ఏడవలేక నవ్విన సోనియా!
posted on Jun 3, 2014 @ 12:29PM
మొన్నటి ఎన్నికలలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోవడంతో ఆ పార్టీ నాయకురాలు సోనియాగాంధీకి ఏడుపు ఒక్కటే మిగిలింది. మొత్తం దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఏడుపుకి ఒక కారణమైతే, ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ మట్టికరవడం ఏడుపుకి మరో కారణం. తెలంగాణ విషయంలో సోనియాగాంధీకి కేసీఆర్ భలే షాకిచ్చాడు. టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పి ఇప్పుడు చక్కగా ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నాడు.
తెలంగాణ విషయంలో షాకులు తిన్న సోనియా గత కొంతకాలంగా తెలంగాణ ఊసు లేకుండా వున్నారు. తాజాగా తెలంగాణ విషయంలో ఆమె ఏడవలేక నవ్వారు. అదెలాగంటే, జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్కి శత్రువులు, మిత్రులు అభినందనలు తెలియజేస్తున్నారు. కేసీఆర్ విషయంలో కడుపులో కత్తులు పెట్టుకున్నవాళ్ళు కూడా అభినందనలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం అభినందనలు తెలిపే విషయం ఎలా వున్నా, కేసీఆర్ తమని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని విమర్శలు చేశారు.
ఇదిలా వుంటే, కేసీఆర్ తనను చేసిన మోసాన్ని తలుచుకుని ఇంతకాలం కుమిలిపోయిన సోనియా గాంధీ మాత్రం కేసీఆర్కి, తెలంగాణ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు. సోనియా తెలిపిన శుభాకాంక్షలు చెప్పక తప్పక చెప్పినట్టే వున్నాయని, సోనియాగాంధీ కేసీఆర్కి, తెలంగాణకి శుభాకాంక్షలు తెలపడం ఏడవలేక నవ్విన చందంగా వుందని రాజకీయ పరిశీకులు భావిస్తు్న్నారు.