యనమల, చినరాజప్పలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు
టీడీపీ నేతలను వరుసగా కేసులు, అరెస్ట్ లు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్రెడ్డి, జేసీ అస్మిత్రెడ్డి, చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ కాగా, మరో ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడికి రెండో వివాహం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో కేసు నమోదైంది.
తన భర్తకు రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నించారని.. కొందరు తనను బెదిరించారని మంజు ప్రియ అనే మహిళ ఫిర్యాదు చేసింది. తన భర్త పిల్లి రాధాకృష్ణ కు అతని తల్లిదండ్రులైన పిల్లి అనంతక్ష్మి, పిల్లి సత్యనారాయణలు రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారని దీనికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప లు ఒత్తాసు పలికారని ఆమె ఆరోపించింది. దీనితో వీరందరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
2011లో పిల్లి రాధాకృష్ణ ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు బాధితురాలు చెబుతోంది. అయితే రెండు రోజుల క్రితం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్వగ్రామంలో రాధాకృష్ణ రెండో వివాహం జరిపించేందుకు ప్రయత్నించారని, దీనికి పెళ్లి పెద్దలుగా మాజీ మంత్రులు యనమల, చినరాజప్పలు హాజరయ్యారని బాధితురాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ వివాహాన్ని అడ్డుకుని పెళ్లికి హాజరైన మాజీ మంత్రులపై కూడా కేసు నమోదు చేశారు.