ఆందోళనతో గుండెపోటు కారణంగానే ముండే మరణం
posted on Jun 3, 2014 @ 11:24AM
ఈరోజు తెల్లవారు జామున కారు ప్రమాదంలో మరణించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండేకు ప్రమాదంలో ఎటువంటి తీవ్ర గాయాలు అవలేదని, ఆందోళన కారణంగా ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని ఆయన సహచర కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారు వెనుక సీటులో కూర్చొన్న ముండే బయటపడిపోయారని, దానితో తీవ్ర ఆందోళన చెందిన ఆయనకు గుండె పోటు వచ్చిందని తెలిపారు. కారు ప్రమాదం తరువాత ముండే తనకు త్రాగేందుకు మంచినీళ్ళు కావాలని తన సహాయకుడిని అడిగినట్లు చెప్పారు. ఆ మరుక్షణమే ఆయన గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయినట్లు తెలిపారు. ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే ఆయన ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనకు కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేసినప్పటికీ, అయన శ్వాస తీసుకోలేక చనిపోయారని వైద్యులు చెప్పారు.