అమరావతి పై జగన్ మరో కొత్త డ్రామా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
posted on Jun 23, 2020 @ 12:08PM
కొద్ది రోజులుగా ఏపీలో వైసిపి ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో కొంత హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని మార్పు ఇప్పట్లో ఉండదని రెవెన్యూ మంత్రి పెద్దిరెడ్డి చెప్పిన మర్నాడే సీనియర్ మంత్రి బొత్స ఇప్పటికే నిర్మాణం పూర్తైన, మరి కొంత పని పెండింగ్ లో ఉన్న భవనాలను సందర్శించారు. దీంతో అమరావతి విషయంలో అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి అనే విషయం అర్ధం కాక అటు విశ్లేషకులు ఇటు ప్రజలు జుట్టు పీక్కునే పరిస్థితి నెలకొంది.
ఐతే ఇదే విషయం పై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. కోర్టులలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో అసత్యాలతో సీఎం జగన్ కాలం గడుపుతున్నారని అన్నారు. ఈ రోజు రాష్ట్రం లో పోలీస్ రాజ్యం నడుస్తోందని అన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని రాష్ట్రంలోని వివిధ రంగాల ప్రజల నుండి హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న తనకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని అయన అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇంకో పార్టీలో చేరితే కష్టం.. పార్టీ ప్రదర్శనలో పాల్గొంటే కష్టం అన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. ఈ పద్ధతులు మంచివి కాదని అయన అన్నారు. అంతే కాకుండా వైసిపి ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో మద్యం మాఫియా, ఇసుక మాఫియా పురుడు పోసుకుంటున్నాయని అయన తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సందర్భం లో అమరావతి విషయం లో జగన్ సర్కారు డ్రామా ఆడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు.