చీరాల వైసీపీలో వర్గ విభేదాలు.. జగన్ కాళ్లు పట్టుకుని బతికిపోయారు!!

ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైఎస్ విగ్రహం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమాలు పోటాపోటీగా సాగడంతో పాటు.. ఆమంచి, కరణం వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.   వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కరణం వెంకటేష్.. ఆమంచిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని ప్రమాణం చేశామని, స్వేచ్ఛను ఇచ్చేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గతంలో మాదిరిగా ఇక్కడ అరాచకాలు, బెదిరింపులు సాగవని స్పష్టం చేశారు. "బెదిరింపులను ఎవరూ చూస్తూ కూర్చోరు, జాగ్రత్త" అంటూ హెచ్చరించారు.   దీనిపై ఆమంచి కృష్ణమోహన్ గట్టిగా స్పందించారు. నా పేరు ఉచ్చరించడానికి భయపడేవాడు కూడా నాకు వార్నింగ్ ఇస్తాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరి బతికిపోయారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం లేకుండా ఎక్కడా బతకలేని వాళ్లు నా గురించి మాట్లాడతారా? అంటూ ఆమంచి మండిపడ్డారు.   అధికార పార్టీ నేతలు ఇలా ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం తీవ్ర చర్చనీయంశమైంది. బాధ్యతగా ఉండాల్సిన నాయకులు ఇలా పబ్లిక్ గా ఒకరిపై ఒకరు బెదిరింపులకు దిగడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   కాగా, 2019 ఎన్నికల్లో చీరాలలో టీడీపీ తరఫున కరణం బలరాం బరిలోకి దిగగా, వైసీపీ తరఫున ఆమంచి కృష్ణమోహన్ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం.. ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. రెండు కత్తులు ఒకే వరలో ఇమడవు అన్నట్టుగా.. రాజకీయ ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఇమడలేకపోతున్నారు. అందుకే వారి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అధికార పార్టీకి తీవ్ర నష్టం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ పరిస్థితి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి బాలినేని

ఏపీ వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు చేయాలని, విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వినియోగం మేరకు వచ్చిన బిల్లులు రైతులే డిస్కంలకు చెల్లించాలని పేర్కొంది.   అయితే, ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సున్నావడ్డీలానే ఉచిత విద్యుత్‌ ను నీరుగార్చబోతున్నారని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. ఉచిత విద్యుత్ విధానాన్ని మార్చడం వల్ల చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులకు నష్టం వస్తుందన్నారు.   రైతులకు ఉచిత విద్యుత్‌ పై మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయ మోటర్లకు స్మార్టు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు విద్యుత్‌ బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.

బంగారంపై 90శాతం రుణం.. ఆర్బీఐ నిర్ణయం

కరోనా నేపధ్యంలో ఆర్బీఐ అనేక వెసులుబాటు నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా బంగారంపై తీసుకునే లోన్ మొత్తాన్ని 75శాతం నుంచి 90 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల చిన్నచిన్న పరిశ్రమలకు పెట్టుబడులు సమకూరుతాయి. అంతే కాదు ప్రజల చేతికి తగినంత డబ్బు రావడంతో వారు ఉపాధి మార్గాలు వెతుక్కోవడం సాధ్యమవుతుంది.  బంగారంపై రుణం ఇచ్చే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఫైనాన్షియల్ ఇన్‌‌స్టిట్యూషన్లకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. గతంలోని నిబంధనల ప్రకారం బంగారం విలువలో 75 శాతం వరకు వరకు మాత్రమే రుణం వచ్చేది. ఇప్పుడు దీనిని 90 శాతానికి పెంచారు. అయితే వచ్చే ఏడాది మార్చి వరకే ఈ సదుపాయం ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా ఆదాయాన్ని కోల్పోయిన ప్రజలకు ఇది ఉరటనిస్తుందని బ్యాంక్ వర్గాలు అంటున్నాయి.   దాదాపు 25వేల టన్నులు భారతదేశ ఆచారంలో బంగారానికి ప్రాధాన్యత ఎక్కువే. ఆభరణాలు కాకుండా బంగారాన్ని మూలధనంగా కూడా భావిస్తారు. ఆడపిల్ల పుట్టగానే బంగారం కొన్నే ఆచారం ఉంది. మనదేశంలోని ఇండ్లలో ఉన్న బంగారం దాదాపు 25 వేల టన్నులు. దీని విలువ అక్షరాల 1.41 లక్షల కోట్ల  డాలర్లు. అంటే మన దేశ సాధారణ జీడీపీలో సగం. బంగారం పై బ్యాంక్ వడ్డీ కూడా తక్కువగానే ఉండటంతో ఇప్పుడు బంగారంపై రుణాలకు భారీగానే గిరాకీ పెరుగుతుంది. ఆర్బీఐ నిర్ణయంతో మరింత ఎక్కువ మంది బంగారు రుణాలు తీసుకునే అవకాశం ఉంది.

ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోక్ సభ 

కరోనా నిబంధనలకు అనుగుణంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తామని సర్క్యులర్ జారీ చేసిన పార్లమెంటు వర్గాలు ఉదయం రాజ్యసభ సమావేశాలను, మధ్యాహ్నం లోక్ సభ సమావేశాలను నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు జరగనున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఉభయసభల సమావేశాలను ఒకేసారి కాకుండా ఉదయం రాజ్యసభ సమావేశాలను, మధ్యాహ్నం లోక్ సభ సమావేశాలను నిర్వహించనున్నారు. అంతేకాదు చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నందున శని,ఆదివారాల్లో కూడా పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. దీనికి సంబంధించి పార్లమెంట్‌ వర్గాలు తాజాగా ఓ సర్క్యులర్‌ను జారీ చేశాయి.

డేటింగ్ యాప్ లను నిషేదించిన పాకిస్తాన్

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు తమ సరదాల కోసం యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. అయితే ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు అభ్యంతరకరమైన యాప్ లను రూపొందించి యువతను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి కొన్నింటిపై భారత్ ప్రభుత్వం గతంలో నిషేధం విధించింది. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం ఐదు ప్రధాన డేటింగ్ యాప్ లపై నిషేధం విధించింది. టిండర్, గ్రిండర్, ట్యాగ్ డ్, స్కౌట్, సే హాయ్ వంటి డేటింగ్, లైవ్ స్ట్రీమింగ్ యాప్ లు స్థానిక చట్టాలను అతిక్రమిస్తున్నాయంటూ పాకిస్థాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ ఆరోపిస్తోంది. తమ కంటెంట్ ను మార్చుకుంటే, స్థానిక చట్టాలకు అనుగుణంగా ఉంటే నిషేధం అంశంపై పునరాలోచిస్తామని అథారిటీ తెలిపింది.   ఈ యాప్ ల్లో అనైతిక, అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించాల్సిందిగా గతంలోనే నోటీసులు ఇచ్చామంటున్నారు. అయితే నిర్దేశిత గడువులోగా ఆయా కంపెనీలు స్పందించలేదని అందుకే వాటిపై నిషేధం విధించాల్సి వచ్చిందని పాక్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ వెల్లడించింది. 

ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండి

దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 2019 సంవత్సరంలో 18వేలకు పైగా ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. ఇక, 13వేలకు పైగా ఆత్మహత్యలతో తమిళనాడు రెండోస్థానంలో నిలిచింది. 12 వేలకు పైగా ఆత్మహత్యలతో పశ్చిమబెంగాల్ మూడో స్థానంలో నిలవగా.. నాలుగైదు స్థానాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక నిలిచాయి. తెలంగాణలో 7,675 మంది ఆత్మహత్యకు పాల్పడగా.. ఆంధ్రప్రదేశ్ లో 6,465 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.   ఇక, దేశవ్యాప్తంగా 10,281 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యధికంగా మహారాష్ట్ర 3,927 ఆత్మహత్యలతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (1,992), ఆంధ్రప్రదేశ్‌ (1,029), మధ్యప్రదేశ్‌ (541), తెలంగాణ (499) లు ఉన్నాయి.   రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉండటంపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని విమర్శించారు.   "రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారు వైఎస్ జగన్. వివిధ పథకాల ద్వారా రైతుకి ఏడాదిలో లక్ష రూపాయిల లబ్ది అన్నారు. ఆఖరికి విత్తనాలు,ఎరువులు కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అసమర్థ వైకాపా ప్రభుత్వం." అని లోకేష్ విమర్శించారు.   "ఇచ్చిన ప్రతీ హామీలో మోసం. ఏకంగా ఉచిత విద్యుత్ పథకానికే మంగళం పాడే ప్రక్రియ మొదలుపెట్టారు. 15 నెలల్లో జగన్ రెడ్డి గారి రైతు వ్యతిరేక నిర్ణయాల వలనే ఆత్మహత్యలు భారీ స్థాయిలో పెరిగాయి. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండి." అని లోకేష్ వ్యాఖ్యానించారు. 

తెలంగాణ టూ శ్రీనగర్.. ఐపిఎస్ అధికారి చారుసిహ్హ

శ్రీనగర్‌ సెక్టార్ సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ ( సీఆర్పీఎఫ్) ఇన్ స్పెక్టర్ జనరల్‌గా తెలంగాణ క్యాడర్ మహిళా ఐపిఎస్ అధికారి చారు సిన్హా నియమితులయ్యారు. వివాదస్పద, తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉండే శ్రీనగర్‌ సెక్టార్ కు మహిళా అధికారి ఐజీగా రావడం ఇదే మొదటిసారి.   శ్రీనగర్  సెక్టార్ 2005లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇక్కడ ఐజీ స్థాయిలో మహిళాపోలీసు అధికారి ఎవరూ నియమించబడలేదు. మూడు జిల్లాలు ముద్గాం, గండర్ బల్, శ్రీనగర్ లు, లడఖ్ యూనియన్ భూభాగం ఈ సెక్టార్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడి సీఆర్పీఎఫ్ సెక్టార్ పరిధిలో రెండు రేంజ్‌లు, 22 ఎగ్జిక్యూటివ్ యూనిట్లు, మూడు మహిళా పోలీసు కంపెనీలు, పారామిలటరీ బలగాలు ఉన్నాయి. వాటన్నింటికీ చారు సిన్హా హెడ్‌గా వ్యవహించనున్నారు. ఇక్కడ పనిచేసే అధికారి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలతో పాటు ఇండియన్ ఆర్మీతోనూ, జమ్మూ కాశ్మీర్ పోలీసులతోనూ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న ప్రస్తుత తరుణంలో అక్కడ మహిళా అధికారిని నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గతంలో బీహార్ సెక్టార్ లో నక్సల్స్ కార్యకలాపాలు అణిచివేయడంలోనూ, తెలంగాణలో నక్సల్స్ ప్రాభల్యం ఉన్న జిల్లాల్లో పనిచేసిన అపారమైన అనుభవం ఆమెకు ఉంది.   చారుసిహ్హ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోని బరేలీ. ఆమె తండ్రి ఎస్.ఎస్. సిహ్హ ఇక్రిశాట్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తూ హైదరాబాద్ కు బదిలీ పై వచ్చారు. అమ్మ మధుసిహ్హ ఆర్టిస్ట్. చారుసిహ్హకు ఇద్దరు చెల్లాలు ఉన్నారు. చారు సిహ్హ ఆబిడ్స్ లోని రోజరీ కాన్వెంట్ లో చదువుకున్నారు. సివిల్స్ లో చేరాలని ఎనిమిదో తరగతిలోనే ఆమె నిర్ణయించుకున్నారు. సెయింట్ ఫ్రాన్సెస్స్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ గోల్ట్ మెడల్ అందుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ లో పిజీ పూర్తి చేసి తర్వాత ఐపిఎస్ లక్ష్యంతోనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి విజయం సాధించారు. 1996 బ్యాచ్ లో సివిల్ సర్వెంట్ గా బాధ్యతలు తీసుకున్న ఆమె ఫస్ట్ పోస్టింగ్ కడప జిల్లా పులివెందుల. కెరీర్ ప్రారంభం నుంచే ఫ్యాక్షనిస్టులను, నక్సలైట్స్ ను అదుపులోకి తీసుకువచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థలో సింహస్వప్నంగా ఉండేవారు. అందుకు నిదర్శనంగా ఆమె సర్వీస్ కన్నా ఎక్కువ సంఖ్యలో బదీలీలు ఉంటాయి. రాజీలేని తత్త్వం, చట్టానికి కట్టుబడి పనిచేసే మనస్తత్వం ఆమెను నిజాయితీ గల అధికారిలో ప్రజల మన్ననలు అందుకునేలా చేశాయి.   తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిఐడి ఐజీగా ఆమె పనిచేశారు. చిన్నారుల బాల్యం భయం లేకుండా ఉండాలన్న ఆలోచనతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చైల్డ్ అబ్యూస్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటుచేశారు. వివక్షలేని బాల్యం ద్వారానే భారత్ భవిష్యత్ ను బంగారుమయం చేయవచ్చని ఎన్నో వేదికలపై ఆమె చెప్పేవారు. కేంద్ర సర్వీస్ కు వెళ్ళిన తర్వాత బీహార్ లోనూ ఆమె పనిచేశారు. ఇప్పుడు శ్రీనగర్ సీఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందడం ఆమె అంకితభావానికి సరైన గుర్తింపు గా భావించవచ్చు. దేశసరిహద్దుల్లో చారుసిహ్హ లాంటి అధికారులు ఉండటం మన దేశంలోని మహిళలందరికీ గర్వకారణం.

వైఎస్ పై అభిమానం చూపుతూనే.. జగన్ తీరుపై మోహన్ బాబు అసంతృప్తి!!

సీనియర్ నటుడు మోహన్ బాబుకు వైసీపీతో గ్యాప్ పెరిగిందా! వైఎస్ కుటుంబానికి ఆయన సన్నిహితంగానే ఉంటున్నారా!. ఈ ప్రశ్నలకు కొంత కాలంగా సరైన సమాధానం దొరకడం లేదు. ఇటీవల కాలంలో ఏపీ సీఎం జగన్ తో మోహన్ బాబు కలిసిన సందర్భాలు లేవు. వైసీపీ ప్రభుత్వం  పని తీరుపై ఆయన ఎక్కడా స్పందించడం లేదు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రచారం చేసిన మోహన్ బాబు.. జగన్ పాలనపై మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. వైసీపీతోనూ, జగన్ తోనూ మోహన్ బాబు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో జగన్ పాలనపై ఆయన విమర్శలు కూడా  చేయలేదు . దీంతో మోహన్ బాబుకు జగన్ మధ్య గ్యాప్ లేదని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు.    వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా  మోహన్ బాబు ఆయనకు నివాళి అర్పించారు. వైఎస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడిగా అభివర్ణించారు. రాష్ట్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోయే రాజకీయవేత్త అని నివాళి అర్పించారు. మా బావగారు అంటూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు. దీంతో మోహన్ బాబు వైఎస్ కుటుంబానికి సన్నిహితంగానే ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ తో మోహన్ బాబుకు ఎంతో అనుబంధం ఉందని, అందుకే ఆయనకు నివాళి అర్పించారని మరికొందరు చెబుతున్నారు. వైఎస్ కు నివాళి అర్పించినంత మాత్రానా జగన్ తో గ్యాప్ లేదని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు.  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే మోహన్ బాబు... సీఎంగా జగన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వైఎస్ కు నివాళి అర్పించిన మోహన్ బాబు.. జగన్ ఏడాది పాలనపై ఎందుకు విషెష్ చెప్పలేదని అంటున్నారు.    కొద్దిరోజుల క్రితం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని మోహన్ బాబు కామెంట్ చేశారు. తన కుమారుడు మనోజ్ రాజకీయాల్లో వస్తానంటే వద్దని చెబుతానని చెప్పారు. దీంతో వైసీపీ రాజకీయాలు, జగన్ తీరుపై అసంతృప్తితోనే మోహన్ బాబు ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంతా భావించారు.     వైఎస్ కుటుంబానికి మోహన్ బాబుకు మధ్య బంధుత్వం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు మోహన్ బాబు. జగన్ ను సీఎం చేయాలని ఓటర్లకు పిలుపిచ్చారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మోహన్ బాబు. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు మంచి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబుకు ఎలాంటి పదవి ఇవ్వలేదు సీఎం జగన్. తాను పదవులు కోరనని మోహన్ బాబు చెబుతున్నప్పటికీ.. ఈ విషయంలో మోహన్ బాబు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఉంది. ఆ మధ్య కుమారులు, కూతురుతో కలిసి ప్రధాని మోడీని కలిసి మోహన్ బాబు.. బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే తాను కేవలం మర్యాదపూర్వకంగానే ప్రధానిని కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. అయితే మోహన్ బాబు కొంతకాలంగా సీఎం జగన్ గురించి ప్రస్తావించకపోవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్ పై అభిమానం చూపుతూనే.. జగన్ పై మెహన్ బాబు ఆగ్రహంగా ఉన్నారనే   చర్చ జరుగుతోంది.

చంద్రబాబును ప్రశాంతంగా ఇంట్లో ఉండనివ్వని వైసిపి.. కేసులు నోటీసులతో రచ్చ 

గత శాసన సభ ఎన్నికలలో టీడీపీ కేవలం 23 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు పని ఇక అయిపోయిందని వైసీపీతో సహా టీడీపీ వ్యతిరేకులు అందరు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల తరువాత చంద్రబాబు అమరావతి నివాసం పై వైసిపి నేతలు కొంతకాలం రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దాని తరువాత బాబు విశాఖ పర్యటనలో కూడా రచ్చ జరగడంతో విషయం హైకోర్టుకు కూడా వెళ్ళింది. అయితే కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి చంద్రబాబు హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లోని తన నివాసం లోనే ఉంటూ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా పార్టీ కేడర్ తో టచ్ లో ఉంటున్నారు. అయితే దీనిపై వైసిపి నాయకులు రెచ్చిపోయి బాబు పక్క రాష్ట్రం లో దాక్కొని జూమ్ ద్వారా కథ నడిపిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఏ అధికారపక్షమైనా తమ ప్రత్యర్ధులు ప్రజలలో కనపడకూడదు.. వినపడకూడదు అని కోరుకుంటాయి. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ లు కూడా అయితే అటు ట్విట్టర్ లో లేదంటే జూమ్ లో కాన్ఫరెన్సులతో కాలక్షేపం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క రాష్ట్ర ప్రజలు పలు రకాల సమస్యలతో సతమతమవుతుండగా బాబు, లోకేష్ లు మాత్రం ఇంటికే పరిమితమవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని అటు పార్టీ నేతలు కూడా మొత్తుకుంటున్నారు.   ఇది ఇలా ఉండగా అధికారంలో ఉన్న వైసిపి మాత్రం అటు టీడీపీని ఇటు బాబును నిత్యం విమర్శిస్తూ ప్రజల లో ఆ పార్టీ పట్ల సానుభూతి పెరిగేలా తమవంతు కృషి చేస్తున్నారు. అయితే వైసిపి ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ పై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించి ఆ పార్టీని జనంలో ఎండగట్టే ప్రయత్నం చేయకుండా నిత్యం ఏదో ఒక సాకుతో బాబును విమర్శిస్తూ మరోపక్క ఇటు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఏదో ఒక సాకుతో అరెస్టులు చేయడంతో టీడీపీకి ప్రజలలో మరింత సానుభూతి పెరుగుతోంది. తాజాగా చిత్తూరులో ఓం ప్రతాప్ అనే దళిత యువకుడి ఆత్మహత్య పై టీడీపీ అధినేత చంద్రబాబు డిజిపికి లేఖ రాసారు. సోషల్ మీడియాలో అతడు చేసిన కామెంట్లపై కొంత మంది వైసిపి నేతలు, పోలీసులు బెదిరింపులకు పాల్పడడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శలు చేసారు. దీని పై వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు బాబు స్వయంగా చితూర్ జిల్లా లోని పోలీస్ స్టేషన్ కు వచ్చి తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపారు. ఇప్పటికైనా వైసిపి మేల్కొని బాబుగారికి మైలేజి ఇచ్చే ఇటువంటి కార్యక్రమాలు మానుకుంటే మంచిదని.. లేదంటే తనకు తానే ప్రత్యర్థికి అస్త్రాలు ఇచ్చి మరీ ఆ పార్టీని బలోపేతం చేసి ఇటువంటి కార్యక్రమాలతో వచ్చే ఎన్నికలలో వైసిపికి గడ్డు పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హైకోర్టు ఆదేశాలతో సీఏఏ పై నిరసన తెలిపిన డాక్టర్ కఫీల్ ఖాన్ అర్ధరాత్రి విడుదల

కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తీసుకు వచ్చిన సీఏఏ చట్టం పై దేశంలో పలు చోట్ల నిరసనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన నిరసనల్లో పాల్గొని విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కఫీల్‌ఖాన్ నిన్న అర్ధరాత్రి జైలు నుండి విడుదలయ్యారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చడంతో పాటు కఫీల్‌ఖాన్ కు బెయిలు మంజూరు చేస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న కఫీల్‌ఖాన్ గత అర్ధరాత్రి మధుర జైలు నుంచి విడుదలయ్యారు.   గత సంవత్సరం డిసెంబరులో సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కఫీల్‌ఖాన్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ జాతీయ భద్రతా చట్టం కింద ఈ ఏడాది జనవరి 29న గోరఖ్‌పూర్‌లో అరెస్ట్ చేశారు. అయితే, ఇప్పటికీ ఆయనను విదుదల చేయాలనీ కోర్టు ఆదేశించినప్పటికీ జైలు అధికారులు సత్వరంగా స్పందించకపోవడంతో ఖాన్ విడుదల ఆలస్యమైంది. దీంతో స్పందించిన ఖాన్ కుటుంబ సభ్యులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని హెచ్చరించడంతో ఆగమేఘాల మీద గత అర్ధరాత్రి జైలు అధికారులు విడుదల చేశారు. నిన్న రాత్రి జైలు నుండి విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడిన కఫీల్ ఖాన్ యూపీలోని యోగి ప్రభుత్వం తనను కొత్త కేసులలో ఇరికించి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. అయన అనుమానాలకు మరో కారణం కూడా ఉంది. అది ఏంటంటే గతంలో బిఆర్డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజెన్ కొరత గురించి డాక్టర్ కఫీల్ ఖాన్ తన ఆందోళన వ్యక్తం చేయడమే.

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఆద్యురాలు

లిల్లీ పౌలెట్ హారిస్ (2 సెప్టెంబర్ 1873 - 15 ఆగస్టు 1897)   మహిళలంటే వంటింటికే పరిమితం అనుకునే రోజుల్లోనే క్రీడారంగంలోనూ రాణించిన మహిళ లిల్లీ పౌలెట్ హారిస్. 18వ శతాబ్దంలోనే ఆస్ట్రేలియాలో మహిళా క్రికెట్ జట్టును ఆమె స్థాపించారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టులో ఆస్ట్రేలియాదే అగ్రస్థానం. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో గత మూడు సంవత్సరాలుగా ఆస్ట్రేలియా మహిళా జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంటుంది.    2 సెప్టెంబర్ 1873 న లిల్లీ పౌలెట్, వైలెట్ కవలలుగా జన్మించారు. ఆమె తండ్రి రిచర్డ్ డియోడాటస్ పౌలెట్-హారిస్, తల్లి ఎలిజబెత్ ఎలియనోర్. తండ్రి హోబర్ట్ బాయ్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్, టాస్మానియా విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు. విద్యలోనూ రాణించిన లిల్లీ వయోలిన్, పియానో వాయిస్తూ సంగీతంలో ప్రతిభ కనపరిచారు. దాంతో పాటు బ్యాట్ పట్టుకుని గ్రాండ్ లో ఆడడం చిన్నప్పటి నుంచి  ఆమెకు ఎంతో ఇష్టం. గుర్రపుస్వారీ, సైక్లింగ్ లోనూ ఆమె చురుగ్గా పాల్గొనేవారు. క్రమంగా క్రికెట్ వైపు ఆమె ఆసక్తిని పెంచుకున్నారు. ఆమె అభిరుచిని తల్లిదండ్రులు గమనించి ప్రోత్సహించారు. 1894లో స్థానిక మహిళల కోసం ఓయిస్టర్ కోవ్ లేడీస్ క్రికెట్ క్లబ్ ను ఆమె ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా కాలనీల్లో మొదటి క్రికెట్ క్లబ్ గా పేరుగాంచింది. ఆ తర్వాత ఆమె క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తన జట్టును విజయాల దిశగా పరుగులు తీయించారు. అద్భుతమైన బౌలింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అయితే క్షయవ్యాధి కారణంగా లిల్లీ క్రికెట్ ఎక్కువ రోజులు ఆడలేకపోయారు. అతి చిన్నవయసులోనే 15 ఆగస్టు 1897లో లిల్లీ మరణించినప్పటికీ క్రికెట్ రంగంలో ఆమె సేవలు చిరస్మరణీయం.   ఓయిస్టర్ క్లబ్ ఆస్ట్రేలియాలో జాతీయస్థాయిలో మహిళా క్రికెట్ టీమ్ ఏర్పడడానికి పునాదులు వేసింది. మహిళల క్రికెట్ ను ఆమే ప్రారంభించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్ అంతర్జాతీయ పోటీల్లోనూ విజేతగా నిలుస్తోంది. 1978లో మొదటిసారి ప్రపంచ కప్ సాధించారు. ఆ తర్వాత 1982, 1988, 1997, 2005 , 2013 లో మరో ఐదు సందర్భాలలో టైటిల్‌ను సాధించారు.  1973 ప్రపంచ కప్‌లో వారి మొదటి మ్యాచ్ నుండి ఇప్పటివరకు  254 వన్డేలు (వన్డే ఇంటర్నేషనల్స్) ఆడారు. ఇప్పటివరకు వన్డే జట్టులో 122 మంది మహిళలు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించారు. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో గత మూడు సంవత్సరాలుగా ఆస్ట్రేలియా మహిళా జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఆస్ట్రేలియాలో అత్యధిక పారితోషికం పొందిన మహిళా క్రీడా జట్టుగా నిలిచింది. ఒక మహిళకు క్రికెట్ పై ఉన్న ఆసక్తి ఈ రోజు ఇన్ని విజయాలకు కారణం అయ్యింది.

త్వరలో హైదరాబాద్ మెట్రో పరుగులు.. సిటీ బస్సులు మాత్రం..

కేంద్ర ప్రభుత్వం అన్ లాక్-4 లో భాగంగా అనేక సడలింపులు ఇస్తూ మెట్రో రైళ్లను నడిపే విషయంలో మాత్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దీంతో ఈ నెల 7 నుంచి హైదరాబాద్ మెట్రో రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నగరంలోని సామాన్యులకు అందుబాటులో ఉండే సిటీ బస్సుల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే సిటీ బస్సులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి సంకేతాలు అందలేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.   ఇది ఇలా ఉండగా ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయం మరోలా ఉన్నట్లుగా తెలుస్తోంది. మెట్రో రైళ్లలో అయితే ప్రయాణికులను నియంత్రించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ వంటి నిబంధనలను పాటించేందుకు అవకాశం ఉంటుందని.. అదే సిటీ బస్సుల విషయంలో ప్రయాణికులను నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికి కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్న నేపథ్యంలో సిటీ బస్సులు నడిపితే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సిటీ బస్సుల విషయంలో మాత్రం మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.

వరంగల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. పవన్ అభిమానులు ఐదుగురు దుర్మరణం!

ఈ తెల్లవారుజామున వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దామెర మండలం పసరగొండ దగ్గరలో ఈ ఘటన జరిగింది. మరణించిన వారంతా జిల్లాలోని పోచం మైదాన్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయడానికి రెండు గంటలు శ్రమించినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రాథమిక ఆధారాలను బట్టి, ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ శ్రీనివాస్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టుగా తెలిపారు.   కాగా, రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు యువకులు పవన్ కళ్యాణ్ అభిమానులని తెలుస్తోంది. ఈరోజు పవన్ పుట్టినరోజు కావడంతో రాత్రి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మరోవైపు, చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా పవన్ అభిమానులు ముగ్గురు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తగిలి మరణించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు.

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు 14వ తేదీ నుంచి..

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఈనెల 14న తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీ వరకు సమావేశాలను నిర్వహిస్తారు. ఈ నెల 14వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు దిగువ స‌భ‌లో స‌మావేశం కావాల‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ తెలిపినట్లు లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్ నోటికేష‌న్‌లో  ప్రకటించారు. అదే రోజున రాజ్య‌స‌భ కూడా సమావేశం అవుతుంది. అయితే రెండు సభల ప్రారంభ సమయాల్లో వ్యవధి ఉంటుంది.    కోవిద్ 19 కారణంగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నామని పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ వెల్లడించింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిద్ నిబంధనలు సభ్యులంతా తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నందున పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌ను దాదాపు 15రోజులు (అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు) నిర్వ‌హించాల‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల క్యాబినెట్ క‌మిటీ సిఫార‌సు చేసింది. కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సిన తయారీ, సరిహద్దుల్లో పరిస్థితులు, ఆర్థిక మాంద్యం ఎదుర్కోనే అంశాలు, రాష్ట్రాలకు నిధులు తదితర అంశాలపై చర్చ జరగనుంది   తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 20రోజుల పాటు ఈనెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు దాదాపు 20రోజుల పాటు జరగనున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున 20 రోజులపాటు సభ నిర్వహించే అవకాశాలున్నాయి.

మహిళలకు ఓటు హక్కు కల్పించాలని..

హ్యారియెట్ షా వీవర్ (1 సెప్టెంబర్ 1876 - 14 అక్టోబర్ 1961)   తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెడతారు కొందరు. తాను నమ్మి, ఆచరిస్తున్న వాటిని ఇతరుల కూడా ఆచరించేలా అవగాహన కల్పిస్తారు మరికొందరు. వీరు కార్యకర్తలుగా, నాయకులుగా సమాజంలో మార్పునకు దోహదపడతారు. ఈ కోవలోనే వస్తారు హ్యారియెట్. ఆమె ఒకవైపు రాజకీయ, సాహిత్య కార్యకర్తగా పనిచేస్తూ మరోవైపు పత్రికాసంపాదకురాలిగా బాధ్యతలు నిర్వహించారు.   హ్యారియెట్ ఫ్రోడెషమ్ లో ధనిక కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మేరీ వీవర్, డాక్టర్ ఫ్రెడెరికి వీవర్. హ్యారియెట్ బడికి వెళ్ళకుండా ప్రైవేటుగా చదువుకున్నారు. సామాజిక రాజకీయ అంశాలపై అపారమైన అవగాహన పెంచుకుంటూ సామాజిక కార్యకర్తగా మారారు. మహిళలకు ఓటు హక్కు కల్పించాలని జరిగిన పోరాటంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ లో సభ్యురాలిగా చేరారు. డోరా మార్క్ డెన్, మేరీ గౌత్రోవే ఆధ్వర్యంలో వెలువడుతున్న ఫెమినిస్ట్ వీక్లీ ది ఫ్రీ ఉమెన్ లో చేరారు. ఆ తర్వాత ఆమె ఈ పత్రికకు ఎడిటర్ గా బాధ్యతలు తీసుకుని పత్రిక పేరును ది న్యూ ఫ్రీ ఉమెన్ గా మార్చారు.  ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటూ సాహిత్య పత్రిక సంపాదకుడు ఎజ్రా పౌండ్ సలహా మేరకు పత్రిక పేరును ది ఎగోయిస్ట్ గా మార్చారు. కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ పత్రికలను పాఠకులకు చేరువ చేస్తూ ఆర్థిక నష్టాల నుంచి బయటపడ్డారు. మహిళలకు ఓటు హక్కు సాధించడంలో ఆమె పత్రిక కూడా ఉపయోగపడింది.   మహిళా హక్కులను కాపాడే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె సేకరించిన సాహిత్యం బ్రిటిష్ లైబ్రరీకి, నేషనల్ బుక్ లీగ్ కు అందించారు.

స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10శాతం మంది పోలీసులు కరోనా బారిన పడ్డారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా బారినపడ్డారు. సోమవారం కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయిన రిపోర్టు మంగళవారం వచ్చింది. దాంతో గత వారం రోజుల్లో తనను కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. డాక్టర్ల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్ లో రవీంద్ర ఉంటారు.   కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందువరుసలో నిలబడిన పోలీసులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధకార్మికులు, జర్నలిస్టులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు ఆరువేలమంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వైద్యసిబ్బంది సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కరోనా బారిన పడిన వైద్యసిబ్బందికి, వారి కుటుంబ సభ్యుల చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రిలో 50బెడ్స్ కూడా ప్రత్యేకంగా కేటాయించారు.

మావోయిస్టు అగ్రనేత గణపతికి గ్రీన్ సిగ్నల్!!

మావోయిస్ట్ అగ్రనేత గణపతి(ముప్పాల లక్ష్మణరావ్) లొంగిపోనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ పోలీసులు స్పందించారు. గణపతి లొంగిపోవాలనుకుంటే స్వాగతిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. బంధువులు, మిత్రుల ద్వారా లొంగిపోవాలనుకున్నా లేదా వేరే ఎవరి ద్వారా లొంగిపోయినా పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. గతంలో లొంగిపోయిన జంపన్న, సుధాకర్‌ లాంటి వారికి ఏ విధంగా సహకరించామో గణపతికి కూడా అలాగే వ్యవహరిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.    పునరావాస ప్రక్రియ కింద ఇప్పటి వరకు 1,137 మంది లొంగిపోయారని తెలిపారు. లొంగుబాటు ప్రక్రియకు పూర్తిస్థాయిలో ద్వారాలు తెరిచే ఉన్నాయని చెప్పారు. గణపతికి మానవతా ధృక్పథంతో తాము పూర్తిగా సహాయ, సహకారాలను అందిస్తామని స్పష్టం చేశారు. గణపతితో పాటు వేణుగోపాల్ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం ఉందని చెప్పారు. ఇతర మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే సంప్రదించవచ్చని తెలంగాణ పోలీస్ శాఖ భరోసా ఇచ్చింది.

ఆ జ్యోతిర్లింగ క్షేత్రంలో పూజల పై సుప్రీం కోర్టు సెన్సేషనల్ తీర్పు 

మన దేశంలో గల 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఉజైన్ కు చెందిన మహాకాళేశ్వర ఆలయం కూడా ఎంతో విశిష్టమైంది. ఎంతో పురాతనమైన ఘన చరిత్ర కలిగిన ఈ మహా కాళేశ్వర్ ఆలయంలో శివలింగం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఆలయంలో పూజల పై మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇక్కడ శివలింగం క్షీణిస్తున్నందున గర్భగుడిలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ ప్రముఖ జ్యోతిర్లింగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈరోజే ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా అయన పదవీ విరమణ కూడా చేయబోతున్నారు. దాదాపు మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో కేవలం శివుడి అనుగ్రహం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.   సుప్రీం కోర్టు తాజాగా మహాకాలేశ్వర్ ఆలయంలో పూజల విషయంలో ఇచ్చిన మార్గదర్శకాలు ఇవే: ఆలయంలోని శివలింగాన్ని ఎవరూ చేతులతో రుద్దకూడదు. శివలింగంపై పెరుగు, నెయ్యి, తేనె పోసి మర్దన చేయకూడదు. శివాలయం గర్భ గుడిలోకి భక్తులెవరినీ అనుమతించకూడదు కేవలం స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నీటిని మాత్రమే శివలింగం పై పడేలా పోయాలి. ఇప్పటి నుండి నిబంధనలను ఉల్లంఘించిన పూజారులపై ఆలయ కమిటీ చర్యలు తీసుకుంటుంది.   అయితే ఉజ్జయిని లోని మహా కాళేశ్వర్ ఆలయంలో శివలింగం క్షీణిస్తోందని కాబట్టి భక్తులను లోపలికి అనుమతించకూడదని, అభిషేకాలు కూడా చేయకూడదని కోరుతూ 2017లో సారికా గురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆలయాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇచ్చేందుకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఆలయాన్ని సందర్శించి తాజాగా పలు సూచనలు చేసింది. వీలైనంత తక్కువ పూజా ద్రవ్యాలతో మాత్రమే పూజలు చేయాలని.. ఆర్‌వో నీటితోనే అభిషేకం చేయాలని తెలిపింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈరోజు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది.

ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్

ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్ ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు సామాన్య ప్రజల నుండి అటు విఐపిల వరకు ప్రస్తుతం అందరిని కరోనా చుట్టేస్తోంది. ఈ రోజు ఉదయం ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో క్యాబినెట్ లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనను హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం వైసిపి నేతలు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు లు కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.