మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. మంత్రి మేనల్లుడికి కూడా!!

ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఇటీవల, విజయనగరం జిల్లా ఎస్‌.కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లాలో కూడా ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విషయం తెలిసిన వెంటనే గన్ మెన్లను ఇళ్లకు పంపించేశారారు. ప్రస్తుతం ఎమ్మెల్యే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మరోవైపు, ఆయన ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లడంతో తోటి ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. అలాగే ఇటీవల ఆయన నియోజకవర్గంలో పర్యటన కూడా జరిపారని తెలుస్తోంది. దీంతో ఆయనను ఎవరెవరు కలిశారు ? ఆయనకు అసలు కరోనా ఎలా సోకింది? అనే విషయాల్ని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తరాంధ్రలో కూడా ఓ వైసీపీ నేత కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సమాచారం.

కరోనా పీడకు త్వరలోనే వ్యాక్సిన్

కరోనా విలయతాండవంతో ప్రపంచం గజగజలాడుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరువలో ఉంది. ఇదే సమయంలో కరోనా నివారణకు ఖచ్చితమైన మందు లేకపోవడంతో ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ దాన్ని తయారుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కరోనా వైరస్ నివారణకు టీకా అభివృద్ధి చేసేందుకు ప్రపంచంలోని దాదాపు 12 ప్రముఖ సంస్థలు ప్రయత్నిస్తుండగా.. వాటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ టీకా మంచి ఫలితాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ తో చింపాజీలపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇపుడు మనుషుల పైన ప్రయోగాలు కూడా వేగంగా చేస్తున్నట్టు ప్రముఖ శాస్త్రవేత్త ఆడ్రియన్ హిల్ ప్రకటించారు. అంతేకాకుండా కరోనా వైరస్ నివారణకు సంబంధించిన టీకా అక్టోబరు వరకు సిద్ధం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆస్ట్రా జెనెకా అనే ఫార్మా కంపెనీతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త వ్యాక్సిన్ ను బ్రెజిల్‌లో కొంతమందిపై ఇప్పటికే ప్రయోగించారు. దక్షిణాఫ్రికాలో కూడా ఈ టీకాను దాదాపు 200 మందిపై ప్రయోగిస్తున్నారు. దీనికితోడు బ్రిటన్‌లో దాదాపు 4వేల మంది వాలంటీర్లు ఈ వ్యాక్సిన్ ప్రయోగానికి తమ అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరికి తోడు మరో 10వేల మందిని కూడా నియమించుకుంటామని యూనివర్సిటీ ప్రకటిచింది. ఏప్రిల్ 23న మొదలైన మానవ ప్రయోగాకు సంబంధించిన వివరాలు ఆగస్టు లేదా సెప్టెంబరులో వస్తాయని దీంతో అక్టోబరులో టీకాను విడుదల చేస్తామని అడ్రియన్ హిల్ తెలిపారు. ఆ దేవుడి దయవల్ల, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా వ్యాక్సిన్ త్వరగా వస్తే ఊపిరి పేల్చుకోవచ్చని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.

చైనా కుట్రలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమెరికా సైన్యం

ఇండియా చైనా సరిహద్దులో ఘర్షణ జరిగి 20 మందికి పైగా మన సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తరువాత రెండు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగి వివాదాస్పద ప్రాంతం నుండి సైనికులను ఉపసంహరించుకుందామని చర్చలలో చెప్పి మళ్ళీ దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుండటం తెలిసిందే. దీంతో భారత్ అప్రమత్తమై పర్వత ప్రాంతాల్లో పోరాడే మెరికల్లాంటి సైన్యాన్ని సరిహద్దుకు తరలిస్తోంది. ఐతే తాజాగా ఈ వివాదం నేపథ్యంలో అమెరికా కూడా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. భారత్ తో పాటు దక్షిణాసియాకు చైనా ముప్పు పొంచి ఉండటంతో.. చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా తన దళాలను తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. నిన్న బ్రస్సెల్ ఫోరం వర్ట్యువల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా జర్మనీలోని అమెరికా సాయుధ బలగాలను ఆసియా ప్రాంతానికి తరలిస్తున్నట్లు అయన తెలిపారు. చైనా దుందుడుకు చర్యలు భారత్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పైన్స్ దేశాలకు ప్రమాదకరంగా మారాయని అయన అన్నారు. దక్షిణ చైనా సముద్రంలో కూడా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో చైనా సైన్యానికి ధీటైన జవాబు చెప్పడానికి అమెరికా తన బలగాలను మోహరించడంతో పాటు తమ వనరులను కూడా వినియోగిస్తామని ఆయన స్పష్టం చేసారు. కొద్ది రోజుల క్రితం భారత్, చైనాల మధ్య గల్వాన్ ఘర్షణలపై స్పందించిన పాంపియో చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో చైనా పాటిస్తున్న విధానం సరైనది కాదని అయన తీవ్రంగా విమర్శించారు. హాంకాంగ్‌ పౌరుల స్వేచ్ఛను హరించే హక్కు చైనాకు లేదని అయన మండిపడ్డారు. అంతే కాకుండా దక్షిణ చైనా సముద్రం, జపాన్‌, మలేషియా దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.

వైసీపీ నేత పీవీపీ అరెస్ట్

వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 14లో ప్రేమ్‌ పర్వత్‌ విల్లాస్‌ పేరిట పీవీపీ నిర్మాణాలు చేశారు. ఇందులో ఒక విల్లాను విక్రమ్‌ కైలాస్‌ కొనుగోలు చేశారు. ఆ విల్లాను మరింత ఆధునికీకరించేందుకు.. టెర్రస్‌పై రూఫ్‌ టాప్ గార్డెన్‌ ను ఏర్పాటు చేయడానికి విక్రమ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో అనుచరులతో కలిసి వచ్చిన పీవీపీ.. విల్లను ఎలా అమ్మానో అలానే ఉంచాలని ఆధునీకరించడానికి వీల్లేదని అన్నారు. అంతేకాక విక్రమ్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి సామాగ్రిని ధ్వంసం చేశారు. రూఫ్ గార్డెన్ కోసం తీసుకొచ్చిన వస్తువులు, ఇతర నిర్మాణ సామాగ్రిని కూడా ధ్వంసం చేశారు. దీంతో, బాధితుడు వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీవీపీ 20 మంది అనుచరులతో తన ఇంటి మీద దాడి చేశారని, తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని, పీవీపీ వల్ల తనకు ప్రాణ హాని ఉందని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధితుడి ఫిర్యాదు‌తో పీవీపీపై ఐపీసీ 447,427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు పిలిపించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత పీవీపీని అరెస్ట్ చేశారు.

సీఎం.. అయన సలహాదారులు.. హైకోర్టు సందేహాలు

ఏపీ ప్రభుత్వానికి అటు హైకోర్టులోనూ ఇటు సుప్రీం కోర్ట్ లోనూ అనేక సార్లు మొట్టికాయలు పడిన సంగతి తెలిసిందే. అంతే కౌకండా సాక్షాత్తు సీఎస్, డీజీపీ కూడా కోర్ట్ మెట్లు ఎక్కవలసి వచ్చింది. తాజాగా రాష్ట్ర డీజీపీ నిన్న హైకోర్టు లో హాజరైనప్పుడు ఈ విషయం పై కోర్ట్ కొన్ని స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. అసలు ప్రభుత్వానికి న్యాయ సలహాదారులు గా ఉన్నవారు అటు ప్రభుత్వానికైనా సరైన సలహాలు ఇవ్వడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా వారు కోర్టుకు కూడా సరిగా సహకరించడం లేదని అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందని కోర్ట్ వ్యాఖ్యానించింది. అసలు ఏ వ్యక్తికీ ప్రభుత్వానికి కోర్ట్ వ్యతిరేకం కాదు. ఐతే ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వకుండా కేవలం కోర్టులను నిందిస్తే ఫలితమేంటని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కొంతమంది కింది స్థాయి అధికారుల అత్యుత్సాహం తో పాటు .విపరీత ప్రవర్తన కారణంగా ఉన్నతాధికారులు కోర్ట్ లో నిలబడాల్సి వస్తోందని డీజీపీ ఎదుటే హైకోర్టు వ్యాఖ్యానించింది చిన్న చిన్న కేసుల విషయంలో కూడా ఇలా జరగడం ఎంతైనా ప్రభుత్వానికి ఇబ్బందికరమే. ఇంతకూ దీనికి కారణం సలహాదారులు ప్రభుత్వానికి, సీఎం కు సరైన సలహాలు ఇవ్వకపోవడమా లేక అయన ఎవరి సలహాలు పట్టించుకోరా.. నిన్ననే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆప్త మిత్రుడు ఉండవల్లి ఇదే విషయమై మాట్లాడుతూ వ్యవస్థలతో వైరం మంచిది కాదని సీఎం జగన్ ను సున్నితంగా హెచ్చరించారు.

సీఎం జగన్ మేనమామకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ నినాదాలు

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వెల్లటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలం పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. సోలార్ ప్లాంట్ వద్దంటూ మూడు గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు. గ్రామాల్లోకి వాహనాలు వెళ్లకుండా దారికి అడ్డంగా రాళ్లు పెట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. సీఎం జగన్ మేనమామ అయిన రవీంధ్రనాథ్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురవడం చర్చనీయాంశమైంది.  కాగా, కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలో కొత్తగా సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాంతంలో స్ధల పరిశీలన కోసం అధికారులు వెళ్లారు. వారితో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి కూడా వెళ్లారు. అయితే, వారు వస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలో సాగు భూములు ఎక్కువ ఉన్నందున సోలార్ ప్లాంట్ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.

గోదావరి మార్కు వెటకారం.. రఘురామ కృష్ణంరాజు రిప్లై మాములుగా లేదు

వైసిపి పార్టీ ఎమ్మెల్యేలకు, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కు వారం రోజుల లోగా సమాధానం ఇవ్వాలని చెపుతూ నిన్న షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే దీనికి రఘురామ కృష్ణం రాజు ఒక్క రోజులోనే సమాధానమిచ్చారు. షో కాజ్ నోటీసుకు సమాధానం ఇస్తూ రివర్స్ లో ఎంపీ విజయ సాయి రెడ్డి పై ప్రశ్నల వర్షం కురిపించారు. అందరికి తన ట్వీట్లతో చుక్కలు చూపించే విజయసాయిరెడ్డికి ఎంపీ రఘురామ రాజు కూసింత తమ గోదావరి మార్కు వెటకారం జోడించి మరీ సమాధానమిచ్చారు. అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ మీరు ఎలా ఇస్తారు? అసలు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉండడమేమిటి ? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసలు క్రమశిక్షణ సంఘం అనేది ఉందా? ఒక వేళ ఉంటే ఆ క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా? క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, సభ్యులెవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే క్రమశిక్షణ సంఘం మినిట్స్ ఉంటే తనకు కూడా పంపాలని రఘురామ కృష్ణంరాజు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కోరారు. తాను ఇస్తున్నది ప్రత్యుత్తరం మాత్రమే కానీ సమాధానం కాదని అయన ఆ లేఖలో పేర్కొన్నారు. అసలు వైఎస్సార్ పార్టీ పేరుతొ షోకాజ్ నోటిస్ పంపించడంతో దానికి చట్టబద్దత పోయిందని అయన అన్నారు. అయినా మనది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కదా.. గతంలో వేరేవారు వైఎస్సార్ పేరుతొ పార్టీ రిజిస్టర్ చేసుకున్నందువల్ల మనకు వైఎస్సార్ పేరు తో పార్టీ దక్కలేదుగా అని ఎత్తి చూపారు. కనీసం తర్వాతైనా పార్టీ పేరు మార్పుకు మనం ఎపుడు ప్రయత్నించలేదని ఆయన ప్రస్తావించారు. అంతే కాకుండా మీ పార్టీ పేరు ఎలా దుర్వినియోగం అవుతుందో చూడండి అంటూ ఈ లేఖ ప్రతిని వైఎస్సార్ పార్టీకి కూడా పంపించారు. అంతేకాకుండా మన పార్టీ పేరులో వైఎస్సార్ అనే పదాన్ని విజయసాయిరెడ్డి తన లెటర్‌హెడ్లలో వాడుకోవటం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి గారికి తెలుసా అని అయన ప్రశ్నించారు. ఇదే సమయంలో మొన్న ఎన్నికలలో పోటీ చేసినపుడు తనకు రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన కాపీ, పార్టీ ఇచ్చిన బి ఫార్మ్, అప్పట్లో ఎన్నికల సంఘం వైఎస్సార్ పేరును ఉపయోగించకూడదని ఎలక్షన్ కమిషన్ రాసిన లెటర్ ను అయన తన లేఖకు జత చేసారు. అసలు పార్టీ నియమాలను ఉల్లంఘించేవారికంటే మీరే పార్టీకి ఎక్కువ నష్టం చేస్తున్నారని అయన తన రిప్లై లో స్పష్టం చేసారు. అయినా మీ నుండి సరైన విధానం లో నోటీసు వస్తే తప్పకుండా సమాధానం ఇస్తానని ఆ ఆలేఖలో రఘురామ కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు. టోటల్ గా పార్టీని ఢీ కొట్టేందుకే అయన సిద్దమైనట్లుగా ఈ లేఖ ద్వారా తెలుస్తోంది. మరీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మీ విధ్వంసాన్ని, ఉన్మాదాన్ని చరిత్ర మరచిపోదు

ప్రజా వేదికను కూల్చి ఏడాది అయిన సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు.  "తెలుగుదేశం హయాంలో ప్రజల వినతులు స్వీకరించే వేదికగా, అన్నివర్గాల సమస్యల పరిష్కార వేదికగా 'ప్రజావేదిక' విలసిల్లింది. విద్య, వైద్య సాయం కోసం, సమస్యలు చెప్పుకోడానికి నిత్యం అనేకమంది వచ్చేవాళ్లు. ప్రభుత్వ సాయంతో పాటు, సమస్యల పరిష్కారం పొందేవాళ్లు. అటువంటి ప్రజావేదికను నేలమట్టం చేయడం ప్రజల ఆకాంక్షలను నేలకూల్చడమే, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ముఖ్యంగా ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చడం ఒక బాధ్యతా రాహిత్యమైన చర్య. ఆ శిధిలాలను తొలగించకుండా అలాగే ఉంచడం ఒక ఉన్మాద చర్య." అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. "నాటి విధ్వంసానికి, మీ ప్రభుత్వ ఉన్మాద పాలన ప్రారంభానికి ఏడాది అయిన సందర్భంగా తెలుగుదేశం నేతలు మీ చర్యలను ప్రజల దృష్టికి తెస్తుంటే ఉలికి పడుతున్నారెందుకు?" అని ప్రశ్నించారు. "మీ విధ్వంసకర పాలనను ప్రశ్నించే హక్కు, నిరసించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. ఆ హక్కులను హరిస్తూ అరెస్టు చేసిన తెలుగుదేశం నాయకులను వెంటనే విడుదల చేయాలి. మా పార్టీ నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన చరిత్ర మీ విధ్వంసాన్ని, ఉన్మాదాన్నీ మరచిపోదు." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు లేనట్లే

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడవడం ఇప్పట్లో కష్టమే అనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపేందుకు బుధవారం హైదరాబాద్‌లో అధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం, టీఎస్‌ ఆర్టీసీలో ఆపరేషన్స్‌ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. దీంతో ఇప్పట్లో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే పరిస్థితి లేదని తెలుస్తోంది.  ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్‌ ఆర్టీసీ, టీఎస్ ‌ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు వాయిదా పడటంతో బస్సు సర్వీసులను నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది.  కాగా, ఈ నెల 1 నుంచి 20 వరకు ఏపీఎస్ ‌ఆర్టీసీ రోజుకు సగటున 3,266 బస్సు సర్వీసుల్ని నడిపింది. 11.03 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. గత 20 రోజులుగా ఏపీఎస్ ఆర్టీసీ రోజుకు రూ.2.43 కోట్లు ఆదాయం ఆర్జించింది. కిలోమీటరుకు రూ.22.06 మాత్రమే పొందింది. కరోనాకు ముందు రోజుకు రూ.12 కోట్ల ఆదాయం ఆర్టీసీకి వచ్చేది. మరోవైపు, ఏపీఎస్‌ ఆర్టీసీ త్వరలో సిటీ సర్వీసులు ప్రారంభించేందుకు నిర్ణయించింది. విజయవాడ, విశాఖలో నడిపే సిటీ సర్వీసుల్లో ఎక్కడ్నుంచి ఎక్కడకు వెళ్లినా ఒకే రేటు వసూలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభం.. 9 కోట్ల ప్రజాధనం మట్టిపాలు

ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శుభకార్యంతో పాలన ప్రారంభించకుండా ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభించారని విమర్శించారు. ప్రజావేదిక కూల్చి రూ.9 కోట్ల ప్రజాధనం మట్టిపాలు చేశారని మండిపడ్డారు.  "అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో పండ్ల చెట్లు నరికి వేశారు. కావలిలో ఉపరాష్ట్రపతి ప్రారంభించిన శిలాఫలకాన్ని కూల్చివేశారు. విజయవాడలో అవతార్ పార్క్ ను ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా పేరూరులో చంద్రబాబు శిలాఫలకం ధ్వంసం చేశారు. నెల్లూరులో పేదల ఇళ్లను కూల్చివేశారు. మడకశిరలో ఇళ్లు కూల్చివేశారు. మాచర్లలో ఇళ్లు కూల్చివేశారు. నర్సరావుపేటలో అన్న క్యాంటీన్ కూల్చి వేశారు." అంటూ వైసీపీ ప్రభుత్వ కూల్చివేతల చిట్టాను కళా వెంకట్రావు చెప్పుకొచ్చారు. ఆస్తులు కూల్చి వేయడం, శిలా ఫలకాలు కూల్చివేయడం, భూములు, గనులు కబ్జా చేయడం, ప్రశ్నించిన ప్రతిపక్షాలపైన, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ అరెస్ట్ లు, వేధింపులు నిత్యకృత్యమయ్యాయని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు కూల్చివేసిన ప్రజావేదికను సందర్శించడానికి వెళ్తున్న వర్లరామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్,అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, పిల్లి మాణిక్యారావు తదితర నాయకుల అక్రమ అరెస్ట్ లను ప్రజలు, మేధావులు ఖండించాలని కళా వెంకట్రావు కోరారు.

అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం.. అసలీ అర్థరాత్రి కుట్రలేంటి?

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడుని.. రాత్రికి రాత్రి డిశ్చార్జి చేయించి, ఏసీబీ అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందని జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. "అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందీ ప్రభుత్వం. అసలు అరెస్టుచేసే ముందురోజే ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆ విషయం చెప్పినా వినకుండా అమానుషంగా వందల కిలోమీటర్లు రోడ్లపై వాహనంలో తిప్పారు. దాంతో గాయం తిరగబెట్టి రెండోసారి ఆపరేషన్ చేయాల్సివచ్చింది. అచ్చెన్నాయుడును ఆస్పత్రి బెడ్ పైనే ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు చెప్పింది. నిలబెట్టవద్దు, కూర్చోపెట్టవద్దని కూడా సూచించింది. 10 రోజులు బెడ్‍ రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెబితే, జీజీహెచ్ అధికారులపై ఒత్తిడిచేసి, అర్ధరాత్రి డిశ్చార్జ్ చేయాలని చూడటం ఏంటి?" అని చంద్రబాబు ప్రశ్నించారు. "ఏసీబీ అధికారులు అర్ధరాత్రే అదుపులోకి తీసుకోవాలని చూడటం ఏంటి? అసలీ అర్థరాత్రి కుట్రలేంటి? కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇది కేసు విచారణలా లేదు, బీసీ నేతపై హత్యాయత్నంలా ఉందని ప్రజాసంఘాలే అంటున్నాయి. ఈ కేసులో చూపే అత్యుత్సాహం, వైసిపి ల్యాండ్ మాఫియాపై, 108 అంబులెన్స్ స్కామ్ మీద, ఆవభూముల స్కామ్ పై, ఇసుక మాఫియాపై ఎందుకులేదు? కొందరు పోలీసు అధికారుల విపరీత ప్రవర్తన వల్లే ఉన్నతాధికారులు కోర్టుల ముందు నిలబడాల్సి వస్తోందని నిన్ననే కోర్టులు ఆక్షేపించాయి. అధికారం చేతిలో ఉందికదా అని బీసీ నేత అచ్చెన్నాయుడు విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదు. న్యాయపరంగా మేమూ పోరాడతాం. మీ కుట్రలను అడ్డుకుంటాం." అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీలో రైలు ప్రమాదం.. నాలుగు ట్యాంకర్ బోగీలు దగ్ధం

కరోనా ఎఫెక్ట్ తో దేశ వ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన వలస కార్మికుల కోసం కేంద్రం కొన్ని శ్రామిక రైళ్లను నడుపుతోంది. ఐతే లాక్ డౌన్ టైం లో కూడా గూడ్స్ రైళ్లు పరుగెడుతూనే ఉన్నాయి. ఐతే తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా సురారెడ్డి పాలెం టంగుటూరు మధ్య ఒక వంతెన వద్ద ఒక గూడ్స్ రైలు పట్టాలు తపింది. దీంతో అందులోని ఐదు ఆయిల్ ట్యాంకర్ బోగీలు వంతెన పై నుండి కింద పడ్డాయి. దీంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందిన వెంటనే డివిజన్ అధికారులు, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఐతే అప్పటికే నాలుగు ఆయిల్ ట్యాంకర్ బోగీలు దగ్ధమయ్యాయని సమాచారం.

45 ఏళ్ల ఎమర్జెన్సీ వంకతో కాంగ్రెస్ పై అమిత్ షా ట్వీట్ల దాడి..

సరిగ్గా 45 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో దేశంలో రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తన ట్వీట్లతో కాంగ్రెస్ తో చెడుగుడు ఆడుకున్నారు. అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. 45 ఏళ్ల క్రితం ఇదే రోజున అధికార దాహంతో ఉన్న ఓ కుటుంబం దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించింద‌ని అయన మండిప‌డ్డారు. రాత్రికి రాత్రే దేశాన్ని ఒక జైలులా మార్చివేశార‌ని ఆయన విమ‌ర్శించారు. మీడియాను, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను, భావ‌స్వేచ్ఛ‌ను సర్వ నాశ‌నం చేశార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పేద‌, బడుగు వ‌ర్గాల వారిపై దారుణ అకృత్యాలు జ‌రిగాయ‌ని అమిత్ షా ఆరోపించారు. తరువాత ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల పోరాటం వ‌ల్ల ఎమ‌ర్జెన్సీని ఎత్తివేశార‌ని అమిత్ షా తన ట్వీట్ల ద్వారా తెలిపారు. దేశంలో ప్ర‌జాస్వామ్యం తిరిగి నిలబడింది కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అది లేదన్నారు. కేవలం ఒక కుటుంబ ప్ర‌యోజ‌నాల కోసం జాతి ప్ర‌యోజ‌నాలు, పార్టీ ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న పెట్టి పరిపాలన చేసారని అయన విమ‌ర్శించారు. దీంతో ఇప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఉండిపోయింద‌ని అమిత్ షా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మైండ్‌సెట్‌లో ఇప్పటికి ఎమ‌ర్జెన్సీ ఆలోచ‌న‌లే ఉన్నాయ‌ని అమిత్ షా విమ‌ర్శించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విధ్వంసానికి పునాది వేసి, అభివృద్ధికి స‌మాధి క‌ట్టి ఏడాది అవుతోంది

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే.. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను అక్రమ నిర్మాణమంటూ కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ప్రజాధనాన్ని వృధా చేశారంటూ.. దీనిపై అప్పట్లోనే విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, ప్రజావేదిక కూల్చి నేటికి ఏడాది అయింది. ఈ సందర్భంగా ప్రజావేదిక శిథిలాల వద్దకు టీడీపీ నేతలు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కరకట్ట వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కరకట్ట వద్ద ఎలాంటి నిరసనలనూ అనుమతించబోమని పోలీసులు చెబుతూ.. టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు, ప్రజావేదిక కూల్చి నేటికి ఏడాది అయిన నేపథ్యంలో.. టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.  "ఒక భ‌వ‌నం క‌ట్ట‌డం ఎంతో క‌ష్టం, ఉప‌యోగం. కూల‌గొట్ట‌డం చిటికెలో ప‌ని, తీవ్ర న‌ష్టం. ఇది తెలిసి కూడా విధ్వంసానికే జై కొడుతున్నారు. ఇటువంటివారిని పాల‌కుడిగా ఎన్నుకున్న పాపానికి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌వేదికైన ప్ర‌జావేదిక కూల‌గొట్టి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విధ్వంసానికి పునాది వేసి, అభివృద్ధికి స‌మాధి క‌ట్టి ఏడాది అవుతోంది." అని లోకేష్ విమర్శించారు. "చంద్ర‌బాబు అంటే న‌వ్యాంధ్ర నిర్మాత‌, జ‌గ‌న్‌రెడ్డి అంటే న‌వ్యాంధ్ర నాశ‌నానికి కంక‌ణం క‌ట్టుకున్న అరాచ‌క పాల‌కుడ‌ని ప్ర‌జావేదిక శిథిలాలు సాక్ష్యం చెబుతున్నాయి. ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కోర్చి నిర్మించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌జావేదిక‌ని క‌డితే, ఒక్క రాత్రిలో కూల్చేశారు జ‌గ‌న్‌రెడ్డి." అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నన్ను కాపాడండి అంటూ గవర్నర్‌ కు నిమ్మగడ్డ లేఖ

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. తనకు వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వెంటనే మీరు జోక్యం చేసుకొని.. తనను కాపాడాలని రమేష్ విజ్ఙప్తి చేశారు. తన ఇంటిపై 24 గంటలు నిఘా పెట్టారని, ఒక ఫోర్డ్ కార్, రెండు మోటార్ సైకిళ్లపై తనని ఫాలో అవుతున్నారని లేఖలో నిమ్మగడ్డ తెలిపారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌లో ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన రహాస్య సమాచారాన్ని భద్రపరిచిన కంప్యూటర్లు, ఇతర హార్డ్‌డిస్క్‌లను ప్రభుత్వం సీజ్ చేసిందని, వాటిని విడుదల చేయించాలని విజ్ఙప్తి చేశారు.  ప్రస్తుతం తాను హైదరాబాద్ లో నివాసం ఉంటున్నానని, తన తల్లి విజయవాడలో ఉన్నారని, ఆమెను చూసేందుకు కూడా అవకాశం ఇవ్వడం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయానికి రానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను పునర్నియమించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ఉద్దేశపూరకంగా అడ్డుకుంటోందని, ఈ విషయంపై తాను హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.   ఏపీ హైకోర్టు తనను పునరుద్ధరించాలని తీర్పునిచ్చినా, ఇప్పటికీ కనగరాజ్‌ కు ఎన్నికల కమిషనర్ సదుపాయాలు కల్పిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని, ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు.

టీడీపీ నేతపై కత్తులతో దాడి

గుంటూరు జిల్లా తెనాలిలో కలకలం రేగింది. ఐతానగర్‌లో టీడీపీ నేత మంచాల రమేష్‌ పై హత్యాయత్నం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి తెగబడ్డారు. అడ్డుగా వెళ్లిన రమేష్‌ సోదరుడు సతీష్‌ పై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రమేష్ కి తీవ్ర గాయాలు కాగా, సతీష్‌ స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. వారిని తెనాలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మంచాల రమేష్‌ కుమార్తె తెనాలి పట్టణంలోని 39వ వార్డులో కౌన్సిలర్‌గా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రమేష్ కుటుంబంపై దాడి జరిగిందని తెలుస్తోంది. ఈ హత్యాయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కరోనా పరీక్షల్లో డొల్లతనం.. ఎమ్మెల్సీ కి ఏపీలో పాజిటివ్‌, హైదరాబాద్‌ లో నెగటివ్‌

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రోజుకి వేలల్లో పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. ఆ పరీక్షల్లో ఖచ్చితత్వం లేదని, డొల్లతనం కనిపిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా పరీక్షల్లో నెగటివ్ అయితే పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చారని టీడీపీ విమర్శిస్తోంది. తాజాగా ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. "ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే అంతకన్నా ఆందోళనకర విషయం ఏమంటే... కరోనా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం... ప్రజారోగ్యంతో ఆటలాడటం. కరోనా పేరుతో పరీక్షా కిట్ల కుంభకోణం, బ్లీచింగ్ పౌడర్ స్కామ్ లు చూసాం. ఇప్పుడు తాజాగా కరోనా పరీక్షల డొల్లతనం బయటపడింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చేసిన కరోనా పరీక్షల్లో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కి కరోనా పాజిటివ్ అని వైసీపీ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే ఆయన్ను క్వారంటైన్ కు వచ్చేయమన్నారు. కానీ అప్పటికే హైదరాబాద్ లో ఉన్న దీపక్ రెడ్డి అక్కడ రెండు చోట్ల పరీక్ష చేయించుకుంటే రెండు రిపోర్టుల్లోనూ నెగటివ్ అని వచ్చింది. ఏమిటిది? ఎక్కడ తప్పు జరుగుతోంది?. " అని చంద్రబాబు ప్రశ్నించారు. "రోజుకు వేల పరీక్షలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటే సరా? అందులో ఖచ్చితత్వం ఇదేనా? నెగటివ్ ఉన్న వ్యక్తికి పాజిటివ్ అని ఎలా చెబుతారు? ప్రజల ఆరోగ్యంతో కూడా ఇలాగే ఆడుకుంటున్నారా? పాజిటివ్ అని నిర్ధారణ కాకముందే ఒక ఎమ్మెల్సీని క్వారంటైన్ లో ఎందుకు పెట్టాలనుకున్నారు?. కరోనా పాజిటివ్ అన్న పేరుతో దీపక్ రెడ్డిని క్వారంటైన్ లో ఉంచాలనుకోవడం వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అనుమానంగా ఉంది. అంతకన్నా ముందు కరోనా పరీక్షల ఖచ్చితత్వం ఏంటన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలి." అని చంద్రబాబు జగన్ సర్కార్ ని నిలదీశారు.

టీడీపీ నేత అచ్చెన్న కేసులో అర్ధరాత్రి హైడ్రామా

ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను ఎసిబి కస్టడీకి అప్పగిస్తూ ఎసిబి కోర్ట్ నిన్న సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది. ఐతే తనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స తీసుకునేందుకు అనుమతించాలని అచ్చెన్న చేసిన అభ్యర్ధనను మాత్రం కోర్టు తిరస్కరించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఆస్పత్రిలోనే ఉంచి న్యాయవాది, వైద్యుడి సమక్షంలో విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆయనను కూర్చోమని లేదా నిలబడమని అధికారులు కోరడానికి వీల్లేదని ఆ ఆదేశంలో స్పష్టం చేసారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీన్ మొత్తం మారిపోయింది. అర్ధరాత్రి సమయంలో అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేస్తున్నట్లు జీజీహెచ్‌ అధికారులు హైడ్రామాకు తెర తీసారు. అంతకు ముందు కోర్టుకు అందించిన రిపోర్ట్ లో ఆయనను మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. దీంతో ఆయనను తమ అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి అటు అయన తరుఫు లాయర్, ఇటు టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో అచ్చెన్న డిశ్చార్జి పై ఆస్పత్రి అధికారులు వెనక్కి తగ్గారు.

వైసీపీ షోకాజ్ నోటీసుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు రియాక్షన్

ఎమ్మేల్యేల పైన, పార్టీ అధినాయకత్వం పైన తీవ్ర వ్యాఖ్య‌లు చేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ అధిష్టానం షోకాజు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తనకు షోకాజు నోటీసు జారీ చేయడంపై రఘరామకృష్ణంరాజు స్పందించారు. ఏ నాడు పార్టీని కానీ, పార్టీ అధ్యక్షుణ్ని కానీ పల్లెత్తు మాట అనలేదన్నారు. ప్రజల కోసం చేపట్టిన పథకాలు అనుకున్నట్టుగా జరగడంలేదని.. సీఎంకి చెప్పాల్సిన విషయాలు వీడియో ముఖంగా చెప్పానని తెలిపారు. సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తే దొరకలేదని పేర్కొన్నారు. అపాయింట్‌మెంట్‌ దొరకని కారణంగానే మీడియా ముఖంగా సూచ‌న‌లు చేసినట్టు వివ‌రించారు. త‌న‌కు నోటీసుపై వివ‌ర‌ణ‌కు వారం రోజులు సమయం ఉన్నా రేపు సమాధానం చెబుతానని రఘరామకృష్ణంరాజు పేర్కొన్నారు.