టీడీపీ కార్యాలయం పై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ  

గుంటూరు లో కొత్తగా నిర్మించిన టీడీపీ ప్రధాన కార్యాలయం అక్రమ నిర్మాణం అంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆఫీసు కోసం వాగు పోరంబోకుకు చెందిన 3 ఎకరాల 65 సెంట్ల భూమిని కేటాయిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబరు 228ని సవాలు చేస్తూ ఆళ్ల ఈ పిటిషన్‌ వేశారు.    మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో టీడీపీ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం 99 సంవత్సరాల లీజు కింద భూమిని కేటాయించిందని.. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని అయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయంలో నీటి వనరులకు సంబంధం ఉన్న భూములను కేటాయించడంపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించారని పిటిషన్‌లో అయన ప్రస్తావించారు. అక్కడ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపినందున చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని... అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు తగిన ఆదేశాలు జారీచేయాలని అయన కోర్టును కోరారు.    అయితే గతంలో కూడా దీనిపై ఎమ్మెల్యే ఆళ్ల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఆ పిటిషన్‌ను కొట్టేసిన సంగతి తెలిసిందే.

నవంబర్ 15 నుంచి రామగుండం ఎరువుల ఉత్పత్తి ప్రారంభం

అతిత్వరలో రామగుండం ఎరువులు అందుబాటులోకి   నవంబర్ 15 నుంచి ఉత్పత్తి ప్రారంభం   కిసాన్ పేరుతో విడుదల   99.5 శాతం పనులు పూర్తి   వెయ్యిమందికి ఉపాధి   తెలంగాణ రైతుల ఎరువుల వేతలు ఇక మాయం   తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎరువుల వెతలు అతి త్వరలో తీరనున్నాయి. ఎరువుల కొరత తీర్చే ప్రతిష్టాత్మక రామగుండం ఫ్యాక్టరీ అతి త్వరలో ప్రారంభం కానుంది.   ఇప్పటికే 99.5శాతం పనులు పూర్తి కాగా పాయింట్ ఐదుశాతం పనులు పూర్తి కావడానికి రెండునెలల సమయం పట్టనుంది. నవంబర్ 15 నుంచి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువులు కిసాన్ బ్రాండ్ పేరుతో మార్కెటులోకి రానున్నాయి.రూ.6,120.55 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ కర్మాగారంలో ప్రతిరోజూ 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కానుంది.   గతంలో మూతపడిన ఎరువుల కర్మాగారం స్థానంలోనే గ్యాస్‌ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్ఎల్‌), ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌), ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎఫ్‌సీఐల్‌)తో జాయింట్‌ వెంచర్‌గా ఈ ఫర్టిలైజర్స్‌ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించారు.  ఈ ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును మల్లవరం-భిల్వారా పైప్‌లైన్ ద్వారా, నీటి వనరులను గోదావరి నది పై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుండి అందిస్తారు.   రాష్ట్ర అవసరాలకే  మొదటి ప్రాధాన్యత రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన యూరియా సగం తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు వినియోగిస్తారు. ప్రాజెక్ట్ ల్లో నీరు  సమృద్ధిగా ఉండటం, చెరువులు జలకళతో కళకళలాడటంతో తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం 10లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర అవసరాల మేరకు కావల్సిన  యూరియాను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. దాంతో ఎరువుల కొరత ప్రతిఏడు రైతులను ఇబ్బంది పెడుతోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీరనుంది.   నాలుగు దశాబ్దాల కిందట .. రామగుండం 1980లో ఉత్పత్తి ప్రారంభించిన ఈ కర్మాగారం మొదటి నుంచి  అనేక సమస్యలను ఎదుర్కోంటూ 18 సంవత్సరాలు ఎరువులను అందించింది. మూడువెల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్రారంభమైనప్పటికీ బొగ్గు కొరత కారణంగా రోజుకు 1500 టన్నుల యూరియా ఉత్పత్తి చేసింది.  నష్టాలభారం, కార్మిక సమస్యల కారణంగా ఎక్కువ రోజులు ఈ పరిశ్రమ మనుగడ సాగలేదు. ఆ తర్వాత క్రమేణా 750 టన్నుల ఉత్పత్తి మాత్రమే చేయగలగడంతో  నష్టాల భారం పెరిగింది. ఆసియాలోనే ప్రయోగాత్మకంగా బొగ్గు ఆధారంగా ఎరువులు తయారు చేసే ఈ కర్మాగారాన్ని  1992లో బీఐఎఫ్ఆర్‌ ఖాయిలా పరిశ్రమగా ప్రకటించి,  1999 లో మూసివేశారు.   మూతపడ్డ 20ఏండ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దానికి సాంకేతికతను అందించి గ్యాస్‌ ఆధారిత ఫ్యాక్టరీగా పునరుద్ధరించాలని నిర్ణయించింది. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ పేరుతో కంపెనీని ప్రారంభించారు. బొగ్గు గనులతోపాటు వెలుగులు నింపే ఎన్టీపీసీవంటి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉండడంతో రామగుండానికి మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు వచ్చింది. మూతపడ్డ 20 ఏళ్ళ తర్వాత ‘రామగుండం ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ స్థానంలో కొత్తగా ‘రామగుండం ఫర్టిలైజర్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌’ పేరుతో 2016లో కొత్త యూనిట్‌ నిర్మాణ పనులు చేపట్టారు. గ్యాస్‌ సరఫరా చేసేందుకుగాను ఏపీలోని కుంచనపల్లి నుంచి 360 కిలోమీటర్ల మేర గ్యాస్‌ పైపులైన్లు వేశారు. గ్యాస్‌ సరఫరాలో ఏదైనా అంతరాయం గానీ, ప్రమాదాలు గానీ జరిగినప్పుడు నియంత్రించేందుకు 15 చోట్ల ఎస్‌వీ స్టేషన్ల (గ్యాస్‌ నియంత్రణ ప్రదేశాలు) నిర్మించారు.   వచ్చే నెలలో ఫ్యాక్టరీని సందర్శించనున్న కేంద్రమంత్రి రామగుండం ఎరువుల కర్మాగారం ఏర్పాటులో జరుగుతున్న పనులపై అధికారులతో  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గురువాతం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 99.5శాతం పనులు పూర్తి అయ్యాయని మరో రెండునెలల్లో మిగతా పనులు పూర్తి అవుతాయని అధికారులు వివరించారు. సెప్టెంబర్ నెలలో ఫ్యాక్టరీని సందర్శిస్తానని మంత్రి చెప్పారు. ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే ఎరువుల్లో సగం తెలంగాణ రాష్ట్రానికే కేటాయిస్తామని, మిగతా సగం ఇతర రాష్ట్రాల రైతులకు అందిస్తామని ఆయన అన్నారు.

గ్రేటర్ లో కేటీఆర్ దూకుడు.. బల్దియా పీఠమే టార్గెట్?

గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ పెంచారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. కొన్ని రోజులుగా వరుస సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. కరోనా భయపెడుతున్నా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జోరుగా చేస్తున్నారు. పెండింగ్ పనులను పూర్తి చేయిస్తూ.. ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీపలే పలు ఫ్లైఓవర్లు, స్లిప్ రోడ్లను ప్రారంభించారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రేటర్ పై పెద్దగా దృష్టి సారించని కేటీఆర్.. సడెన్ గా స్పీడ్ పెంచడానికి త్వరలో జరగనున్న బల్దియా ఎన్నికలే కారణమంటున్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి కాల పరిమితి జనవరిలో ముగియనుంది. అంటే మరో నాలుగు నెలల్లో గ్రేటర్ బల్దియా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. మళ్లీ గ్రేటర్ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేటీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే సిటీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్నా... జోరుగా జనంలోకి వెళుతున్నారు మంత్రి. స్థానిక సమస్యలపై ఫోకస్ చేయాలని గ్రేటర్ నేతలను అలెర్ట్ చేశారు.   గ్రేటర్ లో పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా అధికారులకు టార్గెట్ పెడుతున్నారు కేటీఆర్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేలా చూస్తున్నారు. బాలాపూర్, ఉప్పల్ ఫ్లై ఓవర్ల పనులను వేగంవంతం చేసేలా చర్యలు చేపట్టారు. గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపైనా కేటీఆర్ ఫోకస్ చేశారు. గత ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీనే గులాబీ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. రెండేళ్లలో లక్షన్నర ఇండ్లు కట్టిస్తామని కేటీఆర్ చెప్పడంతో జనాలు నమ్మారు. ఏకపక్షంగా కారు పార్టీకి జై కొట్టారు. దీంతో  జీహెచ్ ఎంసీలో గతంలో ఎప్పుడు లేనంతగా, ఎవరూ అంచనా వేయనంతగా 99 డివిజన్లు గెలిచింది టీఆర్ఎస్. అయితే ఐదేండ్లు కావస్తున్నా ఇండ్ల హామీని అమలు చేయలేకపోయింది. ఇప్పటివరకు నాలుగు వేల ఇండ్లు మాత్రమే పంపిణి చేశారు. మరో లక్ష వరకు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే నిధులు లేక కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో ఇండ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొన్ని బస్తీల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామంటూ ఉన్న ఇండ్లను కూల్చేశారు. దీంతో వారంతా రోడ్డున పడ్డారు. ఐదేండ్లైనా ఇళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా తమకు ఇండ్లు ఇవ్వాలంటూ బల్దియా చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలు సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.   గ్రేటర్ ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అంశం తమకు నష్టం కలిగిస్తుందని ఊహించిన కేటీఆర్ ముందే అప్రమత్తమయ్యారు. గ్రేటర్ పరిధిలోని ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయించారు. అధికారులకు టార్గెట్ పెట్టి మరీ పనులు పరుగులు పెట్టిస్తున్నారు. డిసెంబర్ లోగా 85 వేల ఇళ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రేటర్‌ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల ఇళ్ల చొప్పున పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. విపక్షాలు మాత్రం కేటీఆర్ తీరుపై మండిపడుతున్నాయి. తప్పుడు హామీలతో పేదలను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఐదేండ్లు పట్టించుకోకుండా మళ్లీ ఎన్నికల వేల హడావుడి చేస్తూ మరోసారి గ్రేటర్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.

విశాఖలో గెస్ట్ హౌస్ పై ఒక పక్క హైకోర్టులో విచారణ.. మరో పక్క భూమి కేటాయింపు జీవో జారీ

విశాఖలో నిర్మించ తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్ కోసం ఏపీ సర్కారు 30 ఎకరాలు జిల్లా కలెక్టర్ కు బదలాయిస్తూ జీవో జారీ చేసింది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాపులుప్పాడ గ్రేహౌండ్ భూముల్లో ఈ గెస్ట్ హౌస్ ను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను రద్దును సవాల్ చేస్తూ అమరావతి రైతులతో పాటు పలు సంఘాలు హైకోర్టులో పలు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెల్సిందే. దీంతో హైకోర్టు ఈ అంశం పై స్టేటస్ కో విధించింది.    మరో వైపు స్టేటస్ కో ఉన్న సమయంలో కూడ విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వం శంకుస్థాపన చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఒక న్యాయవాది ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకంతో కౌంటర్ వేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటలలోనే విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కాపులుప్పాడ కొండపై 30 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ కు బదలాయిస్తూ ఏపీ ప్రభుత్వం 1353 జీవో జారీ చేస్తూ.. దీన్ని అత్యవసరంగా పరిగణించాలని ప్రభుత్వం పేర్కొంది.

విజయసాయి వెన్నుపోటు కామెంట్ల పై బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్

కరోనా నుండి కోలుకున్న తరువాత విజయ సాయిరెడ్డి మరింత రెచ్చిపోయి చంద్రబాబు పైన దాడిని తీవ్రం చేసారు. తాజాగా వెన్నుపోటు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. "బాబు గారి వెన్నుపోటు మరోసారి ఢిల్లీ స్థాయిలో మార్మోగింది అంటూ ట్వీట్ చేశారు. పాపం పండి బాబు పవర్ లో లేకుండా పోయారని, త్వరలోనే రాజకీయాల నుంచి కూడా నిష్క్రమణ తప్పదని హస్తినలో అనుకుంటున్నారని" పేర్కొన్నారు. "వెన్నుపోటు రాజకీయాలకు కాలం చెల్లిపోయింది బాబూ, కానీ మీరు ఆంధ్రా ఔరంగజేబ్ గా కలకాలం గుర్తుండిపోతారు... పెద్దాయన సాక్షిగా!" అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అయితే ఈ ట్వీట్ కు కౌంటర్ గా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సీఎం జగన్ పై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసారు. "వెన్నుపోట్లలో బాత్ రూమ్ పోట్లు వేరయా! సోనియమ్మకు వెన్నుపోటు, వివేకా బాబాయ్ కి బాత్ రూమ్ పోటు అంటూ విమర్శించారు. అంతేకాకుండా "తండ్రీకొడుకులకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీనే భక్షించిన వెన్నుపోటుదారుడు జగన్ ను నమ్మితే అంతేనంటూ ఢిల్లీలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చారట!" అంటూ బుద్ధా వెంకన్న ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి శత మొట్టికాయ ఉత్సవం!!

అమరావతి రైతులకు నూటికి నూరుపాళ్లు న్యాయం జరుగుతుందని నర్సాపురం వైసీపీ ఎంపీ రాఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కళ్లుండి మనసులేని ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను కళ్లు లేని మనసున్న న్యాయస్థానాలు న్యాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. న్యాయం పూర్తిగా అమరాతి రైతుల పక్షాన నిలుస్తుందన్నారు. న్యాయం జరుగుతుందన్న మనోధైర్యంతో మహిళలు, రైతులు ముందుకువెళుతున్నారని అన్నారు. గాంధేయమార్గంలో న్యాయంకోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.   అన్యాయంపై అమరావతి రైతులు పాక్షికంగా విజయం సాధించారన్నారు. స్టేటస్‌ కో ఆర్డర్‌ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో అతిథిగృహం నిర్మాణానికి పూనుకోవడం దుస్సాహసమేనని వ్యాఖ్యానించారు. ప్రముఖ న్యాయవాదులు తమవైపు వాదించడానికే కాదు.. వాదించకుండా ఉండటానికీ జగన్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయాలు వెచ్చిస్తోందని రఘురామరాజు ఆరోపించారు. ప్రజాధనం వృథా చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు.    పనికిరాని వారిని అందరినీ తెచ్చి సలహాదారులుగా పెట్టుకున్నారని రఘురామరాజు ఎద్దేవా చేశారు. న్యాయపరమైన విషయాల్లో సీఎం జగన్‌కు సలహాలు ఇచ్చేవారు లేరనుకుంటానని, సీఎం అనవసరంగా పడి ఉన్న సలహాలదారులును తప్పించి.. మంచి వారిని న్యాయ సలహాదారులగా పెట్టుకోవాలని రఘురామరాజు సూచించారు.   త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి శత మొట్టికాయ ఉత్సవం జరుగుతుందని ఎంపీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కోర్టుల్లో 70కి పైగా మొట్టికాయలు పడినప్పుడు తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరముందని అన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే శత మొట్టికాయ ఉత్సవం ఎంతో దూరంలో లేదనిపిస్తుందని పేర్కొన్నారు. నీలం సంజీవరెడ్డి, ఎన్‌ జనార్థన్‌రెడ్డి హయాంలో కోర్టులు చిన్న కామెంట్‌ చేశాయని రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.   ఈ భూమ్మీద ఎక్కడా లేని చిత్రవిచిత్ర బ్రాండ్లన్నీ ఏపీలోనే అమ్ముతున్నారని మండిపడ్డారు. గోల్డ్ మెడల్ లు, ప్రెసిడెంట్ మెడల్స్, నోబెల్ ప్రైజ్ వంటివి అమ్ముతున్నారని, ప్రజలు ఈ మెడల్స్ స్వీకరించవద్దు అని ఆయన కోరారు. ఎస్పీ వై రెడ్డి ఫ్యాక్టరీ లీజుకి తీసుకుని ఇలాంటి బ్రాండ్లను తయారు చేస్తున్నారన్నారని ఆరోపణలు చేశారు. ఇలాంటి బ్రాండ్లు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని రఘురామరాజు వ్యాఖ్యానించారు.

జగన్ సర్కార్ కు మరో షాక్.. టీడీపీ నేతలకు ఊరట

జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. టీడీపీ నేతలకు సంబంధించిన గ్రానైట్ క్వారీల లీజుల రద్దు విషయంలో.. లీజ్ రద్దు నోటీసును హైకోర్టు ఏకంగా డిస్మిస్ చేసింది.   ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే పోతుల రామారావులకు సంబంధించిన గ్రానైట్ క్వారీల లీజులు రద్దు చేస్తూ ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్వారీయింగ్‌లో లోపాలు ఉన్నాయని ఇద్దరు నేతల క్వారీల లీజు రద్దు చేసింది. ప్రభుత్వ ఆదేశాలపై టీడీపీ నేత పోతుల రామారావు హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షతోనే లీజులు రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్దంగా లేవని అభిప్రాయపడింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు రాజధానుల కేసులో సీఎం జగన్ తో పాటు ఇద్దరు మంత్రులకు హైకోర్టు నోటీసులు 

సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ ఏపీ సర్కార్ ఈ విషయంలో అడుగు ముందుకు వేయడం అటుంచి.. రోజూ తన పరువును పోగొట్టుకుంటోంది. తాజాగా మూడు రాజధానులకు సంబంధించిన కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ఈ కేసులో ఏకంగా సీఎం జగన్ తో పాటు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.    ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తోందంటూ ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లాగా, అధికారంలోకి రాగానే మరో లాగా జగన్ మాట మార్చారని పిటిషన్ లో రైతులు పేర్కొన్నారు. దీని పై ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇదే విషయం పై హైకోర్టులో ఇతరులు కూడా పిటిషన్లు దాఖలు చేసారు. ఈ పిటిషన్ల పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మొత్తం పిటిషన్లన్నిటికి కలిపి ఏపీ ప్రభుత్వం కేవలం ఒక్క కౌంటర్ ను మాత్రమే దాఖలు చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ప్రతి పిటిషన్ కు ఒక కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ, బీజేపీలకు కూడా కోర్టు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సెప్టెంబర్ 21వ తేదీ వరకు స్టేటస్ కోను పొడిగిస్తున్నామని హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ పిటిషన్ పై ప్రతి రోజూ విచారణ జరుపుతామని కూడా చెప్పింది. అయితే ఈ విచారణను ప్రత్యక్షంగా నిర్వహించాలా? లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలా? అనే విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది.

మానవతావాది సర్ డోరాబ్జీ టాటా

సర్ డోరాబ్జీ టాటా ( 27 ఆగస్టు 1859 - 3 జూన్ 1932)   టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల విస్తరణలో కీలక వ్యక్తి సర్ డోరాబ్జీ టాటా. భారతీయ పరిశ్రమ పితామహుడుగా పేరుగాంచిన తన తండ్రి ఆశయాల మేరకు  టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలను అభివృద్ధి చేశారు. పారిశ్రామిక రంగంలో చేసిన కృషికి గాను బ్రిటిష్ ప్రభుత్వం 1910లో సర్ బిరుదు ఇచ్చింది.   డోరాబ్జీ టాటా 27 ఆగస్టు 1859 న ముంబయిలో జన్మించాడు. తల్లిదండ్రులు హీరాబాయి, జమ్సెట్టీ టాటా. పెద్దకుమారుడైన డోరాబ్జీ తన ప్రాథమిక విద్యను ముంబయిలో పూర్తి చేసి 1875లో ఉన్నత విద్యకోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిధిలోని గోన్విల్లే, కైస్ కాలేజీ లో చేరాడు. ఆ తర్వాత ఇండియా తిరిగివచ్చి ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో డిగ్రీ పట్టా అందు కున్నాడు.   జర్నలిస్టుగా.. రచనరంగంపై ఆసక్తి, సమాకాలీన అంశాలపై అనురక్తితో జర్నలిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. బొంబాయి గెజిట్ లో రెండు సంవత్సరాల పాటు జర్నలిస్ట్ గా పనిచేశాడు. ఆ తర్వాత 1884లో తన తండ్రి సూచనల మేరకు వ్యాపారరంగంలోకి వచ్చారు. మొదట కాటన్ పరిశ్రమ విభాగంలో చేరాడు. దేశంలో కాటన్ పరిశ్రమల ఏర్పాటు ఎక్కడ లాభసాటిగా ఉంటుందో తెలుసుకోవడానికి పాండిచ్చేరి, ఫ్రెంచ్ కాలనీ, నాగ్ పూర్ తదితర ప్రాంతాలకు వెళ్లారు.   టాటా, భాభా కుటుంబాల మధ్య బంధుత్వం వ్యాపార విస్తరణలో భాగంగా అనేక నగరాలను సందర్శించిన డోరాబ్జీ మైసూర్ పట్టణానికి వెళ్లారు. ఆ రాష్ట్ర మొదటి ఇండియన్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ హోర్మస్టీ భాభాను కలిశారు. ఆ తర్వాత ఆయన ఏకైక కుమార్తె మెహర్ బాయితో డోరాబ్జీ పెండ్లి జరగడంతో టాటా, భాభా కుటుంబాల మధ్య వారధి ఏర్పడింది. ప్రముఖ శాస్త్రవేత్త హోమి జె. భాభా మెహర్ బాయి మేనల్లుడు. భాభా పరిశోధనా సంస్థలకు టాటా గ్రూప్ నిధులను కేటాయించడానికి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వమే కారణం.   తండ్రి ఆశలకు అనుగుణంగా.. భారతదేశంలో "స్వదేశీ ఉద్యమానికి  జమ్సెట్టీ టాటా ఎంతో కృషి చేశారు. దేశీయ వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించేలా తన కాటన్ మిల్లుకు “స్వదేశీ మిల్” అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఇనుము, ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ఎంతగానో శ్రమించారు. అయితే ఆయన కృషి ఫలించలేదు. తండ్రి ఆశయం గురించి తెలిసిన డోరాబ్జీ ఇనుము పరిశ్రమ స్థాపన కోసం ప్రయత్నాలు చేశారు. 1903లో శపూర్ జీ షక్లత్ వాలాతో కలిసి ఇనుము పరిశ్రమ ఏర్పాటుకోసం సరైన ప్రదేశం కోసం వెతికారు. ఒకవైపు ఇనుము పరిశ్రమ కోసం కృషి చేస్తున్న సమయంలోనే తండ్రి అనారోగ్యంతో మరణించారు. ఇది డోరాబ్జీని బాగా కృంగ దీసింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిగా పరిశ్రమ స్థాపన కోసం పెట్టుబడులను సేకరించడానికి అనేక సంస్థలను పెట్టుబడుల కోసం సంప్రదించారు. 1906లో లండన్ సంస్థలను కూడా పెట్టుబడులు పెట్టాలని కోరారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వదేశీ పెట్టుబడులతోనే పరిశ్రమను స్థాపించే ప్రయత్నం చేశారు. ఆయన సంకల్పం ఫలించి మూడువారాల్లోనే పరిశ్రమ స్థాపనకు కావల్సిన పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం జార్ఘండ్ లో జంషేడ్ పూర్ లో ఉన్న టాటా స్టీల్ ప్లాంట్ ను సింబల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియాగా మార్చే ప్రయత్నం చేశారు. 1911లో ఇక్కడి నుంచి ఇనుము ఉత్తత్పి ప్రారంభం అయ్యింది.   ఈ తర్వాత మరోసారి  1924లో పరిశ్రమ ను కొనసాగించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.  డోరాబ్జీ తన ఆస్తులన్నీ పరిశ్రమలో పెట్టుబడిగా పెట్టి పరిశ్రమను నిలబెట్టారు. ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వేతనాలు కట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈనాడు ఈ పరిశ్రమలో వేలాది మంది పనిచేస్తున్నారు. స్వదేశీ ఇనుము తయారు చేయాలన్న తండ్రి ఆశయాలను డోరాబ్జీ నిజం చేశారు.   ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. డోరాబ్జీ టాటాకు క్రీడల పట్ల ఆసక్తి ఉండేది. టాటా గ్రూప్ సంస్థల నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేవారు. అంతేకాదు భారతీయ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1924లో ఎన్నికైయ్యారు.  పారిస్ లో జరిగిన ఒలంపిక్స్ వెళ్లేందుకు భారత బృందానికి ఆర్థిక సహాయం అందించారు.   మెహర్ బాయి మెమోరియల్ గా.. డోరాబ్జీకి భార్య అంటే చాలా ప్రేమ. 1931లో మెహర్ లుకేమియా బారిన బడి మరణించారు. వారికి పిల్లలు లేరు. భార్యపై ఉన్న ప్రేమతో లేడీ టాటా మెమోరియల్ ట్రస్ట్ ను స్థాపించారు. పరిశోధనలు, ప్రకృతి వైపరీత్యాల కోసం ఈ ట్రస్ట్ ఫండ్ ఇస్తుంది. భారతదేశంలోని అనేక విద్యాసంస్థలకు ఈ ట్రస్ట్ నుంచి నిధులు కేటాయిస్తారు. మానవాతావాదిగా, పారిశ్రామిక వేత్తగా పేరుగాంచిన డోరాబ్జీ 3 జూన్ 1932లో జర్మనీలోని బాడ్ కిస్సింగెన్‌లో మరణించాడు.

రేవంత్ రెడ్డి కొత్త పార్టీ.. తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు రానుందా?

వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ.. వివిధ రాష్ట్రాలలో అధికారం కైవసం చేసుకుంటూ దూసుకుపోతుంటే.. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో రోజురోజుకి ప్రభ కోల్పోతుంది. ముఖ్యంగా సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ఆ పార్టీని బాగా దెబ్బ తీస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతని దూరం చేసుకొని.. రాష్ట్రంలో అధికారంతో పాటు, కొంత బలాన్ని కూడా కోల్పోయింది. ఇక, రాజస్థాన్ లో కూడా కీలక నేత సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనని తిరిగి దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ నానా తంటాలు పడాల్సి వచ్చింది.   నిజానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బీజేపీని ఢీ కొట్టి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడంలో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ కీలక పాత్ర పోషించారు. అయితే యువనాయకులైన వీరిని కాదని రెండు రాష్ట్రాల్లోనూ సీనియర్లకు సీఎంలుగా అవకాశమిచ్చింది హైకమాండ్. ఈ నిర్ణయంపై సింధియా, సచిన్ వర్గాలు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. సీనియర్లతో కలిసి పనిచేయడానికి అంగీకరించారు. అయితే సీనియర్లు మాత్రం వీరి మార్క్ కనిపించకుండా చేయడం, వీరి వర్గాలను ఎదగనివ్వకుండా చేయడంతో.. యువ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ అంతర్గత కుమ్ములాటలతో సింధియాని కోల్పోయిన కాంగ్రెస్ సచిన్ ని మాత్రం కాపాడుకోగలిగింది.   అయితే, ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ తీరు మారట్లేదు. ఇప్పుడు ఈ సీనియర్ల, జూనియర్ల  పోరు తెలంగాణలో కూడా కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి దక్కితే పార్టీలో కొనసాగాలని, లేదంటే ప్రాంతీయ పార్టీని స్థాపించి ముందుకు సాగాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.    రేవంత్ రెడ్డిని తెలంగాణలోని సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వి. హనుమంతరావు, జగ్గారెడ్డి వంటివాళ్లు బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి కోసం కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాలో పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా ఓకే కానీ, రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే అంగీకరించబోమని పలువురు సీనియర్లు చెబుతున్నారు.    ఒక రకంగా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి అంత అనుకూల వాతావరణం లేదు. తనతో పాటు పార్టీలో చేరినవారికి కూడా తగిన ప్రాధాన్యం లేదనే ఆసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ పెట్టి ముందుకు సాగాలనే యోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందనే విషయంపై ఆయన కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి నేతలు తగిన సహకారం అందించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.    ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి ఓ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ సర్వే పూర్తిగా క్షేత్ర స్థాయికి వెళ్లి చేయలేదు.15 మందితో ఆ సర్వే చేయించారని సమాచారం. రేవంత్ రెడ్డి ఆలోచనకు దక్షిణ తెలంగాణ నుంచి మంచి మద్దతు లభిస్తోందని, ఉత్తర తెలంగాణ నుంచి అంతగా మద్దతు లభించడం లేదని సర్వేలో తేలినట్లు సమాచారం. గతంలో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో రేవంత్ రెడ్డికి అనుకూల వాతావరణం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అనుకూల వాతావరణం ఉందని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో విస్తృత స్థాయి సర్వేకు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. 150 మందితో సర్వే చేయించాలని, ఒక్కొక్కరికి పది మంది చొప్పున కేటాయించాలని 15 మందితో కూడిన బృందం రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. దానికి రేవంత్ రెడ్డి నుంచి ఆమోదం లభించాల్సి ఉందని సమాచారం.   అసలే, తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ని కాంగ్రెస్ బలంగా ఎదుర్కోలేకపోతోంది. దానికితోడు బీజేపీ తెలంగాణలో బలపడటానికి పావులు కదుపుతోంది. ఇలాంటి సమయంలో సీనియర్లు, జూనియర్ల విభేదాలు ముదిరి రేవంత్ కాంగ్రెస్ ని వీడితే ఆ పార్టీకి మరింత దెబ్బనే చెప్పాలి. మరి కాంగ్రెస్ హైకమాండ్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సింధియా, సచిన్ ల వ్యవహారాలలోలాగా లేట్ గా రియాక్ట్ అవుతుందో లేక వాళ్ళలాగా రేవంత్ తిరుగుబాటు జెండా ఎగరవేయకముందే మేలుకుంటుందో చూడాలి.

మరోసారి స్టేటస్‌ కో పొడిగింపు.. విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణంపై ధిక్కార పిటిషన్

ఏపీలో రాజధాని తరలింపు, సీఆర్డీఏ చట్టం రద్దుపై స్టేటస్‌ కోను హైకోర్టు మరోసారి పొడిగించింది. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగగా, స్టేటస్ కోను సెప్టెంబరు 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసిన హైకోర్టు.. ఈ విషయంపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు, అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు  ధర్మాసనం గడువు ఇచ్చింది.   మరోవైపు, విశాఖపట్నంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలైంది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగింది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో ఏపీ సర్కారు అతిథి గృహాన్ని నిర్మించనుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి భవనం ఐదు ఎకరాల్లో ఉండగా.. కాపులుప్పాడులో 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను ఎలా కడతారని నితీష్ గుప్తా ప్రశ్నించారు. ఒక వైపు హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో అమల్లో ఉన్న సమయంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజధాని తరలింపులో ఇది కూడా ఒక భాగమేనని ఆయన తెలిపారు. వాదనలు విన్న అనంతరం.. దీనిపై కూడా వచ్చేనెల 10లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

పదిశాతం పోలీసుల్లో కరోనా

కరోనా పై పోరులో ముందువరుసలో ఉన్న వైద్యసిబ్బందిని, పోలీసులను కరోనా కలవరపెడుతోంది. లాక్ డౌన్ సమయంలో సమర్థవంతంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థ లో ఇప్పుడు కరోనా భయబ్రాంతాలకు గురిచేస్తుంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర పోలీసు ల్లో దాదాపు పదిశాతం మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు. పోలీస్ శాఖలో ఇప్పటివరకు మొత్తం 5,684 మందికి కోరోనా వచ్చింది. వారిలో 2,384మంది కోలుకున్నారు. 3,357మందిలో చాలామంది హోంఐసోలేషన్ లో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  ఇప్పటివరకు 44మంది పోలీసులు కరోనాతో చనిపోయారని పోలీస్ శాఖ చెప్తోంది. వీరిలో కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు వివిధ స్థాయిలో పనిచేసే పోలీసులు ఉన్నారు.   హైదరాబాద్ కమిషనరేట్ లో దాదాపు 1,967మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,053మంది కోలుకోగా 891 చికిత్స తీసుకుంటున్నారు. 23మంది మరణించారు. ఇక జిల్లాల విషయానికి వస్తే  వరంగల్ లో 526మంది పోలీసులు కరోనా పాజిటివ్ గా నమోదు అయ్యారు. వారిలో 163మంది కోలుకున్నారు. 361మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పోలీసులు చనిపోయారు. కరోనా పాజిటివ్ గా నమోదు అయిన పోలీసులకు 17రోజుల సెలవుతో పాటు ఐదువేల రూపాయల ఆర్థిక సాయం పోలీసు శాఖ అందిస్తోంది. పోలీసు శాఖలోని అన్ని విభాగాలలోను కలుపుకుని మొత్తం 54 వేల మంది పోలీసులు పనిచేస్తున్నారు.   కరోనా ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్న వారిలో వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు ఉన్నారు. మరి వీరిలో ఎంతశాతం మంది కరోనా కోరల్లో చిక్కారో లెక్కలు తీస్తే ఎక్కువ సంఖ్యే బయటకు వస్తుందేమో ..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి ప్రత్యేక సహాయం అందించాలని కోరుతున్నారు. 

కరోనా చికిత్సలో ఓజోన్.. జపాన్ లో పరిశోధనలు

ప్రపంచమంతా జరుగుతున్న పరిశోధనలకు మూలం కరోనాగా మారింది. కరోనా వైరస్ కు ఎన్ని కిరీటాలు ఉన్నాయో అంతకుమించి దాన్ని కొమ్ములు వంచడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఒకవైపు అనేక మార్గాలను అన్వేషిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్ తయారిలో తలమునకలై శ్రమిస్తున్నారు. ఇంకో వైపు  పాజిటివ్ వ్యక్తులు తర్వగా కోలుకునేలా చికిత్స అందించడంలో కొత్త విధానాలను కనుగొంటున్నారు.    తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు ఓజోన్ వాయువుతో వైరస్‌కు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ఓజోన్ పొర భూమిని రక్షించినట్లే కరోనా వ్యాధి బారిన పడినవారిని త్వరగా కోలుకునేలా చేస్తుందట. ఓజోన్ వాయువును అతి తక్కువగా సాంద్రతలో ఉపయోగిస్తే  వైరస్‌ను చంపడం సాధ్యమవుతుందని జపాన్ లోని పుజిటా హెల్త్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 0.05 నుంచి 0.1 పీపీఎం స్థాయిలో ఓజోన్ వాయువును ఉపయోగించి వైరస్‌ను నిర్వీర్యం చేయవచ్చని వారి పరిశోధనల్లో వెల్లడైంది. చికిత్సలోనే కాదు ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో దీనిని డిస్‌ఇన్‌పెక్టెంట్‌గా కూడా ఉపయోగించవచ్చని వారు వెల్లడించారు. ఇప్పటికే ఓజోన్ జనరేటర్లను ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు జపాన్ లో జరుగుతున్నాయి. ఓజోన్ జనరేటర్‌ ద్వారా దాదాపు 10 గంటలపాటు తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును ఉపయోగిస్తే వైరస్ శక్తి 90 శాతం తగ్గినట్టు గుర్తించారు.   ఓజోన్ అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేస్తుందని పుజిటా హెల్త్ యూనివర్సిటీ చీఫ్ సైంటిస్ట్ మురాఠా వెల్లడించారు. అధిక తేమ ఉన్న పరిస్థితుల్లోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. 

సింహాచలం అప్పన్న భూముల పై పెద్దల కన్ను.. లీజుకు ఈరోజే నాంది..!

జగన్ ప్రభుత్వం ఎపి కి కొత్త రాజధానిగా విశాఖను ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. అక్కడ ఆత్యంత ఖరీదైన సింహాచలం అప్పన్న భూముల పై కొంత మంది పెద్దలు కన్నేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సింహాచలం అప్పన్న స్వామి ఆస్తులు లీజుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం ఈరోజు జరిగే ఆలయ పాలక మండలి భేటీలో నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధమయింది.    సింహాచలం అప్పన్న స్వామి ఆలయానికి సంబంధించిన అత్యంత ఖరీదైన భూములలో కళ్యాణ మండపాలు, భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నగరంలోని కీలక ప్రాంతాల్లో ఉన్నాయి. తాజాగా పదహారు ఎకరాలకు పైగా ఉన్న ఆస్తులను 11 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు పాలకమండలి సిద్ధమైంది. అయితే ఇవన్నీ వాణిజ్య పరంగా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉన్న స్థలాలు కావడంతో ఈరోజు జరిగే దేవస్థానం పాలకమండలి సమావేశ అజెండాలో ఈ అంశాన్ని చేర్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భూములను లీజుకు ఇచ్చేందుకు వారు చూపుతున్న కారణం.. కరోనా కారణంగా ఆదాయం పడిపోయిందని.. ఆలయ నిర్వహణ చాల ఇబ్బందికరంగా మారిందని దీంతో తప్పక లీజు ద్వారా భూములు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.    ఈ సింహాచలం అప్పన్న దేవస్థానానికి విజయనగరం పూసపాటి రాజ వంశీకులు ఇచ్చిన వేల ఎకరాల భూములు ఉన్నాయి. ప్రస్తుతం వాటి విలువ వేల కోట్లలోనే ఉంటుంది. ఈ ఆలయానికి ట్రస్టీలుగా పూసపాటి వంశీయులైన ఆనందగజపతి రాజు, అయన మరణానంతరం అశోక్ గజపతి రాజు వ్యవహరించారు. ఐతే కొద్దికాలం క్రితం ఈ ఆలాయాన్ని నిర్వహించే మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు ఆనందగజపతి రాజు నుండి విడిపోయిన మొదటి భార్య కుమార్తె అయిన సంచయితకు అప్పగించడం పై వివాదం నెలకొంది. అప్పన్న ఆస్తుల పై కన్నేసిన కొంత మంది పెద్దలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాయని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే అప్పన్న దేవస్థానం పాలకమండలి సమావేశం చాల కీలకంగా మారింది.

తెలంగాణ హైకోర్టులో జడ్జీలను నియమించాలి

కేంద్ర మంత్రిని కోరిన రాష్ట్ర బిజేపి   తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను తెలంగాణ రాష్ట్ర బిజేపీ కోరింది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.   రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది న్యాయమూర్తుల నియామకానికి అనుమతి ఉందని, కానీ ప్రస్తుతం హైకోర్టులో 14 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన 24 మంది న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచి, వెంటనే న్యాయమూర్తులను నియమించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతాయని ఆయన వివరించారు. న్యాయమూర్తులు సరైన సంఖ్యలో లేకపోవడంతో కేసులు వాయిదా పడుతూ న్యాయం కోసం కోర్టుకు వచ్చేవారు అనేక సమస్యలు ఎదుర్కోంటున్నారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు 46 నుంచి 48 మంది జడ్జీలు పనిచేయడానికి అనువుగా ఉన్నాయని గుర్తుచేశారు.   పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి, న్యాయ సేవలు వేగంగా అందడానికి వీలుగా న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియను త్వరగా చేపట్టాలని కోరారు.

భారత్ లో కరోనా ఉగ్ర రూపం.. నిన్న ఒక్క రోజే వెయ్యికి పైగా మృతి 

కరోనా తో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ లో కరోనా మరణ హోమం సృష్టించగా తాజాగా భారత్ లో నిన్న ఒక్క రోజే 1,023 మంది మృతి చెందారు. ఇక గత 24 గంటల్లో కొత్తగా 75,760 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 33,10,235 కు చేరుకోగా, మృతుల సంఖ్య 60,472కి పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 25,23,772 మంది కోలుకోగా.. 7,25,991 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.    ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్నాటక, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 9,24,998 మంది నుండి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3 కోట్ల 85 లక్షల 76 వేల 510 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలియచేసింది.

కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విషయంలో కడిగిపారేసిన సుప్రీం కోర్టు.. 

దేశంలో లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు తీసుకున్నరుణాలపై ఆరునెలల మారటోరియం వ్యవధిలో వడ్డీ వసూలు చేసే విషయం పై కేంద్రం తీరును తప్పుబడుతూ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో... మార్చి నెల నుంచి ఆగస్టు వరకు రుణ చెల్లింపుదారులకు ఆర్బీఐ ఆరు నెలల మారటోరియం వసతి కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మారటోరియం సమయంలో కూడా రుణాలపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మారటోరియం విషయంలో బ్యాంకులు తమ రుణ చెల్లింపుదారులకు కూడా క్లారిటీ ఇచ్చాయి. తాజాగా మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. లోన్ మారటోరియానికి సంబంధించి ప్రజల బాధలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో లోన్ మారటోరియాన్ని కేవలం వ్యాపార కోణంలో మాత్రమే ఆలోచించవద్దని, ప్రజల బాధను కూడా పట్టించుకోవాలని సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్(డీఎంఏ) కింద లోన్ మారటోరియం అంశంపై కేంద్రానికి అధికారాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.   కరోనా నేపథ్యంలో రుణాలు చేసిన వారికీ ఆర్బీఐ ఇచ్చిన వెసులుబాటు లోన్ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేయవచ్చా లేదా అనే అంశంపై కేంద్రం నిర్ణీత సమయంలో సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆ సందర్భంగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం సమస్య కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల వచ్చిందని కోర్టు పేర్కొంది. మారటోరియం వ్యవధిలో రుణాలపై బ్యాంకులు వడ్డీని మాఫీ చేస్తాయని రుణ చెల్లింపుదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ విషయంలో మరి కొద్దీ రోజుల్లో కేంద్రం స్పష్టత ఇవ్వనుండటంతో రుణ చెల్లింపుదారుల్లో ఆసక్తి నెలకొంది.

అంబటి రాంబాబుకు సొంత పార్టీ కేడర్ షాక్..

వైసిపి సీనియర్ నేత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు గట్టి షాక్ తగిలింది. అయితే ఈ షాక్ ఇచ్చింది ప్రతిపక్షం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇంతకూ అంబటి షాక్ ఇచ్చింది మరెవరో కాదు.. అయన నియోజకవర్గానికి చెందిన సొంత పార్టీ కార్యకర్తలే. సాక్షాత్తు వైసీపీ కార్యకర్తలే తమ ఎమ్మెల్యే మీద హైకోర్టులో పిటిషన్ వేయించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ హైకోర్టులో వారు పిల్ దాఖలు చేశారు.    సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రాజుపాలెం మండలం నెమలిపురి, కొండమోడులో ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అయితే ఈ పిల్‌ను హైకోర్టు న్యాయవాది నాగ రఘు వైసీపీ కార్యకర్తల తరఫున దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు కలెక్టర్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు ఈ పిటిషన్‌లో ఆరోపించారు. ఈ అక్రమ మైనింగ్ పై ఇప్పటికే స్ధానిక మైనింగ్‌ అధికారులు విచారణ జరిపారని కూడా ఆ పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.    అయితే, అధికార పార్టీకి చెందిన వారే పిటిషన్ వేస్తె అది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తరువాత కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.

కౌలు చెల్లించాలని కోరిన అమరావతి రైతులను అరెస్టు చేయటం దుర్మార్గం

కౌలు చెల్లించాలని కోరుతూ విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయ ముట్టడికి రాజధాని రైతులు, మహిళలు బయల్దేరగా పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు కౌలు డబ్బులు ఇస్తామని చెప్పి 3 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మాట నిలబెట్టుకోక పోవడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కౌలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.    సీఆర్‌డీఏ కార్యాలయం ముట్టడికి వస్తున్న రైతులను, మహిళలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. కరకట్ట, మంగళగిరి మీదుగా విజయవాడకు వచ్చే మార్గాల్లో రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు మద్దతుగా వచ్చిన సీపీఎం మధు, బాబూరావులను కూడా పోలీసులు అడ్డుకున్నారు.   కౌలు చెల్లించాలని కోరిన అమరావతి రైతులను అరెస్టు చేయటం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రైతులపై పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే అరెస్ట్ చేసిన అమరావతి రైతులను విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.    మరోవైపు, ఆరు నెలలుగా అమరావతి పెన్షన్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో పాటు, ఈ సంవత్సరం వార్షిక కౌలు కూడా చెల్లించకపోవడంతో.. అమరావతి రైతులు, రైతు కూలీలు చేపట్టిన బిక్షాటన కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. వెంకటపాలెం చలివేంద్రం చెక్ పోస్ట్ వద్ద డీఎస్పీ బృందం, దళిత జేఏసీ అమరావతి నాయకులను రైతులను అడ్డుకోవడం జరిగింది. దళిత రైతులు, రైతు కూలీలు వచ్చిపోయే ప్రయాణికులను భిక్షాటన చేస్తూ.. ప్రభుత్వాన్ని నమ్మి భూమి ఇచ్చి  దగాపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమరావతి పెన్షన్ చెల్లించక నడిరోడ్డున పడ్డాము. మాకు పూట గడవడమే కష్టంగా ఉంది. ఆకలి పస్తులతో జీవనం సాగిస్తున్నాం, కావున దయచేసి ధర్మం చేయండి అని వారు భిక్షాటన చేయడం జరిగింది.