపోయిన బ్లాక్ మనీ! ఆ విషయం మీకూ బాగా తెలుసు. అందుకే, గో అహెడ్... ఎలాగూ ఈ నల్లదనం పద్మవ్యూహంలోకి మీరు ప్రవేశించారు. మీ వెంట భక్తులు ఎలాగూ వుంటారు. పద్మవ్యూహాన్ని ఛేదించండి. దేశ ద్రోహులకు మీరు అభిమన్యుడిలా కనిపించే అర్జునుడని నిరూపించండి!                                             ఇట్లు                                      ఒక మోదీ భక్తుడు!   

హోదా దక్కేది ఎవరిది..?

నవ్యాంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావోస్తుంది. ఎన్నికలకు రెండేళ్లకు మించి సమయం లేదు. అధికార టీడీపీని ఎదుర్కొని 2019 ఎన్నికల్లో లబ్ధిపొందడం అంత తేలిక కాదు. అందుకే జనంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మిగిలిన పార్టీలు రెడీ అవుతున్నాయి. రాష్ట్ర విభజన పాపంతో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోగా...ఇక మిగిలింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కాస్తో కూస్తో విజయావకాశాలు జగన్‌కే ఉంటాయి. కానీ జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. పవన్ బయటి నుంచే మద్ధతు ఇస్తాడు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడు అనుకున్నారంతా..   కానీ అనంతపురం సభలో తాను 2019 ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు..ఇదే అనంత నుంచి ఎమ్మెల్యేగా పోటి చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపైనే పోరాటం చేస్తానని చెబుతూ వస్తోన్న పవన్ ఆ దిశగా ఇంకా ముందుకు వెళతానని తెలిపాడు. అయితే అంతకు ముందు నుంచే జగన్ ప్రత్యేకహోదా విషయంలో ఆందోళనలు, సభలు, యువభేరీలు అంటూ దూసుకెళుతున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా పై పోరాటం చేసే  విషయంలో వైసిపి అధినేత జగన్ కు..జనసేన అధినేత పవన్ కు మధ్య అధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. కేంద్రం ప్రత్యేక హోదా అనే పేరునే కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తుండగా...ఈ రెండు పార్టీలు మాత్రం హోదా అంశాన్నే వేదికగా తీసుకుని మందుకు వెళ్తున్నాయ్. ఇంతకీ అంతిమంగా హోదా బరిలో నిలిచేదెవరు?...ఆఖరి పోరాటం లో గెలిచేదెవరు?   ప్రత్యేక హోదా...ఇపుడు రాష్ట్రంలోనే కాదు....రాజకీయపార్టీల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది...కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందా ..ఇవ్వదా అనే అంశాన్ని పక్కన పెడితే...రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక హోదా పై పోరాటం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. కేంద్రం వైపు నుంచి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో స్పష్టత కరువవుతూ వస్తోంటే...రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో మాత్రం...ప్రత్యేక హోదా పోరు విషయంలో క్రమంగా స్పష్టత వచ్చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోదా ప్రధాన అంశంగా మారే అవకాశం కనిపిస్తుండటంతో ఇప్పటిదాకా దారి తెన్నూ లేకుండా...ఎవరికి వారే ప్రత్యేక హోదా పై పార్టీ వేదికల మీద నుంచి వాయిస్ విన్పించిన నేతలంతా..ఇపుడు ఈ ఇష్యూను  ఓన్ చేసుకునే ప్రయత్నంలో బిజీ అయ్యారు .    సాధారణ ఎన్నికల తర్వాత వైసిపికి ప్రత్యేక హోదా అంశం ఆయుధంగా లభించింది. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ హోదా అంశాన్ని హైలెట్ చేయడం ద్వారా వైసిపి నేతలు బాబు సర్కారును ఇరుకున పెట్టేందుకు సీరియస్ గా ప్రయత్నించారు. హస్తిన మొదలుకుని అమరావతి దాకా వైసిపి అధినేత ఈ అంశం పై దీక్షలు..ధర్నాలు చేపట్టారు. తాజాగా విశాఖలో జై అంద్రప్రదేశ్ సభ, యవభేరిల పేరుతో విద్యార్దులకు అవగాహన కల్పిస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా పలు సార్లు వైసిపి నేతలు ఇదే అంశాన్ని హైలెట్ చేసేందుకు ప్రయత్నించారు. బంద్ లు నిరసనల ద్వారా ఈ అంశం పై అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంలో కొంతమేరకు సక్సెస్ అయ్యారు...వైసిపి నేతలు.   ప్రత్యేక హోదా పై తమ దగ్గరున్న ఆయుధాలన్నీ వాడేసిన జగన్ ఇక ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే  సమయంలో ....సీన్ లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంటరయ్యారు. ప్రత్యేక హోదాపై సమరశంఖం పూరిస్తానంటూ... మరోసారి హోదాపై  చర్చకు తెరలేపారు. 2014 ఎన్నికల్లో జనసేనను తెరపైకి తెచ్చినా...పోటీ చేయకుండా బిజెపి, టిడిపిలకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ హోదా విషయంలో అందుకు భిన్నంగా ప్రవర్తించారు. హోదానే తనకు ముఖ్యమని చెప్తూనే బిజెపి.. టిడిపిలకు గుడ్ బై కొట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక రిసెంట్ గా అనంతపురంలో సభలో పవన్ ప్రసంగం అందర్ని అకట్టుకుంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ . 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తానని ఉద్ఘాటించారు. హామీలు వినీ వినీ విసిగిపోయిన తమ భావావేశాలతో ఆడుకోవద్దని కేంద్ర,రాష్ట్ర  ప్రభుత్వలను హెచ్చరించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు అని.. ఉద్రేకాలు పెరిగే స్థాయికి పరిస్థితిని తీసుకురావొద్దని చెప్పారు. హామీలను నెరవేర్చే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఇదే ఇష్యూను తనకు అనుకూలంగా మలచుకుని  వచ్చే ఎన్నికలనాటికి జనసేన అధినేత ఎన్నికల బరిలో దిగుతారు అని ..రాజకీయ విశ్లేషకుల అంచనా....   ప్రత్యేక హోదా పోరాటం క్రెడిట్ అంతా తమ ఖాతాలో పడుతుందని వైసిపి నేతలు అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్  ఎంట్రీ  వైసిపి నేతలకు కోంత మేరకు ఇబ్బందిగా మారింది. తాము రెండు సంవత్సరాలుగా ఈ అంశం పై సాధించిన ఇమేజ్ ను మూడు బహిరంగ సభలతో పవన్ ఎగరేసుకు పోయారని వైసిపి నేతలు అనుకుంటున్నారు. ఇక ఇష్యూ బేసెడ్ గా పవన్ అనంతపురం సభలో కుడా పవన్ తన పవర్ ఫుల్ స్పీచ్ అకట్టుకుంది అంటున్నారు విశ్లేషకులు. మెన్నటి వరకు రాష్ల్ర ప్రభుత్వం పైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైనా కాస్త విరుచుకుపడ్డారు. కేంద్ర ప్యాకేజీని చంద్రబాబు ఎలా స్వాగతించారు అని పశ్నించారు. దీనికి బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తులపై తాను పోరాటం చేయడం లేదు.. విధానాలపై పోరాటం చేస్తున్నానని అన్నారు. జనసేన తొలి ఆఫీస్‌ను అనంతపురంలోనే ఏర్పాటు చేస్తానని చెప్పిన ప్రజలకు అన్యాయం జరిగితే జనసేన చూస్తూ ఉండదు అన్నారు. పవన్ విషయంలో ఆచితూచి స్పందిచాలని అనుకున్నా వైసీసీ ఇక జనసేనను కూడా ఎదుర్కోవటానికి సిద్దం అవుతోంది.   ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి..2019 నాటికి ప్రభుత్వం మీద అంతో ఇంతో వ్యతిరేకత రాక మానదు...దీనిని మరింత పెంచి తన ఎకౌంట్‌లో వేసుకుని ఎలాగైనా అధికారం అందుకోవాలని చూస్తున్నారు జగన్. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు అప్పట్లో అమరావతి, భూసేకరణ తదితర అంశాలను వాడుకుంది వైసీపీ. అయితే అవి అప్పటికప్పుడే.. అందుకే ఎన్నటికి వాడిపోని హోదా అంశాన్ని జగన్ భుజానికెత్తుకున్నాడు. ఇప్పుడు ఆయన దారిలో నడిచేందుకు జనసేన అధినేత పావులుకదుపుతున్నాడు. 2019 నాటికి వీలైనన్ని సినిమాలు చేసి దానితో పాటే ప్రత్యేకహోదా విషయంలో ప్రజల పక్షాన పోరాడి వారి ఆదరణను పొందాలని చూస్తున్నారు. హోదాతో పాటు రాయలసీమ కరువు, గోదావరి మెగా అక్వా ప్రాజెక్ట్‌ల విషయంలో పోరాటం చేయాలని..తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారు జనసేనాని.    పవన్ కానీ జగన్ కానీ సభలు..సమావేశాలు పెట్టడం..జనాన్ని చైతన్యం చేస్తున్నాం అని చెబుతున్నారే కానీ ఇద్దరూ హోదా సాధించే విషయంలో తగిన కార్యాచరణను ప్రకటించడం లేదు. పవన్ ఇప్పటికే మూడు సమావేశాలు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని చెడా మడా వాయించి వదిలిపెట్టాడు..ఒకసారి పాచీపోయిన లడ్డూలు అన్నాడు..మరోసారి మనకు రావాల్సిన వాటా ఇచ్చినందుకు సన్మానాలు చేశారు అన్నాడు తప్పితే హోదా ఎందుకు రాదో..హోదా అనే పదాన్ని కేంద్రం ఎందుకు రద్దు చేయాలనుకుంటుందోనని నిలదీయలేదు. అటు జగన్ కూడా ఎంతసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు బీజేపీ వద్ద చేతులు కట్టుకుంటున్నారని..ప్రతీదానికి రాజీ పడిపోతున్నారని ..ఎన్‌డీఏ నుంచి బయటకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నాడు తప్పితే...ప్రధాన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల విషయంలో పోరాటం చేయడం లేదు. మరి కేంద్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ తప్పించి..ప్రత్యేకహోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్, పవన్‌ల పోరాటం ఎంత వరకు సక్సెస్ అవుతోందో..జనం వీరిని ఏమేరకు ఆదరిస్తారో..అసలు కేంద్రం ఎలాంటి స్ట్రోక్ ఇస్తుందో వేచి చూడాలి.

ట్రంప్‌ విజయంపై భయపడుతున్న అమెరికన్లు..

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ సంచలన విజయం ఆ దేశంలో ఒకవైపు సంబరాలు జరుపుకుంటుండగా అదే రేంజ్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త అధినేత వస్తుంటే నిరససలు జరగడం బహుశా అమెరికా చరిత్రలో ఇదే ప్రథమమేమో. ట్రంప్ విజయాన్ని నిరసిస్తూ నిన్న పెద్ద సంఖ్యలో జనం రోడ్లమీదకు చేరారు. ట్రంప్ వ్యతిరేక బ్యానర్లు, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయన మాకు అధ్యక్షుడు కాదు..దేశంలో విద్వేషానికి చోటు లేదు అంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా ఐటీ కేంద్రం సిలికాన్ వ్యాలీ వాసులు ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది నా జీవితంలో జరిగిన చెడు సంఘటనగా భావిస్తున్నా.. అయితే దీన్ని అంగీకరించకతప్పదు. పరిస్థితులు ఇదివరకటిలాగే ఉంటాయనుకోవడం లేదని ఒక సంస్థ యజమాని ట్వీట్ చేశారు. బహుశా హిట్లర్ అధికారం తీసుకున్నపుడు ప్రజలు ఇలాగే అనుకున్నారా అని మరోకరు ట్వీట్ చేశారు. ఇంకొందరైతే ఏకంగా కాలిఫోర్నియా రాష్ట్రం అమెరికా నుంచి విడిపోతే మంచిదని వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.   అసలు ట్రంప్ అధ్యక్షుడైనందుకు జనం ఇంతగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అది ఆయన నోటి దురుసు వల్లే వచ్చిందనుకోవాలి. దూకుడు, నోటి దురద, జాత్యాహంకార వాగుడు, విద్వేష ప్రచారం, ప్రత్యర్థులను దుమ్మెత్తి పోసే ధోరణితో డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పదంగా మారారు. ప్రచారంలో భాగంగా రోజుకో సంచలన ప్రకటనతో దూసుకుపోయారు. ఈ నెగటివ్ అంశాలనే పదేపదే చూపుతూ మీడియా హోరెత్తించింది. దానికి తోడు వలసవాదుల విషయంలో ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడి స్ధానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి కంపెనీలు చైనా, భారత్, మెక్సికో దేశాలకు చెందినవారిని హెచ్1బీ1 వీసాల ద్వారా అమెరికాకు పిలుపించుకుని తక్కువ వేతనానికి నియమించుకుని పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. హెచ్1బీ1 వీసాలు స్థానిక ఉద్యోగులకు గండికొడుతున్నాయని ఆయన పలు సభల్లో బహిరంగంగానే విమర్శించారు.   అందుకే సిలికాన్ వ్యాలీలో మొదటి నుంచి ఆయనపై సానుకూల స్పందన లేదు. సిలికాన్ వ్యాలీలోని కంపెలనీ అధిపతులకు, అక్కడి టెక్కీలకు మా మొదటి ఛాయిస్ ట్రంప్ కాదని ముందే ప్రకటించేశారు. సాంకేతిక నిపుణులు అమెరికాలోకి వలస రావడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారని..కానీ ఇక్కడ పనులు జరగాలంటే భారత్, చైనా లాంటి దేశాల నుంచి నిపుణులైన టెకీలు కావాలని వారు బలంగా కోరుకుంటున్నారు. వలసలపై నిషేధం విధిస్తే ఇక్కడ లాభాల మాట దేవుడెరుగు కంపెనీలు నడవటమే గగనమంటున్నారు. అందుకే ట్రంప్‌ను పేరుపెట్టి విమర్శించకపోయినా, ఆయన వలస విధానాలను ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర పదజాలంతో తప్పుపట్టారు. ఐటీ పరిశ్రమ మొత్తం హిల్లరీ క్లింటన్‌కు అనుకూలంగా వ్యవహరించింది. ట్రంప్‌కు ఇచ్చిన దానికంటే 114 రెట్లు అధికంగా హిల్లరీకి విరాళాలు అందజేసింది.     సిలికాన్ వ్యాలీ అంటే వ్యాపార అవసరాలు అనుకోవచ్చు కానీ మిగిలిన రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రజలపైనా ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది. ముస్లింలకు, మెక్సికన్లకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సెక్యులరిజం గురించి మాట్లాడేవారు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయన అధ్యక్షుడైతే తమ ఉద్యోగాలు ఊడిపోతాయేమోనని చాలా మంది ఆందోళన చెందారు. ఈ అంశాలను బేరీజు వేసుకున్న మీడియా సహా మిగిలిన సంస్థలు వెలువరించిన సర్వేల్లో హిల్లరీనే అదృష్టం వరిస్తుందని ప్రకటించారు. చివరకు పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ ఐటీ పరిశ్రమ వర్గాలన్నీ హిల్లరీ గెలుస్తారనన్న అభిప్రాయంతోనే ఉన్నాయి. అధ్యక్షురాలైతే ఆమె ముందుగా ఏం చేస్తారా అన్న దానిపై చర్చించుకుంటున్నాయి.    కానీ సర్వేలను, అంచనాలను తలక్రిందులు చేస్తూ..అనూహ్యంగా ట్రంప్ అమెరికా 45వ ప్రెసిడెంట్‌గా ఎన్నికై..అమెరికన్లనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఫలితాలతో షాక్ తిన్న సిలికాన్ వ్యాలీ సహా దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ట్రంప్‌ను అధ్యక్షుడిగా జీర్ణించుకోలేక రోడ్ల మీదకు వచ్చారు. అవునన్నా కాదన్నా ట్రంప్ ఇప్పుడు అమెరికా అధినేత..ఎన్ని ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ఫలితాన్ని మార్చలేమన్న సంగతి అక్కడి ప్రజలు తెలుసుకోవాలి. గెలవాలనే తలంపుతోనే ట్రంప్ ప్రచారంలో నోరు జారారా..? లేదంటే తన మనసులో ఉన్న మాటనే చెప్పారా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు.

1000కీ బై..2000కి హాయ్..భారతీయుడికేం మిగిలాయ్

అయ్యా ..! గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారికి, నల్లధనాన్ని అరికట్టడానికి మీరు 500,1000 రూపాయలు నోట్లు రద్దు చేశారు. బాగుంది చాలా బాగుంది ఇప్పటి వరకు దేశంలో ఎవ్వరూ చెయ్యలేని పనిని మీరు చేశారు.. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను అని చెప్పుకోడానికి చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా దాచుకున్న నల్లదనం పకోడి పోట్లాలకి, పల్లీలు చుట్టుకోడానికి ఇంకా మిగిలిపోతే ఈ చలికాలంలో చలిమంట వేసుకోడానికి తప్ప ఎందుకు పనికి రాదు అని, ఇకపై ఎవ్వరూ పన్నులు ఎగ్గొట్టలేరు అని ప్రభుత్వానికి పన్ను వసూళ్ళు పెరిగి ఆదాయం పెరుగుతుంది అని మంగళవారం రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా మీడియా గొంతు చించుకుని చాలా బాగా ప్రచారం కూడా చేసింది. అయితే దీని వలన నాలాంటి సామాన్యుడికి ఒరిగే ప్రయోజనం ఏంటో నాకు అర్ధం కావట్లేదు.    లంచం ఇవ్వనిదే ఏ పని చెయ్యం అని ప్రతిజ్ఞ చేసుకుని కూర్చున్న ప్రభుత్వ ఉద్యోగుల చేత మా లాంటి వారు ఎలా పని చేయించుకోవాలి. ఇప్పటి వరకు 1000 నోట్లు జేబులో కుక్కుకోడానికి ఇబ్బంది పడిన ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఇబ్బంది లేకుండా... ఇంకా ఎక్కువ డబ్బులు జేబులో కుక్కుకోడానికా మీరు 2000 రూపాయల నోట్లు రిలీజ్ చేసింది. దాని వలన మీ ప్రభుత్వ ఉద్యోగులకి కదా సర్ ఉపయోగం . దానివల్ల మాకేంటి ఉపయోగం. మేము కట్టిన పన్నులతో జీతాలు తీసుకుని అ జీతాలు సరిపోక మళ్ళి మా దగ్గర లంచాలు బొక్కే పందికొక్కులు ఏమో దర్జాగా ఆఫీస్ కి ఆడి కార్లు వేసుకు వస్తే వాళ్ళకి జీతాలు ఇచ్చే యజమానులం అయిన సామాన్య ప్రజానీకం ఏమో ఆర్టీసి బస్సులు ఎక్కి మీ చేత పని చేయించుకోడానికి రావాలా? పన్ను కట్టి జీతం ఇచ్చే యజమాని ఏమో ఎండలో నిలబడాలా? మా డబ్బులు జీతాలుగా తీసుకుని పని చేసే నాయకులూ, ఉద్యోగులు ఏమో ఏసి రూముల్లో కాలు మీద కాలు వేసుకు కూర్చుంటారా?మా సొమ్ము తో మీ ఉద్యోగులు, మంత్రులు ఊరేగుతారా?   జనాలని నిలువుగా దోచుకుని అడ్డంగా బలిసిన ఎన్ని పందికొక్కుల్ని మీరు ఇప్పటివరకు పట్టి బోనులో పెట్టారు లెక్కలు చెప్పండి. గుర్తులేదా పోనీ కనీసం మీకు గుర్తు ఉన్నవి వేళ్ళ మీద లెక్కేసి చెప్పండి? కనీసం వేళ్ళ మీద లేక్కేసుకోడానికి కూడా ఎవరు కనపడటం లేదు కదా సర్..అవినీతి చేసినోడికి శిక్ష పడనపుడు వాడు మళ్ళీ చెయ్యి చాస్తాడు...మళ్ళీ డబ్బు కూడబెట్టుకుంటాడు, జల్సా చేస్తాడు..వాడి పుత్రరత్నాలు తాగి కార్లు వేసుకువచ్చి రోడ్ల మీద తిరుగుతూ జనాభాని తగ్గిస్తారు.. కొన్ని రోజులకి మళ్ళి దేశంలో నల్లదనం పెరుకుపోయింది అని ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన 2000 రూపాయల నోటు రద్దు చేసి 5000 నోట్లు, అ తర్వాత కొన్ని రోజులకి 10,000 రూపాయల నోట్లు రిలీజ్ చేస్తారా?   దీనివలన మాములు మనిషికి ఉపయోగం ఏంటి సర్? దిని వలన ఏ రైతుకి లాభం , ఏ నిరుద్యోగికి ఉపయోగం సర్? ఏ రోజైతే లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వ ఉద్యోగిని అప్పటికప్పుడు ఉద్యోగం ఉడపీకి వాడి ఆస్తులు జప్తు చేసి వాడిని నడిరోడ్డు మీదకి లాగుతారో, ఎప్పుడు అయితే అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన నాయకులని బొక్కలో తోసి మక్కెలు విరగ్గొట్టి పదవులు లేకుండా చేస్తారో? ఎప్పుడు అలాంటి ఒక చట్టం అమలులోకి తెస్తారో... అప్పుడు... అ రోజు మాములు రైతు లాభం సంపాదించుకుంటాడు..ఒక నిరుద్యోగి బాగుపడతాడు..మాములు మనిషి తాను సంపాదించిన దానితో తృప్తిగా బతుకుతాడు...   మీరు అలా చేస్తే మాలాంటి  సామాన్యుడికి ఉపయోగం. అలా కాకుండా మీరు ఎన్ని సార్లు నోట్లు మార్చిన మీ ఖాజానాకి కోట్లు చేరతాయేమోగానీ  మాలాంటి మాములోడికి ఏ ఉపయోగము ఉండదు. ఈ పని చేసి ఒక చాయ్ వాలాకి ఓటు వేసి మేము మంచిపని చేశాము అని గర్వపడేలా చేసి జనం గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారో లేక మిగిలిన రాజకీయ నాయకులలాగా ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఇన్స్ టాంట్ కాఫీ లాగా ఇన్స్ టాంట్ మ్యాజిక్ లు చూపించి మిగిలిన నాయకుల్లాగా మిగిలిపోతారో మీ ఇష్టం.    ఇట్లు, ఒక సగటు భారతీయుడు 

'వందే'మాతరం అంటోన్న సామాన్య జనం!

మోదీ నిర్ణయంతో బ్లాక్ మనీ వున్నోళ్ల మైండ్స్ బ్లాంక్ అయ్యాయి! 500, 1000 నోట్ల రద్దుతో వాళ్లందరికీ లక్ష టెన్షన్లు ఒకేసారి వచ్చిపడ్డాయి. కాని, సామాన్యుల కష్టాలు మరోలా వున్నాయి. చెల్లని 5వందలు, వెయ్యి సరే... దొరకని వంద నోటు సంగతేంటి? అన్నదే కామన్ మ్యాన్ తల నొప్పి అయిపోయింది! ఎప్పుడూ మన్ కీ బాత్ అంటూ జనంతో మాట్లాడే మోదీ ఈసారి మనీ కీ బాత్ చేసేశాడు. పెద్ద నోట్లు రద్దు చేస్తున్నానంటూ దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. కాని, అయిదు వందలు, వెయ్యి లేకుంటే కావాల్సిన వంద మాత్రం మార్కెట్లో అంత తేలిగ్గా దొరకటం లేదు. వున్న ఏకైక దిక్కు పెట్రోల్ బంక్ లే. కాని, అక్కడా నో స్టాక్ బోర్డ్ లు దర్శనమిస్తున్నాయి! అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచీ పంపులు ఏకధాటిగా పెట్రోల్ చిమ్ముతుండటంతో బంక్ లు కూడా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చేసింది! అంతే కాదు, కామన్ మ్యాన్ ఖర్చుల కోసం వంద నోట్ల ఆశతో ఫ్యుయల్ స్టేషన్ కి వెళితే అక్కడా మంద తప్ప వంద దొరకటం లేదు. పెట్రోల్ పోస్తోన్న బంకుల్లో కూడా మొత్తం అయిదు వందల రూపాయల ఇంధనం ఖరీదు చేయాల్సి వస్తోంది. అంతే తప్ప చిల్లర ఇచ్చేది మాత్రం లేదంటున్నారు! మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఎఫెక్ట్ ఎలా వుంటుందో మామూలు జనాలకి ఉదయం నుంచే అవగాహనకి వచ్చేసింది! పాల ప్యాకెట్ కోసం వంద కాకుండా 5వందలు ఇస్తే అమాంతం రిజెక్ట్ అయిపోతున్నాయి. అదే పరిస్థితి టిఫిన్ సెంటర్లు, హోటల్స్ వద్ద కూడా ఎదురయ్యే సరికి సామాన్యుడు పొద్దు పొద్దున్నే చుక్కలు చూడాల్సి వస్తోంది! పాలు, టిఫిన్, కూరగాయలు, బస్ పాసు, ఎంఎంటీఎస్ టిక్కెట్లు... ఇలా అన్నీ చిల్లర వుంటేనే వర్కవుట్ అయ్యే పనులు. కాని, ఇప్పుడు లేనిదే ఆ చిల్లర! వందలు కరువైన సామాన్య జనం ఏటీఎంలు, బ్యాంక్ లకు వెళదామన్నా అవ్వీ క్లోజ్ అనేశారు. సో... ఇప్పుడు రెండ్రోజుల దాకా వున్న కాసింత చిల్లర, పది, వంద నోట్లనే జాగ్రత్తగా వాడుకోవాలి. తరువాత మందలు మందలుగా వెళ్లి ఏటీఎంలపై పడి వందలు తీసుకోవాలి. అంతదాకా ఈ టెన్షన్ తప్పదు! కాని, నల్లధనం , పాక్ సరఫరా చేసిన దొంగ నోట్ల మీద యుద్ధంలో మనమూ ఇలా ఎంతో కొంత ఇబ్బంది పడుతూ భాగస్వాములం అవ్వటం తప్పనిసరి! లేదంటే మొత్తం దేశానికే చేటు జరిగే పరిస్థితులు వచ్చాయి మరి!