పేరులో ‘నేముంది’.. అదే జిందాల్ కు చిక్కులు తెచ్చింది!

పేరులో ఏముంది.. వ్యక్తిత్వమే మనిషిని నిలబెడుతుంది అంటారు పెద్దలు. కొన్ని సార్లు ఆ పేరే చిక్కులు తెచ్చిపెడుతుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఇకు ఇప్పుడు ఆ పేరే చిక్కులు తెచ్చి పెట్టింది. కొన్ని మీడియా సంస్థలు ఆయన పొటో వేసి మరీ విమర్శనాత్మక వ్యాసాలూ, వార్తలూ ప్రచురించేస్తున్నాయి. ప్రసారం చేసేస్తున్నాయి. అయితే ఆ ప్రచురణలు, ప్రసారాలు, విమర్శలు ఆయనను ఉద్దేశించి కాదు. ఆయన పేరే ఉన్న మరో వ్యక్తిని ఉద్దేశించి. కానీ ఫొటో మాత్రం పారిశ్రామిక వేత్తది ఉండటంతో చిక్కులు తప్పడం లేదు. అసలు జరిగిందేమిటంటే.. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా అప్రదిష్ట మూటగట్టుకున్నారు.  ఆయపై బీజేపీ బహిష్కరణ వేటు కూడా వేసింది. ఇందుకు సంబంధించి వార్తలు ప్రచురించే, ప్రసారం చేసే క్రమంలో నవీన్ కుమార్ జిందాల్ ఫొటో బదులుగా కొన్ని మీడియా సంస్థల్లో పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఫొటోలు వాడేస్తున్నారు. క్రాస్ చెక్ చేసుకోకుండా పేరును బట్టి ఒకరి ఫొటో బదులు మరొకరి ఫొటో వాడేస్తుండటంతో పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ కు తిప్పలు తప్పడం లేదు. సమాజిక మాధ్యమంలో కూడా బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ ఫొటోకు బదులుగా నవీన్ జిందాల్ ఫొటో పెట్టి ట్రోలింగ్ చేసేస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టేస్తున్నారు. దీంతో జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ సంస్థ అగ్గిమీద గుగ్గిలం అయిపోతోంది. సరిగ్గా సరి చూసుకోకుండా ఇష్టారీతిన ఫొటోలు వాడేయడమేమిటని ఫైరైపోతోంది. సామాజిక మాధ్యమంలో నెటిజన్లు కూడా నవీన్ కుమార్ జిందాల్ ను ట్రోల్ చేస్తూ, నవీన్ జిందాల్ ఫోటో పెట్టి తమ చైర్మన్ ఖాతాలను ట్యాగ్ చేస్తున్నారనీ, వెంటనే వాటన్నిటినీ డిలీట్ చేయాలని కోరుతోంది. నవీన్ కుమార్ జిందాల్ వేరనీ, నవీన్ జిందాల్ వేరనీ వివరణలు ఇస్తోంది. 

ఏనుగు కోపం.. వృద్ధురాలిపై దాడి చేసి చంపి.. ఆపై చితి నుంచి లాగి తొక్కి..

కోపం, పగ, కక్ష మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటాయి. అందులోనూ మనుషులతో అటాచ్ మెంట్ ఒకింత ఎక్కువగా ఉండే కుక్కలు, ఏనుగుల్లో అవి మరింత ఎక్కువగా ఉంటాయి. అందుకు నిదర్శనంగా తాజాగా ఒడిశాలో జరిగిన ఒక సంఘటనను చెబుతున్నారు అటవీ అధికారులు. ఒడిశాలోలోని రాయ్ పాల్ గ్రామంలో ఒక వృద్ధురాలిపై ఏనుగు దాడి చేసి తొక్కి చంపేసింది. రాయ్ పాల్ గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి పనిగట్టుకు వచ్చి మరీ ఏనుగు వృద్ధురాలిపై దాడి చేసింది. ఆ సమయంలో ఆమెకు దగ్గరగా ఉన్న వారికి ఎలాంటి హానీ చేయలేదు. అదే రోజు వృద్దురాలికి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనూ ఆ ఏనుగు మరో సారి దాడి చేసింది. ఈ సారి కూడా ఆ వృద్ధురాలి మృతదేహంపైనే దాడి చేసింది కానీ అంత్యక్రియలకు హాజరైన వారెవరికీ ఎటువంటి హానీ చేయలేదు. చితిపై ఉన్న వృద్థురాలి మృతదేహాన్ని తొండంతో చితిపై నుంచి కిందకు లాగి కాళ్లతో తొక్కి ఆ తరువాత తాపీగా అటవీ ప్రాంతంలోనికి వెళ్లిపోయింది. దీనిపై అటవీ అధికారులు ఆ వృద్ధురాలిపై ఏనుగుకు ఏదో కోపం ఉందని అంటున్నారు. ఏనుగులు సాధారణంగా సాధు స్వభావులనీ, తమకు హాని జరిగితేనే అవి కోపం పెంచుకుంటాయని అంటున్నారు. ఆ వృద్ధురాలి కారణంగా ఆ ఏనుగుకు ఏదో హాని జరిగి ఉంటుందనీ, అందుకే కోపం పెంచుకుని అదును చూసి దాడి చేసిందని చెబుతున్నారు. ఆ ఏనుగు వృద్దురాలిపై, ఆ తరువాత ఆమె మృతదేహంపై దాడి చేసిన రెండు సందర్భాలలోనూ పక్కన ఉన్న మరెవరికీ ఎలాంటి హానీ చేయకపోవడాన్ని అటవీ అధికారులు ఎత్తి చూపుతున్నారు. ఆ ఏనుగు ఆ వృద్ధురాలిపై మాత్రమే దాడి చేసిందనీ, మరెవరికీ హాని చేయలేదనీ, దీనిని బట్టే ఆ ఏనుగు ఆ వృద్ధురాలిపై ఎందుకో కోపం పెంచుకుందని పేర్కొంటున్నారు. అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న గ్రామం కనుక ఏదో సందర్భంగా ఆ వృద్ధురాలి కారణంగా ఆ ఏనుగుకు ఏదో హాని, ఇబ్బంది కలిగి ఉంటుందని, అందుకే కోపం పెంచుకుని ఉంటుందని అంటున్నారు. 

వానా వానా స్వాగతం

నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగా ప్రవేశించాయనీ, సాధారణ వర్షపాతం నమోదౌతుందనీ వాతావరణ శాఖ తొందరపడి కోయిలా ముందే కూసిందీ అన్నట్లుగా ప్రకటించేసింది. వాస్తవానికి కేరళలో రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ ఆ తరువాత వాటి గమనం మందగించింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. తెలుగు రాష్ట్రాలలో సాధారణం కంటే మూడు డిగ్రీల అధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. భరించలేనంతగా ఉక్కపోతతో జనం సతమతమయ్యారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ సోమవారం నాటికి రుతుపవనాలు తెలంగాణను పలకరిస్తాయన్న చల్లటి కబురు చెప్పింది. అలాగే ఏపీలోకి కూడా రుతుపవనాలు ప్రవేశిస్తాయనీ, తొలకరి వానలతో సోమవారం  పుడమి పులకరిస్తుందని పేర్కొంది.   సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  ప్రస్తుతం రుతువపనాల కదలికకు అనువైన వాతావరణం నెలకొని ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినట్లు ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదౌతుందని పేర్కొంది.  

కరోనా అనంతర సమస్యలతో ఆసుపత్రిలో సోనియా.. రేపు ఈడీ ఎదుట రాహుల్ హాజరు

కాంగ్రెస్ అధినేదత్రి సోనియాగాంధీ ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల ఆమెకు కరోనా సోకిన సంగతి విదితమే. దీంతో ఆమె ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కరోనా అనంతర సమస్యలతో బాధపడుతుండటంతో ఆమె ఆదివారం ఆసుపత్రిలో చేరారు. గంగారాం ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణదీప్ సుర్జేవాలా ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సోనియా గాంధీకి నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా సోకి ఐసోలేషన్ లో ఉండటంతో ఆమెకు ఈడీ కొంత సమయం ఇచ్చి జూన్ 23న విచారణకు రావాలని మరోమారు సమన్లు పంపింది. ఆమె కుమారుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా ఇదే కేసులో ఈడీ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. ఆ సమన్ల మేరకు ఈ నెల 2న ఆయన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే విదేశాలలో ఉన్న కారణంగా ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేదు.దీంతో ఈ నెల 13న హాజరు కావాలని ఈడీ ఆయనకు మరో మారు సమన్లు పంపింది. దీంతో ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన ఆయన రేపు అంటే 13న ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉండగా సోనియా గాంధీ కూడా ఈడీ ఎదుట హాజరై తీరుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ హెరాల్డ్ కేసులో తమ పార్టీ నేతలకు సమన్లు జారీ చేసిందని ఆయన ఆరోపించారు.  నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసును రాజకేయంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇదలా ఉంటే నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరయ్యే సమయంలో దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా  ఆందోళనలు నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ  అనారోగ్యం కారణంగా, 8వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కాలేదు. నిజానికి పక్షం రోజుల క్రితమే, జూన్ 8 న విచారణకు హాజరు కావాలని, ఈడీ ఆమెకు సమన్లు జారీచేసింది. అయితే, ఇటీవల ఆమెకు  కరోనా సోకినా నేపధ్యంలో విచారణకు మూడు వారాలు గడవు కోరారని, కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల కరోనా బారిన పడిన సోనియా.. ఇంకా కోలుకోని కారణంగా ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కరోనా అనంతర సమస్యలతో గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవంక ఇదే కేసులో, సమన్లు అందుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కూడా విదేశాలలో ఉన్న కారణంగా, జూన్ 2 న విచారణకు హాజరు కాలేదు. అయితే అయన అభ్యర్ధన మేరకు ఈడీ విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. మరో వంక ఇదే కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. మరోవంక  నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆరోపణల జుగల్ బందీ నడుస్తోంది. సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయదాన్నికాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. నేషనల్ హెరాల్ద్ కేసు విషయంలో సోనియా, రాహుల్ ఎలాంటి తప్పు చేయలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా పేర్కొన్నారు. బీజేపే ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ‘నేరం చేసిన వారు ఎవరైనా నేరం చేశామని అంగీకరిస్తారా?   అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తల్లీ కొడుకులు నేరం చేయందే నిజం అయితే ఆ ఇద్దరూ  విచారణకు హాజరై, తమ నిజాయతీని నిరూపించుకోవాలని నడ్డా కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు.  ఇదలా ఉంటే కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. మరో వంక  ఈనెల 13న ఈడీ విచారణకు హజరుకావాలని రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ హజరయ్యే రోజు.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పార్టీ నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులందరినీ పిలిచినట్లు తెలుస్తోంది.  ఈ సమావేశంలో రాహుల్ గాంధీ హాజరు అంశంపై చర్చించనున్నారు. రాహుల్‌ ఈడీ ఎదుట విచారణకు హాజరైన రోజు.. దేశ వ్యాప్తంగా భారీగా నిరసన కార్యక్రమాలను నిర్వహించే యోచనలో ఉంది కాంగ్రెస్‌. సోనియా, రాహుల్‌ ఈడీ విచారణకు హాజరు అయ్యే అంశంపై పార్టీ సినియర్‌ నేతలు చర్చించినట్లు ఏఐసిసి వర్గాల వెల్లడించాయి. గురువారంవర్చువల్‌గా జరిగిన భేటీకి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జులు   ఏఐసీసీ ఆదేశాలమేరకు హాజరయ్యారు. సో.. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు రాజకీయ మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయితే, న్యాయస్థానాల్లో తేల్చుకోవలసిన అంశాన్ని వీధుల్లోకి తీసుకురావడం వలన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ప్రయోజనం దక్కుతుందా లేక అది కూడా బూమరాంగ్ అవుతుందా అనే విషయంలో  కాంగ్రెస్ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ వారి వూహించిన మలుపుల చిత్రం 'ఆ ముగ్గురు'!

నలుగురితో ఎప్పుడూ బాగుండాలి, అందరినీ సమానంగా చూడాలి, మంచివాళ్లని అనిపించుకోవాలి. మంచిగా ప్రవర్తించాలి.. ఇవి అనాదిగా పెద్దవాళ్లు చెబుతున్న సూక్తులు. విని వాటి సారాంశం ఆకళింపు చేసుకోవాలి. లేకుంటే అప్రతిష్ట పాలవడం ఖాయం. ఇపుడు జగన్‌ సర్కార్‌ది ఇదే పరిస్థితి. కొన్ని విషయాలు పరిశీలించి పట్టించుకోవాలి. ఈ రెండూ నిర్లక్ష్యం చేసి సమస్యలు కొని తెచ్చుకున్న నేత వైసీపి అధినేత జగన్‌ రెడ్డి. అధికారంలోకి రావాలని తాపత్రయపడి, తీరా వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పార్టీ వర్గాల్లో సమస్యలు తలెత్తకా పోవు, క్రమేపీ మంత్రులు, ఎమ్మెల్యేలకూ ప్రాణం విసిగెత్తకా పోదు. మరి అదే జరిగింది. మూడేళ్ల పాలన తర్వాత తరచి చూసుకుంటే పార్టీ వర్గాల్లో సఖ్యతా లోపం, నాయకుని మాటకే విలువ లేకపోవడం, జంపింగ్‌ జిలానీలుగా మారడానికి ఏమాత్రం వెనుకాడకపోవడం. అన్నీ జరిగిపోతున్నాయి. ఏపీలో ముగ్గురు ఎంపీలు వైసీపిలో ఏమాత్రం కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదన్నది తేట తెల్లమయింది. వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో నిత్యం చిన్నపిల్లల్లా గొడవలు పడుతున్నారు. వారి మధ్య ఏమాత్రం స్నేహపూర్వక వాతావరణం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ నిలదొక్కుకునే స్థాయి క్రమేపీ కోల్పోతోంది. మూడేళ్లలో ఎన్నికలు జరగనుండగా పార్టీలోని సీనియర్లలోనూ ప్రశాంతత కరువయింది. దీనికి తోడు వచ్చే ఎన్నికలకు పొత్తులకు అవకాశం వుందని తెలుగు దేశం అనడంతో వైసీపీ ఎంపీలు కొంత ఆకర్షితులయ్యారనే చెప్పాలి. ఉత్తరాంధ్రలో నరసాపురం నియోజకవర్గం తీసుకుందాం. ఇక్కడ జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కనిపించరు. ఇప్పుడు కాదు రెండేళ్లుగా అసలు నియోజకవర్గానికే ఆయన దూరంగా వున్నారు. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు మద్దతునిస్తుండటం గమనార్హం. ఆయనకు పార్టీ నాయకునికి మధ్య విభేదాలు ఆఖరికి ఆయన తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటారేవెూనన్న అనుమానాలకి దారితీస్తోంది. రెబెల్‌ స్టార్‌గా రాజకీయాల్లో ప్రసిద్ధి పొందడంతో ఆయన్ను పార్టీ నుంచి తొలగించాలనుకున్నారు జగన్‌. కానీ ఆయనపై అనర్హత వేటు వేయడానికి సాంకేతిక ఇబ్బందులు అడ్డు పడ్డాయి. పార్టీలో వున్నట్టేనా అంటే వున్నట్టే, మీవాడేగా అంటే మావాడే కాని కాడు.. అనే రీతిలో రెండేళ్లుగా వైసీపీలో రఘురామరాజు ప్రయాణం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపీ టికెట్‌ మీదనే తన నరసాపురం నియోజకవర్గం నుంచే పోటీచేసినా పెద్దగా ఆశ్చర్యపడనక్కర్లేదు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వారి ఎంపీ లావు కృష్ణదేవరాయలను బొత్తిగా పట్టించుకోవడం లేదు. పాపం ఆయన మాత్రం అందరితో కలిసి పనిచేయాలన్న మనసున్న వ్యక్తే. ఎమ్మెల్యేలే ఆయన్ను దూరంగా పెట్టేరు. మరీ ముఖ్యంగా విడదల రజని(చిలకలూరిపేట), బొల్లా బ్రహ్మనాయుడు (వినుకొండ)తో ఆయనకు తరచూ ఏదో విధంగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఇతర ఎమ్మెల్యేలు కూడా అంటీ అంటనట్టే వ్యవహరిస్తున్నారు. అంతెందుకు ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు, నరసరావు పేటలో జరిగిన బహిరంగ సభకు ఎంపీ లావు దూరంగానే వున్నారు. పార్టీ అధిష్టానానికి ఎంత గోడు పెట్టుకున్నా చెవిటివాడి ముందు శంఖం పూరించినట్టే అయింది. విసిగెత్తింది. మనసు విరిగింది. పార్టీ మారతారన్న ప్రచారం కూడా జోరందుకుంది. మారినా ఆశ్చర్యపడగనక్కర్లేదు. ఇక ఇటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి విషయానికి వస్తే, అసలు ఎంపీగా ఎన్నికయినప్పటి నుంచే ఆయన అసంతృప్తిగానే వున్నారు. ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదనే ఆయన వైసీపీలోకి వచ్చేరు. ఇక్కడ ఆయనకు లాభం కంటే నష్టమే జరిగిందన్న భావనతో కుంగిపోతున్నారు. దేశ వ్యాప్తంగా పేరున్న తమ మ్యాకడోవెల్స్‌ వైన్‌ అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం మీద కాస్తంత కినుక వహించేరు. పక్క రాస్ట్రాలు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందిపెట్టడం లేదన్న అభిప్రాయం నాటుకుంది. దీనికి తోడు స్థానికంగా బాలినేని ఆధిపత్యం చలాయిం చడం పెరిగింది. దీంతో తనకు అంతకు ముందున్న పట్టు పోయిందని ఇబ్బందిపడుతున్నట్టు అనుచరులే అంటు న్నారు. ప్రోటోకాల్‌ సమస్య ఇంతగా ఇబ్బందిపెడుతుందా, ఏవెూగానీ మాగుంట మాత్రం వచ్చే ఎన్నికల సమ యానికి పార్టీ మారే అవకాశాలే ఎక్కువగా వున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మూడేళ్లకే డీలాపడ్డ జగన్‌ని వచ్చే ఎన్నికల నాటికి ఎవరు, ఎలా ధైర్యం ఇచ్చి నిలబెట్టగలరు స్వపార్టీవారే పక్క చూపులు చూస్తుంటే పార్టీ అధినేత  చేసేదేముంటుంది. వచ్చే ఎన్నికల సమయానికి టిడిపి పంచన చేరేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందన్నది పరిశీలకుల మాట. అదెలా వున్నా, తాను వూహించనది జరిగి తీరాలన్న పట్టుదల, తన మాటే వినాలన్న మొండితనమే వైసీపీ కోటను బద్దలుకొట్టగలదు.

అప్పుడు సరే మరి ఇప్పుడైనా..?

సరే.. అప్పుడు జరిగి పోయిందేదో జరిగిపోయింది. ఆధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ కేంద్రంలో బీజేపీ/ఎన్డీఎ కూటమికి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఆ విధంగా, కేంద్రం మెడలు వంచే అవకాశం వైసేపీకి, ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. రాష్ట్రంలో వైసీపీ బంపర్ మెజారిటీ (151/175) అధికారంలోకి వచ్చినా, 25కు22 ఎంపీ సీట్లు వైసీపీకే వచ్చినా విభజన హామీలు అమలుకు కేంద్రాన్ని అడిగేందుకే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నోరు పెగల్లేదు. ప్రత్యేక హోదా, సహా విభజన చట్టంలోని ఇతర హామీల అమలుకు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తేలేక పోయారు. అప్పుడప్పుడు ఓ రిక్వెస్ట్ చేయడమే కానీ, గట్టిగా ప్రధాని  మోడీ మెడలు వంచే అవకాశం జగన్ రెడ్డికి లేకుండా పోయింది. అందుకే గడచిన మూడేళ్ళలో ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా, మోడీ పాదాలే కానీ, మెడ వైపు చూడలేదు. సరే ..అయిపోయిందేదో అయిపోయింది ... ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి వైసీపీ అవసరం ఏర్పడింది. వైసీపీ, బిజూ జనతాదళ్ దయ తలిస్తేనే, ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి గెలిచి, గుర్రం బగ్గీలో రాష్ట్రపతి భవన్’ చేరుకుంటారు. బిజూ జనతాదళ్  ఏమి చేస్తుంది, ఏమి చేయదు అనే విషయం పక్కన పెడితే, వైసీపీ ఏమి చేస్తుంది? మోడీ మెడలు వంచుతుందా? మాకిది ఇస్తేనే, మీకు మా ఓటు ఇస్తాం అని గట్టిగా చెప్పగలుగుతుందా? క్విడ్ ప్రో క్వో’పద్దతిలో బేరమాడ గలదా? విభజన హామీల అమలుకు పట్టు పడుతుందా? లేక ఎప్పటిలా, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతుందా? జీ .. హుజూర్ అంటుందా? అడగక ముందే, మామోటు మీకే ..అంటూ వైసీపీ  నేతలు కేంద్ర నాయకుల ముందు సాగిల పడతారా?   ఇదే, ఇప్పడు.,ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకిస్తోంది. రాజకీయ మెఇఅ వర్గాల్లో హాట్ హాట్’గా చర్చ జరుగుతోంది.    నిజానికి, ఒక్క వైసీపీనే కాదు, రాష్ట్ర ప్రయోజనాల దృష్టా, టీడీపీకూడా వైసీపీతో కలిసి కేంద్రం పై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తే, కేంద్రానికి మరింత గట్టి సెగ తగులుతుంది. దాంతో  ముగిసిన అధ్యాయం అంటూ మూలకు తోసిన ప్రత్యేక హోదా ఫైల్ మళ్ళీ తెరుచుకునన్నా తెరుచు కుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజీలో ఎపీకి గట్టి బలమే వుంది. రెండు పార్టీలకు కలిపి 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది లోక్ సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వీరందరికీ రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కుంది. జనాభా ప్రాతిపదికన లెక్కిస్తే మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 27,825 అయితే, 36 మంది ఎంపీల ఓటు విలువ మొత్తం  25,488.. ఆవిధంగా ఆంధ్ర ప్రదేశ్  ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ: 27,825 + 25,488 = 53,313. ఇదేమి తక్కువ అంకె కాదు. రాష్ట్రపతి ఫలితాలను తారు మారు చేయగల సత్తా, ఏపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఉందని గణాంకాలే కాదు, రాజకీయ విశ్లేషణలు  కూడా సూచిస్తున్నాయి. నిజానికి బీజేపే గెలుగ్పు ఓటములను నిర్ణయించే సత్తా ఏపీ ఒతుకుందని అంటున్నారు.  అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంత సాహసం చేస్తారా... కేంద్రంతో  క్విడ్ ప్రో క్వో’ గేమ్ ఆడతారా? అంటే , నో ఛాన్స్ అంటున్నారు వైసీపీ నేతలు.. నిజానికి, రాష్ట ప్రయోజనాలే కీలకం అనుకుంటే, కేంద్రం పై వత్తిడి తెచ్చేందుకు ఇంకా చాలా మార్గాలున్నాయి. పార్లమెంట్’ దిగువ సభలో 22, ఎగువ సభలో 9 మంది వైసీపీ ఎంపీ లున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని  నిలదీయ దలచుకుంటే, ఈ సంఖ్య సరి పోతుంది. అయినా ఈ మడు సంవత్సరాలలో ఎప్పుడూ ఆ ప్రయత్నం జరగ లేదు, పైగా వివాదస్పద బిల్లులు సభ ఆమోదంకోసం అవసరం అయిన ప్రతి సందర్భంలోనో కేంద్రానికి వైసీపీ అందగానే ఉంటూ వచ్చింది. అలాగే, ఇప్పడు అందివచ్చిన సువర్ణ అవకాశం కూడా జరవిడుచుకుంటే, ఏపీ ప్రజలు ఎప్పటికీ, వైసీపీని క్షమించరు.అంతకంటే ముఖ్యంగా ఎనిమిదేళ్ళుగా అన్యాయం వెంట అన్యాయానికి గురవుతున్న ఏపీ ప్రజలకు ఇంకో అన్యాయం తోడవుతుందని, అంటున్నారు.

అన్ని వేళ్లూ సజ్జల వైపే..!

ఒక్కో సారి తెరవెనుక ఉండాల్సిన వ్యక్తులు తెర ముందుకు వచ్చి నాటకాన్ని రక్తి కట్టిస్తుంటారు. కొండకొచో ఆ వ్యక్తులే నాటకం రసాభాస కావడానికి కారకులౌతారు. మంచి  జరిగినా, చెడు జరిగినా అటువంటి వ్యక్తులకు వచ్చేదీ ఉండదు, పోయేదీ ఉండదు. కానీ అన్నిటిలో వారి వేలో కాలో పెట్టకు తప్పదు. అటువంటి వారినే ప్రభుత్వంలో అయితే రాజ్యాంగేతర శక్తులు అంటారు. సరిగ్గా జగన్ సర్కార్ లో సజ్జల రామకృష్ణారెడ్డి అటువంటి పాత్రే పోషిస్తున్నారు. ఆయనే ప్రభుత్వ నాటకాన్నిరక్తీ కట్టిస్తారు, రసాభాస చేస్తారు. అందుకే ఆయనను విపక్షాలే కాదు, పార్టీ శ్రేణులు కూడా రాజ్యాంగేతర శక్తిగానే అభివర్ణిస్తున్నాయి. సకల శాఖల మంత్రి అంటూ భుజకీర్తులు తగిలిస్తున్నారు.    ఏపీలో సజ్జల ఇప్పుడొక  బ్రాండ్  అయిపోయారు. ఇదేదో గొప్ప బిరుదో, భుజకీర్తో అనుకోవద్దు. జగన్ ప్రభుత్వంలో వైఫల్యాలన్నిటికీ మంత్రులూ, ఎమ్మెల్యేలే కారణమని నేత జగన్ చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని ఫ్రంట్ లలోనూ బ్రహ్మాండంగా ఉందనీ, ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేలూ, మంత్రులపైనేననీ ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇదేదో అధికారుల సమావేశాల్లోనో, సమీక్షల్లోనో కాదు.. సదరు ఎమ్మెల్యేలూ, మంత్రుల సమక్షంలోనే వారు చెబుతున్నవేవీ వినకుండా.. అంతా మీరు చేశారు అంటున్నారు.  అయితే మంత్రులూ, ఎమ్మెల్యేల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. జగన్ కు నోరూ, చెవులూ, కళ్లూ అన్నీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డేననీ, మంత్రులను, ఎమ్మెల్యేలనూ డమ్మీలను చేసిన ఘనత ఆయనదేననీ అంటున్నారు. జగన్ సజ్జల నోటితో మాట్లాడతారనీ, సజ్జల కళ్లతో చూస్తారనీ, సజ్జల చెవులతో వింటారనీ అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో శక్తి మంతుడు ఎవరంటే మాత్రం వైసీపీలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరూ తమ చూపుడు వేలును సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తున్నారు.  జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు.. ఇప్పటి వరకూ జగన్ తీసుకున్న నిర్ణయాలన్నిటి వెనుకా ఉన్న బ్రెయిన్  సజ్జల వారిదేనని అంటున్నారు. అలా అనడమంటే జగన్ నిమిత్త మాత్రుడు.. అమాయకుడు, ఆయనకు ఏమీ తెలియదు అని కాదు. తాను చేయాల్సింది, చెప్పాల్సింది అంతా సజ్జనతో చెప్పిస్తారు, చేయిస్తారు. అందుకే తాజా మాజీలంతా తమ పదవులు పోవడానికి కారణం సజ్జలేనంటూ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.  అంటే వైఫల్యాలను ఎమ్మెల్యేలు మంత్రులకు అంటగట్టడానికీ, ఘనతను తన సొంతం చేసుకోవడానికి జగన్ కు అన్ని విధాలుగా దోహదం చేస్తున్నది సజ్జల అన్న మాట. ఆ క్రమంలోనే హోం మంత్రి పదవి హుళక్కి అయిన తర్వాత.. మేకతోటి సుచరిత అనుచరులు.. ఈ సజ్జల వారిపై ఓ రేంజ్‌లో తిట్ల దండకం అందుకున్న సంగతి  తెలిసిందే. ఇక జగన్ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణ రెడ్డి పనితనం చూసే.. ఆయనకు సకల శాఖల మంత్రి గారంటూ ప్రతిపక్ష నేతలు  కితాబు ఇచ్చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే అధికార పార్టీలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అగ్రస్థానాన్ని ఆక్రమించారనే ఓ చర్చ   వెలగపూడి సచివాలయం సాక్షిగా చాలా రసవత్తరంగా సాగుతోంది.  జగన్ ప్రభుత్వంలో సలహాదారుడి పేరుతో సజ్జల రామకృష్ణారెడ్డి బ్రోకరిజం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పార్టీలోని ఓ ఎమ్మెల్యేకి జగన్ కెబినెట్‌లో చోటు కల్పిస్తానని మాట ఇచ్చి.. ఆ తర్వాత ఆయనకు   సజ్జల హ్యాండ్ ఇచ్చారనే ఆరోపణలు సైతం   వినిపిస్తున్నాయి. అంతేకాదు.. జగన్ మలి కేబినెట్‌లో పలువురు తాజా ఎమ్మెల్యేలకు చోటు దక్కిందంటే అదీ  సజ్జల వారి చలవేననే ఓ టాక్ కూడా నేటికీ గట్టిగానే నడుస్తోంది.    ఇక జగన్ ప్రభుత్వంలో ఇసుక, లిక్కర్.. వగైరా వగైరాలో కమిషన్లు దండుకొంటూ సజ్జల ఓ పెద్ద కమీషన్ ఏజెంట్ అవతారం ఎత్తారనే ఆరోపణలు కూడా అధికార పార్టీలోనే ఓ రేంజ్ లో వెల్లువెత్తుతున్నాయి.  గుడివాడ క్యాసినో వ్యవహారంలో అప్పటి మంత్రి కొడాలి నాని నుంచి సజ్జలకు కమిషన్ ముట్టిందని.. అలాగే పోలవరం కాంట్రాక్ట్ అవినీతిలో కూడా ఈ సజ్జలకు పాత్ర ఉందనే ఆరోపణలు   వినిపిస్తున్నాయి.   జగన్ ప్రభుత్వం తీసుకున్న ఏదైనా నిర్ణయంపై మాట్లాడాలంటే.. అటు మంత్రులు కానీ.. ఇటు ఉన్నతాధికారులు కానీ ప్రెస్ మీట్ పెట్టి వివరించే ప్రయత్నం చేయరు. అలాగే జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ స్పందించరు. ప్రభుత్వం నిర్ణయంపై వివరణ ఇవ్వాలన్నా, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలన్నా  సజ్జల రామకృష్ణారెడ్డే.  సకల రోగాలకూ ఒకటే మందు జిందా తిలిస్మాత్ అన్నట్లు.. వైసీపీ పార్టీలో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ ఏ అంశంపైనైనా స్పందించాలన్నా మాట్లాడాలన్నా తెరమీదకు వచ్చేది సజ్జల మాత్రమే. అయితే వైసీపీపై ఈగవాలినా వెంటనే స్పందించి కౌంటర్లిచ్చే సజ్జల తనపై వచ్చిన ఆవినీతి ఆరోపణలపై నోరెందుకు ఎత్తడం లేదని అధికార పార్టీలోనే కేడర్ నుంచి లీడర్ల వరకూ ఓ రేంజ్ లో చర్చించుకుంటున్నారు.  

వెూదీ అదానీ ప్రేమాయణం!

నచ్చితే ఎవరినైనా అభిమానించవచ్చు, ప్రేమించా వచ్చు. కానీ ప్రేమలో తలమునకలై తామేం చేస్తున్నావెూ తెలియనంతగా వుంటేనే ప్రమాదం. అదానీకి విండ్‌ పవర్‌ ప్రాజెక్టు ఇప్పించాలని మహా కోరిక. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆ ప్రాజెక్టు ఇప్పించేయాలనుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటాబ్యా రాజపాక్సా మనోడే నా మాట వింటాడు అనే ధీమాతో మన ప్రధాని వెూదీజీ ఆయనతో సమావేశమయ్యారు. ఆ 500 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టు పని మావాడికే వచ్చేట్టు చేయమని వెూదీజీ రాజపాక్సేపై వొత్తిడి తెచ్చారన్నది బయటపడింది. సంగతేంటంటే.. వెూదీ, రాజపాక్సే మాటల మధ్యలో ఈ ప్రాజెక్టుని అదానీకి ఇవ్వాలని కోరడంతో రాజపాక్సే ఆవేశంలో అంగీకరించారట. అలాగని సిలోన్‌ విద్యుత్‌ బోర్డు (సిఇబి) చైర్మన్‌ ఎం.ఎం.సి. ఫెర్నాండో అనడం విచిత్రం. అదెలా జరుగుతుంది వెూదీకి రాజపాక్సే హామీ ఇవ్వడం రెండు ప్రభుత్వాల మధ్య స్నేహబంధానికి ప్రతీకగా పేర్కొన్నారు. కానీ ఈ ప్రాజెక్టు సంబంధించిన అధికారిక కార్యకలాపాలు గమనిస్తున్నవారు మాత్రం ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించారు. ఆనక రాజపాక్సే కూడా అసలా ప్రాజెక్టును అదానీ గ్రూప్‌కి గాని మరే సంస్థ, వ్యక్తులకు గానీ ఇచ్చేది లేదని తేల్చారు. గతేడాది నవంబర్‌లో శ్రీలంక అధ్యక్షుడు తనను పిలిచి ఈ 500 మెగావాట్ల ప్రాజెక్టును అదానీ గ్రూప్‌కి ఇవ్వమని భారత ప్రధాని వెూదీజీ తనను బలవంతం చేసేరని చెప్పడం తాలూకు వీడియో క్లిప్పింగ్‌ అక్కడి ఛానల్స్‌ ప్రసారం చేశాయి. ఇది ప్రభుత్వాల మధ్య ఒప్పందాలే అయినప్పటికీ చర్యలు మాత్రం చట్టంలో పేర్కొన్న కాస్ట్‌ పాలసీ అను సరించే జరుగుతాయని సిలోన్‌ విద్యుత్‌ బోర్డు ఏర్పాటు చేసిన పేనల్‌ చైర్మన్‌ చరితా హెరాత్‌ అన్నారు. దీనికి సంబంధించి ఆ మర్నాడే కమిటీ సమావేశంలో విండ్‌పవర్‌ ప్రాజెక్టును ఇవ్వడం జరగదని రాజపాక్సే పేర్కొనడాన్ని సిఇబి చైర్మన్‌ వివరిస్తూ శనివారం ట్వీట్‌ చేశారు. ఇంతకీ ఈ మొత్తం తెలియ జేసేది.. వెూదీగారి అదానీ ప్రేమాయణం. దేశ పారిశ్రామికవేత్తల్లో ఆయనకు మరెవరూ కనిపించలేదు. ఆ ప్రాజెక్టు మరెవరూ చేపట్టలేరన్న నమ్మకమా, మనది మనది బరంపురమన్న సామెతను అక్షరాలే అమలుచేయాలన్న తపనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో స్నేహం వుండవచ్చు. వారి అభిమానాన్ని పొందగలిగే సత్తా వుండవచ్చునేవెూ అలాగని అన్నీ వారికే అంటగట్టాలని అంతర్జాతీయ ఒప్పందాల్లో కూడా వారి పట్ల అతి ప్రేమను ప్రదర్శించాలా ఎందుకు అవసర సమయాల్లో ఆదుకున్నారా గెలిపించి పీఠం ఎక్కించారనా  

అంతా మద్యం లీల!

వెయ్యి అంటాం.. అన్నీ చేస్తామా.. అవసరార్ధం ఏదో అంటాం.. అపరాధం శమించుగాక అనీ మళ్లీ అదే మాట వెనక్కి తీసుకుంటాం.. చేయకూడదా.. అర్ధంచేసుకోరూ..!! వెనకటికి ఒక స్వాములారు ఈ ఏడాది కొంప కూలేట్టు వర్షాలు పడతాయన్నారు. తీరా చూస్తే పడలేదు. తర్వాత ఆయనే దేవుడు శపించాడని చెప్పి పారిపోయాడు!ఇలా జరుగుతుంటాయి.  గతంలో కాదన్నది, ఇప్పుడు అవసరమయింది జగన్‌ ప్రభుత్వానికి. తప్పేముంది అంటే తప్పేమరి! మద్యం మత్తులో అన్యాయాలు జరుగుతున్నాయి. సమాజంలో దారుణాలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావించి మద్యం నిషేధించడానికి దీప ప్రమాణం చేసి కంకణం కట్టుకున్నారు. అప్పుడు అది తప్పనిసరి. అసలు ప్రభుత్వానికి మద్యం అమ్మకాలే కోట్లలో డబ్బు కుమ్మరిస్తుందన్నది తెలిసినదే. కాబోతే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కంటే కోట్లు ప్రధానం కాదనుకున్నవారు నిషేధాన్ని గురించి భారీ ప్రచారాలు చేసేరు. కొంత సమయం గడిచేక ఒర్నాయనో, అదే మంచి రూటు అనిపించి వుండవచ్చూ. ప్రభుత్వం మద్యం అమ్మకాలను కట్టుదిట్టంగా అమలుచేయడానికి సంకల్పించింది. ఎక్కడపడితే అక్కడ కాకుండా దానికీ ఓ లెక్క వుండాలన్నది. అందుకే దుకాణాల దగ్గర గొడవలు కాకుండా ఒక పద్దతి ప్రకారం అమ్మకాలు జరగాలని కాపాలా దారులను ఏర్పాటు చేసింది. వారిలో దురదృష్టవశాత్తూ కొందరు టీచర్లూ పహారా పనుల్లో వుండడం విపక్షాల కంటపడి ఆ సంగతి రచ్చకెక్కింది. కరోనా కారణంగా అన్ని రంగాలు దాదాపు కుదేలయ్యాయి. ఆదాయమార్గాలు దాదాపు మూసుకుపోయాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అప్పులతోనే కాపురం కొనసాగించడమూ కష్టమే. ఎన్నాళ్లిలా సాగుతుంది పాలన. అందుకే మద్యానికి మళ్లీ పొర్లే అవకాశం ఇచ్చేరు. వేల కోట్లు వచ్చిపడే వీలున్నదాన్ని కాదు పొమ్మంటే అసలుకే ఎసరు అవుతుంది. అందుకే ఓకే అనేసేరు. మరి గత ప్రమాణాలు, బోధల మాటేమిటని అడిగినా సమా ధానం చెప్పే స్థితిలో ప్రభుత్వం లేదు. ధనార్జన అవసరం. అందుకోసం గతంలో చెప్పిన మాటలు నీటి మూటలుగానే మారిపోవడం చేసి చూపారు. పరిస్థితులు ఒకేలా వుండాలని లేదు. వుంటాయనుకోవడం, తన మాటను తానే వెనక్కు తీసుకోవాల్సి వస్తుందా అని అనుకోవడమే భ్రమ. ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంతో మాటలు చేతలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది మరి! అదే ఇప్పుడు జగన్‌ కూడా చేసేడు. నాలుకను ఎలాగయినా మడతబెట్టవచ్చు! గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి కార్పోరేషన్‌ బాండ్లు అమ్మి రెండువేల కోట్లు అభివృద్ధి కోసం అప్పు తెచ్చారు. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ బేవరేజ్‌ కార్పొరేషన్‌ బాండ్లు అమ్మి ఎనిమిదివేల కోట్లు అప్పు తెచ్చుకుంది. పరిస్థితులు చేజారిపోతుంటే మరి వొంట్లో వొణుకు వస్తుందిగదా! ప్రగల్భాలకి ఇపుడు ఆస్కారం లేదు. అందుకే మద్యనిషేధానికి బ్రేక వేస్తూ ఇది తాత్కాలికం, పాక్షికం అంటూనే ఏపీ లిక్కర్‌ బాండ్లపై 9.62 శాతం వడ్డీకి 8 వేలకోట్లు అప్పు తెచ్చింది. ఇండియా రేటింగ్స్‌ సంస్థ బేవరేజెస్‌ కార్పోరేషన్‌కు ఏఏ రేటింగ్‌ ఇవ్వడం చిత్రం. ఎందుకంటే మద్యం విధానం మార్చబోమని దీప ప్రమాణం చేసిన తర్వాతనే ఈ రేటింగ్‌ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు ఎవరికి ఎంత ముట్టచెప్పారన్నది తేలాల్సిన ప్రశ్న.

వెళతారా? వెళ్లరా?.. కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ

కేసీఆర్ ఆరంభించి ఆపేసిన పనిని ఇప్పుడు మమతా బెనర్జీ ఆరంభించారు. జాతీయ రాజకీయాలలో తన ఎంట్రీ ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడానికి శతధా ప్రయత్నించారు. నేతలతో భేటీ అయ్యారు. పర్యటనలు చేశారు. మంతనాలు జరిపారు. అయితే అవేవీ ఫలించలేదు. ఎక్కడా ఆయనకు సానుకూలత ఎదురు కాలేదు.దీంతో ఆయన ఆయన సహజ శైలికి భిన్నంగా గత కొద్ది రోజులుగా ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. ఎక్కడా పెదవి విప్పిన దాఖలాలు లేవు. పార్టీ వ్యవహారాలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. రెండు రోజుల కిందట, పార్టీ ముఖ్యులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలూ ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక, టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్పు వంటి విషయాలు చర్చించారు.  ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో కూడా కేసీఆర్ ఎక్కడా బీజేపీయేతర పార్టీల ఐక్యతా ప్రయత్నాల గురించి పన్నెత్తి మాట్లాడలేదు. అంటే జాతీయ స్థాయిలో నాన్ బీజేపీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న తన ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పకనే చెప్పారు.ఈ నెల చివరిలో జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించేశారు. ఇప్పుడు కేసీఆర్ ఆరంభించి వదిలేసిన పనిని మమతా బెనర్జీ తలకెత్తుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనీ, ఇందుకు అభ్యర్థిని ఖరారు చేయడానికి హస్తినలో కలుద్దామనీ దేశ వ్యాప్తంగా ఉన్న నాన్ బీజేపీ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా మొత్తం 22 మంది నాయకులకు ఆమె లేఖలు రాశారు. సమావేశ తేదీని కూడా జూన్ 15గా ఖరారు చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, పంజాబ్ సీఎంలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా సహా పలు పార్టీల అధినేతలకు మమతా బెనర్జీ లేఖలు రాశారు. ఇంత వరకూ అంతా బానే ఉంది. తాను ఒక అడుగు ముందుకు వేసినప్పుడు అడుగు కలపడానికి విముఖత చూపిన మమతా బెనర్జీ ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ జూన్ 15 నాటి సమావేశానికి హాజరౌతారా అన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   ఇదొక అంది వచ్చిన అవకాశంగా భావించి తాను ఆమోదించే వ్యక్తినే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికయ్యేలా పట్టుబట్టి జాతీయ స్థాయి రాజకీయాలలో తన ప్రాముఖ్యతను చాటుకునే ప్రయత్నం చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా సమావేశం ఏర్పాటు చేసింది ఎవరైతేనేం.. బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలిపే ప్రయత్నాలలో భాగస్వామి అవ్వడం ద్వారా తాను కొత్తగా ఏర్పాటు చేయబోయే భారాస పార్టీకి జాతీయ స్థాయిలో సానుకూలత వచ్చేలా వ్యవహరిస్తారా అన్నది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారన్న విషయం ఆయన పార్టీ ముఖ్యులతోఇటీవల నిర్వహించిన  అత్యవసర సమావేశంలో మాట్లాడిన దానిని బట్టి అవగతమౌతోంది. అయితే అందుకు తాను చేసిన ప్రయత్నాలు కలిసి రాలేదు. దీంతో కేసీఆర్ ఒకింత నిరుత్సాహానికి గురయ్యారనడంలో సందేహం లేదు. ఆయన గత కొంత కాలంగా మౌనం వహించడమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు కేసీఆర్ ఎక్కడైతే ఆపేశారో సరిగ్గా అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేసీఆర్ ఏదైతే చేయాలనుకున్నారో అదే చేయడానికి ఒక అడుగు ముందుకు వేశారు. తాను ప్రయత్నించినప్పుడు ఎందుకు కలిసి రాలేదంటూ కేసీఆర్ ఈ సమావేశానికి దూరంగా ఉండిపోతారా? లేక ఏదైనా తాను ఆరంభించిన పనిని మమత ముందుకు తీసుకెళుతున్నారు కనుక కలిసి అడుగేస్తారా? అన్న దానిపై పరిశీలకులు పలు రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం తాను ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీకి దేశ వ్యాప్తంగా ఒక సానుకూలత వచ్చేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు కానీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కానీ మమత ఆహ్వానం పంపలేదు. సరే తెలుగుదేశం పార్టీకి అయితే ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లు బహుస్వల్పం, అలాగే ఆ పార్టీ అధినేత జాతీయ రాజకీయాలపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఆయన దృష్టి అంతా రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపైనే ఉంది. ఇక జగన్ ను జాతీయ స్థాయిలో నాయకుడిగా ఏ పార్టీ గుర్తించడం లేదు. అంతే కాకుండా జగన్ పార్టీని అంటే వైసీపీని బీజేపీ మిత్రపక్షంగానే ఇతర పార్టీలన్నీ  పరిగణిస్తున్నాయి.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి..కాదు కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీ, మోడీ సర్కార్ విధానాలను గట్టిగా ప్రతిఘటిస్తున్న ఏకైక నేతగా ఇప్పటికే తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు కొనసాగాలన్నా, జాతీయ పార్టీ ఏర్పాటుకు సానుకూలత ఏర్పడాలన్నా మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. చివరికి కేసీఆర్ నిర్ణయం ఏమిటన్నది ఆయన చెబుతేనే తెలుస్తుంది. మమత ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ జూన్ 15న ఢిల్లీలో జరిగే బీజేపీయేతర పార్టీల సమావేశానికి వెళతారా లేదా అన్న ఉత్కంఠ ఆయన తన నిర్ణయం వెలువరించే వరకూ కొనసాగుతూనే ఉంటుంది.

ఎన్టీఆర్ బొమ్మ‌తో రూ.100 నాణెం!

ఆయ‌న ఆంధ్రుల ఆరాధ్య‌దైవం. సినీ తెర మీద భ‌గ‌వంతుడై యావ‌త్ ప్రేక్ష‌క భ‌క్తుల‌కూ వీనుల విందు చేసిన మ‌హాన‌టుడు. ప్ర‌జాసంక్షేమం ల‌క్ష్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అప్ప‌టివ‌ర‌కూ వున్న రాజ‌కీయ  దురం ధ‌రుల‌ను కంగారుపెట్టించిన ఘ‌నుడు. తెలుగు దేశం పార్టీ పేర పార్టీ ఆరంభించి దేశ రాజ‌కీయాల్లో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటిన నిష్క‌ల్మ‌ష నేత‌. ఆయ‌నే నంద‌మూరి తార‌క రామారావు. సినీ వీరాభిమానుల ఎన్టీవోడు, మ‌న‌స్పూర్దిగా అనుస‌రించిన‌వారికి తార‌క‌రాముడు, రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేవారికి,  నిజా యితీగా న‌డుచుకోమ‌ని, ప్రాంతీయ‌త‌ను చాటుతూనే జాతీయాభివృద్ధిలో పాలుపంచుకోమ‌ని చాటిన మ‌హానేత‌!  ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు జ‌రుగుతున్న ఈ త‌రుణంలో యావ‌త్ తెలుగు ప్ర‌జ‌ల‌కూ రిజ‌ర్వు బ్యాంక్ అత్యంత ఆనంద‌క‌ర వార్త అందించింది. అదేమంటే ఆయ‌న బొమ్మ‌తో వంద‌రూపాయ‌ల నాణెం త్వ‌ర‌లో తెచ్చేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. అస‌లు పార్టీతో, పార్టీ సిద్ధాంతాల‌తో, వృత్తితో ప‌నిలేకుండా యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లు ప్రేమించిన  గొప్ప వ్య‌క్తి  రామా రావు. ఆయ‌న‌పేరు త‌ల‌చుకుంటే మ‌న‌సులో అదో ఆనందం. స్వ‌చ్ఛ‌మ‌యిన మ‌న‌సున్న వ్య‌క్తిని, చ‌క్క‌టి చిరున‌వ్వుతో క‌నిపించే ఆజానుబాహుడిని మ‌న‌సులో నిలుస్తాడు. అవినీతిప‌రులు  ఆయ న‌కు ఆమ‌డ దూరం లోనే నిలిచిపోయే విధంగా ప‌రిపాల‌న‌లో స్వ‌చ్ఛ‌త‌ను ప్ర‌ద‌ర్శించిన రాజ కీయ‌వేత్త‌.  ఎన్టీఆర్ జీవితం, రాజ‌కీయ జీవితం గురించి ఎంద‌రు ఎంత గొప్ప‌గా చెప్పుకున్నా, మ‌రెంత‌గా విమ‌ర్శిం చినా ఆయ‌న ఎప్పుడూ తొణ‌క‌లేదు. ఆయ‌న స్థిత‌ప్ర‌జ్క్షుడు.  విమ‌ర్శించేవారిని అజ్ఞానంతో మాట్లాడుతు న్నార‌ని దూరంగా పెట్టారేగాని ద్వేషించి త‌న స్థాయి త‌గ్గించుకోలేదు.  ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్నరావాల‌ని యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లూ ఆకాంక్షించారు. ఆయ‌న‌కు  దేశ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క అవార్డును  ఇవ్వాల‌ని ఆయ‌న అభిమానులు అంతా  కోరుకున్నారు. దీన్ని గురించి కేంద్ర ప్ర‌భుత్వానికి  పార్టీల‌తో సంబంధం లేకుండా తెలుగు రాజ‌కీయ‌నాయ‌కులు అంద‌రూ కేంద్రంలో  ఏ ప్ర‌బు త్వం వున్నా సూచ‌న‌లు చేస్తూనే వున్నారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అది సంభ‌వించ‌లేదు.  అయితే ఇప్పుడు మోదీ ప్ర‌భుత్వం ఎన్టీఆర్ బొమ్మ‌తో వంద‌రూపాయ‌ల నాణాన్ని ముద్రించేందుకు ఆలోచిం చింది. రిజ‌ర్వుబ్యాంకు కొంత ఆల‌స్యం చేసినా అందుకు ఆమోద‌ముద్ర వేయ‌డం యావ‌త్ తెలుగు ప్ర‌జ‌ల ఆనందానికి అంతే లేదు.  ఇది ఆశించిన  తెలుగు ఘ‌న‌కీర్తి.   ఎన్టీఆర్‌ను మ‌ర‌వ‌డం దుర్ల‌భం. త‌రాలు మారినా, ఎన్ని ప‌రిణామాలు సంభ‌వించినా తెలుగువారు ఎప్ప టికీ గుర్తుచేసుకునే ఏకైక న‌టుడు, నేత ఎన్టీఆర్‌.  అయితే భార‌త ర‌త్న కూడా ఇచ్చి వుంటే తెలుగు ప్ర‌జ‌లు మ‌రింత ఆనందించేవారు. ప్ర‌భుత్వానికి జీవితాంతం కృత‌జ్ఞ‌త‌లు తెలిపేవారు. 

తల్లి శోకం తీరాలి

ఇంట్లో పిల్లలు ఆడుకుంటూంటే అదో అందం, ఆనందం. పాకే పిల్లలు అలా పారాడుతూ ఆడుతూ తల్లి చుట్టూ తిరుగుతూంటే ఆ తల్లి ఆనందానికి అంతే వుండదు. అలాంటి ఆనందం అందరికీ వుంటుంది. పిల్లలు పెద్దయినా అలాంటివి తల్లులు గుర్తు పెట్టుకుంటూంటారు. పిల్లలు ఎదిగినా అపుడపుడూ వారికి అప్పటి గోల, ఏడుపులు, మొండితనం, చిరుకోపాలు గుర్తుచేస్తు ఆట పట్టిస్తుంటారు. దాన్ని వివరించడమూ కష్టమే. అలాంటి పసిపిల్లలు ఆడుతూ పాడుతూ తిరుగుతూనే హఠాత్తుగా ఏ ప్రమాదానికో లోనయితే ఆ తల్లి బాధను ఎవరు ఎలా తీర్చగలరు పిల్లలు ఇంటి ఆవరణ దాటి నీటికుంటలో పడవచ్చు, కాలవల్లో పడవచ్చు, బోరుబావి గోతిలోనూ పడిపోవచ్చు. బోరుబావి గోతులు చాలా లోతుగా వుంటాయి. చిన్నపిల్లలు ఆడుతూ పొరపాటున అటుగా వెళ్లి అందులోకి పడిపోవచ్చు. అది చాలా దారుణం, ప్రాణాలతో బయటపడేంతవరకూ తల్లిదండ్రులకు గుండె కోత!శుక్రవారం చత్తీస్‌ఘడ్‌, జంజ్‌గీర్‌ చంపా జిల్లాలోని పిరిద్‌ గ్రామంలో ఇదే జరిగింది. రాహుల్‌ అనే పదేళ్ల పిల్లాడు తన ఇంటి వెనుక ఆడుతూ అక్కడే వున్న పాత బోరుబావి గోతిలో పడిపోయాడు. గది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా ఎస్పీ విజరు అగర్వాల్‌ ఆధ్వర్యంలో సహాయక చర్యలో ప్రారంభించారు. జాతీయ విపత్తు నిర్వహణ విభాగం(ఎన్డీఆర్‌ ఎఫ్‌)తో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం(ఎస్‌ డీఆర్‌ ఎఫ్‌) కూడా రంగలోకి దింగింది. తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టుపక్కలవారికీ క్షణం క్షణం ఆందోళనకరంగా వుంది. ఇప్పటిదాకా కళ్లముందు కనిపించినవాడు అమాంతం ఆ బోరుబావి నోటిలో ఎలా పడ్డాడా బతికి వస్తాడా అని భయం భయంగా అందరినీ చూస్తున్నారు. గోడు పెడుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. బాలుడు పడిపోయిన బోరుబావి సుమారు 80 అడుగుల లోతు వుంటుందని అంచనా. ఇప్పటివరకూ 50 అడుగులు తవ్వారు. 65 అడుగుల వరకూ తవ్వితే తర్వాత బాలుడు వున్న ప్రదేశానికి సమాంతరంగా మరో టన్నల్‌ తవ్వితే బాలుడిని బయటికి తీయడానికి వీలుంటుంది. ప్రస్తుతం బాలుడు సజీవంగా వున్నట్టు సమాచారం. పరిస్థితిని కలెక్టర్‌ పర్యవేక్షిస్తున్నారు. బాలుడు కుటుంబ సభ్యులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతు వారికి ధైర్యం చెబుతున్నారు. ఇది ఒక్క చత్తీస్‌ఘడ్‌లోనే కాదు, ఇది ఒక్క రాహుల్‌ సంగతే కాదు, దేశంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు వింటూనే వున్నాం. కొందరు చనిపోవడం కూడా వింటున్నాం. ఇలాంటి పరిస్థితులకు ప్రభుత్వ అధికారులది, బోరుబావులు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నవారు బాధ్యత వహించాలి. అలాంటి వాటిని వెంటనే పూడ్చేయాలి. అందులో నివాస ప్రాంతాల్లో వున్నవాటి గురించి అక్కడి అధికారులు, వారి సిబ్బంది పట్టించుకోవాలి. లేకుంటే పిల్లలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అలాంటివి ఎక్కడ వున్నవీ గుర్తించి వెంటనే వాటిని పూడ్చేసే చర్యలు చేపడితేనే పిల్లల తల్లిదండ్రులకు, బంధువులకు భయాందోళనలు తొలగుతాయి. పిల్లల భవిష్యత్తును, జీవితాన్ని వూహించని విధంగా బోరుబావులు మింగేస్తుంటే ఆ కుటుంబ గుండె కోతను మాన్పగలిగేదెవరు రాహుల్‌ ప్రాణాలతో బోరుబావి నుంచి బయటికి వచ్చి తల్లిదండ్రులకు బంధువులకు మళ్లీ ఆనందం పంచాలని అందరం ఆశిద్దాం.

పెళ్లి పీటలమీదే వరుడికి దరువు!

పెళ్లి లేదా ఏదో శుభకార్యం, కాలేజీ ఫంక్షన్‌, స్నేహితుల పుట్టినరోజు.. ఏదయితేనేమి వీడియోలు తీసేవారికి పండగే! పెళ్లింట సందడితో పాటు సరదాల్లో తికమక వ్యవహారాలను కూడా తీసేవారుంటారు. స్నేహితుల పుట్టినరోజు ఫంక్షన్స్‌ అలాంటి అల్లరి గోలలు, ఆటపట్టించడాలు ఇతరులు అంతా వీడియో తీసి మిగతా ఫ్రెండ్స్‌కి పంపించడంతో అదో పెద్ద వైరల్‌గా మారి చాలారోజులు సరదాగా గుర్తుచేసుకోవడంలో వారికి అదో ఆనందం. ఇంతవరకూ బాగానే వుంది. కానీ సరదా గొడవలు, మాటలు, కొట్లాటలు కూడా వీడియో నెట్టింట వైరల్‌ అయితే!ఈమధ్య ఇలాంటి సంఘటనే ఒకటి వీడియో నెట్టింట వైరల్‌గా అందరినీ నవ్విస్తోంది. అది ఎక్కడ, ఎవరి పెళ్లి వేడుకలో అనేది అవతల పెడితే అసలు సంగతికి వద్దాం. అనగనగా ఓ వూళ్లో పెళ్లి జరుగుతోంది. బంధువులు, స్నేహి తులతో అంతా చాలా సందడిగా వుంది. పెళ్లి తర్వాత పెళ్లి విందు ఆరగించి అందరూ ఎంతో ఆనందాన్ని మూటగట్టుకుని వెళతారు.. ఇది చాలా సహజంగా అందరూ చూసింది, విన్నది. కానీ ఈ వివాహంలో ఏకంగా వధూవరులే కొట్టేసుకున్నారు. అదే ఇపుడు నెట్టింట మహాసరదాకి కారణమయింది. చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా కొత్త జీవితాన్ని సాగిస్తారని అను కుంటే వీళ్లు కొట్టుకోవడమేమిటని అందరూ ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు. ఇక్కడ వధూవరులు చక్కగా మిఠాయిలు తినిపించుకోలేదు. మిఠాయిలు తినిపించుకునే చిన్నపాటి సంప్రదాయం పెద్ద గొడవకే దారితీసింది. అవును.ఇంతకీ జరిగినదేమంటే.. వధూవరులు దండలు మార్చుకున్నారు. అంతవరకూ బాగానే వుంది. ఆ వెంటనే ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకోవాలిట. వరుడుకి ఇష్టం లేకపోయినా వధువు స్వీట్‌ తినిపించింది. ఆమె ఇక ఇతగాడు తన భర్తే కదా అని కాస్తంత ప్రేమ ఇప్పుడే ప్రదర్శించి బలవంతంగా నోట్లో కుక్కింది. వరుడు ఒకే అన్నాడు. మరి తన వంతు వచ్చినపుడు ఆమె కూడా ఓకే అని స్వీటు పెట్టించుకోవాలి గదా కానీ అలా జరగలేదు. అమ్మాయి ఓవరాక్షన్‌ చేసి తల అవతలకి తిప్పుకుంది. అసలే వరుడుగారు వెంటనే కోపంతో మొహం ఎర్రగా మారిపోయింది. తనకి బలవంతంగా పెట్టింది, మరి తాను ప్రేమగానే మెల్లగా పెట్టడానికి స్వీట్‌ అందిస్తే తలతిప్పుతుందా అనుకున్నాడు. బలవంతంగా స్వీటుని కుక్కబోయేడు ఆమెకి కోపం వచ్చి అతగాడి చేతిని విసిరి కొట్టింది. అదీ ప్రేమతో అయితే పరవా ఇల్లే. జరంత కోపంతోనో, చిరాకుతోనో అయితేనే ప్రాబ్లమ్‌! ఎందుకంటే ఇద్దరూ చక్కగా కలిసిమెలసి జీవించవలసినవారు. ఈ వధూవరుల సరదా గొడవ చూసిన అక్కడి వారంతా షాక అయ్యారు! మరుక్షణం విరగబడి నవ్వుకున్నారు. ఇదో కొత్త తరహా సరదా! ఈ సరదా అంతా వీడియో ఎవరు తీసేరోగానీ ప్రస్తుతం వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయింది. వెతకండి మీకూ దొరుకుతుందేవెూ!

జ‌గ‌న్ హయాం అరాచ‌కాల మ‌యం!

అశోకుడు చెట్లు నాటెను. గాంధీగారు దేశ స్వాతంత్య్ర పోరాటానికి నాయ‌క‌త్వం వ‌హించెను... ఇలా చ‌రిత్ర గురించి పాఠాలు విన‌డం, చెప్పుకోవ‌డం ప‌రిపాటి. అస‌లు చ‌రిత్ర‌లో నిల‌వాలంటే గొప్ప కార్యాలు చేయా లి,  గొప్ప ఉద్య‌మాన్ని న‌డ‌పాలి. త‌ప్ప హ‌త్య‌లు, అరాచ‌కాల‌తో పాల‌నాకాలం అంతా సాగించేవారిని ప్ర‌జా ద్రోహి, దారుణ‌మ‌యిన పాల‌కునిగానే  గుర్తు పెట్టుకుంటారు. ఇలాంటి ఘ‌న‌కీర్తి  వైసీపీ అధ‌నేత, ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంది.  అవును. ఆయ‌న మూడేళ్ల పాల‌న‌లో చేసిన‌దేమిటి అని ఒక్క‌సారి త‌ర‌చి చూస్తే దారుణాలు, అరాచ‌కాలు త‌ప్ప మ‌రోటి క‌న‌ప‌డ‌వు. కానీ చిర్న‌వ్వులు చిందిస్తూ త‌న పాల‌న భేషుగ్గా వుంద‌ని, త‌న మంత్రివ‌ర్గం అద్భు తంగా ప‌నిచేస్తోంద‌ని, ప్ర‌జ‌లు శ‌భాష్ అంటున్నార‌ని ప్ర‌చార ఆర్భాటాలు బాగానే సాగుతున్నాయి.  కానీ వాస్త‌వ చిత్రం వేరు!  వైసీపీ పాల‌న గురించి తెలుగు దేశం పార్టీ ప్ర‌చురించిన పుస్త‌కం, వైసీపీ ద‌మ‌న కాండ ను తెలియ‌జేసే ఫోటో ప్ర‌ద‌ర్శ‌న జ‌గ‌న్ పాల‌నా వైఫల్యాలను మ‌రింత తెలియ‌జేసింది. పాల‌న‌లో లోపాలు, ప‌థ‌కాల అమ‌ల్లో లోపాలు అక్క‌డా ఇక్క‌డా ఏదో ఒక‌టి జ‌ర‌గ‌వ‌చ్చు. కానీ అస‌లు ప్ర‌జా సంక్షేమం అనేది  ఆమ‌డ దూరాన నిల‌బ‌డిపోయింది. అంద‌రూ భ‌యం భ‌యంగానే బ‌తుకుతున్నార‌నేది ఆరోప‌ణ‌ల వెల్లువ‌. ఒక్క మాట‌లో చెప్పాలంటే రాష్ట్రాన్ని వ‌ల్ల‌కాడు చేశార‌న్న‌ది టిడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుగారి ఆరోప‌ణ‌.  జ‌గ‌న్ మూడేళ్ల పాల‌నపై ప్రచురితమైన   పుస్త‌కావిష్క‌ర‌ణ‌, ఫోటో ఎగ్జిబిష‌న్ ఆరంభించిన చంద్ర బాబు  త‌న ప్ర‌సంగంలో రాష్ట్రం ఈ మూడేళ్ల‌లో ఎంత ద‌రిద్రంగా త‌యార‌యింది వివ‌రించేరు. త‌మ పార్టీ ప్ర‌జాప్ర‌తి నిధుల‌పై కేసులు పెట్టార‌ని, గ్రామ‌స్థాయిలో నాలుగు వేల‌మందిపై కేసులు బ‌నాయించార‌ని  బాబు ఆరో పించారు. త‌న‌పైనా కేసులు పెట్ట‌డంతో పాటు ఆరుగురు మాజీ ఎమ్మెల్యేల‌ను, న‌లుగురు మాజీ మంత్రు ల‌ను జైలుకు పంప‌డం జ‌గ‌న్ విప‌క్షాల ప‌ట్ల క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు ప‌రాకాష్ట‌గా బాబు వ‌ర్ణించారు.  పోలీసు లు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటూ, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో మూడేళ్ల‌యినా  ప్ర‌జ‌లు సొంత గ్రామాల‌కు రాలేక‌పోతున్నార‌న్నారు. కోన‌సీమ‌లో చిచ్చు వైసీపీవారి పుణ్య‌మే, వివేకా హ‌త్య‌కేసులో సంబం ధం వున్న శ్రీ‌నివాస‌రెడ్డి, గంగిరెడ్డిల మ‌ర‌ణాల‌కు కార‌కులు ఎవ‌ర‌న్న‌ది ప్ర‌జ‌లు గ్ర‌హించ‌లేక కాదు.  పోలీ సులు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి తొత్తుల‌య్యార‌న్న అనుమానాలు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి త‌న‌కు ప్రాణ‌హాని వుంద‌న్నా, సిబిఐ కేసులో అప్రూవ‌ర్‌కి ప్రాణ‌హాని వుంద‌న్నా పోలీసు వ్య‌వ‌స్థను అనుమానించాల్సి వ‌స్తుంద‌ని బాబు ఆరోప‌ణ‌. అస‌లు మూడేళ్ల పాల‌నలో జ‌గ‌న్ చేసిన‌ది  ప్ర‌జారంజితం కాదు, ప్రాణ‌భీతితో బ‌తికేట్టు ప‌రిస్థితులు సృష్టించిన పాల‌న‌గా పేర్కొనాలి. వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌పై వ‌చ్చిన పుస్త‌కం, ఫోటో ప్ర‌ద‌ర్శ‌న మొత్తం ఈ ఘోరాల‌న్నీ సుస్ప‌ష్టం చేశాయి.   వైసీపీ పాల‌న‌లో జ‌ర‌గిన దారుణాలు లెక్క‌కు మించే వుంటాయి. అర్ధంలేని ఆరోప‌ణ‌లు, కేసులు బ‌నా యించడం, బెదిరించ‌డం అంతా  కూడా వైసీపీ త‌త్వాన్ని తెలియ‌జేస్తుంది.  త‌న వారిని కాపాడుకోవ‌డానికి పోలీసుల‌ను  అను కూలంగా వుప‌యోగించుకోవ‌డం ఆయ‌న‌వ‌ల్ల‌నే అయింది. సిబిఐ వున్న‌ది 41 ఎ నోటీ సులు ఇవ్వ‌డానికా అన్న ప్ర‌శ్న అంత‌టా వ్య‌క్త‌మ‌వుతోంది. దాడి చేసిన వైసిపి పై కేసులు పెట్టకుండా బాధితులు అయిన టిడిపినేతలపై కేసులు పెడుతున్నారు. కాలువ‌ల్లో పూడిక తీయకుండా, ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా, ఎరువులు ఇవ్వకుండా క్రాప్ హాలి డేకు త‌మ‌ని కార‌ణంగా చెప్ప‌డం అర్ధ‌ర‌హిత‌మ‌ని టిడిపి అధినేత అన్నారు.    జగన్ రాష్ట్రానికి పట్టిన అరిష్టం, దరిద్రం. అందుకే క్విట్ జగన్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే స‌రికొత్త నినాదానికి  ప్రాణం పోసింది స్వ‌యానా జ‌గ‌న్ పాల‌నే అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు.  వచ్చే ఎన్నికలే వైసిపికి చివరి ఎన్నికలు అని విప‌క్షాలు అన‌డం స‌త్య‌ దూరం కాదు.  రాజకీయాల్లో ఉండే అర్హత కూడా జగన్ కు లేదు. ఒక్క చాన్స్ అన్నారు....అదే చివరి చాన్స్ అయ్యింది. రాజ్యాంగ ఉల్లంఘన చేసిన కారణంగానే రాజకీయాల్లో ఉండే అర్హతను జగన్ కోల్పోయారు. అని చంద్రబాబు అన్నారు.

బుద్ధా చెబుతోంది నిజమేనా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన సమాచారం జగన్ కు ముందే తెలుసా? వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు చేస్తున్న తాజా దర్యాప్తు క్రమాన్ని చూసినా, టీడీపీ నేత బుద్దా వెంకన్న చెబుతున్న మాటల్ని గమనించినా వాస్తవం లేకపోలేదేమో అనే మాట వినిపిస్తోంది. ఈ హత్య గురించి ముఖ్య నేతకు ముందే తెలుసని, అందుకే బాబాయ్ హత్యపై ఎక్కడా మాట్లాడడం లేదని బుద్దా వెంకన్న ఆరోపిస్తున్నారు. వివేకా హత్యకేసులో నిందితులను ఎందుకు కాపాడుతున్నారని బుద్దా నిలదీస్తున్నారు. ఈ హత్య కేసు నిందితులు అనుమానాస్పదంగా ఎందుకు మరణిస్తున్నారంటూ బుద్దా వెంకన్న ప్రశ్నిస్తున్నారు. మరో పక్కన.. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ అధికారులు మరింత ముమ్మరం చేశారు. దాంట్లో భాగంగా పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వ సర్వేయర్ తో కొలతలు తీయించడం, వీడియో, ఫొటోలు తీయించడం కూడా బుద్దా వెంకన్న మాటల్లో కొంతైనా నిజం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్యాంపు ఆఫీసుతో పాటు అవినాశ్ రెడ్డి ఇంటికి కూడా సీబీఐ అధికారులు కొలతలు తీయించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. నిప్పు లేనిదే పొగ రాదంటారు. వివేకా కేసులో సీబీఐ అధికారులకు లింక్ ఏదో దొరికి ఉండొచ్చని, అందుకే తమ దర్యాప్తును జగన్, అవినాశ్ రెడ్డి ఇళ్ల నుంచి కూడా చేస్తుండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య కుట్ర వెనుక ఓ కీలక మహిళ హస్తం ఉందని, ఆ ‘శివగామి’ ఎవరనే చర్చ కూడా గతంలో బాగా జరిగిన వైనాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో వివేకా హత్య జరిగింది.  అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అప్పట్లో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో గెలిచి, తాను సీఎం అయినా ఈ హత్య కుట్రను ఛేదించే విధంగా ఎందుకు ప్రయత్నించలేదనే ప్రశ్నలు పలువురి నుంచి వ్యక్తం అవుతున్నాయి. కేసు విచారణలో అసలు వాస్తవాలు బయటికి వస్తే.. బాగా కావాల్సిన వారెవరో ఇరుక్కుపోతారనే ముఖ్యనేత అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదేమో?  అని ఇంత వరకూ అంతా అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు బుద్ధా వెంకన్న ఆరోపణలు, సీబీఐ దర్యాప్తు గమనించిన తరువాత  అందుకేనన్న నిర్ధారణకు వస్తున్నారు. వివేకా హత్య కేసులో ముద్దాయిలెవరో తేల్చకుండా జగనే అడ్డుకుంటున్నారని జనం అనుకుంటున్నారన్న టీడీపీ నేత వర్ల రామయ్య మాటల్లో వాస్తవం లేకపోలేదంటున్నారు. అసలు ముద్దాయిలెవరో తేల్చాల్సిన బాధ్యత సీఎంగా జగన్ కు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై జగన్ ఆధ్వర్యంలోని స్థానిక పోలీసులు కేసులు పెట్టడం వెనక కారణం ఏంటో తెలియాలంటున్నారు. బాబాయ్ ని చంపిన అసలు ముద్దాయిలెవరో బయటికి రాకూడదు, అసలు ముద్దాయిలు అరెస్ట్ కాకూడదనే ఆలోచన ఎవరిదని వర్ల ప్రశ్నించడం గమనార్హం. వివేకా హత్య మిస్టరీ వెనుక అసలు రహస్యం మూడేళ్లు దాటిపోయినా వెలికి రాలేదు. సరికదా.. ఈ కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరికి బెదిరింపులు రావడం, ప్రాణహాని భయంతో దస్తగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ఇదే కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించడం వెనుక పెద్ద తలకాయల ఒత్తిడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిటాల రవి హత్య తర్వాత మొద్దు శీనుతో పాటు నిందితులు, సాక్షులు ఎలా చనిపోయారో ఇప్పుడూ అదే జరుగుతోందని బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివేకా మర్డర్ కేసుకు సంబంధించి మరిన్ని సంఘటనలు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డికి కూడా ప్రాణహాని ఉండొచ్చని, వారికి రక్షణ కల్పించాలనే డిమాండ్ వస్తోంది.

పలాయనమా? పనికి మాలిన వ్యూహమా?..

శతాధిక చరిత్ర కలిగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. కాంగ్రెస్. దశాబ్దాల పాటు దేశంలో  ఏకఛత్రాధిపత్యం చెలాయించిన పార్టీ.  వరుస విజయాలతో  దేశ రాజకీయాలను శాశించిన పార్టీ. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు రాష్ట్రంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ కూడా అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు కేవలం రెండంటే రెండు రాష్ట్రాలలోనే అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారం కాదు కదా.. కనీసం విపక్ష హోదా కూడా నిలుపుకోలేని దుస్థితిలో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి పుంజుకోవాలన్న పట్టుదలతో ఉన్నా.. గత ఎనిమిదేళ్లుగా ఆ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంబోట్టు అన్న చందంలో ప్రజాదరణలో పలుచన అవుతూ వస్తోంది.   దీంతో ఆ పార్టీ అగ్ర నాయకత్వంలో   ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా అంటే... ఔననే సమాధానం వస్తుంది. ఎందుకుంటే యూపీలో ఈ నెల 23 న రెండు లోక్ సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనుంది. గత అసెబ్లీ ఎన్నికలలో  అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ నాయకుడు అజంఖాన్ లు తమ తమ లోక్ సభ స్థానాలకు రాజీనామా చేశారు. దాంతో అజంగఢ్, రాంపూర్ పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 23న జరిగే ఈ ఉన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ శ్రేణులనే కాక పరిశీలకులను కూడా నివ్వెర పరిచింది. ఏదైనా రాజకీయ పార్టీ  అందుతోనూ కాంగ్రెస్ లాంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ ఎన్నికలకు దూరం అవ్వడం అంటే జనానికి ఏం సంకేతం ఇస్తున్నట్లు. అదీ కాక సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలనుకుంటున్న పార్టీ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో ఉప ఎన్నికలలో పోటీ చేయడం లేదంటే ఏమనుకోవాలి. కాంగ్రెస్ హైకమాండ్ ఇదో వ్యూహాత్మక నిర్ణయం అని చెప్పుకుంటున్నప్పటికీ విశ్లేషకులు మాత్రం పలాయన వాదమనే అంటున్నారు. పోటీలో దిగి పరాజయం పాలౌతామన్న భయంతోనే కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం యూపీలోని పార్టీ శ్రేణులను కూడా అయోమయానికి గురి చేసింది. మద్దతు కోసం సమాజ్ వాదీ పార్టీ కనీసం కాంగ్రెస్ ను సంప్రదంచను కూడా లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించ లేదు.   ఏ కారణం లేకుండా పోటీ నుంచి వైదొలగడమంటే.. పలాయనం కాక మరేమిటని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పలాయన వాదంతో పార్టీక రాష్ట్రంలో ఉన్న మద్దతు దారులు, సానుభూతి పరులు కూడా దూరమయ్యే అవకాశాలు మెండు అని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ దయనీయ స్థితికి యూపీ ఉప ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం అద్దం పడుతోందని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. పార్టీ అగ్ర నాయకత్వంలో విశ్వాసం లోపించిందనడానికి ఇంత కన్నా ఉదాహరణ అవసరం లేదని కూడా పార్టీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. 

జ‌గ‌న్ కి సోద‌రుల వీధి పోరాటాల త‌ల‌నొప్పి! తెర‌పైకి వంశీ, యార్ల‌గ‌డ్డ గోల‌

ఇంటి గుట్టు గుట్టుగా వున్నంత‌వ‌ర‌కే, గుట్టు ర‌చ్చ‌కెక్కితే ఇంటి ప‌రువు బ‌జారుకెక్కుతుంది. రాజ‌కీయాల్లో ప‌రువుతో పాటు స్థానభ్రంశం కూడా జ‌ర‌గ‌వ‌చ్చు. ఇపుడు వైసీపీ ప‌రిస్థితి ఇదే. జ‌గ‌న్ సార‌ధ్యం ఆహా..ఓహా అనుకున్నారంతా. క్ర‌మేపీ అస‌లు రంగు ఇపుడు బ‌య‌ట‌ప‌డుతోంది. మొన్న‌టిదాకా అంతా చ‌క్క‌గా న‌వ్వు తూ క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్టు కేవ‌లం క‌నిపించార‌నే అనాలి. ఇపుడు ప‌రిస్థితులు అనుకూలించ‌డ‌మూ లేదు. పార్టీ విధానాలు,  ప‌థ‌కాల అమ‌లు అన్నింటా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఫెయిల్ అయింది. మంత్రులు, ఎమ్మెల్యే లు ప్ర‌జ‌ల ముందు నిలిచి గ‌ట్టిగా ఏ ప‌థ‌కం గురించి మాట్లాడి నిలిచే స్థితిలో లేరు. దీనికి తోడు వారిలో వారికి అస్స‌లు ప‌డ‌టం లేదు. ఈ గొడ‌వ‌లు అంత‌కు ముందు నుంచీ వున్నా, ఇపుడు తెర మీద‌కి వ‌స్తు న్నాయి.  మంత్రులు, ఎమ్మ‌ల్యేల‌కు క్లాస్ తీసుకుందామ‌ని పెట్టిన ప్ర‌త్యేక స‌మావేశంలో వారి మ‌ధ్య విభేదాలు బ‌య‌ట ప‌డ్డాయి. అంతేకాదు అధిష్టానం మీద కూడా ఒంటికాలి మీద లేచేందుకు కూడా మం త్రులు, ఎమ్మెల్యేలు వెనుకాడ‌లేదు. మీరు స‌రిగా చేయ‌లేదంటే మీరు స‌రిగా లేర‌న్నారు.  మొన్న మ‌చిలీ ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాల‌శౌరి మ‌ధ్య విభేదాలు బ‌ట్ట బ‌య‌ల‌యినాయి. ఇపుడు లేటెస్ట్‌గా  గ‌న్న‌వ‌రం గొడ‌వ‌లు సీఎం జ‌గ‌న్ దాకా వెళ్లాయి. అక్క‌డ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు  వెంక‌టేశ్వ‌ర రావు మ‌ధ్య విభేదాలు రోడ్డెక్కాయి. వల్ల‌భ‌నేని వంశీ టిడిపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్యా విభేదాలు వుంటూనే వున్నా యి. అయితే అవి చుట్టుప‌క్క‌ల‌వారికి త‌ప్ప అధిష్టానం చెవికి చేర‌లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రికీ చేదోడు వాదోడుగా వుంటున్న త‌న‌ను వంశీ అప్ర‌తిష్ట‌పాలు చేస్తున్నార‌ని వాపోయారు. వ్య‌క్తిగ‌త ప‌నుల‌పై యార్ల‌గ‌డ్డ ఆరు నెల‌లు అమెరికా వెళ్లారు. ఆ స‌మ‌యంలో  త‌న‌పై దుష్ప్ర‌చారం చేశార‌ని యార్ల‌గ‌డ్డ ఆరో ప‌ణ‌. సీఎం జ‌గ‌న్ కెడిసిసి చైర్మ‌న్ ప‌ద‌విని యార్ల‌గ‌డ్డ‌కు ఇచ్చారు. ఎంతో క‌ష్ట‌ప‌డి, ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తెచ్చి 43 శాతం అభివృద్ధి చేసిన త‌న‌ను జ‌గ‌న్ దృష్టిలో త‌క్కువ చేసేవిధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంశీకే చెల్లింద‌న్నారు.  అస‌లే అన్నివైపుల నుంచీ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎమ్మెల్యేలు, మంత్రుల మ‌ధ్య ఇలాంటి వివాదాలు మ‌రింత ఇబ్బందిక‌రంగా మారాయి. విభేదాలు చ‌ర్చించుకుని ప్ర‌భుత్వ ప‌థ కాల ప్ర‌చారంలో గ‌ట్టి కృషి చేయాల‌ని జ‌గ‌న్ నెత్తినోరు కొట్టుకుంటున్నా పార్టీలో సీనియ‌ర్లు ఇలా గొడ‌వ ప‌డుతూండ‌డం జ‌గ‌న్‌కు త‌ల‌భారంగా మారింది. వంశీమోహ‌న్ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజంలేద‌ని  తాను ఎలాంటి విచార‌ణ‌క‌యినా సిద్ధ‌మంటున్నారు యార్ల‌గ‌డ్డ వెంక్ర‌టావు. మ‌ట్టి త‌వ్వ‌డం డ‌బ్బుచేసుకోవ‌డం వంటి ఆరోప‌ణ‌లు అర్ధ‌ర‌హితం. తాను నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి గా వున్న‌పుడు ఒక్క పైసా అవినీతికి పాల్ప‌డ లేద‌ని, అవ‌స‌ర‌మ‌యితే దేవుని వ‌ద్ద ప్ర‌మాణం చేయ‌డానికీ సిద్ధ‌మ‌ని అన్నారు. అంటే నియోజ‌క వ‌ర్గంలో వంశీ మోహ‌న్, వెంక‌ట్రావు మ‌ధ్య విభేదాలు ఏస్థాయికి చేరుకున్న‌దీ తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటి చేస్తారు. ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారని నా పై ఇంతమంది ప్రచారం చేస్తున్నారు కాబట్టే నా ఇమేజ్ బాగా పెరిగింది అనుకుంటున్నాని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ విభేదాలు, త‌గాదాలు, గొడ‌వ‌ల నేప‌థ్యంలో వైసీపీలో కీల‌క‌వ్య‌క్తుల‌ను, అభిమానుల‌ను ఒకే తాటి మీద న‌డిపించడం బ‌హుక‌ష్ట‌మే. ఎన్నిక‌లు ఆట్టే దూరంలో లేని ఈ స‌మ‌యంలో  పార్టీ ప‌టిష్టంగా వ్యూహాత్మ కంగా ముంద‌డుగు వేయాల్సిందిపోయి త‌మ్ముళ్ల మ‌ధ్య త‌గాదాలు,  అభిమానుల వీధిపోరాటాల ప‌రిష్క ర‌ణ కార్య‌క్ర‌మాలే జ‌గ‌న్ రెడ్డికి  ప్ర‌స్తుతం అత్యంత ప్ర‌ధాన కార్య‌క్ర‌మమ‌యింది. 

కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే చోరీ.. తెలంగాణలో భద్రత జాడేదీ!

తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఉన్నాయనడానికి తాజా తార్కానం  బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనంలో చోరీ.  హైదరాబాద్ లోని అణువణువుపై నిఘా,  ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా క్షణాల్లో పసిగట్టే అత్యాధునిక పరిజ్ణానంతో  కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణం జరుగుతోంది. అలాంటి భవనంలోనే చోరీ జరగడం, దీనిపై ఈ ప్రజెక్టు మేనేజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాష్ట్రంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు బయటపడింది.   శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే తెలంగాణ ఆదర్శం అంటూ తన భుజాలను తానే తడుముకుంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమయం దొరికినా దొరకకపోయినా రాష్ట్ర పోలిసింగ్ గొప్పతనాన్ని ఘనంగా చాటుకుంటూ ఉంటారు. తెలంగాణలో అందునా  హైదరాబాద్ లో పోలీసులు స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులకే ఆదర్శంగా నిలుస్తుంటారని గొప్పలు కూడా చెప్పేసుకుంటూ ఉంటారు. అంతటితో ఊరుకోకుండా తెలంగాణ పోలిసింగ్ గొప్పతనాన్ని చాటుకుంటూ జాతీయ స్థాయి పత్రికలు, ఛానెళ్లలో కోట్ల రూపాయల వ్యయంతో ప్రకటనలు కూడా జారీ చేశారు.   ‘తెలంగాణా రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ  అత్యంత అమోఘంగా ఉంది. గడచిన ఆరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ కూడా  శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు. ఆయా  భాగస్వామ్య పక్ష్యాల సమన్వయంతో రాష్ట్రంలో ఎక్కడ కూడా అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూడటంలో రాష్ట్ర పోలీసులు పూర్తిగా సఫలమయ్యారు. దానికి అవసరమైన రీతిలో క్రియాశీలక చొరవ ప్రదర్శించారు.  ప్రజల రక్షణ, శాంతి భద్రతలు కాపాడే విషయంలో రాష్ట్ర పోలీస్ విభాగం కమ్యూనిటీ పోలీసింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. హైదరాబాద్ తో పాటుగా  రాష్ట్రంలోని అనేక ప్రధాన నగరాలు, పట్టణాలలో లక్షలాది సి.సి.టి.వి. కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతోమంది నేరస్తులను అరెస్ట్ చేయడానికి వీలైంది. నేరానికి పాల్పడితే కటకటాలు తప్పవనే సందేశం నేరస్తులకు వెళ్ళేలా చేయడానికి ఇది చాలా ఉపయోగపడింది.  టి.ఎస్. కాప్, హాక్ ఐ, సైబర్ క్రైం డిటెక్షన్ టూల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక అప్లికేషన్లను వినియోగించుకుంటూ, బాధితులకు సత్వర న్యాయం అందించే ప్రయత్నాలు కూడా ఎంతగానో సఫలీకృతమయ్యాయి.’ అన్నది ఆ ప్రకటన సారాశం.  అయితే ఈ భుజకీర్తులన్నీ.. సొంత డబ్బా కొట్టుకోవడానికేననీ, వాస్తవంలో హైదరాబాద్ లో భద్రత డొల్ల అనీ తాజాగా కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ ఘటన మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించేసింది.  హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు  వాటి అనుసంధానం 24x7 నిఘా వంటి మాటలూ, ప్రకటనలూ ఇవన్నీ కోటలు దాటిన మాటలేననీ, ఆచరణ గడప కూడా దాటలేదనీ నిరూపించే స్థాయిలో నేరాలు, ఘోరాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని, నేరస్తుల అనుపానులు క్షణాల్లో కనుగొని వారిని అరెస్టు చేయడానికీ, అసలు నేరం జరగక ముందే నిరోధించడానికి అవసరమైన అత్యాధునిక పరిజ్ణానంతో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న  కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో శుక్రవారం(నిన్న) రాత్రి 38 బండిల్స్ కాపర్ వైర్ చోరీ సంఘటన మరోసారి సందేహానికి తావు లేని రుజువుగా నిలిచింది. నగర వ్యాప్తంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో తెలుసుకుని అక్కడ పోలీసులు వాలిపోయేందుకు అనువు అయిన పరిజ్ణానంతో ఏర్పాటు అవుతున్న భవనానికే దొంగలు కన్నం వేసి చోరీ చేసి దర్జాగా జారుకోగలిగారంటే పోలీసులు ఇక నగరం మొత్తంలో నేరాలను  కంట్రోల్ చేస్తామంటే నమ్మేదెలా? అని సామాన్య జనం సైతం ఇప్పుడు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అయినా రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు ఎంత ఘనంగా  ఉన్నాయో చెప్పడానికి గత వారం రోజులుగా నగరంలో జరిగిన వరుస సామూహిక అత్యాచార ఘటనలే చాలు. అలాగే  జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ రేపు కేసులో నిందితులను రక్షించడానికి పోలీసులు పడిన తాపత్రేయం వారు ఎందు కోసం ఎవరి కోసం పని చేస్తున్నారో తేటతెల్లం చేసేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నేరాలను అరికట్టడంలో ఎంత ‘అప్రమత్త’తతో ఉందో లోకానికి తెలియజేసేసింది.   ఒక వైపు తెలంగాణ సర్కార్ దేశంలోనే శాంతి భద్రతల విషయంలో తెలంగాణ సేఫెస్ట్ ఫేస్ అని చెప్పుకుంటుంటే.. వరుసగా జరుగుతున్న సంఘటనలు మాత్రం బాలికలకు, మహిళలకు మోస్ట్ అన్ సేఫ్ సిటీ హైదరాబాదే అని నిరూపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మహిళా దర్బార్ ఎవరి కోసం? ఎందు కోసం?

తెలంగాణ గవర్నర్  తమిళి సై సౌందర్ రాజన్, రాష్ట్రంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసకుకునేందుకు, రాజ్ భవన్’ లో మహిళా దర్బార్ నిర్వహించారు. ఒక్క హైదరాబాద్ నుంచే కాకుండా, రాష్రంష్లోని అన్ని జిల్లాల నుంచి మహిళలు, మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అన్ని వయసుల వారు, అన్ని వర్గాలవారు వచ్చారు. గవర్నర్ మేడంకు, తమ కష్టాలు చెప్పుకున్నారు. వినతులు అందజేశారు. బాగుంది. అయితే, రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్’ ఇలా నేరుగా, మహిళా దర్బార్’ కానీ, ప్రజా దర్బారే కానీ నిర్వహించ వచ్చునా, ఇది గవర్నర్ గీతదాటడం కాదా? అనే అనుమానాలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి అనుకోండి, అయినా, ఆ అనుమాన ఆరోపణలను కాసేపు పక్కన పెడదాం... ఆమె చెప్పినట్లుగా, గవర్నర్ మేడం గీతదాట లేదనే అనుకుందాం, అయినా, ఈ దర్బార్ ఎవరి కోసం, ఎందు కోసం?  ప్రజలు తమ ముందు ఉంచిన సమస్యలను గవర్నర్ ఏ విధంగా పరిష్కరిస్తారు? ప్రజల సమస్యల పరిష్కారానికి, గవర్నర్ వ్యవస్థ పరిష్కారం చూపుతుందా? రాజ్యాంగం, గవర్నర్’ కు అలాంటి వెసులుబాటు,అధికారాలు కలిపించిందా అంటే ... రాజ్యాంగ నిపుణులు లేదనే అంటున్నారు.నిజానికి, గవర్నర్ శాసన సభను ఉద్దేశించి చేసే ప్రసంగం కూడా గవర్నర్ ప్రసంగం కాదు. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన ప్రసంగాన్నే గవర్నర్ ఒక్క అక్షరం పొల్లు పోకుండా చవవలసిందే. ఒక్క అక్షరంముక్క మార్చే అధికారం కూడా గవర్నర్ కు ఉండదు. అందుకే, గవర్నర్ పదవి అలంకార ప్రాయమైన పదవిగా పేర్కొంటారు.  అదలా ఉంటే, నిజానికి గవర్నర్ తమిళి సై కూడా  సమస్యల పరిష్కారానికి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. బాధిత ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని మాత్రమే అంటున్నారు. వినతి పత్రాలను శ్రీ సర్కార్ వారి శ్రీముఖానికి పంపండం మినహా, గవర్నర్ కార్యాలయం చేయగలిగింది ఏమీ లేదు. అంటే, అనవచ్చునో లేదో కానీ,  గవర్నర్ స్థాయిని పోస్ట్ మ్యాన్ స్థాయికి దిగజార్చారు అనే మాట అక్కడక్కడా వినిపిస్తోంది. పోనీ అలా చేసినా, ఫలితం ఉంటుందా అంటే అదీ లేదు. ఇక ఎందుకీ, దర్బార్ అనే ప్రశ్న సామాన్య జనం నుంచే వస్తోంది. నిజానికి ముఖ్యమత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులకు నేరుగా సమర్పించుకున్న విజ్ఞాపన పత్రాలకే దిక్కు లేదు. అలాంటిది, ప్రజలు గవర్నర్’ కు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలను సంబంధిత శాఖల అధికారులకు పంపితే, సమస్యలు పరిష్కారం అవుతాయా?లేదు, అందులో ఎవరికీ అనుమానం లేదు.  నిజానికి గవర్నర్, తమ సమస్యలను తాము పరిష్కరించుకునే పరిస్థితి లేదు,అందుకే రాష్ట్ర ప్రభుత్వం తమను అడుగడుగునా అవమానించినా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం మినహా, ఏమీ చేయలేని పరిస్థితిలో గవర్నర్ ఉన్నారనేది, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోలేకనే కదా, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇక ఆమె, ప్రజల సమస్యలు ఏమి తీరుస్తారు? అసలు, ఈ రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉన్నారనే విషయాన్నే, రాష్ట్ర ప్రభుత్వం మరిచి పోయింది. ముఖ్యమంత్రి ముఖం చూసి జూన్ 2కు సంవత్సరం అయిందని గవర్నర్ మేడమే  స్వయంగా చెప్పారు. అంతే కాదు, గవర్నర్ అడ్రస్ లేకుండానే శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరిగిపోయాయి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లుగా, ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం, గవర్నర్ వ్యవస్థనే గుర్తించనప్పుడు, ఈ పేరు గొప్ప, మహిళా దర్బార్. ఎందుకు నిర్వహించినట్లు? అంటే, అందుకు సమాధానం కూడా ఏమంత అర్ధం కాని, బ్రహ్మ పదార్ధం కాదు. కేవలం రాజకీయం. అవును, రాజకీయ ఉద్దేశ, దురుద్దేశాలతోనే గవర్నర్, మహిళా దర్బార్ నిర్వహించారు, అని అనుకుంటే అందుకు అభ్యతరం చెప్పవలసిన అవసరం లేదని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చును కానీ , సామాన్య ప్రజలు మాత్రం గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, రాజ భవన్ ను రాజకీయ కార్యకలాపాల వేదిక చేశారనే అంటున్నారు. అలాగే, ఇంత చేసి, వ్రతం తప్పినా ఫలం లేని, వృధా ప్రయాసగానే, గవర్నర్ నిర్వహించిన మహిళా దర్బార్ ను చూడవలసి ఉంటుందని సామాన్య ప్రజలు అంటున్నారు. అలాగే, ఫిర్యాదులు చేయడానికి ఎక్కడేక్కడి నుంచో  వచ్చిన మహిళలు కూడా, గవర్నర్ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన  హామీ ఇవ్వక పోవడంతో, ఇక్కడి పరిస్థితిని ఎరక్క పోయి వచ్చామనే అవేదన వ్యక్తపరిచారు.  అయితే, జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక సాముహిక అత్యాచారం నేపధ్యంగా  నిర్వహించిన మహిళా దర్బార్ లో  మహిళలు చేసిన ఫిర్యాదులు అక్షర సత్యాలు, అందులో సందేహం లేదు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదన్న ప్రధాన ఫిర్యాదే కాదు, బెల్ట్ షాపుల నుంచి ధరణి పోస్టల్  దారుణాల వరకు  ఇంకా అనేక వ్యక్తిగత సమస్యల వరకు, మహిళలు గవర్నర్ మేడం ముందుంచిన ఫిర్యాదులు అన్నీ అక్షర  సత్యాలే...   రాష్ట్రంలో గడచిన ఎనిమిదేళ్ళలో పసికందుల పై అత్యాచారాలు ఏకంగా ఏడు రెట్లు పెరిగాయని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికే చెప్పి నప్పుడు రాష్ట్రంలో పరిస్థితితులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయో వేరే  చెప్ప నక్కరలేదు.  మహిళలు కాదు, పసి కందులు, మైనర్ బాలికలకు రక్షణ లేని రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడడం కూడా మర్యాద అనిపించుకోదు. గవర్నర్ దర్బార్ వలన ఏదైనా ప్రయోజన ఉందటే అది ఇదే, రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో తెలియని వారు తెలుసుకునే అవకాశం లభించింది.   అయితే, గవర్నర్ నిర్వహించిన దర్బార్ వలన ప్రయోజనం ఏమిటి? ఒక విధంగా చూస్తే, గవర్నర్ కు ఫిర్యాదు చేయడం వలన, ప్రజల సమస్యల పరిష్కారం కాక పోగా, మరింత జటిలం అయ్యే ప్రమాదం కూడా లేక పోలేదని,  సమస్యలకు పరిష్కారం చూప వలసిన అధికారులు, దర్బార్ ఫిర్యాదులను ఎర్ర మార్కు పెట్టి ‘ప్రత్యేక’ దృష్టితో పక్కన పెట్టే, ప్రమాదం లేక పోలేదన్న అనుమానాలు కూడా అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ అలంటి అనుభవాలు ఉన్నాయని అంటున్నారు.   అదలా ఉంటే నిజానికి, గవర్నర్ తమిళి సై, తమకు ఉన్న అధికారాలనే సక్రమంగా వినియోగించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం, 8వ షెడ్యూలు ప్రకారం, జీహెచ్ఎంసీ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితిని అజమాయిషీ చేసే అధికారం గవర్నర్ కు వుంది. అయినా, నగరంలో ఇన్ని నేరాలు, ఘోరాలు జరుగుతన్నా, గవర్నర్  ఏ రోజు అధికారులను పిలిచి పరిస్థితిని సమీక్షించ లేదు. అంతవరకు ఎందుకు, జుబ్లీ హిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి, పూర్తి నివేదికను సమర్పించాలని, గవర్నర్ కార్యాలయం వారం రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖ రాశారు. అంతే కాదు, అందుకు రెండు రోజుల గడువు కూడా విధించారు. అయితే, రెండు రోజులు కాదు, వారం రోజులు అయినా ఇంతవరకు రిప్లై లేదని, స్వయంగా గవర్నరే చెప్పారు. అంటే, గవర్నర్ ఒకరు ఉన్నారు అనే విషయాన్ని, ముఖ్యమంత్రి, మంత్రులే కాదు, అధికారులు కూడా మరిచి పోయారు ...  బహుశా ప్రజలు కూడా మరిచి పోరాదనే గవర్నర్ మహిళా దర్బార్’ ఏర్పాటు చేశారో.. ఏమో కానీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నట్లుగా దర్బార్‌ వలన ప్రజలకు ఎలాంటి లాభం లేదు. ఆయనే అన్నట్లుగా ఇది పూర్తిగా రాజకీయవిన్యాసం, అందులో సందేహం లేదని అంటున్నారు.