Read more!

సీఎం కేసీఆర్ మీద విమర్శలు షురూ!

 

 

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో ఇలా విమర్శల పర్వం మొదలైపోయింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కేబినెట్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కాదని, కేసీఆర్ కుటుంబ మంత్రివర్గం అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తండ్రీకొడుకులు, అల్లుడు కలసి సొంత ఆస్తిని పంచుకన్నట్టు మంత్రివర్గాన్ని పంచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. 12 మంది సభ్యులున్న తెలంగాణ మంత్రివర్గంలో కేసీఆర్‌తో కలిపి ముగ్గురు ఆయన కుటుంబానికే చెందినవారు వున్నారని విమర్శించారు. వెనుకబడిపోయిన మహబూబ్‌నగర్ జిల్లాకు కేసీఆర్ కేబినెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని, టీఆర్ఎస్‌కి అత్యధిక సీట్లు ఇచ్చిన జిల్లాకి కేసీఆర్ మొండిచెయ్యి చూపించారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రిపదవులకు అర్హులు కాని సన్నాసులు.. దద్దమ్మలా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితుణ్ణి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాట తప్పడమే కాకుండా మంత్రివర్గంలో కూడా దళితులకు స్థానం కల్పించలేదని విమర్శించారు.