మీరెన్ని తప్పుడు వార్తలు రాయించినా.. నేను పార్టీ విధేయుడినే

కొద్ది రోజులుగా వైసీపీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం పై తీవ్ర రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటిస్ కు జవాబుగా పార్టీ పేరుతో సహా అనేక అంశాల పై ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా రఘురామ రాజు తాను పార్టీకి క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌న‌ని, సీఎం కనుక సమయం ఇస్తే ఆయనను కలిసి అన్ని విషయాలు చెపుతానని అన్నారు. తాను వైసీపీ పార్టీని కానీ, సీఎంను కానీ వ్య‌తిరేకించ‌లేద‌ని, ఐతే తన గురించి మాత్రం వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని విజయ్ సాయి రెడ్డి పై మండి పడ్డారు. తనకు, పార్టీ అధ్య‌క్షునికి మ‌ధ్య గొడ‌వ పెట్టొద్ద‌ని… వీలైతే త‌న‌కు ఇచ్చిన నోటీసు వెన‌క్కి తీసుకోవాల‌ని అయన విజ‌య‌సాయి రెడ్డి ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే త‌న‌కు వ‌చ్చిన షోకాజ్ నోటీసుల‌పై లీగ‌ల్ ఓపీనియ‌న్ కూడా తీసుకున్నాన‌ని అన్నారు. కేంద్ర‌మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిష‌న్ రెడ్డిల‌ను క‌లిసిన తరువాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

మరో వివాదంలో కూన రవి.. లేపేస్తానంటూ వైసీపీ నేతకు ఫోన్ లో వార్నింగ్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తేడా వస్తే లేపేస్తా అంటూ వైసీపీ నేతను ఆయన ఫోన్ లో బెదిరించిన ఆడియో క్లిప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత స్థానిక నేత గుడ్ల మోహన్ రావు వైసీపీ లో చేరారు. అయితే, ఆయ‌న బిల్డింగ్‌లోనే పొందూరు టీడీపీ కార్యాలయం ఉంది. టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించాలని గుడ్ల మోహన్‌కు వైసీపీ నుంచి ఒత్తిళ్లు ఉండ‌డంతో.. ఖాళీ చేయాల్సిందిగా కూన రవి కుమార్ ను కోరారు. దీంతో.. నేను ఖాళీ చేయను ఏం చేసుకుంటావో చేస్కోమ‌ని కూన స‌మాధానం చెప్పారు. అయితే.. తన గురించి ఆలోచించాలని కోరిన మోహ‌న్.. నా బిల్డింగ్ మాత్రం ఖాళీ చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో, ఆగ్ర‌హంతో ఊగిపోయిన కూన.. నీగురించి ఆలోచించేది ఏంటి? తేడా వస్తే లేపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే, త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను కూన ర‌వికుమార్ ఖండించారు. పొందూరులో ఉన్న‌ది జాయింట్ ప్రాప‌ర్టీ అని వివ‌ర‌ణ ఇచ్చిన కూన.. టీడీపీ ఆఫీసు బిల్డింగ్‌పై ఇద్ద‌రికీ హ‌క్కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. నాకు చెప్ప‌కుండా ఆఫీసు రంగుల‌ను ఎలా మారుస్తారు? అని ప్రశ్నించిన ఆయన.. మ‌ర్యాద‌త‌క్కువ ప‌నులు చేయొద్ద‌ని మాత్ర‌మే చెప్పానని అన్నారు. కాగా, ఇటీవల కూన రవి కుమార్ ఓ ఎమ్మార్వోను ఫోన్ లో దూషించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇలా వరుసగా ఆయన ఫోన్ లో వార్నింగ్ లు ఇస్తున్న ఆడియో క్లిప్ లు బయటకు రావడం చర్చనీయాంశమైంది.

మనీలాండరింగ్ కేసు.. అహ్మ‌ద్ ప‌టేల్ ఇంటికి ఈడీ అధికారులు

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. స్టెర్లింగ్ బ‌యోటెక్ లిమిటెడ్ సంస్థ‌కు సంబంధించిన మ‌నీలాండ‌రింగ్ కేసులో ఇంటరాగేట్ చేస్తున్న సమయంలో అహ్మద్ పటేల్ పేరు వెలుగు చూసింది. కేసుకు సంబంధించి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఒకరని ఈడీ ప్రశ్నించనప్పుడు అహ్మద్ పటేల్ పేరు వెల్లడించారు. అహ్మద్ పటేల్ తో పాటు ఆయన కుమారుడు ఫైసల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్ధిఖి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆ సాక్ష్యం ఆధారంగా ఈడీ అధికారులు అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించారు. వాస్తవానికి జూన్ మొదటి వారంలో విచారణకు హాజరుకావాలంటూ అహ్మద్ పటేల్ కు ఈడీ నటీసులు ఇచ్చింది. అయితే, 65 ఏళ్ల వయోభారంతో పాటు, కరోనా వైరస్ ముప్పు కూడా ఉన్నందున విచారణకు హాజరుకాలేనని పటేల్ చెప్పారు. దీంతో, ఈడీ అధికారులే ఆయన నివాసానికి వెళ్లి ప్రశ్నించారు. కాగా, ఆంధ్రాబ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి స్టెర్లింగ్ బయోటెక్ రూ. 5 వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ‌వేసింది. ఆ సంస్థ వివిధ ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం మొత్తం రూ. 8,100 కోట్లుగా అంచ‌నా వేస్తున్నారు. మరోవైపు, ఆ సంస్థ యజమానులైన నితిన్, చేతన్ సోదరులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వారు నైజీరియాలో దాక్కున్నారని సమాచారం. దీంతో, వారిని భారత్ కు రప్పించేందుకు ఈడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

పవన్ కు ఎందుకంత కడుపుమంట.. ఏపీ మంత్రి

కాపు నేస్తం పేరుతొ వైసిపి ప్రభుత్వం అంకెల గారడీ చేసి కాపులను మోసం చేస్తోందని జనసేన అధినేత పవన కళ్యాణ్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి కన్నబాబు తాజాగా పవన్ వ్యాఖ్యల పై ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో కాపులకు తొలి ఏడాది వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు కేవలం వంద కోట్లు ఇచ్చినపుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి ప్రశ్నించారు. పవన్‌కు చంద్రబాబు గొప్ప సంస్కర్తగా కన్పిస్తారని కన్నబాబు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్ అంటే నచ్చదని అందుకే ఆయనపై నిరంతరం విమర్శలు చేస్తుంటారని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పట్ల ఉన్న ప్రేమను పవన్‌ కళ్యాణ్ దాచుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కాపు నేస్తం అద్భుతమైన పథకమని ఈ సందర్బంగా మంత్రి అన్నారు. ఈ పథకం కింద మహిళలకు ఏటా రూ.15వేలు అందిస్తున్నామని దీని కోసం ఏడాదిలో రూ.4,769 కోట్లు ఖర్చు చేస్తున్నామని అయన తెలిపారు. పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కాపు నేస్తం పథకం పై దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన అన్నారు.

చిల్లర కేసులకిచ్చిన ప్రాధాన్యత వివేక హత్య కేసుకు ఇవ్వడం లేదు

ఏపీలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైఎస్ జగన్ సహా పలువురు వైసీపీ నేతలు అప్పుడు డిమాండ్ చేశారు. తీరా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక మాత్రం సైలెంట్ అయిపోయారు. కాగా, తాజాగా ఈ ఘటనపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.. జగన్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. వివేకా హత్యకేసు సీబీఐ దర్యాప్తుకివ్వాలని అడిగింది మీరు కాదా? గవర్నర్‌ని కలిసి మా బాబాయి హత్య కేసును సీబీఐకి ఇవ్వండని కోరింది మీరు కాదా? హైకోర్టులో పిటిషన్ వేసి వివేకా హత్య కేసు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించమని కోరింది మీరు కాదా? అంటూ వర్ల రామయ్య సీఎం జగన్‌ను ప్రశ్నించారు. సీఎం అయిన తర్వాత పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? అని నిలదీశారు. వివేకా హత్య కేసులో పురోగతి ఏమిటని?, హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత మీ ప్రభుత్వం దర్యాప్తును ఎంతవరకు పరిశీలించింది? అని ప్రశ్నించారు. హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించి 100 రోజులు దాటింది. ఇంతవరకు సీబీఐ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. సీబీఐ వర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేంద్ర హోంమంత్రికి, ప్రధానికి లేఖ రాయాలి. వివేకా కూతురు సునీత కూడా దర్యాప్తు పురోగతి వెల్లడించాలని సీబీఐకి లేఖ రాయాలి. సోషల్ మీడియా లాంటి చిల్లర కేసులకిచ్చిన ప్రాధాన్యత వివేక హత్య కేసుకు ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీజేపీ నేతతో స్టార్ హోటల్ లో వైసీపీ లీడర్ల మీటింగ్స్.. వైసీపీ లో కలవరం.! 

ఈ నెల 13 న హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిసిన విషయం పై ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఐతే అసలు ఈ సీసీ టీవీ ఫుటేజ్ ఎలా బయటికి వచ్చిందని కూడా చర్చ జరిగింది. ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ స్టార్ హోటల్ నుండి ఏపీ సీఐడీ ఈ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఒక సీఐడీ కేసు నమోదై ఉన్న నేపథ్యంలో ఈ ఫుటేజ్ కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫుటేజ్ ఆధారంగా వైసీపీ ప్రభుత్వం పై కుట్ర జరుగుతోందని ప్రూవ్ చేయడానికి ట్రై చేసింది. ఐతే వైసీపీ ప్రభుత్వం ఈ ఫుటేజ్ తో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డను, చంద్రబాబును టార్గెట్ చేయాలని ప్రయత్నిస్తే అక్కడ దొరికిన ఫుటేజ్ తో వైసీపీ నాయకత్వం షాక్ కు గురైనట్లు తెలుస్తోంది.  ఆ స్టార్ హోటల్ ఫుటేజ్ లో తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీ సుజనా ను కలిసిన ఆధారాలు దొరికాయి. ఇప్పటికే నరసాపురం ఎంపీ పార్టీ అధిష్టానం పై తిరుగుబాటు తో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో పాటు కొంత మంది సీనియర్ నాయకులూ కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తమ పార్టీ నేతలు సుజనా తో భేటీ కావడం తో అసలు పార్టీలో ఏం జరుగుతోందని మదనం మొదలైనట్లు సమాచారం. బీజేపీ ఎంపీ సుజనా ను కలిసిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ కారణం తో కలిసారో అరా తీసే పనిని కొంత మంది ప్రభుత్వ సలహాదారులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీ సుజనా చౌదరిని కలిసినట్లుగా అయన సన్నిహిత వర్గాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి.

కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. కారును లాక్కెళ్లిన రైలు

కడప జిల్లాలో కారును రైలు లాక్కెళ్లిన ఘటనలో ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వైకోడూరు దగ్గర చోటుచేసుకుంది. వైకోడూరు దాటిన తర్వాత భారతీ సిమెంట్స్‌కు వెళ్లే రైల్వే ట్రాకులో ఎల్సీ 3 వద్ద ఓ కారు రైల్వే లైనును దాటుతుండగా ట్రాక్‌ మధ్యలో ఆగిపోయింది. అదే సమయంలో, భారతీ సిమెంట్స్ నుంచి రెండు రైలింజన్లు వస్తున్నాయి. దీంతో కారును రైలు 200 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఆ సమయంలో కారులో ఇద్దరు ఉన్నారని.. తీవ్ర గాయాలైన వారిని సమీపంలోని ప్రొద్దుటూరు ఆస్పత్రి తరలిస్తుండగా ఒకరు మృతి చెందినట్లు సమాచారం. రైలు కేవలం 20 కిలోమీటర్ల స్పీడుతో రావడంతో కారు ట్రాక్ మీదే ఆగిపోయిందని, లేదంటే ఇంకా ఎక్కువగా దెబ్బతినేదని, స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందేవారని తెలుస్తోంది. కాగా, కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అంటున్నారు. మరోవైపు, రైల్వే క్రాస్‌కు ఎవరూ కాపలా లేకపోవడంతో.. రైళ్లు రావనుకుని ముందుకి వెళ్లుంటారని అనుమానిస్తున్నారు.

నంద్యాలలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి, పలువురికి అస్వస్థత

కర్నూల్ జిల్లా నంద్యాల ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఒకరు మృతి చెందారు, పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 60మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్‌ లీక్ కావడంతో కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

పలాస ఘటన‌పై సీఎం సీరియస్.. ఇద్దరు అధికారులపై‌ వేటు

శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా కారణంగా మరణించిన వ్యక్తి అంత్యక్రియలు విషయంలో అధికారులు  అమానవీయంగా వ్యవహరించారు. మృతదేహాన్ని జేసీబీ‌ ద్వారా తరలించారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. కరోనా రోగుల మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి జేసీబీ లు మరియు ట్రాక్టర్లలో తరలించడాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. చనిపోయిన వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉందన్నారు. అమానవీయమైన ఇలాంటి ఘటనకు కారణమైన జగన్ సర్కారును చూసి సిగ్గుపడుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.  కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల దృష్టికి రావడంతో.. వెంటనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో సీఎంఓ అధికారులు మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి పొక్లెయిన్‌ ద్వారా మృతదేహాన్ని తరలించడం అమానవీయమని స్పష్టంచేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన జిల్లా కలెక్టర్‌ నివాస్, పలాస మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌ను సస్పెండ్ ‌చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే స‌మ‌యంలో.. సోంపేట పరిధిలోని కోర్టు వీధిలో ట్రాక్టర్ పై మహిళ మృతదేహం తీసుకెళ్లిన ఘటనపై కూడా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై సీఎం జగన్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీకాకుళం జిల్లా, పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించిందన్నారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకూడదు. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోకతప్పదు అని సీఎం హెచ్చరించారు.

మంత్రి పదవి దక్కేది ఎవరికి?.. రేసులో విడదల రజనీ, డొక్కా!!

గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపికైన నేపధ్యంలో ఆయన త్వరలో మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో, ఆయన స్థానంలో మంత్రి పదవి ఎవరికి దక్కబోతుంది అనే విషయంపై రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీసీ కోటాలో తనకే మంత్రి పదవి లభిస్తుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ హడావిడిచేస్తున్నారట. ఎమ్మెల్యే రజనీ బీసీ సామాజికవర్గానికి చెందినవారు. ఆమె భర్త కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావటంతో.. అటు బీసీ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇచ్చినట్టుంది. ఇటు కాపు వర్గాన్ని కూడా సంతృప్తి పరిచినట్టు ఉంటుందని ఆమె అనుచరులు చెబుతున్నారు. గతంలో విజయసాయిరెడ్డి ద్వారా పార్టీలో చేరి ఎమ్మెల్యే టిక్కెట్టు తెచ్చుకుని విజయం సాధించిన రజనీ ఆయన ద్వారానే మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. మరి, ప్రస్తుతం పార్టీలో విజయసాయిరెడ్డి పొజిషన్ మునుపటిలా లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మంత్రి పదవి పొందాలని ఎమ్మెల్యే రజనీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే విషయంపై వైసీపీ పెద్దలు ఎలాంటి అనుకూల, వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం లేదు. ఇక, అదే సామాజికవర్గానికి చెందిన శాసనమండలి చీఫ్‍ విప్‍ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారట. ఒకవేళ తనకు మంత్రి పదవిని దక్కకపోయినా.. తన అల్లుడు కిలారి రోశయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఉమారెడ్డి కోరవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, కాసు మహేష్‍రెడ్డికి మంత్రి పదవి దక్కటం ఖాయమని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. అయితే, రెడ్డి సామాజికవర్గానికి మంత్రి పదవి ఇస్తారా లేదా అనే విషయం బయట పడటం లేదు. ఇప్పటికే పార్టీకి రెడ్డి సామాజికవర్గం ముద్ర పడుతున్న నేపథ్యంలో.. మళ్లీ అదే సామాజికవర్గానికి మంత్రి పదవి కట్టబెడితే మిగతా వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, కమ్మ సామాజికవర్గానికైతే మంత్రి పదవి దక్కే అవకాశాలు లేనే లేవని అంటున్నారు.  ఇదిలా ఉంటే, ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన సీనియర్‌ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కు మంత్రి పదవి ల‌భించబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గాల్లో సీనియర్‌ నేతగా, మంత్రిగా పనిచేసిన డొక్కాను సీఎం జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని అంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన డొక్కా అనుభవం తనకు పనికి వస్తుందని, రాజ‌కీయంగా కూడా ఇది క‌ల‌సి వ‌స్తుంద‌నే అంచ‌నాల‌తో మాదిగ వర్గానికి చెందిన సీనియర్‌ నేత డొక్కాకు మంత్రివర్గంలో స్థానం కల్పించ‌బోతున్నార‌ని ప్రచారం జరుగుతోంది. దీంతో మాదిగ ల‌ను పూర్తిగా ఆకట్టుకోవచ్చనే ఆలోచనలో సీఎం ఉన్నారు అంటున్నారు. మొత్తానికి, మోపిదేవి రాజ్యసభ ఎంపికతో ఖాళీ అవుతున్న మంత్రి పదవికి భారీగానే పోటీ ఉంది. మరి సీఎం జగన్ వారిలో ఎవరికి అవకాశమిస్తారో?. అసలు, గుంటూరు జిల్లాలో మంత్రి పదవి ఇవ్వకపోతే నష్టం ఏమిటి అని సీఎం భావిస్తే.. ఈ జిల్లా ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కకపోవచ్చు. అప్పుడు మరింతమంది ఇతర జిల్లాల నేతలు రేసులోకి రావొచ్చు. ఒక వేళ మంత్రి పదవి గుంటూరు జిల్లాకి చెందిన వారికే ఇవ్వాలనుకుంటే.. మరి రాజకీయ అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటారో?.. లేదా కులాలను పరిగణనలోకి తీసుకుంటారో?.. చూడాలి.

అవినీతి, కులం, కుటుంబం కోరల్లో చిక్కుకున్న ఏపీ.. కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

ఎన్నో ప్రకృతి వనరులు ఉండి ఎంతో అభివృద్ధి చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ వంటి బలమైన రాష్ట్రం అవినీతి, కుటుంబం, కులం వంటి రాజకీయ సమస్యలతో అభివృద్ధి లేక కునారిల్లుతోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మోడీ నేతృత్వంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఆ పార్టీ ఏర్పాటు చేసిన జనసంవాద్ ర్యాలీలో పాల్గొన్న ఆమె ఏపీ ప్రస్తుత పరిస్థితి పై ఈ వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు ఇటువంటి అభివృద్ధి నిరోధక ధోరణి పై పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. గత ఆరేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగ పడే కిసాన్ సమ్మాన్ యోజన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి, అక్రమాల పై దర్యాప్తు చేస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. అదే సమయంలో ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం వరల్డ్ బ్యాంక్, ఎడిబి వంటి ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందం చేసుకుని తెచ్చిన ప్రాజెక్టుల విషయంలో ఒప్పందాలు అమలు చేయకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె హెచ్చరించారు. కారణాలేవైనా కానీ అంతర్జాతీయ ఒప్పందాలను రద్దు చేస్తే (పీపీఏ ల రద్దు) రాష్ట్రానికే కాక దేశ అభివృద్ధికి కూడా తీవ్ర ఇబ్బందులు వస్తాయని ఆమె అన్నారు. ఎన్నికల టైం లో వాగ్దానం చేశామని ఇలా అంతర్జాతీయ ఒప్పందాలను రద్దు చేయడం సరి కాదని ఆమె అన్నారు. ఇదే సమయంలో కేంద్రం రూ 2.70 కే కరెంట్ ఇస్తుంటే రాష్ట్రం మాత్రం రూ 9 వసూలు చేస్తోందని చెపుతున్నారని ఆమె అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంట ధర పెట్టి కరెంట్ కొని వ్యాపారం చేయడమా సాధ్యమేనా అని ఆమె వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా పై పోరాటానికి కేంద్రం ఏపీకి 8,025 కోట్లు ఇచ్చిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మిత్ర పక్షమైన జనసేన ను పవన కళ్యాణ్ ను ఆమె ప్రశంసించారు.

రఘురామకృష్ణంరాజు విషయంలో తప్పు చేశామని ఫీలవుతున్న వైసీపీ నేతలు!!

కొన్ని విషయాలలో ఆలస్యం చేయడం వల్ల భారీ నష్టం జరుగుతుందని.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి బోధ పడింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో చేసిన ఆలస్యం.. ఆయనను హీరోని చేసింది, పార్టీని ఇరుకున పెట్టింది. నిజానికి కొన్ని నెలల ముందు వరకు రఘురామకృష్ణంరాజు ఎవరో పెద్దగా తెలియదు. ఒకవేళ తెలిసినా.. వ్యాపారవేత్త గానో, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కేవీపీ రామచంద్రరరావుకు వియ్యంకుడిగానో పరిచయం. మొదట టీడీపీ లో చేరిన రఘురామకృష్ణంరాజు.. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి.. నర్సాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అలా తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. ఎంపీగా గెలిచినా తర్వాత నుండి అప్పుడప్పుడు ఆయన పేరు వినపడటం మొదలుపెట్టింది. జాతీయ స్థాయిలో దాదాపు 350 మంది ఎంపీల‌కు విందు ఇచ్చి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఆ తరువాత.. అలాంటి విందులైతే ఏమీ ఇవ్వలేదు కానీ.. ఏదోక విషయంలో సొంత పార్టీకి పంచ్ లు ఇస్తూ వస్తున్నారు. దాంతో ఆయన పేరు మారుమోగిపోతోంది.  మొదట.. ఇంగ్లీషు మీడియం విషయంలో పార్లమెంట్‌ సాక్షిగా వైసీపీ వైఖరికి భిన్నంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఆ తరువాత.. టీటీడీ భూముల‌ అమ్మకాల‌పై, ఇసుక కొరతపై బహిరంగంగా విమర్శించారు. తన నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్ప‌డుతున్నారని, వారిని కట్టడి చేయాల‌ని, సీఎం తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతోనే ఇలా బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యల‌పై వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు స్పందించడంతో రచ్చ ముదిరింది. రఘురామకృష్ణంరాజు మాటల్లో మరింత వేడి పెరిగింది. తాను ఎంపీ గా జగన్‌ బొమ్మతో గెల‌వలేదని, ఆయన బొమ్మ లేకుండా గెలవగలను, దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు  రాజీనామా చేసి గెలవాలని సవాల్ చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల బల‌గంతో తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న జగన్‌ కు వ్యతిరేకంగా.. సొంత పార్టీకి చెందిన ఒక ఎంపీ మాట్లాడుతుండడంతో పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. ఇక, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. పార్టీ ఆయనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. షోకాజ్‌ నోటీసుతో రఘురామకృష్ణంరాజు ఇరుకున పడతారేమో అనుకుంటే.. రివర్స్ లో ఆయనే పార్టీని ఇరుకున పెట్టారు. అసలు మన పార్టీ పేరు 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ' అయితే 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' పేరుతో నోటిస్ ఇచ్చారేంటి? ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మన పార్టీ 'వైఎస్సార్' అనే పేరు ఉపయోగించకూడదు కదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పార్టీ నెత్తిన పిడుగు పడినట్లయింది. ఇక మీదట పార్టీ పేరు 'వైఎస్సార్ కాంగ్రెస్' అని పిలవడం కుదరదా అని పార్టీ నేతలు తెగ బాధపడుతున్నారు. కొందరైతే మొదట్లోనే రఘురామకృష్ణంరాజు ని సస్పెండ్ చేసుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదుగా అని ఫీలవుతున్నారు. ఇంగ్లీష్ మీడియం, టీటీడీ భూముల వేలం, ఇసుక కొరత, ఎమ్మెల్యేల అవినీతి.. ఇలా వరుసగా వ్యాఖ్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. ఇప్పుడేమో ఆయన ఏకంగా పార్టీ పేరుకే ఎసరు పెడుతున్నారు. ఆయన చేస్తోన్న రగడ పార్టీకి తల‌వంపులు తీసుకొస్తోంది.. పార్టీని ఢిల్లీ స్థాయిలో చుల‌కన చేస్తోంది. అదేదో ఆయనను ముందే సస్పెండ్ చేసుంటే.. మన పార్టీకి ఇన్ని తిప్పలు వచ్చేవి కావు, ఆయనకు అంత క్రేజ్ వచ్చేది కాదని పార్టీ నేతలు తెగ ఫీలైపోతున్నారట.

వైసీపీ తో అమీతుమీకి రఘురామకృష్ణంరాజు సిద్దమౌతున్నారా..!

నరసాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణంరాజుకు, వైసీపీ కి మ‌ధ్య ఏర్ప‌డిన గ్యాప్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాల్లో లోపాల‌ను ఎత్తి చూపుతూ అయన కామెంట్ చేస్తే దానికి కౌంటర్ గా ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు రఘురామ రాజు ను టార్గెట్ చేయడం దానికి అయన అంతే ఘాటుగా జవాబివ్వడం తో వివాదం మరింత ముదిరింది. దీంతో సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామకృష్ణంరాజుకు వైసిపి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులకు అంతే ధీటుగా జవాబు చెపుతూ ఆ నోటీసులు అసలు న్యాయపరంగా చెల్ల‌వ‌ని, తనకు భీఫాం ఇచ్చిన పార్టీ వేరు, అలాగే షోకాజ్ నోటీసు ఇచ్చిన పార్టీ వేరు అంటూ రాజుగారు లా పాయింట్ లాగారు. అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన పొలిటికల్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ లెటర్ హెడ్ ను ఉపయోగించి ఎలా షోకాజ్ నోటీసు ఇస్తుందని అయన తన సమాధానంలో ప్రశ్నించారు. త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో సొంత‌పార్టీ నేత‌లతోనే ప్రాణ‌హ‌ని ఉంద‌ని ఇప్ప‌టికే ఎస్పీ, లోక్ స‌భ స్పీక‌ర్ కు ఫిర్యాదు చేసిన ఆయ‌న త్వరలో స్పీక‌ర్ ను, హోంశాఖ కార్య‌ద‌ర్శిని కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా త‌న ఎంపీ ప‌ద‌వికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందుజాగ్ర‌త్త చర్యలో భాగంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కూడా క‌ల‌వ‌బోతున్నట్లు ప్ర‌చారం నడుస్తోంది. ఇటు వైసిపి పార్టీ ఆయనతో అమితుమీ తేల్చుకోవ‌టానికి సిద్ధ‌ప‌డింద‌ని, త‌న ఎంపీ ప‌ద‌విని ర‌ద్దు చేయించే ఆలోచ‌న‌లో కూడా ఉంద‌ని భావిస్తున్న ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు దీనికి కౌంట‌ర్ గా కొన్ని అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్న‌ట్లు దేశ రాజధానిలో ప్ర‌చారం జోరుగా సాగుతుంది. అంతేకాకుండా త‌నకు బీజేపీ పెద్ద‌ల మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని, ఆ ధీమా తోనే ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారని, ఇదే అంశం జ‌గ‌న్ కు కూడా ఇబ్బందిక‌రంగా మారింద‌ని రాజకీయ విశ్లేష‌కుల అభిప్రాయం. మొత్తంగా ఈ వ్యవహారం టీ కప్పులో తుఫాన్ లాగా సమసి పోతుందో లేక చినికి చినికి గాలి వానగా మారుతుందో మరి వేచి చూడాలి.

ప్రాజెక్టుల నిర్మాణం పై ఏడాదికి రూ.14,000 కోట్లు ఖర్చు చేశాం

జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి ప్రాజెక్టుల పనులు నిలిచి పోవడంతో సాగు, తాగునీటి ఎద్దడి కారణంగా రైతులు, పేదలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను లేఖలో వివరించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల నిలిపివేతపై ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన 10 శాతం పనులు గత 13నెలలుగా పెండింగ్‌లో పెట్టడం బాధాకరమన్నారు. 13 నెలలుగా అన్ని జిల్లాలలో నీటి పారుదల ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయన్నారు. అన్ని జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని చంద్రబాబు కోరారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం పై ఏడాదికి రూ.14,000కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. కానీ ఈ ఏడాది కాలంలో అందులో మూడో వంతు కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు నీరందించాలన్న సంకల్పంతో టీడీపీ ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి 2వ దశ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టిందని అన్నారు. హంద్రీ-నీవా 2వ దశ పనులను 90 శాతం వరకు పూర్తి చేసి శ్రీశైలం నీటిని పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం వరకు ప్రయోగాత్మకంగా విడుదల చేస్తే... ఆ ప్రాంతానికి నీళ్ళు రావడం చూసి ప్రజలు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. అలాంటిది మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తిచేయకుండా పక్కనపెట్టిందని విమర్శించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిచిపోవడంతో రైతులు నష్టపోయారు. ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ నీటిపారుదల పనులు పూర్తిచేసి ప్రభుత్వం రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.

అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ 

ఈఎస్ఐ అవినీతి ఆరోపణల కేసులో ఎసిబి అరెస్ట్ చేసిన టీడీపీ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని ఈ రోజు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించారు. టీడీపీ పార్టీ తరఫున అండగా ఉంటామని ఈ సందర్భంగా వారికి ఆయన భరోసా ఇచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడకు వచ్చిన లోకేష్‌ ముందుగా ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తరువాత అచ్చెన్నాయుడు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అచ్చెన్న గురించి ఆందోళన పడవద్దని.. పార్టీ అన్ని విధాలా వారికీ అండగా ఉంటుందని అయన చెప్పారు. లోకేష్ వెంట ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహణ్ నాయుడు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు ను ఏసీబీ అధికారులు ఆస్పత్రిలోనే విచారిస్తున్నారు. గురువారం 3 గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు.. ఈ రోజు, రేపు కూడా విచారించనున్నారు.

గోధన్ న్యా యోజన.. ఆవు పేడ సేకరణకు వినూత్న పథకం

చత్తీస్ ‌ఘడ్ లో రైతుల నుంచి ఆవు పేడ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 'గోధన్ న్యా యోజన' పేరిట ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించింది. రోడ్లపై ఆవుల సంచారాన్ని నిరోధించడంతోపాటు, పశువుల పెంపకాన్ని లాభదాయకంగా మార్చడానికి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం భూపేష్ బాగేల్ చెప్పారు.   రైతుల నుంచి ఆవు పేడను సేకరించేందుకు ధరను నిర్ణయించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబే అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు సీఎం తెలిపారు. రైతులు, గోశాల నిర్వాహకుల అభిప్రాయాలు తీసుకొని ఆవు పేడకు ధర నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఆవు పేడ సేకరణకు ధరను జులై 20 న హరేలీ ఫెస్టివల్ లో ప్రకటిస్తామని, ఈ పథకం వల్ల ఆవులను వీధుల్లోకి వదిలివేయరని సీఎం వ్యాఖ్యానించారు. పశువుల యజమానుల నుంచి పేడను కొనుగోలు చేసి దాన్ని ప్రభుత్వం ఎరువుగా మార్చుతుందన్నారు. అధికారులు ఆవు పేడను సేకరించి వర్మికంపోస్టు ఉత్పత్తి చేయాలని సీఎం సూచించారు. వర్మీకంపోస్టు ఎరువును సహకార సంఘాల ద్వారా అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పట్టణాభివృద్ధి శాఖల ప్లాంటేషన్ కార్యక్రమాలకు, రైతులకు విక్రయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం భూపేష్ బాగేల్ వివరించారు.

వేలానికి 'చేగువేరా' జన్మించిన ఇల్లు!

చేగువేరా.. ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. విప్లవ వీరుడిగా, పోరాట యోధుడిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశ, భాషలతో సంబంధం లేకుండా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయనను చూడలేకపోయినా.. కనీసం ఆయన పుట్టిన ఇల్లు, ఆయన పెరిగిన నేలని చూడాలని ఎందరో భావిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఏకంగా ఆయన పుట్టిన ఇంటిని సొంత చేసుకునే అవకాశమే వచ్చింది. చేగువేరా స్వస్థలం అర్జెంటీనాలోని రొసారియోలో ఆయన జన్మించిన ఇంటిని వేలానికి పెట్టారు. ఈ ఇంటిని 2000 సంవత్సరంలో కొన్నానని ప్రస్తుతం ఆ ఇంటికి యజమానిగా ఉన్న ఫ్రాన్సిస్కో ఫరుగ్గియా పేర్కొన్నారు. ఈ ఇల్లు 2,580 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని ఓ సాంస్కృతిక కేంద్రంగా మారుద్దామని తాను భావించానని, కానీ కుదరకపోవడంతో వేలం వేయాలని అనుకుంటున్నానని ఫరుగ్గియా తెలిపారు.  మరోవైపు, ఈ భవనానికి ఎంతో క్రేజ్ ఉంది. దీన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకలు వస్తుంటారు. ఈ ఇంటిని సందర్శించిన వారిలో ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్‌ పీపే ముజికా, క్యూబా మాజీ అధినేత ఫీడెల్ క్యాస్ట్రో సంతానం వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అలాగే, 1950 లలో మోటార్ ‌సైకిల్ ‌పై చేగువేరాతో పాటు దక్షిణ అమెరికావ్యాప్తంగా వేల కిలోమీటర్లు ప్రయాణించిన డాక్టర్‌ ఆల్బర్టో గ్రానడోస్‌ కూడా ఈ ఇంటిని సందర్శించారు. అంతటి చరిత్ర ఉన్న చేగువేరా జన్మించిన ఇల్లు వేలానికి రావడంతో.. ఆ ఇంటిని ఎవరు సొంతం చేసుకుంటారోనని అందరిలో ఆసక్తి నెలకొంది.