గుడ్ న్యూస్.. వెనక్కి తగ్గిన చైనా

భారత్-చైనా సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్-చైనా లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు సఫలమయ్యాయి. వాస్తవాధీన రేఖకు చైనా వైపున ఉన్న మోల్డోలో సోమవారం 12 గంటల పాటు లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. భారత్ తరపున లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరపున లిన్ లియు చర్చల్లో పాల్గొన్నారు. తూర్పు లదాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని తెలుస్తోంది. గల్వాన్‌ లోని 14, 15, 17 పాయింట్లనుంచి తమ బలగాలను వెనక్కు తీసుకునేందుకు చైనా అంగీకరించిందని సమాచారం. చర్చలు మరోమారు జరిగే అవకాశం ఉంది.  నిజానికి, జూన్ 6న ఇరు దేశాల మధ్య లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగినప్పుడే గల్వాన్ లో సైన్యాలను ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. కానీ ఆ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా టెంట్లను నిర్మించడంతో ఘర్షణ తలెత్తింది. ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు, 40 మందికి పైగా చైనా సైనికులు మృతి చెందారు.

ఏపీలో రాజకీయ దుమారం.. ముగ్గురు వీఐపీల రహస్య భేటీ.. సీసీ టీవీ ఫుటేజ్ లీక్

ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ సర్కార్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ.. బీజేపీ నేతలతో రహస్య భేటీ అయ్యారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తో నిమ్మగడ్డ రహస్యంగా భేటీ అయిన సీసీ టీవీ ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నెల 13న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సుమారు గంటసేపు వీరి రహస్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం వివాదం నడుస్తుండగా ఈ ముగ్గురు రహస్యంగా సమావేశమవ్వడం.. చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ భేటీలో ఏం చర్చించారు? నిమ్మగడ్డకు బీజేపీ అండగా నిలుస్తుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పార్క్ హయత్ లాంటి హోటల్‌లో జరిగిన రహస్య భేటీకి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ బయటకు రావడం కూడా పలు అనుమానాలకు దారితీస్తుంది. ఎవరో కావాలనే సీసీ టీవీ ఫుటేజ్‌ను బయటపెట్టారన్న వాదనలు విపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ భేటీ రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపే అవకాశముంది.

కరోనా ఖతం.. రాందేవ్ బాబా పతంజలి మందు వచ్చింది...

కరోనా వైరస్ కు పతంజలి సంస్థ ఆయుర్వేద మందు తీసుకొచ్చింది. 'కోరోనిల్' పేరుతో మార్కెట్‌లో ఈ ఆయుర్వేద మందును రాందేవ్ బాబా విడుదల చేశారు. ఈ మందును తీసుకురావడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ కరోనాకు మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పారు. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయొచ్చని అన్నారు. క్లినికల్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ మందును తీసుకొచ్చామని రాందేవ్ బాబా చెప్పారు. 'కోరోనిల్' మందు ద్వారా 5 నుంచి 14 రోజుల్లో కరోనాను నయం చేయొచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. 

అమరావతి పై జగన్ మరో కొత్త డ్రామా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

కొద్ది రోజులుగా ఏపీలో వైసిపి ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో కొంత హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని మార్పు ఇప్పట్లో ఉండదని రెవెన్యూ మంత్రి పెద్దిరెడ్డి చెప్పిన మర్నాడే సీనియర్ మంత్రి బొత్స ఇప్పటికే నిర్మాణం పూర్తైన, మరి కొంత పని పెండింగ్ లో ఉన్న భవనాలను సందర్శించారు. దీంతో అమరావతి విషయంలో అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి అనే విషయం అర్ధం కాక అటు విశ్లేషకులు ఇటు ప్రజలు జుట్టు పీక్కునే పరిస్థితి నెలకొంది. ఐతే ఇదే విషయం పై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. కోర్టులలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో అసత్యాలతో సీఎం జగన్ కాలం గడుపుతున్నారని అన్నారు. ఈ రోజు రాష్ట్రం లో పోలీస్ రాజ్యం నడుస్తోందని అన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని రాష్ట్రంలోని వివిధ రంగాల ప్రజల నుండి హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న తనకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని అయన అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇంకో పార్టీలో చేరితే కష్టం.. పార్టీ ప్రదర్శనలో పాల్గొంటే కష్టం అన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. ఈ పద్ధతులు మంచివి కాదని అయన అన్నారు. అంతే కాకుండా వైసిపి ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో మద్యం మాఫియా, ఇసుక మాఫియా పురుడు పోసుకుంటున్నాయని అయన తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సందర్భం లో అమరావతి విషయం లో జగన్ సర్కారు డ్రామా ఆడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు.

జగన్ గారి చెత్త పాలన గురించి వైసీపీ నేతల వ్యాఖ్యలు.. వారిని కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందా?

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విశాఖలో టీడీపీ సానుభూతిపరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కిషోర్‌ సన్నిహితుడని తెలుస్తోంది. అలాగే కృష్ణాజిల్లా నందిగామలో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారంటూ అర్థరాత్రి సమయంలో అతడ్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కిషోర్‌, కృష్ణ అరెస్ట్ లపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'సింహా' సినిమాలోని 'నో పోలీస్' డైలాగును అనుకరిస్తూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "వైకాపా మాఫియా ఇసుక కొట్టేస్తే నో సిఐడి, ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సిఐడి, ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సిఐడి, విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సిఐడి.108 లో స్కామ్ బయటపడితే నో సిఐడి, మైన్స్ మింగేస్తుంటే నో సిఐడి. మహిళల పై అత్యాచారాలు,వేధింపులకు పాల్పడుతుంటే నో సిఐడి. రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేసారు వైఎస్ జగన్ గారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?" అని లోకేష్ ఫైర్ అయ్యారు. "ఏం నేరం చేసారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు? కృష్ణ,కిషోర్ గారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. జగన్ గారి చెత్త పాలన గురించి వైకాపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు మరి వారిని కూడా సిఐడి అరెస్ట్ చేస్తుందా?" అని లోకేష్ ప్రశ్నించారు.

అసెంబ్లీ సమావేశాలకు కరోనా సోకిన ఎమ్మెల్యే .. టెన్షన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు 

విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన వైజాగ్ లోని ఒక గెస్ట్ హౌస్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను త్వరలో కోలుకుని మళ్ళీ మీడియా ముందుకు వస్తానని అయన ఎంతో కాన్ఫిడెన్స్ తో ప్రకటించారు. వైసిపి ఎమ్మెల్యే శ్రీనివాసరావు అసెంబ్లీ సమావేశాల కు ముందు అమెరికా వెళ్లి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన అమెరికా నుండి ఏపీకి వచ్చినపుడు ఆయనలో ఎలాంటి అనారోగ్య లక్షణాలూ కనిపించలేదు. దీంతో రొటీన్‌గా విదేశాల నుండి వచ్చే వారికి చేసే పరీక్షలు ఆయనకూ చేసి ఎటువంటి సమస్య లేదని చెప్పారు. దీంతో స్వంత నియోజక వర్గానికి వచ్చి పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలను కలిశారు. ఐతే ఆయనకు కరోనా అమెరికాలోనే సోకిందా లేక... ఏపీకి వచ్చిన తరవాత సోకిందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మొన్న ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల లో పాల్గొన్నప్పుడు ఎమ్మెల్యేలందరితో కలిసిపోయి తిరిగారు. అంతే కాకుండా అసెంబ్లీలో జరిగిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ఓటు వేశారు. దీంతో ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులకు టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యేకు కరోనా సోకినా ఎటువంటి లక్షణాలు బయట పడకపోవడంతో అయన ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉన్నందువల్ల అయన కాంటాక్ట్ లిస్ట్ ను అధికారులు ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే అయన కుటుంబ సభ్యులను హోమ్ క్వారంటైన్ లో ఉంచి కరోనా టెస్ట్ చేశారు. టెస్ట్ రిజల్ట్ ఇంకా రావలసి ఉంది.

కొద్దిసేపట్లో కరోనా ఆయుర్వేద మందు విడుదల... కర్టెసీ రాందేవ్ బాబా

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా మందు, వ్యాక్సిన్ల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో రెండు అల్లోపతి మెడిసిన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు గ్లెన్మార్క్ , హెటేరో సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఐతే తాజాగా పతంజలి వ్యవస్థాపకులు, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తాము తయారు చేసిన కరోనా మందును ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్ లోకి విడుదల చేస్తారని పతంజలి సి ఇ ఓ ఆచార్య బాలకృష్ణ తన తాజా ట్వీట్ లో తెలిపారు. పతంజలి తయారు చేసిన ఆయుర్వేద ఔషధం కరోనిల్ (Coronil) ను హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీట్ లో ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ ఆ ట్వీట్ లో తెలిపారు. ఈ సందర్భంగా మొట్ట మొదటి ఆయుర్వేద ఔషధం కరోనిల్ గురించి పూర్తి వివరాలను రాందేవ్ బాబాబు ప్రజలకు తెలియచేస్తారని అయన ప్రకటించారు.

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భయపెడుతున్న లెక్కలు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండు మూడు రోజులుగా రికార్డు స్థాయిలో‌ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 3,189 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 872 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అంటే, 27.34 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. ముఖ్యంగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గ్రేటర్‌ లో సోమవారం ఒక్కరోజే ఏకంగా 713 మందికి కరోనా నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. సోమవారం ఏడుగురు మృతిచెందగా.. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 217కి చేరింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 60,243 మందికి కరోనా‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో 14 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా టెస్టుల పాజిటివ్‌ రేట్ 14.39 శాతం ఉంది. జాతీయ స్థాయిలో ఇది 6.11 శాతం ఉండగా, తెలంగాణలో రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక గత ఐదారు రోజులుగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే కరోనా టెస్టుల పాజిటివ్‌ రేట్ 20 శాతం పైగా ఉంది. పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో 20 మందికి పైగా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడం మాములు విషయం కాదు. కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కరోనా కు వ్యాక్సిన్ రెడీ చేసిన నైజీరియా..!!

ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అమెరికా, బ్రిటన్, భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ వంటి అభివృధి చెందిన దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీనికోసం అనేక వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తున్న సమాచారం ప్రకారం 13 వ్యాక్సిన్లు ప్రస్తుతం మనుషుల పై ప్రయోగ దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రక్రారం నైజీరియా సైంటిస్టులు కరోనా కు వ్యాక్సిన్ కనుగొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి నైజీరియన్ యూనివర్సిటీలు ఒక ప్రకటన చేసినట్లు లోకల్ మీడియా తెలిపింది. ఆఫ్రికా ప్రజల కోసం ఆఫ్రికాలో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ఆడిలెక్ యూనివర్సిటీ వైరాలజి నిపుణుడు డాక్టర్ వోలాడిపో కోలావోల్ ప్రకటించినట్లు ది గార్డియన్ నైజీరియా ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ సామాన్యులకు అందుబాటులోకి రావడానికి 18 నెలలు టైం పట్టవచ్చని డాక్టర్ కోలావోల్ తెలిపారు. దీని పై మరి కొన్ని ట్రయల్స్ అవసరమని అలాగే దీనికి హెల్త్ డిపార్ట్ మెంట్ నుండి అనుమతి కూడా రావాల్సి ఉందని అయన తెలిపారు. కోవిడ్ జినోమ్ కోసం ఆఫ్రికా అంతటా సెర్చ్ చేసి సాధించామని అయన తెలిపారు. వ్యాక్సిన్ రెడీ చేసిన మాట నిజమే.. దీని కోసం చాల ప్రయోగాలు చేసి ఎనలైజ్ చేసాం అని ప్రీషియస్ కార్నర్ స్టోన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జూలియస్ వోలోక్ దీనిని ధృవీకరించారు. ఆఫ్రికన్లు లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేసినప్పటికీ ఇది అందరికి ఉపయోగపడుతుందని అయన తెలిపారు. ఫైనల్ గా వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారు అనే దాని కంటే అది త్వరగా అందరికి అందుబాటులోకి వస్తే ప్రపంచానికి అంతకంటే కావాల్సిందేముంది.

ఏపీలో క‌ల‌క‌లం.. వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా!!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా.. తాజాగా ఏపీలో కూడా ఒక ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా తేలిందని సమాచారం. ఆయన ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చారు. యూఎస్ నుంచి రావడంతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్న ఎమ్మెల్యే.. పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఏపీ లో ఒక ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ రావడం ఇదే తొలిసారి. ఎమ్మెల్యే గన్ మెన్ కి కూడా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు సమాచారం.

వారిని విచారిస్తే అసలు నిజాలు తెలుస్తాయి.. పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి

నకిలీ పత్రాలతో వాహనాలు కొని నడుపుతున్నారని ఆరోపణల పై అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి అయన కుమారుడు అస్మిత్ రెడ్డి ని మొన్నశుక్రవారం కోర్టు ఆదేశాలతో రెండు రోజులకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ సందర్బంగా జరిగిన విచారణలో.. ఎవరిని విచారిస్తే నిజాలు బయటపడతాయో ఆ వివరాలను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు తెలిపినట్లుగా అయన తరఫు లాయర్ రవికుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు పోలీస్ కస్టడీ ముగియడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు మళ్ళీ కడప జైలుకు తరలించారు. హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్టుగా రవికుమార్ రెడ్డి చెప్పారు. విచారణ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తగిన ఆధారాలతో జేసీ ప్రభాకరరెడ్డి సమాధానమిచ్చారని అయన తెలిపారు.

కుంభకోణాన్ని బయటపెట్టిన వ్యక్తి పై వేధింపులకు దిగడం ఏంటి?

108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విరుచుకు పడ్డారు.  "ప్రజల ప్రాణాలను నిలబెట్టే 108 అంబులెన్స్ ల నిర్వహణ కాంట్రాక్టులో స్కామ్ జరగడం సిగ్గుచేటు. గత ఒప్పందం ప్రకారం బీవీజీ సంస్థకు 2020 డిసెంబరు 12 వరకూ కాలపరిమితి ఉంటే... 15 నెలల ముందే 2019 సెప్టెంబరు 20న కొత్త ఏజెన్సీ కోసం 111 జీవో ఎందుకు తెచ్చినట్టు?" అని చంద్రబాబు ప్రశ్నించారు. "అంబులెన్స్ నిర్వహణ ఒప్పందం అమలులో ఉండగా 10 నెలల ముందుగానే 2020 ఫిబ్రవరి 13న జీవో 116 తో బీవీజీ సంస్థఒప్పందాన్ని ఎందుకు రద్దుచేశారు? ఫైనాన్స్‌ విధానంలో కొనుగోలు చేయగలిగిన అంబులెన్సులను జీవో 117తో నేరుగా డబ్బులు చెల్లించి ఎందుకు కొన్నారు?" అని నిలదీశారు. "ఒక్కొక్క పాత అంబులెన్సుకు రూ.47 వేలు, కొత్త అంబులెన్సుకు రూ.90 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు పెంచి... వైసీపీ ఎంపీ అల్లుడికి చెందిన సంస్థకు ఉన్నపళంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంలో మతలబు ఏంటి? అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి?" అని చంద్రబాబు విరుచుకు పడ్డారు. "అంబులెన్స్ స్కామ్ వెలుగులోకి వస్తే అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం... కుంభకోణాన్ని బయటపెట్టిన తెలుగుదేశం నేత పట్టాభిరామ్ పై వేధింపులకు దిగడం ఏంటి? హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది తెలుగుదేశం." అని చంద్రబాబు పేర్కొన్నారు.

మంత్రి బొత్స అమరావతి పర్యటన వెనక అసలు కథేంటి?

సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుండి భూములిచ్చిన రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా మూడు రాజధానుల గురించి గవర్నర్ ప్రసంగం లో ప్రస్తావించారు. ఐతే నిన్న మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజధాని తరలింపు పై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని.. కరోనా నుంచి బయటపడిన తర్వాతే దీని పై మాట్లాడతామని స్పష్టం చేశారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి లోని పలు ప్రాంతాల్లో చేస్తున్న పర్యటనలు ఆ ప్రాంతంలో కలకలం రేపుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను అయన పరిశీలిస్తున్నారు. ఈ పర్యటనలు అటు రైతులు, ఇటు ప్రతిపక్ష పార్టీలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇపుడున్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఈ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనకు తలొగ్గి వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కొంత మంది భావన. ఐతే ఈ పర్యటనల వెనుక మరో కోణం కూడా ఉందని మరి కొందరి వాదన. అదేంటంటే కొద్దీ రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఒక సర్వేలో ప్రజలు వైసిపి ప్రభుత్వానికి బ్రహ్మరధం పడుతున్నారని ఐతే కృష్ణ, గుంటూరు జిల్లాలలో మాత్రం పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ వచ్చిందట. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయేవరకు మూడు రాజధానుల ఊసెత్తకుండా గడిపి తర్వాత మెల్లగా రాజధాని ని తరలిస్తారని మరో వాదన. ఈ వాదనకు మద్దతుగా వారు హైలైట్ చేస్తున్న అంశం ఏంటంటే.. సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కొద్ది రోజు౭ల క్రితం కొంత మంది ఆర్కిటెక్ట్ లు మరియు అధికారులతో కలిసి విశాఖలోని కొన్ని ప్రాంతాలలో పర్యటించి రాజధానికి కావాల్సిన భవనాలను గుర్తించే ప్రయత్నం జరిగింది. దీంతో జగన్ ప్రభుత్వం అసలు ఉద్దేశ్యమేమిటో అని అటు ప్రజలు ఇటు విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు.

90 రోజుల్లో ఏపీలోని ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు

కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. 104 వాహనాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని చెప్పారు. 104 వాహనాల్లో కోవిడ్‌ శాంపిల్‌ సేకరణ చేపట్టాలని.. షుగర్, బీపీ లాంటి వాటికి పరీక్షలు చేసి అక్కడే మందులివ్వాలని సూచించారు. అవసరమైన వారిని పీహెచ్‌సీకి రిఫర్‌ చేయాలని ఆదేశించారు. రాబోయే 90 రోజుల్లో ప్రతి ఇంటికీ అవగాహన కల్పించి, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి పీహెచ్‌సీలో కోవిడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌ ఉండాలని తెలిపారు. ప్రతి నెలలో ఒకరోజు తప్పనిసరిగా గ్రామానికి 104 వాహనం వెళ్లాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం చేస్తున్న కోవిడ్‌ పరీక్షల్లో హేతుబద్ధమైన, పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో 50 శాతం కోవిడ్‌ పరీక్షలు, మిగతా 50 శాతం పరీక్షలు మిగిలిన చోట్ల చేయాలని ఆదేశించారు. కొన్ని పరీక్షలు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకునేవారికి కేటాయించాలన్నారు. ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారికి కూడా కోవిడ్‌ పరీక్షలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

కల్నల్ సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్

కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబసభ్యులను తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన ఆయన.. తొలుత సంతోష్ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆపై రూ.5 కోట్ల ఆర్థిక సాయం తాలూకు చెక్, ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందించారు. రూ.4కోట్ల రూపాయల చెక్‌ను సంతోష్ బాబు భార్యకు.. రూ.కోటి చెక్‌ను సంతోష్ బాబు తల్లిదండ్రులకు అందజేశారు. కల్నల్‌ సంతోష్ బాబు కుటుంబానికి హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్‌లో 711 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలానికి సంబంధించిన పత్రాలను, అలాగే సంతోష్ బాబు‌ భార్యను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం అందజేశారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

వాళ్ళని జైల్లో వెయ్యడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత!

108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని టీడీపీ నేత పట్టాభిరామ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. గత కాంట్రాక్ట్‌ను తప్పించి.. ఎంపీ విజయసాయిరెడ్డి బంధువర్గాలకు 108 అంబులెన్స్‌ల కాంట్రాక్టును కట్టబెట్టారని.. దీనిపై సీఎం, ఆరోగ్యమంత్రి సమాధానం చెప్పాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. మరోవైపు, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారనే నెపంతో పట్టాభిరామ్‌ ని అరెస్ట్ చేసేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసిందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్కామ్ చేసినోళ్లని వదిలేసి, దాన్ని బయట పెట్టినోళ్లని అరెస్ట్ చేయాలనుకోవడం ఏంటని మండిపడ్డారు. "స్కామ్ చేసినోళ్ళని వదిలి, బయటపెట్టిన వాళ్ళని జైల్లో వెయ్యడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత! రివర్స్ టెండరింగ్ లో భారీగా మిగిలిపోయింది అంటూ బిల్డప్ ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం,108లో ప్రజాధనం ఎందుకు వృధా అయ్యిందో చెప్పలేక టిడిపి నాయకుల్ని అరెస్ట్ చెయ్యాలనుకుంటుంది." అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "టిడిపి నాయకులపై అక్రమ కేసులు,అరెస్టులతో వైకాపా నేతల ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్ మాఫియాల ఆగడాలు బయటకు రాకుండా చెయ్యాలనే జగన్ రెడ్డి గారి ప్రయత్నం ఫలించదు." అని లోకేష్ పేర్కొన్నారు.

కరోనా ఎఫెక్ట్... టిఫిన్ బండి నడుపుతున్న హెడ్ మాస్టర్

కరోనా వైరస్ అటు ప్రభుత్వాలను ఇటు సామాన్యులను కూడా కుదేలు చేస్తోంది. తల్లి తండ్రులు కూలి పనికి వెళుతుంటే పాఠశాలలకు వెళ్ళవలసిన పిల్లలు తోపుడు బండి వద్ద ఉండి ఫ్రూట్స్ అమ్ముతున్న ఫోటోలు చూస్తున్నాం. ఒక ఆర్ టి సి ఉద్యోగి కుటుంబ పోషణ కోసం హెయిర్ సెలూన్ పని చేయడం కూడా చూసాం. తాజాగా ఒక ప్రయివేట్ పాఠశాల ప్రిన్సిపాల్ తన కుటుంబాన్ని పోషించడానికి టిఫిన్ బండి నడుపుతున్నారు. ఖ‌మ్మంలో ఓ ప్రైవేట్ పాఠశాల లో ప్రిన్సిప‌ల్ గా పని చేస్తున్న వ్యక్తికి వచ్చే శాలరీ తో మొన్నటి వరకు జీవితం హాయిగానే సాగిపోయింది. ఐతే కరోనా దెబ్బకు ప్రయివేట్ స్కూల్స్ క్లోజ్ అవ్వడం తో కొంత మంది పాఠశాల యాజమాన్యాలు మ‌ళ్లీ స్కూల్స్ రీ ఓపెన్ అయ్యే వ‌ర‌కు టీచర్లకు సిబ్బందికి జీతాలిచ్చే ప‌రిస్థితి లేద‌ని చేతులెత్తేశాయి. దీంతో కుటుంబ పోష‌ణ‌ కోసం రెండు వేల రూపాయలతో ఓ తోపుడు బండి కొని భార్య‌తో క‌లిసి దాని పై ఇడ్లీలు, దోసెలు అమ్ముతూ దాని పై వచ్చే రెండు మూడు వందల సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. మరో చోట ప్రయివేట్ కాలేజ్ లెక్చరర్ కుటుంబ పోషణ కోసం రోజు కూలీ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి నెలకొంది. దేశంలో చాలా మంది ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్ల పరిస్థితి ఇంచుమించుగా ఇలాగే ఉంది.

వైసీపీ కార్యకర్తల శ్యాడ్ సాంగ్.. రేనా చూడు రేనా చూడు, లైవ్ పెట్టలేని దుస్థితి చూడు...

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పిస్తుంటే.. సీఎం వైఎస్ జగన్, విజయసాయిలపై బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పిస్తున్నారు. "కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా బాబు గారికి తగిలించిన బిరుదులివి. చాణక్యుడు, వ్యూహకర్త, దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన ఉద్దండుడు, 20-30 ఏళ్ల ముందస్తు ఆలోచనలు చేసిన విజనరీ. మరి సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి. ఏమిటీ పరాభవం." అంటూ రాజ్యసభ ఎన్నికలను ఉద్దేశించి చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు వేశారు. "నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ఒక ఎమ్మెల్యేని, బాబు గారి దూత కలిసి పార్టీని వదిలి వెళ్లొద్దని ప్రాధేయపడ్డాడట. తక్షణం 5 కోట్లు అరేంజ్ చేసారట. ఇంకో పదేళ్లు పవర్ లేకపోయినా దేనికీ ‘లోటు’ లేకుండా పార్టీని నడిపిస్తారని భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఖజానా దోచినోడికి ఇదో లెక్కా." అంటూ మరో ట్వీట్ తో చంద్రబాబుపై విజయసాయి విమర్శలు గుప్పించారు. కాగా, విజయసాయి విమర్శలకు బుద్ధా వెంకన్న కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. "రేనా చూడు రేనా చూడు, లైవ్ పెట్టలేని దుస్థితి చూడు, దమ్ములేని మాట చూడు, తొంటి చేతి వాచీ చూడరా.. అని వైకాపా కార్యకర్తలు ఏడుస్తూ పాడుతున్నారు. మీ చెవిన పడలేదా విజయసాయి గారు." అంటూ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. "ప‌బ్జీ ఆట‌కు పోతురాజు.. ప‌నిచేయ‌డానికి తిమ్మరాజు అని సొంత ఎంపీ అంటున్నారు వైఎస్ జగన్ ని. మీరేమో ట్వీట్లతో జాకీలేసి లేపి ఎక్క‌డికో తీసుకెళ్లాల‌నుకుంటారు. ఆయ‌న తాడేప‌ల్లి గ‌డ‌ప‌దాటి రారు." అంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. కరోనాను కట్టడి చెయ్యడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిలైందంటూ బీజేపీ ఆందోళనలకు దిగింది. హైదరాబాద్ కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముట్టడించేందుకు యత్నించింది. ఈ క్రమంలో బండి సంజయ్‌‌ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అంతేకాదు... ఆయన వెంట వచ్చిన బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంధర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో తెలంగాణ సర్కారు విఫలమైందని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ఎన్ని టెస్టులు చేశారు. ఇక్కడ ఎన్ని చేశారో చెప్పాలని ప్రశ్నించారు. డాక్టర్లు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నా వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేసారు. పీపీఈ కిట్లు, మాస్కులు కూడా లేవని డాక్టర్లు ధర్నాలు చేశారని.. సీఎం‌, మంత్రులు జోకర్ల లాగా మారారని విమర్శించారు.  హెల్త్ బులెటిన్ కూడా ఇష్టం వచ్చినట్లు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా ను ఆరోగ్య శ్రీ కింద చేర్చాలని డిమాండ్ చేసారు. మోడీ సర్కారు రాష్ట్రానికి చేసిన సాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.