అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్య పదజాలంతో దూషించారాంటూ అయ్యన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ కేసుతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో, త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అయ్యన్న హైకోర్టును ఆశ్రయించారు. అధికార పార్టీ కక్షతో తనపై అక్రమంగా కేసు బనాయించిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయడంతో పాటు తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని, పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయ్యన్న దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

తెలంగాణకు రావాల్సిన కోబాస్‌ యంత్రాన్ని కోల్‌కతాకు తరలించిన కేంద్రం!!

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కరోనా విషయంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని, కరోనా పరీక్షలు చాలా తక్కువగా చేస్తోందని జేపీ నడ్డా విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే, తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహించడానికి ఓ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా కారణమైందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కరోనా పరీక్షలు సరిగా చేయడం లేదన్న విమర్శలకు చెక్‌ పెట్టవచ్చన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్ఆర్‌) కింద 'కోబాస్‌ 8800' అనే యంత్రాన్ని బుక్‌ చేసింది. అమెరికాకు చెందిన రోచే కంపెనీ ఈ యంత్రాన్ని తయారు చేసింది. మంత్రి కేటీఆర్‌ రాంకీ సంస్థతో మాట్లాడి సీఎస్ఆర్‌‌ కింద ఈ యంత్రాన్ని తెప్పించాలని కోరారు. దాంతో ఆ సంస్థ ‘కోబాస్‌ 8800’ను బుక్‌ చేసింది. దాని విలువ సుమారు రూ.7 కోట్ల ఉంటుందని తెలుస్తోంది. ఈ యంత్రంతో 24 గంటల వ్యవధిలో ఏకంగా 5వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని సమాచారం.  కాగా, రాష్ట్ర ప్రభుత్వం అమెరికా నుంచి తెప్పించిన కోబాస్‌ 8800 యంత్రంపై కేంద్రం కన్ను పడిందట. కోబాస్‌ 8800‌ యంత్రం 4 రోజుల క్రితమే చెన్నైకి చేరింది. దీని కోసం హైదరాబాద్ నిమ్స్‌లో భారీ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తలిస్తే.. కేంద్ర ప్రభుత్వం మరొకటి తలిచింది. చెన్నై చేరిన కోబాస్‌ 8800 యంత్రాన్ని కేంద్రం కోల్‌కతాకు తరలించిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా ధ్రువీకరించారు. రాష్ట్రం కోసం తీసుకొచ్చిన యంత్రాన్ని కోల్ కతాకు తీసుకెళ్లే విషయంలో కేంద్రం కీలకంగా వ్యవహరించిందని.. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం హుందాగా వ్యవహరించినట్లుగా ఈటెల వ్యాఖ్యానించారు. తెలంగాణతో పోలిస్తే.. పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వారికి ఆ యంత్రం తో అవసరం ఎక్కువగా ఉంటుందన్న మాట కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రావటంతో.. హైదరాబాద్ కు రావాల్సిన యంత్రం.. కోల్ కతాకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి కూడా తెలంగాణ కోసం సీఎస్ఆర్‌ కింద కోబాస్‌ 8800 యంత్రాన్నే బుక్‌ చేశారు. ఆ రెండు యంత్రాలతోపాటు రాష్ట్రంలో సీసీఎంబీ, ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లలో కలిపి రోజుకి సుమారు 15 వేల టెస్టులు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, కేంద్రం మాత్రం ఒక రాష్ట్రానికి రెండు యంత్రాలు ఎందుకంటూ ఒక యంత్రాన్ని కేసులు ఎక్కువగా బెంగాల్ కి తరలించిందని సమాచారం. కాగా, ఈ విషయాలన్ని బీజేపీ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన క్రమంలో బయటకు రావటం గమనార్హం. ఓ వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు వచ్చే యంత్రాన్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్తే, మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని చర్చలు మొదలయ్యాయి.

108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో అవినీతి.. మరో టీడీపీ నేత అరెస్ట్ కు రంగం సిద్ధం!!

ఏపీలో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు కాగా, కొందరు టీడీపీ నేతలు అరెస్టైన సంగతి తెలిసిందే. తాజాగా, మరో టీడీపీ నేత అరెస్ట్ కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. టీడీపీ నేత పట్టాభిరామ్‌ ఇంటి వద్ద కొందరు పోలీసుల పహారా కాస్తున్నారు. ఆయనను ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకునే అవకాశముందని సమాచారం. 108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని పట్టాభిరామ్ ఆరోపించారు. ఆ కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలను కూడా ఆయన మీడియా సాక్షిగా చూపించారు. గత కాంట్రాక్ట్‌ను తప్పించి.. ఎంపీ విజయసాయిరెడ్డి బంధువర్గాలకు 108 అంబులెన్స్‌ల కాంట్రాక్టును కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై సీఎం, ఆరోగ్యమంత్రి సమాధాం చెప్పాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారనే నెపంతో పట్టాభిరామ్‌ ని అరెస్ట్ చేసేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై టీడీపీ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి మా నాయకులని కార్యకర్తలని అరెస్టులు చేస్తున్నారు. 108 అంబులెన్సుల కుంభకోణం 300 కోట్లు సాక్ష్యాలతో సహా బయటపెట్టాం. బాద్యులయిన మీపార్టీ నాయకుల మీద వారి బంధువుల మీద ఏంచర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు." అని దేవినేని ట్వీట్ చేశారు.

సొంత పార్టీ నేతల నుంచే ప్రాణహాని.. క‌ల‌క‌లం రేపుతోన్న వైసీపీ ఎంపీ లేఖ

వైసీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. తనకు ప్రాణాహాని ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. తనను చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఒక ఎంపీ తనకి సొంత పార్టీ నేతల నుంచే ప్రాణహాని ఉందని  లోక్‌సభ స్పీకర్ కు లేఖ రాయడం సంచలనంగా మారింది. కాగా, ఈ లేఖపై స్పందించిన స్పీకర్‌.. దానిని కేంద్ర హోంశాఖకు పంపినట్లు తెలుస్తోంది. అంతేగాక స్పీకర్‌తో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యక్తిగతంగా ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. త్వరలో ఇదే విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కూడా కలిసి ఎంపీ ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు, ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన వ్యక్తిగత కార్యదర్శి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఎంపీని చంపుతామని బెదిరిస్తూ, కులదూషణలు చేస్తున్న వారి నుంచి రక్షణ కావాలని కోరుతూ ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం, ఆకివీడు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని నలుగురు ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు శ్రీవారి భూముల అమ్మకం, ఇసుక కొరత, ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతి ఇలా పలు అంశాలపై మీడియా ముఖంగా జగన్ సర్కార్ ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయన ఈ అంశాలపై సీఎం జగన్ కలిసి మాట్లాడాలని ప్రయత్నించారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన వ్యాఖ్యలను తట్టుకోలేని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనపై విరుచుకుపడ్డారు. కొందరు స్థానిక వైసీపీ నేతలైతే ఆయనను నియోజకవర్గంలో తిరగనివ్వమని, చంపేస్తామని బెదిరిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదు చేశారు. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

స్టేట్ హోంలో కలకలం.. 57 మంది బాలికలకు కరోనా.. ఐదుగురు గర్భవతులు!

ఉత్తర ప్రదేశ్‌లో కాన్పూరులోని ఓ ప్రభుత్వ వసతిగృహంలో ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలడం, వారిలో ఐదుగురు గర్భంతో ఉన్నట్టు తెలియడం ప్రకంపనలు సృష్టిస్తోంది. యూపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు షెల్టర్‌ హోంలో ఉంటున్న బాలికలకు కరోనా‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో ఐదుగురు బాలికలు గర్భంతో ఉన్నట్టు తెలియడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలి కాన్పూర్‌ ఎస్‌ఎస్‌పీ దినేష్‌ కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. షెల్టర్ హోంలో ఉన్న బాలికలు గర్భవతులు కావడం, వారిలో ఒకరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌, మరొకరికి హెపటైటిస్‌ సీ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయని.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు.  ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు పూనం కపూర్‌.. హోంలో చేరిన తర్వాత ఎవరూ గర్భం దాల్చలేదని.. వారందరూ లైంగిక దాడి బాధితులని పేర్కొన్నారు. కాన్పూర్‌ జిల్లా కలెక్టర్‌ బ్రహ్మదేవ్‌ రామ్‌ తివారి ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ఆశ్రమంలోని సిబ్బంది ఇటీవల ఇద్దరు బాలికలతో కలిసి కాన్పూర్ హాస్పిటల్‌కు వెళ్లారని, అక్కడ కరోనా రోగులతో కాంటాక్ట్ అయిన తర్వాత వీరికి వైరస్ సోకిందని తెలిపారు. వివిధ శిశు సంక్షేమ కమిటీల నుంచి ఇక్కడి హోంకు ఐదుగురు బాలికలు వచ్చారు. వారంతా లైంగిక దాడి బాధితులు. ఇక్కడికి రావడానికి ముందే వారు గర్భవతులుగా ఉన్నారని కలెక్టర్‌ వివరణ ఇచ్చారు.

తెలంగాణను హడలెత్తిస్తున్న కరోనా.. ఒక్క రోజులోనే ఏకంగా 730 కేసులు

తెలంగాణలో రోజురోజూకీ కరోనా ఉధృతి తీవ్రమవుతోంది. పబ్లిక్ హాలిడే ఐన ఆదివారం రోజున ఏకంగా రిక్డార్డు స్థాయిలో 730 కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో నే 659 కేసులు నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో 71 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7802కు చేరింది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి తెలంగాణ లో 210 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్న ఒక్క రోజు ఏడుగురు మరణించారు. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి 3731 మంది కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 3861 మంది కరోనా వైరస్ చికిత్స తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం లో 57,054 మంది నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా, 49,252 మంది కి వైరస్ నెగిటివ్‌గా తేలింది. ఒక పక్క నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తో అయన ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరో పక్క హోమ్ మంత్రి మహమూద్ అలీ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. అక్కడ పని చేసే భద్రతా సిబ్బంది ఒకరికి పాజిటివ్ అని తేలడం తో అధికారులు అప్రమత్తమయ్యారు. హోమ్ మంత్రి క్వార్టర్స్ వద్ద విధులలో ఉన్న ఒక హోమ్ గార్డ్ కు కూడా కరోనా నిర్ధారణ ఐన నేపథ్యంలో మంత్రి మహమూద్ అలీ ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారు.

రాజధాని రైతుల పిటిషన్ పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

చంద్రబాబు హయాంలో అప్పటి ఏపీ ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించి వేలాది మంది రైతులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం రాజధానికి భూమి ఇచ్చిన వారికి ప్రభుత్వం ఏటా కౌలు ఇస్తూ వస్తోంది. ఐతే గత ఏడాది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మూడు భాగాలు చేసి కర్నూల్, వైజాగ్, అమరావతిలలో వరుసగా జ్యుడిషయల్ కేపిటల్, అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్, లెజిస్లేటివ్ కేపిటల్ గా మార్పు చేస్తున్నట్లుగా  ప్రకటించారు. దీంతో తాజాగా అమరావతి ప్రాంత రైతులకు ఇవ్వవలసిన కౌలు ఇంతవరకు చెల్లించక పోవడం తో ఆ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు వార్షిక కౌలు చెల్లించేలా సీఆర్డీఏను ఆదేశించాలని వారు పిటిషన్ దాఖలు చేసారు. దీంతో వార్షిక కౌలు విషయంలో ఏపీ హైకోర్టు సీఆర్డీఏ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం కౌలుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై జూన్ 23వ తేదీలోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఆర్డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

కూతురు, అల్లుడిపై ఏపీ మంత్రి గన్‌మెన్ దాడి

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీ మంత్రి తానేటి వనిత గన్‌మెన్‌ చంద్రారావు రెచ్చిపోయాడు. ప్రేమ వివాహం చేసుకున్న కూతురు, అల్లుడిపై దాడి చేశాడు. ఐదు నెలల క్రితం పోలీసుల సమక్షంలో చంద్రారావు కూతురు ప్రేమపెళ్లి చేసుకుంది. అప్పటినుండి కూతురిపై కోపం పెంచుకున్నాడు. కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని చంద్రారావు.. ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భిణి అన్న కనికరం కూడా లేకుంగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై కూతురు, అల్లుడిని తరుముతూ దాడి చేశాడు. కూతురు వేడుకుంటున్నా చంద్రారావు వదిలిపెట్టలేదు.  ఈ ఘటన పై ఎస్పీ నారాయణ నాయక్ స్పందించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. కాగా, ఇప్పటికే పోలీసులు చంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై  ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు తెలుస్తోంది.

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

కరోనా విజృంభణ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ప్రకటించారు. అలాగే, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేయాలని విపక్ష నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులతో చర్చించి మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేశారు.

మరో రైతు ఉసురు తీసిన రెవెన్యూ ధనదాహం

రైతులను తమ ధన దాహం తో పీడించుకు తింటున్న కొంత మంది రెవెన్యూ ఉద్యోగుల పుణ్యమా అని మొత్తం రెవెన్యూ డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఒక తహసీల్దార్ పై ఒక రైతు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది. అయినా కొంత మంది అధికారులలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి పేరు మీద ఉన్న 1.2 ఎకరాల భూమికి తన పేరు మీద పట్టా ఇవ్వాలని తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి వేసారిన 65 ఏళ్ళ రైతు అదే ఆఫీసు ముందు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజిరెడ్డి అనే రైతు గత్ కొన్ని నెలలుగా కాల్వ శ్రీరాంపూర్ లోని భూమిని తన పేరుతో పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఐతే ఎంతకీ తన పేరుతో పాసు పుస్తకం ఇవ్వకపోవడం తో విసిగిపోయిన ఆ రైతు బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నాడు.

ప‌రీక్ష‌ల పేరుతో ల‌క్ష‌లాది మంది విద్యార్థులను క‌రోనా కోర‌ల్లోకి నెట్టేస్తున్నారు

కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం కొద్ది రోజుల క్రితం పదో తరగతి పరీక్షలు పెట్టి తీరుతామని చెప్పింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి మరింత పెరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. తాజాగా ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. "ఏపీలో కరోనా విజృంభిస్తోంటే, ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను నిర్వహించే ఆలోచన చేస్తోంది. పొరుగురాష్ట్రాల్లో ఉన్నత విద్యా పరీక్షలనే రద్దు చేస్తోంటే ఇక్కడ చిన్నారుల ఆరోగ్యంతో ఆటలెందుకు? వెంటనే పదో తరగతి పరీక్షలను రద్దుచేయాలి." అని చంద్రబాబు డిమాండ్ చేశారు. "క‌రోనా సామాజిక‌వ్యాప్తి మొద‌లైన ప్ర‌మాద‌క‌ర‌మైన ద‌శ‌లో ల‌క్ష‌లాది మంది విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌కుండా టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దుచేయాలి. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు త‌మ విద్యార్థుల‌ను కాపాడుకునేందుకు ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశాయి. ఏపీ ప్ర‌భుత్వం మొండిగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌నే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌దు. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ జగన్ గారు మాత్రం తాడేప‌ల్లి గ‌డ‌ప కూడా దాటి రావ‌డంలేదు. ల‌క్ష‌లాది మంది విద్యార్థులను మాత్రం ప‌రీక్ష‌ల పేరుతో క‌రోనా కోర‌ల్లోకి నెట్టేస్తున్నారు. త‌క్ష‌ణ‌మే ప‌రీక్ష‌ల ర‌ద్దు ప్ర‌క‌టించ‌క‌పోతే టీడీపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌కు దిగుతాం." అని నారా లోకేష్ పేర్కొన్నారు.

ప్రమాదం వైపు పరుగెడుతున్న ప్రపంచం: డబ్ల్యూహెచ్ఓ

భారత్ తో పాటు ప్రపంచం మొత్తం కరోనా విలయ తాండవంతో బెంబేలు ఎత్తుతోంది. భారత్ లో ఐతే ప్రతిరోజు వేల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. అంతే కాకుండా కరోనా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. డబ్ల్యూ హెచ్ ఓ తాజాగా ప్రపంచం లో కరోనా విజృంభణ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు ఓ కొత్త ప్రమాదక‌ర‌ దశలోకి జారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గురు శుక్రవారాల మధ్య గడచిన 24 గంటల్లో లక్షా 50 వేల కేసులు నమోదయ్యాయ‌ని.. ఒకే రోజులో ఈ స్థాయిలో కేసులు తేలడం అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిణామం అని అభిప్రాయ‌ప‌డింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డయిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికమ‌ని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం అమెరికాతో పాటు ఆసియా దేశాల్లోనూ కరోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంద‌ని తెలిపింది.

మేము ప్రారంభించిన పథకాల పేర్లు నేనే మిస్సవుతానేమో అనిపిస్తోంది: సీఎం జగన్

'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకానికి సంబంధించి రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు.  "గతేడాది నా పుట్టినరోజున డిసెంబరు 21న 'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకాన్నిప్రారంభించాం. రెండో విడత సాయాన్ని మళ్లీ అదే రోజున ఇద్దామనుకున్నాం. కానీ కరోనా కష్టకాలంలో నేతన్నలు పడుతున్న కష్టం చూడలేక వారికి ముందుగానే సాయం విడుదల చేస్తున్నాం" అని సీఎం జగన్ తెలిపారు. 81,024 మంది లబ్ధిదారులకు రూ.194.46 కోట్ల సహాయం అందనుందని సీఎం తెలిపారు. అర్హులెవరైనా మిగిలిపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని.. వచ్చే నెలలో ఇదే రోజున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. 13 నెలల కాలంలో చేనేతన్నలకు దాదాపు రూ.600 కోట్ల సహాయం చేశామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన పథకాలు చూస్తుంటే, వాటి పేర్లు నేనే మిస్సవుతానేమో అనిపిస్తోంది అంటూ సీఎం చమత్కరించారు. 13 నెలల్లోనే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు చేశామని సీఎం జగన్ వెల్లడించారు.

ఇసుక బుక్ చేసిన ఏపీ మంత్రి ఇంటికి మట్టి!!

ఏపీలో ఇటీవల కొందరు అధికార పార్టీ నేతలు ఇసుక విషయంలో అసహనం వ్యక్తం చేస్తుంటే.. తాజాగా ఏకంగా ఓ మంత్రికే ఇసుక విషయంలో చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్‌ మండలం భట్నవిల్లి సమీపంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇల్లు కట్టుకొంటున్నారు. మంత్రి ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేశారు. ఏపీఎండీసీ అధికారులు నాలుగు లారీల ఇసుకను తరలించారు. అయితే, ఆ ఇసుక నాసిరకంగా ఉంది. అందులో ఇసుక కన్నా తువ్వ, మట్టే ఎక్కువగా ఉంది.  దీనిపై ఇంటి పనులు చేస్తున్న నిర్వాహకులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి ఇసుక సరఫరాలో లోపాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాలతో ఆర్డీవో భవానీశంకర్, పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ రాంబాబు వెళ్లి.. ఇసుక గుట్టలను పరిశీలించారు. ఆ ఇసుక ఎటువంటి నిర్మాణాలకూ పనికిరాదని, కేవలం పునాదుల్లో వేయడానికి ఉపయోగపడుతుందని కలెక్టర్‌కు నివేదించారు. మంత్రికే ఇలాంటి నాసిరకం ఇసుక పంపితే.. సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూడు నెలల నుంచి సామాన్యులకు కూడా ఇదే తరహా పనికిరాని ఇసుకను సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ సమస్య మంత్రి దాకా రావడంతో అధికార యంత్రాంగం కదిలిందని అంటున్నారు.

రూ.50 వేల కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

వలస కార్మికులకు వారి స్వస్థలాల్లోనే ఉపాధిని కల్పించేందుకు ఉద్దేశించిన ‘గరీబ్ కళ్యాణ్ రోజ్ ‌గార్ యోజన’ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్‌ లోని ఖగారియా జిల్లాలో ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచడమే ఈ పథకం లక్ష్యమన్న మోడీ.. ఇందుకోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక, ఎన్నో అవస్థలు పడుతూ స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికుల అవస్థలు తనను కదిలించాయని, వారి కోసమే ఈ పథకమని మోడీ వ్యాఖ్యానించారు.  ఇప్పటివరకూ పట్టణాల పురోగతి కోసం పాటు పడిన వలస కార్మికులు.. ఇక నుంచి తమ ప్రాంతాన్ని ప్రగతి పథంలో నిలపాలని మోడీ ఆకాంక్షించారు. పల్లె ప్రాంతాల్లో నివసిస్తోన్న శ్రామికులైన మన సోదర సోదరీమణులకు ఈ పథకాన్ని అంకితం చేస్తున్నానని మోడీ తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల ద్వారా మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించామని, ఇందుకు రూ. 50 వేల కోట్లను ఖర్చు చేస్తామని మోడీ వెల్లడించారు. ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాలో ఈ పథకం అమలవుతుందన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలలో వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు. వీరికి ప్రయోజనం చేకూర్చేలా  ‘గరీబ్ కళ్యాణ్ రోజ్ ‌గార్ యోజన’ ఉంటుంది.

ఏపీలో ఆ మూడు జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్

ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతుండటంతో ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటించారు అధికారులు. అనంతపురం జిల్లాలోని 8 మండలాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచి వారం రోజుల పాటు అనంతపురం జిల్లా కేంద్రం సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్‌డౌన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక‌, ప్రకాశం జిల్లాలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న ఒంగోలు, చీరాలలో ఆదివారం నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్‌ ‌ప్ర‌క‌టించారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పలాసలోనూ అధికారులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. పలాసకు చెందిన ఒకరి సంస్మరణ కార్యక్రమం ఈ నెల 11న జరిగింది.  ఇక్క‌డ దాదాపు 200 మందికి భోజనాలు పెట్ట‌గా.. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన బంధువుకు ఆ త‌ర్వాత క‌రోనా సోకినట్లు తేలింది. అంతేకాదు.. ఆ కార్యక్రమానికి హాజరైన ఓ వ్యాపారికి కూడా క‌రోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు.. పలాస, కాశీబుగ్గలను తొలుత కట్టడి ప్రాంతాలుగా గుర్తించారు. సంస్మరణ కార్యక్రమానికి ఎక్కువమంది హాజరైనందున నియోజకవర్గ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నివాస్‌ ప్రకటించారు.

కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్న సీఎం కేసీఆర్

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున సహాయం ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సీఎం వెల్లడించారు. సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి. దేశమంతా మీ వెంటనే ఉందనే సందేశం అందించాలి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

సరిహద్దుల్లో పాక్ రహస్య డ్రోన్ కూల్చివేత

భారత్-చైనా సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. భారత్ సరిహద్దులో పాకిస్థాన్‌ రహస్యంగా డ్రోన్ తో ఫోటోలు తీయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. సరిహద్దులో అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు కూల్చివేశాయి. జమ్ముూకశ్మీర్‌లోని కథువా జిల్లా హీరానగర్  సెక్టారులోని రథువా వద్ద శనివారం ఉదయం పాక్ కి చెందిన డ్రోన్ ఎగురుతూ కనిపించింది. రహస్యంగా ఫొటోలు తీస్తున్నట్టు గుర్తించిన బీఎస్ఎఫ్ 19 బెటాలియన్ కు చెందిన జవాన్లు దానిపై 8 రౌండ్ల కాల్పులు జరిపి దాన్ని కూల్చివేశారు. సరిహద్దుల్లో రహస్యంగా ఫొటోలు చిత్రీకరించేందుకే పాక్ దానిని పంపించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.